30, నవంబర్ 2020, సోమవారం

పరమేశ్వర జగదీశ్వర - ముత్తుస్వామి దీక్షితుల కృతి


ముత్తుస్వామి దీక్షితుల వారు అపార ఆధ్యాత్మిక సంపన్నులు. నాదోపాసనతో పాటు మంత్రానుష్ఠానం చేసి ఎన్నో క్షేత్రాలలోని దేవతల అనుగ్రహం పొందారు. కాశీలో ఎన్నో ఏళ్లు గురువులైన చిదంబరనాథ యోగి గారి దగ్గర ఉండి వారికి సేవ చేసి వారి అనుగ్రహంతో సమస్త విద్యలలోనూ సాఫల్యం పొందారు. ఆయన క్షేత్ర కృతులకు ప్రసిద్ధులని గతంలో ప్రస్తావించాను. ఆయన ఈ దేశంలో దర్శించని క్షేత్రం లేదు అంటే అతిశయోక్తి కాదు. తిరువయ్యారు లోని పంచనదీశ్వర క్షేత్రం సనాతనమైన దేవాలయం. ఇక్కడ ఐదు నదులు, ఐదు పుష్కరిణులు ఉండటం చేత క్షేత్రం ఎంతో పవిత్రతను పొందింది. ఈ క్షేత్ర మహిమను ఉట్టంకిస్తూ దీక్షితుల వారు పరమేశ్వర జగదీశ్వర అనే కృతిని రచించారు. వివరాలు:

సాహిత్యం
=======

పరమేశ్వర జగదీశ్వర శంకర పాహిమాం ప్రణతార్తిహర శ్రీ

పురహర మృగధర సుందరేశ్వర ధర్మసంవర్ధనీ మనోహర

పంచనదీశ్వర గంగాధరేశ్వర పన్నగాభరణ భక్త జనావన
పంచ బ్రహ్మ హత్యాది పాప హర పర శివ తత్వార్ధ బోధిత చతుర
పంచనద క్షేత్ర ప్రభాకర పాలిత గురుగుహ భవభయ హర
వీర క్షేత్ర పాల వినుత చరణ విచిత్ర యమ భయాది నివారణ 

భావం
=====

శరణు కోరినవారి ఆర్తిని తీర్చే ఓ పరమేశ్వరా! జగదీశ్వరా! శంకరా! నన్ను రక్షించుము. త్రిపురాసురులను సంహరించినవాడవు, జింకను ధరించేవాడవు, సుందరేశ్వరుడవు, ధర్మసంవర్ధనీ అమ్మవారి మనోహరుడవు, న్న రక్షించుము. పంచనదీశ్వర క్షేత్రంలో వెలసిన పరమశివుడవు, గంగాధరుడవు, సర్పములు ఆభరణముగా కలిగి భక్త జనులను పోషించేవాడవు, పంచ బ్రహ్మ హత్యా పాతకములను తొలగించేవాడవు, పరశివ తత్త్వార్థమును బోధించే నిపుణుడవు, పంచనదములు కలిగిన ఈ క్షేత్రాన్ని ప్రకాశింపజేసేవాడవు, సుబ్రహ్మణ్యుని రక్షకుడవు, సంసార భయములను తొలగించేవాడవు, వీరులైన క్షేత్రపాలకులచే నుతించబడిన చరణములు కలవాడవు, విచిత్రమైన మృత్యు భయాలను నివారించేవాడవు, నన్ను రక్షించుము. 

శ్రవణం
======

నాట రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మల్లాది సోదర్లు ఆలపించారు.

చిత్రం
=====

తిరువయ్యారు లోని పంచనదీశ్వర స్వామి-ధర్మసంవర్ధనీ అమ్మ వారి ఉత్సవ మూర్తులు.

29, నవంబర్ 2020, ఆదివారం

సదా మదిన్ దలతు గదరా - త్యాగరాజస్వామి కృతి


త్యాగరాజస్వామి వారి శివ కృతులను పరిశీలిస్తే ఆయన ఆ తిరువాయూరు త్యాగరాజస్వామి వారిని ఎంతగా ఆరాధించారో అర్థమవుతుంది. అద్వైతమార్గంలో ఉన్న ఔన్నత్యానికి త్యాగరాజస్వామి వారి కృతులు చక్కని ఉదాహరణలు. రామునిపైనే సింహభాగం కృతులు రచించినా ఎన్నో శివునిపై, అమ్మవారిపై, గణపతిపై కృతులను  సద్గురువులను రచించారు. శివారాధనలో ఉన్న ఆనందాన్ని త్యాగరాజస్వామి తన కృతులెన్నిటో ప్రస్తావించారు. అటువంటి ఒక కృతి సదా మదిన్ దలతు. ఉత్సాహవంతమైన గతిలో సద్గురువులు ఈ కృతిని స్వరపరచారు. వివరాలు:

సాహిత్యం
========

సదా మదిన్ దలతు గదరా ముదాస్పద నగజాధిపతీ

సదాశివానందస్వరూప! సదయ మోద హృదయ పద సరోజములనే

దిగంబరాంధక దైత్య హర దిగీశ సన్నుత గంగాధర
మృగాంక శేఖర నటన చతుర మనుప సమయ మిదిరా త్యాగరాజ నుత

భావం
=====

ఓ పార్వతీపతీ! భక్తులకు ఆనందం కలిగించే నిన్ను ఎల్లప్పుడు నా మదిలో తలచుచున్నాను. ఆనందస్వరూపుడవు, ఆనంద హృదయుడవైన ఓ సదాశివా!  నీ పదకములను నేను ఎల్లప్పుడు మదిలో తలచుచున్నాను. ఓ దిగంబరా! అంధకాసురుని సంహరించిన హరా! ఇంద్రునిచే నుతించబడిన గంగాధారా! చంద్రుని శిరసున ధరించిన నటరాజా! నన్ను రక్షించుటకు ఇది సమయము! త్యాగరాజునిచే నుతించబడిన పరమశివా! నిన్ను ఎల్లప్పుడూ నా మదిలో తలచుచున్నాను. 

శ్రవణం
======

గంభీరవాణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బీఎన్ చిన్మయి గారు ఆలపించారు.

28, నవంబర్ 2020, శనివారం

కోరి సేవింప రారే కోర్కెలీడేర - త్యాగరాజస్వామి కృతి


త్యాగరాజస్వామి శివ కృతులలో కోవూరి సుందరేశ్వరుని పంచరత్న కృతుల ప్రస్తావన చేసుకున్నాము. సుందరేశ్వరుని, సౌందర్యాంబికను దర్శించి, సేవించి సద్గురువులు ఎంత ఆనందించారో మనకు ఈ ఐదు కృతులలో స్పష్టంగా తెలుస్తుంది. తనను అనుగ్రహించిన ఆ సుందరేశ్వరునిపై రచించిన కోరి సేవింపరారే అనే కృతిలో సద్గురువులు స్వామి వైభవాన్ని, అనుగ్రహాన్ని మనోజ్ఞంగా వర్ణించారు. వివరాలు:

సాహిత్యం
======= 

కోరి సేవింప రారే కోర్కెలీడేర 

శ్రీరమణీకరమౌ కోవురి సుందరేశ్వరుని

సురులు వేయి వన్నె బంగారు విరులచే పూజింపగ భూ
సురులు సనకాది మౌని వరులును నుతింపగ
సిరులిత్తునని కొలువై యుండే శ్రీసౌందర్యనాయికా
వరుని శ్రీ త్యాగరాజ వరదుని పరమాత్ముని హరుని

భావము
======

ఓ జనులారా! మనసులో భావించిన కోర్కెలు తీరుట కొరకు శుభకరుడు, సుందరుడు అయిన కోవూరి సుందరేశ్వరుని సేవించుటకు రండి! దేవతలు వేయి వన్నెలు కల బంగారు పుష్పములచే పూజించగా, బ్రాహ్మణులు, సనకాది మునిశ్రేష్ఠులు నుతించగా సమస్త ఐశ్వర్యములను ఇచ్చెదనని కొలువైయున్న సౌందర్యనాయికకు పతియైనవాని, త్యాగరాజునికి వరములిచ్చిన పరమాత్ముడైన శివుని, మనసులో భావించిన కోర్కెలు తీరుటకు ఈ కోవూరి సుందరేశ్వరుని సేవించుటకు రండి. 

శ్రవణం
======

ఖరహరప్రియ రాగంలోని ఈ కృతిని వోలేటి వేంకటేశ్వర్లు గారు ఆలపించారు.

(చిత్రం మదురైలోని సుందరేశ్వరుని ఉత్సవ విగ్రహం)


26, నవంబర్ 2020, గురువారం

తులశమ్మ మా ఇంట నెలకొనవమ్మ - త్యాగరాజస్వామి కృతి

సనాతనధర్మంలోని నిత్యనైమిత్తికాలలో తులసి పూజ అంతర్భాగం. లక్ష్మీ స్వరూపమైన తులసివృక్షాన్ని పవిత్రంగా భావించి పూజించి దళాలను సేవించి తరించినవారు ఎందరో. వారిలో సద్గురువులు త్యాగరాజస్వామి కూడా ఒకరు. నిత్యమూ తులశమ్మను పూజించి ఆ తల్లిని తన కృతుల ద్వారా నుతించారు కూడా. తులసీదళములచే సంతోషముగా పూజింతు అన్న కృతి చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే అమ్మ రావమ్మ తులశమ్మ, తులసీ జగజ్జనని, తులశమ్మ మా ఇంట నెలకొనవమ్మ వంటి కృతుల ద్వారా ఆ తల్లిని ఎంతో భక్తితో నుతించారు. వాటిలో దేవగాంధారి రాగంలో కూర్చబడిన కృతిలో సద్గురువులు తన నిత్యోపాసనలో తులసీ పూజా వైభవాన్ని మనోజ్ఞంగా ఆవిష్కరించారు. సగుణోపాసనలో ఉండే ఔన్నత్యాన్ని ఈ కృతిలో మరో మారు మనకు కళ్లకు కట్టినట్లుగా చెప్పారు. వివరాలు:

సాహిత్యం
=======

తులశమ్మ మా ఇంట నెలకొనవమ్మ శ్రీ

ఈ మహిని నీ సమానమెవరమ్మ బంగారు బొమ్మ

కరకు సువర్ణపు సొమ్ములు బెట్టి సరిగె చీరె ముద్దు కురియగ గట్టి
కరుణ జూచి సిరులను ఒడిగట్టి వరదుని కరమును బట్టి శ్రీ

ఉరమున ముత్యపు సరులసియాడ సుర తరుణులు నిన్ను కొనియాడ
వరమును అష్టదిగీశులు వేడ వరదుడు నిను ప్రేమ జూడ శ్రీ 

మరువక పారిజాత సరోజ కురవక వకుళ సుగంధ రాజ
వర సుమములచే త్యాగరాజ వరద నిను బూజసేతు

భావం
=====

శ్రీతులశమ్మా! మా ఇంటిలో నెలకొనుము తల్లీ! ఓ బంగారు బొమ్మా! ఈ భువిలో నీ సమానమెవరు? మెరసే బంగారపు ఆభరణములు ధరించి, ముద్దులు కురిసేలా బంగారు చీర కట్టుకుని, కరుణతో చూచుచు సమస్త ఐశ్వర్యములను ఒడిలో గట్టుకుని, నారాయణుని కరమును బట్టుకొని మా ఇంటిలో నెలకొనుము తల్లీ! శ్రీతులశమ్మా! మెడలో ముత్యాల వరుసలు కదలుచుండగా, దేవతాస్త్రీలు నిన్ను కొనియాడు చుండగా, అష్టదిక్పాలకులు నిన్ను భక్తితో నుతించగా, నారాయణుడు నిన్ను ప్రేమతో జూడగా మా ఇంటిలో నెలకొనుము తల్లీ! శ్రీతులశమ్మా! మరువము, పారిజాతము, కలువలు, ఎర్ర గోరింటలు, పొగడ పూలవంటి శ్రేష్ఠమైన సుగంధ పుష్పములచే పరమేశ్వరుని అనుగ్రహించిన నిన్ను నేను పూజించెదను, మా ఇంటిలో నెలకొనుము తల్లీ!

శ్రవణం
=======

ఈ కృతిని బెంగళూరు సోదరులు హరిహరన్ అశోక్ ఆలపించారు

24, నవంబర్ 2020, మంగళవారం

హరియే గతి సకల చరాచరములకు - మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కృతి



మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి బహుముఖ ప్రజ్ఞలో గాత్రం, వయోలిన్ సంగీత విద్వత్తుతో పాటు అద్భుతమైన కృతులను రచించి స్వరపరచి, భావరాగ యుక్తంగా ఆలపించే వాగ్గేయకార నైపుణ్యం కూడా ఉంది. ఆయన కొన్ని వందల కృతులను రచించారు. వాటిలో రాగమాలికలు కూడా ఉన్నాయి. వాగ్గేయకారులకు సంగీతంతో పాటు భాషలో పరిపూర్ణమైన నైపుణ్యం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఛందోబద్ధంగా, తాళానికి తగినట్లుగా సాహిత్యాన్ని రచించాలి కాబట్టి వ్యాకరణంపై పట్టు చాలా ముఖ్యం. ఒకే అర్థాన్ని తెలిపే అనేక పదాల అవగాహన పూర్తిగా ఉండాలి, భక్తిభావాన్ని ఉన్నతంగా ఒలికించే స్థాయిలో పరిజ్ఞానం ఉండాలి. పసిబాలుడిగా ఉన్నప్పుడే కచేరీలు మొదలు పెట్టిన బాలమురళి గారు దశాబ్దాల పాటు ఆలిండియా రేడియోలో విజయవాడలో పని చేశారు, ఎందరో కళాకారులకు మార్గదర్శకులుగా నిలిచారు. ఆ సమయం నుండే ఆయన కృతులను రచించారు. ఆయన కృతులతో పాటు ఎన్నో కొత్త రాగాలను కూడా సృష్టించారు. రాగమాలికగా వారు రచించిన ఒక కృతి హరియే గతి. పల్లవి రేవగుప్తిలో, చరణాలు కాంభోజి, శుద్ధ ధన్యాసి, హంసానంది రాగాలలో స్వరపరచారు మంగళంపల్లి వారు. కృతి వివరాలు:

సాహిత్యం
========

హరియే గతి సకల చరాచరములకు
హరియే గతి విరించి రుద్రాదులకైన

ముద్దుల బాలుడై మురళిని చేపట్టి
బాలమురళివై నాదము పూరించి
ముల్లోకములను మునులను సైతము
మురిపించి మైమరపించిన శ్రీ 

ఆయా యుగముల ధర్మము నిలుపగ
అవతారములను దాల్చిన దైవము
హయవాహనుడై కలియుగమందున
అలమేలుమంగపతివై వెలసిన

భస్మాసురులు నయ వంచకులు
అసహన శూరులు పలు శిశుపాలురు
పట్టి బాధించు నిట్టి తరుణమున
పాలన సేయుటకెవరు మాకెవరు

భావం
=====

సమస్త చరాచర జీవరాశులకు శ్రీహరియే గతి. బ్రహ్మ రుద్రాదులకు కూడా శ్రీహరియే గతి. ఆయా యుగములలో ధర్మమును నిలబెట్టుటకు అవతారములెత్తిన పరమాత్మ, అశ్వమును అధిరోహించి కలియుగములో కల్కిగా, అలమేలుమంగాపతియైన శ్రీనివాసునిగా వెలసిన ఆ శ్రీహరే సమస్త చరాచర జీవరాశులకు గతి. భస్మాసురుని వంటి దుష్టులు, దారుణంగా మోసం చేసే వారు, సహనములేని శూరులు, శిశుపాలుని వంటి నీచులు అనేకులు ఈ సమాజాన్ని పట్టి బాధించే ఈ సమయంలో మమ్మలను పాలించేవారెవరు? సమస్త చరాచర జీవరాశులకు ఆ శ్రీహరియే గతి.

శ్రవణం
======

అద్భుతమైన చిట్టస్వరాలతో ఉన్న ఈ కృతిని డాక్టర్ బాలమురళీకృష్ణ గారి ఆలాపనలో దృశ్యశ్రవణంగా వీక్షించండి

22, నవంబర్ 2020, ఆదివారం

ఇలలో ప్రణతార్తిహరుడనుచు - త్యాగరాజస్వామి కృతి


దైవాన్ని నిందించటం భక్తిమార్గంలో మానవ సహజమే. ఒక దైవాన్ని నమ్ముకున్నప్పుడు అసహాయ స్థితిలో ఆ దైవం పలకకపోతే భక్తునికి నిరాశతో అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ, అది తాత్కాలిక భావనే. త్రికరణశుద్ధిగా కొలిచే భక్తుని దైవం అనుగ్రహించకుండా ఉంటాడా? త్యాగరాజస్వామికి అటువంటి అనుగ్రహాలు ఎన్నో. అందుకే ఆయన రచించిన కృతులలో అన్ని రకాల భావనలకు స్థానం ఉంది. తిరువాయూరులోని  పార్వతీపరమేశ్వరుల రూపమైన ధర్మసంవర్ధిని, పంచనదీశ్వరులపై ఆయన కొన్ని కృతులను రచించారు. వాటిలో ఇలలో ప్రణతార్తిహరుడనుచు ఒకటి. తాను ఎంతో ఉపాసన చేసి, కృశించి, ఎంతో కాలము పాదసేవ చేసినా, నిరంతరము సాష్టాంగ ప్రణామాలు చేసినా భక్తసులభుడని పేరొందిన శంకరునికి తనపై కరుణ కలుగలేదని త్యాగరాజస్వామి నిలదీసి అడుగుతున్నారు. భక్తునికి భగవంతుని మధ్య ఇటువంటి సంభాషణలు అనేకం. ఇక్కడ మనం సాష్టాంగ ప్రణామముల ప్రస్తావన చేసుకోవాలి. సాష్టాంగ నమస్కారము అంటే మనకు ఉన్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోऽష్టాంగ ఈరితః, అనగా ఉరముతో, శిరస్సుతో, కన్నులతో, మనసుతో, మాటతో, పాదములతో, చేతులతో, చెవులతో దైవానికి నమస్కరించుట. ఇది ఉపాసనా మార్గంలో ఒక ముఖ్యమైన ఆచారం. దైవం ముందు ఈ ప్రణామం చేయటంలో మనలోని అహంకారానికి మాతృకలైన ఈ ఇంద్రియాలను వంచి పరమాత్మకు దాసోహం అనటం. ప్రతి రోజూ కూడా ఇది చేయటం నిత్యానుష్ఠానంలో ఒక విధి. త్యాగరాజస్వామి ఆ సాష్టాంగ ప్రణామాన్ని ప్రస్తావించటంలో ఉద్దేశం నా సర్వస్వమూ నీ పాదముల వద్ద ఉంచి కొలిచినా నీవు పలకటం లేదు అని. కృతి వివరాలు:

సాహిత్యం
========

ఇలలో ప్రణతార్తిహరుడనుచు పేరెవరిడిరే శంకరుడని నీ

తలచి కరగి చిరకాలము పదమున దండమిడిన నా యెడ దయ లేదాయే

కరచరణ యురము నొసలు భుజములు ధరణి సోక మ్రొక్కగ లేదా
శరణనుచును మొరలిడ లేదా పంచనదీశ త్యాగరాజనుత నీ

భావం
======

త్యాగరాజునిచే నుతించబడిన ఓ పంచనదీశ్వరా! ఈ భూమిపై భక్తుల ఆర్తిని తొలగించేవాడని, శంకరుడని నీకు పేరెవరు ఇచ్చారు? నిన్నే తలచి, కృశించి, చిరకాలముగా నీ పదములకు నమస్కరించిన నా పట్ల నీకు దయలేదాయె! చేతులతో, కాళ్లతో, ఉరముతో, నొసలతో, భుజములతో భూమిని తాకేలా మ్రొక్కగా నాపై దయలేదా? నిన్నే శరణనుచు నేను మొరలిడలేదా?! ఈ భూమిపై భక్తుల ఆర్తిని తొలగించేవాడని, శంకరుడని నీకు పేరెవరు ఇచ్చారు? 

శ్రవణం
======

అఠానా రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

(చిత్రం తిరువాయూర్ పంచనదీశ్వరుడు, ధర్మసంవర్ధిని అమ్మ వారి ఉత్సవమూర్తులు)

21, నవంబర్ 2020, శనివారం

శివ శివ శివ యనరాదా - త్యాగరాజస్వామి కృతి


త్యాగరాజస్వామి నిరంతరం దారితప్పే మనసును సరిదిద్దే సందేశమున్న కృతులను ఎన్నో రచించారు. మనసా ఎటులోర్తునే, మనవి ఆలకించరాదటే వంటి కృతుల ద్వారా మనసును నియంత్రించుకునే మార్గాలను మనకు తెలిపారు. అటువంటి ఒక కృతే శివ శివ శివ యనరాదా. అరిషడ్వర్గాలను, ఇతర దుర్గుణాలను పక్కకు పెట్టి,అన్య స్త్రీలు, అన్యుల ధనముపై ధ్యాస వీడటం మొదలైన వాటిని ఆచరిస్తూ నియమ నిష్ఠలతో పరమశివుని మనసారా కొలువమని చెప్పారు. సజ్జన సాంగత్యం, వేదాధ్యయనం, భగవద్భక్తుల సేవ, శివనామస్మరణ చేస్తే ఈ జన్మకు సంబంధించిన సంసార బాధలను తొలగించుకోవచ్చని హితవు పలికారు. కృతి వివరాలు:

సాహిత్యం
========

శివ శివ శివ యనరాదా ఓరీ భవ భయ బాధలనణచుకోరాదా

కామాదుల తెగగోసి పరభామల పరులధనముల రోసి
పామరత్వము నెడబాసి అతి నేమముతో బిల్వార్చన చేసి 

సజ్జన గణముల గాంచి ఓరీ ముజ్జగదీశ్వరులని మతినెంచి
లజ్జాదుల తొలగించి తన హృజ్జలజమునను పూజించి

ఆగమముల నుతియించి బహు బాగు లేని భాషలు చాలించి
భాగవతులతో పోషించి ఓరీ త్యాగరాజ సన్నుతుడని యెంచి

భావం
======

ఓ మనసా! శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! కామాది అరిషడ్వర్గములను తెగత్రుంచి, అన్యస్త్రీలను, పరుల ధనాదులపై ఆలోచనలను త్యజించి, అజ్ఞానాన్ని విడిచి అత్యంత నియమనిష్ఠలతో బిల్వార్చనతో శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! సజ్జన సమూహములను దర్శించుకుని ఆ పరమశివుని మూడులోకాలకు అధిపతి అని గ్రహించి, దురభిమానము మొదలైన దుర్గుణములను తొలగించుకుని, మన హృదయకమలముచే పూజిస్తూ శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! వేదములను నుతిస్తూ అనవసరమైన సంభాషణలను కట్టి పెట్టి, భాగవతోత్తములను పోషించి, త్యాగరాజునిచే పూజించబడిన వాడని భావించి శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! 

శ్రవణం
=======

పంతువరాళి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

20, నవంబర్ 2020, శుక్రవారం

త్యాగరాజస్వామి లాల్గుడి పంచరత్న కృతి - ఈశ పాహిమం

కర్నాటక సంగీత త్రయంలో త్యాగరాజస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఐదు రకాల పంచరత్న కృతులను రచించారు. అవి ఘనరాగ పంచరత్న కృతులు, తిరువొట్ట్రియూర్ పంచరత్న కృతులు, కోవూరు పంచరత్న కృతులు, శ్రీరంగ పంచరత్న కృతులు, లాల్గుడి పంచరత్న కృతులు. వీటిలో ఘనరాగ పంచరత్న కృతులు జగత్ప్రసిద్ధమైనవి, తిరువాయూరులో, ప్రపంచమంతటా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలలో ఆలపించబడేవి. మిగిలినవి తిరువొట్ట్రియూరులోని త్యాగరాజస్వామి దేవస్థానంలోని త్రిపురసుందరీ అమ్మవారిపై, కోవూరు సుందరేశ్వరునిపై, శ్రీరంగంలోని రంగనాథస్వామిపై, లాల్గుడిలోని సప్తఋషీశ్వర స్వామి దేవస్థానంలోని స్వామిపై, అమ్మపై రచించారు. 

సుబ్రహ్మణ్యుని శాపం నుండి విముక్తి కలిగేందుకు సప్తఋషులు తపస్సు చేసి పరమశివుని కరుణతో శాపవిముక్తులైనారు. అందుకే లాల్గుడిలో వెలసిన ఆ పరమశివుని రూపానికి సప్తఋషీశ్వరుడని పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారి పేరు మహిత ప్రవృద్ధ శ్రీమతి. ఇక్కడి దేవాలయం ఎనిమిదవ శతాబ్దంలో చోళులచే నిర్మించబడింది, స్వామి లింగం స్వయంభూ. లాల్గుడిని సందర్శించినప్పుడు త్యాగరాజస్వామి అయ్యవారిపై, అమ్మవారిపై రచించిన పంచరత్న కృతులు - గతి నీవని (తోడి), లలితే శ్రీప్రవృద్ధే (భైరవి), దేవ శ్రీ (మధ్యమావతి), మహిత ప్రవృద్ధ (కాంభోజి), ఈశ పాహిమాం (కల్యాణి). చివరి కృతి వివరాలు:

సాహిత్యం
========

ఈశ పాహిమాం జగదీశ పాహిమాం

ఆశరగణ మదహరణ బిలేశయ భూష సప్తఋషీ(శ)

శ్రీనాథ కరార్చిత దొరికేనాల్పులకీదర్శన
మేనాటి తపఃఫలమో నీ నామము దొరకె
శ్రీ నారద గానప్రియ దీనార్తి నివారణ పర
మానందార్ణవ దేవ యనాపజనక సప్తఋషీ(శ)

వ్యాసార్చిత పాలిత నిజదాస భూలోక కై
లాసంబను పల్కులు నిజమే సారెకు గంటి
నీసాటి ఎవరయ్యా నీ సాక్షాత్కారమున
వేసట లెల్ల దొలగె నేడే జన్మము సాఫల్యము 

సామాది నిగమ సంచార సోమాగ్ని తరణి లోచన
కామాది ఖండన సుత్రామార్చిత పాద
హేమాచల చాప నిను వినా మరెవరు ముని మనో
ధామ త్యాగరాజ ప్రేమావతార జగ(దీశ)

భావం
======

పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము. రాక్షస గణముల అహంకారాన్ని అణచేవాడవు, సర్పములు ఆభరణములు కలవాడవు, సప్తఋషీశ్వరుడవైన పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము. శ్రీహరి కరములచే పూజించబడిన వాడవు, అల్పులకు నీ దర్శనము దొరికేనా? ఇది ఏ నాటి తపస్సుల ఫలమో నీ నామము లభించింది. నారదుని గానాన్ని ఆనందించేవాడవు, దీనజనుల ఆర్తిని నివారణ చేసే వాడవు, పరమానందమనే సముద్రము వంటి వాడవు, అగ్నిదేవునికి తండ్రివి, సప్తఋషీశ్వరుడవైన పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము. వ్యాసునిచే పూజించబడిన వాడవు, నిజభక్తులను రక్షించేవాడవు, కాబట్టే ఈ లాల్గుడి సప్తఋషీశ్వర క్షేత్రానికి భూలోక కైలాసమన్న పేరు సార్థకము. మరల మరల నిన్ను దర్శించాను, నీ సాటి ఎవ్వరూ లేరు, నీ సాక్షాత్కారముతో నా అలసటలన్నీ తొలగాయి, నా జన్మ సఫలమైనది, పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము. సామాది వేదములలో సంచరించేవాడవు, సూర్యచంద్రాగ్నులు నేత్రములుగా కలవాడవు, కామాది అరిషడ్వర్గములను నాశనము చేసేవాడవు, ఇంద్రునిచే అర్చించబడిన పాదములు కలవాడవు, మేరు పర్వతమును చాపముగా ధరించినవాడవు, నీవు గాక నాకు దిక్కెవరు. మునుల మనసులలో నివసించేవాడవు, ప్రేమావతారుడవైన ఓ పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము. 

శ్రవణం
=======

కల్యాణి రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఈ కృతిని ఓ ఎస్ త్యాగరాజన్ గారు ఆలపించారు

15, నవంబర్ 2020, ఆదివారం

ఈ వసుధ నీ వంటి దైవము - త్యాగరాజస్వామి వారి కృతి

 

సంగీత త్రయంలో ఉన్న ఒక ప్రత్యేకత అనేక క్షేత్రాలు దర్శించినప్పుడు అక్కడి దేవతామూర్తులపై కృతులను రచించటం. ముత్తుస్వామి దీక్షితులవారు భారతదేశమంతా తీర్థయాత్రలు చేశారు, అందుకే చాలా ఎక్కువ కృతులు అటువంటివి రచించారు. త్యాగరాజస్వామి ఎక్కువమటుకు తిరువయ్యారులోనే ఉండేవారు. అప్పుడప్పుడు తీర్థయాత్ర చేసిన క్షేత్రాలలో దేవతామూర్తులపై ఆయన కూడా కృతులను రచించారు. అటువంటి కృతి ఒకటి శహన రాగంలో కూర్చబడిన ఈ వసుధ నీ వంటి దైవము. చెన్నై సమీపంలోని కోవూరు సుందరేశ్వరునిపై ఆయన ఐదు కృతులను రచించారు. అవి కోవూర్ పంచరత్న కృతులుగా పేరొందాయి. దీని వెనుక ఒక గాథ ఉంది. 

త్యాగరాజస్వామి వారు తిరుమల తీర్థయాత్రకు వెళుతూ మధ్యలో కోవూరులో సుందరేశ మొదలియార్ అనే జమీందారును కలుస్తారు. త్యాగరాజస్వామి వారిని మొదలియార్ గారు కొన్ని కృతులను తనపై కృతులను రచించమని కోరతాడు. తాను మానవులను నుతిస్తూ కృతులను రచించనని చెప్పి త్యాగరాజస్వామి తిరుపతి బయలుదేరతారు. తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యంలో బందిపోటు దొంగలు త్యాగరాజస్వామి వారి సమూహంపై దాడిచేయబోగా స్వామి వారికి తన వద్ద ఏమీ లేదని చెబుతారు. ఆ బందిపోట్లు తమపై రాళ్లు విసిరిన ఇద్దరు తేజోమూర్తులెవరు అని ప్రశ్నిస్తారు. త్యాగరాజస్వామి వారిని రామలక్ష్మణులుగా గుర్తించి ఆ బందిపోట్ల భాగ్యానికి ఆనందిస్తారు. కోవూరు క్షేత్రానికి గల మహిమను గ్రహించి అక్కడి సుందేశ్వరుడు, సౌందరాంబికను దర్శించుకుని ఐదు కృతులను రచిస్తారు. ఆ కృతులను విన్న మొదలియారు అవి తనపై రచన చేశారు అనుకుని సంతోషించగా త్యాగరాజస్వామి ఆ కృతులను తాను కోవూర్ సుందరేశ్వరునిపై రచించాను అని చెప్పి తిరిగి తిరువయ్యరు వెళ్లిపోతారు. ఈ కోవూరు పంచరత్న కృతులు - ఈ వసుధ (శహన), కోరి సేవింప (ఖరహరప్రియ), శంభో మహాదేవ (పంతువరాళి), నమ్మి వచ్చిన (కల్యాణి), సుందరేశ్వరుని (శంకరాభరణం). వాటిలో ఈ వసుధ నీ వంటి అనే కృతి వివరాలు:


సాహిత్యం
========

ఈ వసుధ నీ వంటి దైవమునెందు గానరా

భావుకము గల్గి వర్ధిల్లు కోవూరి సుందరేశ గిరీశ

ఆసచే అరనిముషము నీ పురవాస మొనర ఏయు వారి మది
వేసటలెల్లను తొలగించి ధనరాశులనాయువును
భూసుర భక్తియు తేజమునొసగి భువనమందు కీర్తి గల్గ జేసే
దాస వరద త్యాగరాజ హృదయ నివాస చిద్విలాస సుందరేశ

భావం
=====

శుభములు కలిగించుచు వర్ధిల్లే ఓ కోవూరి సుందరేశా! గిరీశ్వరా! ఈ భూమిపై నీవంటి దైవమును ఎక్కడా కానలేను. ఆశతో అరనిమిషమైన నీ సన్నిధిలో యుండే వారి మనసులోని పరితాపములను తొలగించి ధనరాశులను, ఆయుష్షును, బ్రాహ్మణుల పట్ల భక్తిని, తేజస్సును ప్రసాదించి ఈ జగత్తులో కీర్తిని కలిగించేవాడవు, దాసులకు వరములొసగే వాడవు, త్యాగరాజుని హృదయములో నివసించేవాడవు, చిద్విలాసుడవైన ఓ సుందరేశా! ఈ భూమిపై నీవంటి దైవమును ఎక్కడ కానలేను. 

శ్రవణం
======

శహన రాగంలో కూర్చబడిన ఈ కృతిని జీఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు

14, నవంబర్ 2020, శనివారం

రారా మా ఇంటి దాక - త్యాగరాజస్వామి వారి కృతి



ప్రహ్లాద విజయం త్యాగరాజస్వామి వారు రచించిన అద్భుతమైన యక్షగానం. అనేక కృతులతో, పద్యాలతో, గద్యంతో ఈ యక్షగానం ప్రహ్లాదుని భక్తిని, శ్రీహరి రూపమైన రాముని అనుగ్రహాన్ని ఆవిష్కరిస్తుంది. సాగర తీరంలో శ్రీహరి దర్శన భాగ్యం కలిగిన తరువాత స్వామి ప్రహ్లాదుని తన తొడపై కూర్చుండబెట్టుకుని చేతులతో నిమిరి ప్రహ్లాదుని కౌగిలించుకుంటాడు. ఆ భాగ్యాన్ని ఆస్వాదించిన ప్రహ్లాదుడు స్వామిని తన నివాసానికి రమ్మని వేడుకునే కృతి ఇది. పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు నిరంతర శ్రీహరి దర్శనాభిలాషియై స్వామిని తనతోనే ఉండమనే భావనను ఈ కృతి ద్వారా త్యాగరాజస్వామి తెలియజేశారు. ప్రహ్లాదుని హరిభక్తిలో ఉండే శరణాగతి, అనన్యమైన విశ్వాసాలు ఈ కృతిలో స్పష్టంగా మనకు గోచరిస్తాయి. వాగ్గేయకారులు భాగవతోత్తములపై ఇటువంటి రచనలు చేయటంలో ఉద్దేశం వారి మార్గంలోని ఔన్నత్యాన్ని, వారి భావనలను మనకు తెలియజేయటానికే. అందుకు సంగీత సాహిత్యాలకు మించిన సాధనమేముంటుంది? అందుకే త్యాగరాజస్వామి ప్రహ్లాద విజయం మేటి యక్షగానంగా నిలిచిపోయింది. 

సాహిత్యం
========

రారా మా ఇంటి దాక! రఘువీర! సుకుమార! మ్రొక్కేరా!

రారా దశరథ కుమార! నన్నేలుకోరా! తాళలేరా!

కోరిన కొర్కెలు కొనసాగకనే నీరజనయన నీ దారిని గని వే 
సారితి గాని సాధు జనావన సారి వెడలి స్వామి నేడైనా

ప్రొద్దున లేచి పుణ్యము తోటి బుద్ధులు చెప్పి బ్రోతువు గాని 
ముద్దుగారు నీ మోమును జూచుచు వద్ద నిలచి వారము పూజించేను

దిక్కు నీవనుచు తెలిసి నన్ను బ్రోవ గ్రక్కున రావు కరుణను నీ చే 
జిక్కియున్న నన్ను మరతురా ఇక శ్రీ త్యాగరాజుని భాగ్యమా

భావం
=====

ఓ రఘువీర! సుకుమార! నీకు మ్రొక్కెదను మా యింటి దాకా రారా! ఓ దశరథ కుమారా, నేనిక తాళలేకున్నాను నన్నేలుకొనుటకు రారా! నేను కోరుకున్న కోరికలు తీరకనే నీవు వెళ్లిపోయినంత నేను వేసారితిని. కావున ఓ సాధుజన రక్షకా! మరల ఈరోజైనా రావయ్యా స్వామీ! పొద్దునే లేచి పుణ్యమైన బుద్ధులు నాకు చెప్పి నన్ను బ్రోవుము. నీ ముద్దుగారే మోమును చూచుచు నీ వద్దనే నిలిచి మరల మరల పూజింతును, నీకు మ్రొక్కెదను, మా ఇంటి దాకా వచ్చి నన్ను బ్రోవుము. నీవే దిక్కని తెలిసినా నన్ను బ్రోచుటకు వేగము రావు, నాపై కరుణించుము, నీచేతిలో చిక్కియుంటే నన్ను నేను మరతునురా! నా భాగ్యమా! నీకు మ్రొక్కెదను, ఇక నన్ను బ్రోచుటకు మా ఇంటి దాకా రారా! 

శ్రవణం
======

అసావేరి రాగంలోని ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

12, నవంబర్ 2020, గురువారం

రఘునాయకా నీ పాదయుగ రాజీవముల - సద్గురువులు త్యాగరాజస్వామి

త్యాగరాజస్వామి కృతులలో శరణాగతి చాలా కృతులలో గోచరిస్తుంది. సంసార సాగరాన్ని దాటలేని నిస్సహాయ స్థితిలో ఆశ్రితులజనరక్షకుడని పేరొందిన రాముని పాదములను పట్టుకుని విడువకుండా కొలిచే స్థితిని రఘునాయకా నీ పాదయుగ రాజీవముల అన్న కృతిలో ఆవిష్కరించారు. ఎంతో శ్రమపడి రాముని సన్నిధి చేరి శరణు కోరుతున్నాను అని స్వామిని వేడుకున్నారు స్వామి. శ్రీమద్రామాయణంలో ఆశ్రయించిన వారిని రాముడు అమితమైన వాత్సల్యంతో అనుగ్రహించి రక్షించిన సందర్భాలు ఎన్నో. ఆ విధంగానే తాను కూడా, తనను ఆదరించి ఆనందము కలుగజేయవలసిందిగా రాముని ప్రార్థించారు. 

సాహిత్యం
========

రఘునాయకా నీ పాదయుగ రాజీవముల నే విడజాల శ్రీ 

అఘజాలముల పారద్రోలి నన్నాదరించ నీవే గతి గాదా శ్రీ

భవసాగరము దాటలేక నే బలు గాసి పడి నీ మఱుగు జేరితిని
అవనిజాధిపాశ్రితరక్షకా ఆనందకర శ్రీ త్యాగరాజనుత

భావం
=====

రఘుకుల శ్రేష్ఠుడవైన శ్రీరామా! నీ పదకమలములను నే విడువను. నా పాపసమూహములను పారద్రోలి ఆదరించుటకు నీవే గతి కదా! ఈ సంసార సాగరము దాటలేక నేను ఎంతో శ్రమపడి నీ సన్నిధికి చేరుకున్నాను. భూమిజయైన సీతకు పతివైన శ్రీరామా! నీవు ఆశ్రితరక్షకుడవు, ఆనందమును కలిగించేవాడవు! శివునిచే నుతించబడిన వాడవు, నీ పదకమలములను నేను విడువలేను. 

శ్రవణం
=======

హంసధ్వని రాగంలో కూర్చబడిన ఈ కృతిని ప్రియా సోదరీమణులు షణ్ముఖ ప్రియ, హరిప్రియ ఆలపించారు

11, నవంబర్ 2020, బుధవారం

నిన్నాడనేల - సద్గురువులు త్యాగరాజస్వామి కృతి

 


దైవనింద నాస్తికులే కాదు, భక్తిమార్గంలో ఉన్నవారెందరో కూడా చేస్తారు. దీనికి కారణం ఈ భవసాగరంలో ఎదురయ్యే బాధలు, సమస్యలను తట్టుకోలేక తాము నమ్ముకున్న దైవం కూడా కాపాడటం లేదు అన్న ఆవేదనతో. కానీ భగవదనుగ్రహం ఎప్పుడూ సానుకూల ఫలాలలోనే కాదు, భవసాగర తారణంలో కలిగే పాఠాలలో కూడా ఉంటుంది అనేది భగవంతుడు సాక్షీభూతుడుగా ఉండటంలో రహస్యం. ఇది సద్భక్తులకు అనుభవపూర్వకంగా అవగతమవుతుంది. అందుకే ఆధ్యాత్మిక కొండను ఎక్కుతున్న భక్తునికి మొదటి భాగంలో అనేక రకాల భావనలు వస్తాయి, ముందుకు వెళుతున్న కొద్దీ అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించిన తరువాత దైవనింద చేయటం తగ్గుతుంది. పూర్వజన్మ కర్మఫలాలు కొన్నిటిని అనుభవించక తప్పదు అన్నది చాలా మెట్లు ఎక్కితే కానీ మనసు అంగీకరించదు. ఆ తరువాత ప్రయాణంలో అటువంటి ఆలోచనా తరంగాలు సద్దుమణుగుతాయి, తారణం సాఫీగా సాగుతుంది. 

అనుభవపూర్వకంగా కలిగే ఈ జ్ఞానాన్ని తన కృతిద్వారా వివరించారు సద్గురువులు త్యాగరాజస్వామి. సాక్షీభూతుడైన స్వామికి నిన్నాడనేల అని తన ఉన్నతమైన భావనలను తెలియజేశారు. కన్నడ రాగంలోని ఈ కృతిని హైదరాబాద్ సోదరులు శేషాచార్యులు, రాఘవాచార్యులు ఆలపించారు. కన్నడ రాగం ధీర శంకరాభరణ జన్యం. అందమైన గమకాలతో త్యాగరాజస్వామి భావనలను మనోజ్ఞంగా కన్నడ రాగం ఆవిష్కరిస్తుంది. 

నిన్నాడనేల! నీరజాక్ష శ్రీరామ!

కన్నవారిపైని కాకసేయనేల!

కర్మానికి తగినట్టు కార్యములు నడిచేని
ధర్మానికి తగినట్టు దైవము బ్రోచేని

చిత్తానికి తగినట్టు సిద్ధియు కలిగేని
విత్తానికి తగినట్టు వేడుక నడిచేని

సత్త్వరూప నిన్ను సన్నుతి జేసి
తత్త్వము దెలిసిన త్యాగరాజునికి

కలువలవంటి కన్నులు కలిగిన శ్రీరామా! నా కష్టములకు నిన్ను నిందించుట తప్పు. మన కష్టాలకు కన్న తల్లిదండ్రులపై కోపగించుకొనుట యెందుకు? కర్మలకు తగినట్లుగానే కదా ఫలములు, తదుపరి కార్యములు నడిచేది? ధర్మాచరణను బట్టి కదా దైవానుగ్రహము? మన చిత్తశుద్ధిని బట్టి కదా మనకు సిద్ధించే ఫలాలు? డబ్బుకు తగినట్లు కదా వేడుకలు? శుద్ధ సత్త్వ స్వరూపుడవైన నిన్ను నుతించి నీ తత్త్వము గ్రహించినాను, నేను నిందించే పని లేదు శ్రీరామా! 

7, నవంబర్ 2020, శనివారం

అక్షయలింగ విభో స్వయంభో - ముత్తుస్వామి దీక్షితుల కృతి

ముత్తుస్వామి దీక్షితులవారి కృతులలో ఎక్కువ మటుకు క్షేత్ర కృతులే. అనగా, దక్షిణ భారత దేశంలో ఉన్న అనేక దివ్యక్షేత్రాలను సందర్శించి, ఆ దేవతను ఆయన ఉపాసన చేసినప్పుడు రచించినవి. అటువంటి కృతి ఒకటి తమిళనాడులోని నాగపట్టణం జిల్లా కీళ్వేలూరులో ఉన్న అక్షయలింగేశ్వర క్షేత్రంలో వెలసిన స్వామిపై రచించినది. క్షేత్ర ప్రస్తావనలో వాగ్గేయకారులు ఆ క్షేత్రంలోని దేవతలతో పాటు ఇతర వివరాలను కూడా సుస్పష్టంగా పొందుపరచటంలో ఉద్దేశం ఆయా క్షేత్రాలు, దేవతామూర్తుల యొక్క విశిష్టతను, విలక్షణతను శాశ్వతం చేయటం కోసమే. ఇక్కడ అమ్మవారు, స్వామి బదరీవృక్షం క్రింద స్థితమై ఉంటారు. అలాగే ఇక్కడ భద్రకాళీ అమ్మ వారి మూర్తి కూడా ఉంది. వీటిని కృతిలో దీక్షితులవారు ప్రస్తావించారు. అక్షయలింగేశ్వర స్వామి క్షేత్రం చాలా పురాతనమైనది. స్వయంభూ లింగ స్వరూపంలో పరమశివుడు సుందరకుచాంబిక, భద్రకాళిగా పార్వతీ దేవి, వినాయకుడు, కుమారస్వామితో సహా అనేక దేవతామూర్తులు ఈ క్షేత్రంలో ఉన్నాయి. శైవయోగి, కవి జ్ఞానసంబంధర్ రచనలలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. కృతిలో చైత్రపూర్ణిమ నాడు స్వామికి జరిగే భవ్యమైన రథోత్సవ ప్రస్తావన కూడా దీక్షితార్ చేశారు. సనాతన ధర్మ పరిరక్షణలో దీక్షితార్ కృతుల పాత్ర ఎనలేనిది. ఇప్పుడు ద్రావిడవాదం వచ్చి పేర్లు మార్చబడినా, ఒకనాడు తమిళనాడులో ఉన్న క్షేత్రాలు, దేవతల నామాలన్నీ కూడా సనాతన ధర్మానికి మూలమైన సంస్కృత భాషలో ఉన్నవే. దీక్షితుల వారు ఆ నామాలనే తన కృతులలో ఉపయోగించారు. 

ధీరశంకరాభరణ రాగంలో కూర్చబడిన ఈ కృతిని డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

అక్షయలింగ విభో స్వయంభో అఖిలాండ కోటి ప్రభో పాహి శంభో

అక్షయ స్వరూప అమిత ప్రతాప ఆరూఢ వృషవాహ జగన్మోహ
దక్ష శిక్షణ దక్షతర సుర లక్షణ విధి విలక్షణ లక్ష్య
లక్షణ బహు విచక్షణ సుధా భక్షణ గురు కటాక్ష వీక్షణ

బదరీ వనమూల నాయికాసహిత భద్రకాళీశ భక్త విహిత
మదన జనకాది దేవ మహిత మాయాకార్య కలనా రహిత
సదయ గురుగుహ తాత గుణాతీత సాధు జనోపేత శంకర నవనీత
హృదయ విభాత తుంబురు సంగీత హ్రీంకార సంభూత హేమగిరి నాధ
సదాశ్రిత కల్పక మహీరుహ పదాంబుజ భవ రథ గజ తురగ
పదాది సంయుత చైత్రోత్సవ సదాశివ సచ్చిదానందమయ

ఓ అక్షయలింగ ప్రభో! నీవు స్యయంభువుడవు, సమస్త విశ్వములకు ప్రభువువుం శంకరుడవు, నన్ను రక్షింపుము. నాశనము లేని స్వరూపము కలవాడవు, అమిత ప్రతాపవంతుడవు, నందీశ్వరుని అధిరోహించిన జగన్మోహనుడవు. దక్షుని శిక్షించినవాడవు, దేవతలకు విధివిధానములను, విలక్షణమైన తత్త్వములను, లక్ష్యములను దక్షిణామూర్తి రూపములో శిక్షణనొసగిన నిపుణుడవు, అనేక రకములైన విచక్షణ కలవాడవు, అమృతమును సేవించేవాడవు, ఘనమైన కటాక్ష వీక్షణము కలవాడవు, నన్ను రక్షింపుము. బదరీ వనములో పార్వతీదేవి సమేతుడవై యున్నవాడవు, భద్రకాళికి ప్రభువువు, భక్తులకు హితుడవు. మదనుని జనకుడైన శ్రీహరి మొదలైన దేవతలచే నుతించబడిన వాడవు, మాయ చేసే కల్పనలకు అతీతుడవు, ఎల్లప్పుడూ కుమారస్వామిపై పితృవాత్సల్యమును కురిపించేవాడవు, గుణాతీతుడవు, సాధుజనుల సమీపములో ఉండి శుభములు కలిగించేవాడవు, వెన్నవంటి హృదయము కలవాడవు, తుంబురుని సంగీతమును ఆనందించేవాడవు, హ్రీంకారము నుండి ఉద్భవించినవాడవు, కైలాసపతివి, నీ పదకమలములను ఆశ్రయించేవారికి కల్పవృక్షము వంటివాడవు, భవుడవు, రథ గజ తురగ పదాది సైన్యముతో చైత్రోత్సవములో ప్రకాశించే సదాశివుడవు, సచ్చిదానందమయుడవు. నన్ను రక్షింపుము.

చిత్రం కీళ్వేలూరులోని కెదిలియప్పర్ (అక్షయలింగేశ్వరుని) రూపము

6, నవంబర్ 2020, శుక్రవారం

తలచినంతనే నా తనువైతే ఝల్లనెరా - త్యాగరాజస్వామి కృతి


మానసిక స్థితిని బట్టి ఆధ్యాత్మిక అనుభూతులు. మన ధర్మంలో ఈ సత్యానికి ఎన్నో నిదర్శనాలు. సద్గురువులు త్యాగరాజస్వామి వారి కృతులలో ఇది మనకు సుస్పష్టంగా గోచరిస్తుంది. కనబడలేదని విచారము, దయలేదని నిష్ఠూరము, ఉన్నాడో లేడో అని సంశయము, మహిమ అనుభూతికి రాగానే అమితానందము, అంతటా ఉన్నాడని గ్రహింపుకు వస్తుంటే తనువు పులకింత, అది అనుభవాల ద్వారా మరింత ప్రగాఢమై అంతర్ముఖమైన సాధన, అన్నిటికీ రాముడే రక్ష అన్న దృఢమైన విశ్వాసముతో ఎటువంటి క్లేశాన్నైనా భరించే ఓర్పు...ఇలా త్యాగరాజస్వామి ఆధ్యాత్మిక ప్రయాణంలో సమస్త లక్షణాలూ తన కృతులలో వ్యక్తపరచారు. మలిదశలో పరిణతి చెందిన భక్తివిశ్వాసములతో పరిపుష్టమైన మానసిక వికాసము కనబరచిన ఒక కృతి తలచినంతనే నా తనువైతే ఝల్లనెరా. 

