త్యాగరాజు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
త్యాగరాజు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, సెప్టెంబర్ 2026, ఆదివారం

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి


వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి

పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి

శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ
కరమున శరచాపములును ఘనముగ మెరయ 
సురుచిర వాద్యములు మ్రోయ సురలెల్ల వినుతి చేయ
వరత్యాగరాజ నుతుడు వసుధ భారమును బాప

భావము:

సోదరుడైన లక్ష్మణుడు తోడు రాగా కోదండము ధరించిన శ్రీరాముడు యాగరక్షణకై వెళుతున్నాడు. భూమిపై ప్రజలందరూ పొగడుచుండగా వందనీయుడైన విశ్వామిత్రునితో కలసి శ్రీరాముడు వెళుతున్నాడు. తలపైనున్న పొడవైన జుట్టు జారగా, వక్షస్థలములో ఉన్న హారములు, చేతిలో ధనుర్బాణములు గొప్పగా మెరుస్తుండగా, మధురమైన వాద్యములు మ్రోగగా, దేవతలందరూ ప్రస్తుతించుచుండగా పరమశివునిచే నుతించబడిన శ్రీరాముడు భూభారాన్ని తొలగించుటకు యాగరక్షణకై లక్ష్మణునితో కూడి వెళుతున్నాడు.  

తోడి రాగంలో స్వరపరచబడిన ఈ త్యాగరాజస్వామి కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.

శ్రీగణనాథం భజామ్యహం - త్యాగరాజస్వామి కృతి



శ్రీగణనాథం భజామ్యహం
శ్రీకరం చింతితార్థ ఫలదం

శ్రీగురుగుహాగ్రజం అగ్రపూజ్యం
శ్రీకంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం 

రంజిత నాటకరంగతోషణం
శింజిత వర మణిమయ భూషణం
ఆంజనేయావతారం సుభాషణం
కుంజరముఖం త్యాగరాజ పోషణం  

శుభములను ప్రసాదించే వాడవు, మనసులో కోరుకున్న కోరికలకు తగిన ఫలములను అనుగ్రహించే వాడవు అయిన గణనాథా! నిన్ను నేను భజిస్తున్నాను. సుబ్రహ్మణ్యునికి అన్నవైన నీవు, అన్ని పూజలలోనూ ముందుగా పూజింపదగిన అగ్రపూజ్యుడవు.  పరమశివుని కుమారుడవు, నిన్ను ఆశ్రయించిన వారికి సామ్రాజ్య వైభవాన్ని ప్రసాదించేవాడవు,నిన్ను నేను భజిస్తున్నాను.  నాటకరంగానికి సంతోషమును ప్రసాదించేవాడవు, కదులుతున్నప్పుడు మధురంగా మ్రోగే శ్రేష్ఠమైన రత్నమయ ఆభరణాలను ధరించినవాడవుం ఆంజనేయుని అవతారంగా వెలసినవాడవు, మంగళకరమైన, మంచి మాటలు పలికేవాడవు, ఏనుగు ముఖాన్ని కలిగిన వాడవు, త్యాగరాజును ఆదరించి, రక్షించి, పోషించేవాడవు. అటువంటి గణనాథుడవైన నిన్ను నేను భక్తితో భజిస్తున్నాను.

ఈ కృతిలోని ఆంజనేయావతారం అనే ప్రయోగం ప్రత్యేకంగా గమనించదగినది. ఇక్కడ త్యాగరాజస్వామి గణపతినే హనుమంతుని అవతారంగా పేర్కొంటున్నట్లు సాహిత్యం నేరుగా కనిపిస్తుంది. దీనికి ఒక సంప్రదాయ వివరణ ఏమిటంటే, గణపతి మరియు హనుమంతుడు ఇద్దరూ విఘ్నాలను తొలగించే శక్తి, అపారమైన బలం, బుద్ధి, కార్యసిద్ధి, భక్తుల రక్షణ వంటి లక్షణాలకు ప్రతీకలు. అందువల్ల ఆంజనేయుని తత్త్వమే గణపతిలో కూడా వ్యక్తమైందనే భావంతో ఈ ప్రయోగాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే గణపతి నిజంగా ఆంజనేయునిగా అవతరించాడనే కథ వాల్మీకి రామాయణం లేదా ప్రసిద్ధ పురాణాలలో ప్రత్యేకంగా చెప్పబడలేదు.  

కనకాంగి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రంజని గాయత్రి సోదరీమణులు ఆలపించారు

శ్రీరామ పాదమా - త్యాజరాజస్వామి కృతి


శ్రీరామ పాదమా! నీ కృప జాలునే! చిత్తానికి రావే!

వారిజ భవ సనకసనందన వాసవ నారదాదులెల్ల పూజించే

దారిని శిలయై తాపము తాళక వారము కన్నీరును రాల్చగ
శూర! అహల్యను చూచి బ్రోచినారీతి ధన్యుసేయవే త్యాగరాజ గేయమా!

శ్రీరాముని పాదమా! నీ కృప ఒక్కటే నాకు చాలును. నా చిత్తములోకి వచ్చి స్థిరముగా నిలువవే! పద్మములో జన్మించిన బ్రహ్మదేవుడు, సనకుడు, సనందనుడు మొదలైన మహర్షులు, దేవేంద్రుడు, నారదుడు మొదలైన వారందరూ నిన్ను భక్తితో పూజిస్తున్నారు. శ్రీరాముడు నడిచే దారిలో శిలగా పడి, శాపం వల్ల కలిగిన తాపాన్ని భరించలేక, ఎన్నో సంవత్సరాలుగా కన్నీరు కారుస్తూ దుఃఖిస్తున్న అహల్యను చూసి, ఓ వీరుడైన శ్రీరాముని పాదమా! ఆమెను కరుణతో కాపాడి, శాపవిముక్తురాలిని చేసి ధన్యురాలిని చేసిన విధంగానే, త్యాగరాజునిచే నుతించబడుతున్న శ్రీరామపాదమా! నన్ను కూడా కరుణించి, కాపాడి, ధన్యుడిని చేయవే! 

అమృతవాహిని రాగంలో స్వరపరచబడిన ఈ త్యాజరాజస్వామి కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

శ్రీ గణపతిని సేవింపరారే - త్యాగరాజస్వామి కృతి

శ్రీ గణపతిని సేవింపరారే శ్రిత మానవులారా

వాగధిపతి సుపూజల జేకొని బాగా నటింపుచును వెడలిన 

పనస నారికేళాది జంబూ ఫలముల నారగించి
ఘన తరంబుగను మహిపై పదములు ఘల్లు ఘల్లు మననించి
అనయము హరి చరణ యుగములను హృదయాంబుజమున నుంచి
వినయమునను త్యాగరాజ వినుతుడు వివిధ గతుల ధిత్తళాంగుమని వెడలిన  

శరణు కోరిన మానవులారా, శ్రీ గణపతిని సేవించటనికి విచ్చేయండి. వాక్కుకు అధిపతియైన బ్రహ్మదేవునిచే ఉత్తమమైన పూజలందుకొని లీలగా నటింపుచు వెళుతున్న గణపతిని సేవించటానికి విచ్చేయండి. పనస, కొబ్బరి, నేరేడు మొదలైన ఫలములను ఆరగించి, భూమిపై తన గంభీరమైన పాదములను “ఘల్లు ఘల్లు” మను శబ్దముతో మోపుచు, ఎల్లప్పుడూ తన హృదయకమలమున శ్రీహరి చరణయుగములను నిలుపుకొనినవాడు,  వినయముగా త్యాగరాజునిచే నుతించబడిన వాడు, వివిధ నడకలతో ధిత్తళాంగుమనే లయనాదమును పలికించుచు వెడలిన గణపతిని సేవించటానికి విచ్చేయండి.   

త్యాగరాజస్వామి ప్రహ్లాద భక్తి విజయము అనే యక్షగానాన్ని రచించారు. అందులో ప్రహ్లాదుని జననము నుండి నరసింహావతారం వరకు కృతి-గద్య రూపంలో అద్భుతమైన సాహిత్యాన్ని ఐదు భాగాలుగా విభజించారు. మొత్తం 48 దాకా కృతులు ఈ యక్షగానంలో ఉన్నాయి. అందులో మొదటిది ఈ గణపతిని కొలిచే సందర్భంగా కృతి.సౌరాష్ట్ర రాగంలో స్వరపరచబడిన ఈ కృతి సాధారణంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పంచరత్న కృతుల బృందగానం ముందు ఆలపిస్తారు. 

ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

గిరిరాజ సుతా తనయా! సదయా! - త్యాగరాజస్వామి కృతి


గిరిరాజ సుతా తనయా! సదయా!

సురనాథ ముఖార్చిత పాదయుగ!
పరిపాలయ మాం ఇభరాజముఖ!

గణనాథ! పరాత్పర! శంకరాగమ వారినిధీ రజనీకర!
ఫణిరాజ కంకణ! విఘ్న నివారణ! శాంభవ! శ్రీ త్యాగరాజ నుత!

హిమవంతుని పుత్రికయైన పార్వతి కుమారుడు, దయానిధివైన ఓ గణపతీ! దేవతలకు అధిపతియైన ఇంద్రునిచే అర్చించబడిన పాదములు కలిగిన ఓ గజముఖా! మమ్ములను రక్షింపుము. పరబ్రహ్మ స్వరూపుడవైన ఓ గణనాథా! సమస్త శుభములను కలిగిస్తూ, సమస్త విద్యలనే సముద్రమునకు చంద్రుని వంటి వాడా! సర్పములు కంకణములుగా కలిగి విఘ్నములను నివారించే ఓ శంభుతనయా! త్యాగరాజునిచే నుతించబడిన గణపతీ! మమ్ములను రక్షించుము.  

ఈ కృతిని బట్టి కొందరు పల్లవిలో గిరిరాజసుత తనయా అన్నది ఆయన మాతామహులైన గిరిరాజకవి గురించి ప్రస్తావించారని భాష్యం చెప్పారు. కానీ, సంగీతజ్ఞులు, సంగీత నిపుణుల పరిశోధనలో తేలిన విషయం ఆయన మాతామహులు వీణ కాళహస్తయ్య గారు అని, ఆయన పితామహులు కాకర్ల గిరిరాజబ్రహ్మం గారు అని. కాబట్టి ఈ కృతిలోని పల్లవిలో గిరిరాజసుతా తనయా ప్రస్తావన పూర్తిగా గణపతి గురించే అని చాలామంది అంగీకరించారు. 

బంగాళా రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రఘురాం మణికంఠన్ ఆలపించారు

13, సెప్టెంబర్ 2026, ఆదివారం

గానమూర్తే - త్యాగరాజస్వామి కృతి


త్యాగరాజస్వామి వారు రచించిన కృష్ణుని కృతులలో గానమూర్తే ప్రత్యేకమైనది. శ్రీకృష్ణుని వైభవాన్ని అద్భుతంగా సంస్కృతంలో సద్గురువులు ఆవిష్కరించారు. లక్ష్మీ స్వరూపమైన నారీమణి రుక్మిణి. మరి ఆమె మనసులో భావించి స్థిరం చేసుకున్న పురుషుడు ఆ జగదోద్ధారకుడు కాక ఎవరవుతారు? త్రిభువనాలను పాలించే జగన్మోహనాకారుడు రుక్మిణి మధురభక్తికి వశుడైనాడు. ఈ కృతిలో త్యాగరాజస్వామి అంతర్దృష్టితో పాటు విద్వత్తు కూడా గోచరమవుతుంది. కృష్ణుని జీవితంలో ప్రతి ముఖ్యమైన ఘట్టాన్ని కూడా ఆయన స్పృశించారు. వెన్నను దొంగిలిచిన నందకుమారునిగా, అర్జునుని మిత్రునిగా, నల్లని మేఘము వంటి తేజస్సు కలవానిగా, పార్వతీదేవి సోదరునిగా, నరకాసురుని సంహరించిన వానిగా మనోజ్ఞంగా వర్ణించారు.

సాహిత్యం
=======
గానమూర్తే శ్రీకృష్ణ వేణుగానలోల త్రిభువన పాల పాహి

మానినీమణి శ్రీరుక్మిణి మానసాపహార మారజనక దివ్య

నవనీతచోర నందసత్కిశోర నరమిత్ర ధీర నరసింహ శూర
నవమేఘ తేజ నగజా సహజ నరకాంతకాజ నత త్యాగరాజ

భావం
======

వేణుగానలోలుడవు, ముల్లోకములను పాలించేవాడవు, గానమూర్తివైన శ్రీకృష్ణా! నన్ను రక్షింపుము. నారీశిరోమణి అయిన రుక్మిణీదేవి మనసును దోచుకున్నవాడవు, మన్మథునికి జనకుడవు, దివ్యగానమూర్తివి అయిన శ్రీకృష్ణా! నన్ను రక్షింపుము. వెన్నదొంగవు, నందుని ముద్దుబిడ్డవు, అర్జునునికి మిత్రుడవు, ధీరుడవు, నరసింహుడవు, శూరుడవు. క్రొత్త మేఘముల వంటి కాంతి కలవాడవు, పార్వతీదేవి సహోదరుడవు, నరకాసురుని సంహరించిన వాడవు, బ్రహ్మ, శివులచే నుతించబడినవాడవు, గానమూర్తివైన శ్రీకృష్ణా! నన్ను రక్షింపుము.

శ్రవణం
=======

గానమూర్తి రాగంలో కూర్చబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు.

నీకే దయ రాక - త్యాగరాజస్వామి కృతి


ఆధ్యాత్మిక అంశాలను ప్రాపంచిక వ్యవహారశైలితో పోల్చి వివరించటం త్యాగరాజస్వామి అనేక కృతులలో చేశారు. మానవుడికి ఉండే అనేక వికారాల వల్ల ఏ విధంగా ఆధ్యాత్మిక పురోగతి కలుగదో ఆయన వివరించిన ఒక కృతి నీకే దయరాక. వివరాలు:


నీకే దయ రాక నే జేయు పనులెల్ల నెరవేరునా రామ

యేకోపించక నేను నీవను జ్ఞానికేలాగు సుఖమిచ్చునే ఓ రాఘవా

మనసు నిలవని వారు మాయాజాలము జేసి మరి ముక్తిగొననౌనే
కను సంజ్ఞకు రాని కాంతను బలిమిడి కరమిడ వశమౌనే ఓ రాఘవా

వాడిక లేని విద్యల చేత సభలోన వాదించబోనౌనే
సాడి విన్న మాట మది నిల్పలేని సరసుని వితమౌనే ఓ రాఘవా

మెప్పులకై బహు ధర్మము చేసితే మిగుల బ్రోవ దగునే
తప్పు మాటలు గాదు తారక నామ శ్రీత్యాగరాజుని పైని ఓ రాఘవా

శ్రీరామచంద్రా! నీ దయ లేకుంటే నేను చేసే పనులు సఫలమయ్యేనా! జీవాత్మను పరమాత్మ అయిన నీతో నిజంగా ఏకం చేయక మాట వరుసకు మాత్రమే నేను నీవే యను జ్ఞానికి సుఖమెలా కలుగుతుంది? అనురాగముతో కనుసైగకు మెచ్చని స్త్రీ బలవంతాన చేయిపట్టుకుంటే వశము కాని రీతి మనసును స్థిరపరచుకోలేని వారు మాయాజాలం చేస్తే ముక్తి కలుగుతుందా? విన్న చాడీలు మనసులోనే ఉంచుకోలేని పండితుని వలె కౌశలం లేని విద్యలతో సభలలో వాదించబోయిన ఉపయోగమేమి? మెప్పుల కోసం దానధర్మాలు చేస్తే అవి అనుగ్రహపాత్రమవుతాయా? నేను చెప్పే ఈ మాటలు తప్పు కావు, తారకనామధేయుడవైన శ్రీరామా! త్యాగరాజునిపై దయలేకున్న నేను చేసే పనులు సఫలమయ్యేనా!

-త్యాగరాజస్వామి

నీలాంబరి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రంజని-గాయత్రి సోదరీమణులు ఆలపించారు.

నగు మోము కన లేని - త్యాగరాజస్వామి కృతి


నగు మోము కన లేని నా జాలి తెలిసి
నన్ను బ్రోవరాదా శ్రీ రఘువర నీ (నగు)

నగరాజధర నీదు పరివారులెల్ల
ఒగి బోధన జేసే వారలు కారేయటులుండుదురే నీ (నగు)

ఖగరాజు నీ యానతి విని వేగ చనలేడో
గగనానికి yiలకు బహుదూరంబనినాడో
జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు
వగ జూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజ నుత నీ (నగు)

ఓ శ్రీరామా! నీ చిరునవ్వు కనబడక నా హృదయం ఎంతగా వేదన చెందుతోందో తెలిసి కూడా నన్ను రక్షింపవా? పర్వతరాజుని ధరించినవాడా! నీ పరివారమంతా నీకు నా దుఃఖాన్ని వినిపించి, నన్ను అనుగ్రహించమని బోధించేవారు కారా? నీ ఆజ్ఞను విని గరుత్మంతుడు వెంటనే వచ్చుటలేదా? ఆకాశానికి, భూమికి ఎంతో దూరమని అతడు భావించుచున్నాడా? జగత్తునంతటినీ ఏలుచున్న పరమాత్మా! నీవు తప్ప నేను ఎవరి ఎదుట నా మొర వినిపించుకొందును? నాపై నిర్లక్ష్యదృష్టి చూపకుము; ఈ వేదనను నేను సహింపలేను. నన్ను దయతో ఏలుకొనుము, త్యాగరాజునుతుడవైన శ్రీరామా!

ఈ కృతిలో భక్తుని ఆర్తి ఎంతో సన్నిహితమైనది. రాముని “నగుమోము” అనేది కేవలం చిరునవ్వు కాదు—భక్తుని అంతరంగాంధకారాన్ని తొలగించే కరుణాకటాక్షం. ఆ దివ్యస్మితం దర్శనానికి నోచుకోక త్యాగరాజస్వామి కలత చెందుతున్నారు. రాముని పరివారమంతా తన బాధను ప్రభువుకు తెలియజేయలేరా అని ప్రశ్నించడం, తనకు రామునితో ఉన్న ఆత్మీయ సంబంధాన్నీ, కరుణ కోసం ఎదురుచూసే అమాయకమైన విశ్వాసాన్నీ వ్యక్తం చేస్తుంది.

“ఖగరాజు” గరుత్మంతుని ప్రస్తావనలో భక్తుని ఆతురత మరింత స్పష్టమవుతుంది. రాముని ఆజ్ఞ లభిస్తే గరుడుడు క్షణంలో వచ్చి రక్షించగలడని తెలిసిన భక్తుడు, ఆలస్యం ఎందుకని బాధతో అడుగుతున్నాడు. చివరికి “ఎవరితో మొరలిడుదు?” అన్న వాక్యం అనన్యశరణాగతికి పరాకాష్ఠ. సర్వలోకాధిపతియైన రాముడే తనకు ఏకైక ఆశ్రయమని, ఆయన నిరాసక్తతను తాను భరించలేనని చెప్పి, ప్రేమతో కూడిన విరహభక్తిలో తనను ఏలుకోవాలని వేడుకుంటున్నారు.

అభేరి రాగం ఈ కృతిలోని కరుణ, ఆర్తి, ఆశ్రితవాత్సల్య భావాలకు అత్యంత అనుకూలమైనది. దాని మృదువైన స్వరసంచారాలు భక్తుని హృదయంలోని నిస్సహాయతను, “నగుమోము” దర్శనం కోసం కలిగే తపనను హృద్యంగా పలికిస్తాయి. అదే సమయంలో అభేరిలో అంతర్లీనంగా ఉన్న మాధుర్యం, రాముని కరుణపై భక్తునికి ఉన్న అచంచల విశ్వాసాన్ని నిలబెడుతుంది. అందుచేత ఈ రాగం కేవలం దుఃఖాన్ని మాత్రమే కాక, పరమాత్మ రూపం అగోచరం కావటం వల్ల కలిగే విచారం వెనుక దాగి ఉన్న దైవసాన్నిధ్యపు ఆశను, ప్రభువు చిరునవ్వు లభిస్తుందనే నిరీక్షణను అత్యంత సహజంగా పలికిస్తుంది. ఈ కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

చలమేలరా సాకేత రామా! - త్యాగరాజస్వామి కృతి


చలమేలరా సాకేత రామా!

వలచి భక్తి మార్గముతోను నిన్ను వర్ణించుచున్న నాపై 

ఎందుబోదు నేనేమి సేయుదును ఎచ్చోట నే మొర బెట్టుదును
దందనలతో ప్రొద్దుపోవలెనా తాళజాలరా త్యాగరాజనుత

ఓ సాకేత రామా! నిన్నే ప్రేమించి భక్తిమార్గములో వర్ణించుచున్న నాపై కరుణ చూపుటకు ఆలస్యమెందుకు చేయుచున్నావు? నేనెక్కడికి పోయెదను? ఏమి చేసెదను? ఎక్కడ మొరపెట్టుకొందును? నా జీవితమంతా అనవసరమైన విషయములలోనే వృథాగా గడచిపోవలసిందేనా? నేనింక తాళలేను రామా! ఆలస్యము లేకుండా నన్ను కాపాడుము. 

ఈ కృతిలో త్యాగరాజస్వామి భక్తి కేవలం స్తోత్రమో, సంగీతారాధనో కాదని స్పష్టమవుతుంది. ఆయనది రామునిపై సంపూర్ణ ఆధారపడిన జీవన మానక్సిక స్థితి. “వలచి భక్తి మార్గముతోను వర్ణించుచున్న నాపై” అనే భావంలో, ప్రేమతో రామనామాన్ని గానము చేస్తున్న భక్తుని అంతరంగవేదన ఉంది. అయినా ప్రభువు కరుణ ప్రత్యక్షం కావడంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించడం ద్వారా భక్తుని ఆర్తి మరింత గాఢమవుతుంది. ఇది సందేహం కాదు. తనకు హితుడు, రక్షకుడైన శ్రీరామచంద్రమూర్తికి తన బాధ చెప్పుకొనే హక్కుతో చేసిన వినతి. 

“నేనేమి సేయుదును, ఎచ్చోట నే మొర బెట్టుదును” అన్న ప్రశ్నలు అనన్యశరణాగతికి చిహ్నాలు. రాముడిని తప్ప వేరే ఆశ్రయం లేదని తెలిసిన భక్తుడు, తన రోజులు వ్యర్థవిషయాలలో గడవకముందే కాపాడమని వేడుకుంటున్నాడు. “తాళజాలరా”లోని అసహనము భౌతిక దుఃఖం వల్ల మాత్రమే కాదు. దైవసాన్నిధ్యం లేక గడిచే క్షణం కూడా భక్తునికి భారమనే విరహభావం. అందువల్ల ఈ కృతి కరుణ కోసం చేసే ప్రార్థనగా, భక్తి మార్గంలో నిలకడగా ఉన్న హృదయపు విన్నపంగానే నిలుస్తుంది. 

మార్గహిందోళ రాగంలో కూర్చబడిన ఈ కృతిని ప్రియా సిస్టర్స్ హరిప్రియ-షణ్ముఖప్రియ ఆలపించారు

12, సెప్టెంబర్ 2026, శనివారం

వందనము రఘునందనా - త్యాగరాజస్వామి కృతి


వాగ్గేయకారులకు ద్వైత భావనతో పరమాత్మతో సంభాషించటం, వేడుకోవటం, అప్పుడప్పుడు నిందించటం, అంతలో శరణనటం చాలా పరిపాటి. అది వారిద్దరి మధ్య ఉన్న ఆ బంధానికి ప్రతీక. భక్తిమార్గంలో సద్భక్తునికి స్వామిపై అనేక రకాలా భావనలు కలుగుతాయి. అటువంటి భావనలే మనకు ఈ త్యాగరాజస్వామి వారి ప్రహ్లాద విజయము అనే రచనలో రూపొందించబడిన వందనము రఘునందనా అనే సంకీర్తనలో స్పష్టముగా అవగతమవుతాయి. రాముని శరణనన్న త్యాగయ్య స్వామితో చేసిన విన్నపాలను, వ్యక్తపరచిన భావనలను పరిశీలించండి. అంతర్లీనంగా సందేశం మాత్రం ఒక్కటే - రామనామమే ఆయనకు భృతి, ద్యుతి, శరణాగతి. త్యాగయ్య కృతులు వ్రాయాలని వ్రాసినవి కాదు. ఆయన మనోభావనలు శబ్దరూపము పొంది రాగ యుక్తమై భక్తి పుష్పంగా ఆవిష్కరించబడ్డాయి. శహానా రాగం భక్తికి శరణాగతికి ఆర్తికి ప్రతీక. ఈ భావసుమం ఆ రాగంలోనే త్యాగయ్య ఆలపించటం ఆయనపై గల రామానుగ్రహానికి నిదర్శనం.


వందనము రఘునందనా! సేతుబంధనా! భక్తచందనా! రామ!

శ్రీదమా! నాతో వాదమా! నే భేదమా! ఇది మోదమా! రామ!

శ్రీరమా హృచ్చారమా! బ్రోవ భారమా! రాయబారమా! రామ!

వింటిని! నమ్ముకొంటిని! శరణంటిని! రమ్మంటిని! రామ!

ఓడను! భక్తి వీడను! ఒరుల వేడను! నీ వాడను! రామ!

కమ్మని విడెమిమ్మని! వరము కొమ్మని! పలుక రమ్మని! రామ!

న్యాయమా! నీకాదాయమా! ఇంక హేయమా! ముని గేయమా! రామ!

చూడుమీ! కాపాడుమీ! మమ్ము పోడిమిగా గూడుమీ! రామ!

క్షేమము! దివ్య ధామము! నిత్య నేమము! రామ నామము! రామ!

వేగరా! కరుణా సాగరా! శ్రీ త్యాగరాజ హృదయాకారా! రామ!

రఘువంశమున జన్మించిన శ్రీరామా! లంకకు సేతువును నిర్మించిన వాడా! భక్తులకు చందనము వలె సౌఖ్యాన్ని ఇచ్చే వాడా! నీకు నమస్కరిస్తున్నాను! సిరులను ఇచ్చే వాడా! నీకు నాతో వాదమా! నేను పరాయివాడనా! ఇది నీకు సంతోషమా రామా! నీకు నమస్కరిస్తున్నాను! లక్ష్మీదేవి హృదయ-ములో సంచరించే వాడా! నన్ను బ్రోచుటకు భారమా! నీకు నాకు మధ్య రాయబారములెందుకు రామా! నీకు నమస్కరిస్తున్నాను! భక్తులను బ్రోచే నీ కీర్తి విన్నాను, నిన్ను నమ్ముకున్నాను, శరణని నిన్ను రమ్మనుచున్నాను రామా! నీకు నమస్కరిస్తున్నాను! నిన్ను చూచే మార్గములో నేను ఓడను, నీ భక్తిని వీడను, ఇతరులను వేడను, నేను నీ వాడను రామా! నీకు నమస్కరిస్తున్నాను! కమ్మని తాంబూలమిమ్మని వరమును ఇచ్చుచున్నానను తీసుకొమ్మని నీవు నాతో పలుకవలెనని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను రామా! నీకు నమస్కరిస్తున్నాను! నీకు ఇది న్యాయమా! నన్ను కరుణించకుండా ఉండుట నీకు ఆదాయమా, నాతో పలుకుట నీకు చులకనా మునులచేత నుతించబడిన రామా! నీకు నమస్కరిస్తున్నాను! నన్ను కరుణతో చూడుము, కాపాడుము, ఒప్పుగా నన్ను చేకొనుము రామా! నీకు నమస్కరిస్తున్నాను! నిరంతర నియమమైన నీ నామము క్షేమమైనది దివ్య ధామమైనది రామా! ఓ కరుణా సముద్రుడవైన రమా! వేగముగా రమ్ము, త్యాగరాజుని హృదయమునందు వెలసిన రామా! నీకు నమస్కరిస్తున్నాను!

-సద్గురువులు కాకర్ల త్యాగబ్రహ్మం

శహానా రాగంలో కూర్చబడిన ఈ కృతిని కోటా పావని ఆలపించారు.

త్యాగరాజస్వామి వారి కృతి సామజవరగమన


సామజవరగమన సాధుహృత్సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత

సామనిగమజ సుధామయ గాన విచక్షణ
గుణశీల దయాలవాల మాం పాలయ

వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీప స్వీకృత
యాదవకుల మురళీవాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ

ఓ గజరాజు వంటి గంభీరమైన నడక కలిగినవాడా! సజ్జనుల హృదయసారమనే కమలములకు ప్రభువైన వాడా! కాలానికి అతీతమైన కీర్తి కలిగినవాడా! సామవేదం నుంచి పుట్టిన అమృతమయమైన గానంలో నిపుణుడా! సద్గుణశీలుడా! దయకు నిలయమైనవాడా! నన్ను రక్షించు. వేదాల శిరస్సు నుంచి ఉద్భవించిన సప్తస్వరాల నాదపర్వతానికి దీపంలా వెలిగేవాడా, దానిని స్వీకరించినవాడా! యాదవ వంశంలో జన్మించి మురళీవాదనలో ఆనందించి అందరినీ మోహింపజేసేవాడా! త్యాగరాజు పూజించే శ్రీకృష్ణా! నన్ను కాపాడు.

హిందోళ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మంగళపంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

13, ఆగస్టు 2026, గురువారం

మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జీవిత విశేషాలు


డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ భారతీయ కర్ణాటక సంగీత ప్రపంచంలో ఒక అపూర్వమైన బహుముఖ ప్రజ్ఞాశాలి. గాయకుడిగా, వాద్యకారుడిగా, స్వరకర్తగా, వాగ్గేయకారుడిగా, సంగీత ప్రయోగశీలిగా, ఉపాధ్యాయుడిగా, గాయక నటుడిగా, సినీ నేపథ్య గాయకుడిగా ఆయన చేసిన సేవలు అనన్యసామాన్యమైనవి. ముఖ్యంగా గాయకుడిగా ఆయనకు లభించిన ఖ్యాతికి సమానంగా స్వరకర్తగా ఆయన సాధించిన స్థానం కూడా ఎంతో ఉన్నతమైనది. నాలుగు వందలకు పైగా కృతులను రచించి, 72 మేళకర్త రాగాలలోనూ కృతులు సృష్టించి, కొత్త రాగాలను నిర్మించి, తాళప్రయోగాలలో కొత్త మార్గాలను అన్వేషించిన ఆయనను కేవలం మహాగాయకుడిగా మాత్రమే చూడటం ఆయన సృజనాత్మక ప్రతిభను పూర్తిగా అర్థం చేసుకోవడం కాదు.

మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 జూలై 6న అప్పటి తూర్పుగోదావరి జిల్లాలోని శంకరగుప్తం గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి మంగళంపల్లి పట్టాభిరామయ్య స్వయంగా సంగీత విద్వాంసుడు. వేణువు, వయోలిన్, వీణ వంటి వాద్యాలలో ఆయనకు మంచి ప్రావీణ్యం ఉండేది. తల్లి సూర్యకాంతమ్మ వీణా విదుషి. బాలమురళీకృష్ణ జన్మించిన కొద్దికాలానికే తల్లి మరణించడంతో ఆయన పెంపకం ప్రధానంగా తండ్రి సంరక్షణలోనే జరిగింది. చిన్న వయస్సు నుంచే ఆయనలో సంగీతంపై అసాధారణమైన ఆసక్తి, గ్రహణశక్తి కనిపించాయి.

తండ్రి వద్ద ప్రాథమిక సంగీత పరిచయం పొందిన బాలమురళీకృష్ణను తరువాత ప్రముఖ సంగీతాచార్యుడు పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి వద్ద శిష్యరికానికి చేర్పించారు. ఇదే ఆయన జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు అప్పటికే ఆంధ్రదేశంలో కర్ణాటక సంగీత సంప్రదాయాన్ని బలంగా స్థాపించిన మహాగురువుగా పేరుపొందారు. ఆయన ద్వారా బాలమురళీకృష్ణకు కేవలం గాన విద్య మాత్రమే కాకుండా రాగలక్షణం, స్వరజ్ఞానం, లయ, కృతి నిర్మాణం, సంప్రదాయ సంగీత దృష్టి వంటి అనేక అంశాలలో పటిష్ఠమైన పునాది ఏర్పడింది.

బాలమురళీకృష్ణకు సంబంధించిన గురుశిష్య పరంపర ప్రత్యేకంగా ప్రస్తావించదగినది. ఆయన గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు. పారుపల్లి వారు సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి శిష్యులు. సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి మానంబుచావడి వెంకట సుబ్బయ్య శిష్యులు. మానంబుచావడి వెంకట సుబ్బయ్య త్యాగరాజ స్వామివారి ప్రముఖ శిష్యులలో ఒకరు. అందువల్ల బాలమురళీకృష్ణ సంగీత పరంపరను త్యాగరాజస్వామి నుంచి బాలమురళీకృష్ణ వరకు వచ్చిన గొప్ప గురుశిష్య వంశపారంపర్యంగా చూడవచ్చు. ఈ పరంపర ఆయన సంగీతంలో సంప్రదాయానికి ఇచ్చిన ప్రాధాన్యానికి ఒక ముఖ్యమైన ఆధారం.

అయితే బాలమురళీకృష్ణ ప్రతిభను కేవలం గురువుల వద్ద నేర్చుకున్న విద్యతో మాత్రమే వివరించడం సాధ్యం కాదు. ఆయనలో సహజసిద్ధమైన సంగీత మేధస్సు, అపారమైన జ్ఞాపకశక్తి, స్వరాలపై అసాధారణమైన పట్టు, కొత్తదాన్ని సృష్టించాలనే తపన బాల్యంలోనే వ్యక్తమయ్యాయి. ఎనిమిదేళ్ల వయస్సులోనే విజయవాడలో జరిగిన త్యాగరాజ ఆరాధనలో ఆయన పూర్తి స్థాయి కచేరీ ఇచ్చారు. అప్పటివరకు బాలుడైన మురళీకృష్ణను చూసిన హరికథా విద్వాంసుడు ముసునూరి సూర్యనారాయణమూర్తి భాగవతార్ ఆయన పేరుకు బాల అనే విశేషణాన్ని జోడించారని ప్రసిద్ధి. ఆ తరువాత మురళీకృష్ణ అనే పేరు బాలమురళీకృష్ణగా స్థిరపడింది.

చిన్న వయస్సులోనే ఆయన సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించారు. పాఠశాల విద్య కంటే సంగీత సాధనకే ప్రాధాన్యం ఇచ్చి, బాల్యంలోనే తన జీవితాన్ని పూర్తిగా సంగీతానికి అంకితం చేశారు. పదిహేనేళ్ల వయస్సు వచ్చేసరికి 72 మేళకర్త రాగాలపై ఆయనకు విశేషమైన పట్టు ఏర్పడింది. అదే సమయంలో అన్ని మేళకర్త రాగాలలో కృతులు రచించే సాహసం కూడా చేశారు. ఈ వయస్సులోనే ఒక యువ గాయకుడు కేవలం రాగాలను పాడటం కాకుండా వాటి స్వభావాన్ని అర్థం చేసుకుని స్వయంగా కృతులను సృష్టించడం ఆయన అసాధారణ సంగీత మేధస్సుకు నిదర్శనం.

యువకుడిగా ఎదుగుతున్న కొద్దీ బాలమురళీకృష్ణ గాత్ర విద్వత్తుతో పాటు వాద్యవిద్యలోనూ తన ప్రతిభను విస్తరించారు. వయోలిన్, వయోలా, వీణ, మృదంగం, కంజీరా వంటి వాద్యాలను అభ్యసించారు. ముఖ్యంగా వయోలాను కర్ణాటక సంగీత కచేరీ వేదికపై ప్రత్యేకంగా పరిచయం చేసి దానికి ఒక స్వతంత్ర స్థానాన్ని కల్పించడంలో ఆయన పాత్ర విశేషమైనది. గాయకుడిగా మాత్రమే కాకుండా వాద్యకారుడిగా కూడా రాగం, లయ, స్వరప్రయోగాలపై తన అవగాహనను విస్తరించుకున్నారు. ఈ బహుముఖ సాధన ఆయన స్వరకల్పనకు కూడా ఎంతో తోడ్పడింది.

1930ల చివరి దశ నుంచి ఆయన సంగీత ప్రస్థానం వేగంగా విస్తరించింది. దేశంలోని అనేక ప్రాంతాలలో కచేరీలు ఇస్తూ కర్ణాటక సంగీతంలో తనదైన ముద్రను ఏర్పరచుకున్నారు. సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే రాగాల ఆలాపన, నెరవల్, స్వరకల్పన, తాళప్రయోగం, కృతుల నిర్మాణంలో తన సృజనాత్మకతను ప్రదర్శించారు. ఆయన గానంలో శ్రుతిశుద్ధి, గంభీరత, స్పష్టమైన ఉచ్చారణ, వేగవంతమైన స్వరప్రయోగం, లయపై అసాధారణమైన నియంత్రణ ప్రత్యేక లక్షణాలుగా నిలిచాయి.

బాలమురళీకృష్ణ జీవితంలో ఆకాశవాణి ఒక ముఖ్యమైన అధ్యాయం. ఆకాశవాణి ద్వారా ఆయన సంగీతం విస్తృతమైన శ్రోతల వర్గానికి చేరింది. హైదరాబాద్ ఆకాశవాణిలో పనిచేసిన కాలంలో భక్తి సంగీతాన్ని ప్రజలకు చేరువ చేయడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు. భక్తి రంజని వంటి కార్యక్రమాల ద్వారా భక్తిగీతాలు, శాస్త్రీయ సంగీతం, ఆధ్యాత్మిక సాహిత్యం సామాన్య శ్రోతలకు కూడా చేరేలా చేశారు.

సంగీత ప్రపంచంలో ఆయన ప్రస్థానం క్రమంగా అంతర్జాతీయ స్థాయికి చేరింది. భారతదేశంలోని ప్రముఖ సభలతో పాటు యూరప్, అమెరికా, కెనడా, రష్యా, మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా తదితర ప్రాంతాలలో కచేరీలు నిర్వహించారు. ఆయన సంగీతం కేవలం దక్షిణ భారతీయ శ్రోతలకు పరిమితం కాలేదు. హిందుస్తానీ సంగీత విద్వాంసులతో కలిసి జుగల్బందీ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తర, దక్షిణ భారతీయ శాస్త్రీయ సంగీతాల మధ్య సృజనాత్మక సంభాషణకు కూడా ఆయన వేదిక కల్పించారు. భీమ్‌సేన్ జోషి, హరిప్రసాద్ చౌరాసియా, అజయ్ చక్రవర్తి, కిశోరి ఆమోంకర్ వంటి ప్రముఖులతో ఆయన చేసిన సంగీత సహకారాలు ఈ విస్తృత దృక్పథానికి ఉదాహరణలు.

బాలమురళీకృష్ణను గాయకుడిగా మాత్రమే గుర్తించడం ఆయన జీవితంలోని అత్యంత ముఖ్యమైన అంశాన్ని కొంతవరకు మసకబార్చినట్లే అవుతుంది. ఆయన అసలు ప్రత్యేకతల్లో ఒకటి మహత్తరమైన స్వరకర్తగా ఆయన సాధించిన స్థానం. నాలుగు వందలకు పైగా కృతులు ఆయన రచించారు. వర్ణాలు, కృతులు, జావళీలు, పదాలు, భక్తిగీతాలు, భావగీతాలు, తిల్లానాలు వంటి అనేక రూపాలలో ఆయన స్వరరచనలు చేశారు. తెలుగు, సంస్కృతం మాత్రమే కాకుండా కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, పంజాబీ తదితర భాషల్లోనూ సంగీతాన్ని సృష్టించారు.

స్వరకర్తగా ఆయన అత్యంత గొప్ప సాధన 72 మేళకర్త రాగాలన్నింటిలోనూ కృతులను సృష్టించడం. మేళకర్త వ్యవస్థను కేవలం సిద్ధాంతంగా అధ్యయనం చేయకుండా, ప్రతి రాగానికి తగిన సంగీత స్వభావాన్ని గుర్తించి దానిలో సృజనాత్మకమైన కృతిని నిర్మించడం ఆయన ప్రత్యేకత. ఈ క్రమంలో రాగాంగ రవళి వంటి రచనల ద్వారా మేళకర్త రాగ వ్యవస్థపై తన లోతైన అవగాహనను ప్రదర్శించారు. ఆయనకు సంగీతం అనేది కేవలం పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయాన్ని పునరావృతం చేయడం కాదు; సంప్రదాయానికి అంతర్భూతమైన నియమాలను అర్థం చేసుకుని వాటి పరిధిలోనే కొత్త సౌందర్యాన్ని సృష్టించడం.

కొత్త రాగాల సృష్టిలోనూ బాలమురళీకృష్ణ ప్రతిభ అసాధారణమైనది. మహతి, లవంగి, సుముఖం, సిద్ధి, ఓంకారి, గణపతి, సర్వశ్రీ వంటి రాగాలు ఆయన సృజనాత్మక ప్రయోగాలకు ఉదాహరణలు. ముఖ్యంగా నాలుగు స్వరాలు లేదా మూడు స్వరాలతోనే రాగ స్వరూపాన్ని నిర్మించి వాటిలో సంగీతపరమైన సంపూర్ణతను సాధించడం ఆయన సంగీత మేధస్సుకు నిదర్శనం. సంప్రదాయ రాగవ్యవస్థను ధిక్కరించడం ఆయన ఉద్దేశం కాదు; రాగం అనే భావనలో ఇంకా ఎంత సృజనాత్మక అవకాశముందో చూపించడం ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది.

తాళ వ్యవస్థలోనూ ఆయన ప్రయోగాలు చేశారు. త్రిముఖి, పంచముఖి, సప్తముఖి, నవముఖి వంటి తాళప్రయోగాలు ఆయన లయపై ఉన్న అసాధారణమైన పట్టును తెలియజేస్తాయి. గాయకుడిగా లయను అనుసరించడమే కాకుండా స్వరకర్తగా లయను కొత్త నిర్మాణాలకు ఉపయోగించడం ఆయన ప్రత్యేకత. ఈ కారణంగానే ఆయనను సంప్రదాయ కర్ణాటక సంగీతంలో ప్రయోగాత్మక సృజనకు ఒక ప్రధాన ప్రతినిధిగా పరిగణిస్తారు.

బాలమురళీకృష్ణ స్వరకల్పనలో మరో ముఖ్యమైన లక్షణం సాహిత్యానికి ఇచ్చిన ప్రాధాన్యం. తెలుగు, సంస్కృత భాషలపై ఆయనకు ఉన్న పాండిత్యం వల్ల పదానికి సరైన స్వరరూపాన్ని ఇవ్వగలిగారు. ఆయన కృతుల్లో భక్తి, తత్త్వం, గురుభక్తి, సంగీతానుభూతి వంటి అంశాలు కనిపిస్తాయి. కృతి యొక్క భావం స్వరాలతో కలిసి సహజంగా వ్యక్తమయ్యేలా చేయడం ఆయన వాగ్గేయకార ప్రతిభలోని ప్రధాన లక్షణం.

తిల్లానాల విషయంలో బాలమురళీకృష్ణకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కర్ణాటక కచేరీ చివరి భాగంలో సాధారణంగా పాడే తిల్లానాను ఆయన కేవలం లయబద్ధమైన ముగింపు అంశంగా కాకుండా స్వతంత్ర సంగీత సృజనకు అనువైన రూపంగా తీర్చిదిద్దారు. ఆయన తిల్లానాల్లో వేగవంతమైన లయ, ఆకర్షణీయమైన స్వరసంచారాలు, జతిస్వరాల నిర్మాణం, రాగభావం, కొన్ని సందర్భాల్లో అర్థవంతమైన చరణ సాహిత్యం సమన్వయమవుతాయి. నర్తకులకు అనుకూలంగా ఉండే లయాత్మక నిర్మాణంతో పాటు గాయకులు, వాద్యకారులు కచేరీలలో ప్రదర్శించగల సంగీత విలువను కూడా ఆయన తిల్లానాలు కలిగి ఉన్నాయి. బృందావని, గరుడధ్వని, కదనకుతూహలం వంటి రాగాల్లో ఆయన తిల్లానాలు ప్రసిద్ధి పొందాయి. ఆయన తిల్లానాలు నేటికీ కర్ణాటక సంగీత కచేరీలు, భరతనాట్యం ప్రదర్శనల్లో విస్తృతంగా వినిపించడం ఆయన స్వరకర్తగా సాధించిన స్థిరమైన ప్రభావానికి నిదర్శనం.

సంగీత త్రిమూర్తులు, స్వాతి తిరునాళ్, అన్నమాచార్య, భద్రాచల రామదాసు వంటి పూర్వ సంగీతకారుల రచనలకు కూడా బాలమురళీకృష్ణ ప్రత్యేక ప్రాచుర్యం కల్పించారు. ముఖ్యంగా భక్తి సాహిత్యంలోని అనేక కృతులను తన గానంతో ప్రజల్లోకి తీసుకెళ్లారు. సంప్రదాయాన్ని గౌరవించడం అంటే పాత కృతులను మాత్రమే పాడటం కాదని, వాటి భావాన్ని కొత్త తరానికి అర్థమయ్యే రీతిలో అందించడం కూడా సంప్రదాయ పరిరక్షణలో భాగమేనని ఆయన సంగీత జీవితం సూచిస్తుంది.

సినిమా రంగంతో ఆయనకు ఉన్న సంబంధం పరిమితమైనదే అయినప్పటికీ ఎంతో ప్రాధాన్యమైనది. ప్రధానంగా శాస్త్రీయ సంగీతానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన ఎంపిక చేసిన కొన్ని చిత్రాలకు సంగీతం అందించారు, కొన్ని చిత్రాలలో నేపథ్య గాయకుడిగా పాడారు, నటుడిగానూ కనిపించారు. 1967లో వచ్చిన తెలుగు చిత్రం భక్త ప్రహ్లాదలో నారదుని పాత్ర పోషించడం ఆయన నటుడిగా గుర్తుండిపోయే తొలి ప్రయత్నాలలో ఒకటి. తరువాత ఆయన కొన్ని తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలోనూ నటించారు.

1975లో కన్నడ చిత్రం హంసగీతే ఆయన సినీ సంగీత ప్రస్థానంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. ఆ చిత్రానికి సంగీతం అందించడమే కాకుండా ఆయన పాడిన గానానికి జాతీయ స్థాయిలో ఉత్తమ పురుష నేపథ్య గాయకుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. ఈ చిత్రం ద్వారా శాస్త్రీయ గాయకుడిగా ఆయన ప్రతిభ సినిమా సంగీతంలోనూ ఎంత ప్రభావవంతంగా ఉండగలదో దేశవ్యాప్తంగా తెలిసింది.

1980లలో ఆయన సినీ సంగీతకర్తగా కూడా తన ప్రతిభను చూపించారు. ఆదిశంకరాచార్య, మధ్వాచార్య వంటి ఆధ్యాత్మిక, తాత్త్విక నేపథ్యం కలిగిన చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు. ముఖ్యంగా 1986లో వచ్చిన మధ్వాచార్య చిత్రానికి ఆయన అందించిన సంగీతం జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఆయన చేసిన కృషి ఆయనకు మరో జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందించింది. సినిమా రంగంలో ఆయన ప్రస్థానం దీర్ఘకాలిక వాణిజ్య సంగీత ప్రయాణంగా కాకుండా తన శాస్త్రీయ సంగీత దృష్టికి అనుకూలమైన కొన్ని ప్రత్యేక ప్రాజెక్టులకు పరిమితమైన సృజనాత్మక విస్తరణగా చూడటం సముచితం.

గురువుగా బాలమురళీకృష్ణ చేసిన సేవ కూడా ఆయన వారసత్వంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఆయన వద్ద శిక్షణ పొందినవారిలో అజయ్ చక్రవర్తి, ప్రిన్స్ రామవర్మ, అరుణ సాయిరామ్ వంటి ప్రముఖ సంగీత కళాకారులు ఉన్నారు. కృష్ణకుమార్, బిన్నీ కృష్ణకుమార్, వి. రాజ్‌కుమార్ భారతి వంటి సంగీతకారులు కూడా ఆయన వద్ద శిక్షణ పొందారు. ఆయన బోధనలో కేవలం కృతులను నేర్పడం కాకుండా రాగభావం, స్వరప్రయోగం, సాహిత్య ఉచ్చారణ, లయ, సంగీత స్వాతంత్ర్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఉండేది.

ప్రిన్స్ రామవర్మ ఆయనకు అత్యంత సన్నిహితమైన శిష్యులలో ఒకరు. రామవర్మ స్వయంగా బాలమురళీకృష్ణతో తనకు ఉన్న గురుశిష్య సంబంధాన్ని అనేక సందర్భాలలో వివరించారు. ఆయన వద్ద దీర్ఘకాలం అభ్యసించడం ద్వారా కేవలం కృతులు మాత్రమే కాకుండా సంగీత దృష్టిని, విభిన్న భాషలలోని కృతులను, భిన్న సంప్రదాయాల సంగీతాన్ని అధ్యయనం చేసే పద్ధతిని కూడా స్వీకరించారు. అజయ్ చక్రవర్తి కూడా బాలమురళీకృష్ణ వద్ద సుదీర్ఘకాలం అభ్యసించారు. ఈ విధంగా బాలమురళీకృష్ణ శిష్య పరంపర కర్ణాటక సంగీతానికే పరిమితం కాకుండా హిందుస్తానీ సంగీత ప్రపంచంతోనూ అనుసంధానమైంది.

ఆయనకు లభించిన సత్కారాలు ఆయన కృషి విస్తృతిని ప్రతిబింబిస్తాయి. 1975లో సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు. 1978లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ప్రతిష్ఠాత్మకమైన సంగీత కళానిధి బిరుదుతో సత్కరించింది. 1991లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో ఆయనను గౌరవించింది. యునెస్కో మహాత్మా గాంధీ సిల్వర్ మెడల్, ఫ్రాన్స్ ప్రభుత్వం అందించిన షెవలియర్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ వంటి అంతర్జాతీయ గౌరవాలు కూడా ఆయనకు లభించాయి. 2001లో సంగీత నాటక అకాడమీ ఫెలోగా ఎన్నికయ్యారు.

వయస్సు పెరిగిన కొద్దీ ఆయన కచేరీల సంఖ్య తగ్గినా సంగీతంపై ఆసక్తి, కొత్త ఆలోచనలు, సృజనాత్మకత తగ్గలేదు. భారతదేశంలోనే కాకుండా విదేశాలలోనూ కచేరీలు నిర్వహిస్తూ, శిష్యులను తీర్చిదిద్దుతూ, తన కృతులను పాడుతూ, కొత్త తరాలకు కర్ణాటక సంగీతంలోని విస్తృత అవకాశాలను పరిచయం చేస్తూ కొనసాగారు. సంగీతం, వాద్యం, స్వరకల్పన, లయ, సాహిత్యం, బోధన వంటి అనేక రంగాలను ఒకేసారి స్పృశించిన ఆయన వ్యక్తిత్వం క్రమంగా ఒక సంగీత విశ్వంగా మారింది.

2016 నవంబర్ 22న చెన్నైలో బాలమురళీకృష్ణ కన్నుమూశారు. ఎనభై ఆరు సంవత్సరాల జీవితంలో దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఆయన సంగీత ప్రపంచంలో చురుకుగా కొనసాగారు. ఆయన మరణం కర్ణాటక సంగీతానికి ఒక మహత్తరమైన శకానికి ముగింపు పలికినట్లయింది. అయితే ఆయన స్వరాలు, కృతులు, తిల్లానాలు, కొత్త రాగాలు, శిష్య పరంపర, రికార్డింగులు, బోధనా సంప్రదాయం ద్వారా ఆయన సంగీత వారసత్వం నిరంతరం కొనసాగుతోంది.

బాలమురళీకృష్ణ జీవితాన్ని సమగ్రంగా పరిశీలిస్తే ఆయనను కేవలం ఒక గొప్ప గాయకుడిగా నిర్వచించడం సరిపోదు. ఆయన త్యాగరాజు సంగీత పరంపరలో పుట్టిన శాస్త్రీయ గాయకుడు మాత్రమే కాదు; ఆ పరంపరలోనే కొత్త సృజనకు మార్గం చూపిన వాగ్గేయకారుడు. ఆయనకు సంప్రదాయం ఒక గోడ కాదు, ఒక బలమైన పునాది. ఆ పునాదిపై నిలబడి కొత్త రాగాలను సృష్టించారు, 72 మేళకర్తలలో కృతులను రచించారు, తాళాలలో ప్రయోగాలు చేశారు, తిల్లానాలకు కొత్త సౌందర్యాన్ని ఇచ్చారు, అనేక భాషల్లో రచనలు చేశారు, వాద్య సంగీతాన్ని విస్తరించారు, శిష్యులను తీర్చిదిద్దారు. అందువల్ల మంగళంపల్లి బాలమురళీకృష్ణ భారతీయ సంగీత చరిత్రలో ఒక మహాగాయకుడిగా మాత్రమే కాకుండా, సంప్రదాయాన్ని గౌరవిస్తూ దాని సరిహద్దులను సృజనాత్మకంగా విస్తరించిన మహాస్వరకర్తగా చిరస్థాయిగా నిలిచారు. 


15, జులై 2026, బుధవారం

బెంగళూరు నాగరత్నమ్మ జీవిత విశేషాలు



బెంగళూరు నాగరత్నమ్మ భారతీయ కర్ణాటక సంగీత చరిత్రలో అపూర్వమైన స్థానం సంపాదించిన గాయని, సంస్కృత పండితురాలు, తెలుగు సాహిత్యాభిమాని, కళాపోషకురాలు మరియు సామాజిక చైతన్యవంతురాలు. త్యాగరాజ స్వామి సమాధిని పునరుద్ధరించి, నేటి ప్రపంచవ్యాప్తంగా జరిగే త్యాగరాజ ఆరాధనకు శాశ్వత రూపాన్ని కల్పించిన మహనీయురాలిగా ఆమె చిరస్మరణీయురాలు. సంగీతం, సాహిత్యం, భక్తి, దాతృత్వం, స్త్రీ సాధికారత వంటి అనేక రంగాలలో ఆమె చేసిన సేవలు భారతీయ సాంస్కృతిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

నాగరత్నమ్మ 1878 నవంబర్ 3న అప్పటి మైసూరు సంస్థానంలోని నంజనగూడులో జన్మించారు. ఆమె తల్లి పుట్టు లక్ష్మమ్మ దేవదాసీ సంప్రదాయానికి చెందిన ప్రసిద్ధ కళాకారిణి. తండ్రి వకీల్ సుబ్బారావుతో కుటుంబ జీవితం ఎక్కువకాలం కొనసాగకపోవడంతో, చిన్ననాటి నుంచే నాగరత్నమ్మ అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆమె విద్యాభ్యాసం ఆగలేదు. సంస్కృతం, తెలుగు, కన్నడ భాషలలో మంచి పాండిత్యం సంపాదించడమే కాక, సంగీతం, వీణ, వయోలిన్, నృత్యం, హరికథ వంటి కళల్లోనూ శిక్షణ పొందారు. త్యాగరాజ శిష్యపరంపరకు చెందిన సంగీత విద్వాంసుల వద్ద శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించి, గానంలో విశిష్ట ప్రతిభను కనబరిచారు.

పదిహేనేళ్ల వయస్సులోనే ప్రజల ముందర గాయనిగా, వయోలిన్ విద్వాంసురాలిగా, నర్తకిగా తన తొలి ప్రదర్శన ఇచ్చి విశేష ప్రశంసలు అందుకున్నారు. యవ్వనంలోనే బెంగళూరుకు వెళ్లి సంగీత కచేరీలు ప్రారంభించడంతో “బెంగళూరు నాగరత్నమ్మ” అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. తరువాత మద్రాసును తన కళా కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకుని దక్షిణ భారతదేశంలోని ప్రముఖ సంగీత విద్వాంసులలో ఒకరిగా ఎదిగారు. ఆమె గాత్ర మాధుర్యం, రాగాలాపన, సాహిత్యోచ్చారణ, భావవ్యక్తీకరణకు విశేషమైన ఆదరణ లభించింది. కన్నడ, తెలుగు, సంస్కృత భాషలలో సమాన ప్రావీణ్యంతో కచేరీలు నిర్వహించి, ముఖ్యంగా త్యాగరాజ కృతులను అత్యంత భావపూర్వకంగా ఆలపించే గాయనిగా గొప్ప పేరు సంపాదించారు. యదుకులకాంభోజి రాగంపై ఆమెకు అపారమైన అభిమానం ఉండేది. ఆ రాగంలో ఆమె ఆలపించిన “శ్రీ రామ జయరామ” వంటి కీర్తనలు శ్రోతలను పరవశింపజేసేవని సమకాలీన సంగీత విద్వాంసులు ప్రశంసించారు. హరికథా గానంలోనూ ఆమెకు విశేష నైపుణ్యం ఉండేది. వీణ, వయోలిన్, నృత్యం, అభినయంలో కూడా ఆమె సమాన ప్రతిభ కనబరిచారు. దక్షిణ భారతదేశంలోని అనేక పట్టణాలు, నగరాలలో వెయ్యికి పైగా సంగీత కచేరీలు నిర్వహించి, తన కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా కర్ణాటక సంగీత విద్వాంసులలో ఒకరిగా నిలిచారు. ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో గ్రామోఫోన్ కంపెనీ రికార్డు చేసిన తొలి దక్షిణ భారతీయ మహిళా గాయనులలో ఆమె ఒకరు. సంగీతం ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సంపాదించి, కళాకారిణిగా స్వీయ గౌరవంతో జీవించిన అరుదైన మహిళగా కూడా ఆమె గుర్తింపు పొందారు.

ఆమె సంగీత ప్రతిభ అనేక సంస్థానాధీశుల ఆదరణను పొందింది. మైసూరు రాజాస్థానంలో తన ప్రతిభను ప్రదర్శించి విశేష గౌరవం అందుకున్నారు. అనంతరం దక్షిణ భారతదేశంలోని పలు సంస్థానాల నుండి ఆహ్వానాలు అందుకుని రాజాస్థాన గాయనిగా సత్కారాలు పొందారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం సంస్థానం, బొబ్బిలి సంస్థానాల పాలకులు ఆమెను విశేషంగా ఆదరించి సంగీత కచేరీలకు ఆహ్వానించేవారు. అప్పట్లో ఈ సంస్థానాలు కర్ణాటక సంగీతానికి ప్రధాన కేంద్రాలుగా ప్రసిద్ధి చెందగా, నాగరత్నమ్మ అక్కడి సంగీత సభల్లో గానం చేసి విశేష కీర్తి సంపాదించారు. తిరువాంకూరు వంటి ఇతర దక్షిణ భారత రాజాస్థానాల నుండి కూడా ఆమెకు గౌరవం లభించింది. మైసూరు హైకోర్టు న్యాయమూర్తి నరహరి రావు ప్రోత్సాహంతో మద్రాసుకు వెళ్లిన ఆమె, అక్కడి సంగీత ప్రపంచంలో మరింత ఉన్నత స్థానాన్ని సంపాదించారు.

నాగరత్నమ్మకు తెలుగు సాహిత్యంపై అపారమైన మక్కువ ఉండేది. ముఖ్యంగా తంజావూరు ఆస్థాన కవయిత్రి ముద్దుపాళని రచించిన “రాధికా సాంత్వనము” అనే ప్రాచీన తెలుగు కావ్యాన్ని ఆమె శోధించి, మూలపాఠానికి దగ్గరగా సవరించి ముద్రింపజేశారు. అప్పటి సామాజిక పరిస్థితులలో ఈ గ్రంథం అసభ్యమని కొందరు విమర్శించగా, నాగరత్నమ్మ మాత్రం అది గొప్ప సాహిత్య సంపద అని సమర్థించారు. ఈ ప్రచురణపై తీవ్రమైన వివాదాలు చెలరేగాయి. బ్రిటిష్ ప్రభుత్వం పుస్తకాన్ని నిషేధించినప్పటికీ, సాహిత్య స్వేచ్ఛను కాపాడేందుకు ఆమె ధైర్యంగా పోరాటం చేశారు. తరువాత ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు వంటి ప్రముఖులు ఈ నిషేధాన్ని వ్యతిరేకించి సాహిత్య స్వేచ్ఛకు మద్దతు తెలిపారు. ఈ సంఘటన భారతీయ సాహిత్య చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించబడుతుంది.

ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మికి 19ఏళ్ల వయసున్నప్పుడు ఆమెను కలిసి తెలుగు భాషా ఉచ్చారణ దోషాలను సరిదిద్ది త్యాగరాజస్వామి కీర్తనల భావాన్ని వివరించింది. అదే నాగరత్నమ్మ ఎమ్మెస్ సుబ్బులక్ష్మి తిరువాయూరు వచ్చి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలలో కచేరీ చేసినప్పుడు "సుబ్బలక్ష్మీ! ఇప్పుడు నీ పాటలో ఉచ్చారణ దోషాలు లేవు. సరిగ్గా పాడావు, అంతా బాగా పాడవు" అని చెప్పింది. ఆ ఆరాధనోత్సవాలలో సుబ్బులక్ష్మి కచేరీకి మిగిలిన వారి కన్నా ఎక్కువ టికేట్లు అమ్ముడు పోయాయి. నాగరత్నమ్మ పుణ్యమా అని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గాత్రంలో మిగిలిన తమిళ కళాకారుల కన్నా తెలుగు భాషా దోషాలు తక్కువే ఉంటాయి.

నాగరత్నమ్మ జీవితంలో అత్యంత గొప్ప అధ్యాయం తిరువయ్యారులోని శ్రీ త్యాగరాజ స్వామి సమాధితో ముడిపడి ఉంది. ఒక సందర్భంలో త్యాగరాజ స్వామి సమాధి నిర్లక్ష్య స్థితిలో ఉందని తెలుసుకుని ఆమె తీవ్రంగా కలత చెందారు. త్యాగరాజ మహర్షి పట్ల అపారమైన భక్తితో తన సంపాదనలో పెద్ద భాగాన్ని ఖర్చు చేసి సమాధిపై గౌరవప్రదమైన మందిరాన్ని నిర్మింపజేశారు. ఈ సేవను ఆమె జీవిత ధ్యేయంగా భావించారు. తరువాత ప్రతి సంవత్సరం త్యాగరాజ ఆరాధనను సక్రమంగా నిర్వహించేందుకు విశేష కృషి చేశారు. అప్పటివరకు వేర్వేరు వర్గాల ఆధ్వర్యంలో విడివిడిగా జరుగుతున్న ఆరాధనలను ఒకే వేదికపై నిర్వహించే దిశగా ఆమె చేసిన కృషి క్రమంగా ఫలించింది. నేడు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది సంగీత విద్వాంసులు కలిసి పంచరత్న కీర్తనలను ఆలపించే త్యాగరాజ ఆరాధనకు ఆమె వేసిన పునాదులే కారణమని సంగీత చరిత్రకారులు పేర్కొంటారు.

ఆ కాలంలో మహిళలకు త్యాగరాజ ఆరాధనలో గానం చేసే అవకాశం కల్పించడాన్ని కొందరు వ్యతిరేకించారు. నాగరత్నమ్మ మాత్రం మహిళా సంగీత విద్వాంసులకు కూడా సమాన హక్కులు ఉండాలని పట్టుదలగా వాదించారు. మొదట్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైనా, ఆమె పట్టుదల వల్ల తరువాత మహిళలు కూడా ఆరాధనలో భాగస్వాములయ్యారు. అందువల్ల ఆమెను భారతీయ సంగీత రంగంలో స్త్రీ సాధికారతకు మార్గదర్శకురాలిగా కూడా గౌరవిస్తారు.

నాగరత్నమ్మకు త్యాగరాజ శిష్యపరంపరకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులతో సన్నిహిత పరిచయాలు ఉండేవి. ముఖ్యంగా ఉమయాళపురం కృష్ణ భాగవతార్ వంటి త్యాగరాజ ప్రత్యక్ష శిష్యుల ద్వారా ఆమె త్యాగరాజ మహర్షి జీవితం, సంగీత సంప్రదాయం, ఆరాధన విధానాల గురించి విశ్వసనీయ సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ అనుభవాలే త్యాగరాజ సమాధి పరిరక్షణకు ఆమెను ప్రేరేపించాయి. అలాగే తిరువయ్యారు సంగీత సంప్రదాయానికి చెందిన అనేక మంది భాగవతులు, పండితులు ఆమె ప్రయత్నాలకు సహకరించారు. సంగీత ప్రపంచంలో ఆమెకు లభించిన గౌరవం కారణంగా దేశం నలుమూలల నుండి ప్రముఖ విద్వాంసులు తిరువయ్యారు ఆరాధనలో పాల్గొనే సంప్రదాయం క్రమంగా బలపడింది.

సాహిత్యరంగంలో ఆమెకు అనేక మంది పండితులతో పరిచయాలు ఉండేవి. ముఖ్యంగా “రాధికా సాంత్వనము” ప్రచురణ సందర్భంగా సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం వంటి ప్రముఖులతో భావపరమైన విభేదాలు వెలుగుచూశాయి. అయితే అవి వ్యక్తిగత విభేదాలు కాక, సాహిత్య దృక్పథాలకు సంబంధించినవే. నాగరత్నమ్మ ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పగా, సమకాలీన సంస్కరణవాదులు వేరే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ చర్చలు తెలుగు సాహిత్య చరిత్రలో విశేష ప్రాధాన్యం పొందాయి.

నాగరత్నమ్మ గొప్ప దాత కూడా. సంగీత విద్వాంసులను ప్రోత్సహించడం, పండితులకు ఆర్థిక సహాయం చేయడం, గ్రంథాల ప్రచురణకు సహకరించడం, ధార్మిక కార్యక్రమాలకు విరాళాలు అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆమెకు సంగీతం కేవలం వృత్తి కాదు; అది భగవంతుని ఆరాధన. తాను సంపాదించిన సంపదలో గణనీయమైన భాగాన్ని త్యాగరాజస్వామి సేవకే అంకితం చేశారు. వ్యక్తిగత సౌఖ్యాల కంటే కళా సంరక్షణ, గురుభక్తి, ధార్మిక సేవలకే ఆమె అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

జీవిత చరమాంకంలో తిరువయ్యారులోనే ఎక్కువకాలం గడుపుతూ త్యాగరాజ ఆరాధన నిర్వహణలో పూర్తిగా నిమగ్నమయ్యారు. 1952 మే 19న ఆమె పరమపదించారు. ఆమె కోరిక మేరకు త్యాగరాజస్వామి సమాధికి సమీపంలోనే ఆమెకు సమాధి నిర్మించబడింది. గురుభక్తికి ఇది అపూర్వమైన చిహ్నంగా నేటికీ నిలిచివుంది. ప్రతి సంవత్సరం త్యాగరాజ ఆరాధన సందర్భంగా వేలాది మంది సంగీత విద్వాంసులు త్యాగరాజ స్వామితో పాటు నాగరత్నమ్మకు కూడా నివాళులర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

బెంగళూరు నాగరత్నమ్మ వారసత్వం బహుముఖమైనది. ఆమె ఒక అసాధారణ గాయనిగా, తెలుగు సాహిత్య పరిరక్షకురాలిగా, స్త్రీ సాధికారతకు ప్రతీకగా, కళాపోషకురాలిగా భారతీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. నేటి తిరువయ్యారులో జరిగే త్యాగరాజ ఆరాధన ప్రపంచ కర్ణాటక సంగీతానికి ప్రతీకగా నిలవడానికి, మహిళా సంగీత విద్వాంసులకు సమాన గౌరవం లభించడానికి, త్యాగరాజస్వామి స్మృతి శాశ్వతంగా నిలవడానికి బెంగళూరు నాగరత్నమ్మ చేసిన త్యాగం, దూరదృష్టి, అంకితభావం ప్రధాన కారణాలుగా చరిత్ర ఆమెను స్మరిస్తోంది.

11, జులై 2026, శనివారం

కర్నాటక సంగీతం - సంగీతత్రయ సాహిత్యంలోని ప్రత్యేకత


భారతదేశంలో ఉన్న శాస్త్రీయ సంగీతంలో ప్రధానంగా రెండు రకాలు, హిందూస్తానీ శాస్త్రీయ, కర్నాటక శాస్త్రీయ సంగీతం. రెండిటిలోనూ కర్నాటక సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. శాస్త్రం (ఆంగ్లంలో సైన్స్), భావం కలిపి మేళవించే సంగీత సమ్మేళనం మరింత ఉన్నతంగా ఉంటుంది. 

దీనికి ప్రధాన కారణం సంగీతత్రయమైన త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రుల వారి సాహిత్యంలోని ఔన్నత్యం. ఇవి వ్యక్తిపూజను పూర్తిగా వర్జించి మన ధర్మంలోని దేవతామూర్తుల వైభవాన్ని కళ్లకు కట్టినట్లు ఛందోబద్ధంగా వర్ణించి, సముచితమైన రాగంలో స్వరపరచబడటం వల్ల శాస్త్రం, ధర్మం ఏకమై దివ్యమైన సంగీతంగా కర్నాటక శాస్త్రీయ సంగీతం పరిణమించింది, కాలపరీక్షను తట్టుకుని దృఢంగా నిలిచింది. సంగీతత్రయానికి పూర్వం వారి స్థాయిలో సాహిత్యానికి విలువనిచ్చిన అన్నమాచార్యుల వారు, పురందరదాసుల వారు ఈ త్రయం కన్నా దాదాపు 250 ఏళ్లు ముందు జీవించిన వారు. అనగా ఒక 10 తరాల పాటు సమాజంలో అనేక రకాల మార్పులు వచ్చాయి. వాటిలో ముస్లిం పాలకులు, తెల్లవారి పాలన ప్రధానమైనవి. కాబట్టే శాస్త్రీయ సంగీతం ధర్మంతో నిరంతరం మేళవించబడి పరిఢవిల్లటానికి అప్పటి పరిస్థితులు అనుకూలంగా లేవు. రామదాసు గారు చాలా సంకీర్తనలు రాసినా, ఆయన శాస్త్రీయత కన్నా భజన సాంప్రదాయానికి ప్రాధాన్యతనిచ్చారు అని చెప్పుకోవచ్చు. 

అందుకే, కర్నాటక శాస్త్రీయ సంగీతానికి ప్రధానమైన వృద్ధియుగం సంగీతత్రయం ఉన్న కాలమే అని చెప్పుకోవచ్చు. వీరు వచ్చాకే భావానికి పెద్దపీట వేసి శాస్త్రీయత మేళవించి అద్భుతమైన సాహిత్య సంగీత సుగంధాలు అలదబడ్డాయి. త్యాగరాజస్వామి నిధి చాలా సుఖమా, జగదానందకారకా, దీక్షితులవారి రంగపుర విహార, వాతాపి గణపతిం భజే, శ్యామశాస్త్రుల వారి హిమాచలతనయ వంటి వేల కృతులు శాస్త్రీయ సంగీతాన్ని ఉపాసనాపూర్వకంగా పొందిన ఆధ్యాత్మికశక్తితో వెలువడిన సాహిత్యంతో జతపరచినవి. క్షేత్రాలు, దేవతామూర్తులు, నిత్యోపాసన వీరు మనకు అందించిన అద్భుతమైన వారసత్వంలో మూలస్తంభాలు. వర్ణన అన్నది అనుభూతి చెందితేనే సఫలమవుతుంది. ఆ అనుభూతి ఉపాసనతోనే సాధ్యం. త్యాగరాజస్వామి రాముణ్ణి నిరంతరం ఉపాసన చేస్తే దీక్షితుల వారు శ్రీవిద్యోపాసనలో తపోసంపన్నులై నిలిచారు, శ్యామశాస్త్రుల వారు బంగారు కామాక్షి అమ్మను ఒక బిడ్డలా నిత్యం కొలిచారు. కాబట్టే వారి సాహిత్యం మిగిలిన వారి కన్నా మిన్నగా నిలిచిపోయాయి. 

అంతే కాదు, సమకాలీన రాచరికాలు, సంస్థానాలు సంగీతత్రయ సాహిత్యానికి తగిన ప్రోత్సాహాన్నిచ్చాయి. త్యాగరాజస్వామి రాచరికాన్ని పూర్తిగా వర్జించినా వారి సాహిత్యాన్ని అప్పటి,  తరువాతి రాచరికాలు ముందుకు తీసుకు వెళ్లాయి. అందుకే ఆయన శిష్య పరంపర సాహిత్యాన్ని కాపాడగలిగింది. 

ముగ్గురిలో దీక్షితుల వారు దేశాటన ఎక్కువగా చేసి మరింత విస్తారమైన సాహిత్యాన్ని రచించారని చెప్పుకోవచ్చు. త్యాగరాజస్వామి కూడా తాను నివసించిన తిరువయ్యారుకు 500 కిలోమీటర్ల పరిధిలో పర్యటించారు. శ్యామశాస్త్రి గారు బంగారు కామాక్షి దేవాలయంలోని విధుల వలన వీరిద్దరి కన్నా కాస్త తక్కువగా పర్యటించారు. అయితే, ముగ్గురూ కూడా ఉపాసనలో సిద్ధి పొందే రససిద్ధిని కూడా సాధించారు. 

నిజం చెప్పాలంటే, వారి జీవితాలలో ఆధ్యాత్మిక సాధనల వల్లనే వారి సాహిత్యాలు శాశ్వత స్థానాన్ని పొందాయి. శాస్త్రీయ సంగీతం అటువంటి ఉన్నతమైన సాహిత్యానికి చక్కని అలంకరణగా, ఒక సముచితమైన వేదికగా, ఆ దైవిక శక్తితో వేగంగా అనుసంధానం చేసే స్వరారోహణంగా నిలుస్తుంది. అందుకే సాహిత్యాన్ని రమించి సంగీతంలో మేళవించే కళాకారులు చరిత్రలో నిలిచిపోతారు. కేవలం శాస్త్రీయతకే ప్రాధాన్యతనిచ్చి భావం యొక్క విరాట్స్వరూపాన్ని అవగతం చేసుకోలేని వారు కనుమరుగవుతారు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఈ రహస్యాన్ని చక్కగా ఆకళింపు చేసుకుని నిరంతరం పాటించారు కాబట్టే భారతరత్న అయ్యారు. అలాగే మరెందరో గొప్పకళాకారులు. ఈ మేళవింపును గ్రహించని ఎందరో విద్వాంసులు సంగీతసాధన ద్వారా పరమపదసోపానాన్ని అధిరోహించలేకపోయారు.  

కర్నాటక శాస్త్రీయ సంగీత రాగాలలోని స్వరాలతో చేసే గమకాలు అందాన్ని, సొగసును ఇస్తే, భావం వాటి మీద లయవిన్యాసం చేసి సార్థకతను పొందింది. భావరాగతాళ సమన్వితమైనది కాబట్టే సంగీతత్రయ సంపద దివ్యత్వాన్ని పొందగలిగింది. 

10, జులై 2026, శుక్రవారం

పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ - జూనియర్ త్యాగరాజస్వామి



పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ - అసలు పేరు భరతం సుబ్రహ్మణ్య అయ్యర్. వీరు త్యాగరాజస్వామి వారి శిష్యులైన మానాంబుచావడి వేంకటసుబ్బయ్యర్ గారి శిష్యులు.

తిరువయ్యారులో 1845వ సంవత్సరంలో జన్మించిన వీరి తండ్రి భరతం వైద్యనాథ అయ్యర్. తాత పంచనదశాస్త్రి గారు తంజావూరు శరభోజి మహారాజు వారి ఆస్థానంలో విద్వాంసులు. సుబ్రహ్మణ్య అయ్యర్ గారు మేనమామ మేలత్తూరు గణపతిశాస్త్రి గారి వద్ద సంగీతం నేచుకుని తరువాత మానాంబుచావడి వారి వద్ద శిష్యరికం చేశారు. త్యాగరాజస్వామి వారి కృతులను నేర్చుకోవటం కోసం తెలుగు భాషను క్షుణ్ణంగా అధ్యయనం చేసి నూరుకు పైగా సంస్కృత, తెలుగు కృతులను, వర్ణాలను, జావళీలను, తిల్లానాలను రచించారు. ఆయన ముద్ర వేంకటేశ. బేగడ రాగాన్ని విస్తరించి పాడటంలో ఆయన నైపుణ్యం అమోఘం. అందుకే ఆయనకు బేగడ సుబ్రహ్మణ్య అయ్యర్ అని పేరు కూడా వచ్చింది. ఒకసారి మైసూరు మహారాజ వారి ఆస్థానంలో ఈ రాగాన్ని ఆయన మూడు రోజుల పాటు ఆలపించారు. మొదటి రాగాలాపన, రెండవరోజు తానం, మూడవరోజు రామనమమే జీవనము ఓ మనసా అన్న కృతి పల్లవి, స్వరకల్పనలు. ఈ అద్భుతమైన కళానైపుణ్యానికి మహారాజవారు ఆయనకు స్వర్ణకంకణాలను బహుకరించారు. అలాగే ఆయనకు విజయనగరం, ట్రావెంకోర్ ఆస్థానలలో మన్ననలను పొందారు. ఆయన లయజ్ఞానం అసమానమైనది. కదనకుతూహలం రాగంలో ఆయన రచించిన రఘువంశసుధాంబుధిచంద్ర అన్న కృతి జగద్విఖ్యాతమయ్యింది.

ఆయన గొప్ప గురువు కూడా. మైసూరు వాసుదేవాచార్యుల వారు, టైగర్ వరదాచార్యుల వారు మొదలైన ప్రఖ్యాత విద్వాంసులెందరో ఆయన శిష్యులు. మైసూరు వాసుదేవాచార్య తన స్మృతుల్లో గురువు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గురించి ఎంతో గౌరవంగా రాశారు. గురుకులంలో చేరిన వెంటనే కొత్త కృతులు నేర్పకుండా, మూడు నెలల పాటు కేవలం బేగడ రాగంలోని ఒకే వర్ణాన్ని  పాడిస్తూ సాధన చేయించారని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా ఒక రాగంలోని ప్రతి సూక్ష్మభావాన్ని పూర్తిగా గ్రహించిన తరువాతే తదుపరి పాఠానికి వెళ్లాలనే ఆయన బోధనా తత్వం తెలుస్తుంది. వాసుదేవాచార్య తరువాత కాలంలో భారతదేశంలోని మహానుభావ సంగీతకారులలో ఒకరిగా ఎదగడంలో ఈ శిక్షణ కీలక పాత్ర పోషించింది.సేలం మీనాక్షి గారి కుమార్తెలైన పాప, రాధలకు శిక్షణ కోసం ఆయన చెన్నై(చెన్నపట్టణం) వచ్చి అక్కడే స్థిరపడ్డారు. అందుకు ఆయనకు పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు అన్న పేరు స్థిరమయ్యింది. త్యాగరాజస్వామి ప్రభావంతోనే ఆయన కృతులను సద్గురువుల శైలిలో రచించి జూనియర్ త్యాగరాజ అన్న పేరు తెచ్చుకున్నారు. 1902వ సంవత్సరంలో ఆయన పరమపదించారు. 

3, జులై 2026, శుక్రవారం

సరససామదానభేదదండ చతుర - త్యాగరాజస్వామి కృతి

 


సరససామదానభేదదండ చతుర సాటి దైవమెవరే బ్రోవవే

పరమ శాంభవాగ్రేసరుండగుచు పల్కు రావణుండు తెలియలేకపోయె

హితవు మాటలెంతో బాగ బల్కితివి సతముగానయోధ్యనిచ్చేనంటివి
నత సహోదరుని రాజు చేసి రాక హతము చేసితివి త్యాగరాజనుత

ఓ శ్రీరామా! సందర్భోచితంగా సామదానభేదదండోపాయములలో నిపుణుడవైన నీ సాటి దైవమెవరు, నన్ను బ్రోవుము! శివభక్తులలో అగ్రగణ్యుడనని గొప్పలు చెప్పుకునే రావణుడు నీ మహత్తును తెలుసుకోలేకపోయాడు. యుద్ధ సమయములో హితవైన మాటలను ఎంతో బాగా పలికినావు, తప్పును తెలుసుకుని శరణు కోరినచో శాశ్వతముగా అయోధ్యను కూడా ఇచ్చెదననినావు, దుష్టుడైన రావణుని వీడి నీ శరణు కోరిన అతని సోదరుడు విభీషణుని రాజు చేసినావు, దండోపాయముతో రావణుని హతము చేసినావు, పరమశివునిచే నుతించబడే ఓ శ్రీరామా! నన్ను బ్రోవుము. 

- త్యాగరాజస్వామి

శ్రీరామచంద్రుని గుణవైభవాలను మనోజ్ఞంగా ఆవిష్కరించే ఈ కృతిని సద్గురువులు కాపీనారాయణి రాగంలో స్వరపరచారు. ఈ కృతిని రంజని-గాయత్రి సోదరీమణులు అద్భుతంగా ఆలపించారు. 

 https://www.youtube.com/watch?v=ZSsiWR4W5wA 

29, మే 2026, శుక్రవారం

కొలువై యున్నాడే కోదండపాణి - సద్గురువులు త్యాగరాజస్వామి


 

కొలువై యున్నాడే కోదండపాణి

సలలితమతులై సారెకు శీలులై
వలచుచు కోరివచ్చి సేవింపఁగ

జనకజభరతాదులతో మంచి నైవేద్యంబుల
చనువున వేడుక నారగించి మెఱపుకోట్ల గేరు
కనకపటము సొమ్ములను ధరించి వేదోక్తమైన
సనకవచనములచే తోషించి శ్రితుల పోషించి

వరమగు వాసనలు పరిమళింప సన్నిధిలో వెలుఁగుచు
సురవారసతులు బాగ నటింప అదిగాక పరా-
శరనారదమునులెల్ల నుతింప ఎంతెంతో నెనరున
సురపతి వాగీశులు సేవింప మేను పులకింప

ఉడు రాజముఖుఁడు శేషశయ్యపైని చెలంగగ గని
పుడమి కుమారి సుగంధము పూయ నమ్మినవారలకే
కడగంటిని కోరిన వరమీయ త్యాగరాజు నెనరున
అడుగడుగుకు మడువులనందీయ శ్రీరామయ్య 

శ్రీరామచంద్రుడు కరతలంలో కోదండధనుస్సును ధరించి, తన దివ్య రాజసభలో మహోన్నత వైభవంతో విరాజిల్లుచున్నాడు. సౌమ్యస్వభావులైన, సద్గుణసంపన్నులైన భక్తులు ప్రేమభక్తి పరవశులై ఆయనకు సేవలందించుచున్నారు.

ప్రియభార్య సీతాదేవి, ప్రియభ్రాత భరతుడు సమర్పించిన సుస్వాదుభోజ్య నైవేద్యములను ఆయన సంతోషపూర్వకముగా స్వీకరించుచున్నాడు. కోటి విద్యుత్పుంజముల కాంతిని తలపించు తేజస్సుతో ప్రకాశించుచున్నాడు. స్వర్ణమయ దివ్యాంబరములను ధరించి శోభాయమానుడై యున్నాడు. సనకమహర్షి మధురస్వరములతో పారాయణం చేయు వేదఘోషలను ఆనందముతో ఆలకించుచున్నాడు. శరణాగతులను సదా రక్షించువాడై వెలుగొందుచున్నాడు.

సుగంధ పరిమళములతో నిండిన దివ్యవాతావరణమునందు ఆయన ప్రకాశించుచుండగా, అప్సరసలు మనోహరరీతిగా నృత్యములు చేయుచున్నారు. పరాశరుడు, నారదుడు తదితర మహర్షులు ఆయన మహిమను కీర్తించుచున్నారు. ఇంద్రుడు, బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతలు కృతజ్ఞతా ప్రీతులతో శ్రీరామసేవలో నిమగ్నులై యున్నారు.

చంద్రబింబసదృశ సుందరాననుడైన శ్రీరాముడు ఆదిశేషుని దివ్య శయ్యపై విశ్రాంతి పొందుచున్నాడు. భూదేవి తనయయైన సీతాదేవి సుగంధ చందనమును ఆయన దివ్యాంగములపై లేపనముగా అర్పించుచున్నది. కేవలము తన కటాక్షవీక్షణమాత్రముచేతనే భక్తులకు వరప్రసాదములను అనుగ్రహించుచున్నాడు.భక్తశిఖామణియైన శ్రీత్యాగరాజస్వామి పరమభక్తిపూర్వకముగా తాంబూలసేవను సమర్పించుచు, శ్రీరామచంద్రుని అనుగ్రహమును యాచించుచున్నాడు.

- సద్గురువులు త్యాగరాజస్వామి 

దేవగాంధారి రాగంలో స్వరపరచిన ఈ కృతిని హైదరాబాద్ సోదరులు ఆలపించారు


8, ఫిబ్రవరి 2026, ఆదివారం

త్యాగరాజ హృదయం


 

త్యాగయ్య మామూలు మానవునిలా దుర్భర మరణం పొందలేదు, 10 రోజుల ముందే భద్రాద్రి రాముని గాంచి, గిరిపై నెలకొన్న అనే కృతి ద్వారా ఆ సాక్షాత్కారానికి శాశ్వతత్వాన్ని ఆపాదించి, ఆ స్వామి సూచనను గ్రహించి తన మరణ ఏర్పాట్లను చేసుకున్నాడు, శిష్యులందరూ చూస్తుండగా స్వేచ్ఛగా ఆత్మ దేహాన్ని వీడేంత ఆధ్యాత్మిక శక్తిని సంపాదించుకున్నాడు. అందుకే 250 ఏళ్లు గడిచినా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. మరో 1000 ఏళ్లు గడిచినా ముందు తరాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. త్యాగరాజ హృదయాన్ని ఆయన శిష్యులు ఎందరో అక్షర రూపంలో ఆవిష్కరించారు. త్యాగయ్య ఆఖరి రోజుల స్థితికి కేశవ్ గారి చిత్రం చూడండి. 

పులకాంకితుడై యానందాశ్రువుల నింపుచు మాటలాడవలెనని
కలువరించ గని పది పూటల పై గాచెదనను త్యాగరాజ వినుతుని

గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక గంటి భద్రగిరిపై నెలకొన్న!

ఎక్కడో తంజావూరు దగ్గర ఉన్న త్యాగరాజస్వామికి భక్త రామదాసు, ఆయన కొలిచిన భద్రాద్రి రాముని గురి ఎలా తెలిసి, కృతిలో వర్ణించగలిగారు? అదే కదా, భారతీయ ఆధ్యాత్మికతలోని గొప్పతనం. ఏ ప్రచార సాధనం లేని రోజుల్లో దివ్యదృష్టి ద్వారా, నోటి మాట ద్వారా పుంఖానుపుంఖాల విషయాలు, గ్రంథాలు దేశమంతా సద్గురువుల ద్వారా, సత్పురుషుల ద్వారా చాటబడేవి. 

గమనిక: భద్రాద్రి రాముడు రామదాసునే కాదు, ఆ తరువాత కాలంలో వచ్చిన త్యాగయ్యను కూడా బ్రోచాడన్నదానికి ఈ కృతి నిదర్శనం.  

7, ఫిబ్రవరి 2026, శనివారం

శ్రీ టీకే గోవిందరావు జీవిత విశేషాలు



కర్ణాటక సంగీత ప్రపంచంలో భావప్రధాన గానానికి ప్రతీకగా నిలిచిన మహావిద్వాంసుడు శ్రీ త్రిపుణితుర కృష్ణారావు గోవిందరావు గారు. గాయకుడిగా మాత్రమే కాకుండా, సంగీత శాస్త్రవేత్తగా, గురువుగా, రచయితగా ఆయన చేసిన సేవలు అపారం. ఆయన జీవితం మొత్తం కర్ణాటక సంగీతానికి అంకితం అయింది అని చెప్పవచ్చు.

జననం – కుటుంబ నేపథ్యం:

టీకే గోవిందరావు గారు 1929 ఏప్రిల్ 21న కేరళ రాష్ట్రంలోని త్రిపుణితురలో తంకమ్మాళ్, కృష్ణారావు దంపతులకు జన్మించారు. సంగీతం, సంస్కృతి పరంగా సంపన్నమైన కుటుంబంలో ఆయన పెరిగారు. చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి చూపిన ఆయనకు కుటుంబమే తొలి ప్రేరణగా నిలిచింది.

తొలి అభ్యాసం - గురు పరంపర:

ప్రారంభంలో చెంబై వైద్యనాథ భాగవతర్ గారి ప్రభావం ఉన్నా, ఆయన జీవితాన్ని పూర్తిగా మలిచిన గురువు ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్. 15 ఏళ్ల పాటు ఆయన వద్ద గురుకుల సాంప్రదాయంలో ముసిరి వారి వద్ద విద్యనభ్యసించి భావప్రాధాన్యమైన గాత్ర ధర్మాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నారు. 1949లో శ్రీ టి.కె. గోవిందరావు గారు మద్రాసులోని సెంట్రల్ కాలేజ్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్‌లో చేరారు. అక్కడ సంగీత కళానిధి తిరుప్పాంపురం స్వామినాథ పిళ్లై గారు మరియు శ్రీమతి టీ బృంద వంటి మహానుభావుల మార్గదర్శకత్వంలో సంగీత విద్వాన్ పట్టాను పొందారు. 

ముసిరి బాణి అంటే – పదాల అర్థానికి అత్యంత ప్రాధాన్యం, భావాన్ని స్పష్టంగా వ్యక్తపరచే గానం, అతి అలంకారాలు లేకుండా హృదయాన్ని తాకే శైలి.ఈ లక్షణాలన్నీ టి.కె. గోవిందరావు గారి గానంలో స్పష్టంగా కనిపిస్తాయి.

గాయకుడిగా ప్రత్యేకత:

టీకే గోవిందరావు గారి గానంలో శ్రోతలను ఆకట్టుకునే ముఖ్య లక్షణం భావం.స్వరాలు కేవలం శబ్దాలుగా కాకుండా, భావాన్ని మోసుకొచ్చే వాహకాలు అని ఆయన నమ్మకం. అందుకే ఆయన కృతులను పాడేటప్పుడు సాహిత్య ఉచ్చారణ, పదార్థ భావం, భక్తి రసం సమపాళ్లలో ఉంటాయి. అత్యంత క్లిష్టమైన రాగాలకూ ఆయన గానం సరళంగా, హృద్యంగా ఉంటుంది.

ఆకాశవాణి మరియు ఇతర సంస్థల ద్వారా సేవ:

గాయకుడిగా మాత్రమే కాకుండా, ఆకాశవాణిలో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహించడం ద్వారా కూడా ఆయన కర్ణాటక సంగీతానికి సేవ చేశారు. ఆకాశవాణిలో చీఫ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తూ, నాణ్యమైన సంగీత కార్యక్రమాలు, యువ కళాకారులకు అవకాశాలు, సంప్రదాయ సంగీత పరిరక్షణ వంటి అంశాలకు ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. 

యాభై ఏళ్లకు పైగా సాగిన ఆయన సంగీత జీవితంలో, తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలలో అధ్యాపకుడిగా, ఆకాశవాణి చెన్నైలో సంగీత నిర్మాతగా, చివరికి న్యూఢిల్లీ ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో చీఫ్ ప్రొడ్యూసర్ (మ్యూజిక్)గా సేవలందించారు. అదేవిధంగా మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సలహా కమిటీ సభ్యుడిగా, కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఐసీసీఆర్ మరియు బనారస్, ఢిల్లీ, మద్రాస్, అన్నామలై, బెంగళూరు, తెలుగు విశ్వవిద్యాలయాలలో వివిధ హోదాల్లో పనిచేశారు.

గురువుగా, రచయితగా, పరిశోధకుడిగా:

గోవిందరావు గారు ఒక గొప్ప సంగీత పండితుడు. త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామ శాస్త్రి వంటి మహానుభావుల కృతులపై లోతైన అధ్యయనం చేసి, సరైన సాహిత్య, భావార్థం స్వర నిర్మాణం వివరించే విధంగా అనేక పుస్తకాలు రచించారు రచించారు. ప్రత్యేకంగా త్యాగరాజ స్వామి కృతులపై ఆయన చేసిన కృషి పరిశోధకులకు ఎంతో ఉపయోగపడింది.

ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ, ఆయన తన అసలైన లక్ష్యమైన గాయకుడిగా మరియు గురువుగా సేవ చేయడాన్ని ఎప్పుడూ వదలలేదు. భారతదేశమంతటా మాత్రమే కాకుండా శ్రీలంక, సింగపూర్, మలేషియా, యుకె, అమెరికా, కెనడా, మస్కట్ వంటి దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చి, వందలాది మంది శిష్యులను తీర్చిదిద్దారు. గురువుగా ఆయన కఠినమైన నియమాలు పాటించినా, శిష్యులపై అపారమైన ప్రేమ చూపేవారు.సంగీతాన్ని వృత్తిగా కాకుండా, ఒక సాధనగా, ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా చూడమని శిష్యులకు బోధించేవారు. ఆయన శిష్యులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కర్ణాటక సంగీతాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఇదే ఆయనకు నిజమైన గౌరవం.

కర్ణాటక సంగీతంలోని మౌఖిక సంప్రదాయాన్ని పరిరక్షించడానికి మరియు ప్రచారం చేయడానికి ఆయన గానమందిర్ ట్రస్ట్ స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా సంగీత గ్రంథాల ప్రచురణ, ఆడియో–వీడియో రికార్డింగులు, సంగీత సదస్సులు, వర్క్‌షాపులు నిర్వహించారు.

కర్ణాటక సంగీత త్రిమూర్తులు మరియు మహారాజ స్వాతి తిరునాళ్ కృతులన్నింటినీ ప్రామాణికంగా సేకరించి, రోమన్ మరియు దేవనాగరి లిపుల్లో, అర్థాలతో మరియు స్వర నోటేషన్‌తో ప్రచురించడం ఆయన చేసిన మహత్తర సేవ. నవరాత్రి మండపంలో ఆయన చేసిన గానం ప్రసిద్ధి చెందింది. అరుదైన స్వాతి తిరునాళ్ కృతులు ఆయన గానంలో ప్రత్యేక స్థానాన్ని పొందాయి.

పురస్కారాలు – గౌరవాలు:

తన జీవితాంతం చేసిన సేవలకు గాను ఆయనకు అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. సంగీత కళానిధి, సంగీత చుడామణి, సంగీత శాస్త్ర రత్నాకర, సంగీత ఆచార్య, గాయక శిఖామణి వంటి అనేక బిరుదులతో పాటు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. శ్రీ కాంచీ కామకోటి పీఠం నుండి ఆస్థాన విద్వాన్ గౌరవం కూడా పొందారు.

వారసత్వం:

టీకే గోవిందరావు గారు 2011 సెప్టెంబర్ 18న పరమపదించారు. కానీ ఆయన గానం, రచనలు, శిష్య పరంపర ఆయనను నిత్యజీవిగా నిలిపాయి. బొంబాయి సోదరీమణులు లలిత-సరోజ, టీకే రామచంద్రన్, కల్పకం రామన్ వంటి ఎందరో శిష్యులు ఆయన పరంపరను కొనసాగిస్తున్నారు. కర్ణాటక సంగీతంలో భావానికి ఉన్న విలువను కొత్త తరాలకు గుర్తుచేసిన మహానుభావుడు ఆయన.

ముగింపు:

టీకే గోవిందరావు గారు కేవలం ఒక గాయకుడు కాదు. ఆయన ఒక ఆదర్శ గురువు, లోతైన భావజాలం కలిగిన పండితుడు, ఒక అద్భుతమైన సాంప్రదాయానికి పరిరక్షకులు. కర్ణాటక సంగీతం శ్రోతల హృదయాల్లో జీవించాలి అన్నదే ఆయన జీవిత లక్ష్యం. అటువంటి మహానుభావుని సేవలు ఎప్పటికీ మరువలేనివి. 

11, జనవరి 2026, ఆదివారం

తెర తీయగ రాదా - త్యాగరాజస్వామి కృతి



త్యాగరాజస్వామి సమకాలీకులలో ఉపనిషద్బ్రహ్మేంద్ర స్వామి వారు ప్రముఖులు. వీరు కాంచీపురంలో మఠాన్ని ఏర్పాటు చేసి 108 ఉపనిషత్తులపై భాష్యం రచించారు. సన్యాస స్వీకార సమయంలో గురువులు ఇచ్చిన పేరు రామచంద్రేంద్ర సరస్వతి అయినా వారు ఉపనిషత్తులపై చేసిన కృషి వలన ఆయనకు తదనుగుణమైన నామం వచ్చింది. వారు ఒకసారి త్యాగరాజస్వామిని కాంచీపురం రమ్మని ఆహ్వానించారు. శిష్యుల్ని వెంటబెట్టుకుని త్రోవలో పుణ్య క్షేత్రాలను దర్శిస్తూ, అక్కడి వేల్పులను దర్శించిన అనుభవంతో కీర్తనలు రచించి పాడుకున్నారు త్యాగయ్య. కోవూరు, పుత్తూరు, నాగులాపురం, వాలాజీపేట, శ్రీరంగం, నాగపట్టణం తపస్థీర్థం, ఘటికాచలం మొదలైన క్షేత్రాల్లో రచించిన కీర్తనలన్నీ ఒక ఎత్తయితే, తిరుమలలో శ్రీనివాసుని దర్శించుకున్నప్పుడు పాడిన కీర్తన మరో ఎత్తు. అదో చారిత్రాత్మక సన్నివేశం. తిరుమలకు చేరుకున్న త్యాగయ్యకు వెంటనే దర్శనం కాలేదు. ఆలయంలో ప్రవేశించగానే అర్చకులు తెర వేసి స్వామి కైంకర్యాలు చేస్తున్నారు. నిరుత్సాహంతో చింతాక్రాంతుడైన త్యాగయ్య అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశమున్న కీర్తన ఆలపించారు. శ్రీనివాసుడు త్యాగయ్యపై కరుణించగా తెర తొలగిపోయి అద్భుతమైన దర్శనం కలిగింది. కృతి వివరాలు:

తెర తీయగ రాదా లోని
తిరుపతి వేంకటరమణ మచ్చరమను

పరమపురుష ధర్మాది మోక్షముల
పారదోలుచున్నది నాలోని

మత్స్యము ఆకలిగొని గాలముచే మగ్నమైన రీతి యున్నది
అచ్చమైన దీపసన్నిధిని మరుగిడబడి చెఱచినట్లున్నది

వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతి యున్నది
వేగమే నీ మతముననుసరించిన త్యాగరాజ సన్నుత మదమత్సరమను

భావం: 

ఓ తిరుపతి వేంకటరమణా! నా మనసులో మదమత్సరాదులనే అరిషడ్వర్గములు నెలకొనియున్నవి. ఈ ఆరు అంతశ్శత్రువులనే తెర తొలగించుము. ఓ పరమపురుషా! ఈ తెర మానవుని సాధనా సంపత్తికి దోహదము చేసే ధర్మార్థ కామ మోక్షములను విధులకు దూరము చేయుచున్నది. ఈ తెర ఆకలిగొన్న చేప గేలము నందు గల ఎరను ఆశించి దానిలో చిక్కుకున్న రీతి, స్వచ్ఛమైన దీపకాంతికి అడ్డుపడి అంధకారములో పడవేసి అధోగతిపాలు చేస్తున్నది. ఈ మదమత్సరములనే తెర ఎడారులలో ఎండమావులను చూసి భ్రమసి పశుగణములు వాని వద్దకు చేరుకున్నట్లుగా మాయలో పడవేసి నీకు దూరము చేయుచున్నవి. వీటిని తొలగించి నీ దర్శనమును ప్రసాదించుము. నీ భక్తియనే మతమును అవలంబించాను, నన్ను కాపాడుము. 

గౌళిపంతు రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...