31, డిసెంబర్ 2020, గురువారం

రాజగోపాలం భజేऽహం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


ముత్తుస్వామి దీక్షితులవారి కృతులలో మన్నార్‌గూడి శ్రీవిద్యా రాజగోపాలస్వామి వారిపై రచించిన కృతి ఇది. ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు రాజగోపాలస్వామిగా వెలశాడు.  ఇక్కడి ప్రధాన దేవత రూపాలు మూలమూర్తి వాసుదేవ పెరుమాళ్, ఉత్సవమూర్తి రాజగోపాలస్వామి. ఇక్కడ అమ్మవారు హేమభుజవల్లి (సెంగమల తాయారు). దేవకీవసుదేవులకు దర్శనమిచ్చి వారికి పుత్రునిగా జన్మించినది మొదలు గోపాలకునిగా 32 లీలలు ఆ శ్రీహరివి. వాటికి ప్రతీకగానే ఇక్కడి నిత్యసేవలు. రాజగోపాలుని రూపంలో ఒకచేతి మీద కొరడా, చేత వెన్నముద్ద, తలపాగా, చేతులకు గాజులు, నడుముకు ఆభరణములు,పంచెకట్టు, మరొక చేత ఏనుగు దంతము, చుట్టూ గోవులు ఉంటాయి. కంసుడు బలరాముని చంపటానికి కువలయపీఠమనే ఏనుగును పంపగా కృష్ణుడు దానిని చంపి దంతాలను విరుస్తాడు. దానికి ప్రతీకగానే ఇక్కడి స్వామి చేత దంతము. అలాగే గోపస్త్రీల వస్త్రములు, ఆభరణములు దొంగిలించిన దానికి ప్రతీకగా ఒకచెవికి గోపస్త్రీ కుండలము ఉంటుంది. ఇక్కడ స్వామికి పాలను నివేదన చేస్తారు. వివాహ సంతానాది దోషాల నివారణకు, పశు సంవృద్ధికి, సుఖసంతోషాలకు ఈ స్వామిని పూజిస్తే ఫలితం వెంటనే ఉంటుందని నమ్మకం. ఈ దేవాలయాన్ని 10వ శతాబ్దంలో చోళులు నిర్మించగా, 16వ శతాబ్దంలో తంజావూరు నాయకరాజులు పునరుద్ధరించారు. ఇక్కడి హరిద్రానది పుష్కరిణి భారతదేశంలోనే అత్యంత విశాలమైన తీర్థంగా ఒకటిగా పేరొందింది. ఇది 23 ఎకరాల మేర ఉంది. ఉత్సవమూర్తి అయిన రాజగోపాలస్వామి రుక్మిణీ సత్యభామల సహితుడై కొలువబడతాడు. ఈ క్షేత్ర వృక్షం పారిజాత వృక్షం. ఈ వివరాలలో కొన్నిటిని దీక్షితులవారు ఈ కృతిలో ప్రస్తావించారు. 

సాహిత్యం
=======

రాజగోపాలం భజేऽహం రమాలీలం

తేజోమయ మోహనకరం దివ్యాంబరాది ధరం
గజరాజ పూజిత పదం గుణిజన నత గోవిందం

నారదాది కృత భజనం నాదలయయుత సదనం
హరిద్రానదీ తీరం హత్యాది పాప హరం
పారిజాత తరుమూలం పంకజ నయన విశాలం
గురుగుహనుత వనమాలం గోపీజనమాలోలం

భావం
=====

లక్ష్మీదేవితో లీలలను చేసే రాజగోపాలస్వామిని నేను భజిస్తున్నాను. తేజోమయ రూపముతో మోహింపజేసేవాడు, దివ్యమైన వస్త్రములు, ఆభరణములు ధరించేవాడు, గజేంద్రునిచే పూజించబడిన పదములు కలవాడు, శ్రేష్ఠులచే నుతించబడిన గోవిందుడు, రాజగోపాలుని నేను భజిస్తున్నాను. నారదాది మునులచే భజించబడేవాడు, నాదలయయుతమైన సంగీతంలో నివసించేవాడు, హరిద్రానదీ తీర్థ సమీపంలో వెలసినవాడు, హత్య మొదలైన పాపములను హరించేవాడు, పారిజాతవృక్ష మూలమున నివసించేవాడు, కలువల వంటి విశాలమైన నేత్రములు కలవాడు, సుబ్రహ్మణ్యునిచే నుతించబడిన వాడు, వనమాల ధరించేవాడు, గోపస్త్రీలను మైమరపింపజేసేవాడు అయిన రాజగోపాలుని భజిస్తున్నాను. 

శ్రవణం
======

మోహన రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని అరుణా సాయిరాం గారు ఆలపించారు

30, డిసెంబర్ 2020, బుధవారం

క్షితిజారమణం చింతయే - దీక్షితుల వారి కృతి


దీక్షితుల వారు అద్వైత సిద్ధాంతంపై గల విశ్వాసాన్ని తమ కృతులలో పూర్తిగా ప్రతిబింబించారు. షణ్మతములలోని దేవతలను అంతే భక్తితో, తాదాత్మ్యతతో ఆరాధించారు, ఆ భావనలు ఆయన కృతులలో సుస్పష్టంగా తెలుస్తాయి. శైవ శాక్తేయ షణ్ముఖ సాంప్రదాయాలలోని దేవాలయాలలోని దేవతామూర్తులపై ఆయన ఉపాసనా పూర్వకంగా ఎలా కృతులు రచించారో అదే పద్ధతిలో ఆయన వైష్ణవ సాంప్రదాయంలోని అనేక దేవాలయాలను సందర్శించి అత్యద్భుతమైన కృతులను రచించారు. ఈ ధనుర్మాసంలో వారు రచించిన కొన్ని శ్రీరంగనాథుని కృతులను ప్రస్తావించాను. అలాగే, శ్రీరామచంద్రునిపై ఆయన మనోజ్ఞమైన ప్రాకృత భాషలో దివ్యమైన కృతులను రచించారు. వాటిలో ఒక కృతి వివరాలు:

సాహిత్యం
========

క్షితిజారమణం చింతయే శ్రీరామం భవతరణం

క్షితిపతి నత చరణం సేవిత విభీషణం
క్షితి భరణం శ్రితచింతామణిం అఘహరణం

సకలసుర మహిత సరసిజ పదయుగళం శాంతం అతికుశలం
వికసిత వదన కమలమతులితమమలం వీరనుత భుజబలం
శుకశౌనక ముని ముదిత గురుగుహ విదితం శోభన గుణ సహితం
ప్రకటిత సరోజ నయనం పాలిత భక్తం భవపాశహరణనిపుణం

భావం
=====

భవసాగరాన్ని దాటించేవాడు, భూమి నుండి జన్మించిన సీతాదేవి పతి అయిన శ్రీరాముని ధ్యానిస్తున్నాను. మహారాజులచే నుతించబడిన చరణములు కలవాడు, విభీషణునిచే సేవించబడిన వాడు, వరాహావతారంలో భూమిని రక్షించినవాడు, ఆశ్రితులకు చింతామణివలె కామ్యములను తీర్చేవాడు, పాపములను హరించేవాడు అయిన శ్రీరాముని ధ్యానిస్తున్నాను. సమస్త దేవతల చేత పూజించబడిన పదకమలములు కలవాడు, శాంతమూర్తి, అత్యంత నైపుణ్యము కలవాడు, వికసించిన కమలము వంటి ముఖము కలవాడు, సాటిలేని వాడు, నిర్మలుడు, వీరులచే నుతించబడిన భుజబలము కలవాడు, శుకశౌనకాది మునులకు ఆనందం కలిగించినవాడు, సుబ్రహ్మణ్యునిచే గ్రహించబడిన వాడు, సద్గుణములు కలిగి ప్రకాశించేవాడు, వికసించిన కలువల వంటి కన్నులు కలవాడు, భక్తులను పాలించేవాడు, జనన మరణ బంధముల నుండి ముక్తి కలిగించుటలో నిపుణుడైన శ్రీరామచంద్రుని ధ్యానిస్తున్నాను. 

శ్రవణం
======

దేవగాంధారి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని జొన్నలగడ్డ శ్రీరాం ఆలపించారు

29, డిసెంబర్ 2020, మంగళవారం

పరిమళ రంగనాథం భజేऽహం - దీక్షితుల వారి క్షేత్ర కృతి

దీక్షితుల వారి క్షేత్ర కృతులలో ఒకటి తమిళనాడు తిరువిందళూరులోని పుండరీకవల్లీ సమేత పరిమళరంగనాథునిపై రచించినది. ఈ క్షేత్రానికి స్థల పురాణం ఉంది. శ్రీమహావిష్ణువు మత్స్యావతారుడై వేదాలను రక్షించి తిరువిళందూరులోని వనంలో తపస్సు చేసి ఆ వేదాలను వల్లించి వాటికి, తనకు కూడా శాశ్వతమైన పరిమళాన్ని ఆపాదించుకున్నాడు. అంతే కాదు, ఆ వనం కూడా పరిమళ వనంగా మారింది. ఇక్కడి విమానం పేరు వేదామోద విమానం. చంద్రుడు శాపవిముక్తికై ఈ క్షేత్రంలోనే తపస్సు చేసి శ్రీహరి అనుగ్రహం పొందాడు. ఈ క్షేత్రంలో అందుకే చంద్రుడు, అంబరీషుల మూర్తులు ఉంటాయి. ఈ విషయాలన్నీ దీక్షితుల వారు తన కృతిలో ప్రస్తావించారు. వివరాలు:

సాహిత్యం
========

పరిమళ రంగనాథం భజేऽహం వీరనుతం
పరిపాలిత భక్తం పుండరీకవల్లీనాథం

హరిం అంబరీష శీతాంశు వేదాది పూజితం
మురహరం భయహరం నరహరిం ధృత గిరిం
సురనర మునిజన ముదితం
పురహర గురుగుహ విదితం

సుగంధ విపినాంతరంగ శయనం రవిశశి నయనం
శుకశౌనకాది హృద్సదనం సరసిజ వదనం
ఖగరాజ తురంగం కమనీయ శుభాంగం
కనకాంబర కౌస్తుభమణి ధరం కంబు కంధరం
గగన సదృశమాబ్జకరం గజరాజ క్షేమ కరం
నగపతి సుతా సోదరం నర వరద దామోదరం

భావం
=====

వీరులచే నుతించబడేవాడు, భక్తులను పరిపాలించేవాడు, పుండరీకవల్లికి నాథుడైన పరిమళ రంగనాథుని నేను భజిస్తున్నాను. అంబరీషుడు, చంద్రుడు వేదములచే పూజించబడేవాడు, మురాసురుని సంహరించినవాడు, భయమును హరించేవాడు, నరసింహుడు, మందర పర్వతమును ధరించినవాడు, దేవతలు, మానవులు, మునిజనులకు ఆనందం కలిగించినవాడు, పరమశివుడు, సుబ్రహ్మణ్యునిచే గ్రహించబడిన వాడు అయిన పరిమళ రంగనాథుని నేను భజిస్తున్నాను. సుగంధవనము మధ్యలో శయనించేవాడు, సూర్యచంద్రులు కన్నులుగా కలవాడు, శుకశౌనకాది మునుల హృదయములో నివసించేవాడు, కమలము వంటి ముఖము కలవాడు, గరుత్మంతుడు వాహనముగా కలవాడు, అందమైన, శుభకరమైన శరీరవయవములు కలవాడు, బంగారు వస్త్రములు, కౌస్తుభమణి ధరించే వాడు, శంఖము వంటి కంఠము కలవాడు, ఆకాశమును పోలినవాడు, గజేంద్రునికి క్షేమము కలిగించినవాడు, హిమవంతుని కుమార్తె అయిన పార్వతికి సోదరుడైనవాడు, మానవులకు వరదుడు, దామొదరుడైన పరిమళ రంగనాథుని నేను భజిస్తున్నాను. 

శ్రవణం
=======

హమీర్ కల్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని చారులత మణి గారు ఆలపించారు

28, డిసెంబర్ 2020, సోమవారం

రంగనాయకం భావయేऽహం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


సాహిత్య సంపదలో, ఆధ్యాత్మిక వైభవంలో, సంస్కృత భాషా విశేషణాలలో, సంగీతత్రయంలో ముత్తుస్వామి దీక్షితుల వారిది అగ్రస్థానం. వారి ఉపాసనా బలమంతా ఈ మూడు కోణాల ద్వారా ఆయన రచనలలో అద్భుతంగా గోచరిస్తుంది. అటువంటి ఒక కృతి వారు శ్రీరంగంలోని రంగనాథునిపై రచించినది. వివరాలు:

సాహిత్యం
========

రంగనాయకం భావయేऽహం శ్రీరంగనాయకీ సమేతం శ్రీ

అంగజ తాతమనంతమతీతం అజేంద్రాద్యమరనుతం సతతం
ఉత్తుంగ విహంగ తురంగం కృపాపాంగం రమాంతరంగం శ్రీ

ప్రణవాకార దివ్య విమానం ప్రహ్లాదాది భక్తాభిమానం
గణపతి సమాన విష్వక్సేనం గజ తురగ పదాది సేనం
దినమణికులభవ రాఘవారాధనం మామక విదేహ ముక్తి సాధనం
మణిమయ శశివదనం ఫణిపతి శయనం పద్మనయనం
అగణితసుగుణగణ నతవిభీషణం ఘనతర కౌస్తుభమణి విభూషణం
గుణిజన కృత వేదపారాయణం గురుగుహ ముదిత నారాయణం శ్రీ

భావం
=====

రంగనాయకీ సమేతుడైన శ్రీరంగనాయకుని నేను ధ్యానిస్తున్నాను. మన్మథునికి తండ్రి, అనంతుడు, అన్నిటికీ అతీతుడు, బ్రహ్మేంద్రాది దేవతలచే ఎల్లప్పుడూ నుతించబడేవాడు, గరుత్మంతుని వాహనంగా ఆకాశంలో విహరించేవాడు, కృపావీక్షణములు కలవాడు, లక్ష్మీదేవి హృదయములో ఉండేవాడు అయిన శ్రీరంగనాయకుని ధ్యానిస్తున్నాను. ఓంకారమనే దివ్యవిమానంలో విహరించేవాడు, ప్రహ్లాదాది భాగవతోత్తములను ప్రీతితో అనుగ్రహించేవాడు, గణపతితో సమానమైన విష్వక్సేనునిచే పూజించబడేవాడు, గజములు, అశ్వములు, సైనికులతో కూడిన సైన్యము కలవాడు, సూర్యవంశములో జన్మంచి రాఘవునిగా కొలువబడినవాడు, దేహముక్తి పొందేందుకు నాకు సాధనమైనవాడు, మణులతో ప్రకాశించేవాడు, చంద్రుని వంటి ముఖము కలవాడు, విభీషణునిచే నుతించబడినవాడు, శ్రేష్టమైన కౌస్తుభ మణిని వక్షస్థలమున ఆభరణముగా కలవాడు, ఉత్తములైన పండితులచే వేద పారాయణ ద్వారా నుతించబడిన వాడు, సుబ్రహ్మణ్యునికి ఆనందం కలిగించేవాడు, శ్రీమన్నారాయణుడైన రంగనాయకుని నేను ధ్యానిస్తున్నాను. 

శ్రవణం
=======

ఖరహరప్రియ జన్యమైన నాయకి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు.

25, డిసెంబర్ 2020, శుక్రవారం

కరుణ జూడవయ్య మాయయ్య కావేటి రంగయ్య - త్యాగరాజస్వామి శ్రీరంగ పంచరత్న కృతి

త్యాగరాజస్వామి వారు రచించిన శ్రీరంగ పంచరత్న కీర్తనలలో మరొకటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా. శ్రీరంగంలో స్వామి వైభోగాన్ని అనేక సేవలలో చూసి ఆనందించి రచించిన కృతి ఇది. 

సాహిత్యం
========

కరుణ జూడవయ్య మాయయ్య కావేటి రంగయ్య

పరమ పురుష విను మాపాలి పెన్నిధానమా
వరద నలుగురిలో వరమొసగి కరమిడి

చారడేసి కన్నులచే చెలంగు ఉభయ నా
చ్చారులతోను మరి సద్భక్తులతో యా
ళ్వారులతో నీవు వర నైవేద్యముల
నారగించు వేళల హరి త్యాగరాజుని పై

భావం
=====

మా తండ్రివైన ఓ కావేటి రంగయ్యా! నాపై కరుణతో చూడవయ్యా! మా పాలిట పెన్నిధివైన ఓ పరమ పురుషా నా మటలు ఆలకించు! ఓ వరదా! నలుగురిలో వరములు, అభయమునిచ్చి కరుణతో చూడవయ్యా! ఓ శ్రీహరీ! చారెడు కన్నులు కలిగిన శ్రీదేవి భూదేవిలతో, సద్భక్తులతో, ఆళ్వారులతో నీవు శ్రేష్టమైన నైవేద్యములు ఆరగించు వేళ త్యాగరాజునిపై కరుణతో చూడవయ్యా!

శ్రవణం
======

సారంగ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

23, డిసెంబర్ 2020, బుధవారం

ఓ రంగశాయీ యని బిలచితే - త్యాగరాజస్వామి శ్రీరంగ పంచరత్న కృతి


త్యాగరాజస్వామి శ్రీరంగ పంచరత్న కృతులలో బాగా పేరొందిన కృతి ఓ రంగశాయీ. శ్రీరంగం తీర్థయాత్ర వెళ్లి రంగనాథుని ప్రార్థించనప్పుడు ఆయన అనుగ్రహం వెంటనే కలుగనప్పుడు ప్రశ్నిస్తూ ఈ కృతిని రచించారు. వివరాలు:

సాహిత్యం
========

ఓ రంగశాయీ యని బిలచితే ఓ యని రారాదా

సారంగధరుడు జూచి కైలాసాధిపుడు గాలేదా

భూలోక వైకుంఠమిదియని నీలోనె నీవే యుప్పొంగి
శ్రీలోలుడై యుంటే మా చింత దీరే దెన్నడో
మేలోర్వ లేని జనులలో నే మిగుల నొగిలి దివ్య రూపమును ముత్యాలసరుల యురమున గన వచ్చితి త్యాగరాజ హృద్భూషణ

భావం
=====

స్వామీ! ఓ రంగశాయీ యని నిన్ను మనసారా పిలచితే ఓ యని రావచ్చు కదా! కరిచర్మం ధరించే పరమశివుడు నీ అనుగ్రహము పొందిన తరువాత కైలాసాధిపతి అయినాడు కదా! ఈ క్షేత్రము భూలోక వైకుంఠమని నీలో నీవే ఉప్పొంగి ఎల్లప్పుడూ లక్ష్మీదేవిపైనే ధ్యాస కలిగియుంటే మా చింతలు ఎప్పుడు తీరేను? నా శ్రేయస్సును ఓర్వలేని జనుల మధ్య నేను ఎంతొ నలిగి నీ దివ్యరూపమును, ముత్యాల దండలను నీ వక్షస్థలములో చూచి ఆనందించుటకు వచ్చాను. త్యాగరాజుని హృదయమునకు ఆభరణమైన స్వామీ! ఓ రంగశాయీ అని నిన్ను మనసారా పిలచితే ఓ అని రావచ్చు కదా! 

శ్రవణం
=======

కాంభోజి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం అద్భుతంగా ఆలపించారు

22, డిసెంబర్ 2020, మంగళవారం

రంగ రాజు వెడలె జూతాము రారే - త్యాగరాజస్వామి వారి శ్రీరంగ పంచరత్న కృతి


త్యాగరాజస్వామి వారు శ్రీరంగ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు రంగనాథునిపై ఐదు కృతులను రచించారు. వాటిని శ్రీరంగ పంచరత్న కృతులు అంటారు. శ్రీరంగంలో జరిగే తిరునాళ్లలో స్వామిని రాజుగా అలంకరించి అశ్వంపై ఊరేగించే వైభోగాన్ని ఆయన ఒక కృతిలో వివరించారు. వైకుంఠ ఏకాదశి సమయంలో శ్రీరంగంలో 21 రోజుల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. వాటిలో ఎనిమిదవ రోజున స్వామిని బంగారు అశ్వ వాహనంపై విహరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని వేడుపరి అంటారు. దీని వెనుక ఒక గాథ ఉంది మంగైమన్నన్ అనే రాజు కుముదవల్లి అనే వైష్ణవకన్యపై మనసు పడి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. అతనికి విష్ణుభక్తి కలిగించాలన్న సంకల్పంతో కుముదవల్లి కొన్ని షరతులతో వివాహానికి ఒప్పుకుంటుంది. వాటిలో ముఖ్యమైనది ప్రతిరోజూ 1008 వైష్ణవులకు భోజనం పెట్టడం. ఆ షరతును నెరవేర్చటానికి మంగై మన్నన్ అనేక కష్టాలు పడతాడు. చివరకు తన వద్ద ఉన్న ధనమంతా కోల్పోయి ఒకరోజు దొంగతనానికి పాల్పడతాడు. తిరువీధులలో వధూవరుల వేషంలో వస్తున్న స్వామి, అమృతవల్లీ తాయారులను నిలువరించి వారి నగలను దోచుకుంటాడు. కానీ ఆ నగల మూటను భూమి మీద నుండి ఎత్తలేకపోతాడు. అప్పుడు స్వామి అతనిని అనుగ్రహించి తన నిజరూప దర్శనమిచ్చి అతనికి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు. అప్పటి నుండి తిరుమంగై మన్నన్ తిరుమంగై ఆళ్వారుగా పిలువబడ్డాడు. ఈతనే ఆఖరి ఆళ్వారు. ఈ ఘట్టాన్ని ప్రతి ఏడు జరిగే వేడుపరి ఉత్సవాలలో ఆవిష్కరిస్తారు. స్వామిని బంగారు అశ్వంపై చిత్రవీధిలో వేగంగా అశ్వధాటి రీతి ఊపుతారు. శ్రీరంగనాథుడు ఈ ఉత్సవాలలో రంగరాజుగా కొలువబడతాడు. దీనినే త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా ఆవిష్కరించారు. వివరాలు:

సాహిత్యం
=======

రాజు వెడలె జూతాము రారే కస్తురి రంగ 

తేజినెక్కి సామంతరాజులూడిగము సేయ
తేజరిల్లు నవరత్నపు దివ్య భూషణములిడి రంగ

కావేరీ తీరమునను పావనమగు రంగపురిని
శ్రీ వెలయు చిత్ర వీధిలో వేడ్కగ రాగ
సేవను గని సురలు విరులచే ప్రేమను పూజించగ
భావించి త్యాగరాజు పాడగ వైభోగ రంగ

భావం
=====

రాజైన కస్తూరి రంగడు శ్రీరంగపుర వీధులలో విహరిస్తున్నాడు చూద్దాము రండి. మేలుజాతి అశ్వమునెక్కి, సామంతరాజులు సేవలు చేయుచుండగా నవరత్నాలతో పొదిగిన దివ్యమైన ఆభరణములు ధరించి ప్రకాశిస్తున్న రంగనాథుడు శ్రీరంగ వీధులలో విహరిస్తున్నాడు చూద్దాము రండి. కావేరీ తీరములో పావనమైన శ్రీరంగ క్షేత్రంలో సిరులొలికే చిత్ర వీధులలో స్వామి వేడుకగా రాగా, ఆ సేవను కనులారా జూచి దేవతలు పుష్పములతో భక్తితో పూజించగా, ఆ అద్భుతమైన దృశ్యమును చూచి త్యాగరాజు వైభోగ రంగ అని పాడుచున్నాడు, స్వామిని చూద్దాము రండి. 

శ్రవణం
======

దేశిక తోడి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రంజని-గాయత్రి సోదరీమణులు ఆలపించారు

18, డిసెంబర్ 2020, శుక్రవారం

సింగరామూరితివి చిత్తజు గురుడవు - అన్నమాచార్యుల వారి కృతి

 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకునికి తిరుమలలో నిత్యకల్యాణముతో పాటు అనేక అద్భుతమైన సేవలు. వాటిలో కొన్ని ఏడాదికి ఒకమారు నిర్వహిస్తారు. అటువంటి సేవ ఒకటి తెప్పోత్సవం. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి సమయంలో ఐదు రోజుల పాటు ఈ తెప్పోత్సవాన్ని ఎంతో వైభవంగా స్వామి పుష్కరిణిలో నిర్వహిస్తారు. మొదటిరోజు సీతారామలక్ష్మణులు, రెండవరోజు రుక్మిణీకృష్ణులు, మిగిలిన మూడు రోజులు శ్రీదేవి-భూదేవి సమేతుడైన మలయప్ప మూర్తులను పుష్కరిణిలో విహరింపజేస్తారు. అన్నమాచార్యుల వారు తమ కృతులలో స్వామికి జరిగే అనేక సేవలను, ఉత్సవాలను ప్రస్తావించటమే కాదు మనోజ్ఞంగా వర్ణించారు. ఈ వార్షిక తెప్పోత్సవంపై కూడా సద్గురువులు అద్భుతమైన కృతిని రచించారు. వివరాలు: 

సాహిత్యం
========

సింగారమూరితివి చిత్తజు గురుడవు సంగతి జూచేరు మిము సాసముఖ

పూవుల తెప్పలమీద పొలతులు నీవునెక్కి పూవులు ఆకసము మోప పూచిచల్లుచు
దేవదుందుభులు మ్రోయ దేవతలు కొలువగా సావధానమగు నీకు సాసముఖ

అంగరంగవైభవాల అమరకామినులాడ నింగినుండి దేవతలు నినుజూడగా
సంగీత తాళవాద్య చతురతలు మెరయ సంగడిదేలేటి నీకు సాసముఖ

పరగ కోనేటిలోన పసిడి మేడనుండి అరిది యిందిరయు నీవు ఆరగించి
గరిమ శ్రీవేంకటేశ కన్నుల పండువకాగ సరవి నోలాడు సాసముఖ

భావం
=====

ఓ వేంకటేశా! నీవు శృంగారమూర్తివి, మన్మథుని తండ్రివి! మీ సన్నిధిలో అందరూ మిమ్ములను చక్కగా చూచుచున్నారు. పూవులతో అలంకరించబడిన తెప్పల మీద నీవు శ్రీదేవి భూదేవిలతో కూడి యుండగా, పూవులు ఆకాశములో మొలచాయా అన్నట్లుగా మీపైన చల్లబడుతున్నాయి, దేవదుందుభులు మ్రోగుచుండగా దేవతలు మిమ్ములను కొలుచుచుండగా మీ సన్నిధినయున్నవారికి సావధానముగా నున్నది! అంగరంగవైభవముగా దేవకాంతలు నృత్యము చేయుచుండగా దేవతలు మిమ్ము చూచుచుండగా, సంగీత తాళవాద్యములు నైపుణ్యముగా మెరయుచుండగా తెప్పలలో విహరించుచున్న దృశ్యము మీ సన్నిధినయున్నవారికి కన్నులపండువగానున్నది. ఆరగింపులను సేవించి ఎంతో ఒప్పుగా పుష్కరిణియందు బంగారు తెప్పలో శ్రేష్ఠులైన మీరు, అపురూపమైన లక్ష్మీదేవి ఓలలాడుచున్న దృశ్యము మీ సన్నిధినయున్నవారికి ఎంతో కన్నులపండువగా నున్నది. 

శ్రవణం
======

ఖమాస్ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని శ్రీమతి శ్వేతా ప్రసాద్ గారు ఆలపించారు.

14, డిసెంబర్ 2020, సోమవారం

పార్వతీపతిం ప్రణౌమి సతతం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి

హంసధ్వని రాగాన్ని సృష్టించింది ముత్తుస్వామి దీక్షితుల వారి తండ్రి అయిన రామస్వామి దీక్షితుల వారు. వీరు 18వ శతాబ్దంలో తంజావూరు మహారాజులు అమరసింహ భోసలే, తులజాజీ భోసలలే కొలువులలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేశారు. వీరు 108 రాగాలతో చేసిన రాగమాలిక అత్యంత ఎక్కువ నిడివి కలిగిన రాగమాలికగా ఇప్పటికీ ప్రసిద్ధం. తండ్రిపై గౌరవంతో దీక్షితులవారు వాతాపి గణపతిం భజేऽహం అనే కృతిని ఈ రాగంలో స్వరపరచారు. ఆయన ఈ రాగంలో స్వరపరచిన మరొక కృతి పార్వతీపతిం ప్రణౌమి సతతం. వివరాలు:

సాహిత్యం
=======

పార్వతీపతిం ప్రణౌమి సతతం ఆశ్రితజన మందారం శశిధరం

పర్వత రాజ నుత పదాంబుజం భద్ర ప్రద కైలాస విరాజం
గర్విత త్రిపురాది హర చతురం గురుగుహ వందిత శివ శంకరం

భావం
=====

ఆశ్రితజనులకు కల్పవృక్షము వంటి వాడు, చంద్రుని ధరించినవాడు, పార్వతీదేవికి పతియైన పరమశివునికి నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను. పర్వతరాజైన హిమవంతునిచే నుతించబడిన పదకమలములు కలవాడు, శుభఫలములను ప్రసాదిస్తూ కైలాస పర్వతముపై విరాజిల్లేవాడు, గర్వితులైన త్రిపురాసురులు మొదలైన రాక్షసులను సంహరించిన నిపుణుడు, సుబ్రహ్మణ్యునిచే పూజించబడిన శివునికి, శంకరునికి నేను ఎల్లప్పుడూ నమస్కరించుచున్నాను. 

శ్రవణం
======

ప్రఖ్యాత కర్నాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులు సంగీత కళానిధి, పద్మభూషణ్ గుర్తింపులను పొందిన శ్రీ త్రిచూర్ రామచంద్రన్ గారు ఈ క్ర్తిని ఆలపించారు

13, డిసెంబర్ 2020, ఆదివారం

ఇక్ష్వాకుకులతిలక ఇకనైన పలుకవే - రామదాసు కృతి


తానీషా సైనికులు రామదాసును ఎంతటి శారీరిక హింసకు గురి చేయకపోతే ఆ వాగ్గేయకారుడు శ్రీరామచంద్రుని నిందించే భావనలను వ్యక్తపరస్తాడు? భక్తిమార్గంలో ఎంతటి అచంచల విశ్వాసమున్నా, భగవంతుడు పెట్టే పరీక్షలు తట్టుకోవటం చాలా కష్టం. అందులోనూ కారాగార వాసంలో శిక్ష తట్టుకోవటం మరింత కష్టం. పరమ భక్తాగ్రేసరుడైన రామదాసు కూడా ఆ సైనికుల దెబ్బలను తట్టుకోలేకపోయాడు, అందుకే ఇక్ష్వాకుకుల తిలక ఇకనైన పలుకవే అని విలపిస్తూ, నిందిస్తూ, రాముని వేడుకున్నాడు. సీతారామ భరతలక్ష్మణ శత్రుఘ్నులకు ఆభరణాలు, భద్రాద్రి దేవాలయ ప్రాకారానికి, గోపురానికి, మంటపాలకు ఖర్చులు ప్రస్తావిస్తూ అవన్నీ స్వామికే కదా? అవేమైనా దశరథుడు, జనకుడు చేయించారా అని నిష్ఠూరంగా పలుకుతాడు రామదాసు.  ఎవరబ్బ సొమ్మనికి కులుకుతూ తిరుగుతున్నావు అని నిందిస్తాడు. అంతలో తన తప్పు గ్రహించి నిందించినందుకు ఆగ్రహించవద్దు, దెబ్బలకు ఓర్వలేక తిట్టానని చెప్పుకుంటాడు. భక్తులనందరినీ కాపాడే శ్రీరాముని తనను కూడా కాపాడమని చివరకు వేడుకుంటాడు. ఇప్పటికీ గోల్కోండ కోటకు వెళితే రామదాసును బందీ చేసిన జైలును చూస్తే ఆయన ఎంతటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడో చూడవచ్చు. తరువాత రామలక్ష్మణుల అనుగ్రహము, రామదాసు ముక్తి మనకు తెలిసిందే. ప్రతి వాగ్గేయకారుని జీవితంలో కూడా పరమాత్మ అనుగ్రహాన్ని చాటే ఇటువంటి ఘటనలు, అద్భుతాలు ఎన్నో. 

ఇక్కడ కొన్ని సాంకేతిక వివరాలు: మొహరీ అంటే ఒక తులము ఎత్తు బంగారము (30 చిన్నములు అనగా నాలుగు గురిగింజల ఎత్తు). వరహా అనగా 3.4 గ్రాముల బంగారము. 

ఆధ్యాత్మిక సందేశంగా ఈ కృతిని తీసుకుంటే జనన మరణాల మధ్య జీవాత్మ పడే నరకయాతనలన్నీ కూడా పరమాత్మ సృష్టి స్థితి లయములలో భాగమే. ఆ పరమాత్మను చేరుకోవటం కోసమే ఇవన్నీ కూడా. కర్మలు, వాటి ఫలాల నుండి రక్షించి తనకు ముక్తిని ప్రసాదించమని జీవాత్మ చేసే అనేక భావనలతో కూడిన ప్రార్థనగా దీన్ని భావించవచ్చు. సమస్తమూ పరమాత్మకు సమర్పించినపుడు ఆ పరంజ్యోతిలో ఏకమయ్యే దారి కనిపించక జీవాత్మ పడే యాతనకు ఈ కృతి ప్రతిబింబం. 

సాహిత్యం
========

ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర
నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర

చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్ర
ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

గోపుర మంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్ర
నను క్రొత్తగ చూడక ఇద్దరి బ్రోవుము రామచంద్ర

భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలతాడు రామచంద్ర
ఆ మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచంద్ర

లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

కలికి తురాయి నీకు మెలుకువగ చేయిస్తి రామచంద్ర
నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర

నీ తండ్రి దశరథ మహారాజు పెట్టెనా రామచంద్ర
లేక నీ మామ జనక మహారాజు పంపెనా రామచంద్ర

అబ్బ తిట్టితినని ఆయాస పడవద్దు రామచంద్ర
ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్ర

భక్తులందరిని పరిపాలించెడి శ్రీ రామచంద్ర
నీవు క్షేమముగ శ్రీ రామదాసుని యేలుము రామచంద్ర

భావం
=====

ఇక్ష్వాకువంశ తిలకుడవైన శ్రీరామచంద్రా! ఇకనైన పలుకుము. నన్ను నువు రక్షించకుంటే వేరెవరు రక్షించెదరు? ఈ దేవాలయము చుట్టూ ప్రాకారము ఎంతో అందంగా కట్టించాను, ఆ ప్రాకారానికి పదివేల వరహాలు పట్టాయి. ఇకనైన పలికి నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! దేవాలయానికి గోపురము, మంటపాలు స్థిరముగా కట్టించాను, ఇవన్నీ నీకు తెలియవా? నన్ను క్రొత్తగా చూడకుండా ఈ చెరసాలలో ఉన్న నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! నీ ప్రియసోదరుడైన భరతునికి పచ్చల పతకము చేయించాను, దానికి పదివేల వరహాలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! నీ కనిష్ఠ సోదరుడైన శత్రుఘ్నునికి బంగారు మొలత్రాడు చేయించాను, దానికి పదివేల మొహరీలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! లక్ష్మణునికి ముత్యాల పతకము చేయించాను. దానికి పదివేల వరహాలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! సీతమ్మకు చింతాకు పతకము చేయించాను. దానికి పదివేల వరహాలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! నీకోసం అందమైన శిరోభూషణము చేయించాను. ఎవడబ్బ సొమ్మని వాటిని పెట్టుకుని కులుకుతూ తిరుగుతున్నావు! ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. ఈ ఆభరణాలు మీ నాన్న గారు దశరథ మహారాజు చేయించారా లేక మామగారు జనకమహారాజు కానుకగా పంపించారా! ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! నేను ఈ విధంగా దూషిస్తున్నానని కోపగించుకోవద్దు. ఈ తానీష సైనికులు కొట్టే దెబ్బలను భరించలేక అలా చేస్తున్నాను. ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. భక్తులను పరిపాలించే ఓ శ్రీరామచంద్రా! నువ్వు శుభముగా నన్ను రక్షించుము. 

శ్రవణం
======

యదుకుల కాంభోజి రాగంలో కూర్చబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

12, డిసెంబర్ 2020, శనివారం

శర శర సమరైక శూర - త్యాగరాజస్వామి కృతి


రాముని శౌర్యాన్ని, ధీరత్వాన్ని వర్ణించే త్యాగరాజస్వామి కృతులు ఎన్నో. రామాయణంలో విశ్వామిత్ర యాగరక్షణ మొదలు రావణ సంహారం వరకు ఎన్నో ఘట్టలను త్యాగరాజస్వామి తన కృతులలో సవివరంగా రాగయుక్తంగా పలికారు. సీతమ్మ కోసం రాముడు కడలిని దాటే సమయంలో సముద్రుని నిలువరించిన ఘట్టం ప్రస్తావన కూడా అనేక కృతులలో చేశారు. నీరజాక్షికై నీరధి దాటిన నీ కీర్తిని విన్నానురా రామా అని క్షీర సాగర శయన అనే కృతిలో అద్భుతంగా వర్ణించారు. నిజంగా రాముని శౌర్యం తెలుసుకోవాలంటే అరణ్యకాండలోని ఖరదూషణ వధ ఘట్టం, యుద్ధకాండలో రావణాదులపై చేసిన ప్రహార వివరాలు శ్రీమద్వాల్మీకి రామాయణం పఠించాలి. వాటి సారాంశాన్ని త్యాగరాజస్వామి అనేక కృతుల ద్వారా ఆవిష్కరించారు. రాముని శౌర్యం వెనుక ఉన్న మర్మం కూడా తెలిపారు. అటువంటి ప్రస్తావనే ఈ శర శర సమరైక శూర అన్న కృతిలో కూడా చేశారు. వివరాలు:

సాహిత్యం
=======

శర శర సమరైక శూర శరధి మద విదార!

సురరిపు మూల బలమనుతూల గిరులకనల సమమౌ శ్రీరామ

తొలిజేసిన పాపవనకుఠారమా కలనైనను సేయగలేని బలు
విలును విరచి వెలసిన శ్రీరఘుకులవర బ్రోవుము త్యాగరాజనుత!

భావం
====

ఒక్కొక్క బాణముచేత సాటిలేని యుద్ధ శౌర్యమును చూపిన, సముద్రుని గర్వమణచిన శ్రీరామా! దూది పర్వతముల వంటి రావణుని మూలబలమునకు అగ్నితుల్యమైన శ్రీరామా! అనేక జన్మముల పాపములనే అరణ్యములకు గొడ్డలిపెట్టువంటి శ్రీరామా! రాజాధిరాజులు కలలో కూడా ఊహించని రీతి శివధనుస్సును విరిచిన రఘుకులతిలకుడైన శ్రీరామా! పరమశివునిచే నుతించబడిన శ్రీరామా! నన్ను బ్రోవుము. 

శ్రవణం
=====

కుంతలవరాళి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

11, డిసెంబర్ 2020, శుక్రవారం

ప్యారే దర్శన్ దీజో ఆయ్ - ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఆలపించిన మీరా భజన


మీరా భజనలు అనగానే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు గుర్తుకు వస్తారు. కారణం, ఆవిడ భక్తిలోని ఔన్నత్యం,  ఆవిడ ఆలపించిన ప్రతి భజనలోనూ అది ప్రస్ఫుటంగా తెలుస్తుంది. మీరాలో ఉన్న మధురభక్తిని తన గాత్రంలో రంగరించి సుబ్బులక్ష్మి గారు ఈ భజనలు పాడారు. అటువంటి భజన ఒకటి ప్యారే దర్శన్ దీజో ఆయ్. మధురభక్తిలో మీరాకు సర్వసం శ్రీకృష్ణుడే. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి కూడా ముమ్మాటికీ మీరా వంటి భక్తురాలే. ఆ భావన ఆమె నడవడికలో, గాత్రధర్మంలో మనకు స్పష్టంగా గోచరిస్తుంది. అందుకే ఎమ్మెస్ నటించిన మీరా (1945) చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధించింది. 

సాహిత్యం
=======

ప్యారే దర్శన్ దీజో ఆయ్
తుమ్ బిన్ రహ్యయో న జాయ్
జల బిన కమల చంద్ర బిన రజనీ ఐసే తుం దేఖ్యా బిన సజనీ
ఆకుల వ్యాకుల ఫిరూ రైన దిన బిరహ కలేజా ఖాయ్
దివస న భూక్ నీంద్ నహి రైనా ముఖ కే కథన్ న ఆవే బైనా
కహా కరూ కుచ్ కహత్ న ఆవై మిల్ కర్ తపత్ బుఝాయ్
క్యో తరసావో అంతర్యామీ ఆన్ మిలో కృపా కరో స్వామీ
మీరా దాసీ జనమ్ జనమ్ కీ పడీ తుమ్హారీ పాయ్

భావం
=====

ప్రియ కృష్ణా! నీవు లేకుండా నేను జీవించలేను, దర్శనమీయ వేగంగా రా స్వామీ! నీటిని వీడి కమలము, చంద్రుని విడచి రాత్రి ఉండలేనట్లు నిన్ను చూడకుండా ఈ సఖి ఉండలేదు. నీ దర్శనము కోసం విరహముతో పగలు రాత్రి మనసు చెదరి, కలతతో తిరుగుతున్నాను, ఆ విరహము నా హృదయాన్ని తొలచివేస్తున్నది. పగలు ఆకలి లేదు, రాత్రి నిద్ర రావటం లేదు, మాటలు మాట్లాడదామన్నా నోరు పెగలటం లేదు. నువ్వు అంతర్యామివి కదా! నన్ను ఎందుకు తపింపజేస్తున్నావు. వేగంగా వచ్చి నాపై కరుణించు. జన్మజన్మల నుండి ఈ మీరా నీ దాసి, నీ చరణాలపై వ్రాలి ప్రార్థిస్తోంది, దర్శనమీయ వేగంగా రా స్వామీ!

దృశ్య శ్రవణం
===========

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఆలపించిన ఈ భజనను వీడియోలో వీక్షించండి

10, డిసెంబర్ 2020, గురువారం

రామ రామ నీ వారము గావ రారా - త్యాగరాజస్వామి దివ్యనామ సంకీర్తన


రామునితో మనోజ్ఞమైన సంభాషణలలో శరణాగతిని వ్యక్తపరచిన కృతులను కూడా త్యాగరాజస్వామి రచించారు. రమ్మని, ప్రేమతో కాపడమని వేడుకుంటూ రాముని గుణాలను, వైభవాన్ని అద్భుతంగా ఈ కృతులలో వర్ణించారు. అటువంటి కృతులను ఆయన దివ్యనామ సంకీర్తనలు అనే సంపుటిలో కూడా ఎన్నో రచించారు. దాదాపుగా 118 సంఖ్యలో ఉన్న ఈ సంకీర్తనల ఉద్దేశం రామ నామ స్మరణతో భజన సాంప్రదాయంలో బృందగానం చేసుకుని తరించటం. వీటిలో ప్రతి చరణం తరువాత పల్లవిని పూర్తిగా పాడుకునే చక్కని పద్ధతిని ఉపయోగించి త్యాగరాజస్వామి తన కృతులను పామరులకు కూడా అర్థమయ్యేలా రచించారు. మానవుని ఆనందానికి నడవడిక ఎలా ఉండాలో, రామాయణ ఘట్టాలతో సమన్వయం చేస్తూ ఈ దివ్యనామ సంకీర్తనలను స్వామి రచించారు. నామానికి గుణాన్ని, వైభవాన్ని జతపరచి దాన్ని రాగయుక్తంగా ఆలపిస్తే ఆ నామం మన మనసులో స్థిరమవుతుంది అన్న అద్భుతమైన సూత్రాన్ని ఈ దివ్యనామ సంకీర్తనల ద్వారా త్యాగరాజస్వామి మనకు తెలియజేశారు. నామస్మరణతో త్రికరణ శుద్ధి కలిగి రామచంద్ర పరబ్రహ్మ అనుగ్రహం పొందటమే ఈ కృతుల ఉద్దేశం. చిన్న వయసులోనే రామకోటి జపాన్ని మొదలు పెట్టి 21 ఏళ్ల సుదీర్ఘమైన తపస్సు తరువాతా దానిని పూర్తి చేసి రాముని అనుగ్రహం పొంది, ఆ తరువాతే కృతుల రచన మొదలు పెట్టారు త్యాగరాజస్వామి. అందుకే ఆయన కృతులలో సార్థకత, సాఫల్యము సుస్పష్టం. 

త్యాగరాజస్వామి వారు రచించిన దివ్యనామ సంకీర్తనలలో ఒకటి రామ రామ నీ వారము గావ రారా అన్నది. వివరాలు:

సాహిత్యం
=======

రామ రామ నీ వారము గావ రారా సీతా

రామ రామ సాధుజన ప్రేమ రారా 

మెరుగు చేలము గట్టుకో మెల్ల రారా రామ
కరకు బంగరు సొమ్ములు కదల రారా   

వరమైనట్టి భక్తాభీష్ట వరద రామ రారా రామ
మరుగు జేసు కొన్నట్టి మహిమ రారా          

చిరునవ్వు గల మోము జూప రారా రామ
కరుణతో నన్నెల్లప్పుడు కావ రారా   

కందర్ప సుందర ఆనందకంద రారా నీకు
వందనము జేసెద గోవింద రారా   

ఆద్యంత రహిత వేదవేద్యా రారా భవ
వైద్య నేనీవాడనైతి వేగ రారా    

సుప్రసన్న సత్య రూప సుగుణ రారా రామ
అప్రమేయ త్యాగరాజునేల  రారా

భావం
=====

సాధుజనుల పట్ల ప్రేమ కలిగిన ఓ సీతా రామా! మేము నీ వారము, మమ్ములను రక్షించుటకు రావయ్యా! మెరిసే వస్త్రములు, బంగారు ఆభరణములు ధరించి మెల్లగా మమ్ములను రక్షించుటకు రావయ్యా! భక్తుల కామ్యములను దీర్చే వరదునిగా పేరొంది, ఆశ్రయించదగినట్టి అద్భుతమైన మహిమ గల రామా! మమ్ములను రక్షించుటకు రావయ్య! ఉద్దండువైన శ్రీరామా! అతిశయించే కాంతిగల కోదండముతో మెరుస్తూ కనులపండువగా ఉండేలా మమ్ములను రక్షించుటకు రావయ్యా! చిరునవ్వుగల ముఖమును చూపుటకు, కరుణతో నన్నెపుడు ఏలుకొనుటకు రావయ్యా! మన్మథుని వంటి సౌందర్యము కలిగి, ఆనందానికి మూలమైన ఓ శ్రీరామా! నీకు వందనములు జేసెదము, మమ్ములను రక్షించుటకు రావయ్యా! ఆది, అంతములు లేనివాడవు, వేదములచే తెలియబడినవాడవు, ఈ సంసారమునకు వైద్యుడవు, నేను నీ వాడనైతిని, మమ్ములను రక్షించుటకు వేగముగా రావయ్యా! సుప్రసన్నుడవు, సత్య రూపుడవు, సుగుణములు కలవాడవు, ప్రమాణములకు అందని వాడవు, త్యాగరాజును ఏలుకొనుటకు రావయ్యా! 

శ్రవణం
======

ఆనందభైరవి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఎవరు ఆలపించారో తెలియదు, చాలా చక్కగా పాడారు

7, డిసెంబర్ 2020, సోమవారం

కమలాంబాం భజరే రే మానస - దీక్షితుల వారి నవావరణ కృతి


ముత్తుస్వామి దీక్షితుల వారు శ్రీవిద్యోపాసకులు. వారు తిరువారూరులో జన్మించారు. అక్కడ త్యాగరాజస్వామి దేవస్థానంలో వెలసిన కమలాంబికను ఉపాసన చేసి తరించారు.  ఆ అమ్మ పేరుతోనే తిరువారూరు కమలాలయక్షేత్రంగా కూడ పిలువబడింది. ఈ దేవస్థానం సమీపంలో కమలాలయ తటాకం ఉండటం  విశేషం. ఈ కమలాంబ ప్రత్యేకతలు ఎన్నో. అమ్మవారు సుఖాసీనురాలుగా కాకుండా యోగ ముద్రలో ఒక కాలి మీద మరొక కాలు మెలిక వేసి కూర్చొని ఉంటుంది. తన చేత కమలము, పాశాంకుశము, రుద్రాక్ష ధరించి యోగినిగా దర్శనమిస్తుంది. శ్రీవిద్యా ఉపాసనా పద్ధతిలో ఇక్కడ అమ్మవారిని కొలుస్తారు. దీక్షితుల వారు  ఈ కమలాంబ శ్రీ విద్యా ఉపాసనతో జ్ఞాన దృష్టి కలిగి ఈ అమ్మపై 9 కీర్తనలను రచించారు. వీటిని నవావరణ కృతులు అంటారు. శ్రీచక్రంలో ఉన్న తొమ్మిది ఆవరణలకు ఈ తొమ్మిది కృతులను దీక్షితుల వారు రచించారు. ధ్యానము, మంగళము కలుపుకొని మొత్తం 11 కమలాంబ కృతులు ఆయన జ్ఞాన ధారగా వెలువడ్డాయి. తోడి రాగంలో ధ్యాన కృతి కమలాంబికే, తరువాత ఆనందభైరవిలో కమలాంబ సంరక్షతు, కళ్యాణి రాగంలో కమలాంబాం భజరే, శంకరాభరణ రాగంలో శ్రీ కమలాంబికాయ రక్షితోహం, కాంభోజి రాగంలో కమలాంబికాయై, భైరవిలో శ్రీ కమలాంబాయాః పరం, పున్నాగవరాళి రాగమలో కమలాంబికాయాస్తవ, శహానా రాగంలో శ్రీ కమలాంబికాయాం, ఘంట రాగంలో శ్రీ కమలాంబికే, ఆహిరి రాగంలో శ్రీ కమలాంబా జయతి, శ్రీ రాగంలో శ్రీ కమలాంబికే అనే 11 కృతులను రచించారు.

ఈ కీర్తనలలో విభక్తి అవరోహణ ప్రత్యేకత. కృతుల సాహిత్యాన్ని పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఈ నవావరణ కీర్తనలు గానానికి క్లిష్టతరమైనవిగా చెప్పబడతాయి. లోకానికి ఈ ఉపాసనలోని గొప్పతనాన్ని చెప్పటానికి ఆయన దేవతల, యోగినుల వివరాలతో ఈ కృతులను రచించారు. చక్రాలను, ఆయా దేవతల వలన కలిగే సిద్ధులను ఆయన వర్ణించారు. శ్రీవిద్యా ఉపాసన అందరికీ కాదు. చాలా నిష్ఠగా, అర్హులైన గురువుల అనుగ్రహంతో చేయవలసినది. ఈ ఉపాసన సరిగ్గా తెలిసిన గురువులు కూడా చాలా తక్కువ. ఈ నాటి కాలంలో ఇటువంటి ఉపాసన తాంత్రికంగా భావించబడుతుంది. కానీ, దీక్షితుల వారు సిద్ధులైన వారు. తిరువారూరులో అమ్మను ఉపాసన చేస్తూ ఈ కృతులను రచించారు.

కమలాంబ నవావరణ కృతులలో రెండవ కృతి కమలాంబాం భజరే రే మానస. వివరాలు:

సాహిత్యం
=======

కమలాంబాం భజరే రే మానస కల్పితమాయాకార్యం త్యజ రే

కమలావాణీసేవితపార్శ్వాం కంబుజయగ్రీవాం నతదేవాం
కమలాపురసదనాం మృదుగదనాం కమనీయరదనాం కమలవదనాం

సర్వాశాపరిపూరకచక్రస్వామినీం పరమశివకామినీం
దుర్వాసార్చిత గుప్తయోగినీం దుఃఖధ్వంసినీం హంసినీం
నిర్వాణనిజసుఖదాయినీం నిత్యకల్యాణీం కాత్యాయనీం
శర్వాణీం మధుపవిజయవేణీం సద్గురుగుహజననీం నిరంజనీం
గర్వితభండాసురభంజనీం కామాకర్షిణ్యాదిరంజనీం
నిర్విశేషచైతన్యరూపిణీం ఉర్వీతత్వాదిస్వరూపిణీం

భావం
=====

ఓ మనసా! కమలాంబను భజింపుము. మాయా కార్యములను త్యజించుము. వింజామరలను ధరించిన లక్ష్మీ సరస్వతులచే ప్రక్కభాగములందు సేవింపబడే ఆది పరాశక్తి, శంఖాన్ని మించిన కంఠము కలిగినది, దేవతలచే నుతించబడేది, కమలాపురంలో (తిరువారూరులో) వెలసినది, మృదువైన మాటలు,అందమైన పలువరస, కమలము వంటి ముఖము కలిగిన కమలాంబను భజింపుము. అన్ని దిక్కులలోను వ్యాపించి శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత అయినది, పరమశివుని అర్థాంగి అయిన కమలాంబను భజింపుము. దుర్వాసునిచే అర్చించబడిన గుప్తయోగిని స్వరూపిణి, దుఃఖములను తొలగించే దేవి, ఆత్మ మంత్ర స్వరూపిణి, తనదైన మోక్షానందమును ప్రసాదించే తల్లి, నిత్య మంగళ స్వరూపిణి, కాత్యాయని, పరమశివుని పత్ని, తుమ్మెదల నలుపును మించిన కురులు కలిగినది, జ్ఞాననిధియైన సుబ్రహ్మణ్యుని జనని, అజ్ఞానమును తొలగించే జ్ఞానస్వరూపిణి, గర్వముతో అంధుడైన భండాసురుని సంహరించినది, శ్రీచక్రములోని రెండవ ఆవరణలో ఉన్న కామాకర్షిణి దేవతలను రంజింపజేసేది, గుణము, ఉపాధి లేని శుద్ధచైతన్య స్వరూపిణి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచభూతములు మొదలైన వాటి రూపము కలది అయిన కమలాంబను భజింపుము, మాయా కార్యములను త్యజించుము. 

శ్రవణం
======

కల్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

చిత్రం
====

తిరువారూరులోని కమలాంబ మూల రూపం. 

6, డిసెంబర్ 2020, ఆదివారం

గణపతే మహామతే - అంబి దీక్షితార్ కృతి


ముత్తుస్వామి దీక్షితుల వారి వారసులలో మూడవ తరం వారు అంబి దీక్షితులు. వీరు తూత్తుకుడి జిల్లాలోని ఎట్టయపురం సంస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా పని చేసే వారు. వీరు ముత్తుస్వామి దీక్షితుల వారి సాహిత్యాన్ని ప్రచారం చేయటానికి చాలా కృషి చేశారు. డీకే పట్టమ్మాళ్ వంటి ఎందరో కళాకారులకు దీక్షితుల వారి సాహిత్యాన్ని పరిచయం చేసింది అంబి గారే. ఈయన అసలు పేరు కూడా ముత్తాతగారి పేరే. ఆయన తన కృతులలో కూడా ముత్తుస్వామి వారి ముద్రగా గురుగుహ పదాన్నే ఉపయోగించారు. అందుకే చాలామంది ఈ కృతి ముత్తుస్వామి దీక్షితుల వారే రచించారని భావిస్తారు. ఆయన కృతులలో ఒకటి గణపతే మహామతే. వివరాలు:

సాహిత్యం
========

గణపతే మహామతే గౌరీ కుమార మాం పాహి

అణిమాద్యష్టైశ్వర్యప్రద గురుగుహపూజిత వర

సోమసూర్యాగ్నినేత్ర సదాశివానందపుత్ర
వామదేవాదివక్త్ర వారిజ గంభీరగాత్ర
హిమాద్రీశసుతామోద హిరణ్యమయపీఠస్థిత
పామరపండితనుతపద పంకజాసనారాధిత

భావం
=====

మహాబుద్ధిశాలివి, గౌరీ పుత్రుడవైన ఓ గణపతీ! నన్ను రక్షించుము. అణిమాది (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము) అష్టైశ్వర్యములను ప్రసాదించేవాడవు, సుబ్రహ్మణ్యునిచే పూజించబడే శ్రేష్ఠుడవైన ఓ గణపతీ! నన్ను రక్షించుము. సూర్యుడు, చంద్రుడు, అగ్ని నేత్రములుగా కలవాడవు, పరమశివునికి ఆనందము కలిగించే పుత్రుడవు, వామదేవాది ఐదు ముఖములు కలవాడవు, శంఖము వలె అందమైన కంఠము కలవాడవు, హిమవత్పుత్రికయైన పార్వతికి మోదాన్ని కలిగించేవాడవు, బంగారు పీఠముపై స్థితుడవై పామరులు, పండితులచే పూజించబడే పదములు కలిగినవాడవు, బ్రహ్మదేవునిచే పూజించబడేవాడవైన ఓ గణపతీ! నన్ను రక్షించుము. 

శ్రవణం
=======

కల్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

5, డిసెంబర్ 2020, శనివారం

కొలువై యున్నాడే దేవదేవుడు - శరభోజి కృతి



తంజావూరు మహారాజాలు తెలుగు భాషాభివృద్ధికి ఎంత తోడ్పడ్డారో వారు రచించిన ప్రబంధాల సాహిత్యం పరిశీలిస్తే అర్థమవుతుంది. భోసల సాహ మహారాజు (శరభోజి) 1684-1710 మధ్య ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వీరు శివ మరియు విష్ణు పల్లకీ సేవా ప్రబంధాలను రచించారు. వీరు సాహిత్య నిర్వహణా దక్షులు, వేదాంత వైశేషిక వ్యాకరణాది శాస్త్ర విజ్ఞాతలు. అభినవభోజుడని బిరుదు కలవారు. వీరు తమ నామధేయాన్నే ముద్రగా కీర్తనలలో ఉపయోగించారు. వీరు శివ పల్లకీసేవా ప్రబంధాన్ని తిరువాయూరులోని కమలాంబికా సమేత త్యాగరాజస్వామి వారికి అంకితం చేశారు. ఈ ప్రబంధం పరమేశ్వర స్తుతితో మొదలై గౌరీశంకర సంస్తుతితో పరిసమాప్తమవుతుంది. ఈ ప్రబంధమొక సంగీత రూపకం. దీనిని దాదాపుగా రెండువందల సంవత్సరాలు త్యాగరాజస్వామి దేవస్థానంలో ప్రదర్శించారు. 

కే విశ్వనాథ్ గారి గొప్పతనమేమిటంటే తన చలనచిత్రాలలో ప్రాచీన వాఙ్మయానికి, కళలకు ప్రముఖమైన స్థానం కలిపించటం. స్వర్ణకమలం (1988) చిత్రంలో నాయిక నాట్యకళాభ్యాస సన్నివేశానికై శివ వైభావాన్ని ఆవిష్కరించే తంజావూరు మహారాజా వారి పల్లకీ ప్రబంధం నుండి ఈ కృతిని పొందుపరచారు. దీనికి కూచిపూడి నాట్యాన్ని కూర్చిన వారు ప్రఖ్యాత నాట్య గురువు శ్రీమతి ఉమారామారావు గారు. ఈ గీతం ద్వారా అరుదైన సాహిత్యానికి, కూచిపూడి నాట్య కళకు ఓ అద్భుతమైన వేదికను ప్రతిపాదించారు. వివరాలు:

సాహిత్యం
========

కొలువైయున్నాడే దేవదేవుడు

కొలువైయున్నాడే కోటి సూర్యప్రకాశుడే
వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే

బలుపొంకమగు చిలువల కంకణములమర
నలువంకల మణిరుచులవంక తనర
తలవంక నలవేలుపులవంక నెలవంక
వలచేతనొక జింక వైఖరి మీరంగ

మేలుగ రతనంపు రాలు చెక్కినయుంగ
రాలు భుజగ కేయూరాలు మెరయంగ
పాలుగారు మోమున శ్రీలు పొడమ పులి
తోలు గట్టి ముమ్మొన వాలుబట్టి చెలగ

ఆసల గ్రొన్నన వాసన నిండార
భాసమాన మణిసింహాసనాంతర ని
వాసుడగుచు నిజదాసుల పెన్నిధి
భోసల సాహ భూవాసవు దైవము

భావం
=====

దేవదేవుడైన పరమశివుడు కొలువైయున్నాడు చూడండి. కోటి సూర్యుల ప్రకాశము కలవాడు, మన్మథుని శత్రువు, పార్వతీ దేవి మోహించే సుందరమైన రూపము కలిగిన పరమశివుడు కొలువైయున్నాడు. ఎంతో పొందికగా సర్పములు కంకణములుగా అమరగా, నాలుగుదిక్కులా మణులకాంతుల వల్ల అతిశయించగా, ముందుభాగమున దేవతా సమూహము యుండగా, తలపైన చంద్రుడు, ఒక పక్క పార్వతీదేవి, కుడిచేతిలో జింక కలిగి అద్భుతమైన రూపము అతిశయించగా పరమశివుడు కొలువై యున్నాడు చూడండి. మేలైన రత్నాలు, రాళ్లతో పొదిగిన ఉంగరాలు, భుజకీర్తులు మెరయగా, నుంపారు ముఖములో శుభలక్షణములు ఉదయించుచుండగా పులిచర్మముతో, త్రిశూలమును వాలుగా ధరించి ప్రకాశించే పరమశివుడు కొలువైయున్నాడు చూడండి. అనుభూతి పరిపూర్ణత్వము పొందగా, కామ్యములను వేగముగా నెరవేర్చుతూ మణులతో పొదగబడిన సింహాసన స్థితుడై, నిజభక్తుల పాలిటి పెన్నిధిగా, భోసల సాహజీ మహారాజుకు దైవమై పరమశివుడు కొలువై యున్నాడు చూడండి. 

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు
===========================

వలరాజు = మన్మథుడు, పొంకము=పొందిక/సొగసు, చిలువలు=సర్పములు, రుచి=కాంతి, తలవంక=ముందు భాగమున, కులవంక=ధర్మపత్ని, వలచేత=కుడిచేత, వైఖరి=అందము, ముమ్మొన=మూడు అగ్రభాగములు కలిగినది (త్రిశూలము), చెలగు=ప్రకాశించు, క్రొన్నన=వేగముగా, వాసన=అనుభూతి, నిండార=పరిపూర్ణత్వము పొందగా.


దృశ్యశ్రవణం
==========

కృతిలోని మొదటి రెండు చరణాలను మాత్రమే చలనచిత్రంలో పొందుపరచారు. శరభోజీ ఈ కృతిని శంకరాభరణం రాగంలో స్వరపరచగా, ఇళయరాజాగారు రాగమాలికగా కూర్చారు. ఈ కృతిని బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ శ్రావ్యంగా ఆలపించారు, ఉమా రామారావు గారి నృత్య దర్శకత్వంలో భానుప్రియగారు అద్భుతమైన నాట్యం చేశారు

30, నవంబర్ 2020, సోమవారం

పరమేశ్వర జగదీశ్వర - ముత్తుస్వామి దీక్షితుల కృతి


ముత్తుస్వామి దీక్షితుల వారు అపార ఆధ్యాత్మిక సంపన్నులు. నాదోపాసనతో పాటు మంత్రానుష్ఠానం చేసి ఎన్నో క్షేత్రాలలోని దేవతల అనుగ్రహం పొందారు. కాశీలో ఎన్నో ఏళ్లు గురువులైన చిదంబరనాథ యోగి గారి దగ్గర ఉండి వారికి సేవ చేసి వారి అనుగ్రహంతో సమస్త విద్యలలోనూ సాఫల్యం పొందారు. ఆయన క్షేత్ర కృతులకు ప్రసిద్ధులని గతంలో ప్రస్తావించాను. ఆయన ఈ దేశంలో దర్శించని క్షేత్రం లేదు అంటే అతిశయోక్తి కాదు. తిరువయ్యారు లోని పంచనదీశ్వర క్షేత్రం సనాతనమైన దేవాలయం. ఇక్కడ ఐదు నదులు, ఐదు పుష్కరిణులు ఉండటం చేత క్షేత్రం ఎంతో పవిత్రతను పొందింది. ఈ క్షేత్ర మహిమను ఉట్టంకిస్తూ దీక్షితుల వారు పరమేశ్వర జగదీశ్వర అనే కృతిని రచించారు. వివరాలు:

సాహిత్యం
=======

పరమేశ్వర జగదీశ్వర శంకర పాహిమాం ప్రణతార్తిహర శ్రీ

పురహర మృగధర సుందరేశ్వర ధర్మసంవర్ధనీ మనోహర

పంచనదీశ్వర గంగాధరేశ్వర పన్నగాభరణ భక్త జనావన
పంచ బ్రహ్మ హత్యాది పాప హర పర శివ తత్వార్ధ బోధిత చతుర
పంచనద క్షేత్ర ప్రభాకర పాలిత గురుగుహ భవభయ హర
వీర క్షేత్ర పాల వినుత చరణ విచిత్ర యమ భయాది నివారణ 

భావం
=====

శరణు కోరినవారి ఆర్తిని తీర్చే ఓ పరమేశ్వరా! జగదీశ్వరా! శంకరా! నన్ను రక్షించుము. త్రిపురాసురులను సంహరించినవాడవు, జింకను ధరించేవాడవు, సుందరేశ్వరుడవు, ధర్మసంవర్ధనీ అమ్మవారి మనోహరుడవు, న్న రక్షించుము. పంచనదీశ్వర క్షేత్రంలో వెలసిన పరమశివుడవు, గంగాధరుడవు, సర్పములు ఆభరణముగా కలిగి భక్త జనులను పోషించేవాడవు, పంచ బ్రహ్మ హత్యా పాతకములను తొలగించేవాడవు, పరశివ తత్త్వార్థమును బోధించే నిపుణుడవు, పంచనదములు కలిగిన ఈ క్షేత్రాన్ని ప్రకాశింపజేసేవాడవు, సుబ్రహ్మణ్యుని రక్షకుడవు, సంసార భయములను తొలగించేవాడవు, వీరులైన క్షేత్రపాలకులచే నుతించబడిన చరణములు కలవాడవు, విచిత్రమైన మృత్యు భయాలను నివారించేవాడవు, నన్ను రక్షించుము. 

శ్రవణం
======

నాట రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మల్లాది సోదర్లు ఆలపించారు.

చిత్రం
=====

తిరువయ్యారు లోని పంచనదీశ్వర స్వామి-ధర్మసంవర్ధనీ అమ్మ వారి ఉత్సవ మూర్తులు.

29, నవంబర్ 2020, ఆదివారం

సదా మదిన్ దలతు గదరా - త్యాగరాజస్వామి కృతి


త్యాగరాజస్వామి వారి శివ కృతులను పరిశీలిస్తే ఆయన ఆ తిరువాయూరు త్యాగరాజస్వామి వారిని ఎంతగా ఆరాధించారో అర్థమవుతుంది. అద్వైతమార్గంలో ఉన్న ఔన్నత్యానికి త్యాగరాజస్వామి వారి కృతులు చక్కని ఉదాహరణలు. రామునిపైనే సింహభాగం కృతులు రచించినా ఎన్నో శివునిపై, అమ్మవారిపై, గణపతిపై కృతులను  సద్గురువులను రచించారు. శివారాధనలో ఉన్న ఆనందాన్ని త్యాగరాజస్వామి తన కృతులెన్నిటో ప్రస్తావించారు. అటువంటి ఒక కృతి సదా మదిన్ దలతు. ఉత్సాహవంతమైన గతిలో సద్గురువులు ఈ కృతిని స్వరపరచారు. వివరాలు:

సాహిత్యం
========

సదా మదిన్ దలతు గదరా ముదాస్పద నగజాధిపతీ

సదాశివానందస్వరూప! సదయ మోద హృదయ పద సరోజములనే

దిగంబరాంధక దైత్య హర దిగీశ సన్నుత గంగాధర
మృగాంక శేఖర నటన చతుర మనుప సమయ మిదిరా త్యాగరాజ నుత

భావం
=====

ఓ పార్వతీపతీ! భక్తులకు ఆనందం కలిగించే నిన్ను ఎల్లప్పుడు నా మదిలో తలచుచున్నాను. ఆనందస్వరూపుడవు, ఆనంద హృదయుడవైన ఓ సదాశివా!  నీ పదకములను నేను ఎల్లప్పుడు మదిలో తలచుచున్నాను. ఓ దిగంబరా! అంధకాసురుని సంహరించిన హరా! ఇంద్రునిచే నుతించబడిన గంగాధారా! చంద్రుని శిరసున ధరించిన నటరాజా! నన్ను రక్షించుటకు ఇది సమయము! త్యాగరాజునిచే నుతించబడిన పరమశివా! నిన్ను ఎల్లప్పుడూ నా మదిలో తలచుచున్నాను. 

శ్రవణం
======

గంభీరవాణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బీఎన్ చిన్మయి గారు ఆలపించారు.

28, నవంబర్ 2020, శనివారం

కోరి సేవింప రారే కోర్కెలీడేర - త్యాగరాజస్వామి కృతి


త్యాగరాజస్వామి శివ కృతులలో కోవూరి సుందరేశ్వరుని పంచరత్న కృతుల ప్రస్తావన చేసుకున్నాము. సుందరేశ్వరుని, సౌందర్యాంబికను దర్శించి, సేవించి సద్గురువులు ఎంత ఆనందించారో మనకు ఈ ఐదు కృతులలో స్పష్టంగా తెలుస్తుంది. తనను అనుగ్రహించిన ఆ సుందరేశ్వరునిపై రచించిన కోరి సేవింపరారే అనే కృతిలో సద్గురువులు స్వామి వైభవాన్ని, అనుగ్రహాన్ని మనోజ్ఞంగా వర్ణించారు. వివరాలు:

సాహిత్యం
======= 

కోరి సేవింప రారే కోర్కెలీడేర 

శ్రీరమణీకరమౌ కోవురి సుందరేశ్వరుని

సురులు వేయి వన్నె బంగారు విరులచే పూజింపగ భూ
సురులు సనకాది మౌని వరులును నుతింపగ
సిరులిత్తునని కొలువై యుండే శ్రీసౌందర్యనాయికా
వరుని శ్రీ త్యాగరాజ వరదుని పరమాత్ముని హరుని

భావము
======

ఓ జనులారా! మనసులో భావించిన కోర్కెలు తీరుట కొరకు శుభకరుడు, సుందరుడు అయిన కోవూరి సుందరేశ్వరుని సేవించుటకు రండి! దేవతలు వేయి వన్నెలు కల బంగారు పుష్పములచే పూజించగా, బ్రాహ్మణులు, సనకాది మునిశ్రేష్ఠులు నుతించగా సమస్త ఐశ్వర్యములను ఇచ్చెదనని కొలువైయున్న సౌందర్యనాయికకు పతియైనవాని, త్యాగరాజునికి వరములిచ్చిన పరమాత్ముడైన శివుని, మనసులో భావించిన కోర్కెలు తీరుటకు ఈ కోవూరి సుందరేశ్వరుని సేవించుటకు రండి. 

శ్రవణం
======

ఖరహరప్రియ రాగంలోని ఈ కృతిని వోలేటి వేంకటేశ్వర్లు గారు ఆలపించారు.

(చిత్రం మదురైలోని సుందరేశ్వరుని ఉత్సవ విగ్రహం)


26, నవంబర్ 2020, గురువారం

తులశమ్మ మా ఇంట నెలకొనవమ్మ - త్యాగరాజస్వామి కృతి

సనాతనధర్మంలోని నిత్యనైమిత్తికాలలో తులసి పూజ అంతర్భాగం. లక్ష్మీ స్వరూపమైన తులసివృక్షాన్ని పవిత్రంగా భావించి పూజించి దళాలను సేవించి తరించినవారు ఎందరో. వారిలో సద్గురువులు త్యాగరాజస్వామి కూడా ఒకరు. నిత్యమూ తులశమ్మను పూజించి ఆ తల్లిని తన కృతుల ద్వారా నుతించారు కూడా. తులసీదళములచే సంతోషముగా పూజింతు అన్న కృతి చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే అమ్మ రావమ్మ తులశమ్మ, తులసీ జగజ్జనని, తులశమ్మ మా ఇంట నెలకొనవమ్మ వంటి కృతుల ద్వారా ఆ తల్లిని ఎంతో భక్తితో నుతించారు. వాటిలో దేవగాంధారి రాగంలో కూర్చబడిన కృతిలో సద్గురువులు తన నిత్యోపాసనలో తులసీ పూజా వైభవాన్ని మనోజ్ఞంగా ఆవిష్కరించారు. సగుణోపాసనలో ఉండే ఔన్నత్యాన్ని ఈ కృతిలో మరో మారు మనకు కళ్లకు కట్టినట్లుగా చెప్పారు. వివరాలు:

సాహిత్యం
=======

తులశమ్మ మా ఇంట నెలకొనవమ్మ శ్రీ

ఈ మహిని నీ సమానమెవరమ్మ బంగారు బొమ్మ

కరకు సువర్ణపు సొమ్ములు బెట్టి సరిగె చీరె ముద్దు కురియగ గట్టి
కరుణ జూచి సిరులను ఒడిగట్టి వరదుని కరమును బట్టి శ్రీ

ఉరమున ముత్యపు సరులసియాడ సుర తరుణులు నిన్ను కొనియాడ
వరమును అష్టదిగీశులు వేడ వరదుడు నిను ప్రేమ జూడ శ్రీ 

మరువక పారిజాత సరోజ కురవక వకుళ సుగంధ రాజ
వర సుమములచే త్యాగరాజ వరద నిను బూజసేతు

భావం
=====

శ్రీతులశమ్మా! మా ఇంటిలో నెలకొనుము తల్లీ! ఓ బంగారు బొమ్మా! ఈ భువిలో నీ సమానమెవరు? మెరసే బంగారపు ఆభరణములు ధరించి, ముద్దులు కురిసేలా బంగారు చీర కట్టుకుని, కరుణతో చూచుచు సమస్త ఐశ్వర్యములను ఒడిలో గట్టుకుని, నారాయణుని కరమును బట్టుకొని మా ఇంటిలో నెలకొనుము తల్లీ! శ్రీతులశమ్మా! మెడలో ముత్యాల వరుసలు కదలుచుండగా, దేవతాస్త్రీలు నిన్ను కొనియాడు చుండగా, అష్టదిక్పాలకులు నిన్ను భక్తితో నుతించగా, నారాయణుడు నిన్ను ప్రేమతో జూడగా మా ఇంటిలో నెలకొనుము తల్లీ! శ్రీతులశమ్మా! మరువము, పారిజాతము, కలువలు, ఎర్ర గోరింటలు, పొగడ పూలవంటి శ్రేష్ఠమైన సుగంధ పుష్పములచే పరమేశ్వరుని అనుగ్రహించిన నిన్ను నేను పూజించెదను, మా ఇంటిలో నెలకొనుము తల్లీ!

శ్రవణం
=======

ఈ కృతిని బెంగళూరు సోదరులు హరిహరన్ అశోక్ ఆలపించారు

24, నవంబర్ 2020, మంగళవారం

హరియే గతి సకల చరాచరములకు - మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కృతి



మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి బహుముఖ ప్రజ్ఞలో గాత్రం, వయోలిన్ సంగీత విద్వత్తుతో పాటు అద్భుతమైన కృతులను రచించి స్వరపరచి, భావరాగ యుక్తంగా ఆలపించే వాగ్గేయకార నైపుణ్యం కూడా ఉంది. ఆయన కొన్ని వందల కృతులను రచించారు. వాటిలో రాగమాలికలు కూడా ఉన్నాయి. వాగ్గేయకారులకు సంగీతంతో పాటు భాషలో పరిపూర్ణమైన నైపుణ్యం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఛందోబద్ధంగా, తాళానికి తగినట్లుగా సాహిత్యాన్ని రచించాలి కాబట్టి వ్యాకరణంపై పట్టు చాలా ముఖ్యం. ఒకే అర్థాన్ని తెలిపే అనేక పదాల అవగాహన పూర్తిగా ఉండాలి, భక్తిభావాన్ని ఉన్నతంగా ఒలికించే స్థాయిలో పరిజ్ఞానం ఉండాలి. పసిబాలుడిగా ఉన్నప్పుడే కచేరీలు మొదలు పెట్టిన బాలమురళి గారు దశాబ్దాల పాటు ఆలిండియా రేడియోలో విజయవాడలో పని చేశారు, ఎందరో కళాకారులకు మార్గదర్శకులుగా నిలిచారు. ఆ సమయం నుండే ఆయన కృతులను రచించారు. ఆయన కృతులతో పాటు ఎన్నో కొత్త రాగాలను కూడా సృష్టించారు. రాగమాలికగా వారు రచించిన ఒక కృతి హరియే గతి. పల్లవి రేవగుప్తిలో, చరణాలు కాంభోజి, శుద్ధ ధన్యాసి, హంసానంది రాగాలలో స్వరపరచారు మంగళంపల్లి వారు. కృతి వివరాలు:

సాహిత్యం
========

హరియే గతి సకల చరాచరములకు
హరియే గతి విరించి రుద్రాదులకైన

ముద్దుల బాలుడై మురళిని చేపట్టి
బాలమురళివై నాదము పూరించి
ముల్లోకములను మునులను సైతము
మురిపించి మైమరపించిన శ్రీ 

ఆయా యుగముల ధర్మము నిలుపగ
అవతారములను దాల్చిన దైవము
హయవాహనుడై కలియుగమందున
అలమేలుమంగపతివై వెలసిన

భస్మాసురులు నయ వంచకులు
అసహన శూరులు పలు శిశుపాలురు
పట్టి బాధించు నిట్టి తరుణమున
పాలన సేయుటకెవరు మాకెవరు

భావం
=====

సమస్త చరాచర జీవరాశులకు శ్రీహరియే గతి. బ్రహ్మ రుద్రాదులకు కూడా శ్రీహరియే గతి. ఆయా యుగములలో ధర్మమును నిలబెట్టుటకు అవతారములెత్తిన పరమాత్మ, అశ్వమును అధిరోహించి కలియుగములో కల్కిగా, అలమేలుమంగాపతియైన శ్రీనివాసునిగా వెలసిన ఆ శ్రీహరే సమస్త చరాచర జీవరాశులకు గతి. భస్మాసురుని వంటి దుష్టులు, దారుణంగా మోసం చేసే వారు, సహనములేని శూరులు, శిశుపాలుని వంటి నీచులు అనేకులు ఈ సమాజాన్ని పట్టి బాధించే ఈ సమయంలో మమ్మలను పాలించేవారెవరు? సమస్త చరాచర జీవరాశులకు ఆ శ్రీహరియే గతి.

శ్రవణం
======

అద్భుతమైన చిట్టస్వరాలతో ఉన్న ఈ కృతిని డాక్టర్ బాలమురళీకృష్ణ గారి ఆలాపనలో దృశ్యశ్రవణంగా వీక్షించండి

22, నవంబర్ 2020, ఆదివారం

ఇలలో ప్రణతార్తిహరుడనుచు - త్యాగరాజస్వామి కృతి


దైవాన్ని నిందించటం భక్తిమార్గంలో మానవ సహజమే. ఒక దైవాన్ని నమ్ముకున్నప్పుడు అసహాయ స్థితిలో ఆ దైవం పలకకపోతే భక్తునికి నిరాశతో అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ, అది తాత్కాలిక భావనే. త్రికరణశుద్ధిగా కొలిచే భక్తుని దైవం అనుగ్రహించకుండా ఉంటాడా? త్యాగరాజస్వామికి అటువంటి అనుగ్రహాలు ఎన్నో. అందుకే ఆయన రచించిన కృతులలో అన్ని రకాల భావనలకు స్థానం ఉంది. తిరువాయూరులోని  పార్వతీపరమేశ్వరుల రూపమైన ధర్మసంవర్ధిని, పంచనదీశ్వరులపై ఆయన కొన్ని కృతులను రచించారు. వాటిలో ఇలలో ప్రణతార్తిహరుడనుచు ఒకటి. తాను ఎంతో ఉపాసన చేసి, కృశించి, ఎంతో కాలము పాదసేవ చేసినా, నిరంతరము సాష్టాంగ ప్రణామాలు చేసినా భక్తసులభుడని పేరొందిన శంకరునికి తనపై కరుణ కలుగలేదని త్యాగరాజస్వామి నిలదీసి అడుగుతున్నారు. భక్తునికి భగవంతుని మధ్య ఇటువంటి సంభాషణలు అనేకం. ఇక్కడ మనం సాష్టాంగ ప్రణామముల ప్రస్తావన చేసుకోవాలి. సాష్టాంగ నమస్కారము అంటే మనకు ఉన్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోऽష్టాంగ ఈరితః, అనగా ఉరముతో, శిరస్సుతో, కన్నులతో, మనసుతో, మాటతో, పాదములతో, చేతులతో, చెవులతో దైవానికి నమస్కరించుట. ఇది ఉపాసనా మార్గంలో ఒక ముఖ్యమైన ఆచారం. దైవం ముందు ఈ ప్రణామం చేయటంలో మనలోని అహంకారానికి మాతృకలైన ఈ ఇంద్రియాలను వంచి పరమాత్మకు దాసోహం అనటం. ప్రతి రోజూ కూడా ఇది చేయటం నిత్యానుష్ఠానంలో ఒక విధి. త్యాగరాజస్వామి ఆ సాష్టాంగ ప్రణామాన్ని ప్రస్తావించటంలో ఉద్దేశం నా సర్వస్వమూ నీ పాదముల వద్ద ఉంచి కొలిచినా నీవు పలకటం లేదు అని. కృతి వివరాలు:

సాహిత్యం
========

ఇలలో ప్రణతార్తిహరుడనుచు పేరెవరిడిరే శంకరుడని నీ

తలచి కరగి చిరకాలము పదమున దండమిడిన నా యెడ దయ లేదాయే

కరచరణ యురము నొసలు భుజములు ధరణి సోక మ్రొక్కగ లేదా
శరణనుచును మొరలిడ లేదా పంచనదీశ త్యాగరాజనుత నీ

భావం
======

త్యాగరాజునిచే నుతించబడిన ఓ పంచనదీశ్వరా! ఈ భూమిపై భక్తుల ఆర్తిని తొలగించేవాడని, శంకరుడని నీకు పేరెవరు ఇచ్చారు? నిన్నే తలచి, కృశించి, చిరకాలముగా నీ పదములకు నమస్కరించిన నా పట్ల నీకు దయలేదాయె! చేతులతో, కాళ్లతో, ఉరముతో, నొసలతో, భుజములతో భూమిని తాకేలా మ్రొక్కగా నాపై దయలేదా? నిన్నే శరణనుచు నేను మొరలిడలేదా?! ఈ భూమిపై భక్తుల ఆర్తిని తొలగించేవాడని, శంకరుడని నీకు పేరెవరు ఇచ్చారు? 

శ్రవణం
======

అఠానా రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

(చిత్రం తిరువాయూర్ పంచనదీశ్వరుడు, ధర్మసంవర్ధిని అమ్మ వారి ఉత్సవమూర్తులు)

21, నవంబర్ 2020, శనివారం

శివ శివ శివ యనరాదా - త్యాగరాజస్వామి కృతి


త్యాగరాజస్వామి నిరంతరం దారితప్పే మనసును సరిదిద్దే సందేశమున్న కృతులను ఎన్నో రచించారు. మనసా ఎటులోర్తునే, మనవి ఆలకించరాదటే వంటి కృతుల ద్వారా మనసును నియంత్రించుకునే మార్గాలను మనకు తెలిపారు. అటువంటి ఒక కృతే శివ శివ శివ యనరాదా. అరిషడ్వర్గాలను, ఇతర దుర్గుణాలను పక్కకు పెట్టి,అన్య స్త్రీలు, అన్యుల ధనముపై ధ్యాస వీడటం మొదలైన వాటిని ఆచరిస్తూ నియమ నిష్ఠలతో పరమశివుని మనసారా కొలువమని చెప్పారు. సజ్జన సాంగత్యం, వేదాధ్యయనం, భగవద్భక్తుల సేవ, శివనామస్మరణ చేస్తే ఈ జన్మకు సంబంధించిన సంసార బాధలను తొలగించుకోవచ్చని హితవు పలికారు. కృతి వివరాలు:

సాహిత్యం
========

శివ శివ శివ యనరాదా ఓరీ భవ భయ బాధలనణచుకోరాదా

కామాదుల తెగగోసి పరభామల పరులధనముల రోసి
పామరత్వము నెడబాసి అతి నేమముతో బిల్వార్చన చేసి 

సజ్జన గణముల గాంచి ఓరీ ముజ్జగదీశ్వరులని మతినెంచి
లజ్జాదుల తొలగించి తన హృజ్జలజమునను పూజించి

ఆగమముల నుతియించి బహు బాగు లేని భాషలు చాలించి
భాగవతులతో పోషించి ఓరీ త్యాగరాజ సన్నుతుడని యెంచి

భావం
======

ఓ మనసా! శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! కామాది అరిషడ్వర్గములను తెగత్రుంచి, అన్యస్త్రీలను, పరుల ధనాదులపై ఆలోచనలను త్యజించి, అజ్ఞానాన్ని విడిచి అత్యంత నియమనిష్ఠలతో బిల్వార్చనతో శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! సజ్జన సమూహములను దర్శించుకుని ఆ పరమశివుని మూడులోకాలకు అధిపతి అని గ్రహించి, దురభిమానము మొదలైన దుర్గుణములను తొలగించుకుని, మన హృదయకమలముచే పూజిస్తూ శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! వేదములను నుతిస్తూ అనవసరమైన సంభాషణలను కట్టి పెట్టి, భాగవతోత్తములను పోషించి, త్యాగరాజునిచే పూజించబడిన వాడని భావించి శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! 

శ్రవణం
=======

పంతువరాళి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

20, నవంబర్ 2020, శుక్రవారం

త్యాగరాజస్వామి లాల్గుడి పంచరత్న కృతి - ఈశ పాహిమం

కర్నాటక సంగీత త్రయంలో త్యాగరాజస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఐదు రకాల పంచరత్న కృతులను రచించారు. అవి ఘనరాగ పంచరత్న కృతులు, తిరువొట్ట్రియూర్ పంచరత్న కృతులు, కోవూరు పంచరత్న కృతులు, శ్రీరంగ పంచరత్న కృతులు, లాల్గుడి పంచరత్న కృతులు. వీటిలో ఘనరాగ పంచరత్న కృతులు జగత్ప్రసిద్ధమైనవి, తిరువాయూరులో, ప్రపంచమంతటా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలలో ఆలపించబడేవి. మిగిలినవి తిరువొట్ట్రియూరులోని త్యాగరాజస్వామి దేవస్థానంలోని త్రిపురసుందరీ అమ్మవారిపై, కోవూరు సుందరేశ్వరునిపై, శ్రీరంగంలోని రంగనాథస్వామిపై, లాల్గుడిలోని సప్తఋషీశ్వర స్వామి దేవస్థానంలోని స్వామిపై, అమ్మపై రచించారు. 

సుబ్రహ్మణ్యుని శాపం నుండి విముక్తి కలిగేందుకు సప్తఋషులు తపస్సు చేసి పరమశివుని కరుణతో శాపవిముక్తులైనారు. అందుకే లాల్గుడిలో వెలసిన ఆ పరమశివుని రూపానికి సప్తఋషీశ్వరుడని పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారి పేరు మహిత ప్రవృద్ధ శ్రీమతి. ఇక్కడి దేవాలయం ఎనిమిదవ శతాబ్దంలో చోళులచే నిర్మించబడింది, స్వామి లింగం స్వయంభూ. లాల్గుడిని సందర్శించినప్పుడు త్యాగరాజస్వామి అయ్యవారిపై, అమ్మవారిపై రచించిన పంచరత్న కృతులు - గతి నీవని (తోడి), లలితే శ్రీప్రవృద్ధే (భైరవి), దేవ శ్రీ (మధ్యమావతి), మహిత ప్రవృద్ధ (కాంభోజి), ఈశ పాహిమాం (కల్యాణి). చివరి కృతి వివరాలు:

సాహిత్యం
========

ఈశ పాహిమాం జగదీశ పాహిమాం

ఆశరగణ మదహరణ బిలేశయ భూష సప్తఋషీ(శ)

శ్రీనాథ కరార్చిత దొరికేనాల్పులకీదర్శన
మేనాటి తపఃఫలమో నీ నామము దొరకె
శ్రీ నారద గానప్రియ దీనార్తి నివారణ పర
మానందార్ణవ దేవ యనాపజనక సప్తఋషీ(శ)

వ్యాసార్చిత పాలిత నిజదాస భూలోక కై
లాసంబను పల్కులు నిజమే సారెకు గంటి
నీసాటి ఎవరయ్యా నీ సాక్షాత్కారమున
వేసట లెల్ల దొలగె నేడే జన్మము సాఫల్యము 

సామాది నిగమ సంచార సోమాగ్ని తరణి లోచన
కామాది ఖండన సుత్రామార్చిత పాద
హేమాచల చాప నిను వినా మరెవరు ముని మనో
ధామ త్యాగరాజ ప్రేమావతార జగ(దీశ)

భావం
======

పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము. రాక్షస గణముల అహంకారాన్ని అణచేవాడవు, సర్పములు ఆభరణములు కలవాడవు, సప్తఋషీశ్వరుడవైన పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము. శ్రీహరి కరములచే పూజించబడిన వాడవు, అల్పులకు నీ దర్శనము దొరికేనా? ఇది ఏ నాటి తపస్సుల ఫలమో నీ నామము లభించింది. నారదుని గానాన్ని ఆనందించేవాడవు, దీనజనుల ఆర్తిని నివారణ చేసే వాడవు, పరమానందమనే సముద్రము వంటి వాడవు, అగ్నిదేవునికి తండ్రివి, సప్తఋషీశ్వరుడవైన పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము. వ్యాసునిచే పూజించబడిన వాడవు, నిజభక్తులను రక్షించేవాడవు, కాబట్టే ఈ లాల్గుడి సప్తఋషీశ్వర క్షేత్రానికి భూలోక కైలాసమన్న పేరు సార్థకము. మరల మరల నిన్ను దర్శించాను, నీ సాటి ఎవ్వరూ లేరు, నీ సాక్షాత్కారముతో నా అలసటలన్నీ తొలగాయి, నా జన్మ సఫలమైనది, పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము. సామాది వేదములలో సంచరించేవాడవు, సూర్యచంద్రాగ్నులు నేత్రములుగా కలవాడవు, కామాది అరిషడ్వర్గములను నాశనము చేసేవాడవు, ఇంద్రునిచే అర్చించబడిన పాదములు కలవాడవు, మేరు పర్వతమును చాపముగా ధరించినవాడవు, నీవు గాక నాకు దిక్కెవరు. మునుల మనసులలో నివసించేవాడవు, ప్రేమావతారుడవైన ఓ పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము. 

శ్రవణం
=======

కల్యాణి రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఈ కృతిని ఓ ఎస్ త్యాగరాజన్ గారు ఆలపించారు

15, నవంబర్ 2020, ఆదివారం

ఈ వసుధ నీ వంటి దైవము - త్యాగరాజస్వామి వారి కృతి

 

సంగీత త్రయంలో ఉన్న ఒక ప్రత్యేకత అనేక క్షేత్రాలు దర్శించినప్పుడు అక్కడి దేవతామూర్తులపై కృతులను రచించటం. ముత్తుస్వామి దీక్షితులవారు భారతదేశమంతా తీర్థయాత్రలు చేశారు, అందుకే చాలా ఎక్కువ కృతులు అటువంటివి రచించారు. త్యాగరాజస్వామి ఎక్కువమటుకు తిరువయ్యారులోనే ఉండేవారు. అప్పుడప్పుడు తీర్థయాత్ర చేసిన క్షేత్రాలలో దేవతామూర్తులపై ఆయన కూడా కృతులను రచించారు. అటువంటి కృతి ఒకటి శహన రాగంలో కూర్చబడిన ఈ వసుధ నీ వంటి దైవము. చెన్నై సమీపంలోని కోవూరు సుందరేశ్వరునిపై ఆయన ఐదు కృతులను రచించారు. అవి కోవూర్ పంచరత్న కృతులుగా పేరొందాయి. దీని వెనుక ఒక గాథ ఉంది. 

త్యాగరాజస్వామి వారు తిరుమల తీర్థయాత్రకు వెళుతూ మధ్యలో కోవూరులో సుందరేశ మొదలియార్ అనే జమీందారును కలుస్తారు. త్యాగరాజస్వామి వారిని మొదలియార్ గారు కొన్ని కృతులను తనపై కృతులను రచించమని కోరతాడు. తాను మానవులను నుతిస్తూ కృతులను రచించనని చెప్పి త్యాగరాజస్వామి తిరుపతి బయలుదేరతారు. తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యంలో బందిపోటు దొంగలు త్యాగరాజస్వామి వారి సమూహంపై దాడిచేయబోగా స్వామి వారికి తన వద్ద ఏమీ లేదని చెబుతారు. ఆ బందిపోట్లు తమపై రాళ్లు విసిరిన ఇద్దరు తేజోమూర్తులెవరు అని ప్రశ్నిస్తారు. త్యాగరాజస్వామి వారిని రామలక్ష్మణులుగా గుర్తించి ఆ బందిపోట్ల భాగ్యానికి ఆనందిస్తారు. కోవూరు క్షేత్రానికి గల మహిమను గ్రహించి అక్కడి సుందేశ్వరుడు, సౌందరాంబికను దర్శించుకుని ఐదు కృతులను రచిస్తారు. ఆ కృతులను విన్న మొదలియారు అవి తనపై రచన చేశారు అనుకుని సంతోషించగా త్యాగరాజస్వామి ఆ కృతులను తాను కోవూర్ సుందరేశ్వరునిపై రచించాను అని చెప్పి తిరిగి తిరువయ్యరు వెళ్లిపోతారు. ఈ కోవూరు పంచరత్న కృతులు - ఈ వసుధ (శహన), కోరి సేవింప (ఖరహరప్రియ), శంభో మహాదేవ (పంతువరాళి), నమ్మి వచ్చిన (కల్యాణి), సుందరేశ్వరుని (శంకరాభరణం). వాటిలో ఈ వసుధ నీ వంటి అనే కృతి వివరాలు:


సాహిత్యం
========

ఈ వసుధ నీ వంటి దైవమునెందు గానరా

భావుకము గల్గి వర్ధిల్లు కోవూరి సుందరేశ గిరీశ

ఆసచే అరనిముషము నీ పురవాస మొనర ఏయు వారి మది
వేసటలెల్లను తొలగించి ధనరాశులనాయువును
భూసుర భక్తియు తేజమునొసగి భువనమందు కీర్తి గల్గ జేసే
దాస వరద త్యాగరాజ హృదయ నివాస చిద్విలాస సుందరేశ

భావం
=====

శుభములు కలిగించుచు వర్ధిల్లే ఓ కోవూరి సుందరేశా! గిరీశ్వరా! ఈ భూమిపై నీవంటి దైవమును ఎక్కడా కానలేను. ఆశతో అరనిమిషమైన నీ సన్నిధిలో యుండే వారి మనసులోని పరితాపములను తొలగించి ధనరాశులను, ఆయుష్షును, బ్రాహ్మణుల పట్ల భక్తిని, తేజస్సును ప్రసాదించి ఈ జగత్తులో కీర్తిని కలిగించేవాడవు, దాసులకు వరములొసగే వాడవు, త్యాగరాజుని హృదయములో నివసించేవాడవు, చిద్విలాసుడవైన ఓ సుందరేశా! ఈ భూమిపై నీవంటి దైవమును ఎక్కడ కానలేను. 

శ్రవణం
======

శహన రాగంలో కూర్చబడిన ఈ కృతిని జీఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు

14, నవంబర్ 2020, శనివారం

రారా మా ఇంటి దాక - త్యాగరాజస్వామి వారి కృతి



ప్రహ్లాద విజయం త్యాగరాజస్వామి వారు రచించిన అద్భుతమైన యక్షగానం. అనేక కృతులతో, పద్యాలతో, గద్యంతో ఈ యక్షగానం ప్రహ్లాదుని భక్తిని, శ్రీహరి రూపమైన రాముని అనుగ్రహాన్ని ఆవిష్కరిస్తుంది. సాగర తీరంలో శ్రీహరి దర్శన భాగ్యం కలిగిన తరువాత స్వామి ప్రహ్లాదుని తన తొడపై కూర్చుండబెట్టుకుని చేతులతో నిమిరి ప్రహ్లాదుని కౌగిలించుకుంటాడు. ఆ భాగ్యాన్ని ఆస్వాదించిన ప్రహ్లాదుడు స్వామిని తన నివాసానికి రమ్మని వేడుకునే కృతి ఇది. పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు నిరంతర శ్రీహరి దర్శనాభిలాషియై స్వామిని తనతోనే ఉండమనే భావనను ఈ కృతి ద్వారా త్యాగరాజస్వామి తెలియజేశారు. ప్రహ్లాదుని హరిభక్తిలో ఉండే శరణాగతి, అనన్యమైన విశ్వాసాలు ఈ కృతిలో స్పష్టంగా మనకు గోచరిస్తాయి. వాగ్గేయకారులు భాగవతోత్తములపై ఇటువంటి రచనలు చేయటంలో ఉద్దేశం వారి మార్గంలోని ఔన్నత్యాన్ని, వారి భావనలను మనకు తెలియజేయటానికే. అందుకు సంగీత సాహిత్యాలకు మించిన సాధనమేముంటుంది? అందుకే త్యాగరాజస్వామి ప్రహ్లాద విజయం మేటి యక్షగానంగా నిలిచిపోయింది. 

సాహిత్యం
========

రారా మా ఇంటి దాక! రఘువీర! సుకుమార! మ్రొక్కేరా!

రారా దశరథ కుమార! నన్నేలుకోరా! తాళలేరా!

కోరిన కొర్కెలు కొనసాగకనే నీరజనయన నీ దారిని గని వే 
సారితి గాని సాధు జనావన సారి వెడలి స్వామి నేడైనా

ప్రొద్దున లేచి పుణ్యము తోటి బుద్ధులు చెప్పి బ్రోతువు గాని 
ముద్దుగారు నీ మోమును జూచుచు వద్ద నిలచి వారము పూజించేను

దిక్కు నీవనుచు తెలిసి నన్ను బ్రోవ గ్రక్కున రావు కరుణను నీ చే 
జిక్కియున్న నన్ను మరతురా ఇక శ్రీ త్యాగరాజుని భాగ్యమా

భావం
=====

ఓ రఘువీర! సుకుమార! నీకు మ్రొక్కెదను మా యింటి దాకా రారా! ఓ దశరథ కుమారా, నేనిక తాళలేకున్నాను నన్నేలుకొనుటకు రారా! నేను కోరుకున్న కోరికలు తీరకనే నీవు వెళ్లిపోయినంత నేను వేసారితిని. కావున ఓ సాధుజన రక్షకా! మరల ఈరోజైనా రావయ్యా స్వామీ! పొద్దునే లేచి పుణ్యమైన బుద్ధులు నాకు చెప్పి నన్ను బ్రోవుము. నీ ముద్దుగారే మోమును చూచుచు నీ వద్దనే నిలిచి మరల మరల పూజింతును, నీకు మ్రొక్కెదను, మా ఇంటి దాకా వచ్చి నన్ను బ్రోవుము. నీవే దిక్కని తెలిసినా నన్ను బ్రోచుటకు వేగము రావు, నాపై కరుణించుము, నీచేతిలో చిక్కియుంటే నన్ను నేను మరతునురా! నా భాగ్యమా! నీకు మ్రొక్కెదను, ఇక నన్ను బ్రోచుటకు మా ఇంటి దాకా రారా! 

శ్రవణం
======

అసావేరి రాగంలోని ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

12, నవంబర్ 2020, గురువారం

రఘునాయకా నీ పాదయుగ రాజీవముల - సద్గురువులు త్యాగరాజస్వామి

త్యాగరాజస్వామి కృతులలో శరణాగతి చాలా కృతులలో గోచరిస్తుంది. సంసార సాగరాన్ని దాటలేని నిస్సహాయ స్థితిలో ఆశ్రితులజనరక్షకుడని పేరొందిన రాముని పాదములను పట్టుకుని విడువకుండా కొలిచే స్థితిని రఘునాయకా నీ పాదయుగ రాజీవముల అన్న కృతిలో ఆవిష్కరించారు. ఎంతో శ్రమపడి రాముని సన్నిధి చేరి శరణు కోరుతున్నాను అని స్వామిని వేడుకున్నారు స్వామి. శ్రీమద్రామాయణంలో ఆశ్రయించిన వారిని రాముడు అమితమైన వాత్సల్యంతో అనుగ్రహించి రక్షించిన సందర్భాలు ఎన్నో. ఆ విధంగానే తాను కూడా, తనను ఆదరించి ఆనందము కలుగజేయవలసిందిగా రాముని ప్రార్థించారు. 

సాహిత్యం
========

రఘునాయకా నీ పాదయుగ రాజీవముల నే విడజాల శ్రీ 

అఘజాలముల పారద్రోలి నన్నాదరించ నీవే గతి గాదా శ్రీ

భవసాగరము దాటలేక నే బలు గాసి పడి నీ మఱుగు జేరితిని
అవనిజాధిపాశ్రితరక్షకా ఆనందకర శ్రీ త్యాగరాజనుత

భావం
=====

రఘుకుల శ్రేష్ఠుడవైన శ్రీరామా! నీ పదకమలములను నే విడువను. నా పాపసమూహములను పారద్రోలి ఆదరించుటకు నీవే గతి కదా! ఈ సంసార సాగరము దాటలేక నేను ఎంతో శ్రమపడి నీ సన్నిధికి చేరుకున్నాను. భూమిజయైన సీతకు పతివైన శ్రీరామా! నీవు ఆశ్రితరక్షకుడవు, ఆనందమును కలిగించేవాడవు! శివునిచే నుతించబడిన వాడవు, నీ పదకమలములను నేను విడువలేను. 

శ్రవణం
=======

హంసధ్వని రాగంలో కూర్చబడిన ఈ కృతిని ప్రియా సోదరీమణులు షణ్ముఖ ప్రియ, హరిప్రియ ఆలపించారు

11, నవంబర్ 2020, బుధవారం

నిన్నాడనేల - సద్గురువులు త్యాగరాజస్వామి కృతి

 


దైవనింద నాస్తికులే కాదు, భక్తిమార్గంలో ఉన్నవారెందరో కూడా చేస్తారు. దీనికి కారణం ఈ భవసాగరంలో ఎదురయ్యే బాధలు, సమస్యలను తట్టుకోలేక తాము నమ్ముకున్న దైవం కూడా కాపాడటం లేదు అన్న ఆవేదనతో. కానీ భగవదనుగ్రహం ఎప్పుడూ సానుకూల ఫలాలలోనే కాదు, భవసాగర తారణంలో కలిగే పాఠాలలో కూడా ఉంటుంది అనేది భగవంతుడు సాక్షీభూతుడుగా ఉండటంలో రహస్యం. ఇది సద్భక్తులకు అనుభవపూర్వకంగా అవగతమవుతుంది. అందుకే ఆధ్యాత్మిక కొండను ఎక్కుతున్న భక్తునికి మొదటి భాగంలో అనేక రకాల భావనలు వస్తాయి, ముందుకు వెళుతున్న కొద్దీ అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించిన తరువాత దైవనింద చేయటం తగ్గుతుంది. పూర్వజన్మ కర్మఫలాలు కొన్నిటిని అనుభవించక తప్పదు అన్నది చాలా మెట్లు ఎక్కితే కానీ మనసు అంగీకరించదు. ఆ తరువాత ప్రయాణంలో అటువంటి ఆలోచనా తరంగాలు సద్దుమణుగుతాయి, తారణం సాఫీగా సాగుతుంది. 

అనుభవపూర్వకంగా కలిగే ఈ జ్ఞానాన్ని తన కృతిద్వారా వివరించారు సద్గురువులు త్యాగరాజస్వామి. సాక్షీభూతుడైన స్వామికి నిన్నాడనేల అని తన ఉన్నతమైన భావనలను తెలియజేశారు. కన్నడ రాగంలోని ఈ కృతిని హైదరాబాద్ సోదరులు శేషాచార్యులు, రాఘవాచార్యులు ఆలపించారు. కన్నడ రాగం ధీర శంకరాభరణ జన్యం. అందమైన గమకాలతో త్యాగరాజస్వామి భావనలను మనోజ్ఞంగా కన్నడ రాగం ఆవిష్కరిస్తుంది. 

నిన్నాడనేల! నీరజాక్ష శ్రీరామ!

కన్నవారిపైని కాకసేయనేల!

కర్మానికి తగినట్టు కార్యములు నడిచేని
ధర్మానికి తగినట్టు దైవము బ్రోచేని

చిత్తానికి తగినట్టు సిద్ధియు కలిగేని
విత్తానికి తగినట్టు వేడుక నడిచేని

సత్త్వరూప నిన్ను సన్నుతి జేసి
తత్త్వము దెలిసిన త్యాగరాజునికి

కలువలవంటి కన్నులు కలిగిన శ్రీరామా! నా కష్టములకు నిన్ను నిందించుట తప్పు. మన కష్టాలకు కన్న తల్లిదండ్రులపై కోపగించుకొనుట యెందుకు? కర్మలకు తగినట్లుగానే కదా ఫలములు, తదుపరి కార్యములు నడిచేది? ధర్మాచరణను బట్టి కదా దైవానుగ్రహము? మన చిత్తశుద్ధిని బట్టి కదా మనకు సిద్ధించే ఫలాలు? డబ్బుకు తగినట్లు కదా వేడుకలు? శుద్ధ సత్త్వ స్వరూపుడవైన నిన్ను నుతించి నీ తత్త్వము గ్రహించినాను, నేను నిందించే పని లేదు శ్రీరామా! 

7, నవంబర్ 2020, శనివారం

అక్షయలింగ విభో స్వయంభో - ముత్తుస్వామి దీక్షితుల కృతి

ముత్తుస్వామి దీక్షితులవారి కృతులలో ఎక్కువ మటుకు క్షేత్ర కృతులే. అనగా, దక్షిణ భారత దేశంలో ఉన్న అనేక దివ్యక్షేత్రాలను సందర్శించి, ఆ దేవతను ఆయన ఉపాసన చేసినప్పుడు రచించినవి. అటువంటి కృతి ఒకటి తమిళనాడులోని నాగపట్టణం జిల్లా కీళ్వేలూరులో ఉన్న అక్షయలింగేశ్వర క్షేత్రంలో వెలసిన స్వామిపై రచించినది. క్షేత్ర ప్రస్తావనలో వాగ్గేయకారులు ఆ క్షేత్రంలోని దేవతలతో పాటు ఇతర వివరాలను కూడా సుస్పష్టంగా పొందుపరచటంలో ఉద్దేశం ఆయా క్షేత్రాలు, దేవతామూర్తుల యొక్క విశిష్టతను, విలక్షణతను శాశ్వతం చేయటం కోసమే. ఇక్కడ అమ్మవారు, స్వామి బదరీవృక్షం క్రింద స్థితమై ఉంటారు. అలాగే ఇక్కడ భద్రకాళీ అమ్మ వారి మూర్తి కూడా ఉంది. వీటిని కృతిలో దీక్షితులవారు ప్రస్తావించారు. అక్షయలింగేశ్వర స్వామి క్షేత్రం చాలా పురాతనమైనది. స్వయంభూ లింగ స్వరూపంలో పరమశివుడు సుందరకుచాంబిక, భద్రకాళిగా పార్వతీ దేవి, వినాయకుడు, కుమారస్వామితో సహా అనేక దేవతామూర్తులు ఈ క్షేత్రంలో ఉన్నాయి. శైవయోగి, కవి జ్ఞానసంబంధర్ రచనలలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. కృతిలో చైత్రపూర్ణిమ నాడు స్వామికి జరిగే భవ్యమైన రథోత్సవ ప్రస్తావన కూడా దీక్షితార్ చేశారు. సనాతన ధర్మ పరిరక్షణలో దీక్షితార్ కృతుల పాత్ర ఎనలేనిది. ఇప్పుడు ద్రావిడవాదం వచ్చి పేర్లు మార్చబడినా, ఒకనాడు తమిళనాడులో ఉన్న క్షేత్రాలు, దేవతల నామాలన్నీ కూడా సనాతన ధర్మానికి మూలమైన సంస్కృత భాషలో ఉన్నవే. దీక్షితుల వారు ఆ నామాలనే తన కృతులలో ఉపయోగించారు. 

ధీరశంకరాభరణ రాగంలో కూర్చబడిన ఈ కృతిని డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

అక్షయలింగ విభో స్వయంభో అఖిలాండ కోటి ప్రభో పాహి శంభో

అక్షయ స్వరూప అమిత ప్రతాప ఆరూఢ వృషవాహ జగన్మోహ
దక్ష శిక్షణ దక్షతర సుర లక్షణ విధి విలక్షణ లక్ష్య
లక్షణ బహు విచక్షణ సుధా భక్షణ గురు కటాక్ష వీక్షణ

బదరీ వనమూల నాయికాసహిత భద్రకాళీశ భక్త విహిత
మదన జనకాది దేవ మహిత మాయాకార్య కలనా రహిత
సదయ గురుగుహ తాత గుణాతీత సాధు జనోపేత శంకర నవనీత
హృదయ విభాత తుంబురు సంగీత హ్రీంకార సంభూత హేమగిరి నాధ
సదాశ్రిత కల్పక మహీరుహ పదాంబుజ భవ రథ గజ తురగ
పదాది సంయుత చైత్రోత్సవ సదాశివ సచ్చిదానందమయ

ఓ అక్షయలింగ ప్రభో! నీవు స్యయంభువుడవు, సమస్త విశ్వములకు ప్రభువువుం శంకరుడవు, నన్ను రక్షింపుము. నాశనము లేని స్వరూపము కలవాడవు, అమిత ప్రతాపవంతుడవు, నందీశ్వరుని అధిరోహించిన జగన్మోహనుడవు. దక్షుని శిక్షించినవాడవు, దేవతలకు విధివిధానములను, విలక్షణమైన తత్త్వములను, లక్ష్యములను దక్షిణామూర్తి రూపములో శిక్షణనొసగిన నిపుణుడవు, అనేక రకములైన విచక్షణ కలవాడవు, అమృతమును సేవించేవాడవు, ఘనమైన కటాక్ష వీక్షణము కలవాడవు, నన్ను రక్షింపుము. బదరీ వనములో పార్వతీదేవి సమేతుడవై యున్నవాడవు, భద్రకాళికి ప్రభువువు, భక్తులకు హితుడవు. మదనుని జనకుడైన శ్రీహరి మొదలైన దేవతలచే నుతించబడిన వాడవు, మాయ చేసే కల్పనలకు అతీతుడవు, ఎల్లప్పుడూ కుమారస్వామిపై పితృవాత్సల్యమును కురిపించేవాడవు, గుణాతీతుడవు, సాధుజనుల సమీపములో ఉండి శుభములు కలిగించేవాడవు, వెన్నవంటి హృదయము కలవాడవు, తుంబురుని సంగీతమును ఆనందించేవాడవు, హ్రీంకారము నుండి ఉద్భవించినవాడవు, కైలాసపతివి, నీ పదకమలములను ఆశ్రయించేవారికి కల్పవృక్షము వంటివాడవు, భవుడవు, రథ గజ తురగ పదాది సైన్యముతో చైత్రోత్సవములో ప్రకాశించే సదాశివుడవు, సచ్చిదానందమయుడవు. నన్ను రక్షింపుము.

చిత్రం కీళ్వేలూరులోని కెదిలియప్పర్ (అక్షయలింగేశ్వరుని) రూపము

6, నవంబర్ 2020, శుక్రవారం

తలచినంతనే నా తనువైతే ఝల్లనెరా - త్యాగరాజస్వామి కృతి


మానసిక స్థితిని బట్టి ఆధ్యాత్మిక అనుభూతులు. మన ధర్మంలో ఈ సత్యానికి ఎన్నో నిదర్శనాలు. సద్గురువులు త్యాగరాజస్వామి వారి కృతులలో ఇది మనకు సుస్పష్టంగా గోచరిస్తుంది. కనబడలేదని విచారము, దయలేదని నిష్ఠూరము, ఉన్నాడో లేడో అని సంశయము, మహిమ అనుభూతికి రాగానే అమితానందము, అంతటా ఉన్నాడని గ్రహింపుకు వస్తుంటే తనువు పులకింత, అది అనుభవాల ద్వారా మరింత ప్రగాఢమై అంతర్ముఖమైన సాధన, అన్నిటికీ రాముడే రక్ష అన్న దృఢమైన విశ్వాసముతో ఎటువంటి క్లేశాన్నైనా భరించే ఓర్పు...ఇలా త్యాగరాజస్వామి ఆధ్యాత్మిక ప్రయాణంలో సమస్త లక్షణాలూ తన కృతులలో వ్యక్తపరచారు. మలిదశలో పరిణతి చెందిన భక్తివిశ్వాసములతో పరిపుష్టమైన మానసిక వికాసము కనబరచిన ఒక కృతి తలచినంతనే నా తనువైతే ఝల్లనెరా. 

సాహిత్యము:

తలచినంతనే నా తనువైతే ఝల్లనెరా

జలజ వైరి ధరాది విధీంద్రుల
చెలిమి పుజలందిన నిను నే

రోటికి కట్టదగిన నీ లీలలు
మూటికెక్కువైన నీదు గుణములు
కోటిమదనలావణ్యమునైన
సాటి గాని నీ దివ్యరూపమును 

నిద్రాలస్య రహిత శ్రీరామ 
భద్రానిలజ సులభ సంసార
చ్ఛిద్రార్తిని దీర్చే శక్తిని విధి
రుద్రాదుల నుతమౌ చరితంబును

పాదవిజిత మునితరుణీ శాపా
మోద త్యాగరాజనుత ధరాప
నాదబ్రహ్మానంద రూప
వేదసారమౌ నామధేయమును

భావము:

ఓ శ్రీరామా! నిన్ను తలచినంతనే నా శరీరామంతా ఝల్లుమని పులకరిస్తుంది. కమలమునకు శత్రువైన చంద్రుని శిరమున ధరించే పరమశివుడు, బ్రహ్మేంద్రాదుల స్నేహము, పూజలు అందుకున్న నిన్ను తలచినంతనే నా శరీరము పులకిస్తుంది. శ్రీకృష్ణావతారములో నీ అల్లరి చేష్టలకు యశోదమ్మ నిన్ను రోటికి కట్టివేయుట, త్రిగుణాతీతమైన నీ గుణములు, కోటి మన్మథులకైన సాటి కాని సౌందర్యము గల నీ దివ్యరూపమును తలచినంతనే నా శరీరమంతా పులకించును. నిద్ర, అలసత్వము మొదలైన తమోగుణములు లేని శ్రీరామా! భద్రునికి, ఆంజనేయునికి నీవు సులభుడవు! సంసార దోషములనే ఆర్తులను తీర్చే శక్తి కలిగిన వాడవు! బ్రహ్మ రుద్రాదులచే నుతించబడిన చరితము కలిగిన నిన్ను తలచినంతనే నా శరీరము పులకించును. సమస్త భూమండలమును పాలించి, ఆనందముతో పరమశివునిచే నుతించబడిన శ్రీరామా! నీ పాద ధూళిని తాకినంతనే శాపవిముక్తురాలైన గౌతమముని పత్ని అహల్య చరితము, నీ నాదబ్రహ్మానంద స్వరూపము, వేదముల సారమైన నీ నామమును తలచినంతనే  నా శరీరమంతా ఝల్లని పులకిస్తుంది. 

వివరణ:

పరబ్రహ్మ స్వరూపమైన రాముని గుణములను, సౌందర్యాన్ని, వైభవాన్ని తెలిపే రామాయణాది వాఙ్మయం మనకు నిత్య పూజనీయమైనవి. శ్రీరాముని చరితమును అత్యంత మనోజ్ఞముగా వర్ణించిన వాల్మీకి మహర్షి రచించిన రామాయణం పఠించేటప్పుడు ఈ కృతిలో త్యాగరాజస్వామికి కలిగే భావనలన్నీ మనకు కలుగుతాయి. ఆ భావనలు మనసులో నిలిచిపోవాలంటే నిరంతర పునశ్చరణ, నామస్మరణముతో కూడిన సాధన అవసరం. ఆ స్థాయికి త్యాగరాజస్వామి వారు చేరుకున్నాక రాముని తలచుకున్న వెంటనే భవ్యమైన రామ పరబ్రహ్మ తత్త్వముతో పాటు సగుణ వైభవములు కూడా గోచరమై తనువు పులకించి తన్మయత్వము కలిగింది. ఈ భావనలన్నీ సాధకునికి భవసాగరం దాటడానికి అత్యంత ఉపయుక్తమైన ఆలంబనలు. అనంతమైన పరమాత్మ తత్త్వం ముందు మనము, మన కష్టాలు ఎంత? ఘోరమైన శాపం వల్ల  పాషాణమైన అహల్యకు ముక్తిని కలిగించాడు రాముడు, మనలను కూడా అదే విధంగా అనుగ్రహిస్తాడు అన్న భావనను తప్పక కలిగిస్తుంది. రాముని జీవితంలో ప్రతి అడుగూ మనకు ఆదర్శప్రాయమే, మన దోషాలను తొలగించుకుంటూ ముక్తి పథంలో ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి. ఇది అనుభవైకవేద్యంగా తెలిపారు నాదయోగి త్యాగరాజస్వామి. రామనామ స్మరణ, సంకీర్తనల ద్వారా రాముని హృదయములో నిలుపుకుని తరించారు. 

శ్రవణం:

ముఖారి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణగారు శ్రావ్యంగా ఆలపించారు

5, నవంబర్ 2020, గురువారం

అందము ఆనందము రామానుజార్య సంబంధము - నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు

త్యాగరాజ శిష్యపరంపరకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, పండితులు, గురువులు, హరికథా భాగవతార్ శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి శిష్యులైన వీరు ఎందరో గొప్ప కళాకారులకు గురువులు. ఎన్నో పుస్తకాలను రచించారు. 1924లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జన్మించిన వీరు వ్యాకరణ మీమాంస శాస్త్రములను అభ్యసించారు. రామకృష్ణయ్య పంతులు గారి వద్ద గురుకుల పద్ధతిలో కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. 1948 నుండి 1983 వరకు ఆకాశవాణి విజయవాడలో నిలయ విద్వాంసునిగా పనిచేశారు. గానకళాప్రపూర్ణ, సంగీత సాహిత్య కళానిధి, హరికథా చూడామణి, సంగీత కళాసాగర బిరుదులను పొందారు. ఆకాశవాణి స్వర్ణోత్సవాల సమయంలో, తెలుగు విశ్వవిద్యాలయం నుండి ప్రత్యేక పురస్కారాలను పొందారు. కృష్ణమాచార్యుల వారు త్యాగరాజస్వామి యక్షగానాలను తెలుగు నుండి సంస్కృతంలోకి అనువదించారు. 20కు పైగా కృతులు, వర్ణాలు, తిల్లానాలు రచించారు. 60 ఏళ్ల సుదీర్ఘమైన సంగీత ప్రస్థానం కలిగిన వీరికి మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ వారు వీరికి వాగ్గేయకార అవార్డును ప్రదానం చేశారు. శ్రీభాష్యం అప్పలాచార్యుల వారితో ఎంతో అనుబంధం ఉన్న వీరు 2006లో పరమపదించారు. 

కృష్ణమాచార్యుల వారు రామానుజుల వారిని నుతిస్తూ రచించిన ఒక చక్కని కృతిని రచించారు. ఈ కృతిని ఆనందభైరవి రాగంలో స్వరపరచారు. ఈ కృతిని వారి శిష్యుడు ప్రముఖ వయోలిన్ విద్వాంసులు శ్రీ ఎం.ఎస్.ఎన్ మూర్తి గారి సతీమణి, ప్రఖ్యాత విద్వాంసురాలు డాక్టర్ పంతుల రమ గారు ఆలపించారు

అందము ఆనందము రామానుజార్య సంబంధము దాని
చందము మోక్ష కందము మరి చందనాగురు గంధము 

ఘనము పావనము భాష్యకార పద సేవనము జీ-
వనము సదవనము ప్రాక్తన పాప మోచనము

సారము పుణ్య సారము యతి చంద్రుని దివ్యాకారము జగదా-
ధారము తమోదూరము భూత దయాపారావారము

ధ్యేయము భాగధేయము యతి దినకరు నామధేయము కర్ణ-
పేయము నిరపాయము కృష్ణ గేయము సదుపాయము

ఎవ్వరే రామయ్య నీ సరి - త్యాగరాజస్వామి కృతి


రాముని అనేక సుగుణాలలో వైరివర్గములో ఉన్నా సజ్జనులను గుర్తించి వారికి అభయమిచ్చి అనుగ్రహించటం. సీతమ్మను అపహరించిన రావణుని సోదరుడైన విభీషణుని అనుగ్రహించి లంకకు రాజును చేయటంలో రాముని విచక్షణ ఎంత ఉన్నతమైనదో, సునిశితమైనదో మనం గుర్తించాలి అన్న ముఖ్యమైన అంశాన్ని త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ రాముని ప్రాతిపదిక విభీషణుని వ్యక్తిత్వం, ధర్మానురక్తి మరియు రావణుని తరువాత లంక సుఖశాంతులతో ఉండాలి అన్న సంకల్పం. రావణుడు చేసిన దారుణానికి విభీషణుని నమ్మకపోవటం అనేది మానవ సహజం, కానీ రాముడు అందుకు భిన్నంగా అతని నైజాన్ని, భక్తిని, సమర్థతను గుర్తించి సముచితమైన నిర్ణయం తీసుకున్నాడు. అందుకే రాముని మించిన ప్రభువు లేడు అన్నది త్యాగరాజస్వామి సుస్పష్టం చాటారు. 

రామాయణం పఠించి ఆ లోకాభిరాముని వ్యక్తిత్వాన్ని ఆకళింపు చేసుకుంటే రాముడి నడవడిక నుండి మనకు నిత్యజీవితంలో అత్యంత శ్రేయస్కరమైన లక్షణాలు ఎన్నో అవగతమవుతాయి. ఎక్కడ ఉన్నా ధర్మబద్ధమైన నడవడిక కలిగిన వారికి పరమాత్మ అనుగ్రహం ఉంటుంది అన్నది రాముని విచక్షణ ద్వారా మనకు ఎంతో కీలకమైన సందేశం. ఈ సులక్షణాలే మనకు ఎల్లప్పటికీ మార్గదర్శకాలు. 

ఎవ్వరే రామయ్య నీ సరి

రవ్వకు తావులేక సుజనులను రాజిగ రక్షించే వా(రె)

పగవానికి సోదరుడని యెంచక భక్తినెరిగి లంకా పట్టణమొసగగ
నగధర సురభూసుర పూజిత వర నాగశయన త్యాగరాజ వినుత సరి

ఓ రామయ్యా! నీకు సాటి ఎవ్వరు? కీర్తికి భంగము కలుగకుండా సుజనులను సక్రమముగా నీవలె రక్షించే వారెవ్వరు? శత్రు సోదరుడని యెంచక విభీషణుని భక్తిని గుర్తించి లంకా పట్టణమునకు రాజును చేసినావు. మందర పర్వతమును ధరించిన శ్రీహరీ! దేవతలచే, బ్రాహ్మణులచే పూజించబడిన శ్రేష్ఠుడా! ఆదిశేషునిపై శయనించేవాడా! పరమశివునిచే నుతించబడే శ్రీరామా! నీకు సాటి ఎవ్వరు? 

గాంగేయభూషణి రాగంలో కూర్చబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు మధురంగా ఆలపించారు

4, నవంబర్ 2020, బుధవారం

రాముడు రాఘవుడు రవికులుడితడు - తాళ్లపాక అన్నమాచార్యుల వారు


 
రాముడు రాఘవుడు రవికులుడితడు 
భూమిజకు పతియైన పురుష నిధానము 

అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున
పరగ జనించిన పర బ్రహ్మము
సురుల రక్షింపగ నసురుల శిక్షింపగ
తిరమై ఉదయించిన దివ్య తేజము

చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో
సతతము నిలిచిన సాకారము
వింతలుగా మునులెల్ల వెదకినయట్టి
కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము

వేద వేదాంతముల యందు విజ్ఞాన శాస్త్రములందు
పాదుకొన పలికేటి పరమార్థము
పోదితో శ్రీ వేంకటాద్రి బొంచి విజయనగరాన
ఆదికిననాదియైన అర్చావతారము

సూర్యవంశమున రఘుమహారాజు పరంపరలో జన్మించి సీతమ్మకు పతియైన పురుషోత్తముడు ఈ రాముడు. దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్టిలో పరమాన్నమున పరబ్రహ్మ రూపమై, దేవతలను రక్షించుటకు, దానవులను శిక్షించుటకు స్థిరముగా ఆవిర్భవించిన దివ్య తేజో రూపము ఇతడు. నిరంతరం ధ్యానించే యోగిశ్రేష్ఠుల హృదయ కమలములలో ఎల్లప్పుడూ నిలిచిన సాకారము, మునిజనులు ఎంతో ఆతృతతో వెదకే  కాంతులతో ప్రకాశించే ముక్తి పదము ఇతడు. వేద వేదాంతములలో, విజ్ఞాన శాస్త్రములలో పలుకబడిన శాశ్వత పరమార్థము, వైభవముతో రక్షకుడై వేంకటాద్రిపై మరియు విజయనగరములో వెలసి, ఆదికే అనాదియై అర్చించబడే అవతారమూర్తి ఈ రాముడు. 

ఈ కృతిని గరిమెళ్ల అనిలకుమార్ గారు ఆలపించారు

3, నవంబర్ 2020, మంగళవారం

ఆడ మోడి గలదా రామయ్యా! - త్యాగరాజస్వామి కృతి

రామభక్తి సామ్రాజ్యపు దొర హనుమ. మరి ఆ హనుమ స్వామిని మొట్టమొదటి సారి కలిసే రామాయణ ఘట్టంలో రాముడు ఏం చేశాడు? ఇతనెవరో అన్న శంకతో ఉన్న లక్ష్మణుని మాట్లాడేందుకు పంపాడు, తమ్మునికి హనుమ వైభవాన్ని అద్భుతంగా లక్షణయుతంగా వివరించాడు. సకల విద్యాపారంగతుడు, వ్యాకరణాది సమస్త శాస్త్ర కోవిదునిగా అభివర్ణించి లక్ష్మణుని శంకను తొలగించాడు. ఆ విధంగా రాముడు హనుమ గొప్పతనాన్ని చాటాడు. ఆ ఘట్టాన్ని గుర్తు చేసుకుని త్యాగయ్య ఈ కృతి ద్వారా తనను తాను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు అనిపించినా రాముని మనసులోని మర్మాన్ని, ఆధ్యాత్మిక మార్గంలో పరమాత్మ ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తాడు అన్న దానిని సూచించేందుకే ఈ కృతి. రామాంజనేయ సమాగమ ఘట్టం నుండి మనకు సందేశం ఏమిటి? అన్నీ తెలిసిన పరమాత్మ లీలానాటకాలు కార్యాకారణ సంబంధం కలవి. హనుమ యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలిసేది ఎలా? ఈ విధంగానే. 

ఆడ మోడి గలదా రామయ్యా చారుకేశి రాగంలో కూర్చబడింది. నూకల చినసత్యనారాయణ గారు ఈ కృతికి త్యాగరాజస్వామి ఈ రాగాన్నే ఎందుకు ఎన్నుకున్నారో అద్భుతంగా వివరించారు. చారుకేశి శంకరాభరణం, తోడి సమ్మేళనం. శంకరాభరణ స్వరాలతో త్యాగరాజునికి, మనకు, తోడి స్వరాలతో రాముని మేళవించి,ఒకే రాగంగా చారుకేశి అయిన సీతాదేవిని తిరిగి పొందటం అనే ఒకే సంకల్పంగా ఒకరికొకరు సన్నిహితులై ఐక్యతను సాధించే సన్నివేశంగా అభివర్ణించారు. సాహిత్య సంగీత రస భావ ప్రకటనను ఆ విధంగా త్యాగరాజస్వామి అద్భుతంగా వివరించారు అని నూకల వారు ఎంతో ఉన్నతంగా తమ త్యాగరాజ సాహిత్య సర్వస్వంలో వివరించారు. రామాంజనేయుల సమాగమం శంకరభరణం తోడిల కలయికల ఫలితం చారుకేశి రాగం. త్యాగరాజస్వామి వారు వాల్మీకి అవతారమనేది పరమ సత్యం. ఇంతటి లోతన వివరణ ఇచ్చిన మహామహోపాధ్యాయ నూకల వారికి సాష్టాంగ ప్రణామాలు. 

ఆడ మోడి గలదా రామయ్యా మాట(లా)

తోడు నీడ నీవే యనుచు భక్తితో గూడి పాదముల బట్టిన మాట(లా)

చదువు లన్ని తెలిసి శంకరాంశుడై సదయుడాశుగసంభవుండు మ్రొక్క
కదలు తమ్ముని బల్క జేసితివి గాకను త్యాగరాజేపాటి మాట(లా)

ఓ రామయ్యా! నాతో మాట్లాడుటకు వెనకడుగెందుకు? నీవే తోడునీడయని భక్తితో పాదములను శరణంటిని, అటువంటి నాతో మాట్లాడుటకు వెనకడుగెందుకు? అవునులే! సమస్త విద్యా పారంగతుడు, పరమశివుని అంశలో జన్మించిన వాడు, శ్రేష్ఠుడు, వాయుపుత్రుడైన హనుమ నీకు మ్రొక్కగా, అతడెవరో యన్న శంకతో యున్న లక్ష్మణుని ఆ హనుమంతునితో మాట్లాడమన్నావు, ఇంక ఈ త్యాగరాజు ఏపాటి? 

ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు అద్భుతంగా ఆలపించారు

19, అక్టోబర్ 2020, సోమవారం

శ్రీరాజరాజేశ్వరీ త్రిపురసుందరీ - ముత్తుస్వామి దీక్షితుల వారు

శ్రీరాజరాజేశ్వరీ త్రిపురసుందరీ శివే పాహిమాం వరదే

నీరజాసనాది పూజితపరే నిఖిల సంశయ హరణ నిపుణతరే

శౌరి విరించాది వినుత సకలే శంకర ప్రాణ వల్లభే కమలే
నిరతిశయ సుఖ ప్రదే నిష్కళే పూర్ణచంద్రికా శీతలే విమలే
పరమాద్వైత బోధితే లలితే ప్రపంచాతీత గురుగుహ మహితే
సురుచిర నవరత్న పీఠస్థే సుఖతర ప్రవృత్తే సుమనస్థే

ఓ రాజరాజేశ్వరీ! త్రిపురసుందరీ! శివానీ! నన్ను రక్షింపుము. నాకు వరములిచ్చే దేవివి నీవే. బ్రహ్మాదులచే పూజించబడే పరదేవతా! సమస్త సంశయములను హరించే నిపుణురాలవు నీవు. నన్ను రక్షింపుము. బ్రహ్మ, విష్ణువులచే నుతించబడిన సర్వాంతర్యామివి, పరమశివునికి ప్రాణనాయకివి, కమలంవలె మనోజ్ఞమైన రూపము కలిగియున్నావు, నిరుపమానమైన ఆనందాన్ని కలిగించేవు, నిష్కళంకవు, పూర్ణచంద్రుని వలె చల్లదనము కల్గించేవు, నిర్మలవు, ఉత్కృష్టమైన అద్వైతాన్ని బోధించే లలితవు, ప్రపంచానికి అతీతమైన ఆదిపరాశక్తివి, సుబ్రహ్మణ్యునిచే నుతించబడేవు, మనోజ్ఞమైన నవరత్న పీఠమున స్థిరమై యున్నావు, సుఖకరమైన అంతఃప్రకృతి కలిగియున్నావు, సహృదయుల మనసులలో స్థిరమై యున్నావు, నన్ను రక్షింపుము. 

పూర్ణచంద్రిక రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు.

17, అక్టోబర్ 2020, శనివారం

కర్మ ఫలం: మహాభారతం: సైంధవుడు


సోదరి సమానయైన ద్రౌపదిని చెరబట్టబోయిన వాడు సైంధవుడు (కౌరవుల సోదరి దుశ్శల భర్త). పాండవులు వానిని నిలువరించి శిక్షిస్తారు. ప్రతీకారంతో తపస్సు చేసి శివుని అనుగ్రహంతో కురుక్షేత్ర సంగ్రామంలో ఒక్కరోజులో అర్జునుని తక్క మిగిలిన పాండవులను జయించే వరమును పొందిన వాడు. పద్మవ్యూహంలోనికి అభిమన్యుడు వెళ్లిన తరువాత అర్జునుడు తక్క మిగిలిన పాండవులు లోనికి రాకుండా వారిని శివుని వరముతో నిలువరించి అభిమన్యుని మరణానికి కారకుడైనాడు. కుమారుని మరణవార్త విని అర్జునుడు సైంధవుని మర్నాడు సూర్యాస్తమయంలోపు చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. మరునాడు ద్రోణుడు అర్జునుని బారి నుండి సైంధవుని కాపాడేందుకు అద్భుతమైన ప్రణాలికను రూపొందించాడు. కురుసైన్యాన్ని ఎదుర్కోవటంలోనే అర్జునినికి రోజంతా గడచిపోతుంది. సూర్యాస్తమయం కాబోతోందని గ్రహించి శ్రీకృష్ణుడు మాయతో నల్లని మబ్బులు సృష్టించగా, సూర్యాస్తమయం అయినదని ఏమరపాటు చెందిన సైంధవుని చూచి కృష్ణుడు ఆ మబ్బుని వెంటనే తొలగించగా, సూర్యుడు ఇంకా ఉన్నాడని గ్రహించి అర్జునుడు ఆ సైంధవుని తలను వెంటనే బాణములతో ఛేదిస్తాడు. సైంధవునికి తండ్రి వృద్ధక్షతుడు నుంచి వచ్చిన వరం - సైంధవుని శిరస్సు నేలకూల్చిన వాని శిరస్సు ముక్కలవుతుంది. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఆ శిరస్సు ఎక్కడో శమంతపంచకంలో తపస్సు చేసుకుంటున్న వృద్ధక్షత్రుని ఒడిలో పడేలా బాణం వెంట బాణం వేసే పాశుపతాస్త్రాన్ని వేయమని చెబుతాడు. అర్జునుడు అది చేస్తాడు. తన ఒడిలో పడిన శిరస్సును చూసి వృద్ధక్షతుడు దానిని కింద వేయగా ఆయన శిరస్సు కూడ ముక్కలవుతుంది.

ఇక్కడ ఏమిటి దుష్టకర్మలు?

సైంధవుడు:
==========

1. సోదరి సమాన ద్రౌపదిని బలాత్కరించబోవటం

2. తనకు పరమశివుడు అనుగ్రహించినప్పుడు సజ్జనులైన పాండవులపై ప్రతీకార వరం కోరుకోవటం

3. ఆ వరమును బాలుడు, వీరుడు అయిన అభిమన్యుని మరణానికి దుర్వినియోగం చేయటం

వృద్ధక్షతుడు:
===========

1. కుమారుని దుష్టబుద్ధిని సరిచేయకపోవటం

2. కుమారుని మరణానికి కారణమైన వాని శిరస్సు ఛేదం కావాలని దుష్టాలోచనతో వరం పొందటం

దుష్టకర్మల ఫలమేమిటి?
===================

1. ఏమరపాటులో ఉండగా సైంధవుడు వధించబడటం

2. కుమారుని శిరస్సు క్రింద పడవేసి వృద్ధక్షతుడు మరణించటం

తండ్రీకొడుకులు ఒకరి మరణానికి మరొకరు కారకులైనారు. ఇదీ కర్మఫలం యొక్క బలం.

16, అక్టోబర్ 2020, శుక్రవారం

కొనరో కొనరో మీరు కూరిమి మందు - తాళ్లపాక అన్నమాచార్యుల వారు


 

కొనరో కొనరో మీరు కూరిమి మందు ఉనికిమనికికెల్ల ఒక్కటే మందు

ధ్రువుడు కొనిన మందు తొల్లి ప్రహ్లాదుడు చవిగా గొనిన మందు చల్లని మందు
భవ రోగములు వీడి పారగ పెద్దలు మున్ను జవ కట్టుకొనిన నిచ్చలమైన మందు

నిలిచి నారదుడు గొనిన మందు జనకుడు గెలుపుతోగొని బ్రతికిన ఈ మందు
మొలచి నాలుగు యుగముల రాజులు ఘనులు కలకాలముగొని కడగన్న మందు

అజునకు పరమాయువై యొసగిన మందు నిజమై లోకమెల్ల నిండిన మందు
త్రిజగములు నేరుగా తిరువేంకటాద్రిపై ధ్వజమెత్తే కోనేటి దరినున్న మందు

ఓ జనులారా! మన ఉనికికి, జీవనానికి ఏకైక ఔషధమైన పరమాత్ముడనే శ్రేయమును సంపాదించుకొనండి. ధ్రువుడు సంపాదించుకున్నది, ప్రహ్లాదుడు చవి చూసినది ఈ చల్లని ఔషధము. భవరోగములను తొలగించుకొనుటకు ఇంతకు మునుపు శ్రేష్ఠులు మూటగట్టుకున్న నిశ్చమైన మందు ఇది. నారదుడు కొలిచి సంపాదించుకున్నది, శివధనుర్భంగముతో జనకమహారాజు పొంది తనను తాను ఉద్ధరించుకునేలా చేసిన మందు ఇది, నాలుగు యుగములలోనూ అనేకులైన రాజులు, గొప్పవారు ఎంతో కాలము సాధన చేసి ముక్తిని పొందేలా చేసింది ఈ మందు. బ్రహ్మదేవునకు ప్రాణవాయువైనది ఈ మందు, లోకమెల్లా నిండిన సత్యమనెడిది, ముల్లోకాల అభ్యున్నతికై శ్రీవేంకటాద్రిపై కోనేటి సమీపమున వెలసిన శ్రీనివాసుడనే మందు ఇది, దానిని సంపాదించుకొనండి. 

మోహన రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మల్లాది సోదరులు గానం చేశారు.