30, ఆగస్టు 2020, ఆదివారం

పార్వతీ కుమారం భావయే - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి

ముత్తుస్వామి దీక్షితుల వారు తిరుత్తణి సుబ్రహ్మణ్యుని ఉపాసనలో సిద్ధిపొందిన నాదయోగి. వారు ఇక్కడ వల్లీ దేవసేనా సమేత శక్తిధరుని అనుగ్రహం పొంది తన నాదోపసనలో అద్భుతమైన పురోగతిని పొందారు. దీక్షితుల వారు తిరుత్తణి క్షేత్రాన్ని సందర్శించినప్పుడు సుబ్రహ్మణ్యుడు వృద్ధుని రూపంలో మెట్లు దిగి వచ్చి తన చేతితో దీక్షితుల వారి నాలికపై ప్రసాదాన్ని తాకించి అదృశ్యమవుతాడు. ఆ అనుభవానికి ఆశ్చర్యపోయి, స్వామి అనుగ్రహాన్ని గ్రహించి దీక్షితుల వారు ఆ స్వామిపై ఎనిమిది కృతులను రచించారు. అవే తిరుత్తణి కృతులుగా పేరొందాయి. ఈ కృతుల పల్లవులన్నీ కూడా గురుగుహ పదంతో అలంకరించబడినవే. తిరుత్తణి కృతులనే కాదు, దీక్షితుల వారు మరెన్నో కృతులను కూడా సుబ్రహ్మణ్యస్వామి వైభవాన్ని తెలిపే విధంగా రచించారు. గురుగుహ అన్న పదాన్ని తన కృతులలో ముద్రగా ఉపయోగించారు. అంతటి సుబ్రహ్మణ్య ఉపాసకులు వారు. గురుగుహ అని స్వామిని సంబోధించటంలో దీక్షితుల వారి అంతరార్థం తనకు గురువుగా భావించటమే. ఆయన రచించిన సుబ్రహ్మణ్య కృతులలో ఒకటి పార్వతీ కుమారం భావయే. వివరాలు:

సాహిత్యం
=======

పార్వతీ కుమారం భావయే సతతం శరవణభవ గురుగుహ శ్రీ

మార్గసహాయ ప్రియసుతం మాధవాద్యమర సేవితం
మాణిక్య మకుట శోభిత మానిత గుణ వైభవం

భావం
=====

గురుగుహుడు, శరవణభవుడు (రెల్లుగడ్డిలో జన్మించిన వాడు), పార్వతీపుత్రుడైన కుమారస్వామిని ఎల్లప్పుడూ ధ్యానించెదను. విరించిపురంలో వెలసిన మార్గబంధీశ్వరుని ప్రియకుమారుడు, శ్రీహరి మొదలైన దేవతలచే సేవించబడిన వాడు, మాణిక్యములతో పొదిగిన కిరీటముతో శోభిల్లేవాడు, పొగడబడిన గుణవైభవములు కలవాడు అయిన కుమారస్వామిని ఎల్లప్పుడూ ధ్యానించెదను.

శ్రవణం
=======

నాటకురంజి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలాజీ శంకర్ గారు  ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి