29, డిసెంబర్ 2015, మంగళవారం

కైలాసగిరి నుండి కాశికై - దేవులపల్లి వారి శివ భక్తి గీతం


కైలాసగిరి నుండి కాశికై
కాశికాపురి నుండి దాసికై
దాసికై ఈ దక్షవాటికై దయచేసినావయా 
హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర

విరిసె జాబిలి మల్లెరేఖగా కురిసె తేనియల మువ్వాకగా
దరిసి నీ దయ నిండు గోదావరీ నది ఝరులాయెరా 
హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర

ముక్కోటి దేవతల నేతరా ముల్లోకముల కిష్టదాతరా
వెలిబూది పూతరా నలవిసపు మేతరా 
హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మరో శివ భక్తి గీతం ఇది. ద్రాక్షారామంలోని భీమేశ్వరుడిపై రాసినట్లుగా చెబుతారు.ద్రాక్షారామ క్షేత్రం దక్షవాటిక అని పురాణాలలో చెప్పబడింది. పంచారమాలలో ప్రముఖమైనది ద్రాక్షారామం. వేల ఏళ్ల క్రితం నిర్మించబడిన ఈ క్షేత్రం దక్ష వాటిక అని నమ్మకం. భీమేశ్వరుడు మాణిక్యాంబతో కూడి వెలసిన క్షేత్రం ఇది. కాకినాడకు సమీపంలో ఉంటుంది ఈ క్షేత్రం. దేవులపల్లివారి స్వస్థలమక్కడి దగ్గరలోని పిఠాపురం.

దేవులపల్లివారి సాహిత్యంలో లాలిత్యంతో పాటు తెలుగుదనం నిండి విలక్షణంగా ఉంటుంది. తెలియని వారు ఆయన రాసిన గీతలాను వినగానే ఇది దేవులపల్లివారిదా అని అడుగుతారు. దానికి కారణం ఆయన గీతంలో కనబరచే భక్తితో పాటు ప్రత్యేకమైన పదప్రయోగం. దేవులపల్లి వారి శివ రచనలలో తప్పకుండా శివుని శిరసున ఉన్న చంద్రుని, ఒంటిన విభూతి, కంఠంలో గరళము మొదలైన భౌతిక లక్షణాలలో ఒక్కటైనా తప్పకుండా ప్రస్తావన చేస్తారు. శివుడు దయాసముద్రుడు. ప్రార్థన చేసినంతనే కరగిపోయే భక్తవశంకరుడు.

గౌతమముని ప్రార్థనతో శిరసునున్న గంగమ్మను గోదావరిగా శివుడు భువిపైకి పంపాడని శివపురాణం చెబుతుంది. ఆ పరమశివుని దయారూపమైన గోదావరి నది పరవళ్లను పాపికొండల వద్ద చూడవచ్చు. అందుకే గోదావరి నది ఒడ్డున, సమీపాన అనేక శైవ క్షేత్రాలు వెలిసాయి. కృష్ణశాస్త్రి గారి ఇతర భక్తి గీతాలలో లాగనే ఇందులో కూడా తెలుగుదనం ఉట్టిపడే పదప్రయోగం చేశారు.వెలిబూది, నలవిసం వంటి అరుదైన తెలుగు పదాలతో ఈ పాటకు ప్రాణం పోశారు దేవులపల్లి వారు. 1970వ దశకంతో ఆకాశవాణి హైదరాబాద్ మరియు విజయవాడ కేంద్రాల ద్వారా భక్తిరంజని కార్యక్రమంలో దేవులపల్లి వారి గీతాలు ప్రసారమయ్యేవి. అందులో ఈ కైలాసగిరి నుండి ఒకటి. పాలగుమ్మి విశ్వనాథం గారి సంగీతంలో వెలువడిన ఈ గీతం ఎంతో ప్రాచుర్యం పొందింది.

(పైన ఇచ్చిన లింకులో మూడవ నిమిషం వద్ద ఈ పాట మొదలవుతుంది)

24, డిసెంబర్ 2015, గురువారం

వేణు గానమ్ము వినిపించెనే - ఆచార్య ఆత్రేయ గీతం


వేణు గానమ్ము వినిపించెనే చిన్ని కృష్ణయ్య కనిపించడే

దోర వయసున్న కన్నియల హృదయాలను 
దోచుకున్నాడని విన్నాను చాడీలను
అంత మొనగాడటే వట్టి  కథలేనటే ఏది కనబడితే నిలవేసి అడగాలి వానినే

మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందటా
లేదు లేదనుచు లోకాలు చూపాడట
అంత మొనగాడటే వింత కథలేనటే ఏది కనబడితే కనులారా చూడాలి వానినే

దుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
ఘల్లు ఘల్ఘల్లన ఒళ్లు ఝల్ఝల్లన తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట

కృష్ణునిపై రాయబడిన ప్రతిపాటలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే, ఆయన చూపిన లీలలను ఆయా విధముగా అనుభూతి చెంది రాసిన విలక్షణమైన ఆవిష్కరణలు అవి. హే కృష్ణా ముకుందా మురారీ అని సముద్రాల రాఘవాచార్యులు వారి రాస్తే అందులో లీలలను భక్తితో వర్ణించారు. అలాగే హే కృష్ణా యదుభూషణా అని  కొసరాజు గారి రాస్తే అది ఒక బ్రాహ్మణునికి కృష్ణునిపై గల సర్వస్య శరణాగతితో కూడిన భక్తికి ప్రతీకగా నిలిచింది. ఎన్నాళ్లని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా అని శాంతకుమారి పాడిన ఆత్రేయ గారి గీతం శ్రీనివాసునికై ఎదురు చూసే వకుళమాత అనన్యమైన కృష్ణుని భక్తిని సూచిస్తుంది. అలాగే, తెలవార వచ్చే తెలియక నా సామి అని మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి రాసిన గీతం బాలకృష్ణుని నిద్దురలేపే తల్లి యశోదమ్మ ప్రేమకు ప్రతీకగా శాశ్వతమైంది. ఇలా ఎన్నో సినీ గీతాలు కృష్ణ భక్తి సామ్రాజ్యంలో ప్రకాశిస్తునే ఉన్నాయి. కృష్ణభక్తిలో సింహ భాగం రాధ-గోపికలదే. ఎందుకంటే వారందరూ నేను అన్న భావనను మరచి స్వామిని ఆరాధించి తరించిన వారు. వారు సామాన్యమైన స్త్రీపురుష సంబంధాలకు అతీతమైన వారు. పరమపురుషుని హృదయాన నిలుపుకొని రమించి ముక్తులైన వారు. అందుకే వారితో స్వామి రాసలీలాడినా,చీరలు దోచినా, వెన్న దొంగిలించి తిన్నా,అన్ని పవిత్రమైన లీలలగానే నిలిచాయి.

అటువంటి ముగ్గురు గోపికల మనసును ప్రతింబించేదే ఈ వేణుగానమ్ము వినిపించెనే అన్న గీతం. ముగ్గురు అక్కచెల్లెళ్ల మీద చిత్రీకరించిన ఈ గీతాన్ని సిరిసంపదలు అన్న చిత్రానికి ఆచార్య ఆత్రేయ గారు రచించారు. శ్రీకృష్ణుని లీలలను చిలిపిగా వర్ణించి ప్రశ్నించే ఈ గీతంలో సోదరీమణులుగా సావిత్రి, వాసంతి, గిరిజ నటించారు. అద్భుతమైన అభినయ కౌశలాన్ని ప్రదర్శించారు. సావిత్రి గారి సినీ జీవితంలో ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. నాయకునిగా ఏఎన్నార్, ప్రధాన నాయికగా సావిత్రి నాటి సామాజిక పరిస్థితులను, విద్యావంతుల ఆలోచనలకు అద్దం పట్టారు.

ఇక గీతానికి వస్తే, మధురమైన వేణుగానం కృష్ణ ప్రేమకు ప్రతిబింబం. ఆ గానం వినిపిస్తోంది కానీ కృష్ణుడు కనిపించటం లేదు అని గోపికలు ప్రశ్నించే సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు నాయికలు. కృష్ణుడి జీవితంలో లీలలు ఎనలేనన్ని అయినా, ఆత్రేయ గారు గోపికల మనసులు దోచుకోవటం, మన్ను తిన్న నోట విశ్వాన్ని తల్లికి చూపించటం, కాళీయ మర్దనం అనే మూడు ఘట్టాలను తీసుకున్నారు. వీటికి భాగవతంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. దేహము వలననే మనకు నేను అన్న భావనతో మాయలో చిక్కుకుంటాము. గోపికలు ఈ భావనను తొలగించటానికే వారి వస్త్రాలను దొంగిలించి తిరిగి యిచ్చాడు కృష్ణుడు. నా బిడ్డ అన్న మాయలో గారాబంగా పెంచుతున్న యశోదకు విశ్వాన్ని చూపించి మాయను తొలగించాడు. లోకరక్షణకై కాళీయుని పొగరణచటానికి అతని తలపై ఎక్కి నాట్యం చేశాడు.ఇవన్నీ అద్భుతమైన లీలలు. ఈ విధంగా కృష్ణుని లీలావినోదంలో గోపకులమంతా మాయనుండి దూరం చేసి తనతో అనుసంధానం చేశాడు. ఈ లీలలను ఆత్రేయ గారు అద్భుతమైన పదజాలంతో వర్ణించారు. చిలిపిగా కృష్ణుని లీలలను ప్రశ్నించే రీతిలో సాగుతుంది ఈ గీతం. ఇన్ని చేష్టలు నిజంగా చేశాడా లేక ఉట్టి కథలేనా అని నాయికలు ప్రశ్నిస్తున్నట్లుగా అనిపించినా వారి హృదయాలలో ఆరాధనా భావం ఉందని అభినయంలో కనబరచారు. ముఖ్యంగా సావిత్రిగారి నటన ఈ పాటల ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆవిడ మహానటి అని ఎందుకన్నారో ఈ పాటలో ఓ గోపిక భావంతో ఆమె నటించి తీరు చూస్తే అర్థమవుతుంది.


ఈ పాటలోని కొన్ని అచ్చతెలుగు పదాలను గమనించండి - దోర వయసు,చాడీలు,తారంగం, ఘల్లు ఘల్లు, ఝల్లు ఝల్లు. ఈ పదాలే పాటకు ఆయువు పట్టు. కృష్ణుని చేష్టలకు గోపికలు యశోదమ్మకు చేసిన ఫిర్యాదులు ఎన్నో, చెప్పుకున్న చాడీలు ఎన్నో. వాటన్నిటిలో కన్నె మనసుల హృదయాలను దోచుకోవటం గురించి చెప్పటం గోకులం యొక్క వైభవాన్ని చాటుతుంది. తారంగమనేది చేతులతో చేసే విన్యాసం. కాళింది మడుగులో విషం చిమ్ముతున్న కాళీయుని పడగలపై నాట్యం చేస్తూ చేతులు తిప్పే కృష్ణుని లీలను తారంగమంటారు. దీనిని చిన్నపిల్లలకు తల్లులు చేసి వారిని ఆడించే సాప్రదాయం దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా తెలుగుజాతిలో ఉంది. కృష్ణుడు వేసే పద విన్యాసానికి తెలుగు భాష ఇచ్చిన అందమైన జంట పదం ఘల్లు ఘల్లు. అలాగే ఆనందంలో ఒళ్లు పులకరించటానికి ఝల్లు-ఝల్లున అనే జంట పదం. భాషకు ఆయువు పట్టు భావంతో పాటు, శబ్దము. కృష్ణుని తారంగం ఘల్లు-ఘల్లున చేస్తున్నాడు అనగానే ఆ బాలకృష్ణుని రూపము, ఆయన వేసే వ్యత్యస్త పాదములు, కాళ్లకు గజ్జలు కళ్ల ముందు నిలుస్తాయి. ఆత్రేయగారు వీటిని ఉపయోగించి గీతాన్ని శాశ్వతం చేశారు. కృష్ణ భక్తిలో నేనుకు తావిలేదు. అందుకే కృష్ణప్రాప్తి కలిగిన వారికి వేరేమీ అక్కరలేదు. ఎన్ని ఉన్నా అన్నిటికీ దూరమే. ప్రభువొక్కడే కావలసింది.

ఈ గీతానికి ఇంకో విశేషమేమిటంటే ముగ్గురు మేటి గాయనీమణులు కలిసిన పాడిన గీతం ఇది. సావిత్రి గారికి సుశీలమ్మ, వాసంతి గారికి జానకమ్మ, గిరిజ గారికి జిక్కి కృష్ణవేణి గారు మాధుర్య భరితమైన, విలక్షణమైన గానాన్ని అందించారు. మాష్టరు వేణు గారు మధుర్య ప్రధానమైన సంగీతానికి మరోపేరు. ఆయన ఇచ్చిన సంగీతం, ముగ్గురమ్మల గాత్రం, ముగ్గురు నటీమణుల నటనా చాతుర్యం ఈ గీతానికి ప్రత్యేకతనిచ్చాయి. ఇన్నేళ్లైన, ఎన్నిమార్లు విన్నా ఈ పాట వింటే అబ్బ ఎంత బాగుంది అనిపిస్తుంది.

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. 

11, డిసెంబర్ 2015, శుక్రవారం

ఎందుకయా సాంబశివా - దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి శివభక్తి గీతం


ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ

ఈ అల్లరి చేతలు ఈ బూడిత పూతలు ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ సాంబశివా సాంబశివా సాంబశివా

అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి
నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగ పెట్టి
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ సాంబశివా సాంబశివా సాంబశివా

తోలు గట్టి పటకాగా కాలాగ్నిని కుట్టి
కేల త్రిశూలము పట్టి ఫాలమందు కీల పెట్టి
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ సాంబశివా సాంబశివా సాంబశివా

రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర
ఎందుకయా ఈ దాసునికందవయా దయామయా
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ సాంబశివా సాంబశివా సాంబశివా



లలితమైన భక్తి గీతాల ప్రపంచంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది అగ్రస్థానమని చెప్పుకోవాలి. ఎందుకంటే, తెలుగు భాషలో ఆయన ఉపయోగించిన పదాలు, కనబరచిన భావ సౌందర్యం ఎవ్వరికీ అందనంత స్థాయిలో ఉంటాయి. ఆయన భక్తి గీతాలలో కనుమరుగవుతున్న పదాలు చెక్కుచెదరకుండా ప్రకాశిస్తుంటాయి. పదములె చాలు రామా అని ఆయన రాస్తే అది రాముని పాదాలను తాకిన ఒక సువర్ణ పుష్పంలా సాఫల్యాన్ని పొందింది. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు అని రాస్తే అది ఆ శ్రీహరి మెడలోని తులసి మాలలా రాజిల్లింది. ఏమి రామకథ శబరి శబరి అని రాస్తే, రామకథా సుధ యొక్క మాధుర్యాన్ని ఇప్పటికీ మనకు అందిస్తూనే ఉంది. అలాగే, కొలువైతివా రంగశాయి అని రచించితే ఆ శ్రీరంగ శాయి వైభవాన్ని మన కళ్లముందుంచుతుంది.

అలాగే, శివునిపై ఆయన ఎన్నో భక్తి గీతాలు రచించారు. ఆయన భక్తి సాహిత్య సంపదంతా ఆకాశవాణి ద్వారా, తెలుగు చలనచిత్రాల ద్వారా మనకు అందాయి. ఆ శివభక్తి గీతాలలో ఒకటి ఎందుకయా సాంబశివా.

శివతత్త్వం గమనిస్తే మొదట నిజంగానే అల్లరి చేష్టల లాగా అనిపిస్తుంది. కానీ, లయకారునికి కావలసిన లక్షణాలలో అదొకటి. మంచిని చెడును వైవిధ్యంగా కనబరుస్తూనే ప్రళయకాలంలో వాటి అతీతంగా ఉండటం, బూడిద పూతలు, నృత్యాలు, వేషభూషలు శివతత్త్వాన్ని కొంత సంశ్లిష్టంగా చేసినట్లు అనిపించినా శివుడు బోళాశంకరుడు. భక్తితో చెంబెడు నీళ్లు పోసినా, ఒక్క మారేడు దళం వేసినా, కాస్త విభూది పూసినా, ఎలుగెత్తి పాడినా, నర్తించినా అనుగ్రహిస్తాడు. ఏమీ లేకున్నా ఓం నమశ్శివాయ అని తలచితే చాలు పలుకుతాడు. ఆ పరమశివునితో సంభాషణలాంటి ఈ గీతంలో ఆయన రూపగుణ వైభవాలను నుతిస్తూనే తనకు ఎందుకు కనిపించటం లేదని ప్రశ్నిస్తున్నారు కృష్ణశాస్త్రి గారు. సాంబశివ అనే పదానికి విశేషమైన అర్థముంది. స+అంబ = సాంబ...అంబతో కూడిన శివుడు. అంటే సాంబశివుడు అవిభాజ్యమైన అర్థనారీశ్వర తత్త్వాన్ని సూచిస్తుంది. శివుని నుతిస్తే అమ్మను నుతించినట్లే అని సాంబశివ నామం చెబుతుంది.

ఓ సాంబశివా! ఈ బూడిదలు పూసుకోవటం, ఈ అల్లరి చేష్టలు చేయటం ఎందుకు. ఎవరు నీకు చెప్పేది? అలలతో ఉరకలేసి పరుగెడుతున్న గంగను పట్టి తలపాగాలా ఉన్న నీ జటాఝూటాలలో చుట్టావు. చంద్రవంకను తెల్లని కలికితురాయిగా పెట్టావు. కరి మరియు పులి చర్మాన్ని ధరించి, దానికి నడుము కట్టుగా కాలాగ్నిని చుట్టి, చేతిలో త్రిశూలము పట్టుకొని, నుదుటన అగ్నిని మూడో కన్నుగా పెట్టావు. ఓ శివా! నువ్వు ప్రళయాన్ని కలిగించే రుద్రుడవో, కరుణాసముద్రుడవో! ఓ దయామయా! ఈ దాసునికి ఎందుకు కనిపించవు?

ఈ గీతంలో శివుని విలక్షణమైన లక్షణాలను ఎన్నో ప్రస్తావించారు దేవులపల్లి వారు. గంగావతరణంలో భగీరథుడు తన పూర్వీకులకు ముక్తిని కలిగించటానికి బ్రహ్మకై తపస్సు చేయగా, బ్రహ్మ ప్రత్యక్షమై సురగంగను భువికి తీసుకు రావాలంటే ఆ గంగ ఉధృతిని లోకాలు తట్టుకోలేవు, కాబట్టి శంకరుని ప్రార్థించమంటాడు. శంకరుడు భగీరథుని తపస్సుకు మెచ్చి తన శిరస్సులో గంగను ధరించటానికి అంగీకరిస్తాడు. తరువాత భువి మీదకు ప్రవహింప జేస్తాడు. అలా ఆ గంగమ్మ ఈ కర్మభూమిలో ప్రవేశించి సగర పుత్రులతో పాటు ఇప్పటికీ మనందరికీ ముక్తిని కలిగిస్తూనే ఉంది. గంగను ధరించాడు కాబట్టి గంగను కూడా శివుని భార్యగానే భావిస్తారు. అదీ ఈ జటాఝూటాలలోని గంగమ్మ గాథ.

ఇక తరువాత సిగపై నెలవంక...దీనికి కూడా వివరణ ఉంది. దక్షప్రజాపతి 27 మంది కూతుళ్లను చంద్రుడు వివాహమాడుతాడు. కానీ, అతనికి ఒక్క రోహిణి అంటేనే ఎక్కువ మక్కువ. అందుకు మిగిలిన వారు కోపగించి తండ్రికి చెప్పగా, దక్షుడు చంద్రునికి హితవు పలుకుతాడు. అయినా చంద్రుడు మార్చుకోడు. అప్పుడు దక్షుడు చంద్రుని ఆతని ప్రకాశం క్షీణించేలా శపిస్తాడు. ఏమి చేయాలో తోచక చంద్రుడు బ్రహ్మదేవుని ప్రార్థించగా బ్రహ్మ చంద్రుని శివుని ప్రార్థించమంటాడు. చంద్రుడు ప్రభాస తీర్థం వెళ్లి సరస్వతీ నది తీర్థం వద్ద శివలింగం చేసి శివుని పూజిస్తాడు. అతని ప్రార్థనకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై దక్షుని శాపానికి పూర్తి నివృత్తి లేదు కానీ పక్షం రోజులు క్షీణ దశ, పక్షం రోజులు వృద్ధిగా ఉంటుంది అని వరమిస్తాడు. కానీ కృష్ణ పక్షంలో చంద్రుడు తన క్షీణతను చూసి సిగ్గు పడి తండ్రి అయిన సముద్రుని గర్భంలో దాగుంటాడు. చంద్రుడు లేకపోవడంతో లోకంలో చంద్రకాంతి అవసరమైన ఔషధ మొక్కలు ఔషధ గుణాలను కోల్పోతాయి. అంతే కాకుండా, చంద్రుడు లేనందువలన లోకంలో ఎన్నో అనర్థాలు కలుగుతాయి. అప్పుడు దేవతలు చంద్రుడిని మళ్లీ శివుని ప్రార్థించమంటారు. శివుడు చంద్రుని ప్రార్థనను మెచ్చి తన శిరసుపై ధరించి చంద్రుని క్షీణతను, వృద్ధిని నియంత్రిస్తూ,  చంద్రునికి ప్రాభవమిచ్చి లోక కళ్యాణానికి తోడ్పడ్డాడు.

శివుడు కరి చర్మాన్ని ధరిస్తాడు కాబట్టి తోలు కట్టి అన్నారు కృష్ణ శాస్త్రి గారు. దానికి కూడా గాథ ఉంది, గజాసురుని సంహారం తరువాత ఆతనికిచ్చిన వరం మేరకు అతని చర్మాన్ని ధరిస్తాడు. ఇక కాలాగ్నిని నడుం కట్టుగా ధరిస్తాడు అన్నదానికి పటకాగా కాలాగ్నిని చుట్టి అన్నారు కవి. ప్రళయకాలంలో కాలాగ్నిని శివుడు ప్రత్యక్షం చేసి దానితో విలయ తాండవం చేస్తాడు. మిగిలిన సమయమంతా ఆ కాలాగ్నిని తన నడుముకు చుట్టుకొని ఉంటాడు. అనగా కాలాన్ని శాసించే వాడు శివుడు.  శివుని త్రిశూలానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. త్రిమూర్తులకు, త్రిగుణాలకు, త్రిశక్తులు (ఇచ్ఛా, క్రియా, జ్ఞానములు), త్రినాడులకు (ఇడ, పింగళ,సుషుమ్న) , త్రికాలములకు (భూత, వర్తమాన, భవిష్యత్) ప్రతీకగా నిలిచింది. జ్ఞానానికి, బుద్ధికి, చేతనకు ప్రతీకగా మూడవ నేత్రము చెప్పబడింది. అందుకనే అక్కడ అగ్నిని నిలిపాడు శివుడు.

కృష్ణశాస్త్రి గారి గీతాలలో ఈ శైలి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది పైకి ఆకృతి వర్ణనగా అనిపించినా పదప్రయోగాన్ని పరిశీలిస్తే ఎంతో లోతైన భావం దాగి ఉంటుంది. శివుని ఆయుధాలు, రూపము వెనుక నిగూఢార్థములు తెలిసిన యోగి కృష్ణశాస్త్రిగారు. పాలగుమ్మి విశ్వనాథం గారు ఈ గీతానికి సంగీతం కూర్చగా దీనిని ఆకాశవాణి భక్తిరంజని కార్యక్రమంలో ప్రసారం చేయబడింది. కేబీకే మోహన్‌రాజు గారు బృందంతో కలిసి ఈ గీతాన్ని పాడారు. దశాబ్దాలు గడిచిపోయినా ఇప్పటికీ పాట తనకున్న ప్రత్యేక స్థానాన్ని కోల్పోలేదు. 

8, డిసెంబర్ 2015, మంగళవారం

హిమగిరి సొగసులు మురిపించును మనసులు - సముద్రాల వారి ఆణిముత్యం



హిమగిరి సొగసులు మురిపించును మనసులు
చిగురించునేవో ఏవో ఊహలు 
హిమగిరి సొగసులు మురిపించును మనసులు

యోగులైనా మహాభోగులైనా మనసుపడే మనోజ్ఞ సీమ
సురవరులు సరాగాల చెలుల కలసి సొలసే అనురాగసీమ
హిమగిరి సొగసులు మురిపించును మనసులు

ఈ దివిని ఉమాదేవి హరుని సేవించి తరించెనేమో
సుమశరుడు రతీదేవి జేరి కేళి తేలి లాలించెలేమా
హిమగిరి సొగసులు మురిపించును మనసులు


కవి హృదయం సన్నివేశానికి సరిపడా ఎలా భావాన్ని ఆవిష్కరించాలో బాగా ఎరిగి ఉండాలి అన్నదానికి చక్కని ఉదాహరణ ఈ గీతం. పాండవుల వనవాసంలో భీముడు, ద్రౌపది పాత్రలపై చిత్రీకరించబడిన ఈ శృంగార యుగళ గీతం హిమాలయాలు ప్రకృతీపురుషుల తత్త్వాన్ని ఎలా ఆవిష్కరించిందో చూడండి.

హిమాలయాలు సమస్త దేవతా సమూహానికి నివాసలు. కైలసగిరిలో ప్రమథగణాలతో శివపార్వతులు కొలువుంటే, శ్రీమహావిష్ణువు, సమస్త నదీనదాలు, ఆది పరాశక్తితో సహా ఎందరో దేవతలు ఈ పుణ్యభూమిని ఆలవాలం చేసుకున్నారు. అటువంటి భూమిలో ప్రకృతి కూడా పులకరించి పరిపూర్ణమైన దివ్యత్వంతో నిండి ఉంటుంది.

ఈ ప్రాతిపదికను పునాదిగా చేసుకొని సముద్రాల రాఘవాచార్యుల వారు పాండవ వనవాసం చిత్రానికి హిమగిరి సొగసులో అనే గీతాన్ని రాశారు. భీమసేనునిగా నవరసనటనా సార్వభౌముడు అన్న ఎన్‌టీ్ఆర్, ద్రౌపదిగా మహానటి సావిత్రి ఈ యుగళగీతానికి తమ నటనతో ప్రాణం పోశారు. స్త్రీపురుషుల మధ్య వలపులు రేపటానికి ప్రకృతి అతి ముఖ్యమైన కారణం. అందులో హిమాలయాలంటే? మంచు, కొండలు, ఎత్తైన చెట్లు, లోయలు, రమణీయమైన పుష్పాలు, అరుదైన ఫలాలు...అన్నీ అక్కడే. ఇక్కడే యోగులు, సిద్ధులు తపస్సు చేసేది. యక్ష, కిన్నెర, గంధర్వులు విహరించేది. ఇలా, హిమాలయాలలో అణువణువు దివ్యత్వం నిండి ఉంటుంది. ప్రకృతి సౌందర్యానికి స్త్రీ పురుషుల మనసులలో ఊహలు చిగురిస్తాయి. యోగులైనా, భోగులైనా మనసు పడే అందాల సీమ అని కవి వర్ణించటానికి కారణం అక్కడి ప్రకృతిలోని దివ్యత్వమే. దేవతలు సరస సల్లాపములాడే భూమి ఇది. హిమవంతుని పుత్రిక అయిన పార్వతి శివుని కోరి తపస్సు చేసింది కూడా ఇక్కడే. ఆ ఉమాదేవి శంకరుని సేవించి తరించిన ప్రదేశం ఈ హిమాలయాలు. రతీమన్మథుల కేలి జరిగింది కూడా ఇక్కడే. అంతటి మహత్తరమైన హిమగిరి సొగసులు చూసి మోహావేశులు కానివారెవ్వరు?

సముద్రాల రాఘవాచార్యుల వారు తెలుగు సినీ జగత్తులు ఒక రెండు దశాబ్దాల పాటు సాహిత్య ప్రపంచాన్ని ఏలారు. ఆయన రామాయణాన్ని ఒకటి కాదు రెండు కాదు పదికిపైగా పాటలలో సంక్షిప్తంగా వర్ణించారు. పాటలే కాదు, సంభాషణలు కూడా అంతే మనోజ్ఞంగా అందించారు. అటువంటివాటిలో ఒక్కటి ఈ హిమగిరి సొగసులు పాండవ వనవాసం చిత్రంలోనిది. ఘంటసాల మాష్టారు స్వీయ సంగీత దర్శకత్వంలో, సుశీలమ్మతో కలిసి పాడిన యుగళ గీతం ఇది. మంచి స్వరాలతో, రాగయుక్తంగా, భావయుక్తంగా పాడిన ఈ గీతం తెలుగు  సినీ స్వర్ణయుగపు పాటల ఆణిముత్యాలలో ఒకటిగా నిలిచిపోయింది.


6, డిసెంబర్ 2015, ఆదివారం

బేబీ కార్న్-గోబీ మంచూరియన్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్

బేబీ కార్న్-గోబీ మంచూరియన్


బయటకు వెళితే చాలా మంది ఆర్డర్ చేసే ఐటం మంచూరియన్. కొంతమంది గోబీ ఇష్టపడితే, కొంతమంది బేబీ కార్న్ ఇష్టపడతారు. నేను బేబీ  కార్న్, గోబీ కలిపి చేశాను. అసలు మంచురియన్ అంటే ముందుగా ముక్కలను నూనెలో వేయించాలి, తరువాత మళ్లీ మిగిలిన పదార్థాలు వేసి స్టిర్ ఫ్రై చేయాలి. నేను అలా చేయలేదు. స్టీం కుక్ చేసి తరువాత నూనెలో స్టిర్ ఫ్రై చేశాను. కాబట్టి నూనె తక్కువే పట్టింది.

కావలసిన పదార్థాలు:


  • ఒక అంగుళం పరిమాణంలో కోయబడిన బేబీ కార్న్
  • ఒక అంగుళం పరిమాణంలో కింద కాండం కాస్త ఉండేలా కోయబడిన కాలీఫ్లవర్
  • సన్నగా కోయబడిన అల్లం, వెల్లుల్లి
  • సన్నగా కోయబడిన ఉల్లికాడలు
  • సోయా సాస్
  • టబిస్కో సాస్
  • తగినంత నూనె
  • తగినంత రెడ్ చిల్లీ సాస్
  • తగినంత టమాటో కెచప్
  • మిరియాల పొడి
  • ఉప్పు
  • నూనె
  • కార్న్ ఫ్లోర్


తయారు చేసే పద్ధతి:

ముందుగా కాలీఫ్లవర్ ముక్కలను, బేబీకార్న్ ముక్కలను 5 నిమిషాల పాటు స్టీం చేసుకోవాలి. దీని ఉద్దేశం ముక్కలు లోపల పచ్చి పోవటానికి. నూనెలో ఫ్రై చేయకూడదు అనుకుంటేనే ఇలా చేయాలి. లేకపోతే నూనెలో ముక్కలను డీప్ఫ్రై చేయాలి. స్టీం పద్ధతిలో ముక్కలు బాగా ఆవిరిపట్టి పచ్చి పోయిన తరువాత కాసేపు చల్లార్చుకోవాలి. నాన్-స్టిక్ ప్యాన్‌లో మరింత నూనె వేసి, వేడి అయిన తరువాత అందులో తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడల ముక్కలను వేసి బాగా వేయించాలి. ఒక 5 నిమిషాలు వేగి రంగు మారిన తరువాత బేబీ కార్న్, కాలీ ఫ్లవర్ ముక్కలను వేసి కాసేపు స్టిర్ ఫ్రై చేయాలి. తరువాత సోయా సాస్, టబిస్కో సాస్, చిల్లీ సాస్, టమాటో కెచప్, ఉప్పు, మిరియాల పొడి వేసి మరింత సేపు స్టిర్ ఫ్రై చేయాలి. ముక్కలు అన్ని సాస్‌లను, కెచప్‌ను పీల్చుకొని రంగు మారుతున్న తరువాత, 3-4 స్పూన్స్ కార్న్ ఫ్లోర్‌ను కాస్త నీటిలో బాగా కలిపి బాణలిలో ముక్కలపై వేయాలి. దీనివలన అన్ని మిశ్రమాలు దగ్గరకు అయ్యి కొద్దిగా గ్రేవీలా వస్తుంది. దీనిని పాత్రలోకి మార్చుకొని వేడి వేడిగా తినాలి.

గమనిక: ఈ వంటకంలో అల్లం, వెల్లుల్లి బాగా పడతాయి.

వెజిటబుల్ ఫ్రైడ్ రైస్




కావలసిన పదార్థాలు:


  • బాస్మతీ బియ్యం
  • చిన్న ముక్కలుగా తరిగిన క్యారెట్, సన్నగా కోయబడిన ఫ్రెంచ్ బీన్స్, బంగాళ దుంప (ఇంకా కూరగాయలు కావాలనుకుంటే తురిమిన క్యాబేజీ, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా కోయబడిన క్యాప్సికం, సన్నగా తరిగిన ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చు)
  • తగినన్ని ఫ్రోజెన్ బఠాణీలు
  • ఆలివ్ ఆయిల్
  • జీలకర్ర
  • మిరియాల పొడి
  • సోయా సాస్


తయారు చేసే పద్ధతి:

బాస్మతి బియ్యాని ముందుగానే ఉడికించుకోవాలి. దీనికి బియ్యాన్ని ఒక అరగంటసేపు నీళ్లల్లో నానపెట్టుకోవాలి. తరువాత బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్లో కానీ, రైస్ కుక్కర్లో కానీ వేసి, తగినంత నీరు పోసి, కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి ఉడికించాలి. ఉడికిన తరువాత మూత తీసి మరి కాస్త ఆలివ్ ఆయిల్ వేసి పొడి పొడిగా ఉండేలా చేసుకోవాలి. ఎక్కు సేపు మూత ఉంచితే అన్నం మెత్తబడిపోతుంది. ఫ్రైడ్ రైస్ బాగుండదు.

ఒక బాణలిలో నూనె వేసి తరిగిన కూరగాయ ముక్కలన్నీ వేయాలి. కాస్త జీల కర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. చైనీస్ వంటకాలకు ముఖ్యం బాగా వేడి మీద స్టిర్ ఫ్రై చేయటం. అంటే బాణలిని అటు ఇటూ తిప్పుతూ ఉండాలి. ఇలా ఒక 4-5 నిమిషాలు స్టిర్ ఫ్రై చేసిన తరువాత ఉడికించిన బాస్మతీ బియ్యం, సోయా సాస్, మిరియాల పొడి వేసి, మొత్త రైస్‌కు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే మరింత వేసుకోవాలి. దీనిని 3-4 నిమిషాల పాటు మళ్లీ స్టిర్ ఫ్రై చేయాలి.  అంతే, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. వేడి వేడిగా తింటేనే బాగుంటుంది. పైన చేసిన బేబీకార్న్-గోబీ మంచురీన్ తో కలిపి తింటే చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి వేరే సైడ్ డిష్ ఏమీ లేకున్నా కూడా బానే ఉంటుంది.

గమనిక: పై రెండు వంటకాలలోనూ సోయా సాస్ మరియు ఇతర సాస్‌లలో ఉప్పు, కారం ఎక్కువే ఉంటాయి కాబట్టి మీ అభిరుచులను బట్టి జాగ్రత్తగా వేసుకోండి. లేకపోతే వంటలు బాగా కారంగా, ఉప్పగా వచ్చే అవకాశం ఉంది. 

5, డిసెంబర్ 2015, శనివారం

మతం-మానవత్వం


"కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే"...ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి మధురమైన గళంలో శ్రీవేంకటేశ్వర సుప్రభాతం ఎఫ్ఎం రేడియోలో వస్తోంది. ప్రాతః సంధ్యావందనం చేసుకున్నాడు చంద్రశేఖరన్ అయ్యర్. భార్య గౌరి కాలేజీకి వెళ్లాల్సిన పిల్లలను నిద్రలేపే ప్రయత్నంలో కేకలు వేస్తోంది. ఎనభై ఏళ్ల సీతారామన్ అయ్యర్, భార్య జానకమ్మాళ్ వృద్ధాప్యపు భారంతో కాలకృత్యాలలో ఉన్నారు. చంద్రశేఖరన్ సెక్రెటేరియట్లో సెక్షన్ ఆఫీసరు.

పక్క ఫ్లాట్లో రైతుబజార్లో కూరగాయలు, పూలమ్ముకునే సయ్యద్ మిర్జా మార్కెట్టుకు వెళ్లటానికి సిద్ధమవుతున్నాడు. క్రిందటి వారం వానలకు చాలా నష్టపోయిన మిర్జా దానిని ఎలా పూడ్చాలి, పిల్లవాడి స్కూలు ఫీజులు ఎలా కట్టాలి అన్న దిగులుతో భారంగా బయలుదేరాడు. భార్య సల్మా నిండు గర్భిణి. అతి కష్టం మీద వాకిలి దాక వచ్చి భర్తకు ధైర్యం చెప్పి సాగనంపింది. సయ్యద్ తండ్రి షేక్ మిర్జా భార్య పోయి ఒంటరిగా ఉన్నాడు. ఉదయం నమాజ్‌కు సిద్ధమవుతున్నాడు. తాము చేసే ప్రార్థనలు తమ కుటుంబానికి ఏమి సహాయం చేస్తున్నాయని సల్మా ఆలోచన. కానీ బయట పడదు.

వీళ్లకు రెండు ఫ్లాట్ల అవతల శామ్యూల్, నీలం దంపతులు ఉంటారు. శామ్యూల్ కేరళ వాడు, నీలం ముంబై నుండి వచ్చి చెన్నైలో ఉద్యోగం చేస్తోంది. కొత్తగా పెళ్లయ్యింది. మతాంతర ప్రేమ వివాహం. ఇరువైపులా తల్లిదండ్రులు వీరి నిర్ణయంతో పిల్లలను దూరం చేసుకున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.  శామ్యూల్ ఛాందసం కల క్రైస్తవుడు. హిందువుల ప్రసాదాలు ఇస్తే తినడు. విగ్రహారాధనను ఘోరంగా దూషిస్తాడు. సమయం దొరికినప్పుడల్లా ఆ దంపతులిద్దరూ అక్కడి దగ్గర లోని క్రైస్తవ వృద్ధాశ్రమంలో తమ సేవను అందిస్తూ ఉంటారు. వృద్ధాశ్రమంలో వృద్ధులకు కావలసిన వస్తువులను ముందే సేకరించిన విరాళలతో కొనిపెట్టుకొని వారం వారం వెళ్లి ఇచ్చి వస్తారు.

సాయంత్రమైంది. చెన్నైలోని అన్నానగర్‌లోని ఈ అపార్టుమెంటు కాంప్లెక్సులో ప్రజలంతా కాసేపు మిగితావారితో గడుపుదామని తమ ఇళ్లలోనుండి బయటకు వచ్చారు. "అయ్యరు గారూ! మా వాడు మంచి మంచి పూలు తెస్తాడు మార్కెట్లో. మీ శేఖరన్ పూజకు తీసుకుంటారా? అలాగే, వాడు మంచి కూరలు తెస్తాడు తీసుకోండి" అని అడిగాడు షేక్ మిర్జా సీతారామన్ మరియు జానకమ్మాళ్ దంపతులను. "అబ్బే వద్దండీ" అని చెప్పి ముందుకు కదిలారు వారు. "ఏవిటండీ! వాడు మనలను పూలు తీసుకోమంటాడు. మహాపాపం కదా..." అంది జానకమ్మాళ్. "నిజమేనే. వదిలేసేయ్" అని వాకింగ్ చిన్నగా సాగించారు.

షేక్ మిర్జాకు నీలం ఎదురు పడింది. "అంకుల్! ఆదాబ్ అర్జ్ హై! రేపు శనివారం మన కాంప్లెక్సులో వృద్ధులకు ఉచిత రక్త పరీక్షలు, తరువాత ఫలహారం ఉంది. మీరు కూడా తప్పక రండి..." అని చెప్పింది. "పర్లేదు. మేము ఈ మధ్యనే పరీక్షలు చేయించుకున్నాము. అయినా అల్లా దయతో నాకేమీ కాదు" అని సందేహ పూర్వకంగా ముందుకు సాగాడు మిర్జా. మిర్జాకు మతాంతర వివాహాలంటే మహా ద్వేషం.

రాత్రి అయ్యే సరికి ఉరుములు మెరుపులతో వాన మొదలైంది. సల్మాకు మళ్లీ దిగులు, భర్త సయ్యద్ పూలన్నీ పాడైపోతాయి. ఎలాగా అని ఆలోచనలో పడింది. ఈ వారం కూడా డబ్బులు రాకపోతే పస్తులే అనుకుంది. సయ్యద్ ఇంటికి రాలేదు. రాత్రి పది దాటింది. వాన కాస్తా కుంభవృష్టిగా మారింది. సల్మాకు దిగులు మొదలైంది. వస్తాడులేమ్మా అని షేక్ సర్ది చెప్పినా ఆయనకు కూడా లోపల గుబులు మొదలయ్యింది. దాదాపు పదకొండు గంటలకు సయ్యద్ తడిసిన పూల మూటలతో ఇంటికి చేరాడు. "రోడ్ల మీద మూడడుగుల నీళ్లున్నాయి. వాటిలో ఈ పూలను మోసుకుంటూ మధ్య మధ్యలో ఆగటం వలన ఆలస్యమైంది" అని చెప్పాడు.  

"శేఖరన్ గారూ! ఉన్నారా! నీలం ఇంకా ఇంటికి రాలేదు. నేను తొందరగా వచ్చేశాను. బస్సు ఎక్కి రెండు గంటలైందిట. ఫోన్ స్విచాఫ్ వస్తోంది. పన్నెండున్నర అయ్యింది. ఏమి చెయ్యాలో తోచట్లేదు. కాస్త మీ సెక్రటేరియట్ కాంటాక్ట్స్ ద్వారా పోలీసులకు ఫోన్ చేయించండి"...శేఖరన్  ఫోన్ తీసుకోబోయాడు. జానకమ్మాళ్ లోపలనుండి పిలిచి ఆ "శామ్యూల్ మనింట్లోకి ఎందుకు వచ్చాడు. పంపించేసెయ్.." శామ్యూల్‌కు వినబడి వెనుదిరిగి వెళ్లిపోయాడు. శేఖరన్ తలదించుకున్నాడు.

రాత్రంతా కుంభవృష్టి కురుస్తూనే ఉంది. మధ్యలో కరెంటు పోయింది. వానకు సెల్లార్ నిండిపోయింది. ఈ అపర్టుమెంటు ఎత్తు మీద ఉన్నా నీళ్లు బాగా ప్రవహిస్తూ పైకి వస్తున్నాయి. సెల్ ఫోన్లు పనిచేయటం లేదు.

సీతారామన్ గారికి ఎడతెరపి లేని వానలకు ఆయాసం మొదలయ్యింది. గుండె చిక్కబట్టినట్లుగా ఉంది. గౌరి, జానకమ్మాళ్ గృహవైద్యం చిట్కాలన్నీ ప్రయత్నం చేస్తున్నారు. ఊపిరి అందటం లేదు ముసలాయనకు. భర్త పరిస్థితి చూసి జానకమ్మాళ్ స్పృహతప్పి పడిపోయింది. "ఏవండీ! మన పక్కింటి శామ్యూల్ దగ్గర వృద్ధులకు కావలసిన మందులు, అత్యవసర వస్తువులు ఉంటాయని మన సొసైటీ మీటింగులో చెప్పారు. మామయ్యగారి కోసం మందులు అడగండీ"...కాసేపటి క్రింద తాను శామ్యూల్‌కు చేసిన అవమానం శేఖరన్‌కు గుర్తుకు వచ్చింది. అడుగు బయటకు లోపలకు పడుతోంది. తప్పు చేశానన్న భావన ఒకవైపు, తండ్రి ప్రాణం మరో వైపు...ఆలోచనలలో గడప దగ్గర ఆగిపోయాడు.

సల్మాకు నొప్పులు మొదలయ్యాయి. క్రిందకు వెళ్లి దాక్టర్ దగ్గరకు వెళ్ళే పరిస్థితి లేదు. సయ్యద్‌ను దగ్గరకు పిలిచింది. "సునో మియా! మన పక్కింటి గౌరి నర్స్ ట్రైనింగ్ తీసుకున్నానని ఇది వరకు ఎప్పుడో చెప్పింది. కొంచెం పిలవండి." అని చెప్పింది. "బేటా! తుం రుకో. వో లోగొన్ సే హం మదత్ నహీ లేంగే. అల్లా సల్మా కా దేఖ్‌బాల్ కరేగా" అని ఉరిమాడు. సయ్యద్ తన అపార్టుమెంటు ద్వారం దగ్గర ఆగిపోయాడు.

రాత్రంతా నీలం ఇంటికి రాలేదు. సల్మా నొప్పులతో బాధ పడుతునే ఉంది. సీతారామన్ గారిది వచ్చే ప్రాణం పోయే ప్రాణంలా ఉంది. ఎవరి మతాలు వారి మానవత్వానికి అడ్డుగోడలు వేశాయి. తెల్లవారే సరికి సీతారామన్ గారి ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి. ఇంట్లో రోదన. శేఖరన్ మదిలో నిర్వేదం. బయట కుంభ వృష్టి, ఫోన్లు పనిచేయటం లేదు. విద్యుత్తు లేదు. ఇంట్లో తాగటానికి నీళ్లు అంతంత మాత్రం ఉన్నాయి. రోజూ బయట తింటారు కాబట్టి శామ్యూల్-నీలంల ఇంట్లో ఆహారం కూడా ఏమీ లెదు. శామ్యూల్ నీరసంతో గడప దగ్గర కూలబడి ఏడుస్తున్నాడు. కొద్ది దూరంలో సల్మా పురిటి నొప్పులు భరించలేక ఏడుపు.

జానకమ్మాళ్ భర్త శవం పక్కన రోదిస్తున్నా బయట నుండి సల్మా నొప్పులతో ఆర్తనాదాలు బిగ్గరగా వినబడుతున్నాయి. భారమైన హృదయంతో గడపదాకా వెళ్లింది. అక్కడ సల్మా కింద పడుకొని అటు ఇటూ దొర్లటం చూసింది. మతం పేరుతో మూసుకుపోయిన మానవత్వం కళ్లు భర్త మరణంతో తెరుచుకున్నాయి. "గౌరీ! వెంటనే వెళ్లు. పక్కింటి అమ్మాయికి సాయం చేయి. మనం అజ్ఞానంతో పోగొట్టుకున్నది చాలు" అని చెప్పింది. పక్కనే గడప దగ్గర కూలబడి ఉన్న శామ్యూల్ వైపు చూసింది. తిండి తినలేదని అర్థమయ్యింది. ఆ సాయంత్రం చేసిన నివేదన చేసి పాలు, కొబ్బరి ముక్కలు ఉన్నాయి అన్నది గుర్తుకు వచ్చింది. వెంటనే పరుగు పరుగున వెళ్లి వాటిని తెచ్చి శామ్యూల్‌కు పెట్టింది. హిందువుల ప్రసాదం తినరాదన్న తన అజ్ఞానానికి ఏడ్చి ప్రభువే జానకమ్మాళ్ రూపంలో వచ్చినట్లుగా భావించి అవి తిన్నాడు.

వాన కురుస్తునే ఉంది. మనిషి రావటానికి పోవటానికి లేదు. సల్మాకు  కానుపు దగ్గర పడింది. గౌరి సాయంతో ఇంట్లోనే ఆమె ఆడబిడ్డను కన్నది. సయ్యద్ ఊపిరి పీల్చుకున్నాడు. గౌరి ఇంట్లోకి వచ్చింది. పురిటి మైల లేదు మామగారు మరణించిన మైల లేదు..మానవత్వ పరిమళంతో ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. సీతారామన్ మరణించి నాలుగు గంటలయ్యింది. ఇంట్లోనుంచి బయటకు తెసుకు వెళ్లే పరిస్థితి లేదు. ఇంట్లో కూరలు లేవు. తన మత మౌఢ్యానికి చింతించిన షేక్ అడుగులు వేస్తూ సయ్యద్ దగ్గరకు వచ్చి "బేటా! బాజూ వాలే కే ఘర్ మే సబ్జీ నహి హై దిఖ్తా హై. జాకే యే సబ్జీ దో...." తండ్రి మాటలకు ఎంతో సంతోషించాడు సయ్యద్. పరుగు పరుగున శేఖరన్ ఇంటికి వెళ్లి కూరగాయలు ఇచ్చాడు. అతను వాటిని భార్యకు అందించాడు. గౌరిని తమ కుటుంబంతో పాటు సయ్యద్ కుటుంబానికి, శామ్యూల్‌కు వంట చేయమని చెప్పాడు.ఉన్న మంచి నీళ్లను జాగ్రత్తగా ఆ పది మంది ఎలా తాగాలో ఆలోచన చేసి అందరికీ తెలిపాడు.

వాన తగ్గట్లేదు. బయట ప్రపంచంతో మాట్లాడటానికి లేదు. తండ్రి శవం ఇంక పాడయ్యే సమయం వస్తోంది. ఆలోచనలో ఉన్న శేఖరన్ దగ్గరకు శామ్యూల్ వచ్చాడు. "సార్, దురదృష్టమో అదృష్టమో మా ఇంట్లో ఒక చెక్క పెట్టె ఉంది. అందులో నాన్న గారి శరీరాన్ని పెట్టి నా కారుపై పెట్టే ప్రయత్నం చేద్దాము." రెండో ఆలోచన లేకుండా శేఖరన్ అమ్మను అడిగాడు. ఆవిడ సరే అంది. కుటుంబమంతా ఆయన దేహానికి నమస్కారం చేసి అవే అంత్యక్రియలుగా భావించారు. శామ్యూల్ తన ఫ్లాట్ నుండి పెట్టెను తీసుకువచ్చాడు. దైవలీల ఎలా ఉంటుందో చూడండి. సీతారామన్ గారి శరీరం అందులో సరిగ్గా పట్టింది. దానిపై ఆయన వస్త్రాలను కప్పారు. సయ్యద్ తన వద్ద ఉన్న పూలన్నీ తీసుకు వచ్చి ఆయన శరీరంపై కప్పాడు. పెట్టెను మూసి సయ్యద్ ఒక పక్క, షేక్ ఒక పక్క, శేఖరన్ ఒక పక్క, శామ్యూల్ ఒక పక్క సీతారామన్ గారి శవం మోశారు.

జానకమ్మాళ్‌కు అక్కడ నలుగురు కుమారులు కనిపించారు. పైకి చూసి నమస్కారం చేసింది. అల్లా, రాముడు, జీసస్ అనుగ్రహించినట్లుగా అనిపించింది. నలుగురు మగవాళ్లు కలిసి పెట్టెను శామ్యూల్ బండిపై పెట్టి జోరువానలో తాడు వేసి కట్టారు. శామ్యూల్, శేఖరన్ బండిలో కూర్చుని స్టార్ట్ చేశారు. వాన నీటికి మునిగిన రోడ్లపై కారు తేలుతున్నట్లుగా ఉంది. ఒక కిలోమీటర్ దూరం పోగానే బండి ఆగిపోయింది గుంతలో ఇరుక్కుంది. శేఖరన్, శామ్యూల్ బండి దిగారు. గుండెలవరకు నీరు, పైన కుంభవృష్టి. నీటి ఉద్ధృతికి పెట్టె కొట్టుకుపోయింది. శామ్యూల్, శేఖరన్ ఏమీ చేయలేకపోయారు. అలా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన పెట్టె ఒక ఎత్తైన ప్రదేశం దగ్గర ఆగింది. అక్కడ ఒక బస్ షెల్టర్ కింద వంద మంది ఉన్నారు. వారిలో నీలం కళ్లు మూసుకొని కూలబడి ఉంది. పెట్టె పెట్టె అని ఉన్నవారంతా అరిచారు. నీలం కళ్లు తెరిచింది. పెట్టెను అందరూ షెల్టర్ కిందికి చేర్చారు. తెరిచారు. నీలం సీతారామన్ గారి దేహాన్ని గుర్తు పట్టింది. నోటమాటరాలేదు. పెట్టెను కూడా గుర్తు పట్టింది. దానిని కాపాడాలని నిర్ణయించుకొని పక్కవారికి చెప్పింది. వరదల్లో గంటల తరబడి నిలబడి మానవత్వం అంటే ఏమిటో అప్పటికే బాగా అర్థమైన వారందరూ అంగీకరించారు.

దాదాపు ఏడు గంటల తరువాత వాన వెలిసింది. నీలం షెల్టర్ కింద ఉన్నవారి సాయంతో ఆ పెట్టెను స్మశానానికి తీసుకువెళ్లి అక్కడ కాపరికి చెప్పింది. శామ్యూల్, శేఖరన్లకు వార్త తెలిసి అక్కడికి రావటానికి చాలా సమయం పట్టింది. చివరకు వచ్చి శేఖరన్ తండ్రికి అంత్యక్రియలు చేశాడు.

ఇంటికి వచ్చిన శేఖరానికి తల్లి, భార్య ఎదురయ్యారు. శేఖరన్ అంతా వివరించాడు. మూడు కుటుంబాలు ఒక చోట చేరాయి.

"అమ్మా! ఆ రోజు వారి జీవనోపాధి కోసం నాన్నను పూలు కూరగాయలు తీసుకోమని చెప్పిన షేక్ గారిని మీరు తిరస్కరించారు. ఇంటికి సాయం కోరి వచ్చిన శామ్యూల్‌ను నేను అవమానించి, అతని దగ్గర వైద్య సదుపాయం ఉన్నా అహంకారంతో వెళ్లలేకపోయాను. చివరికి ఆ సయ్యద్ గారి పూలే నాన్నకు మాలలయ్యాయి. ఆ శామ్యూల్ ఇంటి పెట్టే నాన్న అంతిమ యాత్రకు తోడైంది....ఆ శామ్యూల్ గారి భార్యే నాన్న శరీరం నీళ్లపాలు కాకుండా నా ధర్మం నిర్వర్తించేలా చేసింది. మనం ఏమి నేర్చుకున్నాము, ఏమి పాటించాము ఆలోచించు"...

"శేఖరన్ గారు! నా అజ్ఞానంతో సయ్యద్‌ను మిమ్మల్ని సహాయం అడగవద్దని చెప్పాను. గౌరి గారు లేకపోతే మా కోడలు, మనవరాలు ఏమయ్యేవారు? మత దురహంకారం నా కళ్లను కప్పేసింది. అందుకే నీలంగారు నా మంచికోరి చెబితే వినలేదు. మీ అందరిలోని దైవత్వాన్ని గుర్తించ లేకపోయాను" అన్నారు షేక్.

"శేఖరన్ గారు! అందరమూ తప్పు చేశాము. ఇన్నాళ్లూ హిందూ మతంపై ద్వేషంతో మీరు దేవతలకు సమర్పించే నివేదనను నేను ఎన్నో మార్లు తిరస్కరించాను. కానీ, చివరకు అదే నా ప్రాణాలను కాపాడింది..మీకు తెలియదు. నాకు చిన్నతనంలోనే చక్కెర వ్యాధి వచ్చింది. ఇంకాసేపు ఏమీ తినకుండా ఉంటే నా పరిస్థితేమిటో ఊహించలేను. మీ అమ్మగారు నాకు ఇచ్చిన ఆహారం నా పాలిట అమృతం..." అన్నాడు శామ్యూల్.

"మామగారి ప్రార్థనలు ఎందుకు ఉపయోగం అని తిట్టుకునే దాన్ని. ఇంతటి వానలో నాకు అవసరానికి దేవతలా వచ్చి పురుడు పోసిన గౌరి గారు మామయ్య చేసిన ప్రార్థనలకు పరమాత్మ స్పందన..."  మియాజీ! మామా గారు! మీరు అంగీకరిస్తే నా బిడ్డకు గౌరి ఇన్సానియత్ మిర్జా అని పేరు పెడతాను" అని సల్మా కన్నీళ్లతో గద్గద స్వరంతో చెప్పింది. సయ్యద్, షేక్ వెంటనే అంగీకరించారు. అందరూ వారి వారి పరమాత్మ స్వరూపాలకు నమస్కరించారు. అందరూ ఒకే భోజనం చేశారు.

అక్కడే మరణం, అక్కడే జననం, అక్కడే మతమనే గోడలు మానవత్వం ముందు విరిగి నేలకు ఒరిగాయి. అక్కడ శౌచము లేదు, శుచి లేదు, అక్కడ ఇతర విశ్వాసాల పట్ల ద్వేషం లేదు. అక్కడ పక్కవాడు నా శత్రువన్న అభద్రతా భావం లేదు. అక్కడ హింస లేదు. అక్కడ అశాంతి లేదు. అక్కడ బేలతనం లేదు. అక్కడ అబలలు లేరు. అందరిలోనూ పరమాత్మ తత్త్వం ప్రజ్జ్వలిస్తోంది. అక్కడే మనిషి జన్మకు సార్థకత ఏమిటో తెలిసింది. అక్కడే నవశకానికి నాంది పలికింది.

ఈ కథ చెన్నైలో గత నాలుగు రోజులుగా అత్యంత దయనీయమైన, కఠినమైన పరిస్థితులలో ప్రాణాలొడ్డి మానవత్వాన్ని పరిమళిస్తున్న వాలంటీర్లకు, మానవతా మూర్తులకు, భారతీయ సైన్యానికి అంకితం. జై హింద్.



తులసీ దయాపూర్ణకలశీ - తులసి పూజ, దళచయనం



కార్తీక మాసం కదా? తులసి పూజ, తులసి వివాహం ఈ నెలలో వచ్చిన విశేషమైన పూజలు. తులశమ్మ విశేషాలు కొన్ని తెలుసుకుందాం.

తులసి - స్వయంగా శ్రీమహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకలసంపదలకు లొంగక, రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. తులసిని ఎన్నో విధాలుగా నుతించారు మన సనాతన ధర్మంలో. తులసిలేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. మరి తులసి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టటం మన కనీస ధర్మం. అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు కలది. మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తులసి పత్రాలు అమృతముతో సమానము.

అనన్యదర్శనాః ప్రాతః మే పశ్యంతి తపోధన
జగత్త్రితయ తీర్థాని తైర్దృష్టాని న సంశయః

ఉదయము నిద్రనుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది.

తులసిచెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరిక, మానసిక ఆరోగ్యమునిస్తుంది.

తులసి పూజ ఎలా చేయాలి? 


తులసికోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణము చేయాలి, నమస్కరించాలి. దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాపప్రక్షాళన జరుగుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు.

ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి.

నమస్తులసి కళ్యాణీ! నమో విష్ణుప్రియే! శుభే!
నమో మోక్షప్రదే దేవి! నమస్తే మంగళప్రదే!
బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ!
పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ!

ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థసంయుతం
యః పఠేత్తం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్

అని తులసిని ప్రార్థించి, అచ్యుతానంతగోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి. తరువాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి.

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం

అని చెంబులోని నీళ్లను తులసిచెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి.

తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే

అని తులసికోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి.

పూజ కోసం తులసీ పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.



తులసీం యే విచిన్వంతి ధన్యాస్తే కరపల్లవాః - పూజ చేయటం కోసం తులసి దళాలను త్రెంపిన చేతులు ఎంతో ధన్యములు అని స్కాందపురణం చెప్పింది.

తులసి చెట్టునుండి దళాలను మంగళ, శుక్ర, ఆది వారములలో, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైధృతి వ్యతీపాత యోగములలో త్రెంప కూడదు. ఇది నిర్ణయసింధులో, విష్ణుధర్మోత్తర పురాణంలో తెలియజేయబడినది. తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు. ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలి పడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను త్రెంపి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించాలి. సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధము వర్తించదు. సాలగ్రామమున్నవారు అన్ని తిథివారములయందు తులసి దళములను త్రెంపవచ్చు. ఎందుకంటే సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం. శ్రీమహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలూ వర్తించవు. ఇది ఆహ్నిక సూత్రావళిలో చెప్పబడింది. స్నానము చేయకుండా మరియు పాద రక్షలు ధరించి తులసి చెట్టను తాకరాదు, దళములను త్రెంపకూడదు. ఇది పద్మపురాణంలో చెప్పబడింది.

తులసి దళాలను ఎలా త్రెంపాలి?

తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రెంపకూడదు. రెండేసి ఆకులు కలిగిన దళముతో కూడిన కొసలను త్రెంపాలి. అన్ని పుష్పాల కన్నా తులసీ మంజరులు (అంతే తులసికి వచ్చే పుష్పాలు) అత్యంత శ్రేష్ఠమని, ఈ మంజరులను కోసేటప్పుడు వాటితోపాటు ఆకులు తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మపురాణం చెప్పింది.



తులసిమొక్కకు ఎదురుగా నిలబడి, రెండు చేతులు జోడించి, కింది మత్రాన్ని చదువుతూ పూజా భావంతో మొక్కను కదిలించకుండా తులసి దళాలను త్రెంపాలి. దీనివలన పూజాఫలం లక్షరెట్లు అధికంగా లభిస్తుంది అని పద్మపురాణం చెప్పింది.

మాతస్తులసి గోవింద హృదయానందకారిణి
నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే 

తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియా
చినోమి కేశ్వస్యార్థే వరదా భవ శోభనే

త్వదంగసంభవైః పత్రై పూజయమి యథా హరిం
తథా కురు కురు పవిత్రాంగి! కలౌ మలవినాశిని!

(ఆహ్నిక సూత్రావళి)

శ్రెహరికి ఆనందాన్ని కలిగించే తులసీ మాతా! నారాయణుని పూజ కొరకు నీ దళములను కోస్తున్నాను. నీకు నా నమస్కారములు. అమృతమునుండి జన్మించిన, ఎల్లప్పుడు శ్రీహరికి ప్రియమైన తులసీమాతా! ఆ కేశవుని పూజ కొరకు నీ దళాలను త్రెంపుతున్నాను. నాకు అభయమునివ్వు శుభకరీ! నీ శరీరమునుండి జన్మించిన పత్రములతో ఆ శ్రీహరిని పూజిస్తాను. కలియుగంలో సమస్త దోషములు తొలగించే పవిత్రమైన శరీరము కల తల్లీ! నేను తలపెట్టిన హరిపూజను సాఫల్యము చేయుము.

పూజ చేసిన తరువాత ఒక తులసీదళాన్ని "అచ్యుతానంతగోవింద" అని స్మరిస్తూ నోట్లో వేసుకొని తినాలి. ప్రతిరోజు భక్తిభావంతో ఒక తులసిదళాన్ని సేవించటం వలన సకల రోగాలు నశిస్తాయి, రాబోయే రోగాలు నిరోధించబడుతాయి.

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తులసీ దయాపూర్ణకలశీ అన్నారు ఒక గీతంలో. తులసి అంతటి వైభవము, దయ కల మాత. నిత్యం పూజిద్దాం, దళాన్ని సేవిద్దాం. సకల శుభాలను,ఆరోగ్యాన్ని పొందుదాం. 

26, నవంబర్ 2015, గురువారం

దైవం మానుష రూపేణ - జానీ శంకరీయం



నమస్సోమాయ చ రుద్రాయ చ తామ్రాయ చ అరుణాయ చ...

కార్తీక సోమవారం, సూర్యోదయం ఇంకా కాలేదు, తెలిమంచు దట్టంగా ఆవరించి ఉంది. పూజా మందిరంలో శ్రీరుద్ర పఠనం శ్రావ్యంగా జరుగుతోంది. సనాతమైన శివ పంచాయతనంలో స్ఫటిక లింగానికి విద్యాశంకర శర్మ గారు పవిత్రమైన గోదావరీ జలాలతో అభిషేకం చేస్తున్నారు. మహాన్యాసముతో తానే రుద్రునిగా మారి అభిషేచనం చేస్తున్నారు. నుదుట విభూతి రేఖలు, మల్లె పూవులా తెల్లని వస్త్రాలు, మెడలో రుద్రాక్షమాల ధరించి తన్మయత్వంతో రుద్ర విధిని సాగిస్తున్నారు. ఇల్లంతా శివమయమై ప్రకాశిస్తోంది.

