ఈ సినిమా తెలుగు చిత్రాల గమనాన్ని మార్చింది. జంధ్యాల గారిని హాస్య వినోద కుటుంబ కథల దర్శకేంద్రునిగా నిలిపింది. జానకమ్మ శృంగార గీతాలకు మహారాణిగా శాశ్వతకీర్తిని తెచ్చిపెట్టింది. ఇదిగో ఆ ప్రేమలేఖ, వీడియో.
https://www.youtube.com/watch?v=I7-aGw7rBmo
అక్కిరాజు ప్రసాద్
1. పుట్టుకతో వచ్చింది పాట అనేది. మాడ్యులేషన్తో సహా అన్ని మెలకువలు మూడేళ్ళ చిన్నవయసులోనే జానకమ్మకు అబ్బాయి.
2. పదేళ్ల వయసులో తల్లి ప్రోద్బలంతో అక్కలతో పాటు రాజమండ్రిలో అయిష్టంగానే పైడిస్వామి గారి వద్ద ఒక ఏడాది పాటు సంగీతం నేర్చుకున్నారు. నీకు నేను కొత్తగా సరిగమలు నేర్పక్కర్లేదు అని నగుమోము గనలేని కీర్తనను ఆయన నేర్పించారు.
3. చిన్నతనంలో సినిమా పాటలు పాడాలన్న అభిలాష తప్ప శాస్త్రీయ సంగీతం మీద ఏ మాత్రం ఇష్టం ఉండేది కాదు.
4. తెలుగులో నీ లీల పాడెద దేవా అనే పాట మురిపించే మువ్వలు చిత్రంలోది. ఇది డబ్ చేయబడిన చిత్రం. తమిళంలో నాదస్వరానికి జోడీగా పాడటానికి ఎందరో గాయనీమణులను వెదికినా సుబ్బయ్యనాడు గారికి తృప్తి కలగలేదు. చివరకు లీల గారు స్వరాల స్థాయికి పాడగలిగేది ఒక్క జానకి మాత్రమే అని ఆవిడ పేరు సూచించారు.
5. తెలుగులో సిరిమల్లె పూవా అనే పాట పదహారేళ్ల వయసు చిత్రంలోనిది. ఈ ట్యూన్ తమిళంలో పదినారు వయదినిలె అనే చిత్రంలో సెందూర పూవే అనే పాట. ఈ పాటకు జానకమ్మ గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని అవార్డు వచ్చింది.
6. తెలుగులో జయప్రద తొలిచిత్రం అంతులేని కథ. అందులో కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు అన్న పాట తమిళ మూలం అవళ్ ఒరు తోడర్ కథై అన్న తమిళ చిత్రంలో కన్నిలే ఎన్న ఉందు అన్న పాట. రెండు చిత్రాలకు సంగీతం ఎం ఎస్ విశ్వనాథన్ గారే. రెండూ కూడా అద్భుతమైన విజయాలు సాధించాయి.
7. 24 ఏళ్ల వయసు నుండే దుమ్ము ఎలర్జీ వల్ల విపరీతమైన ఆయాసం ఉన్నా శివదీక్షాపరురాలనురా వంటి ఎన్నో గీతాలను జానకమ్మ పాడారు. అలాగే, శంకరాభరణంలో సామజవరగమన పాడే సమయంలో ఒక మందు వల్ల ఎలర్జీ వచ్చినా గుండె బిగబట్టి బాలు గారితో రిహర్సల్ చేసి పాడారు.
8. వాయిస్ మాడ్యులేషన్ ఆవిడ ప్రత్యేకత. చాలా సార్లు పురుష కళాకారులకు వాయిసోవర్ ఇచ్చారు.
9. జానకి గారి గొంతులో సన్నాయి మోగుతుంది, సామవేదం పలుకుతుంది, పండు ముసలి వణుకుతుంది, పసిపాప పలవరిస్తుంది అన్నారు కళాతపస్వి విశ్వనాథ్ గారు. గోవులు తెల్లన, చిన్నారి పొన్నారి కిట్టయ్యా...ఈ ప్రతిభకు ఉదాహరణలు.
10. అభిలాష చిత్రంలో సందెపొద్దుల కాడ, బంతీ చామంతీ సూపర్ డూపర్ హిట్ పాటలు. ఇళయరాజా గారి సంగీతం పతాక స్థాయికి వెళ్లటానికి ఉన్న కారణాల్లో జానకి గారి వాయిస్ మాడ్యులేషన్, సృజనాత్మకత ముఖ్యమైనవి. అలాగే, రాక్షసుడు చిత్రంలో నీ మీద నాకు ఇదయ్యో అనే పాటలో జానకమ్మ గారి మాడ్యులేషన్ న భూతో న భవిష్యతి.
11. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో ప్రతి ఒక్క పాట కూడా జానకమ్మ పతాక స్థాయి ప్రతిభకు ఉదాహరణలే. అందాలలో అహో మహోదయం, ప్రియతమా నను పలకరించు ప్రణయమా, యమహో నీ యమా యమా అందం..ఇళయరాజా గారి సంగీతాన్ని అజరామరం చేశారు జానకమ్మ, బాలు గారు.
12. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం అన్నక్కిళి (తమిళం). అందులో అన్నక్కిళి ఉణ్ణై అనే పాట పెద్ద హిట్ అయ్యింది, అదే ట్యూన్లో తెలుగులో రామచిలుక చిత్రంలో సత్యం గారు రామచిలుక పెళ్ళికొడుకెవరే అనే పాటను జానకి గారి చేత పాడించారు. తెలుగులో కూడా అంతే హిట్ అయ్యింది పాట.
13. కొంజుం సాలంగై చిత్రంలోని సింగార వేలనే దేవా అనే పాట విని జానకి గారి గాత్రం నచ్చి మేటి దర్శకులు బీ ఎన్ రెడ్డి గారు పూజాఫలం చిత్రంలో పట్టుబట్టి మూడు పాటలు పాడించుకున్నారు - పగలే వెన్నెల, శివదీక్షాపరురాలనురా, మదనా మనసాయెరా అనే పాటలు.
14. ఆమె గొంతు స్వరకర్తలకు కల్పవృక్షం లాంటిది, ఆవిడ ఉచ్చారణ కానీ, భావం కానీ కవి ఎలా రాశాడో అలాగ యథాతథంగా పాడగల ప్రతిభ అని నమ్మి కళాతపస్వి విశ్వనాథ్ గారు తన చిత్రాలలో జానకమ్మ గారి చేత ఎన్నో పాటలు పాడించారు - ఓంకార నాదాను సంధానమౌ గానమే, సారిగరీగపదాపా, సామజవరగమన, సప్తపది చిత్రంలో నెమలికి నేర్పిన నడకలివి, భామనే సత్యభామనే, గోవులు తెల్లన, సాగరసంగమంలో ఓం నమశ్శివాయ, మౌనమేలనోయి వంటి ఎన్నో పాటలను పాడించుకున్నారు.
14. ఒకమ్మాయి ఒకబ్బాయిని వలలో వేసుకోవాలంటే మరి పాట సాహిత్యం అలా ఉన్నప్పుడు సాహిత్యానికి తగిన ధ్వనులు చేయాలి అన్నది ఆవిడ నమ్మకం. అందుకే ఆవిడ అప్పట్లో బూతు పాటలు అనుకున్న కొన్ని శృంగారగీతాలను పాడారు, అవి హిట్ అయ్యాయి. వృత్తి రీత్యా వీరు ఆనాటి ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాలలో పని చేశారు, కొన్నాళ్లు రాజమండ్రిలో కొన్నాళ్లు సిరిసిల్లలో ఉన్నారు.
15. జానకి గారి తండ్రి శిష్ట్లా శ్రీరామమూర్తి గారు. ఆయన ఆయుర్వేదం డాక్టర్. వీరు ప్రస్తుతం బాపట్ల జిల్లా రేపల్లె దగ్గరలోని పల్లపట్ల గ్రామంలో జానకి గారు 1938వ సంవత్సరం ఏప్రిల్ 23న జన్మించారు.
16. హైదరాబాదులో ఉన్నప్పుడు మోనో యాక్టర్గా జానకమ్మ మామయ్య గారు అనేక పాత్రలను ధరించే వారు, మధ్యలో లతా మంగేష్కర్ పాటలు జానకమ్మ చేత పాడించుకునే వారు. ఆయన పాత్రలను మార్చుకునే సమయంలో ఆయన జేబులో నుండి రాంప్రసాద్ గారి ఫోటో కిందపడగా, దాన్ని దాచుకుని ఆయనపై ప్రేమలో పడ్డారు. వీళ్ల ప్రేమాయణం కొన్నళ్లు సాగింది. 1959లో వీరి వివాహం జరిగింది. రాంప్రసాద్ గారి ప్రోద్బలంతోనే ఆయన తండ్రి జానకి గారిని ఏవీఎం స్టూడియో అధినేతకు సిఫారసు చేశారు. ఆ తరువాతే ఆవిడకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలాగ, జానకి గారిది ప్రేమ వివాహం. తాను మరణించేంత వరకు జానకి గారి పరిపూర్ణమైన సహకారం, ప్రోత్సాహం అందించారు రాం ప్రసాద్ గారు. వీరికి ఒక అబ్బాయి మురళీకృష్ణ. కోడలు ఉమ కూచిపూడి మరియు భరత నాట్య కళాకారిణి. చెన్నైలో నాట్యశిక్షణా సంస్థను నడుపుతున్నారు. వీరి కుమార్తే వైద్యుల అప్సర బెంగళూరులో యోగా టీచర్. మురళీకృష్ణ గారు 2026లో మరణించారు.
17. ప్రముఖ సంగీత విద్వాంసులు, అన్నమాచార్యుల వారి కీర్తనలను ప్రచారం చేసిన వారిలో ప్రముఖులైన గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు జానకమ్మ గారి అక్కయ్య కొడుకు. అలాగే అలనాటి గాయకులు మాధవపెద్ది సత్యం గారి తల్లి శిష్ట్లా వారి ఆడపడుచు. ఆ విధంగా వీరిద్దరికి బంధుత్వం ఉంది.
18. 1997లో రాంప్రసాద్ గారి మరణం జానకి గారికి తీరని లోటుగా నిలిచింది. అయినా పాడటం మనలేదు,తరువాతి తరం కళాకారులను తల్లిలా ప్రోత్సహించారు.
19. భారతదేశంలోని 17 భాషలలో (హిందీతో సహా) జానకమ్మ గారు 48 వేలకు పైగా పాటలు పాడారు. హిందీలో యార్ బినా చైన్ కహారే (సాహెబ్), హోజా రంగీలా రే (రంగీలా) వంటి ఎన్నో హిందీ పాటలు ప్రజాదరణ పొందాయి. చెన్నై-ముంబై మధ్య తిరుగుతూ పాడిన రోజులు ఉన్నాయి.
20. జానకమ్మకు ఉత్తమ గాయనిగా 4 మార్లు జాతీయ అవార్డులు, 10 మార్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి నంది అవార్డు, 6 మార్లు తమిళనాడు రాష్ట్ర అవార్డు, 11 మార్లు కేరళ రాష్ట్ర అవార్డు, ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, 30కు పైగా ఇతర ప్రతిష్ఠాత్మక అవార్డులు పొందారు.
ఈ గీతం ఎస్. జానకి గారి ప్రారంభ దశలోనే ఆమెను అగ్రశ్రేణి మెలోడీ గాయనిగా నిలబెట్టిన అపూర్వ రత్నం. సాలూరి రాజేశ్వరరావు అద్భుత స్వరరచనకు జానకిగారి నిర్మలమైన, మృదుమధురమైన గాత్రం ప్రాణం పోసింది. ప్రతి స్వరం వెన్నెల కిరణంలా హృదయాన్ని స్పృశిస్తూ, భావం మరియు రాగ మాధుర్యాన్ని సమపాళ్లలో ఆస్వాదింపజేస్తుంది. ఎక్కడా ఆర్భాటం లేకుండా, అత్యంత సహజమైన భావవ్యక్తీకరణతో శ్రోతను ఒక ప్రశాంతమైన సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఈ గీతం ప్రత్యేకత. గాత్ర నియంత్రణ, స్వచ్ఛమైన ఉచ్చారణ, సూక్ష్మమైన గమకాల వినియోగం ఈ పాటను తెలుగు సినీ సంగీతంలోని శాశ్వత మెలోడీలలో ఒకటిగా నిలబెట్టాయి.
భారతదేశంలో ఉన్న శాస్త్రీయ సంగీతంలో ప్రధానంగా రెండు రకాలు, హిందూస్తానీ శాస్త్రీయ, కర్నాటక శాస్త్రీయ సంగీతం. రెండిటిలోనూ కర్నాటక సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. శాస్త్రం (ఆంగ్లంలో సైన్స్), భావం కలిపి మేళవించే సంగీత సమ్మేళనం మరింత ఉన్నతంగా ఉంటుంది.
దీనికి ప్రధాన కారణం సంగీతత్రయమైన త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రుల వారి సాహిత్యంలోని ఔన్నత్యం. ఇవి వ్యక్తిపూజను పూర్తిగా వర్జించి మన ధర్మంలోని దేవతామూర్తుల వైభవాన్ని కళ్లకు కట్టినట్లు ఛందోబద్ధంగా వర్ణించి, సముచితమైన రాగంలో స్వరపరచబడటం వల్ల శాస్త్రం, ధర్మం ఏకమై దివ్యమైన సంగీతంగా కర్నాటక శాస్త్రీయ సంగీతం పరిణమించింది, కాలపరీక్షను తట్టుకుని దృఢంగా నిలిచింది. సంగీతత్రయానికి పూర్వం వారి స్థాయిలో సాహిత్యానికి విలువనిచ్చిన అన్నమాచార్యుల వారు, పురందరదాసుల వారు ఈ త్రయం కన్నా దాదాపు 250 ఏళ్లు ముందు జీవించిన వారు. అనగా ఒక 10 తరాల పాటు సమాజంలో అనేక రకాల మార్పులు వచ్చాయి. వాటిలో ముస్లిం పాలకులు, తెల్లవారి పాలన ప్రధానమైనవి. కాబట్టే శాస్త్రీయ సంగీతం ధర్మంతో నిరంతరం మేళవించబడి పరిఢవిల్లటానికి అప్పటి పరిస్థితులు అనుకూలంగా లేవు. రామదాసు గారు చాలా సంకీర్తనలు రాసినా, ఆయన శాస్త్రీయత కన్నా భజన సాంప్రదాయానికి ప్రాధాన్యతనిచ్చారు అని చెప్పుకోవచ్చు.
అందుకే, కర్నాటక శాస్త్రీయ సంగీతానికి ప్రధానమైన వృద్ధియుగం సంగీతత్రయం ఉన్న కాలమే అని చెప్పుకోవచ్చు. వీరు వచ్చాకే భావానికి పెద్దపీట వేసి శాస్త్రీయత మేళవించి అద్భుతమైన సాహిత్య సంగీత సుగంధాలు అలదబడ్డాయి. త్యాగరాజస్వామి నిధి చాలా సుఖమా, జగదానందకారకా, దీక్షితులవారి రంగపుర విహార, వాతాపి గణపతిం భజే, శ్యామశాస్త్రుల వారి హిమాచలతనయ వంటి వేల కృతులు శాస్త్రీయ సంగీతాన్ని ఉపాసనాపూర్వకంగా పొందిన ఆధ్యాత్మికశక్తితో వెలువడిన సాహిత్యంతో జతపరచినవి. క్షేత్రాలు, దేవతామూర్తులు, నిత్యోపాసన వీరు మనకు అందించిన అద్భుతమైన వారసత్వంలో మూలస్తంభాలు. వర్ణన అన్నది అనుభూతి చెందితేనే సఫలమవుతుంది. ఆ అనుభూతి ఉపాసనతోనే సాధ్యం. త్యాగరాజస్వామి రాముణ్ణి నిరంతరం ఉపాసన చేస్తే దీక్షితుల వారు శ్రీవిద్యోపాసనలో తపోసంపన్నులై నిలిచారు, శ్యామశాస్త్రుల వారు బంగారు కామాక్షి అమ్మను ఒక బిడ్డలా నిత్యం కొలిచారు. కాబట్టే వారి సాహిత్యం మిగిలిన వారి కన్నా మిన్నగా నిలిచిపోయాయి.
అంతే కాదు, సమకాలీన రాచరికాలు, సంస్థానాలు సంగీతత్రయ సాహిత్యానికి తగిన ప్రోత్సాహాన్నిచ్చాయి. త్యాగరాజస్వామి రాచరికాన్ని పూర్తిగా వర్జించినా వారి సాహిత్యాన్ని అప్పటి, తరువాతి రాచరికాలు ముందుకు తీసుకు వెళ్లాయి. అందుకే ఆయన శిష్య పరంపర సాహిత్యాన్ని కాపాడగలిగింది.
ముగ్గురిలో దీక్షితుల వారు దేశాటన ఎక్కువగా చేసి మరింత విస్తారమైన సాహిత్యాన్ని రచించారని చెప్పుకోవచ్చు. త్యాగరాజస్వామి కూడా తాను నివసించిన తిరువయ్యారుకు 500 కిలోమీటర్ల పరిధిలో పర్యటించారు. శ్యామశాస్త్రి గారు బంగారు కామాక్షి దేవాలయంలోని విధుల వలన వీరిద్దరి కన్నా కాస్త తక్కువగా పర్యటించారు. అయితే, ముగ్గురూ కూడా ఉపాసనలో సిద్ధి పొందే రససిద్ధిని కూడా సాధించారు.
నిజం చెప్పాలంటే, వారి జీవితాలలో ఆధ్యాత్మిక సాధనల వల్లనే వారి సాహిత్యాలు శాశ్వత స్థానాన్ని పొందాయి. శాస్త్రీయ సంగీతం అటువంటి ఉన్నతమైన సాహిత్యానికి చక్కని అలంకరణగా, ఒక సముచితమైన వేదికగా, ఆ దైవిక శక్తితో వేగంగా అనుసంధానం చేసే స్వరారోహణంగా నిలుస్తుంది. అందుకే సాహిత్యాన్ని రమించి సంగీతంలో మేళవించే కళాకారులు చరిత్రలో నిలిచిపోతారు. కేవలం శాస్త్రీయతకే ప్రాధాన్యతనిచ్చి భావం యొక్క విరాట్స్వరూపాన్ని అవగతం చేసుకోలేని వారు కనుమరుగవుతారు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఈ రహస్యాన్ని చక్కగా ఆకళింపు చేసుకుని నిరంతరం పాటించారు కాబట్టే భారతరత్న అయ్యారు. అలాగే మరెందరో గొప్పకళాకారులు. ఈ మేళవింపును గ్రహించని ఎందరో విద్వాంసులు సంగీతసాధన ద్వారా పరమపదసోపానాన్ని అధిరోహించలేకపోయారు.
కర్నాటక శాస్త్రీయ సంగీత రాగాలలోని స్వరాలతో చేసే గమకాలు అందాన్ని, సొగసును ఇస్తే, భావం వాటి మీద లయవిన్యాసం చేసి సార్థకతను పొందింది. భావరాగతాళ సమన్వితమైనది కాబట్టే సంగీతత్రయ సంపద దివ్యత్వాన్ని పొందగలిగింది.
లక్ష్మీ రావే మా ఇంటికి పరలక్ష్మీ రావే మా ఇంటికి
|క్షీరాబ్ధి పుత్రి పరలక్ష్మీ రావే మా ఇంటికి ॥॥
https://youtu.be/HVju0y2UIFw?t=1833
పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ - అసలు పేరు భరతం సుబ్రహ్మణ్య అయ్యర్. వీరు త్యాగరాజస్వామి వారి శిష్యులైన మానాంబుచావడి వేంకటసుబ్బయ్యర్ గారి శిష్యులు.
తిరువయ్యారులో 1845వ సంవత్సరంలో జన్మించిన వీరి తండ్రి భరతం వైద్యనాథ అయ్యర్. తాత పంచనదశాస్త్రి గారు తంజావూరు శరభోజి మహారాజు వారి ఆస్థానంలో విద్వాంసులు. సుబ్రహ్మణ్య అయ్యర్ గారు మేనమామ మేలత్తూరు గణపతిశాస్త్రి గారి వద్ద సంగీతం నేచుకుని తరువాత మానాంబుచావడి వారి వద్ద శిష్యరికం చేశారు. త్యాగరాజస్వామి వారి కృతులను నేర్చుకోవటం కోసం తెలుగు భాషను క్షుణ్ణంగా అధ్యయనం చేసి నూరుకు పైగా సంస్కృత, తెలుగు కృతులను, వర్ణాలను, జావళీలను, తిల్లానాలను రచించారు. ఆయన ముద్ర వేంకటేశ. బేగడ రాగాన్ని విస్తరించి పాడటంలో ఆయన నైపుణ్యం అమోఘం. అందుకే ఆయనకు బేగడ సుబ్రహ్మణ్య అయ్యర్ అని పేరు కూడా వచ్చింది. ఒకసారి మైసూరు మహారాజ వారి ఆస్థానంలో ఈ రాగాన్ని ఆయన మూడు రోజుల పాటు ఆలపించారు. మొదటి రాగాలాపన, రెండవరోజు తానం, మూడవరోజు రామనమమే జీవనము ఓ మనసా అన్న కృతి పల్లవి, స్వరకల్పనలు. ఈ అద్భుతమైన కళానైపుణ్యానికి మహారాజవారు ఆయనకు స్వర్ణకంకణాలను బహుకరించారు. అలాగే ఆయనకు విజయనగరం, ట్రావెంకోర్ ఆస్థానలలో మన్ననలను పొందారు. ఆయన లయజ్ఞానం అసమానమైనది. కదనకుతూహలం రాగంలో ఆయన రచించిన రఘువంశసుధాంబుధిచంద్ర అన్న కృతి జగద్విఖ్యాతమయ్యింది.
ఆయన గొప్ప గురువు కూడా. మైసూరు వాసుదేవాచార్యుల వారు, టైగర్ వరదాచార్యుల వారు మొదలైన ప్రఖ్యాత విద్వాంసులెందరో ఆయన శిష్యులు. మైసూరు వాసుదేవాచార్య తన స్మృతుల్లో గురువు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గురించి ఎంతో గౌరవంగా రాశారు. గురుకులంలో చేరిన వెంటనే కొత్త కృతులు నేర్పకుండా, మూడు నెలల పాటు కేవలం బేగడ రాగంలోని ఒకే వర్ణాన్ని పాడిస్తూ సాధన చేయించారని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా ఒక రాగంలోని ప్రతి సూక్ష్మభావాన్ని పూర్తిగా గ్రహించిన తరువాతే తదుపరి పాఠానికి వెళ్లాలనే ఆయన బోధనా తత్వం తెలుస్తుంది. వాసుదేవాచార్య తరువాత కాలంలో భారతదేశంలోని మహానుభావ సంగీతకారులలో ఒకరిగా ఎదగడంలో ఈ శిక్షణ కీలక పాత్ర పోషించింది.సేలం మీనాక్షి గారి కుమార్తెలైన పాప, రాధలకు శిక్షణ కోసం ఆయన చెన్నై(చెన్నపట్టణం) వచ్చి అక్కడే స్థిరపడ్డారు. అందుకు ఆయనకు పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు అన్న పేరు స్థిరమయ్యింది. త్యాగరాజస్వామి ప్రభావంతోనే ఆయన కృతులను సద్గురువుల శైలిలో రచించి జూనియర్ త్యాగరాజ అన్న పేరు తెచ్చుకున్నారు. 1902వ సంవత్సరంలో ఆయన పరమపదించారు.
జూలై 3న ఎం. ఎస్. రామారావు గారి 105వ జయంతి. ఆయన జీవిత విశేషాలు:
మోపర్తి సీతారామారావు, తెలుగు ప్రజలకు ఎం. ఎస్. రామారావుగా చిరపరిచితులు, తెలుగు భక్తి సంగీత చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించిన గాయకుడు, స్వరకర్త, రచయిత. ఆయన 1921 జూలై 3న గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని మోపర్రు గ్రామంలో జన్మించారు. తండ్రి మోపర్తి రంగయ్య, తల్లి మంగమ్మ. చిన్ననాటి నుంచే సంగీతంపై సహజమైన ఆసక్తిని పెంపొందించుకున్న ఆయన విద్యాభ్యాసాన్ని గుంటూరులోని హిందూ కళాశాలలో కొనసాగించారు. విద్యార్థి దశలోనే సంగీత పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రముఖ సాహితీవేత్త అడవి బాపిరాజు వంటి మహనీయుల ప్రశంసలు అందుకున్నారు. వారి ప్రోత్సాహం ఆయనను చలనచిత్ర సంగీత ప్రపంచం వైపు నడిపించింది.
1944లో ఆయన తెలుగు చలనచిత్ర రంగంలో నేపథ్య గాయకునిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తెలుగు సినీ సంగీత రంగంలో తొలి తరం నేపథ్య గాయకులలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన రెండు దశాబ్దాలకు పైగా అనేక చిత్రాలకు గాత్రదానం చేశారు. ఘంటసాల, పెండ్యాల నాగేశ్వరరావు, టి. వి. రాజు, పి. ఆదినారాయణరావు వంటి ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ చిత్రాలలో కూడా ఆయన గానం వినిపించింది. ఆయన స్వరంలో ఉన్న గంభీరత, మాధుర్యం, పదస్పష్టత కారణంగా భక్తిగీతాలు మాత్రమే కాకుండా జానపద, దేశభక్తి, సినీగీతాలు కూడా ప్రజాదరణ పొందాయి.
సినీగాయకుడిగా మంచి పేరు సంపాదించినప్పటికీ ఆయన జీవితంలో ఒక కీలక మలుపు 1960ల చివరలో వచ్చింది. సినీరంగంలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన సినీ అవకాశాలు తగ్గాయి. అనంతరం రాజమహేంద్రవరంలోని నవభారత గురుకులంలో గ్రంథపాలకుడిగా పనిచేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు. ఈ కాలంలో ఆయన ఆధ్యాత్మిక చింతన మరింతగా పెరిగింది. భక్తి సంగీతమే తన జీవితానికి నిజమైన మార్గమని ఆయన విశ్వసించడం ఈ దశలోనే ప్రారంభమైంది.
ఎం. ఎస్. రామారావు జీవితాన్ని పూర్తిగా మార్చివేసిన సంఘటన 1971 భారత–పాకిస్తాన్ యుద్ధం. ఆయన పెద్ద కుమారుడు బాబూరావు భారత వైమానిక దళంలో పైలట్గా దేశసేవలో పాల్గొన్నారు. యుద్ధ సమయంలో కుమారుడి క్షేమంపై తీవ్ర ఆందోళనకు గురైన ఆయన ఆంజనేయస్వామిని శరణు వేడుతూ భక్తిపూర్వకంగా ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను సరళమైన, మధురమైన తెలుగులో భావానువదించి, స్వయంగా స్వరపరచి ఆలపించారు. అనంతరం ఆయన కుమారుడు క్షేమంగా తిరిగి రావడం ఆయన భక్తిని మరింత దృఢపరిచింది. ఈ సంఘటన ఆయనను సినీ గాయకుని నుండి భక్తి గాయకునిగా మార్చిన జీవిత మలుపుగా నిలిచింది.
తెలుగు హనుమాన్ చాలీసా అపూర్వమైన ఆదరణ పొందిన తరువాత ఆయన వాల్మీకి రామాయణంలోని సుందరకాండను గేయరూపంలో ప్రజలకు అందించారు. సంస్కృత గ్రంథంలోని భావగాంభీర్యాన్ని ఏమాత్రం తగ్గించకుండా, అదే సమయంలో సాధారణ భక్తుడు కూడా సులభంగా అర్థం చేసుకునే విధంగా మధురమైన రాగాలలో ఆలపించడం ఆయన అసాధారణ ప్రతిభకు నిదర్శనం. అనంతరం బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ వంటి భాగాలను కూడా గేయరూపంలో అందించారు. ఆయన ఆలపించిన ఈ గేయాలు ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి చేరాయి. గ్రామోఫోన్ రికార్డులు, ఆడియో క్యాసెట్ల రూపంలో ఆయన గానం దాదాపు ప్రతి తెలుగు ఇంటిలో నిత్య పారాయణంలో భాగమైంది.
ఎం. ఎస్. రామారావు గానంలోని అత్యంత విశిష్టత పదస్పష్టత. ప్రతి పదం, ప్రతి అక్షరం శ్రోతకు స్పష్టంగా వినిపించేలా ఆయన ఆలాపన ఉండేది. శాస్త్రీయ సంగీతంలో దృఢమైన పునాది ఉన్నప్పటికీ క్లిష్టమైన అలంకారాల కంటే భావవ్యక్తీకరణకు ఆయన అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అందువల్ల సంగీత పరిజ్ఞానం లేని వారికీ ఆయన గానం హృదయాన్ని తాకేది. ఆయన స్వరంలో భక్తి, వినయం, ఆత్మీయత సహజంగా మిళితమై ఉండేవి. ముఖ్యంగా సుందరకాండను ఆయన ఆలపించిన తీరు లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. తెలుగు భక్తి సంగీత చరిత్రలో సుందరకాండ గానానికి ఆయన ఒక ప్రత్యేకమైన ప్రమాణాన్ని నెలకొల్పారు.
1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన గానం విశేష ఆదరణ పొందింది. భక్తి సంగీత ప్రచారంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 1977లో ఆయనకు “సుందరదాసు” అనే బిరుదు లభించింది. ఆ తరువాత ఆయన పేరు చెప్పగానే తెలుగు హనుమాన్ చాలీసా, సుందరకాండ గానం గుర్తుకు వచ్చేంతగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
1992 ఏప్రిల్ 20న హైదరాబాద్లో ఎం. ఎస్. రామారావు పరమపదించారు. అయితే ఆయన గానం, ఆయన భక్తి సందేశం నేటికీ సజీవంగానే ఉన్నాయి. అనేక దేవాలయాలలో, గృహాలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆయన ఆలపించిన తెలుగు హనుమాన్ చాలీసా, సుందరకాండ నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. భక్తిని సంగీతంతో మేళవించి సామాన్య ప్రజల హృదయాలకు చేరవేసిన మహోన్నత గాయకుడిగా ఆయన తెలుగు సంస్కృతిలో చిరస్థాయిగా నిలిచారు.
ఎం. ఎస్. రామారావు గారి ఆధ్యాత్మిక వారసత్వం నేటికీ ఆయన కుటుంబ సభ్యుల ద్వారా సజీవంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఆయన మనవడు పోలాప్రగడ శ్రీనివాస్ తన తాతగారి భక్తి సంపదను పరిరక్షించడం, ప్రచారం చేయడం తన జీవిత ధ్యేయంగా స్వీకరించారు. తెలుగు హనుమాన్ చాలీసా, సుందరకాండ గాన పారాయణాన్ని భారతదేశంతో పాటు విదేశాలలోని తెలుగు భక్తులకు చేరవేస్తూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయన గాత్రంలో తాతగారి గానశైలి, పదస్పష్టత, భక్తిభావం ప్రతిఫలించేలా సుందరకాండ పారాయణాలను నిర్వహిస్తూ యువతరానికి ఈ అమూల్యమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిచయం చేస్తున్నారు. శ్రీ ఎం. ఎస్. రామారావు స్మారక కార్యక్రమాలు, సుందరకాండ ప్రచార యజ్ఞాలు, ఆయన ధ్వని రికార్డుల పరిరక్షణ వంటి కార్యక్రమాల ద్వారా ఈ గొప్ప సంపదను భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ విధంగా ఎం. ఎస్. రామారావు గారి స్వరం నిశ్శబ్దమైనప్పటికీ, ఆయన భక్తి సందేశం, శ్రీరామనామ ప్రచారం, ఆంజనేయ భక్తి పోలాప్రగడ శ్రీనివాస్ సేవల ద్వారా నిరంతరం ప్రజల్లో ప్రతిధ్వనిస్తూ తరతరాలకు ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందిస్తున్నాయి.
మా తెలుగు తల్లికి మల్లెపూదండ - ఈ పాటను అజరామరం చేసిన బహుముఖప్రజ్ఞాశాలి టంగుటూరి సూర్యకుమారి గారు. వికీ ప్రకారం గత సంవత్సరం ఈవిడ శతజయంతి, మరో మూలం ప్రకారం ఈ సంవత్సరం నవంబర్లో. విదేశాల్లో స్థిరపడ్డా భారతీయ కళలకు ఆఖరిరోజు వరకు సేవ చేసిన కళాకారిణి.
అప్పట్లో వీరి పెదనాన్న గారైన ప్రకాశం పంతులు గారు తమ ప్రతి ఒక్క రాజకీయ సభలోనూ సూర్యకుమారి గారి చేత ఈ పాట పాడించేవారట. వారి జీవిత విశేషాలు:
టంగుటూరి సూర్యకుమారి తెలుగు సినీరంగం, సంగీతం, నృత్యం, రంగస్థల కళలలో తనదైన ముద్ర వేసిన అరుదైన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె గాయని, నటి, నర్తకి మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతిని ప్రపంచ వేదికలపై గౌరవప్రదంగా పరిచయం చేసిన సాంస్కృతిక రాయబారిగా కూడా విశేష గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా ప్రసిద్ధి చెందిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆలపించడం ద్వారా ఆమె పేరు శాశ్వతంగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. కళ, సాహిత్యం, దేశభక్తి, సంస్కృతి పట్ల ఆమెకున్న అంకితభావం జీవితాంతం కొనసాగింది.
సూర్యకుమారి 1925 నవంబరు 13న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని రాజమహేంద్రవరంలో జన్మించారు. ఆమె ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రకేసరి తంగుటూరి ప్రకాశం పంతులుగారి సోదరుని కుమార్తె. దేశభక్తి, సామాజిక చైతన్యం, సాహిత్యాభిమానం కలిగిన కుటుంబ వాతావరణంలో పెరిగిన ఆమెకు చిన్ననాటి నుంచే సంగీతం, నాట్యం, నటనలపై ఆసక్తి ఏర్పడింది. సహజసిద్ధమైన మధుర స్వరం, అభినయ నైపుణ్యం, వేదికపై ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రదర్శన ఆమెను బాల్యదశలోనే కళారంగంలోకి తీసుకువచ్చాయి.
కేవలం పన్నెండేళ్ల వయస్సులోనే విప్రనారాయణ చిత్రంలో నటించి సినీరంగ ప్రవేశం చేశారు. అనంతరం రైతుబిడ్డ, అదృష్టం, దేవత, చంద్రహాస, భక్త పోతన, కృష్ణ ప్రేమ, భాగ్యలక్ష్మి, గీతాంజలి, మరదలు పెళ్లి, రామదాసు వంటి అనేక చిత్రాల్లో నటించారు. తెలుగు మాత్రమే కాక తమిళం, కన్నడ, హిందీ భాషల చిత్రాల్లో కూడా తన ప్రతిభను చాటారు. ఆమె నటించిన దేవత, రైతుబిడ్డ చిత్రాలు తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన చిత్రాలుగా గుర్తింపు పొందాయి. కృష్ణ ప్రేమ చిత్రంలో నారదుడి పాత్రను పోషించడం విశేషం. తెలుగు సినీ చరిత్రలో ఒక మహిళ నారదుడి పాత్రను పోషించిన తొలి సందర్భంగా ఇది ప్రస్తావించబడుతుంది. ఈ పాత్రలో ఆమె నటనతో పాటు గాన ప్రతిభ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
సూర్యకుమారి నటిగా ఎంత ప్రతిభ కనబరిచారో, గాయనిగా కూడా అంతే కీర్తిని సంపాదించారు. ఆమె ఆలపించిన అనేక గ్రామోఫోన్ రికార్డులు విశేష ప్రజాదరణ పొందాయి. దేశభక్తి గీతాలు, భక్తి గీతాలు, జానపద గీతాలు, లలిత గీతాలు ఆమె స్వరంతో ప్రజల్లోకి విస్తృతంగా చేరాయి. శంకరంబాడి సుందరాచారిగారు రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆమె ఆలపించడంతో ఆ గీతం అపూర్వ ప్రజాదరణ పొందింది. తరువాత అదే గీతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా అధికారిక గుర్తింపు పొందింది. ఈ గీతం ద్వారా తెలుగు భాష, తెలుగు సంస్కృతి పట్ల ఆమెకున్న అనుబంధం తరతరాలకు పరిచయమైంది.
సినీరంగ విజయాలతో పాటు సూర్యకుమారి నృత్యకళలో కూడా ఉన్నత శిక్షణ పొందారు. భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలను విదేశాల్లో పరిచయం చేయాలనే సంకల్పంతో 1950ల చివర్లో అమెరికాకు వెళ్లారు. అక్కడ భారతీయ సంగీతం, నృత్యం బోధిస్తూ భారతీయ కళలను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశారు. అనంతరం న్యూయార్క్ రంగస్థలంపై రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ది కింగ్ ఆఫ్ ది డార్క్ ఛాంబర్ నాటకంలో రాణి సుదర్శన పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ ప్రదర్శనకు ఆమెకు అవుటర్ క్రిటిక్స్ సర్కిల్ ఉత్తమ నటి పురస్కారం లభించింది. భారతీయ కళాకారిణిగా అంతర్జాతీయ రంగస్థలంపై ఈ స్థాయి గుర్తింపు పొందడం ఆ కాలంలో అరుదైన ఘనతగా నిలిచింది.
1965 ప్రాంతంలో ఆమె లండన్కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కవి, చిత్రకారుడు హారోల్డ్ ఎల్విన్ను వివాహం చేసుకున్న తరువాత భారతీయ కళల ప్రచారానికి మరింత కృషి చేశారు. ఇద్దరూ కలిసి ఇండియా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి భారతీయ సంగీతం, నృత్యం, నాటక కళలను యూరప్లోని అనేక వేదికలపై ప్రదర్శించారు. లండన్లో ప్రతి సంవత్సరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా భారతీయ కళాకారులకు అవకాశాలు కల్పించారు. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయుల భావజాలాన్ని సంగీతం, నాట్యం, నాటకాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆమె విశేష కృషి చేశారు.
సూర్యకుమారి అందాల పోటీలలో కూడా విశేష గుర్తింపు పొందారు. 1952లో మిస్ మద్రాస్ బిరుదును గెలుచుకుని, అదే సంవత్సరంలో జరిగిన మిస్ ఇండియా పోటీలలో రన్నరప్గా నిలిచారు. అయినప్పటికీ ఆమె తన జీవితాన్ని గ్లామర్ ప్రపంచానికే పరిమితం చేయకుండా భారతీయ కళాసంపదను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికే అంకితం చేశారు. కళాకారిణిగా మాత్రమే కాక సాంస్కృతిక రాయబారిగా ఆమె చేసిన సేవలు మరింత విశిష్టమైనవి.
1975లో హైదరాబాద్లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు లండన్ నుంచి ప్రత్యేకంగా వచ్చి మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆలపించారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతిపై ఆమెకున్న ప్రేమకు ఇది ఒక చిరస్మరణీయ ఉదాహరణగా నిలిచింది. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలుగు సంప్రదాయాల ప్రచారం, భారతీయ సంస్కృతి పరిరక్షణ, యువతకు శాస్త్రీయ కళల బోధన వంటి కార్యక్రమాలను జీవితాంతం కొనసాగించారు.
2005 ఏప్రిల్ 25న లండన్లో ఆమె పరమపదించారు. అయితే ఆమె స్వరం, ఆమె నటన, ఆమె నృత్య ప్రదర్శనలు, ముఖ్యంగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతం ద్వారా ఆమె జ్ఞాపకం తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. తెలుగు సినీ చరిత్రలో తొలి తరం బహుముఖ ప్రజ్ఞాశాలులలో ఒకరిగా, భారతీయ కళలను ప్రపంచవ్యాప్తంగా గౌరవప్రదంగా ప్రతిష్ఠించిన సాంస్కృతిక దూతగా, తెలుగు భాషా గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహనీయ కళాకారిణిగా టంగుటూరి సూర్యకుమారి చిరస్మరణీయ స్థానం సంపాదించారు.
ఎప్పుడైనా దీనంగా, నిస్సహాయతగా అనిపించినప్పుడు, ఈ అన్నమాచార్యుల వారి కృతి వినండి, ఒంట్లో నారసింహం అణువణువునా నిలిచి శక్తినిస్తుంది, క్లైబ్యాన్ని తొలగించి కర్తవ్యోన్ముఖులను చేస్తుంది. ఖచ్చితంగా పని చేస్తుంది, సందేహమే లేదు. కావలసింది ఆయనపై అచంచలమైన విశ్వాసం. స్వామి కేళీ విహారం అద్భుతం, అమోఘం, అనుభవైకవేద్యం. నారసింహోపాసకులను అడగండి వారు చెబుతారు.
ఇక్కడ ఒక్క చిన్న విషయం చెప్పాలి. స్వామి తీక్ష్ణ ప్రభావం కలవాడు కాబట్టే నిష్ఠతో గురువిదితంగానే ఉపాసన చేయాలి. స్వయంగా నారసింహ ఉపాసన చేయకూడదు. గురు ముఖత మంత్రోపాసన పొందని వారు కరావలంబ స్తోత్రం, నామావళి వంటివి చదువుకోవచ్చు.
ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహా
ప్రళయమారుత ఘోర భస్త్రికాపూత్కార లలిత నిశ్వాసడోలా రచనయా
కులశైలకుంభినీ కుముదహిత రవిగగన చలన విధినిపుణ నిశ్చల నారసింహా
వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూతలవదివ్య పరుష లాలాఘటనయా
వివిధ జంతు వ్రాతభువన మగ్నౌకరణ నవనవప్రియ గుణార్ణవ నారసింహా
దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ సంగక్రీడయా
వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ కారణ ప్రకట వేంకట నారసింహా
భావము:
ఓ నరసింహా ! ఫాలభాగంనుండి విస్ఫులింగాలు కురిపిస్తూ ప్రపంచమంతటినీ గొప్పగొప్పవిద్యుల్లతలతో మెరిపిస్తూ వేడుకగా విహరించడం నీకు ఒక ఆట. నీవు నిశ్చలంగా ఉంటూ లలితంగా మృదువుగా గాలి వదిలితే (నిశ్వసిస్తే) ఓ నారసింహా !ఆ నిశ్వాసము ప్రళయకాల ప్రభంజనంలా మారి కులపర్వతాలను (ఏడు కులపర్వతాలు ఉన్నాయి ఉదయ, అస్త, హిమ, వింధ్య, మేరు, త్రికూట, లోకాలోక పర్వతాలు) భూమిని చంద్రుడిని సూర్యుడిని ఆకాశాన్ని అన్నింటినీ ఒక ఊపు ఊపుతుంది. ప్రియమైన గుణములకు సముద్రము వంటి ఓ నారసింహా ! దుర్జనులను చూసినప్పుడు భయముగొలిపేటట్లుగా తెరిచిన నీ గొప్పదైన ముఖము నుండి వెలువడే మహాట్టహాసము మరియు నీ లాలాజలము అనేక జంతుతతులన్న ఈ జగమును ముంచెత్తుతూ లోకాలను పవిత్రం గావిస్తున్నది. కొత్తకొత్తగా మారుస్తున్నది.ధగధగా మెరుస్తూ భయంకరంగా విస్ఫులింగాలు వెదజల్లుతూ వికృతమైన కోరలతో నిన్ను నీవు ప్రకటింపచేసుకున్నది ఒక ఆటలాగ శత్రువులైన దానవ వంశాలను భస్మం చేయడం కొరకే కదా!
ఈ సంకీర్తనను గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు ఆలపించారు.
తెలుగు చలనచిత్ర చరిత్రలో కొన్ని చిత్రాలు కేవలం విజయవంతమైన సినిమాలుగానే కాకుండా, కళాత్మకత, కథన వైవిధ్యం, నటన, సంగీతం, సాంకేతిక నైపుణ్యం అన్నింటినీ సమన్వయం చేసిన మైలురాళ్లుగా నిలిచిపోయాయి. అలాంటి చిత్రాల్లో అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన ఇద్దరు మిత్రులు (1961) ఒకటి. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు సృజనాత్మక దృష్టి, నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు కథా ఎంపికలో చూపిన అభిరుచి, అక్కినేని నాగేశ్వరరావు నటనా ప్రతిభ, సాలూరి రాజేశ్వరరావు సంగీతం కలిసి ఈ చిత్రాన్ని చిరస్థాయిగా నిలబెట్టాయి. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు తన సినీ జీవితంలో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇదే కావడం దీనికి మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.
బెంగాలీ కథ నుంచి తెలుగు క్లాసిక్ వరకు
దుక్కిపాటి మధుసూదనరావుకు బెంగాలీ సాహిత్యం, బెంగాలీ చిత్రాలపై ఉన్న ఆసక్తి అప్పటికే ప్రసిద్ధి చెందింది. ఆయన నిర్మించిన వెలుగు నీడలు చిత్రం కూడా బెంగాలీ కథ ఆధారంగానే రూపొంది ఘనవిజయం సాధించింది. ఆ విజయంతో ప్రోత్సాహం పొందిన అన్నపూర్ణ పిక్చర్స్, దర్శకుడు మంగళ్ చక్రవర్తి రూపొందించిన బెంగాలీ చిత్రం తాశేర్ ఘర్ (1957) రీమేక్ హక్కులను కొనుగోలు చేసింది. ఆ చిత్ర కథపై ప్రముఖ ఆంగ్ల రచయిత్రి డాఫ్నీ డూ మౌరియర్ రచించిన ది స్కేప్గోట్ నవల ప్రభావం కూడా కనిపిస్తుందని సినీ చరిత్రకారులు పేర్కొంటారు.
అయితే అన్నపూర్ణ సంస్థ మూల కథను యథాతథంగా అనుసరించలేదు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, సహాయ దర్శకుడు కె. విశ్వనాథ్, ప్రముఖ పాత్రికేయుడు గోరా శాస్త్రి, నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు కలిసి కథను పూర్తిగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మలిచారు. కొత్త పాత్రలను ప్రవేశపెట్టారు. హాస్యాన్ని పెంచారు. కథలో తార్కికతను మెరుగుపరిచారు. భావోద్వేగాలకు మరింత లోతు ఇచ్చారు. ఈ మార్పులే ఈ చిత్రాన్ని సాధారణ రీమేక్ స్థాయి దాటి స్వతంత్ర క్లాసిక్గా నిలబెట్టాయి.
కథలోని వైవిధ్యం
సంపన్నుడైన అజయ్, పేదవాడైన విజయ్ ఇద్దరూ ఒకే పోలికలతో ఉంటారు. అనుకోకుండా కలుసుకున్న వీరిద్దరూ తమ తమ జీవితాల్లో ఎదురవుతున్న కష్టాలను చెప్పుకొని, ఒక సంవత్సరం పాటు జీవితాలను పరస్పరం మార్చుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయం తరువాత జరిగే పరిణామాలే కథకు మూలం.
అజయ్ ఆస్తిని కాజేయాలని ప్రయత్నించే మేనేజర్ భానోజీ కుట్రలను, అజయ్ స్థానంలో ఉన్న విజయ్ తెలివిగా అడ్డుకుంటాడు. మరోవైపు విజయ్ స్థానంలో జీవిస్తున్న అజయ్, సాధారణ మెకానిక్గా జీవిస్తూ జీవితంలోని నిజమైన విలువలను తెలుసుకుంటాడు. ప్రేమను పొందుతాడు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించేందుకు చేసిన త్యాగం వల్ల జైలుకూ వెళ్తాడు. చివరకు భానోజీ చేసిన దుర్మార్గాలు బయటపడడంతో సత్యం విజయం సాధిస్తుంది. ఇద్దరి జీవితాలు సంతోషకరంగా ముగుస్తాయి.
ఈ కథలో స్నేహం, నిజాయితీ, ధర్మం, కుటుంబ విలువలు, సంపద కంటే మనిషి గొప్పవాడనే సందేశం సహజంగా మిళితమై ఉన్నాయి.
అక్కినేని ద్విపాత్రాభినయం – నటనా వైభవానికి నిదర్శనం
ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు నట జీవితంలో ఒక మలుపు. అజయ్, విజయ్ అనే రెండు భిన్న స్వభావాల పాత్రలను ఆయన అద్భుతమైన శరీర భాష, హావభావాలు, సంభాషణా శైలితో స్పష్టంగా వేరు చేశారు. ఎక్కడా ప్రేక్షకుడికి గందరగోళం కలగకుండా పాత్రల వ్యక్తిత్వాన్ని నిలబెట్టడం ఆయన నటనా నైపుణ్యానికి నిదర్శనం.
ప్రత్యేకించి అక్కినేని రెండు పాత్రలు ఒకే ఫ్రేమ్లో కనిపించే షేక్ హ్యాండ్ దృశ్యం అప్పటి ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. కంప్యూటర్ గ్రాఫిక్స్, డిజిటల్ టెక్నాలజీ లేని కాలంలో ఛాయాగ్రాహకుడు పి.ఎస్. సెల్వరాజ్, కెమెరామెన్ పాచూ, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కలిసి ఆ దృశ్యాన్ని ఎంతో నైపుణ్యంతో తెరకెక్కించారు. ఆ సన్నివేశం అప్పటి సాంకేతిక ప్రతిభకు ప్రతీకగా నిలిచింది.
సహాయ నటీనటుల అద్భుత ప్రతిభ
ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గుమ్మడి పోషించిన భానోజీ పాత్ర తెలివైన ప్రతినాయకుడిగా గుర్తుండిపోతుంది. రాజసులోచన, ఈ.వి. సరోజ, జి వరలక్ష్మి, రేలంగి, సూర్యకాంతం, రమణారెడ్డి, పద్మనాభం, అల్లు రామలింగయ్య తమ పాత్రలకు జీవం పోశారు. గుమ్మడి, జి వరలక్ష్మి తమ వయసుకు మించిన పాత్రలను అద్భుతంగా పందించారు. ఇద్దరు హీరోయిన్లు కూడా పోటీ పడి నటించారు.
శారదకు ఇది తొలి ప్రధాన పాత్రలలో ఒకటి. మీనా పాత్రలో ఆమె చూపిన సహజ నటన తరువాత ఆమెను దక్షిణ భారతదేశంలోని అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా నిలబెట్టిన ప్రయాణానికి శ్రీకారం చుట్టింది.
సంగీతం – చిత్ర విజయానికి ప్రధాన బలం
సాలూరి రాజేశ్వరరావు స్వరపరిచిన పాటలు ఈ చిత్రానికి చిరస్మరణీయమైన ఆభరణాలు. పాడవేల రాధికా, ఈ ముసిముసి నవ్వుల, చక్కని చుక్క సరసకు రావే, శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఖుషీ ఖుషీగా నవ్వుతూ, హలో హలో ఓ అమ్మాయి వంటి పాటలు నేటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. దాశరథి కృష్ణమాచార్యులు ఈ చిత్రంతో సినీ గేయరచయితగా ప్రవేశించడం కూడా విశేషం. ఆయనతో పాటు శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు కూడా గీతాలు రచించారు.
హలో హలో ఓ అమ్మాయి, ఖుషీ ఖుషీగా నవ్వుతూ పాటల్లో ఆ కాలం పాశ్చాత్య సంగీత ప్రభావం కొంత కనిపించడం ఆ రోజుల్లోనే సంగీత దర్శకుల విశాల దృష్టిని తెలియజేస్తుంది. విదేశీ బాణీల ప్రభావాన్ని స్వీకరించినప్పటికీ, వాటికి తెలుగు సంస్కృతికి తగిన స్వరూపాన్ని ఇచ్చి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపారు.
ఆసక్తికరమైన విశేషాలు
ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో అరుదైన విషయాలు సినీ అభిమానులను ఆశ్చర్యపరుస్తాయి. శారదను ఈ పాత్రకు దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ సిఫారసు చేయడం ఆమె సినీ జీవితాన్ని మలిచింది. ఈ.వి. సరోజ అనుకోకుండా స్టూడియోలో దుక్కిపాటి మధుసూదనరావును కలవడం వల్ల రెండో కథానాయిక పాత్ర ఆమెకు దక్కింది. తమిళంలో ఇరు నన్బర్గళ్ పేరుతో ఈ చిత్రాన్ని డబ్ చేయగా అక్కడ కూడా విజయం సాధించింది.
ఇద్దరు నాగేశ్వరరావు పాత్రలు ఎదురెదురుగా కనిపించే దృశ్యాల కోసం నటుడు జగన్నాథరావు బాడీ డబుల్గా పనిచేయగా, ఒక సన్నివేశంలో సహాయ దర్శకుడు కె.వి. రావు కూడా డూప్గా నటించడం విశేషం. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన ప్రతి చిత్రంలో నటించిన సావిత్రి, ఈ చిత్రంలో అవకాశం రాకపోవడంతో కొంత నిరాశ చెందినప్పటికీ, చిత్రం శతదినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై తన పెద్ద మనసును చాటుకున్నారు. ఆ వేడుక కోసం నటీనటులందరినీ ప్రత్యేక విమానంలో మద్రాస్ నుంచి హైదరాబాద్కు తీసుకురావడం అప్పట్లో ఒక విశేష సంఘటన.
చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్
ఇద్దరు మిత్రులు కేవలం ఒక విజయవంతమైన రీమేక్ కాదు. మూల కథను గౌరవిస్తూ, తెలుగు సంస్కృతి, భావోద్వేగాలు, కుటుంబ విలువలు, వినోదం అన్నింటినీ సమన్వయం చేసి కొత్త జీవం పోసిన ఆదర్శ రూపాంతరం. అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వ ప్రతిభ, దుక్కిపాటి మధుసూదనరావు కథా దృష్టి, సాలూరి రాజేశ్వరరావు సంగీతం, శక్తివంతమైన సహాయ నటీనటుల బృందం కలిసి ఈ చిత్రాన్ని తెలుగు సినిమా చరిత్రలో శాశ్వత స్థానం పొందేలా చేశాయి.
ఆరున్నర దశాబ్దాలు గడిచినా ఇద్దరు మిత్రులు తన కథా నిర్మాణం, నటనా విలువలు, సాంకేతిక నైపుణ్యం, సంగీత మాధుర్యంతో నేటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. మంచి కథను స్థానిక సంస్కృతికి అనుగుణంగా ఎలా మలచవచ్చో, ఒక రీమేక్ను ఎలా స్వతంత్ర కళాఖండంగా తీర్చిదిద్దవచ్చో నిరూపించిన అరుదైన చిత్రంగా ఇద్దరు మిత్రులు ఎప్పటికీ తెలుగు సినీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచి ఉంటుంది.
ఆంగరైకు చెందిన శ్రీ సత్తూర్ సుబ్రహ్మణ్యం గారి తల్లి పరమాచార్యుల వారిపై అపార భక్తి కలిగిన మహనీయురాలు. వారి ఇంట్లో కోటి శ్రీరామనామ జపయజ్ఞం ప్రారంభమైనప్పటికీ, తొలి రోజుల్లో ఆశించినంతమంది భక్తులు రాలేదు. అదే సమయంలో ఒక భక్తురాలు కన్నీటి పర్యంతమై వారి ఇంటికి వచ్చి, తన ఇంట్లో ఉన్న పరమాచార్యుల వారి విగ్రహం కొన్ని రోజులుగా స్పష్టంగా "నన్ను సత్తూర్ ఇంటికి తీసుకెళ్ళు" అని పలుకుతోందని తెలిపింది. మొదట అది తన భ్రమ అనుకున్న ఆమెకు, అదే దివ్య ఆదేశం పదేపదే వినిపించడంతో భక్తి, భయభక్తులతో ఆ విగ్రహాన్ని సుబ్రహ్మణ్యం గారి ఇంటికి తీసుకువచ్చింది. రామనామ జపం జరుగుతున్న ప్రదేశంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వెంటనే, ఆమెకు ఆ దివ్య స్వరం వినిపించడం పూర్తిగా ఆగిపోయింది. ఈ విశేషాన్ని సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులే తరువాత భక్తులతో పంచుకున్నారు.
ఆ తరువాత ఆ ఇంట్లో జరిగిన మార్పు అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. అప్పటివరకు కొద్దిమంది మాత్రమే హాజరవుతున్న రామనామ జపానికి వందలాది మంది భక్తులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. కోటి రామనామ యజ్ఞం అత్యంత వైభవంగా పూర్తయింది. ఈ సంఘటనను భక్తులు కేవలం ఒక అద్భుతంగా మాత్రమే కాకుండా, భగవన్నామ సంకీర్తన జరిగే చోటే పరమాచార్యుల వారి అనుగ్రహ సాన్నిధ్యం స్వయంగా వెలుగొందుతుందనే దివ్య సత్యానికి నిదర్శనంగా భావిస్తారు. పరమాచార్యుల వారు తమ జీవితమంతా ధర్మం, గురుభక్తి, రామనామ మహిమలనే నిజమైన అద్భుతాలని ఉపదేశించారు. అందువల్ల ఈ సంఘటనలో విగ్రహం మాట్లాడిందనే అంశం కంటే, రామనామ ప్రచారానికి పరమాచార్యుల వారి కృప స్వయంగా మార్గదర్శకత్వం వహించిందనే ఆధ్యాత్మిక సందేశమే భక్తుల హృదయాలను మరింతగా స్పృశిస్తుంది.
శ్రీగురుభ్యోనమః.
సంగీత త్రయంలో పెద్దవారు శ్యామశాస్త్రి గారు. ఆయన వాగ్గేయకారులు, దేవీ భక్తులు, ఉపాసకులే కాదు పారంపర్యంగా వచ్చిన తంజావూరు బంగారు కామాక్షీ అమ్మవారి దేవస్థానంలో అర్చకత్వం కూడా చేశారు. సనాతనమైన ఈ బంగారు కామాక్షీ విగ్రహం తొలుత కాంచీపురంలో ఉండగా ఆది శంకరులే శ్యామశాస్త్రి గారి పూర్వీకులకు ఆ విగ్రహ పూజా బాధ్యతలను అప్పగించారట. 16వ శతాబ్దం మధ్యలో రాజకీయ పరిస్థితుల వలన శ్యామశాస్త్రి పూర్వీకులు కాంచీపురం వదలి ఆ విగ్రహాన్ని తంజావూరు తీసుకు వచ్చి అక్కడ ప్రతిష్ఠించి అక్కడి రాజుల ఆదరణతో ఆ బంగారు కామాక్షి దేవాలయానికి వైభవం వచ్చేలా చేశారు. తంజావూరు మహారాజా తులజావారు మేల రాజవీధిలో ఆ గుడికై పెద్ద స్థలాన్ని కేటాయించి, అగ్రహారాలు, మాన్యాలు, ఆభరణాలు కానుకగా ఇచ్చారు. శ్యామశాస్త్రి తండ్రిగారైన విశ్వనాథశాస్త్రి గారు మరణించిన తరువాత శ్యామశాస్త్రి గారు అమ్మ కైంకర్య బాధ్యతలను స్వీకరించారు.
శ్యామశాస్త్రి కన్న ముందు వారి కుటుంబంలో ఎవ్వరికీ సంగీతంలో ప్రవేశం లేదు. ఆ బంగారు కామాక్షి కరుణతో ఆయన అద్భుతమైన గాయకునిగా, వాగ్గేయకారునిగా పేరొందారు. నిత్యపూజాదికాల తరువాత శ్యామశాస్త్రి వారు ఆ అమ్మ ముందు కూర్చుని ఆనందభాష్పాలు రాలుస్తూ తన కృతులను గానం చేసేవారు. ఎలా? ఆ తల్లిని తన కన్న తల్లిలా, తాను ఒక పసిబిడ్డవానిగా త్రికరణ శుద్ధిగా భావించి పాడేవారు. అమ్మను వేడుకోవడం, అమ్మను నుతించటం, అమ్మను ప్రశ్నించటం, అమ్మ లాలన పొందిన అనుభూతులు, అమ్మ ప్రేమను ఆస్వాదించిన వర్ణనలు...ఆయన కీర్తనలన్నీ మాతృభావనతో వ్రాసినవే.
ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఆయనకు కలలో వచ్చి మదురై వెళ్ళి మీనాక్షీ అమ్మను ఆరాధించమని చెప్పగా, శ్యామశాస్త్రుల వారు అక్కడికి వెళ్ళి నవరత్నమాలికగా పేరొందిన తొమ్మిది అద్భుతమైన కృతులను రచించి అమ్మ ముంగిట ఆలపించారు. వాటిలో ఏడు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి - సరోజదళనేత్రి, దేవీ మీననేత్రి (శంకరాభరణం రాగంలో), మరివేరే గతి యెవరమ్మ (ఆనందభైరవి), నన్ను బ్రోవు లలిత (లలిత), మాయమ్మ (ఆహిరి), దేవీ నీ పద సారస (కాంభోజి), మీనలోచనా బ్రోవ (ధన్యాసి). తమాషా ఏమిటంటే శ్యామశాస్త్రి కుటుంబీకులు తమిళ అయ్యరు బ్రాహ్మణులైనా, ఆయన కృతులన్నీ తెలుగులో వ్రాసినవే. కాబట్టి శ్యామశాస్త్రి పూర్తిగా తెలుగు వారే అని చెప్పవచ్చు. చక్కని లయజ్ఞానంతో, మధురమైన భావసంపదతో, స్వరాక్షర మరియు ప్రాసల సౌందర్యంతో, రాగ అర్థ రస భావనలతో ఆయన కామాక్షీ, మీనాక్షీ పరదేవతలను తన కృతులతో కొలిచారు. శ్యామశాస్త్రి తన రచనలలో దేవీవైభవం పరిపూర్ణంగా ఆవిష్కరించారు. మాతృప్రేమను కురిపించి, అనుగ్రహించి, ఘనపాపములను తొలగించే అమ్మను 300కు పైగా కృతులలో నుతించారు. సంగీత త్రయంలో దేవీతత్త్వాన్ని ఒక కుమారునిగా అద్బుతంగా వర్ణించారు.
నాదోపాసనలో మాతృతత్త్వాన్ని, పరదేవతానుగ్రహాన్ని మనకు అమూల్యమైన ఆధ్యాత్మిక సంపదగా కృతులను అందించిన శ్యామశాస్త్రుల వారు తంజావూరు బంగారు కామాక్షి సేవలోనే తరించి పరమపదించారు. వీరి కుమారులైన సుబ్బరాయశాస్త్రి గారు తండ్రి వద్ద, వారి సమకాలీకులైన త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితుల వారి వద్ద సంగీత శిక్షణను పొంది మంచి వాగ్గేయకారులుగా పేరొందారు.
స్వాంతంబులోన నిన్నే తలచిన సుజనులకెల్లనీ వేళ సంతోషము లొసగేవని నీవు మనోరథ ఫలదాయిని వని
కాంతమగు పేరు పొందితివి కారుణ్యమూర్తివై జగము కాపాడిన తల్లి కదా నేడు నీదు బిడ్డను లాలించి
కనక గిరి సదన లలిత నిను భజన సంతతము సేయ నిజముగను
వినుము నిఖిల భువన జననీ ఇపుడు మా దురితము దీర్చి వరాలిచ్చి
పాలించు కామాక్షీ! పావనీ! పాపశమనీ!
మధురభక్తిలో అనేక రకాలు, బహుళంగా ఉండే భావన నాయికా నాయకుని భావనైతే మాతృత్వ భావన, స్నేహ భావన లాంటివి ఈ మార్గంలో మరెన్నో. దేని ప్రత్యేకత దానిదే. కానీ, ఆ పరమాత్మను తన బిడ్డగా భావించే మాతృత్వ మధుర భక్తి చాలా ఉన్నతమైనది. తన బిడ్డను లాలించించే రీతినే ఆ తల్లి పరమాత్మను కూడా లాలిస్తుంది. ఈ భావనలను ఎందరో వాగ్గేయకారులు, రచయితలు అద్భుతంగా ఆవిష్కరించారు. వారిలో అన్నమాచార్యుల వారు అగ్రగణ్యులు. అటువంటి మాతృత్వ భావనలతో నిండిన ఓ మధుర భక్తి గీతం శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం చిత్రానికి ఆత్రేయ గారు రచించారు. పెండ్యాల వారి సంగీతం, బహుముఖ ప్రజ్ఞాశాలి శాంతకుమారి గారి నటన, గాత్రం కూడా. వకుళమాత శ్రీకృష్ణునికై ఎదురు చూస్తూ ఆరాధించే సన్నివేశం. యశోద మళ్లీ కలియుగంలో వకుళమాతగా జన్మించి శ్రీనివాసుని తల్లి అయ్యింది. శాంతకుమారి పూర్తిగా శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన. గాయనీమణి. చాలా ఆర్తితో, భక్తితో ఈ గీతాన్ని ఆలపించారు.
ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాల
ఎంత పిలచినా ఎంత వేడినా ఈ నాటికి దయరాదేల
గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల
వీనుల విందుగ వేణుగానము విని తరింపగా వేచితిరా
వేచి వేచి యీ వెన్నముద్దవలె కరగిపోయెరా నా బ్రతుకు కరగిపోయెరా నా బ్రతుకు
వెన్న మీగడలు జున్ను పాలకు ఏమి కొరతరా మన యింట
పాలను ముచ్చిలి పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్యా ఈ తల్లి హృదయము ఓర్వలేదయా
ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ యెదురు చూతురా గోపాలా
ఎంత పిలచినా ఎంత వేడినా ఈ నాటికి దయరాదేల
గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల
గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల
https://www.youtube.com/watch?v=6KLid-HkoFc
సరససామదానభేదదండ చతుర సాటి దైవమెవరే బ్రోవవే
పరమ శాంభవాగ్రేసరుండగుచు పల్కు రావణుండు తెలియలేకపోయె
ఓ శ్రీరామా! సందర్భోచితంగా సామదానభేదదండోపాయములలో నిపుణుడవైన నీ సాటి దైవమెవరు, నన్ను బ్రోవుము! శివభక్తులలో అగ్రగణ్యుడనని గొప్పలు చెప్పుకునే రావణుడు నీ మహత్తును తెలుసుకోలేకపోయాడు. యుద్ధ సమయములో హితవైన మాటలను ఎంతో బాగా పలికినావు, తప్పును తెలుసుకుని శరణు కోరినచో శాశ్వతముగా అయోధ్యను కూడా ఇచ్చెదననినావు, దుష్టుడైన రావణుని వీడి నీ శరణు కోరిన అతని సోదరుడు విభీషణుని రాజు చేసినావు, దండోపాయముతో రావణుని హతము చేసినావు, పరమశివునిచే నుతించబడే ఓ శ్రీరామా! నన్ను బ్రోవుము.
- త్యాగరాజస్వామి
శ్రీరామచంద్రుని గుణవైభవాలను మనోజ్ఞంగా ఆవిష్కరించే ఈ కృతిని సద్గురువులు కాపీనారాయణి రాగంలో స్వరపరచారు. ఈ కృతిని రంజని-గాయత్రి సోదరీమణులు అద్భుతంగా ఆలపించారు.
https://www.youtube.com/watch?v=ZSsiWR4W5wA
ఓ శ్రీ చంద్రశేఖర మహాస్వామీ! మీకు పునఃపునః నమస్కారములు. మీరు మంగళప్రదులు, భక్తుల సత్కోరికలను నెరవేర్చి శుభఫలాలను అనుగ్రహించేవారు. శ్రీ చంద్రమౌళీశ్వరుని పరమభక్తితో ఆరాధించే కరుణామూర్తి, వేదశాస్త్రాలలో ప్రవీణులైన మహాచార్యులు, పరమార్థాన్ని బోధించే జగద్గురువులు. మీ సౌమ్యత, దాతృత్వం, ధర్మనిష్ఠ, ప్రశాంత స్వభావం అందరి హృదయాలను ఆకర్షిస్తాయి. భక్తుల జీవితాలను శ్రేయోమార్గంలో నడిపించి వారికి భాగ్యం, ఆనందం, శుభం ప్రసాదిస్తారు. కమలంలా ప్రకాశించే ముఖకాంతితో, మధురమైన ఉపదేశంతో జగత్తును సన్మార్గంలో నడిపిస్తూ, సమస్త జీవులకు సుఖశాంతులను అనుగ్రహించే సర్వవ్యాపక దివ్యస్వరూపులు మీరు. మీకు నమస్కారములు.
- అక్కారై స్వర్ణలత గారి రచన, సంగీతం.
దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన అలంపురం, శైవం–శాక్తేయం రెండింటి వైభవాన్ని ఏకకాలంలో దర్శింపజేసే అరుదైన పుణ్యక్షేత్రం. ఇక్కడ వెలసిన జోగులాంబ అమ్మవారు అష్టాదశ మహా శక్తి పీఠాలలో ఒకరిగా భక్తులచే ఆరాధింపబడుతున్నారు. నవబ్రహ్మేశ్వరాలయాలతో కలిసి ఈ క్షేత్రం భారతీయ ఆధ్యాత్మిక, చారిత్రక, శిల్పకళా సంపదకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచింది.
క్షేత్ర పరిచయం
తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున, కృష్ణా–తుంగభద్రా సంగమానికి సమీపంలో అలంపురం ఉంది. పురాణాలలో ఈ ప్రాంతాన్ని హేమలాపురం, దక్షిణ కాశి, అలాగే శ్రీశైల మహాక్షేత్రానికి పశ్చిమ ద్వారం అని పేర్కొన్నారు. స్కంద పురాణంలో కూడా ఈ క్షేత్ర మహిమ ప్రస్తావించబడింది. ఇక్కడ ఒకవైపు జోగులాంబ అమ్మవారు శక్తి స్వరూపిణిగా కొలువై ఉండగా, మరోవైపు ఏడవ–ఎనిమిదవ శతాబ్దాలకు చెందిన నవబ్రహ్మ శివాలయాలు శైవ సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి.
శక్తి పీఠంగా అలంపురం
పురాణాల ప్రకారం, దక్ష యజ్ఞంలో అవమానానికి గురైన సతీదేవి యోగాగ్నిలో దేహత్యాగం చేసింది. విషాదంలో మునిగిన పరమశివుడు ఆమె దేహాన్ని మోస్తూ తాండవం చేయగా, లోకాల రక్షణార్థం మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. అలంపురంలో సతీదేవి పై దవడ పళ్లు (Upper Teeth) పడినట్లు శాక్తేయ సంప్రదాయం విశ్వసిస్తుంది. అందువల్ల ఈ క్షేత్రం అష్టాదశ మహా శక్తి పీఠాలలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. పూర్వకాలంలో ఈ ప్రాంతం హలంపురం, హేమళాపురంగా పిలువబడేది.
జోగులాంబఅనే పదం తెలుగు పదమైన యోగుల అమ్మనుండి ఉద్భవించిందని పండితులు చెబుతారు. అంటే యోగులకు తల్లి, యోగసాధకులను కాపాడే ఆదిశక్తి అనే భావన. ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపంలో దర్శనమిస్తారు. శవంపై ఆసీనురాలై, తలపై తేలు, బల్లి, కప్ప వంటి ప్రతీకలతో కనిపించడం విశేషం. ఇవి జీవన–మరణ చక్రం, ప్రకృతిలోని భయాలను అధిగమించే దివ్యశక్తికి సంకేతాలుగా భావిస్తారు.
చారిత్రక కాలక్రమం (Timeline)
క్రీస్తుశకం 7వ శతాబ్దం బాదామి చాళుక్యుల పాలనలో జోగులాంబ ఆలయం మరియు నవబ్రహ్మ శివాలయాలు నిర్మించబడ్డాయి. ఆ కాలంలో అలంపురం దక్షిణ భారతదేశంలో ప్రముఖ శైవ–శాక్త కేంద్రంగా అభివృద్ధి చెందింది. 7వ–9వ శతాబ్దాల మధ్య చాళుక్యులు తొమ్మిది శివాలయాలను నిర్మించారు. వీటినే నవబ్రహ్మ ఆలయాలు అంటారు. ఇవి భారతీయ దేవాలయ శిల్పకళలో ప్రారంభ దశ నాగర శైలికి అద్భుత ఉదాహరణలుగా నిలిచాయి. 14వ శతాబ్దం (సుమారు 1390 ఛే)సమయంలో బహమనీ దండయాత్రల సమయంలో అసలు జోగులాంబ ఆలయం ధ్వంసమైంది. అయితే భక్తులు అమ్మవారి మూలవిగ్రహాన్ని రక్షించి సమీపంలోని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో శతాబ్దాల పాటు భద్రపరిచి నిత్యపూజలు కొనసాగించారు. దాదాపు ఆరు శతాబ్దాల తరువాత 2005లో ఆధునిక ఆలయం నిర్మించి, పురాతన విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించారు. అప్పటి నుండి జోగులాంబ అమ్మవారు మళ్లీ స్వస్థానంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
నవబ్రహ్మ ఆలయాల విశిష్టత
అలంపురంలోని తొమ్మిది శివాలయాలు: బాల బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, కుమార బ్రహ్మ, గరుడ బ్రహ్మ, విశ్వ బ్రహ్మ, తారక బ్రహ్మ. ఈ ఆలయాలు ఎర్రరాతితో నిర్మించబడి, ఉత్తర భారత నాగర శైలి మరియు దక్షిణ భారత ద్రావిడ శైలుల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తాయి. బాలబ్రహ్మేశ్వర ఆలయంలో నేటికీ నిత్యపూజలు కొనసాగుతున్నాయి.
ఆధ్యాత్మిక విశిష్టత
అలంపురం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శివుడు మరియు శక్తి ఒకే క్షేత్రంలో సమాన ప్రాధాన్యంతో ఆరాధింపబడుతున్నారు. భక్తులు ముందుగా జోగులాంబ అమ్మవారిని దర్శించి, అనంతరం బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించడం సంప్రదాయంగా భావిస్తారు.
ఈ క్షేత్ర దర్శనంతో శత్రు బాధలు తొలగుతాయని, గ్రహదోషాలు శాంతిస్తాయని, యోగసిద్ధి, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందని, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం.
ముఖ్య ఉత్సవాలు
జోగులాంబ ఆలయంలో సంవత్సరం పొడవునా పూజలు జరుగుతున్నప్పటికీ ముఖ్యంగా ఆశ్వయుజ నవరాత్రులు, విజయదశమి, మహాశివరాత్రి, కార్తీకమాస ప్రత్యేక పూజలు, శక్తి హోమాలు, చండీ పారాయణాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భాలలో వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివస్తారు.
శిల్పకళా ప్రాముఖ్యం
నవబ్రహ్మ ఆలయాలు భారత పురావస్తు శాఖ (ASI) సంరక్షణలో ఉన్న ప్రముఖ చారిత్రక కట్టడాలు. చాళుక్యుల ప్రారంభ దేవాలయ నిర్మాణ శైలికి ఇవి గొప్ప నిదర్శనాలు. పట్టడకల్, ఐహోళె వంటి కర్ణాటక దేవాలయాల అభివృద్ధికి పూర్వ రూపంగా అలంపురం ఆలయాలను పరిశోధకులు పేర్కొంటారు.
కూడవెల్లి సంగమేశ్వర ఆలయం – చాళుక్యుల ప్రాచీన శైవ సంపద
అలంపురం పుణ్యక్షేత్రంలో జోగులాంబ అమ్మవారి ఆలయం, నవబ్రహ్మ దేవాలయాలతో పాటు అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాలలో కూడవెల్లి (కూడలి) సంగమేశ్వర స్వామి ఆలయం ఒకటి. సంగమేశ్వరఅనే పేరు సంగమంఅనే పదం నుండి ఉద్భవించింది. ఒకటి కంటే ఎక్కువ పవిత్ర నదులు కలిసే ప్రాంతానికి సంగమం అని పేరు. ఈ ఆలయం మొదట కృష్ణా–తుంగభద్రా నదుల సంగమానికి సమీపంలోని కుడవెల్లి గ్రామంలో నిర్మించబడింది. శాసనాధారాల ప్రకారం ఇది అలంపురంలోని చాళుక్య దేవాలయాలలో అత్యంత ప్రాచీనమైన నిర్మాణంగా భావించబడుతోంది. చాళుక్యుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం శైవ ఆరాధనకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా అసలు స్థలం జలాశయంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడడంతో, భారత పురావస్తు శాఖ (ASI) 1979–1990 మధ్యకాలంలో ఆలయాన్ని రాతి రాయిగా విడదీసి, ప్రస్తుత అలంపురం సమీపానికి తరలించి యథాతథంగా పునర్నిర్మించింది. భారతదేశంలో విజయవంతంగా పునఃస్థాపించబడిన ప్రాచీన దేవాలయాలలో ఇది ఒక విశిష్ట ఉదాహరణగా గుర్తింపు పొందింది.
ఆలయం తూర్పు ముఖంగా నిర్మించబడింది. గర్భగృహం, అంతరాలయం, మండపం, నంది మండపం, శిల్పాలతో అలంకరించిన స్తంభాలు చాళుక్య శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. గంగ, యమునా, శివుని వివిధ రూపాలు, మకరతోరణాలు, హంసతోరణాలు వంటి శిల్పాలు విశేష ఆకర్షణగా నిలుస్తాయి. భక్తుల విశ్వాసం ప్రకారం సంగమేశ్వర స్వామిని దర్శించడం ద్వారా పితృదేవతల అనుగ్రహం, పాప విమోచనం, కుటుంబ శ్రేయస్సు లభిస్తాయి. ముఖ్యంగా మహాశివరాత్రి, కార్తీకమాసం సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు.
పాపనాశి దేవాలయ సముదాయం – పాపాలను హరించే పవిత్ర క్షేత్రం
అలంపురానికి నైరుతి దిశలో సుమారు 1.5 కి.మీ. దూరంలో ఉన్న పాపనాశి దేవాలయ సముదాయం చాళుక్యుల తరువాత రాష్ట్రకూటులు మరియు పశ్చిమ చాళుక్యుల కాలంలో, సుమారు 9వ నుండి 11వ శతాబ్దాల మధ్య నిర్మించబడింది. ఈ సముదాయంలో ప్రస్తుతం 23 ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా శివునికి అంకితం చేయబడినప్పటికీ, విష్ణు, దేవి మరియు ఇతర దేవతలకు సంబంధించిన శిల్పాలు కూడా కనిపిస్తాయి. ఈ సముదాయంలోని ప్రధాన ఆలయం పాపనాశీశ్వర స్వామి ఆలయం. పాపనాశిఅనే పేరుకు అర్థం పాపాలను నశింపజేసేవాడు. ఈ క్షేత్రంలో భక్తిశ్రద్ధలతో స్నానం చేసి, శివుని దర్శించి పూజలు చేస్తే జన్మజన్మాంతర పాపాలు తొలగుతాయని విశ్వాసం. అందుకే ఈ ప్రాంతానికి పాపనాశిఅనే పేరు వచ్చింది. ఈ ఆలయాలు ప్రధానంగా నాగర శిల్పశైలిలో నిర్మించబడ్డాయి. గర్భగృహాలు, మండపాలు, నంది విగ్రహాలు, నాట్యమూర్తి శివుడు (నటరాజ), సప్తమాతృకలు, సముద్రమథనం వంటి పురాణ ఘట్టాలను ప్రతిబింబించే శిల్పాలు భారతీయ దేవాలయ కళకు అపూర్వ నిదర్శనాలు. శ్రీశైలం జలాశయ నిర్మాణంతో ఈ ఆలయాల అసలు ప్రదేశం మునిగిపోయే ప్రమాదం ఏర్పడడంతో, భారత పురావస్తు శాఖ 1980లలో ఈ దేవాలయాలను శాస్త్రీయ పద్ధతిలో విడదీసి ఎత్తైన ప్రదేశానికి తరలించి పునర్నిర్మించింది. ఈ పునఃస్థాపన భారతీయ వారసత్వ సంరక్షణలో ఒక గొప్ప విజయంగా పరిగణించబడుతుంది.
యాత్రికులకు ఉపయోగకరమైన సమాచారం
రాష్ట్రం: తెలంగాణ
జిల్లా: జోగులాంబ గద్వాల
సమీప నగరం: కర్నూలు (సుమారు 27 కి.మీ.)
హైదరాబాద్ నుండి దూరం: సుమారు 220 కి.మీ.
సమీప నదులు: తుంగభద్రా – కృష్ణా సంగమం
ప్రత్యేకతలు: అష్టాదశ మహా శక్తి పీఠం, నవబ్రహ్మ శివాలయాలు, దక్షిణ కాశి, శ్రీశైల పశ్చిమ ద్వారం.