28, అక్టోబర్ 2016, శుక్రవారం

చిత్తూరు నాగయ్య గారి నటనా ప్రతిభ - మహానుభావుల పాత్రలు

 





తెలుగు చలనచిత్ర సీమలో వుప్పలదడియం నాగయ్య (చిత్తూరు నాగయ్య) గారు ఒక్కరికే మహా వాగ్గేయకారులైన త్యాగయ్య, రామదాసు, మహాకవి పోతన, యోగి వేమన వంటి మహానుభావుల పాత్రలు వేసే సామర్థ్యం ఉంది. కేవలం పాత్రలను వేయటం కాదు, వాటిలో ఒదిగిపోయి, తన సంగీత మరియు నటనా ప్రతిభతో ఆ పాత్రలకు సార్థకత చేకూర్చారు. త్యాగయ్య, రామదాసుల కీర్తనలను అనర్గళంగా రాగయుక్తంగా పాడటం మాటలు కాదు. ఈనాటి నాగార్జున గారి అరకొర రామదాసు, వెకిలి అన్నమయ్య సినిమాలు చూసి ఆహా ఓహో అనుకునే వారికి నాగయ్య గారి చిత్రాలు ఓ కనువిప్పు. అవి ఆ మహానుభావుల మహనీయతకు ప్రతిబింబాలు.  ఆయన యోగి వేమన చిత్రం చూస్తే అసలు వేమన ఏమిటో అర్థమవుతుంది. నాగయ్యగారి పవిత్రత ఆయన పాత్రలలో సుస్పష్టంగా కనిపిస్తుంది. ఓ పాత్ర వేయాలంటే దాని గురించి రెండు మూడు నెలలు చదివి చేస్తే సరిపోదు. ఆ పాత్రలకు సరిపడే స్వచ్ఛత వ్యక్తిత్వంలో ఉండాలి. అదే నాగయ్య గారి గొప్పతనం.  ఒక్క సోమయాజులు గారు మాత్రమే నాగయ్య గారి దీటుగా త్యాగయ్యగా నటించగలిగారు. దానికి బాపు-రమణల ప్రతిభ మూల కారణం.

అలాగే వాల్మీకిగా, వశిష్ఠునిగా, దధీచిగా, వ్యాసునిగా, హాథీరాం బాబాగా, ధృతరాష్ట్రునిగా, పరమానందయ్యగా, అక్రూరునిగా, మహామంత్రి తిమ్మరుసుగా, మేవార్ రాజుగా, ఆశోకునిగా ఆయన కనబరచిన ప్రతిభ అజరామరం. ఉత్తర రామాయణం ఆధారంగా తీయబడిన లవకుశలో ఆయన వాల్మీకి మహర్షి పాత్ర చిరస్మరణీయం. తిమ్మరుసుగా ఆయన నటనలో కనబడిన రాకీయ పరిపాలనా చాతుర్యం అమోఘం. అక్రూరునిగా ఆయన కనబరచిన కృష్ణభక్తి ప్రశంసనీయం. సనాతన ధర్మ గంగాప్రవాహంలోని ఈ మహానుభావుల పాత్రలు ధరించటం ఆయనకు మాత్రమే చెల్లింది. మీరా చిత్రంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి ప్రధాన పాత్రకు భర్తగా ఆయన నటన అద్భుతం. శ్రీవేంకటేశ్వర మహాత్యంలో హాథీరాం బాబాగా ఆయన భక్తి అనిర్వచనీయం. జయభేరిలో గురువు విశ్వంభర శాస్త్రిగా ఆయన కనబరచిన నిండుతనం సినిమాకే వన్నె తెచ్చింది. అలాగే పరమానందయ్యగా ఆయన శిష్యులపై కనబరచిన వాత్సల్యం, కరుణ అనుపమానం. రాము చిత్రంలో ఘంటసాల గారి గీతం "రారా కృష్నాయ్యా" అనే గీతానికి పరిపూర్ణతనిచ్చింది నాగయ్య గారి భక్తిపూరితమైన నటన. నాగయ్యగారు నటించిన త్యాగయ్య, పోతన, రామదాసు, వేమన చిత్రాలు నటనకు, సంగీత సాహిత్య ఔన్నత్యానికి, నిర్మలమైన మనస్తత్వానికి ప్రతీకలు. పౌరాణిక చారిత్రాత్మక పాత్రలే కాదు. నాగయ్య గారు సాంఘిక పాత్రలలోనూ అదే పరిపక్వతను కనబరచారు. ఆయన నటన నేటి నటులకు పాఠాలు.

ఆయన్ పాడిన పాటలలో పాండురంగ మహాత్మ్యం చిత్రంలోని సన్నుతి సేయవె మనసా ఆపన్న శరణ్యుని హరిని అనే గీతం చాలా ఇష్టం. ఆయనకు నివాళిగా ఈ పాట మీకోసం.

23, అక్టోబర్ 2016, ఆదివారం

సూర్యనారాయణ సుప్రభాతం - ఆకాశవాణి భక్తిరంజని

ఆదివారం నాడు ఆకాశవాణి భక్తిరంజనిలో అప్పట్లో తప్పకుండా వినిపించిన తెలుగు సుప్రభాతం ఇది. ఎవరు రాశారో తెలియదు, కానీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి సంగీతం అనుకుంటా. భానుని దిన ప్రస్థానంలోని రంగులను ప్రకృతిలోని పూవుల రంగులతో అద్భుతంగా పోల్చిన సుప్రభాతం ఇది.

శ్రీ సూర్యనారాయణా మేలుకో హరి సూర్యనారయణా!

పొడుస్తూ భానుడు పొన్న పూవు ఛాయ
పొన్న పూవు మీద బొగడ పువ్వు ఛాయ


ఉదయిస్తూ భానుడు ఉల్లిపూవు ఛాయ
ఉల్లిపూవు మీద ఉగ్రంపుపొడి ఛాయ

ఘడియెక్కి భానుడు కంబపువ్వు ఛాయ
కంబపువ్వు మీద కాకారి పూఛాయ

జామెక్కి భానుడు జాజి పూవు ఛాయ
జాజి పువ్వు మీద సంపెంగ పూఛాయ

మధ్యాహ్న భానుడు మల్లెపూవు ఛాయ
మల్లెపూవు మీద మంకెన్నపొడి ఛాయ

మూడు ఝాముల భానుడు ములగ పూవు ఛాయ
ములగ పూవు మీద ముత్యంపుపొడి ఛాయ

అస్తమాన భానుడు ఆవపూవు ఛాయ
ఆవపూవు మీద అద్దంపుపొడి ఛాయ

వాలుతూ భానుడు వంగపూవు ఛాయ
వంగపువ్వు మీద వజ్రంపుపొడి ఛాయ

గ్రుంకుతూ భానుడు గుమ్మడి పూ ఛాయ
గుమ్మడి పువ్వు మీద కుంకంపుపొడి ఛాయ

15, అక్టోబర్ 2016, శనివారం

సువ్వి కస్తూరి రంగా - దాసం గోపాలకృష్ణ గారి రచన


భారతీయ గ్రామీణ జీవితంలో పని చేసే వారికి అలుపు తెలియకుండా కూని రాగాలు, దరువులు, జానపద గీతాలు మొదలైన సంగీత నృత్యాంశాలు ఉద్భవించాయి. ఆడుతు పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది అని కొసరాజు రాఘవయ్య గారు రాసింది అక్షరాలా నిజం. రోజంతా పొలాలలో, ఇళ్లలో పని చేసే వారికి, ముఖ్యంగా మహిళల జీవితాలలో ఈ గ్రామీణ సంగీతం ఓ విడదీయరాని అంతర్భాగం. దీనిని ఎందరో కవులు, కళాకారులు గుర్తించి దానికి తగినంత ప్రాచుర్యం కూడా తెచ్చారు. జానపద సంగీతంలో అందరికీ అర్థమయ్యే భాషలో, ఆయా జీవితాలను ప్రతిబింబించేలా ఈ కళలు ఎంతో ప్రచారం పొందాయి. అటువంటి కోవకు చెందినవే సువ్వి పాటలు. ఆధునిక పనిముట్లు రాకమునుపు శారీరిక శ్రమ కలిగిన పంటలు కోసి కుప్పలు వేయటం, నీళ్ళు మోయటం, ధాన్యాలు దంచటం, రోట్లో పప్పు రుబ్బటం, పిండ్లు కొట్టుకోవటం, పెద్ద ఎత్తన వంటలు చేయటం వంటి పనులలో స్త్రీ పురుషులు తప్పకుండా ఓ పాట అందుకునే వారు. వాటిలో ఒకింత కష్టాన్ని ప్రతిబింబించే పదాలు, కాస్త ఉత్సాహం, కాస్త శృంగారం, కాస్త చిలిపితనం, కాస్త ఆధ్యాత్మికత కలబోసి ఓ అద్భుతమైన రస సమ్మేళనం మనకు ఆవిష్కరించబడుతుంది. పనిలోనూ లయ అనేది మనకు గ్రామీణ శ్రామికుల జీవితాలలో కనబడుతుంది. ఇది సనాతనమైన కళ.

సువ్వి పాటలలో ప్రత్యేకత అవి దాదాపు అన్నమయ్య, క్షేత్రయ్య వంటి వాగ్గేయకారుల సంకీర్తనలకు భావ సారూప్యత కలిగి ఉండటం. మన భారతీయ గ్రామీణ జీవితాలలో ఉన్న గొప్పతనం ఇదే.  ప్రతి ఒక్క కోణంలోనూ ఆధ్యాత్మికత తొణికిసలాడుతూ ఉంటుంది. అలాగే, మధురభక్తి. తాను నాయికగా, స్వామి నాయకుడిగా ఆరాధించే భావన మధురభక్తి. సువ్వి పాటలలో ఈ మధురభక్తి నిండి ఉంటుంది. మధురభక్తికి పతాకస్థాయి కృష్ణ తత్త్వం. సర్వం ఆ నల్లనయ్యకు సమర్పించి ఆయనతో సరససల్లాపాలాడే అనుభూతులు ఎందరో వాగ్గేయకారులు తమ సంకీర్తనలలో కనబరచారు. అటువంటి భావనే కలిగిన ఓ సువ్వి గీతం దాసం గోపాలకృష్ణ గారు రచించిన "సువ్వి కస్తూరి రంగ సువ్వి కావేటి రంగ సువ్వి రామాభిరామ సువ్వి లాలి".

దాసం గోపాలకృష్ణ గారు 1930 ఫిబ్రవరి 13న పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి సమీపంలోని కుముదవల్లి గ్రామంలో సత్యవతి వెంకట్రామయ్య దంపతులకు జన్మించారు. విద్యాభ్యాసం తరువాత పాలకొల్లులో తన నాటక రంగ సేవను మొదలుపెట్టారు. ఆయన సినీ ప్రస్థానం చెన్నైలో 1951లో మొదలైంది. 1955లో వినోదిని పత్రికకు ఆయన స్వాతంత్ర్య పర్వదిన అనే అద్భుతమైన వ్యాసం రాశారు. చిన్నవయసులోనే ఆయన ఎన్నో నాటకాలను రచించారు. రైతు భారతం, సర్వం జగన్నాథం, పున్నమదేవి(చారిత్రాత్మకం) చిలకా గోరింకా, రాగజ్వాల లాంటి నాటకాలు, నాటికలు, బుర్రకథలు రచించారు. ఆయనకు బాగా పేరు తెచ్చిన సాంఘిక నాటకం 'చిల్లరకొట్టు చిట్టెమ్మ '. 1960లో ఈ నాటిక తణుకులో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు నాటకపోటీలలో ప్రథమ బహుమతి పొందింది. 1965లో భక్త పోతన చిత్రానికి సంభాషణలు రాశారు. చిల్లరకొట్టు చిట్టెమ్మ నవలను దాసరి నారాయణరావు గారు 1977లో చిత్రంగా తెరకెక్కించారు. ఆ చిత్రానికి గోపాలకృష్ణ గారు పాటలు, సంభాషణలు అందించారు. తెలుగు చలన చిత్రాలలో ప్రెసిడెంటు పేరమ్మ, భక్త పోతన, బంగారు సంకెళ్లు, శివరంజని వంటి చిత్రాలకు పాటలు, మాటలు రాశారు. అత్తను దిద్దిన కోడలు, కళ్యాణి, రాణీకాసుల రంగమ్మ, అల్లుడు పట్టిన భరతం, పసుపు-పారాణి, దేవదాసు మళ్లీపుట్టాడు, రౌడీ రంగమ్మ, ప్రణయగీతం వంటి చిత్రాలలో  పని చేశారు. శివరంజని చిత్రంలో ఆయన రచించిన గీతం 'జోరు మీదున్నావు తుమ్మెదా'  అన్న పాట ఎంతో పేరుపొందింది. 50కు పైగా చిత్రాలలో పని చేసి 40 మంచి గీతాలు రచించిన దాసం గోపాలకృష్ణ గారు మరణించారు.


1977లో విడుదలైన చిల్లరకొట్టు చిట్టెమ్మ చిత్రానికి దాసం గోపాలకృష్ణ గారు రచించిన 'సువ్వి కస్తూరి రంగ ' అనే గీతం ఎస్.జానకి గారి అద్భుతమైన గాత్రంలో, బాలుగారు మిమిక్రీతో ఎంతో పేరుపొందింది. రమేష్ నాయుడు గారి సంగీతంలో వెలువడిన గీతం శ్రీకృష్ణుడు-గోపికల మధ్య శృంగార  భావనలను, చిలిపి చేష్టలను ప్రతిబింబిస్తుంది.  అర్థరాత్రి నిద్రలో ఆ కొంటె కృష్ణుడు ఆ గోపెమ్మ దగ్గరకు వచ్చి వంగి వంగి చూసి, కొంగు పట్టుకొని లాగాడుట, యమునా తీరానికి తీసుకువెళ్లాడుట. ఆ బృందావనంలో గొల్లభామలలో కలిసి ఆడి పాడిందట. నిద్రలేచి అద్దంలో చూసుకుంటే ఆ కృష్ణుని ముద్దుల ముద్రలు అద్దినట్లుగా ఉన్నాయిట. ఈ భావనలను సువ్వి-ఆహు పద సంపుటితో అందంగా రాశారు దాసం గోపాలకృష్ణగారు. ఈ చిత్రం పాలకొల్లు, పాలకొల్లు పోడూరు ప్రాంతాలలోనే చిత్రీకరించటంతో పాటకు మరింత అందం వచ్చింది. దాసం గోపాలకృష్ణ గారి రచనలు గ్రామాల సంభాషణలలో సహజమైన పదప్రయోగాలు కలిగి తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటాయి. అందుకే, తక్కువ పాటలు రాసినా, అవి ఇప్పటికీ ప్రజల హృదయాలలో స్థానం కలిగి ఉన్నాయి. సువ్వి కస్తూరి రంగ అనే గీతం సాహిత్యం మీకోసం. జానకి గారు ఈ పాటను పాడినట్లు వేరే ఏ గాయని కూడా పాడలేరు అనేలా ఉంటుంది ఈ గానం. రమేష్ నాయుడు గారు మధురమైన సంగీతానికి పెట్టింది పేరు. 1970-80 దశకాలలో ఆయన తెలుగు చిత్రాలకు అందించిన అద్భుతమైన సంగీతం అజరామరం. బాలుగారు, జానకి గార్ల నేపథ్య వైభవంలో ఆయనకు చాలా ముఖ్యమైన పాత్ర ఉంది.

సువ్వి ఆ హు సువ్వి ఆ హు ....సువ్వి...సువ్వి

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ

హైలేసా హయ్యా .. హైలేసా హయ్యా .. హైలేసా హయ్యా .. హైలేసా హయ్యా ..

అద్దమరేతిరి నిద్దురలోన ముద్దుల కృష్ణుడు ఓ చెలియా
అద్దమరేతిరి నిద్దురలోన ముద్దుల కృష్ణుడు ఓ చెలియా
నా వద్దకు వచ్చెను ఓ సఖియా

ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ...
ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ...

వంగి వంగి నను తొంగి చూచెను
కొంగు పట్టుకుని లాగెనుగా
వంగి వంగి నను తొంగి చూచెను
కొంగు పట్టుకుని లాగెనుగా
భల్ చెంగున యమునకు సాగెనుగా

అల్లావనమున కొల్లలుగా వున్న గొల్ల భామలను కూడితిని
నే గొల్ల భామనై అడితిని ...నే గొల్ల భామనై అడితినీ...


నిద్దుర లేచి అద్దము చూడ ముద్దుల ముద్దర ఓ చెలియా ...
నిద్దుర లేచి అద్దము చూడ ముద్దుల ముద్దర ఓ చెలియా ...
హబ్బ... అద్దినట్టుంది ఓ సఖియా...

సువ్వి...ఆహూం...సువ్వీ..ఆహుం..
సువ్వి...ఆహూం...సువ్వీ..ఆహుం..
సువ్వి...ఆహూం...సువ్వీ..ఆహుం..

10, అక్టోబర్ 2016, సోమవారం

ముగురమ్మలు, మహిషాసుర మర్దిని స్తుతి మరియు నీరాజనం - మహర్నవమి


శరన్నవరాత్రులలో ఆఖరి రోజు మహా నవమి. బెజవాడ కనకదుర్గమ్మ మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తుంది. దేవీ మహాత్యంలో దుష్టులను సంహరించటానికి ఆది పరాశక్తి దుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలను ధరిస్తుంది. మధు కైటభులు, మహిషాసురుడు, శుంభ నిశుంభులు ఆ తల్లి చేతులలో హతమవుతారు. రాక్షసులంటే ఎక్కడో ప్రయేకంగా కాదు. దుర్లక్షణాలను బట్టి ప్రవృత్తికి రాక్షసత్వం అనే పేరు ఇవ్వబడింది. మనలోనే ఉంటూ మన మధ్య్తే తిరుగుతూ వికృతక్రీడలతో, దౌర్జన్యంతో స్త్రీలను, బలహీనులను హింసించి ఆధిపత్యం పొందే వాళ్లే రాక్షసులు. అటువంటి వారిని దండించటానికి ఆ అదిపరాశక్తి త్రిశక్తి రూపిణిగా అవతరించి మనలను తరింపజేస్తోంది.

ఈ సందర్భంగా నాకు ఇష్టమైన అమ్మను నుతించే గీతం వివరాలు, చివరగా మంగళ హారరి. ఇంతటితో ఈ శరన్నవరాత్రుల శీర్షికతో వచ్చే వ్యాసాలు సంపూర్ణం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

ఓంకార పంజరశుకీం! ఉపనిషదుద్యానకేళి కలకంఠీం !
ఆగమ విపిన మయూరీ! ఆర్యాం! అంతర్విభావయేద్గౌరీం!

అఖిలాండేశ్వరి! చాముండేశ్వరి! పాలయ మాం గౌరీ! పరిపాలయ మాం గౌరీ!

శుభగాత్రి! గిరిరాజపుత్రి! అభినేత్రి! శర్వార్ధగాత్రి!
సర్వార్ధ సంధాత్రి! జగదేక జనయిత్రి! చంద్రప్రభా ధవళకీర్తి!
చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్దశాంతర భువనపాలిని
కుంకుమరాగశోభినీ! కుసుమ బాణ సంశోభినీ!
మౌనసుహాసిని! గానవినోదిని! భగవతి! పార్వతి! దేవీ!

శ్రీహరి ప్రణయాంబురాశీ! శ్రీపాద విచలిత క్షీరాంబురాశీ!
శ్రీపీఠసంవర్ధినీ! డోలాసురమర్దినీ!
ధనలక్ష్మి! ధాన్యలక్ష్మి! ధైర్యలక్ష్మి! విజయలక్ష్మి!
ఆదిలక్ష్మి! విద్యాలక్ష్మి! గజలక్ష్మి! సంతానలక్ష్మి!
సకలభోగసౌభాగ్యలక్ష్మి! శ్రీమహాలక్ష్మి! దేవీ!

ఇందువదనే! కుందరదనే! వీణాపుస్తకధారిణే!
శుకశౌనకాది వ్యాసవాల్మీకి మునిజన పూజిత శుభచరణే!
సరససాహిత్య స్వరస సంగీత స్తనయుగళే!
వరదే! అక్షర రూపిణే! శారదే! దేవీ!

వింధ్యాటవీవాసినే! యోగసంధ్యాసముద్భాసినే!
సింహాసనస్థాయినే! దుష్టహర రంహక్రియాశాలినే!
విష్ణుప్రియే! సర్వలోకప్రియే! శర్వనామప్రియే! ధర్మసమరప్రియే!
హే బ్రహ్మచారిణే! దుష్కర్మవారిణే! హే విలంబిత కేశపాశినే!
మహిషమర్దనశీల! మహితగర్జనలోల! భయతనర్తనకేళికే! కాళికే!
దుర్గమాగమదుర్గ పాహినే! దుర్గే! దేవీ!

వేటూరి వారి సాహితీ ప్రతిభ దేవీ వైభవంగా ఎలా ఆవిష్కరించిందో చూడండి. ముగురుమ్మల కలయికగా వెలసిన దుర్గ మహిషాసురమర్దినిగా ఎలా ఉంటుందో మన కళ్లకు కట్టినట్లుగా నుతించారు వేటూరి. మొదటి చరణంలో గౌరిని, రెండవచరణంలో మహాలక్ష్మిని, మూడవ చరణంలో సరస్వతిని, చివరి చరణంలో దుర్గను అమోఘమైన పదవిన్యాసంతో ప్రస్తుతించారు. పదప్రయోగంలో వేటూరి వారి పాండిత్యం విలక్షణమైనది. ఈ గీతాన్ని భమిడిపాటి సబిత అనే నృత్యకళాకారిణి నాట్యంగా సప్తపది చిత్రంలో తెరకెక్కించారు. అద్భుతమైన కూచిపూడి విన్యాసంలో, సుశీలమ్మ-బాలు గార్ల సుసంపన్నమైన గాత్రంలో మామ మహదేవన్ గారు మనకు ఈ వేటూరి సాహితీ పారిజాతాన్ని అందించారు.

మొదటి చరణంలో ఆ గౌరిని హిమవంతుని పుత్రికగా, అందమైన ముఖము కల తల్లిగా,  నాట్యాభినయంలో నిపుణురాలుగా, శంకరుని సగభాగంగా, సమస్త సంకల్పములను నెరవేర్చే తల్లిగా, మూడులోకాలకు జననిగా, చంద్రుని వలె ప్రకాశవంతమైన కీర్తి కల అమ్మగా, నాలుగు హస్తములతో దుష్టులను శిక్షించి, భక్తులకు అభయమిచ్చి 14 లోకాలను పాలిచే తల్లిగా, కుంకుమతో శోభిల్లుతూ పూలబాణములతో  వెలిగే అమ్మగా, మౌనముగా చిరునవ్వుతో, సామగానాన్ని ఆనందిస్తూ  ఉండే భగవతిగా పార్వతిని కవి ప్రస్తుతించారు.

రెండవ చరణంలో అమ్మను శ్రీమహావిష్ణువు ప్రేమకు నిలయంగా, పాలకడలిలో ఆ శ్రీహరి పాదాలను సేవిస్తూ ఉండే అమ్మగా, శ్రీపీఠమున స్థిరమైన తల్లిగా, డోలారుసుని సంహరించిన దేవతగా, ధన ధాన్య ధైర్య విజయ ఆది విద్యా గజ సంతాన లక్ష్ములనే అష్ట రూపములతో లోకాల సమస్త కామ్యములను తీర్చే తల్లిగా, సకల సంపదలనిచ్చే కల్పవల్లిగా శ్రీమహాలక్ష్మిని నుతించారు.

మూడవ చరణంలో చంద్రునివంటి ముఖముతో, అందమైన పలువరసతో, వీణ మరియు పుస్తకములు చేత ధరించిన తల్లిగా, శుకుడు శౌనకుడు, వ్యాసుడు, వాల్మీకి మొదలైన వారిచే పూజించబడిన శుభ చరణముల కల అమ్మగా, రసపూరితమైన సాహిత్యము, రసయుక్తమైన సంగీతములనే స్తనములు కలిగిన అమ్మగా, వరములనిచ్చే తల్లిగా, అక్షర రూపిణిగా, శారదగా ఆ సరస్వతీదేవిని నుతించారు.

నాలుగవ చరణంలో ముగురమ్మలు ఏకమైన మహిషాసుర మర్దిని రూపాన్ని కవి అద్భుతంగా ఆవిష్కరించారు. వింధ్యపర్వత శ్రేణుల వద్ద అడవులలో నివసించే అమ్మగా, యోగము, సంధ్యావందనంలో ప్రకాశించే శక్తిగా, సింహారూఢయై దుష్టులను సంహరించే క్రియలో నిపుణురాలైన ఆదిపరాశక్తిగా, విష్ణువుకు, శివునికి,సమస్తలోకములకు ప్రియమైనదిగా, ధర్మ యుద్ధములంటే ఇష్టపడేదిగా, బ్రహ్మచారిణిగా, దుష్కర్మలను వారించేదిగా, ముడివేయని కేశములు కలదిగా, పాశమును ధరించి గొప్ప గర్జనలు, భయము కలిగించే నృత్యము చేస్తూ చేస్తూ కాళిక రూపంలో మహిషాసురుని మర్దించిన గుణశాలిగా, కష్టతరమైన ఆగమాలకు మూలమైన దుర్గగా కొనియాడారు.

ఈ గీతం విని ఆ నృత్యాన్ని చూస్తుంటే రోమాంచమే. అమ్మ రూపాలు, మహిషాసుర మర్దిని విలయ తాండవం మన రోమరోమంలో జాగృతమై తెలియని శక్తి వస్తుంది. ఉత్తేజితులమై కార్యోన్ముఖులమయ్యేలా ఉంటుంది. నిజంగా వేటూరి వారు ఈ గీతాన్ని రాసే సమయంలో ఎటువంటి ఆధ్యాత్మిక శక్తిని అనుభూతి చెందారో ప్రతి అక్షరంలోనూ మనకు ప్రకటితమవుతుంది. అలాగే, కేవీ మహదేవన్ గారు ముగురమ్మలు మరియు మహిషాసురమర్దిని రూపాన్ని వర్ణించే చరణాలకు సముచితమైన రాగాలను ఉపయోగించారు. మనోజ్ఞమైన రాగమాలికగా అందించారు. అందుకే ఇది ఒక మహోన్నతమైన స్తుతిగా నిలిచిపోయింది.

స్త్రీశక్తి జాగృతమై ఈ జగతి సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశిస్తూ, ఈ నీరాజనం.

శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం
కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం

యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం
బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం

నెలకొల్పు డెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం
రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం

మనుజాళి హృదయాల తిమిరాలు తొలగించు మా తల్లి నవ్వులకు నీరాజనం
ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం

చెక్కిళ్ల కాంతితో క్రిక్కిరిసి అలరారు మా తల్లి ముంగెరకు నీరాజనం
రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం

పసిబిడ్డలను చేసి ప్రజలెల్ల పాలించు మాతల్లి చూపులకు నీరాజనం
అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం

పగడాల మరిపించు ఇనబింబమనిపించు మాతల్లి కుంకుమకు నీరాజనం
నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం

తేటిపిల్లలవోలె గాలికల్లలలలాడు మా తల్లి కురులకు నీరాజనం
నీరాల నీరాజనం భక్తి భావాల నీరాజనం

జగదేక మోహినీ సర్వేశు గేహిని మాతల్లి రూపునకు
భక్తి నిలువెత్తు నీరాజనం భక్తి నిలువెత్తు నీరాజనం

బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు భాషలో ప్రావీణ్యం పొంది ఆచార్యులుగా కూడా ఎన్నో ఏళ్లు పని చేశారు. భాషపై పట్టుతో పాటు ఆధ్యాత్మికోన్నతి కూడా వారికి భగవంతుని అనుగ్రహంగా వచ్చింది. తెలుగు మరియు సంస్కృత భాషలలో ఉభయ భాషా ప్రవీణులు వీరు. దేవీభాగవతంపై వీరు విస్తృత పరిశోధన చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరబాద్ లో తెలుగు విభాగంలో ఎన్నో ఏళ్లు ఆచార్యునిగా భాషాసేవ చేశారు.

వీరి రచన ఈ శీతాద్రి శిఖరాన భక్తి గీతం. లోకమాతకు ఇలా నీరాజనం ఇస్తున్నాడు కవి.

హిమవత్పర్వత శిఖరంపై పగడాలతో తాపినట్లుగా ఉన్న మా తల్లి కాళ్ల పారాణికి కెంపువంటి ఎరుపైన, భక్తితో నిండిన నీరాజనం. యోగుల హృదయాలలో చక్కగా మ్రోగే తల్లి అందెలకు బంగారు, భక్తి రంగరించిన నీరాజనం. హృదయంలో నిలిపిన వారికి ప్రేమ వీణలు మ్రోగించే తల్లి గాజులకు రాగాలతో, భక్తి భావములతో నీరాజనం. మానవాళి హృదయాలలోని అంధకారాన్ని తొలగించే తల్లి నవ్వులకు ముత్యాల మరియు భక్తితో కూడిన నృత్యాల నీరజనం. బుగ్గలపై గల వెలుగుతో క్రిక్కిరిసి అలరారే తల్లి ముక్కు పోగుకు రతనాల, భక్తి ప్రయత్నాలతో కూడిన నీరాజనం. ప్రజలందరినీ పసిబిడ్డలను చేసి పాలించే తల్లి చూపులకు అనురాగంతో, భక్తి కనబరుస్తూ నీరాజనం. పగడాలను మరపించేలా, సూర్యబింబంవలె అనిపించే తల్లి కుంకుమకు నిండైన, భక్తి మెండుగా గల నీరాజనం. తేనేటీగ పిల్లల వలే గాలికి అటు ఇటూ ఊగే తల్లి కురులకు నీటితో మరియు భక్తి భావములతో నీరాజనం. జగములోకెల్ల అతి సౌందర్యవతి, సర్వేశ్వరుని పత్ని అయిన తల్లి రూపమునకు భక్తితో నిలువెత్తు నీరాజనం.

కేవలం ప్రాస కోసం పదాలు కాకుండా మంచి భావ సంపద కూడా ఈ గీతంలో ఉన్నాయి. భక్తి విశ్వాసాలతో కూడిన నీరాజనాలు అమ్మ తప్పకుండా స్వీకరించి అనుగ్రహిస్తుంది.

ఈ మంగళహారతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు. శరన్నవరాత్రులలో ఈ అవకాశం నాకు కల్పించిన ఆ జగన్మాతకు, మీకు అందరికీ ధన్యవాదాలు. లోకాస్సమస్తా సుఖినోభవంతు!!

9, అక్టోబర్ 2016, ఆదివారం

దుర్గాష్టమి - శ్రీ దుం దుర్గే



దుర్గే దుర్గత హారిణి త్రిజగతాం సర్గాది సిద్ధార్ధకే
స్వర్గాధీష్ట ఫల ప్రదాన నిపుణే త్రాయస్వ న శ్శంకరి
సా త్వం సర్వ జనాంతరాంతర చిదం సానన్య సిద్ధాత్మికా
సారాసార వివేక దృష్టి విదితా సర్వైక సాక్ష్యాత్మనా

ఓ దుర్గా! మానవుల కష్టములను హరించే తల్లీ! మూడు లోకాల సృష్టి స్థితి లయములకు కారకురాలవు నీవు! సమస్త అభీష్టములను తీర్చే నైపుణ్యము గల తల్లీ! శుభకరీ! మా అంతరాత్మవు నీవు! మాకు విచక్షణ, వివేకము, జ్ఞానము కలిగించే తల్లివి! మూడు లోకాలకు సాక్షీభూతవు నీవు!

అని ఆ దుర్గామాతను నారాయణ తీర్థులవారు తమ శ్రీకృష్ణ లీలా తరంగిణిలో యోగమాయ కంసునికి కృష్ణజన్మవృత్తాంతాన్ని తెలిపిన సందర్భంలో దుర్గాదేవిని మునుల నోట నుతింపజేశారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి మనకు అభయమిచ్చే ఆ సింహవాహినికి పర్వం ఈ దుర్గాష్టమి. దుర్గాసూక్తంలో అమ్మ వైభవాన్ని ఇలా చాటారు:

తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్
దుర్గాం దేవిగ్ం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః

అగ్నివర్ణం కలదీ, తపస్సు ద్వారా ప్రకాశించునదీ, భగవంతునికి చెందినదీ, కర్మ యొక్క ప్రతిఫలాలలో శక్తిగా నెలకొన్నదీ అయిన దుర్గాదేవిని నేను శరణు జొచ్చుచున్నాను. దుఃఖసాగరం నుండి మమ్మలను తీరానికి చేర్చే దేవీ! మమ్ము కాపాడు. నీకు నమస్కారము.

మానవజన్మకు కష్టసుఖాలలో దుర్గమమైన పరిస్థితి ఏర్పడినప్పుడు దుర్గాదేవిని శరణు వేడితే అవి తొలగిపోతాయన్నది ఆర్యోక్తి. మరి అటువంటి దుర్గను కొలిచి ఇదివరకు ఎవరు విజయాన్ని సాధించారు? మనలాంటి మానవులే అయిన పంచ పాండవులు. మహాభారతం విరాట పర్వం ఆరంభంలో పాండవులు అజ్ఞాతవాసానికై విరాటుని కొలువుకు వెళ్లేముందు ధర్మరాజు దుర్గాదేవిని స్తుతించాడు. యుధిష్ఠిరుడి వంటి ధర్మ ప్రభువుకు, సత్యసంధునకు కూడా కష్టాలు తప్పలేదు. అఖండ భారతదేశాన్ని పాలించవలసిన పాండుకుమారులకు తమ నిజస్వరూపం తెలియకుండా మారువేషాలలో ఇంకొకరి పంచన ఉండాల్సిన అగత్యం వచ్చింది. ఎవరు అప్పుడు శరణు? ఆదిపరాశక్తి దుర్గ. ధర్మరాజు ఆ తల్లిని నారాయణుని సోదరిగా, కంసుని మరణానికి కారణమై, దానిని ఆ అసురునికి స్వయంగా తెలిపిన యోగమాయగా గ్రహించి నుతిస్తాడు.

నందగోపకులే జాతాం మంగళ్యాం కులవర్ధినీం

కంసవిద్రావణకరీం అసురాణాం క్షయంకరీం
శిలాతటవినిక్షిప్తాం ఆకాశం ప్రతిగామినీం

వాసుదేవస్య భగినీం దివ్యమాల్య విభూషితాం
దివ్యాంబరధరాం దేవీం ఖడ్గఖేటక ధారిణీం

జయా త్వం విజయా చైవ సంగ్రామే చ జయప్రదా
మమాపి విజయం దేహి వరదా త్వం చ సాప్రతం

వింధ్యే చైవ నగశ్రేష్ఠే తవ స్థానం హి శాశ్వతం
కాళి కాళి మహాకాళి ఖడ్గఖత్వాంగధారిణి

దుర్గాత్ తారయసే దుర్గే తత్ త్వం దుర్గా స్మృతా జనైః
కాంతారేష్వవసన్నానాం మగ్నానాం చ మహార్ణవే

దస్యుభిర్వా నిరుద్ధానాం త్వం గతిః పరమా నృణాం
జలప్రతరణే చైవ కాంతారేష్వటవీషు చ

యే స్మరంతి మహాదేవి న చ సీదంతి తే నరాః
త్వం కీర్తిః శ్రీః ధృతిః సిద్ధిః హ్రీః విద్యా సంతతిర్మతిః

సంధ్యా రాత్రిః ప్రభా నిద్రా జ్యోత్స్నా కాంతిః క్షమా దయా
నృణాంచ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయం

వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి
సోహం రాజ్యాత్ పరిభ్రష్టః శరణం త్వాం ప్రపన్నవాన్

ప్రణతశ్చ యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి
త్రాహి మాం పద్మపత్రాక్షి సత్యే సత్యా భవస్వ నః

అనగా,

యశోద గర్భము నుండి పుట్టి, నారాయణునికి ప్రియమైన, నందగోపుని వంశంలో జన్మించి, అందరికీ శుభములిచ్చి వంశాభివృద్ధి కలిగించే తల్లీ! కంసుని పారద్రోలి, అసురులను నాశనం చేసి, రాతిమీద కొట్టబడినా ఆకాశమార్గంలో పయనించిన వాసుదేవుని సోదరీ! దివ్యమైన పూలమాలలు, వస్త్రములు, ఖడ్గమును, డాలు దాల్చిన దేవీ!

నీవే జయవు, విజయవు. యుద్ధములో జయమునిచ్చే దానవు. నాకు కూడ విజయాన్ని ప్రసాదించే వరాన్ని ఇపుడీయుము.

కాళీ! మహాకాళీ! ఖడ్గము, కపాలం కల దండము ధరించి పర్వత శ్రేష్ఠమైన వింధ్య పర్వతాన్ని శాశ్వత నివాసం చేసుకున్నావు.

ఓ తల్లీ! భరింపరాని కష్టాలనుండి తరింప జేస్తావు కాబట్టే నిన్ను ప్రజలు దుర్గ అని కొలుస్తారు. అడవుల్లో చిక్కుకున్న వారికి, సముద్రం దాటే వారికి, దుర్గమమైన మార్గాలలో పయనించే వారికి, క్రూరుల బారిన పడేవారికి నీవే గతి. నిన్ను స్మరించినవారు ఈ కార్యాలలో కష్టాలపాలు కారు.

నీవే కీర్తివి, శుభానివి, ధైర్యానివి, సిద్ధి, లజ్జ, విద్య, సంతానం, బుద్ధి, సంధ్య, రాత్రి, తేజస్సు, నిద్ర, వెన్నెల, కాంతి, ఓర్పు, దయ మొదలైన రూపాలన్నీ నీవే. నిన్ను పూజించే వారి బంధనం, మోహం, పుత్రశోకం, ధననాశం, రోగం, మృత్యువు, భయము తీరుస్తావు. అమ్మా! ఇప్పుడు నేను రాజ్యభ్రష్టుడనయ్యాను. నీ శరణు వేడుతున్నాను.

దేవతలకు కూడా దేవివైన నీకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నీవు కలువరేకులవంటి ప్రసన్నమైన కనులు కలదానవు. నన్ను రక్షించు. నీవే సత్యము. మా పట్ల సత్యము కమ్ము!

ఈ విధముగా ధర్మమూర్తి అయిన యుధ్హిస్ఠిరుడు ఆ అమ్మను వేడుకోగానే ఆ తల్లి ప్రసన్నురాలై ప్రత్యక్షమై "నాయనా! నీకు త్వరలోనే విజయం కలుగుతుంది. నా అనుగ్రహం వలన విరాటుని కొలువులో మీరుండగా మీ జాడను కౌరవులతో సహా ఎవ్వరూ తెలుసుకోలేరు. నన్ను స్మరించిన వారికి నేను సదా రక్షగా ఉంటాను" అని ఆశీర్వదిస్తుంది.

ప్రముఖ వాగ్గేయకారులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారు దుర్గాదేవిని శ్రీరంజని రాగంలో తిరువారూరు సమీపంలోని కధిరమంగళం వనదుర్గామాతను కొనియాడుతూ ఓ అద్భుతమైన కృతిని రచించారు. ఈ కృతి దుర్గాదేవి మూల మంత్రం యొక్క బీజాక్షరాలతో ఆరంభమవుతుంది. ముత్తుస్వామి దీక్షితుల వారు సిద్ధపురుషులు. మంత్రసాధన చేసి, అమ్మను దర్శించి ఎన్నో కృతులను రచించారు. ఇది కూడా అటువంటిదే. దాని వివరాలు:

శ్రీ దుం దుర్గే శివ సంసర్గే చిద్రస వర్గే
స్థిరే ఆపవర్గే శ్రీ వనదుర్గే

దుందుభి వాద్య భేద నాద వినోదిని
మోదిని వీణా వాదిని సంవేదిని అభేదిని
సుందరి శ్రీరంజని నిరంజని జయ జనని

కరుణారసాలయే కలికల్మష విలయే
కర విధ్రుత కువలయే కానన నిలయే
చరణ కిసలయే చామీకర వలయే
స్వర సంగీత లయే సురుచిర మలయే
గురుగుహోదయే సదయే విజయే అభయే
సరసమయే షట్సమయే సమయే కలయే

ఓ వనదుర్గా మాతా! శివుని సహచారిణీ! సచ్చిదానంద స్వరూపిణీ! శాశ్వతమైన సుఖాలను ప్రసాదించే తల్లీ! వివిధరకములైన వాద్యముల నాదములతో ఆనందించే తల్లీ! వీణావాదనము చేసే తల్లీ! నీవు సర్వాంతర్యామివి! భేదింప శక్యము కావు! మనోజ్ఞమైన రూపము కలదానవు! శ్రీమహాలక్ష్మిని అలరించే తల్లీ! దోషరహితవు! అమ్మా! నీకు జయము! కరుణకు నిలయము నీవు, ఈ కలిదోషాలను హరించే తల్లివి, చేతిలో వికసించిన కమలము కలదానవు, అడవులలో నివసించే తల్లివి! చిగురులవలె మృదువైన పాదములు కల తల్లివి! స్వర్ణకంకణములు ధరించిన మాతవు! కార్తికేయుని తల్లివి! దయామూర్తివి, విజయవు, మాకు అభయమునిచ్చే తల్లివి! మృదువైన స్వభావము కల అమ్మవు! ఆరు మతములకు మూలము మరియు కాలానివి నీవు! అంతటా ఉన్న అమ్మవు!

బాలమురళీకృష్ణ గారి గానంలో ఈ కృతి వినండి.

దీక్షితుల వారి సాహిత్యంలో ఉండే దేవతా వైభవం మహోన్నతమైనది. పూర్తిగా దేవతానుగ్రహం పొంది, ఆ దేవతా స్వరూపంతో అనుసంధానమై ఆయన సంకీర్తనలను రచించారు. అందుకే ఆయన రచనలలో పరిపూర్ణత్వం కనబడుతుంది. ప్రస్తుత కాలంలో వనదుర్గ ఆలలయాలు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, మన సనాతన వాఙ్మయం ఈ వనదుర్గ మన కర్మభూమిలో అంతటా కొలువబడినదని చెబుతున్నాయి. తమిళనాడులోని కధిరమంగళం, తెలంగాణాలోని ఏడుపాయల, కర్ణాటకలోని దేంతడ్క, కేరళలోని పోయిల్కవే మొదలైన ప్రాంతాలలో వనదుర్గ వైభవంగా కొలువబడుతోంది. ఈ క్షేత్రాలు మహిమాన్వితమైనవి.

ఈ దుర్గాష్టమి నాడు బెజవాడ కనకదుర్గమ్మ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తుంది.

ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి | తన్నో దుర్గిః ప్రచోదయాత్ ||

కాత్యాయనీ దేవిని తెలుసుకుందాము. దాని కోసం ఆ కన్యకుమారి యైన దుర్గాదేవిని ధ్యానిద్దాం. ఆ దుర్గాదేవి మనకు ప్రేరణ నిచ్చుగాక!




8, అక్టోబర్ 2016, శనివారం

శరన్నవరాత్రులు - మూల నక్షత్రం నాడు సరస్వతీదేవి అలంకారం


శరన్నవరాత్రులలో నేడు మూల నక్షత్రం, సప్తమి అనంతరం అష్టమి. ఇంద్రకీలాద్రిపై అమ్మ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. సకల కళలకు, సమస్త విద్యలకు, వాక్కుకు రూపమైన ఆ తల్లి మానవజాతి జ్ఞానజ్యోతి నిరంతరం వెలిగేందుకు కారణం. మూలా నక్షత్రం నాడు ఆ తల్లిని ఆరాధించటం విశేషం. యా దేవీ సర్వ భూతేషు విద్యా రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః అన్నది వేదప్రణీతం. సమస్త భూతములలో విద్య రూపంలో ఉన్న ఆ తల్లికి నమస్కారములు అని దీని భావం.

ఇక సరస్వతీ దేవి స్తుతులకు వస్తే ఎన్నో విశేషమైన సంకీర్తనలు, పాటలు ఉన్నాయి. నాకు బాగా నచ్చే పాట స్వాతికిరణం చిత్రంలోని సి.నారాయణ రెడ్డి గారి సంగీత సాహిత్య సమలంకృతే అన్నది. సంస్కృతంలో రచించబడిన ఈ కృతి ఆ భారతీ దేవి వైభవాన్ని మనకు అద్భుతంగా చాటుతుంది. వివరాలు:

సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతీ! మనసా స్మరామి! శ్రీ భారతీ! శిరసా నమామి!

వేద వేదాంత వనవాసిని! పూర్ణ శశిహాసిని!
నాద నాదాంత పరివేషిణి! ఆత్మ సంభాషిణి!
వ్యాస వాల్మీకి వాగ్దాయిని! జ్ఞానవల్లీ సముల్లాసిని!

బ్రహ్మ రసనాగ్ర సంచారిణి! భవ్య ఫలకారిణి!
నిత్య చైతన్య నిజరూపిణి! సత్య సందీపిని!
సకల సుకళా సమున్వేషిణి! సర్వ రస భావ సంజీవిని!

సంగీతం, సాహిత్యము, స్వరం, రాగము, పదము, యోగములతో అలంకరించబడిన తల్లిని భారతీ దేవిగా కవి ప్రస్తుతిస్తున్నారు. వేద వేదాంతములనే వనములలో నివసించే తల్లిగా, పూర్ణ చంద్రబింబము వంటి నవ్వు కలిగి, నాదము, దానికి మూలమైన ఓంకారంతో అలంకరించబడి, ఆత్మతో అనుసంధానమైన తల్లిగా ఆ భారతీదేవిని కవి కొనియాడారు. వ్యాసుడు, వాల్మీకి వంటి అవతారపురుషులకు, ఋషులకు అద్భుతమైన వాక్ సంపదనిచ్చి వారి ద్వారా మనకు వెలలేని వాఙ్మయ సంపదనిచ్చిన, జ్ఞానమనే తీగలతో ప్రకాశించే అమ్మగా మనోజ్ఞంగా అభివర్ణించారు. బ్రహ్మ నాలుకపై నడయాడే ఆ తల్లి అద్భుతమైన ఫలాలను అందిస్తూ, సచ్చిదానంద స్వరూపిణిగా సత్యరూపిణిగా శోభిల్లుతూ, సమస్త శుభకళలకు ఆలవాలమై సమస్త రసములకు, భావములకు ప్రాణమైనదిగా నుతించారు.

ఇటువంటి గీతం రచించాలంటే సరస్వతీ అనుగ్రహం ఉంటేనే సంభవం. నారాయణ రెడ్డి గారి రచనా ప్రస్థానం గమనిస్తే ఆ అనుగ్రహం మనకు ఎల్లెడలా కనబడుతుంది. వాగ్దేవి కటాక్షం కలిగిన ఆయన ఈ చిత్రంలో ఈ గీతంతో పాటు ప్రణతి ప్రణతి ప్రణతి వంటి మరో అద్భుతమైన గీతాన్ని కూడా అందించారు. సాహిత్యానికి మూలం పదాలలో ఉండే భావం, సహజమైన పటుత్వం. సంగీత సాహిత్య సమలంకృతే అనే గీతం ఇటువంటీ సర్వ సులక్షణ సమన్వితమైనది. మహదేవన్ గారి సంగీత మాధుర్యంలో బాలసుబ్రహ్మణ్యం గారి గానంలో ఈ పాట మరింత ప్రకాశించింది.

వీణాపాణిగా, అక్షరరూపిణిగా, శుక వారిజ పాణిగా, వరదాయినిగా, సురలోక గాయనిగా ఆ తల్లి జగత్తును కాపాడుతోంది. ఆమె విపంచి నుండి నిరంతరం షడ్జమ నాదము వెలువడుతూ జగత్తులో శబ్దరస గ్రంథులకు జీవమై నిలుస్తుంది. ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో కొలిచి అనుగ్రహాన్ని పొందుదాం.

7, అక్టోబర్ 2016, శుక్రవారం

కాత్యాయనీ కన్నతల్లీ - శ్రీరంగం గోపాలరత్నం ఆలపించిన గీతం



మొన్న తిథి ద్వయం కావటంతో బెజవాడ దుర్గమ్మ మామూలుగా శరన్నవరాత్రులలో ఐదవనాడు లలితా త్రిపురసుందరి అలంకారానికి బదులుగా కాత్యాయనిగా దర్శనమిచ్చింది.

కాత్యాయని అనగానే నాకు నా చిన్ననాటి లలిత భక్తి గీతం కాత్యాయనీ కన్నతల్లీ గుర్తుకొచ్చింది. దీనిని శ్రీరంగం గోపాలరత్నం గారు అద్భుతంగా పాడారు. వింజమూరి శివరామారావు గారు ఆనాటి లలిత గీతాల రచయితలలో ప్రముఖులు. దేవులపల్లి వారికి, వింజమూరి సోదరీమణులకు బంధువు. లలిత సంగీతంలో భక్తిని గుప్పించిన కవుల ప్రతిభలు ఆనాడు ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. దేవులపల్లి వారు రచించిన లలిత భక్తి గీతాలు అనేకం. అలాగే, మరెందరో మహానుభావులు. వింజమూరి శివరామారావు గారు కథలు, పద్యాలు, కథానికలతో పాటు రామాయణాన్ని గేయంగా రచించారు కూడా. అది ఎంతో ప్రసిద్ధి పొందింది. దానిని తొలుత బాలమురళీకృష్ణగారు ఆలపించారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఆంధ్రా యూనివర్సిటీ వారు కళాప్రపూర్ణ బిరుదునిచ్చారు. ఆకసమున చిరుమబ్బుల చాటున, నల్లనివాడ నే గొల్లపిల్లనోయి, మధురానగరి సమీపంలో, వచ్చెనోయి వసంతము, వినవే చెలి పిలుపు అల్లదిగో వంటి ఎన్నో అద్భుతమైన లలితగీతాలను రచించారు. వీటిని బాలమురళిగారితో పాటు అలనాటి మేటి గాయనీమణులు రావు బాలసరస్వతి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, వేదవతీ ప్రభాకర్ గారు ఆలపించి శాశ్వతం చేశారు. ఆయన కథలు, ఆయన రచించిన గీతాలన్నీ ఎంతో పేరు పొందాయి.

వింజమూరి వారి రచనలలో ఒకటి శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించిన కాత్యాయనీ కన్నతల్లి అనే గీతం. శ్రీరంగం గోపాలరత్నం గారు తెలుగుజాతిలో జన్మించిన ఓ సంగీతపు ఆణిముత్యం. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ గానం తేనె జాలువారినట్లు ఉండేది. పద్మశ్రీ బిరుదు పొందిన ప్రఖ్యాత ఆకాశవాణి ఆర్టిస్టు ఆవిడ. తెలుగునాట సంగీత పితామహులు శ్రీపాద పినాకపాణి గారి శిష్యురాలు. ఆవిడ భక్తిరనజనిలో పాడిన పాటలు ఎందరో జీవితాలలో భక్తిని మొలకెత్తించాయి. 1939లో విజయనగరం జిల్లా పుష్పగిరిలో సుభద్రమ్మ వరదాచారి దంపతులకు జన్మించిన వీరు హరికథలు, జావళులు, కూచిపూడి మరియు యక్షగానం వంటి కళలలో గాయనిగా ప్రసిద్ధి చెందారు. హైదరబాదు మరియు విజయనగరంలలో సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆస్థాన విదుషీమణిగా పనిచేస్తున్నప్పుడు అన్నమాచార్యుల వారి కీర్తనలకు సంగీతాన్నిచ్చారు. సకలం హే సఖి అని ఆవిడ పాడిన అన్నమాచార్య కీర్తన ఎంతో పేరు పొంది నేటికి కూడా ప్రమాణమైంది. కాత్యానీ కన్నతల్లీ వివరాలు.

కాత్యాయనీ! కన్నతల్లీ! మమ్మేలు భక్తావనీ! కల్పవల్లీ!

నీ సేవలే నిత్య సంకీర్తనమ్ములే మా జీవితాల భాగ్యాలు సౌభాగ్యాలు

శివదేవ సీమంతినీ జేజేలు భువనైక సామంతినీ
నీ చూపు వెల్గులు నీ నవ్వు వెన్నెల
ఏ కాలమూ మూడు లోకాల పైనాడు

ఇంద్రకీలాద్వాసినీ దుర్గమ్మ సాంద్ర తేజోద్భాసినీ
నిన్ను పూజింతుమీ హృదయాల కుసుమాల
మన్నింపుమమ్మ నీ చరణాలే శరణాలు

ఆడియో కోసం ఈ లింకును ఓపెన్ చేయండి. క్రింది భాగంలో 2వ పాట ఇది.

http://eemaata.com/em/issues/201501/6384.html?fmt=rts

శరన్నవరాత్రులు - షష్ఠి నాడు శ్రీమహాలక్ష్మి అలంకారం



ఆశ్వయుజ శుద్ధ షష్టి శుక్రవారం బెజవాడ కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మిగా దర్శనమిస్తుంది. ఆ తల్లిని అన్నమాచార్యుల వారు ఎంతో వైభవంగా వర్ణించారు. క్షీరాబ్ది కన్యకకు అనే నీరాజనం అందరికీ తెలిసిందే. చూడరమ్మ సతులాలా అనే సంకీర్తనలో ఆయన ఆ తల్లి రూపమైన గోదాదేవిని చూడికుడుత్త నాంచారి గా అభివర్ణించారు. వివరాలు:

చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ

చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత్త నాంచారి
సోబానే సోబానే సోబానే సోబానే

శ్రీమహాలక్ష్మియట సింగారాలకేమరుదు
కాముని తల్లియట చక్కదనాలకేమరుదు
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు
కోమలాంగి ఈ చూడి కుడుత్త నాంచారి

కలశాబ్ధి కూతురట గంభీరాలకేమరుదు
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు
జలజనివాసినియట చల్లదనమేమరుదు
కొలదిమీర ఈ చూడి కుడుత్త నాంచారి

అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె
కొమెర వయస్సు ఈ చూడి కుడుత్త నాంచారి

చూడికుడుత్త నాంచారి: గోదాదేవి (చూడి కుడుత్త అనేది తమిళ పదం. తాను ధరించిన మాలను స్వామికి ఇచ్చిన అని దాని అర్థం, అలా చేసింది  గోదాదేవి కాబట్టి ఆమెను చూడికుడుత్త నాచ్చియార్ అంటారుట).

సతులారా! మన గోదాదేవి పతితో కూడియున్నది. పెండ్లిపాటలు పాడండి. (సోబాన అనే పదం కలిగిన పాటలు పెళ్లి పాటలుగా ప్రాచుర్యం పొందాయి)

ఈమె శ్రీమహాలక్ష్మి యట, అలంకారాలకు (శృంగారమునకు) ఏమి తక్కువ?  మన్మథుని తల్లియట, చక్కదనాలు ఏమి తక్కువ? చంద్రుని తోబుట్టువట (క్షీర సాగర మథనంలో లక్ష్మితో పాటు చంద్రుడు కూడా ఆవిర్భవించాడు కాబట్టి వారిద్దరు తోబుట్టువులయ్యారు), ప్రసన్నత మరియు కళకు ఏమి తక్కువ? ఈ గోదాదేవి చాల కోమలమైన శరీరము కలది.

ఈమె సముద్రుని కూతురట, గంభీరానికేమి తక్కువ? తలచితే లోకానికి తల్లియట దయకేమి తక్కువ? నీటినుండి పుట్టిన కమలంలో నివసిస్తుందట చల్లదనానికేమి తక్కువ?  ఈ గోదాదేవి అన్నీ అపరిమితంగా కలిగినది.

ఈమె దేవతల వందనాలు పొందినదట, అటువంటి మహిమలకేమి తక్కువ?  అమృతానికి చుట్టమట (క్షీర సాగర మథనంలో అమృతము కూడా ఉద్భవించింది కాబట్టి) మరి ఆనందాలకేమి తక్కువ? కౌమార్యంలో ఉన్న ఈమెను ఆత్రుతతో శ్రీవేంకటేశుడు తానే వచ్చి పెండ్లాడాడు.

అన్నమాచార్యుల వారు గోదా వైభవాన్ని ఈ సంకీర్తన ద్వారా అద్భుతంగా వివరించారు. శ్రీరంగనాథుని పుట్టుకతోనే కొలిచిన గోదా శ్రీమహాలక్ష్మి అవతారంగా దర్శించి ఈ సంకీర్తనను మనకు అందించారు. గోదాదేవి శృంగారాన్ని, సౌందర్యాన్ని, తల్లి ప్రేమను, కరుణను, కళలను, మహిమలను, గాంభీర్యాన్ని, కోమలత్వాన్ని అద్భుతమైన ఉపమానములతో లక్ష్మీదేవితో పోల్చి ఈ కీర్తనకు దివ్యత్వాన్ని చేకూర్చారు. ఆమె ఈ గుణాలను గమనించి శ్రీరంగనాథుడు వచ్చి పెండ్లాడిన సందర్భంగా సతులను సోబాన పాడరమ్మా అని కోరుతున్నాడు సంకీర్తనాచార్యుడు. పదకవితా పితామహుని భావ సంపద, భక్తి జ్ఞాన సౌరభాలు ఈ సంకీర్తన ద్వారా ప్రకాశిస్తున్నాయి. తల్లిలో ఉండే సర్వ సులక్షణాలను అన్నమయ్య ఇందులో పొందుపరచారు.

విష్ణుచిత్తుని ఇంట జన్మించిన ఆ లోకమాత శ్రీరంగనాథునితో ఏకమయ్యే అద్భుతమైన అవతరణిక తిరుప్పావై.  ఆ తిరుప్పావైలోని ఘట్టాలను ఎందరో సంకీర్తనాచార్యులు తమ భావాలలో వ్యక్తపరచారు. గోదావైభవాన్ని స్వయంగా శ్రీవిల్లిపుత్తూరులో దర్శించి తరించిన అన్నమాచార్యుల వారు దానిని తిరుమల-తిరుపతిలో వెలసిన వేంకటేశుడు-అలమేల్మంగల వైభవానుభూతికి సారూప్యంగా వర్ణించారు. తన జీవితాన్ని శ్రీరంగంలోని రంగనాథునికి సమర్పించిన గోదా 'నేను' అన్న భావాన్ని త్యజించి స్వామిలో ఐక్యమయ్యింది. అందుకే లోకవంద్య అయ్యింది.

అన్నమాచార్యుల వారు అమ్మవారిని ఎన్నో కీర్తనలలో నుతించారు. మెరుగు బోడి అన్నా, చూడికుడుత నాంచారి అన్నా, క్షీరాబ్దికన్యక అన్నా, జయలక్ష్మి అన్నా, ఆ అమ్మను ప్రతి ఒక్క సంకీర్తనలోనూ ప్రత్యేకంగా, ఒక వినూత్నమైన భావాన్ని మన ముందు ఆవిష్కరించారు.  పరమాత్మ యొక్క మాయా స్వరూపిణిగా కూడా మనకు వివరించారు. స్వామితో సరస శృంగార సల్లాపాలు సలిపే అమ్మ, లోకమాతగా, మనలను అపారమైన కరుణతో అనుగ్రహించే తల్లిగా, చల్లని చూపులతో కాపాడే కల్పవల్లిగా, సకల సద్గుణాల రాశిగా అన్నమాచార్యుల వారు ఎన్నో కీర్తనలలో ప్రస్తుతించారు. వాటిలో ఈ చూడరమ్మ సతులాలా ప్రత్యేకమైనది.

వివాహమనేది మానవ జన్మలో ఎంతో పవిత్రమైనది. దానికి సంబంధించిన వేడుకలను, ముచ్చటలను అన్నమాచార్యుల వారు తమ పదశోభలలో ఎంతో మధురంగా జనులకు అర్థమయ్యే భాషలో, అనాటి సమాజానికి అద్ధం పట్టేలా రచించారు. పిడికిట తలంబ్రాల పెళ్లికూతురని పాడినా, సోబాన పాడరమ్మా అని నుతించినా ఆయా వేడుకలను మనకు ఇప్పటికీ తెలిసేలా సాహిత్యాన్ని గుప్పించారు. ఇదే మన సంస్కృతిలోని గొప్పతనం. అది ఒక గంగా ప్రవాహంలాంటిది. మహానుభావుల భావ స్పందనలు రచనలుగా మారి, తర తరాల వారసత్వంగా మనకు అందుతోంది.

అన్నమాచార్యుల పదకవితా వైభవం, ఆధ్యాత్మిక ఉన్నతికి ఈ కీర్తన ఒక కలికితురాయి.  గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారి గళంలో ఈ సంకీర్తనను వినండి.

http://play.raaga.com/telugu/song/album/Anamaya-Sankerthana-Vedanadam-AD000028/Chodaramma-Sathulala-36875

6, అక్టోబర్ 2016, గురువారం

బుచ్చి గ్రామ తిరగమోత



వంటింట్లోంచి వస్తున్న పోపు ఘాటు నషాలానికి అంటి ఉక్కిరి బిక్కిరై పొరలు పొరలుగా దగ్గుతున్నాడు అప్పదాసు. "ఏమేవ్ ఏమని నిన్ను కట్టుకున్నానో ఆ క్షణం నుండీ నీ గ్రామ తిరగమోతతో చస్తున్నాను..."

బుచ్చి: "ఆ అవును ఇంతోటి మన్మథుడని మీరు...ఆ ద్రాక్షారామం సంబంధం వదులుకొని మిమ్మల్ని చేసుకున్నాను చూడండీ! కాపురానికొచ్చిన మర్నాడే మీరు మీ అమ్మ కూర్చొని పోపు ఇలా పెట్టాలి, ఇవి వేయాలి, అవి వేయాలి అని నా బుర్ర తినేసి నేర్పించారు. ఆ తిరగమోతే ఇది...మీరు ఏది అన్నా అది మీకూ, పైనున్న ఆ మహాతల్లికి చెందుతాయి..."

అప్పదాసు: "ఒసేవ్! నీ మొహానికి పప్పులో తిరగమోతలో శనగపప్పు వేయకూడదని కూడా తెలియదు. అది చెప్పి సరిదిద్దితే నీ ముదనష్టపు తిరగమోత ఘాటును మాకు అంటగడతావా. ఇది అన్యాయమే బుచ్చీ!"

బుచ్చి:  "ఏవిటీ అన్యాయం! ఇది దప్పళం, అది పులుసు, ఇది పప్పు, అది పప్పు చారు, ఇది సాంబారు, అది కదంబం పులుసు అని వంద రకాల పేర్లు పెట్టి ఒకే వంటను తిప్పి తిప్పు చెప్పి వాటికి తలా ఓ రకం తిరగమోత చెబితే 16 ఏళ్ల వయసులో నాకేం తెలిసి చస్తాయి! అమ్మో అమ్మో మీరు మీ అమ్మ వంటల గోలతో నేను కాబట్టి వేగాను. ఇంకోతి అయితేనే ఎప్పుడే చెప్పున చాటన కొట్టేది.."

అప్పదాసు: "బుచ్చీ! చెప్పున చాటన కొడతావా!! ఉండు నీ పని చెబుతా" అని చేతిలో ఉన్న పేడ ముద్ద గట్టిగా బుచ్చి కాళ్లకేసి కొట్టాడు.

బుచ్చి: "ఆ! ఆ! ఎంత అఘాయిత్యం! పేడతో కొట్టడానికి నేనేవన్నా మట్టి గోడనా! ఉండండీ మీ పని చెబుతా" అని బలంగా చేతిలో ఉన్న కంచు గరిటె విసిరింది. ఆ కంచు దెబ్బకు అప్పదాసు మోకాలి చిప్ప ఖంగున మోగింది మరుక్షణం అప్పదాసు "అమ్మా" అని కింద బొక్క బోర్లా పడ్డాడు.

ఆ తరువాత బుచ్చి-అప్పదాసుల యుద్ధం ఓ గంటసేపు సాగింది. ఇల్లు కిష్కింధకాండ. ఆ ఇంట ఓ వానర జంట వీరంగం...

శరన్నవరాత్రులలో ఐదవనాడు కాత్యాయని అలంకారం



తిథి ద్వయం కావటంతో బెజవాడ దుర్గమ్మ మామూలుగా శరన్నవరాత్రులలో ఐదవనాడు లలితా త్రిపురసుందరి అలంకారానికి బదులుగా కాత్యాయనిగా దర్శనమిచ్చింది.

కాత్యాయని అనగానే నాకు నా చిన్ననాటి లలిత భక్తి గీతం కాత్యాయనీ కన్నతల్లీ గుర్తుకొచ్చింది. దీనిని శ్రీరంగం గోపాలరత్నం గారు అద్భుతంగా పాడారు. వింజమూరి శివరామారావు గారు ఆనాటి లలిత గీతాల రచయితలలో ప్రముఖులు. దేవులపల్లి వారికి, వింజమూరి సోదరీమణులకు బంధువు. లలిత సంగీతంలో భక్తిని గుప్పించిన కవుల ప్రతిభలు ఆనాడు ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. దేవులపల్లి వారు రచించిన లలిత భక్తి గీతాలు అనేకం. అలాగే, మరెందరో  మహానుభావులు. వింజమూరి శివరామారావు గారు కథలు, పద్యాలు, కథానికలతో పాటు రామాయణాన్ని గేయంగా రచించారు కూడా. అది ఎంతో ప్రసిద్ధి పొందింది. దానిని తొలుత బాలమురళీకృష్ణగారు ఆలపించారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఆంధ్రా యూనివర్సిటీ వారు కళాప్రపూర్ణ బిరుదునిచ్చారు. ఆకసమున చిరుమబ్బుల చాటున, నల్లనివాడ నే గొల్లపిల్లనోయి, మధురానగరి సమీపంలో, వచ్చెనోయి వసంతము, వినవే చెలి పిలుపు అల్లదిగో వంటి ఎన్నో అద్భుతమైన లలితగీతాలను రచించారు. వీటిని బాలమురళిగారితో పాటు అలనాటి మేటి గాయనీమణులు రావు బాలసరస్వతి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, వేదవతీ ప్రభాకర్ గారు ఆలపించి శాశ్వతం చేశారు. ఆయన కథలు, ఆయన రచించిన గీతాలన్నీ ఎంతో పేరు పొందాయి.

వింజమూరి వారి రచనలలో ఒకటి శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించిన కాత్యాయనీ కన్నతల్లి అనే గీతం. శ్రీరంగం గోపాలరత్నం గారు తెలుగుజాతిలో జన్మించిన ఓ సంగీతపు ఆణిముత్యం. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ గానం తేనె జాలువారినట్లు ఉండేది. పద్మశ్రీ బిరుదు పొందిన ప్రఖ్యాత ఆకాశవాణి ఆర్టిస్టు ఆవిడ. తెలుగునాట సంగీత పితామహులు శ్రీపాద పినాకపాణి గారి శిష్యురాలు. ఆవిడ భక్తిరనజనిలో పాడిన పాటలు ఎందరో జీవితాలలో భక్తిని మొలకెత్తించాయి. 1939లో విజయనగరం జిల్లా పుష్పగిరిలో సుభద్రమ్మ వరదాచారి దంపతులకు జన్మించిన వీరు హరికథలు, జావళులు, కూచిపూడి మరియు యక్షగానం వంటి కళలలో గాయనిగా ప్రసిద్ధి చెందారు. హైదరబాదు మరియు విజయనగరంలలో సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆస్థాన విదుషీమణిగా పనిచేస్తున్నప్పుడు అన్నమాచార్యుల వారి కీర్తనలకు సంగీతాన్నిచ్చారు. సకలం హే సఖి అని ఆవిడ పాడిన అన్నమాచార్య కీర్తన ఎంతో పేరు పొంది నేటికి కూడా ప్రమాణమైంది. కాత్యానీ కన్నతల్లీ వివరాలు.

కాత్యాయనీ! కన్నతల్లీ! మమ్మేలు భక్తావనీ! కల్పవల్లీ!

నీ సేవలే నిత్య సంకీర్తనమ్ములే మా జీవితాల భాగ్యాలు సౌభాగ్యాలు

శివదేవ సీమంతినీ జేజేలు భువనైక సామంతినీ
నీ చూపు వెల్గులు నీ నవ్వు వెన్నెల
ఏ కాలమూ మూడు లోకాల పైనాడు

ఇంద్రకీలాద్వాసినీ దుర్గమ్మ సాంద్ర తేజోద్భాసినీ
నిన్ను పూజింతుమీ హృదయాల కుసుమాల
మన్నింపుమమ్మ నీ చరణాలే శరణాలు

ఆడియో కోసం ఈ లింకును ఓపెన్ చేయండి. క్రింది భాగంలో 2వ పాట ఇది.

http://eemaata.com/em/issues/201501/6384.html?fmt=rts

5, అక్టోబర్ 2016, బుధవారం

ఆశ్వయుజ శుద్ధ చతుర్ధి అనంతరం పంచమి - శ్రీ లలితా శివజ్యోతి


శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే భువనేశ్వరి
ఆగమ వేద కళామయ రూపిణి అఖిల చరాచరాచరి జనని నారాయణి
నాగ కంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి

అని అగస్త్యార్ అమ్మవారిని కొలిచాడు. సమస్త జీవరాశులలో ఉన్న ఆ తల్లి నారాయణిగా రాజరాజేశ్వరిగా నుతించబడింది. శ్రీచక్రనివాసిని అయిన లలితాంబిక సనాతన వేద వాఙ్మాయానికి, సమస్త కళలకు రూపముగా ప్రస్తుతించబడింది. బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ-అగస్త్య సంవాదంలో చెప్పబడిన లలితా సహస్రనామావళిలో కూడా "చతుష్షష్ట్యుపచారాఢ్యా చతుష్షష్టి కళామయి మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా" అని కొలువబడింది. 64 ఉపచారాలతో కొలువబడిన తల్లిగా, 64 కళలకు ఆలవాలంగా తల్లిని ఈ స్తోత్రంలో నుతించారు. మరి ఏమిటీ చతుష్షష్టి ఉపచారాలు అని ఒక ప్రశ్న వచ్చింది. ధ్యానం, దివ్య మందిరం, రత్న మంటపం, ఆందోళికం, ఆవాహనం, సింహాసనం, వితానం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, మధుపర్కం, అభ్యంగం, ఉద్వర్తనం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఉత్తరీయం, దివ్య పాదుక, కేశపాశ బంధనం, సౌవీరాంజనం, ఆభరణం, శ్రీగంధం, అక్షత, హరిద్రాచూర్ణం, కుంకుమ విలేపనం, సుగంధ ద్రవ్యాణి, సిందూరం, అథాంగ పూజ, ధూపం, దీపం, కుంభార్తిక్యము, నైవేద్యము, హస్తప్రక్షాళనం, పానీయం, ఫలం, తాంబూలం, సువర్ణపుష్ప దక్షిణ, ఛత్రం, చామరం, దర్పణం, నీరాజనం, దివ్యమంత్ర పుష్పం, ప్రదక్షిణం, నమస్కారం, తురంగ వాహనం, గజ వాహనం, రథం, చతురంగ సైన్యం, దుర్గం, వ్యజనం, దృక్పానపాత్ర నటనం, నాట్యం, మృదంగ వాద్యం, గంధర్వకన్యా గానం, అనేక విధ వాద్యాని, క్షమాపణం, భక్త్రగృహ నివాసం, సువర్ణపర్యంకోపవేశనం, పాదయోః లాక్షారంజనం, గండూష జలపాత్రం, సుఖ శయనం, మమహృదయే నిత్యనివాసనం, పూజా ఫలం, ప్రసనార్ఘ్యం..అదండీ సంగతి. అమ్మను ఇంత వివరంగా కొలువవచ్చు. సమయాన్ని బట్టి, భావాన్ని బట్టి సేవలు.

లలితాపరమేశ్వరి అనగానే 1967లో విడుదలైన రహస్యం చిత్రంలో లీలగారు పాడిన శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా అన్న పాట గుర్తుకు వస్తుంది. తెలుగునాట స్త్రీల నోట మంగళహారతి పాటగా శాశ్వతమైపోవటానికి కారణం అందులోని సాహిత్యం, తేలికైన భాష. సమస్త కామ్యములను తీర్చే తల్లిగే సకల శుభకరిగా ఆ జగన్మాతను ఈ గీతంలో కొనియాడారు.  సాహిత్యం పరిశీలిస్తే సముద్రాల వారు రచించినట్లు అనిపిస్తోంది. చిత్రం టైటిల్స్‌లో ఆయన పేరు ఉంది. కానీ ఖచ్చితంగా ఆయనే రచించారని చెప్పటానికి నా దగ్గర ఆధారాలు లేవు. ఎవరు రాసినా, తెలుగునాట ఈ పాట పొందిన ప్రాచుర్యం అంతా ఇంతా కాదు. లలితా త్రిపురసుందరికి మంగళ హారతి పలికే ఈ గీతం సాహిత్యం ఈనాడు ఆశ్వయుజ శుద్ధ చతుర్ధి అనంతరం పంచమి శుభదినాన అందరి కోసం.

శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా

జగముల చిరు నగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
మనసే నీ వశమై, స్మరణే జీవనమై
మాయని వరమీయవే పరమేశ్వరి మంగళ నాయకి
శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా

అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి
అందలేలే చల్లని తల్లికి చంద్రహారతి
రవ్వల తళుకుల కళల జ్యోతుల కర్పూరహారతి
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి


4, అక్టోబర్ 2016, మంగళవారం

శరన్నవరాత్రులు - అన్నపూర్ణాదేవి అలంకారం


అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నం జీవాధారమే కాదు, జీవికి మూలం కూడా.

అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్నసంభవః
యజ్ఞాద్భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః

కర్మలనుండి యజ్ఞము, యజ్ఞము వలన వర్షములు కలిగి, వర్షము వలన పంటలు పండుతాయి అని శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భగవద్గీతలోని కర్మయోగములో చెప్పాడు.

అన్నము స్త్రీపురుషులలోని ఓజస్సుకు కారణమై మానవజాతి సృష్టికి మూలమైంది. ఆ ఆహారానికి అధిదేవతగా ఈనాడు ఆదిపరాశక్తి అన్నపూర్ణేశ్వరి అలంకారంలో దర్శనమిస్తుంది. ఆదిశంకరులు అన్నపూర్ణాష్టకంలో ఈ తల్లి వైభవాన్ని అద్భుతంగా వివరించారు. అంతే అద్భుతంగా ముత్తుస్వామి దీక్షితుల వారి తన కృతి అన్నపూర్ణే విశాలాక్షిలో వర్ణించారు. పాయసాన్నం కలిగిన బంగారు గిన్నె చేత ధరించిన తల్లి సాక్షాత్తు పరమశివునికే భిక్ష ఇచ్చింది. సమస్తలోకానికి అమ్మగా నిలిచింది. ఆ కీర్తన వివరాలు.

అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి

ఉన్నత గర్త తీర విహారిణి ఓంకారిణి దురితాది నివారిణి
పన్నగాభరణ రాజ్ఞి పురాణి పరమేశ్వరి విశ్వేశ్వర భాస్వరి

పాయసాన్న పూరిత మాణిక్య పాత్ర హేమదర్వీ విధృత కరే
కాయజాది రక్షణ నిపుణతరే కాంచనమయ భూషణాంబరధరే
తోయజాసనాది సేవిత పరే తుంబురు నారదాది నుత వరే
త్రయాతీత మోక్షప్రద చతురే త్రిపద శోభిత గురుగుహ సాదరే

ఓ అన్నపూర్ణ తల్లీ! విశాలమైన కన్నుల గల అమ్మా! సమస్త లోకాలకు సాక్షివి! కటాక్షాన్ని ప్రసాదించే తల్లీ!

ఉన్నతమైన గర్త తీరంలో విహారం చేసే, (తిరువారూర్ వద్ద కుళిక్కుళై అనే క్షేత్రంలో అన్నపూర్ణా విశ్వనాథుల క్షేత్ర కీర్తన ఇది) ఓంకార రూపిణీ! సమస్త పాపములను తొలగించే, నాగాభరణములను ధరించే శివుని రాణీ! పురాణములలో పొగడబడిన పరమేశ్వరీ! శివుని ప్రక్కన ప్రకాశించే అమ్మా!

పాయసాన్నము కలిగిన పాత్ర ఒక చేత, బంగారు గరిటే ఒక చేత కలిగి శోభిల్లే, మన్మథుడు మొదలైన వాని రక్షించుటలో నైపుణ్యము కలిగిన, బంగారు వస్త్రములను, ఆభరణములను ధరించిన తల్లీ! కమలాసనుడైన బ్రహ్మ మొదలగు దేవతలచే పూజించబడిన, నారదుడు, తుంబురుడు మొదలైన వారిచే నుతించబడే తల్లీ! ధర్మార్థ కామ్యములను దాటించి మోక్షమును ప్రసాదించటంలో చాతుర్యము కలిగిన, సత్-చిత్-ఆనందములచే శోభిల్లే, గురుగుహుని ఆదరించే తల్లీ! రక్షించుము!

ముత్తుస్వామి దీక్షితుల వారి క్షేత్ర కీర్తనలలో ఈ అన్నపూర్ణే విశాలాక్షీ ఎంతో ప్రాచుర్యం పొందింది. శ్రీవిద్యోపాసనలో సిద్ధులైన దీక్షితులవారు అమ్మను నిరంతరం దర్శించి ఎన్నో అద్భుతమైన కీర్తనలను రచించారు. సామరాగంలో ఈ అన్నపూర్నే విశాలాక్షీ అన్న కీర్తన కుళిక్కుళైలో గల కాశీవిశ్వనాథుని దేవేరి అన్నపూర్ణమ్మను నుతిస్తూ రచించారు.

అన్నపూర్ణ పార్వతీదేవి యొక్క స్వరూపము. సకల కామ్యములతో పాటు మానువుని జీవితానికి అత్యంత ముఖ్యమైన భోజ్యములను అనగా పాడి పంటల ద్వారా వచ్చే ఆహార పదార్థములను పుష్కలముగా అందించె కామితార్థ దాయిని. అన్నం పరబ్రహ్మ స్వరూపం. స్వయంగా సదాశివుడే కాశీ క్షేత్రంలో అమ్మ వద్ద భిక్షను ప్రతిరోజూ తీసుకుంటాడని పురాణలు చెబుతున్నాయి. ఆది శంకరుల వారు తన గురువైన మండన మిశ్రుని వద్దే కాక గురుపత్ని అయిన ఉభయ భారతీదేవి వద్ద కూడా విద్యను నేర్చుకున్నాడు. ఆ తల్లి తన పట్ల చూపిన ఆదరణకు కృతజ్ఞతతో అన్నపూర్ణాష్టకం రచించారు.

దీక్షితులవారి సాహిత్యంలో అమ్మ వైభవాన్ని ఎన్నో కోణాలలో అద్భుతమైన సాహితీ సంపదతో ఆధ్యాత్మిక సుగంధంతో తెలియజేశారు. ఆయనలోని దైవశక్తి ఆయన కీర్తనలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఓంకార రూపిణి, పురాణి, త్రిపద శోభిత అని అన్నప్పుడు ఆయన ఆదిపరాశక్తిని ఏయే అనుభూతులలో ఏయే రూపాలలో దర్శించాడో అర్థమవుతుంది. నిగూఢార్థము కలిగిన పదాలు మనం అనుకుంటే రావు. పూర్తిగా ఆ దేవతా స్వరూపం ఆ కృతికర్తను అనుగ్రహించి పదాలను శక్తిపూరితం చేసి రచనలో వచ్చేలా చేస్తుంది. దీక్షితుల వారి ప్రతి కృతిలోనూ ఈ దైవానుగ్రహము, దైవబలము తేటతెల్లమవుతుంది. అందుకే ఆయన సంగీత త్రయంలో ఒక్కరైనారు. సంగీతం ద్వారా సనాతన ధర్మం పరిఢవిల్లటానికి, భారత దేశపు ఆధ్యాత్మిక శక్తి ప్రకాశించటానికి ఎంతో తోడ్పడ్డారు.

సామ రాగం అద్భుతమైన లాలిత్యము,కరుణ రసము కలిగినది. ఈ రాగంలో శాంతము లేక సౌఖ్యము లేదు, మానస సంచరరే మొదలైన మృదుభావాన్ని, పరిపూర్ణమైన ప్రశాంతతను ఒలికించే కీర్తనలు రచించ బడ్డాయి. దీక్షితులవారు అమ్మకు తనపై గల అపారమైన కరుణకు సూచికగా ఈ అన్నపూర్ణే  విశాలాక్షి కృతికి సామ రాగాన్ని ఎన్నుకొన్నారు. పాలు తేనె కలిసినట్లు భక్తిపూరితమైన సాహిత్యము, కరుణాపూరితమైన రాగలక్షణము కలిసి అమృతాన్ని కురిపించాయి.

ప్రఖ్యాత కర్ణాటక సంగీత విదుషీమణి ఎమ్మెస్ షీలా గారి గాత్రంలో ఈ కీర్తన వినండి.


3, అక్టోబర్ 2016, సోమవారం

శరన్నవరాత్రులు - గాయత్రీదేవి అలంకారం


ఈరోజు బెజవాడ కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. ఆ సందర్భంగా ఓ అరుదైన వాగ్గేయకారుడు మరియు ఆయన రచించిన గాయత్రీమాత కృతి వివరాలు మీకోసం.

గాయత్రీ దేవి మీద రచించబడిన కృతులలో ఎక్కువమటుకు మన తెలుగుజాతి మహనీయుడు ఓగిరాల వీరరాఘవ శర్మ గారు రచించినవే. భక్త జ్ఞానానందతీర్థగా సన్యాసాశ్రమంలో పిలువబడిన ఈ కృతికర్త మహా గాయత్రీ ఉపాసకులు. 1908 మార్చి 23న ఒంగోలు జిల్లా ధేనువకొండ గ్రామంలో జన్మించిన ఈయన తండ్రి వద్దే వేదవేదాంగాలు నేర్చుకున్నారు. ఈయన సంగీత గురువు హరి నాగభూషణం గారు. ఆలిండియా రేడియో ద్వారా కొన్ని వందల కచేరీలు చేశారు. రచనలు చేయటంతో పాటు ఆయన రాగాలను కూడా సృష్టించారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రస్ఫుటించే ఆయన కీర్తనలు దేవీ గానసుధ అనే పుస్తక రూపంలో ప్రచురించబడ్డాయి. గాయత్రీ మాతపై రచనలు చేసిన మొట్టమొదటి వాగ్గేయకారులు ఈయనే. తరువాత మైసూరు మహారాజావారు ఒక రచన చేశారు. సన్యాసాశ్రమానికి పూర్వం 'రాఘవ ' అనే ముద్రను, అటుతరువాత 'జ్ఞానానంద తీర్థ ' అనే ముద్రను ఆయన ఉపయోగించారు. ఆయన కుమారుడు ఓగిరాల రామకృష్ణగారు, కుమార్తెలు విమల-లలిత కూడా సంగీత ప్రవీణులు. ఈయన కొవ్వూరులో గాయత్రీ పంచాయతన పీఠం ఏర్పాటు చేశారు.1989లో ఆయన సిద్ధి పొందారు. ఆయన రచించిన శ్రీ గాయత్రీ దేవి సనాతని అనే కృతి వలజి రాగంలో మీకోసం. దీనిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.

శ్రీ గాయత్రీ దేవీ సనాతని సేవక జన సుశ్రేయోదాయిని

వాగధిపతి సురేంద్ర పూజితే వరదాయకి పంచరదనే సువాసిని

రాగద్వేష రహితాంతరంగ హితే రత్నఖచిత మణిహార మండితే
రసయుత సంగీత మోదితే రాఘవాది భక్త రక్షణ చరితే


2, అక్టోబర్ 2016, ఆదివారం

శరన్నవరాత్రులు - బాలాత్రిపురసుందరి అలంకారం


ఈరోజు బెజవాడ కనకదుర్గమ్మ బాలాత్రిపుర సుందరి అలంకారం కదా. ముత్తుస్వామి దీక్షితుల వారి బాలాంబిక కృతి ఒకటి విన్నాను. అద్భుతమైన సాహిత్యం. ఆదిపరాశక్తి తత్త్వమంతా ఈ కృతిలో నిబిడీకృతమై ఉంది. కేజే యేసుదాస్ గారి గాత్రంలో దీనిని వినవచ్చు.

భజరే రే చిత్త బాలాంబికాం భక్త కల్ప లతికాం

నిజరూప దాన దక్ష చరణాం
అరుణాం నిత్యాం కళ్యాణీం శర్వాణీం

శ్రీ వాగ్భవ కూట జాత చతుర్వేద స్వరూపిణీం
శృంగార కామ రజోద్భవ సకల విశ్వ వ్యాపినీం
దేవీం శక్తి బీజోద్భవ మాతృకార్ణ శరీరిణీం
దేవనుత భవ రోగ హర వైద్య పతి హృదయ విహారిణీం
భావ రాగ తాళ మోదినీం భక్తాభీష్ట ప్రదాయినీం
సేవక జన పాలినీం గురుగుహ రూప ముత్తు కుమార జననీం