22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

పంచాశత్పీఠ రూపిణీ - దీక్షితుల వారి కృతి


పంచాశత్పీఠ రూపిణీ! మాం పాహి శ్రీ రాజరాజేశ్వరీ!

పంచదశాక్షరి! పాండ్యకుమారి! పద్మనాభ సహోదరి! శంకరి!

దేవీ! జగజ్జననీ! చిద్రూపిణి!
దేవాది నుత గురుగుహ రూపిణి!
దేశకాల ప్రవర్తిని! మహాదేవ మనోల్లాసిని! నిరంజని!
దేవరాజ ముని శాప విమోచని! దేవగాంధార రాగ తోషిణి!
భావ రాగ తాళ విశ్వాసిని! భక్త జన ప్రియ ఫల ప్రదాయిని!

ఏబది శక్తిపీఠములలో వెలసిన రాజరాజేశ్వరీ! నన్ను కాపాడుము! పదిహేను బీజాక్షరములు కల మంత్రరూపిణి! పాండ్యరాజుని కుమార్తెగా జన్మించిన మీనాక్షీ! శ్రీహరి సోదరీ! శంకరుని అర్థాంగీ! నన్ను కాపాడుము! ఓ దేవీ! నీవు లోకాలకే అమ్మవు! జ్ఞాన స్వరూపిణివి! దేవతలచే నుతించిబడిన కుమారుని తల్లివి! ఎల్లవేళలా అంతటా ప్రకాశించే అమ్మవు! పరమశివుని మనసును రంజిల్లజేసే నిర్మల మూర్తివి! మునులచే శపించబడిన ఇంద్రుని శాపవిముక్తుని చేసిన అమ్మవు! దేవగాంధార రాగములో అలరారి, భావ రాగ తాళములను విశ్వసించెదవు! భక్తుల కామ్యములను తీర్చెదవు! నన్ను కాపాడుము!

- ముత్తుస్వామి దీక్షితులు

శూలమంగళం సోదరీమణులు గానం చేసిన ఈ దీక్షితుల వారి కృతి దేవగాంధారి రాగంలో స్వరపరచబడింది. సగీత త్రయంలో దీక్షితుల వారి సాహిత్యంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.  వ్యాకరణము, మంత్రము, యోగము, భక్తి, క్షేత్ర వర్ణన, శ్రీ విద్యా ఉపాసన, తిరుత్తణి గురుగుహోపాసన దీస్ఖితుల వారి సాహిత్యంలో ప్రకాశిస్తూ ఉంటాయి. దీక్షితుల వారు తమ అనేక కీర్తనలలో తమ మంత్రశాస్త్ర ప్రావీణ్యంతో పాటు రాగం పేరును కూడా ప్రస్తావించారు. దేశమంతటా తిరిగి అనేక క్షేత్రాలలోని దేవతామూర్తులను దర్శించుకొని వారిని సంకీర్తనల ద్వారా నుతించారు. ఎక్కువ భాగం కీర్తనలను సుబ్రహ్మణ్యునిపైన, తరువాత అమ్మవారిపైన రచించారు. వీరిద్దరిని ఆయన బాగా ఉపాసించి సిద్ధి పొందారు. దేశంలో ఉన్న యాభై శక్తిపీఠాలను కూడా ఆయన సందర్శించారని ఆయన చరిత్ర చెబుతోంది. క్షేత్ర వైభవాలను మనకు అందించిన మహనీయులలో దీక్షితుల వారు అగ్రగణ్యులు. దేహాన్ని త్యజించే సమయంలో కూడా ఆయన అమ్మను స్మరించగలిగిన అపర భక్తులు. 

వావిళ్ల రామస్వామి శాస్త్రులు-వేంకటేశ్వర శాస్త్రులు - వావిళ్ల ప్రెస్



వావిళ్ల రామస్వామి శాస్త్రులు - వీరు తెలుగు వారికి అందించిన సాహితీ సంపద వెలకట్టలేనిది. ఈనాటికీ మనకు శుద్ధమైన తెలుగులో పుస్తకాలు, పురాణేతిహాసాలు, వ్రతకల్పాలు అందుబాటులో ఉన్నాయంటే అది వీరి చలవే. విఖ్యాతమైన సంస్థ వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వ్యవస్థాపకులైన వీరు సంస్కృతాంధ్ర పండితులుగా, వేదవిద్యా కోవిదులుగా పేరొందారు. 1826వ సంవత్సరంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో వీరు జన్మించారు. వీరు చిన్న వయసులోనే ఉభయభాషలలో ప్రావీణ్యం పొంది తాళపత్ర గ్రంథాలను సేకరించి, పరిష్కరించి టీకా తాత్పర్యం వ్రాసి, వాటిని ముద్రించి శాశ్వతంగా సాహిత్యాభిమానులకు అందుబాటులో ఉండేలా చేశారు. వీరి సేవను గుర్తించిన బ్రౌన్ మహాశయుడు చేతి వ్రాత పుస్తకాలు చదువుకునే రోజుల్లో శ్రీవావిళ్ల రామస్వామి శాస్త్రుల వారు ముద్రణాలయం స్థాపించి పాఠకులకు ఎంతో సౌకర్యం కలిగించారు అని కొనియాడారు. వావిళ్ల రామస్వామి శాస్త్రులు వారు ముద్రించి ప్రకటించిన గ్రంథములు 1876 సంవత్సరంలో ప్రచురితమైన లండన్ మ్యూజియంలోని గ్రంథాలయ పట్టికలో నమోదు చేయబడినవి. శ్రీమద్రామాయణమునకు టీకా తాత్పర్య విశేషార్థములతో మొట్ట మొదట ప్రచురించింది వీరే. వీరి సంపాదకత్వంలో అనేక సంస్కృతాంధ్ర గ్రంథములు పరిష్కరించి ముద్రణా భాగ్యమును పొందాయి.

1851వ సంవత్సరంలో రామస్వామి శాస్త్రులు గారి హిందూ భాషా సంజీవని అనే ప్రెస్ ద్వారా ఈ సంస్థను స్థాపించారు. తరువాత ఆది సరస్వతీ నిలయాన్ని కూడా ఆయనే స్థాపించారు. 50కి పైగా పుస్తకాలను తన జీవిత కాలంలో ఆయన ప్రచురించారు. 1891వ సంవత్సరంలో వీరు కాలం చెందారు. వీరికి వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రులు 1884 జన్మించారు. వేంకటేశ్వర శాస్త్రులు గారు 1906లో ఈ సంస్థకు నేతృత్వం వహించి వావిళ్ల ప్రెస్‌గా పేరు మార్చారు. ప్రచురణా పద్ధతికి మెరుగు దిద్ది సంస్థను అభివృద్ధి చేశారు. గోరఖ్‌పూర్ వారి గీతా ప్రెస్, వారణాసి వారి చౌఖంభా ప్రెస్‌తో అనుసంధానం చేసుకొని మనకు అమూల్యమైన వాఙ్మయాన్ని ముద్రిత రూపంలో అందజేశారు. ఉత్తమ ప్రమాణాలు గల ముద్రణంతో, సంపాదకీయ ప్రతిభతో వారు 900కు పైగా సంస్కృతాంధ్ర తమిళ ఆంగ్ల భాషలలో పుస్తకాలను ప్రచురించారు. వేంకటేశ్వర శాస్త్రులు గారి మహా దేశభక్తులు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఎన్నో దేశభక్తిని కలిగించే పుస్తకాలను ప్రచురించారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి చేత ప్రభావితులైనారు. అలాగే బంకించంద్ర ఛటర్జీ గారి ఆనందమఠాన్ని తెలుగులోకి అనువదించారు. ఆంధ్రకేసరి ప్రకాశం గారికి ఎస్. సత్యమూర్తిగారికి ఎంతో ఆర్థిక సహాయం చేశారు. మహాభారతం, రామాయణం, పోతన భాగవతం మొదలైన వాటిని ప్రచురించారు. వీరి సమయంలో ఈ సంస్థను ఇంగ్లాండులోని మెక్‌మిలన్ మరియు లాంగ్‌మాన్ సంస్థలతో పోల్చారు.



1916లో వీరు మా పూర్వీకులు, ఉభయ భాషా పారంగతులు అయిన అక్కిరాజు ఉమాకాంతం పంతులు గారితో కలిసి త్రిలింగ అనే పత్రికను స్థాపించారు. 1941లో ఈ పత్రిక రజతోత్సవం కూడా జరుపుకుంది. వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రులు గారు 1927లో ఫెడరేటెడ్ ఇండియా అనే ఆంగ్ల పత్రికను కూడా స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు నడిపించారు. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి గారితో కలిసి బాలవినోదిని అనే తమిళ మాస పత్రికను నడిపారు. వీరి షష్టిపూర్తి సమయంలో అభిమానులు వీరికి స్మారక ముద్రణను కూడా బహుమతిగా అందజేశారు. ప్రజా జీవితంలో ఎంతో పేరు పొందిన వీరు 1938లో ఆంధ్ర మహాసభ రజతోత్సవ సభకు అధ్యక్షునిగా పని చేశారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. పచయప్ప ట్రస్ట్ బోర్డు అధ్యక్షునిగా, హానరరీ మెజిస్ట్రేటుగా, మద్రాస్ పోర్ట్ ట్రస్ట్, కాస్మోపాలీటన్ క్లబ్, మాసోనిక్ లాడ్జ్, సుగుణ విలాస సభలతో అనుబంధం కలిగి సేవలు చేశారు. ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకులు వీరే. ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యునిగా కూడా పని చేశారు. వీరు సెమ్మంగూడి మరియు అలగప్ప మొదలైన ప్రముఖులకు సన్నిహితులు.

శ్రీనాథుని శృంగార సాహిత్యాన్ని వీరు ప్రచురించగా పిఠాపురం రాజావారు, జయంతి రామయ్య గారు వీరిపై అవి అసభ్యంగా ఉండే సాహిత్యం అని దావా వేసినా అది నిలబడలేదు. తరువాత వీరు వాత్సాయన కామసూత్రాలను కూడా ప్రచురించారు. 1931-33 మధ్య 18 భాగాల మహాభారతాన్ని వీరు సంస్కృతంలో ముద్రించారు.  వారణాసి పండితులు వీరికి శాస్త్ర ప్రచార భూషణ అనే బిరుదునిచ్చారు. వీరు చేసిన భాషా సేవకు భాషోద్ధారక బిరుదు కూడా వచ్చింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు వీరిని 1955లో కళాప్రపూర్ణ బిరుదుతో గౌరవించారు. ధనవంతురాలైన భార్యతో విభేదాలతో వీరి సంసార జీవితం మాత్రం ఒడిదుడుకులు గానే నడించింది. 1942లో పక్షవాతం పాలైన వీరు 1956లో తన 67వ ఏట మరణించారు. వీరికి సంతానం లేదు. ఆయన తరువాత వీరి ఆస్తులకై ఎన్నో న్యాయ పోరాటాలు నడిచాయి. ప్రచురణ సంస్థ మూత పడింది. చెన్నైలో వీవీస్ ట్రస్ట్ నామమాత్రంగా నడుస్తోంది. దీనికి అల్లాడి స్వామినాథన్ గారు ట్రస్టీ. కొన్నేళ్ల క్రితం హైదరాబదులో ముద్రణను పరిమితిగా ఈ ట్రస్ట్ ప్రారంభించింది.

ఈ తండ్రి-కొడుకులు తెలుగు భాషకు చేసిన సేవ చిరస్మరణీయం. ఇటీవలే వావిళ్ల వారి సహితీ సంపదల 150వ జయంతి కూడా జరిగింది. ఎందరో మహానుభావులు అందరికి వందనాలు. 

17, సెప్టెంబర్ 2017, ఆదివారం

శరవణభవ గుహ షణ్ముఖ - తంజావూరు శంకర అయ్యర్ కృతి


శరవణభవ గుహ  షణ్ముఖ
తిరుమరుళ్ పురియ వా వా

మరువుం వళ్లీ దేవయాని మనాళ
కరుణై మళి పొళియ వా దయాళ

కుణ్డ్రు తోరుం ఆడుం కుమరనే  
కురైగళ్  తీర్థరుళ విరైవినిల్ నీ వా
ఎణ్డ్రుం ఇంబం తరుం  తమిళిసైక్క వా
ఇరంగి ఎంగళుక్కు జ్ఞానం తళైక్క వా

రెల్లు గడ్డి నుండి జన్మించి, ఆరు ముఖములు కలిగిన ఓ సుబ్రహ్మణ్యా! నీ కరుణతో మాకు శుభములు కురిపించుటకు రావయ్యా!  ఓ దయాళుడవైన వల్లీ దేవసేనా పతీ! నీ కరుణావృష్టిని కురిపించుటకు రావయ్యా! కొండలలో తిరుగుతూ ఆడుకునే ఓ కుమారా! మా కామ్యములు తీర్చుటకు రావయ్యా! నిత్యానందమునిచ్చే తమిళమును పాడుటకు రావయ్యా! మాపై కరుణ చూపించి జ్ఞానాన్ని ప్రసాదించుము.

(తమిళనాట భాషకు దైవ స్వరూపంగా కుమారస్వామిని కొలుస్తారు. అగస్త్య మహాముని కుమారస్వామిని ఉపాసించగా, ఆయన నోట ఈ భాష ఆ ప్రాంతంలో పలుక బడి ప్రసిద్ది పొందిందని వారి నమ్మకం)

- తంజావూరు శంకర అయ్యర్

షణ్ముఖుని నుతించే ఈ కృతిని కర్త శహానా రాగంలో స్వరపరచారు. ఈ రాగం ఆర్తికి, భక్తికి, శరణాగతికి ప్రతీక. కృతిలోని భావానికి సముచితమైన రాగంలో స్వరపరచటం వాగ్గేయకారుని పూర్ణప్రజ్ఞను సూచిస్తుంది. తంజావూరు శంకర అయ్యరు గారు 1924లో తిరుచిరాపల్లి జిల్లలోని తోగమరైలో జన్మించారు. టైగర్ వరదాచాయులు మొదలైన వారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ఈయన శిష్యులలో టీవీ శంకరనారాయణన్, నేవేలి సంతానగోపాలన్, చిత్రవీణ రవికిరణ్ మొదలైన మహామహులెందరో ఉన్నారు. ముంబై షణ్ముఖానంద సభ ద్వారా ఎందరో శిష్యులకు శిక్షణనిచ్చారు. కలైమామణి బిరుదును పొందారు. ఈ కృతి సాహిత్యంలో ఆర్తిని రాగం ద్వారా అందించటంలో ఆయన కృతకృత్యులైనారు. రంజని-గాయత్రి సోదరీమణులు ఈ కీర్తనను గానం చేశారు. 

10, సెప్టెంబర్ 2017, ఆదివారం

గడప దాక వచ్చి మరలి పోయావు - డాక్టర్ శోభారాజు గారి మధురభక్తి గీతం


గడప దాక వచ్చి మరలి పోయావు
వెను దిరిగి రమ్మని నే పిలుచు లోపే
పిలుపందనంత దూరానికేగావు! స్వామీ! 

గుడిసెనంతా అలికి ముగ్గులేశాను
తోరణాలను కట్టి తలుపు తెరిచుంచాను
దీపాలు వెలిగించి ధూపమేసే లోపు
గడప దాకా వచ్చి మరలి పోయావు
వెను దిరిగి రమ్మని నే పిలుచు లోపే
పిలుపందనంత దూరానికేగావు! స్వామీ! 

భక్ష్యభోజ్యాదులను ప్రేమార చేశాను
కొసరి నీవు తినగా విస్తరేశాను
విశ్శ్రాంతి గొందువని పానుపేసే లోపు
గడప దాకా వచ్చి మరలి పోయావు
వెను దిరిగి రమ్మని నే పిలుచు లోపే
పిలుపందనంత దూరానికేగావు! స్వామీ!

ఏర్పాట్లలో మునిగి ఏమరను ఇకను
కటిక చీకటిగుంది చిరుదివ్వె చేబట్టి
కాలాన్ని మరచి నే ఎదురు చూస్తున్నాను
వస్తావుగా స్వామి మరియొక్క మారు

కాళ్లు వణకేను కళ్ళు చెదరేను
వంటి చేవంతా కంటి నీరాయెను
పెనుగాలికీ దివ్వె పెనుగులాడేను
వస్తావుగా స్వామి మరి యొక్క మారు

- డాక్టర్ శోభారాజు గారు

పదకవితా పితామహుని సంకీర్తనలను ప్రచారంలోకి తీసుకు రావటంలో అగ్రగణ్యులైన డాక్టర్ శోభారాజు గారి అద్భుతమైన మధురభక్తి గీతం ఇది. కృష్ణభక్తి వారికి చిన్ననాడే ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలుగా జీవితంలో అంతర్భాగమై పోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కళను పరమాత్మ సేవకు అంకితం చేసి  పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారి అమూల్యమైన సంకీర్తనా సంపదలోని భావాన్ని ప్రత్యేకమైన మార్గంలో ప్రచారం చేస్తున్నారు పద్మశ్రీ దాక్టర్ శోభారాజు గారు. ఈ మహాయజ్ఞంతో పాటు వారు ఎన్నో సంకీర్తనలను రచించారు. అందులో ఒకటి ఈ గడప దాకా వచ్చి అనే రచన. రాధ, మీరాల మధురభక్తి ఈ గీతంలో స్పష్టంగా కనబడుతుంది. స్వామి వస్తున్నాడన్న ఆనందంలో ఇల్లు అలికి, ముగ్గేసి, తోరణాలు కట్టి, ధూప దీపాలు వెలిగించి, చక్కని భోజనము ఏర్పాటు చేసి, సేదదీరేందుకు పానుపు వేసేలోపు  భక్తురాలు అంతలో స్వామి వెళ్లిపోయాడన్న విచారంలోని మనోభావన ఈ గీతం. ఈ ఏర్పాట్లలో మునిగి స్వామి రాకను ఏమరచేనేమో అని కారు చీకటిలో దివ్వెను చేతబట్టి ఎదురు చూస్తున్న కృష్ణ భక్తురాలి హృదయ సవ్వడులను మనోజ్ఞంగా తెలిపే గీతం ఇది. ఎదురు చూపులో శరీరం బలహీనమై, శక్తి అంతా కన్నీరు ధార కాగా, గాలీ దీపం ఊగిసలాడుతుండగా స్వామిని మరల రమ్మని వేడుకునే గీతం అమ్మ శోభారాజు గారు అద్భుతంగా రచించారు.

భక్తికి శరణాగతి అతి ముఖ్యం. ఈ శరణాగతిని నేను శోభారాజు అమ్మలో పరిపూర్ణంగా గమనించాను. కృష్ణభక్తిలో ఉన్న వారిలో ఈ శరణాగతితో పాటు, ప్రశాంతత, స్థితప్రజ్ఞత, దృఢమైన వ్యక్తిత్వం, పరమాత్మతో ఓ విలక్షణమైన అనుబంధం కలిగి ఉంటారు. శోభారాజు గారు చేస్తున్న సేవ అమూల్యమైనది. ఆధ్యాత్మిక సంపదతో పాటు వ్యక్తిత్వ వికాసంతో కూడిన సామాజిక స్పృహ కలిగిన శోభారాజు గారు మన సమాజాన్ని, నేటి హిందుత్వాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యల గురించి సుస్ఫటమైన భావనలు కలిగిన వారు. డొల్లతనాన్ని, ద్వంద్వ ప్రమాణాలను, కుహనా వాదాలను, దురాచారాలను ఖండిస్తూ ఈ సమాజంలో  పోరాటం సాగిస్తున్న యోధురాలు అమ్మ. ఒక్క గీతంలో ఇన్ని భావనలను వ్యక్తపరచటం అనేది ఆ స్వామి అనుగ్రహమే. ఆధ్యాత్మిక సాధనలో, భక్తి సంగీతం ద్వారా భావకాలుష్య నివారణ అనే అద్భుతమైన లక్ష్యంతో ముందుకు వెళుతున్న శోభారాజు గారు ఇటువంటి గీతాలను ఎన్నో రచించారు. వారి భావ సంపద ఈ సమాజంలో మరింత ప్రచారంలోకి రావాలని నా ప్రార్థన.

శోభారాజు గారు ఈ గీతం ఆలపించిన రీతి అత్యంత మధురం. చరణాలు ముందుకు సాగిన కొద్దీ భావనలకు అనుగుణంగా గాత్రాన్ని మార్చి వేర్వేరు రసాలను పండించారు. స్వామీ అని పిలిచే రీతి మనసును కరగించి వేస్తుంది. బద్ధుడై స్వామి రావలసిందే అని మనసు నిశ్చయమయ్యేలా గానం చేశారు. చివరి చరణంలో శృతిని మార్చి ఆర్తితో వారు పాడిన పద్ధతి మధురభక్తికి నిదర్శనం. గీతాన్ని లలితంగా, భావనలకు అనుగుణంగా స్వరపచటంలో శోభారాజు గారి సాధన ప్రతిబింబిస్తుంది. ఈ గీత భావం అనుభవైకవేద్యం.  అన్నమాచార్య భావనా వాహిని ద్వారా ఈ గీతానికి రమణీయమైన, సముచితమైన చిత్రాలను పొందుపరచి వీడియో రూపొందించిన పార్థసారథి గారికి నా అభిననందలు, కృతజ్ఞతలు.

9, సెప్టెంబర్ 2017, శనివారం

జగమే మారినది మధురముగా ఈ వేళ - మధుర గీతం (దేశద్రోహులు చిత్రం - 1964)




సాలూరి రాజేశ్వరరావు గారు ఎంతటి మహా సంగీత దర్శకులో, ఘంటసాల మాష్టారు, సుశీలమ్మ ఎంతటి మధుర గాయకులో తెలుసుకోవటానికి కొన్ని పాటలు వింటే చాలు. సాహిత్యకారుల ప్రతిభ ఒక ఎత్తైతే దానికి తగ్గ సంగీతం అందించటం సంగీతకారుల ప్రతిభ. మేరు పర్వతమంత ఎత్తైనది సాలూరి వారి సంగీత విద్వత్తు. లలితమైన పాటలకు అత్యంత మధురమైన సంగీతాన్ని అందించటంలో ఆయన మేటి. అటువంటి పాటను ప్రతిభామూర్తి ఆరుద్ర గారు రచించగా రసాలూరించే సాలూరి వారు స్వరపరచగా మధుర గాయకులు ఘంటసాల మాష్టారు, సుశీలమ్మ ఎంతో మధురంగా పాడారు. ఇది 1964లో విడుదలైన దేశద్రోహులు చిత్రంలోని జగమే మారినది మధురముగా ఈ వేళ అన్న పాట. ఇది చిత్రంలో రెండు సందర్భాలలో వస్తుంది. మొదటిది సుశీలమ్మ, ఘంటసాల మాష్టారు యుగళ గీతంగా పాడగా, రెండవది భగ్న ప్రేమికునిగా నాయకుడు అన్న ఎన్‌టీఆర్‌పై కాస్తంత బరువైన సన్నివేశంలో చిత్రీకరించబడి ఘంటసాల మాష్టారు అత్యద్భుతంగా పాడిన గీతం. యుగళ గీతం ఉత్సాహంగా సాగేదైతే సోలో గీతం కాస్త గంభీరంగా సాగుతుంది. సంగీతకారులు మరియు గాయకుల ప్రతిభ విలక్షణంగా తెలుస్తుంది. కళ్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ గీతం అజరామరమై నిలిచింది. పాట మొత్తం అద్భుతమైన స్వరాలతో సితార్, తబలా వాద్య నాదాలతో రాజేశ్వరరావు గారు స్వరపరచారు.

ఆరుద్ర గారి గీతంలోని భావాన్ని పరిశీలిస్తే, లలితమైన పదాలతో ఎంతటి మధురమైన భావనలను పండించారో అర్థమవుతుంది. మనసు నెమలిలా ఆడిందట, పావురాలు పాడాయట, జగమంతా ఎంతో మధురముగా మారిందట. గొరవంక, రామచిలుక చెంత చేరగా అవి అందమైన జంటగా కనబడ్డాయట. ప్రేమ, స్నేహము కలిసి జీవితము పండగా ఓ చిత్రమైన పులకింత కలిగిందట. విరజాజి పూవుల సువాసన స్వాగతము పలుకగా, తుమ్మెద ఆ జాజులలోని మధువు యొక్క తీయదనాన్ని కోరి ప్రేమలో తేలుతూ తిరిగాడిందట. ప్రేమలో పడిన వారికి కలలు, కోరికలు తీరినప్పుడుండే భావనలను ఈ గీతం తెలుపుతుంది. గీతమంతా ఒకే సాహిత్యాన్ని ఉపయోగించి ఒక్క ఆఖరి పంక్తిలో సందర్భోచితంగా సాహిత్యాన్ని మార్చి పాట భావం ఏ మాత్రం చెదరకుండా రచించిన ఆరుద్ర గారి ప్రతిభ అమోఘం.

మాధుర్యానికి మారు పేరు సుశీలమ్మ, అంతే గొప్పగా ఘంటసాల మాష్టారు స్వరయుక్తంగా పాడారు. ఇద్దరూ కలిసి కొన్ని వందల పాటలు దశాబ్దాల పాటు పాడారు. వారిరువురూ తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని మధురమైన గీతాలతో అలరించారు. ఒకరకంగా సాలూరి వారు, ఘంటసాల, సుశీలమ్మల బృందం ఆనాడూ ఈనాడూ కూడా టాప్ క్లాస్ అని చెప్పుకోవాలి. సంగీతానికి, మాధుర్యానికి, భావసంపదకు ఆనాడు ఎంత ప్రాధాన్యముండేదో, వాటికి తగినట్లు గాయకులు కూడా తమలోని ప్రతిభ పాటను మరింత ప్రేక్షకుల మనసులను దోచుకునేలా పాడే వారు. అందరూ పరిపూర్ణమైన న్యాయం చేసేవారు. అందుకే ఇటువంటి పాటలు దశాబ్దాల పాటు నిలిచి మనుషుల హృదయాలను రంజిల్లజేస్తూనే ఉంటాయి.

యుగళ గీతం
సోలో

జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవి మనసారా

మనసాడెనే మయూరమై పావురములు పాడే! ఎల పావురములు పాడే!
ఇదే చేరెను గోరువంక రామచిలుక చెంత! అవి అందాల జంట!
నెనరు కూరిమి ఈనాడే పండెను! జీవితమంతా చిత్రమైన పులకింత!!

విరజాజుల సువాసన స్వాగతములు పలుక! సుస్వాగతములు పలుక!
తిరుగాడును తేనెటీగ తియ్యదనము కోరి! అనురాగాల తేలి!
ఎదలో ఇంతటి సంతోషమెందుకో! ఎవ్వరికోసమో! ఎందుకింత పరవశమో! (యుగళ గీతం)
కమ్మని భావమే కన్నీరై చిందెను! ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి!! (సోలో)


3, సెప్టెంబర్ 2017, ఆదివారం

శ్రీ విష్ణు గీతం - భారతీతీర్థ మహాస్వామి రచన


శృంగేరి శారదా పీఠ జగద్గురువు భారతీతీర్థ మహాస్వామి వారు రచించిన అద్భుతమైన విష్ణు గీతం. వారి సాహిత్యానికి ఆ చిన్నారి హరిప్రియ చేసిన నృత్యం చూస్తే మనసు ఉప్పొంగుతుంది. శ్రీహరిని శరణాగతితో పరిపరి విధాల వేడుకునే ఈ గీతం ఆది శంకరుల స్తుతులను గుర్తు చేస్తుంది. గీతం వివరాలు:

శ్రీ విష్ణు గీతం 

గరుడగమన తవ చరణకమలమిహ  మనసి లసతు మమ నిత్యం
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

జలజ నయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పదపద్మ 
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

భుజగశయన భవ మదన జనక  మమ జనన మరణ భయహారీ
మమ తాపమపా కురు దేవ  మమ పాపమపా కురు దేవ

శఙ్ఖ చక్రధర దుష్ఠ దైత్య హర సర్వలోక శరణ
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

అగణిత గుణగణ అశరణశరణద విదళిత సుర రిపు జాల
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

భక్తవర్యమిహ భూరికరుణయా పాహి భారతీ తీర్థం
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

 ఓ గరుడ వాహనుడవైన శ్రీహరీ! నీ పాదపద్మములు నా మనసునందు నిత్యము ఉద్దీపనము చేయుము. నా తాపమును, పాపమును హరింపుము దేవా!  కలువలవంటి కన్నులు కలిగిన శ్రీహరీ! బ్రహ్మ,ఇంద్రుడు, జ్ఞాన గణముచే నుతించించబడిన పదపద్మములు కలవాడా! నా తాపమును, పాపమును హరింపుము దేవా!  ఆదిశేషునిపై శయనించే శ్రీహరీ! మన్మథుని తండ్రీ! నా జనన మరణ భయములను తీర్చువాడా  నా తాపమును, పాపమును హరింపుము దేవా!  శంఖ చక్రములని ధరించిన నారాయణా! దుష్టులైన రాక్షసుల హరించినవాడా! సర్వలోకములకు రక్షణ కలిగించే వాడా! నా తాపమును, పాపమును హరింపుము దేవా! ఎనలేని సుగుణములు కలిగిన నారాయణా! దీనులకు దిక్కైనవాడా! దేవతల వైరులను సంహరించువాడా! నా తాపమును, పాపమును హరింపుము దేవా! నీ భక్తుడనైన ఈ భారతీతీర్థుని అపారమైన కరుణతో రక్షించుము. నా తాపమును, పాపమును హరింపుము దేవా!

జగద్గురు భారతీతీర్థస్వామి వారి సంగ్రహ చరిత్ర:



1951వ సంవత్సరం ఏప్రిల్ 11న (ఖర నామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్టి నాడు) గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతమైన దాచేపల్లి సమీపంలో నాగులేరు ఒడ్డున అలుగుమల్లిపాడులో తంగిరాల వేంకటేశ్వర అవధాని, అనంతలక్ష్మమ్మ దంపతులకు నోముల ఫలంగా బాలుడు జన్మించాడు. అవధాని గారు నిత్యము భవానిశంకరునికి రుద్రాభిషేకం చేసే వారు. అలాగే రామనవమి సమయంలో నవరాత్రి ఉత్సవాలు చేసేవారు. అనంతలక్ష్మమ్మ హనుమంతుని ధ్యానించేది. నలుగురు ఆడపిల్లల తరువాత మగపిల్లవాడు పుడితే సీతారాముల పేరు, ఆంజనేయుని పేరు పెట్టుకోవాలని ఆ దంపతులు సంకల్పించారు. అందువలన ఆ బాలునికి తల్లిదండ్రులు సీతారామాంజనేయులు అని నామకరణం చేశారు. మూడేళ్ల వయసు నుండే శివనామాన్ని ఆ బాలుడు స్మరించాడు. నిరంతరం స్వామి నామ స్మరణలో తనను తాను మరచే వాడు. ఐదేళ్ల వయసుకే సంస్కృతాన్ని ప్రతాపగిరి శివరామశాస్త్రి గారి వద్ద నేర్చుకోవటం ప్రారంభించారు. తొమ్మిదేళ్ల వయసుకే సంస్కృతంపై పట్టు సాధించారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మొదలైన పండితుల మన్ననలు పొందారు. ఆకాశవాణిలో సంస్కృత కార్యక్రమాలలో పాల్గొనటానికి సీతారామాంజనేయులును పిలిచారు. సంహిత, బ్రాహ్మణ, అరణ్యక చిన్న వయసులోనే చదివిన సీతారామాంజనేయులు గుంటూరు జిల్లా వేదప్రవర్ధక విద్వత్ పరీక్షలో ఉత్తీర్ణులైనారు.

1961వ సంవత్సరంలో సీతారామాంజనేయులును ఉపాధ్యాయుడు విజయవాడలో పర్యటిస్తున్న శృంగేరి శారదా పీఠం అధిపతి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి ముందు సంస్కృతంలో సంభాషించ వలసిందిగా కోరాడు. సుస్పష్టంగా సంస్కృతంలో మాట్లాడటంతో ఆ బాలుడికి ప్రత్యేక బహుమతి లభించింది. అప్పుడు స్వామి దర్శనంతో ఆ బాలుడి మనసులో ఆయనే తనకు దారి, గురువు అని నిశ్చయమైంది. 1966వ సంవత్సరంలో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఉజ్జయినిలో చాతుర్మాస్యం చేస్తున్నారు. అక్కడికి స్వామి ఆశీస్సులకై సీతారామాంజనేయులు తల్లిదండ్రులతో వెళ్లి తనకు శాస్త్రాలను బోధించవలసిందిగా కోరాడు. క్షిప్రా నదిలో స్నానమాచరించి వస్తున్న స్వామి ఆ బాలుని వైరాగ్యము, భక్తి చూసి ఎంతో సంతోషించి శిష్యునిగా స్వీకరించారు. ఎక్కడ నరసరావుపేట? ఎక్కడ ఉజ్జయిని? ఉన్నత పాఠశాల విద్య చదువుతున్న బాలుడు మంచి చదువులు చదవాలని తండ్రి అభిలాష. మరి ఏమిటీ అనుకోని మలుపు? ఇదంతా ఆ శారదాంబ అనుగ్రహమే అన్నారు భారతీతీర్థ స్వామి వారు. చిన్ననాటి దర్శనం తరువాత అభినవ విద్యాతీర్థ స్వామి వారే తన మనసులో నిలిచి తనను ముందుకు నడిపారని, తన సమస్యలకు పరిష్కారం చూపారని, ఆ గుర్వనుగ్రహమే తనను అంత బలీయంగా ఉజ్జయినికి తీసుకు వెళ్లిందని అన్నారు.



అప్పటినుండి సీతారామాంజనేయులు స్వామితోనే ఉన్నారు. ఎనిమిదేళ్లలో కృష్ణ యజుర్వేదం, పూర్వ ఉత్తర మీమాంసలు, న్యాయశాస్త్రముతో పాటు మరెన్నో శాస్త్రాలను అధ్యయనం చేశారు. సంస్కృతంలో రచనలు కూడా చేశారు. 1974వ సంవత్సరంలో అభినవ విద్యాతీర్థస్వామి వారు సీతారామాంజనేయులుకు సన్యాస దీక్షనిచ్చి వారిని భారతీతీర్థస్వామిగా నామకరణం చేశారు. స్వామి వారు అప్పటికే మాతృభాష తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషలలో కూడా ప్రావీణ్యం పొందారు. సన్యాస స్వీకారం వెంటనే గురువులతో కలసి విజయయాత్ర చేశారు. గురువులతో కలసి ఉత్తరభారత దేశంలో పర్యటించినప్పుడు సంస్కృత హిందీ భాషలలో అక్కడి పండితులు, యోగులు, స్వాములతో సంభాషించి వారి మన్ననలు పొందారు. భారతీతీర్థ స్వామి వారికి అమితమైన గురుభక్తి. నిరంతరం గురువులను అనుసరిస్తూ, గమనిస్తూ వారి సుశ్రూషలో గడిపేవారు. 15 ఏళ్ల పాటు ఆ విధంగా తన గురువులైన మహాస్వామి వద్ద అమూల్యమైన సమయం గడిపి ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పొందారు.

1989లో గురువుల మహాసమాధి తరువాత భారతీతీర్థస్వామి శృంగేరి శారదా పీఠానికి 36వ మహాస్వామిగా పీఠాధిపత్యాన్ని స్వీకరించారు. వేద విద్యను అభివృద్ధి చేయటానికి, సనాతన ధర్మ పరిరక్ష్ణకు విశేషమైన సేవలు అందిస్తూ అమిత తపోబల సంపన్నులై, పరమ నిష్ఠా గరిష్ఠులై దేశంలోనే అతి పవిత్రమైన పీఠంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. శారదా ధన్వంతరి ఆసుపత్రి స్వామి వారి సంకల్పబలంతో సాకారమైంది. ఈ ఆసుపత్రి ద్వారా శృంగేరి మరియు చుట్టు పక్కల గ్రామాలకు వైద్య సేవలందిస్తున్నారు. వేదపండితుల దయనీయ పరిస్థితి గ్రహించిన స్వామి వారు పండితులకు జీవనభృతిని కలిగించే ఏర్పాటు చేశారు. ఇక్కడి వేదపాఠశాలలో అత్యుత్తములైన పండితులను విద్యార్థులకు బోధించేలా నియమించి వేదవిద్యాభివృద్ధికి తోడ్పడుతున్నారు. లోక కళ్యాణార్థం పీఠం ఆధ్వర్యంలో శత, సహస్ర చండీ హోమాలు, అతిరుద్ర యాగాలు నిరంతరం నిర్వహించేలా స్వామి ఏర్పాటు చేశారు. పీఠాన్ని దర్శించుకునే భక్తుల కోసం శారదా కృప, యాత్రి నివాస్‌ల పేరిట వసతి గృహాలను నిర్మించారు. ఎన్నో ఏళ్లుగా చాతుర్మాస్య దీక్షా సమయంలో బ్రహ్మసూత్ర భాష్యాల వివరణ చేస్తూ సనాతన ధర్మ ప్రచారానికి తొడ్పడుతున్నారు.

2015 జనవరి 22న తిరుపతికి చెందిన యువ బ్రహ్మజ్ఞాని కుప్పా వేంకటేశ్వర ప్రసాద్ గారిని తన శిష్యునిగా స్వీకరించి అతనిని సన్యాసాశ్రమంలోకి ప్రవేశ పెట్టారు. భారతీతీర్థస్వామి వారి అనంతరం ఈ విదుశేఖర భారతీస్వామి వారు శృంగేరి పీఠాన్ని అధిరోహిస్తారు. శృంగేరి పీఠంలో తెలుగు స్మార్త బ్రాహ్మణులు పీఠాధిపతిగా పరంపర ఈ విధంగా కొనసాగబోతోంది. శ్రీ గురుభ్యో నమః.

2, సెప్టెంబర్ 2017, శనివారం

కమలాంబ నవావరణ కీర్తనలు - ముత్తుస్వామి దీక్షితుల ఆధ్యాత్మిక వైభవం



తిరువారూర్ త్యాగరాజస్వామి, కమలాంబ క్షేత్ర  వివరాలు:

తిరువారూరు - కావేరీ డెల్టా ప్రాంతంలో ఉన్న ఓ పురాతన పట్టణం. ఇక్కడ త్యాగరాజస్వామి (శివుడు) దేవస్థానం ప్రసిద్ధి. ఉత్తరాన సుకుమార నది, దక్షిణాన వలైయార్ నది, నగరం మధ్య నుండి ఓడంబొక్కి నది ప్రవహిస్తాయి. కావేరీ ఉపనదులైన వెన్నార్, వెట్టార్ నదులు కూడా ఇక్కడైకి దగ్గరలోనే ఉన్నాయి. తిరువారూరు చోళులకు రాజధాని. ఈ నగరంలో పురాతన దేవాలయమైన త్యాగరాజస్వామి సన్నిధిని తొలుత ఆదిత్య చోళుడు క్రీస్తు శకం 871-801 సంవత్సరాల మధ్యలో నిర్మించగా, తరువాత రాజ రాజ చోళుడు, రాజేంద్ర చోళుడు మరియు పాండ్య రాజులు పునరుద్ధరించారు. తిరువారూరు కులోత్తుంగ చోళుని (కీ.శ 1070-1120) రాజధాని కూడా. ఆ సమయంలోనే శైవం బాగా వ్యాపించింది. చోళుల తరువాత పాండ్యులు, అటు తరువాత విజయనగర రాజులు, నాయక రాజులు, మరాఠా రాజులు పరిపాలించారు. కళలకు, సంస్కృతికి తిరువారూరు ఆలవాలమైంది. శైవ నాయనార్ గురువులు, కవి ఆయన జ్ఞాన సంబంధర్ తిరువారూరు గురించి ప్రస్తావించారు.


ఇంతటి భవ్యమైన చరిత్ర గల తిరువారూరు పట్టణంలో ఉన్న త్యాగరాజస్వామి దేవస్థానంలో ఆదిపరాశక్తి కమలాంబగా వెలసింది. ఆ అమ్మ పేరుతోనే తిరువారూరు కమలాలయక్షేత్రంగా కూడ పిలువబడింది. ఈ దేవస్థానం సమీపంలో కమలాలయ తటాకం ఉండటం  విశేషం. ఈ కమలాంబ ప్రత్యేకతలు ఎన్నో. అమ్మవారు సుఖాసీనురాలుగా కాకుండా యోగ ముద్రలో ఒక కాలి మీద మరొక కాలు మెలిక వేసి కూర్చొని ఉంటుంది. తన చేత కమలము, పాశాంకుశము, రుద్రాక్ష ధరించి యోగినిగా దర్శనమిస్తుంది. శ్రీవిద్యా ఉపాసనా పద్ధతిలో ఇక్కడ అమ్మవారిని కొలుస్తారు. కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారు  ఈ కమలాంబ శ్రీ విద్యా ఉపాసనతో జ్ఞాన దృష్టి కలిగి ఈ అమ్మపై 9 కీర్తనలను రచించారు. వీటిని నవావరణ కృతులు అంటారు. శ్రీచక్రంలో ఉన్న తొమ్మిది ఆవరణలకు ఈ తొమ్మిది కృతులను దీక్షితుల వారు రచించారు. ధ్యానము, మంగళము కలుపుకొని మొత్తం 11 కమలాంబ కృతులు ఆయన జ్ఞాన ధారగా వెలువడ్డాయి. తోడి రాగంలో ధ్యాన కృతి కమలాంబికే, తరువాత ఆనందభైరవిలో కమలాంబ సంరక్షతు, కళ్యాణి రాగంలో కమలాంబాం భజరే, శంకరాభరణ రాగంలో శ్రీ కమలాంబికాయ రక్షితోహం, కాంభోజి రాగంలో కమలాంబికాయై, భైరవిలో శ్రీ కమలాంబాయాః పరం, పున్నాగవరాళి రాగమలో కమలాంబికాయాస్తవ, శహానా రాగంలో శ్రీ కమలాంబికాయాం, ఘంట రాగంలో శ్రీ కమలాంబికే, ఆహిరి రాగంలో శ్రీ కమలాంబా జయతి, శ్రీ రాగంలో శ్రీ కమలాంబికే అనే 11 కృతులను రచించారు.

ఈ కీర్తనలలో విభక్తి అవరోహణ ప్రత్యేకత. కృతుల సాహిత్యాన్ని పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఈ నవావరణ కీర్తనలు గానానికి క్లిష్టతరమైనవిగా చెప్పబడతాయి. దీక్షితుల వారు చాలా గొప్ప శ్రీ విద్యా ఉపాసకులు. లోకానికి ఈ ఉపాసనలోని గొప్పతనాన్ని చెప్పటానికి ఆయన దేవతల, యోగినుల వివరాలతో ఈ కృతులను రచించారు. చక్రాలను, ఆయా దేవతల వలన కలిగే సిద్ధులను ఆయన వర్ణించారు. శ్రీవిద్యా ఉపాసన అందరికీ కాదు. చాలా నిష్ఠగా, అర్హులైన గురువుల అనుగ్రహంతో చేయవలసినది. ఈ ఉపాసన సరిగ్గా తెలిసిన గురువులు కూడా చాలా తక్కువ. ఈ నాటి కాలంలో ఇటువంటి ఉపాసన తాంత్రికంగా భావించబడుతుంది. కానీ, దీక్షితుల వారు సిద్ధులైన వారు. తిరువారూరులో అమ్మను ఉపాసన చేస్తూ ఈ కృతులను రచించారు.

కమలాంబ నవావరణ కృతులలో మొదటిది కమలాంబా సంరక్షతు మాం. సాహిత్యం, భావం వివరాలు:

కమలాంబా సంరక్షతు మాం హృత్కమల నగర నివాసినీ

సుమనసారాధితాబ్జ ముఖీ సుందర మనః ప్రియకర సఖీ
కమలజానంద బోధ సుఖీ కాంతాతార పంజర శుకీ

త్రిపురాది చక్రేశ్వరీ అణిమాది సిధ్ధేశ్వరీ నిత్య కామేశ్వరీ క్షితి
పుర త్రైలోక్య మోహన చక్రవర్తినీ ప్రకట యోగినీ సుర 
రిపు మహిషాసుర మర్దనీ నిగమ పురాణాది సంవేదినీ 
త్రిపురేశీ గురుగుహ జననీ త్రిపుర భంజన రంజనీ మధు 
రిపు సహోదరీ తలోదరీ త్రిపుర సుందరీ మహేశ్వరీ

మా హృదయ కమలములలో నివసించే ఓ కమలాంబా! మమ్ములను రక్షింపుము. మంచి మనసులు కలిగిన వారిచే ఆరాధించబడుతూ కలువ వంటి ముఖము కల అమ్మా! నీవు పరమశివునికి మనసును రంజిల్ల జేసే సఖివి. కమలమునుండి జన్మించి జ్ఞానమయివై సుఖిణే తల్లివి! తారా చక్రమనే పంజరములో నివసించే చిలుకవు! త్రిపురాది చక్రములకు అధిదేవతవు, అణిమాది సిద్ధులకు ఈశ్వరివి,నిత్య కామేశ్వరివి నీవు! ముల్లోకాలను శాసించే మహారాజ్ఞివి, యోగినిగా ప్రకటితమైన అమ్మవు. మహిషాసురుని సంహరించిన ఆదిపరాశక్తివి, వేద పురాణములలో తెలుపబడిన అమ్మవు. నీవు ఆ పరమశివుని ఈశ్వరివి, కుమారుని తల్లివి. త్రిపురాసురుల సంహారాన్ని ఆనందించిన తల్లివి, శ్రీహరి సహోదరివి, త్రిపుర సుందరివి, మహేశ్వరివి. మమ్ములను రక్షింపుము.

దీక్షితుల వారి వివరాలు:



దీక్షితుల వారు సంగీతమే కాకుండా వేద వేదాంగాలు, యోగ, మంత్ర, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. భారతదేశమంతటా సంచారము చేసిన మహాజ్ఞాని. కర్ణాటక హిందూస్థానీ సంగీత శాస్త్రాలే కాకుండా పాశ్చాత్య సంగీతములో కూడా పరిశోధన చేసి నైపుణ్యము పొందిన వారు. తెలుగును ప్రోత్సహించిన సీపీ బ్రౌను గారితో కలిసి పాశ్చాత్య సంగీత బాణీలలో కూడా కృతులను స్వరపరచారు. సంస్కృతము, తెలుగు, తమిళములలో పారంగతులు. మణిప్రవాళ శైలిలో రచనలు చేసిన మహా నిష్ణాతులు. వీరి తండ్రి రామస్వామి దీక్షితులు శ్రీవిద్యా ఉపాసకులు. వీరు  తిరువారూరులోని కమలాంబికను నవావరణ ఉపాసాన చేశారు. వైదీశ్వరన్ కోయిల్‌లోని బాలాంబికను ఉపాసన చేయగా ఆ తల్లి నలభై రోజుల తరువాత అనుగ్రహించి ఓ ముత్యాల హారాన్ని ప్రసాదించింది. 1776లో తిరువారూరులోని త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాల సమయంలో కృత్తికా నక్షత్రమున సుబ్బలక్ష్మి అమ్మాళ్-రామస్వామి దంపతులకు  కుమారుడు జన్మించెను. అతనికి ముత్తుకుమారస్వామి అని నామకరణం చేయగా ఆ బాలుడు ముత్తుస్వామి దీక్షితులుగా పేరుగాంచాడు. రామస్వామి దీక్షితులకు శ్రీవిద్యా ఉపాసనను అందించిన సద్గురువులు చిదంబరనాథ యోగే ముత్తుస్వామి దీక్షితుల వారికి కూడా దానిని ఉపదేశించారు. ఇది కాశీ నగరంలో జరిగింది. అక్కడే యోగులు దీక్షితుల వారికి శంకర భగవత్పాదుల అద్వైత సిద్ధాంతాలను బోధించారు. కాశీలో కొన్నేళ్ల పాటు సూర్యోదయమునకు పూర్వమే గంగా స్నానము, అనుష్ఠానము, అన్నపూర్ణా విశ్వేశ్వరుల దర్శనము, శ్రీచక్రార్చన దీక్షితుల వారి దిన చర్య. అక్కడినుండే ఆయన నేపాల్ వెళ్లి పశుపతినాథుని, బదరీ వెళ్లి నారాయణుని కూడా సేవించారు. ఒకసారి చిదంబరనాథ యోగులు "ముత్తుస్వామీ! నీవు గంగానదిలో స్నానం చేయుటకు వెళ్లినపుడు కాలికి ఏ వస్తువు తగిలితే దానిని తీసుకొని రా" అని చెప్పారు. ముత్తుస్వాముల వారి కాలికి వీణ దొరుకుతుంది. ఆ వీణ తలభాగం పైకి తిరిగి ఉండి, దానిపై రామ అని రాసి ఉంటుంది. యోగులు శిష్యుని ఆశీర్వదించి "ఇది నీకు గంగమ్మ తల్లి అనుగ్రహము. నీవు గొప్ప సంగీత విద్వాంసుడవు, వైణికుడవు కాగలవు" అని దీవించారు. ఈ వీణ ఇప్పటికీ దీక్షితుల వారి వంశస్థుల వద్ద ఉంది. ఒకసారి ఓ వృద్ధ బ్రాహ్మణుని రూపములో కుమారస్వామి దీక్షితుల వారిని అనుగ్రహించగా తన కృతులకు గురుగుహ అనే ముద్రను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.


దీక్షితుల వారు అనేక వందల క్షేత్రాలలోని దేవతలను ఉపాసన చేసి కృతులను రచించారు. పంచభూత లింగ క్షేత్రాలు, తిరుత్తణి, పళని, కంచి కామాక్షి, వరదరాజ స్వామి, మదురై మీనాక్షి, తిరుమల వేంకటేశ్వరుడు, గురువాయూరు కృష్ణుడు, రామేశ్వరంలోని శివునితో పాటు తిరువారూరులోని త్యాగరాజస్వామి, కమలాంబికలను నుతించారు. కమలాంబ గురించి ఆయన రచించిన నవావరణ కీర్తనలు జగత్ప్రసిద్ధములు. ఈ కీర్తనల కూర్పులో వారి ప్రతిభ పతాక స్థాయిలో కనబడుతుంది. ఈ కృతులు దేవతా మూర్తులకు కట్టిన ఆలయాలవలె ప్రకాశించాయి. ఈ కీర్తనలలో తంత్ర విద్య, శ్రీచక్ర వర్ణన, యంత్ర తంత్ర మంత్ర పూజా సాంకేతిక వైభవాలు ఉట్టిపడతాయి. 1835వ సంవత్సరములో నరక చతుర్దశి నాడు ఆయనకు అన్నపూర్ణా దేవి తేజొమయ రూపము దర్శనమయ్యింది. ఆ దర్శనములో ఆయనకు తనకు సమయమాసన్నమైనదని కూడా గ్రహించారు. ఏహి అన్నపూర్ణే అని తన ఆఖరి కృతిని ఆలపించి, శిష్యులను మీనాక్షి మేముదం దేహి అనే కృతిని పాడమన్నారు. మీనలోచని పాశమోచని అన్న పదాలు వారు ఆలపించుచుండగా శివే పాహి అని జీవన్ముక్తులైనారు దీక్షితుల వారు.

భారతీయ సనాతన ధర్మంలో దీక్షితుల వారి పరంపర వారి సోదరుల కుమారుల ద్వారా, శిష్యుల ద్వార కొనసాగుతూనే ఉంది. తిరువారూరులోనే దీక్షితుల వారి బృందావనం ఉంది. వారి ఉపాసనా బలం భారతదేశమే కాదు ప్రపంచమంతటా సంగీత సాహిత్యం ద్వారా, కళాకారుల గానం ద్వారా ప్రకాశిస్తూనే ఉంది.

రంజని-గాయత్రి సోదరీమణుల గాత్రంలో పైన వివరించబడిన నవావరణ కృతి వినండి