దక్షిణ భారత భక్తి సాహిత్య చరిత్రలో భక్తి, జ్ఞానం, వైరాగ్యం, నామస్మరణలను సమన్వయపరచిన మహనీయులలో కైవార నారాయణ యంతీంద్రులు, భక్తులలో కైవార తాతయ్యగా ప్రసిద్ధి చెందిన యోగివరుడు, విశిష్ట స్థానం పొందారు. ఆయన జీవితం ఒక యోగి జీవితమే కాదు; భగవన్నామం మానవ జీవితాన్ని ఎలా పరిపూర్ణం చేస్తుందో చూపించిన ప్రత్యక్ష సాక్ష్యం. తెలుగు, కన్నడ భాషల్లో ఆయన రచించిన కీర్తనలు, శతకాలు, తాత్విక రచనలు నేటికీ భక్తులను, సంగీతాభిమానులను, వేదాంత జిజ్ఞాసువులను సమానంగా ఆకర్షిస్తున్నాయి.
కైవార నారాయణ యతీంద్రులు నారాయణప్ప అనే పేరుతో క్రీ.శ. 1726 ప్రాంతంలో నేటి కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపుర సమీపంలోని కైవార గ్రామంలో కొండప్ప, ముద్దమ్మ దంపతులకు జన్మించారు. ఆయన జన్మించిన కాలం దక్షిణ భారతదేశంలో రాజకీయ, సామాజిక మార్పులు చోటుచేసుకుంటున్న సమయం. ఒకవైపు విజయనగర సామ్రాజ్య పతనానంతర పరిస్థితులు, మరోవైపు స్థానిక పాలకుల ఆధీనంలో ప్రజల జీవనం కొనసాగుతున్న కాలంలో భక్తి ఉద్యమం ప్రజలకు ఆధ్యాత్మిక బలాన్ని అందించింది. అలాంటి నేపథ్యంలో జన్మించిన నారాయణప్ప చిన్ననాటి నుంచే అసాధారణమైన ఆధ్యాత్మిక ప్రవృత్తిని ప్రదర్శించారు.
ఇతర పిల్లలు ఆటపాటలలో కాలం గడిపినప్పుడు ఆయన ఆలయాలలో గడపడం, పురాణ కథలు వినడం, విష్ణునామ స్మరణ చేయడం, పెద్దలతో ధర్మశాస్త్రాల గురించి ప్రశ్నించడం ఇష్టపడేవారు. చిన్న వయస్సులోనే తెలుగు, కన్నడ, సంస్కృత భాషలను అభ్యసించి రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, ఉపనిషత్తులు వంటి మహాగ్రంథాలను అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం వల్ల ఆయనలో భక్తితో పాటు వేదాంత జిజ్ఞాస కూడా పెరిగింది.
యౌవనానికి చేరుకున్న తరువాత ప్రపంచంలోని సుఖసంపదలు శాశ్వతం కావని ఆయన గ్రహించారు. మనిషి జననం, మరణం, సుఖం, దుఃఖం అన్నీ కాలచక్రంలో భాగాలని తెలుసుకొని వైరాగ్యాన్ని స్వీకరించారు. నిశ్శబ్దమైన ప్రదేశాలలో తపస్సు, యోగసాధన, ధ్యానం, నామజపం, గురుసేవల ద్వారా అంతర్ముఖ జీవితం ప్రారంభించారు. భక్తి లేకుండా జ్ఞానం అసంపూర్ణమని, జ్ఞానం లేకుండా భక్తి స్థిరపడదని ఆయన సాధన ద్వారా అనుభవించారు.
సంప్రదాయం ప్రకారం ఆయనకు అక్కడి దైవమైన అమర నారాయణ స్వామి ప్రత్యక్షానుభూతి కలిగింది. ఆ అనుభవం తరువాత ఆయన జీవితమంతా మారిపోయింది. దేవుని దర్శనం కన్నా దేవుని నామంలో లీనమవడమే పరమానందమని ఆయన గ్రహించారు. అందుకే ఆయన రచనలన్నింటిలోనూ నామస్మరణకు అత్యున్నత స్థానం కనిపిస్తుంది. ఆయనకు యోగసిద్ధులు ఉన్నాయని, అనేక అద్భుతాలు చేశారని స్థానిక సంప్రదాయాలు చెబుతున్నప్పటికీ, ఆయన తనను ఎప్పుడూ మహాయోగిగా ప్రకటించుకోలేదు. తాను భగవంతుని దాసుడనని మాత్రమే చెప్పుకున్నారు.
తపస్సు అనంతరం ఆయన కైవారలో స్థిరపడి ప్రజలకు ధర్మబోధ ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు క్లిష్టమైన వేదాంత విషయాలను అత్యంత సరళమైన భాషలో వివరించేవారు. కలియుగంలో నామస్మరణే మోక్షానికి సులభమైన మార్గమని, గురుభక్తి ఆధ్యాత్మిక జీవితానికి పునాదని, ప్రతి జీవిలోనూ నారాయణుడే ఉన్నాడని ఆయన బోధించారు. కుల, మత, ఆర్థిక భేదాలకు అతీతంగా అందరినీ సమానంగా ఆదరించారు. భగవంతుని సేవ అంటే మానవసేవేనని ఆయన జీవితం ద్వారా తెలియజేశారు.
కైవార తాతయ్య రచనలు భక్తి సాహిత్యంలో ప్రత్యేక స్థానం పొందాయి. అమర నారాయణ శతకం, నాదబ్రహ్మానంద శతకం, తారక బ్రహ్మానంద శతకం, వేదాంత సారావళి, కాలజ్ఞాన రచనలు, అనేక తెలుగు, కన్నడ కీర్తనలు ఆయన ఆధ్యాత్మిక సంపదకు నిదర్శనాలు. ఈ రచనలన్నింటిలోనూ భక్తి, జ్ఞానం, వైరాగ్యం, గురుభక్తి, నామమహిమ ప్రధానాంశాలుగా కనిపిస్తాయి.
ఆయన ప్రసిద్ధ కీర్తనలలో శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి ఒక అద్భుతమైన నామసంకీర్తన. ఈ కీర్తన పల్లవి ఇలా ప్రారంభమవుతుంది.
శ్రీ కృష్ణాయను నామ మంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటికో
శ్రీ గురుపాదాబ్జంబులు మదిలో స్థిరముగ నిలిచేదెన్నటికో
మరవక మాధవు మహిమలు పొగడే మర్మము తెలిసేదెన్నటికో
హరి హరి హరి హరి హరి నామామృత పానము చేసేదెన్నటికో
కమలాక్షుని నా కన్నులు చల్లగ గని సేవించేదెన్నటికో
లక్షణముగ శ్రీలక్ష్మీరమణుని దాసుడనయ్యేదెన్నటికో
పంచాక్షరీ మంత్రము మదిలో పఠియించుట ఇంకెన్నటికో
ఆదిమూర్తి శ్రీ అమరనారేయన భక్తుడనయ్యేదెన్నటికో
ఈ కృతి మొత్తంలో కైవార తాతయ్య ఆధ్యాత్మిక అనుభవం ప్రతిబింబిస్తుంది. సాధారణ భక్తుడు దేవుని వద్ద ఆరోగ్యం, సంపద, సంతానం, విజయాలు కోరుకుంటారు. కానీ కైవార తాతయ్య వాటిలో ఏదీ కోరలేదు. భగవంతుని నామంలో నిజమైన రుచి కలగాలని మాత్రమే ప్రార్థించారు. ఇక్కడ రుచి అనే పదం చాలా లోతైనది. నామాన్ని కేవలం ఉచ్చరించడం కాదు; ఆ నామమే జీవనాధారంగా, శ్వాసగా, ఆనందస్వరూపంగా మారే స్థితిని ఆయన కోరుకున్నారు.
ఈ కృతిలో తరువాత గురుపాద సేవలో స్థిరపడాలని, హరినామామృతాన్ని ఆస్వాదించాలని, కమలాక్షుని దర్శించాలనే తపన కలగాలని, లక్ష్మీరమణుని నిజమైన దాసుడిగా జీవించాలని కవి ప్రార్తించారు. ఈ క్రమంలో భక్తి యొక్క సంపూర్ణ సాధన కనిపిస్తుంది. ముందుగా గురుకృప, తరువాత నామస్మరణ, ఆ తరువాత మనోశుద్ధి, చివరకు భగవత్సాక్షాత్కారం అనే ఆధ్యాత్మిక పరిణామాన్ని ఈ కీర్తన ఎంతో సహజంగా ప్రతిపాదిస్తుంది. ఈ కీర్తనలో ఎక్కడా ఆర్భాటం లేదు. అనుభవం మాత్రమే ఉంది.
మరో ప్రసిద్ధ కృతి వేంకటాచల రమణ. ఈ కీర్తన పల్లవి భక్తి, కవిత్వం, దైవసౌందర్యం మూడింటినీ సమన్వయపరుస్తుంది.
వేంకటాచల రమణ సామజ ప్రియ కరుణ
మకర కుండలాభరణ మారీచు మద హరణ
హర చాప కరఖండ అఖిలాండ రక్షకుండ
కృపజూడు నను నిండ కోదండ దోర్దండ
వాల్మీకి భక్తపోష వైకుంఠ పురవాస
ఇనకోటి సంకాశ ఇందిరా హృదయేశ
శ్రీ రుక్మిణీ లోల ఆశ్రితజన పరిపాల
నమ్మితి నిను చాలా దాయజూడు గోపాలా
నాల్గుయుగములందు నీ నామమే ముందు
ప్రియ భక్తులకు పొందు దురితములకు మందు
రాతి నాతిగా చేసి రవిసుతుని పగదీర్చి
కైవరాధిపుడైన శ్రీఅమరనారేయణ
ఈ కృతిలో కవి తన అనన్యమైన భక్తిని వ్యక్తపరచరారు. వేంకటాచల రమణ అని సంబోధించడం ద్వారా తిరుమల శ్రీనివాసుడిని సర్వలోక శరణ్యుడిగా దర్సించారు. సామవేదాన్ని ఆస్వాదించే స్వామి కరుణామూర్తి అని, మకరకుండలాభరణ అనే విశేషణం భగవంతుని దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానంలో నిలిపే చిత్రణ.
ఈ కృతి చరణాలలో శ్రీరాముని ధర్మపాలన, రావణ సంహారం, సీతారాముల ఆదర్శం, భక్తరక్షణ వంటి అనేక పురాణ ఘట్టాలను సంక్షిప్తంగా స్మరింపజేస్తుంది. రాముడు, కృష్ణుడు, నారాయణుడు, వేంకటేశ్వరుడు వేర్వేరు దేవతలు కాదని, పరబ్రహ్మ స్వరూపానికి వివిధ అవతారరూపాలని కవి సూచించారు.
ఈ రెండు కీర్తనలను పరిశీలిస్తే కైవార తాతయ్య తత్వం స్పష్టమవుతుంది. ఒక కృతిలో నామమహిమను, మరొక కృతిలో శరణాగతి మహిమను ప్రతిపాదించారు. ఒకదానిలో అంతర్ముఖ భక్తి ఉంటే, మరొకదానిలో భగవంతుని సాకార సౌందర్యానుభూతి కనిపిస్తుంది. ఈ రెండింటి అంతిమ లక్ష్యం మాత్రం ఒక్కటే. భక్తుని హృదయాన్ని భగవంతునితో ఏకం చేయడం.
కైవార నారాయణ యతీంద్రుల జీవితంలో గొప్పతనం ఆయన యోగసిద్ధులలో కాదు; ఆయన వినయంలో ఉంది. ఆయన కీర్తనలు సంగీతరచనలు మాత్రమే కావు. అవి సాధకుని అంతర్ముఖ యాత్రకు మార్గదర్శకాలు. ప్రతి పదంలో అనుభవం, ప్రతి భావంలో భక్తి, ప్రతి సందేశంలో వేదాంతం ప్రతిధ్వనిస్తాయి. అందుకే రెండు శతాబ్దాలు గడిచినా ఆయన రచనలు నేటికీ సజీవంగా ఉన్నాయి.
కైవార నారాయణ తాతయ్య సుమారు క్రీ.శ. 1836లో, దాదాపు 110 సంవత్సరాల వయస్సులో, తాను ముందుగానే నిర్ణయించిన రోజున యోగసమాధిని (ఇచ్ఛామరణం) స్వీకరించారు. ఆ రోజు కూడా ఆయన ఎప్పటిలాగే భక్తులకు ఉపదేశం చేసి, సాయంత్రం గాఢధ్యానంలో కూర్చొని, అర్థరాత్రి పరబ్రహ్మలో లీనమయ్యారని ఆయన శిష్యపరంపర వర్ణించింది. మరుసటి రోజు ఆయన పవిత్ర దేహాన్ని గ్రామ ప్రదక్షిణగా తీసుకువెళ్లి, ఆయన సూచించిన ప్రదేశంలో బృందావన సమాధిని నిర్మించారు. కాలక్రమేణా ఆ సమాధి చుట్టూ యోగి నారాయణ ఆశ్రమం, ప్రార్థనా మండపం, నిత్యపూజా వ్యవస్థలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం సమాధి మందిరం భక్తులకు ప్రధాన దర్శనస్థలంగా ఉంది. ఈ ఆశ్రమ అభివృద్ధిలో స్థానిక భక్తులతో పాటు తరువాతి కాలంలో సేవా సంస్థలు, ముఖ్యంగా ఎం.ఎస్. రామయ్య ట్రస్ట్, ముఖ్యపాత్ర పోషించి, ఆలయ ప్రాంగణాన్ని విస్తరించడం, యాత్రికులకు వసతి, అన్నదానం వంటి సదుపాయాలను ఏర్పాటు చేశాయి. నేటికీ ప్రతి సంవత్సరం ఆయన ఆరాధనోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు సమాధి వద్దకు చేరుకుని, కైవార తాతయ్యను యోగి, జ్ఞాని, భక్తకవిగా స్మరిస్తూ నివాళులర్పిస్తారు.
తెలుగు నాట మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కైవార నారాయణ యతీంద్రుల కృతులను ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. ఆయన తరువాత ప్రిన్స్ రామవర్మ గారు ఈ మహత్తరకార్యంలో అద్భుతమైన సేవ చేస్తున్నారు. బాలమురళీకృష్ణ గారు ఆలపించిన శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి, వేంకటాచలరమణ







.jpeg)







