29, ఆగస్టు 2020, శనివారం

కదలేవాడు గాడే రాముడు - త్యాగరాజస్వామి కృతి


 

వాగ్గేయకారుల గొప్పతనం వారి అనుభూతులను అద్భుతమైన వర్ణనలుగా ఆవిష్కరిస్తూనే మూలతత్త్వాన్ని పరిపూర్ణంగా తెలియజేయటంలో కూడా ఉంది. గురుకృప వలన నాకు ఉదయమే త్యాగరాజస్వామి వారి కీర్తనల పుస్తకం తీసి ఆ పేజీలో ఉన్న కీర్తనను అర్థం చేసుకునే అలవాటు కొన్నేళ్లుగా ఉంది. ఈరోజు పరబ్రహ్మమైన రాముని ఆయన అద్భుతంగా సులభమైన పదాలలో వర్ణించిన కృతి కనబడింది. మానవజన్మ ఎత్తి ధర్మాచరణ చేసి ధర్మాన్ని స్థాపించిన రాముడు మనకు తెలుసు. ఆ స్థాయిని దాటి రాముని పరబ్రహ్మ తత్త్వంగా దర్శించి తరించిన త్యాగయ్య ఆ వైభవాన్ని మనతో కూడా పంచుకున్న కృతి ఇది. మానసగోచరమైతే తప్ప ఇటువంటి కృతులను రచించలేరు. అటువంటి రామసాక్షాత్కారం పొంది నిరంతరం రామామృతపానం చేస్తూ తరించిన త్యాగరాజస్వామి మన కర్మభూమిపై మన భాషలో కృతులను రచించటం మన అదృష్టం.

కదలేవాడు గాడే రాముడు కథలెన్నో గలవాడే

మొదలే తానైనాడే తుదమొదలే లేనివాడైనాడే

కల్పనలెన్నడు లేడు సంకల్పములే కలవాడు శేష
తల్పశయనుడే వాడు శ్రీత్యాగరాజ నుతుడైనాడే

శ్రీరాముడు చరాచర స్వరూపుడు. స్థావరరూపుడైనను, జంగమ రూపములతో వేదవేదాంత పురాణేతిహాసములలో అనేక కథలు గలవాడు. సనాతనుడు, శాశ్వతుడు, మొదలు తుది లేనివాడు, సత్యమైనవాడు, మాయాతీతుడు, అనంతమైన సృష్ట్యద్భుతాలనే సంకల్పముగా గలవాడు, నారాయణునిగా ఆదిశేషునిపై శయనించుచున్నవాడు, శంకరునిచే నుతింబడుచున్నాడు శ్రీరామచంద్రుడు. 

నారాయణగౌళ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మల్లాది సోదరులు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి