29, ఆగస్టు 2020, శనివారం

వినరాదా నా మనవి - త్యాగరాజస్వామి వారి క్షేత్ర కృతి


వినరాదా నా మనవి!

కనకాంగ! కావేటి రంగ! శ్రీకాంత! కాంతలెల్ల కామించి పిలచితే!

తేజినెక్కి బాగ తెరువున రాగ! రాజసతులు చూచి రమ్మని పిలచితే!

భాగధేయ వైభోగ రంగ! శ్రీత్యాగరాజనుత! తరుణులు పిలచితే!

ఓ శ్రీరంగనాథా! నా మనవి వినరాదా! బంగారు మేని ఛాయగల కావేటి రంగా! లక్ష్మీపతీ! కాంతలందరూ నిన్ను కోరి పిలీచితే వినరాదా! అశ్వమునెక్కి చక్కని రాజమార్గమున రాగా, రాజసతులు నిన్ను జూచి రమ్మని పిలచితే వినరాదా! భాగ్యవంతుడవై ఎన్నో వైభోగములు కలిగిన, శివునిచే నుతించబడిన ఓ శ్రీరంగనాథా! స్త్రీలందరు నిన్ను పిలుచుతున్నారు, వినరాదా!

త్యాగరాజస్వామి కావేరీ తీరంలో ఉన్న తిరువాయూరులో నివసించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన కూడా దీక్షితులవారి లాగానే అనేక క్షేత్రాలను దర్శించారు. అందులో కావేటి రంగనాథుని అనేక మార్లు దర్శించుకుని నుతించారు. ఆ సందర్భంగా ఆయన రచించిన ఒక క్షేత్ర కృతి దేవగాంధారి రాగంలో కూర్చబడిన ఈ వినరాద నా మనవి. దేవగాంధారి రాగం శరణాగతికి, భక్తికి, విన్నవించుకునే భావానికి ప్రతీక. త్యాగరాజస్వామి ఈ కృతిలో రంగనాథుని మధురభక్తిలో ఓలలాడుతున్న స్త్రీల మనోభావనలను ఆవిష్కరించారు. గోదా స్వామి మధురభక్తిలో తరించి ఆ స్వామిలో జీవైక్యం చెందిన సంగతి తిరుప్పావై మొదలైన గ్రంథముల ద్వారా మనకు తెలిసిందే. ఆ మార్గంలోనే ఎందరో స్త్రీలు కావేటి రంగనాథుని కొలిచి ముక్తిని పొందారు. ఈ కీర్తనలో వర్ణించినట్లుగానే శ్రీరంగంలోని రంగనాథుని వైభవం ఉంటుంది. ఆ స్వామి ఊరేగింపులు, సేవలు, భోగములు, అక్కడి వాతావరణం మధురభక్తికి అనుక్షణం అద్దం పడతాయి. త్యాగరాజస్వామి రచనలలో ఆయన ఆధ్యాత్మిక సోపానం, జీవితంలో వేర్వేరు దశలలోని ఆయన మానసిక పరిస్థితిని ఆవిష్కరిస్తాయి. ఈ కీర్తన ఆయన మధురభక్తిని ఆస్వాదించి అనుభూతి చెంది రచించిన ఆయన యుక్త వయసును సూచిస్తుంది. తరువాత ఆయన త్యాగం, శరణాగతి, భక్తి భావనలతో అంతర్ముఖులై మరింత విశిష్టమైన కృతులను రచించారు. ఈ కృతిని ప్రియా సోదరీమణులు గానం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి