16, ఏప్రిల్ 2017, ఆదివారం

పాడనా తెనుగు పాట - కృష్ణశాస్త్రి చిక్కని తేనెల ఊట


తెలుగు - అమ్మ నేర్పిన భాష, శతాబ్దాల నుండి ప్రవహిస్తున్న జీవనది. మాతృభాష అనగానే తెలియని ఉత్సాహం. చక్కని తెలుగు వినపడితే మనసు ఉరకలెత్తుతుంది. భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంటే సమయమే తెలియదు. భాషలోని పద సంపద గమనిస్తుంటే లోకమే పట్టదు. తెలుగుదనం, తెలుగు నుడికారం, తెలుగు రుచి అనే ఝరులలో తేలియాడుతుంటే అమ్మ ఒడిలో నిదురుపోయినంత సాంత్వన.

తెలుగుదనం అనగానే దేవులపల్లి వారు గుర్తుకొస్తారు. తేట తేనె లాంటి తెలుగు పదాలతో ఎన్నో అద్భుతమైన గీతాలను ఆయన రచించారు. 1976లో విడుదలైన అమెరికా అమ్మాయి చిత్రానికి నేపథ్యం - విదేశీ వనిత భారతీయుడిని వివాహం చేసుకొని, భారత దేశానికి వచ్చి, భాష కళలు నేర్చుకుని, భారతీయతను పరిపూర్ణంగా తెలుసుకోవటం, అత్త మామలకు కనువిప్పు కలిగించటం. ఆ వనిత తీయని తెలుగు భాష అంటే మక్కువ పడి నేర్చుకొని పాడిన పాట ఇది. భారతీయులుగా ఉంటూ మన భాషను విస్మరిస్తున్న నేటి యువతరానికి, తల్లిదండ్రులకు ఈ చిత్రం ఓ పెద్ద కనువిప్పు.

ఈ చిత్ర కథా నాయిక ఆన్నిక్ చేమొట్టి ఫ్రెంచ్ వనిత. భారతీయ కళలపట్ల ఆకర్షితురాలై భారత దేశం వచ్చి భరతనాట్యం నేర్చుకొని, దేవయానిగా పేరు మార్చుకొని మన నాట్యశాస్త్రంలో ఎందరికో శిక్షణనిస్తున్నారు. ఆమె భారత్-ఫ్రెంచ్ కల్చరల్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమానికి సారథ్యం కూడా వహించారు. భారత దేశంలోనే స్థిరపడి మన కళను ఆరాధిస్తున్న ఆమె సేవలకు గుర్తింపుగా ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు ప్రదానం చేసింది.

దేవులపల్లి వారు ఇటువంటి మంచి నేపథ్యం, కథ ఉన్న చిత్రానికి అద్భుతమైన తెలుగుతల్లి వైభవాన్ని చాటే గీతాన్ని అందించారు. ఈ గీతంలో దేవులపల్లి వారి సాహిత్య సౌరభాలు తెలుగుదనపు సౌందర్యంతో మేళవించబడ్డాయి. గుళ్లో గంటలు, గోదావరి గలగలలు, మావులు, తోపులు, మోపులు, పైరగాలులలో మంచి ముత్యాల హారంలా, మధురమైన అమృతరసాల తోట తెలుగు పాట. అటువంటి పాటను పాడే అవకాశం పొందిన ఆ విదేశీ వనిత మనోభావాన్ని కృష్ణశాస్త్రిగారు ముగ్ధమనోహరంగా అవిష్కరించారు. తెలుగుదనానికి ప్రతీకలైన వారు మహా వాగ్గేయకారులు త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు. వీరి నోట మధురంగా వినబడినది, అన్ని నాడులలో చైతన్యం కలిగించేది, వాడవాడల హృదయాల కరగించే తీయని మాటల మూట, తేనెలూరించే తెలుగు పాట. మన తెలుగుదనాన్ని ప్రతిబింబించే మరో ముఖ్యమైన అంశం అప్పుడే వివాహమైన తెలుగు వనిత.  మేనిపై చక్కనైన చీర, కాటుక కళ్లు, మెడలో తాళిబొట్టు, కాళ్లకు పారాణి, నొసట మెరిసే కుంకుమ, కాళ్లకు ఘల్లు ఘల్లుమనే అందెలు, అలా అలా నడచి వచ్చే తెలుగు పడుచు గురించి తెలిపేది తెలుగు నాట ప్రతి చోట పాడబడినది తెలుగు పాట. అద్భుతమైన తెలుగుదనాన్ని ఆకళింపు చేసుకొని, ఆస్వాదించి దానికి అక్షర రూపం కలిగించి పాడింది ఆ విదేశీ వనిత.  గీత సాహిత్యం:

పాడనా తెనుగు పాట
పరవశనై మీ ఎదుట మీ పాట
కోవెల గంటల గణ గణలో
గోదావరి తరగల గలగలలో
మావుల తోపుల మోపులపైన
మసలే గాలుల గుసగుస లో
మంచి ముత్యాల పేట
మధురామృతాల తేట

త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది
నాడునాడుల కదిలించేది
వాడ వాడల కరిగించేది
చక్కెర మాటల మూట
చిక్కని తేనెల ఊట

ఒళ్లంత వయ్యారి కోక
కళ్లకు కాటుక రేఖ
మెళ్లో తాళి కాళ్లకు పారాణి
మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు
అల్లనల్లన నడయాడే
తెనుగు తల్లి పెట్టని కోట
తెలుగు నాట ప్రతి చోట

ఒక కొత్త సంస్కృతిని మన జీవితంలోకి ఆహ్వానించాలంటే ఆ సంస్కృతి మన హృదయాన్ని ఎక్కడో తాకి, అందులో మనం ఇదివరకెన్నడూ అనుభవించని ఆనందం పొంది, మనకు తెలియని ప్రశ్నలకు సమాధానం అంది, మనలను మరింత దృఢచిత్తులను, శాంతమనస్కులను చేయగలిగి ఉండాలి. పాశ్చాత్య సంస్కృతి పట్ల భారతీయులు ఆకర్షితులు కావటానికి ప్రధాన కారణాలు అటువంటివి కావు. మన సంస్కృతి పేరుతో సమాజంలో ఉన్న దురాచారాలను, వివక్షను సహించలేని మనుషులు తాత్కాలిక ఉపశమనం కోసం పాశ్చాత్యానికి అలవాటు పడ్డారు. ఏమిటి అందులో ఉన్నది? ఎవరూ ప్రశ్నించలేని, ఏ కట్టుబాటూ లేని స్వేచ్ఛ. స్వేచ్ఛ మనిషికి కావాలి, కాని అది మనలను బలహీనులను చేసి ఏ సమస్యనూ పరిష్కరించుకోలేని పరిస్థితికి తీసుకు వెళ్లకూడదు. పాశ్చాత్యంలో ఉన్న జాడ్యం అదే. మన సంస్కృతిలోకి వచ్చిన వివక్ష, దురాచారాలను దూరం చేయటానికి పాటుపడకుండా పరధర్మాన్ని ఆశ్రయించటం వలన నేటి భారత యువతీయువకులలో భారతీయత అనేది చాలా మటుకు లేకుండా పోయింది. దాని ఫలితం? తెలుగుదనం వంటి మధుర ఫలాల రుచిని వారు ఆస్వాదించలేకున్నారు.


భాషకు పట్టు సంస్కృతి. సంస్కృతిని సంస్కరించుకుంటే అది పదికాలాల పాటు నిలుస్తుంది. అప్పుడు భాష కూడ నిలుస్తుంది. తెలుగుదనాన్ని వదిలివేసి మనం పరధర్మాల పంచన బానిస బతుకులు బతుకుతుంటే ఓ విదేశీ వనిత ఈ తెలుగుదనం, సంస్కృతిలోని గొప్పతనాన్ని గుర్తించి, దానిలో తనివితీరా ఆనందించి పాడిన గీతం ఈ పాడనా తెనుగు పాట. అటువంటి గీతాన్ని కృష్ణశాస్త్రి గారి కన్నా ఇంకెవరు బాగా రాయగలరు? అందుకే చిత్రదర్శకులు ఆయనను ఎన్నుకున్నారు. భాష యొక్క గొప్పతనం మంచి ప్రాసతో, మంగళకరమైన ధ్వనులతో చెవులకింపుగా ఉండటమే కాదు, బంధాలను సృష్టించి, వాటిని దృఢపరచి, మనుషులను ఏకం చేయగలగటం. అదే తెలుగుదనంలో ఉన్న గొప్పతనం కూడా. శతాబ్దాల పాటు మనుషులను ఏకం చేసి ఓ పటిష్టమైన, వినూత్నమైన, విలక్షణమైన సాంప్రదాయన్ని, సంస్కృతిని భరతభూమిపై నెలకొల్పింది. ఇంతటి మహత్తరమైన భాషను మనం దేని కొరకు కూడా వదులుకోవాల్సిన పనిలేదు. వృత్తి-భాషా సంస్కృతి రెండు పట్టాలవంటివి. ఒకటి ఉపాధినిస్తే రెండవది శాశ్వతమైన ఆనందాన్ని, మనదైన సంస్కృతిలో ఓ చిరునామాను ఇస్తుంది. రెండూ చాలా ముఖ్యం. అందుకే వృత్తిలో అభ్యున్నతి కోసం భాషా సంస్కృతిని మనం వదులుకోకూడదు. వదులుకుంటే జీవితంలో చాలా గొప్ప విషయాన్ని కోల్పోయి వైకల్యముతో దారితప్పినట్లే.


కృష్ణశాస్త్రి గారి తెలుగు భాషా ప్రావీణ్యంతో వెన్నలాంటి తెలుగుపదాలు, పాలు-తేనె కలబోసి ఆస్వాదించిన రీతిలో మన హృదయాలను తాకుతాయి. ఈ పాటలోని ప్రతి అక్షరం అలాంటిదే. తెలుగు నుడికారాన్ని, అందులోని నయగారాన్ని దేవులపల్లి వారి పాటలో మనం అణువణువునా అనుభూతి చెందవచ్చు. తెలుగుదనానికి మన గ్రామీణ వాతావరణానికి అవినాభావ సంబంధం ఉంది. పచ్చని పొలాలు, కష్టపడి పని చేసి మనకు ఆహార ధాన్యాలను అందించే కృషీవలులు, ఉరకలెత్తే గోదారమ్మ, ఆ తల్లితో అనుసంధానమైన జీవితాలు, మళ్లు-చేలు-మోపులు తెలుగుదనానికి ఆయువు పట్లు. అందుకే ఆ జీవనాన్ని కృష్ణశాస్త్రి గారు మొదటి చరణంలో తెలుగుదనంతో మేళవించారు. వాగ్గేయకారులు ఆధ్యాత్మిక సంపదతో పాటు ఆనాటి పరిస్థితులను, జీవనశైలిని, ప్రజల భాషను కూడా ప్రతిబింబించేదిగా మనకు సాహిత్య సంపదగా అందించారు. వారి సాహిత్యంలోని తెలుగుదనం ఈ భాషా ప్రవాహంలోని నాటి నీటి తేటలను తెలియజేస్తుంది. ఆ సాహిత్యం ప్రజల హృదయాలను తాకి, పాషాణమైన హృదయాలను కరగిస్తుంది. ప్రజలను ఏకం చేస్తుంది. అందుకే రెండవ చరణంలో వాగ్గేయకారుల తెలుగుదనాన్ని ప్రస్తావించారు. తాళి,కట్టు-బొట్టు, సింగారం కేవలం ఆకర్షణ కొరకు అనుకుంటే చాలా పొరపాటు. శాస్త్రీయత, దివ్యత్వం కూడినవి అవి. అలాగే గౌరవభావాన్ని పెంచేవి. అందుకే ఒక చరణాన్ని పూర్తిగా వాటి కొరకు కేటాయించారు దేవులపల్లి వారు.

ఆన్నిక్ చేమొట్టి (దేవయాని) పట్టు చీరకట్టి,  సిగలో పూలు  చుట్టి,  ,నల్లపూసలు ధరించి, నుదుటన బొట్టు పెట్టి చక్కని తేనెలొలికించే తెనుగు పాటను ఆలపించటాన్ని ఈ గీతంలో చిత్రీకరించారు. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వపు ప్రతిభ ఈ చిత్రంలో మనకు  ప్రతి షాట్‌లోనూ ప్రతిబింబిస్తుంది. తెలుగుదనానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత, సంభాషణలు, సంగీతము, సాహిత్యానికి ఇచ్చిన ప్రాధాన్యత ఈ చిత్రాన్ని ఓ అద్భుత దృశ్యకావ్యంగా మలచింది.  నేటి తరం తప్పకుండా విని అర్థం చేసుకోవలసిన గీతం ఇది. జీకే వేంకటేష్ గారి సంగీతంలో పూలపాక సుశీలమ్మ అద్భుతంగా పాడిన పాట

9, ఏప్రిల్ 2017, ఆదివారం

నిధి చాలా సుఖమా - త్యాగరాజస్వామి ఆధ్యాత్మిక ఔన్నత్యం


నిధి చాలా సుఖమా! రాముని సన్నిధి సేవ సుఖమా! నిజముగ బల్కు మనసా!

దధి నవనీత క్షీరములు రుచో! 
దాశరథి ధ్యాన భజన సుధారసము రుచో!

శమ దమమను గంగా స్నానము సుఖమా! 
కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా!
మమత బంధన యుత నర స్తుతి సుఖమా!
సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమా!

ఈ ప్రపంచంలో ధన కనక వస్తు వాహనాదుల పట్ల మమకారం లేకుండా ఉండటం చాలా కష్టం. ముఖ్యంగా నేటి కాలంలో కనీస అవసరాలకు పరిమితి ఓ అస్థిరమైన లక్ష్యంగా మారింది. కానీ, ప్రతి మనిషి కూడా ఆత్మావలోకనం చేసుకోవలసిన సమయం ఇది. ఎందుకంటే, ప్రాణం విడిచేటప్పుడు మనతో రాని వాటిపై విషయలోలుడైన మనిషి స్వార్థంతో అకృత్యాలకు పాల్పడుతున్నాడు, కావలసిన దానికన్నా సంపాదించుదామన్న తపనలో మానవత్వం కోల్పోతున్నాడు. ఈ పరుగులో కుటుంబం, తన ఆనందం, బాధ్యతలను విస్మరిస్తున్నాడు. అలాంటప్పుడే మన వాఙ్మయం మనకు ఉపయోగపడేది. త్యాగరాజస్వామి వారు తన కీర్తనలలో శాశ్వతమైన వాటిని వదిలి అశాశ్వతమైన వాటి వెంట పడటం ఎందుకు అన్న సందేశాన్ని ఎంతో చక్కగా తెలియజేశారు. మనలను ప్రశ్నిస్తూనే మార్గాన్ని మనకు తెలియజేశారు. అలాగని త్యాగరాజస్వామి వారిలా అన్నీ త్యజించటం ఈ కాలంలో అసంభవం. కానీ, ఒక సమతుల్యత తప్పకుండా సాధ్యమే. ఆ సమతుల్యత ఉన్నపుడు స్వార్థం కూడా అదుపులో ఉంటుంది. అందుకే, ఆయన కీర్తనల సారం ఇప్పటి సమాజానికి కూడా పూర్తిగా సముచితమైనది.

నిధి చాలా సుఖమా అన్న కీర్తన సామాన్య మానవులమైన మనకు ఆచరణకు సాధ్యం కాని తత్త్వంలా కనిపిస్తుంది. రాముడిని నమ్ముకుంటే ఏమి మిగులుతుంది, సంసారం ఎలా నడుస్తుంది? ఇది ఈనాటి చదువుకున్న వారి ప్రశ్న. ఈ తత్త్వం నేటి కాలానికి వర్తించదు అని వారికి అనిపిస్తుంది. కానీ, దానిలోని అంతరార్థం తెలుసుకుంటే త్యాగరాజస్వామి ఎందుకు చెప్పారో అవగతమవుతుంది.

1. ధనకాంక్షకు ఓ పరిమితి ఉండదు. ఇంత వస్తే మరింత కావాలి అన్నది మానవుని నైజం. ఇది ఓ విషవలయం. దానిని ఛేదించాలంటే కావలసింది దానిపట్ల మమకారం లేకుండా ధర్మబద్ధంగా సంపాదించటం. దానిని మదుపు చేసి గుణీకృతం చేసుకోవచ్చు. అలా చేస్తూనే, మనకు శాశ్వతమైన దాని గురించి ఆలోచించి తీరాలి. రాముని సన్నిధిలో ఉన్న సుఖం ఆ స్థిర లక్ష్యం కాని ధనార్జనలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఎప్పుడైతే కోరికలు గుర్రాలవుతాయో మనసుకు అశాంతి కలుగుతుంది. అశాంతి మనిషిని మానవత్వం మరచి పక్కదారులు త్రొక్కేలా చేస్తుంది. ఈ విషవిలయంలో కష్టాలు కలిగినప్పుడు మాత్రమే మనిషికి భగవంతుడు గుర్తుకు వస్తాడు. అలా కాకుండా భగవద్భక్తితో, శరణాగతితో మన ఆలోచలనను నియత్రించుకోవచ్చు. ఆ నియంత్రణ వలన అశాంతి తొలగి మనిషి స్థిరమైన, శ్రేయస్కరమైన, ఆత్మోన్నతి కలిగించే నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకే దైవసన్నిధి సుఖవంతమైనది. దీనిని అర్థవంతంగా, ప్రభావవంతంగా తెలుపటానికి త్యాగయ్య పెరుగు, వెన్న, పాలు మొదలైన వాని యొక్క అశాశ్వతమైన రుచి-రాముని ధ్యానము, భజన అనే అమృత రసముల శాశ్వతమైన రుచిని ప్రస్తావించారు.

2. స్వార్థం పేట్రేగిన మనిషి తన అవసరాల కోసం మనుషులను పొగడ్తలలో ముంచెత్తుతాడు. దీని ఫలితం తాత్కాలికమే. వ్యక్తిత్వం ఆధారంగా కాకుండా అవసరం ఆధారంగా కలిగే పరిచయాలు, బంధాలు నిలువవు. తద్వారా మనిషి పతనానికి లోనవుతాడు. ఈ నరస్తుతి ఒకరకమైన ఆత్మ వంచనే. అభిప్రాయాలు, అవసరాలను బట్టి ముఖప్రీతి మాటలు చెప్పి, వారి వెనుక దూషించే వ్యక్తిత్వాలు నిరంతరం తెలియని అసంతులనలో ఉంటాయి. దానివలన మనిషి శాశ్వతమైన దానికి దూరమై అశాశ్వతమైన వాటి వెంటే పడతాడు. ఎదురుదెబ్బ తగలగానే భగవంతుడు గుర్తుకు వస్తాడు. విషయ లంపటాలను నుండి భగవంతుని వైపు మళ్లే సమయం కష్టాలు వచ్చినప్పుడే. అన్నీ బాగున్నప్పుడు ఆ భగవంతుని ఆర్తితో ప్రార్థించే వారు బహు అరుదు. త్యాగరాజ స్వామి ఈ విషయ లంపటాలతో కూడిన నరస్తుతి మరియు పవిత్రమైన భగవంతుని నుతి మధ్య తేడా తెలియజేయటానికి అద్భుతమైన ఉపమానం చెప్పారు. ఆధ్యాత్మిక సోపానానికి ముఖ్యమైన శమ దమాదులనే సద్గుణాల గంగానదిలో స్నానము సుఖమా లేక మురికి మయమైన దుర్విషయములనే బావిలో స్నానము సుఖమా అన్నారు.

వాగ్గేయకారుల ఔన్నత్యం సందేశాన్ని తెలియజేస్తూనే దానిని మన నిత్యజీవితంలో సుస్ఫష్టంగా ప్రతిబింబింపజేయటం. మన దేహానికి నచ్చేవి, ఆనందాన్ని ఇచ్చేవి, నచ్చనివి, దుఃఖాన్ని కలిగించే వాటికి పూర్తిగా భిన్నమై శాశ్వతమై, సచ్చిదానందకరమైన ఆత్మకు సంబంధించిన విషయాల మధ్య భేదాన్ని ఈ నిధి చాలా సుఖమా అన్న కీర్తన ద్వారా త్యాగరాజస్వామి మనకు అద్భుతంగా తెలియజేశారు. ఆయన కూడా మనలాంటి మనిషేనండోయ్. కాకపోతే, కఠోరమైన సాధన ద్వారా, జీవితంలో నేర్చుకున్న పాఠాల ద్వారా మమకారపు బంధనాల నుండి విముక్తుడై తన కీర్తనలలో ఆ శాశ్వతానందపు మాధుర్యాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. అందుకే ఆయన మహానుభావుడైనాడు.

ఇక కృతి నేపథ్యానికి వస్తే, త్యాగరాజస్వామి కుటుంబం పేద కుటుంబం. అపర రామభక్తుడైన త్యాగయ్య ఆ రామనామామృతంలో రమించగా వికసించినవి ఆయన కృతిసుమాలు. ఆ కీర్తనల మాధుర్యం తెలిసిన తంజావూరు ప్రభువు త్యాగయ్య ఆయనకు కానుకలు పంపి రాజాస్థానంలో సంగీత విద్వాంసునిగా చేరవలసిందిగా లేఖ రాస్తాడు. ఆ సందర్భంగా తనకు గురువుల అనుగ్రహంగా, రాముని కృప వలన కలిగిన సంగీత సంపదను రామునికే తప్ప నరస్తుతి కోసం వినియోగించనని త్యాగయ్య ఆ కానుకలను తిరస్కరిస్తాడు. ఆ సందర్భంలో ఈ కృతి ఆయన నోట వెలువడుతుంది. పూర్తిగా మమకారం లేని వ్యక్తిత్వం ఉంటేనే అటువంటి విలువైన, అందులోను తన పేదరికాన్ని తొలగించే కానుకలను తిరస్కరించగలడు మానవుడు. త్యాగయ్యకు జీవితంలో మానవులను స్తుతిస్తూ పేరు ప్రాపులు పొంది భోగ భాగ్యాలు అనుభవించటం అశాశ్వతం అని తెలుసు. అందుకే, ఉంఛవృత్తిలో తన పొట్టు నింపుకొని మిగిలిన వాటిని తృణప్రాయంగా పక్కకుపెట్టి తన కీర్తనలను రామునికే అంకితం చేశాడు, తన నాదోపాసనను ఆ పరబ్రహ్మకు ధారపోశాడు.

ఈ సందర్భంగా మనం ఒక్క విషయాన్ని చెప్పుకోవాలి. వాగ్గేయకారులలో కూడా అనేక రకాలు. ఎందరో రాజాస్థానాలను ఆశ్రయించి వారి పేరులను ప్రస్తావించే కృతులను రచించి జీవితంలో ధన కనక వస్తు వాహనాదులు, రాచమర్యాదలను పొందిన వారున్నారు. కొంతమంది మాత్రం దీనికి భిన్నంగా పూర్తిగా వాటిని త్యజించి ఆ భావనతోనే కీర్తనలను రచించారు. అందుకే వారి కృతులు ఈ అశాశ్వతమైన వాటి మీద ఏ మాత్రం అనురాగాన్ని కనబరచవు. అటువంటి వారిలో త్యాగరాజస్వామి అగ్రగణ్యులు. అందుకే వారి కృతులలో ఆధ్యాత్మిక పరిమళాలు మిగిలిన వారి కృతుల కన్నా ఎన్నో మెట్ల పైస్థాయిలో ఉంటాయి. ఆయన కృతులు చిరకాలం నిలిచి ఎప్పటికీ మానవాళికి మార్గదర్శకమవుతాయి. ఇటువంటి వెలకట్టలేని ఆధ్యాత్మిక సంపదను మనకు వారసత్వంగా ఇచ్చిన సద్గురువులు త్యాగరాజస్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు.

నిధి చాలా సుఖమా కళ్యాణి రాగంలో కూర్చబడింది. ఈ కీర్తన నేపథ్యం, దానిలోని మాధుర్యం బాపు-రమణలు నిర్మించిన త్యాగయ్య సినిమలో అద్భుతంగా చిత్రీకరించారు. మొత్తం కీర్తనను చిత్రంలో పొందుపరచలేదు, కానీ సందేశం మాత్రం చక్కగా తెలియజేశారు. ఆ సన్నివేశం లింక్. అలాగే, ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారు దీనిని అద్భుతంగా రాగయుక్తంగా గానం చేశారు. రెండూ విని తరించండి. 

4, ఏప్రిల్ 2017, మంగళవారం

సీతారాముల కళ్యాణం - రామా కనవేమిరా


శ్రీరామ నవమి రేపే. లోకాభిరాముడు శ్రీరామచంద్రమూర్తి అవతరించిన పవిత్రమైన తిథి. లోకకళ్యాణార్థం ఈ రోజు సీతారాముల కళ్యాణం జరపటం అనాదిగా మనకు ఉన్న సాంప్రదాయం. సీతారాముల కళ్యాణం గురించి వాల్మీకి రామాయణంలో విశదంగా, మనోజ్ఞంగా తెలిపారు. విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులతో కూడి మిథిలకు చేరుకునే ఘట్టం నుండి, నలుగు కుమారులు, కోడళ్లతో దశరథ మహారాజు మరియు రాణులు అయోధ్య చేరుకునేంత వరకూ రమణీయమే.

ఈ సీతారామ కళ్యాణం ప్రధాన ఇతివృత్తంగా ఎన్నో చలన చిత్రాలు వచ్చాయి. అన్నీ మంచి విజయాలు సాధించాయి. ఎన్నో మనోజ్ఞమైన గీతాలను అందించాయి. శ్రీశ్రీగారి వాగ్దానం చిత్రంలోని (1961) గీతం శ్రీనగజా తనయం అన్నది హరికథ రూపంలో రాగా, అలాంటి గీతమే పాతికేళ్ల తరువాత 1986లో విడుదలైన స్వాతిముత్యం చిత్రంలో ఆత్రేయగారి కలంలో రామా కనవేమిరా అన్న గీతంగా వచ్చింది. దీనికి కూడా హరికథా నేపథ్యమే. కాకపోతే ఈ స్వాతిముత్యం గీతంలో సీతారామ కళ్యాణంతో పాటు భర్తను కోల్పోయిన నాయిక మరియు అమాయకుడైన నాయకుల వివాహం కూడా చిత్రీకరించబడింది. ఒక ఉదాత్తమైన సన్నివేశం ఇది. గీతంలోని భావం, సన్నివేశం, ప్రధాన పాత్రధారుల నటన నభూతో నభవిష్యతి. ఆ సందర్భానికి ఆత్రేయ గారు అద్భుతమైన గీతాన్ని అందించారు. తెలుగుదనం ఉట్టి పడే ఈ గీతం ద్వారా ఆ సీతారామ కళ్యాణ హరికథకు ప్రాణం పోశారు. ధర్మమూర్తి అయిన రామచంద్రుడు సభాసదుల మధ్య ఉండి కూడా ఆ సభలోకి వచ్చిన జానకిని చూడటం లేదని ఆమె చెలికత్తెలు అనుకుంటున్న భావనతో ఈ రామా కనవేమిరా ఆరంభమవుతుంది.


రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా
రమణీలలామ! నవలావణ్యసీమ! ధరాపుత్రి! సుమగాత్రి నడయాడి రాగా!

సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట
జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా
శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు
రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా

ముసి ముసి నగవుల రసిక శిఖామణులు సానిదమ పమగరిస
ఒస పరి చూపుల అసదృశ విక్రములు సగరిగ మనిదమని
ముసి ముసి నగవుల రసిక శిఖామణులు తాతకిట తకఝణుత
ఒస పరి చూపుల అసదృశ విక్రములు తకఝణు తకధిమితక
మీసము మీటే రోషపరాయణులు నీదమ పమాగరిగమ
మా సరి ఎవరను మత్తగుణోన్మణులు  అహా
క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై
తరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా కనవేమిరా

ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలుకక్కిన దొరలు భూవరులు
తొడగొట్టి ధనువు చేబట్టి బావురని గుండెలు జారిన విభులు అహ గుండెలు జారిన విభులు
విల్లెత్తలేక మొగమెత్తలేక సిగ్గేసిన నరపుంగవులు
తమ వొళ్ళు వొరిగి రెండు కళ్ళు తిరిగి ఒగ్గేసిన పురుషాగ్రణులు
ఎత్తేవారులేరా అ విల్లు ఎక్కుపెట్టేవారులేరా
ఆ ఎత్తేవారులేరా అ విల్లు ఎక్కుపెట్టేవారులేరా
అరెరెర్రెరె ఎత్తేవారులేరా అ విల్లు ఎక్కుపెట్టేవారులేరా
అహ ఎత్తేవారు లేరా అ విల్లు ఎక్కుపెట్టే వారు లేరా  తికతెయ్యకు తాధిమితా

రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమః
అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
సీతవంక ఓరకంట చూసినాడు సీతవంక వోరకంట చూసినాడు
ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు
ఫెళ పెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ
ఫెళ ఫెళ విరిగెను శివధనువు కళలొలికెను సీతా నవవధువు
జయ జయ రామ  రఘుకుల సోమ  జయ జయ రామ  రఘుకుల సోమ
దశరధ రామ దైత్యవిరామ  దశరధ రామ దైత్యవిరామ

సీతాకళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే
కనగ కనగ కమనీయ్యమే  అనగ అనగ రమణీయమే
సీతాకళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే

రామయ్యా అదిగోనయ్య
రమణీలలామ నవలావణ్యసీమ ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగ
రామా కనవేమిరా శ్రీరఘురామ కనవేమిరా  రామ కనవేమిరా కనవేమిరా

అర్థం:

"ఓ రఘురామా! సీతవంక చూడవేమి? నారీశిరోమణి, మనోజ్ఞమైన రూపం కలది, భూమిసుత, మృదువైన పలుకులు పలికించే సీత నడచివస్తోంది. చూడవేమి?" అని సీతాస్వయంవరం ప్రకటించిన తరువాత జనకుని కొలువులోకి జానకి ప్రవేశించే సమయంలో సీతమ్మ చెలికత్తెలు అనుకుంటున్నారట.

సీతా స్వయంవరానికై వేంచేసిన రాజులు ఎలా ఉన్నారు? తమను వరిస్తుందనే ముసి ముసి నవ్వులతో రసికులైనారట, వారంతా సుందరమైన చూపులతో అనన్యమైన పరాక్రమవంతులట. మీసాలను మెలివేసే పౌరుషవంతులట. మా సరి ఎవరని గర్వముతో పొంగిపోతున్నవారట. వారందరికీ ప్రతి క్షణం ఒక యుగంలా ఉత్కంఠతతో ఉందట. వారు ఆ సీత వంక, శివ ధనుస్సు వంక తన్మయులై కళ్లప్పగించి చూస్తున్నారట. కానీ, ఆ రాముడికి మాత్రం ఇవేవీ పట్టటం లేదుట.

ఒక్కొక్క వరుడు విల్లు ఎత్తే ప్రయత్నం చేయటం, చెమటలు పట్టి వెనుదిరగటం, ధనువు ఎత్తే ముందు తొడగెట్టే ధీరత, ఆ ధనుస్సు చేబట్టిన తరువాత  గుండెలు జారి బావురుమన్నారట ప్రభువులు. విల్లు ఎత్తలకే సిగ్గుతో తలదించుకొని ఒక్కొక్క రాజు వెళ్లిపోతున్నాడట. గొప్ప గొప్ప పురుషులు విల్లును ఎత్తే ప్రయత్నంలో తమ ఒళ్లు విరిగి, కళ్లు తిరిగి వెనక్కు వెళ్ళారట. అక్కడున్న వారంతా విల్లు ఎత్తేవారే లేరా? ఎక్కుపెట్టేవారే లేరా? అని మాట్లాడుకున్నారట.

అంతలో మన రామచంద్రుడు లేచి గురువులకు నమస్కరించి, ఆ శివధనుసుపై చేయి ఉంచాడట. సీతవంక ఓరకంటితో చూసి చిటికెలో ఆ విల్లును ఎక్కుపెట్టాడట. ఆ ధనుస్సు ఫెళ ఫెళ విరిగిందట, కొత్తకళలొలికిస్తూ సీతమ్మ నవ వధువైందట. ఇంకేముంది? సభ అంతా రఘుకుల చంద్రుడు, రాక్షస సంహారుడు అయిన శ్రీరాముని జయము జయము అని పలికిందట. సీతమ్మ తలదించుకొని వచ్చి ఆ రాముని మెడలో వరమాల వేసిందట. ఆ సీతారాముల కళ్యాణము ఎంత చూచినా కమనీయమే. ఎంత చెప్పుకున్నా రమణీయమే.



వివరణ:

ఇక్కడ చలనచిత్ర దర్శకుల ఔన్నత్యం గురించి చెప్పుకోవాలి. సీతారామ కళ్యాణ ఘట్టం, దానిని వర్ణించే హరికథలో నాయికా నాయకుల మధ్య ఆశ్చర్యకరంగా జరిగే మూడుముళ్ల తంతును హిందూ వివాహము యొక్క పవిత్రత ఏ మాత్రం దెబ్బతినకుండా చిత్రీకరించటం విశ్వనాథ్ గారి గొప్పతనం. భర్తను కోల్పోయిన స్త్రీ బిడ్డను పెంచుకుంటూ ఉండటం గమనించిన నాయకుడు ఆ హరికథ వింటూ ఆమెను వివాహము చేసుకోవాలని తలచి అప్పటికప్పుడు సీతారామ కళ్యాణ మంటపంలో ఉన్న తాళిని తీసి ఆమెకు కట్టి ఆమె నుదుటన కుంకుమ పెట్టి అర్థాంగిగా స్వీకరిస్తాడు. ముందు సీతారామ కళ్యాణ హరికథ సన్నివేశం పెట్టకపోతే ఆ నాయకునికి అటువంటి తలపు వచ్చేది కాదు. ఎందుకంటే రాముని ధీరత అతనికి ముందడుగు వేయటానికి ధైర్యాన్ని ఇచ్చింది. అతని మంచితనం తెలిసినా కూడా ఆమె ఆ క్షణంలో విస్తుపోతుంది. తరువాత మనస్ఫూర్తిగా ఆ మార్పును అంగీకరించి అతనితో కలిసి జీవిస్తుంది.

రామాయణంలో సీతారాముల కళ్యాణ ఘట్టం, దానికి ముందు వెనుక సర్గలు పరిశీలిస్తే, ఈ వివాహం కూడా లోకకళ్యాణార్థమే అని స్పష్టంగా తెలుస్తుంది. నిమి వంశజులకు వరప్రసాదంగా వచ్చిన శివధనుసును దేవతలు, రాక్షసులు, యక్ష, కిన్నెర, కింపురుషులు, గంధర్వులు, మహోరగులు, మనుష్యులు ఎక్కుపెట్టలేకపోయారు. అటువంటి ధనువును ధర్మమూర్తి అయిన రామచంద్రుడు గురువులైన విశ్వామిత్రుల అనుగ్రహంతో ఎక్కుపెట్టగా అది మధ్యకు విరిగిపోతుంది. అయోనిజ, కారణజన్మురాలైన సీతమ్మను పత్నిగా స్వీకరించేందుకు అవతారపురుషుడైన రాముడే సరైనవాడు అని తెలుపటానికి శివధనుర్భంగ సన్నివేశం. ఈ ప్రపంచంలో స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా గృహస్థాశ్రమంలో ప్రవేశించటానికి ఏ విధమైన కారణాలు ఉంటాయో, కుటుంబాల గురించి ఎటువంటి వివరాలు తెలుసుకోవాలో శ్రీమద్రామాయణం మనకు విశదీకరిస్తుంది. సీతారాముల దాంపత్యము గురించి, వారి వైభవం గురించి తెలియటానికే రామనవమి నాడు వారి కళ్యాణము ఆనవాయితీగా వచ్చింది.

కళాతపస్వి కే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో కమల్ హాసన్, రాధిక నటించిన స్వాతిముత్యం చిత్రంలో ఆత్రేయగారు రచించ ఈ పాటకు ఇళయరాజా గారు సంగీతం అందించారు. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ పాటను అద్భుతంగా గానం చేశారు.

శ్రీ సీతారామాభ్యాం నమః

2, ఏప్రిల్ 2017, ఆదివారం

పలుకే బంగారమాయెనా - రామదాసు కీర్తన


పరమాత్మతో వాగ్గేయకారుల సంభాషణలు చాలా సందర్భాలలో వారి వారి మానసిక పరిస్థితిని ప్రతిబింబించేలా ఉంటాయి. విన్నపాలనుండి శరణాగతి వరకు ఎన్నెన్నో ఈ సంభాషణలలో ఉన్నాయి. రాముని నమ్ముకొని రాముని సేవకే జీవితాన్ని అంకితం చేసిన కంచెర్ల గోపన్న తన వృత్తిలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. తానీషా ప్రభువుచే కారాగారం పాలై కఠినమైన పరిస్థితులను ఎన్నుకున్నాడు. కారాగారంలోనే రామునిపై ఎన్నో సంకీర్తనలను రచించాడు. అతనికి అనన్యమైన భక్తికి, అచంచలమైన విశ్వాసానికి రాముడు కరుణించి అతనిని విముక్తుడను చేశాడు. ఆ దుర్భరమైన పరిస్థితులలో ఆయన నోట వచ్చిన కృతులలో పలుకే బంగారమేయ్నా ఒకటి. వివరాలు:

పలుకే బంగారమాయెనా కోదండ పాణి 

పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి 
కలలో నీ నామ స్మరణ మరవ చక్కని తండ్రి

ఇరువుగ నిసుకలోన బొరలిన యుడుత భక్తికి 
కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి

రాతిని నాతిగ జేసి భూతలమున ప్ర 
ఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి

ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు 
పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి

శరణాగత త్రాణ బిరుదాంకితుడవు గాద 
కరుణించు భద్రాచల వర రామదాస పోషక 

అర్థం:

ఓ కోదండరామా! నీ పలుకే కరువాయెను. పిలిచినా కూడా పలుకకున్నావు. కలలో కూడా నీ నమస్మరణను నేను మరువకున్నాను చక్కనైన నా తండ్రీ! లంకకు వారధి నిర్మాణం చేసే సమయంలో తనకు చేతనైన స్థాయిలో వినమ్రంగా ఇసుకలో పొరలి తోడ్పడిన ఆ ఉడుత భక్తికి మెచ్చి, కరుణించి బ్రోచినావని నేను బాగా విశ్వసించితిని తండ్రీ! నీ పలుకే బంగారమాయె. శిలయై యున్న అహల్యకు మరల జీవచైతన్యాన్నిచ్చి ఈ భూలోకములో పేరుపొందినావని ఇష్టపూర్వకముగా నమ్మినాను తండ్రీ! నిన్ను ఎంత వేడుకున్నా నీకు ఇంచుక కూడా దయ కలుగుట లేదు. నువ్వు పంతము చేయుటకు నేనెంతటి వాడనయ్యా! శరణాగతులను కాపాడే వాడిగా నీవు బిర్దునుపొందినావు. ఈ భద్రాచల రామదుసును పోషించే వాడవు, నన్ను కరుణించు స్వామీ!

వివరణ:

రామదాసు జీవితం మనకు ఆధ్యాత్మిక జీవితానికి ఉత్తమమైన ఉదాహరణ. ధర్మబద్ధమైన ఉపాధితో ఆధ్యాత్మిక పురోగతిలో పరమాత్మపై విశ్వాసంతో జీవితంలో వచ్చే కష్టాలను ఎలా దాటవచ్చో రామదాసు జీవితం మనకు తెలుపుతుంది. శరణాగతి, అచంచలమైన భక్తి విశ్వాసములతో అత్యంత కఠినమైన పరిస్థితులను దాటవచ్చు అని రామదాసు నిరూపించారు. ఆ ప్రయాణంలో ఆయన తన శరణాగతిని, ఆర్తిని అనేక విధాలుగా వ్యక్తపరచారు. ఈ పలుకే బంగరమాయెనా కృతిలో ప్రశ్నిస్తున్న భావన గోచరించినా, అంతర్లీనంగా చరణాలన్నిటిలోనూ ఆ రాముని మహిమలను పలుకుతూ తనను కాపడమన్న వేడుకొను భావం ప్రస్ఫుటమవుతుంది. వారధి బంధనంలో ఉడుతను బ్రోచిన ఉదంతం, వేల ఏళ్ల పాటు శిలయై నిలిచిన అహల్యకు విముక్తి కలిగించటం, ప్రస్తావించారు రామదాసు. ప్రశ్నిస్తూనే శరణు అని వేడుకోవటం వాగ్గేయకారుల విలక్షణమైన పద్ధతి. రామదాసు కూడా ఈ లక్షణాన్ని చాలా కీర్తనలలో పలికించారు.

మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు భద్రాచల రామదాసు కీర్తనలను అజరామరం చేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన పాడిన కృతులు ఇప్పటికీ తెలుగు ఇళ్లలో వినబడుతూనే ఉంటాయి. వారి గళంలో పలుకే బంగారమాయెనా వినండి