15, ఆగస్టు 2020, శనివారం

వేదాలు ఎప్పటివి? ఎలా వచ్చాయి? - కంచి పరమాచార్యుల వారు


వేదాలు అపౌరుషేయాలు - అంటే పురుష ప్రమేయం లేనివి అని అర్థం. పౌరుషేయమంటే మానవ కల్పితం. వేదాలు మానవ కల్పితాలు కానందువల్ల ఏ ఋషీ వాటిని రచించలేదు. వారే వ్రాసి ఉంటే ఋషులను మంత్రకర్తలనవచ్చు. కానీ వారిని మంత్రద్రష్టలంటాము. అంటే మంత్రాలను దర్శించిన వారన్నమాట. దీని వల్ల మనకు తెలిసేదేమిటి? ఋషులు మంత్రాలను కనుగొన్నారు, లేక దర్శించారు, వాటిని రచించలేదు, సృష్టించలేదు.

కొలంబస్ అమెరికాను కనుగొన్నాడన్న మాటకు అర్థం ఏమిటి? అతడు అమెరికాను సృష్టించడని కాదుగా? అప్పటికే ఉన్న అమెరికాను మిగిలిన లోకం దృష్టికి తీసుకు వచ్చాడు. న్యూటన్, ఐన్‌స్టైన్ వంటి శాస్త్రజ్ఞులు భౌతిక నియమాలను కొన్నిటిని ప్రతిపాదించి ప్రసిద్ధులైనారు. అంతేకానీ, వారే ఆ నియమాలను సృష్టించలేదు. భూమ్యాకర్షణ వల్లనే కదా న్యూటన్‌కు పూర్వం కూడా వస్తువులు క్రింద పడేవి? ఆయన దానిని కనుగొన్నాడు, అంతే. ఈ శాస్త్రవేత్తలు ఉన్న ప్రకృతి నియమాలను అర్థం చేసుకుని లోకానికి మొట్టమొదటిసారి చెప్పారు. ఆ విధంగానే సంస్థితమైన మంత్రాలను ఋషులను గ్రహించి, లోకానికి చెప్పారు. మంత్రాలు ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. ఋషులు వాటిని కనుగొనటం వలన ఆ మంత్రాలకు వారి పేర్లను జోడించారు. అప్పటికే ఉండి అజ్ఞాతంగా మిగిలిన వేదమంత్రాలను మానవలోకానికి ఎఱుకపరచిన ఘనత ఋషులకు దక్కుతుంది. అందువల్లనే వారి పేర్లను చెప్పేటప్పుడు మనం వారి స్మృతికి గౌరవసూచకంగా శిరస్సుతో నేలను తాకుతాం. వారు చేసిన మహత్కార్యానికి నివాళి ఇది. మంత్రాన్ని ఉచ్చరించటానికి పూర్వం కూడా ఈ భావంతోనే వారి పేర్లను పేర్కొంటాము. ఋషులు మంత్రాలను కనుగొన్నారన్నప్పుడు వారు కనుగొనక పూర్వం ఎక్కడ ఉండేవి? "అనాది" అంటే అవి ఎప్పుడూ ఉండేవని అర్థమా? ఉంటే ఎక్కడ ఉన్నాయి? అంతరిక్షంలోనా? ఒకవేళ సృష్టితో పాటే పరమాత్మ వేదాలను కూడా సృష్టించాడా? లేక సృష్టికి పూర్వమే సృజించాడా?

సృష్టికి పూర్వమే వేదాలుండేవని, బ్రహ్మ తన సృష్టిని శబ్దరూపంలో సంస్థితమై యున్న వేదమంత్రాలతోనే కొనసాగించాడనీ శాస్త్రాల వల్ల మనకు తెలుస్తుంది. శ్రీమద్భాగవతంలోని బ్రహ్మ సృష్టి గురించిన వివరణను బట్టి ఈ విషయం తెలుసుకోవచ్చు. మరి వేదాలు ఎలా వచ్చాయి? ఈ వేదార్భివ సమయ నిర్ణయమనే గందరగోళానికి సమాధానం వేదములోనే ఉంది. బృహదారణ్యకోపనిషత్తులో ఇలా ఉంది - ఋక్, యజుః, సామరూపాలలో - ఈశ్వరుని "నిశ్శ్వాసితం" మాత్రమే. నిశ్శ్వాసితము అన్న మాటకు అర్థం ఊపిరి విడవటమని. ఊపిరి లేకుండా ఉండగలమా? ఆ విధంగానే వేదాలు పరమాత్మ ఊపిరేనన్నమాట. ఆద్యంతాలు లేని పరమాత్మ నిత్యుడైతే, ఆయన యొక్క ఊపిరే అయిన వేదాలు కూడా అనాది. ఆయనతో పాటే అవి సంస్థితమై ఉంటాయి.

ఇక్కడ గమనించవలసిన విషయమిది: భగవంతుడు కూడా వేదాలను సృష్టించలేదని. మన ఊపిరిని మనమే కల్పించుకోలేము కదా! మనం పుట్టినప్పటి నుండి ఊపిరి ఉంటూనే ఉంటుంది. ఈ విధంగానే ఈశ్వరుడు, వేదాలూను. వేద భాష్యాన్ని వ్రాసిన విద్యారణ్యులు తన గురువు సాక్షాత్తూ ఈశ్వరుడేనంటూ ఆయన యొక్క "నిశ్శ్వాసమే" వేదాలను స్తుతించాడు. విద్యారణ్యుల వారు తన భాష్యంలో గురువు వేదాలలో ఎట్లా లీనమై పోయారో వర్ణించటమే గాక వేదాలు ఈశ్వర సృష్టి కావని కూడా నొక్కి చెప్పారు. అందుకే, వేదాలు పునాదిగా గల సనాతనధర్మం మిగిలిన ధర్మాల కన్నా గొప్పది. స్వయంగా పరమాత్మ నిశ్శ్వాస అయిన వేదాలు శాశ్వతం, సమస్త జీవరాశికి మార్గదర్శకం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి