30, ఆగస్టు 2020, ఆదివారం

సౌందరరాజమాశ్రయే - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


సంగీతత్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారి క్షేత్ర కృతులలో సౌందరరాజమాశ్రయే అని బృందావన సారంగ రాగంలో కూర్చబడిన కృతి ఒకటి. ఇది తమిళనాడులోని నాగపట్టణంలో సౌందరవల్లీ సమేతుడై వెలసిన సౌందరరాజస్వామిపై రచించినది. ఈ క్షేత్రం వైష్ణవ సాంప్రదాయంలోని 108 దివ్యదేశములలో ఒకటి. 8వ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఈ దేవాలయాన్ని పల్లవులు, తంజావూరు నాయకులు పోషించి మరల మరల పునరుద్ధరించారు. 90 అడుగుల రాజగోపురంతో, అద్భుతమైన శిల్పసంపద కలిగిన దేవస్థానం ఇది. ఇక్కడ వైఖానస సాంప్రదాయంలో లక్ష్మీనారాయణుల రూపంగా మూలవిరాట్టులను పూజిస్తారు. ఈ దేవస్థానం ప్రత్యేకత ఇక్కడ ప్రహ్లాదవరదుడైన నారసింహుడు అష్టభుజములతో అభయముద్రలో వెలసి ఉండటం. తంజావూరు నాయకులు ఈ దేవస్థానంలో అద్భుతమైన మంటపాలు నిర్మించారు.

సౌందరరాజమాశ్రయే గజ బృందావన సారంగ వరదరాజం

నంద నందన రాజం నాగపట్టణ రాజం
సుందరి రమా రాజం సురవినుత మహి రాజం
మందస్మిత ముఖాంబుజం మందరధర కరాంబుజం
నందకర నయనాంబుజం సుందరతర పదాంబుజం

శంబర వైరి జనకం సన్నుత శుక శౌనకం
అంబరీషాది వినుతం అనాది గురుగుహ ముదితం
అంబుజాసనాది నుతం అమరేశాది సన్నుతం
అంబుధి గర్వ నిగ్రహమనృత జడ దుఖాపహం
కంబు విడంబమాన కంఠం ఖండీకృత దశకంఠం
తుంబురు నుత శ్రీకంఠం దురితాపహ వైకుంఠం

గజారణ్యములో గజేంద్రుని రక్షించిన సౌందరరాజస్వామి నేను ఆశ్రయించియున్నాను. నందుని కుమారుడు, నాగపట్టణంలో వెలసిన ప్రభువు, సౌందర్యవతి అయిన లక్ష్మీదేవికి నాథుడు, దేవతలచే పొగడబడిన భూనాథుడు, చక్కని చిరునవ్వుతో పద్మము వంటి ముఖము కలవాడు, తన కరపద్మములతో మందరపర్వతాన్ని ఎత్తిన వాడు, కలువలవంటి కన్నులతో ఆనందం కలిగించేవాడు, సుందరమైన కలువల వంటి పాదములు కలవాడు అయిన సౌందరరాజస్వామి నేను ఆశ్రయిస్తున్నాను. శంబరుని వైరి అయిన మన్మంథునికి జనకుడు, శుకశౌనకాదులు, అంబరీషునిచే నుతించబడినవాడు, పుట్టుకలేని వాడు, కుమారస్వామికి ఆనందం కలిగించినవాడు,బ్రహ్మ, ఇంద్రాది దేవతలచే నుతించబడినవాడు, రామావతారంలో సముద్రుని గర్వాన్ని అణచినవాడు, అసత్యాన్ని, జడత్వాన్ని ఛేదించి దుఃఖాలను తొలగించేవాడు, శంఖమును మించిన సొగసున్న కంఠము కలవాడు, దశకంఠుని సంహరించినవాడు, తుంబురుడు నుతించిన శుభకరమైన కంఠము కలవాడు, పాపములను నాశనము చేసే వైకుంఠ స్వరూపుడైన సౌందరరాజస్వామిని నేను ఆశ్రయిస్తున్నాను.

కృతి విశేషాలు:

అద్భుతమైన యతిప్రాసలతో, పరిపూర్ణమైన భక్తి భావంతో అనుపమ సుందరరూపమైన సుందరరాజస్వామిని వర్ణించే కృతి ఇది. పల్లవిలో ద్వితీయాక్షర ఆది ప్రాసతో ఈ కృతి మొదలవుతుంది. రంగపుర విహార అని శ్రీరాముని వర్ణించిన దీక్షితుల వారు అదే రీతిలో, అదే రాగంలో ఈ కృతిని రచించారు. ఈ కృతి వింటుంటే అడుగడుగునా రంగపుర విహార సాహిత్యంతో సారూప్యం అవగతమవుతుంది. అద్భుతమైన ఉత్ప్రేక్షాలంకరములు, ద్వితీయాక్షర ప్రాసలు, రాజం, అంబుజం, కంఠం అన్న పదాలతో అంత్యప్రాసలు ఈ కృతికి ప్రత్యేక ఆకర్షణ. అటువంటి పదప్రయోగం వలన ఈ కృతి కర్ణోపేయమై ప్రకాశిస్తుంది. ప్రముఖ సంగీత శాస్త్రజ్ఞురాలు డాక్టర్ టీఎస్ సత్యవతి గారు కృతిని అద్భుతంగా వివరించారు. వీడీయో చూసి ఆనందించండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి