4, అక్టోబర్ 2017, బుధవారం

చేర రావదేమిరా? రామయ్యా! - త్యాగరాజస్వామి కృతి



చేర రావదేమిరా? రామయ్యా! 

మేరగాదురా ఇక మహామేరుధీర! శ్రీకర! రామయ్య!

తల్లి తండ్రి లేని బాల తన నాథు గోరు రీతి పలుమారు వేడుకొంటే పాలించ రాదా?
వలచుచు నేను నీదు వదనారవిందమును తలచి కరుగ జూచి త్యాగరాజ సన్నుత!

ఓ రామయ్యా! నన్ను చేర రావేమిరా! మేరు పర్వతమంతటి మహా ధీరుడవు, శుభకరుడవు, ఇక నా వల్ల గాదురా రామయ్యా! తల్లి తండ్రి లేని బాలిక తన రక్షణను కోరే రీతి నేను అనేకమార్లు నిన్ను వేడుకొన్నాను.నన్ను పాలించ రాదా!  శివునిచే నుతించబడిన ఓ రామా! నీ మనసు కరుగుటకై,  నిన్నే కోరుచు,  నీ ముఖారవిందమును తలచుచున్నాను. నన్ను చేర రావేమిరా!

- సద్గురువులు త్యాగరాజస్వామి

మల్లాది సోదరులు గానం చేసిన ఈ కృతి రీతిగౌళ రాగంలో స్వరపరచబడినది.


శివకామేశ్వరీం చింతయేహం - దీక్షితులవారి చిదంబర క్షేత్ర కృతి


శివకామేశ్వరీం చింతయేహం
శృంగారరస సంపూర్ణకరీం

శివ కామేశ్వర మనః ప్రియకరీం
శివానంద గురుగుహ వశంకరీం

శాంత కళ్యాణ గుణ శాలినీం శాంత్యతీత కళా స్వరూపిణీం
మాధుర్య గానామృత మోదినీం మదాలసాం హంసోల్లాసినీం
చిదంబర పురీశ్వరీం చిదగ్ని కుండ సంభూత సకలేశ్వరీం

శృంగార రసాన్ని సంపూర్ణం చేసే శివకామేశ్వరీ అమ్మను నేను ధ్యానిస్తున్నాను. శివకామేశ్వరుని మనసును రంజిల్ల జేసే, శివానందయైన, గురుగుహుని నిర్దేశించే అమ్మను నేను ధ్యానిస్తున్నాను. శాంతము మొదలైన శుభకరమైన గుణములతో ప్రకాశిస్తూ, శాంతికి అతీతమైన కళలకు స్వరూపిణియై, మధురమైన గానామృతమును ఆనందించే, ఆనందాతిశయయై హంసపై భాసిల్లే, చిదగ్నికుండము నుండి జన్మించిన, సకల జీవరాశులకు రాజ్ఞియైన, చిదంబరపురానికి ఈశ్వరి అయిన శివకామసుందరిని నేను ధ్యానిస్తున్నాను.



ముత్తుస్వామి దీక్షితుల వారి క్షేత్ర కృతులలో చిదంబరంలో నటరాజునితో కూడి యున్న శివకామసుందరి అమ్మవారిని కొలిచిన కృతి ఇది. చిత్సభలో నటరాజుడు శివకామసుందరీ దేవిల వైభవం కళ్లారా చూడవలసినదే. అద్భుతమైన శైవక్షేత్రం చిదంబరం. తమిళనాడులో చెన్నైకి దక్షిణాన 231కిలోమీటర్ల దూరంలో కడలూరు జిల్లాలో చిదంబరం ఉంది. సనాతనమైన ఈ దేవాలయాన్ని చోళులు, పాండ్యులు, చేరులు, విజయనగర రాజులు పోషించారు. ఇప్పుడున్న కట్టడం 12వ శతాబ్దం నాటిది. 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అనేకదేవతా సమూహమై యున్న ఈ దేవాలయం పంచభూత స్థలములలో ఆకాశాన్ని సూచించేది. శివరాత్రికి జరిగే నాట్యాంజలి ఉత్సవాలకు ఈ దేవస్థానం పేరొందింది. నాలుగు వైపుల నాలుగు గోపురముల ద్వారా ఈ దేవస్థానంలోకి ప్రవేశించ వచ్చు. ఐదు సభలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి - చిత్సభ (గర్భగుడి), కనకసభ (నిత్యసేవలు జరిగే మంటపము), నాట్యసభ, వేయి స్థంభములతో సహస్రార చక్రాన్ని సూచించే రాజసభ, దేవసభ (గణేశుడు, సోమస్కందుడు,  శివానందనాయకి, చండికేశ్వరులకు నిలయమైన సభ). 14వ శతాబ్దంలో హిందూ ద్వేషి అయిన ఇస్లాం రాజు మాలిక్ కఫూర్ దాడులలో ఈ గుడిని కూడా ధ్వంసం చేయగా తరువాత దానిని పునరుద్ధరించారు.

దీక్షితుల వారు శివకామేశ్వరీ రూపంలో ఈ శివకామసుందరిని దర్శించి ఉపాసన చేశారు. ఈ కృతిలో లలితా సహస్రనామావళిలో చిదగ్ని కుండ సంభూతగా పలుకబడిన అమ్మవారిని ప్రస్తావించారు. అలాగే ఈ క్షేత్రంలో ఉన్న శివానంద నాయికను, స్కందుని కూడా ప్రస్తావించారు. శివుని ఆనందతాండవానికి చిదంబరం రంగస్థలం. ఆ తాండవంలో శివకామసుందరిని శృంగార రస సంపూర్ణకరిగా, హంసోల్లాసినిగా వర్ణించి స్థల పురాణానికి సార్థకత కలిగించారు. కళ్యాణి రాగంలో కూర్చబడిన ఈ కృతిని మల్లాది సోదరులు గానం చేశారు.


22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

పంచాశత్పీఠ రూపిణీ - దీక్షితుల వారి కృతి


పంచాశత్పీఠ రూపిణీ! మాం పాహి శ్రీ రాజరాజేశ్వరీ!

పంచదశాక్షరి! పాండ్యకుమారి! పద్మనాభ సహోదరి! శంకరి!

దేవీ! జగజ్జననీ! చిద్రూపిణి!
దేవాది నుత గురుగుహ రూపిణి!
దేశకాల ప్రవర్తిని! మహాదేవ మనోల్లాసిని! నిరంజని!
దేవరాజ ముని శాప విమోచని! దేవగాంధార రాగ తోషిణి!
భావ రాగ తాళ విశ్వాసిని! భక్త జన ప్రియ ఫల ప్రదాయిని!

ఏబది శక్తిపీఠములలో వెలసిన రాజరాజేశ్వరీ! నన్ను కాపాడుము! పదిహేను బీజాక్షరములు కల మంత్రరూపిణి! పాండ్యరాజుని కుమార్తెగా జన్మించిన మీనాక్షీ! శ్రీహరి సోదరీ! శంకరుని అర్థాంగీ! నన్ను కాపాడుము! ఓ దేవీ! నీవు లోకాలకే అమ్మవు! జ్ఞాన స్వరూపిణివి! దేవతలచే నుతించిబడిన కుమారుని తల్లివి! ఎల్లవేళలా అంతటా ప్రకాశించే అమ్మవు! పరమశివుని మనసును రంజిల్లజేసే నిర్మల మూర్తివి! మునులచే శపించబడిన ఇంద్రుని శాపవిముక్తుని చేసిన అమ్మవు! దేవగాంధార రాగములో అలరారి, భావ రాగ తాళములను విశ్వసించెదవు! భక్తుల కామ్యములను తీర్చెదవు! నన్ను కాపాడుము!

- ముత్తుస్వామి దీక్షితులు

శూలమంగళం సోదరీమణులు గానం చేసిన ఈ దీక్షితుల వారి కృతి దేవగాంధారి రాగంలో స్వరపరచబడింది. సగీత త్రయంలో దీక్షితుల వారి సాహిత్యంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.  వ్యాకరణము, మంత్రము, యోగము, భక్తి, క్షేత్ర వర్ణన, శ్రీ విద్యా ఉపాసన, తిరుత్తణి గురుగుహోపాసన దీస్ఖితుల వారి సాహిత్యంలో ప్రకాశిస్తూ ఉంటాయి. దీక్షితుల వారు తమ అనేక కీర్తనలలో తమ మంత్రశాస్త్ర ప్రావీణ్యంతో పాటు రాగం పేరును కూడా ప్రస్తావించారు. దేశమంతటా తిరిగి అనేక క్షేత్రాలలోని దేవతామూర్తులను దర్శించుకొని వారిని సంకీర్తనల ద్వారా నుతించారు. ఎక్కువ భాగం కీర్తనలను సుబ్రహ్మణ్యునిపైన, తరువాత అమ్మవారిపైన రచించారు. వీరిద్దరిని ఆయన బాగా ఉపాసించి సిద్ధి పొందారు. దేశంలో ఉన్న యాభై శక్తిపీఠాలను కూడా ఆయన సందర్శించారని ఆయన చరిత్ర చెబుతోంది. క్షేత్ర వైభవాలను మనకు అందించిన మహనీయులలో దీక్షితుల వారు అగ్రగణ్యులు. దేహాన్ని త్యజించే సమయంలో కూడా ఆయన అమ్మను స్మరించగలిగిన అపర భక్తులు. 

వావిళ్ల రామస్వామి శాస్త్రులు-వేంకటేశ్వర శాస్త్రులు - వావిళ్ల ప్రెస్



వావిళ్ల రామస్వామి శాస్త్రులు - వీరు తెలుగు వారికి అందించిన సాహితీ సంపద వెలకట్టలేనిది. ఈనాటికీ మనకు శుద్ధమైన తెలుగులో పుస్తకాలు, పురాణేతిహాసాలు, వ్రతకల్పాలు అందుబాటులో ఉన్నాయంటే అది వీరి చలవే. విఖ్యాతమైన సంస్థ వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వ్యవస్థాపకులైన వీరు సంస్కృతాంధ్ర పండితులుగా, వేదవిద్యా కోవిదులుగా పేరొందారు. 1826వ సంవత్సరంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో వీరు జన్మించారు. వీరు చిన్న వయసులోనే ఉభయభాషలలో ప్రావీణ్యం పొంది తాళపత్ర గ్రంథాలను సేకరించి, పరిష్కరించి టీకా తాత్పర్యం వ్రాసి, వాటిని ముద్రించి శాశ్వతంగా సాహిత్యాభిమానులకు అందుబాటులో ఉండేలా చేశారు. వీరి సేవను గుర్తించిన బ్రౌన్ మహాశయుడు చేతి వ్రాత పుస్తకాలు చదువుకునే రోజుల్లో శ్రీవావిళ్ల రామస్వామి శాస్త్రుల వారు ముద్రణాలయం స్థాపించి పాఠకులకు ఎంతో సౌకర్యం కలిగించారు అని కొనియాడారు. వావిళ్ల రామస్వామి శాస్త్రులు వారు ముద్రించి ప్రకటించిన గ్రంథములు 1876 సంవత్సరంలో ప్రచురితమైన లండన్ మ్యూజియంలోని గ్రంథాలయ పట్టికలో నమోదు చేయబడినవి. శ్రీమద్రామాయణమునకు టీకా తాత్పర్య విశేషార్థములతో మొట్ట మొదట ప్రచురించింది వీరే. వీరి సంపాదకత్వంలో అనేక సంస్కృతాంధ్ర గ్రంథములు పరిష్కరించి ముద్రణా భాగ్యమును పొందాయి.

1851వ సంవత్సరంలో రామస్వామి శాస్త్రులు గారి హిందూ భాషా సంజీవని అనే ప్రెస్ ద్వారా ఈ సంస్థను స్థాపించారు. తరువాత ఆది సరస్వతీ నిలయాన్ని కూడా ఆయనే స్థాపించారు. 50కి పైగా పుస్తకాలను తన జీవిత కాలంలో ఆయన ప్రచురించారు. 1891వ సంవత్సరంలో వీరు కాలం చెందారు. వీరికి వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రులు 1884 జన్మించారు. వేంకటేశ్వర శాస్త్రులు గారు 1906లో ఈ సంస్థకు నేతృత్వం వహించి వావిళ్ల ప్రెస్‌గా పేరు మార్చారు. ప్రచురణా పద్ధతికి మెరుగు దిద్ది సంస్థను అభివృద్ధి చేశారు. గోరఖ్‌పూర్ వారి గీతా ప్రెస్, వారణాసి వారి చౌఖంభా ప్రెస్‌తో అనుసంధానం చేసుకొని మనకు అమూల్యమైన వాఙ్మయాన్ని ముద్రిత రూపంలో అందజేశారు. ఉత్తమ ప్రమాణాలు గల ముద్రణంతో, సంపాదకీయ ప్రతిభతో వారు 900కు పైగా సంస్కృతాంధ్ర తమిళ ఆంగ్ల భాషలలో పుస్తకాలను ప్రచురించారు. వేంకటేశ్వర శాస్త్రులు గారి మహా దేశభక్తులు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఎన్నో దేశభక్తిని కలిగించే పుస్తకాలను ప్రచురించారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి చేత ప్రభావితులైనారు. అలాగే బంకించంద్ర ఛటర్జీ గారి ఆనందమఠాన్ని తెలుగులోకి అనువదించారు. ఆంధ్రకేసరి ప్రకాశం గారికి ఎస్. సత్యమూర్తిగారికి ఎంతో ఆర్థిక సహాయం చేశారు. మహాభారతం, రామాయణం, పోతన భాగవతం మొదలైన వాటిని ప్రచురించారు. వీరి సమయంలో ఈ సంస్థను ఇంగ్లాండులోని మెక్‌మిలన్ మరియు లాంగ్‌మాన్ సంస్థలతో పోల్చారు.



1916లో వీరు మా పూర్వీకులు, ఉభయ భాషా పారంగతులు అయిన అక్కిరాజు ఉమాకాంతం పంతులు గారితో కలిసి త్రిలింగ అనే పత్రికను స్థాపించారు. 1941లో ఈ పత్రిక రజతోత్సవం కూడా జరుపుకుంది. వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రులు గారు 1927లో ఫెడరేటెడ్ ఇండియా అనే ఆంగ్ల పత్రికను కూడా స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు నడిపించారు. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి గారితో కలిసి బాలవినోదిని అనే తమిళ మాస పత్రికను నడిపారు. వీరి షష్టిపూర్తి సమయంలో అభిమానులు వీరికి స్మారక ముద్రణను కూడా బహుమతిగా అందజేశారు. ప్రజా జీవితంలో ఎంతో పేరు పొందిన వీరు 1938లో ఆంధ్ర మహాసభ రజతోత్సవ సభకు అధ్యక్షునిగా పని చేశారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. పచయప్ప ట్రస్ట్ బోర్డు అధ్యక్షునిగా, హానరరీ మెజిస్ట్రేటుగా, మద్రాస్ పోర్ట్ ట్రస్ట్, కాస్మోపాలీటన్ క్లబ్, మాసోనిక్ లాడ్జ్, సుగుణ విలాస సభలతో అనుబంధం కలిగి సేవలు చేశారు. ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకులు వీరే. ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యునిగా కూడా పని చేశారు. వీరు సెమ్మంగూడి మరియు అలగప్ప మొదలైన ప్రముఖులకు సన్నిహితులు.

శ్రీనాథుని శృంగార సాహిత్యాన్ని వీరు ప్రచురించగా పిఠాపురం రాజావారు, జయంతి రామయ్య గారు వీరిపై అవి అసభ్యంగా ఉండే సాహిత్యం అని దావా వేసినా అది నిలబడలేదు. తరువాత వీరు వాత్సాయన కామసూత్రాలను కూడా ప్రచురించారు. 1931-33 మధ్య 18 భాగాల మహాభారతాన్ని వీరు సంస్కృతంలో ముద్రించారు.  వారణాసి పండితులు వీరికి శాస్త్ర ప్రచార భూషణ అనే బిరుదునిచ్చారు. వీరు చేసిన భాషా సేవకు భాషోద్ధారక బిరుదు కూడా వచ్చింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు వీరిని 1955లో కళాప్రపూర్ణ బిరుదుతో గౌరవించారు. ధనవంతురాలైన భార్యతో విభేదాలతో వీరి సంసార జీవితం మాత్రం ఒడిదుడుకులు గానే నడించింది. 1942లో పక్షవాతం పాలైన వీరు 1956లో తన 67వ ఏట మరణించారు. వీరికి సంతానం లేదు. ఆయన తరువాత వీరి ఆస్తులకై ఎన్నో న్యాయ పోరాటాలు నడిచాయి. ప్రచురణ సంస్థ మూత పడింది. చెన్నైలో వీవీస్ ట్రస్ట్ నామమాత్రంగా నడుస్తోంది. దీనికి అల్లాడి స్వామినాథన్ గారు ట్రస్టీ. కొన్నేళ్ల క్రితం హైదరాబదులో ముద్రణను పరిమితిగా ఈ ట్రస్ట్ ప్రారంభించింది.

ఈ తండ్రి-కొడుకులు తెలుగు భాషకు చేసిన సేవ చిరస్మరణీయం. ఇటీవలే వావిళ్ల వారి సహితీ సంపదల 150వ జయంతి కూడా జరిగింది. ఎందరో మహానుభావులు అందరికి వందనాలు. 

17, సెప్టెంబర్ 2017, ఆదివారం

శరవణభవ గుహ షణ్ముఖ - తంజావూరు శంకర అయ్యర్ కృతి


శరవణభవ గుహ  షణ్ముఖ
తిరుమరుళ్ పురియ వా వా

మరువుం వళ్లీ దేవయాని మనాళ
కరుణై మళి పొళియ వా దయాళ

కుణ్డ్రు తోరుం ఆడుం కుమరనే  
కురైగళ్  తీర్థరుళ విరైవినిల్ నీ వా
ఎణ్డ్రుం ఇంబం తరుం  తమిళిసైక్క వా
ఇరంగి ఎంగళుక్కు జ్ఞానం తళైక్క వా

రెల్లు గడ్డి నుండి జన్మించి, ఆరు ముఖములు కలిగిన ఓ సుబ్రహ్మణ్యా! నీ కరుణతో మాకు శుభములు కురిపించుటకు రావయ్యా!  ఓ దయాళుడవైన వల్లీ దేవసేనా పతీ! నీ కరుణావృష్టిని కురిపించుటకు రావయ్యా! కొండలలో తిరుగుతూ ఆడుకునే ఓ కుమారా! మా కామ్యములు తీర్చుటకు రావయ్యా! నిత్యానందమునిచ్చే తమిళమును పాడుటకు రావయ్యా! మాపై కరుణ చూపించి జ్ఞానాన్ని ప్రసాదించుము.

(తమిళనాట భాషకు దైవ స్వరూపంగా కుమారస్వామిని కొలుస్తారు. అగస్త్య మహాముని కుమారస్వామిని ఉపాసించగా, ఆయన నోట ఈ భాష ఆ ప్రాంతంలో పలుక బడి ప్రసిద్ది పొందిందని వారి నమ్మకం)

- తంజావూరు శంకర అయ్యర్

షణ్ముఖుని నుతించే ఈ కృతిని కర్త శహానా రాగంలో స్వరపరచారు. ఈ రాగం ఆర్తికి, భక్తికి, శరణాగతికి ప్రతీక. కృతిలోని భావానికి సముచితమైన రాగంలో స్వరపరచటం వాగ్గేయకారుని పూర్ణప్రజ్ఞను సూచిస్తుంది. తంజావూరు శంకర అయ్యరు గారు 1924లో తిరుచిరాపల్లి జిల్లలోని తోగమరైలో జన్మించారు. టైగర్ వరదాచాయులు మొదలైన వారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ఈయన శిష్యులలో టీవీ శంకరనారాయణన్, నేవేలి సంతానగోపాలన్, చిత్రవీణ రవికిరణ్ మొదలైన మహామహులెందరో ఉన్నారు. ముంబై షణ్ముఖానంద సభ ద్వారా ఎందరో శిష్యులకు శిక్షణనిచ్చారు. కలైమామణి బిరుదును పొందారు. ఈ కృతి సాహిత్యంలో ఆర్తిని రాగం ద్వారా అందించటంలో ఆయన కృతకృత్యులైనారు. రంజని-గాయత్రి సోదరీమణులు ఈ కీర్తనను గానం చేశారు. 

10, సెప్టెంబర్ 2017, ఆదివారం

గడప దాక వచ్చి మరలి పోయావు - డాక్టర్ శోభారాజు గారి మధురభక్తి గీతం


గడప దాక వచ్చి మరలి పోయావు
వెను దిరిగి రమ్మని నే పిలుచు లోపే
పిలుపందనంత దూరానికేగావు! స్వామీ! 

గుడిసెనంతా అలికి ముగ్గులేశాను
తోరణాలను కట్టి తలుపు తెరిచుంచాను
దీపాలు వెలిగించి ధూపమేసే లోపు
గడప దాకా వచ్చి మరలి పోయావు
వెను దిరిగి రమ్మని నే పిలుచు లోపే
పిలుపందనంత దూరానికేగావు! స్వామీ! 

భక్ష్యభోజ్యాదులను ప్రేమార చేశాను
కొసరి నీవు తినగా విస్తరేశాను
విశ్శ్రాంతి గొందువని పానుపేసే లోపు
గడప దాకా వచ్చి మరలి పోయావు
వెను దిరిగి రమ్మని నే పిలుచు లోపే
పిలుపందనంత దూరానికేగావు! స్వామీ!

ఏర్పాట్లలో మునిగి ఏమరను ఇకను
కటిక చీకటిగుంది చిరుదివ్వె చేబట్టి
కాలాన్ని మరచి నే ఎదురు చూస్తున్నాను
వస్తావుగా స్వామి మరియొక్క మారు

కాళ్లు వణకేను కళ్ళు చెదరేను
వంటి చేవంతా కంటి నీరాయెను
పెనుగాలికీ దివ్వె పెనుగులాడేను
వస్తావుగా స్వామి మరి యొక్క మారు

- డాక్టర్ శోభారాజు గారు

పదకవితా పితామహుని సంకీర్తనలను ప్రచారంలోకి తీసుకు రావటంలో అగ్రగణ్యులైన డాక్టర్ శోభారాజు గారి అద్భుతమైన మధురభక్తి గీతం ఇది. కృష్ణభక్తి వారికి చిన్ననాడే ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలుగా జీవితంలో అంతర్భాగమై పోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కళను పరమాత్మ సేవకు అంకితం చేసి  పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారి అమూల్యమైన సంకీర్తనా సంపదలోని భావాన్ని ప్రత్యేకమైన మార్గంలో ప్రచారం చేస్తున్నారు పద్మశ్రీ దాక్టర్ శోభారాజు గారు. ఈ మహాయజ్ఞంతో పాటు వారు ఎన్నో సంకీర్తనలను రచించారు. అందులో ఒకటి ఈ గడప దాకా వచ్చి అనే రచన. రాధ, మీరాల మధురభక్తి ఈ గీతంలో స్పష్టంగా కనబడుతుంది. స్వామి వస్తున్నాడన్న ఆనందంలో ఇల్లు అలికి, ముగ్గేసి, తోరణాలు కట్టి, ధూప దీపాలు వెలిగించి, చక్కని భోజనము ఏర్పాటు చేసి, సేదదీరేందుకు పానుపు వేసేలోపు  భక్తురాలు అంతలో స్వామి వెళ్లిపోయాడన్న విచారంలోని మనోభావన ఈ గీతం. ఈ ఏర్పాట్లలో మునిగి స్వామి రాకను ఏమరచేనేమో అని కారు చీకటిలో దివ్వెను చేతబట్టి ఎదురు చూస్తున్న కృష్ణ భక్తురాలి హృదయ సవ్వడులను మనోజ్ఞంగా తెలిపే గీతం ఇది. ఎదురు చూపులో శరీరం బలహీనమై, శక్తి అంతా కన్నీరు ధార కాగా, గాలీ దీపం ఊగిసలాడుతుండగా స్వామిని మరల రమ్మని వేడుకునే గీతం అమ్మ శోభారాజు గారు అద్భుతంగా రచించారు.

భక్తికి శరణాగతి అతి ముఖ్యం. ఈ శరణాగతిని నేను శోభారాజు అమ్మలో పరిపూర్ణంగా గమనించాను. కృష్ణభక్తిలో ఉన్న వారిలో ఈ శరణాగతితో పాటు, ప్రశాంతత, స్థితప్రజ్ఞత, దృఢమైన వ్యక్తిత్వం, పరమాత్మతో ఓ విలక్షణమైన అనుబంధం కలిగి ఉంటారు. శోభారాజు గారు చేస్తున్న సేవ అమూల్యమైనది. ఆధ్యాత్మిక సంపదతో పాటు వ్యక్తిత్వ వికాసంతో కూడిన సామాజిక స్పృహ కలిగిన శోభారాజు గారు మన సమాజాన్ని, నేటి హిందుత్వాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యల గురించి సుస్ఫటమైన భావనలు కలిగిన వారు. డొల్లతనాన్ని, ద్వంద్వ ప్రమాణాలను, కుహనా వాదాలను, దురాచారాలను ఖండిస్తూ ఈ సమాజంలో  పోరాటం సాగిస్తున్న యోధురాలు అమ్మ. ఒక్క గీతంలో ఇన్ని భావనలను వ్యక్తపరచటం అనేది ఆ స్వామి అనుగ్రహమే. ఆధ్యాత్మిక సాధనలో, భక్తి సంగీతం ద్వారా భావకాలుష్య నివారణ అనే అద్భుతమైన లక్ష్యంతో ముందుకు వెళుతున్న శోభారాజు గారు ఇటువంటి గీతాలను ఎన్నో రచించారు. వారి భావ సంపద ఈ సమాజంలో మరింత ప్రచారంలోకి రావాలని నా ప్రార్థన.

శోభారాజు గారు ఈ గీతం ఆలపించిన రీతి అత్యంత మధురం. చరణాలు ముందుకు సాగిన కొద్దీ భావనలకు అనుగుణంగా గాత్రాన్ని మార్చి వేర్వేరు రసాలను పండించారు. స్వామీ అని పిలిచే రీతి మనసును కరగించి వేస్తుంది. బద్ధుడై స్వామి రావలసిందే అని మనసు నిశ్చయమయ్యేలా గానం చేశారు. చివరి చరణంలో శృతిని మార్చి ఆర్తితో వారు పాడిన పద్ధతి మధురభక్తికి నిదర్శనం. గీతాన్ని లలితంగా, భావనలకు అనుగుణంగా స్వరపచటంలో శోభారాజు గారి సాధన ప్రతిబింబిస్తుంది. ఈ గీత భావం అనుభవైకవేద్యం.  అన్నమాచార్య భావనా వాహిని ద్వారా ఈ గీతానికి రమణీయమైన, సముచితమైన చిత్రాలను పొందుపరచి వీడియో రూపొందించిన పార్థసారథి గారికి నా అభిననందలు, కృతజ్ఞతలు.

9, సెప్టెంబర్ 2017, శనివారం

జగమే మారినది మధురముగా ఈ వేళ - మధుర గీతం (దేశద్రోహులు చిత్రం - 1964)




సాలూరి రాజేశ్వరరావు గారు ఎంతటి మహా సంగీత దర్శకులో, ఘంటసాల మాష్టారు, సుశీలమ్మ ఎంతటి మధుర గాయకులో తెలుసుకోవటానికి కొన్ని పాటలు వింటే చాలు. సాహిత్యకారుల ప్రతిభ ఒక ఎత్తైతే దానికి తగ్గ సంగీతం అందించటం సంగీతకారుల ప్రతిభ. మేరు పర్వతమంత ఎత్తైనది సాలూరి వారి సంగీత విద్వత్తు. లలితమైన పాటలకు అత్యంత మధురమైన సంగీతాన్ని అందించటంలో ఆయన మేటి. అటువంటి పాటను ప్రతిభామూర్తి ఆరుద్ర గారు రచించగా రసాలూరించే సాలూరి వారు స్వరపరచగా మధుర గాయకులు ఘంటసాల మాష్టారు, సుశీలమ్మ ఎంతో మధురంగా పాడారు. ఇది 1964లో విడుదలైన దేశద్రోహులు చిత్రంలోని జగమే మారినది మధురముగా ఈ వేళ అన్న పాట. ఇది చిత్రంలో రెండు సందర్భాలలో వస్తుంది. మొదటిది సుశీలమ్మ, ఘంటసాల మాష్టారు యుగళ గీతంగా పాడగా, రెండవది భగ్న ప్రేమికునిగా నాయకుడు అన్న ఎన్‌టీఆర్‌పై కాస్తంత బరువైన సన్నివేశంలో చిత్రీకరించబడి ఘంటసాల మాష్టారు అత్యద్భుతంగా పాడిన గీతం. యుగళ గీతం ఉత్సాహంగా సాగేదైతే సోలో గీతం కాస్త గంభీరంగా సాగుతుంది. సంగీతకారులు మరియు గాయకుల ప్రతిభ విలక్షణంగా తెలుస్తుంది. కళ్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ గీతం అజరామరమై నిలిచింది. పాట మొత్తం అద్భుతమైన స్వరాలతో సితార్, తబలా వాద్య నాదాలతో రాజేశ్వరరావు గారు స్వరపరచారు.

ఆరుద్ర గారి గీతంలోని భావాన్ని పరిశీలిస్తే, లలితమైన పదాలతో ఎంతటి మధురమైన భావనలను పండించారో అర్థమవుతుంది. మనసు నెమలిలా ఆడిందట, పావురాలు పాడాయట, జగమంతా ఎంతో మధురముగా మారిందట. గొరవంక, రామచిలుక చెంత చేరగా అవి అందమైన జంటగా కనబడ్డాయట. ప్రేమ, స్నేహము కలిసి జీవితము పండగా ఓ చిత్రమైన పులకింత కలిగిందట. విరజాజి పూవుల సువాసన స్వాగతము పలుకగా, తుమ్మెద ఆ జాజులలోని మధువు యొక్క తీయదనాన్ని కోరి ప్రేమలో తేలుతూ తిరిగాడిందట. ప్రేమలో పడిన వారికి కలలు, కోరికలు తీరినప్పుడుండే భావనలను ఈ గీతం తెలుపుతుంది. గీతమంతా ఒకే సాహిత్యాన్ని ఉపయోగించి ఒక్క ఆఖరి పంక్తిలో సందర్భోచితంగా సాహిత్యాన్ని మార్చి పాట భావం ఏ మాత్రం చెదరకుండా రచించిన ఆరుద్ర గారి ప్రతిభ అమోఘం.

మాధుర్యానికి మారు పేరు సుశీలమ్మ, అంతే గొప్పగా ఘంటసాల మాష్టారు స్వరయుక్తంగా పాడారు. ఇద్దరూ కలిసి కొన్ని వందల పాటలు దశాబ్దాల పాటు పాడారు. వారిరువురూ తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని మధురమైన గీతాలతో అలరించారు. ఒకరకంగా సాలూరి వారు, ఘంటసాల, సుశీలమ్మల బృందం ఆనాడూ ఈనాడూ కూడా టాప్ క్లాస్ అని చెప్పుకోవాలి. సంగీతానికి, మాధుర్యానికి, భావసంపదకు ఆనాడు ఎంత ప్రాధాన్యముండేదో, వాటికి తగినట్లు గాయకులు కూడా తమలోని ప్రతిభ పాటను మరింత ప్రేక్షకుల మనసులను దోచుకునేలా పాడే వారు. అందరూ పరిపూర్ణమైన న్యాయం చేసేవారు. అందుకే ఇటువంటి పాటలు దశాబ్దాల పాటు నిలిచి మనుషుల హృదయాలను రంజిల్లజేస్తూనే ఉంటాయి.

యుగళ గీతం
సోలో

జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవి మనసారా

మనసాడెనే మయూరమై పావురములు పాడే! ఎల పావురములు పాడే!
ఇదే చేరెను గోరువంక రామచిలుక చెంత! అవి అందాల జంట!
నెనరు కూరిమి ఈనాడే పండెను! జీవితమంతా చిత్రమైన పులకింత!!

విరజాజుల సువాసన స్వాగతములు పలుక! సుస్వాగతములు పలుక!
తిరుగాడును తేనెటీగ తియ్యదనము కోరి! అనురాగాల తేలి!
ఎదలో ఇంతటి సంతోషమెందుకో! ఎవ్వరికోసమో! ఎందుకింత పరవశమో! (యుగళ గీతం)
కమ్మని భావమే కన్నీరై చిందెను! ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి!! (సోలో)


3, సెప్టెంబర్ 2017, ఆదివారం

శ్రీ విష్ణు గీతం - భారతీతీర్థ మహాస్వామి రచన


శృంగేరి శారదా పీఠ జగద్గురువు భారతీతీర్థ మహాస్వామి వారు రచించిన అద్భుతమైన విష్ణు గీతం. వారి సాహిత్యానికి ఆ చిన్నారి హరిప్రియ చేసిన నృత్యం చూస్తే మనసు ఉప్పొంగుతుంది. శ్రీహరిని శరణాగతితో పరిపరి విధాల వేడుకునే ఈ గీతం ఆది శంకరుల స్తుతులను గుర్తు చేస్తుంది. గీతం వివరాలు:

శ్రీ విష్ణు గీతం 

గరుడగమన తవ చరణకమలమిహ  మనసి లసతు మమ నిత్యం
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

జలజ నయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పదపద్మ 
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

భుజగశయన భవ మదన జనక  మమ జనన మరణ భయహారీ
మమ తాపమపా కురు దేవ  మమ పాపమపా కురు దేవ

శఙ్ఖ చక్రధర దుష్ఠ దైత్య హర సర్వలోక శరణ
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

అగణిత గుణగణ అశరణశరణద విదళిత సుర రిపు జాల
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

భక్తవర్యమిహ భూరికరుణయా పాహి భారతీ తీర్థం
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

 ఓ గరుడ వాహనుడవైన శ్రీహరీ! నీ పాదపద్మములు నా మనసునందు నిత్యము ఉద్దీపనము చేయుము. నా తాపమును, పాపమును హరింపుము దేవా!  కలువలవంటి కన్నులు కలిగిన శ్రీహరీ! బ్రహ్మ,ఇంద్రుడు, జ్ఞాన గణముచే నుతించించబడిన పదపద్మములు కలవాడా! నా తాపమును, పాపమును హరింపుము దేవా!  ఆదిశేషునిపై శయనించే శ్రీహరీ! మన్మథుని తండ్రీ! నా జనన మరణ భయములను తీర్చువాడా  నా తాపమును, పాపమును హరింపుము దేవా!  శంఖ చక్రములని ధరించిన నారాయణా! దుష్టులైన రాక్షసుల హరించినవాడా! సర్వలోకములకు రక్షణ కలిగించే వాడా! నా తాపమును, పాపమును హరింపుము దేవా! ఎనలేని సుగుణములు కలిగిన నారాయణా! దీనులకు దిక్కైనవాడా! దేవతల వైరులను సంహరించువాడా! నా తాపమును, పాపమును హరింపుము దేవా! నీ భక్తుడనైన ఈ భారతీతీర్థుని అపారమైన కరుణతో రక్షించుము. నా తాపమును, పాపమును హరింపుము దేవా!

జగద్గురు భారతీతీర్థస్వామి వారి సంగ్రహ చరిత్ర:



1951వ సంవత్సరం ఏప్రిల్ 11న (ఖర నామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్టి నాడు) గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతమైన దాచేపల్లి సమీపంలో నాగులేరు ఒడ్డున అలుగుమల్లిపాడులో తంగిరాల వేంకటేశ్వర అవధాని, అనంతలక్ష్మమ్మ దంపతులకు నోముల ఫలంగా బాలుడు జన్మించాడు. అవధాని గారు నిత్యము భవానిశంకరునికి రుద్రాభిషేకం చేసే వారు. అలాగే రామనవమి సమయంలో నవరాత్రి ఉత్సవాలు చేసేవారు. అనంతలక్ష్మమ్మ హనుమంతుని ధ్యానించేది. నలుగురు ఆడపిల్లల తరువాత మగపిల్లవాడు పుడితే సీతారాముల పేరు, ఆంజనేయుని పేరు పెట్టుకోవాలని ఆ దంపతులు సంకల్పించారు. అందువలన ఆ బాలునికి తల్లిదండ్రులు సీతారామాంజనేయులు అని నామకరణం చేశారు. మూడేళ్ల వయసు నుండే శివనామాన్ని ఆ బాలుడు స్మరించాడు. నిరంతరం స్వామి నామ స్మరణలో తనను తాను మరచే వాడు. ఐదేళ్ల వయసుకే సంస్కృతాన్ని ప్రతాపగిరి శివరామశాస్త్రి గారి వద్ద నేర్చుకోవటం ప్రారంభించారు. తొమ్మిదేళ్ల వయసుకే సంస్కృతంపై పట్టు సాధించారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మొదలైన పండితుల మన్ననలు పొందారు. ఆకాశవాణిలో సంస్కృత కార్యక్రమాలలో పాల్గొనటానికి సీతారామాంజనేయులును పిలిచారు. సంహిత, బ్రాహ్మణ, అరణ్యక చిన్న వయసులోనే చదివిన సీతారామాంజనేయులు గుంటూరు జిల్లా వేదప్రవర్ధక విద్వత్ పరీక్షలో ఉత్తీర్ణులైనారు.

1961వ సంవత్సరంలో సీతారామాంజనేయులును ఉపాధ్యాయుడు విజయవాడలో పర్యటిస్తున్న శృంగేరి శారదా పీఠం అధిపతి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి ముందు సంస్కృతంలో సంభాషించ వలసిందిగా కోరాడు. సుస్పష్టంగా సంస్కృతంలో మాట్లాడటంతో ఆ బాలుడికి ప్రత్యేక బహుమతి లభించింది. అప్పుడు స్వామి దర్శనంతో ఆ బాలుడి మనసులో ఆయనే తనకు దారి, గురువు అని నిశ్చయమైంది. 1966వ సంవత్సరంలో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఉజ్జయినిలో చాతుర్మాస్యం చేస్తున్నారు. అక్కడికి స్వామి ఆశీస్సులకై సీతారామాంజనేయులు తల్లిదండ్రులతో వెళ్లి తనకు శాస్త్రాలను బోధించవలసిందిగా కోరాడు. క్షిప్రా నదిలో స్నానమాచరించి వస్తున్న స్వామి ఆ బాలుని వైరాగ్యము, భక్తి చూసి ఎంతో సంతోషించి శిష్యునిగా స్వీకరించారు. ఎక్కడ నరసరావుపేట? ఎక్కడ ఉజ్జయిని? ఉన్నత పాఠశాల విద్య చదువుతున్న బాలుడు మంచి చదువులు చదవాలని తండ్రి అభిలాష. మరి ఏమిటీ అనుకోని మలుపు? ఇదంతా ఆ శారదాంబ అనుగ్రహమే అన్నారు భారతీతీర్థ స్వామి వారు. చిన్ననాటి దర్శనం తరువాత అభినవ విద్యాతీర్థ స్వామి వారే తన మనసులో నిలిచి తనను ముందుకు నడిపారని, తన సమస్యలకు పరిష్కారం చూపారని, ఆ గుర్వనుగ్రహమే తనను అంత బలీయంగా ఉజ్జయినికి తీసుకు వెళ్లిందని అన్నారు.



అప్పటినుండి సీతారామాంజనేయులు స్వామితోనే ఉన్నారు. ఎనిమిదేళ్లలో కృష్ణ యజుర్వేదం, పూర్వ ఉత్తర మీమాంసలు, న్యాయశాస్త్రముతో పాటు మరెన్నో శాస్త్రాలను అధ్యయనం చేశారు. సంస్కృతంలో రచనలు కూడా చేశారు. 1974వ సంవత్సరంలో అభినవ విద్యాతీర్థస్వామి వారు సీతారామాంజనేయులుకు సన్యాస దీక్షనిచ్చి వారిని భారతీతీర్థస్వామిగా నామకరణం చేశారు. స్వామి వారు అప్పటికే మాతృభాష తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషలలో కూడా ప్రావీణ్యం పొందారు. సన్యాస స్వీకారం వెంటనే గురువులతో కలసి విజయయాత్ర చేశారు. గురువులతో కలసి ఉత్తరభారత దేశంలో పర్యటించినప్పుడు సంస్కృత హిందీ భాషలలో అక్కడి పండితులు, యోగులు, స్వాములతో సంభాషించి వారి మన్ననలు పొందారు. భారతీతీర్థ స్వామి వారికి అమితమైన గురుభక్తి. నిరంతరం గురువులను అనుసరిస్తూ, గమనిస్తూ వారి సుశ్రూషలో గడిపేవారు. 15 ఏళ్ల పాటు ఆ విధంగా తన గురువులైన మహాస్వామి వద్ద అమూల్యమైన సమయం గడిపి ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పొందారు.

1989లో గురువుల మహాసమాధి తరువాత భారతీతీర్థస్వామి శృంగేరి శారదా పీఠానికి 36వ మహాస్వామిగా పీఠాధిపత్యాన్ని స్వీకరించారు. వేద విద్యను అభివృద్ధి చేయటానికి, సనాతన ధర్మ పరిరక్ష్ణకు విశేషమైన సేవలు అందిస్తూ అమిత తపోబల సంపన్నులై, పరమ నిష్ఠా గరిష్ఠులై దేశంలోనే అతి పవిత్రమైన పీఠంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. శారదా ధన్వంతరి ఆసుపత్రి స్వామి వారి సంకల్పబలంతో సాకారమైంది. ఈ ఆసుపత్రి ద్వారా శృంగేరి మరియు చుట్టు పక్కల గ్రామాలకు వైద్య సేవలందిస్తున్నారు. వేదపండితుల దయనీయ పరిస్థితి గ్రహించిన స్వామి వారు పండితులకు జీవనభృతిని కలిగించే ఏర్పాటు చేశారు. ఇక్కడి వేదపాఠశాలలో అత్యుత్తములైన పండితులను విద్యార్థులకు బోధించేలా నియమించి వేదవిద్యాభివృద్ధికి తోడ్పడుతున్నారు. లోక కళ్యాణార్థం పీఠం ఆధ్వర్యంలో శత, సహస్ర చండీ హోమాలు, అతిరుద్ర యాగాలు నిరంతరం నిర్వహించేలా స్వామి ఏర్పాటు చేశారు. పీఠాన్ని దర్శించుకునే భక్తుల కోసం శారదా కృప, యాత్రి నివాస్‌ల పేరిట వసతి గృహాలను నిర్మించారు. ఎన్నో ఏళ్లుగా చాతుర్మాస్య దీక్షా సమయంలో బ్రహ్మసూత్ర భాష్యాల వివరణ చేస్తూ సనాతన ధర్మ ప్రచారానికి తొడ్పడుతున్నారు.

2015 జనవరి 22న తిరుపతికి చెందిన యువ బ్రహ్మజ్ఞాని కుప్పా వేంకటేశ్వర ప్రసాద్ గారిని తన శిష్యునిగా స్వీకరించి అతనిని సన్యాసాశ్రమంలోకి ప్రవేశ పెట్టారు. భారతీతీర్థస్వామి వారి అనంతరం ఈ విదుశేఖర భారతీస్వామి వారు శృంగేరి పీఠాన్ని అధిరోహిస్తారు. శృంగేరి పీఠంలో తెలుగు స్మార్త బ్రాహ్మణులు పీఠాధిపతిగా పరంపర ఈ విధంగా కొనసాగబోతోంది. శ్రీ గురుభ్యో నమః.

2, సెప్టెంబర్ 2017, శనివారం

కమలాంబ నవావరణ కీర్తనలు - ముత్తుస్వామి దీక్షితుల ఆధ్యాత్మిక వైభవం



తిరువారూర్ త్యాగరాజస్వామి, కమలాంబ క్షేత్ర  వివరాలు:

తిరువారూరు - కావేరీ డెల్టా ప్రాంతంలో ఉన్న ఓ పురాతన పట్టణం. ఇక్కడ త్యాగరాజస్వామి (శివుడు) దేవస్థానం ప్రసిద్ధి. ఉత్తరాన సుకుమార నది, దక్షిణాన వలైయార్ నది, నగరం మధ్య నుండి ఓడంబొక్కి నది ప్రవహిస్తాయి. కావేరీ ఉపనదులైన వెన్నార్, వెట్టార్ నదులు కూడా ఇక్కడైకి దగ్గరలోనే ఉన్నాయి. తిరువారూరు చోళులకు రాజధాని. ఈ నగరంలో పురాతన దేవాలయమైన త్యాగరాజస్వామి సన్నిధిని తొలుత ఆదిత్య చోళుడు క్రీస్తు శకం 871-801 సంవత్సరాల మధ్యలో నిర్మించగా, తరువాత రాజ రాజ చోళుడు, రాజేంద్ర చోళుడు మరియు పాండ్య రాజులు పునరుద్ధరించారు. తిరువారూరు కులోత్తుంగ చోళుని (కీ.శ 1070-1120) రాజధాని కూడా. ఆ సమయంలోనే శైవం బాగా వ్యాపించింది. చోళుల తరువాత పాండ్యులు, అటు తరువాత విజయనగర రాజులు, నాయక రాజులు, మరాఠా రాజులు పరిపాలించారు. కళలకు, సంస్కృతికి తిరువారూరు ఆలవాలమైంది. శైవ నాయనార్ గురువులు, కవి ఆయన జ్ఞాన సంబంధర్ తిరువారూరు గురించి ప్రస్తావించారు.


ఇంతటి భవ్యమైన చరిత్ర గల తిరువారూరు పట్టణంలో ఉన్న త్యాగరాజస్వామి దేవస్థానంలో ఆదిపరాశక్తి కమలాంబగా వెలసింది. ఆ అమ్మ పేరుతోనే తిరువారూరు కమలాలయక్షేత్రంగా కూడ పిలువబడింది. ఈ దేవస్థానం సమీపంలో కమలాలయ తటాకం ఉండటం  విశేషం. ఈ కమలాంబ ప్రత్యేకతలు ఎన్నో. అమ్మవారు సుఖాసీనురాలుగా కాకుండా యోగ ముద్రలో ఒక కాలి మీద మరొక కాలు మెలిక వేసి కూర్చొని ఉంటుంది. తన చేత కమలము, పాశాంకుశము, రుద్రాక్ష ధరించి యోగినిగా దర్శనమిస్తుంది. శ్రీవిద్యా ఉపాసనా పద్ధతిలో ఇక్కడ అమ్మవారిని కొలుస్తారు. కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారు  ఈ కమలాంబ శ్రీ విద్యా ఉపాసనతో జ్ఞాన దృష్టి కలిగి ఈ అమ్మపై 9 కీర్తనలను రచించారు. వీటిని నవావరణ కృతులు అంటారు. శ్రీచక్రంలో ఉన్న తొమ్మిది ఆవరణలకు ఈ తొమ్మిది కృతులను దీక్షితుల వారు రచించారు. ధ్యానము, మంగళము కలుపుకొని మొత్తం 11 కమలాంబ కృతులు ఆయన జ్ఞాన ధారగా వెలువడ్డాయి. తోడి రాగంలో ధ్యాన కృతి కమలాంబికే, తరువాత ఆనందభైరవిలో కమలాంబ సంరక్షతు, కళ్యాణి రాగంలో కమలాంబాం భజరే, శంకరాభరణ రాగంలో శ్రీ కమలాంబికాయ రక్షితోహం, కాంభోజి రాగంలో కమలాంబికాయై, భైరవిలో శ్రీ కమలాంబాయాః పరం, పున్నాగవరాళి రాగమలో కమలాంబికాయాస్తవ, శహానా రాగంలో శ్రీ కమలాంబికాయాం, ఘంట రాగంలో శ్రీ కమలాంబికే, ఆహిరి రాగంలో శ్రీ కమలాంబా జయతి, శ్రీ రాగంలో శ్రీ కమలాంబికే అనే 11 కృతులను రచించారు.

ఈ కీర్తనలలో విభక్తి అవరోహణ ప్రత్యేకత. కృతుల సాహిత్యాన్ని పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఈ నవావరణ కీర్తనలు గానానికి క్లిష్టతరమైనవిగా చెప్పబడతాయి. దీక్షితుల వారు చాలా గొప్ప శ్రీ విద్యా ఉపాసకులు. లోకానికి ఈ ఉపాసనలోని గొప్పతనాన్ని చెప్పటానికి ఆయన దేవతల, యోగినుల వివరాలతో ఈ కృతులను రచించారు. చక్రాలను, ఆయా దేవతల వలన కలిగే సిద్ధులను ఆయన వర్ణించారు. శ్రీవిద్యా ఉపాసన అందరికీ కాదు. చాలా నిష్ఠగా, అర్హులైన గురువుల అనుగ్రహంతో చేయవలసినది. ఈ ఉపాసన సరిగ్గా తెలిసిన గురువులు కూడా చాలా తక్కువ. ఈ నాటి కాలంలో ఇటువంటి ఉపాసన తాంత్రికంగా భావించబడుతుంది. కానీ, దీక్షితుల వారు సిద్ధులైన వారు. తిరువారూరులో అమ్మను ఉపాసన చేస్తూ ఈ కృతులను రచించారు.

కమలాంబ నవావరణ కృతులలో మొదటిది కమలాంబా సంరక్షతు మాం. సాహిత్యం, భావం వివరాలు:

కమలాంబా సంరక్షతు మాం హృత్కమల నగర నివాసినీ

సుమనసారాధితాబ్జ ముఖీ సుందర మనః ప్రియకర సఖీ
కమలజానంద బోధ సుఖీ కాంతాతార పంజర శుకీ

త్రిపురాది చక్రేశ్వరీ అణిమాది సిధ్ధేశ్వరీ నిత్య కామేశ్వరీ క్షితి
పుర త్రైలోక్య మోహన చక్రవర్తినీ ప్రకట యోగినీ సుర 
రిపు మహిషాసుర మర్దనీ నిగమ పురాణాది సంవేదినీ 
త్రిపురేశీ గురుగుహ జననీ త్రిపుర భంజన రంజనీ మధు 
రిపు సహోదరీ తలోదరీ త్రిపుర సుందరీ మహేశ్వరీ

మా హృదయ కమలములలో నివసించే ఓ కమలాంబా! మమ్ములను రక్షింపుము. మంచి మనసులు కలిగిన వారిచే ఆరాధించబడుతూ కలువ వంటి ముఖము కల అమ్మా! నీవు పరమశివునికి మనసును రంజిల్ల జేసే సఖివి. కమలమునుండి జన్మించి జ్ఞానమయివై సుఖిణే తల్లివి! తారా చక్రమనే పంజరములో నివసించే చిలుకవు! త్రిపురాది చక్రములకు అధిదేవతవు, అణిమాది సిద్ధులకు ఈశ్వరివి,నిత్య కామేశ్వరివి నీవు! ముల్లోకాలను శాసించే మహారాజ్ఞివి, యోగినిగా ప్రకటితమైన అమ్మవు. మహిషాసురుని సంహరించిన ఆదిపరాశక్తివి, వేద పురాణములలో తెలుపబడిన అమ్మవు. నీవు ఆ పరమశివుని ఈశ్వరివి, కుమారుని తల్లివి. త్రిపురాసురుల సంహారాన్ని ఆనందించిన తల్లివి, శ్రీహరి సహోదరివి, త్రిపుర సుందరివి, మహేశ్వరివి. మమ్ములను రక్షింపుము.

దీక్షితుల వారి వివరాలు:



దీక్షితుల వారు సంగీతమే కాకుండా వేద వేదాంగాలు, యోగ, మంత్ర, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. భారతదేశమంతటా సంచారము చేసిన మహాజ్ఞాని. కర్ణాటక హిందూస్థానీ సంగీత శాస్త్రాలే కాకుండా పాశ్చాత్య సంగీతములో కూడా పరిశోధన చేసి నైపుణ్యము పొందిన వారు. తెలుగును ప్రోత్సహించిన సీపీ బ్రౌను గారితో కలిసి పాశ్చాత్య సంగీత బాణీలలో కూడా కృతులను స్వరపరచారు. సంస్కృతము, తెలుగు, తమిళములలో పారంగతులు. మణిప్రవాళ శైలిలో రచనలు చేసిన మహా నిష్ణాతులు. వీరి తండ్రి రామస్వామి దీక్షితులు శ్రీవిద్యా ఉపాసకులు. వీరు  తిరువారూరులోని కమలాంబికను నవావరణ ఉపాసాన చేశారు. వైదీశ్వరన్ కోయిల్‌లోని బాలాంబికను ఉపాసన చేయగా ఆ తల్లి నలభై రోజుల తరువాత అనుగ్రహించి ఓ ముత్యాల హారాన్ని ప్రసాదించింది. 1776లో తిరువారూరులోని త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాల సమయంలో కృత్తికా నక్షత్రమున సుబ్బలక్ష్మి అమ్మాళ్-రామస్వామి దంపతులకు  కుమారుడు జన్మించెను. అతనికి ముత్తుకుమారస్వామి అని నామకరణం చేయగా ఆ బాలుడు ముత్తుస్వామి దీక్షితులుగా పేరుగాంచాడు. రామస్వామి దీక్షితులకు శ్రీవిద్యా ఉపాసనను అందించిన సద్గురువులు చిదంబరనాథ యోగే ముత్తుస్వామి దీక్షితుల వారికి కూడా దానిని ఉపదేశించారు. ఇది కాశీ నగరంలో జరిగింది. అక్కడే యోగులు దీక్షితుల వారికి శంకర భగవత్పాదుల అద్వైత సిద్ధాంతాలను బోధించారు. కాశీలో కొన్నేళ్ల పాటు సూర్యోదయమునకు పూర్వమే గంగా స్నానము, అనుష్ఠానము, అన్నపూర్ణా విశ్వేశ్వరుల దర్శనము, శ్రీచక్రార్చన దీక్షితుల వారి దిన చర్య. అక్కడినుండే ఆయన నేపాల్ వెళ్లి పశుపతినాథుని, బదరీ వెళ్లి నారాయణుని కూడా సేవించారు. ఒకసారి చిదంబరనాథ యోగులు "ముత్తుస్వామీ! నీవు గంగానదిలో స్నానం చేయుటకు వెళ్లినపుడు కాలికి ఏ వస్తువు తగిలితే దానిని తీసుకొని రా" అని చెప్పారు. ముత్తుస్వాముల వారి కాలికి వీణ దొరుకుతుంది. ఆ వీణ తలభాగం పైకి తిరిగి ఉండి, దానిపై రామ అని రాసి ఉంటుంది. యోగులు శిష్యుని ఆశీర్వదించి "ఇది నీకు గంగమ్మ తల్లి అనుగ్రహము. నీవు గొప్ప సంగీత విద్వాంసుడవు, వైణికుడవు కాగలవు" అని దీవించారు. ఈ వీణ ఇప్పటికీ దీక్షితుల వారి వంశస్థుల వద్ద ఉంది. ఒకసారి ఓ వృద్ధ బ్రాహ్మణుని రూపములో కుమారస్వామి దీక్షితుల వారిని అనుగ్రహించగా తన కృతులకు గురుగుహ అనే ముద్రను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.


దీక్షితుల వారు అనేక వందల క్షేత్రాలలోని దేవతలను ఉపాసన చేసి కృతులను రచించారు. పంచభూత లింగ క్షేత్రాలు, తిరుత్తణి, పళని, కంచి కామాక్షి, వరదరాజ స్వామి, మదురై మీనాక్షి, తిరుమల వేంకటేశ్వరుడు, గురువాయూరు కృష్ణుడు, రామేశ్వరంలోని శివునితో పాటు తిరువారూరులోని త్యాగరాజస్వామి, కమలాంబికలను నుతించారు. కమలాంబ గురించి ఆయన రచించిన నవావరణ కీర్తనలు జగత్ప్రసిద్ధములు. ఈ కీర్తనల కూర్పులో వారి ప్రతిభ పతాక స్థాయిలో కనబడుతుంది. ఈ కృతులు దేవతా మూర్తులకు కట్టిన ఆలయాలవలె ప్రకాశించాయి. ఈ కీర్తనలలో తంత్ర విద్య, శ్రీచక్ర వర్ణన, యంత్ర తంత్ర మంత్ర పూజా సాంకేతిక వైభవాలు ఉట్టిపడతాయి. 1835వ సంవత్సరములో నరక చతుర్దశి నాడు ఆయనకు అన్నపూర్ణా దేవి తేజొమయ రూపము దర్శనమయ్యింది. ఆ దర్శనములో ఆయనకు తనకు సమయమాసన్నమైనదని కూడా గ్రహించారు. ఏహి అన్నపూర్ణే అని తన ఆఖరి కృతిని ఆలపించి, శిష్యులను మీనాక్షి మేముదం దేహి అనే కృతిని పాడమన్నారు. మీనలోచని పాశమోచని అన్న పదాలు వారు ఆలపించుచుండగా శివే పాహి అని జీవన్ముక్తులైనారు దీక్షితుల వారు.

భారతీయ సనాతన ధర్మంలో దీక్షితుల వారి పరంపర వారి సోదరుల కుమారుల ద్వారా, శిష్యుల ద్వార కొనసాగుతూనే ఉంది. తిరువారూరులోనే దీక్షితుల వారి బృందావనం ఉంది. వారి ఉపాసనా బలం భారతదేశమే కాదు ప్రపంచమంతటా సంగీత సాహిత్యం ద్వారా, కళాకారుల గానం ద్వారా ప్రకాశిస్తూనే ఉంది.

రంజని-గాయత్రి సోదరీమణుల గాత్రంలో పైన వివరించబడిన నవావరణ కృతి వినండి

26, ఆగస్టు 2017, శనివారం

నీ లీల పాడెద దేవా - జానకమ్మ గీతం మరియు చిత్ర విశేషాలు




నీ లీల పాడెద దేవా - 1962లో విడుదలైన మురిపించే మువ్వలు చిత్రంలో జానకమ్మ పాడిన అద్భుత గీతం. తమిళంలో కొంజుం సాలంగై అనే చిత్రం డబ్బింగ్ ఈ చిత్రం. సంగీత దర్శకులు ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు గారు. నాయకుడు జెమినీ గణేశన్, నాయిక మహానటి సావిత్రి. సింగార వేలనే దేవా అనే పాటకు ఎవరు నాదస్వరానికి దీటుగా పాడగలరు అని సుబ్బయ్యనాయుడు గారు ఆలోచిస్తూ అప్పటి గాయనీమణులను అడిగితే పి. లీల గారు నాదస్వరం స్థాయి స్వరాలను పాడగలిగే గాత్రం జానకమ్మ గారికి ఉందని వారి పేరును సుబ్బయ్య నాయుడు గారికి ప్రతిపాదించారుట.  అంతే. ఓ అద్భుతం ఆవిష్కరించబడింది. ఊహించలేని గమకాలు, ఆ వేగం. సంగీతం పెద్దగా ఏమీ నేర్చుకోని శిష్ట్లా జానకమ్మ గారి గాత్రంలో నాదస్వర స్థాయికి దీటైన స్వరాలు పలికాయి. ఆ గీతం అజరామరమైంది. తమిళంలో వచ్చిన సింగార వేలనే దేవా అన్న పాటను ఆరుద్రగారు తెలుగులోకి నీ లీల పాడెద దేవా అని అనువదించారు. సుబ్బయ్య నాయుడు గారు శ్రీరాములు నాయుడు గారి పక్షిరాజా స్టూడియోలో పని చేసేవారు. తమిళ సినీ పరిశ్రమలో తొలి సంగీత దర్శకులు వీరు. ఎమ్మెస్ విశ్వనాథన్ గారు వీరి శిష్యులు. అరుణాచలం గారు ప్రఖ్యాత నాదస్వర విద్వాంసులు టీఎన్ రాజరత్నం పిళ్లై గారి శిష్యులు. ఈ చిత్రంలో నాదస్వరం వాయించే సమయానికి ఆయన వయసు 41 సంవత్సరాలు. తరువాత రెండేళ్లకే ఆయన మరణించారు.


కొంజుం సాలంగై రాజుల కాలం నాటి కథ. ఈ చిత్రంలో భరత నాట్య నృత్యాంశాలు కూడా ప్రత్యేకం. నర్తకీమణులు కమలా లక్ష్మణ్, కుచలకుమారి గార్ల మధ్య పోటీగా సాగే నృత్య గీతం ఈ చిత్రానికి మరో ముఖ్యాంశం. జానకమ్మ గారి పాటను ముంబై రామన్ స్టూడియోలో రికార్డు చేయగా అరుణాచలం గారి నాదస్వరాన్ని చెన్నైలో రికార్డు చేశారు. సాంకేతికంగా పెద్దగా వసతులు లేకపోయినా రెండిటినీ అద్భుతంగా మిక్స్ చేసి ఓ రసగుళికను ఆవిష్కరించారు సుబ్బయ్యనాయుడు గారు. కొంజుం సాలంగై అద్భుతమైన సంగీతానికి, నృత్యాలకు, కళ్లకు మిరుమిట్లు గొలిపే సెట్లకు ప్రసిద్ధి. మంచి విజయం సాధించిన ఈ చిత్రం మహానటి సావిత్రి 100వ చిత్రం కావటం విశేషం. ఈ చిత్రం పోలిష్ భాషలో కూడ విడుదలైంది. ఈ చిత్రంలో సుశీలమ్మ, లీలమ్మ, సౌందర్‌రాజన్ గారు, రాధ-జయలక్ష్మి, శూలమంగళం రాజ్యలక్ష్మి గార్లు కూడా పాడారు. ఆద్యంతం సంగీత నృత్య ఘట్టాలతో సాగే 3 గంటల రసరమ్య కావ్యం కొంజుం సాలంగై.



ఇటువంటి ప్రయోగాన్నే 1969లో విడుదలైన హిందీ చలన చిత్రం సచ్చాయీలో ఆశాభోస్లే గానంలో తిరుచెరై శివసుబ్రహ్మణ్య పిళ్ల్లై గారు నాదస్వరం వాయించగా మోరే సైయ్యా పక్డే బైయ్య అన్న గీతంగా చిత్రీకరించారు. దీనికి సంగీత దర్శకులు శంకర్ జైకిషన్.



నీ లీల పాడెద దేవా ఆభేరి రాగంలో కూర్చబడింది. వల్లీదేవసేనా సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామిని నుతించే గీతం ఇది. జానకమ్మ ప్రతిభను శాశ్వతం చేసిన గీతం ఇది. అవలీలగా పాడేశారు ఆవిడ. క్లిష్టమైన సంగతులు కలిగిన ఈ గీత సాహిత్యము.


ఆ ఆ ఆ ఆ
నీ లీల పాడెద దేవా
మనవి ఆలించ వేడెద దేవా
నను లాలించు మా ముద్దు దేవా

నీ లీల పాడెద దేవా
నీ లీల పాడెద దేవా

సింధూర రాగంపు దేవా
 ఆ ఆ ఆఆ  ఆ ఆ ఆ ఆఆ
దివ్య శృంగార భావంపు దేవా
వల్లి చెలువాలు నిను కోరు నీవు రావా
ఎలమి నీ లీల పాడెద దేవా

అనుపమ వరదాన శీల ఆ
అనుపమ వరదాన శీల
వేగ కనుపించు కరుణాలవాల
ఎలమి నీ లీల పాడెద దేవా

నీ లీల పాడెద దేవా
నను లాలించు నా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా
నీ లీల పాడెద దేవా
సగమపని నీ లీల పాడెద దేవా
నిసనిదపమ గామగరిసని పానిసగమపా మగరిస నిదమప గరిని
నీ లీల పాడెద దేవా

సా రీ సా నిసరిసా నినిస పపనినిసా మమపపనినిసా గగస గగస నినిస పపని మమప గగమమపపనినిసస గరిని
పా నిదపమగరిసని సగగసగగ సగమప గరిసని సగసా
నినిప మమప నీపనీప సాపనీపసా నిదపమగరి సగసా
గామపనిసా నిసగరిసరిని సాసనీ నిసదని సాసని
గరిని గరిగ నిరిగరి నిగరిని
నిరిని నిసస నిరిని నిసస నిదప
నిరినిసా ఆ ఆ ఆ ఆ
రినీసపానిసాపసామపనిసరీ ఆ ఆ ఆ
సానిపాని సాసనీ సాసనీ
పానిపస పానిదనీ మాదనిపానిదనీసరిసా
పానిదనిసరిసా మగాపమ
సాసరిని నీసరిపా సాసని సాససాససాస సరి గరిసని సరిగరిస
రిసనిదపా పనిమప సనిదపమ పమగరి సగమప పనిమప సనిదనిపనిప పనిమప గరినిసదనిమపని

దక్షిణ భారత మీరా - గాయని వాణీ జయరాం గారి విశేషాలు



ఆమె రూపం నిండైన వ్యక్తిత్వానికి నిలువుటద్దం. ఆమె గానం సమ్మోహనం. ఆమె గళంలో భక్తి, రక్తి అంతే మధురంగా పండుతాయి. "పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను..." - పాట ఆమె గళంలో వింటే సప్తస్వరాలను సరస్వతీ దేవి పలికించినట్లే ఉంటుంది. ఆ స్వామి గుడి తలుపులు తీయవలసిందే. "తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ" అంటే ఆ సూర్యనారాయణుడు వెనువెంటనే ఒప్పుకోవలసిందే. "ఆనతినీయరా హరా" అంటే ఆ హరుడు అనుమతి ప్రసాదించి తీరాలి. "బోల్ రే పపీహరా" అని పాడితే ఆ వసంతకోకిల మన ఎదుట నిలిచి పలుకవలసిందే. "మానస సంచరరే" అనే కృతి పాడితే ఆ శ్రీకృష్ణుడు ఆమె మదిలో నిలిచి తీరుతాడు. "ఒక బృందావనం సోయగం" అని వలపు గీతమాలపిస్తే పాడితే యువత ఉర్రూతలూగారు. ఆ స్వరరాణి కలైవాణి నుండి వాణీ జయరాంగా పేరొందింది.  ఆ మధుర గాయని వివరాలు ఈ బ్లాగుపొస్టులో.

30 నవంబర్ 1945వ సంవత్సరంలో మద్రాసు రాష్ట్రంలోని వెల్లూరులో జన్మించిన కలైవాణికి ఐదుగురు సోదరీమణులు, ముగ్గురు సోదరులు. తల్లి పద్మావతి కర్నూలులో జన్మించినవారు కావటంతో తెలుగులో పాడటం అలవాటైంది. ఆవిడే వాణి గారి తొలి గురువు. తల్లి రంగరామానుజ అయ్యంగార్ వారి వద్ద సంగీత శిక్షణ పొందారు. ఆయన వద్దే వాణిని తల్లి కర్ణాటక సంగీత శిక్షణ కోసం చేర్పించారు. అయిదేళ్ల వయసులోనే ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనలు అపూర్వమైన రాగాలలో వాణి నేర్చుకుని పాడగలిగారు. తరువాత కడలూరు శ్రీనివాస అయ్యంగారు గారి వద్ద కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నారు. వెల్లూరులో నాలుగవ తరగతి వరకు చదువుకున్న తరువాత వాణి గారికి మరింత మంచి సంగీత శిక్షణ ఇప్పించేందుకు వారి కుటుంబం చెన్నైకి తరలి వెళ్లారు. అక్కడ వాణి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు జీఎన్ బాలసుబ్రహ్మణ్యం గారికి శిష్యులైన టీఆర్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఎన్నో జీఎన్‌బీ కృతులపై పట్టు సాధించారు. తరువాత శెమ్మంగూడి శ్రీనివాస అయ్యరు గారి శిష్యులైన ఆరెస్ మణి గారి వద్ద స్వాతి తిరునాళ్ కీర్తనలు నేర్చుకున్నారు. ఎనిమదవ ఏటనే ఆకాశవాణి మద్రాసులో పాడారు. పదేళ్ల వయసునుండే పూర్తి స్థాయి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలు చేశారు. చిన్ననాటి నుండే హిందీ సినీ గీతాలంటే ఎంతో మక్కువ కలిగిన వాణి గారు స్కూలులో 22 వేర్వేరు కళలతో బహుముఖ ప్రజ్ఞ కలిగిన విద్యార్థిగా అవార్డును పొందారు. బీఏ ఎకనామిక్స్ చదువ్తున్నప్పుడు కళాశాలల స్థాయిలో డిబేట్ కార్యక్రమాలలో బహుమతులు పొందారు.  చదువు పూర్తైన తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మద్రాసు బ్రాంచిలో ఉద్యోగంలో చేరారు. తరువాత 1967లో ఉద్యోగరీత్యా హైదరాబాదుకు బదిలీ చేయబడ్డారు. కొన్నాళ్లకే జయరాం గారిని వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ముంబై వెళ్లారు.

ముంబైలో వాణి గారు భర్త జయరాం గారి ప్రోద్బలంతో పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్ అబ్దుల్ రెహ్మాన్ ఖాన్ గారి వద్ద హిందూస్తానీ శాస్త్రీయ సంగీత శిక్షణను పొందారు. ఆ సమయంలోనే గురువు గారి సలహాతో బ్యాంకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి పూర్తి స్థాయి సంగీత సాధనకు తన సమయాన్ని అంకితం చేశారు. అప్పుడు ప్రఖ్యాత సంగీత దర్శకులు వసంత్ దేశాయి గారు ప్రఖ్యాత గాయకులు కుమార గంధర్వ గారితో ఒక మరాఠీ ఆల్బం చేస్తున్నారు. ఆ ఆల్బంలో గంధర్వ గారితో కలిసి రుణానుబంధచ అనే గీతం వాణీ జయరాం పాడారు. 1971వ సంవత్సరం వాణీ జయరాం గారి జీవితంలో ఓ ముఖ్యమైన మైలురాయి. హృషీకేశ్ ముఖర్జీ గారి దర్శకత్వంలో వచ్చిన గుడ్డీ అనే చిత్రంలో వసంత దేశాయి గారు వాణీ జయరాం గారికి అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంలోని బోల్ రే పపీహరా, హరి బినా కైసే జీయూ, హంకో మన్ కీ శక్తి అనే పాటలు అద్బుత విజయం సాధించాయి. వాణీ జయరాం గారికి తాన్సేన్ సమ్మాన్ అవార్డు, బెస్ట్ ప్రామిసింగ్ సింగర్ అవార్డు, ఆలిండియా సినీగోయర్స్ అవార్డు పొందారు. ఈ పాటలు ఇప్పటికీ సంగీతాభిమానుల హృదయాలలో నిలిచే ఉన్నాయి. 1972లో హిందీలో ఎంతో పేరొందిన మీనాకుమారి గారి పాకీజా చిత్రంలో నౌషాద్ గారి సంగీతంలో మోరా సాజన్ అనే పాట పాడారు.  తెలుగు సినీ చిత్రాలలో తొలి అవకాశం 1973లో అభిమానవంతులు చిత్రానికి ఎస్పీ కోడండపాణి గారి సంగీతంలో వెంపటి చిన సత్యం గారు నృత్య దర్శకత్వంలో ప్రముఖ కూచిపూడి నర్తకి శోభానాయుడు గారు నర్తించగా ఎప్పటివలె కాదురా అన్న జావళిని వాణీజయరాం గారు పాడారు. హిందీలో చిత్రగుప్త, మదన్‌మోహన్, ఓపీ నయ్యర్, ఆర్డీ బర్మన్, జైదేవ్, కళ్యాణ్‌జీ-ఆనంద్‌జీ, లక్ష్మీకాంత్-ప్యారేలాల్  మొదలైన మహామహులైన సంగీత దర్శకుల వద్ద పాడారు. మహమ్మద్ రఫీ, ముకేశ్, మన్నా డే, కిశోర్ కుమార్, ఆశా భోస్లే గార్లతో యుగళ గీతాలు పాడారు. 1974 ప్రాంతంలో ముంబై నుండి చెన్నై వచ్చి తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ సినిమాలలో గాయనిగా స్థిరపడ్డారు.

1974లో విడుదలైన అమ్మాయిల శపథం అనే చిత్రంలో నీలి మేఘమా జాలి చూపుమా అనే గీతం వాణీ జయరాం గారి తెలుగు సినీ ప్రస్థానంలో మెరిసిన గీత రాజం. 1975లో విడుదలైన కే బాలచందర్ గారి తమిళ చిత్రం అపూర్వ రాగంగళ్‌లో ఎమ్మెస్ విశ్వనాథన్ గారి సంగీతంలో పాడిన పాటలకు వారికి తమిళంలో ఉత్తమ గాయనిగా జాతీయస్థాయి అవార్డును పొందారు. 1978వ సంవత్సరంలో విడుదలైన మల్లెపూవు చిత్రంలో చక్రవర్తిగారి సంగీత దర్శకత్వంలో నువ్వు వస్తావని బృందావని అన్న అద్భుతమైన ఆరుద్ర గారి పాటను పాడారు. అదే సంవత్సరంలో వచ్చిన మరోచరిత్ర అనే బాలచందర్ గారి మరో చరిత్ర చిత్రంలో ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతంలో విధి చేయు వింతలెన్నో అనే అద్భుతమైన పాటను పాడారు. అదే సంవత్సరంలో తెలుగులో వయసు పిలిచింది అనే చిత్రంలోని నువ్వడిగింది ఏనాడైనా వద్దన్నానా అనే గీతం వాణీ జయరాం గారి విలక్షణమైన గీతాలలో ఒకటి. 1979లో విడుదలైన మీరా అనే హిందీ చలనచిత్రం వాణీ జయరాం గారి సినీ జీవితంలో మరచిపోలేని మైలురాయి. పండిట్ రవిశంకర్‌గారు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించగా 12 మీరా భజనలను వాణీ జయరాం గారు పాడారు. మోరేతో గిరిధర్ గోపాల అనే గీతానికి 1980వ సంవత్సరానికి ఉత్తమ గాయనిగా ఫిలింఫేర్ అవార్డు పొందారు. అలాగే 1979లో విడుదలైన కే విశ్వనాథ్ గారి ఆణిముత్యం శంకరాభరణంలో పాటలకు తెలుగులో ఉత్తమ గయని అవార్డును పొందారు. బ్రోచేవారెవరురా, మానస సంచరరే, దొరకునా ఇటువంటి సేవ వంటి అద్భుతమైన గీతాలను కేవీ మహాదేవన్ గారి దర్శకత్వంలో పాడారు. 1979లోనే కే బాలచందర్ గారి దర్శకత్వంలో విడుదలైన గుప్పెడు మనసు చిత్రంలో ఎమ్మెస్ విశ్వనాథన్ గారి సంగీతంలో బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి నేనా పాడనా పాట అన్న విలక్షణమైన గీతాన్ని గానం చేశారు. 1981లో విడుదలైన సీతాకోక చిలుక చిత్రం వాణీ జయరాం గారికి ఎంతో పేరు తెచ్చింది. ఇళయరాజా గారి సంగీతంలో మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా, అలలు కలలు, సాగర సంగమమే అన్న సంగీత ప్రధానమైన ప్రేమ గీతాలు ఎంతో ప్రజాదరణ పొందాయి.



1980వ దశకంలో ఇళయరాజా వంటి ప్రముఖ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఎన్నో తమిళ తెలుగు చిత్రాలలో వాణీ జయరాం గారు పాడారు. తరువాతి కాలంలో వాణీ జయరాం గారికి తెలుగు సినీ జగత్తులో పేరు రావటానికి ప్రధాన కారణం కళాతపస్వి విశ్వనాథ్ గారి చిత్రాలే. 1987లో విడుదలైన శృతిలయలు చిత్రంలో కేవీ మహాదేవన్ గారి సంగీతంలో ఇన్నిరాశుల యునికి (బాలు గారితో), ఆలోకయే శ్రీబాలకృష్ణం, శ్రీ గణనాథం భజామ్యహం (పూర్ణచందర్ గారితో) అనే పాటలు తెలుగు సినీ అభిమానుల నోట మారు మ్రోగాయి. 1988లో విడుదలైన స్వర్ణ కమలం చిత్రంలో ఇళయరాజా గారి సంగీతంలో బాలుగారితో కలసి వాణీ జయరాం గారు పాడిన అందెల రవమిది పదములదా అనే గీతం ఎంతో ప్రజాదరణ పొందింది. భానుప్రియ గారి నాట్యకౌశలానికి వాణీ జయరాం గారి గానం వన్నె తెచ్చింది. 1991లో బాపు గారి చిత్రం పెళ్లి పుస్తకంలో త్యాగరాజస్వామి వారి జగదానంద కారక అనే కృతిని పాడారు. 1992లో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వాతి కిరణం చిత్రం వాణీ జయరాం గారి తెలుగు సినీ నేపథ్య గాన ప్రస్థానంలో పతాక స్థాయి అనుకోవచ్చు. ఆ చిత్రంలో ఆనతినీయరా హరా అనే పాటకు వారికి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయానిగా అవార్డు వచ్చింది. ఈ చిత్రంలొ వారు పాడిన తెలిమంచు కరిగింది, ప్రణతి ప్రణతి, శివాని భవాని, జాలిగా జాబిలమ్మ, వైష్ణవి భార్గవి, కొండ కోనల్లో పాటలు అనే పాటలు అజరామరమై నిలిచాయి. మొత్తం మీద విశ్వనాథ్ గారి చిత్ర గీతాలతో వాణీ జయరాం గారికి ఎంతో పేరు ప్రతిష్ఠలు వచ్చాయి. 1980,90 దశకాలలో తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినీ గీతాలను వాణీ జయరాం గారు పాడారు.

జాతీయ స్థాయిలోనే కాకుండా, గుజరాతీ, ఒడియా, తమిళ, తెలుగు భాషలలో ప్రాంతీయ స్థాయి ఉత్తమగాయని అవార్డులను పొందారు. కలైమామణి, సంగీత పీఠ్ సమ్మాన్, తమిళనాడు ప్రభుత్వం వారి ఎం కే త్యాగరాజ భాగవతార్ జీవన సాఫల్య పురస్కారం, ఇలింఫేర్  జీవన సాఫల్య పురస్కారం, కాముకర అవార్డు, సుబ్రహ్మణ్య భారతి అవార్డు, రేడియో మిర్చి మరియు రెడ్ ఎఫెం జీవన సాఫల్య పురస్కారం, ఘంటసాల జాతీయ పురస్కారం, దక్షిణ భారత మీరా అవార్డు మొదలైన ఎన్నో పురస్కారాలను, గుర్తింపులను పొందారు. సినీ గీతాలే కాకుండా ఎన్నో భక్తి గీతాలను, లలిత గీతాలను ఆలపించారు. దూరదర్శన్‌లో కూడా పాడారు. వీరు పాడిన లక్షీ, దుర్గా స్తోత్రాలు, స్కంద షష్టి కవచం, శృంగేరి శారదాదేవి గీతాలు, పరాశక్తి గీతాలు మొదలైనవి ఎంతో పేరు పొందాయి. భారత దేశంలో ఉన్న దాదాపు ముఖ్యమైన భాషలన్నిటిలోనూ వాణీ జయరాం గారు 8000కు పైగా పాటలు పాడారు. వీరి భర్త జయరాం గారు సితార్ విద్వాంసులు. నిరాడంబరమైన జీవితం క్రమశిక్షణతో జీవిస్తున్న వాణీ జయరాం గారు తనకు ఇష్టమైన పాటలలో ఒకటిగా మొరటోడు చిత్రంలోని హే కృష్ణా మళ్లీ నీవే జన్మిస్తే అన్న గీతాన్ని పేర్కొన్నారు. గానానికి భాషాజ్ఞానం చాలా ముఖ్యమని భావిస్తారు వాణీ జయరాం గారు. ప్రేమలేఖలు చిత్రంలోని ఈరోజు మంచిరోజు అని సుశీలమ్మ గారితో కలసి అద్భుతంగా పాడిన గీతం వాణీజయరాం గారి ఇష్టమైన మరో పాట. క్యాన్సర్ ఆసుపత్రులలో, అనాథాశ్రమాలలో పాటలు పాడి ప్రేమను పంచుకునే మనస్తత్వం వారిది. కర్ణాటక సంగీతంలో పరిశోధన చేసి కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తీసుకు వస్తున్న విదుషీమణి వీరు. దొరకునా ఇటువంటి సేవ అన్న త్యాగయ్య భావనను వేటూరి గారు శంకరాభరణంలో గుర్తు చేయగా వాణీ జయరాం గారు పవిత్రమైన నాద సాధనతో కొనసాగిస్తున్నారు. వారి సంగీత ప్రస్థానం ఇలాగే వైభవంగా ఓ యజ్ఞంలా సాగాలని ప్రార్థన. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.

వాణీ జయరాం గారికి జాతీయ స్థాయి అవార్డును తెచ్చిపెట్టిన  ఆనతినీయరా హరా (స్వాతి కిరణం - 1992) గీతం వీక్షించండి.

20, ఆగస్టు 2017, ఆదివారం

నా కోసం - కథానిక



"యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధా వేచియున్నది కాదా!"...అరవై ఐదేళ్ల రామారావు శ్రావ్యంగా పాడుతూ భార్య కనకం దగ్గరకు వచ్చి "వేయి కనులతో కనకం వేచియున్నది కాదా" అని ఆమె చెంగు లాగుతూ పాడాడు. "ఇదిగో! మా అమ్మా నాన్న ఎంచక్కా కనకమహాలక్ష్మి అని పేరు పెట్టి మహాలక్ష్మి అని పిలుచుకునే వాళ్లు. నేను పుట్టాక మా నాన్నకు వ్యాపారంలో బోలెడు కలిసి వచ్చిందిట. పెళ్లయ్యాక మీ పుణ్యమా అని నా పేరు మోటుగా కనకం చేసేశారు...మహాలక్ష్మీ అని పిలవకూడదూ"...అంది. "కనకం! పెళ్లై 38 ఏళ్లు అయ్యింది. ఇప్పుడు కొత్తగా నీ పేరు మహాలక్ష్మి అని ఎలా పిలవను? నా పాలిట బంగారం నువ్వు. అందుకే కనకమే నాకిష్టం" అని నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. "అబ్బో! ఈ మాటలకేమి? పోనీలేండి. నా పేరు మీకు మంచి చెస్తే మనకు మంచి చేసినట్లే కదా!" అని నవ్వుతూ భర్త కళ్లలోకి చూసింది. "ఏవండీ! పిల్లలు దూరంగా ఉన్నారు, మీరు రిటైర్ అయ్యారు. ఇదివరకంటే వాళ్ల అవసరాలు, మీ అవసరాలలో నా జీవితం తీరిక లేకుండా ఉండేది. ఇప్పుడు పెద్దగా పని ఉండటం లేదు. పిల్లల దగ్గరకు వెళ్లి ఉండే వయసు కాదు. వాళ్ల సంసారాల్లో వాళ్లు నిలదొక్కుకొని స్వతంత్రంగా ఉండవలసిన సమయం. మనం ఎక్కువ జోక్యం చేసుకోకూడదు. అందుకనే నా ఆలోచనలలో, నా జీవితంలో ఓ పెద్ద అగాథంలా ఉంది ఈ ఖాళీ సమయం. రోజు చాలా భారంగా గడుస్తోంది..." అని నిట్టూర్పుగా అంది కనకం.

"నిజమే కనకం! ఇన్నేళ్ల నుండి పిల్లల పెంపకం, నా అభివృద్ధి అనే సుదీర్ఘ సేవలో నీ సమయమంతా గడిచిపోయింది. నువ్వన్నట్లు పిల్లలు వాళ్ల జీవితాలు వాళ్లు వెళ్లబుచ్చుతున్నారు. మన ప్రమేయం ఇప్పుడు అనవసరం. ఏదో పిల్ల పాప అవసరానికి వెళ్లటం తప్ప ఇప్పుడప్పుడే మనం వాళ్లతో కలిసి జీవించకపోవటమే అందరికీ మంచిది. మనం ఎంత నవీన దృక్పథంతో ఉన్నామనుకున్నా, తరాల మధ్య అంతరం ఉంటుంది. మన ఆలోచనలు, చేసే పనులు వాళ్లకు నచ్చక పోయే అవకాశమే ఎక్కువ...." అని అన్నాడు. "కనకం! నిన్న వాకింగ్ చేస్తున్నపుడు వేంకటేశ్వర్లు గారితో సంభాషణల్లో నేను నా జీవితంలో కొన్ని తప్పులు చేశాను అని అర్థమైంది. నేను, నా ఉద్యోగాభివృద్ధి, పరపతి మీద ధ్యాసతో నీ ఆశలు, ఆశయాలను విస్మరించాను. నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, నీకు కూడా జీవితంలో తృప్తిగా ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది అని ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించు" అని కళ్లలో నీళ్లు నిండగా అపరాధ భావనతో కనకం చేతులు పట్టుకున్నాడు. తన మనసులో ఉన్న వేదనకు మూల కారణం భర్త గ్రహించి అంత తొందరగా, అంత పరిపూర్ణంగా స్పందిస్తాడని ఊహించని కనకం కరిగి పోయింది. "ఏమండీ! నిజమే! నాకు కూడా జీవితంలో ఏదో సాధించాలి అన్న భావన ఎన్నో ఏళ్లు ఉండేది. కొన్నేళ్లు మరుగున పడిపోయినా మళ్లీ ఇప్పుడు అది చిగురెత్తి నన్ను ప్రశ్నిస్తోంది. ఆ మాట మీతో చెప్పలేక అగాథంలా ఉంది అన్నాను. మీరు నా మనసులోని మాట కనుక్కున్నారు. గతం గురించి అనవసరం. మీరు కావాలని చేయాలేదు కదా!! మీరు పిల్లలు నా జీవితంలో మూడింట నాలుగ వంతు. మిగిలిన ఆ పావు భాగాన్ని ఇప్పటికైనా నా స్వావలంబనకు ప్రతిబింబంగా చేసుకొవాలని, నా ఆశయాలకు మార్గదర్శకంగా ఉండాలని మనసు పరి పరి విధాలుగా కోరుకుంటోంది..." అంది కనకం.

"కనకం! ఓ వారం సమయం తీసుకో. నీకు ఏమి చేయాలనుందో, ఏమి చేస్తే నీ మనసులోని వెలితి కొంతైనా పూడుతుందో బాగా ఆలోచించి నాకు చెప్పు. మనకున్న ఆర్థిక పరిమితులలో నేను తప్పకుండా నీ ఆశయాలను నెరవేర్చటానికి వందశాతం నా వంతు ప్రయత్నం చేస్తాను" అన్నాడు రామారావు. కనకం ఆలోచనలో పడింది. "ఏదో సాధిద్దాము అనే కానీ, ఏమి సాధించాలో తెలియదే. బాధ్యతల సాగరం దాటే సరికి అస్తిత్వమే కోల్పోయానా ఏమిటి?" అని గాభరా పడింది. అంతలో సర్దుకొని తన మాతృత్వపు మధురిమలు, రామారావు భార్యగా పొందిన గుర్తింపు నెమరు వేసుకొని కర్తవ్యం గురించి మనసు దృఢపరచుకుంది.

మర్నాడు కనకం అమీర్‌పేట్ షాపింగుకు వెళ్లింది. అక్కడ రోడ్డు మీద నడుస్తుంటే తన వయసు మనిషే ఎదురై "మీ పేరు కనకమహాలక్ష్మి కదూ!" అని అడిగింది. ఎవరో వెంటనే గుర్తుపట్టని కనకం "అవునండీ! మీరు?...". "నేను పీయుసీలో క్లాస్స్మేట్ వనజను" అంది. "వనజా! నువ్వా! ఎంతలా మారిపోయావ్? అసలు గుర్తుపట్టలేకపోయాను. ఎన్నేళ్లయ్యింది...." అని సంభ్రమంగా అంది కనకం. "నువ్వు మాత్రం అలాగే సన్నగా రివటలా ఉన్నావే అందుకే గుర్తుపట్ట గలిగాను" అంది. ఆ తరువాత ఇద్దరు పిచ్చాపాటీ, అలనాటి కబుర్లు ఓ గంటసేపు. మాటల మధ్యలో వనజ "అవునూ! నీకు గుర్తుందా? ఎన్సీసీలో నీకు మంచి పేరొచ్చింది. నీకు సర్టిఫికేట్ ఇస్తూ నువ్వు దేశసేవ చేయాలమ్మా అని ఆనాడు ముఖ్య అతిథి అన్నారు. ఏమైనా సేవ చేయగలిగావా లేక పతి-బిడ్డల సేవేనా" అంది. కనకానికి అసలు తాను ఎన్సీసీ శిక్షణ పొందినట్లు, అందులో తనకు విశిష్ట పతకం లభించినట్లు అసలు గుర్తే లేదు. తన జీవితంలో అంత ముఖ్యమైన ఘట్టం ఎలా మరచాను అనుకుంది. ఓ రెండు గంటల ఆత్మీయ సంభాషణ తరువాత "వనజా! మేము కూకట్‌పల్లిలో ఉంటాము. తప్పకుండా మా ఇంటికి రా. టచ్‌లో ఉందాము" అని చిన్ననాటి స్నేహితురాలిని ఆలింగనం చేసుకొని ఇంటికి తిరిగి వెళ్లింది.

రాత్రికి కనకంలో అంతర్మథనం తీవ్రమైంది. ఆలోచనా తరంగాలు ఓ నలభై ఏళ్లు వెనక్కి వెళ్లాయి. తాను పీయుసీ చదివే రోజులు అవి. ఎంతో ఉత్సాహంగా, దేశమంటే అత్యున్నత భావాలు కలిగి, దేశభక్తి గీతాలు పాడుతూ, కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ ఉన్నప్పుడు మహిళా క్యాడెట్‌గా ఎన్సీసీలో చేరాలని ప్రగాఢమైన కోరిక. కాలేజీలో డ్రిల్ మాష్టారు సత్యం గారు కూడా కనకాన్ని ఎన్సీసీలో చేరటానికి ప్రోత్సహించారు. ఇంట్లో అమ్మనాన్న ఒప్పుకోలేదు. వారికి చెప్పకుండా ఎన్సీసీలో చేరింది. తరువాత ఇంట్లో తెలిసి తిట్టినా మౌనంగా భరించింది. "ఆడపిల్లవు, చదువు పూర్తి కాగానే పెళ్లి చేసుకొని సుఖంగా ఉండక ఈ దేశసేవ నీకెందుకు చెప్పు? " అని వాళ్లు నీరుగార్చటానికి ప్రయత్నించినా గట్టిగా పట్టు పట్టి ఎన్సీసీ శిక్షణ మంచి గుర్తింపుతో పూర్తి చేసింది. నాన్న గారి ఆర్థిక పరిస్థితులు, ఇంట్లో ఇంకా పెళ్లి కావలసిన నలుగురు ఆడపిల్లలున్న సంసారం వలన చదువు పీయూసీ పూర్తవుతూనే వివాహం చేసుకుంది కనకం. ఇన్నాళ్లకు మళ్లీ తనకు అ విషయం గుర్తుకు చేసినందుకు వనజకు మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంది. తనకు భర్త ఇచ్చిన వారం రోజుల సమయంలోపే తన ఆలోచనలను దృఢ పరచుకుంది.

"ఏవండీ! మానవ సేవే మాధావ సేవ అని ఎందరో పెద్దలు చెప్పారు. ఇన్నాళ్లూ నాలో మరుగున పడ్డ ఓ కోణాన్ని నిన్న నా కాలేజీ స్నేహితురాలు వనజ సమయానికి గుర్తు చేసింది. నాకు నిజంగా ఈ సమయంలో స్ఫూర్తినిచ్చేది ఈ సమాజానికి సేవ చేయటం. నేను ఆ మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మీ అభిప్రాయం ఏమిటి? " అని పక్క మీద నిద్రపోతున్న రామారావుతో కనకం అంది. రామారావు సమాధానం చెప్పలేదు.

కనకం భర్తతో మాట్లాడుతున్నా అతని దగ్గరినుండి సమాధానం లేదు. రామారావు నిద్రలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఊహించలేని ఆ ఆకస్మిక మరణానికి కనకమహాలక్ష్మి ప్రపంచం తల్లక్రిందులైంది. పిల్లలు వచ్చారు, అంత్యక్రియలు, కర్మకాండ జరిగిపోయాయి. "అమ్మా! మేము ఇక్కడ నెలల తరబడి ఉండలేము కదా! మాతో పాటు అమెరికా రా, కొన్నాళ్లు నీకు కూడా కాస్త మార్పుగా ఉంటుంది" అని కొడుకు కూతురు కనకంతో అన్నారు. కానీ కనకం భర్త మరణం షాక్‌నుంచి తేరుకోలేదు. పైగా తనకు భర్తతో ఉన్న అనుబంధాన్ని పిల్లలతో పంచుకోవాలని కూడా ఎన్నడూ అనిపించలేదు. ఇప్పుడు తాను అమెరికా వెళ్లి నిరంతరం తన మానసిక పరిస్థితితో వారికి అసౌకర్యం కలిగించకూడదు అన్న భావనతో "నేను ఇప్పుడు రాలేనులేరా. కొన్నాళ్లు నా అంతట నేను ఉండాలి. నా పయనమెటో నిర్ణయించుకోవాలి" అని మృదువుగా చెప్పి పిల్లలను పంపించేసింది.

మనసులో ఎన్నో ప్రశ్నలు. తన ఆశయానికి ఓ రూపం వస్తోంది అనే సమయంలో భర్త మరణించటం ఏమిటి? పిల్లలకు తన మధ్య ఉన్న ఈ దూరాన్ని ఒంటరిగా ఎలా దాటటం? అని దుఃఖం, "మీకేం? హాయిగా దాటిపోయారు, మీ సుఖాలన్నీ చక్కగా అమరిపోయాయి..నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్లిపోయారు" అని రామారావు మీద కోపం. వచ్చిపోయేవాళ్ల సానుభూతిని కూడా భరించలేని పరిస్థితి..ఇలా, ఎన్నో వికారాలు. ఏమీ తెలియని స్థితి ఒకరోజైతే ఎక్కడలేని ధైర్యం మరో రోజు.ఒక్కోసారి మనుషులు కావాలి అన్న భావన, మరెన్నో సార్లు అబ్బ, ఎవరూ వద్దు, నా మానాన నేను జీవించాలి అన్న భావన.

కొన్నాళ్లు శూన్యం ఆవరించిన జీవితం కనకమహాలక్ష్మి. మొదట్లో పలకరింపులకు బంధువులు, ఇరుగు పొరుగు. తరువాత అది కూడా తగ్గిపోయింది. ఓ మూడు నెలలు కనకం ఒంటరి జీవితం అనుభవించింది. ఏ పని చేసినా తన ఒక్క దానికోసమే చేసుకోవాలి. ఇన్నాళ్లూ రామారావు కోసం వచ్చిపోయే స్నేహితులు, బంధువులు వాళ్ల కోసం ఏర్పాట్లు. ఇప్పుడు కేవలం తన కోసమే వంట. ఇలా మొదలైంది ఆమె సత్యాన్వేషణ. పిల్లలు, భర్త ప్రపంచంగా జీవితంలో సింహభాగం గడిచిపోయింది. అంతకుముందెన్నడూ బయట పనులలో తనను రామారావు భాగస్వామిని చేయలేదు. ఇప్పుడో? పూర్తిగా భిన్నమైన జీవితం. కరెంటు, ఫోను వగైరా బిల్లులు, పెన్షన్ పనులు, బ్యాంక్ పనులు ఇంటి పనులు...ప్రతిదీ తనదే బాధ్యత. ఇంటర్నెట్ ఎలా వాడాలి అన్నది కూడా ఇప్పుడే శ్రీకారం. అలా తప్పటడుగులతో కనకం తన జీవితంలోని తరువాయి భాగాన్ని మొదలు పెట్టింది. పీయూసీ చదువుకుంది కాబట్టి వ్యవహారాల్లో అంత కష్టపడకుండానే విషయాలను అవగాహన చేసుకుంది.

కొన్నాళ్లకు వనజ ఫోన్ చేసింది. విషయం తెలిసి తనతో పాటు మరో ముగ్గురు చిన్ననాటి స్నేహితులను తీసుకుని కనకం ఇంటికి వచ్చింది. పలకరింపులు, నిట్టూర్పులు పూర్తయ్యాయి. ఎక్కువ శాతం మంది స్నేహితులు, బంధువులు కనకానికి పిల్లల దగ్గరకు వెళ్లమని సూచించినా ఆమెకు ఆ సలహా నచ్చలేదు. తాను తిరిగి నిలదొక్కుకొని తనకు వెళ్ళాలి అన్న భావన కలిగినప్పుడే తన ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో వెళ్లాలని తీర్మానించుకుంది. స్నేహితులతో తన ఆశయాన్ని చర్చించింది.

"నువ్వున్న పరిస్థితులలో ఇవన్నీ అవసరమా! నీకు పెన్షన్ వస్తుంది, దానితో నీ జీవితానికి ఢోకా లేదు, అమెరికా వెళ్లి ఎంచక్కా పిల్లలతో సమయం గడిపేయవచ్చు. ఈ సమాజ సేవలో ఎన్ని లొసుగులో  ఎన్ని కష్టాలో నీకు తెలియట్లేదు.." అని ఒక స్నేహితురాలు. "సమాజసేవలో నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ పోయి నువ్వు రోడ్డు మీదికోస్తే పిల్లలు దానిని హర్షించరు కనకమహాలక్ష్మి" అని మరో స్నేహితుడు..."ఆడదానివి, అందులోనూ ఒంటరిగా ఉంటావు, ఈ సమాజసేవ వల్ల నీకు ఒరిగేదేమిటి?" అని ఇంకో స్నేహితురాలు...తలా ఓ నిరుత్సాహపరచే సలహా లేదా కామెంటు. ఒక్క వనజ మాత్రం "కనకమహాలక్ష్మీ! జీవితం తల్లక్రిందులైంది అన్న పరిస్థితిలో నీ స్థానంలో ఉండే చాలా మంది స్త్రీలు పిల్లల దగ్గరకు వెళ్లిపోతారు లేదా ఎటూ కదలని స్తబ్దైన జీవితంలోకి వెళతారు. కానీ, నీ నిర్ణయం అలా లేదు. జీవిత భాగస్వామిని కోల్పోవటం అనేది చాలా పెద్ద దెబ్బ, అయినా నీ అస్తిత్వం కోసం పాటుపడే దిశగా నువ్వు ఆలోచిస్తున్నావు. అది మన దేశానికి చాలా శుభ పరిణామం. నీకు నా పూర్తి సపొర్ట్" అని కనకం ఆలోచనలను దృఢపరచింది.

స్నేహితులు వెళ్లిపోయిన తరువాత కనకం రీడింగ్ టేబుల్ దగ్గర లైటు పెట్టుకొని తన ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వటం మొదలు పెట్టింది.

"వ్యక్తిత్వ వికాసం - నేటి భారతీయులలో కొరవడిన అది ముఖ్యమైన లక్షణం. ఈ వ్యక్తిత్వ వికాసాన్ని చిన్నప్పటినుండే పిల్లలకు అలవాటు చేస్తే? ఆలోచనే ఆహా అనిపిస్తోంది. అమలు చేయగలిగితే? కొంతమంది బాలబాలికలైనా స్వావలంబన, మానసిక దృఢత్వంతో నేటి సమాజపు సమస్యలను ఎదుర్కునే వ్యక్తిత్వం పొందగలరు. ఎందరో బాలబాలికలు మానసిక బలం లేక చదువుల్లో పోటీ ప్రపంచంలో నిలువలేకున్నారు, యువతీయువకులు వైవాహిక మరియు ఉద్యోగ జీవితాలలో సమస్యలను ఎదుర్కోలేక సతమతమవుతున్నారు. కొద్ది మంది బాలబాలికలు మరియు యువతీ యువకులకైనా జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కునే వ్యక్తిత్వాన్ని శిక్షణ ద్వారా, అవగాహన ద్వారా అందించ గలిగితే నాకు ఎంతో ఆత్మ సంతృప్తి. ఇదే నా మిగిలిన జీవిత లక్ష్యం. దానికి ముందు నేను దృఢ సంకల్పంతో ఉండాలి. దానికి సాధన నేడే ప్రారంభం".

రాసుకున్న అక్షరాలను పదే పదే చదువుకుని, రేపటి కోసం ఎదురు చూస్తూ నిద్రలోకి జారుకుంది  కనకం. మరునాడు ఉదయమే లేచి తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చింది. మూడు నెలల సమయంలో ఆర్కే (రామారావు - కనకం) పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇన్స్టిట్యూట్ అని పాఠశాల, కళాశాల విద్యార్థులకు వారి వయసును బట్టి ప్రణాలిక సిద్ధం చేసి దానికి ఇద్దరు మనస్తత్వ నిపుణులు, ఇద్దరు విద్యావేత్తల సేవలను వినియోగించుకొని విద్యాసంస్థలతో అనుసంధానం ఏర్పరచుకోవటంలో కనకం సఫలమైంది. రెండేళ్ల కఠోర శ్రమ తరువాత ఆర్కే ఇన్స్టిట్యూట్ హైదరాబాదే కాదు ఇతర ప్రాంతాలలో కూడా పేరొందింది. ప్రముఖుల జీవిత పాఠాలు, చరిత్రలోని ఘటనలు, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన పుస్తకాలు, శిక్షణా కార్యక్రమాలను తన ప్రణాలికలో విద్యార్థుల తరగతి, వయసు మరియు అవగాహనకు తగినట్లుగా రూపొందించి ఆ ప్రణాలికల అమలులో తాను ముందుండి నడిపించింది కనకం. ఓ ఐదేళ్లలో ర్యాగింగ్, యాసిడ్ అటాక్, బాలికలపై అత్యాచారం, గృహ హింస వంటి ఎన్నో క్లిష్టమైన సమస్యలను ఎదుర్కునే ప్రణాలికలు విస్తృతంగా ప్రచారం చేసింది ఆర్కే ఇన్స్టిట్యూట్.

"విద్యార్థినీ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం అనే ముఖ్యమైన అంశంపై ప్రభావవంతమైన, విజయవంతమైన శిక్షణను, ప్రణాలికలను అందిస్తున్న ఆర్కే పర్సనాలిటీ డెవలప్మెంట్ సంస్థ అధినేత్రికి తెలంగాణా ప్రభుత్వం వారి విశిష్ట సేవా పురస్కారాన్ని అందజేయవలసిందిగా గవర్నర్ గారిని కోరుతున్నాము..."...క్రిక్కిరిసిన రవీంద్రభారతి ఆడిటోరియం హాలులో గవర్నర్ చేతుల మీదుగా సేవా పురస్కారాన్ని అందుకునే వేళ కనకం మనసులో భావోద్వేగం, ఏదో సాదించానన్న ఆత్మ సంతృప్తి, మరో పదేళ్లు సేవ చేయాలన్న ఉత్సాహం కలిగాయి. ఎదురుగా కూర్చొని చప్పట్లు కొడుతూ ఆనందబాష్పాలు తుడుచుకుంటున్న స్నేహితురాలు వనజ, అమెరికా నుండి మర్నాడు ఇంటర్నెట్‌లో తల్లి గురించి వచ్చిన వార్తలను చూసి పొంగిపోయిన బిడ్డలు ఆమె ఆనందంలో, ఆ స్థాయికి చేరటంలో పడ్డ కష్టాలలో భాగస్వామ్యులు. నేడు వంటింటికి పరిమితం కాని వనిత కనకమహాలక్ష్మి. ఆ ఇంకేముంది పెన్షన్ వస్తుంది జీవితం గడిచిపోతుంది అని అనుకునే అగమ్యగోచరమైన వితంతువు కాదు. పిల్లలే జీవితం అనుకుంటూ పిల్లలపై ఆధార పడని సాధికరత పొందిన తల్లి ఆమె. ఆర్కే అనే ఒక బ్రాండ్‌కు మారుపేరు కనకం. సమాజ సేవ చేస్తూ ఆర్థిక స్వావలంబన కలిగిన ధీర వనిత. ఆమె ఒక మార్గదర్శి. స్ఫూర్తిప్రదాత.

"నా కోసం" అని పరితపిస్తూ ముందడుగు వేయలేకపోతున్న ప్రతి మహిళకు ఈ కథానిక అంకితం!

- ప్రసాద్  అక్కిరాజు 

కళలకు కాణాచి - విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల




విజయనగరం - ఆ భూమిలో ఏముందో! సంగీతానికి, సమస్త కళలకు పుట్టినిల్లు విజయనగరం. ఆ ప్రాంతాన్ని పాలించిన పూసపాటి గజపతి రాజులు ఆ కళలు వర్ధిల్లేలా వసతులు కల్పించి ప్రోత్సహించారు. ఆ పట్టణంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అంటే తెలియని కళాభిమానులుండరు. 1919వ సంవత్సరంలో మహారాజా పూసపాటి విజయరామ గజపతిరాజు గారు ఈ కళాశాలను స్థాపించారు. తొలుత దీనిని విజయరామ గానపాఠశాల అని నామకరణం చేశారు. మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా హరికథా పితామహులు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు కాగా, ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు ద్వారం వేంకటస్వామి నాయుడు గారు తొలి ప్రొఫెసర్. విజయరామ గజపతి రాజు గారి తరువాత వారి కుమారులైన అలక్ నారాయణ గజపతి రాజు గారు ఆ సంస్థ పేరును శ్రీ విజయరామ సంగీత మరియు నృత్య కళాశాలగా మార్చారు. వివిధ విభాగాలను ఏర్పాటు చేశారు. తరువాతి మహారాజా పీవీజీ రాజు గారు ఈ కళాశాలను ఎంతో అభివృద్ధి చేశారు. 1955వ సంవత్సరంలో ఈ కళాశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక్కడ సంగీత నృత్య విభాగాలలో డిప్లొమా మరియు డిగ్రీ కోర్సులు ఉన్నాయి.



ఇక మహారాజా కళాశాలలో పనిచేసిన వారు, నేర్చుకున్న వారి జాబితా చూస్తే ఆ కళాశాల ఘన చరిత్ర తెలుస్తుంది - ప్రధాన అధ్యాపకులుగా ద్వారం వేంకటస్వామి నాయుడు గారు, ద్వారం నరసింగరావు నాయుడు గారు, ద్వారం భావనారాయణరావు గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, ద్వారం దుర్గాప్రసాదరావు గారు మొదలైన ప్రముఖులు పని చేశారు. వారి శిక్షణ పొందిన వారు వేలాది మంది విద్యార్థులు గురువులై ఆ పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. ద్వారం వంశంలో ఎందరో ఈ సంస్థలో చదివిన వారే. ఘంటసాల వేంకటేశ్వరరావు గారు, పులపాక సుశీలమ్మ గారు, సాలూరి రాజేశ్వరరావు గారు, సాలూరి హనుమంతరావు గారు, కొమాండూరి కృష్ణమాచార్యుల వారు, మంచాల జగన్నాథరావు గారు, మారెళ్ల కేశవరావు గారు, ముళ్లపూడి లక్ష్మణరావు గారు, ముళ్ళపూడి శ్రీరామమూర్తి గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, మహామహోపాధ్యాయ నూకల చినసత్యనారాయణ గారు...ఇలా ఎందరో ప్రముఖులకు సంగీత విద్యను అలదిన సంస్థ మహారాజా కళాశాల. అక్కడి గాలిలో, నీటిలో, మనుషులలో సంగీతం అంతర్భాగం అని చెప్పటం అతిశయోక్తి కాదు.


గాత్రం, వయోలిన్, వీణ, మృదంగం, భరతనాట్యం, కూచిపూడి, కథక్‌లలో ఆంధ్రా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా డిగ్రీ మరియు డిప్లోమా కోర్సులు ఈ కళాశాల ద్వారా చేయవచ్చు. దాదాపు 100 ఏళ్ల చరిత్ర గల ఈ కళాశాల తెలుగు జాతికి చేసిన సేవ ఎనలేనిది. పద్మ అవార్డులు, సంగీత కళానిధి బిరుదులు పొంది మన కళల ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపింపజేసిన ప్రముఖులకు విద్యను ఇచ్చిన సరస్వతీ నిలయం ఇది. స్థాపించి పోషించిన ఆ మహారాజులకు, ప్రమాణాలు పాటించి ప్రతిభకు ప్రాణం పోసిన ప్రధాన అధ్యాపకులకు శతసహస్ర వందనాలు. ద్వారం కుటుంబ సభ్యులకు ఈ కళాశాలతో ఉన్న సుదీర్ఘమైన అనుబంధం, వారు ఈ సంస్థకు చేసిన సేవ చిరస్మరణీయం. ఆ కుటుంబ సభ్యులకు మనం ఎంతో రుణపడి ఉన్నాము.

ప్రముఖ గాయని, సంగీత అధ్యాపకురాలు, ద్వారం వేంకటస్వామి నాయుడు గారి మనుమరాలు, ద్వారం భావనారాయణరావు గారి కుమార్తె ద్వారం లక్ష్మి గారు ఫేస్బుక్‌లో నా యీ పోస్టుకు కామెంటుగా ఈ వివరాలు ఇచ్చారు:

"మా కుటుంబంలో మీరు చెప్పిన నలుగురు ప్రధాన అధ్యాపకులతో పాటు మా మేనత్త గారు ద్వారం మంగతాయారు గారు, ద్వారం రమణకుమారి గారు, ద్వారం మనోరమ గారు, నేను (మొత్తం ద్వారం కుటుంబం నుండి ఎనమండుగురం) ఈ కళాశాలలో పని చేశాము. ఈ కళాశాలలో చదువుకున్న మా ఇతర కుటుంబ సభ్యులు - మా అమ్మ గారు గుమ్మలూరి వరదమ్మ గారు, పెద్దమ్మ గారు గుమ్మలూరి రమణమ్మ గారు ఇక్కడ చదివారు. మా పెద్దమ్మమ్మ కుమారుడైన శ్రీ జోగారావు గారు ఇక్కడ లెక్చరర్‌గా పని చేశారు. వారి కుమారులు శాస్త్రి గారు ఇక్కడ పని చేస్తున్నారు. మా అత్త గారి వైపు కూడా ఇద్దరు పెద మామ గార్లు ఇక్కడ సంగీతం నేర్చుకున్నారు. మా ద్వారం కుటుంబానికి ఈ కళాశల పుట్టినిల్లు, ఓ దేవాలాయం. మా కుటుంబానికి ఈ కళాశాలతో అవినాభావ సంబంధం ఉంది ". 

19, ఆగస్టు 2017, శనివారం

అలనాటి గాయనీమణి ఎల్.ఆర్ ఈశ్వరి గారి సినీ ప్రస్థానం విశేషాలు


ఆమె పేరు వింటేనే ఉత్సాహం ఉరకలేస్తుంది. చిన్న-పెద్ద అని లేకుండా అందరూ ఆమె గళంలోని కైపుకు దాసోహమైన వాళ్లే. దశాబ్దాల పాటు మత్తెక్కించే పాటలతో పాటు ఎన్నో భక్తి గీతాలను కూడా పాడి దక్షిణాది సినీ అభిమానులను అలరించిన గాయని ఎల్. ఆర్. ఈశ్వరి. వీరి పూర్తి పేరు లూర్డ్-మేరీ రాజేశ్వరి ఈశ్వరి. 1939 డిసెంబరు 7న చెన్నైలో రోమన్ కేథలిక్ దంపతులైన ఆంథోనీ దేవరాజ్, రెజీనా మేరీ నిర్మల దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వైపు వారు క్రైస్తవులు, నాయనమ్మ వైపు వారు హిందువులు కావటంతో రెండు కుటుంబాలకూ ఆమోదయోగ్యంగా అలా పేరు పెట్టుకున్నారు.

ఆరేళ్ల వయసులోనే భర్త  దేవరాజ్ మరణించటంతో  నిర్మల ముగ్గురు పిల్లల కుటుంబాన్ని నడిపే భారం తన మీద వేసుకుని, సినీ గీతాలలో కోరస్ పాడే ఉద్యోగంలో చేరారు . చిన్ననాటి పేదరికం వలన  ఎల్. ఆర్. ఈశ్వరికి  సంగీతం నేర్చుకునే అవకాశం రాలేదు. సిలోన్ రేడియోలో పాటలు విని నేర్చుకునే వారు. తల్లితో కలిసి కోరస్‌లో పాడటంతో ఆమె సినీ జీవితం ఆరంభమైంది. తొలి అవకాశం మనోహర అనే తమిళ చిత్రంలో జిక్కి గారితో కోరస్ పాటలో వచ్చింది. ఈ చిత్రం 1954లో ఎల్వీ ప్రసాద్ గారి దర్శకత్వంలో తమిళంలో, అదే సంవత్సరంలో డబ్ చేయబడి తెలుగు, హిందీ భాషలలో విడుదలైంది. అలాగే, 1957లో విడుదలైన సువర్ణసుందరి చిత్రంలో సుశీలమ్మ పాడిన పిలువకురా అనే పాట కోరస్‌లో కూడా పాడారు. 1958లో విడుదలైన తమిళ చిత్రం నల్ల ఇడత్తు సంబంధం అనే చిత్రంలో సంగీత దర్శకులు కేవీ మహాదేవన్ గారు మూడు పాటలు పాడే తొలి అవకాశాన్నిచ్చారు. షావుకారు జానకి, ఎం.ఆర్ రాధ నటించిన ఈ చిత్రం విజయం సాధించగా ఎల్.ఆర్ ఈశ్వరి సినీ నేపథ్య గాయని ప్రస్థానం మొదలైంది. తెలుగులో తొలి అవకాశం 1958లోనే కేవీ మహాదేవన్ గారి సంగీత దర్శకత్వంలో విడుదలైన దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. తమిళ చిత్రాలలో 1961లో విడుదలైన పాశమలర్ అనే చిత్రంలో పాటలతో ఎల్.ఆర్ ఈశ్వరి గారి ఉత్థానం ప్రారంభమైంది. తమిళ దర్శకులు ఏ పీ నాగరాజన్ గరు అప్పటికే ఎం ఎస్ రాజేశ్వరి అనే గాయని ఉండటంతో రాజేశ్వరి ఈశ్వరి పేరుని ఎల్.ఆర్ ఈశ్వరి గా మార్చారు.
ఇక 1960-70 దశకాలు ఎల్.ఆర్ ఈశ్వరి గళంలో వెలువడిన పాటలు మత్తు, గమ్మత్తుతో వీక్షకులను ఉర్రూతలూగించాయి. సుశీలమ్మ, జానకమ్మ మాధుర్యానికి, సొగసుకు మారుపేరైతే ఎల్.ఆర్ ఈశ్వరి ఈ కైపున్న పాటలకు ట్రేడ్ మార్క్ అయ్యారు. తెలుగులో పాండవ వనవాసం, ప్రతిజ్ఞాపాలన, ఉమ్మడి కుటుంబం, భార్యా బిడ్డలు, రైతుబిడ్డ, రౌడీలకు రౌడీలు, మంచి మిత్రులు, అందమైన అనుభవం, అంతులేని కథ, నిండు మనసులు, నాగమల్లి, మరోచరిత్ర, పుట్టినిల్లు మెట్టినిల్లు, అమ్మాయిల శపథం, అగ్గి బరాట, శ్రీవారు మావారు, ముత్తైదువ, రామాలయం, గౌరి, మంచి చెడు, ధనమా దైవమా, శ్రీమంతుడు, జరిగిన కథ, జమీందారు గారి అమ్మాయి, అల్లూరి సీతారామరాజు, రైతు కుటూంబం, మానవుడు దానవుడు, మాతృదేవత, ప్రేం నగర్, దేవుడు చేసిన మనుషులు, రాజకోట రహస్యం, అమ్మ మాట, జీవన తరంగాలు, ప్రాణం ఖరీదు, అన్నదమ్ముల సవాల్, భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణ పాండవీయం, మొరటోడు, ప్రేమ జీవులు, దీక్ష ఆలీబాబా నలభై దొంగలు, బాలమిత్రుల కథ, అగ్గిదొర, ఇదాలోకం మొదలైన ఎన్నో తెలుగు చిత్రాలకు పాటలు పాడారు.

ఎల్.ఆర్ ఈశ్వరి గారి పాడిన పాటల్లో - గాలిలోన పైట చెంగు, పాములోళ్లమయ్య, మాయదారి సిన్నోడు, ఆకులు పోకలు ఇవ్వద్దు, లేలేలేలేలే నా రాజా, భలే భలే మగాడివోయ్, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, నందామయా గురుడ నందామయా, గుడిలోన నా సామి, తీస్కో కోకోకోలా, బోల్త పడ్డావు చిన్ని నాయనా వంటి మత్తెక్కించేవి ఎంతో పేరు పొందాయి. . విజయలలిత, హలం, జ్యోతిలక్ష్మి వంటి శృంగార నర్తకీమణులకు ఎల్.ఆర్ ఈశ్వరి గారు పాడారు. ఇంతే కాకుండా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారికి ఎన్నో తమిళ తెలుగు చిత్రాలలో నేపథ్య గాయనిగా పాటలు పాడారు. తమిళంలో ఎన్నో అమ్మవారి భక్తి గీతాల ఆల్బంస్ పాడారు. అలాగే క్రైస్తవ భక్తి గీతాలు కూడా పాడారు. తమిళం, తెలుగులో ఎక్కువ పాటలు పాడిన ఆవిడ కన్నడంలో, మళయాళంలో కూడా ఎన్నో బహుళ ప్రాచుర్యం పొందిన పాటలు పాడారు. ఘంటసాల, టీఎం సౌందర్‌రాజన్, పీబీ శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, యేసుదాసు, సుశీలమ్మ, జానకమ్మ, వాణీ జయరాం మొదలైన వారితో కలిసి పాడారు. సత్యం, చక్రవర్తి, కేవీ మహాదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్ వంటి మేటి సంగీత దర్శకుల వద్ద పని చేశారు.

1970వ దశకం చివరలో లో నేపథ్య సంగీతం నుండి కనుమరుగైన ఎల్. ఆర్ ఈశ్వరి గారు 2011లో శింబు నటించిన ఓస్తే అనే తమిళ చిత్రం ద్వారా పునః ప్రవేశం చేశారు. ఆ తరువాత తమిళ కన్నడ చిత్రాలలో పాడారు. మొత్తం 14 భాషలలో ఆవిడ పాటలు పాడారు. పాట ఎంత చలాకీనో, మనిషి కూడా అంతే చలాకీ. వందల ప్రైవేట్ కచేరీలలో పాల్గొన్న ఎల్. ఆర్ ఈశ్వరి గారు అవివాహిత. ఈ మధ్య కాలంలో టెలివిజన్ పాటల పోటీల కార్యక్రమాలలో జడ్జిగా పాల్గొన్నారు. కలైమామణి, స్వరాలయ పురస్కారాలు అందుకొని, 77 ఏళ్ల వయసులో కూడ ఉత్సాహంగా పాడగలుగుతున్న విలక్షణ గాయని ఎల్.ఆర్ ఈశ్వరి గారు. బాలసుబ్రహ్మణ్యం గారు వీరిని ఎల్. ఆర్ భాస్వరం అని ఆటపట్టిస్తుంటారు. భాస్వరంలా ఉరకలెత్తే గాయనీమణి అని ఆయన భావన.

ఎల్. ఆర్. ఈశ్వరి గారి పాటల్లో నాకు చాలా  ఇష్టమైన పాట 1972లో విడుదలైన అమ్మ మాట చిత్రంలో జ్యోతి లక్ష్మి పై చిత్రీకరించబడీన మాయదారి సిన్నోడు. తెలుగునాట సంచలనం సృష్టించిన ఈ పాట ఇటీవలే రీమిక్స్ కూడా చేయబడింది. నారాయణ రెడ్డి గారు రచించిన ఈ పాటకు సంగీతం రమేష్ నాయుడు గారు. అటు తరువాత 1978లో విడుదలైన మరో చరిత్ర చిత్రంలోని భలే భలే మగాడివోయ్ అన్న పాట. ఆచార్య ఆత్రేయ గారు రచించగా, ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతం అందించిన ఈ పాటను బాలు, ఎల్.ఆర్ ఈశ్వరి గారు కలిసి పాడారు. ఈ పాటను కమల్ హాసన్, సరితలపై చిత్రీకరించారు. భాషేతర ప్రేమ నేపథ్యమైన ఈ చిత్రంలో ఈ పాటలో ఎల్. ఆర్ ఈశ్వరి గారి మత్తెక్కించే గాత్రం సమ్మోహనం. ఎల్. ఆర్. ఈశ్వరి గారికి పరమాత్మ ఆయురారోగ్యాలు, మరెంతో గాత్ర సేవా భాగ్యం ప్రసాదించాలని ప్రార్థన

అదిగదిగో గగనసీమ - దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన రావు బాలసరస్వతి, ఎమ్మెల్ వసంతకుమారి గానంలో



అదిగదిగో గగనసీమ అందమైన చందమామ ఆడెనోయి
ఇదిగిదిగో తేలి తేలి చల్లనైన పిల్లగాలి పాడెనోయి 
సా రి గ మ ప ద ని సా సా దా ప మ రి గ మ రి సా

హాయి హాయి ఈ లోకం తీయనైనదీ లోకం
నీ ఇల్లే పూలవనం నీ సర్వం ప్రేమ ధనం మరువకోయి ఈ సత్యం


నీ కోసమే జగమంతా నిండెనోయి వెన్నెలలు
చేలలోని గాలిపైన తీయనైన తూలికలు
చెరుచుకోకు ఈ సౌఖ్యం చేతులార ఆనందం
ఏనాడును పొరపడకో ఏమైనా త్వరపడకో
మరల రాదు రమ్మన్నా మాయమైన ప్రేమ ధనం
చిగురింపదు తిరిగి వాడి చెడిన పూలవనం మరువకోయి ఈ సత్యం


దేవులపల్లి కృష్ణశాస్త్రి - ఆ పేరంటేనే తెలుగుదనం. మాటల మువ్వలు భావానికి మురిసి నర్తిస్తే అది కృష్ణశాస్త్రి గీతమవుతుంది. ఆ పదాలేమీ కఠినంగా ఉండవు, పామరులకు కూడా తేటతల్లమే. అందరి హృదయవీణలు మీటి మోహన రాగాలు పలికిస్తాయి. భావానికి మారు పేరు కృష్ణశాస్త్రి. అందులోనూ లలిత సంగీతానికి ఆయన సాహిత్యం ప్రాణవాయువు. తెలుగునాట కృష్ణా గోదావరులున్నంత వరకూ కృష్ణశాస్త్రి సాహిత్యం మకుటాయమానంగానే ప్రకాశిస్తుంది. అటువంటి ఓ గీతమే 1953లో విడుదలైన నా ఇల్లు అనే చిత్రంలోని అదిగదిగో గగనసీమ అనే భావవీచిక.

చిత్ర నేపథ్యం:

ఆనాటి సినీ మహామహులు చిత్తూరు వుప్పలదడియం నాగయ్య గారు నిర్మించి దర్శకత్వం వహించిన ఈ కళాఖండంలో నాగయ్య గారు నాయకుడు, ప్రఖ్యాత నర్తకి టీ ఆర్ రాజకుమారి గారు నాయిక. ఈ రాజకుమారి గారి కుటుంబానికి చెందినవారే జ్యోతిలక్ష్మి, జయమాలిని. ఈ చిత్రంలో ప్రతినాయిక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితగారి తల్లి సంధ్య సోదరి విద్యావతి. రాజకుమారి, విద్యావతి గార్ల అద్భుతమైన నటనతో ఈ చిత్రం మంచి విజయమే సాధించినా పార్టనర్ల మోసం చేసి నాగయ్యగారికి చిల్లి గవ్వ కూడా దక్కలేదు. చిత్రానికి సంగీతం నాగయ్య గారు, అద్దేపల్లి రామారావు గారు అందించారు.రావు బాలసరస్వతీ దేవి గారు, ఎమ్మెల్ వసంతకుమారి గారు, జిక్కి గారు, ఎమ్మెస్ రామారావు గారు, నాగయ్య గారు ఈ చిత్రానికి నేపథ్య గాయకులు. ఈ చిత్రానికి సంభాషణలు కూడా కృష్ణశాస్త్రి గారే.

పాట వివరాలు:

తెలుగు నేపథ్య సంగీతంలో తొలి గాయనీమణుల్లో ఒకరైన బాలసరస్వతి గారు, ఎమ్మెల్ వసంతకుమారి గారు కలిసి పాడిన ఓ అరుదైన గీతం అదిగదిగో గగన సీమ. పాటలో ప్రధాన గాత్రం బాలసరస్వతి గారిదే. ఎంత మధురంగా పాడారంటే వినే వారు ఆనందంలో తేలిపోవలసిందే. ఈ గీతంలో అద్భుతమైన భావం. మంచి ఆశావహమైన స్ఫూర్తిని కలుగజేస్తూ కర్తవ్యాన్ని కూడా బోధిస్తుంది ఈ గీతం. సాహిత్యంలో కృష్ణశాస్త్రి ముద్ర అణువణువునా గోచరిస్తుంది. నాగయ్య గారు ఈ పాటను సారంగ రాగంలో కూర్చారు. ఈ గీతం నాగయ్య గారి సంగీత ప్రతిభను సూచిస్తుంది. తరువాత ఇదే బాణీలో ఎన్నో దేశభక్తి, లలిత గీతాలు తెలుగు సంగీత ప్రపంచంలో వచ్చాయి. ఇల్లు, ప్రేమ ఎంత ముఖ్యమైనవో తెలిపే సందేశాత్మకమైన భావగీతి ఇది. బాలసరస్వతి గారి గాత్రంలో ఆ చెప్పలేని పట్టులాంటి మృదుత్వం ఉంటుంది, ఆ స్వరలక్షణం లలిత భావ గీతాలకు ఎంతో శోభనిచ్చేది. ఎమ్మెల్ వసంతకుమారి గారు అప్పటికే మేటి గాయని అయినా నాగయ్య గారిపై గౌరవంతో, బాలసరస్వతి గారి గొంతులో గొంతు కలిపి అద్భుతమైన ఏకగాత్రం అనిపించేలా పాడారు. ఆనాటి సామాజిక పరిస్థితుల వలన బాలసరస్వతి గారు సుశీలమ్మ, లీల, జిక్కి లాగా బహుళంగా పాడలేకపోయినా, పాడినవి అమృత గుళికలు. మలయమారుతంలా వీచే ఈ గీతం విని ఆనందించండి. 

నీ దయ రాదా - త్యాగరాజస్వామి కృతి


నీ దయ రాదా రామ నీ దయ రాదా!

కాదనే వారెవరు కళ్యాణ రామా! 

నను బ్రోచే వాడవని నాడే తెలియ
ఇన వంశ తిలక ఇంత తామసమా!

అన్నిటికికధికారివని నేఁ బొగడితి
మన్నించితే నీ మహిమకుఁ దక్కువా!

రామ రామ రామ త్యాగరాజ హృత్సదన
నా మది తల్లడిల్లగ న్యాయమా వేగమే!


ఓ రామా! నీకు నాపై దయ కలుగదా? నీకు దయ రాకున్ననూ కాదనే వారున్నారా?  ఓ సూర్యవంశ శ్రేష్ఠుడా! నన్ను బ్రోచేవాడవు నీవేనని నీకు ముందే తెలుసు. అయినా ఇంత తామసమా? అన్నిటికీ నీవే అధికారివని నేను నిన్ను నుతించినాను. నన్ను మన్నించితే నీ మహిమకు ఏమైనా తక్కువగునా? త్యాగరాజుని హృదయములో నివసించే ఓ రామా! నా మనసు తల్లడిల్లేలా చేయుట నీకు న్యాయమా? వీగమే నన్ను బ్రోవుము.

- సద్గురువులు త్యాగరాజస్వామి

నిందాస్తుతిలో త్యాగరాజ స్వామి అనేక కృతులు రచించారు. క్లేశములో ఉన్నప్పుడు భక్తునికి భగవంతునిపై ఆగ్రహం కలగటం అనేది ఎందరో వాగ్గేయకారుల కృతులలో మనం గమనించవచ్చు. తనను బ్రోచుటలో ఆలస్యమెందుకు అని ప్రశ్నించే సంభాషణలో ఎన్నో కృతులు వచ్చాయి. అటువంటిదే నీ దయ రాదా? నిజంగా ఆయనే తనకు దిక్కు అని ప్రతి సాధకునికి తెలుసు. కానీ, ఆశ నిరాశ అయినప్పుడు మనలోని వికారాలు ఒకింత ఒలకటం మానవ సహజం. నీ దయ రాదా అన్న కృతిలో త్యాగయ్య ఇటువంటి భావనలనే వ్యక్తపరచారు. నీ అంతటి వాడు లేడు, నీవు తప్ప వేరే లేరు అని నుతిస్తూనే బ్రోచుటకు తామసమా అని పలికారు. అన్నీ నీవనుకున్నానే, నన్ను కాపాడితే నీ మహిమలకేమైనా తక్కువా అని నిష్ఠూరంగా ప్రశ్నించారు. నా మనసును కష్టపెట్టడం నీకు న్యాయమా అని నిలదీశారు. భక్తిమార్గంలో అనేక రకలా భావనలు వస్తాయి అన్న దానికి ఈ కృతి మరో నిదర్శనం. వసంతభైరవి రాగంలో త్యాగరాజస్వామి వారు ఈ కీర్తనను స్వరపరచారు. ఈ కీర్తనను తెలుగు, తమిళ చిత్రాలలో పొందు పరచారు. సుశీలమ్మ పూజ అనే చిత్రంలో ఆలపించగా, యేసుదాసు ఆరు సింధుభైరవి చిత్రంలో ఆలపించారు. యేసు దాసు గారి ఆలాపన ఇదిగో

చలి గాలి వీచింది - రావు బాలసరస్వతి గారి లలిత గీతం


లలిత గీతాల స్వర్ణయుగం రావు బాలసరస్వతి గారితోనే ప్రారంభమైందని వారి పాటలు విన్నప్పుడు ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓ నాలుగు దశాబ్దాల పాటు సాగిన ఈ స్వర్ణ యుగంలో బాలమురళిగారు, ఘంటసాల మాష్టారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, చిత్తరంజన్ గారు, వేదవతీ ప్రభాకర్ గారు, విజయలక్ష్మీ శర్మ గారు, సురేఖా మూర్తి గారు, ఛాయా దేవి గారు, ద్వారం లక్ష్మి గారు..ఇలా ఎందరో గాత్ర సంపద కలిగిన కళాకారులు సాలూరి రాజేశ్వరరావు గారు, బాలాంత్రపు రజనీకాంతరావు గారు, పాలగుమ్మి విశ్వనాథం గారు మొదలైన మహామహుల సంగీతం స్వరపరచగా అద్భుతమైన గీతాలను పాడారు. దేవులపల్లి వారు, వింజమూరి శివరామారావు గారు, రజనీ, పాలగుమ్మి వారు, ఆరుద్ర, దాశరథి గారు మొదలైన రచయితలు అమూల్యమైన లలిత సంగీత సాహిత్యాన్ని మనకు అందించారు.

రావు బాలసరస్వతీదేవి గారి పాటలు శోధించి విన్న కొద్దీ వారిపై గౌరవం ద్విగుణీకృతమవుతోంది. వారి లలిత సంగీత ప్రతిభ అసామాన్యం. సైగల్ గారి ప్రభావం తనపై ఉందని చెప్పుకున్న బాలసరస్వతి గారు వారి శైలిని ఎంతగా తన లలిత సంగీత గానంలో కనబరచారో ఒక్కొక్క గీతంలో మరింత తెలుస్తోంది. భావానికి తేనె అలది అలా సెలయేటి ధారలా తన గళంలో సాహిత్యాన్ని ఒలికించారు వారు. అటువంటి గీతమే చలి గాలి వీచింది. ఈ గీతాన్ని యూట్యూబ్ ప్రకారం వింజమూరి శివరామారావు గారు రచించారని ఉంది. మరో వెబ్ సైట్లో ఆరుద్ర గారని ఉంది. సాహిత్య శైలి చూస్తే శివరామారావు గారి రచనే అని నా భావన. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి గారు అని యూట్యూబ్ ఉవాచ. లలిత సంగీత సామ్రాజ్ఞి బాలసరస్వతి గారని వారి పాటలు వింటే అర్థమవుతుంది. ఈ గీతంలో వారి గళం ఎంత లేతగా ఉంటుందో! సుసర్ల వారి సంగీతంలో లలిత సంగీతం వినటం ఇదే మొదటి సారి.

చలి గాలి వీచింది తెలవారబోతోంది ఇకనైన ఇల్లు చేరవా 
ప్రియా ఇకనైన ఇల్లు చేరవా ఓ ప్రియా ఇకనైన ఇల్లు చేరవా!

ఎదురు తెన్నులు చూచి ఎద బెదిరి పోయింది
నిదురలో పడు తనువు నిలబెట్టుకున్నాను 
ఇకనైన ఇల్లు చేరవా ఓ ప్రియా ఇకనైన ఇల్లు చేరవా

బరువాయె నా మేను చెరువాయె కన్నీళ్లు
విరహ వేదనను ఏమో మరి మోయలేను 
ఇకనైన ఇల్లు చేరవా ఓ ప్రియా ఇకనైన ఇల్లు చేరవా

ఉత్సాహంగా సాగే ఈ మధురమైన లలిత గీతం బాలసరస్వతి గారి గానంలో ఆలకించి ఆనందించండి. 

సుందరాంగ మరువగలేనోయ్ రావేల - సంఘం చిత్రంలోని ఆపాత మధురం


సంఘం - 1954లో విడుదలైన ఓ అద్భుత కళాఖండం. ఏవీఎం వారి బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించటానికి ప్రధాన కారణం కథ, వైజయంతిమాల, అంజలీదేవిల మేటి నటనాకౌశలం. ముఖ్యంగా వైజయంతిమాల గారిది మైమరపించే నటన. దాదాపుగా వీరిద్దరి భుజాల మీదే సినిమా నడుస్తుంది. అన్న ఎన్‌టీఆర్ గారు కూడా చాలా అందంగా ఉంటారు. ఈ చిత్రానికి ఆర్ సుదర్శనం గారు సంగీత దర్శకత్వం వహించగా తోలేటి వేంకటరెడ్డి గారు పాటలను రచించారు. నాయికలకు టీ.ఎస్. భగవతి మరియు సుశీలమ్మ నేపథ్య గానం చేశారు. 63 ఏళ్ల క్రితం ఇటువంటి చిత్రం వచ్చిందంటే ఓ సంచలనమే అనుకోవాలి. ఎంతో అభ్యుదయ భావాలను ప్రోత్సహించిన చిత్రం ఇది. చక్కని ఇతివృత్తం, మధ్య మధ్యలో హాస్యం, నటీనటుల సహజ హావభావాలు, సంగీత నృత్యాలు, చిత్రీకరణ ఈ చిత్రానికి ఆయువుపట్లు. రాణి, కామిని పాత్రలలో వైజయంతిమాల, అంజలి పోటీ పడి నటించారు. చిలక పలుకుల తెలుగులో వైజయంతిమాల తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. స్నేహితురాళ్లుగా వీరిద్దరూ చిత్రాన్ని డామినేట్ చేశారు.  ఈ చిత్రం తొలుత తమిళంలో నిర్మించబడి (పెణ్), తరువాత తెలుగులో, తరువాత హిందీలో (లడ్కీ) విడుదలై మూడు భాషల్లోనూ విజయం సాధించాయి.

ఈ చిత్రంలో సుశీలమ్మ, టీఎస్ భగవతి గారు పాడిన సుందరాంగ మరువగలేనోయ్ రావేల అనే కృష్ణ ప్రేమ గీతాన్ని మనోజ్ఞంగా తోలేటి వారు రచించంగా పాటలో తన్మయులై నటించారు నాయికలు. ఎంత సుందరమైన గీతమో! పాట సాహిత్యమొక వైపు, ఈ ఇరువురు అందమైన నాయికల నటన మరొక వైపు. ప్రేక్షకుల మనసులు దోచుకొని ఈ గీతాన్ని అజరామరం చేశాయి. ఆర్ సుదర్శనం గారు ఏవీఎం వారికి ఆస్థాన సంగీత విద్వాంసులు. చక్కని వీణా వాదనం, పక్క వాయిద్యముల ధ్వానములతో ఈ పాట అనుక్షణం అలరిస్తుంది. మేను పులకరింపజేస్తుంది. ఆపాత మధురం అని ఊరకే అనలేదు సుమా! సంగీతానికి, నటనకు, భావానికి, చిత్రీకరణకు సమమైన ప్రాధాన్యతనిచ్చి పాటలను కూర్చిన రోజులవి. నటీమణుల ప్రతిభను ప్రకాశింపజేసే సాంకేతిక నైపుణ్యం ఆనాటీ దర్శకులలో ఉండేది. తోలేటి వారి పద ప్రయోగం గమనించండి. చక్కని చిక్కని తెలుగులో లయబద్ధమైన పదమంజరిని రచించారు. ఈ సాహిత్యానికి సంగీత దర్శకులు ఉపయోగించిన వీణావాదనం మనోహరం. నాయికల కళ్లలో వలపులు, ఎదురుచూపులు అద్భుతః. టీఎస్ భగవతి గారు తమిళ చలనచిత్రసీమలో ప్రఖ్యాత గాయని. ఇక సుశీలమ్మ సంగతి చెప్పేదేముంది? వీరిద్దరి యుగళగీతం ఆద్యంతం రసజ్ఞులకు కర్ణామృతమే. ఈ మేటి వన్నె గల గీతాన్ని వీక్షించండి. సాహిత్యం ఇదిగో!

సుందరాంగ మరువగలేనోయ్ రావేల
నా అందచందములు దాచితి నీకై రావేల

ముద్దు నవ్వుల మోహన కృష్ణా రావేల
నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలు

మేని కనులలో వాలు చూపుల ఆ వేళ
నను జూసి కనుసైగ జేసితివోయి రావేల

కాలి మువ్వల కమ్మని పాట ఆ వేళ
ఆ మువ్వలలో పిలుపు అదే వలపు మురిపెముల కలగలుపు

హృదయ వీణ తీగలు మీటి ఆ వేళ
అనురాగ రసములే చిందితివోయి రావేల

మనసు నిలువదోయ్ మధు వసంతమోయ్ రావేల
పూవులు వికసించే ప్రకాశించే ప్రేమతో పలవించే 


17, ఆగస్టు 2017, గురువారం

భక్త జన వత్సలే - నామదేవుని అభంగ్


భక్త జన వత్సలే యేయి ఓ విఠ్ఠలే
కరుణాకల్లోలే పాండురంగే

సజల జలద ధర పీతాంబర పరిధాన
యేయి ఉద్ధరణే కేశీరాజే

నామా మ్హణే తు విశ్వాచీ జననీ
క్షీరాబ్ధి నివాసిని జగదంబే

ఓ విఠ్ఠలా! భక్తులపై వాత్సల్యము కల పాండురంగా! ఈ భక్తునిపై కరుణతో రమ్ము! నీటితో నిండిన నల్లని మేఘము వంటి శరీరముతో, పీతంబరము ధరించి నన్ను ఉద్ధరించటానికి రమ్ము ఓ కేశవా! నామదేవుడు నీవు పాలకడలిలో నివసించే జగన్మాతవని విశ్వసిస్తున్నాడు. ఈ భక్తుడిపై కరుణతో రమ్ము!

నామదేవుడు మహా భక్తుడు. పాండురంగ విఠలుని జగన్మాతగా భావించి పలికిన మరాఠీ అభంగ్ ఇది. అచంచలమైన భక్తికి మరాఠా ప్రాంతం సుప్రసిద్ధి. తుకారాం, నామదేవుడు, జ్ఞానేశ్వరుడు, ఏకనాథ్ సక్కుబాయి, సమర్థ రామదాసు మొదలైన మహాభక్తులకు ఆ నేల జన్మభూమి. నామదేవుడు కొలిచిన ఆ పండరిపుర విఠలుడు ఆయనతో పాటు ఎందరో భక్తులను బ్రోచి మోక్షాన్ని ప్రసాదించాడు. అభంగములు పరమాత్మను భక్తితో ప్రస్తుతించే అద్భుత సంగీత సుమాలు. అభంగములు భక్తుడిని పరమాత్మను విడదీయరాని బంధంలో ముడివేసేవి. అటువంటి అభంగమే ఈ భక్త జన వత్సలే. కర్ణాటక సంగీత సాంప్రదయంలో అభంగములకు స్థానం ఉంది. బృందావన సారంగ రాగంలో కూర్చబడిన ఈ అభంగమును అరుణా సాయిరాం గారు పాడారు.



అలనాటి మధుర గాయని పీ లీల విశేషాలు


"నా తండ్రే నేను గాయనిగా స్థిరపడటానికి కారణం" అని చెప్పారు పొరయాతు లీలమ్మ గారు. రెండు దశాబ్దాల పాటు దక్షిణ భారత దేశపు భాషలలో మధురమైన గాత్రంలో శ్రోతలను మైమరపించిన కంఠం పీ లీల గారిది. 1934 మే 19న  కేరళలోని పాలక్కాడ్ జిల్లా చిత్తూరులో జన్మించిన పీ లీల కుంజమీనన్-మీనాక్షి అమ్మ దంపతులకు మూడవ బిడ్డ. తండ్రి ప్రోత్సాహంతో త్రిభువనమణి భాగవతార్, చెంబై వైద్యనాథ భాగవతార్ వంటి మేటి గాయకుల వద్ద కర్ణాటక సంగీతంలో శిక్షణను పొందారు. కూతురిని గాయనిగా చూడాలనుకున్న మీనన్ గారు ఆమెను చెన్నై తీసుకువెళ్లి గురుకుల పద్ధతిలో వడక్కన్‌చెర్రి రామభాగవతార్ గారి వద్ద శాస్త్రీయ సంగీతాన్ని నేర్పించారు. చెన్నైలో మహామహులైన అరైకుడి, చెంబై, జీఎన్‌బీ వంటి వారి సంగీతం వినే అవకాశం లీలకు దక్కింది. విన్న వెంటనే నేర్చుకోగలిగిన ప్రతిభ కలిగిన లీలకు చిన్ననాటినుండే పోటీలలో బహుమతులు వచ్చాయి. దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారు ఆమెకు ఆంధ్ర మహిళా సభ ద్వారా తొలి కచేరీ అవకాశం కలిగించారు. కొలంబియా రికార్డింగ్ సంస్థ ద్వారా నేపథ్య గాయనిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన లీల ఇక వెను తిరిగి చూడలేదు.

తమిళ, తెలుగు భాషలు రాకపోయినా, మళయాళంలో ఆ పాటలు రాసుకొని అద్భుతమైన ఉచ్చారణతో ఆ రెండు భాషలలో పేరొందారు. అలా 1948లో ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. తెలుగులో మొట్టమొదటి సారిగా 1949లో మనదేశం, కీలుగుర్రం, గుణసుందరి కథ చిత్రాలలో పాడారు. ఘంటసాల గారు ఆమెకు మనదేశం చిత్రంలో పాడే అవకాశం కలిగించారు. గుణసుందరి కథ చిత్రంలో శ్రీరంజని గారిపై "శ్రీతులసి జయతులసి" అనే భక్తి గీతం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక వరుసగా పాతాళభైరవి మొదలు పాండవవనవాసం వరకు ఓ 15-16 ఏళ్ల పాటు లీల గారు తెలుగు నేపథ్య గాయనీమణుల్లో అగ్రశ్రేణిలో నిలిచారు. 1960 దశకం చివరి భాగానికి ఆవిడ గొంతులో మాధుర్యం తగ్గింది. అప్పటికి సుశీలమ్మ, జిక్కి, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి మొదలైన వారు బాగా నిలదొక్కుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే నేపథ్య గాయని అంటే సుశీలమ్మే అనే పరిస్థితి అప్పటికి వచ్చేసింది. ఆపైన లీల గారు తెలుగులో పెద్దగా పాడలేదు. కాకపోతే ఆమె భక్తి పాటల ప్రపంచంలో ప్రైవేట్ ఆల్బంస్ ఎన్నో చేసి చాలా పేరుపొందారు, తన సంగీత ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆమె పాడిన నారాయణీయం, మూకాంబిక శతకం, అష్టపదులు దక్షిణాదిన ఎంతో పేరుపొందాయి.

లీలగారి తెలుగు సినీ జీవితంలో మరువలేని మైలురాయి లవకుశ చిత్రం. 1963లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె సుశీలమ్మ కలిసి లవకుశులకు అందించిన గాత్రం అజరామరమై నిలిచింది. ప్రతి ఒక్క పాట చాలా పేరొందింది. ఒకరకంగా తెలుగు నేపథ్య సంగీత జీవితంలో లీల గారికి  ఈ చిత్రం పతాక స్థాయి అని చెప్పుకోవచ్చు. 1968లో మహానటి సావిత్రి అందరూ మహిళలతో నిర్మించిన చిన్నారిలోకం చిత్రానికి లీలగారు సంగీత దర్శకత్వం వహించారు.

పాతాళభైరవి, బ్రతుకుతెరువు, జయసింహ, మిస్సమ్మ, చిరంజీవులు, తెనాలి రామకృష్ణ, మాయాబజార్, సువర్ణసుందరి, బబ్రువాహన, అప్పుచేసి పప్పుకూడు, పెళ్లినాటి ప్రమాణాలు, శాంతినివాసం, రాజమకుటం, జగదేకవీరుని కథ, పాండురంగ మహాత్య్మం, వేంకటేశ్వర మహాత్య్మం, లవకుశ, గుండమ్మ కథ, పరమానందయ్య శిష్యుల కథ, తిరుపతమ్మ కథ, దక్ష యజ్ఞం, సీతారామకళ్యాణం, పెళ్లి సందడి, మాంగల్య బలం  వంటి ఎన్నో చిత్రాలలో పాడారు. మొత్తం మీద దక్షిణాది భాషలలో 5000కు పైగా పాటలు పాడారు. 1984లో విడుదలైన ఎన్‌టీరామారావు గారి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర చిత్రంలో నీవెవరో నీ జన్మం ఏదో అనే పాట ఆవిడ తెలుగు చిత్రాలలో పాడిన ఆఖరిది. లీలగారికి 1992లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డును, భారత ప్రభుత్వం 2006లో మరణానంతరం పద్మభూషణ్ అవార్డులను ప్రదానం చేశారు. వారికి  హృదయపూర్వకమైన నివాళి.

ఆవిడ పాటిన పాటలలో నాకు అత్యంత ప్రియమైనది రాజమకుటం చిత్రంలోని సడి చేయకో గాలి సడి చేయబోకే.