26, ఆగస్టు 2020, బుధవారం

ఆధ్యాత్మికత - మూలాలు, మార్గదర్శులు






ఈ మధ్య కొత్తగా మరో వింత పోకడ మొదలైంది - కొద్దిగా మోడ్రన్‌గా ఉండే గురువులను నిందించటం. ఏ విమర్శకైనా ప్రాతిపదిక, హేతుబద్ధత ఉండాలి. అప్పుడే అది సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతుంది. ఈ సనాతన ధర్మ ప్రవాహంలో వచ్చిన కోట్లాది గురు పరంపరలను చూస్తే ఎంతో వైవిధ్యం, ఊహించలేని పరిణామ క్రమం కనబడతాయి. దీనికి అనేక కారణాలు. మార్గాలు వేరు కావటం, కాలానుగుణమైన అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి గురువులు అనేక రకాలు. ఆదిశంకరులున్నట్లు ఇప్పటి శంకరాచార్యులు ఉండలేరు కదా? అలాగే వివిధ ఇతర గురువులు కూడా.

కలియుగంలో ధర్మానికి కలిగే గ్లానిని బట్టి, దేశకాలమాన పరిస్థితులను బట్టి, పాలకులను బట్టి గురువులు. కొందరు మన ధర్మాన్ని బోధించిన పుందరుద్ఘాటించే వారైతే కొందరు ముందుండి పోరాటం చేసి ప్రజలను ఏకం చేసిన వారు. కొందరు తార్కికులైతే మరికొందరు పూర్తి సన్యాసులు. కొందరు అతివాదులైతే మరికొందరు హేతువాదులు, ఇంకొందరు మితవాదులు. కానీ లక్ష్యం ఒక్కటే.

ప్రస్తుతమున్న సమయంలో ధర్మభ్రష్టుత్వం పట్టి, మన ఆత్మవిద్యా విధానాన్ని విస్మరించి ఉపాధి విద్యను ఆశ్రయించిన ప్రజానీకానికి అనేక వికారాలు. ముందు మానసిక దౌర్బల్యం, రెండవది స్వార్థం, ఆ తరువాత విషయం తెలుసుకుందామన్న జిజ్ఞాస లేకపోవటం. ఇది ఎక్కువ శాతం మంది ప్రజల పరిస్థితి. దీనికి తోడు సామాజికంగా కుల మత ప్రాంతీయ వైషమ్యాలను పాలకులే పెంచి పోషించి ప్రజలను దారుణంగా విభజించారు. అనేకానేక కారణాల వల్ల ప్రజలకు జీవితంలో ధర్మం యొక్క మూలాంశాలపై కూడా అవగాహన లేదు. పాశ్చాత్య సంస్కృతిలోని చెడు మార్గాలన్నీ కూడా ప్రజల జీవితాలలో, మనసులలో నాటుకుపోయాయి. ఎంత దారుణమంటే రాముడిని నిందించటం, సీతమ్మను చులకన చేయటం, రావణుని ఆరాధించటం, కృష్ణుని స్త్రీలోలునిగా వక్రీకరించటం, ద్రౌపది గురించి నీచంగా మాట్లాడటం మొదలైన వాటి గురించి పుస్తకాలు కూడా వస్తున్నాయి. అంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోండి.

ఇలాంటి దుర్భర మానసిక వికారాలతో అజ్ఞానంలో కొట్టుమిట్టడుతున్న ప్రజలను అనేకానేక ప్రశ్నలు వేధిస్తున్నాయి. వీటన్నిటికీ సనాతనధర్మంలో పరంపరగా వస్తున్న పీఠాధిపతులు పూర్తిగా ప్రభావవంతంగా సమాధానం చెప్పలేకపోతున్నారు, ఒకరకంగా సమస్య వారి పరిధిని దాటిపోయింది. ప్రజలలో హీనత్వం ఎంత అధమస్తంగా ఉందంటే ప్రశ్నలలోనే జీవిస్తున్నారు, ముందుకు వెళ్లలేకపోతున్నారు, పరధర్మం గడపతొక్కి మన ధర్మాన్ని తూలనాడుతున్నారు కూడా. ఈ స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించటానికే, నేటి ప్రజలకు అర్థమయ్యేలా, నేటి ప్రశ్నలకు అనుగుణంగా సమాధానం చెప్పటానికి, నేటి భాషలో నేటి సమాచార సాధనలతో, కులాతీత మతాతీతమైన విధానంతో ప్రజలను ఏకం చేసి వారికి మనశ్శాంతికి తోడ్పడుతున్నారు జగ్గీ వాసుదేవ్, శ్రీశ్రీ రవిశంకర్ వంటి గురువులు. అలా అని వాళ్లు అవతారపురుషులా? కాకపోవచ్చు, కానీ అజ్ఞానులను సమాధాన పరచి వారిని ఒక మార్గంలో నడిపించగలగటంలో కొంతవరకు కృతకృత్యులైనారు. అందుకే వారి వారి సంస్థలు బాగా అభివృద్ధి చెందాయి. వీరి మార్గాలను నిశితంగా పరిశీలిస్తే అవి పూర్తిగా సనాతనధర్మ వాఙ్మయంపై ఆధారపడినవే. మన ముందుకు సందేశాన్ని తీసుకువచ్చే పద్ధతి ప్రత్యేకం. అంతే. పీఠాధిపతులు సాంప్రదాయ మార్గంలోనే నడుస్తున్నారు, వారిని నమ్మి అనుసరించేవారు ఆ మార్గంలోనే అద్భుతంగా ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా ఈ కొత్త గురువుల శిష్యవర్గం కూడా. వీరి ఆధ్యాత్మిక పురోగతి ఎంత మన సమాజానికి ఉపయోపడుతుంది అన్నది ఇప్పుడే చెప్పలేం. ఒక 50 ఏళ్ల తరువాత ఆయా గురువుల సంస్థలు ఎంత నిబద్ధతతో పరంపరను కొనసాగించగలుగుతాయి అన్నదానిపై ఈ సాఫల్యం ఆధారపడి ఉంటుంది.

ఈ కొత్తతరం గురువులను పరిశీలించేటప్పుడు మనం గమనించవలసింది సందేశం, అది ఎవరిని ఉద్దేశించబడినది అన్నది. ధర్మాన్ని నమ్మే వారికి సనాతనంగా వస్తున్న మార్గాలు, సంస్థలు ఉన్నాయి. ఏమీ తెలియని వారికి ఈ కొత్తగురువుల మార్గాలు ప్రభావవంతం. కొన్నాళ్ల తరువాత ఈ శిష్యవర్గం మరింత తెలుసుకునేందుకు సాంప్రదాయ మార్గాలను అన్వేషించే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ గురువులు అనుసరించేది గీత, రామాయణ, మహాభారతాల వంటి కాలపరీక్షను తట్టుకున్న తత్త్వమూలాలే. వీటిని దాటిన కొత్త సిద్ధాంతాలేవి కాలపరీక్షలో పెద్దగా నిలవలేకపోయాయి. జగ్గీవాసుదేవ్ చెప్పే ప్రతి విషయం కూడా ఎంతో సహేతుకంగా వెంటనే మనసును సమాధాన పరచేలా ఉంటుంది. ఆయన అనుసరించే మార్గం మన ధర్మంలో స్పష్టంగా చెప్పబడినదే. అలాగే రవిశంకర్ గారు చెప్పేవి కూడా. ఈ రెండు సంస్థలలోనూ అనాది చెప్పబడిన విధివిధానాలే, సరళంగా చెప్పబడి ఆచరించబడుతున్నాయి. జగ్గీవాసుదేవ్ ఎంతటి సాధన చేస్తే దుర్గమమైన మానస సరోవర్ యాత్రను ప్రతియేడాది, ఇన్నిమార్లు ఎంత సులభంగా చేయగలుగుతున్నారు. అలాగే రవిశంకర్ గారు ఎంత అద్భుతమైన ప్రపంచస్థాయి కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నారు.

ఇంకొక విషయం - ఇటువంటి గురువులు యుగయుగాలుగా వస్తూనే ఉన్నారు. వారి జన్మలకు ఒక లక్ష్యం ఉంటుంది. అవి నెరవేరిన తరువాత వారి శిష్యవర్గం ప్రధాన స్రవంతిలో కలసి ధర్మాన్ని మరింత పరిపుష్టం చేస్తారు. అందుకే గుడ్డిగా కొత్తగా ఏర్పడిన సంస్థలను, వాటి అధిపతులను విమర్శించకూడదు. అందరూ అదే ధర్మపరిక్షణకు తోడ్పడుతున్నవారే. ఈ కొత్త గురువుల సంభాషణలను, వారి అవలంబించే మార్గాలను సమయం వెచ్చించి పరిశీలిస్తే విహంగవీక్షణమవుతుంది. అప్పుడు ఏ రెండిటి మధ్యా వైరుధ్యం కనబడదు. మనం త్యజ్యించవలసింది, గర్హించవలసింది మనలో ఉన్న చీడపురుగులను, ఆధ్యాత్మికత పేరుతో చట్టవ్యతిరేక కార్యక్రమాలను సాగించేవారిని, ప్రజల ధనాన్ని, శాంతిని అపహరించేవారిని. ఇక ఈ నవీన గురువులలో లోపాలున్నాయి కదా అంటారా? ఎవరిలో లేవు చెప్పండి? వారు కూడా మనలాగే మానవజన్మ ఎత్తారు, కొద్దో గొప్పో వికారాలుంటాయి. కానీ వాటి వల్ల మనకు నష్టం కలుగుతోందా లేకా స్థూలస్థాయిలో మనకు ఆనందం, శాంతి కలిగి సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నామా అన్నది ముఖ్యం.

జైహింద్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి