త్యాగయ్య మామూలు మానవునిలా దుర్భర మరణం పొందలేదు, 10 రోజుల ముందే భద్రాద్రి రాముని గాంచి, గిరిపై నెలకొన్న అనే కృతి ద్వారా ఆ సాక్షాత్కారానికి శాశ్వతత్వాన్ని ఆపాదించి, ఆ స్వామి సూచనను గ్రహించి తన మరణ ఏర్పాట్లను చేసుకున్నాడు, శిష్యులందరూ చూస్తుండగా స్వేచ్ఛగా ఆత్మ దేహాన్ని వీడేంత ఆధ్యాత్మిక శక్తిని సంపాదించుకున్నాడు. అందుకే 250 ఏళ్లు గడిచినా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. మరో 1000 ఏళ్లు గడిచినా ముందు తరాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. త్యాగరాజ హృదయాన్ని ఆయన శిష్యులు ఎందరో అక్షర రూపంలో ఆవిష్కరించారు. త్యాగయ్య ఆఖరి రోజుల స్థితికి కేశవ్ గారి చిత్రం చూడండి.
పులకాంకితుడై యానందాశ్రువుల నింపుచు మాటలాడవలెనని
కలువరించ గని పది పూటల పై గాచెదనను త్యాగరాజ వినుతుని
గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక గంటి భద్రగిరిపై నెలకొన్న!
ఎక్కడో తంజావూరు దగ్గర ఉన్న త్యాగరాజస్వామికి భక్త రామదాసు, ఆయన కొలిచిన భద్రాద్రి రాముని గురి ఎలా తెలిసి, కృతిలో వర్ణించగలిగారు? అదే కదా, భారతీయ ఆధ్యాత్మికతలోని గొప్పతనం. ఏ ప్రచార సాధనం లేని రోజుల్లో దివ్యదృష్టి ద్వారా, నోటి మాట ద్వారా పుంఖానుపుంఖాల విషయాలు, గ్రంథాలు దేశమంతా సద్గురువుల ద్వారా, సత్పురుషుల ద్వారా చాటబడేవి.
గమనిక: భద్రాద్రి రాముడు రామదాసునే కాదు, ఆ తరువాత కాలంలో వచ్చిన త్యాగయ్యను కూడా బ్రోచాడన్నదానికి ఈ కృతి నిదర్శనం.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి