30, ఆగస్టు 2020, ఆదివారం

దశావతార కృతులు - భద్రాచల రామదాసు కీర్తన

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతా
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలిగి అధర్మం పేత్రేగుతుందో, అప్పుడు నేను అవతరిస్తాను. దుష్టులను నాశనం చేసి సాధువులను రక్షించటం ద్వారా ధర్మ సంస్థాపన చేయుటకు ప్రతి యుగములోనూ నేను అవతరిస్తాను.

- శ్రీకృష్ణ భగవానుడు భగవ్దగీత నాలుగవ అధ్యాయం జ్ఞానయోగంలో.

ఈ కర్మభూమిపై జన్మించిన వాగ్గేయకారులు కొంతమంది శ్రీహరి దశావతారాలను ఆవిష్కరించే కృతులను రచించారు. వారిలో అన్నమాచార్యులు ప్రముఖులు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ కల్కి అవతారములను ఎన్నో కీర్తనలలో ఆయన నుతించారు. అదే విధంగా ఇతర దీక్షితుల వారు, భద్రాచల రామదాసు, స్వాతి తిరునాళ్ మొదలైన వారు ఇటువంటి సాహిత్యాన్ని మనకు అందించారు. కంచెర్ల గోపన్నగా జన్మించిన వాగ్గేయకారులు రామదాసు గారు రచించిన అటువంటిదే తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అనే కృతి. రామదాసు కృతుల ప్రత్యేకత భజన సాంప్రదాయంలో ఉండటం. పల్లెలలో, వీథులలో, భజన బృందాలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చక్కగా అందరూ పాడుకునే విధంగా ఉంటాయి. తక్కువేమి మనకు అనే కీర్తన ఆ కోవకు చెందినదే. భద్రాచల రామదాసు కీర్తనలను బాలమురళీకృష్ణ గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, మల్లాది సోదరులు మొదలైన సంగీత కళాకారులు ప్రచారంలోకి తీసుకు వచ్చారు. బాలమురళీకృష్ణ గారు ఓ నాలుగు దశాబ్దాల క్రితం పాడిన భద్రాచల రామదాసు కీర్తనలు అనే ఆల్బం ద్వారా ఈ కృతి తెలుగునాట బహుళ ప్రాచుర్యం పొందింది. అవతారాలను ప్రస్తావిస్తూ ఆ పరమాత్మ మన ప్రక్కనే యుండగా మనకింకేమి తక్కువ అన్న భావాన్ని రామదాసు ఈ కీర్తన ద్వారా అద్భుతంగా వ్యక్త పరచారు. మనకు కావలసినది ఆ శ్రీమనారాయణుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసము, సర్వస్య శరణాగతితో కూడిన భక్తి. మిగిలినవన్నీ ఆయనే చూసుకుంటాడు అన్నది రామదాసు అంతరార్థం. బాలమురళి గారు అన్ని చరణాలను పాడలేదు, అయినా వారు ఆలపించినదే మధురంగా ఉంటుంది. విని ఆనందించండి.

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

ప్రక్క తోడుగా భగవంతుడు తన చక్రధారియై చెంతనె యుండగ

మ్రుచ్చు సోమకుని మును జంపిన యా
మత్స్యమూర్తి మన పక్షమునుండగ

సురల కొరకు మందరగిరి మోసిన
కూర్మావతారుని కృప మనకుండగ

దురాత్ముడా హిరణ్యాక్షు ద్రుంచిన
వరాహమూర్తి మనవాడై యుండగ

హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా
పరచిన నరహరి పక్కనె యుండగ

భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
వామనుండు మనవాడై యుండగ

ధరలో క్షత్రియులను దండించిన
పరశురాముడు మన పాలిటనుండగ

దశగ్రీవు మును దండించిన యా
దశరథరాముని దయ మనకుండగ

ఇలలో యదుకుల మందుదయించిన
బలరాముడు మన బలమై యుండగ

దుష్ట కంసుని ద్రుంచినట్టి
శ్రీకృష్ణుడు మనపై కృపతో యుండగ

కలియుగాంతమున కలిగెడి దైవము
కలికి మనలను కావగనుండగ

రామదాసుని గాచెడి
శ్రీమన్నారాయణు నెరనమ్మి యుండగ

1 కామెంట్‌: