28, ఫిబ్రవరి 2016, ఆదివారం

యుధిష్ఠిర కృత దుర్గాదేవి స్తుతి - మహాభారతం విరాటపర్వం


యశోదాగర్భ సంభూతాం నారాయణవరప్రియాం
నందగోపకులే జాతాం మంగళ్యాం కులవర్ధినీం

కంసవిద్రావణకరీం అసురాణాం క్షయంకరీం
శిలాతటవినిక్షిప్తాం ఆకాశం ప్రతిగామినీం

వాసుదేవస్య భగినీం దివ్యమాల్య విభూషితాం
దివ్యాంబరధరాం దేవీం ఖడ్గఖేటక ధారిణీం

జయా త్వం విజయా చైవ సంగ్రామే చ జయప్రదా
మమాపి విజయం దేహి వరదా త్వం చ సాప్రతం

వింధ్యే చైవ నగశ్రేష్ఠే తవ స్థానం హి శాశ్వతం
కాళి కాళి మహాకాళి ఖడ్గఖత్వాంగధారిణి

దుర్గాత్ తారయసే దుర్గే తత్ త్వం దుర్గా స్మృతా జనైః
కాంతారేష్వవసన్నానాం మగ్నానాం చ మహార్ణవే

దస్యుభిర్వా నిరుద్ధానాం త్వం గతిః పరమా నృణాం
జలప్రతరణే చైవ కాంతారేష్వటవీషు చ

యే స్మరంతి మహాదేవి న చ సీదంతి తే నరాః
త్వం కీర్తిః శ్రీః ధృతిః సిద్ధిః హ్రీః విద్యా సంతతిర్మతిః

సంధ్యా రాత్రిః ప్రభా నిద్రా జ్యోత్స్నా కాంతిః క్షమా దయా
నృణాంచ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయం

వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి
సోహం రాజ్యాత్ పరిభ్రష్టః శరణం త్వాం ప్రపన్నవాన్

ప్రణతశ్చ యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి
త్రాహి మాం పద్మపత్రాక్షి సత్యే సత్యా భవస్వ నః

యశోద గర్భము నుండి పుట్టి, నారాయణునికి ప్రియమైన, నందగోపుని వంశంలో జన్మించి, అందరికీ శుభములిచ్చి వంశాభివృద్ధి కలిగించే తల్లీ! కంసుని పారద్రోలి, అసురులను నాశనం చేసి, రాతిమీద కొట్టబడినా ఆకాశమార్గంలో పయనించిన వాసుదేవుని సోదరీ! దివ్యమైన పూలమాలలు, వస్త్రములు, ఖడ్గమును, డాలు దాల్చిన దేవీ!

నీవే జయవు, విజయవు. యుద్ధములో జయమునిచ్చే దానవు. నాకు కూడ విజయాన్ని ప్రసాదించే వరాన్ని ఇపుడీయుము.

కాళీ! మహాకాళీ! ఖడ్గము, కపాలం కల దండము ధరించి పర్వత శ్రేష్ఠమైన వింధ్య పర్వతాన్ని శాశ్వత నివాసం చేసుకున్నావు.

ఓ తల్లీ! భరింపరాని కష్టాలనుండి తరింప జేస్తావు కాబట్టే నిన్ను ప్రజలు దుర్గ అని కొలుస్తారు. అడవుల్లో చిక్కుకున్న వారికి, సముద్రం దాటే వారికి, దుర్గమమైన మార్గాలలో పయనించే వారికి, క్రూరుల బారిన పడేవారికి నీవే గతి. నిన్ను స్మరించినవారు ఈ కార్యాలలో కష్టాలపాలు కారు.

నీవే కీర్తివి, శుభానివి, ధైర్యానివి, సిద్ధి, లజ్జ, విద్య, సంతానం, బుద్ధి, సంధ్య, రాత్రి, తేజస్సు, నిద్ర, వెన్నెల, కాంతి, ఓర్పు, దయ మొదలైన రూపాలన్నీ నీవే. నిన్ను పూజించే వారి బంధనం, మోహం, పుత్రశోకం, ధననాశం, రోగం, మృత్యువు, భయము తీరుస్తావు. అమ్మా! ఇప్పుడు నేను రాజ్యభ్రష్టుడనయ్యాను. నీ శరణు వేడుతున్నాను.

దేవతలకు కూడా దేవివైన నీకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నీవు కలువరేకులవంటి ప్రసన్నమైన కనులు కలదానవు. నన్ను రక్షించు. నీవే సత్యము. మా పట్ల సత్యము కమ్ము!

మహాభారతం విరాట పర్వం ఆరంభంలో పాండవులు అజ్ఞాతవాసానికై విరాటుని కొలువుకు వెళ్లేముందు ధర్మరాజు దుర్గాదేవిని స్తుతించిన శ్లోకాలు. యుధిష్ఠిరుడి వంటి ధర్మ ప్రభువుకు, సత్యసంధునకు కూడా కష్టాలు తప్పలేదు. అఖండ భారతదేశాన్ని పాలించవలసిన పాండుకుమారులకు తమ నిజస్వరూపం తెలియకుండా మారువేషాలలో ఇంకొకరి పంచన ఉండాల్సిన అగత్యం వచ్చింది. ఎవరు అప్పుడు శరణు? ఆదిపరాశక్తి దుర్గ. ధర్మరాజు ఆ తల్లిని నారాయణుని సోదరిగా, కంసుని మరణానికి కారణమై, దానిని ఆ అసురునికి స్వయంగా తెలిపిన యోగమాయగా గ్రహించి నుతిస్తాడు. ఎంతో భక్తితో ధర్మరాజు కొలువగానే అమ్మ ప్రత్యక్షమై "నాయనా! నీకు త్వరలోనే విజయం కలుగుతుంది. నా అనుగ్రహం వలన విరాటుని కొలువులో మీరుండగా మీ జాడను కౌరవులతో సహా ఎవ్వరూ తెలుసుకోలేరు. నన్ను స్మరించిన వారికి నేను సదా రక్షగా ఉంటాను" అని ఆశీర్వదిస్తుంది. మనం కొలిచే దుర్గా స్వరూపం సనాతనమైనదని చెప్పటానికి ఇది నిరూపణ. అంతకుముందు కూడా ఎన్నో మార్లు ఎంతో మంది ఆదిపరాశక్తి రూపాన్ని కొలిచారు.

దుర్గామాతను నీచమైన కోణంలో ఇటీవల ఒక యూనివర్సిటీ విద్యార్థులు చూపించి, అతి నీచమైన మాటలు పలికారని బయటపడింది. మనసులో ఆదిపరాశక్తిని అన్నేసి మాటలన్న నరాధములను ఆ తల్లి శిక్షించాలని ఉక్రోషం కలిగింది. సనాతన ధర్మంపై ఇంతటి దాడి జరుగుతుంటే మనం జాగృతం కావాలి. దీన్ని నిరోధించాలి, వ్యతిరేకించి తీరాలి. ఇప్పుడు మౌనం పాటిస్తే రేపు మరింత ఘోరకలిని చూడాల్సి వస్తుంది. లేవండి! జరుగుతున్న దాడిని ఆపండి!

27, ఫిబ్రవరి 2016, శనివారం

తొలిరేయి గీతాలు - హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి (వెలుగునీడలు)


తొలివలపులో చంద్రుడు, చల్లదనం, పరువాలు, పరవశం, కోరికలు, చిలిపితనం, మైమరపు ఎన్ని భావనలో. గడచిన తరంలో భార్యా భర్తల మధ్య అనురాగాన్ని చాలా లలితంగా చలన చిత్రాలలో అందించేవారు. ఈరోజుల్లా దాష్టీకం, ఎగరడాలు, దూకడాలు, తొడలు కొట్టడాలు మొదలైన ఆవేశపూరితమైన లక్షణాలను చూపించేవారు కాదు. హాయిగా, ఉత్సాహంగా, ప్రశాంతంగా, లాలనగా ఆ బంధాలను చిత్రీకరించేవారు. ఆ భార్యా భర్తల తొలిరేయి ఎంత మధురంగా ఉంటుందో తెలియజేయటానికి వెలుగునీడలు చిత్రంలోని "హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి" పాట మరో మంచి ఉదాహరణ. కథలో పరిస్థితుల కారణంగా ప్రధాన పాత్ర అయిన నాయికను కాకుండా ఇంకొకరిని వివాహం చేసుకున్న నాయకుడు ఆమె పట్ల తన ధర్మాన్ని నిర్వర్తించి తొలిరేయిని ఎంత మధురంగా భావించాడో ఈ గీతంలో తెలుస్తుంది. తొలిరేయి గీతాలు శీర్షికన ఆఖరి సంచికగా "హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి" గీతం వివరాలు మీకు అందిస్తున్నాను.

హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి 
మందు జల్లి నవ్వ సాగే ఎందుకో మత్తు మందు జల్లి నవ్వ సాగే ఎందుకో

తళతళ మెరిసిన తారక
చెలి వెలుగుల వెన్నెల దారుల
కోరి పిలిచెను తన దరి చేరగ
మది కలచెను తీయని కోరిక

మిల మిల వెలిగే నీటిలో
చెలి కలువల రాణి చూపులో
సుమ దళములు పూచిన తోటలో
తొలి వలపుల తేనెలు రాలెను

విరిసిన హృదయమే వీణగా
మధు రసముల కొసరిన వేళల
తొలి పరువములొలికెడు సోయగం
కని పరవశమందెను మానసం

శ్రీశ్రీ గారు తొలిరేయం గీతం రాశారా అని ఆశ్చర్యపోతున్నారా? నేను కూడా అవాక్కయ్యాను. ఆయన విప్లవ రచయితగా అందరికీ తెలుసు, అక్కడక్కడ భక్తి గీతాలు రాశారు అని తెలుసు, కానీ ఇలాంటి తొలిరేయి గీతం కూడా రాశారని తెలిసి వారి ప్రజ్ఞకు జోహార్లు తెలిపాను. ఆయనలోని ప్రతిభా జ్యోతి ఎంత దేదీప్యమానంగా వెలిగిందో ఆయన రాసిన విలక్షణమైన గీతాలు పరిశీలిస్తే తెలుస్తుంది. వాటిలో ఒకటి ఈ హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి అనే గీతం. చంద్రుడిపై ఎందరో మహానుభావులు భావుకంగా రాశారు. కానీ, ఈ శ్రీశ్రీ గీతానికి ఒక ప్రత్యేకత ఉంది. చంద్రుడు ఈ జంట తొలిరేయి నాడు వెండి దారాలల్లి మత్తు మందు చల్లి నవ్వుతున్నాడు అని ఆయన గీతాన్ని ఆరంభించటం. వెండి దారాలల్లి అంటే ఆ వెన్నెలను దారులుగా వేసి తారలను ఆహ్వానిస్తున్నాడు అని కవి భావమేమో అనిపించింది. వెన్నెల వెలుగుల దారిలో మెరుస్తున్న తారక తన దరికి చేరమని కోరి పిలిచిందిట, తీయని కోరిక మదిని కలచిందట. భార్య తారకగా, ప్రియుడు చంద్రునిగా ఎంత అద్భుతంగా వర్ణించారో శ్రీశ్రీ గారు. వెన్నెలలో మెరుస్తున్న నీటిలో కలువల చూపులలో రెక్కలు విప్పి పూచిన పూదోటలో తొలి వలపులనే తేనెలు రాలాయిట. చంద్రుని చల్లదనానికి విరిసే కలువలు ప్రేయసీ ప్రియుల మధ్య విరిసే వలపులకు ప్రతీక. దీన్నే కవి మనకు చక్కని చిక్కని తెలుగులో అందించారు. వలపులతో హృదయం వీణగా మ్రోగి తీయని రసాలని ఒలికిస్తే, ఆ తొలి పరువాల సొగసు చూసి మనసు పరవశించిందట. నాయికానాయకుల మనోభావనను అద్భుతంగా పలికించారు శ్రీశ్రీ.

వెలుగునీడలు చిత్రంలో సావిత్రి కద నాయిక? మరి ఈ పాటలో గిరిజగారున్నారు కదా అన్న ప్రశ్నకు సమాధానం మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. అయినా కూడా, దర్శకులు సందర్భోచితంగా భార్యాభర్తలపై ఈ గీతాన్ని పొందుపరచారు. ఒకరకంగా గిరిజ గారి సినీ ప్రస్థానంలో వెలుగునీడలలోని ఈ పాట ఒక గొప్ప మైలురాయి అని చెప్పుకోవాలి. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వం ప్రతిభ ఈ చిత్రం మొత్తం కనబడుతుంది. ఈ పాట చిత్రీకరణలో జాబిల్లి, వెన్నెల, భార్యాభర్తల మనోభావాలు నటనలో చూపించటం...వీటన్నిటా వారు గుర్తుకొస్తారు. పెండ్యాల వారి సంగీతంలో ఘంటసాల మాష్టారు, సుశీలమ్మ పాడిన ఈ గీతం ఎంతో పెరు తెచ్చుకొంది. పాట వినగానే ఏఎన్నార్ గారు నాయకులు అనేలా ఘంటసాల మాష్టారు పాడారు. అందరు ప్రతిభావంతుల చేత రూపకల్పన చేయబడటం వలననే తొలిరేయి గీతాలలో ఇది మంచి స్థానాన్ని నిలుపుకుంది.

23, ఫిబ్రవరి 2016, మంగళవారం

తొలిరేయి గీతాలు - పూవై విరిసిన పున్నమి వేళ (శ్రీ తిరుపతమ్మ కథ)


తొలిరేయి వలపులో సున్నితత్వానికి కూడా చాల ముఖ్యమైన చోటుంది. భార్య సిగ్గుల దొంతరలో మురిసితే, భర్త వాటిని ఆస్వాదించి సంస్కారవంతమైన భావనతో ఆనందిస్తాడు. ఆ పూవంటి మనసు గల స్త్రీ తనదైనందుకు సంతోషపడతాడు, తొలివలపులు సఫలం చేసుకోవటానికి ఆమెను ప్రొత్సహిస్తాడు, దగ్గరుండి ముందుకు నడిపిస్తాడు. అటువంటి భర్త మనసు పాడితే వచ్చేది అద్భుతమైన ప్రేమ గీతం. 1963లో విడుదలైన శ్రీ తిరుపతమ్మ కథ చిత్రంలోని "పూవై విరిసిన పున్నమి వేళ" అనే పాట అటువంటి భావనల మనోజ్ఞ మాధుర్య గీతం. తొలిరేయి గీతాలు శీర్షికన నాలుగవ సంచికగా ఈ పాట వివరాలు మీకు అందిస్తున్నాను.

పూవై విరిసిన పున్నమి వేళ 
బిడియము నీకేల? బేల!

చల్లని గాలులు సందడి చేసే
తొలి తొలి వలపులు తొందర చేసే
జలతారంచుల మేలి ముసుగులో
తలను వాల్తువేల? ఏల!

మొదటి మూగినవి మొలక నవ్వులు
పిదప సాగినవి బెదరు చూపులు
తెలిసెనులే నీ తలపులేమిటో
తొలగిపోదువేల? బేల!

తీయని వలపుల పాయసమాని
మాయని మమతల ఊయలలూగి
ఇరువురమొకటై పరవశించగా
ఇంకా జాగేల? బేల!

పున్నమికి తొలిరేయి మధుర జ్ఞాపకాలకు గల అవినాభావ సంబంధం ఎన్నో సినీగీతాలలో చూస్తాము. గత సంచికలలో కూడా ఈ పున్నమి నేపథ్యంలోని తొలిరేయి గీతాల వివరాలు తెలుసుకున్నాము. అదే బాటలో వచ్చిన ఇంకో అద్భుతమైన గీతం శ్రీ తిరుపతమ్మ కథ చిత్రంలోని ఈ పాట. భార్య సిగ్గులలో మునిగి తేలుతుంటే భర్త నోట జాలువారిన ఈ గీతం తెలుగు సినీ పాటలలో విశేషమైన స్థానాన్ని సంపాదించింది. దానికి కారణం లలితమైన భావన, మాధుర్య ప్రధానమైన సంగీతం, నటీనటుల ప్రజ్ఞ.

అన్న ఎన్‌టీఆర్, అలనాటి అందాల నటి కృష్ణకుమారిలు అప్పట్లో విజయాలు సాధించే జంటగా పేరొందారు. ఆ సమయంలోనే వచ్చింది ఈ తిరుపతమ్మ కథ చిత్రం. పామర్తి-బీ శంకరరావుల సంగీత దర్శకత్వంలో డాక్టర్ సీ నారాయణ రెడ్డి గారి కలాన వెలువడిన ఈ గీతం తొలిరేయి భావనలకు మధురమైన ఆనవాలుగా నిలిచింది. నారాయణ రెడ్డి గారి రచనలలో ఈ గీతానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దానికి కారణం ఇందులోని భావ సౌందర్యము మరియు తెలుగుదనం.

పున్నమి పూవులా విరిసింది, ఓ చెలీ! సిగ్గెందుకు అని భర్త ఆమెను ప్రశ్నిస్తున్నాడు. చల్లని గాలులు సందడి చేస్తున్నాయి, మొదటి వలపులు తొందర పెడుతున్నాయి, పట్టు చీర కట్టుకొని ఆ చీర కొంగును చాటుగా చెసుకొని తలను వంచుతున్నావు ఎందుకు అని మొదటి చరణంలో తన మనోభీష్టాన్ని తెలుపుతాడు. వలపులు వికసించిన భర్త భార్యను ముందడుగు వేయమని ఎంతో అందంగా అడుగుతాడు. ఆమె ముఖంలో మొలకలెత్తిన నవ్వులు, అంతలో బెదిరిన చూపులు ఆమె మనసులో ఏమి ఆలోచనలు తెలుపుతున్నాయి, ఎందుకు పక్కకు వెళతావు అని ఆమెను దరిచేరటానికి రెండవ చరణంలో ప్రోత్సహిస్తాడు. మూడవ చరణంలో నారాయణ రెడ్డి గారి సాహితీ ప్రతిభ మరింత కనబడుతుంది. తీయమైన వలపులను పాయసంగా భావించి రుచిని చవిచూసి, శాశ్వతమైన ప్రేమానురాగాలనే ఊయాలలో ఊగి, ఇద్దరమూ ఒకటై పరవశించాల్సిన సమయం, ఆలస్యం ఎందుకు అని అతను ఆమెను సంగమానికై ముందడుగు వేయమని కోరతాడు. ఇక్కడ భార్య భర్తను బేల అని అనటం ఆమెను బలహీనం అని చెప్పటానికి కాదు. వివాహమైనా, మనసు అర్థం చేసుకునే భర్త ఎదురుగా ఉన్నా, సహజమైన సిగ్గుతో ఉన్న స్త్రీ మానసిక పరిస్థితిని ప్రతిబింబించటానికి.

ఏ గీతానికైనా అభినయం, గాత్ర ధర్మం, సంగీతం అతి ముఖ్యమైనవి. సాహిత్యం ఎంత లాలిత్యం కూడి ఉందో,  అంతే సంగీత మాధుర్యం కలిగి ఉంది ఈ పాట. దానికి నటీనటుల అభినయం, ఘంటసాల గారి గాత్రం సరిగ్గా తోడై పాటకు శాశ్వత కీర్తిని  తెచ్చాయి. 

22, ఫిబ్రవరి 2016, సోమవారం

తొలిరేయి గీతాలు - వెన్నెలలోనే వేడి ఏలనో (పెళ్లినాటి ప్రమాణాలు)



తొలిరేయి అనగానే మధుర భావనలు, ప్రేమానురాగాలు, విరహముతో పాటు ఉత్సాహం కూడా భార్యా భర్తలలో వస్తుంది. ఆ భావనలన్నిటికీ చిహ్నంగా 1958వ సంవత్సరంలో విడుదలైన పెళ్లినాటి ప్రమాణాలు చిత్రంలో "వెన్నెలలోనే వేడి ఏలనో" అనే గీతాన్ని తొలిరేయి గీతంగా దర్శకులు కేవీరెడ్డి గారు మనకు అందించారు. తొలిరేయి గీతాలు శీర్షికన మూడవ సంచికగా ఈ గీతం వివరాలు మీ ముందుంచుతున్నాను.

వెన్నెలలోనే వేడి ఏలనో వేడిమిలోనే చల్లనేలనో
ఈ మాయ ఏమో జాబిలి ఈ మాయ ఏమో జాబిలి
వెన్నెలలోనే విరహమేలనో విరహములోనే హాయి ఏలనో
ఈ మాయ ఏమో జాబిలి ఈ మాయ ఏమో జాబిలి

మొన్నటి కన్నా నిన్న వింతగా నిన్నటి కనా నేడు వింతగా
నీ సొగసూ నీ వగలూ హాయి హాయిగా వెలసేనే

రూపము కన్నా చూపు చల్లగా చూపుల కన్నా చెలిమి కొల్లగా
నీ కళలూ నీ హొయలూ చల్ల చల్లగా విరిసేనే

1959వ సంవత్సరానికి తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు రాసినవారు పింగళి నాగేంద్రరావు గారు. ఘంటసాల మాష్టారు సంగీతంలో మాష్టారు, లీలగారు పాడిన గీతం మంచి పేరు తెచ్చుకుంది. వెన్నెలలో వేడి ఎందుకు, ఆ వేడిలోనే చల్లదనం ఎందుకు అని నాయికానాయకులు పాటను ఉత్సాహంగా ఆరంభిస్తారు. అంతలోనే వెన్నెలలో విరహమెందుకు, ఆ విరహంలోనే హాయి ఎందుకు అని మధుర భావనలను పలుకుతారు. అన్నీ వెన్నెలకు ఆపాదించటం ఆ చందమామకు ఆ వెన్నెలకే తెలియాలి. వెన్నెలలోని చల్లదనం తొలికలయికకు బీజం వేస్తుంది. ఈ చల్లదనం, ఈ విరహపు వేడి, ఈ హాయి అన్నీ చందమామ మాయే అంటున్నారు పింగళి వారు. నిజమే. లేకుంటే ఇన్ని భావనలు ఒకే చోట ఒకే సమయంలో ఎలా కలుగుతాయి?

మూడు ముళ్ల బంధంలో ఒకటవ్వబోయే జంట భావాలలో మొన్నటికి-నిన్నటికి నిన్నటికి-నేటికి ఎంత మార్పు? వలపులు ఎంత త్వరగా విరిసి గుబాళిస్తాయో కదా? ఆ భావననే పింగళి వారు మొదటి చరణంలో తెలిపారు. భర్త తన భార్యలోని ఈ సొగసు, వగలు ఎంత హాయిగా ఉన్నాయో అని తొలిరేయికి నాంది పలుకుతాడు. రూపము కన్నా అతని చూపులు చల్లగా ఉంటే, ఆ చూపుల కన్నా అతని చెలిమి పుష్కలంగా ఉందిట. ఇదీ ఆమె భావన. అతని కళలు, హొయలు చల్ల చల్లగా విరిసాయిట. అదీ ఆమె తొలిరేయి వేసిన అడుగు. ఈ విధంగా భార్యాభర్తల భావవ్యక్తీకరణతో ఒకరినొకరు ఉత్సాహపరచుకుంటూ, ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో, మధురమైన రేయిని మధురాతిమధురంగా చేసుకున్నారు. ఘంటసాల మాష్టారు-లీలమ్మ శ్రావ్యంగా పాడిన ఈ పాటలో ఏఎన్నార్, జమున జంట జీవించి ఈ గీతానికి ఔన్నత్యాన్నిచ్చారు.

21, ఫిబ్రవరి 2016, ఆదివారం

తొలిరేయి గీతాలు - నన్ను దోచుకుందువటే (గులేబకావళి కథ)


తొలిరేయిన భార్యలో ఆరాధనా భావం కలిగితే మగవానిలో అనుబంధం శాశ్వతమైనది అనే పవిత్రమైన భావం కలుగుతుంది. భర్తలో భార్య పట్ల ప్రేమానురాగాలతో పాటు బాధ్యత అనే మొక్క చిగురిస్తుంది. భార్యకు అన్నీ భర్తే అన్న ఉదాత్తమైన భావన మొలకెత్తుతుంది. ఒకరి మనసు ఒకరి దోచుకోవటంతో నేను అన్న భావన తొలగి మేము అన్న భావన వికసిస్తుంది. ఇద్దరు మనుషులైనా ఒకే నావలో ప్రయాణించే సమయం ఆసన్నమవుతుంది. 1962లో విడుదలైన గులేబకావళి కథ చిత్రంలో "నన్ను దోచుకుందువటే" అనే గీతం తొలిరేయికి సంబంధించినదే. జానపద ఇతివృత్తంతో ఎన్‌టీరామారావు గారు, కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు ఈ గీతాన్ని రచించారు, జోసెఫ్-కృష్ణమూర్తిగార్లు సంగీతాన్ని అందించారు. తొలిరేయి గీతాల శీర్షికన రెండో సంచికల "నన్ను దోచుకుందువటే" పాట వివరాలు అందిస్తున్నాను.

నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ నిన్నే నా స్వామీ

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండవోలే కర్పూరకళికవోలే కర్పూరకళికవోలే
ఎంతటి నెరజాణవో నా అంతరంగమందు నీవు
కలకాలం వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు

నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో
ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం ఇగిరిపోని గంధం

తెలుగు చలన చిత్ర సీమలో డాక్టర్ సి.నారాయణరెడ్డిగారి సాహిత్యం సహజత్వానికి ప్రయోగాలకు పుట్టినిల్లు. అంతకు మునుపు ఎక్కువగా వాడని పదాలను సాహితీ స్రవంతిలోకి తీసుకు వచ్చి, వాటితో సాహిత్యానికి ఎంతో వన్నె తెచ్చినవారు సినారె గారు. దొరసాని, నెరజాణ వంటి పదాలు అప్పట్లో తెలుగు సినీ సాహిత్యంలో చాలా అరుదుగా ఉపయోగించే వారు. నారాయణ రెడ్డి గారు అటువంటి పదాలను తన సాహిత్యంలో పొందు పరచి తెలుగు భాష అందాన్ని పెంచారు.

గీతాన్ని పరిశీలిస్తే, మనసు దోచుకున్న వనిత తనను ఒక పోటీ తరువాత భర్తగా స్వీకరించిన సన్నివేశం తరువాత ఈ పాట చిత్రంలో వస్తుంది. వన్నెలున్న రాణి తన మనసు దోచుకుందని ఆమెకు తెలుపుతాడు భర్త. దాని సమాధానంగా ఆయనను కన్నులలో దాచుకుని ఆరాధిస్తానని పలుకుతుంది ఆ భార్య. భర్త చరణాల నీడలో తరిస్తానని ఆ భార్య సంకల్పం. ఎలా? పూల దండలా, కర్పూరంలా అట. అతని వ్యక్తిత్వానికి సుగంధము, వెలుగు ఆమే కదా? అంతటి పవిత్రమైన భావన ఆ భార్యది. ఆ భార్య తెలివిని మెచ్చుకుంటూ తన అంతరంగంతో వీడిన సంకెళ్లు వేశావు అని ఆ భర్త భావించాడు. తన మసును ఒక మందిరంగా చేసుకుంది ఆ భార్య. అంటే, ఎంతో పవిత్రంగా చేసుకొని, దానిలో తన భర్తను దేవతగా భావించింది. హృదయంలో నిలిచిన భర్తతో తాను ఏకమై పోతాను అంది. జీవాత్మ-పర్మాత్మల అనుసంధానానికి భార్యా-భర్తల సంబంధానికి ఎలా సారూప్యత ఉందో చూడండి. మరి దానికి భర్త చేయాల్సింది ఏమిటి? ఆమెను అతిచరించకుండా, ఆ అనుబంధాన్ని మరపురానిగా చేయటం. నాయకుడు అలానే భావించి ఏనాటిదో ఈ బంధం, దాన్ని తెలుసుకోలేము, అది ఎన్ని యుగాలైనా ఇగిరిపోని గంధం లాంటిది అన్నాడు. చూశారా? నారాయణ రెడ్డి గారు నాయకుడి మనోగతం ద్వారా భార్యా భర్తల మధ్య సంబంధానికి శాశ్వతత్వం ఎలా ఆపాదించారో? అందుకీ ఈ గీతం యాభై ఏళ్ల తరువాత కూడా సుగంధాలు విరజిమ్ముతూనే ఉంది.

అన్న ఎన్‌టీఆర్, జమున గారు ఈ పాటలోని భావ వ్యక్తీకరణలో జీవించారు. అందానికి మారుపేరైన ఇద్దరూ ఒక పవిత్రబంధాన్ని మరింత అందంగా ఆవిష్కరించారు. చందమామ అంత అందంగా, చల్లగా, ప్రశాంతంగా ఎన్‌టీఆర్ నటించగా, ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆరాధనా భావం మనోజ్ఞంగా ఒలికించారు జమున గారు. ఘంటసాల మాష్టారు-సుశీలమ్మ ఈ గీతానికి అమృతత్వం ఆపాదించారు. ఈ చిత్రం ఎన్‌టీఆర్ గారు స్వీయ బ్యానర్ అయిన ఎన్ఏటీ ద్వారా నిర్మించారు. 

20, ఫిబ్రవరి 2016, శనివారం

తొలిరేయి గీతాలు - ఎంత హాయి ఈ రేయి (గుండమ్మ కథ)

తొలిరేయి గీతాలు - ఎంత హాయి ఈ రేయి (గుండమ్మ కథ)


పెళ్లైన జంటకు తొలిరేయి మరపురానిది. ఇద్దరు ఒకటయ్యే వేళ మధురభావనలన్నీ పండే వేళ. ఆ భావనలను అలనాటి చిత్రాలలో అశ్లీలం లేకుండా ఎంతో అందంగా చిత్రకీరించే వారు. అప్పటి దర్శకులు, గేయ రచయితలు తొలి కలయికకు సూచికగా ఎంతో భావయుక్తమైన గీతాలను అందించారు. తొలిరేయి చిత్రీకరణలో నటీనటుల ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంది. సున్నితమైన శృంగారాన్ని, ప్రేమానురాగాలను, కొంటెతనాన్ని, పవిత్రమైన బంధాన్ని నటనలో ప్రదర్శించవచ్చు. అలా చేసిన నటులు ఆ గీతాలను అజరామరం చేశారు. ఒక స్త్రీకి తన భర్తపై గల అనురాగం, ఒక పురుషుడికి తన పత్నిపై గల అధికారం కలబోసిన ఎన్నో గీతాలు తెలుగు సినీ స్వర్ణయుగంలోని చిత్రాలలో వచ్చాయి. అవి బహుళాదరణ పొందాయి. అటువంటి గీతాలలో మొట్టమొదటగా నాకు గుర్తుకు వచ్చేది గుండమ్మ కథ చిత్రంలో "ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి" అనే యుగళ గీతం. తొలిరేయి గీతాలు శీర్షికన మొట్ట మొదట ఈ గీతం వివరాలు మీకు అందిస్తున్నాను.

ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి 
చందమామ చల్లగా మత్తు మందు చల్లగా
చందమామ చల్లగా పన్నీటి జల్లు చల్లగా

ఒకరి చూపులొకరిపైన విరితూపులు విసరగా
ఒకరి చూపులొకరిపైన విరితావులు వీచగా
విరితావుల పరవడిలో విరహమతిశయించగా
విరితావుల ఘుమఘుమలో మేను పరవశించగా

కానరాని కోయిలలు మనల మేలుకొలుపగా
కానరాని కోయిలలు మనకు జోలపాడగా
మధుర భావలాహిరిలో మనము తూలిపోవగా
మధుర భావలహరిలో మనము తేలిపోవగా

విజయా ప్రొడక్షన్స్ పతాకంలో కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో 1962లో విడుదలైన గుండమ్మ కథ చిత్రంలోనిది ఈ గీతం. పింగళి నాగేంద్రరావు గారి సాహిత్యాన్ని అందించగా ఘంటసాల మాష్టారు సంగీతం కూర్చారు. మాష్టారు, సుశీలమ్మ యుగళగీతాన్ని అక్కినేని, జమునల జంటపై చిత్రీకరించారు.

కలలతోటలే విహరించే ఓ స్త్రీ మనోభావాలను, ఆమె భర్త మనోభావాలను దాదాపుగా ఒకే రకమైన పదాలైనా, వైవిధ్యాన్ని విలక్షణంగా అందించారు పింగళి వారు. ఘంటసాల మాష్టారి సంగీతానికి ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది. మాధుర్యానికి, రాగ లక్షణాలకు ఆయన పెద్ద పీట వేసేవారు. అదే శైలి ఈ పాటలో కనబడుతుంది. ఒకింత శృంగారము, ఒకింత మైమరపు, ఒకింత పులకింత, ఒకింత ఎదురుచూపు...అన్ని మధుర భావనలూ పింగళి ఈ గీతంలో ఒలికించారు. భార్యాభర్తల మధ్య శృంగారానికి పవిత్రమైన మధుర భావనలే నాంది. దాన్ని కవి ఈ గీతంలో చాలా స్పష్టంగా ఆవిష్కరించారు.

స్త్రీకి పురుషుడికి ఉన్న భావనలలో తేడాను కవి ఎంత సునిశితంగా ప్రతిపాదించారో చూడండి. నాయకుడు చందమామ చల్లగా మత్తు మందు జల్లగా అన్నాడు. కొంత శృంగార భావనలో మత్తు, మైకము మగవారికి చల్లని వాతావరణంలో కలిగే మాట నిజమే. దానినే ఆ స్త్రీ పన్నీటి జల్లు చల్లగా అని మార్చి పాడింది. స్త్రీ భావనలో చందమామ చల్లదనం పన్నీటి జల్లుగా అనిపించటం స్త్రీత్వానికి ప్రతీక. ఇంద అందంగా మొదలైన గీతం చరణాల్లో మరింత భావగర్భితమైంది.

శృంగారానికి అధిదేవత మన్మథుడి సృష్టి అయిన పూలబాణాలు చూపులతో విసురుకున్నట్లు నాయకుడు భావించటం ఆయనలో మన్మథుడు రేపిన వలపుల తలపులు అంత వాడిగా ఉన్నాయి అనే దానికి ప్రతీక. అదే ఆ స్త్రీ ఆ చూపులను పూల సుగంధాలుగా భావించింది. స్త్రీ సున్నితత్వానికి రతీదేవి ప్రతీక. పింగళి వారు ఎంత అందంగా, విరితూపులు-విరితావులు అన్న పదాలలో భేదాన్ని మనకు అందించారో? మరి మన్మథుడి బాణాలు తగిలితే జరిగేది మైమరపులో తూలిపోవటమే కదా? దానినే నాయకుని తదుపరి భావనగా తెలిపారు. పూల సుగంధాలు తాకితే? మగవారికి విరహాతిశయమే కదా? అదే స్త్రీకి? ఆ ఘుమఘుమలతో శరీరం పరవశించిందిట. ఇదీ మొదటి చరణంలో పింగళి వారి శృంగార రసధార.

ఇక రెండవ చరణంలో - కనిపించని కోయిలలు పాడి ఆ నాయకునిలో కోరికలను మేలుకొలిపితే నాయిక ఆ కోయిల పాటను జోలపాటగా భావించింది. మళ్లీ స్త్రీ పురుషుల భావనలో ప్రకృతీ పురుషుల విలక్షణతను ఆవిష్కరించారు కవి. మరి కోయిల పాటతో మేల్కొన్న పురుషుడికి స్త్రీపై కలిగిన మధుర భావనల వలన జరిగేది మైమరపులో తూలిపోవటమే కదా? దానినే నాయకుని తదుపరి భావనగా తెలిపారు. కోయిల గానం జోలపాటగా భావించిన స్త్రీకి మధురమైన ఆ భావనలో మనసు తేలిపోతాయి కదా? దానిని నాయకి భావంగా ప్రతిపాదించారు. ఇదీ రెండవ చరణంలో పింగళివారి శృంగార రసావిష్కరణ.

పింగళి వారి సాహిత్యానికి ఘంటసాల  మాష్టారి సంగీతం తలమానికమైంది. అప్పటికే అగ్రశ్రేణి నేపథ్యగాయకులుగా ఉన్న మాష్టారు, సుశీలమ్మ ఈ పాటలోని భావానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. మధురమైన లలిత శృంగార గీతానికి మోహన రాగాన్ని మించినదేముంది? సమ్మోహనం చేసే సంగీతాన్ని మాష్టారు ఈ రాగంలో ఈ గీతానికి అందించారు. సౌందర్యానికి, ఒకింత పొగరుకు, హావభావాలకు, పెంకితనానికి జమునగారు పెట్టిన పేరు అయితే, ధీరుడైన, పరిణతి చెందిన యువకునిగా నటించటం నాగేశ్వరరావు గారికి కొట్టిన పిండి. ఆనాటి సాంఘిక చిత్రాలలో వీరి నటనకు ప్రజలు జేజేలు పలికారు. వారిలో గొప్పతనం ఏమిటంటే శృంగార సన్నివేశాలలో కూడా అంతే అద్భుతంగా నటించారు. దానికి ఈ గీతం చక్కని ఉదాహరణ. సంగీతం, సాహిత్యం, గాత్రం, నటన కలయికే ఈ అజరామరమైన తొలిరేయి గీతం. ఇప్పటికీ దీని సుగంధం మనకు అందుతూనే ఉంది.

18, ఫిబ్రవరి 2016, గురువారం

కృష్ణ భక్తి - ఐదవ సంచిక

కృష్ణ భక్తి - ఐదవ సంచిక


కృష్ణభక్తిలో రుక్మిణికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ భక్తిలో భర్త పట్ల ప్రేమానురాగాలతో పాటు ఆయన లోకేశ్వరుడు అన్న పరిపూర్ణమైన నమ్మకం ఉంది. స్వామిని అచంచలమైన భక్తి ప్రేమలతో కొలిచే రాణి రుక్మిణి. ఆ శ్రీమహాలక్ష్మి స్వరూపిణి యొక్క భక్తి వివరాలు ఈ రోజు "కృష్ణ భక్తి - ఐదవ సంచిక" లో తెలుసుకుందాం.

విదర్భదేశానికి రాజైన భీష్మకుని ఇంట రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు అన్న సోదరులకు చెల్లెలిగా రుక్మిణి జన్మించింది. ఆ రుక్మిణి యుక్తవయసుకు రాగానే శ్రీకృష్ణునికి ఆమెపై వలపుల తలపులు కలిగాయి. తన తండ్రి భవనానికి వచ్చే అతిథుల ద్వారా శ్రీకృష్ణుని రూప గుణ వైభవాలు, శక్తి పరాక్రమాలు తెలుసుకున్న రుక్మిణి ఆ మహాత్ముడే నా భర్త అని నిశ్చయించుకుంది. అలాగే శ్రీకృష్ణుడు కూడ ఆమె సౌందర్యము మరియు సౌశీల్యము గురించి తెలుసుకొని ఆమెను తన పత్నిగా భావించాడు. ఆత్మబంధువులంతా వారిరువురికి వివాహము చేయుట మేలు అన తలచారు. కానీ, కృష్ణ విరోధి అయిన అన్న రుక్మి ఆమెను శిశుపాలునికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాడు. అప్పుడా రుక్మిణి అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని ద్వారా స్వామికి విదర్భ వచ్చి తనను తీసుకు వెళ్లమని సందేశం పంపింది. శ్రీమదాంధ్ర మహాభాగవతంలో పోతన దశమ స్కంధంలో ఈ విధంగా దీన్ని వివరించారు.

ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోఁక దేహతాపంబులు దీరిపోవు
నే నీ శుభాకారమీక్షింపఁ గన్నులకఖిలార్థంబు కలుగుచుండు
నే నీ చరణసేవలే ప్రొద్దుఁ జేసిన భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీలసన్నామమేప్రొద్దు భక్తితోఁ దడవిన బంధ సంతతులు వాయు

నట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చి యున్నది నీ యాన నాన లేదు
కరుణఁ జాడుము కంసారి ఖలవిదారి శ్రీయుతాకార మానినీ చిత్తచోర

"ఓ కంసాంతకా! నీ సుగుణాల వివరాలు చెవులకు సోకగానే దేహతాపములు తీరును. చూడముచ్చటైన నీ రూపము చూసినంతనే కన్నులకు అన్ని శుభఫలములు కలుగును. ఎల్లప్పుడూ నీ పాదసేవ చేసే వారికి సమస్త ఔన్నత్యములు కలుగును. స్త్రీల మనసును దోచుకునే స్వామీ! నిరంతరమూ నీ పవిత్రమైన నామమును భక్తితో స్మరించువారికి అన్ని బంధములు తొలగును. అటువంటి నీ పై నా మనసు ఎల్లపుడూ లగ్నమై ఉంది. నాపై కరుణ చూపుము!" అని వేడుకుంటుంది.

ఘనులాత్మీయతమోనివృత్తి కొరకై గౌరీశుమర్యాద నె
వ్వనిపాదాంబుజతోయమందు మునుఁగన్ వాంఛింతురేనట్టి నీ
యనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూరుజన్మంబులన్
నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా!

"ప్రాణనాథా! మహాత్ములు తమ అజ్ఞానము తొలగుటకై శివునిలా నీ పాదపద్మములనుండి జారిన గంగాజలములో మునుగుటను కోరుకుంటారు. అటువంటి మహనీయుడవైన నీ యొక్క కృపకు నేను పాత్రురాలిని కాకపోతే కన్యగానే మిగిలిపోతాను. ఎన్ని జన్మలైనా నిన్నే ధ్యానిస్తాను. అంతే కాదు, నా ప్రాణాలు విడవటానికైనా సిద్ధమే. ఇది ముమ్మాటికీ నిజం"...

ఇలాగ, పరి పరి విధముల వేడుకున్న రుక్మిణి సందేశాన్ని అగ్నిద్యోతనుడు శ్రీకృష్ణునికి విన్నవించగా ఆయన ఆమె మనోభీష్టాన్ని తెలుసుకొని సంతోషించి, విదర్భపై దండెత్తి రుక్మిణిని అపహరించి పరిణయమాడాడు.

రుక్మిణి భక్తి ఒకరకంగా మధురభక్తే. స్వామియే సర్వస్వము అనుకొని ఆతనికి తన మనము, తనువు, అంతఃకరణమును సమర్పించి ఆతని కోసమై వేచిన సాధ్వి ఆమె. స్వామి మహిమను తెలిసిన పతివ్రతా శిరోమణి. నిరంతర పతి ధ్యాన నిరత.  నిర్మలమైన తన ఆత్మను స్వామికి సమర్పించిన మహాభక్తురాలు.

ఒకసారి శ్రీకృష్ణుడు రుక్మిణి ఆట పట్టించటానికి "ఓ రుక్మిణీ! ఎందరో మహా పరాక్రమవంతులైన మహారాజులుండగా ఏమీ లేని, ఎవరికీ చెందని, ఈ యాదవుడనైన నన్ను ఎందుకు పరిణయమాడావు" అని అడుగుతాడు. అపుడామె:

రూఢిమైఁ బ్రకృతి పూరుష కాలములకు నీశ్వరుఁడవై భవదీయ చారు దివ్య
లలితకళా కౌశలమున నభిరతుఁడై కడగు నీ రూపమెక్కడ మహాత్మ!
సత్త్వాది గుణ సముచ్చయ యుక్త మూఢాత్మనయిన నేనెక్కడ ఘన చరిత!
కోరి నీ మంగళ గుణభూతి దానంబు సేయంగఁబడునని చెందు భీతి
నంబునిధి మధ్యభాగమందమృత ఫేన పటల పాండుర నిభమూర్తి పన్నగేంద్ర
భోగశయ్యను బవ్వళింపుచును దనరునట్టి యున్నతలీల దివ్యంబు దలఁప

"పరమాత్మా! నీ చరితము దివ్యమైనది. ప్రకృతీపురుషులకు, కాలానికి నువ్వు ప్రభువువు. నీది దివ్యమనోహర రూపము. ఎంతో అందముగా ఉండే కళలలో నీవు నైపుణ్యం కలవాడవు. అద్భుతరూపసంపన్నుడవైన నీవెక్కడ? సత్త్వరజస్తమోగుణములతో ఉన్న మూఢురాలను నేనెక్కడ? శుభకరమైన నీ సద్గుణములను ఇతరులకు దానము చేయవలసి వస్తుందేమో అనే శంకతో నీవు ఇష్టపూర్వకముగా పాలసముద్రము మధ్యలో అమృతపు నురగల వలె తెల్లగా ఉన్న ఆదిశేషునిపై పవళించి యున్నావు. ఇవన్నీ నీ దివ్యలీలలే అని స్వామి వైభవాన్ని విశదీకరిస్తుంది. ఇంకొక ముందడుగు వేసి ఆధ్యాత్మికంగా స్వామి గొప్పతనాన్ని వివరిస్తుంది..."

శబ్దస్పర్శరూపరసగంధంబులనియెడు గుణంబులచేతఁ బరిగ్రహింపఁబడిన మంగళ సుందర విగ్రహుండవై, అజ్ఞానాంధకార నివారకంబైన రూపంబు గైకొని , భవదీయులైన సేవకులకు ననుభావ్యుండవైతివి. భవత్పాదారవింద మకరంద రసాస్వాద లోలాత్ములైన యోగీంద్రులకైనను భవన్మార్గంబు స్ఫుటంబు గాదట్లగుటంజేసి యీ మనుజపశువులకు దుర్విభావ్యంబగుట యేమి సెప్ప. ఇట్టి ఈశ్వరుండవైన నీకు నిచ్ఛ స్వతంత్రంబు గావున. అదియును నాకధికంబు గావున నిన్ను నేననుసరింతు. దేవా! నీవకించనుడవైతేని బలి భోక్తలైన బ్రహ్మేంద్రాదులెవ్వరి కొరకు బలి సమర్పణంబు చేసిరి. నీవు సమస్త పురుషార్థమయుండ వనియును, ఫలస్వరూపివనియును, నీ యందలి ప్రేమాతిశయంబులంజేసి, విజ్ఞాన దీపాంకురంబున నిరస్త సమస్త దోషాంధకారులై, యిహ సౌఖ్యంబులు విడిచి, సుమతులు భవదీయ దాససంగంబు కోరుచుందురట్లు సేయనేరక, నిజాదికారాంధకార మగ్నులైనవారి భవతత్త్వంబు దెలిసి, బలిప్రక్షేపణంబులు సేయంజాలక, మూఢులై, సంసారచక్రంబునంబరిభ్రమింతురదియును గాక

వరమునీంద్ర యోగివర సురకోటిచే వర్ణిత ప్రభావ వైభవంబు 
గలిగి యఖిలచేతనులకు విజ్ఞానప్రదుండవగుదవభవ! దురితదూర!

"స్వామీ! నీవు సహజముగా దివ్యమంగళ స్వరూపుడవే అయినప్పటికీ, శబ్ద స్పర్శ రూప రస గంధాది పంచతన్మాత్రలతో ప్రకాశించే మంగళకర రూపమును దాల్చినావు. నీ దివ్యరూపము అజ్ఞానాంధకారాన్ని తొలగించేది. ఆ విధముగా సగుణ రూపుడవైన నీవు ఆరాధింపదగిన వాడవు. గొప్ప యోగులు కూడా నీ పాదపద్మములలోని తేనెను రుచిచూచుటకై తహతహలాడుతారు. అట్టి వారికి కూడా నీ తత్త్వము బోధపడదు. కాబట్టి పశువులతో సమానమైన ఈ మానవులకు నీ తత్త్వము ఎలా తెలుస్తుంది? నువ్వు సర్వేశ్వరుడవు. నీ సంకల్పానికి తిరుగులేదు. అది కూడా నాకు తెలియదు. అందుకే నేను నిన్ను అనుసరిస్తున్నాను. దేవా! నీవు ఏమీ లేని వాడవు. కానీ, బ్రహ్మాది దేవతలు కూడా నీకు బలి సమర్పిస్తున్నారు. అనగా నీవు వారికన్నా గొప్పవాడివనే కదా అర్థం! కాబట్టి నీవు అన్నిటినీ మించినవాడివి. చతుర్విధ పురుషార్థములు నీ స్వరూపాలే. యజ్ఞము, యాగము, తపస్సు మొదలైన కర్మల ఫలస్వరూపము నీవే. సజ్జనులు నీపై గల ప్రేమచే విజ్ఞానము యొక్క ప్రభావముతో సమస్త దోషములను పారద్రోలుతారు. వారు ఐహిక సుఖములను వదలి నీ దాసుల సాంగత్యమును కోరుకుంటారు. మూఢులు భౌతిక సుఖములను వదులుకోలేక అధికారములనే అంధకారములో కొట్టుమిట్టడుతూ నీ తత్త్వమును తెలుసుకోలేక, నిన్ను ఆరాధించక జనన మరణములనే చక్రములో పరిభ్రమిస్తారు. స్వామీ! నీవు పాపాలను బాపే వాడవు. మునులు, యోగులు, సమస్త దేవతలు నీ ప్రభావ వైభవమును వర్ణిస్తారు. నీవు అన్ని ప్రాణులకు విజ్ఞానాన్ని ఇచ్చేవాడవు..."

జలజనాభ! సకల జగదంతరాత్మవైనట్టి దేవ! నీ పదారవింద
యుగళి సానురాగయుక్తమై నా మదిఁ గలుగునట్లు గాఁగఁ దలఁపుమనఘ!

పృథురజోగుణ ప్రవృద్ధమైనట్టి నీ దృష్టిచేత నన్నుఁ దేరుకొనఁగఁ 
జూచుటెల్లఁ బద్మలోచన నీమీఁది ఘన దయార్ద్ర దృష్టిగాఁ దలంతు

"పద్మనాభా! మహాత్మా! నీవు ఈ ప్రపంచములో సమస్త ప్రాణులకు అంతరాత్మైనట్టి స్వామివి. నా మనస్సులో నిరంతరం నీ పాదకమలముల యందు భక్తి అనురాగములు వర్ధిల్లేలా అనుగ్రహింపుము. నీ చూపుల ద్వారా అనంతమైన ప్రేమానురాగాలు నాపై ప్రసరించి నన్ను తేరుకునేలా చేసితివి. నా మీద నీకు గల గొప్ప దయాదృష్టికి ఇదే నిదర్శనం..."

అని ఎంతో ఉదాత్తమైన భక్తితో, జ్ఞానంతో రుక్మిణి స్వామి వైభవాన్ని వేనోళ్ల నుతించింది. రుక్మిణి స్వామిని తన భరతగా మాత్రమే అనుకోక పరమాత్మగా గ్రహించింది. స్వామికి ఉన్న అనేక కోట్ల భక్తులలో తాను ఒకరు అనుకుంది. అందుకే ఆమెలో ఇతర కృష్ణ పత్నుల పట్ల అసూయ లేదు. భాగవతంలో శ్రీకృష్ణ తులాభారం గురించి రాయలేదు. కానీ, ఆ తులాభార ఘట్టం అనేక చోట్ల ప్రస్తావించబడింది. సత్యభామను పరీక్షించటానికి నారదుడు ఆమేచే వ్రతము చేయించి స్వామిని తనకు వ్రతఫలముగా దానమిప్పించుకుంటాడు. స్వామి దాస్యాన్ని విడిపించి, స్వామిపై పూర్తి హక్కులు కాలంటే ఆయనకు తూగగల సంపదను ఇస్తే చాలు అంటాడు.  అజ్ఞానంలో సత్యభామ ఆ తప్పటడుగు వేస్తుంది. తన దగ్గర ఎన్ని సంపదలు తులాభారంలో వేచినా అది స్వామికి సరితూగదు. అప్పుడు ఆమె రుక్మిణి వద్దకు వెళ్లి సాయం కోరుతుంది. స్వామిపై అచంచలమైన భక్తితో స్వామికి సమర్పించే తులసీదళాన్ని తీసుకు వెళుతుంది. స్వామికి తులసీదళం అత్యంత ప్రీతికరమైనదని తెలుసు. అందుకే భక్తితో స్వామిని ప్రార్థించి ఆ దళాన్ని తులాభారంలో ఉంచుంతుంది. స్వామి దానికి బద్ధుడవుతాడు.
సముద్రాల రాఘవాచార్యుల వారు ఈ రుక్మిణి భక్తిని, విశ్వాసాన్ని ఈ పద్యంలో అద్భుతంగా పండించారు.

"ఫలమో ఘన రసంబో పత్రమో పుష్పమో కొనుచు భక్తి నిన్ను కొలుచు వారికి ఈవు వశుడవగుటయే సత్యమేని ఈ తులసి దళము నిన్ను తూచు గాక!"

భగవద్గీతలో స్వామి చెప్పాడు కదా? పత్రం పుష్పం ఫలం తోయం, ఏదైనా భక్తితో నాకు సమర్పిస్తే దానిని స్వీకరిస్తాను అని? అదే విధంగా రుక్మిణి భక్తితో సమర్పించిన ఆ తులసీదళం స్వామిని తులాభారంలో బద్ధుడిని చేస్తుంది. ఇక్కడ తులసీదళం కాదు ముఖ్యం, రుక్మిణి భక్తి. ప్రభువుపై ఆమెకు గల విశ్వాసం. దీనినే వేటూరి సుందరరామమూర్తి గారు "తులసీదళానికి తేలిపోయి తూగునటే ఆనందలీల ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మడమెలా అంత వింత గాథల్లో ఆ నందలాలా" అని అద్భుతంగా ఆవిష్కరించారు.

కృష్ణ భక్తి సామ్రజ్యంలో రుక్మిణి స్థానం స్వామి హృదయంలోనే. 

17, ఫిబ్రవరి 2016, బుధవారం

జంధ్యాల హాస్య గుళికలు - మూడవ సంచిక

జంధ్యాల హాస్య గుళికలు - మూడవ సంచిక


జంధ్యాల గారి శ్రీవారికి ప్రేమలేఖ చిత్రానికి ఉన్న ప్రత్యేకత తెలుగు భాషను పునరుద్ధరించే ప్రయత్నం చేయటం, తెలుగుదనాన్ని ఉట్టిపడే వాతావరణాన్ని సినిమాలో అడుగడుగునా చూపించటం. ఈ ఘనత మొత్తం జంధ్యాల గారిదే. అగ్రశ్రేణి నటీనటులు లేకుండా, పదునైన సంభాషణలు, సహజత్వము  రంగరించి ఆయన హాస్యం పండించారు. అందుకే చిత్రం ఘన విజయం సాధించింది. మధ్యతరగతి కుటుంబాలలో ఉండే ఆవేశకావేశాలు, సంతోషాలిచ్చే చిన్న చిన్న పనులు, మనుషుల మధ్య ఉండే ప్రత్యేకమైన బంధాలకు జంధ్యాల గారు ప్రాణం పోసి చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా కథల పిచ్చి కల శ్రీలక్ష్మి, ఆమె బాధితుల ఘోష, పరంధామయ్య ప్రాస వాగుడు, భాస్కరం పేకాట్ స్నేహితుల సంభాషణలతో ఎన్నో రసవత్తరమైన సన్నివేశాలున్నాయి. ఆ కుటుంబంలో జరిగే మరో కొన్ని అద్భుతమైన సన్నివేశాలను "జంధ్యాల హాస్య గుళికలు - మూడవ సంచిక"గా మీకు అందిస్తున్నాను

ఊరు వచ్చి తిరిగి పట్నానికి వెళుతున్న ఆనందరావును బస్సు ఎక్కించటానికి మొత్తం కుటుంబం వెళ్లిన నేపథ్యం, తదుపరి సీన్లలో ఈ సంభాషణలు.

*************************************************

భీముడు: "మహాప్రభో"

పరంధామయ్య: వెధవను రెడీగా ఉండమను. ఇంకో సంబంధముందని రాయగానే రెక్కలు కట్టుకొని రాలమను వెధవను.."

భీముడు: "చిత్తం..." "మహాప్రభో...ఈ మాట ఇప్పుడే చెప్పొస్తున్నాను కదా"

పరంధామయ్య: "నీ పని నేను చెప్పింది చేయటమే. ఈలోపు ధర్మసందేహాలొస్తే బెజవాడ రైల్వే స్టేషనుకు పంపించు. ఆయనెవడో చెబుతుంటాడే..మా కుక్కకు గజ్జి పట్టింది ఏమి చెయ్యమంటారు అంటే బొచ్చుపీకండి గజ్జి తగ్గిపోతుంది అని..ఆయనకు రాయి సమాధానం చెబుతాడు అనుమాన పక్షి. ఆ అడ్డగాడిదతో మాట్లాదకూడదని నిర్ణయించుకున్నాను కాబట్టి కానీ లేకపోతే నేనే చెవి మెలేసి చెప్పేవాడిని వెధవకి..."

భీముడు: "చిత్తం..."

పరంధామయ్య:"చిత్తమంటూ ఇంకా ఇక్కడే తగలడ్డవేం? వెళ్లు"

భీముడు: "వెళుతున్నాను కదా మహాప్రభో..."

భీముడు ఆనందరావుతో: "బాబూ తమరు మళ్లీ త్వరలో పెళ్లి చూపులకు రావటానికి రెక్కలు అవీ కట్టుకొని సిద్ధంగా ఉండమన్నారు మహాప్రభువుల వారు"

పూర్ణ: "బస్సింకా వచ్చేలా లేదు. ఈలోపు శ్రీమంతుడు సినిమా కథ చెప్పనా"

కామాక్షి: "సరే. వేటగాడు కథ చెప్తానేం..."

భాస్కరం: "అబ్బబ్బబ్బా మళ్లీ మొదలెట్టావా. అసలు నీకిన్ని కథలు పేర్లు గుర్తున్నందుకు నీ బుర్రను మ్యూజియంలోనూ నిన్ను జూలోనూ ఉంచాలే.....అదిగో వచ్చేసింది బస్సు"

పరంధామయ్య: "రండి రండి ఏమిటా పెళ్లి నడక.." ..."ఆ ఎక్కరా"

కండక్టరు: "ఎన్ని టికెట్లండీ"

భాస్కరం: "ఒకటే"

కండక్టరు: "ఒక్కటా! ఒక్క టిక్కట్టుకు ఇంతమందొచ్చారేంటండీ? బస్సు ఖాళీగా ఉంది. అందరు ఎక్కండి సార్"

పరంధామయ్య:" నీ బస్సు ఖాళీగా ఉంటే మేమంతా ఎక్కాలా అంట్ల వెధవ"

భీముడు:"కండక్టర్ తమ కొడుకు కాదు మహాప్రాభో తమరు ఎన్ని తిట్టినా పడుండటానికి ఊరుకోండీ"

భాస్కరం: "నువ్వు పద బాబూ పద"

కామాక్షి: "ఎక్కరా చంటీ, జాగర్త"

అమ్మ:"ఆవకాయ మాగాయ జాడీల్లో పెట్టాను. ఉసిరికాయ పచ్చడికి గాలి తగలకుండా చూడు. బూజుపడుతుంది. జాడీలు జాగ్రత్త. బస్సు కుదుపుల్లో కదిలిపోకుండా చూడు.."

పరంధామయ్య: "రోజూ క్రమం తప్పుకుండా మాదీఫలరసాయనం వాడమను శుంఠని"

అమ్మ: "సామాన్లు జాగ్రత్తమ్మా.."
కామాక్షి: "ఒరేయ్ లెక్కపెట్టుకోరా చంటీ"

ఆనందరావు: "ఇక మీరు బయలుదేరండి నాన్నా!"

భాస్కరం:"నీ ఆరోగ్యం జాగ్రత్తరా చంటీ"

అమ్మ: "ఎండలో ఎక్కువగా తిరక్కు నాన్నా"

పరంధామయ్య: "ప్రతిరోజూ మొదటి ముద్ద ఉసిరికాయ పచ్చడేసుకు తినమను కుంకని. పైత్య ప్రకోపం తగ్గుతుంది..."

ఆనందరావు:"ఇక మీరు బయలుదేరండి నాన్నా...బస్సెక్కాను కదా"

కామాక్షి: "ఓసారి ఎప్పుడైనా మావూరు రారా చంటి. కొత్త కొత్త పిండి వంటలు చెసిపెడతాను తిందువు కాని"

పరంధామయ్య భీముడుతో: "ఈసారి పెళ్లిచూపులకు రానని ఇష్టం లేదని రాశాడో నీకు గుండు గీకిస్తాను ఆ విషయం చెప్పు సన్నాసికి"

భీముడు: "బాబూ! నా జుట్టుమీద దయుంచి పెళ్లి చూపులకు తప్పకుండా రండి బాబూ!"...."చెప్పాను మహాప్రభో చెప్పాను"

పరంధామయ్య: "ఆ ఆ! ఇక బస్సు బయలుదే...."

అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి పరంధామయ్య బస్సుకేసి తలబాదుకుంటాడు

భాస్కరం: "ఏమిటి ఏమయ్యింది"

పరంధామయ్య భాస్కరంతో: "అటు చూడు మీ ఆవిడని"...

పూర్ణ డ్రైవరుతో: "రామకృష్ణా సినీ స్టూడియోస్ వారి డ్రైవర్ రాముడు సినిమా చూశావా?"

డ్రైవరు: "చూడలేదండీ"

పూర్ణ: "అందులో ఎన్‌టీ రామారావు లారీ డ్రైవరుగా ఎంత బాగ చేశాడనుకున్నావ్?"

భాస్కరం: "ఒసేయ్ ఒసేయ్ ఆపవే...అవతల మా నాన్న బస్సు బద్దలు కొడుతున్నాడు...రా"

*****************************************************

పూర్ణ: "అప్పుడేమో జయశంకర్ పిచ్చ స్పీడుతో మోటర్ సైకిల్ మీద వచ్చి ఆ రౌడీల్ని దోసకాయ పచ్చడి చేసేస్తాడు.."

భాస్కరం: "జయశంకర్‌కి దోసకాయ పచ్చడంటే బాగా ఇష్టమేమో? "
పూర్ణ: "తన కోసం ప్రాణాలు కూడ లెక్క చేయకుండా ఆ రౌడీలతో ఫైట్ చేసిన ఆ జయశంకర్‌కి సీత తన మనసిచ్చేస్తుంది"

భాస్కరం: "ఎలా ఇస్తుంది. కోసిస్తుందా లేదా దోసకాయ పచ్చడి షేపులో దంచిస్తుందా మనసు?"

పూర్ణ: "అబ్బా! అది కాదండీ! ఆ తరువాత వాళ్లిద్దరూ పార్కులో పాట పాడుకుంటారన్నమాట మనసూ ఇచ్చినా పూసా పూసా వెన్నపూస.."

భాస్కరం: "జయశంకర ఇదివరకు వెన్నపూస వ్యాపారం చేసేవాడు కాబోలు"

పూర్ణ: "కంటిలో వెలుగా పూసా పూసా"

భాస్కరం: "ఆపవే! రిక్షావాడు కథ వినలేక వాలిపోయి తొక్కుతున్నాడు చూడు"

పూర్ణ: "టాట్టడాయ్ టట్టటట్టడాయ్"

భాస్కరం: "బాబు ఆపాపు రిక్షా ఆపు"

పూర్ణ: "ఏంటండీ. ఇప్పుడే కథ బావుంటుంది"

భాస్కరం: "కథతో పాటు నా ఆరోగ్యం కూడా బావుండాలి కదా పూర్ణా!..ఆ..చూడూ...మొన్ననే కొత్త మంగళసూత్రాలు చేయించుకున్నావు. వాటి మీద ప్రేమతో అన్నా నాకప్పుడప్పుడూ కాస్త రెష్టిస్తూ ఉండు..ఇదే ఇంటర్వెల్ అనుకో"

**********************************************

భాస్కరం హార్మణీతో: "ఇక్కడున్నావేమిటిరా హార్మణీ! "

హార్మణీ: "చంపేస్తాను వెధవల్ని. వాళ్ల చర్మం ఊడబీకి అడుగున్నర మందం చెప్పు కుట్టించుకుని ఎత్తు పెరుగుతా. వాళ్ల నాలికల్ని కట్ చేసి మా అమ్మాయి జడలకి రిబ్బన్లుగా చుట్టేస్తాను..హాయ్"

భాస్కరం: "ఎవరి మీదరా ఈ కోపం"

హార్మణీ: "ఇంకెవరు? ఆ కళ్లజోడు, మరచెంబు గాళ్లు. నెల తక్కువ వెధవలనీ"

భాస్కరం: "ఏమయిందీ? నువ్వెళ్లిన దగ్గరనుంచీ మా దగ్గర డబ్బుల్లేక నిన్నల్లా పేకాళ్లేదురా. చేతులు దురదలెక్కి వాచిపోవటం మొదలెట్టాయి. ఆ వెధవలిద్దరూ నన్నిక్కడ కూర్చోబెట్టి, ఆయన దగ్గర ఓ పది రూపాయలు తీసుకొని ఓ గంటలో ఆడుకొని వస్తామని వెళ్లారు. ఇప్పటికి నాలుగ్గంటలైంది వెళ్లి. ఇంతవరకూ రాలేదు. ఆయనేమో నా పదిరూపాయలు నాకిస్తావా కిళ్లీలు కడతావా అంటాడు. నాకేమో కట్టడం రాదు రాకపోతే నేర్చుకోమంటాడాయన. నేనెప్పటికి కిళ్లీలు కట్టడం నేర్చుకొని ఆయన పదిరూపాయలిచ్చి నేనెప్పటికి రుణం తీర్చుకొని బయట పడేది? .."

భాస్కరం: "ఊ సరే సరే ఏడవకు ఉండు"..."ఇదిగో! ఈ పదిరూపాయలు తీసుకొని మా వాడిని విడిచిపెట్టవయ్యా!"

*******************************************

ఇక్కడ రిక్షావాడు మూర్ఛపోతాడు.
భాస్కరం:"ఏమిటే! ఏవయ్యింది? "
పూర్ణ: "మీరెళ్లగానే, కథ తరువాత ఏమయిందమ్మా అని అడిగాడు..."
భాస్కరం: "అడిగాడూ...అర్థాయుష్షు వెధవ...వాడి గొయ్యి వాడే తవ్వుకున్నాడన్నమాట

*******************************************



16, ఫిబ్రవరి 2016, మంగళవారం

జంధ్యాల హాస్య గుళికలు - రెండవ సంచిక

జంధ్యాల హాస్య గుళికలు - రెండవ సంచిక


జంధ్యాల గారి చిత్రాలలో అగ్రస్థానం నిస్సందేహంగా శ్రీవారికి ప్రేమలేఖ చిత్రానిదే. పొత్తూరి విజయలక్ష్మి గారి కథ ఆధారంగా జంధ్యాల గారు 1984లో రామోజీరావు గారు నిర్మాతగా ఈ చిత్రాన్ని తీశారు. అనుక్షణం నవ్వులు పండించే ఈ చిత్రంలో సంభాషణలు జంధ్యాల గారికి ఎంతో పేరు తెచ్చాయి. తెలుగు చిత్రాలలో క్యాబరే పాటల సినిమా ఒరవడి నుండి బయటకు లాగి మధ్య తరగతి జీవితాలతో తీసే హాస్య చిత్రాలకు నాంది పలికారు జంధ్యాల గారు.

శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంతో జంధ్యాల గారి హాస్య సంభాషణా నైపుణ్యం పతాక స్థాయికి చేరుకున్నట్లే. పింజారీ వెధవ, కుంక, శుంఠ వంటి పద ప్రయోగాలు, బూజు పట్టిన ఆవకాయ వంటి పదసమూహాలు, అర్థవంతమైన ప్రాసలు, సినిమాల పిచ్చి-వంటల ప్రయోగాలు మొదలైనవి ఎంత హాయిగా పండించారో. ఈ మాటలతో పాత్రలు మమేకమై సినిమాని ఆద్యంతం రక్తి కట్టించాయి.

ఇందులో ప్రతి మాట, ప్రతి ముఖ కవళిక, నవ్వులు కురిపించేదే. చిత్రంలో ఆనందరావుగా నరేష్, పరంధామయ్యగా సుత్తి వీరభద్రరావు, ఆయన భార్యగా డబ్బింగ్ జానకి, భీముడిగా మిశ్రో, సూర్యంగా విద్యాసాగర్, భాస్కరంగా నూతన్ ప్రసాద్, కామాక్షిగా సంగీత, పూర్ణగా శ్రీలక్ష్మి అద్బుతంగా జీవించారు..ప్రతి కళాకారుడు కూడా మనలను కడుపుబ్బ నవ్విస్తారు. ఆ చిత్రంలో నుండి సన్నివేశాలు, సంభాషణలు ఈ జంధ్యాల హాస్య గుళికలు రెండవ సంచికలో.

**************************************************************

పరంధామయ్య భార్యతో:"అప్రాచ్యపు కుమారుడు భాస్కరానికి అర్భకపు తండ్రి పరంధామయ్య రాయునది..."

భార్య: "అయ్యో అయ్యో అదేమి రాతండీ?"

పరంధామయ్య: "నేను కొన్న కవరు, నేను కన్న కొడుకు. నా ఇష్టమొచ్చినట్టు రాసుకుంటాను నువ్వెవరు అడగటానికి. రాయి!"

"ఒరేయ్ కుంకా"..

భీముడు: "చిత్తం"

పరంధామయ్య: "నిన్ను కాదు"

భీముడు: "అలవాటైపోయింది మహాప్రభో"

పరంధామయ్య: "ఆ ఆ" "నువ్వు టింగురంగడిలా పెళ్లాం చేత సినిమా కథలు చెప్పించుకుంటూ నీ దినవారాలు గడుపుకుంటున్నావ్. నీ అంట్ల వెధవ తమ్ముడు పెళ్లి చేసుకోను గాక చేసుకోనని మొండికెత్తాడు. నువ్వు వెంటనే వాడికో ఉత్తరం రాసి వాణ్ని పెళ్ళికొప్పించు.

ఇట్లు

బుద్ధిలేక మిమ్మల్ని కన్న శుంఠ పరంధామయ్య"

భీముడు: "ఆహా! ఈ చివరి వాక్యం మాత్రం అద్భుతంగా ఉంది మహా ప్రభో!"

పరంధామయ్య: "ఏవిటి ఉత్తరం రాయమన్నదా?"

భీముడు: "ఆహా. కాదు కాదు. శుంఠ పరంధామయ్య అన్నది. ఉన్నదున్నట్టుగా తనని తాను దూషించుకోవటం మహర్షుల్ల వల్ల మాత్రమే అయ్యే పని మహాప్రభో!"

పరంధామయ్య బావమరిది సూర్యం: "హలో బావా...చేతికి కట్టేమిటి బావా"

పరంధామయ్య: "సిగ్గు లేకపోతే సరి. కన్న తండ్రి మాట కాదంటావ్. ఏళ్లొచ్చాయి ఎందుకు? పెళ్లి చూపులేర్పాటు చేశాను రమ్మని రాస్తే రానని ఠలాయిస్తావా? పింజారీ వెధవ. నేనసలు పెళ్లి చూపులైనా చూశానురా? మా నాన్న చూసి ఫలాన పిల్లను కట్టుకోమంటే ఎగిరి గంతేసి చేసుకున్నాను. పిచ్చి పిచి వేషాలు వేసావంటే నీ నవరంధ్రాల్లో మైనం కూరతాను కుంకా.."

పరంధామయ్య భార్య: "ఊరుకోండీ. మీ కొడుకు చేసిన నిర్వాకానికి మా తమ్ముడిని తిడతారేం?"

భీముడు: "అయ్యా! మహా ప్రభువుల వారి వ్యాకరణం తమకు తెలియనిదేముంది చెప్పండీ. వారికి తృతీయ తత్పురుష లేదు. నేను నువ్వు అన్నవి తప్ప అతను ఆమె అనేవే లేవు వారికి. ఇప్పుడు వారిని కరిచిన కుక్కకు పిచ్చెక్కి చచ్చిందనుకోంది. నన్ను కరిచి నువ్వు చచ్చావంటారాయన."

పరంధామయ్య: "చాల్లే ఊరుకో..నన్ను కుక్క కరిచిన విషయం దేశమంతా చెప్పాలా? వెధవ అర్థాయుష్షు కుక్క"

భీముడు: "ఇక వారికొచ్చిన కోపం.."

సూర్యం: "అర్థమైంది లేవయ్యా!"..."బావా!మన చంటి నువ్వేర్పాటు చేసిన పెళ్లి చూపులకు రానని రాశాడు. ఇప్పుడు నేను విశాఖపట్నం వెళ్లి వాడిని కోప్పడైనా తీసుకు రావాలి. అంతే కదా"

పరంధామయ్య: "ఇట్నుంచి ఇటే వెళ్లి చెవులు పట్టుకొని లాక్కురా వెధవని"

భీముడు: "అమ్మ గారు రమ్మన్నారని ఒక్క మాట చెప్పండి సూర్యం బాబు. వెంటనే బయలుదేరుతారు చిన్నబాబు గారు"

పరంధామయ్య: "ఈ ఉచిత సలహాలు వినడం వల్లే మా కొంప బూజు పట్టిన ఆవకాయ జాడీలా ఇంతందంగా తయారయ్యింది. నువ్వు నోర్ముయ్...." బామ్మర్దితో: "నువ్వు మాట్లాడవేం?"

సూర్యం: "నువ్వా ఛాన్స్ ఎక్కడిచ్చావ్ బావా? ఈ ఇంట్లో చెవులకేగా పని..."

పరంధామయ్య: "ఊ! ఊ! వెంటనే వెళ్లు. ఆ వెధవ రానంటే మా బావగారింట్లో వెండి బిందెత్తుకు పోయాడని ఆ ఊళ్లోనే కేసు పెట్టించు. పోలీసులే అరవంకాలేసుకు తీసుకొస్తారు వెధవను. ఇక వాడొచ్చి పెళ్లికొప్పుకుంటే మా భీముడిని తిరపతి పంపించి గుండు గీకిస్తానని వెంకన్నకి మొక్కుకున్నాను."

భీముడు: "మహాప్రభో! నా మీద తమరు మొక్కుకోవటమేమిటి మహాప్రభో! ఇంత దయ భరించలేను. ఈ దాసానుదాసుడికి బొచ్చు భిక్ష ప్రసాదించండి మహాప్రభో"

*************************************************************

కామాక్షి తల్లితో: "కత్తి పట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి నూనెలో వేసి.."

పూర్ణ అత్తగారితో: "డబా డబా బాదుతూ ఉంటే.."

కామాక్షి: "అవి చిటపటలాడుతూ ఉడికి..."

పూర్ణ: "కాళ్లకి బుద్ధి చెబుతారన్నమాట.."

భాస్కరం: "మామయ్యా! మన పెళ్లలు...."

సూర్యం: "అబ్బా! నీ పెళ్లాం నా పెళ్లాం అను భాస్కరం. మన పెళ్లాలు అనకు. వినటానికేం బాలెదు.."

పూర్ణ అమ్మతో: "అప్పుడు రామారావొచ్చి.."

కామాక్షి: "నువ్వుండొదినా".."అమ్మా అలా వేగిన వాటి మీద ఉప్పుకారం చల్లి దాచుకుంటే అబ్బా ఎంత బాగుంటుందో..."

పూర్ణ అత్తగారితో: "అబ్బా! ఉండవమ్మా" "అత్తయ్యా! ఇప్పుడే కథ బాగుంటుంది. రామారావు వాణిశ్రీని చూస్తాడన్నమాట. .."

పూర్ణ భర్తతో: "ఆ వచ్చారా? మధ్యలో మాట్లాడించకండే..కథ చెప్తున్నాను."

కామాక్షి భర్తతో: "ఆ కలకత్తా భౌ భౌ వండటం గురించి చెబుతున్నాను మామయ్యా! .."

భాస్కరం భార్యతో: "నా టూరింగ్ టాకీసా! మా అమ్మే దొరికిందా నీకు వేధించుకు తినటానికి?"

సూర్యం భార్యతో: "నా కదిలే మిలటరీ భోజన హోటలా! మా అక్కయ్యే దొరికిందా వేయించుకు తినటానికి..."

పూర్ణ: "అబ్బా ఉండండీ...ఏదో చెబుదామనుకున్నా మర్చిపోయాను.."

భాస్కరం: "సింగినాదం, జీలకర్ర"

కామాక్షి తల్లితో: "ఆ భౌ భౌ మీద జీలకర్ర కూడా వేస్తే చాలా బాగుంటుందమ్మా!"

సూర్యం: "ఆ డీడీటీ వేస్తే ఇంకా బావుంతుంది!!!"

పూర్ణ: "ఉండండీ. సరే! మళ్లీ పాట దగ్గరనుంచీ మొదలుపెడతానేం...కసిగా ఉంది కసి కసిగా ఉంది కలవక కలవక కలిసినందుకు కస్సుమంటోంది...కసిగా ఉంది ఆ కసిగా ఉంది కసిగా ఉంది.."

పరంధామయ్య: "ఆపండీ. ఒక్కొక్కళ్ల గొంతు కోసి సింహద్వారానికి వేళ్లాడదీస్తాను..."

"రేయ్ భాస్కరం. నీ పెళ్లాం పాడకుండా ఉండలేకపోతే దానిని నీ గదికి తీసుకెళ్లి దాని పాటకు తాళం వేస్తూ చావు. నేను బయట తాళమేసుకు చస్తాను. అంతే కానీ ఈ చెవులకు మాత్రం కసి కసిగా ఉంది తిక్క తిక్కగా ఉంది అన్న పాటలు వినిపించాయో నేనే ఓ హత్య చేసి ఆ నేరాన్ని మీ మొగుడూ పెళ్లాల మీదికి తోస్తానూ...హు..."

"రేయ్ సూర్యం. నువ్వూ విను. నీ పెళ్లాం మధ్యాన్నం ఏదో కొత్తరకం పిండి వంట చేసి పోరి పోరి మరీ తినిపించింది. ఇప్పటికి మూడు వాంతులు ఆరు విరేచనాలు అయ్యయి. కలరా వచ్చి చచ్చిందేమో అని అనుమానంగా ఉంది.."

భాస్కరం: "ఓహో! అందుకా ఇందాకటినుంచీ దొడ్లో చెంబట్టుకు తిరుగుతున్నావు? "

పరంధామయ్య కొడుకుతో: "నువ్వు నోరు మూసుకు చావు.."

పరంధామయ్య సూర్యంతో: " పని మనిషి ఆ వంట తిని వెర్రిగా నవ్వుతూ పిచ్చి పిచ్చి వేషాలేస్తోందిట. ఇకనుంచీ నీ పెళ్లాం కొత్త రకం పిండివంటలు మొదలుపెట్టిందో...."...

పక్కనున్న స్థభానికి తలబాదుకోబోయాడు...

**************************************************************

భీముడు ఆనందరావుతో: "పోనీ ఈయన దగ్గర పని మానేసి పొదాం అంటే ఈయన దగ్గర పనిచేసిన వాళ్లకు ప్రపంచంలో ఎవరూ ఉద్యోగ్యం ఇవ్వరు. అదీ నా బాధ. సరే, నన్ను తీసేస్తే నాలాగా అణిగిమణిగి పడుండే మనిషి వారికి దొరకడు, అది ఆయన బాధ. అబ్బా...చచ్చిపోతున్ననంటే నమ్మండీ. అరే ఎవడి మీద కోపమొచ్చినా నాకు గుండు గీయిస్తానంటాడు. అడ్డమైన మొక్కులూ నా మీద మొక్కుకుంటాడు. మొన్నటికి మొన్న ఏదో పాత బాకీ జమ పడితే, అన్నవరం కొండ, తెలుసుగా బాబు ఎంతెత్తో, దాని మీదికి ఆరు సార్లు ఎక్కించి అరవైపొర్లు దండాలు పెట్టిస్తానని మొక్కుకున్నాడు..."

***************************************************************

15, ఫిబ్రవరి 2016, సోమవారం

జంధ్యాల హాస్య గుళికలు - మొదటి సంచిక


జంధ్యాల హాస్య గుళికలు - మొదటి సంచిక


జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలుగు సినీ చరిత్రలో హాస్యాన్ని కొత్త స్థాయికి తీసుకు వెళ్లిన మహానుభావులు. ఎటువంటి వెకిలి, ద్వంద్వార్థాలు లేకుండా తెలుగు పదాలతో అద్భుతమైన హాస్యరసాన్ని తన చిత్రాలలో పండించారు. ఆ మహానుభావుడి వల్ల ఎనభై, తొంభయ్యవ దశకాలలో తెలుగు చలన చిత్రాలలో సుత్తి వీరభద్రరావు, వేలు, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి వంటి గొప్ప హాస్య కళాకారులు వెలుగొందారు. జంధ్యాల గారికి నివాళిగా ఈ హాస్య గుళికలు శీర్షికన వ్యాసాలు మీకు అందిస్తున్నాను. మొదటి సంచికలో ఆనందభైరవి చిత్రంలో ప్రాసలు మాట్లాడే వీరభద్రరావు, ఈలలు వేసే శ్రీలక్ష్మి, వీరిద్దరి బాధితునిగా సుత్తి వేలు మధ్య పొట్టలు చెక్కలయ్యే సన్నివేశం ఇది.

వీరభద్రరావు పేషెంటుతో: "మింగినట్టున్నావు కొత్త ఆవకాయతో కొండంత వాయ"

పేషెంటు: "చిత్తం. ఆహా! చేయి చూడగానే ఎలా చెప్పగలిగారో మహానుభావులు"

వీరభద్రరావు: "ఆవకాయలో వేడుంటుంది. ఆ వేడి నాలాంటి వాడి గల వైద్యుడికి నాడిలో తెలుస్తుంది రా బోడి..."

వీరభద్రరావు కొడుకుతో: "జంటగా వెళ్లి ఒంటిగా తగలడ్డావేం"..."కోడలేదిరా...కోడలేది అంటే గోడలకేసి నీడల కేసి చూస్తావేంటి రా గూడల జుట్టు వెధవ. ఏ అమ్మేశావా?"

కొడుకు వేలు: "నా ఖర్మ! సినిమాకి వెళ్లామా! అందులో ఓ మాంచి ఫైటింగ్ సీన్ వచ్చింది. హీరో రౌడీలను బాదుతున్నాడు. అది చూసి నీ కోడలు నీ కోడలు కయ్య్ అని అమెరికాకి వినిపించేంత గట్టిగా ఓ ఈల కొట్టింది. దాంతో దీని ముందు సీట్లో కూర్చున్న ఒకావిడ గుండె జబ్బు వచ్చి పడిపోయింది..."

వీరభద్రరావు దిమ్మతిరిగి పడిపోతాడు...

వేలు: "నాన్నా! నాన్నా! నీకు కూడా...నాకంత అదృష్టం కూడానా"..."ఆ ఈల విని ఆపరేటర్ అదిరిపడి సినిమా ఆపేసి లైట్లేశాడు. జనమంతా మాకేసి చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయొచ్చాను. అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగితా సినిమా కూడా చూపించమంటూ ఈలేసి గోల చేస్తోందక్కడ...."

వీరభద్రరావు: "అబ్బా! మనకా ఈలల గోల ఏల? ఈ ఈలన్నది ఇలలో కలలో మన ఇంటావంటా లేని విద్యే? "

వేలు: "అబ్బా! దాని ఈలతోనే చస్తుంటే మధ్యలో నీ కవిత్వం గోలేమిటి నాన్నా తలవాచిపోతోంది..."

వేలు శ్రీలక్ష్మితో: "ఆగు! ఏమిటే? ఊ! ఏమిటి ఇందాక నువ్వక్కడ చేసిన పని?"

శ్రీలక్ష్మి: "కోప్పడకండీ! అంత శబ్దం వస్తుందని అనుకోలేదు..."

వేలు: "నిన్ను...నిన్ను ఇక జన్మలో బయటికి తీసుకెళితే నా చెవిలో ఈలేసి చంపెయ్యవే"
శ్రీలక్ష్మి: "అంత మాటనకండీ. ఈల వెయ్యటం నాకు మాత్రం ఇష్టమేనా? ఏం చేయను ఎక్కువ సంతోషం కానీ బాధ కానీ కలిగినప్పుడు వేళ్లు వాటంతట అవే దగ్గరవుతాయి, నోటి దగ్గరికి వెళ్లిపోతాయి, లోపలనుంచి గాలి వస్తుంది, బయటకి శబ్దమొస్తుంది. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండీ..."

వేలు: "నా వల్ల కాదే! ఈలేసే పెళ్లాన్ని ఏలుకోలేను. ఇవాళ్లో రేపో వకీలు గారిని కలిసి నీకు విడాకులిచ్చేస్తాను"

శ్రీలక్ష్మి: "అంటే ఏంటండీ"

వేలు: "కోర్టు వారు ఇక నీకు నాకు ఏ సంబంధం లేదని కాయితం ఇస్తారు..అది.."

దుఃఖంతో శ్రీలక్ష్మి కయ్య్ అని ఈల వస్తుంది

శ్రీలక్ష్మి: "క్షమించండి ఇది బాధ ఈల"

వీరభద్రరావు: "ఓసి నీ బాధ తగలెయ్య.  అమ్మ అమ్మ...గుండిగి కింద పడ్డ అప్పడంలా గుండె చితికిపోయింది కదమ్మా. ఒరేయ్ కుంకాక్షీ. ఇకనుంచి క్షమించమని అదీ మీ ఆవిడనడక్కు. ఆ సంబరంలో మళ్లీ ఈల కొట్టిందంటే ఈ గుండెకి ఆ ఈల జోలవుతుంది. స్వస్తి..పో అవతలకి పో"

వేలు:"నాన్న..నాన్న గుండాడుతోందా?"

వీరభద్రరావు - "ఆ ఆ"

వేలు: "అమ్మబాబోయ్...పదవే లోపలకి పద"

13, ఫిబ్రవరి 2016, శనివారం

కృష్ణభక్తి - నాలుగవ సంచిక

కృష్ణభక్తి - నాలుగవ సంచిక


కృష్ణభక్తిలో మరో ప్రత్యేకత నృత్య హేల. బృందావనంలో గోపికలతో రాసహేలలో, వసంతోత్సవంలో ఆడి పాడే కృష్ణుని వర్ణిస్తూ ఎందరో భక్తులు స్వామి వైభవాన్ని మనకు ఆవిష్కరించారు. వారిలో ప్రముఖులు నారాయణ తీర్థుల వారు. ఆంధ్రనాట తల్లావఝ్ఝుల గోవింద  శాస్త్రిగా జన్మించి తమిళనాట స్థిరపడి నారాయణ తీర్థులుగా పేరుపొందిన ఈ యోగి కృష్ణునిపై భక్తితో అనుపమానమైన, అపురూపమైన కృష్ణలీలా తరంగిణిని రచించారు. నవ రసాలను ఒలికిస్తూ సంస్కృతంలో శ్రీకృష్ణుని లీలావినోదాలను నాట్యశాస్త్రానికి అనువుగా రచించారు. కృష్ణలీలా తరంగిణిలో బాలకృష్ణుని లీలలు మొదలు రుక్మిణీకళ్యాణం చివర.

నారాయణతీర్థులవారి కృష్ణలీలా తరంగిణిలో ఒక ప్రత్యేకమైన లక్షణం బాలకృష్ణుని లీలలను వర్ణనలలో కృష్ణుని ఆకృతిని, వేషభూషలను విశేషంగా ఉట్టంకించటం. బాల గోపాల కృష్ణ పాహి పాహి అనే తరంగంలో ఆ కృష్ణుని మనోజ్ఞంగా వర్ణించారు. ఆ తరంగం విశేషాలు:


బాల గోపాల కృష్ణ పాహి పాహి 

నీల మేఘ శరీరా నిత్యానందం దేహి

కలభ సుందర గమన కస్తూరి శోభితానన 
నళిన దళాయత నయన నంద నందన 
మిళిత గోప వధూజన మీనాంక కోటి మోహన 
దళిత సంసార బంధన దారుణ వైరి నాశన 

యజ్ఞ యజ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ 
యజ్ఞ ఫల వితరణ యతి జన తరణ 
అజ్ఞాన ఘన సమీరణ అఖిల లోక కారణ 
విజ్ఞాన దళితావరణ వేదంత వాక్య ప్రమాణ

వ్యత్యస్త పాదారవింద విశ్వ వందిత ముకుంద 
సత్యాఖండ బోధానంద సద్గుణ బృంద 
ప్రత్యస్తామిత భేద కంద పాలిత నంద సునంద 
నిత్యద నారాయణ తీర్థ నిర్మలానంద గోవింద



బాలుడైన కృష్ణుని పాహి పాహి అని నుతిస్తూ మొదలయ్యే ఈ గీతంలో నీలిమేఘాల రంగుతో శరీరం కలిగిన ఆ బలుని శాశ్వతానందం ప్రసాదించమని వేడుకుంటున్నారు.

ఏనుగులా అందంగా నడిచే, కస్తూరితో శోభించే ముఖము కల, కలువ రేకుల వంటి కన్నులు గలవాడు ఆ నందకుమారుడు. గోపవధువులతో కలిసి ఆడి పాడేవాడు, కోటి మన్మథులకు సమానమైన మోహనాకారుడు అయిన ఆ కృష్ణుడు అతిభయంకరమైన శత్రువులను జయించిన వాడు, భక్తులను సంసార బంధములనుండి విడిపించే వాడు.

లోకకళ్యాణార్థమై ఋషులు చేసే యజ్ఞాలను కాపాడే వాడు, యాదవ వంశమునకు ఆభరణమైన వాడు ఆ కన్నయ్య. యజ్ఞఫలమును స్వీకరించే వాడు, యతులను తరింపజేసేవాడు వీడే. అజ్ఞాన మేఘములను తొలగించేవాడు, సమస్త లోకములకు కారణమైన వాడు ఈ బాలుడు. విజ్ఞానమును చాటే వాడు, వేదవేదాంతములకు ప్రమాణమైన వాడు ఈ బాలకృష్ణుడు.
 
వ్యత్యస్తమైన అడుగులతో (ఒక కాలు మరో కాలును దాటుతూ వేసే అడుగులు) అందమైన పాదములు కలవాడు, అఖండమైన సత్యమును బోధిస్తూ ఆనందించేవాడు, సద్గుణముల రాశి అయినవాడు ఆ బాలకృష్ణుడు. ఎవరిలో అయితే జీవరాశులలో ఉన్న భేదములన్నీ లీనమై మటుమాయమైపోతాయో,ఆతడే ఈ నంద సునందాదులను పాలించే బాలకృష్ణుడు. ఆ గోవిందుడు నారాయణ తీర్థులకు నిత్యము నిర్మలమైన ఆనందాన్ని ప్రసాదించే వాడు.

నారాయణ తీర్థుల వారి భక్తి మార్గము ఈ తరంగంలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. లీలావేష్టితమైన శ్రీకృష్ణుని బాల్యము చిలిపి చేష్టలా అనిపించినా, అందులో ఆ బాలుడు వేసిన ప్రతి అడుగూ మానవజాతి ఉద్ధరణకే. మమకారం విహీనమై, పరిపూర్ణమైన ప్రేమ తత్త్వముతో మానవాళికి భేదభావములను మరపింపజేసి, మోహపాశములనుండి విడిపించి శాశ్వతానందాన్ని ప్రసాదించినవాదు కృష్ణుడు. ఈ మార్గంలో మానవునకు శత్రువులైన అరిషడ్వర్గముల నాశనం చేసి వారిని ఉద్ధరించినవాడు. కంసాది దానవుల సంహారం దీనికి సూచిక. ధర్మ సంస్థాపనకు ఈ లీలలు ముందడుగులు. యజ్ఞములు అనగా మనము కామ్యముతో చేసే నిత్యకర్మల యొక్క ఫలాన్ని స్వీకరించి మనలను సోపానములో ముందుకు నడిపించే వాడు ఈ సారథి. సమస్త వేదముల సారము, మూలము ఈ పరమాత్మ పరిపూర్ణ స్వారూపము. అజ్ఞానమును తొలగిస్తూ జ్ఞానాన్ని పంచే జగద్గురువు ఈ కృష్ణుడు. ఈ సందేశాన్ని పరిపూర్ణంగా ఈ తరంగంలో నారాయణ తీర్థుల వారు మనకు అందించారు.

కూచిపూడి నాట్యపద్ధతిలో నారాయణ తీర్థుల ఈ తరంగానికి చాలా ముఖ్యమైన స్థానముంది. ఈ తరంగ నాట్యము లేకుండా ఏ రంగప్రవేశమూ ఉండదు, ఎంత గొప్ప కళాకారులైనా ఈ తరంగాన్ని తమ నాట్యప్రదర్శనలలో ప్రదర్శించకుండా ఉండరు. మోహనరాగంలో కూర్చబడిన ఈ తరంగంలో కళాకారులు భక్తి జ్ఞాన కర్మ యోగములకు ప్రతీకగా పళ్లెము, చెంబుతో నర్తించటం ఆనవాయితీ. సంతులన, లయజ్ఞానం, పారవశ్యం అన్నీ మేళవించి కృష్ణ భక్తిని ఆవిష్కరించే అద్భుతమైన పుష్పం ఈ నారాయణ తీర్థుల వారి తరంగం.

10, ఫిబ్రవరి 2016, బుధవారం

కృష్ణ భక్తి - మూడవ సంచిక

కృష్ణ భక్తి - మూడవ సంచిక



కృష్ణ భక్తిలో ఉన్న ప్రత్యేకత బాలునిగా లాలించి, చేష్టలను దర్శించి, అంతలోనే పరమాత్మగా అనుభూతి చెందటం. దీనినే మధుర భక్తిగా ప్రస్తుతించారు భాగవతులు. రాధ, గోపికలు మొదలు ఎందరో కృష్ణ భక్తులు తమ మధురభక్తితో తరించారు. వారికి స్వామి తప్ప ఇంక వేరే ఏమీ ఉండదు. మనలో కలిగే అన్ని భావనలూ స్వామితోనే పంచుకోవటం మధుర భక్తిలో ఒక లక్షణం. దీనివలన ఎన్ని కష్టాలైనా అవలీలగా దాటారు ఆ భక్తులు. అలాంటి వారిలో అన్నమాచార్యుల వారు అగ్రగణ్యులు. ఆ శ్రీకృష్ణుని బాలుడైన పరమాత్మునిగా భావించారు, అంతలోనే యశోదమ్మగా లాలించారు, గోపెమ్మగా ప్రేమించారు, భక్తునిగా సేవించారు, మణిమాణిక్యములతో పోల్చారు. ఆ మధురభక్తిలో ఎన్నలేని భావనలు, చివరకు శరణాగతితో స్వామికి సమర్పణము.

"భావయామి గోపాల బాలం" అనే సంకీర్తనలో ఎంత మనోజ్ఞంగా వర్ణించారో? ఆ బాల కృష్ణుడు నడుముకు కట్టుకున్న మేఖలము, అలంకరించ బడిన మణి ఘంటిక, మృదువైన శబ్దాలు చేస్తూ విలసిస్తున్నాయిట. కొంటె పదములు వేస్తూ, పెన వేసుకుంటూ, దూరమవుతూ, అద్భుతమైన నటన చేస్తూ ఉన్నాడుట. చిన్ని కృష్ణుని లీలలను ఎదురుగా దర్శించకుండా ఇలా రాయటం అసంభవం.

ఇంతలో ఆ బాలుని నవరత్నాలలో అద్భుతంగా పోల్చారు అన్నమాచార్యుల వారు. యశోద ముంగిట ముద్దులొలికే ముత్యంగా పోల్చారు..అంతటితో ఆగారా? తిద్దరాని మహిమల దేవకీ సుతుడు అన్నారు. ఆయన మహిమలను వర్ణించలేము అని బాలుడైన పరమాత్మ వైభవాన్ని చాటారు. గోపకుల స్త్రీ చేతుల మాణిక్యము, కంసుని పాలి వజ్రము, మూడులోకాలలో కాంతులను విరజిమ్మే పచ్చ, రతికేళిలో రుక్మిణికి పగడము, గోవర్ధన పర్వతానికి గోమేధికము, శంఖ చక్రాల సందులలో వైఢూర్యము, కాళీయుని పడగలపై పుష్యరాగము, శ్రీవేంకటాద్రిలో ఇంద్రనీలము, పాలసముద్రంలో దివ్యరత్నము...ఇవన్నీ ఆ శ్రీకృష్ణుడే. మరి ఆయన మన చెంతనే ఉన్న చిన్ని కృష్ణుడట, మనకు గతిగా నిలిచి కాపాడే కమలాక్షుడట, బాలుని రూపములో తిరిగే పద్మనాభుడట...ఇదీ ముద్దుగారే యశోద అనే సంకీర్తనలో అన్నమాచార్యుల వారు అనుభూతి చెంది కురిపించిన భావామృతవర్షిణి.

మరి ఆ చిన్ని కృష్ణునికి లాలి పాడాలి కదా? ఆయనే యశోదగా, గోపెమ్మలుగా భావించి అద్భుతంగా "లాలనుచునూచేరు లలనలిరుగడలా బాలగండవర గోపాల నిను చాలా" అని లాలించారు. "లలనాజనాపాంగ లలిత సుమచాప జలజలోచన దేవ సద్గుణ కలాప తలపులోపల మెలగు తత్త్వ ప్రదీపా..." అని బాలునికి లాలిపాడారు. అందులో ఒక బాలునిగా భావించారా? ఆ కలువకన్నులు కల వాడు సద్గుణాల రాశిగా, మన తలపులలో మెలిగే తత్త్వ ప్రదీపకునిగా దర్శించి నుతించారు. భక్తిలో జీవాత్మ-పర్మాత్మ తత్త్వములను ఎరిగి దాని నుండి అద్వైత భావనకు చేరుకునేలా మనకు ఇటువంటి సంకీర్తనలను అందించారు.

అందుకే కృష్ణ భక్తి సామ్రాజ్యంలో బాలుడి నుండి జగద్గురువు దాకా శతకోటి రూపానుభూతులకు ప్రత్యేక స్థానాలున్నాయి, అవి అన్నీ కలిపితే మధురమైన భక్తి రస సామ్రాజ్యంగా ప్రకాశిస్తుంది.

గోవింద కృష్ణజై గోపాల కృష్ణ జై!

8, ఫిబ్రవరి 2016, సోమవారం

కృష్ణ భక్తి - రెండవ సంచిక



లీలల ద్వారా మాయాప్రేరితమైన లక్షణాలను తొలగించినవాడు కృష్ణుడు. మన్ను తింటున్నాడని చూచి బాలుడైన తమ్మునిపై ప్రేమతో అన్న బలరాముడు తల్లికి ఫిర్యాదు చేస్తే, ఆ తల్లి కలవరపడి ఏదీ నోరు తెరువు అని అడగగా మొత్తం విశ్వాన్ని నోట చూపించాడు. అంతటితో యశోదకు తాను ఆ బాలుని తల్లి అన్న మాయ నశించి అతనిలో పరమాత్మను దర్శిస్తుంది. ఆ ఘట్టాన్ని సముద్రాల రాఘావాచార్యుల వారు పాండురంగ మహాత్యం చిత్రంలో జయ కృష్ణా ముకుందా మురారీ అనే గీతంలో ఇలా అందంగా వర్ణించారు.

అమ్మా! తమ్ముడు మన్ను తినేనూ.. చూడమ్మా! అని రామన్న తెలుపగా
అన్నా! అని చెవి నులిమి యశోద ఏదన్నా! నీ నోరు చూపుమనగా
చూపితివట నీ నోటను, బాపురే! పదునాల్గు భువన భాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు తాపము నశియించి జన్మ ధన్యత గాన్చెన్

అలాగే,  కాళింది మడుగును అహంకారంతో విషపూరితం చేస్తున్న కాళీయునికి గుణపాఠం చెప్పటానికి ఆ మడుగులో దూకుతాడు. అమ్మో పిల్లవాడు నీట దూకాడు, ఆ సర్పము ఏమి చేస్తుందో అని నందయశోదలు, గోకులమంతా భయపడుతుంది. వారి భయమే కానీ, పరమాత్మ లీలకు ఆటంకమా? ఆ మహాసర్పము మదాన్ని అణచటానికి ఆతని తోక ఒక చేత పట్టుకొని, పడగలపై నాట్యం చేశాడు. విజయుడై అలాగే నీటినుండి బయటకు వచ్చాడు. ఆతని చూసి ఆ నందయశోదలకు కనువిప్పు కలిగింది. తమ బిడ్డ సామాన్యుడు కాదని అర్థమైంది. ఆ ఘట్టాన్ని సముద్రాల వారు ఇలా వర్ణించారు:

కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ కేళీ ఘటించిన గోపకిశోరా
కంసాది దానవ గర్వాపహార హింసా విదూర పాప విదార

దీనిని మరింత సులువుగా వేటూరి సుందరరామమూర్తిగారు సప్తపది చిత్రంలో ఇలా వివరించారు:

కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలమా బాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ
తాండవమాడిన సరళి గుండెల నూదిన మురళి ఇదేనా ఆ మురళి

ఇలా ఒకటా రెండా? అవతారం మొత్తం అనుక్షణం ఆ కృష్ణుని లీలలే. ప్రతి ఒక్క లీలకూ ఒక పరమార్థముంది. దానిని అనుభూతి చెందిన నందవ్రజమంతా ఆయన భక్తులైనారు. ఒక్కసారి ఆ స్వామి భక్తి సామ్రాజ్యంలో ఆయనకు దాసులైతే ఇక వేరే ప్రపంచం అక్కరలేదు. అన్నీ ఆయనే, అన్నిటా ఆయనే. రాసలీలలో తన్మయులైన రాధాది గోపికలు ఆయన భక్తులలో అగ్రగణ్యులు. పెంచిపెద్ద చేసిన తల్లిదండ్రులూ ఆయన భక్తులే. ఆడుకున్న సఖులూ ఆయన భక్తులే. అందుకే లీలావినోదభరితమైన కృష్ణభక్తి సామ్రాజ్యం విలక్షణమైనది, అనుపమానమైనది. 

7, ఫిబ్రవరి 2016, ఆదివారం

కృష్ణ భక్తి - మొదటి సంచిక

కృష్ణ భక్తి - మొదటి సంచిక


కృష్ణుని గురించి ఎంతమంది చెప్పినా తనివి తీరదు. అది సంపూర్ణం కాదు. పోతన మొదలు నేటి కవుల వరకు చాల మంది తెలుగుభాషలో స్వామి రూపగుణవైభవాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అందులో వేటూరి సుందరరామమూర్తిగారు కూడా ఉన్నారు. "మోహనాల వేణువూదే మోహనాంగుడితడే.." అని ఒక పంక్తిలో పొగిడితే ఇంకొక పంక్తిలో "నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే" అని సాగర సంగమం చిత్రంలోని వేవేల గోపెమ్మల మువ్వగోపాలుడే ముద్దు గోవిందుడే అన్న గీతంలో వేటూరి వారు అన్నారు. ఆ సమ్మోహననుని  వేణువు వింటే గోకులం అంతా "నేను" అన్న భావన మరచి ఆ పరమాత్మతో అనుసంధానమై తన్మయత్వంలో మునిగేవారుట. ఆతని రూపము వర్ణించనలవి కానిది.

"కస్తూరీతిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేచ ముక్తావళీం గోప స్త్రీ పరివేష్టితోం విజయతే గోపాల చూడామణిం" అని బిల్వమంగళుడు ఆ ముకుంది మోహన రూపాన్ని శ్రీకృష్ణకర్ణామృతంలో వర్ణించే యత్నం చేశాడు. విశాలమైన నుదుటన కస్తూరి తిలకం, వక్షస్థలమున కౌస్తుభ మణి, ముక్కు చివరన కొత్త ముత్యం, చేతిలో వేణువు, చేతులకు కంకణాలు, తనువంతా శ్రీచందనం, కంఠములో ముత్యాలహారం, చుట్టూ గోపికలతో ప్రకాశిస్తున్నాడు ఆ గోపాల చూడమణి.

మరి ఆ కృష్ణుడు ఆకాశం రంగుతో నిఖిలమైనాడు. అంతటా ఆయనే ఉన్నాడు. సృష్టికి పరిణామాలకు లీలావినోదంతో చూస్తూ సాక్షీ భూతుడైనాడు. అందుకే వేటూరి వారు ఆయనను కాలమై నిలిచాడు అన్నాడు. ఇంకొక అడుగు ముందుకు వేసి "గీతార్థ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే" అన్నారు. కర్మ చేయటం వరకే నీ వంతు, ఫలాన్ని నాకు వదులు అని చెప్పి మన విదిని మార్చుకునే మార్గం చెప్పాడు ఆ పరమాత్మ. కృష్ణావతారానికి ఒక విశేషమైన, విలక్షణమైన లక్షణముంది. ఆయన అంతటా ఉన్నట్లు అనిపించినా, ఎవ్వరికీ దేనికీ చెందని వాడు. కన్న తల్లికే చెందలేదు, ప్రేమించిన రాధకూ చెందలేదు, పూజించిన బావకూ చెందలేదు. ధర్మం వైపు నిలిచాడు. భక్తికి తలవంచాడు. అందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఔరా అమ్మక చెల్లా అనే గీతంలో "బాలుడా! గోపాలుడా! లోకాల పాలుడా! తెలిసేది ఎలా ఎలా ఛాంగు భళా" అన్నారు. "అయినవాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికీ" అని కృష్ణుని తత్వాన్ని వీలైనంత సులభంగా తెలియజేసే ప్రయత్నం చేశారు.

కృష్ణభక్తికి మూలం ఇదే. మనలను మనం సంపూర్ణంగా స్వామికి సమర్పించుకోవటం. అన్నీ భావనలూ ఆయనవే అని "నేను", "నాది" అన్న భావనలకు దూరమై జీవాత్మను పరమాత్మను ఏకం చేయటం. ఎప్పుడైనా శరణాగతితో ఉన్న కృష్ణభక్తులను చూస్తే ఈ విషయం అవగతమవుతుంది - బాహ్యప్రపంచం పట్టదు, స్వామిని దర్శిస్తూ అనేకునితో ఏకమై రమిస్తూ ఉంటారు..

6, ఫిబ్రవరి 2016, శనివారం

పనీర్‌ గులాబ్ జామూన్



నిన్న ఇంట్లో పాలు విరిగాయి. వెంటనే శ్రీమతి విరిగిన పాలను మూటగట్టించి పనీర్ చేసింది. ఎప్పుడూ పనీర్‌తో కూరేనా? స్వీట్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. పనీర్‌తో గులాబ్ జామూన్ బాగుంటుంది అని తను రెసిపీ చెప్పింది. వెంటనే ఆ పనిలో పడ్డాను.

కావలసిన పదార్థాలు:

పనీర్ అరకిలో
మైదాపిండి 50గ్రాములు
కండెన్సుడ్ మిల్క్ (నెస్లె డబ్బా చిన్నది)
బేకింగ్ పౌడర్
కొద్దిగా నెయ్యి
పంచదార అరకిలో
ఏలకులపొడి

తయారు చేసే పద్ధతి:

ముందుగా పనీరును (విరిగిన పాలను మూట కడితే వచ్చే పాల ఉత్పత్తి) గ్రైండరులో వేసి మెత్తగా చేసుకోవాలి.  దానిలో 50 గ్రాముల మైదాపిండి, అరకప్పు కండెన్సుడ్ మిల్క్, బేకింగ్ పౌడర్, కాస్త నెయ్యి వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక అరగంటసేపు పాత్రలో మూత పెట్టి ఉంచాలి. తరువాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక గిన్నలో అరకిలో చక్కెరలో అరలీటరు నీళ్లుపోసి వేడి చేస్తూ తీగ పాకం చేసుకోవాలి. పాకం సిద్ధమైంది అనటానికి సూచన గరిటతో పైకి తీస్తే తీగలా సాగాలి. పాకంలో ఏలకులపొడిని వేసి కలపాలి.




స్టవ్‌పై నూనె పెట్టి నూనె వెడెక్కిన తరువాత ఉండలను ఒక్కొక్కసారి 4-5 చొప్పున సన్న సెగలో వేయించాలి. ఎక్కువ సెగలో వేయిస్తే లోపల ఉడకదు, పైన మాడిపోయి పాకాన్ని పీల్చదు. ఎర్రగా వేగిన తరువాత వాటిని ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి. అప్పుడు ఆ ఉండలను పాకంలో వేయాలి. ఒక అరగంటకు ఉండలు పాకాన్ని పీల్చి పెద్దగా, సాఫ్ట్‌గా అవుతాయి. అంతే! పనీర్ గులాబ్ జామూన్ రెడీ!! 

5, ఫిబ్రవరి 2016, శుక్రవారం

తరాల మార్పులు - జీవితాల్లో పెను మార్పులు


కాలాలు మారాయి, అవసరాలు పెరిగాయి, ఉద్యోగాలలో పని గంటలు పెరిగాయి, మనుషుల్లో ధర్మం మారింది. వీటన్నిటితో పని చేసే వారి జీవితాలు ఒత్తిడితో ఉన్నాయి. దీన్ని వృద్ధ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి.

కొడుకు/అల్లుడి గురించి -

"మేము ఉద్యోగాలు చేసినప్పుడు ఆరు గంటలకల్లా ఇంట్లో ఉండేవాళ్లమురా! ఈ ఉద్యోగాలేంటో? రాత్రింబవళ్లూ పని, పిల్లల చదువుల గురించి పట్టించుకునే సమయం లేదు. ఎందో, వీళ్లకు డబ్బుంది కానీ సుఖం లేదు..."

కోడలు/కూతురు గురించి -

"మా తరంలో ఆడవాళ్లు ఇంటి పట్టున ఉండి పిల్లలను చూసుకునే వాళ్లు. నా కోడలు, కూతురు ఉద్యోగం పొద్దున పోతే రాత్రి దాకా చేస్తూనే ఉంటారు. రాత్రిళ్లు పొద్దు పోయిన తరువాత కూడా కాల్స్...ఇక ఆ పిల్లల తిండి పట్టించుకునే వాళ్లు ఎవరు?...ఎందుకీ ఆడాళ్లకు ఉద్యోగాలు? మొగుళ్లు బోలెడు సంపాదిస్తున్నారు, హాయిగా మానేసి పిల్లల చదువులు, తిండి చూసుకోవచ్చు కాద?"

మనవలు/మనవరాళ్ల గురించి -

"వీళ్లకి బయటికి వెళ్లి ఆడుకునే బుద్ధి లేదు. ఇరవై నాలుగు గంటలూ టీవీ, సెల్ ఫోన్, ఐ ప్యాడ్...పసితనంలో సోడాబుడ్డీల కళ్లజోళ్లు..."

కోడలు గురించి -

"మా కోడలకి పిల్లలను అరిస్తే ఇష్టముండదు. మేము ఇలా పెంచలేదమ్మా. పిల్లలకు డిసిప్లీన్ లేకపోతే ఎలా? భయం భక్తి లేదు. ఎదురు ప్రశ్నిస్తారు, ఇంకా ముదిరితే అరుస్తారు..ఏవిటో ఈ పెంపకం..ఎందుకీ డబ్బు?..."

ఎదిగిన మనవడు/మనవరాలి గురించి:

"ఏం పిల్లలో, కాస్త కూడా ఒత్తిడి తట్టుకోలేరు, ఒక్క పని చాతకాదు, పొద్దున పోయి రాత్రికి వస్తారు కాలేజీనుంచి. వీళ్ల శరీరాల్లో శక్తి ఉండదు, ఏదైనా చెబితే కోపం..."

కొడుకు గురించి తండ్రి -

"మా వాడికి అప్పుడే స్పాండిలోసిస్ వచ్చింది. మెదలో, నడుములో డిస్క్ ప్రాబ్లం. ముప్ఫై కూడా లేవు. ఐదు కిలోల బరువు కూడ మోయలేడు. నేను ఆ వయసులో ఎంత బరువైన ఎత్తేవాడిని, ఎంత దూరమైనా నడిచి వెళ్లే వాడిని"

- ఇదీ చాలా మంది రిటైర్ అయిన తల్లిదండ్రులు తమ పిల్లల కుటుంబాల గురించి తమ సాటి వయస్కులతో, అక్క చెల్లెళ్లతో చెప్పేవి.

నిజమే. కానీ, ఈ సమస్యలకు కారణం ఏమిటి అని కూడా ఆలోచించాలి కదా?

1. ఇది వరకు చాలా మంధి చిన్న/మధ్య తరగతి ఊర్లలో, పట్టణాలలో ఉద్యోగాలు చేసుకునే వారు. కాబట్టి, తక్కువ డబ్బుతో అయినా సంసారం నడిచేది. ఇప్పుడు ఉద్యోగాలన్నీ పెద్ద పట్టణాలలోనే ఉంటున్నాయి. అక్కడ వస్తువుల ధరలతో పాటు, నెల ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఒక సంపాదనతో కుటుంబం గడవటం కష్టమే. స్త్రీలు ఉద్యోగం చేయటం అనేది స్త్రీ స్వేచ్ఛ కోసం కన్నా ఆర్థిక వెసులుబాటు కోసమే ఎక్కువగా తప్పనిసరి అయ్యింది. ఇది ఈ తరం వాళ్లు కోరి తెచ్చుకున్నది కాదే?

2. ఇదివరకు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలలో చేసే వారు, పబ్లిక్ సెక్టార్ (బ్యాంకులు వగైరా) జాబుల్లో చేసేవారు. కాబట్టి వారికి పని గంటలు పరిమితం. ఇప్పుడు అలా కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు, పని విపరీతం, కంపెనీల మధ్య పోటీ, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయిస్తే తప్ప లాభాలు రావు. అది కూడా కాకుండా, బీపీవో వంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల వలన రాత్రిళ్లు పని చేయాల్సిన అవసరం. వేర్వేరు భౌగోళిక ప్రాంతాలలో ఉన్నవారితో కలిసి పని చేయాలి, అక్కడి కస్టమర్సును సపోర్ట్ చేయాలి. అలాగే, బ్యాకుల నుండి కస్టమర్లు ఎక్కువ పని వేళలు, ఎక్కువ సర్వీసులు ఆశిస్తున్నరు. ప్రభుత్వం కూడా దీనిపైనే దృష్టి పెట్టింది. ఇది వరకు 5:30 కల్లా ఇంటికి వచ్చే బ్యాంకు ఉద్యోగులు ఇప్పుడు రాత్రి పొద్దుపోయాక వస్తున్నారు. దీనితో పని వేళలలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. ఇవేవీ, ఈ తరం వాళ్లు కొని తెచ్చుకున్నవి కాదే?

3. ఇది వరకు సమాజంలో భద్రత ఉండేది, పిల్లలు రోడ్లపైకి వెళ్లి ఆడుకునేందుకు వీలుగా ట్రాఫిక్ తక్కువ ఉండేది, ఆడపిల్లలపై అత్యాచారాలు తక్కువగా ఉండేవి. అందుకని, హాయిగా పిల్లలు రోడ్ల మీద ఆడుకునే వాళ్లు. ఇప్పుడు జనాభా పెరిగింది, రోడ్లు పెరగలేదు, ఆట స్థలాలు ఆక్రమించబడ్డాయి. పిల్లల భద్రత కోసం వారిని తల్లిదండ్రులు బయటికి పంపించటం లేదు. ఇది నేటి తరం కొని తెచ్చుకున్నది కాదే?

4. ఇది వరకు ఒక్క దూరదర్శన్ మాత్రమే ఉండేది, సెల్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు, ఇన్ని రకాల పరికరాలు లేవు. కాబట్టి పిల్లలకు ఆటలు, ఇతరులతో కలిసే అవకాశం ఉండేది. ఇప్పుడో? వందల చానెళ్లు, వందల పరికరాలు, దానిలో పిల్లల సమయాన్ని హరించే లక్షల ఆటలు, పాటలు. దీనిలో నేటి తల్లిదండ్రులకు పాత్ర ఉంది. వారు నియంత్రణలో పెట్టవచ్చు, కానీ చేయటం లేదు.

5. ఒక తరం క్రితం, పిల్లలకు చదువులు -> ఉద్యోగాలు -> ఆర్థిక భద్రత అనే దాని మీదికి విపరీతమైన ఫోకస్ వచ్చి వ్యక్తిత్వ వికాసాన్ని వదిలేశారు. అంటే, మాకు డబ్బు లేదు, మా పిల్లలు చదువుకొని సంపాదించాలి అని ఆ తరం తల్లిదండ్రులు పిల్లలను చదువుల్లోనే ఉంచి,మిగితావి పక్కన పెట్టారు. దానితో ఎదిగే పిల్లల వ్యక్తిత్వ వికాసం జరగలేదు. కేవలం మార్కుల్లో మాత్రమే వారి ప్రతిభ. ఈ జాడ్యం నేడు, వికృతమై నారాయణ/చైతన్య వంటి కమర్షియల్ విద్యాసంస్థలకు జన్మనిచ్చింది. ఇక పిల్లలకు వ్యక్తిత్వ వికాసమే లేదు. దీనికి క్రిందటి తరం తల్లిదండ్రులే బాధ్యులు. నేటి తరం తల్లిదండ్రులు కళ్లు తెరిచి సరిదిద్దాలి.

6. ఇది వరకు అన్ని ఉద్యోగాలూ ఫైళ్లు చూడటం, రాయటం. అలాగే కార్మిక వర్గంలో ఎక్కువగా లేచి తిరిగి శరీరానికి పని పెట్టే ఉద్యోగాలు ఉండేవి. ఇప్పుడు అలా కాదు. అన్ని ఉద్యోగాలూ కంప్యూటర్ మీద చేసేలా మారాయి. కంప్యూటర్ ఉద్యోగాలు పెరిగాయి. ఇవి సిట్టింగ్ జాబ్స్ కావటం, సరైన పద్ధతిలో కూర్చోకపోవటం వలన వెన్నెముక్ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి ఉద్యోగులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో వాళ్లు కూడ తోడ్పడి ప్రోత్సహించాలి.

మొత్తం మీద, క్రిందటి తరం తల్లిదండ్రులు పరిస్థితులను కాస్త అర్థం చేసుకోవాలి. తమ పిల్లలు ఎందుకు ఈ స్థితిలో ఉన్నారో గ్రహించి దానికి కారణాలను కనుక్కొని వీలైనంత సహాయకరంగా ఉండాలి. ఊరికే పక్కవారితో ఆడిపోసుకుంటే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మారిన తరంతో పాటు మారిన పరిస్థితులు. అంతే. ఇది తెలుసుకుంటే తరాల మధ్య అంతరాలు రావు.

4, ఫిబ్రవరి 2016, గురువారం

శ్రీశ్రీ రచన - సీతాకళ్యాణ హరికథ - వాగ్దానం (1961)


హరికథ భారతీయ కళలలో ఒక ప్రముఖమైన స్థానం కలిగి ఉండేది. 19వ శతాబ్దంలో ఆదిభట్ల నారాయణదాసు గారి పుణ్యమా అని వికసించిన ఈ కళ ఆంధ్రప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే కన్నడ, తమిళ, మరాఠీ ప్రాంతాలలో హరికథలు 19వ శతాబ్దంలో బాగా ప్రాచుర్యం చెందాయి. ధర్మ ప్రచారానికి, ఆధ్యాత్మిక వైభవానికి హరికథలు సాధనాలుగా నిలిచాయి. ఉత్తరాదిన ఇప్పటికి కూడా హరికథ ప్రజల జీవితంలో అంతభాగం. మరి ఏమిటి హరికథలో ప్రత్యేకత? సంగీతం, సాహిత్యం, భక్తి, భాగ్వత కథలు, కాస్తంత ఆహార్యం..ఇవి సమపాళ్లలో మేళవించి కథను చక్కగా విశదీకరించే ప్రక్రియ. దీనిలో భాషకు, వాక్శుద్ధికి, గాత్ర సౌలభ్యానికి, పురాణేతిహాసముల జ్ఞానానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. హరికథలు సమాజంలో ప్రజలకు ధర్మ బోధతో పాటు జ్ఞాన వైరాగ్యాలను అందిస్తాయి. అటువంటి కళను చలన చిత్రాలలో చాలా తక్కువగా ఆవిష్కరించారు. అందుకు కారణం హరికథకు సమయం ఎక్కువ కావాలి, చలనచిత్రానికి పరిమితమైన సమయం. అయినా కూడా, కొంతమంది మహానుభావులు ఈ కళను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. తెలుగు సినీ స్వర్ణయుగంలో జరిగిన అటువంటి ప్రయత్నమే 1961లో విడుదలైన వాగ్దానం చిత్రంలోని సీతాకళ్యాణ హరికథ.

దర్శకులు ఆత్రేయ అద్భుతంగా సామాజిక కథాంశంలో సీతారామ కళ్యాణం కథను గీత రూపంలో చిత్రీకరించారు. నాగేశ్వరరావు, కృష్ణకుమారిలపై ఎంతో అర్థవంతంగా ఈ హరికథా గీతాన్ని చిత్రీకరించారు. కథకులుగా రేలంగి, వాద్యసహకారం పాత్రలలో సూర్యకాంతం, పద్మనాభంలను పాత్రధారులను చేశారు. ఈ హరికథకు మూలస్థంభాలు శ్రీశ్రీ గారి సాహిత్యం, పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం, ఘంటసాల మాష్టారు గానం.

శ్రీశ్రీ అనగానే విప్లవ సాహిత్యం అనుకున్నారా? ఆయన విప్లవానికి ముందు అనేక రకాల రచనలు చేశారు. వాటిలో సీతాకళ్యాణ హరికథ అగ్రస్థానంలో నిలుస్తుంది. వారు యోగి అనటానికి ఈ పాట ఒక మంచి ఉదాహరణ. గణపతి ప్రార్థనతో మొదలయ్యే ఈ గీతం, అద్భుతమైన వచన మరియు పద్య సాహిత్యంతో విరబూసింది. సాహిత్యం పరిశీలిద్దాం:

శ్రీనగజా తనయం సహృదయం
చింతయామి సదయం త్రిజగన్మహోదయం

శ్రీరామ భక్తులారా! ఇది సీతాకళ్యాణ సత్కథ. నలభైరోజులనుంచీ చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకు వస్తున్నాను. అంచేత కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తున్నది. నాయనా కాస్త పాలు మిరియాలు ఏమైనా...

చిత్తం! సిద్ధం!

భక్తులారా! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాలనుంచీ విచ్చేసిన వీరాధివీరులలో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్య సుందరమూర్తి,ఆహా! అతడెవరయ్యా అంటే -

రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు
వాడు నెలరేడు సరిజోడు మనగాడు
వాని కనులు మగమీలనేలురా వాని నగవు రతనాల జాలురా
వాని కనులు మగమీలనేలురా వాని నగవు రతనాల జాలురా
వాని జూచి మగవారలైన మైమరచి మరుల్కొనెడు మరోమరుడు మనోహరుడు రఘురాముడు


సనిదని సగరిగరిరిగ రిసగ రిరిగ రిసగ గరిసనిద రిస గగరి సని దని రిస నిద రిస నిద నిదపమ గరి రఘురాముడు

సనిస సనిససగరిరిగ రిసనిసనిస పదనిస సనిగరిసనిస సనిరిసనిదని నిదసనిదపమ గమద
ని ని ని ని ని ని ని ని ప స ప స ప స ప స  స ప స ప స ప త ధీం తరికిటతక రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు


సెహభాష్ శభాష్.

ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షమునుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో,

ఎంత సొగసుగాడే ఎంత సొగసుగాడే మనసింతలోనే దోచినాడే
మోము కలువరేడే మోము కలువరేడే నా నోము ఫలము వీడే
శ్యామలాభిరాముని జూడగ నా మది వివశమాయె నేడే ఎంత సొగసుగాడే

ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయై ఉండగా,
అక్కడ స్వయంవర సభామంటపంలో జనక మహీపతి సభాసదులను జూచి:

అనియెనిట్లు ఓ యనఘులార నా యనుగు పుత్రి సీత
వినయాబ్ధిక సద్గుణ వ్రాత ముఖ విజిత లలిత జలజాత
ముక్కంటి వింటి నెక్కిడ జాచిన ఎక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి మల్లెల మాల వైచి పెండ్లాడు

అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా - "హా! ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము. దీనిని స్పృశించుటయే మహాపాపము" అని అనుకొనిన వాడై వెనుదిరిగిపోయాడట.

తదనంతరంబున,

ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొక్కారు మెరుపు వలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి
సదమల మదగజ గమనముతోన స్వయంవర వేదిక నెంచ
మదన విరోధి శరాసనమును తన కరమున బూనిన యంత

ఫెళ్లు మనె విల్లు గంటలు ఘల్లు మనె
గుభిల్లు మనె గుండె నృపులకు ఝల్లుమనియె జానకీ దేహము

ఒక నిమేషమ్మునందె నయము జయమును భయము విస్మయము కదురా

శ్రీమద్రమారమణ గోవిందో హరి

భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుంది, మరొక్కసారి జై శ్రీమద్రమారమణ గోవిందో హరి

భక్తులరా ఆ విధముగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము గావించినాడు. అంతట,

భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే
పృథుగుణమణి భాగ్యోపేతన్ సీతన్
భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే

శ్రీమద్రమారమణ గోవిందో హరి

సాహితీ సౌరభం:

ఈ హరికథా గీతంలో శ్రీశ్రీ గారు గణపతి స్తుతి, శ్రీరాముని రూపవర్ణన, సీతాదేవి మనోభీష్టం, జనకమహారాజు మనోగతం, శివధనుర్భంగం, సీతారామ కళ్యాణం ఘట్టాలను వచన పద్య రూపాలలో అందించారు. హరికథలో కథకుడు భక్తులతో నిరంతరం అనుసంధానమై ఉండటం చాలా ముఖ్యం. అందుకే కాస్త హాస్యం కూడ కథకులు జోడిస్తారు, మధ్య మధ్యలో నామస్మరణ చేయిస్తారు. ఇది ఆంధ్ర ప్రాంతంలోని హరికథలలోనే కాదు, యావద్భారతావనిలో జరిగే హరికథా కార్యక్రమాలలో తప్పనిసరిగా ఉండే అంశం. శ్రీశ్రీ గారు అందుకే శ్రీమద్రమారమణ గోవిందో హరి అని అక్కడక్కడ జోడించారు.

ఇక ముఖ్యమైన ఘట్టలకు వస్తే, శ్రీరాముని వర్ణనలో తెలుగు పదాలను అసమానమైన రీతిలో గుప్పించారు. ఆ రాముని అందాన్ని వర్ణించటంలో అంతే అందమైన పదాలను ఉపయోగించారు. రమణీయ వినీల ఘన శ్యాముని ఆవిష్కరణలో చంద్రునితో పోల్చటం, ఆయన కనులను చేపలుగా, ఆయన నవ్వితే రత్నాలు జాలువారినట్లు, ఆ రాముని చూసి మగవారు సైతం మైమరచి మోహించేలా ఉన్న ఇంకో మన్మథుడా అన్నట్లు మనసులను దోచుకున్నాడట.ఈ చరణంలో అద్భుతమైన సంగీత ప్రతిభను పెండ్యాల వారు ప్రదర్శించారు. మంచి స్వరాలతో హుషారుగా సాగించేలా చేశారు. దానికి తగిన నటనతో రేలంగి గారు, గాత్రంతో ఘంటసాల గారు రక్తి కట్టించారు.

ఇక రెండవ ఘట్టం - సీతాదేవి రాముని చూడటం. సీతమ్మ అంతఃపురం కిటికీలోనుండి రాముని చూసి తన మనుసును అతనికి అర్పించి ఆతని ముఖము కలువల రాజైన చంద్రునిగా, తన నోము ఫలముగా భావించింది. ఆ శ్యామసుందరుని జూసి ఆమె మనసు వివశమైంది. శ్రీశ్రీ గారి పాండితీ ప్రతిభ ఈ ఘట్టంలో కూడా ప్రస్ఫుటంగా కనబడుతుంది.

తరువాతి ఘట్టం జనకమహారాజు సీతాస్వయంవరం కోసం తీర్చిన కొలువులో. జనకుని మనసులో ఉన్న సందేహము, ఆతృత ఆయన మాటలలో ఎలా ఉండాలో పరిపూర్ణంగా చెప్పారు శ్రీశ్రీ గారు. "ఓ పుణ్యాత్ములారా! నా ప్రియ పుత్రిక సీత వినయలక్షణ సంపన్నమైనది, సద్గుణములు కలిగినది, అన్ని విద్యలు నేర్చినది, శ్రీమహాలక్ష్మి. ఆమె విధంగా అంది - ఈ శివధనుస్సును ఎక్కుపెట్టిన వీరుని నేను ప్రేమతో వరించి మల్లెల మాల వేసి పెండ్లాడెదను"

తరువాత ఘట్టం రాముడు శివధనుర్భంగము చేయటం. శ్రీశ్రీ గారు ఇక్కడ మంచి పద్యాన్ని అందించారు. సూర్యవంశ తిలకుడు అయిన రాముడు తొలకరిలో వచ్చే మెరుపులాగా నిలబడి, గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదం పొంది మిక్కిలి నిర్మలమైన మదపుటేనుగు లాగా నడుస్తూ స్వయంవర వేదికకు చేరుకున్నాడు. మదనుని శత్రువైన శివుని ధనుస్సును ఎత్తి ఎక్కుపెట్టపోగా అది ఫెళ్లు మని విరిగింది. అక్కడ ఉన్న రాజులకు గుండె గుభిల్లుమంది. సీతమ్మకు ఒళ్లు ఝల్లుమంది. సభలో ఒకే సమయములో సిగ్గు, విజయ హాసం, భయము, ఆశ్చర్యము అనే భావనలు అక్కడి వారిలో కలిగాయిట. సీతమ్మకు సిగ్గు, రామయ్యకు విజయ భావన, మిగిలిన రాజులకు భయము, కొందరికి ఆశ్చర్యము...శ్రీశ్రీ గారు చేసిన పదప్రయోగం అపూర్వం.

ఇక తరువాత సీతారాముల కళ్యాణము..మంగళము..

శ్రీశ్రీ గారు చేసిన ఈ అనుపమానమైన, అరుదైన రచన తెలుగు సినీరంగానికే వన్నె తెచ్చింది. తరువాత 2-3 హరికథా ప్రయత్నాలు చలన చిత్రాలలో జరిగాయి. కే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వాతిముత్యం చిత్రంలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సీతారామ కళ్యాణం బాగా పండింది. సూత్రధారులు చిత్రంలో సుశీలమ్మ పాడిన రుక్మిణీ కళ్యాణం పరవాలేదు అనిపించింది. ఈ సీతాకళ్యాణ హరికథను కానడ, శంకరాభరణం, తోడి, కేదారగౌళ, శ్రీ, కళ్యాణి రాగాలలో రాగమాలికగా అందించారు పెండ్యాల వారు. సంగీత, సాహిత్య, నటనా సుగంధాలతో ఈ గీతం ఇప్పటికీ మనలను అలరిస్తూనే ఉంది. 

పులకించని మది పులకించు - మనసుకవి ఆత్రేయ భావసంపద


మానవ జీవితంలో సంగీతానికి, అందులో పాటకు ఎంతో గొప్ప స్థానం ఉంది. శిశువులు, పశువులు, పాములు సంగీతానికి స్పందిస్తాయి. మనసులోని ఎటువంటి భావాలైనా వ్యక్తపరచటానికి అత్యద్భుతమైన సాధనం గానం. గానానికి ఉన్న ఈ మహత్తును మనసుకవి ఆత్రేయ కన్నా ఎవరు గొప్పగా రాయగలరు? ప్రేమ చిగురించిన ఓ వనిత ఆ ప్రియుని కోసం పాడే జోలపాటగా ఈ గీతాన్ని ఆవిష్కరించారు. 1960 సంవత్సరంలో విడుదలైన పెళ్లికానుక చిత్రంలో జిక్కి గారు అద్భుతంగా పాడిన గీతం పులకించని మది పులకించు. కృష్ణకుమారిపై చిత్రీకరించబడిన ఈ గీతం పాట యొక్క విశిష్టను పరిపూర్ణంగా ఆవిష్కరించింది. ఆత్రేయగారి పద సౌందర్యం, భావసంపద అనుపమానం. ఆత్రేయ గారి మనోకమలాన్ని పరిశీలిద్దాం:

పులకించని మది పులకించు
వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల యెంచు 
మనసునే మరపించు గానం మనసునే మరపించు                           

రాగమందనురాగమొలికి రక్తి నొసగును గానం
రేపు రేపను తీపికలలకు రూపమిచ్చును గానం
చెదరిపోయే భావములను చేర్చి కూర్చును గానం
జీవమొసగును గానం మది చింత బాపును గానం   
                                      
వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును
కూలిపోయిన తీగలైనా కొమ్మలలమి ప్రాకును
కన్నెమనసు ఎన్నుకొన్న తోడు దొరికిన మురియు
దోరవలపే కురియు  మది దోచుకొమ్మని తెలుపు  
                             
మనసునే మరపించు ప్రేమ మనసునే మరపించు

ప్రేయసీ ప్రియుల ప్రేమలో పవిత్రతకు నాంది వారి విలువలు. ఆ విలువలకు మూలం సంస్కారం. మంచి సంస్కారం ఒక యువతి మనసులో ప్రేమను ఎంత అందంగా చిగురింపజేస్తుందో గమనించండి. ప్రేమ భావన కలిగిన మనసు పాటగా పులకిస్తుంది. ఇది వరకు ఎన్నడూ వినిపించని కథను వినిపిస్తుంది. అంతకు మునుపు అనిపించని ఆశలను లెక్కిస్తుంది. అదీ ఆ గానం యొక్క గొప్పతనం. రాగంలో అనురాగాన్ని ఒలికిస్తూ రక్తిని కలిగిస్తుంది. ప్రేమ వలన రేపటి కోసం ఎదురుచూసే తీయని భావనకు రూపమిస్తుంది. ప్రేమ చిగురించిన తరుణంలో చెదరిపోతున్న భావాలను చేర్చి కూర్చి జీవాన్ని ఇస్తుంది. చింతను తొలగిస్తుంది. ఇది ఆత్రేయగారి కవితాశైలికి చిహ్నం.

కవి తన అద్భుతమైన భావ ఝరిని రెండో చరణంలో మరింత అందంగా ఆవిష్కరించారు. వాడిపోయిన పైరులు కూడా నీరు దొరకగానే నర్తిస్తాయిట. కూలిపైన తీగలు కూడా కొమ్మల సాయంతో వాటికి చుట్టుకొని పాకుతాయిట. కన్య తన మనసు ఎన్నుకొన్న తోడు దొరికితే మురుస్తుంది. లేత వలపులు కురిపిస్తుంది, ఆ వలపులు దోచుకోమని సంకేతాలు చేస్తుంది. ఇవన్నీ ప్రేమ వల్ల కలిగినవే. ఆ ప్రేమ మనసునే మరపిస్తుంది.

రెండవ చరణంలో ఆత్రేయగారు ప్రేమ, మనసు, ఆశలు చిగురించటం, వాటిని ప్రకృతిలో వచ్చే మార్పులతో పోల్చటం ఎంత హృద్యంగా మన ముందుంచారో గమనించండి. స్త్రీపురుషులు మధ్య చిగురించే ప్రేమకు ప్రకృతిలో వచ్చే మార్పులే సామ్యాలు. ఆ మార్పులకు మనస్సు పలికితే? అదే ఇటువంటి మనోజ్ఞమైన గీతం. అందుకే ఆత్రేయ గారు మనసుకవిగా చిరస్మరణీయులు.

ఇక గీతానికి ప్రాణవాయువులు సంగీతం, గానం. ఏఎంరాజా గారు మంచి గాయకులు అని మనకు తెలుసు. ఆయన సంగీత దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రాన్ని తొలుత తమిళంలో కల్యాణ పరిసు అని తీసారు. దానికి కూడా రాజా గారే సంగీతం, ఈ పాట తుళ్లాదు మనముల్ తుళ్లుం సొల్లాద కదింగల్ సొల్లుం అని పట్టుకొట్టై కళ్యాణసుందరం గారు రచించగా జిక్కి గారే పాడారు. తరువాత తెలుగులో తీసారు. తమిళంలో జెమినీ గణేశన్, సీఆర్ విజయకుమారి గార్ల మీద చిత్రీకరించగా, తెలుగులో ఏఎన్నార్, కృష్ణకుమారి గార్ల మీద తీశారు. రెండు చిత్రాలు, వాటిలోని పాటలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. జిక్కి గారి జీవితంలో ఈ పాట కలికితురాయిగా నిలిచింది. 

మాతృదేవోభవ పితృదేవోభవ!

మాతృదేవోభవ పితృదేవోభవ!


ఏడుపే మాటలైన సమయంలో తన శక్తిని పాలుగా ఇచ్చేది అమ్మ
తడబడే అడుగులు వేసేటప్పుడు చేయి పట్టి నడిపించే వాడు నాన్న

ప్రతిరోజూ లెక్కతప్పకుండా బడికి బాక్సులు తయారు చేసేది అమ్మ
బడికి టైం అయిపోతుంటే షూస్ పాలిష్ చేసి తొడిగించేవాడు నాన్న

చిందరవందరగా ఉన్న పుస్తకాలు బ్యాగులో నీటుగా సర్దేది అమ్మ
పెన్సిళ్లు ముక్కులు విరిగిపోతే చెక్కి బాక్సులో పెట్టేవాడు నాన్న

ఇంటికి రాగానే నీ ఆకలి తీర్చి నీ మురికిని వదిలించేది అమ్మ
బద్ధకాన్ని వదిలించి క్రమశిక్షణతో ముందుకు నడిపేవాడు నాన్న

విలువకట్టలేని విలువలను నిరంతరం అందించే దైవం అమ్మ
అపజయాలలో నిన్ను ప్రోత్సహించి ఉత్సాహపరచే వాడు నాన్న

అలుపు లేకుండా ఏళ్ల తరబడి ఉచిత సేవ చేసిన వాళ్లకు నువ్వు చేసేది ఉపకారమా?
నిస్స్వార్థంతో నీకోసం జీవించి అలసి ఒడలిన వారికి నువ్వు ఇవ్వగలిగేది ఒంటరితనమా? 

ఈనాటి నీ స్వార్థం రేపటి నీ దుఃఖం 
ఈనాటి నీ ధర్మం రేపటి నీ సాంత్వన

ఈనాటి నీ ఓర్పు రేపటి నీ రక్షణ
ఈనాటి నీ త్యాగం రేపటి నీ సంపద

మాతృదేవోభవ పితృదేవోభవ!

3, ఫిబ్రవరి 2016, బుధవారం

పనీర్ టిక్కా

పనీర్ టిక్కా 






స్టార్టర్స్ లేదా స్నాక్స్‌గా పనీర్ టిక్కా బాగుంటుంది. దీనికి గ్రిల్ అవసరం లేదు. పెనం మీద లేదా నాన్ స్టిక్ ప్యాన్ మీద చేసుకోవచ్చు.పనీర్‌తో పాటు క్యాప్సికం, ఉల్లిపాయ, పైన్ ఆపిల్, కార్న్ (మొక్క జొన్న కంకి), కాలీ ఫ్లవర్, టమాటో, బంగాళా దుంప ఇలా ఎన్నో కూరలను ఇందులో వాడుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:

పనీర్ 1-1/2 అంగుళాల వెడల్పున్న పెద్ద ముక్కలు
క్యాప్సికం 1-1/2 అంగుళాల వెడల్పున్న పెద్ద ముక్కలు
చెక్కు తీసిన పైన్ యాపిల్ 1-1/2 అంగుళాల వెడల్పున్న ముక్కలు
తగినంత పెరుగు
తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్
ఎండు కారం
ఉప్పు
కొత్తిమీర (తరిగి గ్రైండ్ చేసినది)
కస్తూరి మెంతి (మెంతి ఆకులను ఎండబెడితే వచ్చేది)
గరం మసాలా
చాట్ మసాలా
నూనె
టూత్‌పిక్స్

తయారు చేసే పద్ధతి:





ముందుగా పెరుగులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఎండు కారం, కొత్తిమీర పేస్ట్, గరం మసాలా, చాట్ మసాలా, కస్తూరి మెంతి, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. ఉప్పు కారం మసాలాలు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఈ పెరుగు మిశ్రమంలో పనీర్, క్యాప్సికం, పైన్ ఆపిల్ ముక్కలు వేసి ఒక సారి కలియతిప్పి అరగంటసేపు అలా ఉంచాలి. అప్పుడు ఆ డ్రెస్సింగ్‌లోని రుచులు ముక్కలకు పడతాయి. అరగంట తరువాత టూత్‌పిక్ తీసుకొని ఒక పనీర్ ముక్క, ఒక క్యాప్సికం ముక్క, ఒక పైన్ ఆపిల్ ముక్క దాని గుచ్చాలి. ఇలా మిగిలిన ముక్కలను వేర్వేరు టూత్‌పిక్స్‌లకు గుచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం/నాన్ స్టిక్ ప్యాన్ మీద నూనె వేసి అది వేడి అయిన తరువాత ఈ ముక్కలున్న టూత్‌పిక్స్‌లను అందులో ఉంచాలి. ముక్కలు మాడ కుండా గమనిస్తూ రంగు మారుతున్నప్పుడు మరో పక్క తిప్పాలి. అన్నివైపులా రంగు మారిన తరువాత వాటిని తీసి ప్లేట్లో ఉంచుకోవాలి. వీటిని ఏ చట్నీ లేకుండా తినవచ్చు. కావలసిన వాళ్లు కాస్త పెరుగు, సన్నగా కోసిన పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి చట్నీ చేసుకొని దానితో తినవచ్చు. టిక్కాలను వేడి వేడిగానే తినాలి. చల్లారితే బాగుండవు.