తాళ్లపాక అన్నమాచార్యులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తాళ్లపాక అన్నమాచార్యులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, జులై 2026, ఆదివారం

ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా - తాళ్ళపాక అన్నమాచార్యుల వారి కృతి



ఎప్పుడైనా దీనంగా, నిస్సహాయతగా అనిపించినప్పుడు, ఈ అన్నమాచార్యుల వారి కృతి వినండి, ఒంట్లో నారసింహం అణువణువునా నిలిచి శక్తినిస్తుంది, క్లైబ్యాన్ని తొలగించి కర్తవ్యోన్ముఖులను చేస్తుంది. ఖచ్చితంగా పని చేస్తుంది, సందేహమే లేదు. కావలసింది ఆయనపై అచంచలమైన విశ్వాసం. స్వామి కేళీ విహారం అద్భుతం, అమోఘం, అనుభవైకవేద్యం. నారసింహోపాసకులను అడగండి వారు చెబుతారు. 

ఇక్కడ ఒక్క చిన్న విషయం చెప్పాలి. స్వామి తీక్ష్ణ ప్రభావం కలవాడు కాబట్టే నిష్ఠతో గురువిదితంగానే ఉపాసన చేయాలి. స్వయంగా నారసింహ ఉపాసన చేయకూడదు. గురు ముఖత మంత్రోపాసన పొందని వారు కరావలంబ స్తోత్రం, నామావళి వంటివి చదువుకోవచ్చు.

ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహా

ప్రళయమారుత ఘోర భస్త్రికాపూత్కార లలిత నిశ్వాసడోలా రచనయా
కులశైలకుంభినీ కుముదహిత రవిగగన చలన విధినిపుణ నిశ్చల నారసింహా

వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూతలవదివ్య పరుష లాలాఘటనయా
వివిధ జంతు వ్రాతభువన మగ్నౌకరణ నవనవప్రియ గుణార్ణవ నారసింహా

దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ సంగక్రీడయా
వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ కారణ ప్రకట వేంకట నారసింహా

భావము:

ఓ నరసింహా ! ఫాలభాగంనుండి విస్ఫులింగాలు కురిపిస్తూ ప్రపంచమంతటినీ గొప్పగొప్పవిద్యుల్లతలతో మెరిపిస్తూ వేడుకగా విహరించడం నీకు ఒక ఆట. నీవు నిశ్చలంగా ఉంటూ లలితంగా మృదువుగా గాలి వదిలితే (నిశ్వసిస్తే) ఓ నారసింహా !ఆ నిశ్వాసము ప్రళయకాల ప్రభంజనంలా మారి కులపర్వతాలను (ఏడు కులపర్వతాలు ఉన్నాయి ఉదయ, అస్త, హిమ, వింధ్య, మేరు, త్రికూట, లోకాలోక పర్వతాలు) భూమిని చంద్రుడిని సూర్యుడిని ఆకాశాన్ని అన్నింటినీ ఒక ఊపు ఊపుతుంది. ప్రియమైన గుణములకు సముద్రము వంటి ఓ నారసింహా ! దుర్జనులను చూసినప్పుడు భయముగొలిపేటట్లుగా తెరిచిన నీ గొప్పదైన ముఖము నుండి వెలువడే మహాట్టహాసము మరియు నీ లాలాజలము అనేక జంతుతతులన్న ఈ జగమును ముంచెత్తుతూ లోకాలను పవిత్రం గావిస్తున్నది. కొత్తకొత్తగా మారుస్తున్నది.ధగధగా మెరుస్తూ భయంకరంగా విస్ఫులింగాలు వెదజల్లుతూ వికృతమైన కోరలతో నిన్ను నీవు ప్రకటింపచేసుకున్నది ఒక ఆటలాగ శత్రువులైన దానవ వంశాలను భస్మం చేయడం కొరకే కదా!

 ఈ సంకీర్తనను గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు ఆలపించారు

7, ఫిబ్రవరి 2026, శనివారం

ఆకటి వేళల అలపైన వేళల - అన్నమాచార్యుల కృతి



ఈతి బాధలలో, కష్టాలలో ఉన్నప్పుడు నాకు తప్పకుండా గుర్తుకు వచ్చే కృతి, అన్నమాచార్యుల వారి ఆకటి వేళల...శుభపంతువరాళి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని అక్కారై సోదరీమణులు శుభలక్ష్మి, స్వర్ణలత అద్భుతంగా ఆలపించారు. 

ఆకటి వేళల అలపైన వేళల
తేకువ హరినామమే దిక్కు మరి లేదు

కొఱమారియున్న వేళ కులము చెడిన వేళ
చెఱవడి వొరుల చేజిక్కిన వేళ
వొఱపైన హరినామమొక్కటే గతి గాక
మఱచి తప్పిననైన మఱి లేదు తెఱగు

ఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామమొక్కటే గతి గాక
మాపు దాకా పొరలిన మరిలేదు తెఱగు

సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతిగాక
మంకు బుద్ధి పొరలిన మరిలేదు తెఱగు

- తాళ్లపాక అన్నమాచార్యుల వారు 

భావం:

ఆకలి కలిగినప్పుడు, అలసిపోయినప్పుడు ధైర్యమును చేకూర్చి రక్షించునది హరినామమొక్కటే. అది తప్ప మరొక దిక్కు లేదు.

తాను ఎందుకూ పనికి రాని దుస్థితి ఏర్పడినప్పుడు, కులము చెడినప్పుడు, ఇతరులచే బంధింపబడి కృశించినప్పుడు, ప్రకాశమానమైన హరినామమొక్కటే గతి. దానిని మరచినచో మరొక గతి లేదు.

ఆపద కలిగినప్పుడు, నిందకు లోనైనప్పుడు, పాపము మీద పడినప్పుడు, భయపడినప్పుడు, మిక్కిలిగా స్మరింపదగిన హరి నామమొక్కటే గతి. దానిని మించి ఎంత ప్రయత్నించిననూ ఆ దుర్దశలనుండి కాపాడుటకు మరొక మార్గం లేదు.

శత్రువులు సంకెళ్ళతో బంధించినప్పుడు, చంపుటకు పిలిచినప్పుడు, అప్పులవారు అడ్డగించి నిలదీసినప్పుడు విడిపించుటకు శ్రీ వేంకటేశ్వరుని నామమొక్కటే ఉపాయము. దానిని వదలి మూర్ఖత్వముతో ఎంత ప్రయత్నించిననూ వేరొక ఉపాయము లేదు.

అన్నమయ్య శృంగార సంకీర్తన విని సాళ్వ నృసింహరాయలు ఆయనను చెరశాలలో బంధించి హింసించినప్పుడు ఆచార్యులు “ఆకటివేళల” అను సంకీర్తనను ఆలపించగా సంకెళ్ళు తమకు తామే విడిపోయానట. అప్పుడు రాజు ఆచార్యుల పాదాలపై పడి క్షమించమని వేడుకొనగా “శ్రీహరి నిన్ను రక్షించుగాక” అని దీవించెనట. ఈ విషయము అన్నమయ్య మనుమడు చిన్నన్న తాను రచించిన అన్నమయ్య జీవిత చరితలో తెలిపారు. 

https://youtu.be/sKW2OEb8-8M?t=127

5, జనవరి 2026, సోమవారం

అదివో చూడరో అందరు మొక్కరో - అన్నమాచార్యుల కీర్తన



 అదివో చూడరో అందరు మొక్కరో గుదిగొని బ్రహ్మము కోనేటి దరిని

రవిమండలమున రంజిల్లు తేజము దివి చంద్రునిలోని తేజము
భువిననలంబున బొడమిన తేజము వివిధంబులైన విశ్వతేజము

క్షీరాంబుధిలో చెలగు సాకారము సారె వైకుంఠపు సాకారము
యీరీతి యోగీంద్రులెంచు సాకారము సారెకు జగముల సాకారము

పొలసినయాగంబులలో ఫలమును పలుతపములలో ఫలమును
తలచిన తలపుల దానఫలంబును బలిమి శ్రీవేంకటపతియే ఫలము


భావం: 

ఇదిగో చూడండి - ఇది సాధారణ దృశ్యం కాదు. ఇది దర్శించినవారందరూ సహజంగానే నమస్కరించేంత మహిమ కలిగిన స్వరూపం.పుష్కరిణి సమీపంలో వెలసిన ఈ పరబ్రహ్మను బయటి చూపుతో కాదు; మనస్సును అంతర్ముఖం చేసి, లోతుగా ధ్యానించినవారే చేరగల మార్గమిదని అన్నమాచార్యుల వారు చెబుతున్నారు. ఇది జ్ఞానమార్గం కాదు, అహంకారాన్ని వదిలే అంతర్యాత్ర.

సూర్యునిలో కనిపించే ఉజ్జ్వల కాంతి, చంద్రునిలో కనిపించే శాంత ప్రకాశం, అగ్నిలో మండే ఉగ్ర తేజస్సు - ఈ మూడు వేర్వేరు లక్షణాలైనా, మూలంగా అవన్నీ ఒకే తేజస్సు. అది పరబ్రహ్మ తేజస్సు. అంటే దేవుడు ఎక్కడో వేరుగా లేడు. ప్రకృతిలో కనిపించే ప్రతి శక్తి ఆయనే.

అదే పరబ్రహ్మం పాలసముద్రంలో నారాయణుడిగా సాకారమైంది. అదే వైకుంఠంలో నిత్యనివాసిగా ప్రకాశిస్తోంది. యోగులు తమ ధ్యానంలో దర్శించేది కూడా అదే రూపం. అలాగే సమస్త లోకాలకు ఆధారమైన మూలస్వరూపం కూడా ఆయనే. ఇక్కడ అన్నమాచార్యులు నిరాకార–సాకార భేదాన్ని తొలగించే సందేశం యిచ్చారు. రూపం ఉన్నా,లేకున్నా, సత్యం ఒక్కటే అని చెబుతున్నారు.

యజ్ఞయాగముల ఫలము, అనేక తపస్సుల ఫలము, నిరంతరము తలచిన ఫలము, దానములు చేసిన ఫలము, అన్నీ కూడా ఆ శ్రీవేంకటేశ్వరుడే. అన్నమాచార్యుల తత్త్వసారాంశం ఇదే - సాధనలన్నీ గమ్యం కాదు, భగవంతుడే గమ్యం. 

ఈ కీర్తన మొత్తం చెబుతున్నది ఒక్క వాక్యంలో: సర్వత్రా కనిపించే తేజస్సు భగవంతుడే. అన్ని సాధనల పరమ ఫలితం ఆయనే.


శోభారాజు గారి ఆలాపన

10, ఏప్రిల్ 2024, బుధవారం

అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు - శ్రీరంగం గోపాలరత్నం ఆలపించిన అన్నమయ్య కృతి

తెలుగు గడ్డ మీద పుట్టిన ఓ అనర్ఘ్యరత్నం శ్రీరంగం గోపాలరత్నం గారు. ఆవిడ దివికేగి మూడు దశాబ్దాలు దాటినా ఈనాటికీ కూడా అటువంటి గాత్రం మళ్లీ తెలుగు గడ్డ మీద పుట్టలేదు. ఆవిడ గాత్ర మాధుర్యం, తెలుగుదనం ఉట్టిపడే ప్రతిభ అనన్యం. దాదాపు నాలుగు దశాబ్దాల సంగీత ప్రస్థానంలో ఆవిడ తెలుగు గడ్డపై శాస్త్రీయ సంగీతానికి మహారాణిగా నిలిచారంటే అతిశయోక్తి కాదు. కవిరాయుని జోగారావు గారు, డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి వద్ద సంగీతాన్ని అభ్యసించారు. అతిపిన్న వయసులోనే హరికథలు ఆలపించారు. 

ఆవిడ ఆలపించిన ఓ అన్నమాచార్యుల వారి కృతి, బాలకృష్ణుని లీలలపై, ఆరభి రాగంలో స్వరపరచబడింది. అన్నమాచార్యుల వారికి ఆ కృష్ణుని లీలలు ఎంత అద్భుతంగా కనబడ్డాయో అంతకు మించి అందంగా ఆయన పదాలలో వెలువడ్డాయి. అన్నమాచార్యుల సాహిత్యమంటేనే తెనుగుదనం ఉట్టీపడే జానపదాలు. గోపాలరత్నం గారు ఈ కృతిని రమ్యాతిరమ్యంగా ఆలపించారు.  

అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు
దినదిన క్రొత్తలాయదృష్టమిదే మాకు

ఆడెడి బాలుల హరి అంగిలి చూపుమని
తోడనే వాండ్ల నోర దుమ్ములు చల్లి
యీడ మాతో చెప్పగాను యిందరము గూడిపోయి
చూడబోతే పంచదారై చోద్యమాయెనమ్మా

తీట తీగెలు సొమ్మంటూ దేహము నిండ గట్టె
తీటకుగాక బాలులు తెగి వాపోగా
పాటించి యీ సుద్ది విని పారితెంచి చూచితేను
కోటికోటి సొమ్ములాయ కొత్తలోయమ్మా

కాకి జున్ను జున్నులంట గంపెడేసి తినిపించి
వాకొలిపి బాలులెల్ల వాపోవగా 
ఆకడ శ్రీవేంకటేశుడా బాలుల కంటి నీరు
జోకగ ముత్యాలుసేసె జూడగానమ్మా 

ఓ యశోదమ్మా! ఈ చిన్ని కృష్ణుని మాయలు అంతా ఇంతా అని చెప్పలేము, ప్రతి రోజు కొత్త కొత్తగా ఉన్న ఈ మాయలను చూడటం మా అదృష్టం. తనతో ఆడే బాలురి అంగిలి చూపమని చెప్పి వారు నోరు తెరవగానే దుమ్ము చల్లాడుట. ఆ మాట పిల్లలు మాకు చెప్పగా మేమందరము వెళ్లి చూస్తే ఆ దుమ్మంతా పంచదారయ్యింది, ఇదేమి వింతో! దురదలు పుట్టించే తీగెలు ఆభరణాలంటూ తోటి బాలుర దేహముపై కృష్ణుడు కట్టాడుట, ఆ దురదలు భరించలేక బాలులు మా వద్ద వాపోగా, మేమంతా వెళ్లి చూస్తే ఆ తీగెలు అమూల్యమైన కొత్త ఆభరాణాలయినాయమ్మా! చిన్న చిన్న జున్ను ముద్దలు  గంపల కొద్దీ తోటి బాలురకు తినిపించాడుట, వారు ఆ వికారాన్ని భరించలేక మా వద్ద వాపోయారు. మేమంతా వెళ్ళి చూడగా శ్రీనివాసుడా బాలుల కంటి నీరును అద్భుతంగా ముత్యాలుగా మార్చేసాడమ్మా!  

10, జనవరి 2021, ఆదివారం

ఎదుటనున్నాడు వీడే - అన్నమాచార్యుల కృతి


పరబ్రహ్మమైన శ్రీహరి దేవకి కడుపున అసాధారణమైన పరిస్థితులలో అవతారం దాల్చి, అటువంటి అసాధారణ పరిస్థితులలోనే దేవకి చెంతకు చేరి ఆ తల్లితో అపురూపమైన బంధాన్ని పంచుకున్నాడు. బ్రహ్మాండమును బాలుని నోట జూచినా, వైష్ణవమాయలో ఆ తల్లి పరమాత్మను బిడ్డగానే భావించి అవ్యాజమైన ప్రేమను పంచింది. ఇక పెరుగుతున్న కొద్దీ ఆ బాలుని లీలలు అన్నా ఇన్నా? వెన్నముద్దలు దొంగిలించాడు, పశువులను గాచాడు, రాక్షసులను సంహరించాడు, శాపగ్రస్తులకు మోక్షాన్ని కలిగించాడు, కాళీయుని పొగరణచాడు, రాసలీలలో పాల్గొన్నాడు.... అడుగడుగునా వైనమంత వల్లించలేని లీలలు, నమ్మశక్యం గాని చేష్టలు. వీటిని అన్నమాచార్యుల వారు తమ సంకీర్తనలెన్నిటో అద్భుతంగా ప్రస్తావించారు. అటువంటి ఒక కృతి ఎదుటనున్నాడు వీడే. వివరాలు:

సాహిత్యం
========

ఎదుటనున్నాడు వీడే! ఈ బాలుడు!
మది తెలియమమ్మ ఏమరులో గాని!!

పరమపురుషుడట పశుల గాచెనట
సరవులెంచిన విన సంగతా యిది
హరియె తానట ముద్దులందరికి జేసెనట
ఇరవాయనమ్మ సుద్దులేటివో గాని

వేదాలకొడయడట వెన్నలు దొంగిలెనట
నాదించి విన్నవారికి నమ్మికా యిది
ఆదిమూలమీతడట ఆడికెల చాతలట
కాదమ్మ ఈ సుద్దులు ఎట్టి కతలో గాని

అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట
కొలదొకరికి చెప్ప కూడునా యిది
తెలిపి శ్రీవేంకటాద్రి దేవుడై నిలిచెనట
కలదమ్మ తనకెంతో కరుణో గాని

భావం
=====

ఇతనివి ఏమి మాయలో గానీ, ఎదుటనున్న ఈ బాలుడైన కృష్ణుని మనసు మనం తెలుసుకోలేమమ్మా! ఇతడే పరమపురుషుడట, మరి పశువులను గాస్తున్నాడుట, ఈ తీరులను లెక్కించిన అర్థమయ్యే సంగతులు కావు. ఇతడే శ్రీహరియట, అందరికీ మురిపాలు అందిస్తున్నడట, ఇవేమి మాటలో గానీ స్థిరమై నిలిచాయి. ఇతడు వేదాలకు ప్రభువట, మరి వెన్నలు దొంగిలించిన వాడు కూడా ఇతడేయట, శ్రద్ధగా విన్న వారికైనా ఇది నమ్మదగినదేనా? అన్నిటికీ మూలము ఇతడేనట, ఇతడివి కొంటె చేష్టలట, ఇవి కథలే తప్ప మంచి మాటలు కావు. ఇతడు బ్రహ్మకు తండ్రియట, మరి యశోదకు బిడ్డ కూడా అట, మనపై ఎంత కరుణో ఉందో, అందుకే తన మహిమలను తెలిపేందుకు శ్రీవేంకటాద్రిపై దేవుడై నిలిచినాడట, ఇతనివి ఏమి మాయలో గానీ, ఎదుటనున్న ఈ బాలుడైన కృష్ణుని మనసు మనం తెలుసుకోలేమమ్మా!

శ్రవణం
=======

భుజంగిణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు ఆలపించారు

18, డిసెంబర్ 2020, శుక్రవారం

సింగరామూరితివి చిత్తజు గురుడవు - అన్నమాచార్యుల వారి కృతి

 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకునికి తిరుమలలో నిత్యకల్యాణముతో పాటు అనేక అద్భుతమైన సేవలు. వాటిలో కొన్ని ఏడాదికి ఒకమారు నిర్వహిస్తారు. అటువంటి సేవ ఒకటి తెప్పోత్సవం. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి సమయంలో ఐదు రోజుల పాటు ఈ తెప్పోత్సవాన్ని ఎంతో వైభవంగా స్వామి పుష్కరిణిలో నిర్వహిస్తారు. మొదటిరోజు సీతారామలక్ష్మణులు, రెండవరోజు రుక్మిణీకృష్ణులు, మిగిలిన మూడు రోజులు శ్రీదేవి-భూదేవి సమేతుడైన మలయప్ప మూర్తులను పుష్కరిణిలో విహరింపజేస్తారు. అన్నమాచార్యుల వారు తమ కృతులలో స్వామికి జరిగే అనేక సేవలను, ఉత్సవాలను ప్రస్తావించటమే కాదు మనోజ్ఞంగా వర్ణించారు. ఈ వార్షిక తెప్పోత్సవంపై కూడా సద్గురువులు అద్భుతమైన కృతిని రచించారు. వివరాలు: 

సాహిత్యం
========

సింగారమూరితివి చిత్తజు గురుడవు సంగతి జూచేరు మిము సాసముఖ

పూవుల తెప్పలమీద పొలతులు నీవునెక్కి పూవులు ఆకసము మోప పూచిచల్లుచు
దేవదుందుభులు మ్రోయ దేవతలు కొలువగా సావధానమగు నీకు సాసముఖ

అంగరంగవైభవాల అమరకామినులాడ నింగినుండి దేవతలు నినుజూడగా
సంగీత తాళవాద్య చతురతలు మెరయ సంగడిదేలేటి నీకు సాసముఖ

పరగ కోనేటిలోన పసిడి మేడనుండి అరిది యిందిరయు నీవు ఆరగించి
గరిమ శ్రీవేంకటేశ కన్నుల పండువకాగ సరవి నోలాడు సాసముఖ

భావం
=====

ఓ వేంకటేశా! నీవు శృంగారమూర్తివి, మన్మథుని తండ్రివి! మీ సన్నిధిలో అందరూ మిమ్ములను చక్కగా చూచుచున్నారు. పూవులతో అలంకరించబడిన తెప్పల మీద నీవు శ్రీదేవి భూదేవిలతో కూడి యుండగా, పూవులు ఆకాశములో మొలచాయా అన్నట్లుగా మీపైన చల్లబడుతున్నాయి, దేవదుందుభులు మ్రోగుచుండగా దేవతలు మిమ్ములను కొలుచుచుండగా మీ సన్నిధినయున్నవారికి సావధానముగా నున్నది! అంగరంగవైభవముగా దేవకాంతలు నృత్యము చేయుచుండగా దేవతలు మిమ్ము చూచుచుండగా, సంగీత తాళవాద్యములు నైపుణ్యముగా మెరయుచుండగా తెప్పలలో విహరించుచున్న దృశ్యము మీ సన్నిధినయున్నవారికి కన్నులపండువగానున్నది. ఆరగింపులను సేవించి ఎంతో ఒప్పుగా పుష్కరిణియందు బంగారు తెప్పలో శ్రేష్ఠులైన మీరు, అపురూపమైన లక్ష్మీదేవి ఓలలాడుచున్న దృశ్యము మీ సన్నిధినయున్నవారికి ఎంతో కన్నులపండువగా నున్నది. 

శ్రవణం
======

ఖమాస్ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని శ్రీమతి శ్వేతా ప్రసాద్ గారు ఆలపించారు.

4, నవంబర్ 2020, బుధవారం

రాముడు రాఘవుడు రవికులుడితడు - తాళ్లపాక అన్నమాచార్యుల వారు


 
రాముడు రాఘవుడు రవికులుడితడు 
భూమిజకు పతియైన పురుష నిధానము 

అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున
పరగ జనించిన పర బ్రహ్మము
సురుల రక్షింపగ నసురుల శిక్షింపగ
తిరమై ఉదయించిన దివ్య తేజము

చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో
సతతము నిలిచిన సాకారము
వింతలుగా మునులెల్ల వెదకినయట్టి
కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము

వేద వేదాంతముల యందు విజ్ఞాన శాస్త్రములందు
పాదుకొన పలికేటి పరమార్థము
పోదితో శ్రీ వేంకటాద్రి బొంచి విజయనగరాన
ఆదికిననాదియైన అర్చావతారము

సూర్యవంశమున రఘుమహారాజు పరంపరలో జన్మించి సీతమ్మకు పతియైన పురుషోత్తముడు ఈ రాముడు. దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్టిలో పరమాన్నమున పరబ్రహ్మ రూపమై, దేవతలను రక్షించుటకు, దానవులను శిక్షించుటకు స్థిరముగా ఆవిర్భవించిన దివ్య తేజో రూపము ఇతడు. నిరంతరం ధ్యానించే యోగిశ్రేష్ఠుల హృదయ కమలములలో ఎల్లప్పుడూ నిలిచిన సాకారము, మునిజనులు ఎంతో ఆతృతతో వెదకే  కాంతులతో ప్రకాశించే ముక్తి పదము ఇతడు. వేద వేదాంతములలో, విజ్ఞాన శాస్త్రములలో పలుకబడిన శాశ్వత పరమార్థము, వైభవముతో రక్షకుడై వేంకటాద్రిపై మరియు విజయనగరములో వెలసి, ఆదికే అనాదియై అర్చించబడే అవతారమూర్తి ఈ రాముడు. 

ఈ కృతిని గరిమెళ్ల అనిలకుమార్ గారు ఆలపించారు

16, అక్టోబర్ 2020, శుక్రవారం

కొనరో కొనరో మీరు కూరిమి మందు - తాళ్లపాక అన్నమాచార్యుల వారు


 

కొనరో కొనరో మీరు కూరిమి మందు ఉనికిమనికికెల్ల ఒక్కటే మందు

ధ్రువుడు కొనిన మందు తొల్లి ప్రహ్లాదుడు చవిగా గొనిన మందు చల్లని మందు
భవ రోగములు వీడి పారగ పెద్దలు మున్ను జవ కట్టుకొనిన నిచ్చలమైన మందు

నిలిచి నారదుడు గొనిన మందు జనకుడు గెలుపుతోగొని బ్రతికిన ఈ మందు
మొలచి నాలుగు యుగముల రాజులు ఘనులు కలకాలముగొని కడగన్న మందు

అజునకు పరమాయువై యొసగిన మందు నిజమై లోకమెల్ల నిండిన మందు
త్రిజగములు నేరుగా తిరువేంకటాద్రిపై ధ్వజమెత్తే కోనేటి దరినున్న మందు

ఓ జనులారా! మన ఉనికికి, జీవనానికి ఏకైక ఔషధమైన పరమాత్ముడనే శ్రేయమును సంపాదించుకొనండి. ధ్రువుడు సంపాదించుకున్నది, ప్రహ్లాదుడు చవి చూసినది ఈ చల్లని ఔషధము. భవరోగములను తొలగించుకొనుటకు ఇంతకు మునుపు శ్రేష్ఠులు మూటగట్టుకున్న నిశ్చమైన మందు ఇది. నారదుడు కొలిచి సంపాదించుకున్నది, శివధనుర్భంగముతో జనకమహారాజు పొంది తనను తాను ఉద్ధరించుకునేలా చేసిన మందు ఇది, నాలుగు యుగములలోనూ అనేకులైన రాజులు, గొప్పవారు ఎంతో కాలము సాధన చేసి ముక్తిని పొందేలా చేసింది ఈ మందు. బ్రహ్మదేవునకు ప్రాణవాయువైనది ఈ మందు, లోకమెల్లా నిండిన సత్యమనెడిది, ముల్లోకాల అభ్యున్నతికై శ్రీవేంకటాద్రిపై కోనేటి సమీపమున వెలసిన శ్రీనివాసుడనే మందు ఇది, దానిని సంపాదించుకొనండి. 

మోహన రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మల్లాది సోదరులు గానం చేశారు. 

4, అక్టోబర్ 2020, ఆదివారం

మరలి మరలి జయ మంగళము - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

అన్నమాచార్యుల వారి సంకీర్తనలలో ఎన్నో మంగళహారతులు కూడా ఉన్నాయి. వాటిలో మరలి మరలి జయ మంగళము ఒకటి. మధ్యమావతి రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు

మరలి మరలి జయ మంగళము సొరిది నిచ్చలును శుభ మంగళము 

కమలా రమణికి కమలాక్షునకును మమతల జయ జయ మంగళము
అమర జననికిని అమర వంద్యునకు సుముహూర్తముతో శుభ మంగళము 

జలధి కన్యకును జలధి శాయికిని మలయుచు శుభ మంగళము
కలిమి కాంతకు ఆ కలికి విభునికిని సుళువుల హారతి శుభమంగళము

చిత్తజు తల్లికి శ్రీవేంకటపతికి మత్తిల్లిన జయ మంగళము
ఇత్తలనత్తల ఇరువుర కౌగిటి జొత్తుల రతులకు శుభ మంగళము

మళ్లీ మళ్లీ నిశ్చయమైన వరుసలో శ్రీనివాసునికి, పద్మావతికి శుభ మంగళము. కమలమునందు స్థిరమైన లక్ష్మీదేవికి, కమలముల వంటి కన్నులు కలిగిన స్వామికి మమతలతో కూడిన జయ మంగళము. దేవతలకు మాతయైన లక్ష్మీదేవికి, దేవతలచే నుతించబడే స్వామికి సుముహూర్త సమయమున శుభ మంగళము. సముద్రుని కుమార్తె అయిన లక్ష్మీదేవికి, క్షీరాబ్ధిలో శయనించే శ్రీహరికి తిరుగుచు మంగళము. ఐశ్వర్యములకు దేవతయైన లక్ష్మీదేవికి, ఆమెకు పతియైన స్వామికి సుళువైన హారతులతో శుభ మంగళము. మన్మథునికి తల్లి అయిన లక్ష్మీదేవికి, శ్రీవేంకటేశ్వరునికి మత్తుగొనేలా జయ మంగళము. ఇరుప్రక్కల శ్రీదేవి భూదేవితో కౌగిట అనురాగములొలికించే స్వామికి ఆ దేవులతో కూడి శుభ మంగళము కలుగుగాక. 

17, సెప్టెంబర్ 2020, గురువారం

దేవ దేవం భజే దివ్య ప్రభావం - సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యులు

దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణ పుంగవం రామం

రాజ వర శేఖరం రవి కుల సుధాకరం
ఆజానుబాహుం నీలాభ్ర కాయం
రాజారి కోదండ రాజ దీక్షా గురుం
రాజీవ లోచనం రామచంద్రం

పంకజాసన వినుత పరమ నారాయణం
శంకరార్జిత జనక చాప దళనం
లంకా విశోషణం లాలిత విభీషణం
వేంకటేశం సాధు విబుధ వినుతం

దేవదేవుడు, దివ్యమైన మహిమలు కలవాడు, రావణాసురుని శత్రువు, యుద్ధములో శ్రేష్ఠుడు అయిన రాముని భజింపుము. రాజాధిరాజు, సూర్యవంశానికి చంద్రునివంటి వాడు, ఆజానుబాహువు, నీలమేఘ శరీరుడు, క్షత్రియుల శత్రువైన పరశురాముని కోదండమును ధర్హించిన ఘనుడు, కలువలవంటి కన్నులు కలవాడు అయిన రామచంద్రుని భజింపుము. బ్రహ్మచే నుతించినబడిన శ్రీహరి, జనకుని వద్ద ఉన్న శివుని విల్లును ఎక్కుపెట్టి విరిచిన వాడు, లంకను జయించినవాడు, విభీషణుని అనుగ్రహించిన వాడు, సాధువులు, జ్ఞానులచే నుతించబడిన వేంకటేశ్వరుని భజింపుము.

హిందోళ రాగంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు పాడగా వినండి.

4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

నాలం వా తవ నయవచనం - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

అన్నమాచార్యుల వారు రచించిన అద్భుతమైన శృంగార సంకీర్తనలలో ఒకటి ఈ సంస్కృత భాషలో వెలువడిన "నాలం వా తవ నయ వచనం". ప్రఖ్యాత కర్ణాటక శాస్త్రీయ సంగీత మరియు లలిత సంగీత విదుషీమణి శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం గారు ఎంతో అందంగా ఆలపించి బహుళ ప్రాచుర్యం కలిగించగా ఇటీవల విదుషీమణి శ్రీమతి శ్వేతా ప్రసాద్ గారు పాడితే మళ్లీ విన్నాను. పైకి శృంగార సంకీర్తన అనిపించినా, మధురభక్తిలోని ఆధ్యాత్మిక తత్త్వం ఈ కృతిలో నిబిడీకృతమై ఉంది. జయదేవుని అష్టపదులలోని భావానికి పరిపూర్ణమైన సారూప్యత ఈ అన్నమాచార్యుల వారి కృతిలో మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. చాలా పరిమితమైన సంస్కృత భాషా అవగాహనతో యథాతథం అనువదించే ప్రయత్నం చేశాను. తప్పులుంటే పెద్దలు మన్నించి సరిదిద్దగలరు.

నాలం వా తవ నయవచనం
చేలం త్యజతే చేటీ భవామి

చలచలమమ సం సద్ఘటనే కిం?
కులిశ హృదయ బహుగుణ విభవ
పులకిత తను సంభృత వేదనయా
మలినం వహామి మదం త్యజామి

భజభజ తే ప్రియభామాం సతతం
సుజనస్త్వం నిజ సుఖనిలయ
భుజరేఖా రతిభోగి భవసి కిం?
విజయీభవ మద్విధిం వదామి

నయ నయ మామనునయనవిధం తే
ప్రియ కాంతాయాం ప్రేమభవం
భయహర వేంకటపతే త్వం మ
త్ప్రియో భవసి శోభితా భవామి

స్వామీ! నీ మోసపు మాటలు చాలు, నా కొంగు విడిచిపెట్టు, నేను నీకు దాసినై ఉన్నాను. వజ్రము వలె కఠినమైన హృదయము కలవాడా! ఈ విధంగా దగ్గర వస్తావెందుకు? దూరంగా వెళ్లు. నీ అనేక గుణ వైభవములతో నా తనువు పులకరించి, చెమటలను విసర్జిస్తూ మలినమైపోయింది. సజ్జనుడువైన నీవు నీకు ప్రియమైన సతుల వద్దకే వెళ్లు. నీవు వారితో ఎంతటి రతి సుఖములను అనుభవించావో నీ భుజాలపై గోటికొనలతో ఏర్పడిన రేఖలే చెబుతున్నాయి. రతిభోగములో నీకు విజయము కలుగుగాక. ఈ విరహం నా విధి అని నన్ను నేను సమాధాన పరచుకుంటాను. చేసినదంతా చేసి ఎంత బాగా నన్ను ఓదార్చుతున్నావు? ఈ నీ పద్ధతులు నీ ప్రియసతులకు బాగా నచ్చి వారిలో ప్రేమను కలుగ జేస్తాయి. నా భయాలను తొలగించే శ్రీనివాసా! నీవు నాకు మాత్రమే ప్రియుడవు అయితే నేను సంతోషిస్తాను. నీ మోసపు మాటలు చాలు, నా కొంగు విడిచిపెట్టు, నేను నీకు దాసినై ఉన్నాను.

బృందావన సారంగ రాగంలో కూర్చబడిన ఈ కృతిని శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించారు

మనుజుడై పుట్టి మనుజుని సేవించి - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినము దుఃఖమొందనేల?

జుట్టెడు కడుపుకై చొరని చోట్లు చొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి
పుట్టిన చోటికే పొరలి మనసు వెట్టి
వట్టి లంపటము వదల నేరడు గాన

అందరిలోపుట్టి అందరిలో చేరి
అందరి రూపములటు తానై
అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించి
అందరాని పదమందెనటు గాన

మనిషిగా పుట్టి ఇంకొక మనిషిని సేవించి ప్రతి రోజు దుఃఖము పొందుట ఎందుకు? జానెడు కడుపుకోసం పనికిమాలిన పనులు చేసి, పిడికిలి అన్నము కోసం ఇతరులను బతిమాలి, కామముతో మనం జన్మించిన స్థానంపైనే ధ్యాస కలిగి,  వట్టి బంధనములను వదలలేడు ఈ మనిషి. అందరిలో జన్మించి, అందరిలోనూ తానే ఉండి, అందరి రూపములు కూడా తానేయై, అందమైన శ్రెవేంకటేశ్వరుని సేవిస్తే దుర్లభమైన మోక్షపదము కూడా అందగలదు. 

జుట్టెడు కూటికోసం మనం పడే పాట్లు, శారీరిక సుఖాలకోసం తపన, పనికిమాలిన లంపటాలను వదిలించుకోలేని దుస్థితి..... మనం ఏం చేస్తున్నామో, దేనికోసం వెంపర్లాడుతున్నామో, ఏమి చేస్తే మంచిదో అన్నీ చక్కగా చెప్పేశారు అన్నమయ్య. చేయాల్సింది చేస్తే అందరాని పదములు అందుబాట్లోకి వస్తాయి అని ఒక్క వాక్యంలో తెలిపారు. ఆభోగి రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు

ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు

అంతనింత గొల్లెతల అరచేతి మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పౘ్చ పూస
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు

రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల సందుల వైఢూర్యము
గతియై మమ్ము గాచే కమలాక్షుడు

కాళింగుని పడగలపై గప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము
పాలజలనిధిలోన బాయని దివ్యరత్నము
బాలుని వలె తిరిగే పద్మనాభుడు

అక్షరరూపమీయలేని మహిమలు గల దేవకీ సుతుడైన బాలకృష్ణుడు ముద్దులొలికే రూపముతో యశోద ముంగిట ముత్యము వలెనున్నాడు చూడండి! అంతటా ఉండే ఆ పరమాత్మ ఈ గోకులం యొక్క అరచేతికి మాణిక్యము వంటి వాడు, దుష్టుడైన కంసుని పాలిట వజ్రము, తన కాంతులతో మూడు లోకాలలోనూ ప్రకాశించే మరకతము వంటి వాడు ఈ కృష్ణుడు చూడండి! రతికేళిలో రుక్మిణీదేవి అందమైన మోమునకు పగడపు కాంతి వంటి వాడు ఈ కృష్ణుడు, గోకులాన్ని ఇంద్రుని బారి నుండి రక్షించ చిటికిన వేలిన ఎత్తిన గోవర్ధన గిరికి గోమేధికము వంటి వాడు. శంఖచక్రాల నడుమ ప్రకాశించే వైఢూర్యమితడు. కలువలవంటి కన్నులు గల ఈ కృష్ణుడే మనకు గతియై కాచే వాడు, చూడండి!. అహంకారముతో విషమును జిమ్మిన కాళింగుని పడగలపై నర్తిస్తూ పుష్యరాగములా ప్రకాశించిన వాడు, శ్రీవేంకటాద్రి ఏలే నల్లనయ్య ఇంద్రనీలము వంటి వాడు. క్షీరసాగరములో పద్మనాభునిగా విడువలేని దివ్యమైన రత్నమైన వాడు బాలునిలా మన ముందు తిరుగాడుతున్నాడు చూడండి!

అన్నమాచార్యుల వారి సాహితీ వైభవానికి ఈ సంకీర్తన గొప్ప ఉదాహరణ. బాలకృష్ణుని మనోజ్ఞమైన అవతార విశేషాలను వర్ణిస్తూనే ఆయనను సర్వాంతర్యామిగా దర్శించి తరించినవారిలో అన్నమయ్య అగ్రగణ్యులు. యశోదకు శిశువై లాలించబడి అల్లరి చేష్టలు చేసిన ఆ బాలుడు బ్రహ్మకు తండ్రి, భూదేవికి రక్షకుడు అని "చేరి యశోదకు శిశువితడు" అనే కృతిలో నుతించిన అన్నమయ్య, ఈ సంకీర్తనలో నవరత్నాలతో పోలుస్తూ బాలకృష్ణుని వైభవాన్ని ఆవిష్కరించారు. ఆయన ఉపయోగించిన పదాలను నిశితంగా పరిశీలిస్తే ఇది కేవలం వర్ణన కాదు, విశ్వాత్మకుని బాలునిలో గాంచిన అనుభూతుల సారం అని అర్థమవుతుంది. దిద్దలేని మహిమలు గలవాడైన పరమాత్మ కారణ జన్ముడై దేవకి గర్భాన జన్మించి, గోకులంలో యశోద వద్ద పెరిగి లోకోద్ధారకుడైనాడు. ముత్యము ఎలా ఏర్పడుతుంది? నీటిలో నత్తగుల్లలు సంరక్షణార్థమై ఏర్పరచుకునే ఆకృతి నుండి ఉద్భవిస్తుంది. సృష్టి స్థితి లయములలో ఈ విశ్వానికి కలిగే గ్లానిని తొలగించటానికి అనేకరూపాలలో అవతరించే పరమాత్మ ధర్మస్థాపనకై ద్వాపరయుగంలో నాటకీయంగా కారాగారంలో ఉన్న దేవకి గర్భాన ఉద్భవిస్తాడు. స్వచ్ఛమై, సహజమై యుండే ముత్యము వంటి వాడు ఆ చిన్నికృష్ణుడని అన్నమయ్య భావం. అంతటి కృష్ణుడు గోకులానికి మాణిక్యం అని పలికారు అన్నమయ్య. మాణిక్యము అనగా కెంపు శాశ్వతమైన ప్రేమకు ప్రతీక. గోకులంలో ఆ బాలుడు పంచింది ప్రేమే కదా? వజ్రం పదునైనది, పటిష్టమైనది, శక్తివంతమైనది. అందుకే దుష్ట కంసుని పాలిట వజ్రంగా వర్ణించారు. గరుడపౘ్చ జ్ఞానానికి, బుద్ధి వికాసానికి ప్రతీక. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్ముని ముల్లోకాలలోనూ ప్రకాశించే గరుడపౘ్చగా నుతించారు. పగడము శక్తికి, ధాతుపుష్టికి కారకమైన నవరత్నము. అందుకే రతికేళిలో రుక్మిణి మోవికి పగడంగా స్వామిని అభివర్ణించారు. గోమేధికము భీతావహ స్థితినుండి ఉపశమనం కలిగించే రత్నం. రాహుగ్రహ ప్రేరితమైన ఈ రత్నంగా శ్రీకృష్ణుని అభివర్ణించినప్పుడు గోవర్ధనగిరి ఉదంతాన్ని ప్రస్తావించారు అన్నమాచార్యులు. శంఖ చక్రాలు స్వామి యొక్క సృష్టి స్థితి లయములకు సూచికయైన ఆయుధములు కాగా, వాటి మధ్య మెరిసే వైఢూర్యముగా అన్నమయ్య ఎందుకు వర్ణించారు? వైఢూర్యము ఆధ్యాత్మికతకు ప్రతీక. సృష్ట్యాది, ప్రళయము మధ్య ఆధ్యాత్మిక ప్రకాశమైన వానిగా తెలుపటానికి వైఢూర్యాన్ని వినియోగించారు. అందుకే తదుపరి పంక్తిలో గతియై మమ్ము గాచే కమలాక్షుడు (శంఖచక్రములతో యున్న ఆధ్యాత్మికశక్తి) అని శ్రీహరి అవతరమైన బాలకృష్ణుని స్తుతించారు. అహంకారాన్ని నాశనం చేసేది, దుష్టశక్తుల నుండి కాపాడేది, పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టేది పుష్యరాగము. మరి ఈ అహంకారము, దుష్టశక్తి రూపమే కదా కాళింగుడు. వానిని అణచి కాళీయమర్దునిగా లోకఖ్యాతిని పొందిన వాడు కృష్ణుడు. అందుకే అన్నమయ్య పుష్యరాగంగా వర్ణించారు. మరి నల్లనిదేహముతో నీలమణి కాంతితో ఉండేవాడు శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుడు దేనికి ప్రసిద్ధి? మన కర్మఫలములను తొలగించి ఆపదలనుండి కాపాడి రక్షించే వాడు. ఇంద్రనీలమణి ఈ పాపసంచయమును పోగొట్టి సమస్త సంపదలను ప్రసాదించే నవరత్నము. అందుకే ఏలేటి శ్రీవేంకటాద్రి ఇంద్రనీలము అని అన్నమాచార్యుల వారు ప్రస్తుతించారు.

మొత్తం మీద నవగ్రహముల శుభఫలములను ప్రసాదించే నవరత్నములు - మౌక్తికము (ముత్యము), పద్మరాగము (మాణిక్యము/కెంపు), వజ్రము, మరకతము (గరుడపౘ్చ), ప్రవాళము (పగడము),గోమేధికము,వైడూర్యము, పుష్యరాగము, నీలము - వీటి వైశిష్ట్యాన్ని సమస్త సద్గుణ సంపన్నుడు, శుభకరుడు, భవహరుడు, జగన్మోహనుడు అయిన శ్రీకృష్ణుని లీలల వర్ణనలో పొందుపరచి మనకు రత్నశాస్త్రాన్ని, నవగ్రహాల అనుగ్రహము పొందే మార్గాన్ని కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునిగా అత్యద్భుతంగా పలికారు. అందుకే ఆయన సద్గురువులైనారు. ఒక్కొక్క సంకీర్తన మంత్ర సమానమై శతాబ్దాల అనంతరం కూడా ఆధ్యాత్మిక సుగంధాలు ఈ ప్రపంచమంతా వెదజల్లుతున్నాయంటే అది అన్నమాచార్యుల వారి వైశిష్ట్యాన్ని, వారి దార్శనికతను, భక్తి సంపదను తెలుపుతాయి. నందకాంశగా జన్మించిన ఆయన సంకీర్తనలలోని భావాన్ని పైవివరాలతో తెలిపిన డాక్టర్ శోభారాజు గారికి నా శతసహస్ర వందనాలు. వారి వివరణను నా పదాలలో తెలిపే ప్రయత్నం చేశాను. తప్పులు దొర్లి ఉంటే అన్యథా భావించరాదు. అన్నమయ్య తత్త్వాన్ని అర్థం చేసుకొవటం అంటే మాటలు కాదు. అవి అనుభవైకవేద్యం. కఠోర సాధనతోనే సాధ్యం. ఆ మార్గంలో సఫలీకృతులైన శోభారాజు గారికి ఆ శ్రీనివాసుడు సమస్త శుభములు కలిగించాలని నా ప్రార్థన. వారికి నా ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు.

ముద్దుగారే యశోద సంకీర్తన శోభారాజు గారి పాడిన లింక్ యూట్యూబ్‌లో దొరకలేదు. ఈ లింక్‌లో ఆ పాట క్లిక్ చేసి వినవచ్చు.

ఇతడొకడే సర్వేశ్వరుడు - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

ఇతడొకడే సర్వేశ్వరుడు సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు

పరమ యోగులకు భావ నిధానము అరయ నింద్రాదులకైశ్వర్యము
గరిమ గొల్లెతల కౌగిట సౌఖ్యము సిరులొసగేటి ఈ వేంకటేశుడు

కలికి యశోదకు కన్న మానికము తలచిన కరికిని తగు దిక్కు
అల ద్రౌపదికిని ఆపద్బంధుడు చెలరేగిన ఈ శ్రీవేంకటేశుడు

తగిలిన మునులకు తపము సత్ఫలము ముగురు వేల్పులకు మూల మీతడె
ఒగి నలమేల్మంగకొనరిన పతియై జిగి మించిన ఈ శ్రీవేంకటేశుడు

వికసించిన కమలముల వంటి కన్నులు గల ఈ శ్రీవేంకటేశ్వరుడే సర్వేశ్వరుడు. శ్రేష్ఠులైన యోగులు భావించే పెన్నిది, అనుభూతి చెందగా ఇంద్రాదులకు నిధియైన వాడు, ఉత్తములైన గోపికల కౌగిటి సౌఖ్యము, సమస్త సంపదలనొసగే ఈ వేంకటేశ్వరుడే. మనోజ్ఞమైన యశోదకు మాణిక్యము వంటి కుమారుడు, ఆపదలో తలచిన గజేంద్రునికి దిక్కు, కురు సభలో శరణాగతితో ఆలపించిన ద్రౌపదికి చీరలిచ్చి మానము కాపాడిన ఆపద్బంధువు, ఈ దివ్యంగా ప్రకాశించే వేంకటేశ్వరుడే. కఠోరమైన తపస్సు చేసే మునులకు సత్ఫలమైన వాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలమైన పరమాత్మ, చక్కనైన అలమేలుమంగకు తగిన పతియై అనంతమైన కాంతి కలవాడు ఈ వేంకటేశ్వరుడే. 

ఏమైనా తిరుమల శ్రీనివాసుని వైభవమే వైభవం. అందుకే అన్నమయ్య జిగి మించిన శ్రీవేంకటేశుడు అన్నాడు. ఆ జిగి అంతా ఆయన మహత్తుల వల్లే. అనేక ఉదాహరణలతో, ఆయా సందర్భాలలో మహిమలను ఉట్టంకిస్తూ శ్రీనివాసుడే సర్వేశ్వరుడని మనోజ్ఞంగా స్వామి గుణవిభవములను ఆవిష్కరించారు అన్నమాచార్యుల వారు. మోహన రాగంలో కూర్చబడిన ఈ కృతిని గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు ఆలపించారు.

విశ్వప్రకాశునకు వెలియేడ లోనేడ - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

విశ్వప్రకాశునకు వెలియేడ లోనేడ శాశ్వతునకూహింప జన్మమికనేడ

సర్వపరిపూర్ణునకు సంచారమికనేడ నిర్వాణమూర్తికిని నిలయమికనేడ
ఉర్వీధరునకు గాలూదనొకచోటేడ పార్వతీస్తుత్యునకు భావమికనేడ

నానాప్రభావునకు నడుమేడ మొదలేడ ఆననసహస్రునకు నవ్వలివ్వలేడ
మౌనిహృదయస్థునకు మాటేడ పలుకేడ జ్ఞానస్వరూపునకు గాన విన నేడ

పరమయోగీంద్రునకు పరులేడ తానేడ దురితదూరునకు సంస్తుతినిందలేడ
తిరువేంకటేశునకు దివ్యవిగ్రహమేడ హరికి నారాయణునకవుగాములేడ

విశ్వమంతా ప్రకాశించే పరమాత్మకు వెలుపల, లోపల ఎక్కడ? శాశ్వతమైన వానికి జన్మమెక్కడ? అన్నిటా నిండి యున్న వానికి సంచారమెక్కడ? నిర్వాణమైన వానికి నివాసం ఎక్కడ? భూమిని ధరించేవానికి కాలుపెట్టుటకు చోటెక్కడ? పార్వతిచే నుతించబడిన వానికి భావమెక్కడ? అన్నిరకముల తేజస్సులు తానేయైన వానికి మొదలు చివర ఎక్కడ? ఎనలేని శిరసులు కలవానికి ఆవల ఈవల ఎక్కడ?మునుల హృదయాలలో నివసించే వానికి మాటలు, పలుకులెక్కడ? జ్ఞాన స్వరూపమైన వానికి కాంచుట, వినుట ఎక్కడ? యోగిశ్రేష్ఠుడైన వానికి పరులు తనవారు ఎవరు? కష్టాలను తొలగించే వానికి నిందాస్తుతులెక్కడ? తిరుమల వేంకటేశ్వరునికి దివ్యమైన విగ్రహమెక్కడ? హరి, నారాయణుడు అయిన వానికి మంచి చెడులెక్కడ?

పరమాత్మ విశ్వజనీన విశ్వవ్యాప్త నిర్గుణ పరబ్రహ్మ తత్త్వమునకు మంచి-చెడు, జనన మరణాలు, లోపల వెలుపల, నివాసము లేవు, ఆయన భావాతీతుడు, మొదలు చివర లేని వాడు, అటువైపు ఇటువైపు అనే అవధులు లేని వాడు, ఇష్టులు-అయిష్టులు లేని వాడు, నిందాస్తుతులకు అతీతమైన వాడు, రూపారూపములకందని వాడు అని అన్నమాచార్యుల వారు ఎంత భావగర్భితంగా చెప్పారో! హంసనాదం రాగంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా చక్కగా పాడిన ఈ కృతి అన్నమయ్య కృతులలో ఓ ప్రత్యేకమైన స్థానం కలిగినది.

ఎటువంటి మోహమో ఎట్టి తమకమో - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

ఎటువంటి మోహమో ఎట్టి తమకమో గాని
తటుకునను దేహమంతయు మరచె చెలియ

పలుకుతేనెల కొసరి పసిడి కిన్నెర మీటి
పలుచనిలుగున నిన్ను పాడి పాడి
కలికి కన్నీరు బంగారు పయ్యెదనొలుక
తలయూచి తనలోనె తలవంచు చెలియ

పడతి నీవును తాను పవళించు పరపుపై
పొడము పరితాపమున పొరలి పొరలి
జడిగొన్న జవ్వాది జారు చెమటల దోగి
ఉడుకునూరుపులనుసురుసురాయె చెలియ

తావి జల్లెడి మోము దమ్మి కడు వికసించె
లోవెలితి నవ్వులను లోగి లోగి
శ్రీ వేంకటేశ! లక్ష్మీకాంత! నినుగలసి
ఈ వైభవములందె యిదివో చెలియ

అన్నమయ్య శృంగార సంకీర్తనలలో ఓ అద్భుతమైన భావం గలది ఈ ఎటువంటి మోహమో అనే సామ రాగంలోని కృతి. తనను తానే మరచియున్న అలమేలుమంగ మరియు శ్రీవేంకటేశ్వరుని శృంగార భావనలను మనోహరంగా ఆవిష్కరించిన కృతి ఇది. సామ రాగంలోని లాలిత్యము, మైమరపు కలిగించే భావన ఈ కృతికి ఎంతో సముచితం. తేనెల వంటి పలుకులతో బంగారు వీణ మీటుతూ మేనిని వయ్యారముగా విరచుచూ స్వామిని స్తుతించుచుండగా ఆనందబాష్పాలు రాలి ఆమె పైటపై జాలువారగా తలయూచుచూ తనలోనే తాను తలవంచుకున్నదట ఆ పద్మావతి. ఆ దంపతుల రతికేళిలోని ఉచ్చ్వాస నిశ్శ్వాసలలో కస్తూరి చెమటలకు కరగి వేడికి ఆవిరైపోయినందట. ఆ స్వామితో ఏకమైన వేళ ఆమె సిగ్గుతో లోలోని నవ్వులు వలన ముఖము కలువవలె వికసించిందట. ఈ వైభవాలన్నీ స్వామితో కూడిన వేళ అని అన్నమయ్య ఈ కృతిలో సుందరంగా వర్ణించారు. సామ రాగంలో కూర్చబడిన ఈ కృతిని గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేయగా వినండి.

అదె చూడరె మోహన రూపం - తాళ్లపాక అన్నమాచార్యుల వారు



అదె చూడరె మోహన రూపం
పది కోట్లు గల భావజ రూపం

వెలయగ పదారు వేల మగువలను
అలమిన ఘన మోహన రూపం
వలచిన నంద వ్రజము గొల్లె తల
కులుకు చూపులకు గురియగు రూపం

ఇందిరా వనితనెప్పుడు తన వుర
మందు నిలిపిన మోహన రూపం
కందువ భూసతి కాగిటి సొంపుల
విందులు మరిగిన వేడుక రూపం

త్రిపుర సతుల బోధించి రమించిన
అపురూపపు మోహన రూపం
కపురుల శ్రీవేంకటపతియయి ఇల
నుపమించగ రాని వున్నత రూపం

పదికోట్ల మన్మథుల సమానమైన రూపము గల శ్రీనివాసుని మోహన రూపమును అదిగో చూడండి! కృష్ణావతారంలో పదహారువేల గోపికలను మైమరపింపజేసిన ఘనమైన మోహన రూపము, ప్రేమతో నందవ్రజములోని స్త్రీల కులుకు చూపులకు గురియైన రూపమగు శ్రీనివాసుని మోహన రూపమును అదిగో చూడండి. లక్ష్మీదేవిని తన వక్షస్థలములో ఎల్లపుడూ నిలుపుకున్న మోహనరూపము, నేర్పరితనముతో భూదేవి కౌగిట సొంపులను ఆస్వాదించిన వేడుకైన రూపమగు శ్రీనివాసుని మోహన రూపమును అదిగో చూడండి. త్రిపురాసురుల సంహారంలో బుద్ధావతారమెత్తి సతులకు బోధించి రమించిన అపురూపమైన మోహన రూపము, కాంతులతో ఈ భువిపై పోల్చలేని ఉన్నతమైన రూపమగు శ్రీనివాసుని మోహన రూపమును అదిగో చూడండి.

మోహన రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఆలపించిన వారు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. 

నమో నారాయణాయ నమో - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

నమో నారాయణాయ నమో!నమో నారాయణాయ నమో!

నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వ పారాయణాయ శోభన మూర్తయే

నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ
సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో

కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ మురవైరినే జగన్మోహనాయ
తరుణీందు కోటీర తరుణీ మనస్తోత్ర పరితోష చిత్తాయ పరమాయ తే నమో

పాత్రదానోత్సవ ప్రథిత వేంకటరాయ ధాత్రీశ కామితార్ధ ప్రదాయ
గోత్రభిన్మణి రుచిర గాత్రాయ రవిచంద్ర నేత్రాయ శేషాద్రి నిలయాయ తే నమో

సగుణ పరబ్రహ్మ స్వరూపుడు, అన్నిటాయున్న వాడు, సుందరమైన రూపము గల నారాయణునికి నమస్సులు. శాశ్వతమైనవాడు, జ్ఞానులచే నుతించబడిన వాడు, లోకేశ్వరుడు, ముని సమూహముల విశ్వాసము కలవాడు, సత్యమైన వాడు, ప్రత్యక్షమైన వాడు, సజ్జనుల సాంగత్యములో నుండే వాడు, జగత్తును రక్షించే నారాయణునికి నమస్సులు. గజేంద్రుని కాపాడిన వాడు, కౌస్తుభమును ధరించిన వాడు, మురారియైన వాడు, జగన్మోహనాకారుడు, సముద్రుని కుమర్తె అయిన లక్ష్మీదేవితో ప్రకాశించే వాడు, గోపకాంతల మనస్సులలో తలచబడే వాడు, ఎల్లప్పుడూ ఆనందమయమైన మనస్సు కలవాడు, పరమపురుషుడు అయిన నారాయణునికి నమస్సులు. పాత్రులను అనుగ్రహించేవానిగా ప్రసిద్ధి చెందిన వాడు, వేంకటేశ్వరుడు, ధరణీపతి, కామ్యములను తీర్చేవాడు, ఇంద్రనీలమణి కాంతితో అందమైన దేహము కలవాడు, సూర్య చంద్రులు నేత్రములుగా కలవాడు శేషాద్రి శిఖరముపై నివసించే నారాయణునికి నమస్సులు.

అన్నమాచార్యుల వారు సంస్కృతంలో రచించిన కొన్ని కృతులలో ఇది ఒకటి. శ్రీరాగంలో కూర్చబడిన ఈ కృతిని గానం చేసిన వారు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు, వారి కుమారులు అనిల కుమార్ గారు.

అదె చూడరయ్య పెద్ద హనుమంతుని - - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

అదె చూడరయ్య పెద్ద హనుమంతుని
గుదిగొని దేవతలు కొనియాడేరయ్య

ఉదయాస్త శైలములు ఒక జంఘగా చాచె
అదివో ధ్రువమండలమందే శిరసు
చదివె సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు
ఎదట ఈతని మహిమ ఏమని చెప్పేమయ్య

దండిగా బ్రహ్మాండము దాక తోకమీదికెత్తి
మెండగు దిక్కుల నిండా మేను పెంచెను
గుండుగూడ రాకాసుల గొట్టగ చేతులు చాచె
అండ ఈతని ప్రతాపమరుదరుదయ్యా

దిక్కుల పిక్కటిల్లగ దేహ రోమములు పెంచె
ప్రక్కన లోకములకు ప్రాణమై నిల్చె
ఇక్కడ శ్రీ వేంకటేశు హితవరి బంటాయె
మిక్కిలి ఈతని లావు మేలుమేలయ్య

అత్యంత విశ్వాసంతో దేవతలు కొనియాడే పెద్ద హనుమంతుని అదిగో చూడండయ్యా! తూర్పు పడమర పర్వత శిఖరాలు తాకేలా ఒక కాలు చాచి, ధ్రువమండలములో శిరసు ఉండే అంతగా ఎదిగి, సూర్యుని వద్ద విద్యలభ్యసించి చక్కగా మోము త్రిప్పుచు ఎదుట ఉన్న ఈ హనుమంతుని మహిమ ఏమని చెప్పేము? బ్రహ్మాండము వరకు ఎదిగి తోకను చాచి, దిక్కుల నిండూగా తన శరీరాన్ని పెంచి, రాక్షస సమూహాన్ని కొట్టేందుకు చేతులు చాచి మనకు అండగా ఉన్నా ఈ హనుమంతుని ప్రతాపము ఎంతో అరుదయ్యా! దిక్కులు పిక్కటిల్లేలా దేహరోమములు పెంచి, ప్రక్కనే తోడుగా ఉంటూ సమస్త లోకములకు ప్రాణమై నిలిచి, ఇక్కడ తిరుమలలో శ్రీవేంకటేశ్వరుని హితునిగా బంటుగా నిలిచిన ఇతని బలము ఎంతో మేలయ్యా! అతనిని చూడండి.

బౌళి రాగంలోని ఈ సంకీర్తనను గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించారు.

(చిత్రం బెంగళూరు మహాలక్ష్మీ లేఔట్‌లో వెలసిన ప్రసన్న వీరాంజనేయస్వామి)

దేవ యీ తగవు దీర్చవయ్యా - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

దేవ! యీ తగవు దీర్చవయ్యా! వేవేలకునిది విన్నపమయ్యా!!

తనువున బొడమినతతి నింద్రియములు పొనిగి యెక్కడికి బోవునయా!
పెనగి తల్లికడ బిడ్డలు భువిలో యెనగొని యెక్కడికేగుదురయ్యా!!

పొడుగుచు మనమున బొడమిన యాసలు అదననెక్కడికి నరుగునయా!
వొదుగుచు జలములనుండు మత్స్యములు పదపడి యేగతి బాసీనయ్యా!!

లలినొకటొకటికి లంకెలు నీవే అలరుచునేమని యందునయా!
బలు శ్రీవేంకటపతి నాయాత్మను గలిగితివెక్కడి కలుషములయ్యా!!

దేవా! నీకు వేవేల విన్నపాలు, ఈ తగవు కాస్త తీర్చవయ్యా! ఈ దేహములో మొలిచిన ఇంద్రియములు, ప్రేగులు క్షీణించి ఎక్కడికి పోవును? తల్లి చుట్టూ తిరిగే బిడ్డలు విడిచి ఎక్కడికేగుదురు? మనసులో మొలకెత్తిన ఆశలు పెరుగుతూ ఆ తరువాత ఎక్కడికి వెళతాయి? దాగుతూ నీటిలో ఉండే మత్స్యములు ఆ తరువాత ఏ గతి పొందును? క్రమక్రమముగా ఒకటికొకటి లంకెలు వేసేది నీవే, నేనేమని చెప్పేది? ఓ వేంకటనాథా! నీవే నా ఆత్మయైనప్పుడు ఈ కలుషములు ఎలా కలిగినాయి?

సావేరి రాగంలో కూర్చబడిన ఈ కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...