26, ఆగస్టు 2020, బుధవారం

షిర్డీ సాయి తత్త్వం - వ్యతిరేక ప్రచారానికి సమాధానం


 

మట్టిలో మాణిక్యాలు ఎందరో - వారిలో గురువులు, మహా ఆధ్యాత్మికవేత్తలు, తత్త్వశాస్త్రజ్ఞులు ఉన్నారు. రూపం చూసి ఏ హంగులూ లేని వారిని, మాటను విని ఏ తీపీ లేని వారిని పక్కకు పెట్టకూడదు. అలాచేస్తే ఓ గొప్ప సాంగత్యం కోల్పోయే ప్రమాదముంది. చాలాసార్లు శాస్త్రాలకు ఆచార వ్యవహారాలకు అతీతులైనట్లున్నవారు తారసపడినప్పుడు వారి ఆత్మజ్ఞానాన్ని విస్మరిస్తాము, మనకు సరైనవి, మనం పాటించే పద్ధతులు వారు పాటించనందుకు నిందిస్తాము. అలాగే హంగులు ఆర్భాటాలున్నవారిని చూసి వాటి భ్రమలో పడి అసలు విషయాన్ని విస్మరిస్తాము. ఇక్కడే మన సమయం వృథా అయ్యేది. జ్ఞాన సముపార్జనకు ఈ ప్రపంచంలో మూలాలు సమృద్ధి, గురుతత్త్వానికీ అంతే. బాహ్య విషయలోలత్వంలో అంధులమై అవకాశాలను కోల్పోతాము.

ఈ ప్రపంచంలో నేడు జరుగుతున్న షిర్డీ సాయి వ్యతిరేక ప్రచారానికి పైన చెప్పినవి కొన్ని కారణాలు. ఆయన చెప్పినవి శాస్త్రానికి ధర్మానికి అతీతమని కొందరు పెద్దలు, అలాగే ఆయనవి ఫకీరు చేష్టలని మరికొందరు, మరికొందరు ఆయన తీరు హైందవ వ్యతిరేకమని. ఇవన్నీ పైపైని మాటలే, ఆయన గురించి ఏ మాత్రం తెలుసుకోకుండా అనేవే. గొప్ప వారు ఎప్పుడూ ఆ కాలానికి, సమాజానికి ఉపయుక్తమైన మార్గాలలోనే నడుస్తారు. సాయి చేసింది కూడా అదే. శ్రద్ధ, కూరిమి లేకుండా మూఢంగా ఆరాధిస్తూ, పరధర్మాలను నిందిస్తూ, హింసకు పాల్పడే పరిస్థితులలో, ప్రజలను ఏకం చేసి, సామాన్యులకు కూడా ఆచరణయోగ్యమైన మార్గాన్ని ప్రతిపాదించారు. అదే ఒక శతాబ్దం పాటు నిలిచి విస్తరిస్తోంది. కాలానుగుణంగా ప్రజలకు సముచితమైన మార్గాన్ని బోధించలేక అవస్థ పడుతున్నారు అరకొర జ్ఞానమున్న సనాతనధర్మ గురువులు. అందుకే కదా, జగ్గీ వాసుదేవ్, రవిశంకర్ వంటి వారికి ప్రజాదరణ పెరుగుతోంది? అసలు ఆధ్యాత్మిక సత్తా ఉన్న సనాతనవాదులెంతమంది? వారు బహుళ ప్రజానీకంపై ఎంతటి ప్రభావం చూపగలుగుతున్నారు? వారి పరిధులేమిటి? ఇవి గమనిస్తే, ప్రస్తుతమున్న పీఠాధిపతులు, ఇతర మఠాధిపతుల పరిధి కొన్ని లక్షలమంది వరకే. అదే సమస్య. కొన్ని వేలమంది గురువులు, వారికి కొన్ని లక్షల మంది అనుచరులు. వారి మధ్య ఐక్యత లేదు, సఖ్యత లేదు, సారూప్యత ఉన్నా అంగీకరించలేని పరిస్థితి. పైగా కుళ్ళిపోయిన వ్యవస్థలు. అందుకే వీటికి అతీతంగా వచ్చిన తత్త్వాలు ప్రజాదరణ పొందుతున్నాయి. అంత మాత్రాన అవి సనాతనధర్మ వ్యతిరేకమన్నది పూర్తి అసత్యం. ఇక్కడే సాయి వ్యతిరేకులు తప్పటడుగులు వేస్తున్నది. సాయి భక్తి మార్గంలో సనాతనధర్మంలో చెప్పినదేనినీ ఖండించలేదు, వదులుకోమని చెప్పలేదు. మన వ్యక్తిత్వం, మనం అనుసరించే మార్గంలో కావలసిన ముఖ్యమైన ప్రాతిపదికలను ప్రస్తావించి వాటిపైనే దృష్టి పెట్టారు.

అన్యమత వాతావరణంలో పెరిగిన కబీరు రామదాసుకు ఎలా గురువైనాడు? అదే రీతి సాయి కూడా ఈ కోట్లాది భక్తులకు సద్గురువు, పూజనీయుడు, వారి తత్త్వం పూర్తిగా దత్తాత్రేయ పరంపరతో అనుసంధానమైనది. ఆ దృష్టితో పరిశీలించి విశ్లేషణ చేస్తే ఎటువంటి వైరుధ్యమూ కనబడదు. హిందుత్వాన్ని గౌరవించి అనుసరించిన అబ్దుల్ కలాం మనకు గౌరవనీయుడే కదా? మరి సాయి ఎందుకు కాడు? అబ్దుల్ కలాం మడి, వర్ణాశ్రమ ధర్మాలు పాటించలేదే? ఆయన వ్యక్తిత్వం వాటికి అతీతం. అలాగే, సాయి కూడా.

జైహింద్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి