8, ఫిబ్రవరి 2026, ఆదివారం

త్యాగరాజ హృదయం


 

త్యాగయ్య మామూలు మానవునిలా దుర్భర మరణం పొందలేదు, 10 రోజుల ముందే భద్రాద్రి రాముని గాంచి, గిరిపై నెలకొన్న అనే కృతి ద్వారా ఆ సాక్షాత్కారానికి శాశ్వతత్వాన్ని ఆపాదించి, ఆ స్వామి సూచనను గ్రహించి తన మరణ ఏర్పాట్లను చేసుకున్నాడు, శిష్యులందరూ చూస్తుండగా స్వేచ్ఛగా ఆత్మ దేహాన్ని వీడేంత ఆధ్యాత్మిక శక్తిని సంపాదించుకున్నాడు. అందుకే 250 ఏళ్లు గడిచినా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. మరో 1000 ఏళ్లు గడిచినా ముందు తరాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. త్యాగరాజ హృదయాన్ని ఆయన శిష్యులు ఎందరో అక్షర రూపంలో ఆవిష్కరించారు. త్యాగయ్య ఆఖరి రోజుల స్థితికి కేశవ్ గారి చిత్రం చూడండి. 

పులకాంకితుడై యానందాశ్రువుల నింపుచు మాటలాడవలెనని
కలువరించ గని పది పూటల పై గాచెదనను త్యాగరాజ వినుతుని

గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక గంటి భద్రగిరిపై నెలకొన్న!

ఎక్కడో తంజావూరు దగ్గర ఉన్న త్యాగరాజస్వామికి భక్త రామదాసు, ఆయన కొలిచిన భద్రాద్రి రాముని గురి ఎలా తెలిసి, కృతిలో వర్ణించగలిగారు? అదే కదా, భారతీయ ఆధ్యాత్మికతలోని గొప్పతనం. ఏ ప్రచార సాధనం లేని రోజుల్లో దివ్యదృష్టి ద్వారా, నోటి మాట ద్వారా పుంఖానుపుంఖాల విషయాలు, గ్రంథాలు దేశమంతా సద్గురువుల ద్వారా, సత్పురుషుల ద్వారా చాటబడేవి. 

గమనిక: భద్రాద్రి రాముడు రామదాసునే కాదు, ఆ తరువాత కాలంలో వచ్చిన త్యాగయ్యను కూడా బ్రోచాడన్నదానికి ఈ కృతి నిదర్శనం.  

కులదైవం - ఇష్టదైవం


కులదైవం
========

ఇది నేను చెప్పే విషయం కాదు, కొన్నాళ్ల క్రితం గురువు గారి చెప్పినది, యథాతథంగా రాసే ప్రయత్నం చేశాను. శ్రీగురుభ్యోనమః.

సనాతనధర్మ సాంప్రదాయాలను అనుసరించే ప్రతి వ్యక్తికి కూడా కులదైవం ఉంటుంది. అది ఎవరు అనేది మన తల్లిదండ్రులకు, పూర్వీకులకు, మన స్వగ్రామంలో ఉండేవారికి తెలుస్తుంది. ఒకవేళ వారికి తెలియకపోతే ఏమిటి అన్న కోణం వైపు చివర్లో దృష్టి పెడదాము. 

అసలు కులదైవం అంటే? మన జన్మకు, మన కుటుంబ నేపథ్యానికి సంబంధించిన దేవత. మన గతం గురించి అన్నీ ఎరిగి నిరంతరం వెన్నంటి ఉండే దేవత. పూర్వజన్మ కర్మఫలాలను బట్టే ప్రస్తుత జన్మ కుటుంబ నేపథ్యం. దాన్ని శాసించేది కులదేవత. బాగా ఉపాసన చేసి బాహ్యాభ్యంతర శుచి కలిగిన వారికి కులదేవత అనుగ్రహం, దర్శనం కలిగి తీరుతుంది. జ్ఞానులకు, అవధూతలకు, సద్గురువులకు ఈ కులదేవత కనబడుతుంది. అంతే కాదు, ఆ దేవత ఆ కుటుంబం లేదా వ్యక్తులపై ఎటువంటి వీక్షణంతో ఉంది అన్నది కూడా వారు చెప్పగలరు. కులదేవతలకు లెఖ్ఖలు ఉంటాయి. అందుకే కొన్నిసార్లు వారిని ఉపాసన చేయని మనుషులను తెలియని సమస్యలు పట్టిపీడిస్తుంటాయి. 

అందుకే, ధార్మికులకు సంధ్యావందనం లాంటి నిత్యకర్మలతో పాటు కులదేవతా ఉపాసన కూడా చాలా ముఖ్యం. తెలియని పీడలు, బాధలు అంతగా ప్రభావం చూపకుండా ఉంచేది కులదేవతే. పితృదేవతలు ఎలాగైతే వంశాభివృద్ధినిస్తారో అలాగే కులదేవతలు ఈతిబాధల నుండి, ఋణబాధల నుండి ఉపశమనం కలిగిస్తారు. 

గమనిక - అందరికీ తిరుమల శ్రీనివాసుడు కులదైవం కాదు. కొందరికి నారసింహుడు, కొందరికి శివుడు, కొందరికి లలిత, కొందరికి సుబ్రహ్మణ్యస్వామి, కొందరికి గణపతి, కొందరికి వీరభద్రుడు, మరికొందరికి సూర్యనారాయణుడు, కొందరికి భద్రకాళి, ఇంకొందరికి చండి, ఇంకొందరికి ఆంజనేయుడు. ఖచ్చితంగా ఆ రూపాన్ని తెలుసుకొని కొలువవలసిందే. అన్నీ ఉన్నా మనశ్శాంతి లేకపోవటం, ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమవ్వటం, తెలియని అనారోగ్యాలు, కీచులాటలు..ఇటువంటివి కులదేవతను ఉపాసన చేయని ఫలితాలే. కులదైవం సాధారణంగా మన పూర్వీకులు నివసించిన ప్రాంతానికి సమీపంలో వెలసి ఉంటుంది. ఫలానా వేణుగోపాలస్వామి మా కులదైవం అని ఎవరైనా చెప్పారనుకోండి - దాని అర్థం వారి పూర్వీకులలో ఎవరో ఆ దేవతానుగ్రహాన్ని పొంది తరించి ఆ మార్గాన్ని తరువాతి తరాలకు చెప్పటం వల్లనే.   

చాలామటుకు కులదైవం వంశపారంపర్యంగా ఆస్తికులైతే తెలిసే అవకాశం ఉంది. ధర్మభ్రష్టులై కుటుంబంలో ఏ దేవుళ్ళను ఉపాసన చేశారు అన్న విషయాన్ని ఎక్కడో త్యజించిన వారి తరువాత తరాలవారికి కులదేవత ఎవరో తెలియకపోవచ్చు. అలాంటి వారికి పైన చెప్పినట్లు గురువులు, అవధూతలు, జ్ఞానులు, సిద్ధులు కులదైవాన్ని గుర్తించి చెప్పగలరు. ఒకవేళ ఆ అవకాశం లేఅకపోతే నిత్యం ఇంట్లో దీపం పెట్టి నన్ను అనుగ్రహించి నీ రూపాన్ని తెలుపు అని ప్రార్థిస్తే ఖచ్చితంగా కులదేవత సంకేతాలు పంపి మనకు దారి చూపుతుంది. 

ఇష్టదైవం:
=======

ఇష్టదైవం అనేది ఊరికే నిర్ణయించబడదు. పూర్తిగా మన పూర్వజన్మల వాసనలను బట్టే మనకు కొన్ని దైవాల మీద మక్కువ, నమ్మకం ఏర్పడుతుంది. ఉదాహరణకు నేను గత జన్మలో అమ్మవారిని పూజించినా లేక అటువంటి కర్మలలో పాల్గొన్నా లేక అనుభూతులు చెందినా, ఆ వాసనలు ఈ జన్మలో కూడా కొనసాగుతాయి. తెలియకుండానే ఆ దైవానికి ఆకర్షించబడతాము. అందుకే ఇది పూర్తిగా ఆత్మప్రబోధమైనదే. 

ఇష్టం దైవం ఉపాసన ఊరికే పోదు. అలాగే, కులదైవాన్ని విస్మరిస్తే అనుకున్న ఫలితాలు పూర్తిగా రావు. కులదైవం తెలియకపోతే ఒక్కొక్కసారి ఈ జన్మ కాలం పాటు ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉంటే మనకు ఎప్పుడో ఒకప్పుడు కులదైవం ఇష్టదైవం ద్వారా గోచరమవుతుంది. కులదైవం గురించి వ్రాసిన పోస్టులో దీపారాధన చేసి ఆ దీపజ్యోతిని కులదైవం అవగతమయ్యేలా చేయమని ప్రార్థించాలని చెప్పాను. మనకున్న సగుణోపాసనలో దీపారాధన అనేది చాలా ముఖ్యమైనది ఇటువంటి కారణాల వల్లే. 

సారాంశం: మనిషిగా జన్మించాక ఆస్తికత చాలా ముఖ్యం. ఇలా కుల ఇష్టదైవాలను ఇతోధికంగా పూజిస్తే కామ్యములు తీరతాయి, కర్మలను సక్రమంగా నిర్వర్తించగలము, ఉన్నతమైన జన్మలను పొందగలము.  

7, ఫిబ్రవరి 2026, శనివారం

శృంగేరి శారదా పీఠాధిపతులు చంద్రశేఖర భారతీస్వామి చరిత్ర



సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాఙ్ముఖం
నౌమి శాస్త్రేషు నిష్ణాతం చన్ద్రశేఖరభారతీం


ఇంద్రియ విషయములకు అతీతులై నిరంతరం ధ్యానమగ్నులై వేదవిద్యా నిష్ణాతులై జీవించిన చంద్రశేఖర భారతీస్వామి వారికి నమస్సులు.

ఈ కర్మభూమిపై గత శతాబ్దకాలంలో జీవన్ముక్తులైన మహాత్ములు కొద్దిమందిలో శృంగేరి శారదాపీఠం 34వ అధిపతులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర భారతీ తీర్థ స్వామి వారు ఒకరు. మహాలయ ఆమావాస్య, వారి పుణ్యతిథి. మన పుణ్యభూమిపై నడయాడిన ఆ మహనీయుని వివరాలు సంక్షిప్తంగా:

శృంగేరి పుణ్యక్షేత్రంలో ఈశ్వరి గోపాలశాస్త్రి మరియు లక్ష్మమ్మ దంపతులు ఉండేవారు. వారికి 11 మంది బిడ్డలు జన్మించినా ఒక్కరూ బతకలేదు. అప్పటి శృంగేరి శారదా పీఠాధిపతులైన సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి వారిని ఆశ్రయించగా స్వామి వారు వారిని అనుగ్రహించి సత్సంతానం కలుగుతుందని ఆశీర్వదించారు. ఆ సంతానం వల్ల తల్లిదండ్రులతో పాటు శృంగేరి సంస్థానానికి, భరతభూమికి మేలు కలుగుతుందని, కాబట్టి అతనిని శారదాంబ సేవకు అంకితం చేయమని సూచించారు. గోకర్ణం తీర్థయాత్ర వెళుతున్న దంపతులకు మహాబలేశ్వరుడు స్వప్న సాక్షాత్కారమిచ్చి పురుష సంతానం కలుగుతుందని చెబుతాడు. 1892వ సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన, నందన నామ సంవత్సరం ఆశ్వయుజ బహుళ ఏకాదశి నాడు వారికి మగబిడ్డ జన్మించాడు. స్వామి వారి అనుగ్రహంతో ఆ తల్లిదండ్రులు బాలునికి నరసింహశాస్త్రి అని నామకరణం చేశారు.

పువ్వు పుట్టగానే పరిమళించినట్లు దైవానుగ్రహంతో జన్మించిన నరసింహశాస్త్రి చిన్ననాటి నుండే ప్రాపంచిక విషయాల పట్ల నిరాసక్తితో, పూర్తిగా అంతర్ముఖుడై జ్ఞాన సముపార్జనలోనే ఉండేవాడు. శృంగేరి శారదాపీఠం కార్యనిర్వాహకులైన శ్రీకంఠ శాస్త్రి గారి వద్ద నివసిస్తూ విద్యాభ్యాసం చేశాడు. చిన్ననాటి నుండి నరసింహకు మూకపంచశతి అంటే మహా ప్రీతి. దానిని పఠిస్తూ తన్మయత్వంలో ఉండేవాడు. అలా ఒకసారి దానిని పఠిస్తూ బాహ్యప్రపంచాన్ని మరచి శృంగేరి పరిసరాలను దాటి కూడా వెళ్లాడు. నరసింహశాస్త్రికి బాలమేధావి, అమితమైన జిజ్ఞాస మరియు జ్ఞాపకశక్తి కలవాడు. ఆంగ్లభాషను పాఠశాలలో, సంస్కృతాన్ని ఇంట్లో తండ్రి వద్ద అభ్యసించాడు. నరసింహునికి ఎనిమిదవ ఏట బ్రహ్మోపదేశం హరిగింది. త్రికాల సంధ్య, ద్వికాల అగ్నికార్యం చేసే క్రమశిక్షణకు ఆ వయసులోనే నరసింహుడు అలవాటు పడ్డాడు. 11వ ఏట పీఠాధిపతుల సూచనతో నరసింహుడు శృంగేరిలోని సద్విద్యా సంజీవని సంస్కృత పాఠశాలలో చేరారు. ఆ స్వామి వారే బెంగళూరులో స్థాపించిన భారతీయ గీర్వాణ ప్రౌఢ విద్యా అభివర్ధని పాఠశాలలో మీమాంస మరియు వేదాంతములలో ఉన్నత విద్యనభ్యసించారు. ఆ గురువుల మనోసంకల్ప ఫలంగా నరసింహుడు అద్భుత విద్యా ప్రావీణ్యంతో చంద్రశేఖర భారతీస్వామిగా 1912లో ఉత్తరాధికారిగా నియమించబడ్డారు. ఆ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో శివాభినవ నృసింహభారతీ స్వామి వారు విదేహముక్తి పొందగా చంద్రశేఖర భారతీస్వామి వారు శృంగేరి శారదా పీఠం 34వ అధిపతిగా పీఠాన్ని అధిరోహించారు.

వీరి హయాంలోనే శృంగేరి శారదా పీఠ నవీకరణ, శివాభినవ నృసింహ భారతీ స్వామి వారి స్మృతిగా నృసింహవనం రూపొందాయి. 1916వ సంవత్సరంలో మైసూరు మహారాజా వారి సమక్షంలో శారదా క్షేత్రానికి కుంభాభిషేకం జరిగింది. 1924 వారు మైసూరు, తమిళనాడు, కేరళ ప్రాంతాలలో విజయ యాత్ర చేశారు. 1927లో ఆదిశంకరుల జన్మస్థలమైన కాలడిలో వేదాంత పాఠశాలను స్థాపించారు. మైసూరు ట్రావంకోర్ సంస్థానాలలో పర్యటించిన తరువాత శృంగేరి తిరిగి వచ్చారు. దీని తరువాత స్వామి వారు పూర్తిగా తపోమగ్నులై, అప్పుడప్పుడు మాత్రమే బయటకు వచ్చి శిష్యులకు భాష్యములు బోధించేవారు. 1931లో పీఠం యొక్క నిర్వహణకై తన శిష్యుడైన శ్రీనివాసశాస్త్రికి సన్యాసమిచ్చి అభినవ విద్యా తీర్థ స్వామిగా నామకరణం చేసి ఉత్తరాధికారిగా ప్రకటించారు. దాదాపుగా అప్పటి నుండి పీఠం బాధ్యతలను అభినవ విద్యాతీర్థులే నిర్వహించారు. దీనికి మైసూరు రాజాస్థానం కూడా ఎంతో తోడ్పడింది. 1938 ప్రాంతంలో చంద్రశేఖర భారతీ స్వాముల వారు బెంగళూరు, మైసూరు, కాలడిలలో పర్యటించారు. తరువాత పూర్తిగా అవధూత స్థితిని పొంది ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉన్నారు. కేవలం శిష్యులకు వేదాంత బోధలో మాత్రమే మాట్లాడే వారు. 1945 నుండి స్వామి వారు పూర్తి అవధూత జీవితాన్ని గడిపారు. సత్యాన్వేషులకు, పాలకులకు మాత్రమే దర్శనమిచ్చే వారు, మిగిలిన సమయమంత తపోదీక్షలోనే. 1954లో భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు శృంగేరి పర్యటించి స్వామి వారితో ఆధ్యాత్మిక విషయాలు చర్చించి వారి ఆశీర్వాదం పొందారు.

అవధూతగా స్వామి వారు తమ తపోశక్తితో అద్భుతమైన దేహకాతిని పొంది శారదాంబ ప్రత్యక్ష రూపంగా భక్తులకు గోచరించేవారు. 1954 సంవత్సరంలో స్వామి వారు దేహత్యాగం చేయాలని నిర్ణయించుకున్నారు. మహాలయ అమావాస్య, అనగా, 1954 సంవత్సరం సెప్టెంబర్ 26న తుంగా నదిలోకి వెళ్లి పద్మాసన స్థితిలో, దేహానికి ఎటువంటి కష్టమూ లేకుండా, ఆత్మకు ఎటువంటి క్షోభ లేని సచ్చిదానంద స్థితిలో దేహత్యాగం చేశారు. దీనికి ఆనాటి శిష్యులే ప్రత్యక్ష సాక్షులు. డాక్టర్లు దేహపరీక్ష చేసి పరిపూర్ణమైన ఆరోగ్యస్థితిలోనే స్వామి వారు సంకల్ప మాత్రంచే దేహత్యాగం చేశారు అని ఆశ్చర్యపోయారు. అభివన విద్యాతీర్థుల వారు వీరి గురువుల సమాధి పక్కనే శివలింగంతో స్మారకం నిర్మించారు.

చంద్రశేఖర భారతీస్వామి వారు గురురాజ సూక్తి మాలిక మరియు వివేకచూడామణి భాష్యం రచించారు. వీరు కంచి పరమాచార్యుల వారికి సమకాలీకులు. భరతజాతి అదృష్టం ఇద్దరు చంద్రశేఖరేంద్రులు ఒకే సమయంలో రెండు మహోన్నతమైన పీఠాలను అధిరోహించి సనాతన ధర్మ పరిరక్షణకు విశేషంగా తోడ్పడ్డారు. 42 ఏళ్ల పీఠాధిపత్యంలో తమ తపోశక్తిని పూర్తిగా ఆ క్షేత్ర పవిత్రతను కాపాడటానికి, ధర్మ రక్షణకు ధారపోశారు చంద్రశేఖర భారతీస్వామి వారు.

ఆ అవధూతకు పాదాభివందనములు.

శ్రీ టీకే గోవిందరావు జీవిత విశేషాలు



కర్ణాటక సంగీత ప్రపంచంలో భావప్రధాన గానానికి ప్రతీకగా నిలిచిన మహావిద్వాంసుడు శ్రీ త్రిపుణితుర కృష్ణారావు గోవిందరావు గారు. గాయకుడిగా మాత్రమే కాకుండా, సంగీత శాస్త్రవేత్తగా, గురువుగా, రచయితగా ఆయన చేసిన సేవలు అపారం. ఆయన జీవితం మొత్తం కర్ణాటక సంగీతానికి అంకితం అయింది అని చెప్పవచ్చు.

జననం – కుటుంబ నేపథ్యం:

టీకే గోవిందరావు గారు 1929 ఏప్రిల్ 21న కేరళ రాష్ట్రంలోని త్రిపుణితురలో తంకమ్మాళ్, కృష్ణారావు దంపతులకు జన్మించారు. సంగీతం, సంస్కృతి పరంగా సంపన్నమైన కుటుంబంలో ఆయన పెరిగారు. చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి చూపిన ఆయనకు కుటుంబమే తొలి ప్రేరణగా నిలిచింది.

తొలి అభ్యాసం - గురు పరంపర:

ప్రారంభంలో చెంబై వైద్యనాథ భాగవతర్ గారి ప్రభావం ఉన్నా, ఆయన జీవితాన్ని పూర్తిగా మలిచిన గురువు ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్. 15 ఏళ్ల పాటు ఆయన వద్ద గురుకుల సాంప్రదాయంలో ముసిరి వారి వద్ద విద్యనభ్యసించి భావప్రాధాన్యమైన గాత్ర ధర్మాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నారు. 1949లో శ్రీ టి.కె. గోవిందరావు గారు మద్రాసులోని సెంట్రల్ కాలేజ్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్‌లో చేరారు. అక్కడ సంగీత కళానిధి తిరుప్పాంపురం స్వామినాథ పిళ్లై గారు మరియు శ్రీమతి టీ బృంద వంటి మహానుభావుల మార్గదర్శకత్వంలో సంగీత విద్వాన్ పట్టాను పొందారు. 

ముసిరి బాణి అంటే – పదాల అర్థానికి అత్యంత ప్రాధాన్యం, భావాన్ని స్పష్టంగా వ్యక్తపరచే గానం, అతి అలంకారాలు లేకుండా హృదయాన్ని తాకే శైలి.ఈ లక్షణాలన్నీ టి.కె. గోవిందరావు గారి గానంలో స్పష్టంగా కనిపిస్తాయి.

గాయకుడిగా ప్రత్యేకత:

టీకే గోవిందరావు గారి గానంలో శ్రోతలను ఆకట్టుకునే ముఖ్య లక్షణం భావం.స్వరాలు కేవలం శబ్దాలుగా కాకుండా, భావాన్ని మోసుకొచ్చే వాహకాలు అని ఆయన నమ్మకం. అందుకే ఆయన కృతులను పాడేటప్పుడు సాహిత్య ఉచ్చారణ, పదార్థ భావం, భక్తి రసం సమపాళ్లలో ఉంటాయి. అత్యంత క్లిష్టమైన రాగాలకూ ఆయన గానం సరళంగా, హృద్యంగా ఉంటుంది.

ఆకాశవాణి మరియు ఇతర సంస్థల ద్వారా సేవ:

గాయకుడిగా మాత్రమే కాకుండా, ఆకాశవాణిలో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహించడం ద్వారా కూడా ఆయన కర్ణాటక సంగీతానికి సేవ చేశారు. ఆకాశవాణిలో చీఫ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తూ, నాణ్యమైన సంగీత కార్యక్రమాలు, యువ కళాకారులకు అవకాశాలు, సంప్రదాయ సంగీత పరిరక్షణ వంటి అంశాలకు ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. 

యాభై ఏళ్లకు పైగా సాగిన ఆయన సంగీత జీవితంలో, తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలలో అధ్యాపకుడిగా, ఆకాశవాణి చెన్నైలో సంగీత నిర్మాతగా, చివరికి న్యూఢిల్లీ ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో చీఫ్ ప్రొడ్యూసర్ (మ్యూజిక్)గా సేవలందించారు. అదేవిధంగా మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సలహా కమిటీ సభ్యుడిగా, కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఐసీసీఆర్ మరియు బనారస్, ఢిల్లీ, మద్రాస్, అన్నామలై, బెంగళూరు, తెలుగు విశ్వవిద్యాలయాలలో వివిధ హోదాల్లో పనిచేశారు.

గురువుగా, రచయితగా, పరిశోధకుడిగా:

గోవిందరావు గారు ఒక గొప్ప సంగీత పండితుడు. త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామ శాస్త్రి వంటి మహానుభావుల కృతులపై లోతైన అధ్యయనం చేసి, సరైన సాహిత్య, భావార్థం స్వర నిర్మాణం వివరించే విధంగా అనేక పుస్తకాలు రచించారు రచించారు. ప్రత్యేకంగా త్యాగరాజ స్వామి కృతులపై ఆయన చేసిన కృషి పరిశోధకులకు ఎంతో ఉపయోగపడింది.

ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ, ఆయన తన అసలైన లక్ష్యమైన గాయకుడిగా మరియు గురువుగా సేవ చేయడాన్ని ఎప్పుడూ వదలలేదు. భారతదేశమంతటా మాత్రమే కాకుండా శ్రీలంక, సింగపూర్, మలేషియా, యుకె, అమెరికా, కెనడా, మస్కట్ వంటి దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చి, వందలాది మంది శిష్యులను తీర్చిదిద్దారు. గురువుగా ఆయన కఠినమైన నియమాలు పాటించినా, శిష్యులపై అపారమైన ప్రేమ చూపేవారు.సంగీతాన్ని వృత్తిగా కాకుండా, ఒక సాధనగా, ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా చూడమని శిష్యులకు బోధించేవారు. ఆయన శిష్యులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కర్ణాటక సంగీతాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఇదే ఆయనకు నిజమైన గౌరవం.

కర్ణాటక సంగీతంలోని మౌఖిక సంప్రదాయాన్ని పరిరక్షించడానికి మరియు ప్రచారం చేయడానికి ఆయన గానమందిర్ ట్రస్ట్ స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా సంగీత గ్రంథాల ప్రచురణ, ఆడియో–వీడియో రికార్డింగులు, సంగీత సదస్సులు, వర్క్‌షాపులు నిర్వహించారు.

కర్ణాటక సంగీత త్రిమూర్తులు మరియు మహారాజ స్వాతి తిరునాళ్ కృతులన్నింటినీ ప్రామాణికంగా సేకరించి, రోమన్ మరియు దేవనాగరి లిపుల్లో, అర్థాలతో మరియు స్వర నోటేషన్‌తో ప్రచురించడం ఆయన చేసిన మహత్తర సేవ. నవరాత్రి మండపంలో ఆయన చేసిన గానం ప్రసిద్ధి చెందింది. అరుదైన స్వాతి తిరునాళ్ కృతులు ఆయన గానంలో ప్రత్యేక స్థానాన్ని పొందాయి.

పురస్కారాలు – గౌరవాలు:

తన జీవితాంతం చేసిన సేవలకు గాను ఆయనకు అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. సంగీత కళానిధి, సంగీత చుడామణి, సంగీత శాస్త్ర రత్నాకర, సంగీత ఆచార్య, గాయక శిఖామణి వంటి అనేక బిరుదులతో పాటు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. శ్రీ కాంచీ కామకోటి పీఠం నుండి ఆస్థాన విద్వాన్ గౌరవం కూడా పొందారు.

వారసత్వం:

టీకే గోవిందరావు గారు 2011 సెప్టెంబర్ 18న పరమపదించారు. కానీ ఆయన గానం, రచనలు, శిష్య పరంపర ఆయనను నిత్యజీవిగా నిలిపాయి. బొంబాయి సోదరీమణులు లలిత-సరోజ, టీకే రామచంద్రన్, కల్పకం రామన్ వంటి ఎందరో శిష్యులు ఆయన పరంపరను కొనసాగిస్తున్నారు. కర్ణాటక సంగీతంలో భావానికి ఉన్న విలువను కొత్త తరాలకు గుర్తుచేసిన మహానుభావుడు ఆయన.

ముగింపు:

టీకే గోవిందరావు గారు కేవలం ఒక గాయకుడు కాదు. ఆయన ఒక ఆదర్శ గురువు, లోతైన భావజాలం కలిగిన పండితుడు, ఒక అద్భుతమైన సాంప్రదాయానికి పరిరక్షకులు. కర్ణాటక సంగీతం శ్రోతల హృదయాల్లో జీవించాలి అన్నదే ఆయన జీవిత లక్ష్యం. అటువంటి మహానుభావుని సేవలు ఎప్పటికీ మరువలేనివి. 

జయతు జయతు జయజయోస్తు జననీ వాణీ - భక్తి గీతం


 

చిన్నప్పుడు ఆకాశవాణిలో చిత్తరంజన్ గారు నేర్పించిన సరస్వతీదేవి భక్తి గీతం:

జయతు! జయతు! జయజయోస్తు! జననీ వాణీ!
వీణాపుస్తకపాణీ! సకలలోకజనవందిత పంకజభవురాణీ! సురుచిరవేణీ!

సురమునిగణ సంసేవిత సుమధుర హాసోజ్వలనయనా!
సితపద్మాసనశోభిత నతజనసేవితచరణా!భవభయహరణా!
సకలలోకజనవందిత పంకజభవురాణీ! సురుచిరవేణీ!

అనుదినమును నీ నామము మరువక స్మరియింతుమమ్మ! నీవే శరణంటిమమ్మ!నిఖిలలోకజనయిత్రీ! కరుణించుము తల్లీ!
పాహి హే జననీ! పాహి పరమపావనీ!
సకలలోకజనవందిత పంకజభవురాణీ! సురుచిరవేణీ!

అర్థం:

అమ్మా సరస్వతీ దేవీ! నీకు జయము జయము. వీణను, పుస్తకాన్ని చేతుల్లో ధరించిన నీవు మూడు లోకములలోని జనులచే పూజించబడేవు. పద్మము నుండి జన్మించిన బ్రహ్మదేవుని పత్నివి నీవు. అందమైన కురులు కలిగిన దానవు. నీకు జయము జయము. 

దేవతలు, ఋషులు నిరంతరం సేవించే దేవివి నీవు. మధురమైన చిరునవ్వుతో,మెరిసే కనులకాంతితో, తెల్లని పద్మాసనంపై విరాజిల్లుతున్నావు. భక్తజనులచే సేవించబడిన చరణములు కలిగియున్నావు. మాకు జననమరణ భయాలను తొలగించే తల్లివి నీవే.

ప్రతి రోజూ నీ నామాన్ని మరువకుండా స్మరిస్తూ మేమంతా నీశరణు కోరుతున్నాము అమ్మా. మూడు లోకాలకు జనని అయిన తల్లీ, మాపై కరుణ చూపించు. ఓ తల్లీ! మమ్మల్ని కాపాడు! నీవు అత్యంత పావనమైన మాతవు! మా జీవితాలకు రక్షణగా నిలువు తల్లీ!

 https://www.youtube.com/watch?v=4sue4fiSEtg 

నహుషుడి కథ



పురాణకాలంలో నహుషుడు అనే రాజు అత్యంత శక్తివంతుడైన, ధర్మబద్ధుడైన చక్రవర్తిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన చంద్రవంశానికి చెందినవాడు. తన తపస్సు, శౌర్యం, పరాక్రమం వల్ల దేవతల కన్నా గొప్ప బలాన్ని సంపాదించాడు.

ఇంద్రుడి అప్రతిష్ఠ – నహుషుడికి దేవేంద్ర పదవి

ఒక సందర్భంలో ఇంద్రుడు వృత్రాసురుని సంహరించి బ్రహ్మహత్య పాపానికి గురయ్యాడు. ఆ పాపభారంతో ఇంద్రుడు దాగిపోయాడు. దేవలోకానికి నాయకుడు లేకపోవడంతో దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. అప్పుడు బ్రహ్మదేవుడు నహుషుడిని దేవేంద్రునిగా నియమించాడు.

నహుషుడు దేవలోకానికి వచ్చాక మొదట ధర్మానుసారంగానే పాలన చేశాడు. దేవతలు, ఋషులు కూడా అతనిని గౌరవించారు. అయితే కాలక్రమేణా అతనిలో అహంకారం పెరిగింది.

అహంకారానికి ఆరంభం

దేవేంద్ర పదవికి వచ్చిన తర్వాత నహుషుడు అపార తేజస్సు సంపాదించాడు. ఆ తేజస్సుతో అతని శరీరం వెలుగులతో మెరసిపోయేది. ఆ వెలుగుల ప్రభావంతో దేవతలంతా అతనికి భయపడే స్థితి వచ్చింది. ఈ అహంకారమే అతని పతనానికి కారణమైంది.

నహుషుడికి దేవేంద్రుడి భార్య అయిన శచీదేవిపై (ఇంద్రాణి) కోరిక కలిగింది. శచీదేవి తెలివితో నహుషుడిని తప్పించుకుంటూ, “నీవు మహర్షులు నన్ను పల్లకీలో మోసుకొచ్చినప్పుడు మాత్రమే నీ కోరికను నెరవేర్చుతాను” అని షరతు పెట్టింది.

ఋషుల అవమానం

అహంకారంతో నహుషుడు మహర్షులను పల్లకీ మోయమని ఆజ్ఞాపించాడు. దేవతల భయంతో ఋషులు అంగీకరించాల్సి వచ్చింది. ఆ పల్లకీని మోసేవారిలో మహాతపస్వి అయిన అగస్త్య మహర్షి కూడా ఉన్నాడు.అగస్త్యుడు చిన్న కాయంతో నడిచే కారణంగా పల్లకీ కొంచెం ఊగింది. అప్పుడు నహుషుడు అహంకారంతో “సర్ప! వేగంగా నడువు” అని అగస్త్య మహర్షిని దూషించాడు.

శాపం – పతనం

ఈ అవమానాన్ని సహించలేని అగస్త్య మహర్షి నహుషుడిని శపించాడు: “నీవు నన్ను సర్పమని పిలిచావు కాబట్టి నిజంగానే భూమిపై వేగంగా కదలలేని కొండచిలువగా పతనమవుదువు. ఆ స్థితిలో చాలాకాలంలో ఉంటావు.”

ఆ శాపంతో నహుషుడు వెంటనే దేవేంద్ర పదవి కోల్పోయి భూమిపై భయంకరమైన కొండచిలువగా మారిపోయాడు. అదే సమయంలో ఇంద్రుడు తన పాపం నుండి విముక్తి పొందాడు మరియు మళ్లీ దేవేంద్ర పదవిని అధిష్ఠించాడు. 

శాపవిముక్తి:

నహుషుడు అగస్త్యుడి శాపం వల్ల అజగర రూపం దాల్చి ఆయన కాళ్ల మీద పడి శాపవిమోచనం కోసం వేడుకుంటాడు. బహుదీర్ఘకాలం కొండచిలువ రూపంలో ఉండాలి అంటే నేను చాలా ఆహారం తీసుకోవాలి. కాబట్టి ఏ ప్రాణి కనబడినా ఆ ప్రాణి బలమంతా నాకు రావాలి. అలాగే శాపవిమోచనం ఎప్పుడు కలుగుతుందో చెప్పండి అన్నాడు. ఆహారం గురించి వరం ఉపశమనంగా ఇస్తాడు అగస్త్యుడు. అలాగే, శాపవిమోచనం కాలాంతరంలో నీవడిగే ప్రశ్నలకు ఎవరైతే అత్యుత్తమమైన సమాధానాలు చెప్పగలిగితే ఆ రోజున నీకు శాపవిమోచనం, దీనికి చాలా సమయం పడుతుంది. నీలో ఉన్న అహంకారం తొలగిన తరువాతే ఇది జరుగుతుంది అని చెప్పాడు. 

కాలాంతరంలో ద్వాపరయుగంలో భీముడు కొండచిలువ రూపంలో ఉన్న నహుషుని చేత చిక్కి అవస్థ పడుతున్నప్పుడు ధర్మరాజు అక్కడికి వచ్చి నహుషుడితో సంభాషిస్తాడు. నహుషుడు అడిగిన ప్రశ్నలకు ధర్మరాజు అద్భుతమైన సమాధానాలు చెప్పాడు. బ్రాహ్మణుడు అనగా ఎవరు, అత్యుత్తమమైన ధర్మం ఏది మొదలైన ప్రశ్నలకు ఉత్తమమైన సమాధానాలు చెప్పగా నహుషుడికి శాపవిముక్తి కలిగి తిరిగి తన పూర్వరూపం పొందుతాడు, భీమసేనుడికి అపాయం తప్పుతుంది.

మహాభారతంలో యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు లోతైన ఆధ్యాత్మిక తత్త్వసారం కలిగినవిగా శాశ్వతంగా మిగిలిపోతాయి. 

ఆకటి వేళల అలపైన వేళల - అన్నమాచార్యుల కృతి



ఈతి బాధలలో, కష్టాలలో ఉన్నప్పుడు నాకు తప్పకుండా గుర్తుకు వచ్చే కృతి, అన్నమాచార్యుల వారి ఆకటి వేళల...శుభపంతువరాళి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని అక్కారై సోదరీమణులు శుభలక్ష్మి, స్వర్ణలత అద్భుతంగా ఆలపించారు. 

ఆకటి వేళల అలపైన వేళల
తేకువ హరినామమే దిక్కు మరి లేదు

కొఱమారియున్న వేళ కులము చెడిన వేళ
చెఱవడి వొరుల చేజిక్కిన వేళ
వొఱపైన హరినామమొక్కటే గతి గాక
మఱచి తప్పిననైన మఱి లేదు తెఱగు

ఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామమొక్కటే గతి గాక
మాపు దాకా పొరలిన మరిలేదు తెఱగు

సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతిగాక
మంకు బుద్ధి పొరలిన మరిలేదు తెఱగు

- తాళ్లపాక అన్నమాచార్యుల వారు 

భావం:

ఆకలి కలిగినప్పుడు, అలసిపోయినప్పుడు ధైర్యమును చేకూర్చి రక్షించునది హరినామమొక్కటే. అది తప్ప మరొక దిక్కు లేదు.

తాను ఎందుకూ పనికి రాని దుస్థితి ఏర్పడినప్పుడు, కులము చెడినప్పుడు, ఇతరులచే బంధింపబడి కృశించినప్పుడు, ప్రకాశమానమైన హరినామమొక్కటే గతి. దానిని మరచినచో మరొక గతి లేదు.

ఆపద కలిగినప్పుడు, నిందకు లోనైనప్పుడు, పాపము మీద పడినప్పుడు, భయపడినప్పుడు, మిక్కిలిగా స్మరింపదగిన హరి నామమొక్కటే గతి. దానిని మించి ఎంత ప్రయత్నించిననూ ఆ దుర్దశలనుండి కాపాడుటకు మరొక మార్గం లేదు.

శత్రువులు సంకెళ్ళతో బంధించినప్పుడు, చంపుటకు పిలిచినప్పుడు, అప్పులవారు అడ్డగించి నిలదీసినప్పుడు విడిపించుటకు శ్రీ వేంకటేశ్వరుని నామమొక్కటే ఉపాయము. దానిని వదలి మూర్ఖత్వముతో ఎంత ప్రయత్నించిననూ వేరొక ఉపాయము లేదు.

అన్నమయ్య శృంగార సంకీర్తన విని సాళ్వ నృసింహరాయలు ఆయనను చెరశాలలో బంధించి హింసించినప్పుడు ఆచార్యులు “ఆకటివేళల” అను సంకీర్తనను ఆలపించగా సంకెళ్ళు తమకు తామే విడిపోయానట. అప్పుడు రాజు ఆచార్యుల పాదాలపై పడి క్షమించమని వేడుకొనగా “శ్రీహరి నిన్ను రక్షించుగాక” అని దీవించెనట. ఈ విషయము అన్నమయ్య మనుమడు చిన్నన్న తాను రచించిన అన్నమయ్య జీవిత చరితలో తెలిపారు. 

https://youtu.be/sKW2OEb8-8M?t=127

20, జనవరి 2026, మంగళవారం

భగవద్రామానుజాచార్యుల జీవనయాత్ర – స్థలాల ఆధారిత సారాంశము



భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో రామానుజాచార్యుల వారు అతి విశిష్టమైన స్థానాన్ని అలంకరించిన అవతారపురుషులు. విశిష్టాద్వైత సిద్ధాంతానికి ప్రాణప్రతిష్ఠ చేసి, భక్తి–జ్ఞాన–కర్మల సమన్వయాన్ని ప్రజలకు సులభముగా బోధించిన జగద్గురువులు. వారి జీవితం ఒక స్థలంలో స్థిరముగా ఉండిన జీవితం కాదు; అది ధర్మప్రచారం నిమిత్తం దేశమంతా విస్తరించిన ఒక మహాయాత్ర.

శ్రీపెరుంబుదూరు – అవతార స్థలం:    

శ్రీ రామానుజాచార్యుల జన్మస్థానముగా ప్రసిద్ధి పొందినది శ్రీపెరుంబుదూరు గ్రామము. ఇది తమిళనాడులోని ఒక పుణ్యక్షేత్రము. క్రీస్తుశకం 11వ శతాబ్దం ప్రారంభంలో ఇక్కడ వారు జన్మించారు. చిన్ననాటి నుంచే అపూర్వమైన బుద్ధిశక్తి, ధార్మిక స్వభావం కలిగిన బాలకుడిగా ప్రసిద్ధి చెందారు. వేదపాఠనానికి అనుకూలమైన వాతావరణంలో పెరిగిన ఈ బాలుడు, భవిష్యత్తులో భారతీయ తత్వచింతనకు దిశానిర్దేశం చేసే మహాచార్యుడవుతాడని అప్పుడే సంకేతాలు కనిపించాయి.

కాంచీపురం – విద్యాభ్యాసము మరియు అంతర్మథనం:

బాల్యానంతరం రామానుజులు కాంచీపురానికి చేరుకున్నారు. ఇది ఆ కాలంలో విద్యా–సాంస్కృతిక-ఆధ్యాత్మిక కేంద్రముగా వెలుగొందిన నగరం. ఇక్కడ యాదవప్రకాశుడు అనే అద్వైతాచార్యుని వద్ద వేదాంత విద్యను అభ్యసించారు. అయితే గురువు బోధించిన అద్వైత భావన, శిష్యుని హృదయంలోని భక్తి ప్రధానమైన దృష్టితో సరిగా ఏకీభవించలేదు. ఈ అంతర్మథనమే భవిష్యత్తులో విశిష్టాద్వైత సిద్ధాంత రూపకల్పనకు బీజమైంది.

కాంచీపురంలోనే వారు దేవాలయ సేవలలో పాల్గొని, శ్రీ వరదరాజ స్వామి అనుగ్రహంతో భక్తి మార్గాన్ని లోకానికి బోధించసాగారు. ఇక్కడ గృహస్థ జీవితం నుంచి విరక్తి చెంది, క్రమంగా సన్యాస మార్గానికి పయనించారు.

శ్రీరంగం – ప్రధాన పీఠము మరియు కార్యక్షేత్రము:

రామానుజాచార్యుల జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ శ్రీరంగంలో ప్రారంభమైంది. కావేరి నదీ తీరంలో విరాజిల్లే శ్రీరంగనాథస్వామి ఆలయం వారి ఆధ్యాత్మిక కార్యాలకు కేంద్రబిందువైంది. ఇక్కడ వారు శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని సుస్థిరంగా స్థాపించారు. ఆలయ ఆరాధనా విధానాలను శాస్త్రీయంగా పునర్వ్యవస్థీకరించి, సామాన్య ప్రజలకు సైతం భక్తి మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు.

శ్రీరంగంలోనే వారు శ్రీభాష్యం, గీతాభాష్యం వంటి మహాగ్రంథాలను రచించి, బ్రహ్మసూత్రాలకు విశిష్టాద్వైత వ్యాఖ్యానాన్ని అందించారు. వారి జీవితాంతం ఈ పుణ్యక్షేత్రమే వారి నివాసముగా, కార్యక్షేత్రముగా నిలిచింది. చివరికి ఇక్కడే వారు దేహత్యాగం చేశారు. ఈనాటికీ వారి శరీరావశేషాలు ఆలయ ప్రాంగణంలో సజీవ సంప్రదాయంగా దర్శనమిస్తాయి.

మేల్కోటే (తిరునారాయణపురం) – విరోధముల నడుమ ధర్మస్థాపన:

చోళ రాజుల కాలంలో కొన్ని మతపరమైన సంఘర్షణల కారణంగా రామానుజాచార్యులు శ్రీరంగాన్ని విడిచి కర్ణాటక ప్రాంతానికి వెళ్లవలసి వచ్చింది. అప్పుడు వారు మేల్కోటే అనే ప్రాంతంలో దీర్ఘకాలం నివసించారు. ఇది కూడా వారి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన స్థలముగా నిలిచింది.

మేల్కోటేలో వారు దేవాలయాలను పునరుద్ధరించి, విగ్రహారాధనకు ప్రాధాన్యతనిచ్చారు. అక్కడ యదుగిరి యతిరాజ మఠాన్ని స్థాపించి, అనేక శిష్యులను తయారుచేశారు. సామాజిక సంస్కరణలు, భక్తి ప్రచారం, తత్వవాద బోధన — అన్నీ కలిసిన సమగ్ర కార్యాచరణ అక్కడ సాగింది. కొందరు వారు అక్కడ 12 సంవత్సరాలు, మరికొందరు 30 సంవత్సరాలకు పైగా నివసించినట్లు చెప్పారు.

ఉపసంహారం:

శ్రీ రామానుజాచార్యుల జీవితం ఒక వ్యక్తిగత యాత్ర కాదు. అది సమాజాన్ని, ఆధ్యాత్మికతను, తత్వచింతనను ఒక కొత్త దిశగా నడిపించిన మహాప్రయాణం. శ్రీపెరుంబుదూరులో జన్మించి, కాంచీపురంలో విద్యనభ్యసించి, శ్రీరంగంలో సిద్ధాంతాన్ని స్థాపించి, మేల్కోటేలో ధర్మాన్ని నిలబెట్టిన ఈ మహాచార్యుడు భారతదేశ ఆధ్యాత్మిక భూభాగమంతటా తన ప్రభావాన్ని చాటాడు.

వారి నివసించిన ప్రతి స్థలమూ ఈనాటికీ ఒక తీర్థక్షేత్రమే. వారి బోధనలు కాలాతీతమైనవి, వారి జీవితం అనుసరణీయమైనది, వారి సిద్ధాంతం సనాతనమైనది. 

18, జనవరి 2026, ఆదివారం

వీరభద్రుడు-వీరభద్రుని పళ్ళెం

వీరభద్రుడు:

శివుని అంశతో జన్మించినవాడు ఇతడు. రౌద్రరూపము దాల్చిన శివుడు తన జడను లాగి నేలకు కొట్టగా ఈ వీరభద్రుడు జన్మించాడు. దక్షుడు బ్రహ్మ చేస్తున్న సత్రయాగము చూడటానికి వచ్చినప్పుడు తనను చూసి లేచి మాట్లాడని తన అల్లుడగు శివునిపై కోపించి శపించి వెళ్లిపోతాడు. ఆనాటి నుండి దక్షుడు శివునిపై శత్రుభావము వీడక ఉంటాడు. అందువల్ల శివుడిని,కుమార్తె ఉమ పిలువకుండానే బృహస్పతి సవనము ఆరంభిస్తాడు. అది తెలిసి ఉమ తన తండ్రి చేస్తున్న యాగమును చూడటానికి భర్త అనుమతిని పొంది యజ్ఞశాలకు వెళుతుంది. అక్కడ తండ్రిచే అవమానించబడి ఆయనను నిందిస్తూ యోగాగ్నిని సృష్టించి దానిలో దగ్ధమవుతుంది. ఆ వృత్తాంతమును శివుడు నారదుని ద్వారా తెలుసుకొని కోపోద్రిక్తుడై తన జడ ఒకటి పెఱికి భూమి మీద విసరగా, దాని నుండి వీరభద్రుడు ఆవిర్భవించి, ఘోరమైన రూపము దాల్చి దక్ష యజ్ఞమును ధ్వంసము చేయటానికి శివుని ఆనతి పొంది యజ్ఞశాలకు వెళ్లి యజ్ఞధ్వంసము మరియు దక్షవధ చేస్తాడు. అప్పుడు బ్రహ్మ మొదలగు దేవతలు శివుని ప్రార్థింపగా శివుఁడు ప్రసన్నుడై మళ్లీ దక్షాదులను అనుగ్రహిస్తాడు. దక్షయజ్ఞము ధ్వంసమయ్యే సమయంలో యజ్ఞపురుషుడు మృగరూపము ధరించి పారిపోవుచుండగా ఆ మృగమును వీరభద్రుడు వధిస్తాడు, శివుడు పునరుజ్జీవింపచేస్తాడు. దక్ష యజ్ఞ సమయంలో రౌద్ర రూపము దాల్చిన ఉమ అంశతో ఆవిర్భవించిన భద్రకాళిని వీరభద్రుని పత్నిగా భావిస్తారు. 

శివ పురాణం, స్కాంద పురాణం, పద్మ పురాణం వీరభద్రుని గురించి ప్రస్తావిస్తాయి. మన దేశంలో లేపాక్షి, కొత్తకొండ, రిషీకేశ్, హుమ్నాబాద్, కుంభకోణం మొదలైన ప్రాంతాలలో వీరభద్రుని దేవాలయాలున్నాయి. వీరశైవాన్ని ఆచరించేవారు ఎక్కువగా కర్నాటక, తెలంగాణా, పల్నాడు ప్రాంతాలలో ఉంటారు. ఉత్తరాదిన దక్షయజ్ఞ విధ్వంసకుడిగా, దక్షిణాది వారు శివుని ప్రమథ గణాధిపతిగా, క్షేత్రపాలకునిగా, వీరునిగా వీరభద్రుని ఆరాధిస్తారు. శ్రీశైలంలో బయలు వీరభద్రస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది. 

=

వీరభద్రుడి పళ్లెం:

వీరభద్రుడికు చేసే విశిష్టమైన పూజ, వీరశైవులు ఆచరించే ఒక ఆచారము వీరభద్రుడీ పళ్లెం/వీరభద్రుని వీథి పళ్ళెం. ఈ పూజా తతంగం అద్భుతమైన వీరవిన్యాసాలతో కూడి ఉంటుంది. అసాధ్యం అనిపించే వీరనాట్యంతో అద్భుతమనిపిస్తుంది.  శివద్వేషులను అంతం చేసే మహావీర ఖడ్గాన్ని ఈ ప్రక్రియలో ప్రదర్శిస్తారు.  ఆ వీరనాట్యం చూసి తీరాల్సిందే, చెప్పశక్యం కాదు. అటువంటి వీరభద్రుని పళ్ళెం వీరశివాచార కుటుంబాలకు, లింగధారులకు ఒక కుటుంబ ఆచారంగా వస్తూంటుంది. ఇందులో వీరభద్రుని ఆవిర్భావ కథను దక్షయజ్ఞ దండకంగా అమితమైన ఆవేశంతో చదువుతూ, ఢమఢమ డప్పులు మోగిస్తూ,  నారసాలు పొడుచుకోవడం, అగ్గి విన్యాసాలు చేయడం, సూదుల్లాంటి మేకులున్న పావుకోళ్ళని ధరించి అశ్శరభ శ్శరభ, దశ్శరభశ్శరభ అని నాట్యం చేయడం, నిప్పుల గుండాలు తొక్కడం ఇలా ఎన్నో వీరోచిత విన్యాసాలుంటాయి.

వీరి ఖడ్గ ప్రదర్శనం వీరా వేశంతో కూడుకొని వుంటుంది. స్త్రీలూ, పురుషులూ ఒక గుంపుగా వీధిలో ప్రవేశించి అక్కడక్కడ ఆగుతూ ఈ ఖడ్గాలు చదివి ముందు సాగుతారు. ఖడ్గధారి ఖడ్గం చదివేటప్పుడు గుంపులోనుంచి ముందుకు వస్తాడు. సాంబ్రాణి ధూపంతో అతనిని ముంచెత్తుతారు. సన్నాయి బూరలతో, డోళ్ళతో, శంఖాలాతో, ఖడ్గధారిని ఆవేశ పరుస్తారు. ఆ ఆవేశంలో ఖడ్గధారి ఖడ్గం (వీరభద్ర ఆవిర్భావ గాథని వివరించే పదాల్లాంటివి) చదువుతాడు. పళ్లెంలో మహావీర ఖడ్గాన్ని ఉంచుతారు.  వీభద్రపళ్లెంలో ఈ ఖడ్గ విన్యాసం తప్పనిసరిగా ఉంటుంది. ఖడ్గం పట్టి చేసే  ఈ నృత్యాన్ని ఖడ్గ నృత్యమని కూడ పిలుస్తారు. ఈ నృత్యం ప్రత్యేకంగా కొన్ని జాతులవారు మాత్రమే చేస్తారు. ఏ కులం వారైనా వీర శైవ మతాన్ని అవలంబించిన ప్రతి వారూ ఈ నృత్యాన్ని తప్పక చేస్తారు.

తంతు తతంగం:

ఈ మహావీరఖడ్గ నృత్య సమయంలో పెద్ద పెద్ద ప్రభలు గట్టి ఆ ప్రభలను అనేక అలంకారలతో ముంచి వేస్తారు. ప్రభకు ముందూ వెనుకా స్త్రీ పురుషులు నడుస్తూ వుంటారు. ప్రభ ముందు సన్నాయి వాయిద్య కాండ్రు రెండుమూడు దళాలువారుంటారు. ముఖ్యంగా ఈ నృత్యంలో వీరు వాయించే వాయిద్యం వీరంగం. ఇది ఒక ప్రత్యేకమైన వాయిద్యం. కణకణమని అతి దురితంగా డోళ్ళు మ్రోగుతాయి. సన్నాయి బూరలు తారాస్థాయిలో గుక్క పట్టి నృత్య కారుని చెవుల్లో వూదుతారు. సాంబ్రాణి ధూపం ముఖానికి దట్టంగా పట్టిస్తారు. దీనితో ఖడ్గధారి వీరావేశంతో ఒక్కగెంతు గ్తెంతి దశ్శరభశరభ, అశ్శరభ శరభ అంటూ డోలు వాయిద్య గాళ్ళను కవ్విస్తూ... అదదదద అబబబబ అగగగగ ... అని డోలు వాయిద్య గానిని కవ్వించి ముక్తాయింపులు ఇప్పించి దశ్శరభ అశ్శరభ అని వీరభద్రుని ఆవిర్భావగాథ లైన దక్షుని దండకం తదితరాలు చదువుతూ వీరనాట్యం చేస్తాడు. హంగూ, ఆర్భాటం చేస్తారు. వీరంగ ధ్వనులు మిన్ను ముట్టుతాయి. ఇలా ఖడ్గం పట్టి దండకం చదువుతూ, వాయిద్యాల గమకాలననుసరించి, వీరావేశంతో ఆ ప్రక్కకూ, ఈ ప్రక్కకూ అడుగులు వేస్తూ, కంకణం కట్టిన కత్తిని వేగంగా త్రిప్పుతూ ఆసాంతంలో ఏ గ్రామదేవతను గాని ఏ దేవుణ్ణి పూజిస్తారో, ఆ గ్రామం పేరు తలచి జై మంగళ గిరి వీరభద్ర అని ముగించి మరల వాయిద్యగాండ్రను అదరించి శరభ, శరభ అంటూ నానా హంగామా చేసి ఆ కత్తిని ఎవరైతే ఆ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారో, అతని పళ్ళెంలో వుంచుతారు.

ఇలా ఊరేగుతూ నాలుగు వీథులూ కలిసిన చోటల్లా ఒక్కొక్క వ్వక్తి పై విధంగా ఖడ్గ నృత్యం చేస్తాడు. ఇలా ఉత్సవం ముందుకు సాగేకొద్దీ జన సమూహం ఎక్కువై ఎంతో ఉద్రేకాన్ని కలిగిస్తుంది. నృత్యధారి ధరించే ఖడ్గం చాల భారీగా వుంట్ఘుంది. ఖడ్గం మిలమిల మెరుస్తూ వుంటుంది. ఖడ్గం మధ్య భాగంలో తమలపాకులతో గాని, మామిడాకులతో గానీ కంకణం కడతారు. కొన్ని చోట్ల నిమ్మకాయలు గుచ్చడం ఉంది. 

ఖడ్గ ధారి కర్తవ్యాలు:

ఖడ్గం ధరించే వ్వక్తి విభూతి రేఖలు పట్టించి, విచిత్ర వేష ధారణలో వుంటాడు. ఖడ్గం ధరించే వ్వక్తి ఆ రోజున ఉపవాసముంటాడు. ప్రతి వారూ ఈ నృత్యం చేయడం కష్టం. నృత్యం చేసే ప్రతి వ్వక్తి దక్షుని దండకాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలి. లేనట్లేయితే అడుగు పడదు. ఖడ్గ నృత్య ధారి ప్రళయ తాండవంగా నృత్యం చేసిన తరువాత శివమెక్కి ఆవేశంతో నారసాలు పొడుచు కుంటాడు.

నారసాలు:

ఖడ్గ నృత్యంలో ఆ నారసాల నృత్యం మహా ఉత్తేజంగా, భయంకరంగా వుంటుంది. ఖడ్గ నృత్యం అయిన వెంటనే ఆ వ్వక్తి నారసాలు పొడుచుకుంటాడు. 

నారసాలంటే అనేక రకాలుగా వుంటాయి.  ఏకనారసం, కంటి నారసం, గొంతు నారస, శిరసు నారసం, శూల నారసం మొదలైన పేర్లతో వుంటాయి. ఇవి శూలం మాదిరిగా ఉండి, త్రిశూలం చివరి భాగంలో నూనె గుడ్డలు చుట్టి, వాటిని వెలిగించి, సన్నని మొన భాగాన్ని నాలికపై గుచ్చుతారు. ఇలా గ్రుచ్చే సమయంలో జోరుగా వాయిద్య సమ్మేళనం జరిగుతుంది. రణగొణ ధ్వనులు చేస్తారు. ఉద్రేకంలో ఉన్న వారికి కర్పూరం వెలిగించిన పళ్ళెం చేతికిస్తారు. నృత్యకారుడు చేతితో నారసాన్ని పట్టుకుని వాయిద్యానికి తగినట్టు వీరాధివీరుడిలా గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేస్తాడు. చేసే కొద్దీ వాయిద్యాల జోరు ఎక్కువ అవుతుంది. ఈ జోరులో వెలిగించిన వత్తులు, ఒక్కొక్కటిగా ఆరి పోవడంతో ఈ నృత్యం కూడ పూర్తి అవుతుంది.

స్థలానుకూలంగా ఆచారాలు: 

ఈ వీరభద్రుని పళ్ళెం పట్టే విధానంలోని ప్రధాన విన్యాసాల గురించే మనం ఇంతసేపూ చెప్పుకున్నాం.  కొన్ని చోట్ల ఈ విన్యాసాలతో పాటుగా నిప్పుల గుండాలు తొక్కడం తదితర ఎన్నో భీభత్సమైన విన్యాసాలు కూడా చేస్తూ ఉంటారు. కలియుగంలో జంతుబలులు నిషేధించినా కొన్ని చోట్ల అవి ఈ విన్యాసాల్లో చోటుచేసుకుంటాయి. సాధారణంగా కూషంఆండాన్ని సాత్విక బలిగా అర్పిస్తూ ఉంటారు. ఇలా వీరభద్రుని పళ్లెం వీరోచిత విన్యాసాలతో కూడి చివరగా ఏదైనా ఒక వీరభద్ర దేవాలయం దగ్గరే ముగుస్తూ ఉంటుంది.   


11, జనవరి 2026, ఆదివారం

తెర తీయగ రాదా - త్యాగరాజస్వామి కృతి



త్యాగరాజస్వామి సమకాలీకులలో ఉపనిషద్బ్రహ్మేంద్ర స్వామి వారు ప్రముఖులు. వీరు కాంచీపురంలో మఠాన్ని ఏర్పాటు చేసి 108 ఉపనిషత్తులపై భాష్యం రచించారు. సన్యాస స్వీకార సమయంలో గురువులు ఇచ్చిన పేరు రామచంద్రేంద్ర సరస్వతి అయినా వారు ఉపనిషత్తులపై చేసిన కృషి వలన ఆయనకు తదనుగుణమైన నామం వచ్చింది. వారు ఒకసారి త్యాగరాజస్వామిని కాంచీపురం రమ్మని ఆహ్వానించారు. శిష్యుల్ని వెంటబెట్టుకుని త్రోవలో పుణ్య క్షేత్రాలను దర్శిస్తూ, అక్కడి వేల్పులను దర్శించిన అనుభవంతో కీర్తనలు రచించి పాడుకున్నారు త్యాగయ్య. కోవూరు, పుత్తూరు, నాగులాపురం, వాలాజీపేట, శ్రీరంగం, నాగపట్టణం తపస్థీర్థం, ఘటికాచలం మొదలైన క్షేత్రాల్లో రచించిన కీర్తనలన్నీ ఒక ఎత్తయితే, తిరుమలలో శ్రీనివాసుని దర్శించుకున్నప్పుడు పాడిన కీర్తన మరో ఎత్తు. అదో చారిత్రాత్మక సన్నివేశం. తిరుమలకు చేరుకున్న త్యాగయ్యకు వెంటనే దర్శనం కాలేదు. ఆలయంలో ప్రవేశించగానే అర్చకులు తెర వేసి స్వామి కైంకర్యాలు చేస్తున్నారు. నిరుత్సాహంతో చింతాక్రాంతుడైన త్యాగయ్య అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశమున్న కీర్తన ఆలపించారు. శ్రీనివాసుడు త్యాగయ్యపై కరుణించగా తెర తొలగిపోయి అద్భుతమైన దర్శనం కలిగింది. కృతి వివరాలు:

తెర తీయగ రాదా లోని
తిరుపతి వేంకటరమణ మచ్చరమను

పరమపురుష ధర్మాది మోక్షముల
పారదోలుచున్నది నాలోని

మత్స్యము ఆకలిగొని గాలముచే మగ్నమైన రీతి యున్నది
అచ్చమైన దీపసన్నిధిని మరుగిడబడి చెఱచినట్లున్నది

వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతి యున్నది
వేగమే నీ మతముననుసరించిన త్యాగరాజ సన్నుత మదమత్సరమను

భావం: 

ఓ తిరుపతి వేంకటరమణా! నా మనసులో మదమత్సరాదులనే అరిషడ్వర్గములు నెలకొనియున్నవి. ఈ ఆరు అంతశ్శత్రువులనే తెర తొలగించుము. ఓ పరమపురుషా! ఈ తెర మానవుని సాధనా సంపత్తికి దోహదము చేసే ధర్మార్థ కామ మోక్షములను విధులకు దూరము చేయుచున్నది. ఈ తెర ఆకలిగొన్న చేప గేలము నందు గల ఎరను ఆశించి దానిలో చిక్కుకున్న రీతి, స్వచ్ఛమైన దీపకాంతికి అడ్డుపడి అంధకారములో పడవేసి అధోగతిపాలు చేస్తున్నది. ఈ మదమత్సరములనే తెర ఎడారులలో ఎండమావులను చూసి భ్రమసి పశుగణములు వాని వద్దకు చేరుకున్నట్లుగా మాయలో పడవేసి నీకు దూరము చేయుచున్నవి. వీటిని తొలగించి నీ దర్శనమును ప్రసాదించుము. నీ భక్తియనే మతమును అవలంబించాను, నన్ను కాపాడుము. 

గౌళిపంతు రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు

5, జనవరి 2026, సోమవారం

ధీమహి గాయత్రీం సతతం - గణపతి సచ్చిదానందస్వామి వారి కృతి



ధీమహి గాయత్రీం సతతం ధీమహి గాయత్రీం సతతం ధీమహి గాయత్రీం 

సంధ్యాత్రితయే మునివినుతాం సవితృ వరేణ్య శ్రీ రూపాం
ధీమద్ధీ చోదన శీలాం భర్గోరూపాం తాం దేవీం

మహిత చతుర్వింశతి వర్ణాం త్రిపదాం దేవీం నిటలాక్షీం
పంచశిరస్థాం దశహస్తాం ఉపనయనార్థే వినియుక్తాం

ముక్తా విద్రుమ హేమగణా ఘన ధవళోజ్జ్వల వర్ణమయీం
వ్యాహృతి రూపాం ప్రణవార్ధాం గాయక సచ్చిదానందకరాం 


ధీమహి

శబ్దార్థం: ధ్యానించుదము
భావార్థం: మనస్సును ఏకాగ్రం చేసి స్మరిస్తాము

గాయత్రీం

శబ్దార్థం: గాయత్రీ దేవిని
భావార్థం: వేదమాత అయిన గాయత్రీ దేవతను

సతతం

శబ్దార్థం: ఎల్లప్పుడూ
భావార్థం: నిరంతరం, అవిచ్ఛిన్నంగా

భావం:

మేము ఎల్లప్పుడూ, నిరంతరం గాయత్రీ దేవిని ధ్యానిస్తాము.

సంధ్యాత్రితయే మునివినుతాం సవితృ వరేణ్య శ్రీ రూపాం

సంధ్యా–త్రితయే

శబ్దార్థం: మూడు సంధ్యా కాలములలో
భావార్థం: ప్రాతః, మాధ్యాహ్న, సాయంకాల సంధ్యలలో

ముని–వినుతాం

శబ్దార్థం: మునులు స్తుతించినది
భావార్థం: ఋషులచే మహిమించబడిన దేవి

సవితృ–వరేణ్య

శబ్దార్థం: సవితృ దేవునికి అత్యంత ప్రియమైనది
భావార్థం: సూర్య తేజస్సుతో ఏకరూపమైనది

శ్రీ రూపాం

శబ్దార్థం: దివ్యమైన రూపమును కలిగినది
భావార్థం: మంగళకరమైన, శోభాయమాన రూపధారి

భావం:

మూడు సంధ్యలలోనూ మునులు స్తుతించే, సూర్య తేజస్సుతో వెలుగొందే దివ్య రూపధారిణి గాయత్రీ.

ధీమద్ధీ చోదన శీలాం భర్గోరూపాం తాం దేవీం

ధీమత్–ధీ

శబ్దార్థం: జ్ఞానసంపన్నమైన బుద్ధి
భావార్థం: ఉత్తమమైన వివేక బుద్ధి

చోదన–శీలాం

శబ్దార్థం: ప్రేరేపించే స్వభావం కలది
భావార్థం: మన బుద్ధిని ఉత్తమ మార్గంలో నడిపించేది

భర్గః–రూపాం

శబ్దార్థం: తేజస్సు స్వరూపిణి
భావార్థం: పాపనాశకమైన దివ్య కాంతి స్వరూపం

తాం దేవీం

శబ్దార్థం: ఆ దేవిని
భావార్థం: ఆ పరాశక్తిని

భావం:

మన జ్ఞానాన్ని ఉత్తేజపరచే, దివ్య తేజస్సు స్వరూపమైన గాయత్రీ దేవిని ధ్యానిస్తాము.

మహిత చతుర్వింశతి వర్ణాం త్రిపదాం దేవీం నిటలాక్షీం

మహిత

శబ్దార్థం: మహిమ కలది
భావార్థం: గొప్పగా ఆరాధించబడినది

చతుర్వింశతి వర్ణాం

శబ్దార్థం: 24 అక్షరాలు కలది
భావార్థం: గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాల స్వరూపిణి

త్రిపదాం

శబ్దార్థం: మూడు పదాలుగా విభజించబడినది
భావార్థం: భూః–భువః–స్వః అనే మూడు పాదాల రూపం

నిటల–అక్షీం

శబ్దార్థం: నిటలంలో నేత్రమున్నది
భావార్థం: తృతీయ నేత్రంతో విరాజిల్లే శక్తి

భావం:

24 అక్షరాలు, మూడు పాదాలు కలిగిన తృతీయ నేత్రధారిణి గాయత్రీ దేవి.


పంచశిరస్థాం దశహస్తాం ఉపనయనార్థే వినియుక్తాం

పంచ–శిరస్థాం

శబ్దార్థం: ఐదు శిరస్సులు కలది
భావార్థం: పంచభూతాత్మక శక్తి స్వరూపిణి

దశ–హస్తాం

శబ్దార్థం: పది చేతులు కలది
భావార్థం: అనేక శక్తులను ధరించినది

ఉపనయన–అర్థే వినియుక్తాం

శబ్దార్థం: ఉపనయన సంస్కారానికి నియమించబడినది
భావార్థం: బ్రహ్మవిద్య ప్రవేశానికి అధిష్ఠాన దేవత

భావం:

ఉపనయనాది సంస్కారాలకు మూలదేవతగా నిలిచిన మహాశక్తి.

ముక్తా విద్రుమ హేమగణా ఘన ధవళోజ్జ్వల వర్ణమయీం

ముక్తా – ముత్యముల వంటి
విద్రుమ – ప్రవాళముల వంటి
హేమగణా – బంగారు కాంతి వంటి

ఘన ధవళ ఉజ్జ్వల వర్ణమయీం

శబ్దార్థం: దట్టమైన తెల్లని ప్రకాశం కలది
భావార్థం: శుద్ధత, పవిత్రత ప్రతీక

భావం:

వివిధ రత్నకాంతులతో మెరిసే పవిత్ర దివ్య స్వరూపిణి.

వ్యాహృతి రూపాం ప్రణవార్థాం గాయక సచ్చిదానందకరాం

వ్యాహృతి రూపాం

శబ్దార్థం: భూః–భువః–స్వః స్వరూపిణి
భావార్థం: లోకత్రయాన్ని ఏకరూపం చేసినది

ప్రణవార్థాం

శబ్దార్థం: ఓంకారానికి అర్థస్వరూపం
భావార్థం: పరబ్రహ్మ తత్త్వ స్వరూపిణి

గాయక సచ్చిదానందకరాం

శబ్దార్థం: పఠించువారికి ఆనందమిచ్చేది
భావార్థం: చైతన్యానందాన్ని ప్రసాదించేది

భావం:

ఓంకారార్థ స్వరూపిణి అయిన గాయత్రీ దేవి భక్తులకు సచ్చిదానందాన్ని ప్రసాదిస్తుంది.

తాత్పర్యం:

మేము ఎల్లప్పుడూ గాయత్రీ దేవిని ధ్యానిస్తాము, నిత్యం గాయత్రీ దేవినే మనసారా స్మరిస్తాము. సంధ్యా కాలములన్నిటిలోనూ పూజింపబడే ఆమెను, మునులు స్తుతించే, సవితృ దేవుని శ్రేష్ఠ తేజస్సుతో వెలుగొందే శ్రీమయ రూపమును కలిగిన దేవిని ధ్యానిస్తాము.మన బుద్ధిని ప్రేరేపించి, శుద్ధి చేసే స్వభావముతో భర్గస్వరూపంగా ప్రకాశించే ఆ దేవిని స్మరిస్తాము. ఇరవై నాలుగు అక్షరాల గాయత్రీ మంత్ర స్వరూపిణిగా, మూడు పదాలుగా విస్తరించిన త్రిపదా స్వరూపిణిగా, నిటలమున తృతీయ నేత్రంతో విరాజిల్లే దేవిని ధ్యానిస్తాము. ఐదు శిరస్సులు, పది హస్తాలు కలిగిన మహాశక్తిగా, ఉపనయనాది సంస్కారములకు అధిష్ఠాన దేవతగా ఆమెను మనసారా స్మరిస్తాము. ముక్త, విద్రుమ, హేమమణులవంటి కాంతితో శుద్ధ ధవళ వర్ణంతో ప్రకాశించే దేవిని, వ్యాహృతుల స్వరూపమై, ప్రణవార్థంగా నిలిచిన దేవిని, గానంతో సచ్చిదానందాన్ని ప్రసాదించే గాయత్రీ దేవిని మేము ఎల్లప్పుడూ ధ్యానిస్తాము.

గీతాంజలి బృందం ఆలాపన 

లీలాజగజ్జ్యోతిర్లతా - అమ్మ వారి కృతి


 
లీలాజగజ్జ్యోతిర్లతా
శైలాధిరాడ్గేహోదితా

ఫాలాంబక ప్రేమాధృతా
మాలాలసద్భూషావృతా 

బుధజన మన సమ్మోదినీ
మదయుతజన సంతాపినీ

మృదుకరకలాసంశోభినీ
హృదిలసతు మే విద్యాధునీ  

- ఉడుపా వేంకటనారాయణశాస్త్రి

1. లీలా జగజ్జ్యోతిర్లతా  

   – లీలామయంగా ప్రకాశించే జగత్తు అంతటిని వెలిగించే జ్యోతి లత (ప్రకాశ వల్లి)  

   → అమ్మవారు సౌందర్యంతో, కాంతితో జగత్తును వెలిగించే శక్తి.

2. శైలాధిరాడ్ గేహోదితా  

   – శైలాధిరాజు =  హిమవంతుడు, గేహోదితా = ఇంటిలో జన్మించిన  

   → పార్వతీదేవిగా, హిమవంతుని కుమార్తెగా జన్మించిన దేవి.

3. ఫాలాంబక ప్రేమాధృతా 

   – ఫాలాంబకుడు = శివుడు, ప్రేమాధృతా =  ప్రేమతో ఆరాధించిన  

   → శివుని ప్రేమను పొందిన, ఆయన ప్రియమైన దేవి.

4. మాలాలసద్భూషావృతా  

   – మాలలతో అలంకరించబడిన, శోభాయమానమైన అలంకారాలతో ఉన్న దేవి  

   → ఆభరణాలతో, పుష్పమాలలతో అలంకరించబడిన అమ్మవారు.

5. బుధజన మన సమ్మోదినీ

   – బుద్ధిమంతుల మనస్సులను ఆనందింపజేసేవారు  

   → జ్ఞానులు, భక్తులు ఆమెను ధ్యానించి హర్షించేవారు.

6. మదయుతజన సంతాపినీ  

   – మదంతో ఉన్న (అహంకారుల) జనులను బాధించేవారు  

   → అహంకారులను సంహరించే, దుర్మార్గులను శిక్షించే శక్తి.

7. మృదుకరకలాసంశోభినీ* 

   – మృదువైన చేతులతో కళాశోభను కలిగించినవారు  

   → ఆమె చేతులు సౌందర్యంతో, కళాత్మకతతో నిండినవి.

8. హృదిలసతు మే విద్యాధునీ 

   – హృదయంలో ప్రకాశించే విద్యా నదిగా వెలిగేవారు  

   → విద్యారూపిణిగా, జ్ఞానాన్ని ప్రసరించే శక్తిగా అమ్మవారు.

చిల్కుండ సోదరీమణులు లక్ష్మీ నాగరాజ్, ఇందు నాగరాజ్ ఈ కృతిని చారుకేశి రాగంలో ఆలపించారు


హరికథా కళాకారిణి దాలిపర్తి ఉమామహేశ్వరి గారు



తెలుగుదనంతో పూర్తిగా ముడిపడిన కళ హరికథ. సాహిత్యం, సంగీతం, కూసంత నృత్యం ఖచ్చితంగా వస్తేనే హరికథ చెప్పగలరు. అటువంటి కళను అభ్యసించేందుకు సుమనస్కులు, సంస్కారవంతులు, కళాపోషకులు అప్పటి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం జమీందారు బలుసు ప్రభాకర బుచ్చి కృష్ణ సత్యనారాయణరావు గారు 1973లో సర్వారాయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా సర్వారాయ హరికథా పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలలో నేర్చుకుని గొప్ప కళాకారిణి పేరొందారు శ్రీమతి దాలిపర్తి ఉమామహేశ్వరి గారు, ప్రముఖ ఆంధ్రనాట్య కళాకారులు కళాకృష్ణ గారి ధర్మపత్ని. 2024లో వారికి పద్మశ్రీ అవార్డు లభించింది. వారి జీవిత విశేషాలు ఈ పోస్టులో, వారితో ఇంటర్వ్యూ చూడండి, ఎంత చక్కని తెలుగు భాష వారిది! 

శ్రీమతి దాలిపర్తి ఉమామహేశ్వరి గారు తెలుగు మరియు సంస్కృత భాషల్లో ప్రసిద్ధి చెందిన హరికథా కళాకారిణి. సంస్కృతంలో హరికథను ప్రదర్శించిన మొదటి మహిళా హరికథా కళాకారిణి అనే దేశవ్యాప్త ఖ్యాతి ఆమెకు లభించింది.

1960 మే 21న ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో సాంప్రదాయ సంగీతకారుల కుటుంబంలో జన్మించిన ఆమె చిన్న వయస్సు నుంచే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసిస్తూ, పాఠశాల విద్యను పూర్తిచేశారు. ఆమె తండ్రి తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయానికి ఆస్థాన నాదస్వర విద్వాంసులు.

హరికథ నేర్చుకోవడంలో శ్రీ ఎస్బీపీబీకే సత్యనారాయణరావు, వారి ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరి గారు ఉమామహేశ్వరి గారిని ఎంతో ప్రోత్సహించారు. హరికథను ఆమె గురువులైన శ్రీ కడలి వీరదాసు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు, రాజశేఖరుని లక్ష్మీపతిరావు, ఎన్సీహెచ్ కృష్ణమాచార్య, వేదిమంచి నరసింహదాసు గారి వద్ద అభ్యసించారు. ఆమె నాట్యాచార్య శ్రీ నటరాజ రామకృష్ణ గారి శిష్యురాలిగా శాస్త్రీయ నృత్యాన్ని కూడా నేర్చుకున్నారు. ఆమె తొలి తెలుగు హరికథ గౌరీకల్యాణం, ఇది ఆమె మాతృసంస్థ అయిన సర్వారాయ హరికథ పాఠశాలలో ప్రదర్శించబడింది. తొలి సంస్కృత హరికథ కాళిదాస కుమారసంభవం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని ఖ్యాతిగాంచిన కాళిదాస అకాడమీలో ప్రదర్శించారు. అప్పటి నుంచి కాళిదాస అకాడమీలో ఆమె ప్రదర్శనలు ప్రతి యేటా ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కాళిదాసుని దాదాపు అన్ని నాటకాలు, కావ్యాలను సంస్కృతంలో ఆమె ప్రదర్శించారు. సర్వారాయ హరికథ పాఠశాల గౌరవ ప్రధానాచార్యురాలిగా ఆమె అనేక మంది బాలికలకు హరికథను వృత్తిగా తీసుకునేలా శిక్షణ, ప్రేరణ అందిస్తున్నారు.ఉమామహేశ్వరి గారు హరికథా పితామహుడిగా పరిగణించబడే ఆది భోట్ల నారాయణదాసు గారి హరికథలను ప్రజలకు విస్తృతంగా పరిచయం చేశారు. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాసాల నుంచి ఎన్నో ప్రత్యేక ఘట్టాలను చేర్చి తన ప్రదర్శనలకు విశిష్టతను తెచ్చారు.రమణ మహర్షి, శారదా దేవి పరమహంస, పొట్టిశ్రీరాములు, ఆదికవి నన్నయ్యలపై హరికథలు రచించి వాటిని ప్రజాదరణ పొందేలా చేశారు. కవయిత్రిగా, రచయితగా కూడా ఆమె విశిష్ట ప్రతిభ చూపారు.

తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, అన్నవరం, వేములవాడ వంటి అనేక క్షేత్రాలలో ఆమె ప్రదర్శనలు నిరంతరం జరుగుతుంటాయి. ఆమె వృత్తిజీవితంలో అత్యున్నత ఘట్టం 1986లో బద్రినాథ్‌లో జరిగిన శ్రీ ఆది శంకరాచార్య జయంతి వేడుకలలో చేసిన హరికథ ప్రదర్శన. అంతేకాక, ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయం, యేలు విశ్వవిద్యాలయాలలో జరిగిన వేదిక సదస్సుల్లో పాల్గొన్నారు. దేశం నలుమూలలా, విదేశాలలో కూడా ఆమె హరికథా వైభవాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. 1981లో మలేషియాలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు, 1993లో హార్వర్డ్ వేదసమ్మేళనం, 1996లో అమెరికాలో ఆటా తెలుగు సమావేశం (హ్యూస్టన్), అలాగే యూకే (1996), సింగపూర్, ఇండోనేషియా (2003), ఒమన్ తదితర దేశాలలో ఆమె ప్రదర్శనలు ప్రశంసలు అందుకున్నాయి.

ఆమె కళను సంరక్షించేందుకు అనేక సాంస్కృతిక సంస్థలు ఆమె ఆడియో, వీడియో రికార్డులు నిర్వహించాయి. వాటిలో బొంబాయి నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, న్యూఢిల్లీ సెంట్రల్ సంగీత నాటక అకాడమీ, సాహిత్యకళా పరిషత్, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్, వారణాసిలోని జ్ఞాన ప్రవాహ సంస్థలు ముఖ్యమైనవిగా నిలుస్తాయి. హరికథకు చేసిన విశేషసేవలకు అనేక పురస్కారాలు, గౌరవాలు ఆమెకు లభించాయి. సెంట్రల్ సంగీత నాటక అకాడమీ పురస్కార్, లలితకళా పురస్కారం, కలారత్న పురస్కారం, మహిళా నవరత్న అవార్డు, దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డు వంటి అనేక గుర్తింపులు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్్లో స్థానం పొందిన తొలి మహిళా హరికథ కళాకారిణి ఆమె. శృంగేరి శారదా పీఠాధిపతి ఆమెకు అభినవ మాతంగి బిరుదు ప్రదానం చేశారు. ఉజ్జయినిలోని కాళిదాస అకాడమీ చిత్రకథా సరస్వతి, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఉత్తమ హరికథ ప్రవచనకారిణి వంటి బిరుదులతో ఆమెను సత్కరించాయి.దూరదర్శన్, ఆకాశవాణి లో ఆమె గ్రేడ్‌డ్ ఆర్టిస్ట్. శ్రీ సర్వారాయ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుండి లలితకళా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సంస్కృతి శాఖ నుండి ఉగాది పురస్కారం కూడా పొందారు.

ఉమామహేశ్వరి గారితో ముఖాముఖీ

అదివో చూడరో అందరు మొక్కరో - అన్నమాచార్యుల కీర్తన



 అదివో చూడరో అందరు మొక్కరో గుదిగొని బ్రహ్మము కోనేటి దరిని

రవిమండలమున రంజిల్లు తేజము దివి చంద్రునిలోని తేజము
భువిననలంబున బొడమిన తేజము వివిధంబులైన విశ్వతేజము

క్షీరాంబుధిలో చెలగు సాకారము సారె వైకుంఠపు సాకారము
యీరీతి యోగీంద్రులెంచు సాకారము సారెకు జగముల సాకారము

పొలసినయాగంబులలో ఫలమును పలుతపములలో ఫలమును
తలచిన తలపుల దానఫలంబును బలిమి శ్రీవేంకటపతియే ఫలము


భావం: 

ఇదిగో చూడండి - ఇది సాధారణ దృశ్యం కాదు. ఇది దర్శించినవారందరూ సహజంగానే నమస్కరించేంత మహిమ కలిగిన స్వరూపం.పుష్కరిణి సమీపంలో వెలసిన ఈ పరబ్రహ్మను బయటి చూపుతో కాదు; మనస్సును అంతర్ముఖం చేసి, లోతుగా ధ్యానించినవారే చేరగల మార్గమిదని అన్నమాచార్యుల వారు చెబుతున్నారు. ఇది జ్ఞానమార్గం కాదు, అహంకారాన్ని వదిలే అంతర్యాత్ర.

సూర్యునిలో కనిపించే ఉజ్జ్వల కాంతి, చంద్రునిలో కనిపించే శాంత ప్రకాశం, అగ్నిలో మండే ఉగ్ర తేజస్సు - ఈ మూడు వేర్వేరు లక్షణాలైనా, మూలంగా అవన్నీ ఒకే తేజస్సు. అది పరబ్రహ్మ తేజస్సు. అంటే దేవుడు ఎక్కడో వేరుగా లేడు. ప్రకృతిలో కనిపించే ప్రతి శక్తి ఆయనే.

అదే పరబ్రహ్మం పాలసముద్రంలో నారాయణుడిగా సాకారమైంది. అదే వైకుంఠంలో నిత్యనివాసిగా ప్రకాశిస్తోంది. యోగులు తమ ధ్యానంలో దర్శించేది కూడా అదే రూపం. అలాగే సమస్త లోకాలకు ఆధారమైన మూలస్వరూపం కూడా ఆయనే. ఇక్కడ అన్నమాచార్యులు నిరాకార–సాకార భేదాన్ని తొలగించే సందేశం యిచ్చారు. రూపం ఉన్నా,లేకున్నా, సత్యం ఒక్కటే అని చెబుతున్నారు.

యజ్ఞయాగముల ఫలము, అనేక తపస్సుల ఫలము, నిరంతరము తలచిన ఫలము, దానములు చేసిన ఫలము, అన్నీ కూడా ఆ శ్రీవేంకటేశ్వరుడే. అన్నమాచార్యుల తత్త్వసారాంశం ఇదే - సాధనలన్నీ గమ్యం కాదు, భగవంతుడే గమ్యం. 

ఈ కీర్తన మొత్తం చెబుతున్నది ఒక్క వాక్యంలో: సర్వత్రా కనిపించే తేజస్సు భగవంతుడే. అన్ని సాధనల పరమ ఫలితం ఆయనే.


శోభారాజు గారి ఆలాపన

27, డిసెంబర్ 2025, శనివారం

భగవద్రామానుజులు - మేల్కోటే రామప్రియ విగ్రహం

 ఆరోజుల్లో చోళరాజు పెడుతున్న హింసలు భరించలేక భగవద్రామానుజులు తన శిష్యగణంతో మైసూరు సమీపంలోని మేల్కోటేలో దాదాపు 20 ఏళ్లు నివసించారు. అక్కడ ఉన్నప్పుడు ఆయన సనాతనధర్మానికి, సమాజానికి చేసిన సేవ అంతా యింతా కాదు. వేదపాఠశాల, చెలువనారాయణస్వామి దేవస్థాన నిర్మాణం, తత్సంబంధమైన వ్యవస్థల ఏర్పాటు, క్షామంతో అలమటిస్తున్న ప్రజల కోసం తొన్నూరు రిజర్వాయర్ నిర్మాణం...ఇవన్నీ రామానుజుల వారి చలవే. అంతే కాదు, మొట్టమొదటిసారి హరిజనులు దేవాలయ ప్రవేశానికి అనుమతించబడింది చెలువనారాయణుని సన్నిధిలోనే, అది రామానుజుల వారి వల్లే.


అక్కడి మహారాజు విష్ణువర్ధనుని చేత తాలక్కాడ్, తొండనూర్, బేలూరు, నాగమంగళ, బెళవాడి అనే ఐదు ప్రదేశాలలో కీర్తినారాయణ, నంబినారాయణ, కేశవనారాయణ, సౌమ్యనారాయణ, వీరనారాయణ దేవస్థానాలను ఏర్పాటు చేయించి శ్రీవైష్ణవ వ్యాప్తికి, స్థిరత్వానికి తోడ్పడ్డారు. నిజం చెప్పాలంటే శ్రీరంగం కన్నా శ్రీవైష్ణవం నిలబడింది మైసూరు ప్రాంతంలో రామానుల వారు చేసిన ప్రయత్నాల వల్లనే. అందుకే ఆయన పంచ నారాయణ క్షేత్ర ప్రతిష్ఠాపనాచార్యగా ప్రసిద్ధి పొందారు.

అంతే కాదు, 82 ఏళ్ల వయసులో కాలినడకన ఢిల్లీ వెళ్లి మొఘల్ సుల్తాను వద్ద నుండి ఉత్సవమూర్తి అయిన రామప్రియ రూపాన్ని పరిపూర్ణమైన భక్తి మహిమతో సాధించి తీసుకు వచ్చి సనాతనధర్మంలోని భక్తి మార్గం యొక్క గొప్పతనాన్ని మరోమారు చాటి శాశ్వతం చేశారు. బీబీ నాంచారి అన్న గాథ ఈ ఉదంతానికి సంబంధించినదే. ఇస్లాంలో జన్మించినా ఆ రామప్రియ ఉత్సవమూర్తిలోని దైవాన్ని గ్రహించి ఆరాధించ గలిగిన స్త్రీ కాబట్టే ఆమెకు పూజనీయ స్థానం కలిగించారు రామానుజుల వారు.

వెయ్యేళ్ల నాడు రామానుజుల వారు ఢిల్లీ నుండి తెచ్చిన రామప్రియ విగ్రహం ఇదుగో!

రామానుజో విజయతే!



27, అక్టోబర్ 2025, సోమవారం

దేవ కార్యం - పితృ కార్యం

మనం చేసే కార్యాలలో హోమంతో కూడినవి దేవతలకు ప్రీతిగా చేసేవి, పితృదేవతలకు ప్రీతిగా చేసేవి ప్రధానంగా రెండు భాగాలు. పర-అపర కర్మలకు అనుసంధానమైనవి ఇవి. వీటిలో మనం వినే పదాలు స్వాహా స్వధా. ఇవి ఏమిటి?
స్వాహా అన్న పదానికి అగ్ని దేవుని భార్య, హవిష్ప్రదానం అన్నవి ప్రధానమైన అర్థాలు. యజ్ఞకాండలో స్వాహా శబ్దం లేకుండా హవిస్సులు వేల్చడం ఉండదు. ఏ దేవతలను ఉద్దేశించి యజ్ఞాదులు చేస్తున్నారో వారికి హవిస్సులు అందడానికి స్వాహా తప్పనిసరి. ఆహుతులు స్వాహాకార, వషట్కార పూర్వకంగా వేల్చినప్పుడే దేవతలకు అందుతాయి. అయితే, సంధ్యావందనంలో కేశవ నామాలు చెప్పేటప్పుడు త్రిరాచమ్య అంటూ ముమ్మారు స్వాహాకారంతో ఆచమనం చేయడం పద్ధతి. ఇక్కడ హోమాగ్ని ప్రసక్తి లేదు. అయినప్పటికీ అవి దేవతలకు సమర్పించేవే కనుక స్వాహా శబ్దాన్ని వాడవలసి వస్తున్నది. స్వాహా శబ్దం హోమ సంబంధమైన సాంకేతిక పదం మాత్రమే కాదు. అది సార్థకమైన వాఙ్నామం కూడా. చక్కగా హుతమగుగాక అనే అర్థాన్ని కొందరు భాష్యకారులు ఉదహరించారు. ఇది మహామహిమాన్వితమైన మంత్రమని కొందరు విద్వాంసుల భావన. వేద మంత్రాలు లేకుండానే స్వాహా మంత్రోచ్చారణ చేసే సందర్భాలు ఉన్నాయి. నిత్యనైమిత్తిక కర్మలలోనూ యజ్ఞ యాగాదులలోనూ ఆచమన క్రియతో స్వాహా సాక్షాత్కరించడం ప్రారంభ మవుతుంది. దేవతలకు ఆహుతులను అందించే శబ్దంగా స్వాహా ప్రసిద్ధమైంది. అంతే కాదు అనేక మంత్రాలకు చివర స్వాహా ఉంటుంది. స్వాహా దేవికి ప్రీతికరమైనది ఘృతము. అందుకే అగ్ని కార్యాలలో ఘృతము ప్రధానమైన భుక్కు.
అగ్నికార్యంలో/ యజ్ఞాలలో స్వాహా శబ్దం వినిపించినట్లే పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వడంలో స్వధా శబ్దం వినిపిస్తుంది. పితృయజ్ఞాలలో స్వాహాదేవియే తర్పణాలలో స్వధా రూపిణిగా వస్తున్నదని శాస్త్రం. (పితృ యజ్ఞేషు స్వధా మాతా) పితృ దేవతలను ఉద్దేశించి వషట్కారం చేయడం స్వధాకారం.(స్వధానమ ఇతి వషట్కారపి). అగ్ని దేవుని భార్య స్వాహాదేవి యొక్క మరో రూపం స్వధా. ఈ స్వధా దేవికి ప్రీతికరమైనవి నల్ల నువ్వులు. అందుకే నల్ల నువ్వులను తర్పణ విధి పూర్వకంగా భుక్కుగా పితృదేవతలకు సమర్పిస్తాము. స్వధానమ తర్పయామి అన్న మంత్రం శ్రాద్ధ కర్మలలో వినిపించే మంత్రం. ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు గోత్రం పేరు మరియు రూపాన్ని (వసు రూపం, రుద్ర రూపం, ఆదిత్య రూపం) పేర్కొని, తదనంతరం "స్వధా నమః తర్పయామి" అని మూడు సార్లు చెప్పి తర్పణం సమర్పిస్తాము.
మీరు పై నిర్వచనాలను, ప్రయోజనాలను గమనిస్తే రెండు విభాగాల ప్రక్రియలు కూడా చాలా సారూప్యత కలిగి ఉంటాయి. అందుకే పితృకార్యాలకు, ఇతర అగ్నికార్యాలతో సమానమైన స్థానం, ప్రయోజనాన్ని చెప్పారు మన ఋషులు.
రెండిటిలో ప్రధానమైన భేదాలు రెండిటి మధ్య తేడాను స్పష్టంగా తెలుపటానికి సాంకేతికంగా ఏర్పడినవే అని నా ఉద్దేశం. అందుకే పితృకార్యాలను ఇతర అగ్నికార్యాలను అంతే పవిత్రంగా, అంతే నమ్మకంతో, భక్తి పూర్వకంగా నిర్వర్తించాలి అని ప్రాజ్ఞులు నొక్కివక్కాణిస్తారు.

10, ఏప్రిల్ 2024, బుధవారం

అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు - శ్రీరంగం గోపాలరత్నం ఆలపించిన అన్నమయ్య కృతి

తెలుగు గడ్డ మీద పుట్టిన ఓ అనర్ఘ్యరత్నం శ్రీరంగం గోపాలరత్నం గారు. ఆవిడ దివికేగి మూడు దశాబ్దాలు దాటినా ఈనాటికీ కూడా అటువంటి గాత్రం మళ్లీ తెలుగు గడ్డ మీద పుట్టలేదు. ఆవిడ గాత్ర మాధుర్యం, తెలుగుదనం ఉట్టిపడే ప్రతిభ అనన్యం. దాదాపు నాలుగు దశాబ్దాల సంగీత ప్రస్థానంలో ఆవిడ తెలుగు గడ్డపై శాస్త్రీయ సంగీతానికి మహారాణిగా నిలిచారంటే అతిశయోక్తి కాదు. కవిరాయుని జోగారావు గారు, డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి వద్ద సంగీతాన్ని అభ్యసించారు. అతిపిన్న వయసులోనే హరికథలు ఆలపించారు. 

ఆవిడ ఆలపించిన ఓ అన్నమాచార్యుల వారి కృతి, బాలకృష్ణుని లీలలపై, ఆరభి రాగంలో స్వరపరచబడింది. అన్నమాచార్యుల వారికి ఆ కృష్ణుని లీలలు ఎంత అద్భుతంగా కనబడ్డాయో అంతకు మించి అందంగా ఆయన పదాలలో వెలువడ్డాయి. అన్నమాచార్యుల సాహిత్యమంటేనే తెనుగుదనం ఉట్టీపడే జానపదాలు. గోపాలరత్నం గారు ఈ కృతిని రమ్యాతిరమ్యంగా ఆలపించారు.  

అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు
దినదిన క్రొత్తలాయదృష్టమిదే మాకు

ఆడెడి బాలుల హరి అంగిలి చూపుమని
తోడనే వాండ్ల నోర దుమ్ములు చల్లి
యీడ మాతో చెప్పగాను యిందరము గూడిపోయి
చూడబోతే పంచదారై చోద్యమాయెనమ్మా

తీట తీగెలు సొమ్మంటూ దేహము నిండ గట్టె
తీటకుగాక బాలులు తెగి వాపోగా
పాటించి యీ సుద్ది విని పారితెంచి చూచితేను
కోటికోటి సొమ్ములాయ కొత్తలోయమ్మా

కాకి జున్ను జున్నులంట గంపెడేసి తినిపించి
వాకొలిపి బాలులెల్ల వాపోవగా 
ఆకడ శ్రీవేంకటేశుడా బాలుల కంటి నీరు
జోకగ ముత్యాలుసేసె జూడగానమ్మా 

ఓ యశోదమ్మా! ఈ చిన్ని కృష్ణుని మాయలు అంతా ఇంతా అని చెప్పలేము, ప్రతి రోజు కొత్త కొత్తగా ఉన్న ఈ మాయలను చూడటం మా అదృష్టం. తనతో ఆడే బాలురి అంగిలి చూపమని చెప్పి వారు నోరు తెరవగానే దుమ్ము చల్లాడుట. ఆ మాట పిల్లలు మాకు చెప్పగా మేమందరము వెళ్లి చూస్తే ఆ దుమ్మంతా పంచదారయ్యింది, ఇదేమి వింతో! దురదలు పుట్టించే తీగెలు ఆభరణాలంటూ తోటి బాలుర దేహముపై కృష్ణుడు కట్టాడుట, ఆ దురదలు భరించలేక బాలులు మా వద్ద వాపోగా, మేమంతా వెళ్లి చూస్తే ఆ తీగెలు అమూల్యమైన కొత్త ఆభరాణాలయినాయమ్మా! చిన్న చిన్న జున్ను ముద్దలు  గంపల కొద్దీ తోటి బాలురకు తినిపించాడుట, వారు ఆ వికారాన్ని భరించలేక మా వద్ద వాపోయారు. మేమంతా వెళ్ళి చూడగా శ్రీనివాసుడా బాలుల కంటి నీరును అద్భుతంగా ముత్యాలుగా మార్చేసాడమ్మా!  

3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

క్షీరసాగర విహార - త్యాగరాజస్వామి కృతి



ఈ కృతి బాలమురళీకృష్ణ గారి గాత్రంలో వింటుంటే ఎంతటి కఠినమైన హృదయమైనా కరిగి పోవలసిందే. త్యాగరాజాది భక్తులను పోషించిన శ్రీరామచంద్రమూర్తి గుణవైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరించే కృతి ఇది. త్యాగరాజస్వామి ఉత్సవ సాంప్రదాయ కృతులలో ఒకటి, బాలమురళీకృష్ణ గారు ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. ఆనందభైరవి రాగంలో స్వరపరచబడింది. త్యాగరాజ శిష్యపరంపరలో ఐదవ తరానికి చెందిన వారు బాలమురళీకృష్ణ గారు. సద్గురువుల సాహిత్యం, స్వరరచన యథాతథంగా కొనసాగించిన వారిలో మంగళంపల్లి వారు అగ్రగణ్యులు. వారి గాత్రంలో ఈ కృతిని విని ఆనందించండి. 

క్షీరసాగర విహార! అపరిమిత ఘోర పాతక విదార!
క్రూర జన గణ విదూర! నిగమ సంచార! సుందర శరీర!

శతమఖాऽహిత విభంగ! శ్రీరామ! శమన రిపు సన్నుతాంగ!
శ్రితమానవాంతరంగ! జనకజా శృంగార జలజ భృంగ!

రాజాధిరాజ వేష! శ్రీరామ! రమణీయ కర సుభూష!
రాజనుత లలిత భాష! శ్రీ త్యాగరాజాది భక్త పోష!

పాలకడలిలో విహరించేవాడు, అనంతమైన ఘోర పాపములను నాశనము చేసేవాడు, రాక్షస సమూహాన్ని సంహరించేవాడు, వేదములలో సంచరించేవాడు, సుందరమైన శరీరము కలవాడు, నూరు యజ్ఞములు చేసిన ఇంద్రుని శత్రువులను నాశనము చేసేవాడు, మన్మథుని శత్రువైన పరమశివునిచే నుతించబడినవాడు, ఆశ్రయించినవారి హృదయములలో నివసించేవాడు, కలువ వంటి సీతమ్మ పాలిట తుమ్మెద వంటివాడు, రాజాధిరాజు అయినవాడు, అందమైన హస్తములు కలిగి, చక్కని ఆభరణములు ధరించినవాడు, రాజులచే నుతించబడినవాడు, మృదువుగా మాట్లాడేవాడు, త్యాగరాజు మొదలైన భక్తులను పోషించేవాడు శ్రీరాముడు. 

- త్యాగరాజస్వామి

25, జనవరి 2021, సోమవారం

ఆనందసాగరమీదని దేహము - త్యాగరాజస్వామి కృతి

త్యాగరాజస్వామి వారి నాదయోగంలో బ్రహ్మానందస్థితిలో రచించిన కృతులెన్నో. ఆ అనందాన్ని అనుభవించలేని దేహం భూమికి భారమే అన్నది కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. బ్రహ్మవిష్ణుమహేశ్వరులు, ఎందరో మహానుభావులు చేసిన నాదోపాసనను మానవుడూ కూడా అనుభూతి చెందాలన్నది సద్గురువుల సందేశం. అటువంటి భావమున్న కృతి ఆనందసాగరమీదని దేహము. వివరాలు:

సాహిత్యం
========

ఆనందసాగరమీదని దేహము భూమిభారమే రామబ్రహ్మా(నందసాగర)

శ్రీనాయకాఖిల నైగమాశ్రిత సంగీత జ్ణానమను బ్రహ్మా(నందసాగర)

శ్రీవిశ్వనాథ శ్రీకాంత విదులు పావనమూర్తులుపాసించలేదా
భావించి రాగలయాదుల భజియించే శ్రీత్యాగరాజనుత 

భావం
=====

ఓ రామా!సీతాపతీ! రామ పరబ్రహ్మమనే ఆనందసాగరములో ఈదని దేహము ఈ భూమికి భారమే. సమస్త వేదములకు ఆశ్రయమైన సంగీత జ్ఞానమనే బ్రహ్మానందమనే సాగరాన్ని అనుభూతి చెందని దేహము భారమైనది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, నిర్మలరూపులు సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉపాసించినారు కదా! ఆ విధముగా భావించి రాగలయాదులతో భజించే పరమశివునిచే నుతించబడే శ్రీరామా! బ్రహ్మానందమనే సాగరాన్ని అనుభూతి చెందని దేహము భారమైనది. 

శ్రవణం
======

గరుడధ్వని రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని కృత్తికా నటరాజన్ గారు ఆలపించారు.

16, జనవరి 2021, శనివారం

చిదంబర నటరాజమాశ్రయేऽహం - ముత్తుస్వామి దీక్షితుల కృతి


పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటైన చిదంబరంలో నటరాజస్వామి, శివకామసుందరీ అమ్మ వారు, ఈ క్షేత్రంలోనే ఉన్న గోవిందరాజస్వామిపై నాదజ్యోతి ముత్తుస్వామి దీక్షితుల వారు ఎన్నో కృతులను రచించారు. చిదంబర క్షేత్రం విశ్వానికి హృదయస్థానంగా, చిత్సభలో నటరాజస్వామి చేసే నాట్యం యొక్క లయే విశ్వానికి హృదయస్పందంగా చెప్పబడింది. ఎంతో నిగూఢమైన సందేశం కలిగిన కృతులను ఆయన ఈ క్షేత్ర దేవతలపై రచించారు. వాటిలో ముఖ్యమైనవి ఆనందనటనప్రకాశం, చిదంబరేశ్వరం, శివకామీపతిం చింతయేऽహం, శివకామేశ్వరీం చింతయేऽహం, శివకామేశ్వరం చింతయామ్యహం, చింతయేऽహం సదా చిత్సభా నాయకం, గోవిందరాజాయ నమస్తే, సతతం గోవిందరాజం మొదలైనవి. వీటితో పాటు చిదంబర నటరాజమాశ్రయేऽహం అన్న కృతిని కూడా రచించారు. వివరాలు:

సాహిత్యం
=======

చిదంబర నటరాజమాశ్రయేऽహం శివకామీపతిం చిత్సభాపతిం

చిదంబరవిహారం శంకరం చిదానందకరం గురుగుహవరం
కేదారేశ్వరం విశ్వేశ్వరం కమలాపతి నుత పదం శశిధరం

భావం
=====

చిత్సభకు ప్రభువు, శివకామసుందరికి పతియిన చిదంబర నటరాజస్వామిని నేను శరణు కోరుచున్నాను. ఆకాశలింగ రూపములో చిదంబరంలో విహరించేవాడు, శాశ్వతమైన ఆనందమును కలిగించేవాడు, సుబ్రహ్మణ్యునికి వరములొసగినవాడు, కేదారేశ్వరునిగా కేదారనాథ్‌లో వెలసినవాడు, విశ్వమునకు ప్రభువు, లక్ష్మీపతి యైన శ్రీహరిచే నుతించబడిన పదములు కలవాడు, చంద్రుని తలపై ధరించినవాడు అయిన చిదంబర నటరాజస్వామిని నేను శరణు కోరుచున్నాను. 

శ్రవణం
======

కేదారం రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఐశ్వర్యా శంకర్ గారు ఆలపించారు