20, జనవరి 2026, మంగళవారం

భగవద్రామానుజాచార్యుల జీవనయాత్ర – స్థలాల ఆధారిత సారాంశము



భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో రామానుజాచార్యుల వారు అతి విశిష్టమైన స్థానాన్ని అలంకరించిన అవతారపురుషులు. విశిష్టాద్వైత సిద్ధాంతానికి ప్రాణప్రతిష్ఠ చేసి, భక్తి–జ్ఞాన–కర్మల సమన్వయాన్ని ప్రజలకు సులభముగా బోధించిన జగద్గురువులు. వారి జీవితం ఒక స్థలంలో స్థిరముగా ఉండిన జీవితం కాదు; అది ధర్మప్రచారం నిమిత్తం దేశమంతా విస్తరించిన ఒక మహాయాత్ర.

శ్రీపెరుంబుదూరు – అవతార స్థలం:    

శ్రీ రామానుజాచార్యుల జన్మస్థానముగా ప్రసిద్ధి పొందినది శ్రీపెరుంబుదూరు గ్రామము. ఇది తమిళనాడులోని ఒక పుణ్యక్షేత్రము. క్రీస్తుశకం 11వ శతాబ్దం ప్రారంభంలో ఇక్కడ వారు జన్మించారు. చిన్ననాటి నుంచే అపూర్వమైన బుద్ధిశక్తి, ధార్మిక స్వభావం కలిగిన బాలకుడిగా ప్రసిద్ధి చెందారు. వేదపాఠనానికి అనుకూలమైన వాతావరణంలో పెరిగిన ఈ బాలుడు, భవిష్యత్తులో భారతీయ తత్వచింతనకు దిశానిర్దేశం చేసే మహాచార్యుడవుతాడని అప్పుడే సంకేతాలు కనిపించాయి.

కాంచీపురం – విద్యాభ్యాసము మరియు అంతర్మథనం:

బాల్యానంతరం రామానుజులు కాంచీపురానికి చేరుకున్నారు. ఇది ఆ కాలంలో విద్యా–సాంస్కృతిక-ఆధ్యాత్మిక కేంద్రముగా వెలుగొందిన నగరం. ఇక్కడ యాదవప్రకాశుడు అనే అద్వైతాచార్యుని వద్ద వేదాంత విద్యను అభ్యసించారు. అయితే గురువు బోధించిన అద్వైత భావన, శిష్యుని హృదయంలోని భక్తి ప్రధానమైన దృష్టితో సరిగా ఏకీభవించలేదు. ఈ అంతర్మథనమే భవిష్యత్తులో విశిష్టాద్వైత సిద్ధాంత రూపకల్పనకు బీజమైంది.

కాంచీపురంలోనే వారు దేవాలయ సేవలలో పాల్గొని, శ్రీ వరదరాజ స్వామి అనుగ్రహంతో భక్తి మార్గాన్ని లోకానికి బోధించసాగారు. ఇక్కడ గృహస్థ జీవితం నుంచి విరక్తి చెంది, క్రమంగా సన్యాస మార్గానికి పయనించారు.

శ్రీరంగం – ప్రధాన పీఠము మరియు కార్యక్షేత్రము:

రామానుజాచార్యుల జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ శ్రీరంగంలో ప్రారంభమైంది. కావేరి నదీ తీరంలో విరాజిల్లే శ్రీరంగనాథస్వామి ఆలయం వారి ఆధ్యాత్మిక కార్యాలకు కేంద్రబిందువైంది. ఇక్కడ వారు శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని సుస్థిరంగా స్థాపించారు. ఆలయ ఆరాధనా విధానాలను శాస్త్రీయంగా పునర్వ్యవస్థీకరించి, సామాన్య ప్రజలకు సైతం భక్తి మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు.

శ్రీరంగంలోనే వారు శ్రీభాష్యం, గీతాభాష్యం వంటి మహాగ్రంథాలను రచించి, బ్రహ్మసూత్రాలకు విశిష్టాద్వైత వ్యాఖ్యానాన్ని అందించారు. వారి జీవితాంతం ఈ పుణ్యక్షేత్రమే వారి నివాసముగా, కార్యక్షేత్రముగా నిలిచింది. చివరికి ఇక్కడే వారు దేహత్యాగం చేశారు. ఈనాటికీ వారి శరీరావశేషాలు ఆలయ ప్రాంగణంలో సజీవ సంప్రదాయంగా దర్శనమిస్తాయి.

మేల్కోటే (తిరునారాయణపురం) – విరోధముల నడుమ ధర్మస్థాపన:

చోళ రాజుల కాలంలో కొన్ని మతపరమైన సంఘర్షణల కారణంగా రామానుజాచార్యులు శ్రీరంగాన్ని విడిచి కర్ణాటక ప్రాంతానికి వెళ్లవలసి వచ్చింది. అప్పుడు వారు మేల్కోటే అనే ప్రాంతంలో దీర్ఘకాలం నివసించారు. ఇది కూడా వారి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన స్థలముగా నిలిచింది.

మేల్కోటేలో వారు దేవాలయాలను పునరుద్ధరించి, విగ్రహారాధనకు ప్రాధాన్యతనిచ్చారు. అక్కడ యదుగిరి యతిరాజ మఠాన్ని స్థాపించి, అనేక శిష్యులను తయారుచేశారు. సామాజిక సంస్కరణలు, భక్తి ప్రచారం, తత్వవాద బోధన — అన్నీ కలిసిన సమగ్ర కార్యాచరణ అక్కడ సాగింది. కొందరు వారు అక్కడ 12 సంవత్సరాలు, మరికొందరు 30 సంవత్సరాలకు పైగా నివసించినట్లు చెప్పారు.

ఉపసంహారం:

శ్రీ రామానుజాచార్యుల జీవితం ఒక వ్యక్తిగత యాత్ర కాదు. అది సమాజాన్ని, ఆధ్యాత్మికతను, తత్వచింతనను ఒక కొత్త దిశగా నడిపించిన మహాప్రయాణం. శ్రీపెరుంబుదూరులో జన్మించి, కాంచీపురంలో విద్యనభ్యసించి, శ్రీరంగంలో సిద్ధాంతాన్ని స్థాపించి, మేల్కోటేలో ధర్మాన్ని నిలబెట్టిన ఈ మహాచార్యుడు భారతదేశ ఆధ్యాత్మిక భూభాగమంతటా తన ప్రభావాన్ని చాటాడు.

వారి నివసించిన ప్రతి స్థలమూ ఈనాటికీ ఒక తీర్థక్షేత్రమే. వారి బోధనలు కాలాతీతమైనవి, వారి జీవితం అనుసరణీయమైనది, వారి సిద్ధాంతం సనాతనమైనది. 

18, జనవరి 2026, ఆదివారం

వీరభద్రుడు-వీరభద్రుని పళ్ళెం

వీరభద్రుడు:

శివుని అంశతో జన్మించినవాడు ఇతడు. రౌద్రరూపము దాల్చిన శివుడు తన జడను లాగి నేలకు కొట్టగా ఈ వీరభద్రుడు జన్మించాడు. దక్షుడు బ్రహ్మ చేస్తున్న సత్రయాగము చూడటానికి వచ్చినప్పుడు తనను చూసి లేచి మాట్లాడని తన అల్లుడగు శివునిపై కోపించి శపించి వెళ్లిపోతాడు. ఆనాటి నుండి దక్షుడు శివునిపై శత్రుభావము వీడక ఉంటాడు. అందువల్ల శివుడిని,కుమార్తె ఉమ పిలువకుండానే బృహస్పతి సవనము ఆరంభిస్తాడు. అది తెలిసి ఉమ తన తండ్రి చేస్తున్న యాగమును చూడటానికి భర్త అనుమతిని పొంది యజ్ఞశాలకు వెళుతుంది. అక్కడ తండ్రిచే అవమానించబడి ఆయనను నిందిస్తూ యోగాగ్నిని సృష్టించి దానిలో దగ్ధమవుతుంది. ఆ వృత్తాంతమును శివుడు నారదుని ద్వారా తెలుసుకొని కోపోద్రిక్తుడై తన జడ ఒకటి పెఱికి భూమి మీద విసరగా, దాని నుండి వీరభద్రుడు ఆవిర్భవించి, ఘోరమైన రూపము దాల్చి దక్ష యజ్ఞమును ధ్వంసము చేయటానికి శివుని ఆనతి పొంది యజ్ఞశాలకు వెళ్లి యజ్ఞధ్వంసము మరియు దక్షవధ చేస్తాడు. అప్పుడు బ్రహ్మ మొదలగు దేవతలు శివుని ప్రార్థింపగా శివుఁడు ప్రసన్నుడై మళ్లీ దక్షాదులను అనుగ్రహిస్తాడు. దక్షయజ్ఞము ధ్వంసమయ్యే సమయంలో యజ్ఞపురుషుడు మృగరూపము ధరించి పారిపోవుచుండగా ఆ మృగమును వీరభద్రుడు వధిస్తాడు, శివుడు పునరుజ్జీవింపచేస్తాడు. దక్ష యజ్ఞ సమయంలో రౌద్ర రూపము దాల్చిన ఉమ అంశతో ఆవిర్భవించిన భద్రకాళిని వీరభద్రుని పత్నిగా భావిస్తారు. 

శివ పురాణం, స్కాంద పురాణం, పద్మ పురాణం వీరభద్రుని గురించి ప్రస్తావిస్తాయి. మన దేశంలో లేపాక్షి, కొత్తకొండ, రిషీకేశ్, హుమ్నాబాద్, కుంభకోణం మొదలైన ప్రాంతాలలో వీరభద్రుని దేవాలయాలున్నాయి. వీరశైవాన్ని ఆచరించేవారు ఎక్కువగా కర్నాటక, తెలంగాణా, పల్నాడు ప్రాంతాలలో ఉంటారు. ఉత్తరాదిన దక్షయజ్ఞ విధ్వంసకుడిగా, దక్షిణాది వారు శివుని ప్రమథ గణాధిపతిగా, క్షేత్రపాలకునిగా, వీరునిగా వీరభద్రుని ఆరాధిస్తారు. శ్రీశైలంలో బయలు వీరభద్రస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది. 

=

వీరభద్రుడి పళ్లెం:

వీరభద్రుడికు చేసే విశిష్టమైన పూజ, వీరశైవులు ఆచరించే ఒక ఆచారము వీరభద్రుడీ పళ్లెం/వీరభద్రుని వీథి పళ్ళెం. ఈ పూజా తతంగం అద్భుతమైన వీరవిన్యాసాలతో కూడి ఉంటుంది. అసాధ్యం అనిపించే వీరనాట్యంతో అద్భుతమనిపిస్తుంది.  శివద్వేషులను అంతం చేసే మహావీర ఖడ్గాన్ని ఈ ప్రక్రియలో ప్రదర్శిస్తారు.  ఆ వీరనాట్యం చూసి తీరాల్సిందే, చెప్పశక్యం కాదు. అటువంటి వీరభద్రుని పళ్ళెం వీరశివాచార కుటుంబాలకు, లింగధారులకు ఒక కుటుంబ ఆచారంగా వస్తూంటుంది. ఇందులో వీరభద్రుని ఆవిర్భావ కథను దక్షయజ్ఞ దండకంగా అమితమైన ఆవేశంతో చదువుతూ, ఢమఢమ డప్పులు మోగిస్తూ,  నారసాలు పొడుచుకోవడం, అగ్గి విన్యాసాలు చేయడం, సూదుల్లాంటి మేకులున్న పావుకోళ్ళని ధరించి అశ్శరభ శ్శరభ, దశ్శరభశ్శరభ అని నాట్యం చేయడం, నిప్పుల గుండాలు తొక్కడం ఇలా ఎన్నో వీరోచిత విన్యాసాలుంటాయి.

వీరి ఖడ్గ ప్రదర్శనం వీరా వేశంతో కూడుకొని వుంటుంది. స్త్రీలూ, పురుషులూ ఒక గుంపుగా వీధిలో ప్రవేశించి అక్కడక్కడ ఆగుతూ ఈ ఖడ్గాలు చదివి ముందు సాగుతారు. ఖడ్గధారి ఖడ్గం చదివేటప్పుడు గుంపులోనుంచి ముందుకు వస్తాడు. సాంబ్రాణి ధూపంతో అతనిని ముంచెత్తుతారు. సన్నాయి బూరలతో, డోళ్ళతో, శంఖాలాతో, ఖడ్గధారిని ఆవేశ పరుస్తారు. ఆ ఆవేశంలో ఖడ్గధారి ఖడ్గం (వీరభద్ర ఆవిర్భావ గాథని వివరించే పదాల్లాంటివి) చదువుతాడు. పళ్లెంలో మహావీర ఖడ్గాన్ని ఉంచుతారు.  వీభద్రపళ్లెంలో ఈ ఖడ్గ విన్యాసం తప్పనిసరిగా ఉంటుంది. ఖడ్గం పట్టి చేసే  ఈ నృత్యాన్ని ఖడ్గ నృత్యమని కూడ పిలుస్తారు. ఈ నృత్యం ప్రత్యేకంగా కొన్ని జాతులవారు మాత్రమే చేస్తారు. ఏ కులం వారైనా వీర శైవ మతాన్ని అవలంబించిన ప్రతి వారూ ఈ నృత్యాన్ని తప్పక చేస్తారు.

తంతు తతంగం:

ఈ మహావీరఖడ్గ నృత్య సమయంలో పెద్ద పెద్ద ప్రభలు గట్టి ఆ ప్రభలను అనేక అలంకారలతో ముంచి వేస్తారు. ప్రభకు ముందూ వెనుకా స్త్రీ పురుషులు నడుస్తూ వుంటారు. ప్రభ ముందు సన్నాయి వాయిద్య కాండ్రు రెండుమూడు దళాలువారుంటారు. ముఖ్యంగా ఈ నృత్యంలో వీరు వాయించే వాయిద్యం వీరంగం. ఇది ఒక ప్రత్యేకమైన వాయిద్యం. కణకణమని అతి దురితంగా డోళ్ళు మ్రోగుతాయి. సన్నాయి బూరలు తారాస్థాయిలో గుక్క పట్టి నృత్య కారుని చెవుల్లో వూదుతారు. సాంబ్రాణి ధూపం ముఖానికి దట్టంగా పట్టిస్తారు. దీనితో ఖడ్గధారి వీరావేశంతో ఒక్కగెంతు గ్తెంతి దశ్శరభశరభ, అశ్శరభ శరభ అంటూ డోలు వాయిద్య గాళ్ళను కవ్విస్తూ... అదదదద అబబబబ అగగగగ ... అని డోలు వాయిద్య గానిని కవ్వించి ముక్తాయింపులు ఇప్పించి దశ్శరభ అశ్శరభ అని వీరభద్రుని ఆవిర్భావగాథ లైన దక్షుని దండకం తదితరాలు చదువుతూ వీరనాట్యం చేస్తాడు. హంగూ, ఆర్భాటం చేస్తారు. వీరంగ ధ్వనులు మిన్ను ముట్టుతాయి. ఇలా ఖడ్గం పట్టి దండకం చదువుతూ, వాయిద్యాల గమకాలననుసరించి, వీరావేశంతో ఆ ప్రక్కకూ, ఈ ప్రక్కకూ అడుగులు వేస్తూ, కంకణం కట్టిన కత్తిని వేగంగా త్రిప్పుతూ ఆసాంతంలో ఏ గ్రామదేవతను గాని ఏ దేవుణ్ణి పూజిస్తారో, ఆ గ్రామం పేరు తలచి జై మంగళ గిరి వీరభద్ర అని ముగించి మరల వాయిద్యగాండ్రను అదరించి శరభ, శరభ అంటూ నానా హంగామా చేసి ఆ కత్తిని ఎవరైతే ఆ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారో, అతని పళ్ళెంలో వుంచుతారు.

ఇలా ఊరేగుతూ నాలుగు వీథులూ కలిసిన చోటల్లా ఒక్కొక్క వ్వక్తి పై విధంగా ఖడ్గ నృత్యం చేస్తాడు. ఇలా ఉత్సవం ముందుకు సాగేకొద్దీ జన సమూహం ఎక్కువై ఎంతో ఉద్రేకాన్ని కలిగిస్తుంది. నృత్యధారి ధరించే ఖడ్గం చాల భారీగా వుంట్ఘుంది. ఖడ్గం మిలమిల మెరుస్తూ వుంటుంది. ఖడ్గం మధ్య భాగంలో తమలపాకులతో గాని, మామిడాకులతో గానీ కంకణం కడతారు. కొన్ని చోట్ల నిమ్మకాయలు గుచ్చడం ఉంది. 

ఖడ్గ ధారి కర్తవ్యాలు:

ఖడ్గం ధరించే వ్వక్తి విభూతి రేఖలు పట్టించి, విచిత్ర వేష ధారణలో వుంటాడు. ఖడ్గం ధరించే వ్వక్తి ఆ రోజున ఉపవాసముంటాడు. ప్రతి వారూ ఈ నృత్యం చేయడం కష్టం. నృత్యం చేసే ప్రతి వ్వక్తి దక్షుని దండకాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలి. లేనట్లేయితే అడుగు పడదు. ఖడ్గ నృత్య ధారి ప్రళయ తాండవంగా నృత్యం చేసిన తరువాత శివమెక్కి ఆవేశంతో నారసాలు పొడుచు కుంటాడు.

నారసాలు:

ఖడ్గ నృత్యంలో ఆ నారసాల నృత్యం మహా ఉత్తేజంగా, భయంకరంగా వుంటుంది. ఖడ్గ నృత్యం అయిన వెంటనే ఆ వ్వక్తి నారసాలు పొడుచుకుంటాడు. 

నారసాలంటే అనేక రకాలుగా వుంటాయి.  ఏకనారసం, కంటి నారసం, గొంతు నారస, శిరసు నారసం, శూల నారసం మొదలైన పేర్లతో వుంటాయి. ఇవి శూలం మాదిరిగా ఉండి, త్రిశూలం చివరి భాగంలో నూనె గుడ్డలు చుట్టి, వాటిని వెలిగించి, సన్నని మొన భాగాన్ని నాలికపై గుచ్చుతారు. ఇలా గ్రుచ్చే సమయంలో జోరుగా వాయిద్య సమ్మేళనం జరిగుతుంది. రణగొణ ధ్వనులు చేస్తారు. ఉద్రేకంలో ఉన్న వారికి కర్పూరం వెలిగించిన పళ్ళెం చేతికిస్తారు. నృత్యకారుడు చేతితో నారసాన్ని పట్టుకుని వాయిద్యానికి తగినట్టు వీరాధివీరుడిలా గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేస్తాడు. చేసే కొద్దీ వాయిద్యాల జోరు ఎక్కువ అవుతుంది. ఈ జోరులో వెలిగించిన వత్తులు, ఒక్కొక్కటిగా ఆరి పోవడంతో ఈ నృత్యం కూడ పూర్తి అవుతుంది.

స్థలానుకూలంగా ఆచారాలు: 

ఈ వీరభద్రుని పళ్ళెం పట్టే విధానంలోని ప్రధాన విన్యాసాల గురించే మనం ఇంతసేపూ చెప్పుకున్నాం.  కొన్ని చోట్ల ఈ విన్యాసాలతో పాటుగా నిప్పుల గుండాలు తొక్కడం తదితర ఎన్నో భీభత్సమైన విన్యాసాలు కూడా చేస్తూ ఉంటారు. కలియుగంలో జంతుబలులు నిషేధించినా కొన్ని చోట్ల అవి ఈ విన్యాసాల్లో చోటుచేసుకుంటాయి. సాధారణంగా కూషంఆండాన్ని సాత్విక బలిగా అర్పిస్తూ ఉంటారు. ఇలా వీరభద్రుని పళ్లెం వీరోచిత విన్యాసాలతో కూడి చివరగా ఏదైనా ఒక వీరభద్ర దేవాలయం దగ్గరే ముగుస్తూ ఉంటుంది.   


11, జనవరి 2026, ఆదివారం

తెర తీయగ రాదా - త్యాగరాజస్వామి కృతి



త్యాగరాజస్వామి సమకాలీకులలో ఉపనిషద్బ్రహ్మేంద్ర స్వామి వారు ప్రముఖులు. వీరు కాంచీపురంలో మఠాన్ని ఏర్పాటు చేసి 108 ఉపనిషత్తులపై భాష్యం రచించారు. సన్యాస స్వీకార సమయంలో గురువులు ఇచ్చిన పేరు రామచంద్రేంద్ర సరస్వతి అయినా వారు ఉపనిషత్తులపై చేసిన కృషి వలన ఆయనకు తదనుగుణమైన నామం వచ్చింది. వారు ఒకసారి త్యాగరాజస్వామిని కాంచీపురం రమ్మని ఆహ్వానించారు. శిష్యుల్ని వెంటబెట్టుకుని త్రోవలో పుణ్య క్షేత్రాలను దర్శిస్తూ, అక్కడి వేల్పులను దర్శించిన అనుభవంతో కీర్తనలు రచించి పాడుకున్నారు త్యాగయ్య. కోవూరు, పుత్తూరు, నాగులాపురం, వాలాజీపేట, శ్రీరంగం, నాగపట్టణం తపస్థీర్థం, ఘటికాచలం మొదలైన క్షేత్రాల్లో రచించిన కీర్తనలన్నీ ఒక ఎత్తయితే, తిరుమలలో శ్రీనివాసుని దర్శించుకున్నప్పుడు పాడిన కీర్తన మరో ఎత్తు. అదో చారిత్రాత్మక సన్నివేశం. తిరుమలకు చేరుకున్న త్యాగయ్యకు వెంటనే దర్శనం కాలేదు. ఆలయంలో ప్రవేశించగానే అర్చకులు తెర వేసి స్వామి కైంకర్యాలు చేస్తున్నారు. నిరుత్సాహంతో చింతాక్రాంతుడైన త్యాగయ్య అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశమున్న కీర్తన ఆలపించారు. శ్రీనివాసుడు త్యాగయ్యపై కరుణించగా తెర తొలగిపోయి అద్భుతమైన దర్శనం కలిగింది. కృతి వివరాలు:

తెర తీయగ రాదా లోని
తిరుపతి వేంకటరమణ మచ్చరమను

పరమపురుష ధర్మాది మోక్షముల
పారదోలుచున్నది నాలోని

మత్స్యము ఆకలిగొని గాలముచే మగ్నమైన రీతి యున్నది
అచ్చమైన దీపసన్నిధిని మరుగిడబడి చెఱచినట్లున్నది

వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతి యున్నది
వేగమే నీ మతముననుసరించిన త్యాగరాజ సన్నుత మదమత్సరమను

భావం: 

ఓ తిరుపతి వేంకటరమణా! నా మనసులో మదమత్సరాదులనే అరిషడ్వర్గములు నెలకొనియున్నవి. ఈ ఆరు అంతశ్శత్రువులనే తెర తొలగించుము. ఓ పరమపురుషా! ఈ తెర మానవుని సాధనా సంపత్తికి దోహదము చేసే ధర్మార్థ కామ మోక్షములను విధులకు దూరము చేయుచున్నది. ఈ తెర ఆకలిగొన్న చేప గేలము నందు గల ఎరను ఆశించి దానిలో చిక్కుకున్న రీతి, స్వచ్ఛమైన దీపకాంతికి అడ్డుపడి అంధకారములో పడవేసి అధోగతిపాలు చేస్తున్నది. ఈ మదమత్సరములనే తెర ఎడారులలో ఎండమావులను చూసి భ్రమసి పశుగణములు వాని వద్దకు చేరుకున్నట్లుగా మాయలో పడవేసి నీకు దూరము చేయుచున్నవి. వీటిని తొలగించి నీ దర్శనమును ప్రసాదించుము. నీ భక్తియనే మతమును అవలంబించాను, నన్ను కాపాడుము. 

గౌళిపంతు రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు

5, జనవరి 2026, సోమవారం

ధీమహి గాయత్రీం సతతం - గణపతి సచ్చిదానందస్వామి వారి కృతి



ధీమహి గాయత్రీం సతతం ధీమహి గాయత్రీం సతతం ధీమహి గాయత్రీం 

సంధ్యాత్రితయే మునివినుతాం సవితృ వరేణ్య శ్రీ రూపాం
ధీమద్ధీ చోదన శీలాం భర్గోరూపాం తాం దేవీం

మహిత చతుర్వింశతి వర్ణాం త్రిపదాం దేవీం నిటలాక్షీం
పంచశిరస్థాం దశహస్తాం ఉపనయనార్థే వినియుక్తాం

ముక్తా విద్రుమ హేమగణా ఘన ధవళోజ్జ్వల వర్ణమయీం
వ్యాహృతి రూపాం ప్రణవార్ధాం గాయక సచ్చిదానందకరాం 


ధీమహి

శబ్దార్థం: ధ్యానించుదము
భావార్థం: మనస్సును ఏకాగ్రం చేసి స్మరిస్తాము

గాయత్రీం

శబ్దార్థం: గాయత్రీ దేవిని
భావార్థం: వేదమాత అయిన గాయత్రీ దేవతను

సతతం

శబ్దార్థం: ఎల్లప్పుడూ
భావార్థం: నిరంతరం, అవిచ్ఛిన్నంగా

భావం:

మేము ఎల్లప్పుడూ, నిరంతరం గాయత్రీ దేవిని ధ్యానిస్తాము.

సంధ్యాత్రితయే మునివినుతాం సవితృ వరేణ్య శ్రీ రూపాం

సంధ్యా–త్రితయే

శబ్దార్థం: మూడు సంధ్యా కాలములలో
భావార్థం: ప్రాతః, మాధ్యాహ్న, సాయంకాల సంధ్యలలో

ముని–వినుతాం

శబ్దార్థం: మునులు స్తుతించినది
భావార్థం: ఋషులచే మహిమించబడిన దేవి

సవితృ–వరేణ్య

శబ్దార్థం: సవితృ దేవునికి అత్యంత ప్రియమైనది
భావార్థం: సూర్య తేజస్సుతో ఏకరూపమైనది

శ్రీ రూపాం

శబ్దార్థం: దివ్యమైన రూపమును కలిగినది
భావార్థం: మంగళకరమైన, శోభాయమాన రూపధారి

భావం:

మూడు సంధ్యలలోనూ మునులు స్తుతించే, సూర్య తేజస్సుతో వెలుగొందే దివ్య రూపధారిణి గాయత్రీ.

ధీమద్ధీ చోదన శీలాం భర్గోరూపాం తాం దేవీం

ధీమత్–ధీ

శబ్దార్థం: జ్ఞానసంపన్నమైన బుద్ధి
భావార్థం: ఉత్తమమైన వివేక బుద్ధి

చోదన–శీలాం

శబ్దార్థం: ప్రేరేపించే స్వభావం కలది
భావార్థం: మన బుద్ధిని ఉత్తమ మార్గంలో నడిపించేది

భర్గః–రూపాం

శబ్దార్థం: తేజస్సు స్వరూపిణి
భావార్థం: పాపనాశకమైన దివ్య కాంతి స్వరూపం

తాం దేవీం

శబ్దార్థం: ఆ దేవిని
భావార్థం: ఆ పరాశక్తిని

భావం:

మన జ్ఞానాన్ని ఉత్తేజపరచే, దివ్య తేజస్సు స్వరూపమైన గాయత్రీ దేవిని ధ్యానిస్తాము.

మహిత చతుర్వింశతి వర్ణాం త్రిపదాం దేవీం నిటలాక్షీం

మహిత

శబ్దార్థం: మహిమ కలది
భావార్థం: గొప్పగా ఆరాధించబడినది

చతుర్వింశతి వర్ణాం

శబ్దార్థం: 24 అక్షరాలు కలది
భావార్థం: గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాల స్వరూపిణి

త్రిపదాం

శబ్దార్థం: మూడు పదాలుగా విభజించబడినది
భావార్థం: భూః–భువః–స్వః అనే మూడు పాదాల రూపం

నిటల–అక్షీం

శబ్దార్థం: నిటలంలో నేత్రమున్నది
భావార్థం: తృతీయ నేత్రంతో విరాజిల్లే శక్తి

భావం:

24 అక్షరాలు, మూడు పాదాలు కలిగిన తృతీయ నేత్రధారిణి గాయత్రీ దేవి.


పంచశిరస్థాం దశహస్తాం ఉపనయనార్థే వినియుక్తాం

పంచ–శిరస్థాం

శబ్దార్థం: ఐదు శిరస్సులు కలది
భావార్థం: పంచభూతాత్మక శక్తి స్వరూపిణి

దశ–హస్తాం

శబ్దార్థం: పది చేతులు కలది
భావార్థం: అనేక శక్తులను ధరించినది

ఉపనయన–అర్థే వినియుక్తాం

శబ్దార్థం: ఉపనయన సంస్కారానికి నియమించబడినది
భావార్థం: బ్రహ్మవిద్య ప్రవేశానికి అధిష్ఠాన దేవత

భావం:

ఉపనయనాది సంస్కారాలకు మూలదేవతగా నిలిచిన మహాశక్తి.

ముక్తా విద్రుమ హేమగణా ఘన ధవళోజ్జ్వల వర్ణమయీం

ముక్తా – ముత్యముల వంటి
విద్రుమ – ప్రవాళముల వంటి
హేమగణా – బంగారు కాంతి వంటి

ఘన ధవళ ఉజ్జ్వల వర్ణమయీం

శబ్దార్థం: దట్టమైన తెల్లని ప్రకాశం కలది
భావార్థం: శుద్ధత, పవిత్రత ప్రతీక

భావం:

వివిధ రత్నకాంతులతో మెరిసే పవిత్ర దివ్య స్వరూపిణి.

వ్యాహృతి రూపాం ప్రణవార్థాం గాయక సచ్చిదానందకరాం

వ్యాహృతి రూపాం

శబ్దార్థం: భూః–భువః–స్వః స్వరూపిణి
భావార్థం: లోకత్రయాన్ని ఏకరూపం చేసినది

ప్రణవార్థాం

శబ్దార్థం: ఓంకారానికి అర్థస్వరూపం
భావార్థం: పరబ్రహ్మ తత్త్వ స్వరూపిణి

గాయక సచ్చిదానందకరాం

శబ్దార్థం: పఠించువారికి ఆనందమిచ్చేది
భావార్థం: చైతన్యానందాన్ని ప్రసాదించేది

భావం:

ఓంకారార్థ స్వరూపిణి అయిన గాయత్రీ దేవి భక్తులకు సచ్చిదానందాన్ని ప్రసాదిస్తుంది.

తాత్పర్యం:

మేము ఎల్లప్పుడూ గాయత్రీ దేవిని ధ్యానిస్తాము, నిత్యం గాయత్రీ దేవినే మనసారా స్మరిస్తాము. సంధ్యా కాలములన్నిటిలోనూ పూజింపబడే ఆమెను, మునులు స్తుతించే, సవితృ దేవుని శ్రేష్ఠ తేజస్సుతో వెలుగొందే శ్రీమయ రూపమును కలిగిన దేవిని ధ్యానిస్తాము.మన బుద్ధిని ప్రేరేపించి, శుద్ధి చేసే స్వభావముతో భర్గస్వరూపంగా ప్రకాశించే ఆ దేవిని స్మరిస్తాము. ఇరవై నాలుగు అక్షరాల గాయత్రీ మంత్ర స్వరూపిణిగా, మూడు పదాలుగా విస్తరించిన త్రిపదా స్వరూపిణిగా, నిటలమున తృతీయ నేత్రంతో విరాజిల్లే దేవిని ధ్యానిస్తాము. ఐదు శిరస్సులు, పది హస్తాలు కలిగిన మహాశక్తిగా, ఉపనయనాది సంస్కారములకు అధిష్ఠాన దేవతగా ఆమెను మనసారా స్మరిస్తాము. ముక్త, విద్రుమ, హేమమణులవంటి కాంతితో శుద్ధ ధవళ వర్ణంతో ప్రకాశించే దేవిని, వ్యాహృతుల స్వరూపమై, ప్రణవార్థంగా నిలిచిన దేవిని, గానంతో సచ్చిదానందాన్ని ప్రసాదించే గాయత్రీ దేవిని మేము ఎల్లప్పుడూ ధ్యానిస్తాము.

గీతాంజలి బృందం ఆలాపన 

లీలాజగజ్జ్యోతిర్లతా - అమ్మ వారి కృతి


 
లీలాజగజ్జ్యోతిర్లతా
శైలాధిరాడ్గేహోదితా

ఫాలాంబక ప్రేమాధృతా
మాలాలసద్భూషావృతా 

బుధజన మన సమ్మోదినీ
మదయుతజన సంతాపినీ

మృదుకరకలాసంశోభినీ
హృదిలసతు మే విద్యాధునీ  

- ఉడుపా వేంకటనారాయణశాస్త్రి

1. లీలా జగజ్జ్యోతిర్లతా  

   – లీలామయంగా ప్రకాశించే జగత్తు అంతటిని వెలిగించే జ్యోతి లత (ప్రకాశ వల్లి)  

   → అమ్మవారు సౌందర్యంతో, కాంతితో జగత్తును వెలిగించే శక్తి.

2. శైలాధిరాడ్ గేహోదితా  

   – శైలాధిరాజు =  హిమవంతుడు, గేహోదితా = ఇంటిలో జన్మించిన  

   → పార్వతీదేవిగా, హిమవంతుని కుమార్తెగా జన్మించిన దేవి.

3. ఫాలాంబక ప్రేమాధృతా 

   – ఫాలాంబకుడు = శివుడు, ప్రేమాధృతా =  ప్రేమతో ఆరాధించిన  

   → శివుని ప్రేమను పొందిన, ఆయన ప్రియమైన దేవి.

4. మాలాలసద్భూషావృతా  

   – మాలలతో అలంకరించబడిన, శోభాయమానమైన అలంకారాలతో ఉన్న దేవి  

   → ఆభరణాలతో, పుష్పమాలలతో అలంకరించబడిన అమ్మవారు.

5. బుధజన మన సమ్మోదినీ

   – బుద్ధిమంతుల మనస్సులను ఆనందింపజేసేవారు  

   → జ్ఞానులు, భక్తులు ఆమెను ధ్యానించి హర్షించేవారు.

6. మదయుతజన సంతాపినీ  

   – మదంతో ఉన్న (అహంకారుల) జనులను బాధించేవారు  

   → అహంకారులను సంహరించే, దుర్మార్గులను శిక్షించే శక్తి.

7. మృదుకరకలాసంశోభినీ* 

   – మృదువైన చేతులతో కళాశోభను కలిగించినవారు  

   → ఆమె చేతులు సౌందర్యంతో, కళాత్మకతతో నిండినవి.

8. హృదిలసతు మే విద్యాధునీ 

   – హృదయంలో ప్రకాశించే విద్యా నదిగా వెలిగేవారు  

   → విద్యారూపిణిగా, జ్ఞానాన్ని ప్రసరించే శక్తిగా అమ్మవారు.

చిల్కుండ సోదరీమణులు లక్ష్మీ నాగరాజ్, ఇందు నాగరాజ్ ఈ కృతిని చారుకేశి రాగంలో ఆలపించారు


హరికథా కళాకారిణి దాలిపర్తి ఉమామహేశ్వరి గారు



తెలుగుదనంతో పూర్తిగా ముడిపడిన కళ హరికథ. సాహిత్యం, సంగీతం, కూసంత నృత్యం ఖచ్చితంగా వస్తేనే హరికథ చెప్పగలరు. అటువంటి కళను అభ్యసించేందుకు సుమనస్కులు, సంస్కారవంతులు, కళాపోషకులు అప్పటి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం జమీందారు బలుసు ప్రభాకర బుచ్చి కృష్ణ సత్యనారాయణరావు గారు 1973లో సర్వారాయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా సర్వారాయ హరికథా పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలలో నేర్చుకుని గొప్ప కళాకారిణి పేరొందారు శ్రీమతి దాలిపర్తి ఉమామహేశ్వరి గారు, ప్రముఖ ఆంధ్రనాట్య కళాకారులు కళాకృష్ణ గారి ధర్మపత్ని. 2024లో వారికి పద్మశ్రీ అవార్డు లభించింది. వారి జీవిత విశేషాలు ఈ పోస్టులో, వారితో ఇంటర్వ్యూ చూడండి, ఎంత చక్కని తెలుగు భాష వారిది! 

శ్రీమతి దాలిపర్తి ఉమామహేశ్వరి గారు తెలుగు మరియు సంస్కృత భాషల్లో ప్రసిద్ధి చెందిన హరికథా కళాకారిణి. సంస్కృతంలో హరికథను ప్రదర్శించిన మొదటి మహిళా హరికథా కళాకారిణి అనే దేశవ్యాప్త ఖ్యాతి ఆమెకు లభించింది.

1960 మే 21న ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో సాంప్రదాయ సంగీతకారుల కుటుంబంలో జన్మించిన ఆమె చిన్న వయస్సు నుంచే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసిస్తూ, పాఠశాల విద్యను పూర్తిచేశారు. ఆమె తండ్రి తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయానికి ఆస్థాన నాదస్వర విద్వాంసులు.

హరికథ నేర్చుకోవడంలో శ్రీ ఎస్బీపీబీకే సత్యనారాయణరావు, వారి ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరి గారు ఉమామహేశ్వరి గారిని ఎంతో ప్రోత్సహించారు. హరికథను ఆమె గురువులైన శ్రీ కడలి వీరదాసు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు, రాజశేఖరుని లక్ష్మీపతిరావు, ఎన్సీహెచ్ కృష్ణమాచార్య, వేదిమంచి నరసింహదాసు గారి వద్ద అభ్యసించారు. ఆమె నాట్యాచార్య శ్రీ నటరాజ రామకృష్ణ గారి శిష్యురాలిగా శాస్త్రీయ నృత్యాన్ని కూడా నేర్చుకున్నారు. ఆమె తొలి తెలుగు హరికథ గౌరీకల్యాణం, ఇది ఆమె మాతృసంస్థ అయిన సర్వారాయ హరికథ పాఠశాలలో ప్రదర్శించబడింది. తొలి సంస్కృత హరికథ కాళిదాస కుమారసంభవం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని ఖ్యాతిగాంచిన కాళిదాస అకాడమీలో ప్రదర్శించారు. అప్పటి నుంచి కాళిదాస అకాడమీలో ఆమె ప్రదర్శనలు ప్రతి యేటా ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కాళిదాసుని దాదాపు అన్ని నాటకాలు, కావ్యాలను సంస్కృతంలో ఆమె ప్రదర్శించారు. సర్వారాయ హరికథ పాఠశాల గౌరవ ప్రధానాచార్యురాలిగా ఆమె అనేక మంది బాలికలకు హరికథను వృత్తిగా తీసుకునేలా శిక్షణ, ప్రేరణ అందిస్తున్నారు.ఉమామహేశ్వరి గారు హరికథా పితామహుడిగా పరిగణించబడే ఆది భోట్ల నారాయణదాసు గారి హరికథలను ప్రజలకు విస్తృతంగా పరిచయం చేశారు. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాసాల నుంచి ఎన్నో ప్రత్యేక ఘట్టాలను చేర్చి తన ప్రదర్శనలకు విశిష్టతను తెచ్చారు.రమణ మహర్షి, శారదా దేవి పరమహంస, పొట్టిశ్రీరాములు, ఆదికవి నన్నయ్యలపై హరికథలు రచించి వాటిని ప్రజాదరణ పొందేలా చేశారు. కవయిత్రిగా, రచయితగా కూడా ఆమె విశిష్ట ప్రతిభ చూపారు.

తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, అన్నవరం, వేములవాడ వంటి అనేక క్షేత్రాలలో ఆమె ప్రదర్శనలు నిరంతరం జరుగుతుంటాయి. ఆమె వృత్తిజీవితంలో అత్యున్నత ఘట్టం 1986లో బద్రినాథ్‌లో జరిగిన శ్రీ ఆది శంకరాచార్య జయంతి వేడుకలలో చేసిన హరికథ ప్రదర్శన. అంతేకాక, ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయం, యేలు విశ్వవిద్యాలయాలలో జరిగిన వేదిక సదస్సుల్లో పాల్గొన్నారు. దేశం నలుమూలలా, విదేశాలలో కూడా ఆమె హరికథా వైభవాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. 1981లో మలేషియాలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు, 1993లో హార్వర్డ్ వేదసమ్మేళనం, 1996లో అమెరికాలో ఆటా తెలుగు సమావేశం (హ్యూస్టన్), అలాగే యూకే (1996), సింగపూర్, ఇండోనేషియా (2003), ఒమన్ తదితర దేశాలలో ఆమె ప్రదర్శనలు ప్రశంసలు అందుకున్నాయి.

ఆమె కళను సంరక్షించేందుకు అనేక సాంస్కృతిక సంస్థలు ఆమె ఆడియో, వీడియో రికార్డులు నిర్వహించాయి. వాటిలో బొంబాయి నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, న్యూఢిల్లీ సెంట్రల్ సంగీత నాటక అకాడమీ, సాహిత్యకళా పరిషత్, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్, వారణాసిలోని జ్ఞాన ప్రవాహ సంస్థలు ముఖ్యమైనవిగా నిలుస్తాయి. హరికథకు చేసిన విశేషసేవలకు అనేక పురస్కారాలు, గౌరవాలు ఆమెకు లభించాయి. సెంట్రల్ సంగీత నాటక అకాడమీ పురస్కార్, లలితకళా పురస్కారం, కలారత్న పురస్కారం, మహిళా నవరత్న అవార్డు, దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డు వంటి అనేక గుర్తింపులు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్్లో స్థానం పొందిన తొలి మహిళా హరికథ కళాకారిణి ఆమె. శృంగేరి శారదా పీఠాధిపతి ఆమెకు అభినవ మాతంగి బిరుదు ప్రదానం చేశారు. ఉజ్జయినిలోని కాళిదాస అకాడమీ చిత్రకథా సరస్వతి, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఉత్తమ హరికథ ప్రవచనకారిణి వంటి బిరుదులతో ఆమెను సత్కరించాయి.దూరదర్శన్, ఆకాశవాణి లో ఆమె గ్రేడ్‌డ్ ఆర్టిస్ట్. శ్రీ సర్వారాయ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుండి లలితకళా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సంస్కృతి శాఖ నుండి ఉగాది పురస్కారం కూడా పొందారు.

ఉమామహేశ్వరి గారితో ముఖాముఖీ

అదివో చూడరో అందరు మొక్కరో - అన్నమాచార్యుల కీర్తన



 అదివో చూడరో అందరు మొక్కరో గుదిగొని బ్రహ్మము కోనేటి దరిని

రవిమండలమున రంజిల్లు తేజము దివి చంద్రునిలోని తేజము
భువిననలంబున బొడమిన తేజము వివిధంబులైన విశ్వతేజము

క్షీరాంబుధిలో చెలగు సాకారము సారె వైకుంఠపు సాకారము
యీరీతి యోగీంద్రులెంచు సాకారము సారెకు జగముల సాకారము

పొలసినయాగంబులలో ఫలమును పలుతపములలో ఫలమును
తలచిన తలపుల దానఫలంబును బలిమి శ్రీవేంకటపతియే ఫలము


భావం: 

ఇదిగో చూడండి - ఇది సాధారణ దృశ్యం కాదు. ఇది దర్శించినవారందరూ సహజంగానే నమస్కరించేంత మహిమ కలిగిన స్వరూపం.పుష్కరిణి సమీపంలో వెలసిన ఈ పరబ్రహ్మను బయటి చూపుతో కాదు; మనస్సును అంతర్ముఖం చేసి, లోతుగా ధ్యానించినవారే చేరగల మార్గమిదని అన్నమాచార్యుల వారు చెబుతున్నారు. ఇది జ్ఞానమార్గం కాదు, అహంకారాన్ని వదిలే అంతర్యాత్ర.

సూర్యునిలో కనిపించే ఉజ్జ్వల కాంతి, చంద్రునిలో కనిపించే శాంత ప్రకాశం, అగ్నిలో మండే ఉగ్ర తేజస్సు - ఈ మూడు వేర్వేరు లక్షణాలైనా, మూలంగా అవన్నీ ఒకే తేజస్సు. అది పరబ్రహ్మ తేజస్సు. అంటే దేవుడు ఎక్కడో వేరుగా లేడు. ప్రకృతిలో కనిపించే ప్రతి శక్తి ఆయనే.

అదే పరబ్రహ్మం పాలసముద్రంలో నారాయణుడిగా సాకారమైంది. అదే వైకుంఠంలో నిత్యనివాసిగా ప్రకాశిస్తోంది. యోగులు తమ ధ్యానంలో దర్శించేది కూడా అదే రూపం. అలాగే సమస్త లోకాలకు ఆధారమైన మూలస్వరూపం కూడా ఆయనే. ఇక్కడ అన్నమాచార్యులు నిరాకార–సాకార భేదాన్ని తొలగించే సందేశం యిచ్చారు. రూపం ఉన్నా,లేకున్నా, సత్యం ఒక్కటే అని చెబుతున్నారు.

యజ్ఞయాగముల ఫలము, అనేక తపస్సుల ఫలము, నిరంతరము తలచిన ఫలము, దానములు చేసిన ఫలము, అన్నీ కూడా ఆ శ్రీవేంకటేశ్వరుడే. అన్నమాచార్యుల తత్త్వసారాంశం ఇదే - సాధనలన్నీ గమ్యం కాదు, భగవంతుడే గమ్యం. 

ఈ కీర్తన మొత్తం చెబుతున్నది ఒక్క వాక్యంలో: సర్వత్రా కనిపించే తేజస్సు భగవంతుడే. అన్ని సాధనల పరమ ఫలితం ఆయనే.


శోభారాజు గారి ఆలాపన

27, డిసెంబర్ 2025, శనివారం

భగవద్రామానుజులు - మేల్కోటే రామప్రియ విగ్రహం

 ఆరోజుల్లో చోళరాజు పెడుతున్న హింసలు భరించలేక భగవద్రామానుజులు తన శిష్యగణంతో మైసూరు సమీపంలోని మేల్కోటేలో దాదాపు 20 ఏళ్లు నివసించారు. అక్కడ ఉన్నప్పుడు ఆయన సనాతనధర్మానికి, సమాజానికి చేసిన సేవ అంతా యింతా కాదు. వేదపాఠశాల, చెలువనారాయణస్వామి దేవస్థాన నిర్మాణం, తత్సంబంధమైన వ్యవస్థల ఏర్పాటు, క్షామంతో అలమటిస్తున్న ప్రజల కోసం తొన్నూరు రిజర్వాయర్ నిర్మాణం...ఇవన్నీ రామానుజుల వారి చలవే. అంతే కాదు, మొట్టమొదటిసారి హరిజనులు దేవాలయ ప్రవేశానికి అనుమతించబడింది చెలువనారాయణుని సన్నిధిలోనే, అది రామానుజుల వారి వల్లే.


అక్కడి మహారాజు విష్ణువర్ధనుని చేత తాలక్కాడ్, తొండనూర్, బేలూరు, నాగమంగళ, బెళవాడి అనే ఐదు ప్రదేశాలలో కీర్తినారాయణ, నంబినారాయణ, కేశవనారాయణ, సౌమ్యనారాయణ, వీరనారాయణ దేవస్థానాలను ఏర్పాటు చేయించి శ్రీవైష్ణవ వ్యాప్తికి, స్థిరత్వానికి తోడ్పడ్డారు. నిజం చెప్పాలంటే శ్రీరంగం కన్నా శ్రీవైష్ణవం నిలబడింది మైసూరు ప్రాంతంలో రామానుల వారు చేసిన ప్రయత్నాల వల్లనే. అందుకే ఆయన పంచ నారాయణ క్షేత్ర ప్రతిష్ఠాపనాచార్యగా ప్రసిద్ధి పొందారు.

అంతే కాదు, 82 ఏళ్ల వయసులో కాలినడకన ఢిల్లీ వెళ్లి మొఘల్ సుల్తాను వద్ద నుండి ఉత్సవమూర్తి అయిన రామప్రియ రూపాన్ని పరిపూర్ణమైన భక్తి మహిమతో సాధించి తీసుకు వచ్చి సనాతనధర్మంలోని భక్తి మార్గం యొక్క గొప్పతనాన్ని మరోమారు చాటి శాశ్వతం చేశారు. బీబీ నాంచారి అన్న గాథ ఈ ఉదంతానికి సంబంధించినదే. ఇస్లాంలో జన్మించినా ఆ రామప్రియ ఉత్సవమూర్తిలోని దైవాన్ని గ్రహించి ఆరాధించ గలిగిన స్త్రీ కాబట్టే ఆమెకు పూజనీయ స్థానం కలిగించారు రామానుజుల వారు.

వెయ్యేళ్ల నాడు రామానుజుల వారు ఢిల్లీ నుండి తెచ్చిన రామప్రియ విగ్రహం ఇదుగో!

రామానుజో విజయతే!



27, అక్టోబర్ 2025, సోమవారం

దేవ కార్యం - పితృ కార్యం

మనం చేసే కార్యాలలో హోమంతో కూడినవి దేవతలకు ప్రీతిగా చేసేవి, పితృదేవతలకు ప్రీతిగా చేసేవి ప్రధానంగా రెండు భాగాలు. పర-అపర కర్మలకు అనుసంధానమైనవి ఇవి. వీటిలో మనం వినే పదాలు స్వాహా స్వధా. ఇవి ఏమిటి?
స్వాహా అన్న పదానికి అగ్ని దేవుని భార్య, హవిష్ప్రదానం అన్నవి ప్రధానమైన అర్థాలు. యజ్ఞకాండలో స్వాహా శబ్దం లేకుండా హవిస్సులు వేల్చడం ఉండదు. ఏ దేవతలను ఉద్దేశించి యజ్ఞాదులు చేస్తున్నారో వారికి హవిస్సులు అందడానికి స్వాహా తప్పనిసరి. ఆహుతులు స్వాహాకార, వషట్కార పూర్వకంగా వేల్చినప్పుడే దేవతలకు అందుతాయి. అయితే, సంధ్యావందనంలో కేశవ నామాలు చెప్పేటప్పుడు త్రిరాచమ్య అంటూ ముమ్మారు స్వాహాకారంతో ఆచమనం చేయడం పద్ధతి. ఇక్కడ హోమాగ్ని ప్రసక్తి లేదు. అయినప్పటికీ అవి దేవతలకు సమర్పించేవే కనుక స్వాహా శబ్దాన్ని వాడవలసి వస్తున్నది. స్వాహా శబ్దం హోమ సంబంధమైన సాంకేతిక పదం మాత్రమే కాదు. అది సార్థకమైన వాఙ్నామం కూడా. చక్కగా హుతమగుగాక అనే అర్థాన్ని కొందరు భాష్యకారులు ఉదహరించారు. ఇది మహామహిమాన్వితమైన మంత్రమని కొందరు విద్వాంసుల భావన. వేద మంత్రాలు లేకుండానే స్వాహా మంత్రోచ్చారణ చేసే సందర్భాలు ఉన్నాయి. నిత్యనైమిత్తిక కర్మలలోనూ యజ్ఞ యాగాదులలోనూ ఆచమన క్రియతో స్వాహా సాక్షాత్కరించడం ప్రారంభ మవుతుంది. దేవతలకు ఆహుతులను అందించే శబ్దంగా స్వాహా ప్రసిద్ధమైంది. అంతే కాదు అనేక మంత్రాలకు చివర స్వాహా ఉంటుంది. స్వాహా దేవికి ప్రీతికరమైనది ఘృతము. అందుకే అగ్ని కార్యాలలో ఘృతము ప్రధానమైన భుక్కు.
అగ్నికార్యంలో/ యజ్ఞాలలో స్వాహా శబ్దం వినిపించినట్లే పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వడంలో స్వధా శబ్దం వినిపిస్తుంది. పితృయజ్ఞాలలో స్వాహాదేవియే తర్పణాలలో స్వధా రూపిణిగా వస్తున్నదని శాస్త్రం. (పితృ యజ్ఞేషు స్వధా మాతా) పితృ దేవతలను ఉద్దేశించి వషట్కారం చేయడం స్వధాకారం.(స్వధానమ ఇతి వషట్కారపి). అగ్ని దేవుని భార్య స్వాహాదేవి యొక్క మరో రూపం స్వధా. ఈ స్వధా దేవికి ప్రీతికరమైనవి నల్ల నువ్వులు. అందుకే నల్ల నువ్వులను తర్పణ విధి పూర్వకంగా భుక్కుగా పితృదేవతలకు సమర్పిస్తాము. స్వధానమ తర్పయామి అన్న మంత్రం శ్రాద్ధ కర్మలలో వినిపించే మంత్రం. ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు గోత్రం పేరు మరియు రూపాన్ని (వసు రూపం, రుద్ర రూపం, ఆదిత్య రూపం) పేర్కొని, తదనంతరం "స్వధా నమః తర్పయామి" అని మూడు సార్లు చెప్పి తర్పణం సమర్పిస్తాము.
మీరు పై నిర్వచనాలను, ప్రయోజనాలను గమనిస్తే రెండు విభాగాల ప్రక్రియలు కూడా చాలా సారూప్యత కలిగి ఉంటాయి. అందుకే పితృకార్యాలకు, ఇతర అగ్నికార్యాలతో సమానమైన స్థానం, ప్రయోజనాన్ని చెప్పారు మన ఋషులు.
రెండిటిలో ప్రధానమైన భేదాలు రెండిటి మధ్య తేడాను స్పష్టంగా తెలుపటానికి సాంకేతికంగా ఏర్పడినవే అని నా ఉద్దేశం. అందుకే పితృకార్యాలను ఇతర అగ్నికార్యాలను అంతే పవిత్రంగా, అంతే నమ్మకంతో, భక్తి పూర్వకంగా నిర్వర్తించాలి అని ప్రాజ్ఞులు నొక్కివక్కాణిస్తారు.

10, ఏప్రిల్ 2024, బుధవారం

అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు - శ్రీరంగం గోపాలరత్నం ఆలపించిన అన్నమయ్య కృతి

తెలుగు గడ్డ మీద పుట్టిన ఓ అనర్ఘ్యరత్నం శ్రీరంగం గోపాలరత్నం గారు. ఆవిడ దివికేగి మూడు దశాబ్దాలు దాటినా ఈనాటికీ కూడా అటువంటి గాత్రం మళ్లీ తెలుగు గడ్డ మీద పుట్టలేదు. ఆవిడ గాత్ర మాధుర్యం, తెలుగుదనం ఉట్టిపడే ప్రతిభ అనన్యం. దాదాపు నాలుగు దశాబ్దాల సంగీత ప్రస్థానంలో ఆవిడ తెలుగు గడ్డపై శాస్త్రీయ సంగీతానికి మహారాణిగా నిలిచారంటే అతిశయోక్తి కాదు. కవిరాయుని జోగారావు గారు, డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి వద్ద సంగీతాన్ని అభ్యసించారు. అతిపిన్న వయసులోనే హరికథలు ఆలపించారు. 

ఆవిడ ఆలపించిన ఓ అన్నమాచార్యుల వారి కృతి, బాలకృష్ణుని లీలలపై, ఆరభి రాగంలో స్వరపరచబడింది. అన్నమాచార్యుల వారికి ఆ కృష్ణుని లీలలు ఎంత అద్భుతంగా కనబడ్డాయో అంతకు మించి అందంగా ఆయన పదాలలో వెలువడ్డాయి. అన్నమాచార్యుల సాహిత్యమంటేనే తెనుగుదనం ఉట్టీపడే జానపదాలు. గోపాలరత్నం గారు ఈ కృతిని రమ్యాతిరమ్యంగా ఆలపించారు.  

అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు
దినదిన క్రొత్తలాయదృష్టమిదే మాకు

ఆడెడి బాలుల హరి అంగిలి చూపుమని
తోడనే వాండ్ల నోర దుమ్ములు చల్లి
యీడ మాతో చెప్పగాను యిందరము గూడిపోయి
చూడబోతే పంచదారై చోద్యమాయెనమ్మా

తీట తీగెలు సొమ్మంటూ దేహము నిండ గట్టె
తీటకుగాక బాలులు తెగి వాపోగా
పాటించి యీ సుద్ది విని పారితెంచి చూచితేను
కోటికోటి సొమ్ములాయ కొత్తలోయమ్మా

కాకి జున్ను జున్నులంట గంపెడేసి తినిపించి
వాకొలిపి బాలులెల్ల వాపోవగా 
ఆకడ శ్రీవేంకటేశుడా బాలుల కంటి నీరు
జోకగ ముత్యాలుసేసె జూడగానమ్మా 

ఓ యశోదమ్మా! ఈ చిన్ని కృష్ణుని మాయలు అంతా ఇంతా అని చెప్పలేము, ప్రతి రోజు కొత్త కొత్తగా ఉన్న ఈ మాయలను చూడటం మా అదృష్టం. తనతో ఆడే బాలురి అంగిలి చూపమని చెప్పి వారు నోరు తెరవగానే దుమ్ము చల్లాడుట. ఆ మాట పిల్లలు మాకు చెప్పగా మేమందరము వెళ్లి చూస్తే ఆ దుమ్మంతా పంచదారయ్యింది, ఇదేమి వింతో! దురదలు పుట్టించే తీగెలు ఆభరణాలంటూ తోటి బాలుర దేహముపై కృష్ణుడు కట్టాడుట, ఆ దురదలు భరించలేక బాలులు మా వద్ద వాపోగా, మేమంతా వెళ్లి చూస్తే ఆ తీగెలు అమూల్యమైన కొత్త ఆభరాణాలయినాయమ్మా! చిన్న చిన్న జున్ను ముద్దలు  గంపల కొద్దీ తోటి బాలురకు తినిపించాడుట, వారు ఆ వికారాన్ని భరించలేక మా వద్ద వాపోయారు. మేమంతా వెళ్ళి చూడగా శ్రీనివాసుడా బాలుల కంటి నీరును అద్భుతంగా ముత్యాలుగా మార్చేసాడమ్మా!  

3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

క్షీరసాగర విహార - త్యాగరాజస్వామి కృతి



ఈ కృతి బాలమురళీకృష్ణ గారి గాత్రంలో వింటుంటే ఎంతటి కఠినమైన హృదయమైనా కరిగి పోవలసిందే. త్యాగరాజాది భక్తులను పోషించిన శ్రీరామచంద్రమూర్తి గుణవైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరించే కృతి ఇది. త్యాగరాజస్వామి ఉత్సవ సాంప్రదాయ కృతులలో ఒకటి, బాలమురళీకృష్ణ గారు ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. ఆనందభైరవి రాగంలో స్వరపరచబడింది. త్యాగరాజ శిష్యపరంపరలో ఐదవ తరానికి చెందిన వారు బాలమురళీకృష్ణ గారు. సద్గురువుల సాహిత్యం, స్వరరచన యథాతథంగా కొనసాగించిన వారిలో మంగళంపల్లి వారు అగ్రగణ్యులు. వారి గాత్రంలో ఈ కృతిని విని ఆనందించండి. 

క్షీరసాగర విహార! అపరిమిత ఘోర పాతక విదార!
క్రూర జన గణ విదూర! నిగమ సంచార! సుందర శరీర!

శతమఖాऽహిత విభంగ! శ్రీరామ! శమన రిపు సన్నుతాంగ!
శ్రితమానవాంతరంగ! జనకజా శృంగార జలజ భృంగ!

రాజాధిరాజ వేష! శ్రీరామ! రమణీయ కర సుభూష!
రాజనుత లలిత భాష! శ్రీ త్యాగరాజాది భక్త పోష!

పాలకడలిలో విహరించేవాడు, అనంతమైన ఘోర పాపములను నాశనము చేసేవాడు, రాక్షస సమూహాన్ని సంహరించేవాడు, వేదములలో సంచరించేవాడు, సుందరమైన శరీరము కలవాడు, నూరు యజ్ఞములు చేసిన ఇంద్రుని శత్రువులను నాశనము చేసేవాడు, మన్మథుని శత్రువైన పరమశివునిచే నుతించబడినవాడు, ఆశ్రయించినవారి హృదయములలో నివసించేవాడు, కలువ వంటి సీతమ్మ పాలిట తుమ్మెద వంటివాడు, రాజాధిరాజు అయినవాడు, అందమైన హస్తములు కలిగి, చక్కని ఆభరణములు ధరించినవాడు, రాజులచే నుతించబడినవాడు, మృదువుగా మాట్లాడేవాడు, త్యాగరాజు మొదలైన భక్తులను పోషించేవాడు శ్రీరాముడు. 

- త్యాగరాజస్వామి

25, జనవరి 2021, సోమవారం

ఆనందసాగరమీదని దేహము - త్యాగరాజస్వామి కృతి

త్యాగరాజస్వామి వారి నాదయోగంలో బ్రహ్మానందస్థితిలో రచించిన కృతులెన్నో. ఆ అనందాన్ని అనుభవించలేని దేహం భూమికి భారమే అన్నది కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. బ్రహ్మవిష్ణుమహేశ్వరులు, ఎందరో మహానుభావులు చేసిన నాదోపాసనను మానవుడూ కూడా అనుభూతి చెందాలన్నది సద్గురువుల సందేశం. అటువంటి భావమున్న కృతి ఆనందసాగరమీదని దేహము. వివరాలు:

సాహిత్యం
========

ఆనందసాగరమీదని దేహము భూమిభారమే రామబ్రహ్మా(నందసాగర)

శ్రీనాయకాఖిల నైగమాశ్రిత సంగీత జ్ణానమను బ్రహ్మా(నందసాగర)

శ్రీవిశ్వనాథ శ్రీకాంత విదులు పావనమూర్తులుపాసించలేదా
భావించి రాగలయాదుల భజియించే శ్రీత్యాగరాజనుత 

భావం
=====

ఓ రామా!సీతాపతీ! రామ పరబ్రహ్మమనే ఆనందసాగరములో ఈదని దేహము ఈ భూమికి భారమే. సమస్త వేదములకు ఆశ్రయమైన సంగీత జ్ఞానమనే బ్రహ్మానందమనే సాగరాన్ని అనుభూతి చెందని దేహము భారమైనది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, నిర్మలరూపులు సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉపాసించినారు కదా! ఆ విధముగా భావించి రాగలయాదులతో భజించే పరమశివునిచే నుతించబడే శ్రీరామా! బ్రహ్మానందమనే సాగరాన్ని అనుభూతి చెందని దేహము భారమైనది. 

శ్రవణం
======

గరుడధ్వని రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని కృత్తికా నటరాజన్ గారు ఆలపించారు.

16, జనవరి 2021, శనివారం

చిదంబర నటరాజమాశ్రయేऽహం - ముత్తుస్వామి దీక్షితుల కృతి


పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటైన చిదంబరంలో నటరాజస్వామి, శివకామసుందరీ అమ్మ వారు, ఈ క్షేత్రంలోనే ఉన్న గోవిందరాజస్వామిపై నాదజ్యోతి ముత్తుస్వామి దీక్షితుల వారు ఎన్నో కృతులను రచించారు. చిదంబర క్షేత్రం విశ్వానికి హృదయస్థానంగా, చిత్సభలో నటరాజస్వామి చేసే నాట్యం యొక్క లయే విశ్వానికి హృదయస్పందంగా చెప్పబడింది. ఎంతో నిగూఢమైన సందేశం కలిగిన కృతులను ఆయన ఈ క్షేత్ర దేవతలపై రచించారు. వాటిలో ముఖ్యమైనవి ఆనందనటనప్రకాశం, చిదంబరేశ్వరం, శివకామీపతిం చింతయేऽహం, శివకామేశ్వరీం చింతయేऽహం, శివకామేశ్వరం చింతయామ్యహం, చింతయేऽహం సదా చిత్సభా నాయకం, గోవిందరాజాయ నమస్తే, సతతం గోవిందరాజం మొదలైనవి. వీటితో పాటు చిదంబర నటరాజమాశ్రయేऽహం అన్న కృతిని కూడా రచించారు. వివరాలు:

సాహిత్యం
=======

చిదంబర నటరాజమాశ్రయేऽహం శివకామీపతిం చిత్సభాపతిం

చిదంబరవిహారం శంకరం చిదానందకరం గురుగుహవరం
కేదారేశ్వరం విశ్వేశ్వరం కమలాపతి నుత పదం శశిధరం

భావం
=====

చిత్సభకు ప్రభువు, శివకామసుందరికి పతియిన చిదంబర నటరాజస్వామిని నేను శరణు కోరుచున్నాను. ఆకాశలింగ రూపములో చిదంబరంలో విహరించేవాడు, శాశ్వతమైన ఆనందమును కలిగించేవాడు, సుబ్రహ్మణ్యునికి వరములొసగినవాడు, కేదారేశ్వరునిగా కేదారనాథ్‌లో వెలసినవాడు, విశ్వమునకు ప్రభువు, లక్ష్మీపతి యైన శ్రీహరిచే నుతించబడిన పదములు కలవాడు, చంద్రుని తలపై ధరించినవాడు అయిన చిదంబర నటరాజస్వామిని నేను శరణు కోరుచున్నాను. 

శ్రవణం
======

కేదారం రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఐశ్వర్యా శంకర్ గారు ఆలపించారు

13, జనవరి 2021, బుధవారం

దొరకునా ఇటువంటి సేవ - త్యాగరాజస్వామి కృతి


త్యాగరాజస్వామి కృతులలో కొన్ని చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా రాముని సేవా భాగ్యం యొక్క గొప్పతనాన్ని ప్రస్తావించే ఉన్నతస్థాయి కృతులను ఎన్నో రచించారు. రాముని రూప లావణ్యాలను, ముక్కోటి దేవతలు, భాగవతోత్తములు శ్రీరాముని అనేక ఉపచారముల ద్వారా కొలిచే రీతిని కళ్లకు కట్టినట్లు వర్ణించి, మనసులు ఉప్పొంగి రామభక్తి సామ్రాజ్యంలో మనం కూడా అంతర్భాగం కావాలన్న సంకల్పం కలిగేలా చేశారు. ఆయన నిరంతర రామ సేవా భాగ్యంలో తరిస్తూ రచించిన ఈ కృతులు అమృతధారలై నిలిచాయి. అటువంటి ఒక కృతి దొరకునా ఇటువంటి సేవ. వివరాలు:

సాహిత్యం
========

దొరకునా ఇటువంటి సేవ

దొరకునా అల్ప తపమొనరించిన భూసురవరులకైన సురలకైన 

తుంబురు నారదాదులు సుగుణ కీర్తనంబుల నాలాపము సేయగ
అంబరీషముఖ్యులు నామము సేయగ జాజుల పై జల్లగ
బింబాధరలగు సురవార యలివేణులు నాట్యము లాడగ
అంబుజ భవ పాకారులిరుగడలనన్వయ బిరుదావళినిపొగడగ
అంబరవాస సతులు కర కంకణంబులు ఘల్లని విసరగ మణి హా
రంబులు కదలగ నూచే ఫణి తల్పంబున నెలకొన్న హరిని కనుగొన

మరకత మణి సన్నిభ దేహంబున మెరుగు కనక చేలము శోభిల్ల
చరణ యుగ నఖావళి కాంతులు చందురు పిల్లలను గేర
వర నూపురము వెలుగు కర యుగమున వజ్రపు భూషణములు మెరయ
ఉరమున ముక్తాహారములు మరియు ఉచితమైన మకర కుండలంబులు
చిరు నవ్వులు గల వదనంబున ముంగురులద్దంపు కపోలము ముద్దు
గురియు దివ్యఫాలంభున దిలకము మెరసే భువిని లావణ్యనిధిని గన

తామస గుణ రహిత మునులకు బొగడ దరము గాకనే భ్రమసి నిల్వగ
శ్రీమత్కనకపు దొట్ల పైని చెలువందగ కొలువుండగ
కామిత ఫలదాయకియౌ సీత కాంతుని గని యుప్పొంగగ
రామబ్రహ్మ తనయుడౌ త్యాగరాజు తాబాడుచు నూచగ
రాముని జగదోద్ధారుని సురరిపు భీముని త్రిగుణాతీతుని పూర్ణ
కాముని చిన్మయరూపుని సద్గుణధాముని కనులార మదిని కనుగొన

భావం
=====

సూక్ష్మమైన తపము చేసిన బ్రాహ్మణులకైనా, దేవతలకైనా ఇటువంటి రామ సేవాభాగ్యము దొరకునా? తుంబురు నారదులు సుగుణములను పొగడే కీర్తనలను ఆలాపన చేయగా, అంబరీషుడు వంటి భక్తాగ్రగణ్యులు నామమును నుతించగా, జాజులను చల్లుతూ ఎర్రని పెదవులు కలిగిన దేవ కన్యలు నాట్యము చేయగా, బ్రహ్మేంద్రాదులు ఇరుపక్కల అనేక బిరుదులతో పొగడగా, ఆకాశములో నివసించే సతులు చేతుల కంకణములు ఘల్లనిపించగా, మణిహారములు ఊగగా నూచే శేషతల్పశాయియైన హరిని చూచే సేవాభాగ్యము దొరకునా? పచ్చలకాంతి వంటి ప్రకాశము కలిగిన దేహముపై మెరిసే బంగారు వస్త్రము శోభిల్లగా, పాదములగోళ్ల కాంతులు చంద్రకాంతులను పోలగా, మంచి మంజీరములు పాదములపై వెలుగొందగా, చేతులయందు వజ్రాల ఆభరణాలు మెరయగా, కంఠమున ముత్యాల హారములు, చెవులకుచితమైన మకర కుండలములు, చిరునవ్వులు కలిగిన ముఖమున ముంగురులు, అద్దము వంటి చెక్కిళ్లు ముద్దులు కురిపించగా, దివ్యమైన నుదుట మెరిసే తిలకము కలిగిన ఈ భూమిపై సౌందర్యమునకు నిధియైన రాముని చూచే సేవాభాగ్యము దొరకునా? తామస గుణరహితులైన మునులకు పొగడ శక్యము గాక చకితులై నిలువగా, కనకపు ఊయలపై అందముగా కొలువుండిన, కోరిన వరములొసగే సీతమ్మ పతిదేవుని చూచి ఉప్పొంగగా, కాకర్ల రామబ్రహ్మం తనయుడైన త్యాగరాజు తాను పాడుచు ఊపగా, జగదోద్ధారకుడు, రాక్షసుల పాలిట అరివీరభయంకరుడు, త్రిగుణాతీతుడు, పూర్ణకాముడు, సచ్చిదానంద స్వరూపుడు, సద్గుణములకు నెలవైన రాముని కనులార మనసులో కనుగొనే సేవాభాగ్యము దొరకునా? 

శ్రవణం
=======

బిలహరి రాగంలో ఈ కృతిని రంజని-గాయత్రి సోదరీమణులు పాడగా వినండి

10, జనవరి 2021, ఆదివారం

ఎదుటనున్నాడు వీడే - అన్నమాచార్యుల కృతి


పరబ్రహ్మమైన శ్రీహరి దేవకి కడుపున అసాధారణమైన పరిస్థితులలో అవతారం దాల్చి, అటువంటి అసాధారణ పరిస్థితులలోనే దేవకి చెంతకు చేరి ఆ తల్లితో అపురూపమైన బంధాన్ని పంచుకున్నాడు. బ్రహ్మాండమును బాలుని నోట జూచినా, వైష్ణవమాయలో ఆ తల్లి పరమాత్మను బిడ్డగానే భావించి అవ్యాజమైన ప్రేమను పంచింది. ఇక పెరుగుతున్న కొద్దీ ఆ బాలుని లీలలు అన్నా ఇన్నా? వెన్నముద్దలు దొంగిలించాడు, పశువులను గాచాడు, రాక్షసులను సంహరించాడు, శాపగ్రస్తులకు మోక్షాన్ని కలిగించాడు, కాళీయుని పొగరణచాడు, రాసలీలలో పాల్గొన్నాడు.... అడుగడుగునా వైనమంత వల్లించలేని లీలలు, నమ్మశక్యం గాని చేష్టలు. వీటిని అన్నమాచార్యుల వారు తమ సంకీర్తనలెన్నిటో అద్భుతంగా ప్రస్తావించారు. అటువంటి ఒక కృతి ఎదుటనున్నాడు వీడే. వివరాలు:

సాహిత్యం
========

ఎదుటనున్నాడు వీడే! ఈ బాలుడు!
మది తెలియమమ్మ ఏమరులో గాని!!

పరమపురుషుడట పశుల గాచెనట
సరవులెంచిన విన సంగతా యిది
హరియె తానట ముద్దులందరికి జేసెనట
ఇరవాయనమ్మ సుద్దులేటివో గాని

వేదాలకొడయడట వెన్నలు దొంగిలెనట
నాదించి విన్నవారికి నమ్మికా యిది
ఆదిమూలమీతడట ఆడికెల చాతలట
కాదమ్మ ఈ సుద్దులు ఎట్టి కతలో గాని

అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట
కొలదొకరికి చెప్ప కూడునా యిది
తెలిపి శ్రీవేంకటాద్రి దేవుడై నిలిచెనట
కలదమ్మ తనకెంతో కరుణో గాని

భావం
=====

ఇతనివి ఏమి మాయలో గానీ, ఎదుటనున్న ఈ బాలుడైన కృష్ణుని మనసు మనం తెలుసుకోలేమమ్మా! ఇతడే పరమపురుషుడట, మరి పశువులను గాస్తున్నాడుట, ఈ తీరులను లెక్కించిన అర్థమయ్యే సంగతులు కావు. ఇతడే శ్రీహరియట, అందరికీ మురిపాలు అందిస్తున్నడట, ఇవేమి మాటలో గానీ స్థిరమై నిలిచాయి. ఇతడు వేదాలకు ప్రభువట, మరి వెన్నలు దొంగిలించిన వాడు కూడా ఇతడేయట, శ్రద్ధగా విన్న వారికైనా ఇది నమ్మదగినదేనా? అన్నిటికీ మూలము ఇతడేనట, ఇతడివి కొంటె చేష్టలట, ఇవి కథలే తప్ప మంచి మాటలు కావు. ఇతడు బ్రహ్మకు తండ్రియట, మరి యశోదకు బిడ్డ కూడా అట, మనపై ఎంత కరుణో ఉందో, అందుకే తన మహిమలను తెలిపేందుకు శ్రీవేంకటాద్రిపై దేవుడై నిలిచినాడట, ఇతనివి ఏమి మాయలో గానీ, ఎదుటనున్న ఈ బాలుడైన కృష్ణుని మనసు మనం తెలుసుకోలేమమ్మా!

శ్రవణం
=======

భుజంగిణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు ఆలపించారు

2, జనవరి 2021, శనివారం

బ్రహ్మాండ వలయే మాయే - మైసూరు మహారాజా జయచామరాజ వడయార్ కృతి


ఈ భారతదేశంలో సంగీతం కలకాలం నిలిచింది అంటే దానికి ఆనాటి పాలకుల ఇచ్చిన ఆదరణ కూడా ఒక ముఖ్యమైన కారణం. త్యాగరాజస్వామి వంటి వాగ్గేయకారులు రాజాశ్రయాన్ని పూర్తిగా త్యజించారు, అది ఆనాటి పరిస్థితులకు సముచితంగా వారు ఎంచుకున్న మార్గం. రాజాశ్రయంలో ఉన్న లోటుపాట్లను ఎరిగే, నరస్తుతులకు, వారిచ్చే కానుకలకు దూరంగా నిలిచి పూర్తిగా రాముని సేవలోనే గడిపారు. కర్నాటక సంగీతంలో ఉన్న మహత్తును, ఆధ్యాత్మిక సంపదను గ్రహించి ఆ తరువాతి కాలంలో ఎందరో జమీందార్లు, పాలకుకు స్వయంగా సంగీతాన్ని పూర్తిస్థాయిలో అభ్యసించి, దానిని ఉపాసనా మార్గంలో వినియోగించుకుని, అద్భుతమైన అనుభూతులను పొందుతూ, తమ తమ ఆస్థానలలో సంగీత సాహిత్య నాట్య సాంప్రదాయాలకు పెద్ద పీట వేసి కళాకారులను, గురువులను ఆదరించి, ప్రోత్సహించారు. అటువంటి వారిలో మైసూరు సంస్థానం చివరి మహారాజా జయచామరాజ వడయార్ గారు ప్రముఖులు. వారు శ్రీవిద్యోపాసకులే కాకుండా కర్నాటక శాస్త్రెయ సంగీత ప్రావీణ్యం కలవారు, ఎన్నో కృతులను కూడా రచించారు. మైసూరు సామ్రాజ్య దేవత అయిన రాజరాజేశ్వరి అమ్మవారిని నుతిస్తొ ఆయన రచించిన ఒక కృతి. వడయార్ గారి ముద్ర శ్రీవిద్య. అలాగే, ఈ కృతిని ఆయన మాండ్ రాగంలో స్వరపరచారు. తగ్గట్టుగానే పల్లవిలోనే రాగముద్రను పొందు పరచారు. వారి సంస్థానంలో నిత్యం ఈ కృతిని విద్వాంసులు ఉదయం అమ్మవారి సేవలో ఆలపించేవారట. అద్భుతమైన ఆధ్యాత్మిక సంపద కలిగిన ఈ కృతిని పరిశీలిస్తే వడయార్ గారి సంస్కృత భాషా పాండిత్యం, ఉపాసనా బలం గోచరిస్తాయి. శివజాయే, బ్రహ్మరంధ్రనిలయే, అహినిభవేణి, అంతరహిత కైవల్య విహారిణి, గతినిర్జితకరిణి మొదలైన పదసమూహాలు వడయార్ గారి ప్రతిభలోని ఔన్నత్యాన్ని తెలుపుతాయి. వివరాలు:

సాహిత్యం
========

బ్రహ్మాండ వలయే మాయే బ్రహ్మాది వందిత శివజాయే

బ్రహ్మవిద్యానందిత హృదయే బ్రహ్మర్షాద్యుపాసిత శ్రీవిద్యా బ్రహ్మరంధ్రనిలయే

గౌతమార్చిత గాయత్రి గౌరీ గిరిరాజేంద్ర పుత్రి
కాంత రాగిణి నారాయణి కారుణ్య లలితే మంజులవాణి
అంతర్ముఖ జ్యోతిర్మయ కల్యాణి అహినిభవేణి పురాణి
అంతరహిత కైవల్య విహారిణి గతినిర్జితకరిణి గీర్వాణి

భావం
=====

పరమశివుని పత్నివైన ఓ పార్వతీదేవీ! నీవు బ్రహ్మాండమును చుట్టి యున్న మాయవు, బ్రహ్మాదులచే పూజించబడుచున్నావు. నీవు బ్రహ్మవిద్యచే ఆనందము పొందే హృదయము కలిగియున్నావు, బ్రహ్మర్షులచే ఉపాసించే శ్రీవిద్యవు, సహస్రార చక్రమునందు నివసించియున్నావు. నీవు గౌతమ మునిచే అర్చించబడిన గాయత్రివి, పర్వతరాజేంద్రుడైన హిమవంతుని పుత్రివి, పతియైన పరమశివునిపై అనురాగముతో నిండియున్నావు, నారాయణుని సోదరివి, కరుణామూర్తివి, లలితవు, మృదువైన పలుకులు కలిగియున్నావు, ఎల్లప్పుడూ అంతర్ముఖవై ప్రకాశించెదవు, ఎల్లప్పుడూ శుభములు కలిగించెదవు, తుమ్మెదల సమూహము వంటి కురులు కలిగియున్నావు, సనాతనమైనదానవు, అంతములేని మోక్షములో విహరించెదవు, ఏనుగును మించిన నడక కలిగి, వాక్కే అస్త్రముగా గల పరదేవతవు.

శ్రవణం
======

మాండు రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని విదుషీమణి ఎమ్మెస్ షీలా గారు ఆలపించారు


1, జనవరి 2021, శుక్రవారం

ఈ పాదం ఇలలోన నాట్య వేదం - వేటూరి గీతం



శ్రీహరి చరణకమలాల మహత్తును, రహస్యాన్ని ఎందరో ఋషులు, వాగ్గేయకారులు, కవులు వేనోళ్ల పొగిడారు, తమ అంతర్దృష్టితో పొందిన అనుభూతులను మనోజ్ఞంగా అక్షరరూపంలో ఆవిష్కరించారు. అపౌరుషేయమైన వేదములలో కూడా పరమపురుషుని పదాల గురించి అనేక చోట్ల ప్రస్తావన ఉంది. పురుష సూక్తంలో పాదోऽస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి, త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః పాదోऽస్యేహాऽऽభవాత్పునః అని చెప్పబడింది, అనగా పరమాత్మ పాదమే విశ్వముగా ఆవిర్భవించింది, ఆ స్వామి మూడు పాదములు అమృతత్వం కలిగిన లోకాలపై నిలిచి ఉంటాయి, అవి అత్యున్నతమైన మోక్షాన్ని సూచించే విధంగా ఊర్ధ్వదిశగా ఉంటాయి, ఆ పరమపురుషుని ఒక పాదమే మరల మరల సృష్టి క్రమమవుతున్నది అని. ఈ సత్యాన్నే అనేక అవతారములలో మనం గమనిస్తాం కూడా. వాటిని వాగ్గేయకారులు తమ సాహిత్యంలో అద్భుతంగా ప్రస్తావించారు. అన్నమాచార్యుల వారు బ్రహ్మ కడిగిన పాదము అన్న కృతిలో దశావతారములలో పరమపురుషుని పదవైశిష్ట్యాన్ని ఆవిష్కరించగా, కృష్ణశాస్త్రి గారు పదములె చాలు రామా నీ పదధూళులె పదివేలు అన్నారు, అలాగే రామచరణం రామచరణం రామచరణం మాకు శరణం అని అటువంటి భావాన్నే తనదైన శైలిలో పలికించారు. ఆ తరువాత ఈ హరిపాద వైభవాన్ని అంతే మనోజ్ఞంగా, లోతుగా పలికించారు వేటూరి వారు. మయూరి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం కూర్చగా వేటూరి చేసిన శ్రీహరి పదార్చన వివరాలు.


సాహిత్యం
=======

ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం
కాల గమనాల గమకాల గ్రంథం 

ఈ పాదమే మిన్నాగు తలకు అందం
ఈ పాదమే ఆ నాటి బలికి అంతం
తనలోని గంగమ్మ ఉప్పొంగగా
శిలలోని ఆ గౌతమే పొంగగా
పాట పాటలో తను చరణమైన వేళ
కావ్య గీతిలో తను పాదమైన వేళ
గానమే తన ప్రాణమై లయలు హొయలు విరిసే ఈ పాదం

ఈ పాదమే ఆ సప్తగిరికి శిఖరం
ఈ పాదమే శ్రీహస్త కమల మధుపం
వాగ్గేయ సాహిత్య సంగీతమై
త్యాగయ్య చిత్తాన శ్రీగంధమై
ఆ పాదమే ఇల అన్నమయ్య పదమై
ఆ పాదమే వరదయ్య నాట్య పథమై
తుంబుర వర నారద మునులు  జనులు కొలిచే ఈ పాదం


భావం
====

శ్రీహరి పాదమే కదా ఈ భూమిపై నాట్యానికి వేదమైంది, ఈ పాదం పరమశివునికి ఆనందం కలిగించేది, ఈ పాదం కాలగమనంలోని మార్పులకు సాక్ష్యం. ఈ శ్రీహరి పాదమే కాళింగుని తలలపై అందంగా నాట్యం చేసింది, ఈ పాదమే ఆనాడు బలిని పాతాళానికి తొక్కివేసింది, ఈ పాదం నుండే సురగంగ జన్మించింది, ఈ పాదం తాకగానే అహల్య శాపవిముక్తి పొంది తిరిగి చైతన్యవంతమైంది, ప్రతి గీతంలోనూ ఈ పాదం ఒక చరణమైంది, ప్రతి కావ్యగీతికలోనూ ఈ శ్రీహరి చరణమే ఒక పాదమైంది, గానామృతమే తన ప్రాణం చేసుకుని లయబద్ధంగా హొయలు చిందించేది ఈ శ్రీహరి పాదమే. ఈ శ్రీహరి పాదమే ఏడుకొండలకు శిఖరమైంది, ఈ పాదమే లక్ష్మీ దేవి చేతిలో ఉన్న కమలముపై తుమ్మెదలా వ్రాలి ఉంది, ఈ పాదమే వాగ్గేయకారుల సాహిత్య సంగీత రూపమైంది, ఈ పాదమే త్యాగయ్య చిత్తానికి శ్రీచందనమైంది, ఈ పాదమే అన్నమయ్య పదకవితగా జాలువారింది, ఈ పాదమే క్షేత్రయ్యకు నాట్యసోపానమైంది, తుంబురుడు, నారదుడు, మునిశ్రేష్ఠులు, మానవులు కొలిచేది ఈ శ్రీహరి పాదమునే. 

శ్రవణం
======

వేటూరి సుందరరామమూర్తి గారి గీతాన్ని ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం గారి స్వరపరచగా, ఎస్పీ శైలజ గారు ఆలపించారు

31, డిసెంబర్ 2020, గురువారం

రాజగోపాలం భజేऽహం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


ముత్తుస్వామి దీక్షితులవారి కృతులలో మన్నార్‌గూడి శ్రీవిద్యా రాజగోపాలస్వామి వారిపై రచించిన కృతి ఇది. ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు రాజగోపాలస్వామిగా వెలశాడు.  ఇక్కడి ప్రధాన దేవత రూపాలు మూలమూర్తి వాసుదేవ పెరుమాళ్, ఉత్సవమూర్తి రాజగోపాలస్వామి. ఇక్కడ అమ్మవారు హేమభుజవల్లి (సెంగమల తాయారు). దేవకీవసుదేవులకు దర్శనమిచ్చి వారికి పుత్రునిగా జన్మించినది మొదలు గోపాలకునిగా 32 లీలలు ఆ శ్రీహరివి. వాటికి ప్రతీకగానే ఇక్కడి నిత్యసేవలు. రాజగోపాలుని రూపంలో ఒకచేతి మీద కొరడా, చేత వెన్నముద్ద, తలపాగా, చేతులకు గాజులు, నడుముకు ఆభరణములు,పంచెకట్టు, మరొక చేత ఏనుగు దంతము, చుట్టూ గోవులు ఉంటాయి. కంసుడు బలరాముని చంపటానికి కువలయపీఠమనే ఏనుగును పంపగా కృష్ణుడు దానిని చంపి దంతాలను విరుస్తాడు. దానికి ప్రతీకగానే ఇక్కడి స్వామి చేత దంతము. అలాగే గోపస్త్రీల వస్త్రములు, ఆభరణములు దొంగిలించిన దానికి ప్రతీకగా ఒకచెవికి గోపస్త్రీ కుండలము ఉంటుంది. ఇక్కడ స్వామికి పాలను నివేదన చేస్తారు. వివాహ సంతానాది దోషాల నివారణకు, పశు సంవృద్ధికి, సుఖసంతోషాలకు ఈ స్వామిని పూజిస్తే ఫలితం వెంటనే ఉంటుందని నమ్మకం. ఈ దేవాలయాన్ని 10వ శతాబ్దంలో చోళులు నిర్మించగా, 16వ శతాబ్దంలో తంజావూరు నాయకరాజులు పునరుద్ధరించారు. ఇక్కడి హరిద్రానది పుష్కరిణి భారతదేశంలోనే అత్యంత విశాలమైన తీర్థంగా ఒకటిగా పేరొందింది. ఇది 23 ఎకరాల మేర ఉంది. ఉత్సవమూర్తి అయిన రాజగోపాలస్వామి రుక్మిణీ సత్యభామల సహితుడై కొలువబడతాడు. ఈ క్షేత్ర వృక్షం పారిజాత వృక్షం. ఈ వివరాలలో కొన్నిటిని దీక్షితులవారు ఈ కృతిలో ప్రస్తావించారు. 

సాహిత్యం
=======

రాజగోపాలం భజేऽహం రమాలీలం

తేజోమయ మోహనకరం దివ్యాంబరాది ధరం
గజరాజ పూజిత పదం గుణిజన నత గోవిందం

నారదాది కృత భజనం నాదలయయుత సదనం
హరిద్రానదీ తీరం హత్యాది పాప హరం
పారిజాత తరుమూలం పంకజ నయన విశాలం
గురుగుహనుత వనమాలం గోపీజనమాలోలం

భావం
=====

లక్ష్మీదేవితో లీలలను చేసే రాజగోపాలస్వామిని నేను భజిస్తున్నాను. తేజోమయ రూపముతో మోహింపజేసేవాడు, దివ్యమైన వస్త్రములు, ఆభరణములు ధరించేవాడు, గజేంద్రునిచే పూజించబడిన పదములు కలవాడు, శ్రేష్ఠులచే నుతించబడిన గోవిందుడు, రాజగోపాలుని నేను భజిస్తున్నాను. నారదాది మునులచే భజించబడేవాడు, నాదలయయుతమైన సంగీతంలో నివసించేవాడు, హరిద్రానదీ తీర్థ సమీపంలో వెలసినవాడు, హత్య మొదలైన పాపములను హరించేవాడు, పారిజాతవృక్ష మూలమున నివసించేవాడు, కలువల వంటి విశాలమైన నేత్రములు కలవాడు, సుబ్రహ్మణ్యునిచే నుతించబడిన వాడు, వనమాల ధరించేవాడు, గోపస్త్రీలను మైమరపింపజేసేవాడు అయిన రాజగోపాలుని భజిస్తున్నాను. 

శ్రవణం
======

మోహన రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని అరుణా సాయిరాం గారు ఆలపించారు

30, డిసెంబర్ 2020, బుధవారం

క్షితిజారమణం చింతయే - దీక్షితుల వారి కృతి


దీక్షితుల వారు అద్వైత సిద్ధాంతంపై గల విశ్వాసాన్ని తమ కృతులలో పూర్తిగా ప్రతిబింబించారు. షణ్మతములలోని దేవతలను అంతే భక్తితో, తాదాత్మ్యతతో ఆరాధించారు, ఆ భావనలు ఆయన కృతులలో సుస్పష్టంగా తెలుస్తాయి. శైవ శాక్తేయ షణ్ముఖ సాంప్రదాయాలలోని దేవాలయాలలోని దేవతామూర్తులపై ఆయన ఉపాసనా పూర్వకంగా ఎలా కృతులు రచించారో అదే పద్ధతిలో ఆయన వైష్ణవ సాంప్రదాయంలోని అనేక దేవాలయాలను సందర్శించి అత్యద్భుతమైన కృతులను రచించారు. ఈ ధనుర్మాసంలో వారు రచించిన కొన్ని శ్రీరంగనాథుని కృతులను ప్రస్తావించాను. అలాగే, శ్రీరామచంద్రునిపై ఆయన మనోజ్ఞమైన ప్రాకృత భాషలో దివ్యమైన కృతులను రచించారు. వాటిలో ఒక కృతి వివరాలు:

సాహిత్యం
========

క్షితిజారమణం చింతయే శ్రీరామం భవతరణం

క్షితిపతి నత చరణం సేవిత విభీషణం
క్షితి భరణం శ్రితచింతామణిం అఘహరణం

సకలసుర మహిత సరసిజ పదయుగళం శాంతం అతికుశలం
వికసిత వదన కమలమతులితమమలం వీరనుత భుజబలం
శుకశౌనక ముని ముదిత గురుగుహ విదితం శోభన గుణ సహితం
ప్రకటిత సరోజ నయనం పాలిత భక్తం భవపాశహరణనిపుణం

భావం
=====

భవసాగరాన్ని దాటించేవాడు, భూమి నుండి జన్మించిన సీతాదేవి పతి అయిన శ్రీరాముని ధ్యానిస్తున్నాను. మహారాజులచే నుతించబడిన చరణములు కలవాడు, విభీషణునిచే సేవించబడిన వాడు, వరాహావతారంలో భూమిని రక్షించినవాడు, ఆశ్రితులకు చింతామణివలె కామ్యములను తీర్చేవాడు, పాపములను హరించేవాడు అయిన శ్రీరాముని ధ్యానిస్తున్నాను. సమస్త దేవతల చేత పూజించబడిన పదకమలములు కలవాడు, శాంతమూర్తి, అత్యంత నైపుణ్యము కలవాడు, వికసించిన కమలము వంటి ముఖము కలవాడు, సాటిలేని వాడు, నిర్మలుడు, వీరులచే నుతించబడిన భుజబలము కలవాడు, శుకశౌనకాది మునులకు ఆనందం కలిగించినవాడు, సుబ్రహ్మణ్యునిచే గ్రహించబడిన వాడు, సద్గుణములు కలిగి ప్రకాశించేవాడు, వికసించిన కలువల వంటి కన్నులు కలవాడు, భక్తులను పాలించేవాడు, జనన మరణ బంధముల నుండి ముక్తి కలిగించుటలో నిపుణుడైన శ్రీరామచంద్రుని ధ్యానిస్తున్నాను. 

శ్రవణం
======

దేవగాంధారి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని జొన్నలగడ్డ శ్రీరాం ఆలపించారు

29, డిసెంబర్ 2020, మంగళవారం

పరిమళ రంగనాథం భజేऽహం - దీక్షితుల వారి క్షేత్ర కృతి

దీక్షితుల వారి క్షేత్ర కృతులలో ఒకటి తమిళనాడు తిరువిందళూరులోని పుండరీకవల్లీ సమేత పరిమళరంగనాథునిపై రచించినది. ఈ క్షేత్రానికి స్థల పురాణం ఉంది. శ్రీమహావిష్ణువు మత్స్యావతారుడై వేదాలను రక్షించి తిరువిళందూరులోని వనంలో తపస్సు చేసి ఆ వేదాలను వల్లించి వాటికి, తనకు కూడా శాశ్వతమైన పరిమళాన్ని ఆపాదించుకున్నాడు. అంతే కాదు, ఆ వనం కూడా పరిమళ వనంగా మారింది. ఇక్కడి విమానం పేరు వేదామోద విమానం. చంద్రుడు శాపవిముక్తికై ఈ క్షేత్రంలోనే తపస్సు చేసి శ్రీహరి అనుగ్రహం పొందాడు. ఈ క్షేత్రంలో అందుకే చంద్రుడు, అంబరీషుల మూర్తులు ఉంటాయి. ఈ విషయాలన్నీ దీక్షితుల వారు తన కృతిలో ప్రస్తావించారు. వివరాలు:

సాహిత్యం
========

పరిమళ రంగనాథం భజేऽహం వీరనుతం
పరిపాలిత భక్తం పుండరీకవల్లీనాథం

హరిం అంబరీష శీతాంశు వేదాది పూజితం
మురహరం భయహరం నరహరిం ధృత గిరిం
సురనర మునిజన ముదితం
పురహర గురుగుహ విదితం

సుగంధ విపినాంతరంగ శయనం రవిశశి నయనం
శుకశౌనకాది హృద్సదనం సరసిజ వదనం
ఖగరాజ తురంగం కమనీయ శుభాంగం
కనకాంబర కౌస్తుభమణి ధరం కంబు కంధరం
గగన సదృశమాబ్జకరం గజరాజ క్షేమ కరం
నగపతి సుతా సోదరం నర వరద దామోదరం

భావం
=====

వీరులచే నుతించబడేవాడు, భక్తులను పరిపాలించేవాడు, పుండరీకవల్లికి నాథుడైన పరిమళ రంగనాథుని నేను భజిస్తున్నాను. అంబరీషుడు, చంద్రుడు వేదములచే పూజించబడేవాడు, మురాసురుని సంహరించినవాడు, భయమును హరించేవాడు, నరసింహుడు, మందర పర్వతమును ధరించినవాడు, దేవతలు, మానవులు, మునిజనులకు ఆనందం కలిగించినవాడు, పరమశివుడు, సుబ్రహ్మణ్యునిచే గ్రహించబడిన వాడు అయిన పరిమళ రంగనాథుని నేను భజిస్తున్నాను. సుగంధవనము మధ్యలో శయనించేవాడు, సూర్యచంద్రులు కన్నులుగా కలవాడు, శుకశౌనకాది మునుల హృదయములో నివసించేవాడు, కమలము వంటి ముఖము కలవాడు, గరుత్మంతుడు వాహనముగా కలవాడు, అందమైన, శుభకరమైన శరీరవయవములు కలవాడు, బంగారు వస్త్రములు, కౌస్తుభమణి ధరించే వాడు, శంఖము వంటి కంఠము కలవాడు, ఆకాశమును పోలినవాడు, గజేంద్రునికి క్షేమము కలిగించినవాడు, హిమవంతుని కుమార్తె అయిన పార్వతికి సోదరుడైనవాడు, మానవులకు వరదుడు, దామొదరుడైన పరిమళ రంగనాథుని నేను భజిస్తున్నాను. 

శ్రవణం
=======

హమీర్ కల్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని చారులత మణి గారు ఆలపించారు