ఏకదంతం భజేహం ఏకానేక ఫల ప్రదం
పాకశాసనారాధితం పామర పండితాది నుత పదం
కైలాసనాథ కుమారం కార్తికేయ మనోహరం
హాలాస్య క్షేత్ర వేగవతీ తట విహారం హరం
కోలాహల గురుగుహ సహితం కోటి మార లావణ్య హితం
మాలా కంకణాది ధరణం మాషా వల్లభాంబా రమణం
ఏకదంతుడైన శ్రీగణపతిని నేను భజిస్తున్నాను. ఆయన పరమఫలమైన మోక్షాన్ని, అనేకమైన ఐహిక కోర్కెల ఫలాలను అనుగ్రహించేవాడు.
పాకాసురుణ్ణి సంహరించిన ఇంద్రునిచే ఆరాధింపబడేవాడు, పామరుల నుండి పండితుల వరకు అందరిచే నుతించబడే పాదములు కలవాడు, కైలాసనాథుడైన శివుని కుమారుడు, కార్తికేయునికి ఆనందము కలిగించే వాడూ అయిన ఏకదంతుడిని నేను భజిస్తున్నాను. హాలాస్యక్షేత్రమైన మదురైలో వేగవతి నది తీరాన విహరించేవాడు, భక్తుల దుఃఖాలు, విఘ్నాలు తొలగించేవాడు. ఉత్సవకోలాహలంలో గురుగుహుడైన సుబ్రహ్మణ్యునితో కలిసి ఉండేవాడు. కోటి మన్మథుల అందాన్ని మించే లావణ్యం కలిగి, లోకహితాన్ని చేసేవాడు. పూలమాలలు, కంకణాలు మొదలైన ఆభరణాలు ధరించినవాడు. నల్లని రూపము కలిగి, మాయాశక్తి స్వరూపిణియైన వల్లభాంబాదేవికి పతియైన గణపతిని నేను భక్తితో భజిస్తున్నాను.
మధురకు హాలాస్యక్షేత్రం అనే పేరు రావడం స్థలపురాణ సంబంధమైనది.
పారంపర్య కథనం ప్రకారం, మదురై నగర నిర్మాణానికి శివుడు ఒక సర్పాన్ని పంపాడు. ఆ సర్పం నగరానికి సరిహద్దులుగా చుట్టుకొని తన తల–తోకలను మధ్యభాగంలోని శివాలయ దిశగా ఉంచింది. ఆ సర్పానికే హాలాస్యమని పేరు. అందువల్ల ఆ పవిత్ర నగరం హాలాస్యం, తమిళంలో తిరువాలవాయ్, అని ప్రసిద్ధి చెందింది. అక్కడ వెలసిన శివుడు సోమసుందరేశ్వరుడు/హాలాస్యనాథుడు. అందుకే కృతిలో హాలాస్య క్షేత్రం అని ముత్తుస్వామి దీక్షితుల వారు ప్రస్తావించారు.
బిలహరి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని సిక్కిల్ గురుచరణ్ గారు ఆలపించారు.