సాహిత్యము:

తలచినంతనే నా తనువైతే ఝల్లనెరా

జలజ వైరి ధరాది విధీంద్రుల
చెలిమి పుజలందిన నిను నే

రోటికి కట్టదగిన నీ లీలలు
మూటికెక్కువైన నీదు గుణములు
కోటిమదనలావణ్యమునైన
సాటి గాని నీ దివ్యరూపమును 

నిద్రాలస్య రహిత శ్రీరామ 
భద్రానిలజ సులభ సంసార
చ్ఛిద్రార్తిని దీర్చే శక్తిని విధి
రుద్రాదుల నుతమౌ చరితంబును

పాదవిజిత మునితరుణీ శాపా
మోద త్యాగరాజనుత ధరాప
నాదబ్రహ్మానంద రూప
వేదసారమౌ నామధేయమును

భావము:

ఓ శ్రీరామా! నిన్ను తలచినంతనే నా శరీరామంతా ఝల్లుమని పులకరిస్తుంది. కమలమునకు శత్రువైన చంద్రుని శిరమున ధరించే పరమశివుడు, బ్రహ్మేంద్రాదుల స్నేహము, పూజలు అందుకున్న నిన్ను తలచినంతనే నా శరీరము పులకిస్తుంది. శ్రీకృష్ణావతారములో నీ అల్లరి చేష్టలకు యశోదమ్మ నిన్ను రోటికి కట్టివేయుట, త్రిగుణాతీతమైన నీ గుణములు, కోటి మన్మథులకైన సాటి కాని సౌందర్యము గల నీ దివ్యరూపమును తలచినంతనే నా శరీరమంతా పులకించును. నిద్ర, అలసత్వము మొదలైన తమోగుణములు లేని శ్రీరామా! భద్రునికి, ఆంజనేయునికి నీవు సులభుడవు! సంసార దోషములనే ఆర్తులను తీర్చే శక్తి కలిగిన వాడవు! బ్రహ్మ రుద్రాదులచే నుతించబడిన చరితము కలిగిన నిన్ను తలచినంతనే నా శరీరము పులకించును. సమస్త భూమండలమును పాలించి, ఆనందముతో పరమశివునిచే నుతించబడిన శ్రీరామా! నీ పాద ధూళిని తాకినంతనే శాపవిముక్తురాలైన గౌతమముని పత్ని అహల్య చరితము, నీ నాదబ్రహ్మానంద స్వరూపము, వేదముల సారమైన నీ నామమును తలచినంతనే  నా శరీరమంతా ఝల్లని పులకిస్తుంది. 

వివరణ:

పరబ్రహ్మ స్వరూపమైన రాముని గుణములను, సౌందర్యాన్ని, వైభవాన్ని తెలిపే రామాయణాది వాఙ్మయం మనకు నిత్య పూజనీయమైనవి. శ్రీరాముని చరితమును అత్యంత మనోజ్ఞముగా వర్ణించిన వాల్మీకి మహర్షి రచించిన రామాయణం పఠించేటప్పుడు ఈ కృతిలో త్యాగరాజస్వామికి కలిగే భావనలన్నీ మనకు కలుగుతాయి. ఆ భావనలు మనసులో నిలిచిపోవాలంటే నిరంతర పునశ్చరణ, నామస్మరణముతో కూడిన సాధన అవసరం. ఆ స్థాయికి త్యాగరాజస్వామి వారు చేరుకున్నాక రాముని తలచుకున్న వెంటనే భవ్యమైన రామ పరబ్రహ్మ తత్త్వముతో పాటు సగుణ వైభవములు కూడా గోచరమై తనువు పులకించి తన్మయత్వము కలిగింది. ఈ భావనలన్నీ సాధకునికి భవసాగరం దాటడానికి అత్యంత ఉపయుక్తమైన ఆలంబనలు. అనంతమైన పరమాత్మ తత్త్వం ముందు మనము, మన కష్టాలు ఎంత? ఘోరమైన శాపం వల్ల  పాషాణమైన అహల్యకు ముక్తిని కలిగించాడు రాముడు, మనలను కూడా అదే విధంగా అనుగ్రహిస్తాడు అన్న భావనను తప్పక కలిగిస్తుంది. రాముని జీవితంలో ప్రతి అడుగూ మనకు ఆదర్శప్రాయమే, మన దోషాలను తొలగించుకుంటూ ముక్తి పథంలో ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి. ఇది అనుభవైకవేద్యంగా తెలిపారు నాదయోగి త్యాగరాజస్వామి. రామనామ స్మరణ, సంకీర్తనల ద్వారా రాముని హృదయములో నిలుపుకుని తరించారు. 

శ్రవణం:

ముఖారి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణగారు శ్రావ్యంగా ఆలపించారు

5, నవంబర్ 2020, గురువారం

అందము ఆనందము రామానుజార్య సంబంధము - నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు

త్యాగరాజ శిష్యపరంపరకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, పండితులు, గురువులు, హరికథా భాగవతార్ శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి శిష్యులైన వీరు ఎందరో గొప్ప కళాకారులకు గురువులు. ఎన్నో పుస్తకాలను రచించారు. 1924లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జన్మించిన వీరు వ్యాకరణ మీమాంస శాస్త్రములను అభ్యసించారు. రామకృష్ణయ్య పంతులు గారి వద్ద గురుకుల పద్ధతిలో కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. 1948 నుండి 1983 వరకు ఆకాశవాణి విజయవాడలో నిలయ విద్వాంసునిగా పనిచేశారు. గానకళాప్రపూర్ణ, సంగీత సాహిత్య కళానిధి, హరికథా చూడామణి, సంగీత కళాసాగర బిరుదులను పొందారు. ఆకాశవాణి స్వర్ణోత్సవాల సమయంలో, తెలుగు విశ్వవిద్యాలయం నుండి ప్రత్యేక పురస్కారాలను పొందారు. కృష్ణమాచార్యుల వారు త్యాగరాజస్వామి యక్షగానాలను తెలుగు నుండి సంస్కృతంలోకి అనువదించారు. 20కు పైగా కృతులు, వర్ణాలు, తిల్లానాలు రచించారు. 60 ఏళ్ల సుదీర్ఘమైన సంగీత ప్రస్థానం కలిగిన వీరికి మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ వారు వీరికి వాగ్గేయకార అవార్డును ప్రదానం చేశారు. శ్రీభాష్యం అప్పలాచార్యుల వారితో ఎంతో అనుబంధం ఉన్న వీరు 2006లో పరమపదించారు. 

కృష్ణమాచార్యుల వారు రామానుజుల వారిని నుతిస్తూ రచించిన ఒక చక్కని కృతిని రచించారు. ఈ కృతిని ఆనందభైరవి రాగంలో స్వరపరచారు. ఈ కృతిని వారి శిష్యుడు ప్రముఖ వయోలిన్ విద్వాంసులు శ్రీ ఎం.ఎస్.ఎన్ మూర్తి గారి సతీమణి, ప్రఖ్యాత విద్వాంసురాలు డాక్టర్ పంతుల రమ గారు ఆలపించారు

అందము ఆనందము రామానుజార్య సంబంధము దాని
చందము మోక్ష కందము మరి చందనాగురు గంధము 

ఘనము పావనము భాష్యకార పద సేవనము జీ-
వనము సదవనము ప్రాక్తన పాప మోచనము

సారము పుణ్య సారము యతి చంద్రుని దివ్యాకారము జగదా-
ధారము తమోదూరము భూత దయాపారావారము

ధ్యేయము భాగధేయము యతి దినకరు నామధేయము కర్ణ-
పేయము నిరపాయము కృష్ణ గేయము సదుపాయము

ఎవ్వరే రామయ్య నీ సరి - త్యాగరాజస్వామి కృతి


రాముని అనేక సుగుణాలలో వైరివర్గములో ఉన్నా సజ్జనులను గుర్తించి వారికి అభయమిచ్చి అనుగ్రహించటం. సీతమ్మను అపహరించిన రావణుని సోదరుడైన విభీషణుని అనుగ్రహించి లంకకు రాజును చేయటంలో రాముని విచక్షణ ఎంత ఉన్నతమైనదో, సునిశితమైనదో మనం గుర్తించాలి అన్న ముఖ్యమైన అంశాన్ని త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ రాముని ప్రాతిపదిక విభీషణుని వ్యక్తిత్వం, ధర్మానురక్తి మరియు రావణుని తరువాత లంక సుఖశాంతులతో ఉండాలి అన్న సంకల్పం. రావణుడు చేసిన దారుణానికి విభీషణుని నమ్మకపోవటం అనేది మానవ సహజం, కానీ రాముడు అందుకు భిన్నంగా అతని నైజాన్ని, భక్తిని, సమర్థతను గుర్తించి సముచితమైన నిర్ణయం తీసుకున్నాడు. అందుకే రాముని మించిన ప్రభువు లేడు అన్నది త్యాగరాజస్వామి సుస్పష్టం చాటారు. 

