27, ఆగస్టు 2020, గురువారం

వందే వాసుదేవం శ్రీపతిం - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

 పదకవితా పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు సంస్కృతంలో పలికిన ఓ అద్భుతమైన కృతి శ్రీరాగంలో. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు గానం చేశారు.

వందే వాసుదేవం శ్రీపతిం
బృందారకాధీశ వందిత పదాబ్జం

ఇందీవర శ్యామమిందిరా కుచ తటీ
చందనాంకితలసచ్చారు దేహం
మందార మాలికా మకుట సంశోభితం
కందర్ప జనకమరవిందనాభం

ధగ ధగిత కౌస్తుభ ధరణ వక్షస్థలం
ఖగరాజ వాహనం కమల నయనం
నిగమాది సేవితం నిజరూప శేష ప
న్నగ రాజ శాయినం ఘన నివాసం

కరిపురనాథ సంరక్షణ తత్పరం
కరిరాజ వరద సంగత కరాబ్జం
సరసీరుహాననం చక్ర విభ్రాజితం
తిరు వేంకటాచల దేవం భజే

లక్ష్మీదేవికి పతి, ఇంద్రునిచే పూజించబడిన పదకమలములు కల వాసుదేవునికి నమస్కరిస్తున్నాను. నీలమేఘశ్యాముడు, లక్ష్మీదేవి కుచముల చందనము అలదుకొన్న అందమైన దేహము కలవాడు, మందార మాల, కిరీటముతో శోభిల్లేవాడు, మన్మథునికి జనకుడు, పద్మనాభుడైన వాసుదేవునికి నమస్కరిస్తున్నాను. ధగ ధగ మెరిసే కౌస్తుభమును వక్షస్థలములో ధరించినవాడు, గరుత్మంతుడు వాహనముగా కలవాడు, కమలముల వంటి కన్నులు కలవాడు, వేదవేదాంతములచే సన్నుతించబడినవాడు, నిజరూపములో పన్నగరాజైన ఆదిశేషునిపై శయనించి వైకుంఠమనే ఘనమైన ధామంలో నివసించే వాసుదేవునికి నమస్కరిస్తున్నాను. హస్తినాపురానికి రాజైన ధర్మరాజును రక్షించే కర్తవ్యములో ఉన్నవాడు, గజేంద్రునికి కలువల వంటి కరములతో అభయమిచ్చినవాడు, కలువ వంటి ముఖము కలవాడు, సుదర్శన చక్రము చేత ధరించి ప్రకాశించేవాడు, వేంకటాచలముపై వెలసిన దేవుని నేను భజిస్తున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి