24, సెప్టెంబర్ 2016, శనివారం

మామ శకుని - ధూళిపాళ సీతారామశాస్త్రి గారు


మామ శకుని అనగానే మొదట సీఎస్సార్ తరువాత ధూళిపాళ గారి పేర్లు గుర్తుకోస్తాయి. ఒక లక్ష్యంతో కౌరవుల నాశనానికై ప్రతిజ్ఞ చేసిన శకుని పాత్రను ధూళిపాళ గారు ఎంతో బాగా పోషించారు. దాదాపు 40 ఏళ్ల సినీ నటజీవితంలో 300కు పైగా చిత్రాలలో నటించారు. ఆయన 95వ జయంతి ఈరోజు. ఆ సహజ నటునికి నివాళిగా ఈ వ్యాసం.

1921 సెప్టెంబర్ 24న ఇప్పటి గుంటూరు జిల్లా దాచేపల్లి గ్రామంలో (పల్నాడు ప్రాంతం) రత్నమ్మ మరియు శంకరయ్య దంపతులకు ధూళిపాళ సీతారామశాస్త్రి గారు జన్మించారు. 8వ తరగతి వరకు దాచేపల్లిలో చదువుకొని తరువాత బాపట్లలోని ప్రఖ్యాత శంకర విద్యాలయంలో వేదవిద్యను అభ్యసించారు. తొలుత ప్లీడరు గుమాస్తాగా పనిచేశారు. తరువాత స్త్రీ పాత్రల ద్వారా నాటక రంగ ప్రవేశం చేశారు. ఆయనకు నాటక రంగంలో బాగా పేరు తెచ్చిన పాత్ర దుర్యోధనుడు. ఆ కాలంలో మంచి నటుడు, రచయిత, గాయకుడు, దర్శకుడు అయిన గయుడు గారు ధూళిపాళ గారిని సినీ రంగానికి పరిచయం చేశారు. గయుడి గారి సహాయంతో 1962లో విడుదలైన భీష్మ చిత్రంలో దుర్యోధనుడి పాత్ర ధూళిపాళ గారికి లభించింది. దుర్యోధనుడిగా ధూళిపాళ గారు తొలిచిత్రంలోనే అద్భుతంగా నటించారు. ఆ పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చింది.

అదే సంవత్సరంలో పుండరకీక్షయ్య గారి నిర్మాణంలో కమలాకర కామేశ్వరరావు గారు మహామంత్రి తిమ్మరుసు చిత్రం విడుదల చేశారు. ఆ చిత్రంలో ధూళిపాళ గారు అల్లసాని పెద్దన పాత్ర వేసి మెప్పు పొందారు. ఇక తరువాత ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. 1963లో విడుదలైన శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలో బావ-బావమరది మధ్య యుద్ధానికి కారకుడైన గయిని పాత్రను వేశరు. సినిమాలో గయుడిగా ధూళిపాళ గారి పాత్రం చాలా ముఖ్యమైనదే. తరువాత వచ్చిన అద్భుతకళాఖండంలో ధూళిపాళ గారు తనకు పేరు తెచ్చిన పాత్ర వేసే అవకాశం వచ్చింది. లక్ష్మీ రాజ్యం గారు నిర్మాతగా కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలోనే 1963లో విడుదలై ప్రపంచమంతా పేరుపొంది తెలుగు సినీ స్వర్ణయుగంలో ఆణిముత్యం లాంటి చిత్రమైన నర్తనశాల (విరాట పర్వం) చిత్రంలో ధూళిపాళ గారు సుయోధనుడి పాత్ర వేశారు. దుర్లక్షణాలను తనం ముఖంలో అద్భుతంగా పండించి తన వంతు పాత్రను పరిపూర్ణంగా పోషించారు. కాకపోతే ఆ చిత్రంలో ఎస్వీఆర్, ఎన్‌టీఆర్, సావిత్రిల నటనా కౌశలం ముందు ఇంకెవ్వరూ నిలువలేకపోయారు. అఖండమైన విజయం సాధించి తెలుగు చలనచరిత్రలో కలికితురాయిగా నిలిచిన చిత్రం ఇది.

1964లో సీతారాం గారి దర్శకత్వంలో ఆయనే నిర్మాతగా విడుదలైన మరో మంచి చిత్రం బొబ్బిలి యుద్ధం. 18వ శతాబ్దంలో విజయనగరం క్షత్రియ గజపతి రాజులు మరియు బొబ్బిలి వెలమ రాజుల మధ్య జరిగే ఆధిపత్యపు పోరును తెరకెక్కించిన ఈ చిత్రంలో ధూళిపాళ గారు నరసరాయుడు పాత్రను పోషించారు. మళ్లీ పుండరీకాక్షయ్య/కమలాకర కామేశ్వరరావు గారి కాంబినేషన్‌లో 1967లో విడుదలైన శ్రీకృష్ణావతారం చిత్రంలో ధూళిపాళ గారు సత్రాజిత్తు పాత్రను పోషించారు. తరువాత ఉండమ్మా బొట్టు పెడతా, బాంధవ్యాలు, ఆత్మీయులు, ఏకవీర, బాలరాజు కథ, మట్టిలో మాణిక్యం, బాలభారతం, శ్రీరామాంజనేయ యుద్ధం, అందాలరాముడు, గుణవంతుడు, సీతాకళ్యాణం, మహాకవి క్షేత్రయ్య, కురుక్షేత్రం వంటి ఎన్నో చిత్రాలలో మంచి పాత్రలు పోషించారు.

ధూళిపాళ గారి నటజీవితంలో ముఖ్యమైన చిత్రాలు శ్రీకృష్ణ పాండవీయం (1966), బాలభారతం (1972), మరియు దాన వీర శూర కర్ణ (1977) చిత్రాలు. మూడింటిలోనూ ఆయన శకుని పాత్రను అద్భుతంగా పోషించారు. ఆ కళ్లలో పగ, ప్రతీకార జ్వాల ప్రస్ఫుటంగా కనబరచారు. డైలాగ్స్‌లో కుటిల రాజనీతి హృద్యమైన తెలుగు భాషలో సుస్పష్టమైన ఉచ్చారణతో ఆయన చలనచిత్రాల వైభవాన్ని ఇనుమడింపజేశారు. ధూళిపాళ గారికి పేరు తెచ్చిన మరో పాత్ర సాంఘిక చిత్రమైన బాంధవ్యాలు. 1968లో విడుదలైన ఈ చిత్రాన్ని ఎస్వీ రంగారావు గారు నిర్మించి దర్శకత్వం వహించారు, ప్రధాన పాత్ర కూడా అయానదే. ఆయన తమ్మునిగా ధూళిపాళ గొప్పగా నటించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది అవార్డును పొందారు. చిత్రం కూడా ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది. ధూళిపాళ గారి సినీ ప్రస్థానంలో చాలా మటుకు పాత్రలు పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలే. కమలాకర కామేశ్వరరావు గారే మళ్లీ 1977లో విడుదలైన కురుక్షేత్రం చిత్రంలో ఆయనకు ఇంద్రుని పాత్రను ఇచ్చారు. విఠలాచార్య గారి చిత్రాలలో కూడా ధూళిపాళ గారు మంచి పాత్రలు వేశారు.

గొప్ప హనుమద్భక్తులైన ధూళిపాళ గారు కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీర్వాదంతో 2001లో సన్యాసం స్వీకరించారు. గుంటూరులో మారుతి ఆశ్రమాన్ని స్థాపించారు. 2007 ఏప్రిల్ 13న సిద్ధి పొందారు. పల్నాటి పొరుషం తన భాషలో కనబరచే రంగస్థల నటుడు, స్ఫురద్రూపి, మంచి వాక్పటిమ, ప్రత్యేకమైన నటనా కౌశలం కలిగి ఉండటంతో పాటు భక్తుడు అయిన ధూళిపాళ సీతారామశాస్త్రి గారికి జోహార్లు.

-అక్కిరాజు ప్రసాద్ (24 సెప్టెంబర్ 2016)

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

ప్రతిభామూర్తి సింగీతం శ్రీనివాసరావు

ఆయన చిత్రాలు మూస మసాల ధోరణికి భిన్నంగా ఎంతో విలక్షణతతో, సాంకేతిక నైపుణ్యంతో, నటీనటుల ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకునే కోవకు చెందినవి. సంభాషణలు లేకుండా ఒక చిత్రానికి దర్శకత్వం వహించి దానిని విజయవంతం చేసిన సత్తా ఆయనలో ఉంది. ఒక్కొక్క చిత్రం ఒక్కో కోణంలో ఒక్కో సందేశంతో ఒక్కో నైపుణ్యంతో ఆయన తీర్చిదిద్దారు. హాలీవుడ్ స్థాయిలో చిత్రాలను ఆయన మనకు అందించారు. అదేనండీ, సింగీతం శ్రీనివాసరావు గారి గురించి చెబుతున్నా! ఈరోజు ఆయన 85వ పుట్టినరోజు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకునిగా, నిర్మాతగా, రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న ఆ ప్రతిభామూర్తి విశేషాలు కొన్ని.



ఆంధ్రప్రదేశ్‌లొని నెల్లూరు జిల్లా గూడురులో 1931, సెప్టెంబర్ 21న జన్మించిన శ్రీనివాసరావు గారు మద్రాసు విశ్వవిద్యాలయంలో చదువుకొని 1954లో కేవీ రెడ్డి గారి వద్ద మాయబజార్ చిత్రానికి అప్రెంటిస్‌గా చేరారు. సాంకేతిక కారణాల వలన మాయాబజార్ నిర్మాణం ఆలస్యం కావటంతో ఆయన కేవీ రెడ్డి గారి వద్దే దొంగరాముడు చిత్రంలో పనిచేశారు. అక్కడినుండి అద్భుతమైన ఆయన సినీప్రస్థానం మొదలైంది. పాటలు పాడటం, సాహిత్యం రాయటం, దర్శకత్వం, నిర్మించటం, నటన ఇలా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవీ రెడ్డి గారు, పింగళి నాగేంద్రరావు గారి శిష్యరికంలో ఆయన నైపుణ్యం సంపాదించారు. దొంగరాముడు చిత్రానికి ఆయన సహాయ దర్శకునిగా పనిచేసినా ఆయన పేరు టైటిల్స్‌లో వేయలేదు. అలాగే మాయాబజార్, జగదేకవీరుని కథ, పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి చిత్రాలలో కూడా పనిచేశారు. 1972లో మొట్టమొదటి సారి శ్రీనివాసరావు గారు స్వంతంగా నీతి నిజాయితీ అనే చిత్రం తీశారు. ఆ చిత్రం ఆడలేదు. 1974లో ఆయన తొలి తమిళ చిత్రం దిక్కత్ర పార్వతి అనే చిత్రానికి దర్శకతం వహించారు. రాజాజీ రచించిన ఓ నవల ఆధారంగా తీసిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ తమిళ చిత్రం అవార్డు పొందింది. నటిగా లక్ష్మికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. హిందీలో వచ్చిన సీష్‌మహల్ అనే చిత్రాన్ని 1975లో జమీందారు గారి అమ్మాయిగా నిర్మించారు. ఆచిత్రంలోని మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన అనే అద్భుతమైన పాట మనకు తెలిసిందే.

ఆయన సినీ ప్రస్థానంలో ముఖ్యమైన ఘట్టం 1976లో విడుదలైన అమెరికా అమ్మాయి చిత్రం. ఓ అమెరికా అమ్మాయి భారతీయ కళలపట్ల ఆకర్షించబడి ఇక్కడి మనుషులను ఎలా మారుస్తుందో ఈ చిత్రంలో సింగీతం వారు మనకు అద్భుతంగా తెరపై చూపించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అటుతరువాత వచ్చిన చిత్రాలన్నీ వైవిధ్య భరితమైనవి, విలక్షణమైనవి. పంతులమ్మ, సొమ్మొకడిది సోకొకడిది, రామచిలక వంటి అద్భుతమైన తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అదే సమయంలో ఎన్నో తమిళ కన్నడ చిత్రాలను అందించారు. తరువాత మైలు రాయి 1984లో విడుడలైన మయూరి చిత్రం. ప్రఖ్యాత నర్తకి సుధా చంద్రన్ గారి నిజ జీవితం ఆధారంగా తీసిన చిత్రం ఉత్తమ చలన చిత్రం అవార్డు పొందింది. ఆయన దర్శకత్వంలో అమెరికాలో పుట్టిన ఓ అబ్బాయి నేపథ్యంలో చిత్రం 1987లో విడుదలై అద్భుతమైన విజయం సాధించింది. తరువాత 1988లో వచ్చిన కళాఖండం పుష్పక విమాన. మాటలు లేకుండా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన చిత్రం ఇది. కమల్ హాసన్ గారి నట జీవితంలో ఈ చిత్రం ఓ కలికితురాయి. ఈ చిత్రానికి కూడా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయి.  1989లో వచ్చిన మరో అద్భుత సృష్టి అపూర్వ సహోదరగళ్  (తెలుగులో అపూర్వ సహోదరులు). అన్ని భాషలలోనూ ఈ విజయం సాధించింది. కమల్ హాసన్ గారి నటనా కౌశలాన్ని శ్రీనివాస రావు గారు మరింత ఇనుమడింపజేసేలా మనకు ఈ చిత్రాన్ని అందించారు. గొప్ప సాంకేతిక విలువలతో విలక్షణమైన కథతో ఈ చిత్రం వారివురికీ ఎంతో పేరు తెచ్చింది.

1990లో శ్రీనివాసరావు గారు ఇంకో విలక్షణమైన హాస్యరస ప్రధాన చిత్రాన్ని మనకు అందించారు. అదే తమిళంలో తీసిన మైకెల్ మదన కామ రాజు అనే చిత్రం. కమల్ హాసన్ గారు నాలుగు పాత్రలు పోషించిన ఈ చిత్రం ఓ అద్భుత కళావిష్కరణ. కమల్ హాసన్ గారి సినీ ప్రస్థానంలో మరో గొప్ప చిత్రం. మంచి విజయం సాధించింది. తెలుగు చలన చిత్ర చరితలో 1991 ఓ ముఖ్యమైన సంవత్సరం. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో బాలకృష్ణ గారు కథానాయకుడుగా ఓ అద్భుతమైన చిత్రం విడుదలైంది. అదే ఆదిత్య 369. టైం మెషిన్ ద్వారా శ్రీకృష్ణదేవారాయల కాలానికి వెళ్లి మనకు ఓ సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని ఆయన తీశారు. ఈ చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధించింది. తరువాత బృందావనం, మేడం వంటి విలక్షణమైన చిత్రాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి.

1994లో విడుదలైన మరో కళాఖండం భైరవ ద్వీపం చిత్రం. బాలకృష్ణ గారి సినీ విజయాలలో ఈ చిత్రం ఒకటి. జానపద ఇతివృత్తంలో మంచి కథతో జగదేకవీరుని కథను తలపించేలా శ్రీనివాసరావు గారు ఈ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రానికి నంది అవార్డు వచ్చింది. తరువాత కూడా ఎన్నో మంచి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 2 జాతీయ అవార్డులు, 7 నంది అవార్డులు, 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 3 కర్ణాటక రాష్ట్ర అవార్డులు. అరవై రెండేళ్ల ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానం మన సినీ ప్రపంచంలో ఓ మంచి అనుభూతి. దర్శకత్వ ప్రతిభ, సంభాషణలలో పటుత్వం, నిర్మాణంలో సాంకేతిక విలువలు, కథలో విలక్షణత, నటీనటుల ఉన్నతమైన నటనా కౌశలం, అద్భుతమైన ఛాయాగ్రహణం, మంచి సంగీతం ఆయన చిత్రాల ప్రత్యేకతలు. కమల్ హాసన్ గారి సినీజీవితపు విజయాలలో సింగీతం వారిది చాలా ముఖ్యమైన స్థానం.

ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాంకేతిక నైపుణ్యాన్ని సంపాదించుకునే వ్యక్తిత్వం ఆయనది. ఆయన చిత్రాలు ముందు చూపుతో ఉంటాయి. కథలు దానిని సంపూర్ణంగా ప్రతిబింబిస్తాయి. ఆయన సినీయానంలో పుష్పక విమానానికి అత్యధికంగా ప్రజాదరణ రాగా, ఆదిత్య 369 ఆయనకు అన్నిటికన్నా తృప్తిని ఇచ్చిన చిత్రమట. 85ఏళ్ల వయసులో కూడ నేటి తరం దర్శకులకు పోటీగా చిత్రాలు తీయటానికి సిద్ధమంటున్న సింగీతం శ్రీనివాసరావు గారికి భగవంతుడు ఆయురారోగ్యాలతో మరింత ఉత్సాహాన్ని కలిగించాలని నా ప్రార్థన.

అక్కిరాజు ప్రసాద్ (21/9/2016)

నాటక కళాప్రపూర్ణ స్థానం నరసింహారావు గారు

అక్కిరాజు ప్రసాద్ (23/09/2016)
=========================


తెలుగు నాట రంగస్థల నటనకు, తరువాత సినీ నటనకు ఆద్యులైన వారిలో ఆయన ఒకరు. స్త్రీ పాత్రలకు ఆయన పెట్టింది పేరు. శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ పాత్రకు రంగస్థలంలో పేరు తెచ్చింది ఆయన నటనా కౌశలమే. చింతామణి, దేవదేవి(విప్రనారాయణ), మధురవాణి (కన్యాశుల్కం) వంటి అద్భుతమైన పాత్రలను పోషించిన స్థానం నరసింహారావు గారి 114వ జయంతి నేడు. తొలితరం చిత్రాలలో కూడా నటించిన ఆయన 1500లకు పైగా రంగస్థల ప్రదర్శనలిచ్చారు. 1902వ సంవత్సరం సెప్టెంబర్ 23న గుంటూరు జిల్లా బాపట్లలో ఆదెమ్మ, హనుమంతరావు దంపతులకు నరసింహారావు గారు జన్మించారు. బాపట్లలో భావనారాయణస్వామి వారి దేవస్థానం సమీపంలోనే ఉండేది వీరి ఇల్లు. 16వ ఏట తండ్రి మరణించగా స్థానం వారు తరువాత మేనమామ కామరాజు వేంకటనారాయణ గారి వద్ద పెరిగారు. ఆ మేనమామ కూతురు హనుమాయమ్మను స్థానం వారు వివాహం చేసుకున్నారు. వీరికి సావిత్రి అని ఒక కుమార్తె పుట్టింది.

బాపట్ల భావనారాయణస్వామి వారి గుడిలో భజనకు అలవాటు చేసుకున్న స్థానం వారు అక్కడే ఓ బాబా వద్ద ఊపిరిపై పట్టు సాధించి ఎక్కువ సేపు పాడగలిగే మెళకువ నేర్చుకున్నారు. మేనమామ బాపట్లలోనే ప్లీడరుగా చేసేవారు. ఆయన సహాయంతో నాటకాల రిహార్సల్స్ చేసుకునే వసతి కలిగింది. బాపట్లలో చదుకువుకునేటప్పుడే ఆయన చిత్రలేఖనం నేర్చుకున్నారు. ఈ చిత్రకళానైపుణ్యం, భజనల అనుభవం, మేనమామ ఇంట్లో హార్మోనియంతో సాధన ఆయన నాటక రంగ ప్రస్థానానికి మూలస్థంభాలైనాయి. భావనారాయణ స్వామి వారి గుడిలో జరిగే బుర్రకథలు, కూచిపూడి యక్షగానాలు, భామా కలాపాలు ఆయనపై ఎంతో ప్రభావం చూపాయి. అభినవ సత్యభామగా పేరొందిన వెంపటి వెంకటనారాయణ గారి నటన ఆయనను ప్రభావితం చేసింది.

1920లో నాటక రంగం ప్రవేశించిన ఆయనకు త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి అనే నటుడు శిక్షణనిచ్చారు. తెనాలిలోని రామ విలాస సభ ద్వారా ఆయన రంగ ప్రవేశం జరిగింది. స్థానం వారి మొట్టమొదటి రంగస్థల పాత్ర సత్యహరిశ్చంద్రలో చంద్రమతి. 1921వ సంవత్సరంలో ఈ నాటక ప్రదర్శన జరిగింది. ఆయన నటనకు ముగ్ధులైన చెళ్లపిళ్ళ వేంకట శాస్త్రి గారు స్థానం వారి వద్దకు వచ్చి మరీ ఆశీర్వదించారుట. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి కార్యక్రమాల సహాయానికి చీరాలలో ఈ నాటకాన్ని మరల వేయాలని కోరగా తల్లి ముందు అంగీకరించలేదు. తరువాత ఊరిపెద్దల ఒత్తిడితో ఆవిడ ఒప్పుకోక తప్పలేదు. ఆ ప్రదర్శనకు ఆయనకు పది రూపాయల పారితోషకం లభించింది. తరువాత అదే నాటకాన్ని గుంటూరు, వేటపాలంలలో ప్రదర్శించారు.

తరువాత ఆయనకు పేరు తెచ్చిన పాత్ర రోషనారా. ఔరంగజేబు చెల్లెలైన రోషనార కథను కొప్పరపు సుబ్బారావు గారు నాటకంగా రచించగా ఆ పాత్రను స్థానం వారు పోషించి లబ్దప్రతిష్ఠులైనారు. తరువాత తెనాలిలోని మూడు ప్రఖ్యాత నాటక సంస్థల ద్వారా ఎన్నో నాటకాలు వేశారు. ఆయనకు పేరు తెచ్చిన ఇతర పాత్రలు భక్త ప్రహ్లాదలోని లీలావతి, శ్రీకృష్ణ లీలలులో యశోద, మోహినీ రుక్మాంగదలో మోహిని పాత్రలు. రామ విలాస సభ ద్వారా రోషనార, సోహ్రాబ్ అండ్ రుస్తుం, అభిజ్ఞాన శాకుంతలం, కన్యాశుల్కం, సతీ అనసూయ, చింతామణి, సారంగధర, చంద్రగుప్తలో ముర, బొబ్బిలియుద్ధంలో మల్లమదేవి, చండికలో చండిక వంటి ఎన్నో నాటకాలలో ఆయన పాత్రలు ధరించారు.

ఆయన హావభావాలు, హొయలు, చిలిపి నవ్వులు, శృంగార రసావిష్కరణలు ఆనాటి రంగస్థల రసికుల మనసులను ఉర్రూతలూగించాయి. ఆయన పాటలు ప్రేక్షకుల మనసులను దోచుకునేవి. స్త్రీ పాత్రలను ధరించటంలో వేషభూషలు, నడవడికలు, మాటలపై ఆయన అత్యంత శ్రద్ధతో సిద్ధమయ్యేవారు. ప్రేమ తరువాత ప్రతీకారం కనబరచే రోషనారా పాత్రా ఆనాడు తెలుగునాట అందరి నోట మెలిగింది. సత్యభామగా, చిత్రాంగిగా, శకుంతలగా ఆయన అభినయం అనుపమానం.

స్థాణం వారి రంగస్థల జీవితంలో కలికితురాయి సత్యభామ పాత్ర. ఆయన శ్రీకృష్ణ తులాభారంలోని ఈ పాత్రకోసం భీమవరపు నరసింహారావు గారి సహకారంతో మీరజాల గలడా అనే ప్రఖ్యత గీతాన్ని రచించారు. ఈ నాటకం, పద్యంతో ఆయన తెలుగు నాటక చరిత్రలో కొత్త యుగాన్ని ఆరంభించారు. పాటనుండి పద్యానికి పద్యం నుండి పాటకు మారుతూ గంటల తరబడి పాడుతూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశరు. పద్యగద్యాల సమన్వయంతో కొత్త పంథాను సృష్టించారు. తెనాలి నుండి ఆయన ప్రస్థానం శ్రీకృష్ణ తులాభారం ద్వారా చెన్నైకి సాగింది. 1928లో ఈ ప్రదర్శన జరిగింది. తరువాత బెంగుళూరులో వరుసన 22 ప్రదర్శనలు ఇచ్చి ప్రఖ్యాత రంగస్థల కళాకారులు గుబ్బి వీరన్న గారి ప్రశంసలు కూడా పొందారు. ఆయన సత్యభామ పాత్రకు కాశీనాథుని నాగేశ్వరరావు గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి నాయకులు ముగ్ధులై ఎంతో ప్రశంసించారు.

బళ్లారి రాఘవ, బందా కనకలింగేశ్వరరావు, వేమూరి గగ్గయ్య, ఈలపాట రఘురామయ్య వంటి మేటి రంగస్థల నటులకు సమకాలీకులు స్థానం వారు. ఆకాశవాణిలో కన్యాశుల్కం మరియు గణపతి వంటి నాటకాలతో ప్రజలను అలరించారు. రాధాకృష్ణ, సత్యభామ అనే తొలితరం చిత్రాలలో నటించారు. నటస్థానం అనే పుస్తకాన్ని రచించారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా 1956లో పద్మశ్రీ అవార్డు, 1961లో సంగీత నాటక అకాడెమీ అవార్డు వచ్చాయి. ఆయనకు నరసాపురంలో నటకావతంస బిరుదు (1924), కలకత్తా మేయర్ బంగారు పతకం (1932), రంగూనులో స్వర్ణ కిరీట ధారణ (1933), విజయనగరంలో నటశేఖర బిరుదు (1953), న్యూఢిల్లీలో డాక్టర్ రాధాకృష్ణన్ గారి అభినందన (1954), నాటక కళాప్రపూర్ణ బిరుదు (1960) లభించాయి. ఆయన నాటక కళాపరిషత్తుకు అధ్యక్షత కూడా వహించారు. 1957లో ఆకాశవాణిలో చేరి నాటక కార్యక్రమాల ప్రయోక్తగా పదేళ్లు పనిచేశారు. పక్షవాతంతో ఏడాదిపాటు మంచాన పడి 1971 ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన తెనాలిలో ఆయన పరమపదించారు.

ప్రముఖ ఆచార్యులు డాక్టర్ మొదలి నాగభూషణ శర్మ గారు స్థానం వారి గురించి "నటకావతంస స్థానం నరసింహారావు నట జీవన ప్రస్థానం" అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తక ఆధారంగా ఈ వ్యాసం రచించబడింది.

స్థానంవారు పాడిన మీరజాల గలడా నాయానతి
https://www.youtube.com/watch?v=-mVLrCRnjSc