26, నవంబర్ 2011, శనివారం

శ్రీమదాంధ్ర మహాభాగవతము ప్రథమ స్కంధము - సూతుని శౌనకాదులు వేడుకొనుట

అమ్మకు అంకితం

సూతమహామునిని శౌనకాది ఋషులు పరమ భాగవతతోత్తముని గాథను తెలుపుమని వేడుట:

ఎవ్వని యవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొరిదిజేయు
నెవ్వని శుభనామ మేప్రొద్దు నుడుపంగ సంసారబంధంబు సమసిపోవు
నెవ్వని చరితంబు హృదయంబు జేర్చిన భయమొంది మృత్యువు పరువువెట్టు
నెవ్వని పదనది నేపారుజలముల సేవింప నైర్మల్యసిద్ధి గలుగున్

తపసు లెవ్వని పాదంబు దగిలి శాంతి
తెఱవుగాంచిరి వసుదేవదేవకులకు
నెవ్వడుదయించె దత్కథలెల్ల
నిచ్చవుట్టెడు నెఱిగింపు మిద్ధచరిత

తాత్పర్యము: ఓ విమలచరితుడైన సూతమహామునీ! ఎవరి అవతారము వలన సకల ప్రాణులకు సుఖము, వృద్ధి, క్షేమము కలుగునో, ఎవని శుభనామము స్మరించినంత సంసార బంధాలు తొలగిపోవునో, ఎవని చరిత్ర హృదయములో నిలిపినంత మృత్యువు కూడా భయపడి పారిపోవునో, ఎవ్వని పాదములనుండి జన్మించిన పవిత్ర గంగానదీ జలము సేవిస్తే పునీతలవుతారో, తపస్సు చేసే మహాత్ములు ఎవని పాద స్పర్శ వలన పరమశాంతి పొందుతారో దేవకీ వసుదేవులకెవ్వడు పుత్రునిగా ఉదయించెనో ఆతని కథలనన్నిటినీ వినుటకు మాకు మిక్కిలి కోరికగా నున్నది గాన ఆ గాథలను వినిపించుడు.

భావము: సీసము-తేటగీతి యుగళమైన ఈ పద్యరత్నములలో పోతనామాత్యులు తన శ్రీహరి భక్తిని తేటతెల్లము చేశారు. హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు అని అన్నమాచార్యులవారు అన్నరీతి పోతనవారు ఈ పద్యములలో హరిని శౌనకాది మునులు నుతించిన రీతి కడు శ్రావ్యము. భాగవత లక్ష్యమైన మోక్షమును పొందుటకు ఏమి చేయాలి అని మునులనోట సూతునికి విన్నపముగా పోతనగారు అలరించారు. హరి నామస్మరణ, హరిగాథను హృదయములో నిలుపుకొనుట, హరిపాదాన పుట్టిన పవిత్ర గంగానది స్నానము చేయుట - ఇవన్నీ మోక్షకారకలే అని శౌనకాది మునుల నోట పలికించారు.



హరినామ కథన దావానలజ్వాలచే గాలవే ఘోరాఘకాననములు
వైకుంఠదర్శన వాయుసంఘంబుచే దొలగవే భవదుఃఖతోయదములు
కమలనాభ ధ్యానకంఠీరవంబుచే గూలవే సంతాపకుంజరములు
నారాయణ స్మరణ ప్రభాకరదీప్తిచే దీరవే షడ్వర్గతిమిరరతులు

నళిననయన భక్తినావచేగాక సంసారజలధి దాటి చనగరాదు
వేయినేల మాకు విష్ణుప్రభావంబు దెలుపువయ్య సూత! ధీసమేత

తాత్పర్యము: ఓ సూతమునీంద్రా! శ్రీహరిగాథా శ్రవణమనే దావాగ్నిచే ఘోరపాపపుటరణ్యములు దహించుకుపోవా? వైకుంఠదర్శనమనే పెనుగాలిశక్తికి సంసారదుఃఖమనే కారుమేఘములు తొలగిపోవా? పద్మనాభుని ధ్యానమనే సింహపుదెబ్బకు శోకములనే ఏనుగులమంద నేలకూలదా? నారాయణ స్మరణమనే ప్రచండ సూర్యతేజముచే కామక్రోధాది అరిషడ్వర్గమనే చీకటి మాయమవదా? కమలాక్షుని యందు భక్తియనే నావచే తప్ప సంసారాన్ని దాటుట సాధ్యమవుతుందా? ఇన్ని మాటలెందుకు? ఓ ధీమంతుడా! శ్రీహరియొక్క దివ్యలీలా ప్రభావాల గుఱించి మాకు వివరించి తెలుపుమయ్యా!

భావము: పైన చెప్పిన పద్యాలలో మొదలైన హరివైభవ వర్ణన ఈ సీసము-ఆటవెలది పద్యయుగళములో కూడా పోతనగారు శౌనకాది మునులు-సూత సంవాదంగా కొనసాగించారు. అద్భుతమైన కవితా సంపదను భక్తితో కూర్చి శ్రీహరి భాగవత గాథాలహరిని ఆరంభించారు. అనన్యమైన ఉపమానములు అలంకారములు ఈ పద్యములో పోతనగారి కలంలో వెలువడ్డాయి. అంతా ఆ శ్రీహరి మహిమే! ఈ పద్యయుగళములోని ఐదు  ఉపమానములు:

  1. శ్రీహరి గాథల వినుటను దావాగ్ని అంత శక్తివంతముగా, మానవ పాపములు ఘోరారణ్యములుగా ఉపమానము చేసి, కేవలం ఆ దావాగ్ని మాత్రమే ఈ కానలను కాల్చగలదని వివరించారు. 
  2.  వైకుంఠ దర్శనము పెనుగాలి వంటి శక్తిగా, సంసారంలో ఉండే దుఃఖాలను కారుమేఘాలుగా పోలిచి, ఆ పెనుగాలి మాత్రమే ఈ కారుమేఘాలను తొలగించ గలదని వక్కాణించారు.
  3. హరిధ్యానమును సింహపు హుంకారముగా, శోకమును ఏనుగుల సమూహముగా, ఆ సింగపు ఘాతమే ఈ ఏనుగులను నేలకూల్చగలదిగా నుతించారు
  4. నారాయణుని నామస్మరణను ప్రంచండ భానుని తేజముగా, కామక్రోధలోభమోహమదమాత్సర్యములను చీకటిగా, ఈ చీకటిని ఆ తేజమే మాయము చేయనదిగా పలికారు.
  5. హరిభక్తిని నావగా, సంసారమును సాగరముగా, ఈ సాగరాన్ని ఆ నావతో మాత్రమే దాటగలమని ఉదహరించారు.

అందుకే పోతన భక్త శిరోమణి, మహాకవి అయినాడు.

25, నవంబర్ 2011, శుక్రవారం

శ్రీమదాంధ్ర మహాభాగవతము ప్రథమ స్కంధము - ప్రార్థన పద్యములు

అమ్మకు అంకితం

భాగవతంలోని ప్రార్థనా పద్యాల తరువాత తన సంకల్పాన్ని, లక్ష్యాన్ని, భాగవత కావ్య లక్షణాలను పోతన గారు గొప్పగా మన ముందుంచారు. అందులో మూడు:

ఇమ్మనుజేశ్వరాధములుకిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే
సమ్మెటపోటులం బడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పె నీ
బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్

ఈ పవిత్ర గ్రంధమును అధములు, హీనచరితులైన ఈ రాజులకు అంకితమిచ్చి, వారిచ్చే ధనధాన్య వస్తువాహన గృహగ్రామాదులను స్వీకరించి, చివరకు యమధర్మరాజు తాడనములకు లోనగుటకంటె, ఈ బమ్మెరపోతన లోకహితార్థమై తన కావ్యకన్యయైన భాగవతమును ఆ శ్రీహరికే సమర్పించదలచెను.

ఈ పద్యంలో పోతన తన రచనలను అశాశ్వతమైన మానవులకు అంకితం ఇచ్చి చివరకు నరకయాతన పడటం కన్నా శాశ్వతుడైన ఆ శ్రీహరికే అంకితమిచ్చి లోకకళ్యాణమునకు సంకల్పము తెలిపారు. అది పోతన ఆదర్శాలకు, జీవనశైలికి, భగవద్భక్తికి, భోగభాగ్యాల పట్ల నిరాసక్తతకు నిదర్శనము. రాజులు తమను పొగిడినంత కాలం, తమకు ధనసంపద, రాజ్యమున్నంత కాలం, తామున్నంత కాలం ఆ కవిని పోషిస్తారు. తరువాత? అలాగే ఒక రాజును పొగడిన కవి ఇంకొక రాజుకు ఆప్తుడు కాలేడు కదా? ఇవన్నీ భగవంతుని విస్మరించి రాజులు శాశ్వతమని భావించి చేసినందువలన, నరకలోక ప్రాప్తి కలిగి నానా యాతనలు అనుభవించవలసినదేగా? భగవద్భక్తుడైన పోతన ఈ విషయము నిరంతరము స్ఫురణలో నిలుపుకొని శాశ్వతమైన, సచ్చిదానందమైన శ్రీహరికే తన కావ్యాన్ని అంకితమిచ్చి ధన్యుడైనాడు.



పలికెడిది భాగవతమట పలికించువిభుండు రామభద్రుండట నే
బలికిన భవహరమగునట పలికెద వేరొండుగాథ బలుకగ నేలా

నేను చెప్పబోవునది పరమపవిత్రమైన భాగవతమట, నాచే చెప్పించే నాథుడు సాక్షాత్తు ఆ శ్రీరామచంధ్రుడేనట, నేనీ భాగవతగాథను చెపితే సంసార బంధము నశిస్తుందట. అందుచేత నేనీ భాగవతమునే పలికెదను. మరివేరొక గాథను చెప్పడమెందుకు?.

తాను కేవలం కర్తను మాత్రమే అన్న భావనను తెలుపటానికి పోతనగారి ఈ పద్యం చక్కటి నిదర్శనము. అంతా ఆ రాముని సంకల్పముతో జరుగుతున్నదే, ఆ గాథను పలికితే అన్ని బంధాలు తొలగి మోక్షమార్గోన్ముఖుల మవుతామట, ఇంక వేరే గాథలు ఎందుకు చెప్పాలి? ఇది ఆయన లక్ష్యముపై గల తదేక దీక్ష, దృఢత్వానికి సంకేతము. కాబట్టే వ్యాస భగవానులు రచించిన బృహత్తరమైన భాగవతాన్ని పోతనగారు అత్యంత రమణీయంగా రచించారు.

లలితస్కంధము గృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం
జులతాశోభితమున్ సువర్ణసుమనస్సుజ్ఞేయమున్ సుందరో
జ్జ్వలవృత్తంబు మహాఫలంబు విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్యకల్పతరువుర్విన్ సద్ద్విజశ్రేయమై

ఈ భాగవతము లలితమైన గ్రంథము. శ్రీకృష్ణభగవానుని చరిత్రయే దీనికి మూలము. శుకమహర్షిచే అందముగా ఆలాపించబడిన మంజులమైన గానము, బంగారములా శుద్ధి చేయబడిన మనసు గలవారికి తేటతెల్లము. అతిసుందరముగా శోభించే కథావస్తువు గలది. చాలా గొప్ప ఫలప్రదమైనది, విమలుడైన వ్యాసభగవానునిచే నిర్మితమైన భాగవతమనే కల్పవృక్షము, మంచి బ్రాహ్మణులకు శ్రేయస్కరమై వెలయునట్టిది.

భాగవత లక్షణాలను తెలిపే ఈ పద్యం అందులోని మార్దవాన్ని, సౌశీల్యాన్ని, శోభను, భావ సారూప్యాన్ని, మహిమను మనోజ్ఞంగా రూపొందించారు పోతన. ఇటువంటి లక్షణాలు, పదజాలము, భావజాలము కలిగిన పద్యాలు పోతన భాగవతంలో కోకొల్లలు. పోతన భాగవత ప్రొయులకు ఈ పద్యలక్షణాలను సుళువుగా గుర్తుపట్టగలరు.

23, నవంబర్ 2011, బుధవారం

సత్య సాయి మొట్ట మొదటి భజన - మానస భజరే గురుచరణం


మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ శివాయ నమ ఓం
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం
ఓంకారం బాబా ఓంకారం బాబా ఓంకారం బాబా ఓం నమో బాబా
మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం
గురు మహారాజ్ గురు జై జై సాయినాథ సద్గురు జై జై
గురు మహారాజ్ గురు జై జై సాయినాథ సద్గురు జై జై
మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం

ఈ భజన భగవాన్ సత్య సాయి బాబా గళంలో

సత్య సాయి భజన - ఉయ్యాలలూగుమా శ్రీసత్యసాయి


ఉయ్యాలలూగుమా శ్రీసత్యసాయి ఆత్మడోలికలోనూ ఆనందదాయి

నా మానస సరోవరము పాల్కడలి కాగా 

శేషరూపక నాడీకల్పమున నిలచే
శ్వాసలే మధురగానము చేయు వేళలో 

నా తనువెల్ల హాయిగా విహరింపుమయ్య తనువెల్ల హాయిగా విహరింపుమయ్య |ఉయ్యాలలూగుమా|

బ్రహ్మాండమంతయు వ్యాపించియున్న 

నీవేమో నాలో నిలచి యున్నావు
ఈ విశ్వమంతయు
ఈ విశ్వమంతయు నీలోపలది గాన 
వాసుదేవా నేను సాయిదేవా నేను నీలోననున్నానుగా |ఉయ్యాలలూగుమా|

లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి

బొంబాయి జయశ్రీ శ్రవణం

సత్య సాయి భజన - సాయీశ్వర నీ పదముల సన్నిధి నే చేరినాను


సాయీశ్వర నీ పదముల సన్నిధి నే చేరినాను
సదానంద వార్నిధిలో సదా డోలలూగినాను


హరేరామ హరేకృష్ణ హరే సాయి హరే హరే
భజే సాయి శాంతిదాయి సత్య సాయి హరే హరే  |సాయీశ్వర|

మనసులోన భక్తి సుధా మధురిమలే నింపినాను
కనులలోన కాంతి ప్రభా కవిత జ్యోతి నిలిపినాను
ఆరాధన పూర్వకముగ అనవరతము కొలిచినాను
తనివారగ దర్శించి తరియించెద స్వామి నేడు |సాయీశ్వర|

హృదయపథములో నిరతము పదయుగమును నిలిపినాను
భావవీధిలో సతతము సేవచేయ తలచినాను
ఆవేదన పొంగగ నను ఆదుకొనగ వేడినాను
పరమాద్భుత మహిమాన్విత కరుణ కోరినాను నేడు |సాయీశ్వర|

ఆశ్రిత జనకోటికెల్ల అభయమొసగు దాతనీవు
నామకీర్తనన మురియు నారాయణమూర్తి నీవు
లీలామానుష దేహుడు బోళాశంకరుడు నీవు
త్రిమూర్తి స్వరూపుడవు దీనబాంధవుడవు నీవు |సాయీశ్వర|

త్రేతాయుగమందు వెలయు సీతాపతి నీవుగదా
ద్వాపరమ్ములోన వెలుగు గోపాలుడు నీవుగదా
ఈ కలికాలమున అవతరించిన సాయీవి కదా
పర్తివాస పరమపురుష పరమాత్ముడ నీవే కదా |సాయీశ్వర|

ప్రియ సిస్టర్స్ శ్రవణం 

22, నవంబర్ 2011, మంగళవారం

శ్రీమదాంధ్ర మహాభాగవతము ప్రథమ స్కంధము - అమ్మలగన్నయమ్మ

అమ్మకు అంకితం

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చినయమ్మ తన్ను లో
నమ్మినవేల్పుటమ్మలమనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ది యిచ్చుత మహత్వకవిత్వపటుత్వ సంపదల్

పోతనామాత్యులు

తాత్పర్యము: అమ్మలందరికీ అమ్మ, లక్ష్మి, సరస్వతి, పార్వతులకు మూలమైన అమ్మ, అందరమ్మలకన్నా అధికురాలైన అమ్మ, రాక్షసుల తల్లుల కడుపులకు చిచ్చుపెట్టి (రాక్షస సంహారం ద్వారా), తనను మనసులో నమ్ముకున్న దేవతల తల్లుల మనములలో నిలిచియుండే అమ్మ, దయాసాగరి అయిన మా దుర్గాదేవి నాకు మహత్తు కలిగిన కవిత్వ, పటుత్వ సంపదలనిచ్చు గాక!


జగజ్జనని ఆది పరాశక్తి

ప్రథమ స్కంధములోని ప్రార్థన పద్యాలలో అత్యంత ప్రజాదరణ పొందినది ఈ అమ్మలగన్నయమ్మ. ఆ ఆదిపరాశక్తిని నుతిస్తూ పోతనగారు ఆమె అపార కరుణారస వృష్టి ద్వారా తనకు ఎంతో మహత్తు కలిగిన దృఢమైన కవితా సంపద కలగాలని వేడుకున్నారు. పోతన భాగవతంలో పదశోభ మువ్వల గజ్జెలా గంగా ప్రవాహంలా అత్యంత రమణీయంగా ఉంటుంది. పద్యము మొత్తం అమ్మ శబ్దంతో నింపిన పోతనగారు జగజ్జనని మహాత్మ్యాన్ని ఉత్పలమాలలో మనకు అందించారు.

పురాణేతిహాసములలో ముగ్గురుమ్మలకు మూలంగా కొలువబడిన ఆ దుర్గాదేవి సర్వశక్తిస్వరూపిణి కనుకు పోతనగారు ఆమెను తన కావ్యరసప్రవాహం సుగమంగా సాగటానికి రమ్యంగా ప్రార్థించారు.  ఈ పద్యాన్ని శ్రీకృష్ణపాండవీయం చలన చిత్రంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణి ఆ జగన్మాతను ప్రార్థించే సన్నివేశంలో గానకోకిల సుశీలమ్మ గారు అద్భుతంగా గానం చేశారు. అమ్మను నుతించే ఏ పద్యమైన అమ్మ అంత హృద్యమే. కృపాబ్ది అన్నది అమ్మ దయారాశిని సూచించటానికి ఎంత సముచితమైనదో తల్లి ప్రేమను చూరగొన్న ప్రతి బిడ్డకు తెలుసు. నా తల్లి సరస్వతమ్మ గారితో పాటు ఈ లోకంలో ఉన్న ప్రతి మాతృమూర్తికి ఈ పద్యం అంకితం.

21, నవంబర్ 2011, సోమవారం

శ్రీమదాంధ్ర మహాభాగవతము ప్రథమ స్కంధము - శ్రీ కైవల్య పదంబు

అమ్మకు అంకితం

తెలుగు సాహితీ జగత్తులో అత్యుత్తమమైన రచన బమ్మెర పోతనామాత్యులవారి శ్రీమదాంధ్ర మహాభాగవతము. వేదవ్యాసులవారి భాగవతాన్ని రామ కార్యంగా, రాముని సంకల్పము చేత, ఈ తేనెల తేటల మూట అయిన శాశ్వత సాహితీ సంపదను పోతనగారు కృతి చేసి ఆ రామునికే అంకితము చేశారు. ఇటువంటి రచన న భూతో న భవిష్యతి. ప్రతి పద్యములోనూ భగవంతుని దర్శనాన్ని కలిగించి మనలను తర తరాలపాటు మోక్షమార్గోన్ముఖులను చేశారు. ఆ మహాకవికి తెలుగు సాహితీ జగత్తు మరియు భక్త జన కోటి తరఫున శత సహస్ర కృతజ్ఞతాభివందనములు.

మాతృదేవోభవ - అపారమైన ప్రేమ, కరుణ, వాత్సల్యము, జ్ఞానము కలిగిన నా మాతృమూర్తి సరస్వతమ్మ గారికి ఈ ధారావాహికాన్ని సమర్పిస్తూ ఆమెకు ఉత్తమలోకాలు ప్రాప్తించాలని ఆ విశ్వాత్ముడైన శ్రీహరికి నా ప్రార్థన.



పోతనగారు భాగవతాన్ని ప్రథమ స్కంధములో ప్రార్థనా శ్లోకము ద్వారా ఆరంభించారు.

శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళీలోలవిలసదృగ్జాల సంభూత నా
నా కంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్

తాత్పర్యము: మానవ జన్మకు అత్యుత్తమమైన పురుషార్థము మోక్షము. ఆ మోక్షప్రాప్తిని పోతనగారు శ్రీకైవల్యపదంబు గా పేర్కొన్నారు. ఈ భాగవత ప్రయోజనము, లక్ష్యము కూడా అదే కదా! లోకరక్షణాపరాయణుడు, భక్తపాలనమే ఒక కళగా ఆచరించేవాడు, దానవుల ఉద్ధృతాన్ని అరికట్టే వాడు, లీలావలోకనముతో (కంటిచూపుతో) అనేక బ్రహ్మాండములను సృష్టించే వాడు, నందుని ఇల్లాలయిన యశోద ముద్దు బిడ్డడు అయిన బాలకృష్ణుని శ్రీ కైవల్యపదమును పొందుట కొరకు నేను ధ్యానిస్తున్నాను.

భాగవతంలో సృష్టి, శ్రీహరి అవతారములు, వాటి విలక్షణ లక్షణములను అద్భుతంగా వివరించినా, శ్రీకృష్ణుని అవతార వర్ణనా ఘట్టమైన దశమ స్కంధము అత్యంత రమ్యమైనది, రసమయమైనది, జనాదరణ పొందినది. అందుకు కారణం ఆ లీలామానుషుని మాయాప్రేరిత చేష్టలు, వాటిలో అంతర్లీనమైన ఆధ్యాత్మిక సందేశము. మనలో ఒకనిగా ఉంటూ, చిలిపి చేష్టలు ప్రదర్శిస్తూ విశ్వవిలాసానికి సాక్షీభూతునిగా నిలచి పిదప దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన యోగావతారుడు శ్రీకృష్ణుడు. తల్లి ప్రేమ, కన్నెలతో రాసక్రీడలు, చెలికాళ్లతో సావాసము, మహాకాళిందీ కేళీ విలాసము, కంసాది దానవ సంహారము, తన్మయ బృందావన వేణు గాన నాట్య విలాసము, రాజనీతి, రణనీతి, ధర్మ స్థాపన, పంచమవేదంగా ప్రసిద్ధిగాంచిన శ్రీమద్భగవద్గీత బోధన ద్వారా కర్తవ్య ప్రబోధము, విశ్వరూపసందర్శనము, అతి సామాన్య అవతార సమాప్తి - ఇంతటి విలక్షణ లీలానాటక ప్రదర్శనము చేసిన ఆ శ్రీకృష్ణుని ప్రార్థనా శ్లోకములో నుతించుట సముచితం. అందుకే శ్రీమదాంధ్ర మహా భాగవత సౌరభము మొదటి మెట్టులోనే సంపూర్ణంగా పరిమళించి తెనుగునాట చిరకాలం నిలిచింది.

మొదటి పద్యములోనే పోతనగారు తన లక్ష్యాన్ని, మార్గాన్ని చాలా సుస్పష్టంగా మన ముందుంచారు. భగవంతుని గాథలను వర్ణిస్తూ ఆయనను ధ్యానించి కైవల్యము పొందే మార్గాన్ని ఈ ప్రార్థనలో చిత్రీకరించారు. పాండిత్యానికి భక్తి పారవశ్యానికి గల తేడా మనకు శ్రీనాథుడు మరియు పోతనల రచనలను పోల్చి చూస్తే విశదపడుతుంది. లాలిత్యము, మాధుర్యము, సంపూర్ణ వర్ణనము, రోమాంచము గావించే పద కిసలయ విన్యాసము పోతన రచనకు మూలస్థంభమైతే భక్తి, తాదాత్మ్యత దానికి శ్వాస. అందుకే అది ఆత్మ సాక్షాత్కారానికి సోపానముగా నిలిచింది. వచ్చే సంచికలో మరొక ప్రార్థనా పద్యము అమ్మలగన్నయమ్మ...


18, నవంబర్ 2011, శుక్రవారం

శ్రీ పోతన భాగవత మధురిమలు - అమ్మ కోసం

అమ్మకు పోతన భాగవతం పద్యాలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు బాలశిక్షతో పాటు నేర్చుకున్న ఈ పద్యాలు అమ్మ ముఖంలో ఆనందాన్ని, తృప్తిని నింపేది. నిద్రలో లేపి అడిగినా కూడా అమ్మ ఈ పద్యాలు సరైన ఉచ్చారణతో ఉత్సాహంగా చెప్పేది. అమ్మ ఆత్మ శాంతికోసం పోతన భాగవతంలోని కొన్ని పద్యాలు ధారావాహికంగా. మూలం గీతా ప్రెస్సు వారి శ్రీ పోతన భాగవత మధురిమలు.