18, డిసెంబర్ 2020, శుక్రవారం

సింగరామూరితివి చిత్తజు గురుడవు - అన్నమాచార్యుల వారి కృతి

 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకునికి తిరుమలలో నిత్యకల్యాణముతో పాటు అనేక అద్భుతమైన సేవలు. వాటిలో కొన్ని ఏడాదికి ఒకమారు నిర్వహిస్తారు. అటువంటి సేవ ఒకటి తెప్పోత్సవం. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి సమయంలో ఐదు రోజుల పాటు ఈ తెప్పోత్సవాన్ని ఎంతో వైభవంగా స్వామి పుష్కరిణిలో నిర్వహిస్తారు. మొదటిరోజు సీతారామలక్ష్మణులు, రెండవరోజు రుక్మిణీకృష్ణులు, మిగిలిన మూడు రోజులు శ్రీదేవి-భూదేవి సమేతుడైన మలయప్ప మూర్తులను పుష్కరిణిలో విహరింపజేస్తారు. అన్నమాచార్యుల వారు తమ కృతులలో స్వామికి జరిగే అనేక సేవలను, ఉత్సవాలను ప్రస్తావించటమే కాదు మనోజ్ఞంగా వర్ణించారు. ఈ వార్షిక తెప్పోత్సవంపై కూడా సద్గురువులు అద్భుతమైన కృతిని రచించారు. వివరాలు: 

సాహిత్యం
========

సింగారమూరితివి చిత్తజు గురుడవు సంగతి జూచేరు మిము సాసముఖ

పూవుల తెప్పలమీద పొలతులు నీవునెక్కి పూవులు ఆకసము మోప పూచిచల్లుచు
దేవదుందుభులు మ్రోయ దేవతలు కొలువగా సావధానమగు నీకు సాసముఖ

అంగరంగవైభవాల అమరకామినులాడ నింగినుండి దేవతలు నినుజూడగా
సంగీత తాళవాద్య చతురతలు మెరయ సంగడిదేలేటి నీకు సాసముఖ

పరగ కోనేటిలోన పసిడి మేడనుండి అరిది యిందిరయు నీవు ఆరగించి
గరిమ శ్రీవేంకటేశ కన్నుల పండువకాగ సరవి నోలాడు సాసముఖ

భావం
=====

ఓ వేంకటేశా! నీవు శృంగారమూర్తివి, మన్మథుని తండ్రివి! మీ సన్నిధిలో అందరూ మిమ్ములను చక్కగా చూచుచున్నారు. పూవులతో అలంకరించబడిన తెప్పల మీద నీవు శ్రీదేవి భూదేవిలతో కూడి యుండగా, పూవులు ఆకాశములో మొలచాయా అన్నట్లుగా మీపైన చల్లబడుతున్నాయి, దేవదుందుభులు మ్రోగుచుండగా దేవతలు మిమ్ములను కొలుచుచుండగా మీ సన్నిధినయున్నవారికి సావధానముగా నున్నది! అంగరంగవైభవముగా దేవకాంతలు నృత్యము చేయుచుండగా దేవతలు మిమ్ము చూచుచుండగా, సంగీత తాళవాద్యములు నైపుణ్యముగా మెరయుచుండగా తెప్పలలో విహరించుచున్న దృశ్యము మీ సన్నిధినయున్నవారికి కన్నులపండువగానున్నది. ఆరగింపులను సేవించి ఎంతో ఒప్పుగా పుష్కరిణియందు బంగారు తెప్పలో శ్రేష్ఠులైన మీరు, అపురూపమైన లక్ష్మీదేవి ఓలలాడుచున్న దృశ్యము మీ సన్నిధినయున్నవారికి ఎంతో కన్నులపండువగా నున్నది. 

శ్రవణం
======

ఖమాస్ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని శ్రీమతి శ్వేతా ప్రసాద్ గారు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి