30, ఆగస్టు 2020, ఆదివారం

సారసముఖి సకల భాగ్యదే - ముత్తయ్య భాగవతార్ కృతి

సారసముఖి సకల భాగ్యదే! శ్రీ చాముండేశ్వరి!

మారజనక సోదరి! మహిషాసుర మర్దిని!

హసిత వదనే! ఆర్ద్ర హృదయే! హరికేశ నిరతే సదయే!
రసికజన సమ్మోద రుచిరే! రాజేశ్వరి రక్షిసౌ!

కలువ వంటి ముఖము కలిగిన ఓ చాముండేశ్వరి! మాకు సమస్త భాగ్యములను ప్రసాదించుము! మన్మథుని తండ్రియైన శ్రీహరి సోదరీ! మహిషాసురుని సంహరించిన తల్లీ! మాకు సమస్త భాగ్యములను ప్రసాదించుము! చిరునవ్వు మోము, కరుణా హృదయము కలిగి, హరికేశుడైన పరమశివుని అర్థాంగివై దయ చూపే అమ్మవు! రసికుల హృదయాలకు ఆనందము కలిగించే రాజరాజేశ్వరివి. మమ్ములను రక్షింపుము.

ఇది క్షేత్ర కృతి. మైసూరు చాముండేశ్వరిని నుతిస్తూ వాగ్గేయకారులు ముత్తయ్య భాగవతార్ గారు రచించి గౌడ మల్హర్ రాగంలో స్వరపరచారు.

మైసూరు చాముండేశ్వరి వివరాలు:

క్రౌంచపురిగా పేరుగాంచిన మైసూరు ప్రాంతంలో చాముండి పర్వతశ్రేణిపై వెలసిన దుర్గ చాముండేశ్వరి. మహిషాసురుని ఈ కొండపై సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. 12వ శతాబ్దంలో హోయసళ రాజులు ఈ దేవాలయాన్ని నిర్మించగా తరువాత శతాబ్దంలో విజయనగర రాజులు దీనికి గోపురాన్ని కట్టించారు. 3000 అడుగుల ఎత్తున ఉన్న ఈ కొండపైకి 17వ శతాబ్దంలో వడయారు రాజులు మెట్ల మార్గాన్ని నిర్మించారు. 800వ మెట్టు వద్ద 16 అడుగుల ఎత్తైన నల్లరాతి నంది ఈ క్షేత్రానికి ఆకర్షణ. ఈ విగ్రహాన్ని మైసూరు మహారాజా దొడ్డదేవరాజ వడయార్ బహుకరించారు. అష్టాదశ శక్తిపీఠాలలో క్రౌంచ పీఠంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలోని అమ్మవారిని మైసూరు వడయార్ పాలకులు కొలిచారు. ఇక్కడ దేవతామూర్తులు చాముండేశ్వరి, మహాబలేశ్వరుడు. ఈ చాముండి క్షేత్రాన్ని మహాబలాద్రిగా కూడా చరిత్రలో చెప్పబడింది. చతురస్రాకారంలో ద్రావిడ శైలిలో నిర్మించినబడిన ఈ దేవాలయంలో నవరంగ మంటపం, అంతరాళ మంటపం, గర్భగుడి ఉన్నాయి. అద్భుతమైన శిల్ప సంపదతో ఏడంచెల గోపురం ఈ గుడి ప్రత్యేకత. గణపతి, భైరవుడు మొదలైన దేవతామూర్తులు కూడా ఈ దేవాలయంలో ఉన్నాయి. గర్భగుడిలొ అష్టభుజములు కలిగిన మహిషాసుర మర్దిని రూపములో చాముండేశ్వరి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ వడయార్ రాజుల విగ్రహాలు, అమ్మ వారి సింహవాహనం కూడా చూడవచ్చు. శరన్నవరాత్రులలో వేద పఠనంతో పాటు అమ్మకు వైభవంగా పూజలు చేస్తారు. ఆశ్వయుజ పౌర్ణమి నాడు అమ్మకు రథోత్సవం, తెప్పోత్సవం కన్నుల పండువగా జరుగుతాయి.

సారసముఖి సకల భాగ్యదేహి అనే కృతిని రంజని గాయత్రి సోదరీమణులు పాడారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి