15, ఆగస్టు 2020, శనివారం

వేదాలు అనంతం - కంచి పరమాచార్యుల వారు


వేదాలు అనంతమనటానికి ఒక కథ ఉంది. భరద్వాజ మహర్షి మూడు జన్మలలో వేదాలను అధ్యయయనం చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు ఇంకొక జన్మనిస్తాను. ఆ జన్మతో చేస్తావు అని అడిగితే, భరద్వాజుడు "అదనంగా లభించే ఆ జన్మ కూడా వేదాధ్యయనానికే వినియోగిస్తాను" అన్నాడు. అన్ని వేదాలనూ ఎన్ని జన్మలెత్తినా పూర్తిగా అధ్యయనం చేయటం అసంభవమని, ఋషి పట్ల జాలితో అతను ఎదురుకుంటున్న సమస్య ఎంత జటిలమైనదో తెలియజేయటానికై పరమేశ్వరుడు మూడు పెద్ద పర్వతాలను సృష్టించి వాటి నుండి గుప్పెడు మట్టి తీసుకుని "నీవిప్పటివరకు అధ్యయనం చేసినదంతా ఈ పిడికెడు మట్టితో సమానం. నీవింకా అధ్యయనం చేయవలసింది ఈ పర్వతాల మేర ఉన్నది" అన్నాడుట. భరద్వాజునికి సంబంధించిన ఈ గాథ కాఠక భాగములో ఉంది. ఇటువంటి గాథల వల్ల వేదాలు అనంతమని విశదమవుతుంది.

మంత్రాలు భరద్వాజుని వంటి ఎందరో తపస్సంపన్నులైన ఋషులకు అభివ్యక్తమైనవే. అందువల్ల ఆయా మంత్రాలు ఆయా ఋషులకు చెందినవైనాయి. ఆ మంత్రాలను ఆలకించటానికి వారికి దివ్యమైన చెవులున్నాయి. యోగశాస్త్రం ప్రకారం మనస్సులోని మౌనం విశ్వాంతరాళంతో అనుసంధానం చేస్తే అంతరిక్షంలో తేలుతున్న శబ్దాలన్నీ వినబడతాయి. విశ్వమంతటితో తాదాత్య్మం చెందగలిగిన వారికే ఇది సాధ్యం. అందువల్లే, ఋషులు లోక శ్రేయస్సుకై ఆ మంత్రాలను బయట పెట్టరే తప్ప వాటిని వారు సృష్టించలేదు. ఈ మహోపకారాన్ని చేసి మానవాళికి అజ్ఞాతంగా సంస్థితమైన వాటిని తెలియజేశారు. గంగను రప్పించిన వానికి మనం ప్రణమిల్లుతాం. కానీ, గంగను అతను సృష్టించలేదు కదా! దివి నుండి భువికి తీసుకు వచ్చాడు అంతే. అయినా ఎంతో తపోశక్తిని ధారపోసి లోకకల్యాణార్థం ఎంతో దూరం నుండి తీసుకు వచ్చాడని కృతజ్ఞత తెలుపుకుంటాం. మనకు అందుబాటులో లేని మంత్రాలను మనకు అనుగ్రహించిన ఋషులను ఎంతగా కొనియాడాలి? అందుకే సంధ్యావందనం, అనుష్ఠానం మొదలైనవి. అవి నిత్యం చేస్తేనే మనం ఋషి ఋణం తీర్చుకొనగలిగేది. తద్వారా రోజులో మూడుసార్లు మన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనలను పునరుత్తేజితం చేసుకోవటానికి సుస్పష్టమైన విధివిధానం నిర్ణయించబడింది. అందులో అంతర్భాగమే ఈ ఉపాకర్మ కూడా. వైదిక కర్మలు పూర్తిగా స్వీయోద్ధరణ ద్వారా లోకకల్యాణార్థమనే అద్భుతమైన లక్ష్యం కొరకు నిర్దేశించబడినవి. ఎంత శ్రద్ధాసక్తులతో ఆచరిస్తే అంత ఫలితం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి