20, మార్చి 2016, ఆదివారం

సీతారామ వైభవం-5: రామచంద్రుడితడు (అన్నమాచార్యుల వారి రచన)



శ్రీరాముని వైభవాన్ని త్యాగరాజు, రామదాసు వంటి రామభక్తులు అద్భుతంగా తమ సంకీర్తనలలో చాటారు. వారి జీవితమంతా రామభక్తి సామ్రాజ్యంలోనే సాగిపోయింది. సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు వీరిద్దరికన్నా ముందే తిరుమల శ్రీవేంకటేశ్వరునిపై కొన్ని వేల సంకీర్తనలు రచించి పరమాత్మను నుతించారు. ఆయన సంకీర్తనలలో ఎన్నో శ్రీరామునిపై కూడా ఉన్నాయి. రాముని వైభవాన్ని అద్భుతంగా ఈ సంకీర్తనలలో ఆయన వర్ణించారు. వాటిలో ఒకటి రామచంద్రుడితడు. శ్రీరాముడు ఎవరెవరిని ఎలా అనుగ్రహించాడో ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు.


రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలము లియ్యగలిగె నిందరికి

గౌతము భార్యపాలిటి కామధేను వితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
ఈతడు దాసుల పాలిటి ఇహపర దైవము

పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు
సరి హనుమంతు పాలి సామ్రాజ్యము
నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు
గరిమ జనకు పాలి ఘనపారిజాతము

తలప శబరి పాలి తత్వపు రహస్యము
అలరి గుహుని పాలి ఆదిమూలము
కలడన్న వారి పాలి కన్ను లెదటి మూరితి
వెలయ శ్రీ వేంకటాద్రి విభుడితడు

తాత్పర్యము:

రఘువీరుడైన శ్రీరామచంద్రుడు ఎందరికో ఈ విధముగా కామ్యములను ఇచ్చాడు. భర్త గౌతమముని శాపానికి గురై వేల సంవత్సరాలు నిర్జీవంగా ఉన్న అహల్యను తన పాద స్పర్శతో ఉద్ధరించినవాడు ఆయన. లోకకళ్యాణార్థం యాగం చేయ తలపెట్టిన విశ్వామిత్రునికి రాక్షసుల బెడద కలగటంతో ఆయన కోరిక మేరకు శ్రీరాముడు ఆ యాగ సంరక్షణ చేశాడు. సీతకు కోరుకున్న వెంటనే కోర్కెలు తీర్చేవాడు ఆ రాముడు. దాసులకు ఇహమునందు పరమునందు దైవము ఈ రాముడు. అన్నచే మోసగించబడిన సుగ్రీవునికి ఇతడు ఒప్పుగా పరమ బంధువైనాడు. తననే నిరంతరము కొలిచే హనుమంతునికి ఈయనే సామ్రాజ్యం. చెడును వీడి మంచి కోరి వచ్చి శరణనన్న విభీషణునికి నిధి ఈ రాముడు. తన బిడ్డకు ఎటువంటి భర్త దొరుకుతాడో అని ఆలోచనలో ఉన్న రాజర్షి జనకుని పాలిట శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడి గొప్ప పారిజాతమైనాడు రాముడు. తన గురువుల మాట ప్రకారం తనను ఉద్ధరించటానికై వేచి ఉన్న శబరికి మోక్షాన్ని ప్రసాదించిన వాడు రాముడు. గుహుని పాలిట సనాతనుడు ఈ రాముడు. కలడు అనుకునే వారికి కన్నులెదుట నిలిచే ప్రభువు శ్రీవేంకటాద్రిలో వెలసిన వాడు.

వివరణ:


అన్నమాచార్యుల వారి సాహిత్యంలో ఉన్న గొప్పతనం అందులోని లోతైన ఆధ్యాత్మిక సౌరభం. రాముడు ఎవెరెవరి కోర్కేలను ఎలా తీర్చాడు అన్నది ఈ సంకీర్తన ప్రధాన ప్రాతిపదిక అయినా అందులో నిగూఢమైన తత్త్వనిధి ఉంది. ఇంద్రుని పన్నాగములో అపవిత్రమైన అహల్య గౌతముని శాపము వలన వేల సంవత్సరాలు భస్మ రూపములో వాయు భక్షణ చేస్తూ ఎవరికీ అగుపించక ఉంటుంది. అదే గౌతముడు రామచంద్రుడు ఈ ఆశ్రమంలోకి వచ్చినంతనే పునీతవై తిరిగి రూపాన్ని పొందుతావు ఆమెకు శాపవిముక్తి చెబుతాడు. వేల సంవత్సరాలు అలా భస్మశాయినివై ఉన్న అహల్య రాముడు ఆ ఆశ్రమంలో ప్రవేశించగానే పవిత్రయై తన దివ్యరూపాన్ని తిరిగి పొందుతుంది. అంటే రాముడు ఎంతటి ధర్మాతుడో ఊహించండి. జీవహీనమైన ప్రాణికి జీవాన్నిచ్చే అద్భుత పురుషుడు రాముడు. ధర్మ రక్షణలో తిరుగులేని వాడు కాబట్టే విశ్వామిత్రుడు లేతవయసులోనే రాముడిని అడవులకు తీసుకువెళతాడు. అందులో ఆ ధర్మ రక్షణ లోక కళ్యాణార్థం చేయటం రాజుల విధి, దానిని సఫలీకృతం కావించుట మునుల కర్తవ్యం. అందుకే ఆయన విశ్వామిత్రుని పాలిట కల్పవృక్షమైనాడు. ఆదర్శ పతిగా సీతాదేవి కోరికలను తీర్చినవాడు రాముడు. ఇక్కడ చింతామణి అనగా కామ్యములను తీర్చే మణి అని అర్థము. సీతారాముల మధ్య ఎక్కడా లేదు, కుదరదు అన్న వాటికి తావే లేదు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని ఒకరి కోసం ఒకరు జీవించారు. లోకానికే ఆదర్శమైనారు. భర్తగా తన ధర్మాన్ని ముమ్మాటికీ పాటించిన రాముడు అందుకే సీతమ్మ పాలిట చింతామణి అయినాడు. మొదటి చరణంలో అతి ముఖ్యమైన వాక్యం - దాసుల పాలిట ఇహము పరము రెండిటా దైవము అన్నారు. జన్మను తరించటానికి, భవసాగరాన్ని దాటటానికి రామనామమే శరణము, అలాగే పరములో కూడా అనంతమైన శక్తినిచ్చేవాడు రాముడు.


తమ్ముడైన సుగ్రీవుడిని వాలి మోసం చేసి ఆతని భార్యను చెరబట్టి కిష్కింధను ఏలుతాడు. ధర్మం కాపాడటానికి రాముడు సుగ్రీవునికి బాసటగా నిలచి వాలిని వధిస్తాడు. తారకు విముక్తి కలిగిస్తాడు. బంధువనే వాడి ప్రథమ కర్తవ్యం తోడునీడగా నిలబడటం. అది రాముడు పాటించిన ధర్మం వలన ఏర్పడిన బంధం. అన్నీ తానే అనుకుని రాముడిని కొలిచిన వాడు హనుమంతుడు. రామనామమే అతనికి శ్వాస. రాముడే స్వామి. అందుకే హనుమ ఉత్తమ భక్తుడు అని రాముడు చెప్పాడు. ఆ హనుమంతుడికి వేరే సామ్రాజ్యం అక్కరలేదు. రామభక్తే అతని సామ్రాజ్యం. విభీషణుడు హరిభక్తుడు, ధర్మ పరాయణుడు.  అన్న రావణుడు అధర్మానికి ఒడిగడితే అతనిని హెచ్చరించి హితబోధ చేశాడు. దూతగా వచ్చిన హనుమను సంహరించమని రావణుడు ఆదేశిస్తే అది అధర్మమని తెలిపి అతని ఆలోచనను సరిచేశాడు. రామరావణ యుద్ధంలో ధర్మం వైపు నిలచి ధర్మ విజయానికి తోడ్పడిన వాడు విభీషణుడు. రావణుని వధ తరువాత రాముడు అతనిని లంకకు రాజుగా చేస్తాడు. అందుకే అన్నమాచార్యుల వారు విభీషణుని పాలిట పెన్నిధి అని రాముని నుతించారు. ఇక జనకుడి వంటి ఉత్తమునికి రాముడు ఘన పారిజాతం ఎలా అయ్యాడు? సమస్త శాస్త్రములు, ధర్ములు తెలిసిన జనకుడు తన వంశం వారికి శివుని ద్వారా అందిన ధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడే తన బిడ్డ అయిన సీతను పెండ్లాడటానికి తగిన వరుడు అని నిశ్చయించుకుంటాడు. శివ ధనుర్భంగం తరువాత జనకునికి విశ్వామిత్రుడు ఇక్ష్వాకు వంశ వృత్తాంతము తెలిపి ఆ వంశజుల కీర్తిని చాటుతాడు. అటువంటి శ్రీరాముడు అయోనిజ అయిన సీతను చేపట్టి జనుకుడి వంశాన్ని కూడా ఉద్ధరించాడు. అలాగే సీతమ్మ నిమి వంశంలో జన్మించి ఇక్ష్వాకు వంశానికి వచ్చి ఆ పూర్వీకులు ఘన కీర్తిని ఇనుమడింపజేసింది. రాముని సత్యవాక్పరిపాలన, ధర్మపరాయణత జనకుని పాలిట పారిజాతం.


శబరి మతంగమహర్షి శిష్యురాలు. సన్యాసం స్వీకరించి గురువులను ఎంతో భక్తిప్రపత్తులతో సేవిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటుంది. సీతారామలక్ష్మణులు చిత్రకూటం చేరుకున్నప్పుడు మతంగమహర్షి పరమపదానికి చేరుకుంటారు. దేహాన్ని విడిచే ముందు ఆయన శబరితో నువ్వు చేసిన సేవలు చాల గొప్పవి. శ్రీరాముడు ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు నీ సేవకు సాఫల్యం కలిగి నీకు ముక్తిని ప్రసాదించును అని చెబుతాడు. ఆ మహర్షి మాటల ఫలాన శ్రీరాముడు మతంగవనానికి వచ్చి శబరి చేసిన పూజలు స్వీకరించి ఆమెకు కైవల్యాన్ని ప్రసాదిస్తాడు. ఇదీ, శబరి తత్త్వ రహస్యము. గుహుడు శ్రీరాముడు దేవుడని ఎరిగిన వాడు. అతని రామభక్తి అనుపమానమైనది. రాముడు అరణ్యవాసానికి వెళ్లేటపుడు, భరతుడు శ్రీరాముని కోసం అరణ్యానికి వచ్చినపుడు గుహుని పాత్ర ఎంతో ముఖ్యమైనది. అతని సేవకు మెచ్చి శ్రీరాముడు అతని అనుగ్రహిస్తాడు. అందుకే గుహుని పాలిట ఆది మూలము అన్నారు అన్నమాచార్యుల వారు. ఇక కలడు అని తలచిన వారికి కళ్లెదుటి దైవము రాముడు అన్నారు.  ఎలా? ఎంత మంది రామభక్తులు ఆయన నామస్మరణతో ఆయన పదచింతనతో భవసాగరాన్ని దాటి ముక్తిని పొందలేదు? తులసీదాసు మొదలైన మహాభక్తులు ఈ కోవకు చెందిన వారు. మరి ఆ శ్రీరాముడే కలియుగంలో మనకు దగ్గరగా శ్రీవేంకటాద్రిలో వెలసిన ప్రభువు అని అన్నమాచార్యుల వారు తగురీతిన కొనియాడారు.

అన్నమాచార్యుల వారు అందించిన ఈ శ్రీరామవైభవ వర్ణన పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. అందుకే ఆయన సంకీర్తనలు మంత్రసమానమై అలరారుతున్నాయి. రామచంద్రుడితడు అనే కీర్తన ద్విజావంతి రాగంలో కూర్చబడింది. దీనిని శ్రావ్యంగా ఆలపించిన కళాకారుల పేరు తెలియదు. 

16, మార్చి 2016, బుధవారం

అత్త-కోడలు - ఆధిపత్యపు పోరు

కోడలు: అత్తయ్యా పెళ్లై ఇన్నేళ్లయ్యింది. మీకు ఏది ఇష్టమో తెలుసుకోవటం నా వల్ల కాలేదు...
అత్తగారు: అది మీ మామగారి వల్లే కాలేదు. ఇంక నీ వల్ల ఏమవుతుంది. అయినా, ఇష్టాలు అయిష్టాలు ఇష్టమున్న మనుషులతోనే లేమ్మా.

అత్తగారు: కోడలు పిల్లా! డబ్బేమన్నా దాస్తున్నారా? వాడికి వచ్చింది వచ్చినట్లు స్వాహాయేనా?
కోడలు: ఆ మీరు మామయ్యగారి జీతమంతా ఏం చేశారో మీ బీరువాల్లో చీరలే చెబుతాయి. నేను మాత్రం తక్కువ తిన్నానా?

అత్తగారు: పిల్ల కళ్లు ముక్కు అన్ని నావేనే. చక్కగా తీరుగా ఉంటాయి మా వాళ్ల పోలికలు.
కోడలు: అందరూ పిల్ల నలుపు మీదే వచ్చిందంటున్నారు అత్తయ్యా!
అత్తగారు: అమ్మాయ్! నలుపు అదృష్టమే. తెల్లతోలుంటేనే అందముటే...
కోడలు:  మరి మీ అబ్బాయి నన్ను చేసుకుంది నా తెల్లతోలు చూసేగా?

కోడలు: వెధవ పోలికలు, వద్దనుకుంటే వస్తాయి. ఆ కోపం, ఆ హఠం వేయటం అన్నీ దిగిపడ్డాయి.
అత్తగారు: ఆ నిజమే. మీ అమ్మ పోలికే అని నేను మీ మామగారు ఎప్పుడూ అనుకుంటాం.

అత్తగారు: వెధవ గోదారి వంటలు, ప్రతి దాంట్లోనూ బెల్లం, ఆవ కూరలు. ఒంటికి వాతం, వేడి. తినలేక చస్తున్నా.
కోడలు: ముదనష్టపు గుంటూరు వంటలు. నోట్లో పెట్టుకుంటే నాలు ఊడాల్సిందే. ఒక రుచా పచా!

అత్తగారు: ఈ తూగోజీ వాళ్లున్నారు చూడండీ, భలే మాటలు చెబుతారండీ. అండీ అండీ అంటూనే వెనకాతల గోతులు తవ్వుతారు.
కోడలు: అబ్బో ఈ గుంటూరు కృష్ణా జిల్లాల వాళ్లతో పడలేము తల్లో. యమ టెక్కు, ఓ మాట పడలేరు, నోట్లోంచి మాట వస్తే విరిచినట్లే. మా అహంబోతులండీ.

13, మార్చి 2016, ఆదివారం

అసమాన సాహస మహిళ నీరజ భనోత్


మానవత్వం కోసం, తన ధర్మం కోసం ప్రాణాలొడ్డి పోరాడి వందలాది మంది ప్రాణాలు కాపాడిన వీర వనిత, భరతజాతి గర్వంతో చెప్పుకోగలిగిన ధీర నారి, ఊహించలేని సంక్లిష్టకరమైన సమయంలో సమయస్ఫూర్తి, తెగింపు, ఓర్పు చూపి విలువైన ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు కోల్పోయిన త్యాగమూర్తి....ఇలా ఆమె కనబరచిన ధైర్య సాహసాలను ఎన్ని రీతుల చెప్పినా అవి తక్కువే. ఎవరని ఆలోచిస్తున్నారా? స్త్రీ శక్తిని, మానవ జన్మ లక్ష్యాన్ని తన అసమాన సాహసోపేతమైన చర్యలతో ప్రపంచానికి చాటిన మహిళ నీరజ భనోత్. తీవ్రవాదులతో పోరాడి విమాన ప్రయాణికులను కాపాడి తన ప్రాణాలను కోల్పోయిన ఈ అసమాన మహిళ వివరాలు తెలుసుకుందాం.

1963 సెప్టెంబర్ 7న పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్‌లో హరీష్ మరియు రమా భనోత్ దంపతులకు నీరజ జన్మించింది. అప్పటికే అఖిల్ మరియు అనీష్ అనే ఇద్దరబ్బాయిలు వారికి పుట్టారు. నీరజ చండీగఢ్‌లోని సేక్రెడ్  హార్ట్ స్కూల్, ముంబైలోని బాంబే స్కాటిష్ స్కూల్‌లో చదివిన తరువాత అక్కడే సెయింట్ క్సేవియర్స్ కళాశాలలో చదువు పూర్తి చేసింది. తరువాత మోడలింగ్ కెరీర్ మొదలు పెట్టింది. అప్పుడే పాన్ ఆం ఎయిర్లైన్స్ వాళ్లు ఫ్లైట్ అటెండెంట్స్ పోస్టులకు పత్రికలలో ప్రకటన చేస్తే నీరజ అప్ప్లై చేసి అమెరికాలోని మయామీలో శిక్షణ పొందింది. ఆమె ప్రతిభకు మెచ్చి ఆ సంస్థ వాళ్లు ఆమెను ఛీఫ్ ఫ్లైట్ అటెండెంట్‌గా నియమించారు.

1986వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన పాన్ ఆం 73 విమానం 361 మంది ప్రయాణికులు 19 మంది సిబ్బందితో ముంబై నుండి కరాచీ మరియు ఫ్రాంక్‌ఫర్ట్ మీదుగా న్యూయార్కుకు బయలు దేరింది. ముంబై నుండి కరాచీ విమానాశ్రయం చేరుకున్న విమానాన్ని నలుగురు అబు నిదల్ సంస్థకు చెందిన తీవ్రవాదులు హైజాక్ చేశారు. దానిని సైప్రస్ మళ్లించాలని అనుకున్నారు. ప్రయాణికుల విడులకు బదులుగా తమ సంస్థకు చెందిన ఖైదీలను విడుదల చేయాలని వారి డిమాండ్లు.

నీరజ సమయస్ఫూర్తితో కాక్‌పిట్‌లో ఉన్న పైలట్లకు హైజాక్ గురించి తెలియజేసింది. విమానం ఇంకా రన్‌వే మీదనే ఉండటంతో పైలట్లు కాక్‌పిట్ నుండి సురక్షితంగా బయట పడ్డారు. దీనితో విమానాన్ని నడిపే పరిస్థితిని నీరజ వలన తప్పింది. కానీ, విమానంలో ఉన్న మిగిలిన ఉద్యోగులలో నీరజే సీనియర్ కావటంతో భారమంతా ఆమెపై పడింది. ఆ తీవ్రవాదులు తమ డిమాండ్లకై అమెరికా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావటానికి నీరజను విమానంలో ఉన్న అమెరికన్ పౌరసత్వమున్న ప్రయాణికుల పాస్‌పోర్టులన్నీ సేకరించమని చెప్పారు. నీరజ చాలా తెలివిగా అమెరికన్ పాస్‌పోర్టులన్నీ సీట్ల కింద కొన్ని, చెత్త బుట్టలో కొన్ని దాచమని సిబ్బందిని నిర్దేశించింది. తాను కూడా అదే చేసింది. మొత్తం మీద 41 మంది అమెరికన్ ప్రయాణీకులు ఉన్నా నీరజ కనబరచిన సమయ స్ఫూర్తితో తీవ్రవాదులు వారిని వేరు చేయలేకపోయారు.

17 గంటలు దాటినా విమానం నడిపించటానికి విమానాశ్ర్య అధికారులు పైలట్లను పంపక పోవడంతో తీవ్రవాదులు పేలుడు పదార్థాలు, గన్లను ఉపయోఇంచటం మొదలు పెట్టారు. వారి వద్ద ఇక ఆయుధాలలో తూట్లు, పేలుడు పదార్థాల నిల్వలు నిండుకున్నాయి. అప్పుడు, ప్రాణాలకు తెగించి నీరజ ప్రయాణికుల సాయంతో ఎమెర్జెన్సీ డోర్లు తెరుస్తుంది. తన ప్రాణాలను కాపాడుకోవటానికి తాను ముందు దూకవచ్చు, కానీ ముగ్గురు చిన్నపిల్లలను ఆ తీవ్రవాదుల కాల్పులనుండి రక్షించటానికి వారితోనే ఉంటుంది. తీవ్రవాదుల కాల్పుల్లో మొత్తం 20 మంది ప్రయాణికులు మరణించారు. అందులో 12 మంది భారతీయులు ఇద్దరు అమెరికన్లు మిగిలిన వారు పాకీస్తాన్, యూకే మరియు మెక్సికోకు చెందినవారు. మిగిలిన 340 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి నీరజ తన ప్రాణాలను కోల్పోయింది. పసిపిల్లల కోసం, తోటి ప్రయాణికుల కోసం సాహసోపేతంగా పోరాడి వీరమరణం పొందింది. పాకిస్తానీ సైన్యానికి చెందిన స్పెషల్ సెక్యూరిటీ గ్రూపుకు చెందిన సైనికులు ఆ తీవ్రవాదులను చెరబట్టారు.

అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన నీరజకు భారత ప్రభుత్వం 1987లో మరణానంతరం ఆశోకచక్ర అవార్డును ప్రకటించింది. నీరజ తల్లి రమ అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్ చేతుల మీదుగా రిపబ్లిక్ డే నాడు ఆ అవార్డును స్వీకరించింది. అటు తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం ఆమెకు తంఘా-ఎ-ఇన్సానియత్ అవార్డును, అమెరికా ప్రభుత్వం జస్టిస్ ఫర్ క్రైంస్ మరియు  స్పెషల్ కరేజ్ అవార్డును ప్రదానం చేసింది. 2004వ సంవత్సరంలో భారత తపాలా శాఖ ఆమె సంస్మరణార్థం ఒక ప్రత్యేక తపాలా బిళ్లను విడుల చేసింది.


నీరజ తల్లిదండ్రులు ఆమె మరణాంతరం జీవిత భీమాతో వచ్చిన డబ్బుతో నీరజ భనోత్ -పాన్ ఆం అనే ట్రస్ట్ ఏర్పాటు చేశారు. విమానయానంలో డ్యూటీని మించి సేవాదృక్పథాన్ని కనబరచే వారికి ఒక అవార్డును, వరకట్నం వంటి సామాజిక అంశాలపై పోరాడే వారికి నీరజ భనోత్ అవార్డును ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఈ రెండవ అవార్డుకు కూడా కారణం ఉంది. నీరజకు 1985లో గల్ఫ్‌లో ఉన్న ఒక వ్యక్తితో వివాహమైంది. కానీ, వరకట్న వేధింపులతో రెండు నెలలకే నీరజ తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చి తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఆ దురాచారానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు ఈ అవార్డును ఇస్తున్నారు. నీరజ కాపాడిన పిల్లలలో ఒకరు ఇప్పుడు పైలట్. ఇది నీరజ చేసిన సాహసానికి ఉత్తమమైన సాఫల్యము మరియు సార్థకత.

నీరజ తండ్రి హరీష్ 2007లో, తల్లి రమ 2015 డిసెంబరులో మరణించారు. ఇటీవలే నీరజ సాహస చరిత్రను తెరకెక్కించారు.  సోనం కపూర్ నీరజగా నటించింది. ప్రఖ్యాత నటి షబనా అజ్మీ నీరజ తల్లి రమగా నటించారు. నీరజ సోదరులు అఖిల్ మరియు అనీష్ ఈ చిత్రాన్ని చూసి ఎంతో సంతోషించారు. వాస్తవాన్ని యథాతథంగా తీసినందుకు నిర్మాతను, దర్శకుడిని అభినందించారు. ఈ చిత్రం ప్రతి మహిళ, ప్రతి బాలిక చూడవలసినది. ఆడది అబల కాదు అని మరో సారి చాటి చెప్పిన నీరజ సాహస గాథ తరతరాల పాటు మార్గదర్శకం. ఆమె కథను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశాలలో చేర్చి దేశ పౌరులను మరింత సాహసవంతులుగా, దేశభక్తులుగా, మానవత్వంతో నిండిన మనుషులుగా తీర్చిదిద్దటానికి తోడ్పడాలి.

11, మార్చి 2016, శుక్రవారం

వేణువాద్య సమ్మోహనం - ప్రతిభామూర్తి జయప్రద రామమూర్తి


సంగీతం కొంతమందికి దైవానుగ్రహమైతే కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చే వారసత్వం. రెండూ కలగలిపితే ఇక అది అద్భుతమైన ప్రతిభావిష్కరణే అవుతుంది. సంగీతం వారసత్వంగా వస్తే అది జీవితంలో ఒక అంతర్భాగమై ప్రత్యేకంగా నేర్చుకున్నట్లు అనిపించదు. ఎలాగైతే మాట్లాడటం, ఆడటం నేర్చుకుంటారో, అలాగే కొన్ని సంగీత కుటుంబాలలో సంగీతన్ని కూడా పిల్లలు చిన్నప్పటినుంచే నేర్చుకుంటారు. అటువంటి ఒక అసమాన కళాకారిణి జయప్రద రామమూర్తిగారు. తెలుగుగడ్డపై పుట్టిన తొలి వేణువాద్య ఏ గ్రేడ్ కళాకారిణిగా జయప్రదగారు ఈరోజు ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆవిడ వివరాలు తెలుసుకుందాం.

గతంలో నేను ప్రముఖ వేణు వాద్య కళాకారిణులు సిక్కిల్ సోదరీమణులు నీల కుంజుమణి గార్ల గురించి రాసినప్పుడు వాయిద్యాలలో వేణువు ఎందుకు కష్టమైనదో తెలిపాను. శ్వాసకు సంబంధించిన వాయిద్యం ఇది. ఆ శ్వాసలో స్వరాలను పలికించాలంటే తప్పకుండా ప్రత్యేకమైన సాధన కావాలి. అందులో వేర్వేరు కాలాలలో వాయించేటప్పుడు ఊపిరిని నియంత్రించటానికి ఎంతో శ్రమ పడాలి. అందుకే వేణుగాన విద్వాంసులు చాలా తక్కువమంది ఉంటారు. మరి జయప్రదగారు ఎంతటి పరిశ్రమ, సాధన చేసుంటే ఈనాడు విద్వాంసులయ్యుంటారో ఊహించండి.

జయప్రద గారు గురుముఖత విద్య నేర్చుకోక మునుపే సంగీతంలో మెళకువలన్నీ తల్లి వద్ద నేర్చుకున్నారు. జయప్రద గారు ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ప్రేమా రామమూర్తి గారు. తండ్రి కీర్తిశేషులు శ్రీ ఓవీ రామామూర్తిగారు. ప్రేమ గారి తాత గారు బళ్లారి జమీందారు గారు శ్రీనివాస శాస్త్రిగారు వేణువాద్య విద్వాంసులు. ప్రేమ గారు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి శిష్యురాలు, ఆలిండియా రేడియోలో ఏ గ్రేడ్ కళాకారిణిగా పనిచేశారు. జయప్రద గారు చిన్ననాడే సంగీతంలో ప్రావీణ్యం సంపాదించి ఆకాశవాణిలో దూరదర్శన్‌లో కచేరీలు చేసినా,  తల్లి సలహా మేరకు ప్రఖ్యాత వేణువాద్య విద్వాంసులు డాక్టర్ ఎన్. రమణి గారి వద్ద చెన్నైలో, హైదరాబాదులో శ్రీ శ్రీనివాసన్ వద్ద నేర్చుకున్నారు. తరువాత శ్రీ సుదర్శనాచార్యుల వద్ద మృదంగం కూడా నేర్చుకున్నారు. తరువాత బంగ్లాదేశ్‌లో జరిగిన భారతీయ ఉత్సవాలలో ప్రఖ్యాత హిందూస్థానీ వేణువాద్య విద్వాంసులు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారితో పరిచయం ఏర్పడింది. ఆయన సలహా మేరకు హిందూస్థానీ వేణువాదనం కూడా నేర్చుకున్నారు. కళతో పాటు తన విద్యాభ్యాసాన్ని కూడ అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లారు. కామర్స్‌లో పీహేచ్‌డీ పూర్తి చేశారు జయప్రదగారు. తన చదువును సంగీతంతో ముడిపెట్టి పీహెచ్‌డీని మార్కెటింగ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే అంశంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఆ విధంగా తనను డాక్టర్ జయప్రదగా చూడాలనుకున్న తల్లి ప్రేమ గారి ఆకాంక్షను నెరవేర్చారు.

జయప్రద గారు పాశ్చాత్య మరియు భారతీయ శాస్త్రీయ సంగీతాల మేళనను శాస్త్రీయత కోల్పోకుండా చేయటాన్ని ఇస్టపడతారు. ఆమె వేణువాద్యానికి కావలసిన శక్తిని యోగా మరియు ప్రాణాయం ద్వారా పొందారు. ఊపిరితిత్తుల మరియు చేతి వేళ్ల దృఢత్వాన్ని వీటి ద్వారా పొందారు. వేణువాద్యం సహజ ప్రాణాయామం కాబట్టి దానివలన నాడీమండలం ఆరోగ్యంగా ఉంటుంది అని మానసిక రోగులకు ఈ వాద్యాన్ని నేర్చుకోమని  జయప్రదగారు సలహా ఇస్తారు. శబ్దానికి మానసిక ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని జయప్రదగారు అందరికీ చెప్పాలన్న యోచనతో దానిపై పరిశోధన చేస్తున్నారు.

జయప్రద గారు నవీనతకు చిహ్నంగా వేగంగా వాయించే రోలింగ్ ఫింగర్స్ అని కొత్త విధానాన్ని కనిపెట్టి ప్రపంచ మరియు జాతీయ రికార్డులను సొంతం చేసుకున్నారు. రకరకాల వేణువులలో రాగాలను ఆయా వేణువుల ధర్మానికి అనుగుణంగా మలచుకుంటూ వేలి కదలికను సృజనాత్మకంగా చేయటంలో జయప్రదగారు రికార్డులను సొంతం చేసుకున్నారు. దీనిని ట్రాన్స్పోస్ ఫింగరింగ్ అంటారు. మనోధర్మాన్ని ఈ ప్రక్రియ ద్వారా వాయించి ఈ రికార్డులకెక్కారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారం, ఢిల్లీ ప్రభుత్వం వారి పురస్కారం వంటి ఎన్నో గుర్తింపులు పొందారు. ఎన్నో దేవస్థానాలలో వీరి వేణువాద్యం అక్కడి దేవతామూర్తుల సేవలలో వినియోగిస్తున్నారు.  పండిట్ రవిశంకర్ గారు వీరిలోని ప్రతిభను గుర్తించి ఎంతో ప్రశంసించి ఆశీర్వదించారు. విజయాలు సాధించినప్పుడు బాధ్యత పెరుగ్తుంది అన్న సత్యాన్ని జయప్రదగారు పరిపూర్ణంగా నమ్ముతారు.

సంగీతం అంటే ధ్యానం, దానితో వేరే ఆలోచనలన్నీ తొలగి మనసు ప్రశాంతతను పొందుతుందని పరిపూర్ణంగా విశ్వసించే నిష్ణాతురాలు జయప్రదగారు. ఆవిడ వేణువాదన వింటుంటే మనసు తేలిపోతుంది, తేలికపడుతుంది. శ్రీకృష్ణుడు ఎదుట నిలచినట్లనిపిస్తుంది. మనోవికారాలన్నీ తొలగి ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఆవిడ పలికించే గమకాలు, ఆవిడ చేసే శబ్ద విన్యాసాలు మనసును కట్టి పడేస్తాయి. తన గురువుల వద్ద నేర్చుకున్న విద్యను, తన సాధన ద్వారా పరిపక్వత చెందిన సంగీతాన్ని జయప్రదగారు తన శిష్యులకు అందజేస్తున్నారు. దేశవిదేశాల్లో ఎన్నో కచేరీలు చేసిన జయప్రదగారు మాండోలిన్ వంటి తీగలతో కూడిన వాయిద్యాలను కూడ ఇష్ట పడతారు. ఛందస్సు లేని చుటుకులను స్వరపరచే అవకాశాన్ని మైసూర్ దత్తపీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామి వారు జయప్రద గారికి అనుగ్రహించారు.

ఫ్లూట్ ఐకాన్ ఆఫ్ ఏషియా, ఫ్లూట్ మేస్ట్రో, దివా ఆఫ్ డక్కన్, ఆస్థాన విదుషీ, వేణుగాన వినోదిని, మురళీధర మృదుపద మంజీరం, నాదయోగ వంటి బిరుదులు పొందారు. జయప్రదగారిని భారత రాష్ట్రపతులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు వేర్వేరు సందర్భాలలో సత్కరించారు. గ్లోబల్ వరల్డ్ రికార్డ్, యునిక్ రికార్డ్, ఏషియాస్ టాప్ 100 టాలెంట్, నేషనల్ ఫెలోషిప్, భారతి గౌరవ పురస్కార్, గోల్డెన్ బ్రేస్లెట్ అవార్డ్, బెస్ట్ ఫ్లూటిస్ట్, ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మర్ అవార్డులు పొందారు.

భగవంతుడు జయప్రదగారికి మరింత వేణువాద్య సేవాభాగ్యాన్ని, మరెన్నో గుర్తింపులను, పురస్కారాలను కలిగేలా అనుగ్రహించాలని ప్రార్థన. తెలుగుజాతి ముద్దుబిడ్డ జయప్రద గారి సంగీత సోపానం మరింత జయప్రదంగా సాగాలని ఆకాంక్షిద్దాం. వారి ప్రతిభ తరతరాలకు అందాలని ఆశిద్దాం. వారు వాయించిన కాంభోజి రాగ కీర్తనను వినండి. 

పాత్రం, అపాత్రం - యోగ్యం, అయోగ్యం


దాత, గ్రహీత ఇద్దరూ అయోగ్యులైతే ఎన్నో చిక్కులు - సహాయం పొందిన వాడికి, చేసినవాడికి ఆ సహాయం యొక్క విలువ ఒకటిగా ఉండదు, ఒకరిపై ఒకరికి అభిప్రాయాలూ అంత గొప్పగా కూడా ఉండవు. చేసినవాడికి గోరంత కొండంతైతే పొందిన వాడికి కొండంత గోరంత అవుతుంది. ఊరికే చేయలేదు అని పొందిన వాడనుకుంటే, పొందిన వాడు కృతఘ్నుడు అని చేసినవాడనుకుంటాడు. ఒక్కసారి సాయం చేస్తే జీవితాంతం దాసోహం కావాలా అని పొందిన వాడు అనుకుంటే నేను చేయకపోతే వాడి బతుకు బస్‌స్టాండే అనుకుంటాడు చేసిన వాడు. నేను చేశాను కాబట్టి నేను మహనీయుడిని అని చేసినవాడు భావిస్తే అది ఆయన ప్రతిఫలాపేక్షతో చేశాడు అని పొందినవాడనుకుంటాడు. చూశారా? మంచి కోసం జరగాల్సిన కర్మలో ఎన్ని వికృతాలో? వీటన్నిటిలో మనిషి చాలా సార్లు మరచిపోయే విషయం - ఇవ్వటం ఉపకారం కాదు, అది మానవ జన్మ ఎత్తినందుకు ఒక కనీస ధర్మం. ఈ విశ్వంలో ఎక్కువ నుండి తక్కువకు, తక్కువ నుండి ఎక్కువకు నిరంతరం బదిలీ జరుగుతూ ఉండాల్సిందే. లేకపోతే విశ్వ పరిణామమే ఆగిపోతుంది. అది ఆలోచన కావచ్చు, ధనం, వస్తువు, బంగారం, వాహనం, ఏదైనా కావచ్చు. అందుకే చాలా సార్లు మేము జీవితమంతా ఇతరులకు మంచే చేశాము అనుకునే వాళ్లకు కూడా చెప్పుకోలేని కష్టాలు, బాధలు, వ్యాథలు. చేసినవారి మనసులు బరువులు, పొందిన వారి మనసులు చీడ పురుగులు...అందుకే పాత్రం, అపాత్రం అనే విచక్షణ ఉపయోగించకపోతే, యోగ్యం, అయోగ్యం అన్నది ఆలోచించకపోతే ఇద్దరికీ మిగిలేది పాపమే. మరి కావలసింది ఏమిటి?

1. సాయం చేసేటప్పుడు యోగ్యునికి, పాత్రమైనది చేయటం
2. ఫలాపేక్ష లేకుండా ఉండటం
3. సాయం పొందినందుకు భగవంతునికి కృతజ్ఞత తెలుపటం, మరొకరికి ఫలాపేక్ష లేకుండా చేయటం.
4. భగవంతుడంటే రాయో, ఆకాశమో, నేలో కాదు. యోగ్యమైనది ఏదైనా భగవంతుడే. కాబట్టి యోగ్యుడైన మానవుడు భగవంతుడే.
5. మనం చేసేది భగవంతుని కోసం అన్న భావన. అన్నీ చెందినవానికి, అన్నీ తానైన వానికి తిరిగి ఇవ్వటం లెక్క పెట్టకూడదు కదా? ఇది అదే.

మంచి జరిగిన తరువాత నకారాత్మకమైన ఆలోచనలు వచ్చి దగ్గర కావలసిన మనుషులు దూరమెందుకు అవుతున్నరు అని మీరు ఆలోచిస్తే చాలా సార్లు అపాత్రము, అయోగ్యత మరియు ప్రతిఫలాపేక్షే కారణాలు. ఇది బయట వాళ్లతోనే కాదు, రక్తసంబంధీకుల మధ్య కూడా ఉంటుంది. అందుకే కుటుంబాలు విడిపోతాయి. ఎప్పుడైతే ఈ మూడు కారణాలు రంగంలో ఉంటాయో అప్పుడు అసలు లక్ష్యం, అసలు ధర్మం పక్కకు నెట్టబడుతుంది. అందుకే సనాతన ధర్మం ఫలాపేక్షకు, అపాత్రమునకు పాప ప్రమాణము నిర్ణయించింది.

కలియుగంలో అధర్మం పాళ్లు, తద్వారా మనుషులలో అయోగ్యం, అపాత్రము పాళ్లు, ప్రతిఫలాపేక్ష ఎక్కువ ఉంటాయి కాబట్టి నిజాయితీతో సాయం చేయదలచుకుంటే పాత్రమును బాగా నిశింతంగా పరిశీలించి, ఫలాపేక్షలేకుండా చేయాలి. అప్పుడు పాప సంచయము మనకు రాదు. ఈ విచక్షణ చేయాలంటే మంచి-చెడు, ధర్మం-అధర్మం వివరాలు బాగా తెలియాలి. మనస్తత్త్వం అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉండాలి. వీటన్నిటికీ అంతర్ముఖమైన సాధన ఉండాలి. ఆచరంచి మరింత ముందుకు వెళ్లగలిగే ఓర్పు సహనం ఉండాలి. మొత్తం మీద శుద్ధమైన అంతఃకరణం ఉంటే ఈ పాత్రము-అపాత్రము విచక్షణ చేసే శక్తి వస్తుంది. మన పురాణ ఇతిహాసాలు, యోగుల చరిత్రలు, వారి రచనలు కూడా చాల ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి, కాలగమనం యొక్క పరీక్షలను తట్టుకొని ఎప్పటికీ సముచితంగా ఉండేలా రూపొందించబడినవి. ధర్మాధర్మ విచక్షణ నుండి పాత్రాపాత్ర విచక్షణ కలుగుతుంది. అప్పుడు అయోగ్యములైన వాటిని వీలైనంత త్వరగ మనకు దూరం చేసుకునే శక్తి కలుగుతుంది. యోగ్యములైన వాటిమీదే ధ్యాస ఉండి యత్నం సఫలమవుతుంది. కర్మ సాఫల్యం పొందుంతుంది. చేసే కర్మలు సఫలమైతే పాప పుణ్య సంచయం పటాపంచలై అకర్మ వైపు మనలను తీసుకువెళుతుంది.

ఇదం శరీరం ఖలు ధర్మ సాధనం. ఎంతో దుర్లభమైన మానవ శరీరాన్ని ఇతరులకు సాయపడేలా ఉపయోగించితేనే మానవ జన్మ సార్థకము. 

10, మార్చి 2016, గురువారం

బ్యాడ్మింటన్ ద్రోణాచార్యుడు - తెలుగుతేజం పుల్లెల గోపీచంద్


ప్రశాంతమైన వదనం, చక్కని చిరునవ్వు, కొండంత వినమ్రత, చక్కని భాషణ, అపారమైన క్రీడా కీర్తి - కలబోస్తే? పుల్లెల గోపీచంద్. తెలుగుజాతికి కీర్తి పతాకలు తెచ్చిన క్రీడాకారుడు, బ్యాడ్మింటన్‌లో ద్రోణాచార్యుడు ఈ ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ. నలభై రెండేళ్ల వయసుకే పద్మ భూషణ్, పద్మశ్రీ, ద్రోణాచార్య, అర్జున మరియు రాజీవ్ ఖేల్ రత్న అవార్డులు పొందాడు. దేశంలో క్రీడలలో అత్యున్నత శిఖరాలను చూశాడు గోపీచంద్. ఆయన పేరు చెప్పగానే హైదరబాద్‌లోని అకాడెమీ, అక్కడ తీర్చిదిద్దబడిన సైనా నెహ్వాల్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారులు గుర్తుకు వస్తారు. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి?

చదువుకునే రోజుల్లోనే బ్యాడ్మింటన్‌లో ప్రావీణ్యం సాధించిన గోపీచంద్ భారత సంయుక్త యూనివర్శిటీస్ జట్టుకు నేతృత్వం వహించాడు. మొదట ఎస్ ఎం ఆరిఫ్ వద్ద, తరువాత ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఆల్ ఇంగ్లాండ్ టోర్నమెంట్ గెలిచిన ప్రకాష్ పడుకోనే వద్ద, తరువాత ప్రసాద్ గంగులీ వద్ద శిక్షణ పొందాడు. 1996లో తొలి జాతీయ చాంపియన్‌షిప్ గెలిచాడు. ఐదేళ్లపాటు వరుసగా ఈ టోర్నమెంట్ గెలిచాడు. ఏళ్లపాటు భారతదేశ బ్యాడ్మింటన్ కీర్తిని మరింత పెంచాడు. గోపీచంద్ క్రీడా జీవితంలో చారిత్రాత్మక ఘట్టం 2001లో వచ్చింది. బ్యాడ్మింటన్ వింబుల్డన్‌గా భావించబడే ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నాడు. 1980లో ప్రకాష్ పడుకోనే గెలిచిన తరువాత ఈ టోర్నమెంట్ గెలిచిన ఏకైక భారతీయుడు గోపీచంద్. తన బలహీనతలను కోచ్ గంగులీ ప్రసాద్ సాయంతో గమనించుకొని వేగాన్ని పెంచుకొని, శరీర దారుఢ్యాన్ని నిర్మించుకొని ఆ ఛాంపియన్‌షిప్ గెలిచాడు. బెంగుళూరులో ప్రకాష్ పడుకోనే అకాడెమీలో ఆయన వద్ద కోచింగ్ తన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా గోపీచంద్ చెబుతారు. ఆయన వద్ద గెలవగలం అన్న మనోస్థైర్యాన్ని నేర్చుకున్నాను అని గోపీచంద్ అంటారు.

క్రీడాకారుడిగా గోపీచంద్ సాధించిన విజయాలు ఒక ఎత్తైతే కోచ్‌గా ఆయన విజయాలు దానికి పదిరెట్లు. క్రీడాకారులను ఆడటం కోసం కాకుండా గెలవటం కోసం ఆడేలా శిక్షణ ఇవ్వటం, దేహ మరియు మానసిక దారుఢ్యాన్ని పెంచుకొని విజయాలు సాధించేలా సిద్ధం చేయటం గోపీచంద్ ప్రత్యేకత. ఆటగాళ్ల వ్యక్తిత్వానికి సరిపడా కోచింగ్ ఇచ్చి, ఆట ఆడే సమయంలో ఎక్కువ సేపు ఆడే సామర్థ్యాన్ని పెంచటం ఆయన గొప్పతనం. ముఖ్యమైన పోటీలకు దాదాపు ఏడాది ముందునుంచే శిక్షణ మొదలు పెట్టటం వంటి ప్రణాళికల వలన భారత క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలలో నిలబడటమే కాదు ఒకటి తరువాత మరొకటి గెలిచేలా చేశాడు.

భారతదేశ బ్యాడ్మింటన్ చరిత్రలో గోపీచంద్ స్థాపించిన అకాడెమీ ఒక ముఖ్యమైన పేజీ. అప్పటివరకు బ్యాడ్మింటన్ అంటే చైనా ఆటగాళ్ల ఏకచ్ఛత్రాధిపత్యంగా ఉండేది. కానీ, గోపీచంద్ అకాడెమీ మొదలుపెట్టిన తరువాత ఈ దుర్భేద్యమైన చైనా ఆటగాళ్ల కోటను బద్దలు కొట్టగలిగారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి ఆటగాళ్లు అగ్రశ్రేణి ఆటగాళ్లుగా ప్రపంచస్థాయిలో నిలబడగలిగారు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపటం గోపీచంద్ కోచింగ్ ముద్ర. ఒత్తిడిలో ఆడుతున్నప్పుడు ఒక స్థాయిని దాటి గెలిచే శక్తిని ఆటగాళ్లలో తీసుకురాగలిగిన కోచ్ గోపీచంద్. టోర్నీలు ఒకటి తరువాత ఒకటి చిన్నవయసులోనే గెలిచేలా ఆటగాళ్లను రూపకల్పన చేశాడు గోపీచంద్. తన అనుభవంతో, ఆటపై గల పట్టుతో ఆటగాళ్లకు మార్గదర్శిగా నిలిచాడు. సైనా నెహ్వాల్ ప్రపంచంలో మొదటి ర్యాంకుకు వెళ్లగలిగిందంటే దానిలో గోపీచంద్ పాత్ర ఎంతో ఉంది.

ఐదారుగురు అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను తయారు చేయటం వలన భారతదేశంలో మూడవస్థాయి ఆటగా (క్రికెట్,  టెన్నిస్ తరువాత) ఉన్న బ్యాడ్మింటన్‌ను వేలాది మంది పిల్లలు నేర్చుకునేలా స్ఫూర్తిని నింపాడు. ఈరోజు బ్యాడ్మింటన్‌లో ప్రీమియర్ లీగ్ మంచి ఆదరణతో నడుస్తోంది అంటే దానికి ఆద్యుడు గోపీచంద్ అనే చెప్పుకోవచ్చు. ఆటగాళ్లు ఓటమి పాలై నిరాశలో ఉన్నప్పుడు వారిని ఉత్సాహ పరచి విజయ పథంలో నడిపించిన ఆచార్యుడు గోపీచంద్. 2012లో సైనా నెహ్వాల్ లండన్ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకోవటంలో గోపీచంద్ పాత్ర మరువలేనిది. ఆమె సూపర్ సిరీస్ విజాయలకు కూడా రథసారథి గోపీచందే. సైనా ఫోర్‌హ్యాండ్, కోర్టులో నెట్ వద్ద ఆటలో నైపుణ్యతను అభివృద్ధి చేసి ఆమెను నంబర్ వన్ క్రీడాకారిణిగా గోపీచంద్ రూపొందించాడు. శరీర దారుఢ్యాన్ని, మానసికంగా గెలవాలి అన్న తపనను ఆమెలో నిరంతరం ఉండేలా చేశాడు గోపీచంద్.

ఈరోజు భారతదేశానికి సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కాశ్యప్, శ్రీకాంత్ కిడాంబి, అరుంధతి పంతవనె, ప్రణయ్ కుమార్, గురుసాయి దత్, అరుణ్ విష్ణు, రుత్విక శివాని వంటి ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఉన్నారంటే గోపీచంద్ అకాడెమీలో ఆయన వద్ద పొందిన అద్భుతమైన శిక్షణ వలన అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. అందుకే ఆయనకు చిన్న వయసులోనే అన్ని అవార్డులు వచ్చాయి. గోపీచంద్ వంటి మంచి వ్యక్తి భారతదేశ క్రీడారంగంలో ఉండటం ఈ దేశం అదృష్టం. ఈ దేశంలో బ్యాడ్మింటన్ అంటే గోపీచంద్ పేరు రాకుండా ఉండదు. అది ఆయన ఈ ఆటపై చూపిన ప్రభావం, ఆయన మన ఆటగాళ్లలో తెచ్చిన అనూహ్యమైన మార్పు, వారికి తెచ్చిపెట్టిన గుర్తింపు. తెలుగుజాతి ముద్దుబిడ్డ గోపీచంద్ గారు వందలాదిమంది ప్రపంచస్థాయి ఆటగాళ్లను సిద్ధం చేయాలని అభిలషిద్దాం. 

9, మార్చి 2016, బుధవారం

సీతారామ వైభవం-4: ఇక్ష్వాకు-నిమి వంశజుల వివరాలు



సాధారణంగా పెళ్లి అనుకోగానే కుటుంబాల వివరాలు తెలుసుకుంటాము. ఇది మనకు సనాతన ధర్మం నుండి వచ్చిందే. శివధనుర్భంగం చేసిన తరువాత జనకుడు తన మంత్రులను పంపించి దశరథ మహారాజును మిథిలకు ఆహ్వానిస్తాడు. దశరథుడు సంతోషించి వశిష్ఠాదులతో మిథిల చేరుకుంటాడు. జనకుడితో తన వంశవృత్తాంతాన్ని వశిష్ఠుల వారు తెలుపుతారు అని అంటాడు. వశిష్ఠుడు ఇలా వివరంగా ఇక్ష్వాకు వంశ వివరాలు తెలుపుతాడు:

"ఓ జనక మహారాజా! అవ్యక్తమైన పరబ్రహ్మమునుండి చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. ఆయనకు మరీచి, మరీచికి కాశ్యపుడు, కాశ్యపునికి సూర్యుడు జన్మించాడు. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు. ఇతడు మొదటి ప్రజాపతి. ఇతని కుమారుడు ఇక్ష్వాకువు. ఈయన అయోధ్యకు మొదటి ప్రభువు. కుక్షి అనేవాడు ఇక్ష్వాకు పుత్రుడు. అతని కుమారుడు వికుక్షి. అతని కుమారుడు బాణుడు. మహాపరాక్రమశాలి అనరణ్యుడు బాణుని కుమారుడు. అతని కొడుకు పృథువు. పృథువు కొడుకు త్రిశంకువు. అతని కుమారుడు దుందుమారుడు. అతని కుమారుడు యువనాశ్వుడు. అతని కుమారుడు మాంధాత. అతని కుమారుడు సుసంధి. సుసంధి కుమారులు ధ్రువసంధి, ప్రసేనజిత్తు. ధ్రువసంధి కుమారుడు భరతుడు. అసితుడు భరతుని కుమారుడు. అసితుని కుమారుడు సగరుడు. సగరుని కుమారుడు అసమంజుడు. అతని కుమారుడు అంశుమంతుడు. ఆయన కుమారుడు దిలీపుడు. దిలీపుని కుమారుడు భగీరథుడు. ఆయన కుమారుడు కకుత్‌స్థుడు. అతని కుమారుడు రఘుమహారాజు. అతని కుమారుడు ప్రవృద్ధుడు. అతని కుమారుడు శంఖణుడు. అతని కుమారుడు సుదర్శనుడు. అతని పుత్రుడు అగ్నివర్ణుడు. అతని కుమారుడు శీఘ్రగుడు. అతని కుమారుడు మరువు. అతని కుమారుడు ప్రశుక్రుడు. ఆయన పుత్రుడు అంబరీషుడు. ఆయన కుమారుడు నహుషుడు. నహుషుని కొడుకు యయాతి. అతని కుమారుడు నాభాగుడు. ఆయన తనయుడు అజుడు. అజుని కుమారుడే దశరథుడు. ఇక్ష్వాకు వంశము మొదటినుండీ అతి పవిత్రమైనది. ఆ వంశములో పుట్టిన రాజులందరూ మహాధార్మికులు, వీరులు,సత్యసంధులు. ఓ రాజా! ఆ మహావంశసంజాతులైన రామలక్ష్మణులకు మీ కుమార్తెలను ఇచ్చి వివాహము చేయుట ఎంతో యుక్తము. వంశవైభవము వలన, సద్గుణసౌశీల్యముల వలన, ఈడు-జోడు బట్టి కూడా ఈ రాజకుమారులు మీ కుమార్తెలు వివాహమాడుటకు తగిన వారు" అని చెబుతాడు.

అప్పుడు జనకుడు మంగళ వచనాలు పలికి వశిష్ఠునికి ఇలా వివరాలు చెబుతాడు. "మహర్షీ మా వంశం కూడా చాలా గొప్పది. కన్యాదాత వివాహ సమయంలో వంశవృత్తాంతాన్ని పూర్తిగా వివరించటం సమంజసం. మా వంశానికి మూల పురుషుడు నిమి మహారాజు. ఆయన ముల్లోకాలలో ప్రసిద్ధి చెందిన వాడు. ఎంతో ధర్మాత్ముడు. అతని కుమారుడు మిథి. అతడే మిథిలా నగర నిర్మాత. ఆయన కుమారుడు ఉదావసుడు. అతని కుమారుడు నందివర్ధనుడు. అతని సుతుడు సుకేతుడు. అతని కుమారుడు దేవరాతుడు. ఆయన పుత్రుడు బృహద్రథుడు. ఆయన కుమారుడు మహావీరుడు. అతని కుమారుడు సుధృతి. అతని తనయుడు దృష్టకేతువు. అతని తనయుడు హర్యశ్వుడు. వీరందరూ ధర్మపరాయణులు. హర్యశ్వుని కుమారుడు మరువు.  అతని పుత్రుడు ప్రతింధకుడు. అతని సుతుడు కీర్తిరథ మహారాజు. అతని తనయుడు దేవమీఢుడు. ఆయన కొడుకు విబుధుడు.  ఆతని తనయుడు మహీధ్రకుడు. కీర్తిరాతుడు అతని కుమారుడు. అతని పుత్రుడు మహారోముడు. అతని తనయుడు స్వర్ణరోముడు. అతని పుత్రుడు హ్రస్వరోముడు. వీరందరూ రాజర్షులే. హ్రస్వరోముని కుమారులలో పెద్దవాడిని నేను. నా తమ్ముడు కుశధ్వజుడు మహావీరుడు. మా తండ్రిగారు జ్యేష్ఠుడనైన నన్ను రాజుగా చేశాడు. కుశధ్వజుడు నిర్మల హృదయుడు, దేవతుల్యుడు. ఓ మునీశ్వరా!  చాలా సంతోషముగా నేను నా కుమార్తెలలో సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునికిచ్చి వివాహం చేసెదను. ఓ దశరథ మహారాజా! నేను ఈ విషయం మూడు మార్లు చెబుతున్నాను. ఇందులో సందేహము లేదు. రామలక్ష్మణులచే స్నాతకము చేయించుము. నీకు శుభము కలుగు గాక. వివాహానికి సంబంధించిన నాందీవిధులను నిర్వహింపుము. ఉత్తర ఫల్గుణీ నక్షత్రమున వివాహ కార్యక్రమమును జరిపింపుము. రామలక్ష్మణులకు సుఖశాంతులు కలగటానికి దానాలు ఇప్పింపుము" అని పలుకుతాడు.

అపుడు విశ్వామిత్రుడు జనకునితో "రాజా! నీ తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలు మాండవి శ్రుతకీర్తి  అనుపమానమైన సౌందర్యవతులు. మాండవిని భరతునకిచ్చి, శ్రుతకీర్తిని శతృఘ్నునికిచ్చి వివాహము చేయుట యుక్తము" అని పలుకుతాడు. దశరథుడు, జనకుడు అందుకు వెంటనే సంతోషించి అంగీకరిస్తారు.

వివరణ:

వివాహానికి కేవలం అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడటంతో సరిపోదు, వివరాలు తెలుసుకొని ఆ వంశస్థుల వివరాలు కూడా ముఖ్యం. ఎందుకంటే, ఒక సంసారం హాయిగా సాగటానికి కుటుంబాలలో పాటించే పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు తెలుసుకొని ఆ జంట అన్యోన్యంగా ఉండటానికి దోహదపడతాయి. అలాగే ఆయా వంశాలలో గొప్పవారి వివరాలు తెలుసుకోవటం ద్వారా వియ్యాలవారిని సముచితంగా గౌరవించే అవకాశముంటుంది.

ఇక్కడ ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వారందరూ మహావీరులుగా, ధర్మపరాయణులుగా చెప్పబడ్డారు. అలాగే, జనకుని పూర్వజులందరూ రాజర్షులే. రాజ్యపాలనతో పాటు ధర్మసూక్ష్మాలు పాటిస్తూ, యజ్ఞ యాగాది క్రతువులు చేసి దివ్యశక్తులు పొందిన వారు. రెండు పవిత్రమైన వంశాల కలయిక సీతారాముల వివాహం. దానికి నాంది విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగరక్షణకై తీసుకువెళ్లటం. మన పురాణాలలోని గొప్పతనం ఇదే. రాజులకు ఋషులు, మహర్షులు, యోగులు ఎప్పటికప్పుడు ధర్మాన్ని బోధించి లోకకళ్యాణార్థం సముచిత కార్యాలు చేయించే వారు. దీనివలన రాజులకు యశస్సు, రాజ్యానికి సుఖశాంతులు, ఋషులకు సత్కర్మ ఫలం దక్కేది. వశిష్ఠాదులు ఇక్ష్వాకు వంశాన్ని ఇలా కంటికి రెప్పలా కాపాడగా శతానందుడు మొదలైన వారు జనకుని వంశాన్ని ఉద్ధరించారు. వివాహమనేది ఒక పవిత్రమైన కార్యం. దాని వలన రెండు వైపులా  తరాలు ఉద్ధరించబడతాయి. లోకోద్ధరణకు బీజం పడుతుంది. అందుకే మన వివాహ వ్యవస్థ అత్యంత శక్తివంతమైనది, సనాతనమైనా పుష్టికరమైనది. 

అలుపులేని యోధురాలు ఇరోం షర్మిల


ఇరోం షర్మిల - పేరు వినగానే ఆమె ముక్కుకున్న పైపు, విరబోసుకున్న జుట్టు, ముఖంలో పోరాట పటిమ గుర్తుకొస్తాయి. మణిపూర్ రాష్ట్రంలో ఆర్ముడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ (ఏఎఫెస్పీఏ చట్టం 1958) రద్దు చేయాలని 780 వారాలకు, అనగా 15 ఏళ్లకు పైగా ఆహారాన్ని విసర్జించి శాంతియుగ నిరాహార దీక్ష చేస్తున్న అసమాన మహిళ. ఈ చట్టం శాంత్రిభద్రతలు అదుపులో లేని సరిహద్దు రాష్ట్రాల్లో ఆర్మీకి ప్రత్యేక అధికారాలు ఇవ్వటానికి భారత ప్రభుత్వం 1958లో రూపొందించింది. ఈ చట్టం ప్రకారం ఆయా రాష్ట్రాలలో ఆర్మీ వాళ్లు ఎటువంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి నిర్బంధించవచ్చు, పెద్దగా పర్మిషన్లు లేకుండా అల్లర్లు సృష్టించే వారిని కాల్చి వేయవచ్చు.

2000 సంవత్సరం నవంబర్ 2వ తేదీన మణిపూర్ రాజధాని ఇంఫాల్ సమీపంలో మలోం అనే ఊరు దగ్గర 10 మంది పౌరులు కాల్చబడ్డారు. దాని వెనుక భారత పారామిలటరీలో ఒక భాగమైన అస్సాం రైఫిల్స్ హస్తముందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో కలతకు గురై ఇరోం ఆ సంవత్సరం నవంబర్ 5 నుండి ఆమరణ నిరాహారదీక్ష మొదలు పెట్టింది. ఏఎఫెస్పీఏ చట్టాన్ని మణిపూర్‌లో ఉపసంహరించాలని, అంత వరకు ఆహారం, నీరు ముట్టనని, తల దువ్వుకోనని ప్రతిజ్ఞ చేసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు షర్మిల తన మాటకు కట్టుబడే ఉంది. ఆమెకు శాశ్వతంగా ముక్కు-గొంతు ద్వార పొట్టకు ఒకపైపు వేసి ఆరోగ్యం క్షీణించనప్పుడల్లా ప్రభుత్వం దాని ద్వారా శరీరానికి కావలసిన శక్తిని అందజేస్తోంది.

వివాదాస్పద చట్టం ఏఎఫెస్పీఏను వెనక్కు తీసుకోవటానికి ఇరోం షర్మిల 2006లో ఢిల్లీ జంతర్-మంతర్‌లో దీక్ష చేసింది. ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, హోం మంత్రికి లేఖలు రాసింది. 15 ఏళ్లుగా తన పోరాటం సాగిస్తూనే ఉంది. ఎన్నో సార్లు అరెస్టు అయి విడుదలైంది. ఆమెను గృహనిర్బంధంలో కూడా ఉంచారు. కొద్దికాలం క్రితం షర్మిలను కాపాడండి అనే ఉద్యమం కూడా ఆరంభమైంది. పుణే యూనివర్సిటీ వారు ఈమె పేరిట 39 మంది మణిపూర్ యువతీ యువకులకు ఉచిత డిగ్రీ కోర్సులను అందించింది. ఎన్నో విధాలుగా తన రాష్ట్రంలో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈమె పోరాడుతూనే ఉంది.

అంతర్జాతీయంగా ఇరోం షర్మిలకు మానవ హక్కుల సంఘాలనుండి ఎన్నో గుర్తింపులు అందాయి. 2007లో గ్వాంగ్‌జూ మానవ హక్కుల అవార్డు, పీపుల్స్ విజిలన్స్ కమిటీ ఆన్ హ్యూమన్ రైట్స్ అవార్డు, 2009లో మయిలమ్మ అవార్డు, 2010లో ఆసియా మానవ హక్కుల సంఘం నుండి జీవిత సాఫల్య పురస్కారం, రవీంద్రనాథ్ శాంతి బహుమతి, సర్వ గుణ సంపన్న అవార్డులు లభించాయి. 2013లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆమెను ప్రిజనర్ ఆఫ్ కాన్షియెన్స్ (మనస్సాక్షి ఖైదీ)గా గుర్తించింది.

ఏఎఫెస్పీఏను మణిపూర్‌నుండి ఉపసంహరించేంత వరకు తన తల్లిని కూడా కలువనని అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్న ఇరోం షర్మిల గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జోహారులు. స్త్రీ అబల కాదు, స్త్రీకి అనంతమైన శక్తి ఉంది ఉన్నదానికి షర్మిల నిలువుటద్దం.

ఈమె లక్ష్యం భారత సైన్యంపై కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల చట్టం పేరుతో దౌర్జన్యం కూడదు అన్నది ఆమె పోరాటం వెనుక సారాంశం. మణిపూర్‌లో  గత ఐదేళ్లలో ఐదు వేలమంది హింసలో మరణించారు. ఇందులో ఎంతో మంది అమాయకులు. చట్టవ్యతిరేక శక్తులను చర్చలకు పిలిచి శాంతియుతంగా త్వరగా ఈ సమస్యను భారత మరియు మణిపూర్ ప్రభుత్వాలు పరిష్కరించి ఇరోం షర్మిలకు విముక్తి కలిగిస్తారని ఆశిద్దాం. 

6, మార్చి 2016, ఆదివారం

తిల్లానాలు - బాలమురళీరవం - నా దిర్ దిర్ ధీం తనన నోం


కర్ణాటక సంగీత సాంప్రదాయంలో రకరకాల అంశాలు ఉన్నాయి. వర్ణం, గీతం, కృతి, రాగమాలిక, పదం, జావళి,తిల్లాన..ఇలా ఎన్నో. ఒక్కో రకానికి ఒక్కో ప్రత్యేకత ఉంది, సముచిత స్థానముంది. వీటిల్లో తిల్లానాకు ప్రత్యేకమైన  లక్షణాలు ఉన్నాయి. తిల్లానాలు సంగీత కచేరీలలోనే కాదు, నాట్య ప్రదర్శనలో కూడా అద్భుతంగా ప్రదర్శిస్తారు. మిగిలిన ప్రక్రియలతో పోలిస్తే తిల్లాన చిన్నది. ఎక్కువ సాహిత్యం ఉండదు, శ్రావ్యంగా లయ బద్ధంగా తి ల న అనే అక్షరాల కలయికతో ఉంటుంది. ఎక్కువ శాతం జతులతో నిండి ఉండే తిల్లాన వినటానికి సొంపుగా ఉంటుంది, అందుకే నాట్య ప్రదర్శనకు కూడా అనువైన అంశం.

తిల్లానలకు మూలం మధ్యయుగానిక చెందిన కైవార ప్రబంధాలు. ఈ ప్రబంధాలలో జతులు కార్యక్రమాల చివరలో ఉండేవి. ఈ ప్రబంధాల ప్రేరణతోనే 18వ శతాబ్ది కాలంలో తిల్లానాలు పుట్టాయి.తిల్లానాలు సంగీత కచేరీలో రాగం తానం పల్లవి అనే సమయం పట్టే అంశం తరువాత వస్తుంది. నాట్య ప్రదర్శనలలో పదాల తరువాత తిల్లాన ఉంటుంది. కథా కాలషేపాలలో కూడా తిల్లాన వేగంగా ప్రేక్షకులను రంజింపజేసేలా ఉపయోగించబడుతుంది.  తిల్లానాలో పల్లవి, అనుపల్లవులలో జతులు, చరణంలో మొదటి భాగం సాహిత్యం, రెండవ భాగం జతి ఉంటుంది. చాలా మటుకు తిల్లానాలలో పల్లవి మొదటి కాలంలో ఉంటుంది. అనుపల్లవి మొదటి, మధ్యమ కాలంలో ఉంటుంది. చరణం మధ్యమ కాలంలో ఉండి చిట్టస్వరాలు కలిగి ఉంటుంది. కృతులకు భిన్నంగా తిల్లానాలో అనుపల్లవి చరణం తరువాత వచ్చి అటు తరువాత పల్లవి వస్తుంది.

తిల్లానాల కూర్పులో సాహిత్యకారుడికి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అందుకనే అవి చాలా ప్రాచుర్యం పొందాయి. జతులు మొదటి, రెండవ కాలములతో పేర్చి కూర్చటంతో వినటానికి సొంపుగా, ఉత్సాహకరంగా ఉంటాయి. అనురూపత్వం (సిమెట్రీ) ఉండటంతో తిల్లానాల అనుపల్లవిలో ఒక మకుటం కూడా పొందుపరస్తారు సాహిత్యకారులు.

తిల్లానలో ప్రత్యేకత దిర్, థక్కు, ధిక్కు, తక తఢింగు, తళాంగు, కిటక మొదలైన ప్రబంధ శబ్దాలతో ఉండటం. వీటితో సంగీత కచేరీలు రక్తి కడతాయి.

తిల్లానలలో రకాలు

1. నాట్య ప్రదర్శనల కోసం రాసినవి - లయ  ప్రాధాన్యమైన జతులతో నిండి ఉంటాయి. మొట్ట మొదటి తిల్లానాలు ఈ కోవకు చెందినవే. మేలత్తూర్ వీరభద్రయ్య గారు, తంజావూర్ చతుష్టయంగా పేరొందిన  పొన్నయ్య, చిన్నయ్య, శేషయ్యర్, జీఎన్ బాలసుబ్రహ్మణ్యం గార్లు ఈ తిల్లానాలను రచించారు
2. ఉపపాదన కోసం రాసినవి - అనగా బోధనకు ఉపయోగించేవి. ఇవి అంగ, క్రియ, అక్షర కాలం మొదలైన పరిజ్ఞానం అందించటానికి రాసినవి. మహా వైద్యనాథ అయ్యరు, రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ మొదలైనవారు రాశారు.
3. సంగీత కచేరీల కోసం  రాసినవి - వీటిలో రాగ మాధుర్యానికి ప్రాధాన్యత ఉంటుంది. స్వర సంగతులను కూడ ప్రతిపాదిస్తారు. మైసూర్ వాసుదేవాచార్య, ముత్తయ్య భాగవతార్, బాలమురళీకృష్ణ, లాల్గూడి జయరామన్ మొదలైన వారు ఈ  రకమైన తిల్లానాలు రచించారు

తిల్లానాలకు హిందూస్థానీ సంగీతంలో కూడా చోటు ఉంది. వీటిని తరానాలు అంటారు. ఇవి ఒధని, తధని, తధీం మొదలైన పదాలతో నిండి ఉంటాయి. ఈ పదాలు పర్షియన్ మరియు అరబిక్ భాషల నుండి వచ్చినవి. 13వ శతాబ్దంలో అమీర్ ఖుస్రో ఈ ప్రయోగం మొదలు పెట్టాడు. సూఫీ సంగీతంలో, హిందూస్థానీ సంగీతంలో తరానాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది.

కర్ణాటక సంగీతంలోని తిల్లానాలలో డాక్టర్ బాలమురళీకృష్ణ గారి రచనలకు ప్రత్యేక స్థానం ఉంది. అవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఎందరో కళాకారులు ఆయన తిల్లానలను సంగీత నృత్య కచేరీలలో ప్రదర్శిస్తారు. ఆయన రాగమాలికగా, బృందావని, కుంతలవరాళి, కదనకుతూహలం, ద్విజావంతి రాగాలలో కూర్చిన తిల్లానాలు ఈనాడు ప్రమాణాలు. ఆ తిల్లానాలలో  కదనకుతూహలం రాగంలో కూర్చిన తిల్లానా వివరాలు పరిశీలిద్దాం.

సాహిత్యం:

నా దిర్ దిర్ ధీం తనన నోం తదరదాని నా దిర్ దిర్ తోం నా దిర్ దిర్ తోం ధిత్తిల్లిల్లాన

తదర దాని దిరన నిద ఉదర దాని దిరన
తకిటఝం మ ద ని తకిట ఝం గ ప స
తతకిట తోం స ని ద ప మ గ రి స

నా దిర్ దిర్ ధీం తనన నోం తదరదాని నా దిర్ దిర్ తోం నా దిర్ దిర్ తోం ధిత్తిల్లిల్లాన

తరికిట తోం తరికిట తోం త ఝణుత
తత్తరికిట తక తక ధిత్తళాంగు తక తరి కిటతక తక ధిత్తళాంగు తోం దిర్ దిర్ తోం దిర్ తోం
తిల్లాన ధిత్తిల్లాన ధిత్తిల్లాన
స రి మ గ రి స రి మ మ ద ద ని గ గ ప స స ని ద ప మ గ రి

వదనమదే విరిసెనే అధరమదే మురిసేనే
మధుర గానంబదే నా మురళీమనోహరుడదే
మదన కదన కుతూహలుడు రమ్మనె బిరాన బిరాన బిరాన రావే

ఈ తిల్లానాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

1. ఉత్సాహంగా రాగానికి సముచితమైన జతులు, సాహిత్యం
2. అద్భుతమైన జతులు మరియు స్వర సంగతులు
3. రాగం పేరు, రచయిత పేరు రెండూ మకుటంగా రావటం
4. ఓలలాడించే గానంతో అద్భుతమైన కాలగతిలో కూర్చబడటం
5. గాయకునితో పాటు మృదంగం, వయోలిన్, ఘటం మొదలైన వాద్య కళాకారులకు కూడా ప్రతిభను కనబరచే అవకాశం ఉండటం

శ్రీకృష్ణునితో అనుబంధం కల ఎటువంటి రచనైనా ఆయన మోహన మురళీరవం లాగా మధురంగానే ఉంటుంది. అందుకనే, ఈ తిల్లానా కూడా మధురంగా, లయబద్ధంగా, కదనోత్సాహం కలిగించేలా ఉంటుంది. బాలమురళీకృష్ణ గారి గాత్ర సంగీత ప్రతిభ గురించి మాట్లాడనక్కరలేదు, కానీ వారి రచనలను చూస్తే ఆయనలోని బహుముఖ ప్రజ్ఞ అర్థమవుతుంది. తిల్లానా రచించాలంటే మాటలు కాదు. అందులో జనరంజకం చేయాలాంటే అది గాయకుల నోట నిరంతరం పలికేలా ఉండాలి. ఈ తిల్లాన ఆ కోవకు చెందినదే. వినగానే ఆనందం కలుగుతుంది. మళ్లీ వినాలి, పాడాలి అనిపిస్తుంది. అందుకే భాషా భేదాలు లేకుండా అన్ని ప్రాంతాలకు చెందిన సంగీత కళాకారులు ఈ తిల్లానాను తమ కచేరీలలో అంతర్భాగం చేసుకున్నారు.

సంగీతం దైవంతో ముడి పడి ఉన్నదానికి మరో నిదర్శనం తిల్లానాలు. ఎందుకంటే - సందేశంతో పాటు మనలను ఆనందం ఓలలాడించ గలిగే శక్తి దానిలో ఉంది. శబ్దం అమ్మ రూపమైతే లయ పరమశివుని ప్రతి రూపం. ఆ శబ్ద లయ విన్యాసమే తిల్లాన. బాలమురళీకృష్ణ గారి ఈ తిల్లానా విని ఆస్వాదించండి.




4, మార్చి 2016, శుక్రవారం

స్పూర్తిదాయక గీతాలు - మౌనంగానే ఎదగమని, కలకానిది విలువైనది


అపజయాలు, ఒత్తిళ్లు, కష్టాలు, పరాభవాలు, కుంగుబాట్లు, ఒంటరితనాలు, అన్యాయం జరిగిందన్న ఆవేశం, ఆక్రోశం...ఇలా మనిషికి నిజజీవితంలో ఎన్నో మనోవికారాలు. వాటి వల్ల జీవిత రథం దారి తప్పే అవకాశం ఉంది. ఇవన్నీ సహజమే, చాలా సార్లు ఎలా ఈ జీవితం అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడే కావాలి ప్రేరణ. ఒక్కసారి ఆలోచనలు అనే చీకటి గదిలోంచి బయటకు వెళ్లి చూస్తే ఈ కష్టాలు, బాధలు పడేది మనం ఒక్కళ్లమే కాదు అని అర్థమవుతుంది. సమాజంలో మనకన్నా కష్టాలలో ఉండి కూడా స్ఫూర్తితో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే వారిని చూస్తే ప్రేరణ కలుగుతుంది, ముందడుగు వేయాలన్న సంకల్పం చిగురిస్తుంది. ఎప్పుడైతే ఇవి దాటలేనివి, ఇవ నాకొక్కరికే వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అన్న ఆలోచనలు వస్తాయో ఆ క్షణమే సమాజం వైపు చూడాలి, అంతర్ముఖులం కావాలి.

ఈ మానసిక స్ఫూర్తికి ఆది మనలోనే. ఏదో ఒక దానిపై నమ్మకం ఉండాలి. అది దైవం కావచ్చు, గురువు కావచ్చు, ఇంకో వ్యక్తి కావచ్చు, లేదా స్వయం శక్తి కావచ్చు. చాలా సార్లు కష్టాల కడలి అనిపిస్తుంది. ఆ సమయంలో మనకు సనాతన ధర్మం అందించిన వాఙ్మయం తప్పకుండా తోడ్పడతాయి. అనాదిగా మానవ జన్మ ఎత్తిన ప్రతి వానికీ కష్టాలు తప్పలేదు. ఇది అవతార పురుషులైనా, యోగులైనా, మహాత్ములైనా...ఎవ్వరైనా సరే. వారు నమ్ముకున్న ధర్మం వారికి ఎలా ఈ సాగరాన్ని దాటడానికి సహాయ పడింది అన్నది మనకు రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు, భగవద్గీత స్పష్టంగా తెలిపాయి. రాముడి జీవితంలో ఎన్ని కష్టాలు రాలేదు? పాండవుల జీవితంలో ఎన్ని బాధలు? ధర్మమే వారికి బాసటగా నిలిచింది.

కలియుగ లక్షణమే అశాంతి, కల్లోలం, మోసం. కాబట్టి మానవునికి కష్టాలు దాటాలంటే మరింత స్ఫూర్తి, వ్యక్తిత్వ వికాసం, ధర్మము మరియు దైవంపై నమ్మకం కావాలి. స్ఫూర్తి మనలోనే కలగాలంటే కొంత కష్టమే. అందుకే ఓ గ్రంథమో, ఓ మహనీయుని చరిత్రో, ఓ చిత్రమో, ఓ కథో, ఓ గీతమో, లేకుంటే మరో వ్యక్తి సాంగత్యమో...ఇలా ఏదో ఒకటి స్ఫూర్తినిస్తుంది. బాధల్లో ఉన్న మనిషికి సంగీతం సాంత్వనను ఎందుకిస్తుందో తెలుసా? అది హృదయాన్ని తాకే కళ కాబట్టి, దైవం అందులో నివాసముంటుంది కాబట్టి. సంగీతానికి అక్షరం ప్రాణవాయువు. ఆ అక్షరం మనిషి మనోభావాలకు ప్రతిరూపం. అందుకే మన మనుసులోని భావాలను కవి అక్షరాలతో స్వరయుక్తంగా తాకితే వెంటనే స్పందన ఉంటుంది. అందుకే, మనోవికారాలతో మనం క్రుంగిపోతున్నప్పుడు భావయుక్తమైన గీతాలు మనలను ఉత్తేజపరచి వికారాన్ని కాస్త తగ్గిస్తాయి. అటువంటి రెండు గీతాలు మీకోసం.

1. మొదటిది నా ఆటోగ్రాఫ్ చిత్రంలో చిత్ర పాడిన మౌనంగానే ఎదగమని అన్న గీతం. ప్రేమలో దారుణంగా విఫలమైన ఒక యువకుడు దారుణంగా క్రుంగిపోతాడు. జీవించటం వ్యర్థం అన్న దిగులుతో హైదరబాదు వచ్చి తిండికి కూడా అవస్థ పడుతూ ఉంటాడు. ఆ సందర్భంలో అంధులచే ఒక సంగీత విభావరి ఏర్పాటు చేసి వారికి స్ఫూర్తిదాయకురాలైన ఒక యువతి పాడే పాట అతనికి మార్గదర్శకంవుతుంది. అతనిలో మార్పు మొదలవుతుంది. ఎటువంటి వైకల్యాలు ఉన్నా, ఆటుపోట్లు ఎదురైనా ముందుకు సాగమని ఉద్బోధిస్తుంది. మన తలరాతను మనం మార్చుకోవచ్చన్న అద్భుతమైన సత్యాన్ని తెలుపుతుంది. ఎక్కువ ఆర్భాటాలు లేకుండ ఎదగటం, ఎదిగిన కొద్దీ వినయంతో మెలగాలని చెబుతుంది. అపజయం కలిగితే క్రుంగిపోరాదని ఋతువుల సమయంలో ఆకులురాలిన చొటే కొత్త చిగురు వస్తుంది అన్న సారూప్యంతో మనలకు ధైర్యాన్నిస్తుంది. మజిలీ చేరటానికి ఎంతో దూరం అన్నదాని గురించి ఎక్కువ ఆలోచించంకుండా ఎన్నోదారులున్నాయి అని ఆలోచిస్తే మంచిందని సలహా ఇస్తుంది. యుగయుగాలుగా మనకు తెలుస్తున్న సత్యం - ఏ బాధ కూడా శాశ్వతం కాదు. తప్పకుండా తిరిగి చిరునవ్వు నవ్వే రోజు వస్తుంది. ఏ గొప్ప పని మొదలు పెట్టినా మొదట ఎన్నో అవరోధాలు వస్తాయి. కానీ, వాటికి భయపడక ముందుకు సాగాలి. విశ్వకళ్యాణానికి చేసిన సాగరమథనంలో తొలుగ గరళమే పుట్టింది, తరువాతే అమృతం. అలాగే ప్రతి మంచిపనికి ముందు విఘ్నాలుంటాయి, తరువాతే విజయం. కష్టాలు దాటితే ఆనందమనే నిధి మనం సొంతమవుతుంది. ఇది జీవిత సత్యం అని పలుకుతుంది. నుదుటి రాతలు, చేతి గీతలు అన్నీ మన ప్రయత్నంతో మార్చ వచ్చు. కావలసింది శ్రమ, ధైర్యం. అటువంటి ధీర శ్రామికుల ముందు విధి కూడా తలవంచుతుంది, దైవం వారిని అనుగ్రహిస్తుంది. ఆ విధంగా ముందుకు సాగి చరిత్రలు రాయాలి అని హితవు పలుకుతుంది.

గీతం మనలోని బలహీనతలను పక్కకు పెట్టి, శక్తులకు జీవం పోసి మనకు మంచి ప్రేరణనిస్తుంది. మానవ జన్మ అన్న తరువాత ఏదో ఒక లోపం తప్పదు. ఆ లోపాలను అధిగమించి స్వశక్తులై ముందుగు సాగించటానికి ఇలాంటి గీతాలు ఎంతో ఉపయోగపడతాయి. చంద్రబోస్ గారు ఇటువంటి గీతం ఒక మంచి సందేశాత్మక చిత్రమైన నా ఆటోగ్రాఫ్‌లో అందించటం మన అదృష్టం. కీరవాణి గారి సంగీతం కూడా సందేశానికి సముచితంగా ఉంటుంది. చిత్ర గారి గానం దానికి శాశ్వతత్వాన్ని ఆపాదించింది.

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది

అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలినచోటే కొత్త చిగురు కనిపిస్తుంది.


దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగరమథనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమొచ్చింది.
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది
తెలుసుకొంటే సత్యమిది
తలచుకుంటే సాధ్యమిది

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో
మారిపోని కథలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే వ్రాయాలి
మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి

2. రెండవ గీతం వెలుగునీడలు చిత్రంలోని శ్రీశ్రీ గారి రచన "కలకానిది విలువైనది" అనే గీతం. మనిషికి ఎన్ని రకాల కష్టాలో? చిత్రంలో నాయికకు వివాహం చేసుకున్న కొన్నాళ్లకే భర్త యాక్సిడెంటులో మరణిస్తాడు. తీరని దుఃఖంలో జీవితం దుర్భరమయమనే భావనలో నలిగిపోతున్న ఆమెకు స్నేహితుడు ఈ గీతం ద్వారా సాంత్వననిచ్చి ఆమెలో మళ్లీ జీవించాలన్న సంకల్పాన్ని కలిగిస్తాడు. డాక్టర్ వృత్తిలోకి తిరిగి ప్రవేశించేలా చేస్తాడు. భార్యా భర్తలలో ఎవరు ఇలా అకాల మరణం చెందినా ఉన్న వారికి వర్ణించలేని వ్యథే. కానీ, అది వారు కోరి తెచ్చుకున్నది కాదు. అలాగే జీవితాంతం నిరర్థకంగా ఆనందానికి దూరంగా ఉండటం కూడా సరి కాదు. జీవిత భాగస్వామి మరణించినా కుటుంబం, సమాజం, దేశం పట్లా బాధ్యతలున్నాయి. ఆయుష్షు ఉన్నంత కాలం సకారాత్మక ధోరణితో జీవించాలి, ఏదో ఒకటి సాధించాలి. అన్నది ఈ గీతం సందేశం. కలకాదు, బ్రతుకు ఎంతో విలువైనది, దానిని కన్నీళ్లతో వృథా చేయకు అని చెబుతుంది ఈ గీతం. దానికి సారూప్యంగా, గాలి వీచినప్పుడు పూల తీగ నేల కూలితే దానిని అలానే వదిలేస్తామా? మృదువుగా నిలబెట్టి నీళ్లు పోసి మళ్లీం జీవం పోయమూ? జీవితం కూడా అంతే. అకాల మరణమనే పెనుగాలి వస్తే అంతటితో జీవితాన్ని ముగించకూడదు. మళ్లీ నిలబెట్టాలి. చీకటిలోనే అలమటించటమెందుకు? కలతలకు లొంగి మానసిక స్థైర్యాన్ని కోల్పోయి కవరించటం ఎందుకు? సాహసమే జ్యోతిగా చేసుకొని ముందుకు సాగాలి అని ఎంతో అద్భుతంగా చెబుతుంది. సముద్రపు లోతుల్లో ఆణిముత్యాలు ఉన్నట్లు శోకాల సముద్రం చాటున సుఖము కూడా ఉంది. జీవితంలో ఏదీ కూడా మన దగ్గరికి రాదు. మనమే కష్టపడి సాధించుకోవాలి అని ఒక దిశను నిర్దేశిస్తుంది.

శ్రీశ్రీగారు ఎంతటి ఉదాత్తమైన గీతాన్ని అందించారో సాహిత్యం చూస్తే అర్థమవుతుంది. యోగ్యత ఉన్న కవి హృదయం నుండి వెలువడే అక్షర సత్యాలు ఇవి. ఘంటసాల మాష్టారు భావ సౌందర్యం ప్రకాశించేలా అద్భుతంగా గానం చేశారు. పెండ్యాల వారి సంగీతం , ఏఎన్నార్ సావిత్రిల నటన ఈ పాటను సంపూర్ణం చేసి అత్యుత్తమ గీతాలలో ఒకటిగా నిలిపాయి.

కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనె బలి చేయకు
కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనె బలి చేయకు

గాలి వీచి పూవుల తీగ నేల వాలి పోగ
జాలి వీడి అటులేగాని వదులవైతువా
చేర దీసి నీరు పోసి చిగురించ నీయవా

అలముకున్న చీకటిలోనె అలమటించనేల
కలతలకే లొంగి పోయి కలువరించనేల
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో

అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఏది తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీర గుణం


మడిసి అన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా చెప్పండి!. శోకం, మానసిక వ్యధ, ఆందోళన, కన్నీళ్లు ఇవన్ని అందరికి ఎప్పుడోకప్పుడు వచ్చేవే. మరి అప్పుడు ఏమిటి చెయ్యటం?.  ఏమి చెయ్యొచ్చో అన్నదానికి ఈ పాటలు మంచి ఉదాహరణలు . పాజిటివ్ ఆలోచనలతో పోరాడమని వీటి సారాంశం. ఎందుకంటే అనుకూల (పాజిటివ్) ఆలోచనలు వ్యతిరేక (నెగటివ్)  ఆలోచనల కన్నా చాలా బలమైనవి. కొన్ని అనుకూల ఆలోచనలతో ఒక వ్యతిరేక ఆలోచనను పోరాడటం దీనిలో మొదటి మెట్టు. రెండోది - ఉన్న పరిస్థితిలోంచి బయటకు ఎవ్వరు లాగలేరు. అది మనం అడుగు వేస్తె తప్ప అవ్వని పని. అడుగు వెయ్యటానికి, ఆలోచనలు రావటానికి పక్కనవాళ్ళు సాయపడగలరు.

ఆశ వదలకుండా ఒక అడుగు అనుకూల ఆలోచనతో వేస్తె అక్కడ తప్పకుండా మనకున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందుకనే మన పెద్దలు అన్నారు - సమస్య ఉంటే పది మందితో చెప్పుకోవాలిరా అని. దాని అర్థం సానుభూతి పొందటానికి కాదు - కష్టంలో ఉన్న మనిషి యొక్క మానసిక పరిస్థితి అడుగు ముందుకు వేసే ఆలోచనలను రానివ్వకపోవచ్చు. అలాంటప్పుడు నలుగురితో కలిసి, మాట్లాడితే - కొత్త ఆలోచనలు మన మనస్సులోకి వెళ్లే అవకాశం ఎక్కువ. అలాగే, నలుగురుతో మాట్లాడితే మనకున్న సమస్యకన్నా ఇంకా పెద్ద సమస్య కనిపించొచ్చు. అప్పుడు మన సమస్యను 'ఆ ఇది చాలా చిన్నది, నన్నేమి చెయ్యలేదు, పాపం వాళ్ళు ఇంకా ఎంత పెద్ద భవసాగరంలో ఉన్నారో' అని కొట్టి పారేసే అవకాశం వస్తుంది. అంటే - ఒక అనుకూల ఆలోచన మొదలయ్యినట్టే కదా? అది చాలు సమస్యను పూర్తిగా అధిగమించటానికి.

మరి కష్టాలు దాటడానికి సాధనాలు ఏమిటి? 1. ముందడుగు వేసే ధైర్యం - ఇక్కడ మనకు ఆ పరిస్థితిలో ధైర్యం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మన చుట్టూ ఉన్న వ్యవస్థను ఆశ్రయించాలి - కుటుంబం, బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, గురువులు, తోటి పనివారు, పుస్తకాలు.  కానీ మొట్టమొదటి అడుగు మనమే వెయ్యాలి. పక్కవాళ్ళు వేయించారు అని అనిపించినా అది మన మనస్సు చెప్పనిదే జరగదు. 2. పరిష్కారం ఉంది అనే నమ్మకం, భగవంతుడు ఎప్పటికీ మనల్ని ఇలానే ఉంచడు అన్న విశ్వాసం.

గీతలో కృష్ణ పరమాత్మ, శంకరాచార్యుల వారు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు....ఇలా ఎందరో మనకు కష్టమయమైన జీవితాన్ని ఎలా సాగించాలో చక్కగా బోధించారు.  ఈ రెండు గీతాలు కూడా ఆ కోవకు చెందినవే . ఈ రెండు గీతాలు అప్పుడప్పుడూ వింటూ ఉంటే జీవితంలో మనం దిగులుతో కుంగిపోకుండా, మనకు వచ్చే సమస్యలను అధిగమిస్తూ ఖచ్చితంగా ముందుకు  సాగిపోతాము. 


3, మార్చి 2016, గురువారం

నిను కొలుచును ఈ జగమంతా - హనుమద్భక్తి గీతం


హనుమంతుడు అనగానే స్వామి భక్తి, అసమాన్య వీర పరాక్రమాలతో పాటు వినయము, జ్ఞానము, బుద్ధి కుశలత, సమయ స్ఫూర్తి గుర్తుకు వస్తాయి. అన్నిటికన్నా రామభక్తే ముందు నిలుస్తుంది. ఎందుకంటే, అదే ఆయనకు భృతి, ద్యుతి మరియు గతి. ఆయనకు వేరే తలపు లేదు. వేరే పని లేదు. అంతా స్వామికే, అన్నీ ఆయన కొరకే.  ఎంతటి పరాక్రమ సంపన్నుడైనా తనకు అన్నీ స్వామి అనుగ్రహం వలనే అన్నది ఆయన తత్త్వం. అందుకే, ఆయన ఎన్ని అవరోధాలు వచ్చినా ఎంతో  దుర్గమమైన కార్యాలను సాధించాడు. స్వామిపై పరిపూర్ణమైన నమ్మకంతో సాగరాన్ని దాటి, లంకను  ఛేదించాడు. ఎక్కడో హిమాలయాలలో ఉన్న సంజీవనిని తెచ్చి లక్ష్మణునికి పునరుజ్జీవుని చేశాడు.  

హనుమంతుడు రామనామ స్మరణతో నిరంతరం రోమాంచకుడై   ఉంటాడు . మరి రామభక్తిలో ఉన్న మహిమ మనకు తెలిసినదే. అందుకే త్యాగరాజస్వామి రోమాంచమనే ఘన కంచుకము, రామభక్తుడనే ముద్రబిళ్ల, రామనామమనే వరఖడ్గము - వీటిని రాముని బంటుయైన హనుమంతుని ఆయుధాలుగా చెప్పారు. రామనామస్మరణతో రోమాంచమైన శరీరము అత్యంత దృఢమవుతుంది అన్నదానికి హనుమంతుడు ప్రత్యక్ష ఉదాహరణ. అలాగే ఆ రాముని నామమే ఆయనకు అత్యంత శక్తివంతమైన ఆయుధం, రామభక్తే హనుమంతుని  చిరునామా! మరి హనుమంతుడు ఎక్కడ ఉంటాడు? రాముని కొలిచే ప్రతి చోటా... 

యత్ర  యత్ర  రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం 
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత  రాక్షసాంతకం 

రాముని కీర్తించే ప్రతి చోటా తలవంచి నమస్కరిస్తూ, కన్నులలో ఆనందబాష్పాలు నింపుకొని ఉంటాడు ఆ హనుమంతుడు. హనుమద్భక్తులలో ఉండే ఒక గొప్ప లక్షణం ఎంతటి కష్టాన్నైనా ఆ రామబంటుపై నమ్మకంతో దాటగలిగే  ఆత్మస్థైర్యం. అలాగే,  వీరు రామభక్తి సామ్రాజ్యంలో  సంపాదించుకునే ప్రయత్నంలో నిరంతరం ఉంటారు.  విశేషమేమిటంటే, హనుమను  కాపాడుతాడు, రాముని తలచితే హనుమ  అండగా ఉంటాడు.

పాలగుమ్మి విశ్వనాథం గారు తెలుగు గడ్డపై  పుట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతకారునిగా, రచయితగా  ఆయన అందించిన సేవలు ఎనలేనివి. లలిత సంగీత జగత్తులో వారి స్థానం అనుపమానమైనది. 15 వేలకు పైగా గీతాలకు సంగీతం అందించి 100కు పైగా గీతాలు రచించారు ఆయన.  ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో దశాబ్దాల పాటు లలితా సంగీత కళామ తల్లికి సేవ చేశారు. లలిత సంగీత స్వర్ణయుగంలో బాలాంత్రపు  గారితో సమానంగా  విశ్వనాథం గారు తెలుగు సంగీత  ప్రపంచానికి వెలుగు తెచ్చారు. దేవులపల్లి కృశ్ణశాస్త్రి గారు, దాశరథి గారు, అబ్బూరి రామకృష్ణగారు మొదలైన గొప్ప రచయితల సాహిత్యానికి సంగీతం కూర్చారు. బాలమురళీకృష్ణగారు, ఎమ్మెస్ రామారావు గారు, చిత్తరంజన్ గారు, వేదవతీ ప్రభాకర్ గారు, కేబీకే మోహన్ రాజు గారు మొదలైన గాయకులకు తన సంగీతం ద్వారా ఎంతో  పేరు తెచ్చిపెట్టారు. ఆయన మంచి గాయకులు కూడా.

పాలగుమ్మి వారి సాహితీ రచనలలో నా చిన్నతనంలో ఆకాశవాణిలో వచ్చిన ఈ హనుమంతుని పాట మా ఇంట్లో అందరం పాడుకునే వాళ్లం.  సత్సంగంలో దీనిని భక్తితో ఆలపించే వారు. రచనను పరిశీలిద్దాం.

నిను కొలుచును ఈ జగమంతా నను మరువకుమో హనుమంతా!

రామచంద్రుని కొలువు దొరికెనట రామనామమే దారిబత్తెమట
రాత్రింబవలు రామ ధ్యానమట రామభక్తి సామ్రాజ్యపు దొరవట

రామకీర్తనమే చెవులబడినయే అడుగులు కదలక ఆగిపోదువుట
అరమోడ్పు కనులతో అంజలి ఘటించి అన్నీ మరచి నర్తించెదవట

శ్రీపాద ధూళి శిరసున దాలిచి శతయోజనముల సంద్రము దాటి
సీతామాత సేమమే అరసి శ్రీరామచంద్రుని ఓదార్చితివట

అయోధ్య రాముని అంతరంగమన స్థిరముగ నెలకొన్న హనుమంతా!
ప్రభువుకు మా మనవులందించుమన్నా ఆస్వామి నీ మాట కాదనడన్నా!

- పాలగుమ్మి విశ్వనాథం గారు

ప్రపంచమంతా నిన్ను కొలుస్తుంది. నన్ను మరువకుము అని కవి ప్రార్థిస్తున్నారు. హనుమంతుని వృత్తి ఏమిటి? రాముని సేవ. రాముని నామమే ఆయనకు దారి మరియు భృతి అట.  నిరంతరం రామ ధ్యానమట. ఆ రామ భక్తి  సామ్రాజ్యానికి హనుమంతుడు దొర  అట. నిజమే, ఎందుకంటే హనుమను మించిన రామ భక్తుడు లేడు.  

ఆ రాముని కీర్తన చెవులకు వినబడగానే హనుమంతుని అడుగులు ఆగిపోతాయట. అరమోడ్పు కనులతో స్వామికి అంజలి సమర్పించి, అన్నీ మరచిపోయి నర్తిస్తాడట. నిజమే, హనుమంతునికి రామనామ కీర్తన కన్నా సంతోషకరమైనది ఏముంది?  

స్వామి పాదధూళిని శిరసున దాల్చి నూరు యోజనాల దూరాన ఉన్న లంకకు చేరి సీతమ్మ క్షేమ సమాచారం తెలుసుకొని స్వామిని ఓదార్చాడట. నిజమే, స్వయంగా రాముడే నీవంటి సేవకుడు, భక్తుడు లేడు అని పలికాడు. అంతటి కార్యం చేసిన హనుమను రాముడు ఆలింగనం చేసుకొని ఆశీర్వదించాడు. 

రాముని తన హృదయమున నిలుపుకున్నాడు హనుమంతుడు. ఆ ప్రభువుకు మా మానవులు వినిపించు హనుమంతా! ఆయన నీ మాట కాదనడు అని కవి అద్భుతంగా వేడుకుంటున్నారు. నిజమే, బంటు అంతరంగములో ఉన్నాడు స్వామి, బంటుకు సంపూర్ణ అనుగ్రహం అందించాడు స్వామి. మరి మనం ఆ రామబంటుకు  అర్జీ  పెట్టుకుంటే స్వామి తప్పక అనుగ్రహిస్తాడు. 

పాలగుమ్మి వారు ఈ గీతాన్ని లలితమైన అచ్చ తెనుగు పదాలతో రచించి అంటే మధురమైన సంగీతాన్ని అందజేశారు . ఆయనే స్వయంగా పాడారు కూడా.  ఆయనలోని హనుమద్భక్తి గీతంలోని ప్రతి అక్షరంలోనూ గోచరిస్తుంది. స్వచ్ఛత, శరణాగతి, చనువు, హనుమంతుని తత్త్వ జ్ఞానం కలిగి పాలగుమ్మి వారు ఈ రచన చేశారు. అందుకే, ఇన్నేళ్లైనా ఈ పాట ఇప్పటికీ రామ-హనుమల బంధాన్ని ఆవిష్కరిస్తూ, హనుమద్భక్తి వైభవాన్నిహృద్యంగా చాటుతూనే ఉంది. పాలగుమ్మి వారి ప్రతిభకు, వ్యక్తిత్వానికి, శుద్ధ అంతఃకరణానికి  ఈ గీతం నిలువుటద్దం.

2, మార్చి 2016, బుధవారం

కూచిపూడి నృత్యాంశం - దశావతారం


పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఈ తత్త్వాన్నే భాగవతంలో వ్యాస భగవానులు మనకు అనేకావతారముల వర్ణనతో వివరించారు. భగవంతుని అవతారములలో దశావతారములకు ప్రాముఖ్యత ఉంది. చెడు విపరీతమై పోయినప్పుడు ఆయా కాలమాన పరిస్థితులకు అనువైన అవతారం ఎత్తి దుష్ట శిక్షణ చేశాడు పరమాత్మ. వేదోద్ధరణ, సమస్త కామ్యముల సిద్ధికి క్షీర సాగర మథనం, హిరణ్యకశిపు బారినుండి భూమిని కాపాడటం కోసం, హిరణ్యాక్షుని దాష్టిణ్యాలను అణచటానికి నారసింహావతారం, బలిమర్దనానికై వామనావతారం, అధర్మానికి పాల్పడుతున్న క్షత్రియులను వధించటానికి పరశురామునిగా, రావణుని చంపటానికి రామావతారం, కౌరవులతో పాటు ఎందరో రాక్షస ప్రవృత్తి గలవారిని సంహరించటానికి బలరామ, కృష్ణావతారములుగా, కలియుగంలో అకృత్యములు మితిమీరినప్పుడు దుష్టశిక్షణకై కల్కిగా పరమాత్మ అవతరించాడు.

దశావతారాలను వర్ణిస్తూ ఎంతో మంది అద్భుతమైన గేయాలను, కీర్తనలను రచించారు. అన్నమాచార్యుల మొదలు ఇటీవలి వరకు ఎన్నో రచనలు వచ్చాయి. అందులో నాట్య శాస్త్రానికి అనువుగా గుంటూరు జిల్లా పెదపులివర్రు గ్రామానికి చెందిన సిద్ధాబత్తుల రంగదాసు గారు రచించిన ఈ దశావతార శబ్దం చాలా ప్రాముఖ్యత పొందింది. వెంపటి వారు, వేదాంతం వారు కూచిపూడి సాంప్రదాయంలో ఈ దశావతార శబ్దాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చారు. అద్భుతమైన స్వరములతో, సాహిత్యంతో మోహన రాగంలో ఈ గీతం కూర్చబడింది. మొదట శ్లోకం జయదేవుడు రచించిన గీతగోవిందంలోనుండి తీసుకొనబడింది. లయబద్ధంగా సాగే ఈ శబ్దంలో అద్భుతమైన తెలుగు పదప్రయోగం జరిగింది. పెదపులివర్రు గ్రామంలో వెలసిన వరదరాజస్వామి వారిపై రంగదాసు గారు ఈ కృతిని రచించారు.

దశావతార వర్ణన భారతీయ సంగీత నాట్య విద్యలలో చాలా ప్రముఖమైన స్థానం ఉండటానికి కారణం ఆయా అవతారముల విలక్షణ జన్మ లక్ష్యాలు. ఈ విలక్షణత వలన వాటి వర్ణన సంగీత నాట్య కళలలో కూడా మరింత వైవిధ్యభరితంగా చేయవచ్చు. కూచిపూడి నాట్య శాస్త్రంలో దశావతార అద్భుతమైన వర్ణనకు గొప్ప అవకాశం ఉంది. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క లీలను వివరిస్తూ నర్తించవచ్చు. తద్వారా ఆ అవతార లక్ష్యాన్ని ప్రభావవంతంగా అందించవచ్చు. ఈ అవకాశాన్ని కూచిపూడి నాట్యగురువులు చాలా చక్కగా వినియోగించుకున్నారు. అందుకే దశావతార నృత్య ప్రదర్శనలు బహుళ ప్రాచుర్యం పొందాయి. వేదాంతం వారు, వెంపటి వారు తమ శిష్య పరంపరలో ఈ దశావతర  నాట్య శైలిని అందంగా తీర్చి దిద్దారు.

దక్షిణ భారత నాట్య సాంప్రదాయాలలో భరత నాట్యం మరియు కూచిపూడిలలో ప్రత్యేకమైన శబ్దాలతో లయ ప్రాధాన్యమైన నట్టువాంగానికి చాల ముఖ్యమైన స్థానం ఉంది. సాహిత్యానికి ముందు నట్టువాంగంలో కళాకారులు తమ ప్రతిభను ప్రయోగాల, పరిశోధనల ద్వారా మరింత మెరుగు పరచుకునే అవకాశం ఉంటుంది. నట్టువాంగానికి మంచి సాహిత్యం తోడైతే, దానికి తగిన ఆహార్యం, అభినయం కలిపితే ఆ నృత్య ప్రదర్శన ప్రేక్షకుల మనసును దోచుకుంటుంది. అటువంటి అంశమే ఈ దశావతారం.

మహంకాళి మోహన్ గారు ప్రసిద్ధ కూచిపూడి నాట్య గురువులు. వారు నట్టువాంగం అందించిన ఆడియో. దశావతార ప్రదర్శన వీడియోలు యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. మంజుభార్గవి గారి ప్రదర్శన బాగుంది, కానీ వీడియో క్వాలిటీ సరిగా లేదు. వీర నరసింహరాజు గారి సౌజన్యంతో ప్రముఖ నాట్యాచార్యులు  వేదాంతం రాఘవయ్య గారి దశావతార నాట్యం చూడండి. అలాగే నాట్య మయూరి తెలుగు సినీ జగత్తులో మెరుపువేగంతో శాస్త్రీయ సంగీతం చేసిన ఎల్  విజయలక్ష్మిగారు సతీ సుమతి చిత్రంలో రాగమాలికగా చేసిన అద్భుతమైన దశావతార నృత్యం  చూడండి.

సాహిత్యం:

వేదానుద్ధరతే జగన్నివహతే భూగోళముద్భిభ్రతే
దైత్యం దారయతే బలిం ఛలయతే క్షత్రక్షయం కుర్వతే
పౌలస్త్యం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే
మ్లేచ్ఛాన్మూర్ఛయతే దశాకృతికృతే కృష్ణాయ తుభ్యం నమః

తక్కధింత తాహత ధీనుత తద్ధీనుత తాహతణాంత
తఝంతరిత తఝం ఝంతరిత తఝం తరిత ఝంతకు రేకిణ 
తడికు డిడికు డిడిడికు డింకు తడికు డిడికు డిడిడికు డింకు
తక్కిణణక తక్కుంతరికిణణక తక్కిణణక తక్కుంతరికిణణక 
తక్కుత ధిక్కుంత ధిక్కుంతరి తక్కుంతక

మత్సరమున మరి అంబుధిలో జొచ్చియున్న సోమకు ద్రుంచియు
విచ్చలవిడి వేదములజునకు ఇచ్చితివో మత్స్యావతారా!

తధనుఝణుత ధిమికిట ఝంతరి తాహత ఝణు ఝణఝణుత ఝణు
తఝ్ఝణుతా తక్కధితక్కుంతరి తఝ్ఝణుతా తక్కధితక్కుంతరి

పలుమరు మిము ప్రస్తుతి చేయుచు చెలగి సురలు జలధి మదింపగ
కలిమి బలిమి యెలమితో నొసగిన కులగిరిధర కూర్మావతారా! 

తధన ఝణుత ధిమికిట ఝంతరి  తాహత ఝణు ఝణఝణుత ఝణు
కుక్కుంతరికిట తరికిట కిట తక కుక్కుంతరికిట తరికిట కిట తక

స్థిరముగ ధరనురవడి చేకొని ఉరగపథంబిరువుగ జొచ్చిన
హిరణ్యాక్షు బరిమార్చితివో వర సుగుణా! వరాహరూపా!

తధన ఝణుత ధిమికిట ఝంతరి  తాహత ఝణు ఝణఝణుత ఝణు
తంథంథన తాణుతఢీంకుకు తంథంథన తాణుతఢీంకుకు

జంభారి సుర ప్రముఖ కదంబంబును రక్షింపంగ 
స్థంబంబున వెడలియు దానవఢింబకు గాచితివో నరసింహా!

తధన ఝణుత ధిమికిట ఝంతరి  తాహత ఝణు ఝణఝణుత ఝణు
తత్తణాంత తాహత ధీణుత తత్తణాంత తాహత ధీణుత

మానితముగ ముల్లోకంబుల తానొప్పుగ కాపాడంగ 
మానుగ మూడడుగులు బలిచే దానముగొను వామనరూపా

తధన ఝణుత ధిమికిట ఝంతరి  తాహత ఝణు ఝణఝణుత ఝణు
తరితతరిత ద్రుడుతత్తతకిట తరితతరిత ద్రుడుతత్తతకిట

తరమి తరమి ధరణీ పతులను పరశువుచే దునుమాడితివో
వర వీర పరాక్రమమున ధర పరగితివో భార్గవరామా 

తధన ఝణుత ధిమికిట ఝంతరి  తాహత ఝణు ఝణఝణుత ఝణు
తక్కుంతరిత రుంతకు రేకిణ తక్కుంతరిత రుంతకు రేకిణ

దశరథ తనయుడవై సురలకు వశముగాని దశముఖు త్రుంచియు
విశదముగా అయోధ్యకు సీతతో వేంచేసితివో రఘురామా

తధన ఝణుత ధిమికిట ఝంతరి  తాహత ఝణు ఝణఝణుత ఝణు
జగజగణపు జగణపు రేకిణ జగజగణపు జగణపు రేకిణ

యాదవ వంశాబ్ధి సుధాకరు ఆదిదేవుడనుజుడు కాగా
మోదమొసగి ఖలులను త్రుంచియు మేదిని భరముడిపిన బలరామా

తధన ఝణుత ధిమికిట ఝంతరి  తాహత ఝణు ఝణఝణుత ఝణు
తాకుధణకు తఢీంకు డేకు తాకుధణకు తఢీంకు డేకు

అంగనలకు సిగ్గలడలింపగ అంగజ సమ రూపముతో
రంగుగ పురకాంతల వ్రతములు భంగ పరచు బుద్ధావతారా

తధన ఝణుత ధిమికిట ఝంతరి  తాహత ఝణు ఝణఝణుత ఝణు
కిటకిటడక కిర్రటకిటడక కిటకిటడక కిర్రటకిటడక

కాటపు కలి బాధలు మాన్పగ నీటుగ కరవాలము జేకొని
ఘోటకమున యెక్కి దురాత్ముల గీటడచిన కల్క్యావతారా

తధన ఝణుత ధిమికిట ఝంతరి  తాహత ఝణు ఝణఝణుత ఝణు
జగకుణగకు జేజే జగకు జగకుణగకు జేజే జగకు

సురల్ మేలు మేలని పొగడగ నిరతము నీ దాసుల బ్రోవను
పరగ వ్యాఘ్రపురమున వెలసిన వరదరాజదేవా ఆశ్రిత సురభోజా పరాక్

1, మార్చి 2016, మంగళవారం

మాయాబజార్‌లో తత్త్వ బోధ


కళాఖండాలైన చిత్రాలలో వినోదం మరియు సాంకేతిక విలువలతో పాటు మానవజాతికి మంచి సందేశం కూడా ఉండేది. అటువంటి చిత్రాలలో మాయా బజార్ ఒకటి. 1957లో విడుదలైన ఈ చిత్ర కథాంశం పూర్తిగా కల్పితేమే అయినా ఆద్యంతం మనలను మంత్రముగ్ధులను చేయటానికి కారణం చిత్రీకరణ, నటన, సంగీతంలతో పాటు కథలోని సందేశం కూడా. శశిరేఖను అభిమన్యుడు పెళ్లాడటానికి ఘటోత్కచుడు చేసే మాయాజాలం పూర్తిగా కలిపితమే. మహాభారతంలో ఈ ఘట్టం లేదు. అయినా, ఈ చిత్రం చూస్తే ఏ మాత్రం కల్పితం అన్న భావన రాదు. అందుకు కారణం ప్రతి సన్నివేశం కూడా మనలను హత్తుకునేలా సంభాషణలు, సెట్టింగ్స్ మరియు వేషభూషలతో చిత్రీకరించటం వలన.

ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఘటోత్కచుడు ద్వారకలో ఉన్న శశిరేఖను అపహరించి తన రాజ్యానికి తీసుకువెళ్లటం, తదుపరి తాను ఆ శశిరేఖగా నటించటం. ఘటోత్కచుడు ద్వారక ప్రవేశించే సమయంలో అతనిలో తాను ఏదైనా సాధించగలను అన్న ఆత్మవిశ్వాసం కాస్త మితిమీరుతుంది. అతని ఉత్సాహాన్ని అదుపులో ఉంచటానికి కృష్ణ పరమాత్మ ముసలి తాత రూపంలో కూర్చొని అతనిని పరీక్షిస్తాడు.  కార్య సాధనలో నేను చేయగలను అన్న ఆత్మ విశ్వాసంతో పాటు, అది పరమాత్మ అనుగ్రహంతో చేస్తున్నాను అన్న కృతజ్ఞత, జ్ఞానం ఉంటే పరమాత్మ ఆ కార్యాన్ని సఫలం చేస్తాడు. ఎప్పుడైతే నా వల్లనే జరుగుతుంది, నేనే దీనికి కర్తను అన్న భావన మనసులో ప్రవేశిస్తుందో అప్పుడు భంగపాటు తప్పదు. ఆ తత్త్వాన్ని విశదంగా తెలియజేటానికే ఈ సన్నివేశాన్ని సృష్టించారు దర్శకులు కేవీ రెడ్డి గారు. పింగళి నాగేంద్రరావు గారి సంభాషణలు మనకు అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తాయి. వివరాలు:

తాత:

చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ
చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ

అటు ఉన్నది ఇటు లేదు ఇటు ఉన్నది అటు లేదు
అటు ఉన్నది ఇటు లేదు ఇటు ఉన్నది అటు లేదు
అటు నేనే ఇటు నేనే అటు నేనే ఇటు నేనే
చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ

చిన చేపను పెద చేప చినమాయను పెనుమాయ
చిన చేపను పెద చేప చినమాయను పెనుమాయ
అది స్వాహా ఇది స్వాహా అది స్వాహా ఇది స్వాహా
చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ

ఎరుకకుండ వచ్చావు ఎరుకలేక పోతావు
ఇది వేదం ఇదె వేదం ఇదె వేదం ఇదె వేదం

ఘటోత్కచుడు: "ఏయ్ తాతా? నీ వేదం బాగానే ఉంది కానీ, అసలు నువ్వెవరివో చెప్పు"

తాత: "ఓహోహోహోహో నీవా? నీకు తెలియదూ నేనెవరినో?"

ఘటోత్కచుడు:"తెలియకనేగా అడిగేది"

తాత: "తెలియని వానికి చెప్పినా తెలియదు"

ఘటోత్కచుడు:"ఏయ్ తాతా! నీ కుతర్కం చాలించు. నువ్వెవరివైతే నాకేమిలే! చూడు...శశిరేఖ అనే చిన్నది ఎక్కడుందో కాస్త చెప్పు"

తాత:"హాయ్ హాయ్ నా సాయం కోరుతూ నన్నే అదిరిస్తున్నావ్? పేరు చెప్పి శరణు కోరి బుద్ధిగా అడుగు చెబుతాను."

ఘటోత్కచుడు:"ఏయ్ తాతా! ఏమనుకున్నావ్? జాగ్రత్త. నాకాగ్రహమొస్తే ఆగను. నిన్ను నీ ద్వారకను సముద్రంలో ముంచి పోతాను."

తాత:"అబ్బో అబ్బో అంత ఘనుడివా? చెప్పవేం మరి? అయితే, నువ్వు అంత పని చేయనక్కరలే. నేను ముసలి వాడిని.  నడవలేను. నన్ను మోసుకొని పో. అలాగే శశిరేఖను చూపిస్తా."

ఘటోత్కచుడు: "ఉం. అలా రా దారికి. హ హ లే."

తాత:"చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ"

ఘటోత్కచుడు:"అరే! ఇంత బరువున్నావే!"

తాత:"ద్వారకనే పెళ్లగిస్తానంటివే? మరి నన్నే ఎత్తలేవా?"

ఘటోత్కచుడు:"హుం హా"

తాత:"హు హు హు హు హు హు ఎత్తు నాయనా ఎత్తు.."

ఘటోత్కచుడు:"ఊ.. ఏనుగులు మింగావా పర్వతాలు ఫలహారం చేశావా ఏమిటి నీ మాయ?"

తాత:"చిన మాయను పెను మాయ అది స్వాహా ఇది స్వాహా అటు నేనే ఇటు నేనే అది నేనే ఇది నేనే"

ఘటోత్కచుడు:"ఓహోహోహోహో తెలిసింది తెలిసింది..నమో నమో నమో నమో నమో నమః నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమః"

కృష్ణుడు: "చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ"

ఈ సంభాషణలను నిశితంగా పరిశీలిద్దాం.

ఆశీర్వచనంతో ప్రారంభించిన కృష్ణ పరమాత్మ మాయ, పరమాత్మ తత్వాలను నేరుగా ఆవిష్కరిస్తాడు. మాయ తన సృష్టే అని, కనిపించేది, కనిపించనిది, మన దగ్గర ఉన్నది దూరాన ఉన్నదీ అన్నీ తానే, అన్నీ తన లీలలే అని ఆయన చెబుతాడు. చిన్న మాయను పెద్ద మాయ చిన్న చేపను పెద్ద చేప మింగినట్లు మింగేస్తూ ఈ ప్రపంచమంతా మాయలో నడుస్తుందని ఆయన సనాతన ధర్మ ఆధ్యాత్మిక సారాన్ని అందించాడు. మాయలో నేను, నా వలన అన్న భావనలో, తాడును చూసి పాము అనుకునే భ్రాంతిలో మనిషి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఇదంతా లీలగా ఆయన చూస్తుంటాడు. తెలియకుండానే పుడతాము. తెలియకుండానే పోతాము. అంటే ఈ శరీరానికి సంబంధించిన జనన మరణాలతో మేధకు సంబంధం లేకుండా కాలచక్రం సాగిపోతుంది. అందులో అన్నిటికీ అతీతంగా ఉండేది పరమాత్మ ఒక్కటే. అతీతమైన ఆయన అన్నిటికీ సృష్టికర్తగా చెప్పబడ్డాడు.

మరి ఎదురుగా పరమాత్మ నిలబడితే ఆయనను గుర్తించకుండా చేసేది? మన అహంకారం. ఈ దేహానికి సంబంధించిన వాసనలు. వీరోత్సాహంతో ద్వారక చేరిన ఘటోత్కచుడు తాత రూపంలో ఉన్న కృష్ణుని ఎన్ని సంకేతాలు వచ్చినా గుర్తించలేకపోతాడు. మనం కూడా అంతే. సృష్టిలోని జీవరాశులన్నిటిలోనూ పరమాత్మ ఉన్నాడని తెలియకు కొన్ని సార్లు, తెలిసినా కూడా మాయలో పడి అహంకారపూరితమైన వివక్షను చూపిస్తాము.

ఈ సంభాషణలో "తెలియని వానికి చెప్పినా తెలియదు" అని అంటాడు శ్రీకృష్ణుడు. తెలుసుకుందాము అని కోరుకునే వానికి ఫలితం రావాలంటే ముఖ్యం సంకల్పం, చిత్తశుద్ధి. మరి అహంకారముంటే ఆ రెండూ మలినమవుతాయి. అప్పుడు ఇతరులు చెప్పినా తెలుసుకోలేరు. హిరణ్యాక్షుడు, రావణుడు, దుర్యోధనుడు మొదలైన వారికి ఎంతో మంది హితవు పలికినా వారు వినాశనము వైపే అడుగులు వేశారు. కారణం మాయకు లోబడి పరమాత్మ తత్త్వాన్ని ఎరుగక పోవటం, తాము ప్రపంచాన్ని జయించామన్న అహంకారం.

ఘటోత్కచుడు ముసలివాడన్న చులకనతో ఆతనిని సాయం అడగటంలో కొంత అహంకారం ప్రదర్శిస్తాడు. దానికి సమాధానంగా పరమాత్మ - సాయం కోరి వచ్చినవాడివి అదిరిస్తున్నావు. నీ ఉనికి తెలిపి శరణు కోరు, తప్పక సాయం చేస్తాను అంటాడు. పరమాత్మకు కావలసినది శరణాగతి. అది ఉంటే సంకల్ప మాత్రాన మన కామ్యములు నెరవేరతాయి అన్నది ఈ సంభాషణలోని సందేశం. తరువాత, కార్యసాధనలో చులకన భావాన్ని ప్రదర్శించిన ఘటోత్కచుడికి భంగపాటు తప్పలేదు. ముసలివాడిని ఎత్తటం ఎంత అనుకున్నాడు. కానీ, అహంకారంతో వస్తే విశ్వమంతా ఉన్నవాడిని ఎలా ఎత్తగలడు? తన శక్తితో ద్వారకనే పెళ్లగిస్తానన్నవాడు ముసలివాడిని ఎత్తలేకపోతాడు. అనగా, తన శక్తికి కారణం దైవం అన్న సంగతి స్వాతిశయముతో కప్పబడుతుంది. దానికి కనువిప్పు కలిగిస్తాడు పరమాత్మ. కార్యసాధనలో భగవంతునిపై దృష్టి నిరంతరం ఉండాలి అన్న సత్యాన్ని మనకు కృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు. దైవలీలతో కనువిప్పు కలిగి ఘటోత్కచుడు శ్రీకృష్ణుని శరణు వేడుతాడు. విజయాన్ని పొందుతాడు.

ఈ తత్వానికి మనకు అత్యంత ఉత్తమమైన ఉదాహరణ శ్రీమద్రామాయణంలో హనుమంతుడు. ఎంతటి బలసంపన్నుడైనా హనుమంతుడు స్వామి నామాన్ని మరువలేదు. తన బలిమి, కలిమి స్వామే అని నమ్మాడు. క్లైబ్యం వచ్చినా తనలను తాను మళ్లీ స్వామి నామస్మరణతో శక్తివంతం చేసుకున్నాడు. కార్యాన్ని సాధించాడు.

ఇటువంటి సందేశాత్మక సన్నివేశాలు మాయాబజార్ సినిమాలో మరెన్నో. అందుకే దాదాపు 60 ఏళ్లు అయినా ఈ చిత్రం ఇప్పటికీ నేటి సమాజంలో బహుళ ప్రజాదరణ కలిగి ఉంది. ఎన్ని మార్లు చూసినా మళ్లీ చూడాలన్న ఉత్సుకత కలుగుతుంది.