26, డిసెంబర్ 2016, సోమవారం

మిసైల్ వుమన్, అగ్నిపుత్రి టెస్సీ థామస్ - అగ్ని క్షిపణి ప్రాజెక్టు అధినేత్రి


అగ్ని-5: భారతదేశపు ప్రతిష్ఠాత్మక అణ్వాయుధాలు ప్రయోగించగల ఖండాంతర క్షిపణి ఈరోజు ఒడిషాలోని కలాం ద్వీపం నుండి విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ క్షిపణి దాదాపు 5వేల కిలోమీటర్లు, అనగా, మొత్తం ఆసియా ప్రాంతం, ఐరోపా వరకు ప్రయాణించగల అత్యంత శక్తివంతమైనది. 1000 కేజీల క్షిపణి బరువును మోగయగలదు. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు గల ఈ క్షిపణి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అతి వేగంగా వెళ్లగలదు. గతిశీల క్షిపణి కాబట్టి ఇది శత్రువుల రాడార్లలో అంత తొందరగా కనబడదు. భారతదేశపు రక్షణకు ఈ అగ్ని-5 అప్రతిహతమని చెప్పుకోవచ్చు. దీని తరువాతిది అగ్ని-6. ఇప్పటికే ఇది అభివృద్ధిలో ఉంది. అగ్ని-6 భూమిపైనుండే కాకుండా జలాంతర్గామి ద్వారా కూడా ప్రయోగించే వెసులుబాటు ఉంటుంది. అగ్ని-6 8,000-10,000 కిలోమీటర్ల వరకు వెళ్లగలదని శాస్త్రవేత్తల అంచన. అగ్ని-5ను విజయవంతంగా ప్రయోగించటం ఇది నాలుగవ సారి.

ఇంతటి శక్తివంతమైన అగ్ని-5 ప్రాజెక్టుకు సారథి ఎవరో తెలుసా? కేరళకు చెందిన 53ఏళ్ల మహిళా శాస్త్రవేత్త టెస్సీ థామస్. పురుషాధిక్యపు రక్షణ రంగంలో టెస్సీ థామస్ ఓ ధృవతార. అగ్ని-4 ప్రాజెక్టుకు కూడా ఆమే సారథి. పెరిగే వయసులో క్షిపణులు ప్రయోగించే ప్రదేశానికి దగ్గరలో నివసించటంతో ఆమెకు దాని వెనుక ఉన్న సాంకేతిక పరిజ్ఞానంపై మక్కువ ఏర్పడిందిట. త్రిస్సూరులోని ప్రభుత్వ కళాసాలలో ఇంజనీరింగ్ చదివి పునేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్మమెంట్ టెక్నాలజీలో ఎంటెక్ పట్టాను పొంది రక్షణ శాఖ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థైన డీఆర్డీవోలో చేరారు. అగ్ని4,5 ప్రాజెక్టులకే కాదు, అగ్ని-3 ప్రాజెక్టుకు కూడా ఆమె అసోసియేట్ డైరెక్టరుగా పని చేశారు.


మిసైల్ వుమన్, అగ్నిపుత్రిగా పిలువబడే టెస్సీ థామస్ మన బాలబాలికలకు ఆదర్శప్రాయం. మహిళలు కొన్ని పదవులకు పనికిరారు అనే బూర్జువా సిద్ధాంతాలను తప్పని నిరూపించిన మహిళ టెస్సీ. దేశరక్షణకు అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ఉత్పత్తి చేసే అతి ముఖ్యమైన రంగంలో రాణించిన టెస్సీ దేశభక్తి అనుపమానం. అగ్ని-5 మరో మారు విజయవంతంగా ప్రయోగించబడినందుకు టెస్సీ బృందానికి శుభాకాంక్షలు. ఇటువంటి వారికి దేశం అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులు ఇవ్వకపోవటం దేశానికే సిగ్గుచేటు. జైహింద్. 

బహుముఖ ప్రజ్ఞాశాలి శాంతకుమారి జీవిత విశేషాలు, ముజ్జగాలు మోహించగ గీతం


రాయలసీమ ఎందరో మహనీయులకు, బహుముఖ ప్రజ్ఞాశాలురైన కళాకారులకు జన్మభూమి. అందులో నాటక మరియు సినీ రంగ ప్రముఖులు చాలా ఎక్కువ. చిత్తూరు నాగయ్య గారు, కేవీరెడ్డి గారు, బళ్లారి రాఘవ గారు, పసుపులేటి కన్నాంబ గారు, పద్మనాభం గారు...వీరంతా ఈ రతనాలసీమలో జన్మించినవారే. అటువంటి ప్రజ్ఞాశాలుల కోవకు చెందినవారే శాంతకుమారి గారు. వారి సంగ్రహ చరిత్ర మరియు వారు పాడిన ఓ ఆణిమ్ముత్యం ముజ్జగాలు మోహించగ అనే గీతం వివరాలు.

1920 సంవత్సరం మే 17న కడపజిల్లా పొద్దుటూరు సమీపంలో వెల్లాల శ్రీనివాసరావు, పెదనరసమ్మ దంపతులకు శాంతకుమారి గారు జన్మించారు. ఆవిడకు తల్లిదండ్రులు పెట్టిన పేరు సుబ్బమ్మ. తల్లి శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, తండ్రి నటులు. ఇద్దరి కళలను పుణికి పుచ్చుకున్న సుబ్బమ్మ చిన్ననాడే సంగీతం అభ్యసించటం మొదలు పెట్టారు. ఆవిడ పీ. సాంబమూర్తిగారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు శ్రీమతి డీకే పట్టమ్మాళ్ గారు సుబ్బమ్మ గారి సహాధ్యాయిని. చిన్నతనంలోనే నాటక సంఘాలలో చేరి 16 ఏళ్లకు ఆకాశవాణి కళాకారిణిగా పేరొందారు. శాస్త్రీయ సంగీత వృత్తిని కొనసాగించటానికి ఆమె చెన్నై వెళ్లారు. అక్కడ విద్యోదయ పాఠశాలలో సంగీత ఉపాధ్యాయినిగా చేరారు. ఆవిడ సంగీత ప్రస్థానంలో సాలూరి రాజేశ్వరరావు గారితో కలసి ఆకాశవాణిలో పాడారు.

1936లో పీవీ దాస్ అనే సినీ ప్రముఖులు అప్పటివరకు శశిరేఖా పరిణయంగా నాటక రంగంలో ప్రసిద్ధి పొందిన కథను మాయాబజార్ అనే చిత్రంగా నిర్మించి దర్శకత్వం వహించాలని పూనుకున్నారు. శశిరేఖ పాత్రకోసం సరైన కళాకారిణి కోసం వెదుకుతుండగా చెన్నై విద్యోదయ పాఠశాలలో సుబ్బమ్మ గాత్రం ఆయన విని ఆయన ఎంతో ముచ్చట పడ్డారు. ఆ అమ్మాయిని సినిమాలో పాత్రకు పంపించవలసిందిగా ఆమె తల్లిదండ్రులను కోరారు. శ్రీనివాసరావు-పెదనరసమ్మ దంపతులకు, సుబ్బమ్మ నాయనమ్మకు ఆమె  సినిమాల్లో చేరటం ఇష్టం లేదు. వారు అమ్మాయి సంగీత కళాకారిణిగానే అభివృద్ధి చెందాలని పట్టుపట్టారు. కానీ, సుబ్బమ్మ తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని 4 రోజులు నిరాహారదీక్ష చేసింది. తల్లిదండ్రులు ఒప్పుకోక తప్పలేదు. పీవీ దాస్ గారు ఆమె పేరును శాంతకుమారిగా మార్చారు. మాయాబజార్ చిత్రంలో శాంతకుమారి గారు శశిరేఖ పాత్ర వేసి ఎంతో సహజంగా నటించటమే కాదు, పాడారు కూడా. ఈ చిత్రంలో ప్రముఖ నటులు లక్ష్మణ స్వామి గారు అభిమన్యునిగా నటించారు. చిత్రం పెద్ద విజయం సాధించింది.



1937లో పీ.పుల్లయ్య గారు సారంగధర చిత్రాన్ని తీశారు. ఇది ఆయనకు తొలి దర్శకత్వం. అందులో శాంతకుమారిని చిత్రాంగి పాత్రకు ఎంపిక చేశారు. తొలిపాత్ర శశిరేఖ లాలిత్యం కూడినదైతే చిత్రాంగి కపటమైన పాత్ర. ఈ వైవిధ్యాన్ని ఆమె ఎంతో సహజంగా తన నటనలో కనబరచారు. ఆ చిత్రంలో ఆమె త్యాగరాజస్వామి వారి రాగసుధారస అనే కీర్తనను  పాడారు. చిత్రం మంచి విషయం సాధించింది. 28ఏళ్ల పుల్లయ్య గారి మంచితనాన్ని గమనించిన శాంతకుమారి ఆయాన తన నట జీవితాన్ని ప్రోత్సహిస్తారని భావించి ఆయనను వివాహం చేసుకోవాలని కోరారు. అదే సంవత్సరంలో వారిద్దరి వివాహం జరిగింది. ఆ తరువాత శాంతకుమారి నట జీవితం నిరాటంకంగా విజయవంతంగా సాగింది.

శాంతకుమారి గారి చిత్ర ప్రస్థానంలో మరో ముఖ్యమైన మైలురాయి 1943లో విడుదలైన కృష్ణప్రేమ చిత్రం. ఇందులో ఆమె రాధ పాత్ర పోషించారు. మహామహులైన నటీమణులు, గాయనీమణులు పాలువాయి భానుమతి గారు (రాధ సోదరి చంద్రావళిగా), టంగుటూరి సూర్యకుమారి గారు (నారదునిగా, అవును స్త్రీ పురుష పాత్రను ధరించటం ఆరోజుల్లో చాలా అరుదు) ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం కూడా బాగా విజయం సాధించింది. 1945లో విడుదలైన మాయాలోకం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి కథానాయికగా నటించారు. తరువాత 1949లో కేవీరెడ్డి గారి దర్శకత్వంలో విడుదలైన గుణసుందరి కథలో గుణసుందరి (శ్రీరంజని) సోదరి రూపసుందరిగా నటించారు. ఈ చిత్రాన్ని  కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. 1950లో విడుదలైన షావుకారు చిత్రంలో శాంతకుమారి గారు శాంతమ్మగా నటించారు. ఈ చిత్రంలో నాయిక పాత్ర షావుకారు జానకి గారిది. ఈ చిత్రం అఖండ విజయాన్ని పొందింది. ఈ చిత్రం నుండి దాదాపు శాంతకుమారి పెద్ద వయసు పాత్రలను పోషించటం మొదలు పెట్టారు.



1950 దశకంలో ధర్మదేవత, అర్థాంగి, సారంగధర (ఈ మారు రాణీ రత్నాంగి పాత్ర), బొమ్మల పెళ్లి, జయభేరి మొదలైన తెలుగు చిత్రాలతో పాటు తమిళ సినిమాలో కూడా నటించారు. శాంతకుమారి నటనా జీవితంలో 1960లో విడుదలైన శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం ఓ ముఖ్యమైన మైలురాయి. ఈ చిత్రంలో ఆమె శ్రీనివాసుని తల్లి వకుళమాతగా అద్భుతంగా నటించారు. నటనతో పాటు "ఎన్నాళ్లని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా" అన్న ఆర్ద్రతతో కూడిన పాటను అద్భుతంగా పాడారు. "వీనుల విందుగ వేణుగానము విని తరించగా వేచితిరా వేచి వేచి నీ వెన్న ముద్దవలె కరగి పోయెరా నా బ్రతుకు" అని ఆమె గళంలో జాలువారిన ఈ పాట నేటికీ వీక్షకుల కళ్లు  చెమరింపజేస్తుంది. ఈ పాట, ఈ చిత్రం ఆమె బహుముఖప్రజ్ఞకు ప్రతిబింబం.

1960 దశకం మొత్తం శాంతకుమారి వయసుకు మించిన పాత్రలు వేశారు. ఆమెకు బాగా పేరు తెచ్చిన పాత్ర రామానాయుడు గారి రాముడు-భీముడు చిత్రంలో అక్క పాత్ర. ప్రేమ, వాత్సల్యంతో నిండిన ఈ పాత్రలో ఆమె ఎన్‌టీఆర్ సోదరిగా అద్భుతంగా నటించారు. శాంతినివాసం, సిరిసంపదలు, రేచుక్క, మురళీకృష్ణ, ప్రేమించి చూడు, ప్రాణమిత్రులు వంటి మంచి చిత్రాలలో నటించారు. తల్లిగా, సవతి తల్లిగా ఆమె వేసిన పాత్రలు చిరస్మరణీయం. శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం చిత్రాన్ని హిందీలోకి భగవాన్ బాలాజీగా అనువదించారు.



శాంతకుమారి గారు మొత్తం మీద 250పైగా చిత్రలలో నటించారు. అందులో 60 తమిళచిత్రాలు. మిగిలినవి తెలుగు. వీటిలో 25పైగా చిత్రాలు రాగిణి మరియు పద్మశ్రీ అనే సొంత  బ్యానర్లపై తీయబడినవే. పద్మశ్రీ సంస్థ పుల్లయ్య వీరి కుమార్తె  పేరున స్థాపించబడింది. శాంతకుమారి  నాగేశ్వరరావు, జగ్గయ్య, జెమినీ గణేశన్, శివాజీ గణేశన్ మొదలైన వారికి తల్లి పాత్రలను పోషించి తెలుగు తమిళ భాషలలో ఎంతో పేరు పొందారు. తెలుగులో విజయవంతమైన చిత్రాలన్నీ దాదాపుగా పుల్లయ్యగారు తమిళంలో మళ్లీ తెరకెక్కించారు. 1970 దశకంలో శాంతకుమారి అక్కా చెల్లెళ్లు, తల్లా పెళ్లామా, ప్రేం నగర్, కొడుకు కోడలు, సెక్రెటరీ, ముత్తైదువ చిత్రాలలో నటించారు.

ఆ తరువాత ఆమె సినీ రంగం నుండి విరమణ తీసుకొని రచనల వైపు మళ్లారు. భక్తి పాటలను రచించారు. 75 ఏళ్ల వయసులో కూడా ఆమె తను శిష్యురాలైన లలితాకుమారికి పాటలు నేర్పించారు. శాంతకుమారి గారు రచించిన భక్తి గీతాలను బాలమురళీకృష్ణా గారు ఆలపించారు. సుదీర్ఘమైన ఆమె సినీజీవితంలో ఆమె ఎన్నో పాటలను పాడారు. వాటిలో  "మోహనాంగ రారా", "ఎవరోయి ఎవరోయి (మాయాలోకం), "ఊగూమా కృష్ణ", "ఇదే ఆనందము" (కృష్ణ ప్రేమ), "కలకల ఆ కోకిలేమో", "చక్కని దొరలేలే చందమామ" (గుణసుందరి కథ), "ఎన్నాళ్లని కన్నులు కాయగ" (శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం), "మనసు తెలిసిన ఓ నాన్న" (తల్లా పెళ్లామా) మొదలైనవి. సినీ గీతాలే కాదు, శాంతకుమారి గారు ఎన్నో ప్రైవేట్ గీతాలను ఆకాశవాణిలో పాడారు.

నటన, నిర్మాణం, గాత్రం, రచన, సంగీతం మొదలైన కళలలో పట్టు సాధించి తన ప్రతిభను తెలుగు, తమిళ ప్రజలకు అందజేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి శాంతకుమారి గారికి 1998లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసి గౌరవించారు. 16 జనవరి 2006న శాంతకుమారి చెన్నైలో పరమపదించారు.

శాంతకుమారి గాత్ర మాధుర్యం తెలియాలంటే ఆమె పాడిన ఈ మధుర భక్తి గీతం వినాల్సిందే. రాధ మనసులో కృష్ణునిపై గల వివిధ భావనలను ముజ్జగాలు మోహించగ అనే గీతంలో శాంతకుమారి గారు అద్భుత్గమా పండించారు. ఆమె పాటలో భావుకత, రాధ ప్రేమ, స్వామిపై రాధకు గల అధికారం, ఆ స్వామి మోహన మురళీగానంపై గల మక్కువ ప్రస్ఫుటం. గోకులాన్ని వీడి మధుర, ద్వారకలలో ఉన్న శ్రీకృష్ణుని బృందావనం తిరిగి రమ్మని ఎంతో హృద్యంగా వేదుకునే రాధ మనసును శాంతకుమారి ఆవిష్కరించారు. శంఖ చక్రాలు, సారథ్యాలు, అస్త్ర శస్త్రాలన్నీ యమునలో పారవేసి తన వద్దకు రమ్మని కోరే రాధ మనసు శాంతకుమారి గళంలో పరిపూర్ణంగా ప్రతిబింబిస్తుంది. గోకులాన్ని వదలి వెళ్లిన కృష్ణుని పక్షపాతాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఏ పక్షం (యుద్ధాలు, సారథ్యాలు ఒకవైపు ప్రేమ సామ్రాజ్యమైన బృందావని ఒకవైపు) అని అడుగుతుంది. ఆ కురుక్షేత్రం మురళి మరియు రాధ కన్నా ఎక్కువా అని ప్రశ్నిస్తుంది. మధురభక్తిలో ఎన్ని భావనలుంటాయో అన్నీ ఈ గీతంలో కవి ఆవిష్కరించగా అంతే అందంగా శాంతకుమారి గారు పాడి దీనిని అజరామరం చేశారు. ఈ పాట ఎవరు రాశారో, ఎవరు స్వరపరచారో తెలియదు. బహుశ సాలూరి వారి స్వరఝరిలో వచ్చిన లలితగీతమేమో అనిపిస్తుంది. ఈ పాట విని తరించండి.

ముజ్జగాలు మోహించగ మురళిని మ్రోయించరా కృష్ణా కృష్ణా

శంఖమేల? చక్రమేల? సారథ్యములేలరా?
అస్త్ర శస్త్రజాలమెల్ల యమున పారవైచి రారా

ఎందుకురా మధురా నగరి? ఎందుకురా ద్వారకాపురి?
బృందావని వీడి నీవు పొందిన సుఖమేమున్నది?

పక్షపాతమేల? నీ పక్షమేది గోపాలా?
మురళి కన్న రాధ కన్న కురుక్షేత్రమేల?