రామాయణం పఠించి ఆ లోకాభిరాముని వ్యక్తిత్వాన్ని ఆకళింపు చేసుకుంటే రాముడి నడవడిక నుండి మనకు నిత్యజీవితంలో అత్యంత శ్రేయస్కరమైన లక్షణాలు ఎన్నో అవగతమవుతాయి. ఎక్కడ ఉన్నా ధర్మబద్ధమైన నడవడిక కలిగిన వారికి పరమాత్మ అనుగ్రహం ఉంటుంది అన్నది రాముని విచక్షణ ద్వారా మనకు ఎంతో కీలకమైన సందేశం. ఈ సులక్షణాలే మనకు ఎల్లప్పటికీ మార్గదర్శకాలు. 

ఎవ్వరే రామయ్య నీ సరి

రవ్వకు తావులేక సుజనులను రాజిగ రక్షించే వా(రె)

పగవానికి సోదరుడని యెంచక భక్తినెరిగి లంకా పట్టణమొసగగ
నగధర సురభూసుర పూజిత వర నాగశయన త్యాగరాజ వినుత సరి

ఓ రామయ్యా! నీకు సాటి ఎవ్వరు? కీర్తికి భంగము కలుగకుండా సుజనులను సక్రమముగా నీవలె రక్షించే వారెవ్వరు? శత్రు సోదరుడని యెంచక విభీషణుని భక్తిని గుర్తించి లంకా పట్టణమునకు రాజును చేసినావు. మందర పర్వతమును ధరించిన శ్రీహరీ! దేవతలచే, బ్రాహ్మణులచే పూజించబడిన శ్రేష్ఠుడా! ఆదిశేషునిపై శయనించేవాడా! పరమశివునిచే నుతించబడే శ్రీరామా! నీకు సాటి ఎవ్వరు? 

గాంగేయభూషణి రాగంలో కూర్చబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు మధురంగా ఆలపించారు

4, నవంబర్ 2020, బుధవారం

రాముడు రాఘవుడు రవికులుడితడు - తాళ్లపాక అన్నమాచార్యుల వారు


 
రాముడు రాఘవుడు రవికులుడితడు 
భూమిజకు పతియైన పురుష నిధానము 

అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున
పరగ జనించిన పర బ్రహ్మము
సురుల రక్షింపగ నసురుల శిక్షింపగ
తిరమై ఉదయించిన దివ్య తేజము

చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో
సతతము నిలిచిన సాకారము
వింతలుగా మునులెల్ల వెదకినయట్టి
కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము

వేద వేదాంతముల యందు విజ్ఞాన శాస్త్రములందు
పాదుకొన పలికేటి పరమార్థము
పోదితో శ్రీ వేంకటాద్రి బొంచి విజయనగరాన
ఆదికిననాదియైన అర్చావతారము

సూర్యవంశమున రఘుమహారాజు పరంపరలో జన్మించి సీతమ్మకు పతియైన పురుషోత్తముడు ఈ రాముడు. దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్టిలో పరమాన్నమున పరబ్రహ్మ రూపమై, దేవతలను రక్షించుటకు, దానవులను శిక్షించుటకు స్థిరముగా ఆవిర్భవించిన దివ్య తేజో రూపము ఇతడు. నిరంతరం ధ్యానించే యోగిశ్రేష్ఠుల హృదయ కమలములలో ఎల్లప్పుడూ నిలిచిన సాకారము, మునిజనులు ఎంతో ఆతృతతో వెదకే  కాంతులతో ప్రకాశించే ముక్తి పదము ఇతడు. వేద వేదాంతములలో, విజ్ఞాన శాస్త్రములలో పలుకబడిన శాశ్వత పరమార్థము, వైభవముతో రక్షకుడై వేంకటాద్రిపై మరియు విజయనగరములో వెలసి, ఆదికే అనాదియై అర్చించబడే అవతారమూర్తి ఈ రాముడు. 

ఈ కృతిని గరిమెళ్ల అనిలకుమార్ గారు ఆలపించారు

3, నవంబర్ 2020, మంగళవారం

ఆడ మోడి గలదా రామయ్యా! - త్యాగరాజస్వామి కృతి

రామభక్తి సామ్రాజ్యపు దొర హనుమ. మరి ఆ హనుమ స్వామిని మొట్టమొదటి సారి కలిసే రామాయణ ఘట్టంలో రాముడు ఏం చేశాడు? ఇతనెవరో అన్న శంకతో ఉన్న లక్ష్మణుని మాట్లాడేందుకు పంపాడు, తమ్మునికి హనుమ వైభవాన్ని అద్భుతంగా లక్షణయుతంగా వివరించాడు. సకల విద్యాపారంగతుడు, వ్యాకరణాది సమస్త శాస్త్ర కోవిదునిగా అభివర్ణించి లక్ష్మణుని శంకను తొలగించాడు. ఆ విధంగా రాముడు హనుమ గొప్పతనాన్ని చాటాడు. ఆ ఘట్టాన్ని గుర్తు చేసుకుని త్యాగయ్య ఈ కృతి ద్వారా తనను తాను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు అనిపించినా రాముని మనసులోని మర్మాన్ని, ఆధ్యాత్మిక మార్గంలో పరమాత్మ ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తాడు అన్న దానిని సూచించేందుకే ఈ కృతి. రామాంజనేయ సమాగమ ఘట్టం నుండి మనకు సందేశం ఏమిటి? అన్నీ తెలిసిన పరమాత్మ లీలానాటకాలు కార్యాకారణ సంబంధం కలవి. హనుమ యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలిసేది ఎలా? ఈ విధంగానే. 

ఆడ మోడి గలదా రామయ్యా చారుకేశి రాగంలో కూర్చబడింది. నూకల చినసత్యనారాయణ గారు ఈ కృతికి త్యాగరాజస్వామి ఈ రాగాన్నే ఎందుకు ఎన్నుకున్నారో అద్భుతంగా వివరించారు. చారుకేశి శంకరాభరణం, తోడి సమ్మేళనం. శంకరాభరణ స్వరాలతో త్యాగరాజునికి, మనకు, తోడి స్వరాలతో రాముని మేళవించి,ఒకే రాగంగా చారుకేశి అయిన సీతాదేవిని తిరిగి పొందటం అనే ఒకే సంకల్పంగా ఒకరికొకరు సన్నిహితులై ఐక్యతను సాధించే సన్నివేశంగా అభివర్ణించారు. సాహిత్య సంగీత రస భావ ప్రకటనను ఆ విధంగా త్యాగరాజస్వామి అద్భుతంగా వివరించారు అని నూకల వారు ఎంతో ఉన్నతంగా తమ త్యాగరాజ సాహిత్య సర్వస్వంలో వివరించారు. రామాంజనేయుల సమాగమం శంకరభరణం తోడిల కలయికల ఫలితం చారుకేశి రాగం. త్యాగరాజస్వామి వారు వాల్మీకి అవతారమనేది పరమ సత్యం. ఇంతటి లోతన వివరణ ఇచ్చిన మహామహోపాధ్యాయ నూకల వారికి సాష్టాంగ ప్రణామాలు. 

ఆడ మోడి గలదా రామయ్యా మాట(లా)

తోడు నీడ నీవే యనుచు భక్తితో గూడి పాదముల బట్టిన మాట(లా)

చదువు లన్ని తెలిసి శంకరాంశుడై సదయుడాశుగసంభవుండు మ్రొక్క
కదలు తమ్ముని బల్క జేసితివి గాకను త్యాగరాజేపాటి మాట(లా)

ఓ రామయ్యా! నాతో మాట్లాడుటకు వెనకడుగెందుకు? నీవే తోడునీడయని భక్తితో పాదములను శరణంటిని, అటువంటి నాతో మాట్లాడుటకు వెనకడుగెందుకు? అవునులే! సమస్త విద్యా పారంగతుడు, పరమశివుని అంశలో జన్మించిన వాడు, శ్రేష్ఠుడు, వాయుపుత్రుడైన హనుమ నీకు మ్రొక్కగా, అతడెవరో యన్న శంకతో యున్న లక్ష్మణుని ఆ హనుమంతునితో మాట్లాడమన్నావు, ఇంక ఈ త్యాగరాజు ఏపాటి? 

ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు అద్భుతంగా ఆలపించారు