29, మార్చి 2017, బుధవారం

ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి - భద్రాద్రి వైభవము




చైత్ర శుద్ధ పాడ్యమి అయిన ఈరోజు భద్రగిరిపై వెలసిన సీతారామలక్ష్మణులకు బ్రహ్మోత్సవాలు ఆరంభం. భద్రాద్రి రాముని వైభవం ఏమని చెప్పను? 17వ శతాబ్దంలో జీవించిన రామభక్తుడు, యోగి కంచెర్ల గోపన్న తన కృతులలో ఆ రాముని, ఆ క్షేత్రాన్ని గురించి ఎన్నో అద్భుతమైన సంకీర్తనల ద్వారా వర్ణించారు. ఆ సీతారాములను నమ్ముకొని ఆయన జీవితంలో ఎదురైన కష్టాలన్నిటినీ దాటి మోక్షాన్ని పొందాడు. భక్త రామదాసుగా పేరొందాడు. తన అద్భుతమైన ఆధ్యాత్మిక జీవన యానంలో రాముని వేనోళ్ల నుతించాడు. పాహి రామప్రభో అన్నాడు, పలుకే బంగారమాయెనా అని ప్రశ్నించాడు. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే అని వేడుకున్నాడు, చరణములే నమ్మితి అని శరణాగతి పలికాడు. ఏతీరుగ నను చూచెదవో అని కష్టాల కడలిని దాటించమని కోరాడు. నను బ్రోవమని చెప్పవే అని సీతమ్మ ద్వారా అర్జీ పెట్టాడు. ఎవడబ్బ సొమ్మని కులుకుచు తిరిగేవు అని నిందించాడు, వెంటనే దెబ్బలకోర్వక అబ్బా తిట్టితినయ్యా అని ప్రార్థించాడు. తారక మంత్రము కోరిన దొరికెను అని రామ నామ మహిమను చాటాడు. శ్రీరామనామం మరువం అని భజన సాంప్రదాయంలో గానం చేశాడు. ఇలా వేల సంకీర్తనలతో రాముని నుతించాడు. రామనామ స్మరణతో ఈ కర్మభూమి వైభవాన్ని మరింత పవిత్రం చేశాడు.

ఆ రామదాసు భద్రాచల క్షేత్రాన్ని వివరిస్తూ ఇదిగో భద్రాద్రి అన్న సంకీర్తనను మనకు అందించారు. వివరాలు:

ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి 

ముదముతో సీతా ముదిత లక్ష్మణులు  కలిసి కొలువగా రఘుపతి యుండెడి

చారు స్వర్ణ ప్రాకార గోపుర 
ద్వారములతో సుందరమై యుండెడి 

అనుపమానమై అతి సుందరమై 
దనరు చక్రము ధగ ధగ మెరిసెడి 

కలి యుగమందున ఇల వైకుంఠముగా
అలరుచున్నది నయముగ మ్రొక్కుడి 

పొన్నల పొగడల పూపొదరిండ్లను 
చెన్ను మీగడను శృంగారంబడు 

శ్రీకరముగ రామదాసును 
ప్రాకటముగ బ్రోచే ప్రభు వాసము 

అర్థము:

గౌతమీ నదీ తీరాన ఉన్న భద్రాద్రి క్షేత్రాన్ని చూడండి! ఆనందముతో సీత, లక్ష్మణుడు కలిసి కొలువగా యున్న రామచంద్రుడెండడి భద్రాదిని చూడండి. అందమైన బంగారు గోపురంతో, ప్రాకారములతో, ద్వారములతో శోభిల్లుతున్న భద్రాద్రి క్షేత్రాన్ని కాంచండి. అనుపమానమై, అత్యంత సుందరమై ధగ ధగ ప్రకాశించే చక్రముతో ఉన్న భద్రాద్రిని చూడండి. కలియుగములో ఈ భువిపై వైకుంఠముగా అలరారే భద్రాద్రి క్షేత్రాన్ని భక్తితో మ్రొక్కండి. పున్నాగ, పొగడ పూల పొదరిళ్లతో మీగడలా అందాన్ని విరజిమ్ముతున్న భద్రాద్రిని దర్శించండి. శుభకరమై రామదాసును ప్రత్యక్షముగా బ్రోచే ఆ రామచంద్రుని వాసమైన భద్రాద్రిని దర్శించండి.



భద్రాద్రి క్షేత్రం:

భద్రుని బ్రోచేందుకు భువిపై ఆ శ్రీహరి వెలసినందుకు ఈ క్షేత్రానికి భద్రాద్రి అని పేరు వచ్చింది.
ప్రస్తుతం తెలాంగాణా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. హైదరాబాదునుండి 304 కిలోమీటరలో దూరంలో ఈ క్షేత్రం ఉంది. భద్రాద్రి క్షేత్ర సౌందర్యం, పవిత్రత అనుభవైకవేద్యం. ముఖ్యంగా శరత్తు, శిశిర, హేమంత ఋతువులలో అక్కడి ప్రకృతి సౌందర్యం వర్ణనాతీతం. పవిత్రమైన గోదావరీ తీరాన సీతారాముల క్షేత్రాన్ని ఆ కంచెర్ల గోపన్న భవ్యమగా నిర్మించాడు. ఆ దేవాలయ నిర్మాణానికైన ఖర్చు కోసం జైలుపాలై, ఆ సీతారాముల అనుగ్రహంతో విముక్తుడై ఈ భద్రాచల క్షేత్రాన్ని, ఆ రాముని మహిమను ఎల్లెడలా చాటాడు. తానీషా ప్రభువు కూడా ఈయన రామభక్తి మహిమను స్వయంగా అనుభూతి చెంది తరించాడు. ఆ రామదాసు నిర్మించిన క్షేత్రం రాముని జన్మ తిథియైన చైత్ర శుద్ధ నవమి నాడు లోకకళ్యాణార్థమై జరిగే సీతారాముల కళ్యాణానికి ప్రసిద్ధి. దశమి నాడు పట్టాభిషేకం జరుగుతాయి. పాలకుల తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఈ కళ్యాణ సమయంలో రామదాసు సమయం నుండి ఉంది. అలాగే, ధనుర్మాస ఉత్సవాలకు కూడా భద్రాద్రి ప్రసిద్ధి. వైకుంఠ ఏకాదశి పర్వదినం ఇక్కడ వైభవోపేతంగా జరుపబడుతుంది. ఈ సందర్భంగా జరిగే పదిరోజుల పండువను అధ్యయనోత్సవాలు అంటారు. ఇదే సందర్భంగా భక్త రామదాసు గౌరవార్థం వాగ్గేయకార ఉత్సవాలు కూడా ఈ క్షేత్రంలో జరుగుతాయి. ఈ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలలో స్వామికి గోదావరిలో తెప్పోత్సవం కూడా జరుగుతుంది.  ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత సీతాదేవి రాముని వామాంకముపై కూర్చుని ఉంటుంది. ఈ దేవాలయం వెనుక భాగంలో రామకోటి రాసినవారు తమ పుస్తకాలను భద్రపరచే వసతి ఉంది. ఈ రామకోటి పుస్తకాలను నిత్యపూజ చేసి తరువాత గోదావరిలో నిమజ్జనం చేస్తారు. ప్రతి శనివారం ఉదయం 8:30 గంటలకు సీతారాములకు సువర్ణ తులసి అష్టోత్తరనామార్చన, ప్రతి ఆదివారం నాడు ఉదయం 8:30 గంటలకు సువర్ణ పుష్ప అష్టోత్తరనామార్చన భక్తులు చేసుకోవచ్చు. భద్రాచలానికి 32 కిలోమీటర్ల దూరంలో గోదావరి ఒడ్డున దుమ్ముగూడెం మండలంలో పర్ణశాల తప్పక దర్శించవలసిన ప్రదేశం.


భద్రాద్రి ప్రస్తావన:

భక్తరామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచెర్ల గోపన్న తెలుగుగడ్డపై జన్మించి, అమృత తుల్యమైన సంకీర్తనలను అందించటంతో పాటు ఈ క్షేత్ర నిర్మాణం చేసి రామభక్తి సామ్రాజ్యంలో ఈ దేవస్థానానికి శాశ్వత స్థానాన్ని కలిగించాడు. ఈ భద్రాద్రి రాముని గురించి శ్రీరామకర్ణామృతంలో కూడ ప్రస్తావించారు.

శ్లోకం:

వామాంక స్థిత జానకీ పరిలసత్కోదండ దండం కరే 
చక్రంచోర్ధ్వ కరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే
బిభ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం

అర్థం:

ఎడమ తొడపై కూర్చుని సీత సేవించగా, ప్రకాశించే కోదండం ఒక చేత, పైచేతిలో చక్రము, కుడిచేతులలో శంఖమును, బాణములను ధరించిన, కలువరేకులవంటి కన్నులు కలిగిన, భద్రాద్రి కొండపై వెలసిన, భుజకీర్తులు మొదలగు వానిచే అలంకరించబడిన, నీలమేఘ శ్యాముడైన రామచంద్రుని భజిస్తున్నాను.

రామదాసుగారు తన దాశరథీ శతకంలో ఈ భద్రగిరి రామునిపై అద్భుతమైన పద్యాలను రచించారు. ఈ శతకంలోని అనేక పద్యాలలో భద్రగరి దాశరథీ కరుణాపయోనిధీ అన్న ముద్రను ఉపయోగించారు. దాశరథీ శతకంలోని మొదటి పద్యం:

శ్రీరఘురామ! చారు తులసీదళ ధామ! శమ క్షమాది శృం
గార గుణాభిరామ! త్రిజగన్నుత శౌర్య రమా లలామ! దు
ర్వార కబంధ రాక్షస విరామ! జగజ్జన కల్మషార్ణవో
త్తారక నామ! భద్రగిరి దాశరథీ! కరుణా పయోనిధీ!

అర్థం:

ఓ శ్రీరామా! అందమైన తులసిమాలలు ధరించిన, శమదమాది శృంగార గుణములతో ప్రకాశించే, మూడు లోకాలచే నుతించబడిన పరాక్రమ గుణములు కల్గిన, సీతాదేవికి పతియైన, దుష్టులైన కబంధాది రాక్షసులను సంహరించిన, ఈ లోకంలో ప్రజలను కల్మషమనే సాగరాన్ని దాటించే తారక నామము కలిగిన, భద్రగిరిపై వెలసిన కరుణాసముద్రుడవైన దశరథ రామా! నీకు మంగళము.

ఇలా శతకంలోని అన్ని పద్యాలలోనూ ఆ రాముని ఎంతో వైభవంగా వర్ణించారు రామదాసు.  భద్రాచల రామదాసుని, ఆ క్షేత్రాన్ని సద్గురువులు త్యాగరాజస్వామి కూడ తమ సంకీర్తనలలో ప్రస్తావించారు. క్షీర సాగర శయన అనే కీర్తనలో "ధీరుడౌ రామదాసుని బంధము తీర్చినది విన్నానురా రామా!" అని రామదాసు తానీషా బందీగా ఉండగా మారువేషంలో సీతారాములు వచ్చి కప్పము చెల్లించి బంధవిముక్తుడిన గావించిన అద్భుతమ మహిమను నుతించారు. అలాగే, త్యాగరాజస్వామి వారి సమాధికి పదిరోజుల ముందు భద్రాద్రి రాముడే స్వప్నంలోకి వచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని అభయమిచ్చాడు అని ఆయన "(భద్ర) గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక గంటి" ఒక కృతిని రచించారు. అందులో "పదిపూటల పై గాచెదనను  త్యాగరాజ వినుతుని" అని స్పష్టంగా పలికారు. దీనిని బట్టి భద్రాద్రి రాముడు త్యాగరాజస్వామి అవసాన దశలో ఆయనకు స్వప్న సాక్షాత్కారమిచ్చి మోక్షాన్ని కలిగించాడని తెలుస్తోంది.

ముగింపు:

భద్రాద్రి సీతారాముల కళ్యాణంలో తలంబ్రాలకు ఎంతో మహత్తు ఉంది. ఈ తలంబ్రాలను శిరసున దాల్చిన వారికి పాపక్షయమై దేహాత్మలు శుద్ధి పొందుతాయని అనుభవ పూర్వకంగా పెద్దలు చెప్పారు. అలాగే, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే ఈ కళ్యాణంలో పాల్గొన్నా, కాంచినా కడు పుణ్యమని చెప్పారు. ఒకవేళ భద్రాద్రి వెళ్లటం కుదరకపోయినా, మీకు దగ్గరలో ఎక్కడ సీతారాముల కళ్యాణం జరిగినా, ఆ ఉత్సవంలో పాల్గొని ఆ తలంబ్రాలను శిరసున దాల్చటం సకల శుభకరం. వీలున్నప్పుడు గౌతమీ నది తీరాన ఉన్న భద్రాద్రి రాముని దర్శించి తరించండి!

రామదాసు కీర్తనలను ప్రచారంలోకి తీసుకు రావటనికి బాలమురళీకృష్ణగారు, నేదునూరి కృష్ణమూర్తిగారు, శోభారాజు గారు, మల్లాది సోదరులు వంటి ఎందరో కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులు ఎనలేని కృషి చేశారు. వీరిలో బాలమురళీకృష్ణ గారు పాడిన రామదాసు కీర్తనలు ఎంతో ప్రచారం పొందాయి. ఇదిగో భద్రాద్రి కీర్తనను ఆయన గళంలో వినండి.

శ్రీరామ రామ రామ!







26, మార్చి 2017, ఆదివారం

రామకథా సుధా రసపానము - త్యాగరాజస్వామి భక్తి సోపానము


సీతా రాముల చరిత్ర అతి పావనము. రాముని నామము సకల క్లేశ హరణము, భవాబ్ధి తారకము, మోక్ష కారకము. సీతారాముల నడవడిక అన్ని యుగాలకు ఆదర్శ ప్రాయము. వీరి కథను ఎందరో మహానుభావులు అనేక విధాలుగా నుడివి, ప్రచారం చేసి, దానిలోనే తరించారు. ఆదికవి మొదలు నేటి కవుల వరకు రామకథామృతంతో ముక్తిని పొందిన వారే. సద్గురువు త్యాగరాజ స్వామి వారు ఆ సీతారాముల చరిత్ర యొక్క మహత్తును తెలిపే కృతులను ఎన్నో రచించారు. వాటిలో రామకథా సుధా రస పానమొక రాజ్యము అనే కీర్తన ఒకటి. వివరాలు:

రామ కథా సుధా రస పానమొక రాజ్యము చేసునే 

భామామణి జానకి సౌమిత్రి 
భరతాదులతో భూమి వెలయు శ్రీ

ధర్మాద్యఖిల ఫలదమే మనసా 
ధైర్యానంద సౌఖ్య నికేతనమే 
కర్మ బంధ జ్వలనాబ్ధి నావమే 
కలి హరమే త్యాగరాజ నుతుడగు

అర్థము:

ఓ మనసా! రామకథ అనే అమృతాన్ని సేవించటమనేది ఒక సామ్రాజ్యము. నారీశిరోమణి అయిన సీత, భరతలక్ష్మణాదులతో ఈ భూమిపై వెలసిన సీతారాముల కథ అత్యంత పవిత్రమైనది. ధర్మార్థ కామ్య మోక్షములనే చతుర్విధ పురుషార్థముల ఫలమునిచ్చేది ఈ సీతారాముల సత్కథ. ధైర్యానికి, ఆనందానికి, సుఖానికి సూచిక ఈ రామకథ. కర్మబంధములనుండి విముక్తి పొందటం ఓ పెద్ద సాగరాన్ని దాటటం వంటిదే. ఆ తారకానికి నావ రామకథ. శివునిచే నుతించబడిన ఆ రాముని కథకలియుగములో సమస్త పాపాలను హరించేది.

వివరణ:

శ్రీమద్రామాయణ పారాయణ భక్తితో, శరణాగతితో, శుద్ధ అంతఃకరణముతో చేసే భక్తులకు త్యాగయ్య భావన తప్పక అనుభూతిగా కలుగుతుంది. రామాయణంలో ఉన్న గొప్పతనం ప్రతి అడుగులోనూ సీతారాములలో ఉన్న ధర్మాచరణం. రాజధర్మంతో పాటు, పుత్ర ధర్మం, సోదర ధర్మం, పతి ధర్మం, స్నేహ ధర్మం, శత్రు ధర్మం...ఇలా అన్ని పాత్రలలోనూ తన ధర్మాన్ని ఆచరించి దివ్యత్వాన్ని ఎలా పొందాలో రాముడు మానవజాతికి తెలిపాడు. ఆయన ఔన్నత్యం ఎటువంటిది అంటే ఆయన గురించి తెలిసిన వారందరూ నిరంతరం ఆయనను చూడాలని తహతహలాడే వారు, ఆయననే ధ్యానించే వారు. ధర్మాచరణతోనే అర్థములు పొందిన వారు సీతారాములు. తండ్రి మాటకై రాజ్యాన్ని వదులుకొని వనవాసం చేయటమంటే మాటలు కాదు. ఆ పితృవాక్య పరిపాలన, పతిని అనుగమించటం అనే ధర్మాలను పాటించి తద్వారా లభించిన అర్థాన్ని మాత్రమే స్వీకరించారు. అలాగే ఎన్ని లోభాలు ఎదురుగా నిలచినా ధర్మాచరణమే వారి నడవడికగా నిలిచింది. ధర్మార్థములతోనే తమ కామ్యములను సిద్ధింపజేసుకున్నారు. అడుగడుగునా దీనిని నిరూపించి అవతార సమాప్తి గావించారు. ఈ విధంగా చతుర్విధ పురుషార్థముల ఫలములను సామాన్య మానవుల రూపంలో పొందారు. అందుకే రామ కథామృతం ధర్మాద్యఖిల ఫలదము అని త్యాగరాజస్వామి చెప్పారు.

శ్రీమద్రామాయణంలో మానవునికి భవసాగరంలో కలిగే కష్టాల ప్రస్తావన, వాటిని ఎలా దాటవచ్చో మనకు సుస్పష్టంగా తెలియజేశారు. ధర్మాచరణ, కర్మానుష్ఠానం, గురువులను ఆశ్రయించటం, సత్సాంగత్యం, సన్మిత్రాన్వేషణ, ఆశ్రిత జన పాలన, రాజనీతి, సుయోచన చేయగలిగే వారిని అర్థించటం, దైవభక్తి..ఇలా ఆధ్యాత్మిక సోపానంలో మనకు అనాదిగా చెప్పబడిన సాధనాలన్నిటినీ సీతారాములు ఆచరించి మనకు మార్గదర్శకులైనారు. అరణ్యవాస ఆరంభంలో అత్రి-అనసూయల బోధ, తదుపరి అనేక ఋషుల ఆశీర్వచనములు, జటాయు-సంపాతిల సహాయము, సుగ్రీవాదులతో మైత్రి, జాంబవంతుని జ్ఞానం, హనుమంతుని అపారమైన బుద్ధిర్బలాలు, విభీషణుని సహాయం..ఇలా అడుగడుగునా వనవాసంలో సమిష్టి కృషితోనే రాముడు ధర్మ స్థాపన చేశాడు. అలాగే తన ధర్మాన్ని నిర్వర్తించి తన బంధు మిత్ర ఆశ్రిత గణాలకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని కలిగించాడు. అందుకే రామకథా సుధ ధైర్యానంద సౌఖ్యాలకు సూచికగా త్యాగరాజస్వామి పలికారు.

ఇక రామ నామము భవ తారకమనేది జగద్విదితమే. సృష్టి యొక్క స్థితి లయములకు కారకులైన నారాయణుడు, శివుని యొక్క నామములనుండి ఉద్భవించిన రామ నామము అత్యంత శక్తివంతమైనది. ఆ నామానికి ఉన్న మహత్తును స్వయంగా సదాశివుడు పార్వతికి తెలియజేశాడు. "కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుం మిచ్ఛామ్యహం ప్రభో" (స్వామీ! శ్రీహరి వేయి నామాలను పఠించిన కలిగే ఫలము ఏ లఘు ఉపాయముతో పండితులు నిత్యం పఠించి పొందుతున్నారు, వినాలని ఉంది చెప్పండి) అని అడుగగా ఆ పరమేశ్వరుడు "శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే" (ఓ పార్వతీ! శ్రీరామ రామ రామ అన్న పఠనం ఆ శ్రీహరి వేయి నామాలను పలికినంత ఫలము) అని తెలిపాడు. నామస్మరణే కలియుగంలో తారకం అని వేద సమస్త వాఙ్మయాలు ఘోషిస్తున్నాయి. అందుకే త్యాగరాజ స్వామి రామకథామృతాన్ని కర్మ బంధనాలను తొలగించుకునే బృహత్సాగర తారకానికి నావగా, కలి దోష హరణంగా చెప్పారు.

ఇటువంటి కీర్తనలను పరిశీలించినప్పుడు నాదోపాసన అనేది ఎంత గొప్పదో అర్థమవ్తుంది. జీవనశైలి-అనుభూతులు-భావ గోచరం-సంగీతం ద్వారా ఆ భావాన్ని వ్యక్తపరచటం...పరిపూర్ణమైన ఆధ్యాత్మిక యానమే. సాద్గుణ్యముతో సాఫల్యాన్ని పొంది సాయుజ్యాన్నిచ్చే శక్తివంతమైన సాధన ఈ నాదోపాసన. ఆ నాదోపాసనలో రామకథామృతం మహత్తును మనకు తెలియజేసిన మహనీయుడు త్యాగరాజు. ఆ సద్గురువులకు నా నమోవాకములు.

మధ్యమావతి రాగంలో త్యాగయ్య ఈ కీర్తనను కూర్చగా ఓ యువ గాయకుడు కృష్ణ నారాయణన్ అద్భుతంగా దానిని ఆలపించారు

5, మార్చి 2017, ఆదివారం

జగమే రామమయం మనసే అగణిత తారకనామమయం


రామనామం రుచి ఒక్కసారి చవి చూసిన వారికి ఇంక వేరే ఏమీ రుచించదు. ఆ రాముని భక్తి సామ్రాజ్యంలో ప్రవేశించిన వారికి ఇంక వేరే ఏమీ అక్కర ఉండదు. రాముని సేవే భృతి, ద్యుతి. ఆయనకు శరణాగతితో సేవ చేసి, ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉండటంలోనే వారికి సర్వస్వం. ఏ రాజుల ఆశ్రయం రుచించదు, ఎవ్వరినీ పొగడ మనస్కరించదు. అలా రామభక్తిలో తరించిన మహానుభావులలో పోతన, రామదాసు, త్యాగయ్య మొదలైన వారితో పాటు ఆతుకూరి మొల్ల కూడా ఉన్నారు. కడప జిల్లా బద్వేలు సమీపంలోని గోపవరం గ్రామానికి చెందిన కేసన శెట్టికి మొల్ల 1440వ సంవత్సరంలో జన్మించిందని చారిత్రకుల అభిప్రాయం. అన్నమాచార్యుల వారి భార్య తిమ్మక్క తరువాత మొల్ల తెలుగులో రెండవ కవయిత్రిగా చెప్పుకుంటారు. శ్రీశైల మల్లికార్జునుని కొలిచే కేసన తన బిడ్డకు ఆ శివునికి ప్రియమైన అడవి మల్లె పేరు మొల్ల అని పెట్టుకున్నాడు. శివునే తన గురువుగా భావించిన మొల్ల ప్రభావితమై సంస్కృత రామాయాణాన్ని తెలుగులోకి అనువదించింది. పోతనకు ఈమె సమకాలీకురాలు కావచ్చు. వీలైనంత తెలుగుపదాలలోనే రామాయణాన్ని రచించాలన్న సంకల్పాన్ని ఆమె తన రామయణంలోని మొదటి పద్యాలలో వెలిబుచ్చింది. అదే విధంగా రచన చేసింది. పోతనలాగానే ఈమె తన రచనలను రామునికి తప్ప ఎవ్వరికీ అంకితం చేయకూడని నిర్ణయించుకుంది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తాను రచించిన రామాయణాన్ని పలికే అవకాశం ఆమెకు కలిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. మొల్ల రామాయణంలో తెలుగుదనం ఉట్టిపడుతుంది. మచ్చుకు కొన్ని పద్యాలు:

కామారి వినుత నామా!
సామీరికృతప్రణామ! సంహృతరక్షో
గ్రామా! వర్షా మేఘ
శ్యామా! సంగ్రామ భీమ! జానకిరామా!

విమల సుధాకర వదనా!
సుమనశ్చేతోబ్జసదన! సుస్థిర కదనా!
కమనీయరదన! శత్రు వి
షమ! రఘుకుల సార్వభౌమ! జానకిరామా!

కువలయదళనేత్రా! కోమల స్నిగ్ధ గాత్రా!
భవముఖనుతిపాత్రా! భక్త వృక్షాళి చైత్రా!
రవిశతసమధామా! రక్షితాక్షాంఘ్రి భామా!
కవిజననుతనామా! కావుమా మమ్ము రామా!

ఈ కవయిత్రి మొల్లపై ఇంటూరి వేంకటేశ్వరరావు గారు కుమ్మరి మొల్ల అనే నవల రచించారు. ఈ నవల ఆధారంగా ప్రఖ్యాత హాస్యనటులు బసవరాజు పద్మనాభంగారు 1970లో కథానాయిక మొల్ల చిత్రాన్ని ఆవిష్కరించారు. ఆ చిత్రంలో మొల్లగా వాణిశ్రీ నటించారు. చిత్రం పతాక సన్నివేశంలో మొల్ల గానం చేసినట్లుగా ఈ రాముని గీతాన్ని అందించారు. గీతాన్ని డాక్టర్ సి. నారాయణరెడ్డి గారు రచించగా ఎస్పీ కోదండపాణి గారు సంగీతం అందించారు. పూలపాక సుశీలమ్మ గారు అద్భుతంగా రామగానం చేశారు.

రఘుకుల తిలకా నీ ఆనతి
రచియించితి రామాయణ సత్కృతి
ఆ కృతి వరియించినాపతివి నీవే
అతులిత కైవల్య గతివి నీవే

జగమే రామమయం మనసే అగణిత తారకనామ మయం

నీలజలద రమణీయ రూపం
నిగమాంచల మందిర మణిదీపం
సుందర జానకి వందిత చరణం
సురముని శరణం భవ తాప హరణం

ఆ చిరునవ్వే అమృతపు జల్లు
అఖిల జగములేలు ఆ చేతి విల్లు
అతని గానమున అలరారు కావ్యం
అన్ని యుగాలకు నవ్యాతి నవ్యం

ఎవని కమల కమనీయ పదము చూపించె అహల్యకు ముక్తి పదము
ఎవని చంద్రికా మృదుల కరము అందించె శబరికి దివ్య వరము
ఎవని ఏలుబడి ఇంటికొక్క గుడి నిలిపెనో
ఎవని రాజ్యమే రామరాజ్యమై వెలసెనో
ఆ రాముడు నా అంతరంగమున నిండగా
అహము మరచి ఈ ఇహము మరచి జన్మాంతర బంధములెల్ల విడచి
ఆ మహజ్జ్యోతిలో లీనము కానా రాం రాం
ఆ మహాప్రభునిలో ఐక్యము కానా రాం రాం
ఓ రామా రఘురామా కైవల్య నామా రాం రాం

ఆ రామును ఆజ్ఞతోనే తన కావ్యం అని మొల్ల ఈ గీతాన్ని ఆరంభించిన రీతి రామభక్తుల విశ్వాసాన్ని సూచిస్తుంది. తన కృతిని రామునికే అంకితం చేస్తున్నానని అందరి సమక్షాన ప్రకటిస్తుంది. తనకు ఆ రాముడే కైవల్యమని చాటుతుంది. ఎలా? ఆమెకు ప్రపంచమంతా రాముడే. మనసునిండా అనతమైన మహిమ గల తారక నామం.

ఆ రాముడి రూపం ఎటువంటిది? నీలమేఘ శరీరముతో రమణీయమైనది, వేదశాస్త్రముల అంచులలో ప్రకాశించే మణి ఆ రాముని తత్త్వం. అందమైన సీత నమస్కరించిన పాదాలు ఆ రామునివి. దేవతలకు, మునులకు శరణం ఆ చరణాలు, మానవుని పాపములను, తాపమును హరించేవి ఆ చరణాలు. ఆ రాముని చిరునవ్వు అమృతము కురిసినట్లుగా ఉంటుంది. ఆ చేతి విల్లు సమస్త జగాలను శాసిస్తుంది. అతని వర్ణనే రామాయణంగా అలరారుతుంది. ఆ రామాయణం ఎన్ని యుగాలు గడిచినా నిత్య నూతనమే. అతని అందమైన పదకమలములు అహల్యకు ముక్తి పథాన్ని చూపించాయి. అతని పూవులవలె మృదువైన చేతులు శబరికి దివ్యమైన వరాలు అందించాయి. అతని రాజ్యంలో ప్రతి ఇల్లు ఒక దేవాలయంగా మారింది. అతని రాజ్యం రామరాజ్యంగా చెప్పబడింది. అటువంటి రాముడు నా అంతరంగములో నిలిచి ఉండగా, నేను అనే అహాన్ని విడిచి, దేహ స్ఫురణ మరచి, జన్మ జన్మల బంధాలు వీడి ఆ మహాజ్యోతిలో లీనము కానా? ఆ మహాప్రభువులో ఐక్యము కానా? అని అద్భుతంగా గానం చేస్తూ, రామ నామ స్మరణ మధ్య తన దేహాన్ని త్యజించి జీవాత్మను ఆ పరమాత్మలో ఏకం చేస్తుంది.

మొల్ల రామాయణాన్ని తెలుగులోకి అనువదించి తరిస్తే ఆమె వ్యక్తిత్వాన్ని ఈ గీతంతో అనుసంధానం చేసి రామ తత్త్వాన్ని మరింత ప్రజలలోకి తీసుకువెళ్లారు సి. నారాయణరెడ్డి గారు. రామభక్తి గీతలను గమనిస్తే అన్నింటికీ కొన్ని సారూప్యాలుంటాయి - మొదటిది రామనామ మహిమ, రెండవది రాముని గుణరూపవైభవ వర్ణన, మూడవది శరణాగతి. రామభక్తిలో ముక్తి ఆఖరి సోపానమైతే దానికి పునాదులు దృధమైన రామనామ స్మరణము, తద్వారా భవ పాపహరణం. నారాయణరెడ్డి గారి గీతాలలో తెలుగుదనం అందరికీ తెలిసిందే. ఆ తెలుగుదనానికి భక్తి సుగంధం అలదితే? దానికి రామభక్తి పారిజాత పరిమళం సమీరంలా సోకితే? ఈ గీతం అలాంటిదే. నీలమేఘశ్యాముని సుందరం రూపాన్ని కాంచి, వేదవేదాంగాలలో చెప్పినది ఆ తత్త్వమే అని గ్రహించి, జానకి కొలిచినది ఆయన పాదములే అని తలచి, అందరి ఆర్తిని తొలగించంది ఆ రాముని పాదములే అని మొల్ల వంటి మహాభక్తురాలు, కవయత్రి పాత్ర ద్వారా మనకు తెలియజేశారు కవి. మొదటి చరణంలోని పద ప్రయోగం ఆయన ప్రతిభకు, భక్తికి తార్కాణాలు. రెండవ చరణంలో ఇంకొక అడుగు ముందుకు వేసి రాముని మనోహరమైన చిరునవ్వును, అతి శక్తివంతమైన కోదండమును, అతని గుణాలను, నడవడికను తెలిపే రామాయణాన్ని ప్రస్తావించి ఆ గాథను ఎప్పటికీ ఇగిరిపోని గంధంగానే పలికారు. రామాయణంలో రాముని మహిమలు తెలిపే కొన్ని కీలకమైన ఘట్టాలు అహల్యా శాపవిమోచనం, శబరికి మోక్షం, రామరాజ్య స్థాపనను ప్రస్తావించారు. అటువంటి రాముడు మనసులో స్థిరమైతే, ఆయన తారక నామమే అంతరంగంలో నిలిచిపోతే మరి దేహము స్ఫురణ దూరమై, అహంకారం పటాపంచలై కైవల్యప్రదమవుతుంది. మొల్ల వంటి కవయిత్రికి, రామభక్తురాలికి ఇటువంటి భావనతో నిండిన గీతం ఎంతో సముచితం. నారాయణరెడ్డి గారి భావగర్భితమైన గీతం పతాక సన్నివేశాన్ని రామభక్తి ప్రవాహంతో తడిపి పునీతం చేస్తుంది. సుశీలమ్మ గానం, కోదండపాణి గారి సంగీతం ఈ పాటకు మరింత పవిత్రతను చేకూర్చాయి.

శ్రీరామ జయరామ జయ జయ రామ!

3, మార్చి 2017, శుక్రవారం

భారతీయ నాట్యకళలు - వ్యాపార ధోరణి


యథో హస్త తథో దృష్టి
యథో దృష్టి తథో మనః
యథో మనః తథో భావ
యథో భావ తథో రసః

చేతులు ఎటువైపు ఉంటాయో దృష్టి అటువైపు; దృష్టి ఎటువైపు ఉంటుందో మనసు అటువైపు. మనసు ఎటువైపు ఉంటుందో భావం అటువైపు. భావం ఎటువైపు చూస్తుందో రసం ఆ భావనతోనే పెల్లుబుకుతుంది.

- నాట్యశాస్త్రం.

నాట్యకళలో ఆంగికం, ఆహార్యం, మనస్సు, భావము, రసము అన్నీ ఏకమై అంశంలో లీనమైతేనే అది రసికుల హృదయాలను తాకి రంగమంటపంపై దివ్యత్వాన్ని రాజిల్లజేస్తుంది. చప్పట్లపైన, పారితోషకం పైన, అవార్డులపైన, ఫోటోలు, వీడియోలపైన దృష్టి కలిగి ఉండే కళాకారులు చేసే నాట్యంలో ఈ దివ్యత్వం ఉండదు. కళ జీవరసంతో ఉట్టిపడదు. అందుకే కళారాధనలో తనను తాను మర్చిపోయి రమించాలి అని సద్గురువులు చెప్పారు. అది భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకళి, ఒడిస్సీ, మణిపురీ, మోహినిఆట్టం వంటి ఏ కళైనా కావచ్చు. కానీ, కళాకారుడు కళలో, భావంలో, స్వరంలో, లయలో తాదాత్మ్యత చెందకపోతే యాంత్రికమైన నృత్యమే అవుతుంది. ఆ నృత్యం కుప్పిగంతులతో సమానమవుతుంది. భారతీయ నృత్యకళలకు ఉన్న ప్రత్యేకత సనాతన ధర్మంలో అంతర్భాగమై ఇహ పరాలను సమానంగా ప్రస్తావించే అంశాలను ప్రదర్శించే అవకాశాన్ని కళాకారులకిస్తాయి. తద్వారా వారి వ్యక్తిత్వాలను పై మెట్టుకు తీసుకువెళతాయి. నేను అన్న భావన కోల్పోయిన అ కళాకారులు పాత్రలో జీవించి భవంతో నర్తించి రసాన్ని అభినయం ద్వారా ప్రవహింపజేస్తారు. అందుకే, ప్రతి ఒక్క అంశమూ కూడా దివ్యత్వాన్ని పొంది రంగస్థలాన్ని ఓ దేవాలయంగా మారుస్తాయి. దీనికి ప్రధన సాధనం గురువు, గురు పరంపర. ఏదో నాలుగు ముద్రలు నేర్పి ఓ రెండు మూడు అంశాలు భావం తెలియజేయకుండా నేర్పే గురువులు ఈరోజు చాలా మంది కనిపిస్తున్నారు. కాస్త గుర్తింపు రాగానే వాళ్లే న్యాయనిర్ణేతలు. వారి శిష్యులకు అసలు కళ, భావం, ఆ కళలోని పవిత్రత, ఆ కళకు మూలాలు తెలియజేసే గురువులు కరువయ్యారు. ఓ నాట్యగురు కావాలంటే నాట్యయోగంలో సిద్ధించాలి. వ్యక్తిత్వం స్థితప్రజ్ఞత పొందాలి. నవరసాలను అలవోకగా ఒలికించగలగాలి. పాషణమైన మనుషుల హృదయాలను కరిగించి మానవత్వాన్ని నింపాలి. మనుషులను ఏకం చేయగలిగే శక్తికి ఇటువంటి గురువులకు, వారికి నైపుణ్యం గల కళలలో ఉంది. నాట్యవిద్యను వ్యాపారధోరణితో కాకుండా ఓ సనాతన పవిత్ర కళగా భావించి తరువాతి తరాలకు ఈ గురువులు అందిస్తే ఈ రసప్రవాహం శాశ్వతమవుతుంది. లేకపోతే భారతీయ నాట్య కళలు రూపాంతరం చెంది సహజమైన శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది.

ఈ సమస్యను కళాతపస్వి కే విశ్వనాథ్ గారు సాగరసంగమం, స్వర్ణకమలం చిత్రాల ద్వారా మనకు చాలా చక్కగా తెలియజేశారు. మన నాట్యకళలకు ఉన్న చరిత్ర, దివ్యత్వం మరే ప్రపంచ కళలకు లేదంటే అతిశయోక్తి కాదు. నర్తనమే శివకవచం నటరాజ పాద సుమరజం అన్నారు వేటూరి వారు. నిత్యనర్తనుడైన శివుని పూజకు చివురించిన కళలు వ్యాపారధోరణి పట్టి ప్రమాణాలను కోల్పోకూడదు. దీని గురుతర బాధ్యత నాట్య శాస్త్ర గురువులపైనే ఉంది. పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవటం ప్రధాన లక్ష్యం కాకుండా కళను ఆరాధించి భావాన్ని ఆకళింపు చేసుకొని ఆహార్యంలో గుప్పించగలిగే శిక్షణా పద్ధతిని పునరుద్ధరించి కొనసాగించాలి. 

తాగరా శ్రీరామ నామామృతం - వేదవ్యాస గీతం


అల్లా...ఇది ఇస్లాంలో దేవుడు అనటానికి ఉపయోగించే పదం. ఈ పదానికి శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో శంకరభట్టుగారు అద్భుతమైన వివరణ ఇచ్చారు - అల్ అనగా శక్తి, ఆహ్ అనగా శక్తిని ధరించివాడు. అనగా శివపార్వతుల అర్థనారీశ్వర రూపం ఎలానో అల్లా పదం అంతే. దైవం అంటే ఏ విశ్వాసంలోనైనా ఒకటే అన్నదానికి ఈ అర్థం ఓ మంచి ప్రాతిపాదిక అవుతుంది. కబీర్ దాస్ ఇస్లాం మతాన్ని విశ్వసించే కుటుంబంలో జన్మించినా హిందూ సిఖ్ ఇస్లాంలలోని మంచి
సిద్ధాంతాలను మాత్రమే తీసుకొని దురాచారాలను ఖండించాడు. హిందూ మత సిద్ధాంతాలకు ఆయనకు గురువు స్వామి రామానంద. ఆయన వద్ద తారక మంత్ర ఉపదేశాన్ని పొందిన కబీర్ భారతదేశంలో అనేక చోట్ల పర్యటించారు. అలాగే అల్లా అనే పదం యొక్క అర్థాన్ని సంపూర్ణంగా మతాలకు అతీతంగా ఆకళింపు చేసుకున్న మహానుభావుడు కబీర్. మానవుని జీవితానికి ముఖ్యమైన విలువలను స్పష్టంగా తన దోహాల రూపంలో మనకు అందించారు. వృత్తి రీత్యా చేనేత కార్మికుడైనా, భక్తిలో రాముని దర్శించి తరించిన వాడు కబీర్. తారక మంత్ర సిద్ధిని పొంది ఎందరికో దాని అమృతాన్ని అందించాడు. ఒక రకంగా చెప్పాలంటే కబీర్ 15వ శతాబ్దపు సంఘసంస్కర్త.

కబీర్‌దాసు మన తెలుగునాట జన్మించిన రామదాసుకు తారమంత్రాన్ని ఉపదేశించిన గురువని చెప్పబడింది. ఆ కబీర్-రామదాసుల కలయిక,మంత్రోపదేశ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా శ్రీరామదాసు సినిమాలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో వారిద్దరు తొలిసారు కలిసే ఘట్టంలో ఓ సుమధుర భక్తి గీతం వెలువడింది. కీరవాణి సంగీతంలో శ్రీవేదవ్యాస గారు రచించగా శంకర్ మహదేవన్ మరియు విజయ్ యేసుదాస్ ఈ పాటను రామదాసు, మరియు కబీర్ పాత్రలకు పాడారు. వివరాలు పరిశీలిద్దాం:

అల్లా ... శ్రీ రామా...
శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు
కళ్యాణ గుణఘనుడు కరుణా ఘనాఘనుడు ఎవడు
అల్లా తత్వమున  అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు
ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు
తాగరా శ్రీరామనామామృతం ఆనామమే  దాటించు భవ సాగరం
తాగరా శ్రీ రామనామామృతం ఆనామమే  దాటించు భవ సాగరం

ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలిసిన మూర్తి
ఏ మూర్తి  ముజ్జగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి  శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి  నిఖిలాండ  నిత్య సత్య స్ఫూర్తి
ఏ మూర్తి  నిర్వాణ నిజ ధర్మ సమవర్తి
ఏ మూర్తి  జగదేక చక్రవర్తి
ఏ మూర్తి  ఘనమూర్తి  ఏ మూర్తి  గుణకీర్తి
ఏ మూర్తి  అడగించు జన్మజన్మల ఆర్తి
ఏ మూర్తి  ఏ మూర్తియునుగాని  రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్ర మూర్తి

తాగరా ఆ ఆ ఆ  తాగరా శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం...

పాపాప మపనీప మపనీప మపసనిప మాపామ శ్రీ రామా
పాపాప మపనీని  పనిసాస రిరిసనిప   మాపాని  మపమా కోదండ రామా
మపనిసరి  సానీ పానీపామా  సీతారామా
మపనిసరి  సా రీ  సరిమరిస నిపమా  ఆనందరామా
మా మా రిమరిమరి  సరిమా  రామా జయరామా
సరిమా రామా సపమా  రామా
పా ఆ ఆ ఆ   వన  రామా


ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలాకే వేల్పు
ఏ వేల్పు నిటూర్పు ఇలనునిల్పు
ఏ వేల్పు నిఖిల కల్యాణముల కలగల్గు
ఏ వేల్పు నిగమనిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగినేలలను కల్పు
ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పుదేమల్పు లేని గెలుపు
ఏ వేల్పు  సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ  వేల్పు దాసానుదాసులకు కైమోడ్పు

తాగరా ఆ ఆ ఆ  తాగరా శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం...

రాముడెవరు? శుభాన్ని కలిగించే వాడు, అందమైన రూపము కలవాడు, పాపములను హరించే వాడు. సమస్త సద్గుణములను కలిగిన గొప్పవాడు, కరుణ మూర్తీభవించిన వాడు - ఇంతవరకు బానే ఉంది, అందరికీ అర్థమవుతుంది. మరి అల్లా తత్త్వమున అల్లారుముద్దుగా అలరారు అందాల చంద్రుడెవరు? అన్నాడు కవి. అల్లా తత్వమేమిటి? శక్తియుతమైన శివమని పైన చెప్పుకున్నాం కదా? రాముడి నామంలోనే ఉంది మూలమంతా. మళ్లీ శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రకే వెళితే రాం అనే పదానికి అగ్ని బీజం. ఇదే విషయం రామరహస్యోపనిషత్తులో కూడా చెప్పబడింది. అత్యంత శక్తివంతమైన రామ నామం శివకేశవుల శక్తి సమన్వితమై ఈ విశ్వంలో పరమాత్మ తత్త్వాన్ని ప్రసరింపజేస్తోంది. పరమాత్మ తత్వంలో ప్రకాశించే వాడు రామచంద్రుడు. ఆ రాముడి ఘనత ఎటువంటిది? ఆనందరాముడు, అమృతర్సంతో నిండి యున్న వాడు. ఆ రామ నామమనే అమృతాన్ని త్రాగమని కవి ఘోషిస్తున్నారు. ఆ నామాన్ని నమ్ముకుంటే చాలు, ఈ భవ సాగరాన్ని దాటగలము అని చెప్పారు.

త్రిమూర్తులుగా వెలసిన పరమాత్మ ఆ రాముడు. ఈ మూడులోకాలకు ఆయనే మూలము. ఆయన విశ్వజనీనమైన శక్తి యొక్క చైతన్యరూపము. ఆయనే సమస్త లోకములలోని జీవరాశులకు సత్యము, శాశ్వతము, కారకము. ఆయనే మోక్ష ప్రదాయకుడు. సత్య ధర్మ పాలనలో సమ న్యాయం చూపించే వాడు. ఆ రామచంద్రమూర్తి మూడు లోకాలకు ఏకైక చక్రవర్తి. ఆయన ఘనమైన రూపము కలవాడు, తన గుణములచే కీర్తిని పొందిన వాడు. ఆ రామచంద్రుడు జన్మ జన్మల ఆర్తిని హరించే వాడు. ఒక రూపమంటూ లేని వాడు, సమస్త రసములను మూర్తీభవించిన వాడు. ఆయనే శ్రీరామచంద్రమూర్తి. ఆ రాముని నామమనే అమృతాని త్రాగమని కవి చెబుతున్నారు. ఆ నామం మనలను సంసార సాగరాన్ని దాటించే నావ.

శ్రీరాముడు కోదండరాముడు, సీతారాముడు, ఆనందరాముడు, జయరాముడు. ఆయన ఘంత ఎలాంటిది? సమస్త దేవతలు కొలిచెడి దేవుడు ఆ రాముడు. ఆయన పదునాలుగు లోకాలకు దేవుడు. ఆయన నిట్టూర్పులతో ఈ భువిని నిలిపే దైవము. ఆయనే సమస్త కళ్యానములను ప్రసాదించే దైవము. ఆయన తత్త్వము సమస్త శాస్త్రాలను తెలిపేది. ఆయన నింగి నేల అంతటా వ్యాపించి ఉన్న దైవము. ఆయన మహా ప్రకాశవంతమైన దైవము, ఆయన రూపము మనోహరమైనది. ఆయన విజయాలు అప్రతిహతమైనవి. సీతమ్మ ప్రేమకు, ఆలోచనలను తెలిపేది ఆ రమచంద్రుడు. అటువంటి రాముని నామమనే అమృతాన్ని త్రాగమని కవి ఉద్ఘాటిస్తున్నారు. ఆ నామం మనలను ఈ సంసార బాధలనుండి రక్షిస్తుంది.

ఈ పాటను లోతుగా పరిశీలిస్తే రామతత్త్వం ఎంతటి మహత్కరమైనదో తెలుస్తుంది. ధర్మం మూర్తీభవించిన వాడు రాముడైతే అనుగమించిన సీత లోకపావని. అందుకే ఈ అవతారం శక్తి సమన్వితమై లోకోత్తరమైంది. ప్రతి అడుగులోనూ మానవునికి ఉత్తమ విలువలను నేర్పిన వారు సీతారాములు. తల్లిదండ్రులు, గురువులు, సోదరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, సేవకులు, శత్రువుల పట్ల ఎలా ప్రవర్తించాలో రామాయణం మనకు చక్కగా వివరిస్తుంది. విలువలనే ఓ చిత్రపటం గీస్తే అది రాముని రూపమై ఆవిష్కరిస్తుంది అని అనటంలో ఎటువంటి సందేహమూ లేదు. అలా నడచుకున్నాడు కాబట్టే ఆయన నామం అంత గొప్పది. రామనామంతో తరించిన మహనీయులను మనం ఎంచలేము. మన పాపాలను హరించేది, మనలను తరించేది, మనకు ముక్తిని ప్రసాదించేది అని త్యాగరాజ స్వామి వంటి మహనీయులు ఎందరో తెలిపారు. రామావతారంతో మనకు అవగతమయ్యే సత్యాలు కొన్ని ఉన్నాయి:

1. ధర్మాన్ని తు.చ. తప్పకుండా ఆచరించే మానవుడు దివ్యాత్వన్ని పొంది ముల్లోక వంద్యుడవుతాడు.
2. అటువంటి దివ్యమూర్తుల నామ స్మరణతో మన పాపాలు హరింపబడతాయి.
3. వారి నడవడిక మనకు జీవితంలో సాధనాలుగా తోడ్పడి మనలను స్థితప్రజ్ఞులను చేస్తాయి.

రామ పూర్వతాపిన్యుపనిషత్ రాముడే పరబ్రహ్మమని స్పష్టంగా చెబుతుంది:

రామ ఏవ పరం బ్రహ్మ రామ ఏవ పరం తపః
రామ ఏవ పరం తత్త్వం శ్రీరామో బ్రహ్మ తారకం

రాముడే పరబ్రహ్మము. రాముడే పరమ తపము. రాముడే పరతత్త్వము. శ్రీరాముడే తారక బ్రహ్మము.

అటువంటి రామమంత్రాన్ని మించినది మరొకటి లేదని ఎందరో చెప్పారు. అగస్త్య సంహిత ప్రకారం రామమంత్రమే మంత్రరాజం. అది సర్వోత్తమమైన మంత్రం. దూదికొండలను ఒక చిన్న నిప్పురవ్వ ఎలా దహిస్తుందో అలా కాటుకొండలవంటి పాపములను రామ నామము దహించివేస్తుందని ఈ సంహిత చెప్పింది. స్త్రీపురుష భేదం లేకుండా అందరూ ఈ మంత్రాన్ని జపించవచ్చని ఈ సంహిత తెలుపుతుంది. ఈ సందేశాన్ని వేదవ్యాస గారి ఈ గీతం సామాన్యునికి అర్థమయ్యేలా చాటింది. రామ నామే జీవనంగా, భుక్తిగా, ముక్తిగా భావించి తరించ వారిలో కబీర్ దాసు అగ్రగణ్యులు. అలాగే వాగ్గేయకారులైన త్యాగరాజస్వామి, రామదాసు, అన్నమాచార్యుల వారు తమ సంకీర్తనలలో రామ మంత్ర మహాత్మ్యాన్ని చాటారు. అటువంటి కబీర్-రామదాసుల కలయికలో ఇటువంటి గీతాన్ని ఆవిష్కరించటం వేదవ్యాస గారి ప్రతిభను మనకు తెలియజేస్తుంది.

ఇటీవలి కాలంలో రామునిపై వచ్చిన సినీ గీతాలలో ఈ తాగరా శ్రీరామ నామామృతం అనే పాట అత్యంత మహిమాన్వితమైన సందేశం కలది. రచయిత వేదవ్యాస రంగభట్టర్ గారి కౌశలం ఈ పాటలో ప్రతి ఒక్క అక్షరంలోనూ కనబడుతుంది. శ్రీమంజునాథ చిత్రంలో మహా ప్రాణ దీపం అనే గీతం గుర్తుందా? ఈ వేదవ్యాస గారు రచించిందే. ఇటువంటి గీతం రచించాలంటే తప్పకుండా దైవానుగ్రహం కలిగి ఉండాలి. వేదవ్యాస గారు భగవద్రామానుజుల వారి శిష్యుని వంశంలో జన్మించిన వారు. వీరి పూర్వీకులది శ్రీరంగం. దశాబ్దాల క్రితం వరంగల్‌కు తరలి వచ్చారు. ఈయన హైదరాబాదులోని వేదాంత వర్ధని సంస్కృత కళాశాలలో విద్యాభ్యాసం చేసిన తరువాత టీటీడి సంస్కృత ప్రాచ్య కళాశలలో అధ్యాపకునిగా చేరి 36 సంవత్సరాల సర్వీసు తరువాత పదవీ విరమణ చేసి తిరుపతిలోనే స్థిరపడ్డారు. చదువుకునే రోజుల్లోనే కర్ణాటక శాస్త్రీయ సంగీత శిక్షణ పొందారు. తరువాత తిరుపతిలో సంగీతాన్ని అభ్యసించారు. ఆయన స్వరజ్ఞాన వర్ధిని అనే అద్భుతమైన గ్రంథాన్ని కూడా రచించారు. సంగీతంలో ఎందరికో శిక్షణనిచ్చారు. రామదాసు, వేంగమాంబ, ఆదిశంకరాచార్య చిత్రాలకు ఉత్తమ గేయ రచయిత అవార్డులను పొందారు. గతంలో వీరు కేవీ మహదేవన్, సాలూరి రాజేశ్వరరావు గారి వద్ద పని చేశారు. సంగీతంపై ఎన్నో పరిశోధనలు చేసిన వీరు ఇప్పటికీ ఔత్సహిక కళాకారులకు, బాలబాలికాలు శిక్షణనిస్తున్నారు. ఎందరో నటీనటులకు నటనలో శిక్షణ కూడా ఇస్తున్నారు. వేదవ్యాస రంగభట్టర్ గారి కలంలో వెలువడిన ఈ గీతం తెలుగు చలన చిత్ర భక్తి గీతాల్లో ఓ ప్రత్యేక స్థానంలో ఉంటుంది.

రామమంత్ర మహత్తును వేదవ్యాస గారు అద్భుతమైన అక్షర సంపదతో అందించగా కీరవాణి గారు అంతే గొప్ప స్వరాలను అందించారు. తండ్రికి తగ్గ తనయుడిగా విజయ్ యేసుదాస్, మరో ఆరితేరిన సంగీత కళాకారుడు, నేపథ్య గాయకుడు శంకర్ మహాదేవన్ సమఉజ్జీలుగా ఈ పాటను పాడారు. ఇద్దరు గొప్ప గాయకులు, గొప్ప సంగీత దర్శకుడు, గొప్ప రచయిత కలయికలో వెలువడిన ఈ గీతం రామనామామృతాన్ని అందరికీ పంచింది.

శ్రీరామ జయరామ జయ జయ రామ!