25, డిసెంబర్ 2016, ఆదివారం

కూచిపూడి నృత్యాంశం - కృష్ణ శబ్దం


నృత్య సాంప్రదాయాలలో శబ్దాలకు ప్రత్యేక స్థానం ఉంది. శబ్దాలలో సరళమైన సాహిత్యంతో అభినయంతో వివరణ ఉంటుంది. శబ్దాలలో రెండు నుండి ఐదు చరణాల వరకు ఉండవచ్చు. ఒక్కొక్క చరణం వేర్వేరు అంశాలను ప్రస్తావించవచ్చు. శబ్దాలలో వేగమైన పద విన్యాసములు ఉండవు. భరత నాట్య శైలిలో శబ్దాలలో తొలుత కూర్చబడినవి ఒకే రాగంలా రాగా తరువాత వీటిని రాగమాలికలుగా, మిశ్రచాపు తాళంలో రూపొందించే సాంప్రదాయం వచ్చింది. శబ్దాలు రాజు గారి కొలువులో ఆ రాజు గుణవైభవాలను నుతించే శైలి కూడా ఉంది. ఇస్లాం రాజులను నుతించే కవులు సలాం అనే పదాన్ని కూడా శబ్దాలలో ఉపయోగించారు. కొన్ని ప్రాచుర్యమైన శబ్దాలు - కృష్ణ శబ్దం, రామాయణ శబ్దం, దశావతార శబ్దం, రాజశ్రీ శబ్దం, మండూక శబ్దం, వినాయక శబ్దం మొదలైనవి.

కృష్ణ శబ్దంలో వాసవసజ్జిక అయిన నాయిక నాథుని రాకకై అలంకరించుకొని వేచియుంటుంది. ఆయన గుణాలను వర్ణిస్తూ  లయబద్ధంగా సాగుతుంది. ఇందులో పల్లవి "రారా స్వామి రారా" అనే పద సంపుటిని ఎక్కడైనా పునరుపయోగించుకొని అభినయాన్ని విశదీకరించే అవకాశం ఉంటుంది. కృష్ణ శబ్దం సాహిత్యం పరిశీలిద్దాం.

మోహన రాగం, ఆది తాళంలో కృష్ణ శబ్దం కూర్చబడింది. నాయిక స్వామిని రారా అని పిలుస్తోంది. యాదవకులానికి చంద్రుడైన, సముద్రుని వంటి గంభీరత కలిగిన, వంద కోట్ల మన్మథుల సుందర రూపము కలిగిన, అమితమైన భుజ బలము కలిగిన శూరుని, స్త్రీల మనసులు దోచుకున్న, మేరు పర్వతమంత ధీరత కలిగిన, కవులను పోషించిన, శత్రువులను సంహరించిన, భరత నాట్య శాస్త్రానికి నిధియైన, సరసత కలిగిన రాజును కరుణతో చూచి ఏలుకోమని పరి పరి విధాల  నుతిస్తుంది.

ఈ కృష్ణ శబ్దం అభినయంలో మొదటి రెండు పంక్తులలో విపులంగా అభినయ కౌశల్యాన్ని కళాకారులు ప్రదర్శిస్తారు. స్వామి రారా యదువంశ సుధాంబుధి చంద్ర అనే పంక్తులను పదే పదే పలుకుతూ నాయకుని రాకకై ఆ నాయిక గంధం సిద్ధం చేయటం, పూలు కోయటం, మాలలల్లటం, తనను తాను అలనకరించుకోవటం, నాయకునికై  మాలలల్లటం మొదలైన వాటిని విశదంగా అభినయంతో ప్రదర్శిస్తారు. అలాగే, మొత్తం సాహిత్యాన్ని వివిధ గతులలో కూడా ప్రదర్శిస్తారు. మొత్తం మీద శబ్దాలు కళాకారులు రాజ సభలలో ప్రదర్శించే ఓ ముఖ్యమైన అంశంగా పరిగణించ వచ్చు. ఈ శబ్దాలను అభినయ ప్రాధాన్యమైన కూచిపూడి సాంప్రదాయాలలో ప్రదర్శిస్తారు. ప్రఖ్యాత కూచిపూడి నృత్య కళాకారిణి మంజుభార్గవి గారి కృష్ణ శబ్ద కూచిపూడి నృత్యాన్ని వీక్షించండి.

రారా! స్వామి రారా!
యదువంశ సుధాంబుధి చంద్రా!
రత్నాకర సమ గంభీరా!
శత కోటి మన్మథాకారా!
భాసుర భుజ బల రణ శూరా!
నారీ జన మానస చోరా!
మహా మేరు సమాన ధీరా!
కవి జన పోషక మందారా!
పర రాజ శత్రు సంహారా!
భరత శాస్త్ర నిధి నీవేరా!
నీవేరా, నీవేరా, నీవేరా!
సరసత గల దొర నీవేరా!
మము కరుణ జూచుటకు వేళరా! ఇది వేళరా!
చలమేలరా, మది పూనరా!
నీదానరా, మమ్మేలుకోరా! 

19, డిసెంబర్ 2016, సోమవారం

దేశభక్తి గీతం - జై జై భారత జాతీయాభ్యుదయానందోత్సవ శుభ సమయం


జై జై భారత జాతీయాభ్యుదయానందోత్సవ శుభ సమయం
ప్రియతమ భారత జనయిత్రి చిరదాస్య విమోచన నవోదయం

ప్రొద్దు పొడిచె లేవండోయి నిద్ర విడిచి రారండోయి 
దిగ్దిగంతములు ఝర్ఝరిల్లగా నిక్వాణము సేయండోయి

హిందూ ముస్లిం క్రైస్తవ పార్శీ ఏకవేదికను నిలవండి
జాతులెన్నైన దేశం ఒకటని లోక సన్నిధిని చాటండి

నా చిన్ననాడు ఆకాశవాణిలో బాగా విని, నేర్చుకున్న గీతం ఇది. పదాలు చూస్తుంటే దేవులపల్లి వారిలా అనిపిస్తోంది.ఎవరికైనా దీని రచయితే ఎవరో తెలిస్తే దయచేసి తెలియజేయండి. పరతంత్రము నుండి స్వేచ్ఛ లభించిన శుభతరుణంలో రచించిన గీతం ఇది. నిద్రాణమై ఉన్న భారతీయులను జాగృతం చేసే మొదటి చరణం, మతభేదాలతో కనుమరుగవుతున్న భారతీయతను పునరుద్ధరించే రెండవ చరణంతో దేశభక్తి సువాసనలను గుబాళిస్తుంది ఈ గీతం. విని ఆనందించండి.

18, డిసెంబర్ 2016, ఆదివారం

ప్రక్కల నిలబడి కొలిచే ముచ్చట - త్యాగరాజ వైభవం


ప్రక్కల నిలబడి కొలిచే ముచ్చట బాగ తెల్ప రాదా!

చుక్కల రాయుని గేరు మోము గల 
సుదతి సీతమ్మ సౌమిత్రి రాముని కిరు

తనువుచే వందనమొనరించుచున్నారా!
చనువున నామ కీర్తన సేయు చున్నారా! 
మనసున దలచి మైమరచి యున్నారా! 
నెనరుంచి త్యాగరాజునితో హరి హరి మీకిరు

త్యాగరాజస్వామి సంకీర్తనలలో సీతారాముల వైభవాన్ని అద్భుతంగా వర్ణించిన వాటిలో "ప్రక్కల నిలబడి" ఒకటి. రామ పరివారం కొలువుతీరి యుండగా అక్కడి స్థితిగతులను మనకు సద్గురువు మనోజ్ఞంగా తెలియజేశారు.

ఆ లోకాభిరామునికి ఇరు ప్రక్కల నిలబడి సీతాలక్ష్మణులు, పరివారము ఆయనను కొలిచే ముచ్చటను వాగ్గేయకారులు అనుభూతి చెందుతూ మన కళ్ల ఎదుట ఆవిష్కరించారు. కాసేపు శరీరముతో నమస్కరిస్తున్నారట. మరి కాసేపు నామ సంకీర్తన చేస్తున్నారట. మరి కాసేపు మనసులోనే తలచుతూ మైమరచియున్నారట. త్యాగరాజునిపై ప్రేమతో ఈవిధంగా ఆ పరివారం ఆ రాముని కొలుస్తున్న రీతిని ఖరహరప్రియ రాగంలో త్యాగరాజస్వామి పలికారు.

త్రికరణములతో పరమాత్మను కొలవటం ఆధ్యాత్మికత పరిపక్వతను సూచిస్తుంది. మనసా వాచా కర్మణా అక్కడ ఉన్నవారు రాముని కొలిచిన పద్ధతిని త్యాగరాజస్వామి కనులారా కంచి తరించి మనకు అందించారు. నామము తారకమై నాలికన కదలాడగా, శరీరము ఆయన రూపమును కాంచి వందనము చేయగా, మనసులోనే ఆయన రూపాన్ని తలచి మిగిలినవన్నీ మరచిపోయియున్నారు అన్న భావనను ఈ కృతిలో నుతించారు.

ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి గాత్ర ప్రవాహంలో బహుకొద్ది మాత్రమే వీడియోలు ఉన్నాయి. వాటిలో ఒకటి 1984లో తిరువాయూరులో త్యాగరాజ ఆరాధనోత్సవాల సమయంలోని కచేరీ. ఆ నాటి సాయంత్రం ఆమె ఈ కృతిని అద్భుతంగా వివరంగా పాడారు. చూసి తరించండి. రామ పరివారాన్ని మనముందు మరో మారు ఆవిష్కరించిన ఆమెకు, త్యాగరాజస్వామి వారికి వందనాలు.

25, నవంబర్ 2016, శుక్రవారం

జొన్నవిత్తుల వారి తెలుగుభాషా వైభవంపై గీతం


మాతృభాష కన్నతల్లి వంటిది. దానిని విస్మరిస్తే కన్నతల్లిని విస్మరించినట్లే. మాతృభాషను గౌరవిస్తే కొన్ని తరాలు తరిస్తాయి. లేకుంటే అంతటితో ఆ భాషా ప్రవాహం ఆగిపోయి పరధర్మం పాలైపోతాము. అక్షరాలను నేర్చుకోవటం, వ్రాయటం, చదువగలిగి మాధుర్యాన్ని ఆస్వాదించటంతో పాటు, భావాలను మాతృబాషలో వ్యక్తపరచగలగటం మన కనీస ధర్మం. భాష  కేవం పదల అల్లిక కాదు. దివ్యత్వం చేత ప్రచోదనమైన శబ్దవాహిని. మహానుభావుల నోట పలుకబడిన దివ్యవాహిని. జ్ఞానం, మేధస్సు, ఆధ్యాత్మిక శక్తి కలబోసిన పదాల సమ్మేళనం మాతృభాషా ప్రవాహం.

మందార మకరంద మాధుర్యాల రుచిని తెలిపేది భాష. మధురసపు మామిడి పండ్ల తీయదనాన్ని తెలిపేది ఈ భాష. ఋతువుల లక్షణ సంపదను ఆవిష్కరించేది భాష. కళల ఆకృతిని చిత్రపటంగా మనముందుంచేది భాష. మనుషులను బంధాలతో అల్లి ఐక్యతతో ముందుకు నడిపేది భాష. నవరసాల భావావిష్కరణ చేసేది భాష. పురాణేతిహాసముల ధర్మాలను ప్రస్ఫుటింపజేసేది భాష. మానవ జీవన వాహినిలో సంస్కృతి సాంప్రదాయలను అవిరామంగా అందించేది బాష.

భాషా వైభవం కొన్ని శతబాదాల పాటు శతికోటి ప్రభల వెలుగు వెలిగి ఆంగ్ల మాధ్యమంలో బోధన వచ్చిన తరువాత ఓ అర్ధ శతాబ్ద సమయంలో తీవ్రంగా క్షీణించ సాగింది. ఉపాధికై ఆంగ్లమాధ్యయం తప్పని సరి కావటంతో తెలుగు మాట్లాడే ప్రాంతాలలోనే తెలుగు బోధన తగ్గిపోయింది. నేను 1980  దశకంలో తెలుగును మొదటి భాషగా తీసుకోగలిగాను, అప్పుడు చెప్పగలిగిన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఇప్పుడు రెండూ లేవు. భాష అటకెక్కింది. ఆంగ్లభాషా ప్రవాహంతో కలిసి పరుగెత్తలేకపోతోంది. తెలుగుభాష అనే వృక్షానికి తిరి ప్రాణం పోయవలసింది ఇళ్లలోనే. తల్లిదండ్రులు పిల్లలతో తెలుగులో మాట్లాడాలి, తెలుగును నేర్పించాలి, తెలుగు భాషా మాధుర్యాన్ని చవిచూపించాలి. సమాజంలో తెలుగు వాడకం చాలా వేగంగా తగ్గుతున్నా,  తెలుగు భాష ప్రాభవం పునరుజ్జీవమై గొదావరిలా ఉప్పొంగాలని కోరుకునే వారు ఎందరో. భాషాభివృద్ధికి, భాషాభిమానం పెంచటానికి, భాషా వినియోగం పెంపొందించటానికి కృషి చేస్తున్న వాళ్లు ఎందరో. ఇప్పటికీ తేటతేనె తెలుగులో అమృత రస ధారలనొలికించే కవులెందరో. రసహృదయులింకెందరో. వారందరికీ శతసహస్రవందనాలు.

తెలుగు భాషా వైభవం చాటే ఎన్నో గీతాలు వచ్చాయి. ఎన్నో అజరామరమైనాయి. అటువంటి వాటిలో ప్రముఖ సినీ గేయ రచయిత, సాహితీవేత్త జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు రచించిన ఈ గేయం ఎంతో పేరుపొందింది. చక్కని భాష, ఆ భాష వైభవాన్ని తెలిపే చారిత్రాత్మక ప్రస్తావనలు, భాషలో ఉన్న సౌందర్యం, లాలిత్యం ఈ గీతం ద్వారా మనకు రచయిత అందించారు. తెలుగుదనాన్ని ఆస్వాదించటానికి ఈ గీతం ఓ మంచి అవకాశం. ఇంత చక్కని గీతం అందించిన జొన్నవిత్తుల వారికి హృదయపూర్వక నమస్కారములు.

చక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు
నన్నయ తిక్కన ఎఱ్ఱన పితికిన ఆవు పాల పొదుగు
చదువుల తల్లికి  సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు

హిమగిరి జలనిధి  పదముల అమరిన  జిలుగు వెలుగు తెలుగు
గణ యతి ప్రాసల ధ్వని రస శాఖల కవితలల్లు పులుగు
నవ నవ పథముల కవితా రధములు సాగిపోవు  నెలవు
అలవోకగ అష్టావధానములు సేయు కవుల కొలువు

అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు
శ్రీనాథుని కవితాశుధారలో  అమరగంగ  పరుగు
రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో
రస ధారయై ధ్రువ తారయై  మన దేశ భాషలను లెస్సయై
దేవ భాషతో చెలిమిచేసి పలు దేశ  దేశముల వాసికెక్కినది

మన అక్షరాల  తీరు మల్లెపాదు కుదురు
మన భాష పాల కడలి భావం మధు మురళి
అజంత పదముల అలంకృతం మన భాష అమృత జనితం
భారత భాష  భారతి నుదుట తెలుగు భాష తిలకం

బాలమురళీరవం - ఓంకారాకారిణి


బాలమురళీకృష్ణ గారి రచనల్లో పాండిత్యంతో పాటు దేవతాస్వరూపము యొక్క గుణవిభవ వర్ణన ప్రత్యేకంగా ఉంటుంది.ఆయన రచించిన మరో కృతి పరిశీలిద్దాం. వాగ్గేయకారులు రాగం యొక్క పేరును కృతిలో ఉపయోగించటం ఒక ప్రక్రియ. ముత్తుస్వామి దీక్షితుల వారు ఈ ప్రక్రియకు చాలా ప్రసిద్ధి. త్యాగరాజ స్వామి వారు కూడా అక్కడక్కడా దీనిని ఉపయోగించారు. వారి పరంపరలో ఐదవ తరం శిష్యులైన బాలమురళీకృష్ణ గారు కూడా ఈ ప్రక్రియను తమ రచనల్లో బాగా ఉపయోగించారు. ఈ ఓంకారాకారిణి లవంగి రాగంలో కూర్చబడినది. ఆ పేరును చరణంలో ఉపయోగించారు. ఆ త్రిపురసుందరిని నుతిస్తూ బాలమురళి గారు ఈ కృతిలో బీజాక్షరాలతో పాటు శక్తివంతమైన పదాలను ఉపయోగించారు. వాగ్గేయకారుల పరంపరకు వన్నె తెచ్చారు.

ఆ అమ్మను ఓంకార ఆకారముగా, మన అహంకారాన్ని నశింపజేసేదిగా ప్రార్థిస్తున్నారు. ఒక్క హూంకారంతో శత్రువులను సంహరించే తల్లి హ్రీం అనే బీజాక్షరానికి రూపముగా, శివుని ధర్మపత్నిగా కొనియాడారు. తన ముద్రైన మురళిని ఉపయోగిస్తూ, ఆ గాన సుధాలహరిలో విహరించే అమ్మగా, పరమశివునిచే ప్రేమించబడిన త్రిపురసుందరిగా, కరుణారసంతో నిండిన లాలిత్యము గల సుందరిగా,వరం, అభయము ఇచ్చే సమస్త శుభాంగిగా ప్రస్తుతించారు. దాదాపుగా దీక్షితుల వారి కృతులలోని ఔన్నత్యాన్ని ఈ కృతిలో మనం గమనించవచ్చు. లవంగి రాగము కూడా ఆయన బాలమురళీకృష్ణ గారి సృష్టే. ఈ రాగంలో నాలుగే (స రి మ ద) స్వరాలు ఉన్నాయి. ఇలాంటి ప్రయోగం చేసినందుకు తమిళ శాస్త్రీయ సంగీత పండితులు గగ్గోలు పెడితే ఆయన మరింత ధైర్యంగా ఇటువంటి రాగాలు మరికొన్ని కూడా సృష్టించారట. కనకాంగి రాగ జన్యమైన ఈ లవంగి సాహిత్యానికి దివ్యత్వాన్నిచ్చింది. ఈ కృతికి బాలమురళి గారు చెప్పిన చిట్టస్వరాలు ఆయన మేధోసంపత్తికి మచ్చుతునక. నిజంగా ఆయనలాంటి వాగ్గేయకారుల తరంలో జన్మించటం మన అదృష్టం. వారికి మరో మారు నివాళి. ఈ కృతిని బాలమురళిగారి గళంలోనే వినండి.


ఓంకారాకారిణీ! మదహంకార వారిణీ! అవతుమాం!

హూంకార మాత్ర శత్రు దమనీ! హ్రీంకార రూపిణి! రుద్రాణీ!

మురళీ సుధా లహరీ విహారీ! పురరిపు ప్రేమిత త్రిపుర సుందరీ!
కరుణారస భరిత లలిత లవంగీ! వరదా! అభయదా! సకల శుభాంగీ!

24, నవంబర్ 2016, గురువారం

బాలమురళీరవం - అమ్మా ఆనందదాయిని వర్ణం


ఆయన రచించిన అద్భుతమైన వర్ణం అమ్మా ఆనందదాయిని - గంభీర నాట రాగంలో. బాలమురళి గారి ప్రత్యేకత కవితా పటిమ. భక్తితో పాటు కవిత్వపు సువాసనలు తెలుగులో ఆయన గుబాళించారు. అందుకే ఆయన కర్ణాటక సంగీతంలో కొత్త విప్లవానికి నాంది పలికారు. విన్నకొద్దీ ఆయన ప్రజ్ఞ మరింత తేటతెల్లమవుతుంది. నాకు సంగీత జ్ఞానం లేదు కాబట్టి ఈ వర్ణానికి స్వరాలు రాయలేదు. స్వరాలలోనే అసలు అందం. గంభీర నాటలోని గంభీరమంతా ఈ కృతిలో కనబరచారు బాలమురళి గారు.

అమ్మా ఆనంద దాయిని అకార ఉకార మకార రూపిణివమ్మ నిను నమ్మి బాల మురళీగానమ్ము చేసి ధన్యుడనైతిని

నీ నిర్వికార నిరామయ మూర్తి తరణి శత కిరణ సుశమమయముగ నిలిచే హృది
సకలము నవరస భరితము నిరతము నిరవధిక సుఖము అనుభవమమ్మా

శివే శివే శివే వేవేల వరాలరాశివే మొరాలింపు

సదానంతానందామృతం సత్సంగీతం

ఏది నిజంబెయ్యదసత్యమని తెల్పగ ప్రార్థింతును నే తెలియ

ఇన బింబ సమాన ముఖ బింబ కదంబ నికురుంబ మదంబ ఉమసాంబ

అంతర్యాగమున నిను కొలిచి పురాకృత ఖలంబుల విముక్తునిగ
నేనైతి సకల శుభ గుణా వినుత మునిగణావన గుణ త్రిగుణాతీతా
విధి హరి గణపతి శరవణభవ శుక శౌనక అసుర సుర గణ రతిపతి
సురపతి వినుత శివే నిరతిశయ శివే శివే పరమ పరశివే శివే శివే

https://www.youtube.com/watch?v=TKcgJ0VuNvQ

14, నవంబర్ 2016, సోమవారం

షోడశోపచారములు



రామయ్యా! నీ తారక మంత్రము నాకు భవ తారకము. నా మనసునే మందిరము చేసుకొని నిన్ను ఆ యింటికి ఆహ్వానిస్తున్నాను. వచ్చి నన్ను పావనము చేయవయ్యా! సీతమ్మ! లోకమాతా! నీ చల్లని చూపులే మాకు సకల సౌభాగ్యములు! స్వామితోడ వచ్చి మా గృహమును పావనము చేయవలసినది!! మీ పాదములకు నా హృదయ కమలమును సమర్పించి

రామయ్యా! వచ్చావా నా తండ్రీ! నీ కొరకు నా కళ్లు కాచి ఎదురుచూస్తున్నానయ్యా! అమ్మా సీతమ్మా నా ప్రార్థనలు విని స్వామిని తోడ్కొని వచ్చావా? ఎంత దయ తల్లీ నీది?

ఇదిగోండి మీ పాదాలు కడుగ అర్ఘ్యము. మీ చరణ ధూళి సోకినంత నా ఇల్లు పావనమైంది. నా జన్మ ధన్యమైంది. ఆనందబాష్పాలు కలబోసిన నీటితో మీ పాదాలు కడుగ అనుమతీయండి! రామయ్యా! సీతమ్మా! ఇదిగో మీ చేతులు కడుగ పాద్యము! స్వామీ! ఎంత సుందర చరణములో నీవి? అమ్మా సీతమ్మ! నీ మట్టెలు స్వామి ప్రేమకు సంకెతమే కదా? ఆహా ఏమి నా భాగ్యము? లోకపావని, రఘురాముడు మా ఇంట అడుగు పెడుతున్నారు!

అమ్మా! అయ్యా! లోపలికి రండి! మీ కోసం రత్నఖచిత సింహాసనాలు సిద్ధం చేయలేకపోయాను, కానీ, నా చేతితో నేసిన పట్టు వస్త్రము కప్పిన ఆసనముంచాను! అదిగో! మా పెరట్లో పూచిన మల్లికా జాజి పారిజాత సంపంగులనుంచి మీకై వేచి ఉన్నాను! సుఖాసీనులు కండి! ఓ సౌగంధికా పుష్పములారా! అమ్మకు, అయ్యకు మీ సువాసనలతో సౌఖ్యాన్ని కలిగించండి!

స్వామీ! అమ్మా! ఇదిగో ఆచమనం! ముల్లోకాల సద్భక్తులకు దర్శనమిచ్చి అలసి సొలసి వచ్చి ఉంటారు. ఈ జలంతో మీ గొంతులు కాస్త తడుపుకోండి. ఇదిగిదిగో మధుపర్కం. ఆ తేనె-పెరుగు మీ మధురమైన పలుకులకు ఉపకరిస్తుంది. పలుకు తేనెల తల్లి సీతమ్మా! నీ మాటలే మాకు వరాల మూటలు. స్వామి ఉన్నాడని సిగ్గు పడకమ్మా!

రామయ్యా!సీతమ్మా! పాలు, పెరుగు, తేనె, శర్కర,నెయ్యితో, నారికేళ జలముతో, చక్కగా గంధము అరగదీసి సుగంధ ద్రవ్యములను చేర్చిన నీటితో స్నాననికి అన్నీ సిద్ధంగా ఉంచాను. హాయిగా స్నానం చేయండి. మర్చిపోకండేం! ఆ స్నానపు జలాలను కాస్త నా సేవనకు ఉంచండి. ఇదుగోండి, మీ స్నానాంతరం ధారణకు వస్త్రము, ఉపవీతము.

ఆహా! ఏమి సౌందర్యమయ్యా రామయ్య! ఎంత లావణ్యమమ్మా సీతమ్మ! రెండు కళ్లూ చాలటం లేదు! నను కన్న తల్లీ! నా తండ్రి రామయ్యా! ఇదుగో నా భక్తి అనే గంధపు చెక్కతో అరగదీసిన గంధము...నుదుట ధరించండి! నా హృదయమును ఈ పుష్పము ద్వారా మీకు సమర్పిస్తున్నాను. ధరించండి! ఇదిగిదిగో! మీ సౌకర్యానికై సాంబ్రాణి ధూపము! మీ మందిరమంతా చక్కని సువాసనతో నిండాలి.

రామయ్యా! సీతమ్మా! ఇదుగో! జ్యోతిస్స్వరూపులైన మీకు ఈ దీపం! అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి నాకు జ్ఞానజ్యోతిని ప్రసాదించండి. నా శ్రీమతి ఎంతో శ్రమపడి మీకు నివేదించటానికి భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు, పానీయాలు సిద్ధం చేసింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీ రూపమైన ఈ నివేదనమును శుభ్రమైన వెండి పాత్రలో సేవించండి. మీకు ఇష్టమైనవి భుజించండి! మీ చేతులు శుభ్రం చేసుకోవటానికి ఇదిగోండి ఆచమనం! అమ్మా! ఇదిగో లేత తమలపాకులు, మా పెరట్లో పెరిగిన తీగవి, ఆ సున్నం, వక్కలు, ఇతర సుగంధ ద్రవ్యాలు వేసి స్వామికి తాంబూలం అందించు తల్లీ!

రామయ్యా! సీతమ్మా! అంతా సౌఖ్యమే కదా! మీ దివ్యమంగళ రూపాలను నేను ఏమని పొగడెదను? ఇదిగో నీరాజనం. ఏకహారతి, పంచహారతి అందుకోండి. పంచభూతములలోనూ, సమస్త దేవతామూర్తులలోనూ, ప్రకృతిలోను, నాలోను ఉన్న మీ మహత్తులను తెలిపే మంత్ర పుష్పం పఠిస్తున్నాను. దశరథపుత్రుడైన రాముని తెలుసుకునేందుకు ఆ సీతావల్ల్భుడైన మిమ్ములను ధ్యానిస్తున్నాను. జనకుని పుత్రికయైన సీతమ్మను తెలుసుకునేందుకు ఆ రామపత్నియైన మిమ్ములను ధ్యానిస్తున్నాను. మీరు మమ్ములను అనుగ్రహించెదరు గాక. అన్ని దిక్కులా, ,అంతటా, నా దేహమనే దేవాలయంలో స్థిరమై ఉన్న మీకు ప్రదక్షిణ నమస్కారములు సమర్పిస్తున్నాను. తెలిసీ తెలియక చేసిన పాపములను, ఈ జన్మలోనూ, ఇతర జన్మలలోనూ చేసిన పాపములు నశించుటకు ప్రదక్షిణము చేస్తున్నాను. నేను పాపుడను, పాప కర్మలను చేసే వాడిని, పాపాత్ముడను, పాపము వలన పుట్టిన వాడను. నన్ను తరించటానికి మీ కరుణను కురిపించవలసింది. మీరు తప్ప నాకు వేరే దిక్కెవ్వరూ లేరు. కాబట్టి కరుణతో నన్ను రక్షించండి.







28, అక్టోబర్ 2016, శుక్రవారం

చిత్తూరు నాగయ్య గారి నటనా ప్రతిభ - మహానుభావుల పాత్రలు

 





తెలుగు చలనచిత్ర సీమలో వుప్పలదడియం నాగయ్య (చిత్తూరు నాగయ్య) గారు ఒక్కరికే మహా వాగ్గేయకారులైన త్యాగయ్య, రామదాసు, మహాకవి పోతన, యోగి వేమన వంటి మహానుభావుల పాత్రలు వేసే సామర్థ్యం ఉంది. కేవలం పాత్రలను వేయటం కాదు, వాటిలో ఒదిగిపోయి, తన సంగీత మరియు నటనా ప్రతిభతో ఆ పాత్రలకు సార్థకత చేకూర్చారు. త్యాగయ్య, రామదాసుల కీర్తనలను అనర్గళంగా రాగయుక్తంగా పాడటం మాటలు కాదు. ఈనాటి నాగార్జున గారి అరకొర రామదాసు, వెకిలి అన్నమయ్య సినిమాలు చూసి ఆహా ఓహో అనుకునే వారికి నాగయ్య గారి చిత్రాలు ఓ కనువిప్పు. అవి ఆ మహానుభావుల మహనీయతకు ప్రతిబింబాలు.  ఆయన యోగి వేమన చిత్రం చూస్తే అసలు వేమన ఏమిటో అర్థమవుతుంది. నాగయ్యగారి పవిత్రత ఆయన పాత్రలలో సుస్పష్టంగా కనిపిస్తుంది. ఓ పాత్ర వేయాలంటే దాని గురించి రెండు మూడు నెలలు చదివి చేస్తే సరిపోదు. ఆ పాత్రలకు సరిపడే స్వచ్ఛత వ్యక్తిత్వంలో ఉండాలి. అదే నాగయ్య గారి గొప్పతనం.  ఒక్క సోమయాజులు గారు మాత్రమే నాగయ్య గారి దీటుగా త్యాగయ్యగా నటించగలిగారు. దానికి బాపు-రమణల ప్రతిభ మూల కారణం.

అలాగే వాల్మీకిగా, వశిష్ఠునిగా, దధీచిగా, వ్యాసునిగా, హాథీరాం బాబాగా, ధృతరాష్ట్రునిగా, పరమానందయ్యగా, అక్రూరునిగా, మహామంత్రి తిమ్మరుసుగా, మేవార్ రాజుగా, ఆశోకునిగా ఆయన కనబరచిన ప్రతిభ అజరామరం. ఉత్తర రామాయణం ఆధారంగా తీయబడిన లవకుశలో ఆయన వాల్మీకి మహర్షి పాత్ర చిరస్మరణీయం. తిమ్మరుసుగా ఆయన నటనలో కనబడిన రాకీయ పరిపాలనా చాతుర్యం అమోఘం. అక్రూరునిగా ఆయన కనబరచిన కృష్ణభక్తి ప్రశంసనీయం. సనాతన ధర్మ గంగాప్రవాహంలోని ఈ మహానుభావుల పాత్రలు ధరించటం ఆయనకు మాత్రమే చెల్లింది. మీరా చిత్రంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి ప్రధాన పాత్రకు భర్తగా ఆయన నటన అద్భుతం. శ్రీవేంకటేశ్వర మహాత్యంలో హాథీరాం బాబాగా ఆయన భక్తి అనిర్వచనీయం. జయభేరిలో గురువు విశ్వంభర శాస్త్రిగా ఆయన కనబరచిన నిండుతనం సినిమాకే వన్నె తెచ్చింది. అలాగే పరమానందయ్యగా ఆయన శిష్యులపై కనబరచిన వాత్సల్యం, కరుణ అనుపమానం. రాము చిత్రంలో ఘంటసాల గారి గీతం "రారా కృష్నాయ్యా" అనే గీతానికి పరిపూర్ణతనిచ్చింది నాగయ్య గారి భక్తిపూరితమైన నటన. నాగయ్యగారు నటించిన త్యాగయ్య, పోతన, రామదాసు, వేమన చిత్రాలు నటనకు, సంగీత సాహిత్య ఔన్నత్యానికి, నిర్మలమైన మనస్తత్వానికి ప్రతీకలు. పౌరాణిక చారిత్రాత్మక పాత్రలే కాదు. నాగయ్య గారు సాంఘిక పాత్రలలోనూ అదే పరిపక్వతను కనబరచారు. ఆయన నటన నేటి నటులకు పాఠాలు.

ఆయన్ పాడిన పాటలలో పాండురంగ మహాత్మ్యం చిత్రంలోని సన్నుతి సేయవె మనసా ఆపన్న శరణ్యుని హరిని అనే గీతం చాలా ఇష్టం. ఆయనకు నివాళిగా ఈ పాట మీకోసం.

23, అక్టోబర్ 2016, ఆదివారం

సూర్యనారాయణ సుప్రభాతం - ఆకాశవాణి భక్తిరంజని

ఆదివారం నాడు ఆకాశవాణి భక్తిరంజనిలో అప్పట్లో తప్పకుండా వినిపించిన తెలుగు సుప్రభాతం ఇది. ఎవరు రాశారో తెలియదు, కానీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి సంగీతం అనుకుంటా. భానుని దిన ప్రస్థానంలోని రంగులను ప్రకృతిలోని పూవుల రంగులతో అద్భుతంగా పోల్చిన సుప్రభాతం ఇది.

శ్రీ సూర్యనారాయణా మేలుకో హరి సూర్యనారయణా!

పొడుస్తూ భానుడు పొన్న పూవు ఛాయ
పొన్న పూవు మీద బొగడ పువ్వు ఛాయ


ఉదయిస్తూ భానుడు ఉల్లిపూవు ఛాయ
ఉల్లిపూవు మీద ఉగ్రంపుపొడి ఛాయ

ఘడియెక్కి భానుడు కంబపువ్వు ఛాయ
కంబపువ్వు మీద కాకారి పూఛాయ

జామెక్కి భానుడు జాజి పూవు ఛాయ
జాజి పువ్వు మీద సంపెంగ పూఛాయ

మధ్యాహ్న భానుడు మల్లెపూవు ఛాయ
మల్లెపూవు మీద మంకెన్నపొడి ఛాయ

మూడు ఝాముల భానుడు ములగ పూవు ఛాయ
ములగ పూవు మీద ముత్యంపుపొడి ఛాయ

అస్తమాన భానుడు ఆవపూవు ఛాయ
ఆవపూవు మీద అద్దంపుపొడి ఛాయ

వాలుతూ భానుడు వంగపూవు ఛాయ
వంగపువ్వు మీద వజ్రంపుపొడి ఛాయ

గ్రుంకుతూ భానుడు గుమ్మడి పూ ఛాయ
గుమ్మడి పువ్వు మీద కుంకంపుపొడి ఛాయ

15, అక్టోబర్ 2016, శనివారం

సువ్వి కస్తూరి రంగా - దాసం గోపాలకృష్ణ గారి రచన


భారతీయ గ్రామీణ జీవితంలో పని చేసే వారికి అలుపు తెలియకుండా కూని రాగాలు, దరువులు, జానపద గీతాలు మొదలైన సంగీత నృత్యాంశాలు ఉద్భవించాయి. ఆడుతు పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది అని కొసరాజు రాఘవయ్య గారు రాసింది అక్షరాలా నిజం. రోజంతా పొలాలలో, ఇళ్లలో పని చేసే వారికి, ముఖ్యంగా మహిళల జీవితాలలో ఈ గ్రామీణ సంగీతం ఓ విడదీయరాని అంతర్భాగం. దీనిని ఎందరో కవులు, కళాకారులు గుర్తించి దానికి తగినంత ప్రాచుర్యం కూడా తెచ్చారు. జానపద సంగీతంలో అందరికీ అర్థమయ్యే భాషలో, ఆయా జీవితాలను ప్రతిబింబించేలా ఈ కళలు ఎంతో ప్రచారం పొందాయి. అటువంటి కోవకు చెందినవే సువ్వి పాటలు. ఆధునిక పనిముట్లు రాకమునుపు శారీరిక శ్రమ కలిగిన పంటలు కోసి కుప్పలు వేయటం, నీళ్ళు మోయటం, ధాన్యాలు దంచటం, రోట్లో పప్పు రుబ్బటం, పిండ్లు కొట్టుకోవటం, పెద్ద ఎత్తన వంటలు చేయటం వంటి పనులలో స్త్రీ పురుషులు తప్పకుండా ఓ పాట అందుకునే వారు. వాటిలో ఒకింత కష్టాన్ని ప్రతిబింబించే పదాలు, కాస్త ఉత్సాహం, కాస్త శృంగారం, కాస్త చిలిపితనం, కాస్త ఆధ్యాత్మికత కలబోసి ఓ అద్భుతమైన రస సమ్మేళనం మనకు ఆవిష్కరించబడుతుంది. పనిలోనూ లయ అనేది మనకు గ్రామీణ శ్రామికుల జీవితాలలో కనబడుతుంది. ఇది సనాతనమైన కళ.

సువ్వి పాటలలో ప్రత్యేకత అవి దాదాపు అన్నమయ్య, క్షేత్రయ్య వంటి వాగ్గేయకారుల సంకీర్తనలకు భావ సారూప్యత కలిగి ఉండటం. మన భారతీయ గ్రామీణ జీవితాలలో ఉన్న గొప్పతనం ఇదే.  ప్రతి ఒక్క కోణంలోనూ ఆధ్యాత్మికత తొణికిసలాడుతూ ఉంటుంది. అలాగే, మధురభక్తి. తాను నాయికగా, స్వామి నాయకుడిగా ఆరాధించే భావన మధురభక్తి. సువ్వి పాటలలో ఈ మధురభక్తి నిండి ఉంటుంది. మధురభక్తికి పతాకస్థాయి కృష్ణ తత్త్వం. సర్వం ఆ నల్లనయ్యకు సమర్పించి ఆయనతో సరససల్లాపాలాడే అనుభూతులు ఎందరో వాగ్గేయకారులు తమ సంకీర్తనలలో కనబరచారు. అటువంటి భావనే కలిగిన ఓ సువ్వి గీతం దాసం గోపాలకృష్ణ గారు రచించిన "సువ్వి కస్తూరి రంగ సువ్వి కావేటి రంగ సువ్వి రామాభిరామ సువ్వి లాలి".

దాసం గోపాలకృష్ణ గారు 1930 ఫిబ్రవరి 13న పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి సమీపంలోని కుముదవల్లి గ్రామంలో సత్యవతి వెంకట్రామయ్య దంపతులకు జన్మించారు. విద్యాభ్యాసం తరువాత పాలకొల్లులో తన నాటక రంగ సేవను మొదలుపెట్టారు. ఆయన సినీ ప్రస్థానం చెన్నైలో 1951లో మొదలైంది. 1955లో వినోదిని పత్రికకు ఆయన స్వాతంత్ర్య పర్వదిన అనే అద్భుతమైన వ్యాసం రాశారు. చిన్నవయసులోనే ఆయన ఎన్నో నాటకాలను రచించారు. రైతు భారతం, సర్వం జగన్నాథం, పున్నమదేవి(చారిత్రాత్మకం) చిలకా గోరింకా, రాగజ్వాల లాంటి నాటకాలు, నాటికలు, బుర్రకథలు రచించారు. ఆయనకు బాగా పేరు తెచ్చిన సాంఘిక నాటకం 'చిల్లరకొట్టు చిట్టెమ్మ '. 1960లో ఈ నాటిక తణుకులో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు నాటకపోటీలలో ప్రథమ బహుమతి పొందింది. 1965లో భక్త పోతన చిత్రానికి సంభాషణలు రాశారు. చిల్లరకొట్టు చిట్టెమ్మ నవలను దాసరి నారాయణరావు గారు 1977లో చిత్రంగా తెరకెక్కించారు. ఆ చిత్రానికి గోపాలకృష్ణ గారు పాటలు, సంభాషణలు అందించారు. తెలుగు చలన చిత్రాలలో ప్రెసిడెంటు పేరమ్మ, భక్త పోతన, బంగారు సంకెళ్లు, శివరంజని వంటి చిత్రాలకు పాటలు, మాటలు రాశారు. అత్తను దిద్దిన కోడలు, కళ్యాణి, రాణీకాసుల రంగమ్మ, అల్లుడు పట్టిన భరతం, పసుపు-పారాణి, దేవదాసు మళ్లీపుట్టాడు, రౌడీ రంగమ్మ, ప్రణయగీతం వంటి చిత్రాలలో  పని చేశారు. శివరంజని చిత్రంలో ఆయన రచించిన గీతం 'జోరు మీదున్నావు తుమ్మెదా'  అన్న పాట ఎంతో పేరుపొందింది. 50కు పైగా చిత్రాలలో పని చేసి 40 మంచి గీతాలు రచించిన దాసం గోపాలకృష్ణ గారు మరణించారు.


1977లో విడుదలైన చిల్లరకొట్టు చిట్టెమ్మ చిత్రానికి దాసం గోపాలకృష్ణ గారు రచించిన 'సువ్వి కస్తూరి రంగ ' అనే గీతం ఎస్.జానకి గారి అద్భుతమైన గాత్రంలో, బాలుగారు మిమిక్రీతో ఎంతో పేరుపొందింది. రమేష్ నాయుడు గారి సంగీతంలో వెలువడిన గీతం శ్రీకృష్ణుడు-గోపికల మధ్య శృంగార  భావనలను, చిలిపి చేష్టలను ప్రతిబింబిస్తుంది.  అర్థరాత్రి నిద్రలో ఆ కొంటె కృష్ణుడు ఆ గోపెమ్మ దగ్గరకు వచ్చి వంగి వంగి చూసి, కొంగు పట్టుకొని లాగాడుట, యమునా తీరానికి తీసుకువెళ్లాడుట. ఆ బృందావనంలో గొల్లభామలలో కలిసి ఆడి పాడిందట. నిద్రలేచి అద్దంలో చూసుకుంటే ఆ కృష్ణుని ముద్దుల ముద్రలు అద్దినట్లుగా ఉన్నాయిట. ఈ భావనలను సువ్వి-ఆహు పద సంపుటితో అందంగా రాశారు దాసం గోపాలకృష్ణగారు. ఈ చిత్రం పాలకొల్లు, పాలకొల్లు పోడూరు ప్రాంతాలలోనే చిత్రీకరించటంతో పాటకు మరింత అందం వచ్చింది. దాసం గోపాలకృష్ణ గారి రచనలు గ్రామాల సంభాషణలలో సహజమైన పదప్రయోగాలు కలిగి తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటాయి. అందుకే, తక్కువ పాటలు రాసినా, అవి ఇప్పటికీ ప్రజల హృదయాలలో స్థానం కలిగి ఉన్నాయి. సువ్వి కస్తూరి రంగ అనే గీతం సాహిత్యం మీకోసం. జానకి గారు ఈ పాటను పాడినట్లు వేరే ఏ గాయని కూడా పాడలేరు అనేలా ఉంటుంది ఈ గానం. రమేష్ నాయుడు గారు మధురమైన సంగీతానికి పెట్టింది పేరు. 1970-80 దశకాలలో ఆయన తెలుగు చిత్రాలకు అందించిన అద్భుతమైన సంగీతం అజరామరం. బాలుగారు, జానకి గార్ల నేపథ్య వైభవంలో ఆయనకు చాలా ముఖ్యమైన పాత్ర ఉంది.

సువ్వి ఆ హు సువ్వి ఆ హు ....సువ్వి...సువ్వి

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ

హైలేసా హయ్యా .. హైలేసా హయ్యా .. హైలేసా హయ్యా .. హైలేసా హయ్యా ..

అద్దమరేతిరి నిద్దురలోన ముద్దుల కృష్ణుడు ఓ చెలియా
అద్దమరేతిరి నిద్దురలోన ముద్దుల కృష్ణుడు ఓ చెలియా
నా వద్దకు వచ్చెను ఓ సఖియా

ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ...
ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ...

వంగి వంగి నను తొంగి చూచెను
కొంగు పట్టుకుని లాగెనుగా
వంగి వంగి నను తొంగి చూచెను
కొంగు పట్టుకుని లాగెనుగా
భల్ చెంగున యమునకు సాగెనుగా

అల్లావనమున కొల్లలుగా వున్న గొల్ల భామలను కూడితిని
నే గొల్ల భామనై అడితిని ...నే గొల్ల భామనై అడితినీ...


నిద్దుర లేచి అద్దము చూడ ముద్దుల ముద్దర ఓ చెలియా ...
నిద్దుర లేచి అద్దము చూడ ముద్దుల ముద్దర ఓ చెలియా ...
హబ్బ... అద్దినట్టుంది ఓ సఖియా...

సువ్వి...ఆహూం...సువ్వీ..ఆహుం..
సువ్వి...ఆహూం...సువ్వీ..ఆహుం..
సువ్వి...ఆహూం...సువ్వీ..ఆహుం..

10, అక్టోబర్ 2016, సోమవారం

ముగురమ్మలు, మహిషాసుర మర్దిని స్తుతి మరియు నీరాజనం - మహర్నవమి


శరన్నవరాత్రులలో ఆఖరి రోజు మహా నవమి. బెజవాడ కనకదుర్గమ్మ మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తుంది. దేవీ మహాత్యంలో దుష్టులను సంహరించటానికి ఆది పరాశక్తి దుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలను ధరిస్తుంది. మధు కైటభులు, మహిషాసురుడు, శుంభ నిశుంభులు ఆ తల్లి చేతులలో హతమవుతారు. రాక్షసులంటే ఎక్కడో ప్రయేకంగా కాదు. దుర్లక్షణాలను బట్టి ప్రవృత్తికి రాక్షసత్వం అనే పేరు ఇవ్వబడింది. మనలోనే ఉంటూ మన మధ్య్తే తిరుగుతూ వికృతక్రీడలతో, దౌర్జన్యంతో స్త్రీలను, బలహీనులను హింసించి ఆధిపత్యం పొందే వాళ్లే రాక్షసులు. అటువంటి వారిని దండించటానికి ఆ అదిపరాశక్తి త్రిశక్తి రూపిణిగా అవతరించి మనలను తరింపజేస్తోంది.

ఈ సందర్భంగా నాకు ఇష్టమైన అమ్మను నుతించే గీతం వివరాలు, చివరగా మంగళ హారరి. ఇంతటితో ఈ శరన్నవరాత్రుల శీర్షికతో వచ్చే వ్యాసాలు సంపూర్ణం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

ఓంకార పంజరశుకీం! ఉపనిషదుద్యానకేళి కలకంఠీం !
ఆగమ విపిన మయూరీ! ఆర్యాం! అంతర్విభావయేద్గౌరీం!

అఖిలాండేశ్వరి! చాముండేశ్వరి! పాలయ మాం గౌరీ! పరిపాలయ మాం గౌరీ!

శుభగాత్రి! గిరిరాజపుత్రి! అభినేత్రి! శర్వార్ధగాత్రి!
సర్వార్ధ సంధాత్రి! జగదేక జనయిత్రి! చంద్రప్రభా ధవళకీర్తి!
చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్దశాంతర భువనపాలిని
కుంకుమరాగశోభినీ! కుసుమ బాణ సంశోభినీ!
మౌనసుహాసిని! గానవినోదిని! భగవతి! పార్వతి! దేవీ!

శ్రీహరి ప్రణయాంబురాశీ! శ్రీపాద విచలిత క్షీరాంబురాశీ!
శ్రీపీఠసంవర్ధినీ! డోలాసురమర్దినీ!
ధనలక్ష్మి! ధాన్యలక్ష్మి! ధైర్యలక్ష్మి! విజయలక్ష్మి!
ఆదిలక్ష్మి! విద్యాలక్ష్మి! గజలక్ష్మి! సంతానలక్ష్మి!
సకలభోగసౌభాగ్యలక్ష్మి! శ్రీమహాలక్ష్మి! దేవీ!

ఇందువదనే! కుందరదనే! వీణాపుస్తకధారిణే!
శుకశౌనకాది వ్యాసవాల్మీకి మునిజన పూజిత శుభచరణే!
సరససాహిత్య స్వరస సంగీత స్తనయుగళే!
వరదే! అక్షర రూపిణే! శారదే! దేవీ!

వింధ్యాటవీవాసినే! యోగసంధ్యాసముద్భాసినే!
సింహాసనస్థాయినే! దుష్టహర రంహక్రియాశాలినే!
విష్ణుప్రియే! సర్వలోకప్రియే! శర్వనామప్రియే! ధర్మసమరప్రియే!
హే బ్రహ్మచారిణే! దుష్కర్మవారిణే! హే విలంబిత కేశపాశినే!
మహిషమర్దనశీల! మహితగర్జనలోల! భయతనర్తనకేళికే! కాళికే!
దుర్గమాగమదుర్గ పాహినే! దుర్గే! దేవీ!

వేటూరి వారి సాహితీ ప్రతిభ దేవీ వైభవంగా ఎలా ఆవిష్కరించిందో చూడండి. ముగురుమ్మల కలయికగా వెలసిన దుర్గ మహిషాసురమర్దినిగా ఎలా ఉంటుందో మన కళ్లకు కట్టినట్లుగా నుతించారు వేటూరి. మొదటి చరణంలో గౌరిని, రెండవచరణంలో మహాలక్ష్మిని, మూడవ చరణంలో సరస్వతిని, చివరి చరణంలో దుర్గను అమోఘమైన పదవిన్యాసంతో ప్రస్తుతించారు. పదప్రయోగంలో వేటూరి వారి పాండిత్యం విలక్షణమైనది. ఈ గీతాన్ని భమిడిపాటి సబిత అనే నృత్యకళాకారిణి నాట్యంగా సప్తపది చిత్రంలో తెరకెక్కించారు. అద్భుతమైన కూచిపూడి విన్యాసంలో, సుశీలమ్మ-బాలు గార్ల సుసంపన్నమైన గాత్రంలో మామ మహదేవన్ గారు మనకు ఈ వేటూరి సాహితీ పారిజాతాన్ని అందించారు.

మొదటి చరణంలో ఆ గౌరిని హిమవంతుని పుత్రికగా, అందమైన ముఖము కల తల్లిగా,  నాట్యాభినయంలో నిపుణురాలుగా, శంకరుని సగభాగంగా, సమస్త సంకల్పములను నెరవేర్చే తల్లిగా, మూడులోకాలకు జననిగా, చంద్రుని వలె ప్రకాశవంతమైన కీర్తి కల అమ్మగా, నాలుగు హస్తములతో దుష్టులను శిక్షించి, భక్తులకు అభయమిచ్చి 14 లోకాలను పాలిచే తల్లిగా, కుంకుమతో శోభిల్లుతూ పూలబాణములతో  వెలిగే అమ్మగా, మౌనముగా చిరునవ్వుతో, సామగానాన్ని ఆనందిస్తూ  ఉండే భగవతిగా పార్వతిని కవి ప్రస్తుతించారు.

రెండవ చరణంలో అమ్మను శ్రీమహావిష్ణువు ప్రేమకు నిలయంగా, పాలకడలిలో ఆ శ్రీహరి పాదాలను సేవిస్తూ ఉండే అమ్మగా, శ్రీపీఠమున స్థిరమైన తల్లిగా, డోలారుసుని సంహరించిన దేవతగా, ధన ధాన్య ధైర్య విజయ ఆది విద్యా గజ సంతాన లక్ష్ములనే అష్ట రూపములతో లోకాల సమస్త కామ్యములను తీర్చే తల్లిగా, సకల సంపదలనిచ్చే కల్పవల్లిగా శ్రీమహాలక్ష్మిని నుతించారు.

మూడవ చరణంలో చంద్రునివంటి ముఖముతో, అందమైన పలువరసతో, వీణ మరియు పుస్తకములు చేత ధరించిన తల్లిగా, శుకుడు శౌనకుడు, వ్యాసుడు, వాల్మీకి మొదలైన వారిచే పూజించబడిన శుభ చరణముల కల అమ్మగా, రసపూరితమైన సాహిత్యము, రసయుక్తమైన సంగీతములనే స్తనములు కలిగిన అమ్మగా, వరములనిచ్చే తల్లిగా, అక్షర రూపిణిగా, శారదగా ఆ సరస్వతీదేవిని నుతించారు.

నాలుగవ చరణంలో ముగురమ్మలు ఏకమైన మహిషాసుర మర్దిని రూపాన్ని కవి అద్భుతంగా ఆవిష్కరించారు. వింధ్యపర్వత శ్రేణుల వద్ద అడవులలో నివసించే అమ్మగా, యోగము, సంధ్యావందనంలో ప్రకాశించే శక్తిగా, సింహారూఢయై దుష్టులను సంహరించే క్రియలో నిపుణురాలైన ఆదిపరాశక్తిగా, విష్ణువుకు, శివునికి,సమస్తలోకములకు ప్రియమైనదిగా, ధర్మ యుద్ధములంటే ఇష్టపడేదిగా, బ్రహ్మచారిణిగా, దుష్కర్మలను వారించేదిగా, ముడివేయని కేశములు కలదిగా, పాశమును ధరించి గొప్ప గర్జనలు, భయము కలిగించే నృత్యము చేస్తూ చేస్తూ కాళిక రూపంలో మహిషాసురుని మర్దించిన గుణశాలిగా, కష్టతరమైన ఆగమాలకు మూలమైన దుర్గగా కొనియాడారు.

ఈ గీతం విని ఆ నృత్యాన్ని చూస్తుంటే రోమాంచమే. అమ్మ రూపాలు, మహిషాసుర మర్దిని విలయ తాండవం మన రోమరోమంలో జాగృతమై తెలియని శక్తి వస్తుంది. ఉత్తేజితులమై కార్యోన్ముఖులమయ్యేలా ఉంటుంది. నిజంగా వేటూరి వారు ఈ గీతాన్ని రాసే సమయంలో ఎటువంటి ఆధ్యాత్మిక శక్తిని అనుభూతి చెందారో ప్రతి అక్షరంలోనూ మనకు ప్రకటితమవుతుంది. అలాగే, కేవీ మహదేవన్ గారు ముగురమ్మలు మరియు మహిషాసురమర్దిని రూపాన్ని వర్ణించే చరణాలకు సముచితమైన రాగాలను ఉపయోగించారు. మనోజ్ఞమైన రాగమాలికగా అందించారు. అందుకే ఇది ఒక మహోన్నతమైన స్తుతిగా నిలిచిపోయింది.

స్త్రీశక్తి జాగృతమై ఈ జగతి సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశిస్తూ, ఈ నీరాజనం.

శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం
కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం

యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం
బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం

నెలకొల్పు డెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం
రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం

మనుజాళి హృదయాల తిమిరాలు తొలగించు మా తల్లి నవ్వులకు నీరాజనం
ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం

చెక్కిళ్ల కాంతితో క్రిక్కిరిసి అలరారు మా తల్లి ముంగెరకు నీరాజనం
రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం

పసిబిడ్డలను చేసి ప్రజలెల్ల పాలించు మాతల్లి చూపులకు నీరాజనం
అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం

పగడాల మరిపించు ఇనబింబమనిపించు మాతల్లి కుంకుమకు నీరాజనం
నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం

తేటిపిల్లలవోలె గాలికల్లలలలాడు మా తల్లి కురులకు నీరాజనం
నీరాల నీరాజనం భక్తి భావాల నీరాజనం

జగదేక మోహినీ సర్వేశు గేహిని మాతల్లి రూపునకు
భక్తి నిలువెత్తు నీరాజనం భక్తి నిలువెత్తు నీరాజనం

బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు భాషలో ప్రావీణ్యం పొంది ఆచార్యులుగా కూడా ఎన్నో ఏళ్లు పని చేశారు. భాషపై పట్టుతో పాటు ఆధ్యాత్మికోన్నతి కూడా వారికి భగవంతుని అనుగ్రహంగా వచ్చింది. తెలుగు మరియు సంస్కృత భాషలలో ఉభయ భాషా ప్రవీణులు వీరు. దేవీభాగవతంపై వీరు విస్తృత పరిశోధన చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరబాద్ లో తెలుగు విభాగంలో ఎన్నో ఏళ్లు ఆచార్యునిగా భాషాసేవ చేశారు.

వీరి రచన ఈ శీతాద్రి శిఖరాన భక్తి గీతం. లోకమాతకు ఇలా నీరాజనం ఇస్తున్నాడు కవి.

హిమవత్పర్వత శిఖరంపై పగడాలతో తాపినట్లుగా ఉన్న మా తల్లి కాళ్ల పారాణికి కెంపువంటి ఎరుపైన, భక్తితో నిండిన నీరాజనం. యోగుల హృదయాలలో చక్కగా మ్రోగే తల్లి అందెలకు బంగారు, భక్తి రంగరించిన నీరాజనం. హృదయంలో నిలిపిన వారికి ప్రేమ వీణలు మ్రోగించే తల్లి గాజులకు రాగాలతో, భక్తి భావములతో నీరాజనం. మానవాళి హృదయాలలోని అంధకారాన్ని తొలగించే తల్లి నవ్వులకు ముత్యాల మరియు భక్తితో కూడిన నృత్యాల నీరజనం. బుగ్గలపై గల వెలుగుతో క్రిక్కిరిసి అలరారే తల్లి ముక్కు పోగుకు రతనాల, భక్తి ప్రయత్నాలతో కూడిన నీరాజనం. ప్రజలందరినీ పసిబిడ్డలను చేసి పాలించే తల్లి చూపులకు అనురాగంతో, భక్తి కనబరుస్తూ నీరాజనం. పగడాలను మరపించేలా, సూర్యబింబంవలె అనిపించే తల్లి కుంకుమకు నిండైన, భక్తి మెండుగా గల నీరాజనం. తేనేటీగ పిల్లల వలే గాలికి అటు ఇటూ ఊగే తల్లి కురులకు నీటితో మరియు భక్తి భావములతో నీరాజనం. జగములోకెల్ల అతి సౌందర్యవతి, సర్వేశ్వరుని పత్ని అయిన తల్లి రూపమునకు భక్తితో నిలువెత్తు నీరాజనం.

కేవలం ప్రాస కోసం పదాలు కాకుండా మంచి భావ సంపద కూడా ఈ గీతంలో ఉన్నాయి. భక్తి విశ్వాసాలతో కూడిన నీరాజనాలు అమ్మ తప్పకుండా స్వీకరించి అనుగ్రహిస్తుంది.

ఈ మంగళహారతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు. శరన్నవరాత్రులలో ఈ అవకాశం నాకు కల్పించిన ఆ జగన్మాతకు, మీకు అందరికీ ధన్యవాదాలు. లోకాస్సమస్తా సుఖినోభవంతు!!

9, అక్టోబర్ 2016, ఆదివారం

దుర్గాష్టమి - శ్రీ దుం దుర్గే



దుర్గే దుర్గత హారిణి త్రిజగతాం సర్గాది సిద్ధార్ధకే
స్వర్గాధీష్ట ఫల ప్రదాన నిపుణే త్రాయస్వ న శ్శంకరి
సా త్వం సర్వ జనాంతరాంతర చిదం సానన్య సిద్ధాత్మికా
సారాసార వివేక దృష్టి విదితా సర్వైక సాక్ష్యాత్మనా

ఓ దుర్గా! మానవుల కష్టములను హరించే తల్లీ! మూడు లోకాల సృష్టి స్థితి లయములకు కారకురాలవు నీవు! సమస్త అభీష్టములను తీర్చే నైపుణ్యము గల తల్లీ! శుభకరీ! మా అంతరాత్మవు నీవు! మాకు విచక్షణ, వివేకము, జ్ఞానము కలిగించే తల్లివి! మూడు లోకాలకు సాక్షీభూతవు నీవు!

అని ఆ దుర్గామాతను నారాయణ తీర్థులవారు తమ శ్రీకృష్ణ లీలా తరంగిణిలో యోగమాయ కంసునికి కృష్ణజన్మవృత్తాంతాన్ని తెలిపిన సందర్భంలో దుర్గాదేవిని మునుల నోట నుతింపజేశారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి మనకు అభయమిచ్చే ఆ సింహవాహినికి పర్వం ఈ దుర్గాష్టమి. దుర్గాసూక్తంలో అమ్మ వైభవాన్ని ఇలా చాటారు:

తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్
దుర్గాం దేవిగ్ం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః

అగ్నివర్ణం కలదీ, తపస్సు ద్వారా ప్రకాశించునదీ, భగవంతునికి చెందినదీ, కర్మ యొక్క ప్రతిఫలాలలో శక్తిగా నెలకొన్నదీ అయిన దుర్గాదేవిని నేను శరణు జొచ్చుచున్నాను. దుఃఖసాగరం నుండి మమ్మలను తీరానికి చేర్చే దేవీ! మమ్ము కాపాడు. నీకు నమస్కారము.

మానవజన్మకు కష్టసుఖాలలో దుర్గమమైన పరిస్థితి ఏర్పడినప్పుడు దుర్గాదేవిని శరణు వేడితే అవి తొలగిపోతాయన్నది ఆర్యోక్తి. మరి అటువంటి దుర్గను కొలిచి ఇదివరకు ఎవరు విజయాన్ని సాధించారు? మనలాంటి మానవులే అయిన పంచ పాండవులు. మహాభారతం విరాట పర్వం ఆరంభంలో పాండవులు అజ్ఞాతవాసానికై విరాటుని కొలువుకు వెళ్లేముందు ధర్మరాజు దుర్గాదేవిని స్తుతించాడు. యుధిష్ఠిరుడి వంటి ధర్మ ప్రభువుకు, సత్యసంధునకు కూడా కష్టాలు తప్పలేదు. అఖండ భారతదేశాన్ని పాలించవలసిన పాండుకుమారులకు తమ నిజస్వరూపం తెలియకుండా మారువేషాలలో ఇంకొకరి పంచన ఉండాల్సిన అగత్యం వచ్చింది. ఎవరు అప్పుడు శరణు? ఆదిపరాశక్తి దుర్గ. ధర్మరాజు ఆ తల్లిని నారాయణుని సోదరిగా, కంసుని మరణానికి కారణమై, దానిని ఆ అసురునికి స్వయంగా తెలిపిన యోగమాయగా గ్రహించి నుతిస్తాడు.

నందగోపకులే జాతాం మంగళ్యాం కులవర్ధినీం

కంసవిద్రావణకరీం అసురాణాం క్షయంకరీం
శిలాతటవినిక్షిప్తాం ఆకాశం ప్రతిగామినీం

వాసుదేవస్య భగినీం దివ్యమాల్య విభూషితాం
దివ్యాంబరధరాం దేవీం ఖడ్గఖేటక ధారిణీం

జయా త్వం విజయా చైవ సంగ్రామే చ జయప్రదా
మమాపి విజయం దేహి వరదా త్వం చ సాప్రతం

వింధ్యే చైవ నగశ్రేష్ఠే తవ స్థానం హి శాశ్వతం
కాళి కాళి మహాకాళి ఖడ్గఖత్వాంగధారిణి

దుర్గాత్ తారయసే దుర్గే తత్ త్వం దుర్గా స్మృతా జనైః
కాంతారేష్వవసన్నానాం మగ్నానాం చ మహార్ణవే

దస్యుభిర్వా నిరుద్ధానాం త్వం గతిః పరమా నృణాం
జలప్రతరణే చైవ కాంతారేష్వటవీషు చ

యే స్మరంతి మహాదేవి న చ సీదంతి తే నరాః
త్వం కీర్తిః శ్రీః ధృతిః సిద్ధిః హ్రీః విద్యా సంతతిర్మతిః

సంధ్యా రాత్రిః ప్రభా నిద్రా జ్యోత్స్నా కాంతిః క్షమా దయా
నృణాంచ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయం

వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి
సోహం రాజ్యాత్ పరిభ్రష్టః శరణం త్వాం ప్రపన్నవాన్

ప్రణతశ్చ యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి
త్రాహి మాం పద్మపత్రాక్షి సత్యే సత్యా భవస్వ నః

అనగా,

యశోద గర్భము నుండి పుట్టి, నారాయణునికి ప్రియమైన, నందగోపుని వంశంలో జన్మించి, అందరికీ శుభములిచ్చి వంశాభివృద్ధి కలిగించే తల్లీ! కంసుని పారద్రోలి, అసురులను నాశనం చేసి, రాతిమీద కొట్టబడినా ఆకాశమార్గంలో పయనించిన వాసుదేవుని సోదరీ! దివ్యమైన పూలమాలలు, వస్త్రములు, ఖడ్గమును, డాలు దాల్చిన దేవీ!

నీవే జయవు, విజయవు. యుద్ధములో జయమునిచ్చే దానవు. నాకు కూడ విజయాన్ని ప్రసాదించే వరాన్ని ఇపుడీయుము.

కాళీ! మహాకాళీ! ఖడ్గము, కపాలం కల దండము ధరించి పర్వత శ్రేష్ఠమైన వింధ్య పర్వతాన్ని శాశ్వత నివాసం చేసుకున్నావు.

ఓ తల్లీ! భరింపరాని కష్టాలనుండి తరింప జేస్తావు కాబట్టే నిన్ను ప్రజలు దుర్గ అని కొలుస్తారు. అడవుల్లో చిక్కుకున్న వారికి, సముద్రం దాటే వారికి, దుర్గమమైన మార్గాలలో పయనించే వారికి, క్రూరుల బారిన పడేవారికి నీవే గతి. నిన్ను స్మరించినవారు ఈ కార్యాలలో కష్టాలపాలు కారు.

నీవే కీర్తివి, శుభానివి, ధైర్యానివి, సిద్ధి, లజ్జ, విద్య, సంతానం, బుద్ధి, సంధ్య, రాత్రి, తేజస్సు, నిద్ర, వెన్నెల, కాంతి, ఓర్పు, దయ మొదలైన రూపాలన్నీ నీవే. నిన్ను పూజించే వారి బంధనం, మోహం, పుత్రశోకం, ధననాశం, రోగం, మృత్యువు, భయము తీరుస్తావు. అమ్మా! ఇప్పుడు నేను రాజ్యభ్రష్టుడనయ్యాను. నీ శరణు వేడుతున్నాను.

దేవతలకు కూడా దేవివైన నీకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నీవు కలువరేకులవంటి ప్రసన్నమైన కనులు కలదానవు. నన్ను రక్షించు. నీవే సత్యము. మా పట్ల సత్యము కమ్ము!

ఈ విధముగా ధర్మమూర్తి అయిన యుధ్హిస్ఠిరుడు ఆ అమ్మను వేడుకోగానే ఆ తల్లి ప్రసన్నురాలై ప్రత్యక్షమై "నాయనా! నీకు త్వరలోనే విజయం కలుగుతుంది. నా అనుగ్రహం వలన విరాటుని కొలువులో మీరుండగా మీ జాడను కౌరవులతో సహా ఎవ్వరూ తెలుసుకోలేరు. నన్ను స్మరించిన వారికి నేను సదా రక్షగా ఉంటాను" అని ఆశీర్వదిస్తుంది.

ప్రముఖ వాగ్గేయకారులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారు దుర్గాదేవిని శ్రీరంజని రాగంలో తిరువారూరు సమీపంలోని కధిరమంగళం వనదుర్గామాతను కొనియాడుతూ ఓ అద్భుతమైన కృతిని రచించారు. ఈ కృతి దుర్గాదేవి మూల మంత్రం యొక్క బీజాక్షరాలతో ఆరంభమవుతుంది. ముత్తుస్వామి దీక్షితుల వారు సిద్ధపురుషులు. మంత్రసాధన చేసి, అమ్మను దర్శించి ఎన్నో కృతులను రచించారు. ఇది కూడా అటువంటిదే. దాని వివరాలు:

శ్రీ దుం దుర్గే శివ సంసర్గే చిద్రస వర్గే
స్థిరే ఆపవర్గే శ్రీ వనదుర్గే

దుందుభి వాద్య భేద నాద వినోదిని
మోదిని వీణా వాదిని సంవేదిని అభేదిని
సుందరి శ్రీరంజని నిరంజని జయ జనని

కరుణారసాలయే కలికల్మష విలయే
కర విధ్రుత కువలయే కానన నిలయే
చరణ కిసలయే చామీకర వలయే
స్వర సంగీత లయే సురుచిర మలయే
గురుగుహోదయే సదయే విజయే అభయే
సరసమయే షట్సమయే సమయే కలయే

ఓ వనదుర్గా మాతా! శివుని సహచారిణీ! సచ్చిదానంద స్వరూపిణీ! శాశ్వతమైన సుఖాలను ప్రసాదించే తల్లీ! వివిధరకములైన వాద్యముల నాదములతో ఆనందించే తల్లీ! వీణావాదనము చేసే తల్లీ! నీవు సర్వాంతర్యామివి! భేదింప శక్యము కావు! మనోజ్ఞమైన రూపము కలదానవు! శ్రీమహాలక్ష్మిని అలరించే తల్లీ! దోషరహితవు! అమ్మా! నీకు జయము! కరుణకు నిలయము నీవు, ఈ కలిదోషాలను హరించే తల్లివి, చేతిలో వికసించిన కమలము కలదానవు, అడవులలో నివసించే తల్లివి! చిగురులవలె మృదువైన పాదములు కల తల్లివి! స్వర్ణకంకణములు ధరించిన మాతవు! కార్తికేయుని తల్లివి! దయామూర్తివి, విజయవు, మాకు అభయమునిచ్చే తల్లివి! మృదువైన స్వభావము కల అమ్మవు! ఆరు మతములకు మూలము మరియు కాలానివి నీవు! అంతటా ఉన్న అమ్మవు!

బాలమురళీకృష్ణ గారి గానంలో ఈ కృతి వినండి.

దీక్షితుల వారి సాహిత్యంలో ఉండే దేవతా వైభవం మహోన్నతమైనది. పూర్తిగా దేవతానుగ్రహం పొంది, ఆ దేవతా స్వరూపంతో అనుసంధానమై ఆయన సంకీర్తనలను రచించారు. అందుకే ఆయన రచనలలో పరిపూర్ణత్వం కనబడుతుంది. ప్రస్తుత కాలంలో వనదుర్గ ఆలలయాలు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, మన సనాతన వాఙ్మయం ఈ వనదుర్గ మన కర్మభూమిలో అంతటా కొలువబడినదని చెబుతున్నాయి. తమిళనాడులోని కధిరమంగళం, తెలంగాణాలోని ఏడుపాయల, కర్ణాటకలోని దేంతడ్క, కేరళలోని పోయిల్కవే మొదలైన ప్రాంతాలలో వనదుర్గ వైభవంగా కొలువబడుతోంది. ఈ క్షేత్రాలు మహిమాన్వితమైనవి.

ఈ దుర్గాష్టమి నాడు బెజవాడ కనకదుర్గమ్మ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తుంది.

ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి | తన్నో దుర్గిః ప్రచోదయాత్ ||

కాత్యాయనీ దేవిని తెలుసుకుందాము. దాని కోసం ఆ కన్యకుమారి యైన దుర్గాదేవిని ధ్యానిద్దాం. ఆ దుర్గాదేవి మనకు ప్రేరణ నిచ్చుగాక!




8, అక్టోబర్ 2016, శనివారం

శరన్నవరాత్రులు - మూల నక్షత్రం నాడు సరస్వతీదేవి అలంకారం


శరన్నవరాత్రులలో నేడు మూల నక్షత్రం, సప్తమి అనంతరం అష్టమి. ఇంద్రకీలాద్రిపై అమ్మ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. సకల కళలకు, సమస్త విద్యలకు, వాక్కుకు రూపమైన ఆ తల్లి మానవజాతి జ్ఞానజ్యోతి నిరంతరం వెలిగేందుకు కారణం. మూలా నక్షత్రం నాడు ఆ తల్లిని ఆరాధించటం విశేషం. యా దేవీ సర్వ భూతేషు విద్యా రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః అన్నది వేదప్రణీతం. సమస్త భూతములలో విద్య రూపంలో ఉన్న ఆ తల్లికి నమస్కారములు అని దీని భావం.

ఇక సరస్వతీ దేవి స్తుతులకు వస్తే ఎన్నో విశేషమైన సంకీర్తనలు, పాటలు ఉన్నాయి. నాకు బాగా నచ్చే పాట స్వాతికిరణం చిత్రంలోని సి.నారాయణ రెడ్డి గారి సంగీత సాహిత్య సమలంకృతే అన్నది. సంస్కృతంలో రచించబడిన ఈ కృతి ఆ భారతీ దేవి వైభవాన్ని మనకు అద్భుతంగా చాటుతుంది. వివరాలు:

సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతీ! మనసా స్మరామి! శ్రీ భారతీ! శిరసా నమామి!

వేద వేదాంత వనవాసిని! పూర్ణ శశిహాసిని!
నాద నాదాంత పరివేషిణి! ఆత్మ సంభాషిణి!
వ్యాస వాల్మీకి వాగ్దాయిని! జ్ఞానవల్లీ సముల్లాసిని!

బ్రహ్మ రసనాగ్ర సంచారిణి! భవ్య ఫలకారిణి!
నిత్య చైతన్య నిజరూపిణి! సత్య సందీపిని!
సకల సుకళా సమున్వేషిణి! సర్వ రస భావ సంజీవిని!

సంగీతం, సాహిత్యము, స్వరం, రాగము, పదము, యోగములతో అలంకరించబడిన తల్లిని భారతీ దేవిగా కవి ప్రస్తుతిస్తున్నారు. వేద వేదాంతములనే వనములలో నివసించే తల్లిగా, పూర్ణ చంద్రబింబము వంటి నవ్వు కలిగి, నాదము, దానికి మూలమైన ఓంకారంతో అలంకరించబడి, ఆత్మతో అనుసంధానమైన తల్లిగా ఆ భారతీదేవిని కవి కొనియాడారు. వ్యాసుడు, వాల్మీకి వంటి అవతారపురుషులకు, ఋషులకు అద్భుతమైన వాక్ సంపదనిచ్చి వారి ద్వారా మనకు వెలలేని వాఙ్మయ సంపదనిచ్చిన, జ్ఞానమనే తీగలతో ప్రకాశించే అమ్మగా మనోజ్ఞంగా అభివర్ణించారు. బ్రహ్మ నాలుకపై నడయాడే ఆ తల్లి అద్భుతమైన ఫలాలను అందిస్తూ, సచ్చిదానంద స్వరూపిణిగా సత్యరూపిణిగా శోభిల్లుతూ, సమస్త శుభకళలకు ఆలవాలమై సమస్త రసములకు, భావములకు ప్రాణమైనదిగా నుతించారు.

ఇటువంటి గీతం రచించాలంటే సరస్వతీ అనుగ్రహం ఉంటేనే సంభవం. నారాయణ రెడ్డి గారి రచనా ప్రస్థానం గమనిస్తే ఆ అనుగ్రహం మనకు ఎల్లెడలా కనబడుతుంది. వాగ్దేవి కటాక్షం కలిగిన ఆయన ఈ చిత్రంలో ఈ గీతంతో పాటు ప్రణతి ప్రణతి ప్రణతి వంటి మరో అద్భుతమైన గీతాన్ని కూడా అందించారు. సాహిత్యానికి మూలం పదాలలో ఉండే భావం, సహజమైన పటుత్వం. సంగీత సాహిత్య సమలంకృతే అనే గీతం ఇటువంటీ సర్వ సులక్షణ సమన్వితమైనది. మహదేవన్ గారి సంగీత మాధుర్యంలో బాలసుబ్రహ్మణ్యం గారి గానంలో ఈ పాట మరింత ప్రకాశించింది.

వీణాపాణిగా, అక్షరరూపిణిగా, శుక వారిజ పాణిగా, వరదాయినిగా, సురలోక గాయనిగా ఆ తల్లి జగత్తును కాపాడుతోంది. ఆమె విపంచి నుండి నిరంతరం షడ్జమ నాదము వెలువడుతూ జగత్తులో శబ్దరస గ్రంథులకు జీవమై నిలుస్తుంది. ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో కొలిచి అనుగ్రహాన్ని పొందుదాం.

7, అక్టోబర్ 2016, శుక్రవారం

కాత్యాయనీ కన్నతల్లీ - శ్రీరంగం గోపాలరత్నం ఆలపించిన గీతం



మొన్న తిథి ద్వయం కావటంతో బెజవాడ దుర్గమ్మ మామూలుగా శరన్నవరాత్రులలో ఐదవనాడు లలితా త్రిపురసుందరి అలంకారానికి బదులుగా కాత్యాయనిగా దర్శనమిచ్చింది.

కాత్యాయని అనగానే నాకు నా చిన్ననాటి లలిత భక్తి గీతం కాత్యాయనీ కన్నతల్లీ గుర్తుకొచ్చింది. దీనిని శ్రీరంగం గోపాలరత్నం గారు అద్భుతంగా పాడారు. వింజమూరి శివరామారావు గారు ఆనాటి లలిత గీతాల రచయితలలో ప్రముఖులు. దేవులపల్లి వారికి, వింజమూరి సోదరీమణులకు బంధువు. లలిత సంగీతంలో భక్తిని గుప్పించిన కవుల ప్రతిభలు ఆనాడు ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. దేవులపల్లి వారు రచించిన లలిత భక్తి గీతాలు అనేకం. అలాగే, మరెందరో మహానుభావులు. వింజమూరి శివరామారావు గారు కథలు, పద్యాలు, కథానికలతో పాటు రామాయణాన్ని గేయంగా రచించారు కూడా. అది ఎంతో ప్రసిద్ధి పొందింది. దానిని తొలుత బాలమురళీకృష్ణగారు ఆలపించారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఆంధ్రా యూనివర్సిటీ వారు కళాప్రపూర్ణ బిరుదునిచ్చారు. ఆకసమున చిరుమబ్బుల చాటున, నల్లనివాడ నే గొల్లపిల్లనోయి, మధురానగరి సమీపంలో, వచ్చెనోయి వసంతము, వినవే చెలి పిలుపు అల్లదిగో వంటి ఎన్నో అద్భుతమైన లలితగీతాలను రచించారు. వీటిని బాలమురళిగారితో పాటు అలనాటి మేటి గాయనీమణులు రావు బాలసరస్వతి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, వేదవతీ ప్రభాకర్ గారు ఆలపించి శాశ్వతం చేశారు. ఆయన కథలు, ఆయన రచించిన గీతాలన్నీ ఎంతో పేరు పొందాయి.

వింజమూరి వారి రచనలలో ఒకటి శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించిన కాత్యాయనీ కన్నతల్లి అనే గీతం. శ్రీరంగం గోపాలరత్నం గారు తెలుగుజాతిలో జన్మించిన ఓ సంగీతపు ఆణిముత్యం. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ గానం తేనె జాలువారినట్లు ఉండేది. పద్మశ్రీ బిరుదు పొందిన ప్రఖ్యాత ఆకాశవాణి ఆర్టిస్టు ఆవిడ. తెలుగునాట సంగీత పితామహులు శ్రీపాద పినాకపాణి గారి శిష్యురాలు. ఆవిడ భక్తిరనజనిలో పాడిన పాటలు ఎందరో జీవితాలలో భక్తిని మొలకెత్తించాయి. 1939లో విజయనగరం జిల్లా పుష్పగిరిలో సుభద్రమ్మ వరదాచారి దంపతులకు జన్మించిన వీరు హరికథలు, జావళులు, కూచిపూడి మరియు యక్షగానం వంటి కళలలో గాయనిగా ప్రసిద్ధి చెందారు. హైదరబాదు మరియు విజయనగరంలలో సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆస్థాన విదుషీమణిగా పనిచేస్తున్నప్పుడు అన్నమాచార్యుల వారి కీర్తనలకు సంగీతాన్నిచ్చారు. సకలం హే సఖి అని ఆవిడ పాడిన అన్నమాచార్య కీర్తన ఎంతో పేరు పొంది నేటికి కూడా ప్రమాణమైంది. కాత్యానీ కన్నతల్లీ వివరాలు.

కాత్యాయనీ! కన్నతల్లీ! మమ్మేలు భక్తావనీ! కల్పవల్లీ!

నీ సేవలే నిత్య సంకీర్తనమ్ములే మా జీవితాల భాగ్యాలు సౌభాగ్యాలు

శివదేవ సీమంతినీ జేజేలు భువనైక సామంతినీ
నీ చూపు వెల్గులు నీ నవ్వు వెన్నెల
ఏ కాలమూ మూడు లోకాల పైనాడు

ఇంద్రకీలాద్వాసినీ దుర్గమ్మ సాంద్ర తేజోద్భాసినీ
నిన్ను పూజింతుమీ హృదయాల కుసుమాల
మన్నింపుమమ్మ నీ చరణాలే శరణాలు

ఆడియో కోసం ఈ లింకును ఓపెన్ చేయండి. క్రింది భాగంలో 2వ పాట ఇది.

http://eemaata.com/em/issues/201501/6384.html?fmt=rts

శరన్నవరాత్రులు - షష్ఠి నాడు శ్రీమహాలక్ష్మి అలంకారం



ఆశ్వయుజ శుద్ధ షష్టి శుక్రవారం బెజవాడ కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మిగా దర్శనమిస్తుంది. ఆ తల్లిని అన్నమాచార్యుల వారు ఎంతో వైభవంగా వర్ణించారు. క్షీరాబ్ది కన్యకకు అనే నీరాజనం అందరికీ తెలిసిందే. చూడరమ్మ సతులాలా అనే సంకీర్తనలో ఆయన ఆ తల్లి రూపమైన గోదాదేవిని చూడికుడుత్త నాంచారి గా అభివర్ణించారు. వివరాలు:

చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ

చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత్త నాంచారి
సోబానే సోబానే సోబానే సోబానే

శ్రీమహాలక్ష్మియట సింగారాలకేమరుదు
కాముని తల్లియట చక్కదనాలకేమరుదు
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు
కోమలాంగి ఈ చూడి కుడుత్త నాంచారి

కలశాబ్ధి కూతురట గంభీరాలకేమరుదు
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు
జలజనివాసినియట చల్లదనమేమరుదు
కొలదిమీర ఈ చూడి కుడుత్త నాంచారి

అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె
కొమెర వయస్సు ఈ చూడి కుడుత్త నాంచారి

చూడికుడుత్త నాంచారి: గోదాదేవి (చూడి కుడుత్త అనేది తమిళ పదం. తాను ధరించిన మాలను స్వామికి ఇచ్చిన అని దాని అర్థం, అలా చేసింది  గోదాదేవి కాబట్టి ఆమెను చూడికుడుత్త నాచ్చియార్ అంటారుట).

సతులారా! మన గోదాదేవి పతితో కూడియున్నది. పెండ్లిపాటలు పాడండి. (సోబాన అనే పదం కలిగిన పాటలు పెళ్లి పాటలుగా ప్రాచుర్యం పొందాయి)

ఈమె శ్రీమహాలక్ష్మి యట, అలంకారాలకు (శృంగారమునకు) ఏమి తక్కువ?  మన్మథుని తల్లియట, చక్కదనాలు ఏమి తక్కువ? చంద్రుని తోబుట్టువట (క్షీర సాగర మథనంలో లక్ష్మితో పాటు చంద్రుడు కూడా ఆవిర్భవించాడు కాబట్టి వారిద్దరు తోబుట్టువులయ్యారు), ప్రసన్నత మరియు కళకు ఏమి తక్కువ? ఈ గోదాదేవి చాల కోమలమైన శరీరము కలది.

ఈమె సముద్రుని కూతురట, గంభీరానికేమి తక్కువ? తలచితే లోకానికి తల్లియట దయకేమి తక్కువ? నీటినుండి పుట్టిన కమలంలో నివసిస్తుందట చల్లదనానికేమి తక్కువ?  ఈ గోదాదేవి అన్నీ అపరిమితంగా కలిగినది.

ఈమె దేవతల వందనాలు పొందినదట, అటువంటి మహిమలకేమి తక్కువ?  అమృతానికి చుట్టమట (క్షీర సాగర మథనంలో అమృతము కూడా ఉద్భవించింది కాబట్టి) మరి ఆనందాలకేమి తక్కువ? కౌమార్యంలో ఉన్న ఈమెను ఆత్రుతతో శ్రీవేంకటేశుడు తానే వచ్చి పెండ్లాడాడు.

అన్నమాచార్యుల వారు గోదా వైభవాన్ని ఈ సంకీర్తన ద్వారా అద్భుతంగా వివరించారు. శ్రీరంగనాథుని పుట్టుకతోనే కొలిచిన గోదా శ్రీమహాలక్ష్మి అవతారంగా దర్శించి ఈ సంకీర్తనను మనకు అందించారు. గోదాదేవి శృంగారాన్ని, సౌందర్యాన్ని, తల్లి ప్రేమను, కరుణను, కళలను, మహిమలను, గాంభీర్యాన్ని, కోమలత్వాన్ని అద్భుతమైన ఉపమానములతో లక్ష్మీదేవితో పోల్చి ఈ కీర్తనకు దివ్యత్వాన్ని చేకూర్చారు. ఆమె ఈ గుణాలను గమనించి శ్రీరంగనాథుడు వచ్చి పెండ్లాడిన సందర్భంగా సతులను సోబాన పాడరమ్మా అని కోరుతున్నాడు సంకీర్తనాచార్యుడు. పదకవితా పితామహుని భావ సంపద, భక్తి జ్ఞాన సౌరభాలు ఈ సంకీర్తన ద్వారా ప్రకాశిస్తున్నాయి. తల్లిలో ఉండే సర్వ సులక్షణాలను అన్నమయ్య ఇందులో పొందుపరచారు.

విష్ణుచిత్తుని ఇంట జన్మించిన ఆ లోకమాత శ్రీరంగనాథునితో ఏకమయ్యే అద్భుతమైన అవతరణిక తిరుప్పావై.  ఆ తిరుప్పావైలోని ఘట్టాలను ఎందరో సంకీర్తనాచార్యులు తమ భావాలలో వ్యక్తపరచారు. గోదావైభవాన్ని స్వయంగా శ్రీవిల్లిపుత్తూరులో దర్శించి తరించిన అన్నమాచార్యుల వారు దానిని తిరుమల-తిరుపతిలో వెలసిన వేంకటేశుడు-అలమేల్మంగల వైభవానుభూతికి సారూప్యంగా వర్ణించారు. తన జీవితాన్ని శ్రీరంగంలోని రంగనాథునికి సమర్పించిన గోదా 'నేను' అన్న భావాన్ని త్యజించి స్వామిలో ఐక్యమయ్యింది. అందుకే లోకవంద్య అయ్యింది.

అన్నమాచార్యుల వారు అమ్మవారిని ఎన్నో కీర్తనలలో నుతించారు. మెరుగు బోడి అన్నా, చూడికుడుత నాంచారి అన్నా, క్షీరాబ్దికన్యక అన్నా, జయలక్ష్మి అన్నా, ఆ అమ్మను ప్రతి ఒక్క సంకీర్తనలోనూ ప్రత్యేకంగా, ఒక వినూత్నమైన భావాన్ని మన ముందు ఆవిష్కరించారు.  పరమాత్మ యొక్క మాయా స్వరూపిణిగా కూడా మనకు వివరించారు. స్వామితో సరస శృంగార సల్లాపాలు సలిపే అమ్మ, లోకమాతగా, మనలను అపారమైన కరుణతో అనుగ్రహించే తల్లిగా, చల్లని చూపులతో కాపాడే కల్పవల్లిగా, సకల సద్గుణాల రాశిగా అన్నమాచార్యుల వారు ఎన్నో కీర్తనలలో ప్రస్తుతించారు. వాటిలో ఈ చూడరమ్మ సతులాలా ప్రత్యేకమైనది.

వివాహమనేది మానవ జన్మలో ఎంతో పవిత్రమైనది. దానికి సంబంధించిన వేడుకలను, ముచ్చటలను అన్నమాచార్యుల వారు తమ పదశోభలలో ఎంతో మధురంగా జనులకు అర్థమయ్యే భాషలో, అనాటి సమాజానికి అద్ధం పట్టేలా రచించారు. పిడికిట తలంబ్రాల పెళ్లికూతురని పాడినా, సోబాన పాడరమ్మా అని నుతించినా ఆయా వేడుకలను మనకు ఇప్పటికీ తెలిసేలా సాహిత్యాన్ని గుప్పించారు. ఇదే మన సంస్కృతిలోని గొప్పతనం. అది ఒక గంగా ప్రవాహంలాంటిది. మహానుభావుల భావ స్పందనలు రచనలుగా మారి, తర తరాల వారసత్వంగా మనకు అందుతోంది.

అన్నమాచార్యుల పదకవితా వైభవం, ఆధ్యాత్మిక ఉన్నతికి ఈ కీర్తన ఒక కలికితురాయి.  గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారి గళంలో ఈ సంకీర్తనను వినండి.

http://play.raaga.com/telugu/song/album/Anamaya-Sankerthana-Vedanadam-AD000028/Chodaramma-Sathulala-36875

6, అక్టోబర్ 2016, గురువారం

బుచ్చి గ్రామ తిరగమోత



వంటింట్లోంచి వస్తున్న పోపు ఘాటు నషాలానికి అంటి ఉక్కిరి బిక్కిరై పొరలు పొరలుగా దగ్గుతున్నాడు అప్పదాసు. "ఏమేవ్ ఏమని నిన్ను కట్టుకున్నానో ఆ క్షణం నుండీ నీ గ్రామ తిరగమోతతో చస్తున్నాను..."

బుచ్చి: "ఆ అవును ఇంతోటి మన్మథుడని మీరు...ఆ ద్రాక్షారామం సంబంధం వదులుకొని మిమ్మల్ని చేసుకున్నాను చూడండీ! కాపురానికొచ్చిన మర్నాడే మీరు మీ అమ్మ కూర్చొని పోపు ఇలా పెట్టాలి, ఇవి వేయాలి, అవి వేయాలి అని నా బుర్ర తినేసి నేర్పించారు. ఆ తిరగమోతే ఇది...మీరు ఏది అన్నా అది మీకూ, పైనున్న ఆ మహాతల్లికి చెందుతాయి..."

అప్పదాసు: "ఒసేవ్! నీ మొహానికి పప్పులో తిరగమోతలో శనగపప్పు వేయకూడదని కూడా తెలియదు. అది చెప్పి సరిదిద్దితే నీ ముదనష్టపు తిరగమోత ఘాటును మాకు అంటగడతావా. ఇది అన్యాయమే బుచ్చీ!"

బుచ్చి:  "ఏవిటీ అన్యాయం! ఇది దప్పళం, అది పులుసు, ఇది పప్పు, అది పప్పు చారు, ఇది సాంబారు, అది కదంబం పులుసు అని వంద రకాల పేర్లు పెట్టి ఒకే వంటను తిప్పి తిప్పు చెప్పి వాటికి తలా ఓ రకం తిరగమోత చెబితే 16 ఏళ్ల వయసులో నాకేం తెలిసి చస్తాయి! అమ్మో అమ్మో మీరు మీ అమ్మ వంటల గోలతో నేను కాబట్టి వేగాను. ఇంకోతి అయితేనే ఎప్పుడే చెప్పున చాటన కొట్టేది.."

అప్పదాసు: "బుచ్చీ! చెప్పున చాటన కొడతావా!! ఉండు నీ పని చెబుతా" అని చేతిలో ఉన్న పేడ ముద్ద గట్టిగా బుచ్చి కాళ్లకేసి కొట్టాడు.

బుచ్చి: "ఆ! ఆ! ఎంత అఘాయిత్యం! పేడతో కొట్టడానికి నేనేవన్నా మట్టి గోడనా! ఉండండీ మీ పని చెబుతా" అని బలంగా చేతిలో ఉన్న కంచు గరిటె విసిరింది. ఆ కంచు దెబ్బకు అప్పదాసు మోకాలి చిప్ప ఖంగున మోగింది మరుక్షణం అప్పదాసు "అమ్మా" అని కింద బొక్క బోర్లా పడ్డాడు.

ఆ తరువాత బుచ్చి-అప్పదాసుల యుద్ధం ఓ గంటసేపు సాగింది. ఇల్లు కిష్కింధకాండ. ఆ ఇంట ఓ వానర జంట వీరంగం...

శరన్నవరాత్రులలో ఐదవనాడు కాత్యాయని అలంకారం



తిథి ద్వయం కావటంతో బెజవాడ దుర్గమ్మ మామూలుగా శరన్నవరాత్రులలో ఐదవనాడు లలితా త్రిపురసుందరి అలంకారానికి బదులుగా కాత్యాయనిగా దర్శనమిచ్చింది.

కాత్యాయని అనగానే నాకు నా చిన్ననాటి లలిత భక్తి గీతం కాత్యాయనీ కన్నతల్లీ గుర్తుకొచ్చింది. దీనిని శ్రీరంగం గోపాలరత్నం గారు అద్భుతంగా పాడారు. వింజమూరి శివరామారావు గారు ఆనాటి లలిత గీతాల రచయితలలో ప్రముఖులు. దేవులపల్లి వారికి, వింజమూరి సోదరీమణులకు బంధువు. లలిత సంగీతంలో భక్తిని గుప్పించిన కవుల ప్రతిభలు ఆనాడు ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. దేవులపల్లి వారు రచించిన లలిత భక్తి గీతాలు అనేకం. అలాగే, మరెందరో  మహానుభావులు. వింజమూరి శివరామారావు గారు కథలు, పద్యాలు, కథానికలతో పాటు రామాయణాన్ని గేయంగా రచించారు కూడా. అది ఎంతో ప్రసిద్ధి పొందింది. దానిని తొలుత బాలమురళీకృష్ణగారు ఆలపించారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఆంధ్రా యూనివర్సిటీ వారు కళాప్రపూర్ణ బిరుదునిచ్చారు. ఆకసమున చిరుమబ్బుల చాటున, నల్లనివాడ నే గొల్లపిల్లనోయి, మధురానగరి సమీపంలో, వచ్చెనోయి వసంతము, వినవే చెలి పిలుపు అల్లదిగో వంటి ఎన్నో అద్భుతమైన లలితగీతాలను రచించారు. వీటిని బాలమురళిగారితో పాటు అలనాటి మేటి గాయనీమణులు రావు బాలసరస్వతి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, వేదవతీ ప్రభాకర్ గారు ఆలపించి శాశ్వతం చేశారు. ఆయన కథలు, ఆయన రచించిన గీతాలన్నీ ఎంతో పేరు పొందాయి.

వింజమూరి వారి రచనలలో ఒకటి శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించిన కాత్యాయనీ కన్నతల్లి అనే గీతం. శ్రీరంగం గోపాలరత్నం గారు తెలుగుజాతిలో జన్మించిన ఓ సంగీతపు ఆణిముత్యం. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ గానం తేనె జాలువారినట్లు ఉండేది. పద్మశ్రీ బిరుదు పొందిన ప్రఖ్యాత ఆకాశవాణి ఆర్టిస్టు ఆవిడ. తెలుగునాట సంగీత పితామహులు శ్రీపాద పినాకపాణి గారి శిష్యురాలు. ఆవిడ భక్తిరనజనిలో పాడిన పాటలు ఎందరో జీవితాలలో భక్తిని మొలకెత్తించాయి. 1939లో విజయనగరం జిల్లా పుష్పగిరిలో సుభద్రమ్మ వరదాచారి దంపతులకు జన్మించిన వీరు హరికథలు, జావళులు, కూచిపూడి మరియు యక్షగానం వంటి కళలలో గాయనిగా ప్రసిద్ధి చెందారు. హైదరబాదు మరియు విజయనగరంలలో సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆస్థాన విదుషీమణిగా పనిచేస్తున్నప్పుడు అన్నమాచార్యుల వారి కీర్తనలకు సంగీతాన్నిచ్చారు. సకలం హే సఖి అని ఆవిడ పాడిన అన్నమాచార్య కీర్తన ఎంతో పేరు పొంది నేటికి కూడా ప్రమాణమైంది. కాత్యానీ కన్నతల్లీ వివరాలు.

కాత్యాయనీ! కన్నతల్లీ! మమ్మేలు భక్తావనీ! కల్పవల్లీ!

నీ సేవలే నిత్య సంకీర్తనమ్ములే మా జీవితాల భాగ్యాలు సౌభాగ్యాలు

శివదేవ సీమంతినీ జేజేలు భువనైక సామంతినీ
నీ చూపు వెల్గులు నీ నవ్వు వెన్నెల
ఏ కాలమూ మూడు లోకాల పైనాడు

ఇంద్రకీలాద్వాసినీ దుర్గమ్మ సాంద్ర తేజోద్భాసినీ
నిన్ను పూజింతుమీ హృదయాల కుసుమాల
మన్నింపుమమ్మ నీ చరణాలే శరణాలు

ఆడియో కోసం ఈ లింకును ఓపెన్ చేయండి. క్రింది భాగంలో 2వ పాట ఇది.

http://eemaata.com/em/issues/201501/6384.html?fmt=rts

5, అక్టోబర్ 2016, బుధవారం

ఆశ్వయుజ శుద్ధ చతుర్ధి అనంతరం పంచమి - శ్రీ లలితా శివజ్యోతి


శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే భువనేశ్వరి
ఆగమ వేద కళామయ రూపిణి అఖిల చరాచరాచరి జనని నారాయణి
నాగ కంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి

అని అగస్త్యార్ అమ్మవారిని కొలిచాడు. సమస్త జీవరాశులలో ఉన్న ఆ తల్లి నారాయణిగా రాజరాజేశ్వరిగా నుతించబడింది. శ్రీచక్రనివాసిని అయిన లలితాంబిక సనాతన వేద వాఙ్మాయానికి, సమస్త కళలకు రూపముగా ప్రస్తుతించబడింది. బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ-అగస్త్య సంవాదంలో చెప్పబడిన లలితా సహస్రనామావళిలో కూడా "చతుష్షష్ట్యుపచారాఢ్యా చతుష్షష్టి కళామయి మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా" అని కొలువబడింది. 64 ఉపచారాలతో కొలువబడిన తల్లిగా, 64 కళలకు ఆలవాలంగా తల్లిని ఈ స్తోత్రంలో నుతించారు. మరి ఏమిటీ చతుష్షష్టి ఉపచారాలు అని ఒక ప్రశ్న వచ్చింది. ధ్యానం, దివ్య మందిరం, రత్న మంటపం, ఆందోళికం, ఆవాహనం, సింహాసనం, వితానం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, మధుపర్కం, అభ్యంగం, ఉద్వర్తనం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఉత్తరీయం, దివ్య పాదుక, కేశపాశ బంధనం, సౌవీరాంజనం, ఆభరణం, శ్రీగంధం, అక్షత, హరిద్రాచూర్ణం, కుంకుమ విలేపనం, సుగంధ ద్రవ్యాణి, సిందూరం, అథాంగ పూజ, ధూపం, దీపం, కుంభార్తిక్యము, నైవేద్యము, హస్తప్రక్షాళనం, పానీయం, ఫలం, తాంబూలం, సువర్ణపుష్ప దక్షిణ, ఛత్రం, చామరం, దర్పణం, నీరాజనం, దివ్యమంత్ర పుష్పం, ప్రదక్షిణం, నమస్కారం, తురంగ వాహనం, గజ వాహనం, రథం, చతురంగ సైన్యం, దుర్గం, వ్యజనం, దృక్పానపాత్ర నటనం, నాట్యం, మృదంగ వాద్యం, గంధర్వకన్యా గానం, అనేక విధ వాద్యాని, క్షమాపణం, భక్త్రగృహ నివాసం, సువర్ణపర్యంకోపవేశనం, పాదయోః లాక్షారంజనం, గండూష జలపాత్రం, సుఖ శయనం, మమహృదయే నిత్యనివాసనం, పూజా ఫలం, ప్రసనార్ఘ్యం..అదండీ సంగతి. అమ్మను ఇంత వివరంగా కొలువవచ్చు. సమయాన్ని బట్టి, భావాన్ని బట్టి సేవలు.

లలితాపరమేశ్వరి అనగానే 1967లో విడుదలైన రహస్యం చిత్రంలో లీలగారు పాడిన శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా అన్న పాట గుర్తుకు వస్తుంది. తెలుగునాట స్త్రీల నోట మంగళహారతి పాటగా శాశ్వతమైపోవటానికి కారణం అందులోని సాహిత్యం, తేలికైన భాష. సమస్త కామ్యములను తీర్చే తల్లిగే సకల శుభకరిగా ఆ జగన్మాతను ఈ గీతంలో కొనియాడారు.  సాహిత్యం పరిశీలిస్తే సముద్రాల వారు రచించినట్లు అనిపిస్తోంది. చిత్రం టైటిల్స్‌లో ఆయన పేరు ఉంది. కానీ ఖచ్చితంగా ఆయనే రచించారని చెప్పటానికి నా దగ్గర ఆధారాలు లేవు. ఎవరు రాసినా, తెలుగునాట ఈ పాట పొందిన ప్రాచుర్యం అంతా ఇంతా కాదు. లలితా త్రిపురసుందరికి మంగళ హారతి పలికే ఈ గీతం సాహిత్యం ఈనాడు ఆశ్వయుజ శుద్ధ చతుర్ధి అనంతరం పంచమి శుభదినాన అందరి కోసం.

శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా

జగముల చిరు నగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
మనసే నీ వశమై, స్మరణే జీవనమై
మాయని వరమీయవే పరమేశ్వరి మంగళ నాయకి
శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా

అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి
అందలేలే చల్లని తల్లికి చంద్రహారతి
రవ్వల తళుకుల కళల జ్యోతుల కర్పూరహారతి
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి


4, అక్టోబర్ 2016, మంగళవారం

శరన్నవరాత్రులు - అన్నపూర్ణాదేవి అలంకారం


అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నం జీవాధారమే కాదు, జీవికి మూలం కూడా.

అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్నసంభవః
యజ్ఞాద్భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః

కర్మలనుండి యజ్ఞము, యజ్ఞము వలన వర్షములు కలిగి, వర్షము వలన పంటలు పండుతాయి అని శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భగవద్గీతలోని కర్మయోగములో చెప్పాడు.

అన్నము స్త్రీపురుషులలోని ఓజస్సుకు కారణమై మానవజాతి సృష్టికి మూలమైంది. ఆ ఆహారానికి అధిదేవతగా ఈనాడు ఆదిపరాశక్తి అన్నపూర్ణేశ్వరి అలంకారంలో దర్శనమిస్తుంది. ఆదిశంకరులు అన్నపూర్ణాష్టకంలో ఈ తల్లి వైభవాన్ని అద్భుతంగా వివరించారు. అంతే అద్భుతంగా ముత్తుస్వామి దీక్షితుల వారి తన కృతి అన్నపూర్ణే విశాలాక్షిలో వర్ణించారు. పాయసాన్నం కలిగిన బంగారు గిన్నె చేత ధరించిన తల్లి సాక్షాత్తు పరమశివునికే భిక్ష ఇచ్చింది. సమస్తలోకానికి అమ్మగా నిలిచింది. ఆ కీర్తన వివరాలు.

అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి

ఉన్నత గర్త తీర విహారిణి ఓంకారిణి దురితాది నివారిణి
పన్నగాభరణ రాజ్ఞి పురాణి పరమేశ్వరి విశ్వేశ్వర భాస్వరి

పాయసాన్న పూరిత మాణిక్య పాత్ర హేమదర్వీ విధృత కరే
కాయజాది రక్షణ నిపుణతరే కాంచనమయ భూషణాంబరధరే
తోయజాసనాది సేవిత పరే తుంబురు నారదాది నుత వరే
త్రయాతీత మోక్షప్రద చతురే త్రిపద శోభిత గురుగుహ సాదరే

ఓ అన్నపూర్ణ తల్లీ! విశాలమైన కన్నుల గల అమ్మా! సమస్త లోకాలకు సాక్షివి! కటాక్షాన్ని ప్రసాదించే తల్లీ!

ఉన్నతమైన గర్త తీరంలో విహారం చేసే, (తిరువారూర్ వద్ద కుళిక్కుళై అనే క్షేత్రంలో అన్నపూర్ణా విశ్వనాథుల క్షేత్ర కీర్తన ఇది) ఓంకార రూపిణీ! సమస్త పాపములను తొలగించే, నాగాభరణములను ధరించే శివుని రాణీ! పురాణములలో పొగడబడిన పరమేశ్వరీ! శివుని ప్రక్కన ప్రకాశించే అమ్మా!

పాయసాన్నము కలిగిన పాత్ర ఒక చేత, బంగారు గరిటే ఒక చేత కలిగి శోభిల్లే, మన్మథుడు మొదలైన వాని రక్షించుటలో నైపుణ్యము కలిగిన, బంగారు వస్త్రములను, ఆభరణములను ధరించిన తల్లీ! కమలాసనుడైన బ్రహ్మ మొదలగు దేవతలచే పూజించబడిన, నారదుడు, తుంబురుడు మొదలైన వారిచే నుతించబడే తల్లీ! ధర్మార్థ కామ్యములను దాటించి మోక్షమును ప్రసాదించటంలో చాతుర్యము కలిగిన, సత్-చిత్-ఆనందములచే శోభిల్లే, గురుగుహుని ఆదరించే తల్లీ! రక్షించుము!

ముత్తుస్వామి దీక్షితుల వారి క్షేత్ర కీర్తనలలో ఈ అన్నపూర్ణే విశాలాక్షీ ఎంతో ప్రాచుర్యం పొందింది. శ్రీవిద్యోపాసనలో సిద్ధులైన దీక్షితులవారు అమ్మను నిరంతరం దర్శించి ఎన్నో అద్భుతమైన కీర్తనలను రచించారు. సామరాగంలో ఈ అన్నపూర్నే విశాలాక్షీ అన్న కీర్తన కుళిక్కుళైలో గల కాశీవిశ్వనాథుని దేవేరి అన్నపూర్ణమ్మను నుతిస్తూ రచించారు.

అన్నపూర్ణ పార్వతీదేవి యొక్క స్వరూపము. సకల కామ్యములతో పాటు మానువుని జీవితానికి అత్యంత ముఖ్యమైన భోజ్యములను అనగా పాడి పంటల ద్వారా వచ్చే ఆహార పదార్థములను పుష్కలముగా అందించె కామితార్థ దాయిని. అన్నం పరబ్రహ్మ స్వరూపం. స్వయంగా సదాశివుడే కాశీ క్షేత్రంలో అమ్మ వద్ద భిక్షను ప్రతిరోజూ తీసుకుంటాడని పురాణలు చెబుతున్నాయి. ఆది శంకరుల వారు తన గురువైన మండన మిశ్రుని వద్దే కాక గురుపత్ని అయిన ఉభయ భారతీదేవి వద్ద కూడా విద్యను నేర్చుకున్నాడు. ఆ తల్లి తన పట్ల చూపిన ఆదరణకు కృతజ్ఞతతో అన్నపూర్ణాష్టకం రచించారు.

దీక్షితులవారి సాహిత్యంలో అమ్మ వైభవాన్ని ఎన్నో కోణాలలో అద్భుతమైన సాహితీ సంపదతో ఆధ్యాత్మిక సుగంధంతో తెలియజేశారు. ఆయనలోని దైవశక్తి ఆయన కీర్తనలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఓంకార రూపిణి, పురాణి, త్రిపద శోభిత అని అన్నప్పుడు ఆయన ఆదిపరాశక్తిని ఏయే అనుభూతులలో ఏయే రూపాలలో దర్శించాడో అర్థమవుతుంది. నిగూఢార్థము కలిగిన పదాలు మనం అనుకుంటే రావు. పూర్తిగా ఆ దేవతా స్వరూపం ఆ కృతికర్తను అనుగ్రహించి పదాలను శక్తిపూరితం చేసి రచనలో వచ్చేలా చేస్తుంది. దీక్షితుల వారి ప్రతి కృతిలోనూ ఈ దైవానుగ్రహము, దైవబలము తేటతెల్లమవుతుంది. అందుకే ఆయన సంగీత త్రయంలో ఒక్కరైనారు. సంగీతం ద్వారా సనాతన ధర్మం పరిఢవిల్లటానికి, భారత దేశపు ఆధ్యాత్మిక శక్తి ప్రకాశించటానికి ఎంతో తోడ్పడ్డారు.

సామ రాగం అద్భుతమైన లాలిత్యము,కరుణ రసము కలిగినది. ఈ రాగంలో శాంతము లేక సౌఖ్యము లేదు, మానస సంచరరే మొదలైన మృదుభావాన్ని, పరిపూర్ణమైన ప్రశాంతతను ఒలికించే కీర్తనలు రచించ బడ్డాయి. దీక్షితులవారు అమ్మకు తనపై గల అపారమైన కరుణకు సూచికగా ఈ అన్నపూర్ణే  విశాలాక్షి కృతికి సామ రాగాన్ని ఎన్నుకొన్నారు. పాలు తేనె కలిసినట్లు భక్తిపూరితమైన సాహిత్యము, కరుణాపూరితమైన రాగలక్షణము కలిసి అమృతాన్ని కురిపించాయి.

ప్రఖ్యాత కర్ణాటక సంగీత విదుషీమణి ఎమ్మెస్ షీలా గారి గాత్రంలో ఈ కీర్తన వినండి.


3, అక్టోబర్ 2016, సోమవారం

శరన్నవరాత్రులు - గాయత్రీదేవి అలంకారం


ఈరోజు బెజవాడ కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. ఆ సందర్భంగా ఓ అరుదైన వాగ్గేయకారుడు మరియు ఆయన రచించిన గాయత్రీమాత కృతి వివరాలు మీకోసం.

గాయత్రీ దేవి మీద రచించబడిన కృతులలో ఎక్కువమటుకు మన తెలుగుజాతి మహనీయుడు ఓగిరాల వీరరాఘవ శర్మ గారు రచించినవే. భక్త జ్ఞానానందతీర్థగా సన్యాసాశ్రమంలో పిలువబడిన ఈ కృతికర్త మహా గాయత్రీ ఉపాసకులు. 1908 మార్చి 23న ఒంగోలు జిల్లా ధేనువకొండ గ్రామంలో జన్మించిన ఈయన తండ్రి వద్దే వేదవేదాంగాలు నేర్చుకున్నారు. ఈయన సంగీత గురువు హరి నాగభూషణం గారు. ఆలిండియా రేడియో ద్వారా కొన్ని వందల కచేరీలు చేశారు. రచనలు చేయటంతో పాటు ఆయన రాగాలను కూడా సృష్టించారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రస్ఫుటించే ఆయన కీర్తనలు దేవీ గానసుధ అనే పుస్తక రూపంలో ప్రచురించబడ్డాయి. గాయత్రీ మాతపై రచనలు చేసిన మొట్టమొదటి వాగ్గేయకారులు ఈయనే. తరువాత మైసూరు మహారాజావారు ఒక రచన చేశారు. సన్యాసాశ్రమానికి పూర్వం 'రాఘవ ' అనే ముద్రను, అటుతరువాత 'జ్ఞానానంద తీర్థ ' అనే ముద్రను ఆయన ఉపయోగించారు. ఆయన కుమారుడు ఓగిరాల రామకృష్ణగారు, కుమార్తెలు విమల-లలిత కూడా సంగీత ప్రవీణులు. ఈయన కొవ్వూరులో గాయత్రీ పంచాయతన పీఠం ఏర్పాటు చేశారు.1989లో ఆయన సిద్ధి పొందారు. ఆయన రచించిన శ్రీ గాయత్రీ దేవి సనాతని అనే కృతి వలజి రాగంలో మీకోసం. దీనిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.

శ్రీ గాయత్రీ దేవీ సనాతని సేవక జన సుశ్రేయోదాయిని

వాగధిపతి సురేంద్ర పూజితే వరదాయకి పంచరదనే సువాసిని

రాగద్వేష రహితాంతరంగ హితే రత్నఖచిత మణిహార మండితే
రసయుత సంగీత మోదితే రాఘవాది భక్త రక్షణ చరితే


2, అక్టోబర్ 2016, ఆదివారం

శరన్నవరాత్రులు - బాలాత్రిపురసుందరి అలంకారం


ఈరోజు బెజవాడ కనకదుర్గమ్మ బాలాత్రిపుర సుందరి అలంకారం కదా. ముత్తుస్వామి దీక్షితుల వారి బాలాంబిక కృతి ఒకటి విన్నాను. అద్భుతమైన సాహిత్యం. ఆదిపరాశక్తి తత్త్వమంతా ఈ కృతిలో నిబిడీకృతమై ఉంది. కేజే యేసుదాస్ గారి గాత్రంలో దీనిని వినవచ్చు.

భజరే రే చిత్త బాలాంబికాం భక్త కల్ప లతికాం

నిజరూప దాన దక్ష చరణాం
అరుణాం నిత్యాం కళ్యాణీం శర్వాణీం

శ్రీ వాగ్భవ కూట జాత చతుర్వేద స్వరూపిణీం
శృంగార కామ రజోద్భవ సకల విశ్వ వ్యాపినీం
దేవీం శక్తి బీజోద్భవ మాతృకార్ణ శరీరిణీం
దేవనుత భవ రోగ హర వైద్య పతి హృదయ విహారిణీం
భావ రాగ తాళ మోదినీం భక్తాభీష్ట ప్రదాయినీం
సేవక జన పాలినీం గురుగుహ రూప ముత్తు కుమార జననీం


24, సెప్టెంబర్ 2016, శనివారం

మామ శకుని - ధూళిపాళ సీతారామశాస్త్రి గారు


మామ శకుని అనగానే మొదట సీఎస్సార్ తరువాత ధూళిపాళ గారి పేర్లు గుర్తుకోస్తాయి. ఒక లక్ష్యంతో కౌరవుల నాశనానికై ప్రతిజ్ఞ చేసిన శకుని పాత్రను ధూళిపాళ గారు ఎంతో బాగా పోషించారు. దాదాపు 40 ఏళ్ల సినీ నటజీవితంలో 300కు పైగా చిత్రాలలో నటించారు. ఆయన 95వ జయంతి ఈరోజు. ఆ సహజ నటునికి నివాళిగా ఈ వ్యాసం.

1921 సెప్టెంబర్ 24న ఇప్పటి గుంటూరు జిల్లా దాచేపల్లి గ్రామంలో (పల్నాడు ప్రాంతం) రత్నమ్మ మరియు శంకరయ్య దంపతులకు ధూళిపాళ సీతారామశాస్త్రి గారు జన్మించారు. 8వ తరగతి వరకు దాచేపల్లిలో చదువుకొని తరువాత బాపట్లలోని ప్రఖ్యాత శంకర విద్యాలయంలో వేదవిద్యను అభ్యసించారు. తొలుత ప్లీడరు గుమాస్తాగా పనిచేశారు. తరువాత స్త్రీ పాత్రల ద్వారా నాటక రంగ ప్రవేశం చేశారు. ఆయనకు నాటక రంగంలో బాగా పేరు తెచ్చిన పాత్ర దుర్యోధనుడు. ఆ కాలంలో మంచి నటుడు, రచయిత, గాయకుడు, దర్శకుడు అయిన గయుడు గారు ధూళిపాళ గారిని సినీ రంగానికి పరిచయం చేశారు. గయుడి గారి సహాయంతో 1962లో విడుదలైన భీష్మ చిత్రంలో దుర్యోధనుడి పాత్ర ధూళిపాళ గారికి లభించింది. దుర్యోధనుడిగా ధూళిపాళ గారు తొలిచిత్రంలోనే అద్భుతంగా నటించారు. ఆ పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చింది.

అదే సంవత్సరంలో పుండరకీక్షయ్య గారి నిర్మాణంలో కమలాకర కామేశ్వరరావు గారు మహామంత్రి తిమ్మరుసు చిత్రం విడుదల చేశారు. ఆ చిత్రంలో ధూళిపాళ గారు అల్లసాని పెద్దన పాత్ర వేసి మెప్పు పొందారు. ఇక తరువాత ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. 1963లో విడుదలైన శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలో బావ-బావమరది మధ్య యుద్ధానికి కారకుడైన గయిని పాత్రను వేశరు. సినిమాలో గయుడిగా ధూళిపాళ గారి పాత్రం చాలా ముఖ్యమైనదే. తరువాత వచ్చిన అద్భుతకళాఖండంలో ధూళిపాళ గారు తనకు పేరు తెచ్చిన పాత్ర వేసే అవకాశం వచ్చింది. లక్ష్మీ రాజ్యం గారు నిర్మాతగా కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలోనే 1963లో విడుదలై ప్రపంచమంతా పేరుపొంది తెలుగు సినీ స్వర్ణయుగంలో ఆణిముత్యం లాంటి చిత్రమైన నర్తనశాల (విరాట పర్వం) చిత్రంలో ధూళిపాళ గారు సుయోధనుడి పాత్ర వేశారు. దుర్లక్షణాలను తనం ముఖంలో అద్భుతంగా పండించి తన వంతు పాత్రను పరిపూర్ణంగా పోషించారు. కాకపోతే ఆ చిత్రంలో ఎస్వీఆర్, ఎన్‌టీఆర్, సావిత్రిల నటనా కౌశలం ముందు ఇంకెవ్వరూ నిలువలేకపోయారు. అఖండమైన విజయం సాధించి తెలుగు చలనచరిత్రలో కలికితురాయిగా నిలిచిన చిత్రం ఇది.

1964లో సీతారాం గారి దర్శకత్వంలో ఆయనే నిర్మాతగా విడుదలైన మరో మంచి చిత్రం బొబ్బిలి యుద్ధం. 18వ శతాబ్దంలో విజయనగరం క్షత్రియ గజపతి రాజులు మరియు బొబ్బిలి వెలమ రాజుల మధ్య జరిగే ఆధిపత్యపు పోరును తెరకెక్కించిన ఈ చిత్రంలో ధూళిపాళ గారు నరసరాయుడు పాత్రను పోషించారు. మళ్లీ పుండరీకాక్షయ్య/కమలాకర కామేశ్వరరావు గారి కాంబినేషన్‌లో 1967లో విడుదలైన శ్రీకృష్ణావతారం చిత్రంలో ధూళిపాళ గారు సత్రాజిత్తు పాత్రను పోషించారు. తరువాత ఉండమ్మా బొట్టు పెడతా, బాంధవ్యాలు, ఆత్మీయులు, ఏకవీర, బాలరాజు కథ, మట్టిలో మాణిక్యం, బాలభారతం, శ్రీరామాంజనేయ యుద్ధం, అందాలరాముడు, గుణవంతుడు, సీతాకళ్యాణం, మహాకవి క్షేత్రయ్య, కురుక్షేత్రం వంటి ఎన్నో చిత్రాలలో మంచి పాత్రలు పోషించారు.

ధూళిపాళ గారి నటజీవితంలో ముఖ్యమైన చిత్రాలు శ్రీకృష్ణ పాండవీయం (1966), బాలభారతం (1972), మరియు దాన వీర శూర కర్ణ (1977) చిత్రాలు. మూడింటిలోనూ ఆయన శకుని పాత్రను అద్భుతంగా పోషించారు. ఆ కళ్లలో పగ, ప్రతీకార జ్వాల ప్రస్ఫుటంగా కనబరచారు. డైలాగ్స్‌లో కుటిల రాజనీతి హృద్యమైన తెలుగు భాషలో సుస్పష్టమైన ఉచ్చారణతో ఆయన చలనచిత్రాల వైభవాన్ని ఇనుమడింపజేశారు. ధూళిపాళ గారికి పేరు తెచ్చిన మరో పాత్ర సాంఘిక చిత్రమైన బాంధవ్యాలు. 1968లో విడుదలైన ఈ చిత్రాన్ని ఎస్వీ రంగారావు గారు నిర్మించి దర్శకత్వం వహించారు, ప్రధాన పాత్ర కూడా అయానదే. ఆయన తమ్మునిగా ధూళిపాళ గొప్పగా నటించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది అవార్డును పొందారు. చిత్రం కూడా ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది. ధూళిపాళ గారి సినీ ప్రస్థానంలో చాలా మటుకు పాత్రలు పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలే. కమలాకర కామేశ్వరరావు గారే మళ్లీ 1977లో విడుదలైన కురుక్షేత్రం చిత్రంలో ఆయనకు ఇంద్రుని పాత్రను ఇచ్చారు. విఠలాచార్య గారి చిత్రాలలో కూడా ధూళిపాళ గారు మంచి పాత్రలు వేశారు.

గొప్ప హనుమద్భక్తులైన ధూళిపాళ గారు కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీర్వాదంతో 2001లో సన్యాసం స్వీకరించారు. గుంటూరులో మారుతి ఆశ్రమాన్ని స్థాపించారు. 2007 ఏప్రిల్ 13న సిద్ధి పొందారు. పల్నాటి పొరుషం తన భాషలో కనబరచే రంగస్థల నటుడు, స్ఫురద్రూపి, మంచి వాక్పటిమ, ప్రత్యేకమైన నటనా కౌశలం కలిగి ఉండటంతో పాటు భక్తుడు అయిన ధూళిపాళ సీతారామశాస్త్రి గారికి జోహార్లు.

-అక్కిరాజు ప్రసాద్ (24 సెప్టెంబర్ 2016)

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

ప్రతిభామూర్తి సింగీతం శ్రీనివాసరావు

ఆయన చిత్రాలు మూస మసాల ధోరణికి భిన్నంగా ఎంతో విలక్షణతతో, సాంకేతిక నైపుణ్యంతో, నటీనటుల ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకునే కోవకు చెందినవి. సంభాషణలు లేకుండా ఒక చిత్రానికి దర్శకత్వం వహించి దానిని విజయవంతం చేసిన సత్తా ఆయనలో ఉంది. ఒక్కొక్క చిత్రం ఒక్కో కోణంలో ఒక్కో సందేశంతో ఒక్కో నైపుణ్యంతో ఆయన తీర్చిదిద్దారు. హాలీవుడ్ స్థాయిలో చిత్రాలను ఆయన మనకు అందించారు. అదేనండీ, సింగీతం శ్రీనివాసరావు గారి గురించి చెబుతున్నా! ఈరోజు ఆయన 85వ పుట్టినరోజు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకునిగా, నిర్మాతగా, రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న ఆ ప్రతిభామూర్తి విశేషాలు కొన్ని.



ఆంధ్రప్రదేశ్‌లొని నెల్లూరు జిల్లా గూడురులో 1931, సెప్టెంబర్ 21న జన్మించిన శ్రీనివాసరావు గారు మద్రాసు విశ్వవిద్యాలయంలో చదువుకొని 1954లో కేవీ రెడ్డి గారి వద్ద మాయబజార్ చిత్రానికి అప్రెంటిస్‌గా చేరారు. సాంకేతిక కారణాల వలన మాయాబజార్ నిర్మాణం ఆలస్యం కావటంతో ఆయన కేవీ రెడ్డి గారి వద్దే దొంగరాముడు చిత్రంలో పనిచేశారు. అక్కడినుండి అద్భుతమైన ఆయన సినీప్రస్థానం మొదలైంది. పాటలు పాడటం, సాహిత్యం రాయటం, దర్శకత్వం, నిర్మించటం, నటన ఇలా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవీ రెడ్డి గారు, పింగళి నాగేంద్రరావు గారి శిష్యరికంలో ఆయన నైపుణ్యం సంపాదించారు. దొంగరాముడు చిత్రానికి ఆయన సహాయ దర్శకునిగా పనిచేసినా ఆయన పేరు టైటిల్స్‌లో వేయలేదు. అలాగే మాయాబజార్, జగదేకవీరుని కథ, పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి చిత్రాలలో కూడా పనిచేశారు. 1972లో మొట్టమొదటి సారి శ్రీనివాసరావు గారు స్వంతంగా నీతి నిజాయితీ అనే చిత్రం తీశారు. ఆ చిత్రం ఆడలేదు. 1974లో ఆయన తొలి తమిళ చిత్రం దిక్కత్ర పార్వతి అనే చిత్రానికి దర్శకతం వహించారు. రాజాజీ రచించిన ఓ నవల ఆధారంగా తీసిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ తమిళ చిత్రం అవార్డు పొందింది. నటిగా లక్ష్మికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. హిందీలో వచ్చిన సీష్‌మహల్ అనే చిత్రాన్ని 1975లో జమీందారు గారి అమ్మాయిగా నిర్మించారు. ఆచిత్రంలోని మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన అనే అద్భుతమైన పాట మనకు తెలిసిందే.

ఆయన సినీ ప్రస్థానంలో ముఖ్యమైన ఘట్టం 1976లో విడుదలైన అమెరికా అమ్మాయి చిత్రం. ఓ అమెరికా అమ్మాయి భారతీయ కళలపట్ల ఆకర్షించబడి ఇక్కడి మనుషులను ఎలా మారుస్తుందో ఈ చిత్రంలో సింగీతం వారు మనకు అద్భుతంగా తెరపై చూపించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అటుతరువాత వచ్చిన చిత్రాలన్నీ వైవిధ్య భరితమైనవి, విలక్షణమైనవి. పంతులమ్మ, సొమ్మొకడిది సోకొకడిది, రామచిలక వంటి అద్భుతమైన తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అదే సమయంలో ఎన్నో తమిళ కన్నడ చిత్రాలను అందించారు. తరువాత మైలు రాయి 1984లో విడుడలైన మయూరి చిత్రం. ప్రఖ్యాత నర్తకి సుధా చంద్రన్ గారి నిజ జీవితం ఆధారంగా తీసిన చిత్రం ఉత్తమ చలన చిత్రం అవార్డు పొందింది. ఆయన దర్శకత్వంలో అమెరికాలో పుట్టిన ఓ అబ్బాయి నేపథ్యంలో చిత్రం 1987లో విడుదలై అద్భుతమైన విజయం సాధించింది. తరువాత 1988లో వచ్చిన కళాఖండం పుష్పక విమాన. మాటలు లేకుండా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన చిత్రం ఇది. కమల్ హాసన్ గారి నట జీవితంలో ఈ చిత్రం ఓ కలికితురాయి. ఈ చిత్రానికి కూడా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయి.  1989లో వచ్చిన మరో అద్భుత సృష్టి అపూర్వ సహోదరగళ్  (తెలుగులో అపూర్వ సహోదరులు). అన్ని భాషలలోనూ ఈ విజయం సాధించింది. కమల్ హాసన్ గారి నటనా కౌశలాన్ని శ్రీనివాస రావు గారు మరింత ఇనుమడింపజేసేలా మనకు ఈ చిత్రాన్ని అందించారు. గొప్ప సాంకేతిక విలువలతో విలక్షణమైన కథతో ఈ చిత్రం వారివురికీ ఎంతో పేరు తెచ్చింది.

1990లో శ్రీనివాసరావు గారు ఇంకో విలక్షణమైన హాస్యరస ప్రధాన చిత్రాన్ని మనకు అందించారు. అదే తమిళంలో తీసిన మైకెల్ మదన కామ రాజు అనే చిత్రం. కమల్ హాసన్ గారు నాలుగు పాత్రలు పోషించిన ఈ చిత్రం ఓ అద్భుత కళావిష్కరణ. కమల్ హాసన్ గారి సినీ ప్రస్థానంలో మరో గొప్ప చిత్రం. మంచి విజయం సాధించింది. తెలుగు చలన చిత్ర చరితలో 1991 ఓ ముఖ్యమైన సంవత్సరం. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో బాలకృష్ణ గారు కథానాయకుడుగా ఓ అద్భుతమైన చిత్రం విడుదలైంది. అదే ఆదిత్య 369. టైం మెషిన్ ద్వారా శ్రీకృష్ణదేవారాయల కాలానికి వెళ్లి మనకు ఓ సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని ఆయన తీశారు. ఈ చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధించింది. తరువాత బృందావనం, మేడం వంటి విలక్షణమైన చిత్రాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి.

1994లో విడుదలైన మరో కళాఖండం భైరవ ద్వీపం చిత్రం. బాలకృష్ణ గారి సినీ విజయాలలో ఈ చిత్రం ఒకటి. జానపద ఇతివృత్తంలో మంచి కథతో జగదేకవీరుని కథను తలపించేలా శ్రీనివాసరావు గారు ఈ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రానికి నంది అవార్డు వచ్చింది. తరువాత కూడా ఎన్నో మంచి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 2 జాతీయ అవార్డులు, 7 నంది అవార్డులు, 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 3 కర్ణాటక రాష్ట్ర అవార్డులు. అరవై రెండేళ్ల ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానం మన సినీ ప్రపంచంలో ఓ మంచి అనుభూతి. దర్శకత్వ ప్రతిభ, సంభాషణలలో పటుత్వం, నిర్మాణంలో సాంకేతిక విలువలు, కథలో విలక్షణత, నటీనటుల ఉన్నతమైన నటనా కౌశలం, అద్భుతమైన ఛాయాగ్రహణం, మంచి సంగీతం ఆయన చిత్రాల ప్రత్యేకతలు. కమల్ హాసన్ గారి సినీజీవితపు విజయాలలో సింగీతం వారిది చాలా ముఖ్యమైన స్థానం.

ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాంకేతిక నైపుణ్యాన్ని సంపాదించుకునే వ్యక్తిత్వం ఆయనది. ఆయన చిత్రాలు ముందు చూపుతో ఉంటాయి. కథలు దానిని సంపూర్ణంగా ప్రతిబింబిస్తాయి. ఆయన సినీయానంలో పుష్పక విమానానికి అత్యధికంగా ప్రజాదరణ రాగా, ఆదిత్య 369 ఆయనకు అన్నిటికన్నా తృప్తిని ఇచ్చిన చిత్రమట. 85ఏళ్ల వయసులో కూడ నేటి తరం దర్శకులకు పోటీగా చిత్రాలు తీయటానికి సిద్ధమంటున్న సింగీతం శ్రీనివాసరావు గారికి భగవంతుడు ఆయురారోగ్యాలతో మరింత ఉత్సాహాన్ని కలిగించాలని నా ప్రార్థన.

అక్కిరాజు ప్రసాద్ (21/9/2016)