"శంకరం! ఒరేయ్ శంకరం! అర్జెంటుగా బయటకు రా".. స్నేహితుడు జానీ పిలుపుతో. జానీ గొంతు విని వెంటనే లేచి బయటకు వెళ్లాడు శంకరం. "ఏమయ్యింది రా జానీ?" అని అడిగాడు. "ఆయేషా ఆయాసపడుతూ పడిపోయింది. ఎందుకో భయంగా ఉంది. త్వరగా కారు తీసుకొని బయలుదేరు". క్షణం ఆలోచించకుండా కారు తీసుకొని ఇద్దరూ జానీ ఇంటికి వెళ్లారు. ఆయాసపడుతున్న ఆయేషాను హుటాహుటిన పదిహేను కిలోమీటర్ల దూరాన ఉన్న రాజమండ్రి ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.

"సమయానికి తీసుకు వచ్చారు. వీరికి గుండెపోటు వచ్చింది. ఒక వారం తరువాత బైపాస్ సర్జరీ చేయాలి. ఈలోపు డబ్బు సమకూర్చుకోండి" అని డాక్టర్ చెప్పాడు. స్నేహితులిద్దరూ ఇంటి దారి పట్టారు. "జానీ! రేపు మధ్యాహ్నం ఇద్దరం రాజమండ్రి వెళ్లి నాకు మా నాన్న గారిచ్చిన అర ఎకరం పొలం అమ్మి డబ్బులు సిద్ధం చేసుకుందాం.." అన్నాడు. "ఒరేయ్! ఇంట్లో కామేశ్వరితో చర్చించకుండా హడావిడి నిర్ణయాలు తీసుకోవద్దు. నీకున్నది ఆ అర ఎకరం ఒక్కటే. తొందరపడకు. ప్రభుత్వాసుపత్రిలో ప్రయత్నిద్దాం అక్కడ ఉచితంగా చేస్తారు" అని చెప్పాడు. "జానీ! నా నిర్ణయం మారదు. ప్రభుత్వాసుపత్రిలో ఏమి జరుగుతుందో నాకు తెలుసు. అయేషా ప్రాణాలు కావాలనుకుంటే నేను చెప్పిన మాట విను" అని గట్టిగా చెప్పి కారు దిగి ఇంట్లోకి వెళ్లాడు.

"ఏవండీ! మీకు జానీ అన్నయ్యకు ఉన్న సాన్నిహిత్యం నాకు తెలుసు, కానీ తన్నుమాలిన ధర్మం పనికి రాదు కదా. మనకున్న ఏకైక ఆస్తి ఆ అర ఎకరం. అది కూడా పోతే పిల్ల పెళ్లి, మన వృద్ధాప్యం...." భార్య కామేశ్వరి మాట పూర్తి కాకుండానే "కామేశ్వరీ! జానీ కుటుంబం నాకు చేసిన సాయానికి నేను ఏమి చేసినా రుణం తీర్చుకోలేను" అని వివరాలు చెప్పాడు.

"జానీ నేను ఎనిమిదవ తరగతి నుండి డిగ్రీ పూర్తి అయ్యే వరకు ఒకే స్కూలు, కాలేజీలో చదువుకున్నాం. అప్పుడు 1991వ సంవత్సరం. నేను డిగ్రీ మొదటి సంవత్సరం. మా అమ్మ, నాన్న రాజమండ్రి నుండి మా ఊరు రావటానికి బస్సెక్కారు. బస్సు రాజమండ్రి పొలిమేర దాటగానే అదుపు తప్పి బోల్తా పడింది. రాత్రి సమయం, అప్పట్లో అంబులెన్సుల వసతి లేదు. ఫోన్లు అన్నిచోట్లా ఉండేవి కాదు. ఆ సమయంలో అక్కడికి దగ్గరలో ఉన్న దర్గాలో ప్రార్థనలు ముగించుకొని వస్తున్న జానీ, అతని తండ్రి ఈ బస్సు ప్రమాదం చూసి దగ్గరకు వచ్చి వెంటనే రోడ్డుపై వచ్చే వాహనాలలో గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించారు, కదలలేని వారికి జానీ తండ్రి ప్రథమ చికిత్స చేశారు. ఆయన హోమియోపతీ డాక్టర్. బాగా గాయపడ్డా అమ్మ, నాన్నలను ఆస్పత్రికి తరలించి, వారికి స్వయంగా తన రక్తం దానం చేసి ప్రాణాలు పోశారు.

ఆ తరువాత నేను ఊరికి వెళ్లినపుడు నాన్న గారు ఇలా చెప్పారు. "శంకరం! మన సనాతన ధర్మం చెప్పినట్లు ఈ ప్రపంచంలోని ప్రతి చరాచరములోనూ పరమాత్మ ఉన్నాడు. మన అదృష్టం బాగుండి ఈ పుణ్యాత్ముడు మనకు ఆ సమయంలో పరమాత్మ రూపుడై రావటం వలన ఈరోజు మేము బతికి ఉన్నాము. మనం చదువుకున్న శాస్త్రాల సారం మానవ ధర్మాన్ని పాటించి పరమాత్మను అంతటా చూడగలగటం. నమకంలో చెప్పినట్లు ఆ పరమ శివుడు అన్ని రూపాలలోనూ ఉన్నాడు. దీనికి నిరూపణ నాకు దక్కిన ఈ పునర్జన్మ. వారి మతం ఏదైనా ఇటువంటి వారికి ఎప్పటికి కృతజ్ఞులమై ఉందాము. ఎప్పటికీ వారిలాంటి మానవత్వమున్న మనుషులను నీ జీవితంలో సన్నిహితులుగా  ఉంచుకో. వారికోసం ఏదైనా చేయి. రెండో ఆలోచనే వద్దు".

ఆ మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. అప్పటినుండీ నేను జానీ అన్నదమ్ముల్లా జీవితంలో ప్రతి విషయంలో తోడునీడగా మెలుగుతున్నాము. మంచే మాకు మతము. నేను పాటించే మార్గం మన ఇంటి గోడలు దాటేంతవరకే. తరువాత విశ్వజనీనమైన శక్తిని ఇలాంటి వారిలో చూసి అనుభూతి చెందటం వరకే నా ఆలోచన."

"నిజమేనండీ...కానీ, వాళ్ల మతం మన మతాన్ని ద్వేషిస్తుంది, మన సాంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధమైన సాంప్రదాయాలను ప్రచారం చేస్తూ హింసను చాటుతుందనిపిస్తుంది..."

"కామేశ్వరీ! మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు అవి పుట్టిన దేశ కాలమాన పరిస్థితులను బట్టి. ఇస్లాం ఆరంభమైన ప్రాంతాలలో ఆ సమయంలో ఉన్న సమస్యలకు, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వారి ప్రాతిపదికలు రాసుండవచ్చు. అలాగే మనకు కూడా. ఆ రాజులు మన దేశంపై దండెత్తి అప్పటి మన ఆలయాల సంపదను చూసి ఓర్వలేక, ఇక్కడి మతాన్ని పాటించకుండా, వారి ధర్మాన్ని మనపై రుద్దాలనే దురుద్దేశంతో దారుణాలకు పాల్పడ్డారు. దాని వలన ఇస్లాం మతానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. అలాగే, మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత హిందూ ఐక్యతను ఛిద్రం చేయటానికి, మైనారిటీల పేరుతో ఓట్లు పొందటానికి రాజకీయ పార్టీలు ప్రజలను విభజించారు. దీనిని ఇస్లాం మత పెద్దలు, ఇస్లాం మతాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వారు ఖండించలేదు. దానితో హిందూ-ముస్లింల మధ్య ఒక పెద్ద అగాథం ఏర్పడింది. కానీ, మతానికి ప్రతిబింబం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం బాగున్నప్పుడు ఇక మతంతో పనేమిటి? ఇక ఆచారాలంటావా? హిందువులలో వేర్వేరు మార్గాలను పాటించేవారిలో వైరుధ్యాలు లేవా? కాబట్టి లోతుగా పరిశీలించటం నేర్చుకో. తప్పకుండా మన ధర్మాన్ని ప్రశ్నించే వారిని ఎదుర్కోవాలి, మన ధర్మం ఉనికికి హాని కలిగించే వాటిని తిప్పి కొట్టాలి. కానీ, మతం పేరుతో ప్రజలపై ద్వేషం పెంచుకోకూడదు..."

కామేశ్వరి మౌనంగా ఉండిపోయింది. శంకరం అర ఎకరం పొలం అమ్మటం, అయేషాకు ఆపరేషన్ జరిగి తిరిగి ఆరోగ్యవంతురాలు కావటం, శంకరం-జానీల స్నేహం మరింత వికసించి దృఢపడింది. కామేశ్వరి మనసులో అయ్యో ఉన్న ఆస్తి కాస్తా పోయిందే అన్న అసంతృప్తితో కూడిన కోపం అలానే ఉంది.

కాలచక్రం తిరిగింది. ఐదేళ్లు గడిచాయి. శంకరం-కామేశ్వరిల కూతురు కళ్యాణి పిఠాపురంలో డాక్టర్ ఉమర్ ఆలీ షా విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో తన డాక్టరేట్ పనిలో భాగంగా కొన్ని ప్రాచీన గ్రంథాలపై అధ్యయనం చేస్తోంది. కామేశ్వరి కూతురు దగ్గరకు వెళ్లింది. పీఠం చూసిన తరువాత కామేశ్వరి ఉమర్ ఆలీ షా గారి విశాల హృదయానికి, వారి ఆధ్యాత్మిక వికాసానికి ముగ్ధురాలైంది. తెలుగు భాషపై ఆలీషా గారికి గల మక్కువ, సనాతన ధర్మాన్ని గౌరవించే ఇస్లాం మతంలోని శాంతికాములైన గొప్పవారి వివరాలు తెలుసుకొని తన అజ్ఞానానికి చింతించింది. నాడు భర్త చెప్పిన విషయాలను మనసులో అవగతం చేసుకోగలిగింది.

కళ్యాణి, కామేశ్వరి తిరిగి గ్రామానికి కలిసి వస్తున్నప్పుడు తన ఇంటి దారి కాకుండ జానీ గారి ఇంటివైపు అడుగులు వేసింది. కామేశ్వరిని చూసి అయేషా, జానీ ఆశ్చర్య పడ్డారు. "అమ్మా! ఇంతవరకూ మా ఇంట మీరు అడుగు పెట్టలేదు. ఈరోజు రావటం ఎంతో సంతోషం. అల్లా మా ఇంటికి పార్వతీదేవిని పంపించినట్లుగా ఉంది..." అన్నారు.

కామేశ్వరి దగ్గరకు వచ్చి అయేషా చేతులు పట్టుకొని - "ఇన్నాళ్లూ నాలోని సందేహాలు తీరలేదు. అడుగు మీ ఇంటి వైపు పడలేదు. మనిషి వ్యక్తిత్వం నిర్మలమైతే ఇక మతానికి, కులానికీ, రంగుకు, రూపానికి అక్కడ తావు లేదు అన్నది నాకు పిఠాపురంలో అవగతమైంది. నేడు మీ ఇంటికి రావటం నా భాగ్యంగా భావిస్తున్నాను" అంది. కామేశ్వరిని, కళ్యాణిని ఇంట్లోకి సాదరంగా అహ్వానించారు అయేషా-జానీ దంపతులు. నిర్ఘాంతపోయింది కామేశ్వరి - ఎదురుగా వ్యాసం పీఠం పెట్టుకొని చక్కగా వేదమంత్రాలు వల్లిస్తున్న జానీ కొడుకు బాషా. స్పష్టమైన ఉచ్ఛారణతో "శన్నో మిత్ర శం వరుణః...శన్న ఇంద్రో బృహస్పతిః..." ఎంతో శ్రావ్యంగా ఆలపిస్తున్నాడు. తెల్లని లాల్చీ పైజమా, తలపై తెల్లని టొపీ, నల్లని గడ్డం, ముఖంలో ప్రశాంతత...రూపమేమో స్వచ్ఛమైన ముస్లిం, పలికేదేమో సుస్వర వేదమంత్రాలు..ఇరవై ఎనిమిదేళ్ళ బాషాలో దివ్యత్వం ఉట్టిపడుతోంది. చిన్నవాడైనా చేతులెత్తి నమస్కరించింది కామేశ్వరి.

కామేశ్వరిని చూసి చిరునవ్వుతో పలకరించి నమస్కరించాడు బాషా. "అమ్మా! మీరూ, చెల్లాయి కళ్యాణి మా ఇంటికి రావటం ఎంతో సంతోషం. నాకు వేద విద్యపై ఆసక్తికి కారణం శంకరం గారు. వారి ప్రోత్సాహంతో, మద్దతుతో సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని తెలుసుకునే అవకాశం కలిగింది" అని చెప్పాడు. మాటల్లోనే శంకరం అక్కడికి వచ్చాడు. కామేశ్వరి భర్తతో తన అవగతాన్ని వివరించింది. "కామేశ్వరీ - పిఠాపురంలో నివసించిన దత్తవతారులు శ్రీపాద శ్రీవల్లభులు అల్లా అర్థాన్ని వివరించారు. అల్లా అనే పదం అల్-అహ అనే రెండు పదాలనుండి ఆవిర్భవించింది. అల్ అనగా శక్తి అహ అనగా శక్తిని ధరించువాడు. అనగా పరమాత్మ. సనాతన ధర్మంలో ఇది శివపార్వతుల తత్త్వానికి పూర్తి సారూప్యత కలది. ఈ విషయాన్ని నేను బాషాతో ప్రస్తావించగా అతనిలో మన సాంప్రదాయం గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది. దాని ఫలితమే నీ ముందున్న వేదపండితుడైన బాషా..." అన్నాడు.

అందరూ హాయిగా తమలో వికసించిన ఆధ్యాత్మిక సుమాల పరిమళాలను కాసేపు పంచుకున్నారు. అల్లా లేదా శివశక్తి తత్త్వం ఆ ఇంట అంతటా నిండిపోయింది. అటు తరువాత అల్లాహో అక్బర్ అన్న మసీదు ప్రార్థనలు కామేశ్వరికి నమస్సోమాయ చ రుద్రాయ చ లాగానే మధురంగా, దివ్యంగా ధ్వనించాయి.

18, నవంబర్ 2015, బుధవారం

అమ్మ, నాన్న - స్వార్థపు అమెరికా పిల్లలు

(ఈ కథ సగటు తెలుగు తల్లిదండ్రుల పరిస్థితిని ప్రతిబింబింపజేసేది. చాలా మంది అమెరికాలో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎంతో బాధ్యతాయుతంగానే ఉంటున్నారు. లేని మిగితావారిని ఉద్దేశించినది మాత్రమే)


"అమ్మా! నేనే. పదహరో తారీఖున నా స్నేహితురాలు సుమ హైదరాబాదు వస్తోంది. దానితో రెండు మూడు రకాల పొడులు, నేను మొన్న వచ్చినప్పుడు వదిలేసి వెళ్లిన పట్టుచీరలు, పుల్లారెడ్డి స్వీట్స్ పంపించు. వాళ్లు సైదాబాదులో ఉంటారు. నాన్నను వెళ్లి ఇచ్చి రమ్మను. నేను వచ్చేటప్పుడు వాళ్ళకు బోలెడు వస్తువులు తెచ్చాను...."

మొదలయ్యింది పొద్దునే కృష్ణవేణికి కూతురు స్రవంతి నుండి ఈ "ఇండియా-అమెరికా"ల మధ్య సరఫరా చర్చలు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ప్రతి ఏడాది, రెండు మూడు సార్లు జరిగే తంతు ఇది.

"వేణీ! ఆలోచించు! తల్లికి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. కానీ, అది ఇలా ఉండకూడదే. ఏ వస్తువులు అవసరమో అనవసరమో, ఎక్కడ ఉన్నా అక్కడి సమాజంలో ఎలా కలిసిపోవాలో నేర్పాలి. మనం ఏం చేస్తున్నాం? వాళ్లకు మన జీవితాన్ని అందించాలన్న తపనలో తప్పటడుగులు వేస్తున్నాము"...అన్నాడు భర్త వేంకటేశ్వరరావు.

"చాల్లే ఊరుకోండీ! పిల్ల అంత దూరంలో ఉంది. ఒక అచ్చటా-ముచ్చటా లేదు. పాపం ఎంత కష్టపడుతోందో అక్కడ. ఇంత మాత్రం మనం భరించలేమా? కన్న తల్లిదండ్రులుగా..."

"వేణీ! ఖర్చులు నువ్వు లెక్క రాయవు. కానీ, నువ్వు చేసే సరఫరాతో మనం ఇంకో సంసారాన్ని పోషించవచ్చు"..

"మీరు మీ పిచ్చి మాటలు...ఆపండి".

రెండు వారాలకు తల్లికి స్రవంతి ఫోన్. "అమ్మా! నాకు రెండో నెల. నవంబర్ నెలాఖరులో డెలివరీ. నువ్వు నవంబర్ మధ్యకు వచ్చి మే మధ్య వరకు ఉండాలి. నేను చేసుకోలేను. మా అయన టికెట్ బుక్ చేస్తాడు. నాన్నను ఇన్ష్యూరెన్స్ తీసుకోమను. నువ్వు డాక్టర్ దగ్గర అన్ని పరీక్షలు చేయించుకొని, ఆరునెలలకు సరిపడా మందులు, నాకు, పుట్టబోయే బిడ్డకు హోమియో మందులు తీసుకు రావాలి. నాన్నకు టికెట్ పెట్టలేను. ఒక ఆరునెలలు ఆయనను చెల్లాయి దగ్గర ఉండమని చెప్పు". ...

ఒక పక్క కూతురు గర్భవతి అన్న సంతోషం, మరో పక్క కూతురు తమ ఇద్దరినీ కాకుండా తనను ఒక్కదానినే రమ్మని చెప్పటం, మాట్లాడిన పద్ధతి కృష్ణవేణి కాసేపు నలిగిపోయింది. తేరుకొని, "ఏవండీ, విన్నారుగా. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోండి నాకోసం"...

బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు కృష్ణవేణికి ఉన్న వ్యాధులు. మందులతో, ఎక్సర్సైజుతో కొంత అదుపులోనే ఉన్నాయి. పని ఎక్కువైతే మోకాళ్లు నొప్పులు వస్తాయి. పెద్ద కూతురు స్రవంతి అమెరికాలో. చిన్న కూతురు శ్రావణి హైదరబాదులో ఇటీవలే వివాహం అయ్యింది. ఆంధ్రాబ్యాంకులో పని చేసి స్రవంతి పెళ్లి కాగానే ఐదేళ్లముందే వాలటరీ రిటైర్మెంట్ తీసుకుంది కృష్ణవేణి. భర్త వేంకటేశ్వరరావు ఎస్బీఐలో సర్వీసు చేసి రిటైర్ అవ్వబోతున్నాడు. ఇద్దరి సర్వీసులో దాచుకున్న సొమ్ము, కృష్ణవేణి రిటైర్మెంట్ డబ్బుతో ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు. నిజం చెప్పాలంటే ఇంక పెద్దగా బ్యాంకులో డబ్బులు లేవు, నెల నెలా వచ్చే పింఛను తప్ప. ఇంటి అద్దె లాంటి ఖర్చులు లెవు కాబట్టి సంసారం పెద్ద ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. దంపతులిద్దరూ జాగ్రత్తపరులే.

"శ్రావణీ! అక్క అమెరికాకు నన్నొక్కదాన్నే రమ్మంటోంది. నాన్న ఒక్కరూ ఉండటం కష్టం, మంచిది కాదు. మరి నీ దగ్గర....".

"అమ్మా! నాకు అత్తగారితోనే సరిపొతోంది. ఆఫీసు, ఇల్లు, అత్త గారు...ఇంక నాన్న కూడానా...అందులో నాన్న అది కరెక్టు కాదు ఇది కరెక్టు కాదు అని కామెంట్స్ చేస్తుంటారు. ఈయనకు అవి ఇష్టం ఉండదు. సర్దిచెప్పే ఓపిక, సమయం నాకు లేదు. మీరే ఏదో ఒకటి చేసి నాన్నను కూడా అమెరికాకు తీసుకువెళ్ళండి...".

అవాక్కయ్యింది కృష్ణవేణి. "ఎంత కష్టపడి పెంచాము పిల్లల్ని? ఆడపిల్లలని లెక్క చేయకుండా వారికి కావలసినంత స్వేచ్ఛనిచ్చి, మంచి చదువులు చదివించి పెళ్లిళ్లు చేస్తే ఒక్క నిమిషంలో ఇద్దరూ ఇలా తమ సౌకర్యాన్ని, స్వార్థాన్ని వాళ్లు ఎలా చూసుకుంటున్నారు" అని నిర్ఘాంతపోయింది. భర్తకు విషయాలు తెలిస్తే నొచ్చుకుంటాడని అబద్ధమాడింది.

"ఏవండీ! మీరు రాకుండా నేను ఆరు నెలలు ఉండలేను. స్రవంతికి ఎన్ని డబ్బు ఇబ్బందులున్నాయో అల్లుడు ఏమంటున్నాడో! కాబట్టి నా గ్రాట్యూటీ డబ్బులు పెట్టి మీకు టికెట్ కొంటాను. ఇద్దరం కలిసే వెళదాము..."

"వేణీ! ఇలా ప్రతి దానికి మన రిటైర్మెంట్ డబ్బులు వాడితే ఇక మన వృద్ధాప్యానికి ఏమి మిగులుతాయి? నేను ఒక్కడినే ఉంటాను. శ్రావణిని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నాకు వంట వచ్చు, పనిమనిషి ఉంటుంది..."

"ఏవండీ! మీరు లేకుండా నేను ఒక్క వారం రోజులు కూడా ఇంతవరకు ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేదు. మీరు రావలసిందే. ఇది నా నిర్ణయం". లక్ష రూపాయలు గ్రాట్యూటీ నుండి ఈ టికెట్ కోసం స్వాహా...వేంకటేశ్వరరావు అయిష్టంగానే ఒప్పుకున్నాడు.

ప్రయాణానికి రెండు నెలల ముందు నుండి స్రవంతి ఫోన్లలో ఆర్డర్లు. అమ్మా ఆ ఘాగ్రా చోళీ, ఫలానా పట్టు చీరా, శ్రీవారికి ఫలానా కుర్తా పైజామా, రకరకాల పిండి వంటలు, ఖరీదైన ఇతర వస్తువులు..డబ్బు మాత్రం వేణి-వేంకటేశ్వరరావు దంపతుల జేబులోవే. దాదాపుగా ఈ దుబారా ఖర్చులు యాభైవేలకు పైగానే.

"సార్! అమెరికా ప్రయాణం అంటున్నారు కాబట్టి ఇద్దరూ ఎక్జిక్యూటివ్ మాష్టర్ హెల్త్ చెకప్ చేయించుకోండి. ఇవి కాకుండా గుండెకు, కిడ్నీలకు సంబంధించిన కొన్ని పరీక్షలు చేయాలి" ఈ దంపతుల ఫిజీషియన్ దాక్టర్  శ్రీధర్ సలహా. తప్పదు కదా అని బిల్లు కౌంటర్ దగ్గరకు వెళ్లి ఎంత అని అడిగారు. రెండు నిమిషాలలో టక టక కంప్యూటర్లో అన్నిటికీ లెక్కవేసి "మొత్తం పరీక్షలాకు 40 వేలు అవుతుందండీ! " అని బిల్లు చేసే వ్యక్తి చెప్పాడు. వేంకటేశ్వరరావుకు గుండె ఆగినంత పని అయ్యింది. ఎక్కడినుండి తేవాలి ఇంత డబ్బులు, ఎందుకింత ఖర్చు ఇప్పుడు....వెను దిరిగి ఇంటికి వెళ్లారు దంపతులు.

"అమ్మా స్రవంతీ! మా హెల్త్ చెకప్‌కు 40 వేలు అవుతుందిట. మేము ఏమీ చేయించుకోము. రోజూ వేసుకునే మందులే ఆర్నెలలకు తెచ్చుకుంటాము..చాలదా".

"నాన్నా! మీకు అర్థం కాదేంటి? ఇక్కడ ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే, ఇన్షూరెన్స్ కవరేజ్ లేకపోతే నా ఆస్తిపాస్తులు అమ్మి కట్టాలి. మీకున్న క్రానిక్ డిసీజెస్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల ఖర్చులు విజిటర్ ఇన్షూరెన్స్‌లో కవర్ అవ్వవు...మీరు పరీక్షలు చేయించుకుని మీ ముఖ్యమైన భాగాలు ఆరోగ్యంగా ఉన్నాయని తెల్చుకోవాల్సిందే..."

కూతురి కర్కశత్వం విని వేంకటేశ్వరరావు దిగులు పడ్డాడు. తన సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులతో ఇద్దరికీ పరీక్షలు చేయించారు. భగవంతుని దయ వలన ఏమీ పెద్ద ఇబ్బందులు లేవు. ఆరునెలలకు సరిపడా జలుబు, దగ్గు, జ్వరం, మోకాళ్ల నొప్పులు, విరేచనాలు, వాంతులు, తలనొప్పి వగైరా వగైరా సమస్త రోగాలకు అల్లోపతీ మందుల ఖర్చు పదిహేను వేలు. ఇవి కాక కూతురికి, పుట్టబోయే బిడ్డకు హోమియోపతీ మందుల ఖర్చు మరో ఐదువేలు...తడిసి మోపెడు. భార్యా భర్తలు ఈ అపరిమితమైన, అలవికాని ఖర్చులతో నీరసపడ్డారు.

ప్రయాణం వారం రెండురోజుల్లోకి వచ్చింది. విమానంలో ఎకానమీ క్లాసు టికెట్టుతో ఒక్కరికి నలభై ఆరు కేజీల బరువు మాత్రమే తీసుకు వెళ్లవచ్చు. దంపతుల బట్టలు, అప్పటికి కొన్న సామాను బరువు కలిపితే ఒక్కొక్కరికీ యాభై కేజీలు దాటాయి. తమకు కావలసిన వస్తువులను తీసేసి కూతురి ఆనందం కోసం,తమ ఆరోగ్యం కోసం అతి ముఖ్యమైనవి పెట్టుకుని అతి కష్టం మీద సూట్కేసుల బరువు సరి చేశారు. వెళ్లేముందు రోజు రాత్రి స్రవంతి అత్తగారినుండి ఫోన్. "వదినగారూ! నేను మర్చిపోయాను. మా వాడికి జీడిపప్పు పాకం చాలా ఇష్టం. రెండు కేజీలు అవి, వాడికి, అమ్మాయికి బట్టలు, అలాగే మా అమ్మాయి వస్తువులు కొన్ని ఇస్తాను..పట్టుకెళ్లండి". వియ్యపరాలు కావటంతో మొహమాటపడి అలాగే అంది కృష్ణవేణి.

"వేణీ! మన చెకిన్ లగేజీ నిండింది. ఎక్కడ పెడతావు ఇవి? ఏవండీ! హ్యాండ్ లగేజీలో పెట్టుకుందాం. బాగుండదు అల్లుడు, వియ్యాలవారు ఏమైనా అనుకుంటారు..." ఏడు కేజీల హ్యాండ్ లగేజీలో వియ్యాలవారి వస్తువులు పట్టించే సరికి అవి కూడా నిండాయి.

అన్నీ సర్దుకొని, ఇల్లు తాళం పెట్టి బయలుదేరారు దంపతులు. వాషింగ్టన్ విమానాశ్రయంలో స్రవంతి,అల్లుడు రిసీవ్ చేసుకున్నారు. బయటకు రాగానే కారు ఎక్కేలోపు ఒళ్లు గడ్డ కట్టుకుపోయేంత చలి. బ్రతుకు జీవుడా అని ప్రయాణపు అలసటతో ఇంటికి చేరారు. ఇక మొదలైంది వారికి నరకం.

స్రవంతి నిండు చూలాలు కావటంతో ఇంటిల్లిపాది వంట భారం వేణిపైనే పడింది. ఇవికాక రెండు పూటలా సింక్ నిండా అంట్లు, వారానికొకసారి ఇల్లు వాక్యూం క్లీనింగ్, బండెడు బట్టలు ఉతకటం...రోజంతా ఊపిరి పీల్చుకునే సమయం లేకుండా వేణి పగలు రాత్రి పని చేస్తోంది. మొదట్లో వేంకటేశ్వరరావు భార్యను పట్టించుకోలేదు. మెల్లమెల్లగా వేణిపై ఉన్న పనిభారం అర్థమయ్యింది. సహాయం చేయటం మొదలు పెట్టాడు. అంట్లు తోమటం, బట్టలు వాషర్ డ్రైయర్ లో వేయటం.....భారంగా రోజులు గడుస్తున్నాయి.

పిల్ల కానుపు అయ్యింది. బారసాల చేశారు. మొత్తం వంటా కృష్ణవేణే. దాదాపు యాభై మంది. ఆరోజు మొదలయ్యాయి ఆమెకు ఆరోగ్య సమస్యలు. విపరీతమైన మోకాళ్లనొప్పులు, మెడ, చేతుల నొప్పులు...గ్లాసు ఎత్త లేదు, అడుగు వేయలేదు. చంటి బిడ్డకు స్నానం చేయించాలి..కూతురికి సాయం చేయాలి..బండెడు పని ఇంట్లో. అతి కష్టం మీద ఎవ్వరికీ చెప్పకుండ ఒక నెల గడిపింది వేణి. తరువాత మెల్లగా స్రవంతికి చెప్పింది.

"స్రవంతీ! నాకు విపరీతమైన మెడనొప్పి, మోకాళ్లనొప్పులు వస్తున్నాయి. పెయిన్ కిల్లర్స్ పని చేయటం లేదు. ఇక్కడ ఎవరైన దాక్టర్..."

స్రవంతి "అమ్మా! నేను ముందే చెప్పాను. ఇండియాలో ఆరోగ్య సమస్యలకు ఇక్కడ డాక్టర్లు అక్కడిలా అందుబాట్లో ఉండరు. ఇక్కడ ఒక ఇండియన్ డాక్టర్ ఉన్నాడు. అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తాను. కానీ, నువ్వు హైదరబాద్ డాక్టరుకు ఫోన్ చేసి కనుక్కో ఏమైనా మందులు చెబితే తెప్పిస్తాను"....

"స్రవంతీ! అవన్నీ అయిపోయాయి. డాక్టర్ ఫోన్లో చెప్పలేను అని అంటున్నారు. నువ్వు ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకో..."

అతి కష్టం మీద మరో వారం తరువాత డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది. ఫీజు 100 డాలర్లు. ఇన్షూరెన్సులో కవర్ అవ్వదు. తెచ్చుకున్న డాలర్లలో 100 ఇచ్చింది వేణి. "స్రవంతీ! యువర్ మదర్ మే నీడ్ కంప్లీట్ రెస్ట్ ఫర్ అ వీక్. ఇఫ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ ద పెయిన్స్ డోంట్ రెడ్యూస్, వి నీడ్ టు డు ఎ స్కాన్ ఆఫ్ హర్ నెక్ అండ్ నీస్. దే విల్ కాస్ట్ టు  థౌసండ్ డాల్లర్స్.  ఇన్షూరెన్స్ డస్నాట్ కవర్ దీస్. ." స్రవంతికి గుండెలో రాయి పడింది. రెండు వేల డాలర్లా అని మారు మాట్లాడకుండా తల్లిని ఇంటికి తీసుకు వచ్చింది. ఒక వారం పాటు పని తనే చేసుకుంది. వేణి నొప్పులు తగ్గలేదు.

"నాన్నా! ఏం చేయను? రెండు వేల డాలరు పెట్టి పరీక్షలు చేయించే స్థోమత నాకు లేదు. మా ఆయన ఏవిటీ గోల అని విసుక్కుంటున్నారు. అమ్మ ఓర్చుకోవాల్సిందే. ఇంకా నాలుగు నెలలు ఉంది మీ ఆరు నెలలు పూర్తి అవ్వటానికి. నాకు బిడ్డ, మీ సాయం కావాలి..ఎలా"..

ఇంకో వారం చూద్దామని వేణి సర్ది చెప్పింది. నొప్పులు తగ్గక పోగా మానసిక వత్తిడితో, చలి విపరీతం కావటంతో, అసలు వ్యాయామం లేకుండా, బయటకు వెళ్లలేని మంచు కురిసే సమయంలో రోగం మరింగ తీవ్రమయ్యింది. వేణి పూర్తిగా మంచాన పడింది.

వేంకటేశ్వరరావు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. "అమ్మా స్రవంతీ! మీ అమ్మ ఇలానే ఉంటే చాలా కష్టం. మేము వెంటనే ఇండియా వెళ్లిపోతున్నాము. టికెట్ మార్పించుకున్నాము. రేపు ఆదివారం మా ప్రయాణం." అని తెగేసి చెప్పేశాడు. షాక్ తిన్నది స్రవంతి. అమ్మ పరిస్థితి చూసి ఏమీ అనలేకపోయింది.

మొహాలు నల్లగా పెట్టుకొని స్రవంతి, ఆమె భర్త వేణి దంపతులను ఇండియా విమానం ఎక్కించారు. రెండు రోజుల ముందునుండే ఇండియా అనగానే వేణిలో ఉత్సాహం మొదలయ్యింది. హైదరాబాదులో దిగారు. డాక్టరుకు చూపించుకున్నారు. స్పాండిలైటిస్, ఆర్థరైటిస్ చలికి, శారీరిక ఒత్తిడికి తీవ్రతరమయ్యాయని డాక్టర్ చెప్పాడు. తగిన వ్యాయామాలు, మందులు వాడి కుదుట పడటానికి ఒక రెండు నెలలు పట్టింది. పిల్లల సహాయం లేకుండానే మొత్తం భారాన్ని వేంకటేశ్వరరావు మోశాడు. భార్యను కంటికిరెప్పలా కాపాడుకున్నాడు.
ఆ రెండు నెలలూ వారిద్దరి మధ్య అమెరికాలో ఇంటికి బందీ అయ్యే జీవితం, ఆ చలి, పిల్లల స్వార్థంతో కూడిన నిస్సహాయత చర్చాంశాలు. భారతదేశం స్వర్గం అన్న భావన కలిగింది.

స్రవంతి నుండి తల్లికి ఫోన్ - "అమ్మా! మీరు ముందు వచ్చేశారని మా అత్తగారు బయలుదేరుతున్నారు అమెరికాకు. నాకు చాలా వస్తువులు కావాలి. మీరు కొని ఇవ్వండి..."

వేణి మనసు ఉగ్రమైంది. "స్రవంతీ! మా దగ్గర ఇంక వనరులు లేవు. మా సేవింగ్స్ అంతా ఖర్చైపోయాయి. మా జీవితం మొత్తం మీకోసం అన్నట్లుగానే బతికాం. ఇప్పటివరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఖర్చులు మేమే పెట్టుకున్నాము. కానీ, ఇక మా వల్ల కాదు. నీ ఆడంబరాలకు, నీకు నిరంతరం సప్లై చేయటానికి మా దగ్గర డబ్బులు లేవు. మీ ఆయనో నువ్వో మీ అత్తగారికి డబ్బులు పంపించి మీకు కావలసిన వస్తువులు తెప్పించుకోండి. మేము చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టము. అంతే కాదు, ఇక ముందు నీకు ఏది కావాలన్నా మీరు ఇండియా వచ్చినప్పుడు మీ డబ్బుతో కొనుక్కోండి. మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు నాకు చేతనైంది వండి పెడతాను. కానీ మీ గొంతెమ్మ కోర్కేలు తీర్చలేను. సారీ అమ్మా! ఈ విషయం మీ ఆయనకు కూడా చెప్పు".

స్రవంతి నోట మాట రాలేదు. ఫోన్ పెట్టేసింది. వేంకటేశ్వరరావు ఆశ్చర్యపోయాడు. "వేణీ! ఈ పనే రెండేళ్ల నాడు చేస్తే ఎంత బాగుండేది? మన చరమాంకానికి డబ్బులు మరింత మిగిలేవి. ఇప్పటికైన మించిపోయింది లేదు. నేను ప్రైవేట్ బ్యాంకులో కన్సల్టెంట్‌గా చేరతాను. నాకు ఓపిక ఉన్నన్నాళ్లూ చేస్తాను. మన ఇద్దరి వరకూ హాయిగా జరిగిపోతుంది. పిల్లల పెళ్లిళ్లు చేశాము చాలు. మన బాధ్యత అంతటితో ముగిసింది. ఇకనైనా వారికోసమే బతుకకుండా మన ఆనందం, మన స్వీయోద్ధరణకు సమయాన్ని వెచ్చిద్దాం. ఏమంటావ్?"

"అవునండీ! నాకు కూతుళ్లిద్దరూ కనివిప్పు కలిగించారు. పూర్తిగా తమ స్వార్థం కోసం నా వైపు నుండి మానవతా దృక్పథం కూడా చూపించలేదు. మీ మాటే నా మాట. మన ప్రతిక్షణం ఇక పూర్తిగా మన కోసమే సద్వినియోగం కావాలి. అలాగే చేసుకుందాం"

మరునాడు స్రవంతి ఫోన్ చేసింది. వేంకటేశ్వరరావు ఇలా చెప్పాడు - "చూడమ్మా! మా జీవితమంతా ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచాము. ఉద్యోగాలు, పెళ్లిళ్ల వరకే మా బాధ్యత. మీ పిల్లలు, మీ అమెరికా అవసరాల కోసం మా వైపు నుండి ఒక్క నిమిషం కూడా ఆలోచించ కుండా అక్కడి పరిస్థితులకు భయపడి, అక్కడ అడ్జెస్ట్ అవ్వకుండా, ఇక్కడి మా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోకుండా మీరు వ్యవరిస్తున్నారు. మీ పిల్లలు మీ బాధ్యత. మాది కాదు. మేము ఇప్పుడు సంపాదించే వయసు దాటి పోయాము. మీరు 25 ఏళ్లు దాటినా కూడా స్వావలంబన లేకపోవటం ఒకరకంగా మా పెంపకంలో లోపమే. మేము దీనిని సరిదిద్దాలని నిర్ణయించుకున్నాం. మీకు కష్టమైనా ఇదే సరైన నిర్ణయం. ఇకనైనా మా పరిస్థితులను అర్థం చేసుకొని మీ పనులు, మీ అవసరాలను మీరే పరిష్కరించుకోండి."

నెల తరువాత దంపతులిద్దరూ ఉత్తర భారత దేశ యాత్రకు ఒక ఇరవైమంది స్నేహితులతో కలిసి రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు. దానికోసం ప్రణాలికలు సిద్ధం చేయటంలో మునిగిపోయారు. 

6, నవంబర్ 2015, శుక్రవారం

విధాత తలపున ప్రభవించినది - సిరివెన్నెల హృదయకమల వికాసం


విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం - ఓం
ప్రాణ నాడులకు స్పందననొసగిన ఆది ప్రణవ నాదం- ఓం
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం

సరసస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

ప్రాగ్దిశ (ప్రాకృత) వీణియపైన దినకర మయూఖ తంత్రుల పైన
జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల స్వనముల స్వర గతి జగతికి శ్రీకారము కాగా
విశ్వకావ్యమునకది భాష్యముగ

విరించినై ...

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాదతరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే

విరించినై ...

నా ఉచ్చ్వాసం కవనం
నా నిశ్వాసం గానం
సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం



కొన్ని గీతాలు ఆ కవి హృదయాన్ని ఆవిష్కరించటంతో పాటు భాషకే వన్నె తెస్తాయి. అజరామరమవుతాయి. అలాంటి ఓ గీతం సిరివెన్నెల చిత్రంలోని సరసస్వర సుర ఝరీ గమనమౌ అనే సీతారామశాస్త్రి గారి గీతం. గీతం యొక్క రూపం కవి యొక్క హృదయం. సంగీతానికి అర్థం తెలిపిన గీతం ఇది. సృష్టిలో మొట్టమొదటి శబ్దం ఓం. ఇది ఎలా ఉద్భవించింది? బ్రహ్మ తలపులలో ఉద్భవించినది. విశ్వానికి మూలం ఓం అని దీని అర్థం. నాడులన్నిటికీ స్పందనను ఇచ్చిన తొలి శబ్దం ఓం కారము. ప్రణవంగా చెప్పబడినది ఈ ఓంకారము. అంటే నిరంతరం ప్రస్తుతించబడేది అని అర్థం. విశ్వమంతటా ఓంకార నాదం నిరంతరం  వస్తూనే ఉంటుంది. వినేంత నిర్మలత్వం పెంచుకుంటే అది వినిపిస్తుంది. ఈ నాదం విశ్వరూపమై కనులనే కొలనులో ప్రతిబింబిస్తే, గుండెలోతులలో ప్రతిధ్వనించిన బ్రహ్మదేవుని వీణా గానమే ఈ సంగీతం. మంచిరసాలతో నిండిన స్వరాలు గంగాప్రవాహంలా సాగే అవతరించిన సంగీతం సామవేదము యొక్క సారము. ఈ రసహృదయుడు పాడిన గీతం జీవన గీతం. తానే బ్రహ్మయై గీతాన్ని రచించి వీణయై దానిని వినిపించాడు కవి. తూరుపు దిక్కనే వీణపై, సూర్యుని కిరణాలనే తంత్రులపై, మేలుకొన్న పక్షుల రవములు నీలి ఆకాశమనే వేదికపైన పలికిన కిలకిల స్వరములే స్వరజతులై ఈ జగత్తుకు శ్రీకారాము కాగా, విశ్వమనే కావ్యమునకు ఈ గీతం భాష్యముగా కవి హృదయం తానే బ్రహ్మగా ఆవిష్కరించింది. జన్మించే ప్రతి శిశువు పలికే జీవితం యొక్క అద్భుతమైన నాద తరంగాలు, చైతన్యము పొందటం ద్వారా కలిగిన స్పందనల వలన ఆ హృదయ ధ్వనులు మృదంగ నాదంగా, ఆది అంతములులేని రాగము, ఆది తాళములో, అనంతమైన జీవన వాహినిగా సాగిన సృష్టి లీల కవి బ్రహ్మ కలమున జాలువారింది, గాయకుని నోట పలికింది. ఆ గీతం ఉచ్ఛ్వాస అయితే గానం నిశ్శ్వాస అయ్యింది.

సృష్టి ఆద్యంతమూ నాదప్రవాహం ఏయే రూపాలలో మనకు ఆవిష్కరిస్తుందో ఇంత కన్నా అందంగా, పవిత్రంగా మనకు ఎవ్వరూ తెలియజేయలేరు అంటే అతిశయోక్తి కాదు. ఏ వాగ్గేయకారుడి అనుభూతికీ ఇది తక్కువ కాదు. ఎందుకంటే ఈ గీతం అనంతమైన విశ్వము, పరమాత్మ లీలలు, నిరంతర ప్రవాహంగా సాగే నాదానుసంధానాలకు సంబంధించింది. వేటూరి గారు ఈ నాదప్రవాహాన్ని శంకర గళనిగళము, శ్రీహరి పదకమలము అన్నారు. అది కూడా ఇటువంటీ అనుభూతి జనితమైన భావనే. సృష్టి స్థిలయములలో జీవరాశికి కలిగే స్పందనలు, ఆ సృష్టిలీలలో ప్రకృతిలో కలిగే ఉదయాస్తమయాలు, ప్రకృతికి స్పందించే జీవకోటి భావవ్యక్తీకరణలు...అన్నీ ఆ నాదోద్భవములే. వీటికి ఓంకారం ఆది. ఆ ఓంకారంతో అనుసంధానమయినదే సామవేదం. దాని సారమే సంగీతము. ఈ భావనను దివ్యంగా అందించే గీతంలో కవి హృదయాన్ని ఆవిష్కరించే పాత్ర అంధుడిది. అంధుడైనంత మాత్రాన భావనలు, విశ్వవిలాసపు రసాస్వాదన ఉండదు అనుకోవటం చాలా తప్పు. దృష్టి లేకపోతేనేమి? అంతర్ముఖుడైన కళాకారుడు తాదాత్మ్యతతో అన్నిటినీ అనుభూతి చెంది ఆలపించే గీతం ఇంత అందంగానే ఉంటుంది.

భావానికి ఔన్నత్యం కర్మేంద్రియముల స్థాయిని దాటి జ్ఞానేంద్రియముల ద్వారా చూడగలిగినప్పుడు. ఆ భావనకు భాష, సంగీతం తల్లిదండ్రులు. సీతారామశాస్త్రిగారి ఈ గీతం ఆయన పొందిన దివ్యానుభూతికి పతాకస్థాయి. నాదప్రవాహం ఓంకారమునుండి పుట్టి సృష్టిలోని అణువణువులోనూ భాగమైనందువల్లే దానికి దివ్యత్వం కలిగింది. నాదాన్ని శరీరమంతా నిరంతరం కలిగియున్నవాడు శివుడని త్యాగరాజస్వామి కొలిస్తే సృష్టి చేస్తూ విపంచిపై బ్రహ్మ అనుభూతి చెందాడు అని సీతారామశాస్త్రిగారు మనకు మనోజ్ఞంగా చెప్పారు.  సామసంగీత రాయ అని అన్నమచార్యుల వారు శ్రీవేంకటేశ్వరుని కొలిచితే ఇక్కడ ప్రకృతితో తల్లీనమైన పరమాత్మ వ్యక్తీకరణగా మనకు సీతారామశాస్త్రిగారు వివరించారు.

ఇక భాషా సంపదకు వస్తే ఈ గీతం తెలుగు భాషకే మరో మారు ప్రాణం పోసింది. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల, నడుము, బొడ్డు, ముద్దు వంటి పదాలతో బూతు సాహిత్యం కల్తీ సారాలాగా తెలుగు చిత్రసీమలో పారుతున్న సమయంలో మనకు విశ్వనాథ్ గారు దివ్యౌషధమైన సంగీత సాహిత్య ప్రచోదనమైన చిత్రాలను అందించి భాషకు, సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రాణం పోశారు. వారి దివ్యదృష్టికి సీతారామశాస్త్రిగారి దివ్యానుభూతి తోడైతే ఇక తెలుగుదనానికి తక్కువేమిటి? సాహిత్యంలోని ప్రతి అక్షరం కూడా పరమాత్మ తత్త్వాన్ని ఆవిష్కరించేదే. విధాత తలపు, అనాది జీవన వేదం, ఆది ప్రణవ నాదం, విశ్వరూప విన్యాసం, విరించి విపంచి గానం, సరసస్వర సురఝరీ గమనము, సామవేద సారం, ప్రాగ్దిశ వీణ, దినకర మయూఖ తంత్రులు, జాగృత విహంగ తతులు, వినీల గగనము, జగతికి శ్రీకారము, విశ్వకావ్యమునకు భాష్యం, జీవన నాద తరంగం, హృదయ మృదంగ ధ్వానం, అనాది రాగం, అనంత జీవన వాహిని, సృష్టివిలాసం, ఉచ్ఛ్వాస, నిశ్శ్వాస ఇలా ప్రతి ఒక్క అక్షరం కూడా చైతన్యపూరితమై, ప్రాకృతికమై మనసును తాకినవే.

సంగీతం గురించి ఏమి చెప్పను? కేవీ మహదేవన్ గారు స్వయంగా సామగానాన్ని అందించారేమో అనిపిస్తుంది. హరిప్రసాద్ చౌరాసియా గారి అద్భుతమైన వేణువాద్యం ఈ గీత సాహిత్యానికి ఎంతో వన్నె తెచ్చింది. అవ్యక్తానుభూతిని కలిగించేది వేణువాదనం. దానికి మూర్తీభవించిన ప్రతిభ చౌరాసియా గారిది. భావానికి గాయకుడి గళం జీవం. బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీలమ్మ గారు ఈ పాటలోని సాహిత్యానికి అమృతత్వం ఇచ్చారు. ముఖ్యంగా బాలుగారు పల్లవిలోను, పాటచివరి సాహిత్యంలోనూ కనబరచిన మాధుర్యం న భూతో న భవిష్యతి. ఇది వారి నేపథ్య గాయక జీవితంలో కలికితురాయి.

ఓంకారానికి సనాతన ధర్మంలో గల ప్రాధాన్యతను సాహిత్యం, సంగీతం, గాత్రంలో పరిపూర్ణంగా ప్రతిబింబించిన ఈ గీతం సిరివెన్నెల చిత్రానికే కాదు భారత దేశ సినీ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ గీతానికి సీతారామశాస్త్రిగారికి ఉత్తమ గేయరచయితగా, బాలుగారికి ఉత్తమ గయాకునిగా జాతీయ అవార్డులు రావటం వారి ప్రతిభకు, రసావిష్కరణకు సార్థకత.

ఎన్ని మార్లు విన్నా ఈ గీతం మరింత మధురంగా అనిపిస్తుంది.దివ్యత్వాన్ని కురిపిస్తూనే ఉంటుంది. 

29, అక్టోబర్ 2015, గురువారం

సాయీశ్వర నీ పదముల సన్నిధి నే చేరినాను



సాయీశ్వర నీ పదముల సన్నిధి నే చేరినాను 
సదానంద వార్నిధిలో సదా డోలలూగినాను

హరే రామ హరే కృష్ణ హరే సాయి హరే హరే 
భజే సాయి శాంతిదాయి సత్యసాయి హరే హరే

మనసులోన భక్తిసుధా మధురిమలే నిలిపినాను 
కనులలోన కాంతి ప్రభా కవిత జ్యోతి నిలిపినాను
ఆరాధన పూర్వకముగ అనవరతము కొలిచినాను
తనివారగ దరిశించి తరియించెద స్వామి నేడు

హృదయ పథములో నిరతము పదయుగమును నిలిపినాను
భావవీథిలో సతతము సేవసేయ తలచినాను
ఆవేదన పొంగగ నను ఆదుకొనగ వేడినాను
పరమాద్భుత మహిమాన్విత కరుణ కోరినాను నేడు

త్రేతాయుగమందు వెలయు సీతాపతి నీవుకదా
ద్వాపరమ్ములోన వెలుగు గోపాలుడు నీవు కదా
ఈ కలికాలమున అవతరించిన సాయీవి కదా
పర్తివాస పరమపురుష పరమాద్భుత నీవె కదా

ఆశ్రిత జన కోటికెల్ల అభయమొసగు దాత నీవు
నామకీర్తన మురియు నారాయణమూర్తి నీవు
లీలా మానుష దేహుడు బోళా శంకరుడు నీవు
త్రిమూర్త్యాత్మ రూపుడవు దీనబాంధవుడవు నీవు



గురువు సనాతన ధర్మంలోని అతిముఖ్యమైన కోణం. అదే దీని విశిష్టత. సాధకుడు అడవిలో దిక్సూచి/పటం లేకుండా వెదికే యాత్రికుడైతే గురువు ఆతనికి దిక్సూచి/పటం చూపించి మార్గనిర్దేశకం చేసేవాడు. చీకటిలో వెలుగును చూపే జ్ఞానజ్యోతి. కారడవిలో తప్పిపోయిన వ్యక్తికి లాంతరుతో వచ్చి దారిచూపేవాడు గురువు. అలా సద్గురువుగా వచ్చిన దత్తావతారుడు షిర్డీ సాయి. ఆయన సమాధి తరువాత 8 ఏళ్లకు తదుపరి అవతారంగా పుట్టపర్తిలో జన్మించారు సత్యసాయిబాబా. ఒకరా ఇద్దరా? ఒక ఊరా ఒక జిల్లానా? దేశదేశాలలో కోట్లాది మందికి ఆరాధ్యదైవమైనారు. ప్రేమ, సేవలకు ప్రతిరూపమై నిలిచారు. సత్యసాయి భక్తులలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలు, సమాజం పట్ల సేవా తత్పరత. ఆ సత్యసాయిబాబా గురించి సాయికృష్ణ యాచేంద్ర గారు ఎంతో ఆరాధనా భావంతో ఈ గీతాన్ని రచించారు.

ఒక మహనీయునితో అనుబంధం వారి పట్ల ఎంతటి ఉత్తమమైన భావవీచికలను కలిగిస్తుందన్నదానికి ఈ గీతం మంచి ఉదాహరణ. సమస్త దేవతలను సాయిలోనే చూశారు రచయిత. భక్తికి ప్రతిస్పందన భావం సౌందర్యం. భావం రచయిత అంతఃకరణాన్ని సూచిస్తుంది. ఈ గీతంలో సాయికృష్ణ గారు తన సాయి భక్తి ఔన్నత్యాన్ని చాటారు.

నమ్మిన దైవం పాదాల వద్దకు చేరితే అది శాశ్వతానందమనే సముద్రమే కదా? సాయి పదముల వద్దకు చేరినపుడు ఆనందసాగరంలో తేలియాడుతున్నట్లు రచయిత అనుభూతి చెందారు. సాయినే రామునిగా కృష్ణునిగా నుతించారు. శాంతి ప్రదాతగా సత్యసాయిని ప్రస్తుతించారు. మనసులో భక్తిని, కనులలో కాంతులను నిలుపుకొని ఎల్లప్పుడూ ఆయనను కొలిచిన భక్తుడు తనివితీరా దర్శించి తరియించే తరుణంలో ఈ గీతం వెల్లువై పొంగింది. హృదయములో స్వామి పాదాలను నిలిపి, నిరంతర సేవా తత్పరతను భావములో నిలిపి, అవేదన పొంగగా, ఆదుకోమని వేడుకొంటూ, పరమాద్భుతమైన మహిమ కల, కరుణామయుడైన సాయిని ప్రస్తుతించే  భావం సుమం ఈ గీతం. రాముడిగా, కృష్ణుడిగా అవతరించ పరమాత్మ ఈ కలికాలంలో పుట్టపర్తిలో సాయిగా వెలసినాడని, ఆ సాయిని పరమాద్భుతమైన పరమపురుషునిగా నుతిస్తుంది ఈ గీతం. తనను ఆశ్రయించిన వారిని ఆదుకునే దాతగా, నామకీర్తనలో నిరంతరం మురిసే నారాయణునిగా, తన లీలగా మనిషి రూపాన్ని ధరించిన శివునిగా, త్రిమూర్తుల రూపంగా, దీనులకు బంధువుగా కీర్తించే గీతం ఇది.

ఒక మహనీయుడిని, అవతార పురుషుడిని ఇంత భావసంపదతో నుతించే గీతాలు చాలా అరుదు. సాయి కృష్ణ యాచేంద్ర గారు ఇటువంటి గీతాలు ఎన్నో రాశారు. సాయి భక్తి పూర్తిగా ఒంటబట్టితే తప్ప ఇలాంటి గీతాలు ప్రకటితం కావు. శరణాగతి, భక్తి, నమ్మకం, ఆనందం అన్నీ కలిస్తేనే గుణవైభవ వర్ణన సరైన పదాలతో ముత్యాల వరుసలా ఆవిష్కరించబడేది. సాయి భక్తులలో ఇటువంటి లోతైన భావనలకు కారణం వారికి స్వామితో గల వ్యక్తిగత అనుభూతులు. స్వామి కొందరికి రోగాలను నయం చేస్తే, కొందరికి సన్మార్గం చూపించారు. కొందరికి ప్రేమతో సాంత్వన కలిగిస్తే కొందరికో వ్యంగ్యంతో అహంకారాన్ని అణచారు. నీరులేని ఎడారి గ్రామాలకు నీటిని అందించి దీనబంధువైనారు. విలువలతో కూడిన విద్యను అందించి బ్రహ్మజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేశారు. ఉచితవైద్యం అందించి పేదలకు ప్రాణాలు పోశారు. ఇవన్నీ అద్భుతాలే. కేవలం స్వామి సంకల్పంతో, శక్తితో జరిగిన పనులే. గురువుగా, దైవంగా, తల్లిగా, తండ్రిగా వేర్వేరు పాత్రలను పోషించి స్వామి తన భక్తులకు సర్వం అయినారు. అందుకే వారికి స్వామిపై అంత ఆరాధనా భావం. అటువంటి భావంతోనే సాయికృష్ణ గారు ఈ గీతాన్ని రచించారు. అందుకే మహత్తరంగా ప్రచోదనమైంది.

సత్యసాయి అనగానే గుర్తుకు వచ్చేది ఆయన ప్రేమ, కరుణ, వాత్సల్యం, ఆయన స్థాపించిన సంస్థలలో సేవాతత్పరత, భజనలు, క్రమశిక్షణ, వినమ్రత. ఇవన్నీ ఈ గీతంలో మనకు పుష్కలంగా గోచరిస్తాయి. స్వామి యొక్క అత్యద్భుతమైన లీలగా నాకు అనిపించేది ఆయన శిష్యకోటి. ప్రపంచవ్యాప్తంగా సాయి సిద్ధి పొందిన నాలుగేళ్ల తరువాత కూడా కార్యక్రమాలు స్వామి ఉన్నప్పుడు ఎలా జరిగాయో అలాగే జరుగుతున్నాయి. మీడియా ఎంత బురద జల్ల ప్రయత్నించినా, ఎన్ని వ్యతిరేక శక్తులు దాడులు చేసినా, సంఘటితమైన శిష్యగణం స్వామి ఆరంభించిన అద్భుతమైన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తునే ఉన్నారు. కులమతాలకు అతీతంగా లక్షలమంది వాలంటీర్లు ఈ సేవలో తరిస్తునే ఉన్నారు. ఒక వ్యక్తి ప్రపంచాన్ని సైతం మార్చగలడు అన్నదానికి  మనకళ్లముందటి సత్య సాయి అవతారమే ప్రమాణం. సాయికృష్ణ యాచేంద్ర గారి గీతం వీటన్నిటికీ సాక్షి.

ఈ గీతాన్ని షణ్ముఖ ప్రియ, హరిప్రియ గార్ల గానంలో వినండి.

24, అక్టోబర్ 2015, శనివారం

పాయోజి మైనే - మీరా భజన్



ఇక్ష్వాకు వంశార్ణవ జాత రత్నం
సీతాంగనా జీవన భాగ్య రత్నం
వైకుంఠ రత్నం మమ భాగ్య రత్నం
శ్రీరామ రత్నం శిరసా నమామి

- శ్రీరామకర్ణామృతం

పాయోజి మైనే రాం రతన్ ధన్ పాయో

వస్తు అమోలిక్ దీ మేరే సద్గురు కిర్పా కర్ అప్నాయో పాయోజి మైనే

జనం జనం కీ పూంజీ పాయీ జగ్ మే సభీ ఖోవాయో పాయోజి మైనే

ఖర్చై న ఖోటై చోర్ న లూటై దిన్ దిన్ బఢత్ సవాయో పాయోజి మైనే

సత్ కి నావ్ ఖేవటియా సద్గురు భవ్ సాగర్ తర్వాయో పాయోజి మైనే

మీరా కే ప్రభు గిరిధర్ నాగర్ హరఖ్ హరఖ్ జస్ గాయో పాయోజి మైనే

- మీరాబాయి 

భావం:

సజ్జనులారా! నేను నామమనే రత్నాన్ని (రామనామము) ధనంగా పొందాను. ఈ అమూల్యమైన బహుమతిని నాకు సద్గురువులిచ్చారు. నేను కృతజ్ఞతతో స్వీకరించాను. ప్రాపంచిక వస్తువిషయాలన్నీ కోల్పోయినా, ఎన్నెన్నో జన్మల పుణ్యానికి లభించే ఈ రామనామమనే సంపదను ఈ జన్మలోనే పొందాను. ఏ దొంగా దొంగిలించలేనిది ఈ సంపద. ఎంత ఖర్చుపెట్టినా మరింత పెరిగే ఈ రామనామమనే సంపదను పొందాను. సత్యమనే నావలో సద్గురువుల అనుగ్రహంతో భవసాగరాన్ని దాటాను. మీరాకు ప్రభువైన ఆ గిరిధరుని కీర్తిని హర్షముతో గానము చేస్తున్నాను.

వివరణ:

మధురభక్తికి మరో పేరు మీరాబాయి. 16వ శతాబ్దానికి చెందిన ఈ భక్తురాలు ఎన్నో కఠిన పరీక్షలను, సామాజిక వివక్షను ఓర్చి తన కృష్ణభక్తిని చాటింది. ఆమె భక్తి విషాన్ని కూడా భగవతుని రూపంగా మార్చివేసింది. ప్రస్తుతపు రాజస్థాన్‌లో జన్మించి ద్వారకలో స్వామిలో ఐక్యమైన ఈ భక్తురాలు తన భావాలను అద్భుతమైన పదాలుగా అందించింది. భారతదేశపు భక్తి సంగీతంలో మీరా రచనలు ఉత్తమ భజనలుగా శాశ్వతమైనాయి. మధురభక్తిలో తనను తానే స్వామిని సమర్పించుకొని స్వామితో రమించే భావజాలం ఎందరో మహానుభావులు తమ సాహిత్యంలో కనబరచారు. అన్నమాచార్యులు, క్షేత్రయ్య, గోదా, మీరా వీరిలో ప్రముఖులు. భగవంతునికే అంకితం అయిన మీరా భజనల్లో భక్తి సువాసనలు పుష్కలం. అటువంటిదే ఈ పాయోజి మైనే రాం రతన్ ధన్ పాయో. వ్రజ భాషలో మీరా రచనలు చేసింది. అది హిందీ భాషకు చాలా దగ్గరగా ఉంటుంది. వ్రజ, అవధ్ అనేవి రెండు ద్వాపర యుగం నుండి శ్రీకృష్ణుడు తిరిగిన ప్రాంతాలలో ప్రజల భాషలు. వీటినుండే హిందీ జన్మించింది. ఈ వ్రజ భాషకు దేవనాగరి లిపి. ఇప్పటికీ రాజస్థాన్, హర్యాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో వ్రజ భాషా మాట్లాడుతారు.



ఈ భజనలో మీరా రామనామమనే సంపద వలన తనకు కలిగిన అనుభవాలను, అనుభూతులను అద్భుతంగా నుతించారు. అసలు రామనామమెంత అమూల్యమైనదో, అది సద్గురువుల అనుగ్రహం వలన తనకు లభించిన సంపదగా ఆమె అభివర్ణించారు. తనకున్న సంపదలన్నీ పోయినా ఎన్నో జన్మలెత్తినా కూడా లభించని  రామనామమనే సంపదను గురువులు రవిదాసు గారు ఆమెకు అందించారని కొనియాడారు. దొంగలు దోచుకోలేనిది, ఎంత పంచితే అంత విలువ పెరిగేదిట రామనామ సంపద. నిజమే కదా? మనకు తెలిసిన తారక మంత్రము ఎంత మందికి అందితే దాని విలువ మరింత పెరుగుతునే ఉంది. ఎందరో మహానుభావులు ఈ రామనామంతో జనన మరణాల వలన కలిగే కష్టాలను, దుఃఖాన్ని అధిగమించి మోక్షం పొందారు. ఈ ప్రపంచంలో ఒక్కటే సత్యం. అదే భగవంతుడు. సంసారమనే దుర్భరమైన సాగరాన్ని సత్యమనే నావలో గురువులు నన్ను దాటించారు అని ఎంతో భావగర్భితంగా మీరాబాయి స్తుతించారు. రాముని నామం రుచి తెలిసిన వారికి వేరేదీ రుచించదు. దానినే స్మరిస్తూ అందులోనే తరించారు. అదే విధంగా మీరా కూడా తాను నమ్ముకున్న దైవాన్ని స్మరిస్తూ భగవంతునిలో లీనమైంది. నేను అన్న భావన వదిలి, దేహం యొక్క వాసనలను త్యజించి జీవాత్మను శుద్ధి చేస్తే అదే పరమాత్మ రూపం అని తెలిసి ముక్తిని మహానుభావులలో మీరా అగ్రగణ్యురాలు. ఈ కర్మభూమిలో మీరాబాయికి గల స్థానం పవిత్రమైనది, ఉన్నతమైనది.

లతా మంగేష్కర్ గారి గళంలో ఈ భజన వినండి.

22, అక్టోబర్ 2015, గురువారం

జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి


జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి

అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్న అమ్మవు నీవే
నీ చరణములే నమ్మితినమ్మ
శరణము కోరితినమ్మా భవాని

నీదరినున్న తొలగు భయాలు
నీ దయలున్న కలుగు జయాలు
నిరతము మాకు నీడగ నిలచి
జయమునీయవే అమ్మాభవాని

చలనచిత్రాలు ఎంత ప్రభావవంతమైన మాధ్యమాలో తెలుగు సినీ చరిత్రలోని స్వర్ణయుగాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. అప్పట్లో ప్రతి చలన చిత్రంలోనూ ఒక భక్తిగీతం ఉండేది. తప్పకుండా సామాజిక స్పృహ ఉండేది. పాత్రలలో పవిత్రత ఉండేది. నర్తనశాల పౌరాణిక చలనచిత్రమైనా అందులో ద్రౌపది పాత్రకు భక్తిగీతాన్ని పొందుపరచాల్సిన అవసరం దర్శకునికి నిజంగా లేదు. కానీ, ఆ గీతం చిత్రానికి వన్నె తెచ్చింది. సావిత్రి గారి సినీయాత్రలో అది ఒక కలికితురాయిలా నిలిచింది.

భక్తి సంగీతం అంటే కేవలం వాగ్గేయకారుల కృతులే కాదూ, తాము కూడా ఏమీ తీసిపోము అన్నరీతిలో అప్పటి సినీ గేయ రచయితలు గీతాలు రాసేవారు. అటువంటిదే నర్తనశాల చిత్రంలోని జననీ శివకామిని అన్న గీతం. ఈ పాటను పరిశీలిద్దాం.

పాండవులు అరణ్యవాసం పూర్తై అజ్ఞాతవాసానికి విరాటరాజు కొలువులో మారువేషాలలో ఉండాలని నిర్ణయించుకొన్న తరువాత సైరంధ్రిగా పాంచాలి విరాటరాజు భార్య సుధేష్ణాదేవి వద్దకు వెళ్లే సందర్భంలో ఈ గీతాన్ని దర్శకులు పొందుపరచారు. దర్శకుల ప్రతిభ ఇలాంటి సందర్భాలలోనే తెలుస్తుంది. అప్పుడు ద్రౌపది మానసిక పరిస్థితి ఏమిటి? తమ అజ్ఞాతవాసం భంగమైతే మళ్లీ వనవాసం మొదలు. తనకు జరిగిన పరాభావానికి బదులు ఉండదు. భర్తలకు గౌరవం, రాజ్యం తిరిగిరాదు. ఇలా పరిపరి విధాల తలపులలో ఉన్న ద్రౌపదికి అమ్మవారి మందిరం కనిపిస్తుంది. ఆ అమ్మను ప్రార్థించే సన్నివేశంలోని గీతం ఇది.

మహాభారతంలోని విరాటపర్వం మొదలులో ధర్మరాజు తమ అజ్ఞాతవాస విజయానికి దుర్గాదేవిని కొలుస్తాడు. ఎంతో మహిమగల స్తోత్రం అంది. అలాగే ద్రౌపది అమ్మవారిని కొలిచినట్లు కూడా ఉంది. ఇక నర్తనశాల చిత్రానికి వస్తే, ఇది విరాటపర్వ నేపథ్యం.

ఈ గీతంలో రచయిత సముద్రాల రాఘవాచార్యులవారు భక్తిని, ఆర్తిని, శరణాగతిని సులభమైన పదాలలో తెలియజేశారు. శివకామిని అన్నపదం చిదంబరంలో శివుని రాణి అయిన శివకామసుందరినుండి వచ్చింది. ఆ అమ్మ ఎటువంటిది? జయమును, శుభమును కలిగించేది, విజయాని రూపం ఆ తల్లి. ఆ అమ్మ సకలలోకాలకు తల్లి. అమ్మలను గన్న అమ్మ. అటువంటి తల్లి పాదాలను నమ్మి శరణు కోరుతున్నాను అని పాంచాలి ప్రార్థిస్తుంది. ఆ అమ్మ దగ్గర ఉంటే భయాలు తొలగిపోతాయి. ఆ అమ్మ దయ ఉంటే జయాలు కలుగుతాయి. మాకు ఎల్లప్పుడూ నీడగా నిలిచి జయాన్ని ప్రసాదించు తల్లీ భావనీ అని వేడుకుంటుంది.

ఎంతటి శక్తిసంపన్నులైనా, ధర్మపరాయణులైనా పాండవులకు కష్టాలు తప్పలేదు. కానీ, వారు ఆ ధర్మాన్ని త్యజించలేదు. తాము నమ్ముకున్న దైవంపై విశ్వాసంతో ముందుకు సాగారు. ఆ ధర్మపరాయణత్వం వలనే వారికి సమస్త అస్త్రశస్త్రాలు, చీకటిలో వెలుగులు లభించాయి. ఆ పాండవుల ధర్మపరాయణతకు ఒక లక్షణం భక్తి. ఆ భక్తికి సూచిక ఈ పాంచాలిపై చిత్రీకరించబడిన గీతం.

పురాణాలలో పాత్రలు ఎంతో దివ్యత్వం కలిగినవైనా వారు కూడా దైవాన్ని ప్రార్థించటంలో ఉద్దేశం అన్నిటినీమించిన శక్తి గురించి మనకు తెలియజేయటం, ఎంతటివారికైన ఆపదలు, కష్టాలు కలుగుతాయి, వాటిని దైవానుగ్రహంతో దాటగలం అని చెప్పటానికి. మా గురువుగారు రమణరావుగారు ఎప్పుడూ చెబుతారు - "మనం చేసే ఉపాసన మనకు ఎండవానల్లో గొడుగులాగా రక్షణనిస్తుంది. పూర్తిగా తడువకుండా కాపాడుతుంది. దీనివలన మనం ఆ వర్షమనే అవరోధాన్ని దాటి ముందుకు వెళ్లగలం". అదే ఈ గీతం యొక్క ఉద్దేశం కూడా.

సముద్రాల రాఘవాచర్యుల వారు రాసిన ఈ గీతానికి సంగీత సరస్వతి సుసర్ల దక్షిణామూర్తిగారు సంగీతం అందించారు. మాధుర్యానికి, భక్తి భావానికి మారు రూపైన సుశీలమ్మ గారు ఈ పాటను పాడారు. అమ్మా అని పాట ఆరంభంలో ఆవిడ పాడిన ఆలాపన శిలలనైనా కరిగించేలా ఉంటుంది. భక్తివిశ్వాసాలకు ఈ గీతం నిలువుటద్దం. ఇక సావిత్రి గారి సంగతి చెప్పేదేముంది. పాటలోని భావానికి, పాత్రకు జీవం పోశారు. అందుకే నర్తనశాల చిత్రం ఇప్పటికీ సజీవంగా నిలిచింది. ఈ గీతం శాశ్వతమైంది.

20, అక్టోబర్ 2015, మంగళవారం

జననీ నిను వినా - తంజావూరు సుబ్బరాయశాస్త్రి గారి రచన



అమ్మ వారి సంకీర్తనలలో ఒక ఆర్తి ఉంటుంది. అమ్మను వేడుకోవటం ఆమె అనుగ్రహించటం మనం నిత్యం చూసేదే. ఆ ఆదిపరాశక్తి కరుణామయి, దయామయి. ఆ భావనతోనే భక్తుడైన వాగ్గేయకారులు అమ్మను శరణాగతితో వేడుకున్నారు. ఆ తల్లి కనులలో కురిసే కరుణ, లాలన, బిడ్డ పట్ల గల వాత్సల్యం ఒక పక్క, మనలను భవసాగరాన్ని దాటించే శక్తిగా మరొక పక్క, మన కోరికలను తీర్చే వరదాయినిగా ఇంకో పక్క..ఇలా ఆ ఆదిపరాశక్తి వైభవాలను ఎంతో మనోజ్ఞంగా నుతించారు మన వాగ్గేయకారులు. అమ్మను నుతించిన ప్రతి వాగ్గేయకారుడూ అమ్మ ఉపాసకుడే. ఉపాసన త్రికరణ శుద్ధితో, భక్తి శ్రద్ధలతో, శరణాగతితో చేయనిదే అమ్మ వైభవం అందంగా సంకీర్తనలలో ఆవిష్కరించటం కుదరదు. సంగీత త్రయంలో ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్యామశాస్త్రి వారు పరదేవతను ఉపాసించి సిద్ధి పొందారు. ఆ శ్యామశాస్త్రి వారి కుమారులు సుబ్బరాయ శాస్త్రి గారు. ఆయన ఎక్కువ కృతులను రచించకపోయినా, మనకు అందుబాటులో ఉన్నవన్నీ ఆయన ఆధ్యాత్మిక సౌరభాన్ని తెలియజేస్తున్నాయి.

సుబ్బరాయశాస్త్రిగారు 1803వ సంవత్సరంలో తంజావూరులో శ్యామశాస్త్రి గారికి రెండవ కుమారునిగా జన్మించారు. చిన్నతనంలో తండ్రి వద్ద సంగీతం నేర్చుకున్నారు. శ్యామశాస్త్రి గారు కుమారుడికి సంగీతం నేర్పవలసిందిగా త్యాగరాజు వారిని అభ్యర్థించగా ఆయన అందుకు ఎంతో సంతోషించి శిష్యునిగా అంగీకరించారు. సుబ్బరాయశాస్త్రి గారు త్యాగరాజస్వామి వారి ప్రధాన శిష్యులలలో ఒకరిగా పేరొందారు. అటుతరువాత మళ్లీ తండ్రి వద్ద సంగీతాభ్యాసం చేశారు. ఆ సమయంలోనే తమ ఇంటి వెనుక ప్రాంతంలో ఉండే ముత్తుస్వామి దీక్షితుల వారి వద్ద కూడా సంగీతం నేర్చుకునే అవకాశం లభించింది. ఈ విధంగా సంగీత త్రయం వద్ద విద్యనభ్యసించే అరుదైన భాగ్యం సుబ్బరాయ శాస్త్రి గారికి మాత్రమే దక్కింది. ఆయన కర్ణాటక సంగీతమే కాకుండా హిందూస్థానీ కూడా నేర్చుకున్నారు. వయోలిన్ విద్వాంసులు కూడా. సుబ్బరాయశాస్త్రిగారు రాగభావానికి ప్రసిద్ధి. గురువులు త్యాగరాజస్వామి వారు ఈయన భక్తికి, రాగభావానికి ఎంతో ఆనందపడ్డారట. సుబ్బరాయశాస్త్రి గారి రచనలలో సంగీత త్రయం ఛాయలు కనిపిస్తాయి. ఈయన ముద్ర 'కుమార '. ఆయన చాలా కాలం తీర్థయాత్రలలోనే గడిపారు. చెన్నైలో నివసించారు. ఆయన సంగీత వారసత్వం వీణ ధనమ్మాళ్ మొదలైన వారి ద్వారా కొనసాగుతునే ఉంది. ఆయన రచించిన జననీ నినువినా అనే కృతిని ఈరోజు పరిశీలిద్దాం. ఈ కృతిలో ఆయన తండ్రి శ్యామశాస్త్రిలా భక్తి భావనను, పరదేవతతో అనుసంధానాన్ని, ఉపాసనా సాఫల్యాన్ని ప్రతిబింబింపజేశారు.

సాహిత్యం:

జననీ నిన్ను వినా అంబ జననీ నిను వినా త్రిలోక
జననీ నిను వినా దిక్కెవరమ్మా జగములోన గాన అంబా

మనసిజ మానస సమ్మోదిని
వినవే నా మనవిని విని నన్ను బ్రోవుము

వనజాయత నేత్రి కుమార జనని కామితదాత్రి
ఘన పాప లతాలవిత్రి సనకాది మునిజన సన్నుత పాత్రి

నిరవధిక సుఖ దాయకి యనుచు విని నిను చాల గొలిచితి
నిరతముగ తనయుని మొరలు విని నీవలెనె బ్రోచుటకు ఎవరికి
ధరలో వినుమా ఇది ఘనమా తరుణమిది కృపసలుపు దురుసుగ
సరసీరుహ లోచని సువాసిని తామసము సేయకనే బ్రోవుము

అర్థం:

ఓ మూడు లోకాలకు తల్లీ! అంబా! నీవు కాకుండా నాకు ఈ ప్రపంచములో బ్రోచుటకు దిక్కెవరు?

మన్మథునికి మోదాన్ని కలిగించిన తల్లీ! నా మనవిని విని నన్ను కాపాడు. కలువలవంటి కన్నులు గల అమ్మా! కుమారస్వామికి జననీ!  కోర్కేలను తీర్చే తల్లీ! పెనవేసుకున్న ఊడలవంటి పాపములను నాశనం చేసే తల్లీ! సనకాది మునులచే నుతించబడిన అమ్మా! అనంతమైన సుఖాలను ప్రసాదించే తల్లివని విను నిన్ను చాలా కొలిచితిని.  ఈ తనయుని మొరలు విని వేగముగా బ్రోచుటకు నీవు తప్ప ఈ భూమిపై ఎవ్వరు? నా మొరలు వినుము. ఆలస్యము తగదు తల్లీ! నీ కృపను కలిగించుటకు ఇది తగిన సమయము. బహుళముగా ప్రసాదించుము.  ఓ కలువలవంటి కన్నులు గల తల్లీ! శుభకరీ! నన్ను వెంటనే బ్రోవుము.

వివరణ:

సుబ్బరాయశాస్త్రిగారి ఈ రచనలో తండ్రి శ్యామశాస్త్రిగారి భావ జాలం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పరదేవతపై గల భక్తి విశ్వాసములు, ఆ తల్లితో ద్వైత భావంతో గల అనుబంధం, విన్నపాలు మొదలైనవి శ్యామశాస్త్రి గారి సాహిత్యంలో కోకొల్లలు. అదే రీతిన సుబ్బరాయశాస్త్రిగారు ఈ కీర్తనను రచించారు. సాహిత్యానికి రాగం ప్రాణం. అందుకే కరుణ, భక్తి రసాలను బాగా పండించే రీతిగౌళ రాగాన్ని ఆయన ఎంచుకున్నారు. శరణాగతి, ఆర్తి కలిగిన ఈ కీర్తన సాహిత్యానికి రీతిగౌళ రాగం ప్రాణప్రతిష్ఠ చేసి శాశ్వతత్వాన్ని ప్రసాదించింది.

ఈ కృతిలో వాగ్గేయకారుని భాషా పటిమ,  భక్తి సువాసన పదప్రయోగంలో విదితం. మనసిజ మానస సమ్మోదిని...ఇదేంటి అమ్మవారు మన్మథునికి మోదం ఎలా కలిగించింది అన్న ప్రశ్న కలుగవచ్చు. మన్మథుని బూడిద చేసింది శివుడైతే దేహంలేని రూపాన్ని ఇచ్చింది పార్వతి. ఆ విధంగా మన్మథునికి ఆనందం కలిగించింది అమ్మ. చరణంలో పదప్రయోగం గమనించండి - వనజాయత నేత్రి కుమారజననీ కామితదాత్రి ఘనపాపలతాలవిత్రీ...ఇందులో శాస్త్రులుగారి సాహిత్యం తెలుగు తెలుగు సంస్కృత భాషా పాండిత్యాన్ని చాటుతుంది. ఘనపాపలతాలవిత్రి అట అమ్మ...మర్రి ఊడలను ఎప్పుడైన చూశారా? పెనవేసుకుని విడదీయలేకుండా, త్రెంచటానికి అలవికాకుండా ఉంటాయి. మన పాపసంచయం కూడ అటువంటిది అని అద్భుతంగా పోల్చారు వాగ్గేయకారులు. అటువంటి పాపాలను కూడా నాశనం చేసే తల్లిగా అమ్మను అభివర్ణించారు. చిట్టస్వర సాహిత్యంలో ఆయన తెలుగుభాషా సౌందర్యాన్ని మనకు అందించారు. ఈ నాలుగు పంక్తులలో అమ్మను ఒక తనయుడు అడిగినట్లే ఆ ఆదిపరాశక్తిని వేడుకునే సాహిత్యాన్ని ఆవిష్కరించారు. అమ్మను తామసము చేయక బ్రోవుము అని అడగటం ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. చిన్నపిల్లవాడు అమ్మతో ఎప్పుడూ ఒకేలా మాట్లాడడు. మధ్యలో నిష్ఠూరము, ఆత్రుత, ఒకింత అలుక...అన్నీ ప్రదర్శిస్తాడు. అదే విధంగా వేర్వేరు భావనలను సుబ్బరాయశాస్త్రిగారు ఈ సాహిత్యంలో మనకు అందించారు. ఇది ఒకింత మధురభక్తికి దగ్గరగా ఉంటుంది. అన్నమాచార్యులు, శ్యామశాస్త్రి ఈ సాహితీ లక్షణాలకు పితామహులు. ఈ ఒక్క కృతి చాలు సుబ్బరాయశాస్త్రి గారి వ్యక్తిత్వాన్ని తెలుపటానికి. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

ఈ కృతి ఎందరో పాడారు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి పాడినది బాగుంటుంది. ఇటీవలి చారులత మణి గారు ఆలపించింది ఉచ్ఛారణలో స్పష్టంగా అనిపించింది. మాధుర్యత కొంత లోపించినా, సాహిత్యం యొక్క గొప్పతనం కోసం ఈ వీడియోను ఎంచుకున్నాను. మహారాజపురం సంతానం వారిది రాగాలపనతో కూడినది, ఉచ్ఛారణలో స్పష్టత లేదు.  

19, అక్టోబర్ 2015, సోమవారం

అంబ వాణి నన్ను ఆదరించవే


అంబ వాణి నన్ను ఆదరించవే

శంబరారి వైరి సహోదరి 
కంబు గళే సిత కమలేశు రాణి

పరదేవి నిన్ను భజియించు నిజ భక్తులను బ్రోచే పంకజాసిని
వర వీణా పాణి వాగ్విలాసిని హరికేశపుర అలంకారి రాణి

హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతార్ గారు సంగీత త్రయం తరువాత ప్రసిద్ధులైన వాగ్గేయకారులలో ఒకరు. ఆయన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో 1877 సంవత్సరంలో జన్మించారు. సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ప్రావీణ్యం సాధించి ఎన్నో సంకీర్తనలను రచించారు. సంగీత పోషకులైన ట్రావంకోర్, మదురై, మైసూర్ రాజుల వద్ద తన వైదుష్యాన్ని పెంపొందించుకొని సంగీత ప్రపంచంలో తనకు ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ట్రావంకోర్ లోని మహారాజా స్వాతితిరుణాళ్ సంగీత అకాడెమీలో ఎన్నో ఏళ్లు పనిచేసి ఆ మహారాజావారి ఎన్నో కీర్తనలకు బాణీ కూర్చారు. ఆయన ముద్ర 'హరికేశ '. ఈయన దాదాపు ఇరవైకి పైగా రాగాలను సృష్టించారు. నాలుగు వందలకు పైగా సంకీర్తనలను రచించారు. మైసూరు మహారాజా వారి సన్స్థానంలో ఉన్నప్పుడు అక్కడి చాముండేశ్వరిపై దాదాపు 115 కీర్తనలను రచించారు. ఆయన రచించిన వర్ణాలు ఎంతో పేరు పొందాయి. అందులో ఖమాస్ రాగంలోని మాతే మలయధ్వజ పాండ్యసజాతే అన్నది ఎంతో ప్రాచుర్యం పొందింది. వీణ మరియు మృదంగ విద్వాంసులు ఈయన. ఆయన రచించిన సంకీర్తనలలో ఒకటి అంబవాణి నన్ను ఆదరించవే.

ఈ సంకీర్తనలో ఆయన పరదేవతా స్వరూపమైన సరస్వతిని తనను ఆదరించుమని వేడుకొంటున్నారు. త్రిమూర్తులు, ముగురమ్మల మధ్య ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని మన ఆధ్యాత్మికవేత్తలు, సద్గురువులు, వాగ్గేయకారులు ప్రస్తావించారు. విష్ణువు సోదరిగా పార్వతిని, శివుని సోదరిగా సరస్వతిని ప్రస్తుతించారు. ఈ సంకీర్తన అనుపల్లవిలో శంబరారి వైరి సహోదరిగా సరస్వతిని కొలిచారు భాగవతార్ గారు. అంటే మన్మథుని శత్రువైన శివుని సోదరి అని అర్థం. కంబుగళే సిత కమలేశు రాణి అనగా అందమైన కంఠము గల, కమలములో స్థితుడైన బ్రహ్మకు పత్ని అని అర్థం. పరదేవి అనగా రూపగుణాతీతమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. నిత్యము వీణావాద్యములో ఉండే ఈ తల్లి నవరాత్రులలో మూలశక్తిగా కొలువబడుతుంది. చరణంలో తనను భజించే భక్తులను బ్రోచే పంకజములో నివసించే దేవిగా, చేతిలో వీణకలిగి ప్రపంచంలో వాక్కు అనే అద్భుతమైన శక్తిని కలిగిన దేవతగా వాగ్గేయకారులు కొనియాడుతున్నారు.

కీరవాణి రాగంలో కూర్చబడిన ఈ సంకీర్తన సరస్వతీదేవికి ఒక అందమైన స్తుతిగా పేరొందింది. ఎస్పీ రాం గారు ఈ సంకీర్తనను చాల హృద్యంగా ఆలపించారు. వారి అంబవాణి అనే ఆల్బంలో ఈ సంకీర్తనపై క్లిక్ చేసి వినండి.    

14, అక్టోబర్ 2015, బుధవారం

ధైర్య కాత్యాయని - అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ


"వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం..."

అని లక్షీ అష్టోత్తర శతనామావళి శ్రావ్యంగా పూజగది నుండి వినబడుతోంది. పాత చెక్క పూజ మందిరం, దానిలో వంశపారంపర్యంగా వచ్చిన దేవీ పంచాయతనం, మధ్యలో అమ్మ వారు. స్ఫటిక లింగం, మిగిలినవి పంచలోహ విగ్రహాలు, అంగుష్టమాత్రం కన్నా తక్కువ ఎత్తులో ఉన్నాయి. చక్కగా ఎర్రని మందారాలు, తెల్లని నంది వర్ధనాలు ఆ పంచాయతన దేవతామూర్తులకు అలంకరించబడి ఉన్నాయి. చూచిన వారికి పవిత్రమైన భావన. మందిరం ముందు కాత్యాయని ఆకుపచ్చని చీర కట్టి భక్తితో అమ్మను కొలుస్తోంది. భక్తురాలి ప్రార్థనలను ఎదురుగా ఆ అమ్మలగన్న అమ్మ శ్రద్ధగా ఆలకిస్తోందా అన్నట్లు ప్రశాంతంగా దివ్యంగా ఉంది వాతావరణం. కాత్యాయని కంట నీరు. "అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే" అని ఆర్తితో పాడుతోంది.

పరుగు పరుగున ఏడేళ్ల సర్వజ్ఞ దేవుడి మందిరంలోకి వచ్చి తల్లి ఒడిలో వాలింది. అమ్మా అమ్మా అని తల్లి గడ్డం పట్టుకొని లాగింది. తల్లి తలతిప్పి చూసింది. ఆమె కళ్లలో నీటిని చూసి పిల్ల దిగాలుగా చూసింది. ఇంతలో కాత్యాయని తమాయించుకొని పిల్లను దగ్గరకు తీసుకొని ముద్దాడింది..."నా బంగారు తల్లీ! అమ్మా సర్వజ్ఞా! ఆ గౌరి అనుగ్రహంతో నాకు పుట్టావు..." అని హత్తుకొంది. తల్లి ప్రేమకు కరిగి కిల కిల నవ్వింది సర్వజ్ఞ.

"వినబడుతోందా లేదా! కాఫీ అని గంటనుండి గొంతు చించుకుంటున్నాను. నీ పూజలే కానీ మొగుడంటే పట్టదు. అంతే, ఉద్యోగం లేదు కదా అని అలుసు..." పడక గదిలోనుండి తిట్ల దండకం మొదలైంది. చటుక్కున లేచి వెళ్లి అరుస్తున్న భర్త సూర్యం ముందు నిలబడింది కాత్యాయని. కళ్లెర్ర చేసి ఉగ్ర రూపంలో ఊగిపోతున్నాడు. "నేనూ సంపాయిస్తాను, నాకు కుడా మంచి రోజులోస్తాయి చూడు" అని ఛర్రున లేచి బాత్రూంలోకి వెళ్లాడు. బయటకు రాగానే కాఫీ అని అందించబోయింది. విసిరి కొట్టాడు. జుట్టు పట్టుకొని కొట్టబోయాడు. బిక్కపోయి సర్వజ్ఞ తల్లిని తండ్రి బారినుండి తప్పించాలని ప్రయత్నించింది. పసిపిల్ల అన్న జ్ఞానం లేకుండా చెంప ఛెళ్లుమనిపించాడు. గుక్కపెట్టకుండా ఏడ్వటం మొదలు పెట్టింది. భర్తవైపు అసహ్యంగా చూసి పిల్లను తీసుకొని అక్కడినుండి వెళ్లిపోయింది. ఆలోచనలు గతంలోకి వెళ్లాయి.

తల్లిదండ్రుల బీదరికానికి తలవంచి 18 ఏళ్ల వయసులోనే తన అందం చూసి మోజు పడ్డ సూర్యంతో వివాహానికి కాత్యాయని అంగీకరించింది. అప్పటికి డిగ్రీ మొదటి సంవత్సరమే. స్నేహితులందరూ ప్రశ్నించినా తండ్రికి ఆర్థిక వెసులుబాటు లేదు, వెనుక ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు అన్న ఆలోచనతో గృహిణి అయ్యింది. వివాహ సమయంలో మంచి ఉద్యోగం ఉన్న సూర్యం తన అహంకారంతో తోటి  ఉద్యోగులతో, యాజమాన్యంతో చీటికి మాటికి పోట్లాటలు తెచ్చుకునే వాడు. సహనం తక్కువ అతనికి. తెలివి ఉన్నా నలుగురితో పనిచేసే చాకచక్యం లేకపోవడంతో ఉద్యోగం ఊడిపోయింది. ఇలా 2-3 ఉద్యోగాలు అయిన తరువాత ఇక ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు. ఇంతలో సర్వజ్ఞ పుట్టింది. కాత్యాయని భర్త పరిస్థితి గ్రహించి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేయాలని సంకల్పించింది. పరీక్షలలలో మంచి మార్కులు సంపాయించి ఒక ప్రైవేట్ సంస్థలో రిసెప్షనిష్టుగా పనిచేస్తోంది. భార్య ఉద్యోగం, తన నిరుద్యోగం, కష్టపడలేని మనస్తత్త్వం సూర్యాన్ని మృగంగా మార్చాయి. భార్య నలుగురితో మాట్లాడటం భరించలేకపోయేవాడు. తను ఇంట్లో ఒంటరిగా ఉండలేక బయట తిరుగుళ్లకు అలవాటయ్యాడు. తాగుడు, సిగరెట్లు, వాటికి డబ్బుకోసం భార్యను వేధించటం. అంతంత జీతం, సంసారం గడవటమే కష్టంగా ఉండటంతో కాత్యాయని డబ్బు నిరాకరించేది. అంతే కాదు, ఆ చెడు అలవాట్లంటే ఆమెకు అసహ్యం. అరుపులు కాస్తా కొట్టటం, బూతులు తిట్టటం వరకు వెళ్లాయి.

గతంలోనుండి వర్తమానంలోకి వచ్చింది కాత్యాయని. నవరాత్రులు చిన్నప్పటినుండి చక్కగా భక్తి శ్రద్ధలతో చేసుకోవటం ఆమెకు అలవాటు. ఈ సంవత్సరం కూడా అలాగే ఎన్ని కష్టాలున్నా అమ్మను కొలుస్తోంది. ఎంతో జాగ్రత్తగా కూడబెట్టుకున్న డబ్బుతో పిల్లను చదివిస్తోంది.

"నాకు 1000 రూపాయలు కావాలి.స్నేహితులతో బయటకు వెళ్లాలి"...సూర్యం అరిచాడు. ఆలోచనలనుండి బయట పడింది కాత్యాయని. "నా దగ్గరలేవు. ఇంకో వారంలో పిల్లకు టర్మ్ ఫీజు కట్టాలి" అంది. అంతే. ఉగ్రరాక్షసుడైనాడు సూర్యం. "మొగుడికి డబ్బు లేదు కానీ, దీని చదువుకు ఉన్నాయి. ఇది చదవకపోతే మనకు నష్టమేమీ లేదు...." అని కాత్యాయనిని కొట్టాడు. ఈడ్చుకుంటూ బజారులోకి తీసుకెళ్లాడు. పిల్ల ఏడ్చుకుంటూ ఇరుగుపొరుగు వారిని సాయం కోరింది. అందరూ మౌనంగా చూశారు తప్ప ముందడుగు వేయలేదు. వీధిలో ముడి వీడిన జుట్టుతో, దుఃఖంతో, కోపంతో కాత్యాయని చూస్తోంది. సూర్యం కాలు ఎత్తి తన్నబోయాడు.

"ఒరేయ్ సూర్యం!". అరుపు విని ఉలిక్కిపడ్డాడు. ఎదురుగా కర్రతీసుకొని వడి వడిగా తన వైపు వస్తున్న సుబ్బమ్మ. తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు సూర్యం. దగ్గరకు వచ్చి "ఒరేయ్! నువ్వు మనిషివా! రాక్షసుడివా! బంగారంలాంటి పిల్లను తెచ్చి పెళ్లి చేస్తే బాధ్యత లేకుండా ఇలా బజారుకీడుస్తావా? ఇంకొక్క అడుగు ముందుకు వేశావో...నీ ప్రాణాలు నీకు దక్కవు" అని కర్ర ఎత్తింది. అంతే, వెనుకడుగు వేశాడు.

సుబ్బమ్మ వినోదంగా చూస్తున్న అందరినీ ఒక్కసారి అసహ్యంగా చూసి, కాత్యాయని దగ్గరకు వెళ్లి గంభీరంగా పలికింది. "అమ్మా కాత్యాయనీ! నీలో భయాన్ని పారద్రోలు. మనిషికి కావలసిన కనీసపు అవసరాలను తీర్చలేను భర్త నా కొడుకు అని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది. సంసారం నడుపుతోందన్న ఇంగిత జ్ఞానం లేక మృగంలా ప్రవర్తిస్తున్నాడు వీడు. నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని, నీ మానసిక ఆనందాన్ని కోల్పోయి నిస్సహాయగా ఉండవద్దు. ఎదురు తిరుగు. నిర్భయవై ముందడుగు వేయి. పెళ్లి సంసారం కన్నా నీ ప్రాణం ముఖ్యం. నీ ఆత్మ గౌరవం ముఖ్యం" అని సెల్ ఫోన్ తీసి పోలీస్ కమీషనరుకు ఫోన్ చేయించింది. ఐదు నిమిషాల్లో పోలీసులు వచ్చి సూర్యాన్ని అరెస్టు చేసి తీసుకెళ్లారు. గృహహింస చట్టం కింద సూర్యాన్ని విచారించవలసిందిగా స్వయంగా సుబ్బమ్మ అర్జీ రాసి ఇచ్చింది.

ఇంటికి వచ్చి కాత్యాయనిని, పిల్లను దగ్గరకు పిలిచి ఇలా చెప్పింది. "స్త్రీకి సహనం పురుషుడి గుణాన్ని బట్టి ఉండాలి. ఎప్పుడైతే పురుషుడు తన ధర్మాన్ని మరచి, తన బాధ్యతను విడిచి ఇలా ప్రవర్తిస్తాడో స్త్రీ చూపించాల్సింది సహనం కాదు. ధైర్యం, తన కాళ్లపై తాను నిలబడి జీవించాలి అన్న దృక్పథం. నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తున్నావు కదా? దానిలో నీకు అర్థమయ్యింది ఏమిటి? భర్త అంటే అమితమైన ప్రేమానురాగాలు కల మహాలక్ష్మి, తన భర్తలో అర్థ దేహమైన పార్వతి, నిరంతరం భర్తకు ఆనందం కలిగించే సరస్వతి, ముగ్గురూ కలసి ప్రపంచాన్ని పీడుస్తున్న రాక్షసుడిని చంపటానికి ఉగ్ర దుర్గగా అవతరించారు. ప్రేమ, శాంతము, వాత్సల్యము, కరుణ కలిగిన ఆ ముగ్గురు అమ్మలు ఈ విధంగా అవతరించటానికి కారణం ఎదురుగా ఉన్న సమస్య. లోకరక్షణ కోసం వారి తమ శక్తులను ఏకీకృతం చేసి ఆది పరాశక్తిగా అవతరించి మహిషుడిని సంహరించారు. నీలోని ఓర్పు, సహనం, శాంతం వాడి బాధ్యత విస్మరించినప్పుడే వదిలివేయాలి. భర్త ఎన్ని హింసలు పెట్టినా భరించాలి అన్నది కాదు పాతివ్రత్యం అంటే. సమయానుగుణంగా, పరిస్థితులను బట్టి స్త్రీ వేర్వేరు రూపాలను ధరించాలి. ధర్మం తప్పి మతిభ్రంశుడైన సూర్యం నీ శాంతం, ఓర్పుతో మారడు. వాడికి కావలసింది శిక్ష. శిక్ష ద్వారా మార్పు. మార్పు ద్వారా భార్య యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవటం. అప్పుడే వాడు మళ్లీ నీకు భర్తగా ఉండటానికి అర్హుడు..."

ఏడేళ్ల సర్వజ్ఞ, ఇరవై ఆరు ఏళ్ల కాత్యాయని డెబ్భై ఏళ్ల సుబ్బమ్మలో జ్ఞానజ్యోతిని దర్శించారు. సాంత్వన పొందారు. స్ఫూర్తితో ధైర్యంగా నిలబడ్డారు.

విజయదశమి సాయంత్రం. ప్రక్కనే కనకదుర్గమ్మ దేవస్థానం. అమ్మ ముంగిట నాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేయబడ్డాయి. మొదట బాల త్రిపుర సుందరిగా ఏడేళ్ల పాప అద్భుతమైన నాట్య విన్యాసం చేసింది. అనంతరం "ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయురీం ఆర్యాం అంతర్విభావాయేత్ గౌరీం" అన్న శ్లోకం మొదలైంది. ఎదురుగా ఎరుపు రంగ పట్టు చీర కూచిపూడి శైలితో ధరించింది కళాకరిణి. సిగలో ఎర్రని కనకాంబరాల మాల, నుదుట ఎర్రని కుంకుమ బొట్టు, సర్వాభరణాలు ధరించి అమ్మవారిని తలపించింది. ముగురమ్మల లక్షణాలను వివరించే "అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ" అని పాట మొదలైంది.

ఎదురుగా ఉన్న పెద్దముత్తైదువకు నమస్కారం చేసి కళాకారిణి నాట్యం ఆరంభించింది. ముందు గౌరిగా, శంకరుని అర్థ భాగంగా, భగవతిగా శాంకరి రూపాన్ని ఆవిష్కరించింది. తరువాత శ్రీహరి ప్రణయరాశిగా, స్వామి పాదములొత్తే ఆదిలక్ష్మిగా, అష్టలక్ష్ముల రూపాలను మనోజ్ఞంగా ప్రదర్శించింది.చంద్రబింబము వంటి ముఖం కలిగి, బంగారు మేని ఛయతో వీణా పుస్తకములు ధరించి చతుర్ముఖ బ్రహ్మను అలరిస్తున్న సాహితీ సంగీత రూపిణి శారదగా అద్భుతమైన నర్తన చేసింది. తరువాత పతాక సన్నివేశంలో ఆది పరాశక్తిగా నడచి వచ్చింది. సమస్త శక్తులకు మూలమై, కేశములు  ముడి వేయకుండా, త్రిశూల ధారియై, అస్త్ర శస్త్రములతో, త్రిమూర్తులు, ముగురమ్మల శక్తి సంహితయై కాళరూపిణియై మహిషుని సంహరించే దుర్గగా రోమాంచకముగా నర్తించింది. ముగింపుగా మహిషాసుర మర్దన స్తోత్రం సామూహిక నృత్యంగా ప్రదర్శించబడింది.

మొత్తం ప్రదర్శనలో ప్రతి కదలికలోనూ కళాకారిణి ఆత్మ స్థైర్యంతో భక్తితో దేవీమహాత్మ్యాన్ని ప్రేక్షకుల మనసుల్లో నిలిపింది. సభ కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది. ఉత్సవ నిర్వాహకులు కళాకారిణిని అభినందిస్తూ "శ్రీమతి కాత్యాయని నేడు మనకు దుర్గమ్మ అంటే ఇలా ఉంటుంది అన్న భావనను కలిగించారు. నాట్య ప్రతిభే కాకుండా సాహిత్యంలో లీనమై ఆయా రూపాలను భావ సౌందర్యంతో ప్రదర్శించారు. అలాగే బాలా త్రిపుర సుందరిగా కుమారి సర్వజ్ఞ ఎంతో సుందరమైన ప్రదర్శన ఇచ్చింది. వారికి మన కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉణ్డాలి. దేవస్థానం పక్షాన వారికి శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు" అని పలికారు. తరువాత కాత్యాయని మాట్లాడింది.

"నేను చిన్నప్పటినుండీ నాట్య సంగీత శాస్త్రాల అభ్యసించేటప్పుడు దేవీ తత్త్వమంతే ఇష్టపడే దాన్ని. కానీ, నిజ జీవితానికి వచ్చేసరి నా వ్యక్తిత్వ వికాసంలో ఆ తత్త్వాన్ని పూర్తిగా అమలుపరచలేకపోయాను. నా జీవితంలో పెళ్లి అనేది ఒక పీడకలగా మిగిల్చింది నాలోని భయం. ఓర్పుగా ఉంటే సమస్య పరిష్కారం అవుతుందని భావించాను. కానీ, ఈ నాటి సమాజంలో ఉన్న మృగాళ్ల పాలిటి కావలసింది ఓర్పు కాదు. ధైర్యం, సాహసం, జీవితం పట్ల సకారాత్మకమైన ధోరణి. ఈ విషయాన్ని నా నిస్సహాయ స్థితిలో మా అత్తగారు నాకు తెలియజేశారు. కన్నబిడ్డ అన్న మమకారాన్ని వదలి ఆవిడ నన్ను స్త్రీగా గౌరవించి, కఠినమైన నిర్ణయం తీసుకొని నన్ను ముందుకు నడిపించారు. ఇది నాకు నిజంగా విజయదశమి. నిర్భయ రూపాన్ని నేను మా అత్తగారిలో చూశాను. నేటి సమాజంలో స్త్రీల పట్ల హింస అత్యాచారాలు స్త్రీ తన శక్తిని గ్రహించకపోవటం వలన పేట్రేగిపోతున్నాయి. ప్రతి స్త్రీ తన కాళ్లమీద తాను నిలబడి సమస్యను ఎదుర్కుంటే మృగంలాంటి మగవాడు వెనుకంజ వేస్తాడు. శారీరికంగా మగవాడు బలవంతుడైన మన మనసు గట్టిగా ఉంటే ఆతని శరీరబలాన్ని తప్పక జయించగలం. మన ఆడపిల్లలకు ఓర్పు, సహనం, శాంతం, ప్రేమలతో పాటు ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి. నా ఈ విజయదశమి ప్రదర్శనకు స్ఫూర్తి మా అత్తగారు. ఆవిడలోని ఆదిపరాశక్తిక్తి నా నమస్కారాలు. అత్తగారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను." అని చెప్పింది. అందరూ ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. స్త్రీలు ఆనందబాష్పాలు రాల్చారు. వారందరికీ తెలియని ప్రేరణ కలిగింది.

సుబ్బమ్మ వేదికపైకి వచ్చి "స్త్రీని అబల చేసింది స్త్రీయే. సమాజం ఏమనుకుంటుందో, భర్తను వదిలితే సమాజం అవహేళన చేస్తుంది, తోడు లేకుండా ఎలా జీవించటం, ఆడదంటే అన్నీ భరించాలి...ఇవన్నీ మనం తరతరాలుగా వింటున్నవే. శారీరికంగా స్త్రీపురుషుల బలాలలో తేడా ఉండవచ్చు. కానీ, సాటి స్త్రీని ఒక మగవాడు హింసిస్తుంటే చూస్తూ ఊరుకోవటం ఈ సమాజం చేసే పెద్ద తప్పు. ఆ సమస్య రేపు మనింట్లోనే వస్తే అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆడపిల్లలకు చిన్నపటినుండీ పరిస్థితులను ఎదుర్కొనగలిగే ఆత్మస్థైర్యం ఇస్తే వారు అపారమైన శక్తివంతులవుతారు. సమాజం వారి మేధో సంపత్తిని, సుగుణాలను మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకోగలదు. ఆడపిల్లల రక్షణకు వారిలో ఆత్మస్థైర్యం ఎంతో ముఖ్యం. వీగిపోయే మనస్తత్వాలను పిల్ల్లకు ఇవ్వకూడదు. నా కొడుకు రాక్షసుడు. ఒక స్త్రీని వాడు పెడుతున్న బాధలు చూసి నాలో ఎంతో అంతర్మథనం జరిగింది. రక్తసంబంధం కన్నా నా ధర్మం ముఖ్యం అనుకున్నాను. నేను చేసినదానికి వాడు నన్ను జీవితాంతం అసహ్యించుకోవచ్చు. కానీ, ఒక స్త్రీకి తోడుగా నిలబడ్డాను అన్న తృప్తి నాకు చాలు. ధన్యవాదాలు".

ఆ రోజు గుడిలో అమ్మ వారి విగ్రహంతో పాటు, నలుగురు ఆది పరాశక్తుల రూపాలు కనిపించాయి. వెనుదిరిగి ఇంటికి వెళుతున్నపుడు ప్రతి వ్యక్తిలోనూ అంతర్మథనం మొదలయ్యింది. ఆడపిల్లలను ఎలా పెంచాలి అని కొందరు, కోడలిని ఎలా గౌరవించాలి అని కొందరు, భార్యను ఎలా చూసుకోవలి అని కొందరు...దిద్దుబాటు దారిలో పడ్డారు. అదే కదా ఆధ్యాత్మికత ఉద్దేశం?