30, ఆగస్టు 2020, ఆదివారం

ఆనందామృతాకర్షిణి - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


ఉపాసనా బలం ఎంత గొప్పదో తెలుసుకోవటానికి ఈ కర్మభూమిపై జన్మించిన అనేక మహనీయుల అద్భుత గాథలు చదవాలి. ఈ పుణ్యభూమిలో లోక కల్యాణార్థం తమ తపోశక్తిని ధారపోసిన సత్పురుషులలో వాగ్గేయకారులు కూడా ఉన్నారు. వారిలో ముత్తుస్వామి దీక్షితుల వారు ఒకరు. సుబ్రహ్మణ్య మరియు శ్రీవిద్యోపాసనలో భారతదేశంలోనే అగ్రగణ్యులుగా పేరొందిన దీక్షితుల వారు తమ సాధనలో భాగంగా అనేక క్షేత్రాలను సందర్శించి అక్కడ కొన్ని రోజులు గడుపుతూ తీవ్రమైన సాధన చేశారు. అలా ఒకసారి ఆయన తిరునల్వేలి వెళ్లి అక్కడ సాధన చేసుకోదలచారు. తిరునల్వేలిలో నెల్లియప్పార్ దేవాలయం చాలా సనాతనమైనది, సుప్రసిద్ధమైనది. అక్కడ పార్వతీదేవి రూపమైన కాంతిమతి అమ్మవారిని దీక్షితుల వారు అంతకు మునుపే ఉపాసన చేసి మంత్రసిద్ధి పొందారు. ఆయన మరల తిరునల్వేలి వెళ్లినప్పుడు అక్కడ కరువు వలన తామ్రపర్ణి నది ఎండిపోయి, ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆయన నిత్యానుష్ఠానానికి కూడా ప్రవహించే నీరు దొరకని పరిస్థితి. ఆ కరువు యొక్క తీవ్రత చూసి చలించిన దీక్షితుల వారు కాంతిమతి అమ్మవారిని ఆర్తితో వర్షం కురిపించమని కృతి ద్వారా ప్రార్థించారు. అమృతవర్షిణి రాగంలో కూర్చబడిన ఈ కృతి సార్థకత పొంది, వెంటనే అమ్మవారు కరుణించి మూడు రోజుల పాటు తిరునల్వేలిలో సువృష్టి కురిపించిందట. సద్య సువృష్టి హేతవే త్వాం సంతతం చింతయే సలిలం వర్షయ వర్షయ వర్షయ అని దీక్షితుల వారు కాంతిమతి అమ్మవారిని నుతిస్తున్నప్పుడు ఆయనలోని ఆర్తి చూసినవారు నిశ్చేష్టులైపోయారట. ఎక్కడ లేని మబ్బులు రావటం, ఒకటి కాదు, రెండు కాదు, మూడు రోజులు ఏకధాటిన అమ్మ వర్షం కురిపించి అక్కడి ప్రజలను కరుణించటం దీక్షితుల వారి ఆధ్యాత్మిక యానంలో ఓ మహత్తరమైన ఘట్టం.

ఆనందామృతాకర్షిణి! అమృతవర్షిణి!
హరాది పూజితే! శివే! భవాని!

శ్రీనందనాది సంరక్షిణి!
శ్రీ గురుగుహ జనని! చిద్రూపిణి!
సానంద హృదయ నిలయే సదయే!
సద్య సువృష్టి హేతవే!
త్వాం సంతతం చింతయే అమృతేశ్వరి!
సలిలం వర్షయ! వర్షయ! వర్షయ!

భవుని అర్థాంగి అయిన ఓ పార్వతీ! నీవు అమృతమనే వర్షాన్ని కురిపించే తల్లివి, ఆనందమనే అమృతానికి కారణానివి, శివాది దేవతలచే పూజించబడిన అమ్మవు! లక్ష్మీ దేవి పుత్రుడైన మన్మథుని కాపాడిన తల్లివి, కుమారస్వామి జననివి, జ్ఞాన స్వరూపిణివి. సచ్చిదానందములో తన్మయులైన వారి హృదయములో నివసించే దేవతవు. నిశ్చయముగా నీవు మంచి వర్షములకు కారణానివి. అమృతేశ్వరివైన నిన్ను నేను ఎల్లప్పుడూ ధ్యానిస్తాను. మంచి వర్షాలు కురిపించు తల్లీ!

అమృతవర్షిణి రాగంలో కూర్చబడిన ఈ కృతిని అరుణా సాయిరాం గారు ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి