15, ఆగస్టు 2020, శనివారం

సగుణారాధన - శ్రీరామ శరణ్ శ్రీ కుందుర్తి వేంకట నరసయ్య గారు


 పంచభూతాలకు పరమాత్మకు సంబంధమేమిటి?

ఆకారము లేని భగవంతుడు ప్రకృతి అనే రూపము దాల్చి మనకు కనిపిస్తున్నాడు. ప్రకృతిన్యాం అధిష్ఠాయ సంభవమ్యాత్మ మాయయా - నా యొక్క మాయ చేత ప్రకృతిని ఆశ్రయించి రూపం దాలుస్తానని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తెలిపాడు. పంచభూతాలే ప్రకృతిలోని మూలద్రవ్యాలు. ఇవి కాక మనస్సు, బుద్ధి, అహంకారము అనే మూడున్నాయి. ఎనిమిదింటితో కూడిన ఆలోచనలే మన సనాతన ధర్మానికి మూలస్థంభాలు. మానవుడు ఈ అష్ట ప్రకృతులను కలిగియున్నాడని ఆ కృష్ణ పరమాత్మే గీతలో చెప్పాడు.

దేవుళ్లు ఎలా ఏర్పడ్డారు?

పరమాత్మ పంచభూతముల ద్వారా సృష్టిని జరిపించాడు. ఆకారము, రూపము లేని పరమాత్మ పంచభూతములనే దుస్తులను ధరించి మనకు సాక్షాత్కరిస్తున్నాడు. ఒక్కొక్క ఆకారంలో ఒక్కొక్క పేరుతో పిలువబడ్డాడు

ఏ పేర్లు ఎలా వచ్చాయి?

ఆకాశస్యాధిపో విష్ణుః అగ్నేశ్చైవ మహేశ్వరి వాయూ సూర్యః క్షితిరేశః జీవనస్య గణాధిపః - అనగా ఆకాశం విష్ణువు, అగ్నియే శక్తి, వాయువు సూర్యుడు, పృథ్వి ఈశ్వరుడు, జలం గణపతి. ఇలా ఐదు పేర్లతో ఉపాసించబడుతున్నారు. ఆకాశం అనగా సర్వవ్యాపకమైనది, నీలవర్ణము కలది, విష్ణువు కూడా అంతటా ఉన్నవాడు, నీలవర్ణుడు, ఆకాశ లక్షణం శబ్దం, అలాగే విష్ణువు కూడా సంకీర్తనల ద్వారా శబ్దం ద్వారా ఉపాసించబడుతున్నాడు. అలాగే అగ్ని ఎరుపు రంగు కలది. అగ్ని అంశతో శక్తి ఏర్పడినది. శక్తిని ఉపాసించువారు కుంకుమ, ఎర్రని పూలు, ఎర్రని వస్త్రములతో పూజితారు, ఎర్రని పండ్లు, పులిహోర నైవేద్యం పెడతారు. వాయువు అంశగల దేవత సూర్యుడు, ఇతడు బంగారు వర్ణం కలవాడు, సూర్యునిలో వాయువులున్నట్లు అందరూ ఎరిగినదే. పృథ్వి అంశ గలవాడు శివుడు, ధవళ వర్ణుడు, పృథ్వి నుండి వచ్చిన జలముతో శివునికి అభిషేకం చేస్తారు, పూలతో, దళములతో పూజిస్తారు. జలము యొక్క అంశతో గణపతి ఏర్పడ్డాడు. అందుకే పూజ అనంతరం గణపతిని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క దేవత పైవిధంగా ఏర్పడ్డారు.

మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులెవరు?

మనిషి యొక్క ప్రకృతులలో పంచభూతములు గాక మనస్సు, బుద్ధి, అహంకారము అన్నవి ఉన్నాయి కదా. మనస్సు బ్రహ్మకు, బుద్ధి విష్ణువునకు, అహంకారము రుద్రునకు ప్రతీకలుగా ఉన్నాయి. అవే సృష్టి, స్థితి, లయములను జరుపుతున్నాయి.

మీరు చెప్పిన ఐదుగురు దేవతలను భారతదేశములోని వివిధ ప్రాంతాలలో ఆరాధిస్తున్నారు కదా? ఈ ఐదింటి యొక్క సమైక్య రూపాన్ని ఆరాధించే ప్రక్రియ ఏదైనా ఉందా?

ఉన్నది. పంచభూతముల సమైక్య రూపముగా గాయత్రిని ఉపాసిస్తారు. పంచముఖీ గాయత్రీ ధ్యాన శ్లోకం ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః అనే శ్లోకంలో ఈ విషయాన్ని గ్రహించవచ్చు.

"సగుణారాధన" - శ్రీరామ భక్తాగ్రేసరులు శ్రీరామ శరణ్ శ్రీ కుందుర్తి వేంకట నరసయ్య గారితో జరిగిన గోష్టి నుండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి