20, సెప్టెంబర్ 2026, ఆదివారం

రా రా రాజీవ లోచన - మైసూరు వాసుదేవాచార్యుల కృతి



రా రా రాజీవ లోచన! రామా! నన్ను బ్రోచుటకు!

దీనాశ్రితజన మందార! కరుణాపారవార!

ఏరా నీ కరుణ కల్గని కారణమేమో! కానరా!
మారారి వినుత! శుభద! సుచరిత!
పరాత్పర! ధరణిజా మనోహరా!

నీవే నా విభుడని నిరతము నీ పాదములను నెర నమ్మితి!
నీవాడని నను కరుణించి ఈవేళ నా చేయి విడువకురా!
దేవ దేవా! దశరథ నృప నందన! దశముఖాది సకల రిపుజనహరణ!
నీవనాదరణ సేయకురా! పవనజాప్త! శ్రీ వాసుదేవ!

తామర రేకుల వంటి కన్నులు కలిగిన, దీనులైన ఆశ్రితుల పాలిటి కల్పవృక్షమైన, కరుణాసముద్రుడవైన శ్రీరామా! నన్ను బ్రోచుటకు రారా! నాపై కరుణ ఇంకా కలుగకుండుటకు కారణమేమో! నన్ను కానరా! మన్మథుని శత్రువైన శివునిచే నుతించబడిన, శుభములను కలిగించే, సచ్చరిత్ర కలిగిన పరమాత్మా! సీతాదేవి మనోహరుడవు నీవు. నన్ను బ్రోచుటకు రారా! నీవే నా ప్రభువని ఎల్లప్పుడూ నీ పాదములను నమ్ముకొంటిని. నీవాడని నాపై కరుణ జూపి ఈ వేళ నా చేయి విడువకుము రామా! దేవ దేవా! దశరథ మహారాజుని కుమారా! రావణాది రాక్షసులను సంహరించిన రామా! నాపై నిరాదరణ సేయకుము రా! ఓ వాసుదేవా! వాయుపుత్రుడైన హనుమంతునికి నీవు ఆప్తుడవు! నన్ను బ్రోచుటకు రారా!

మైసూరు మహారాజా జయచామరాజ వడయార్ కొలువులో ఆస్థాన విద్వాంసునిగా ఎంతో పేరొందిన మైసూరు వాసుదేవాచార్యుల వారు ప్రఖ్యాత సంగీత విద్వాంసులు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి శిష్యులు. తెలుగు సంస్కృత భాషలలో 300కు పైగా వర్ణములు, కృతులను రచించిన వీరు తమ మలి జీవితంలో రుక్మిణీదేవి అరుండేల్ గారి కళాక్షేత్రలో కూడా ప్రధాన సంగీత అధ్యాపకునిగా పనిచేశారు. మైసూరులో మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో 1865వ సంవత్సరంలో జన్మించిన వీరు అక్కడి మహారాజా సంస్కృత కళాశాలలో సంస్కృత అధ్యయనం చేశారు. త్యాగరాజస్వామి వారి శిష్య పరంపరకు చెందిన వీరు మనసును కరిగించే కీర్తనలను తెలుగు, సంస్కృత భాషలలో రచించారు. బ్రోచేవారెవరురా అనే ఖమాస్ రాగ కీర్తనతో ఎంతో పేరు పొందారు. వీరి కీర్తనలు, భక్తికి, ఆర్తికి, శరణాగతికి ప్రతీక. 1959వ సంవత్సరంలో వీరికి పద్మ భూషణ్ అవార్డు బహుకరించబడింది. వీరు తమ కృతులలోని భావంతో అభినవ త్యాగరాజు అన్న బిరుదును కూడా పొందారు. సంగీత సాహిత్య సేవలో పరిపూర్ణమైన జీవితం గడిపిన తరువాత వీరు 1961వ సంవత్సరంలో చెన్నైలో పరమపదించారు. వీరి ముద్ర "వాసుదేవ".

మోహన రాగం మనోహరమైనది. జగన్మోహనుడైన శ్రీరాముని వర్ణించటానికి ఇంతకన్నా సముచితమైన రాగం ఏముంటుంది? చెవులకు ఇంపుగా, ఆర్తి, భక్తి, శరణాగతి ఉట్టిపడే రాగ లక్షణాలు కల్గినది మోహనం. భక్తులను రామభక్తి సామ్రాజ్యంలో సమ్మోహితులను చేసే రాగం ఇది. వాసుదేవాచార్యుల వారు ఈ కీర్తనలో విశేషమైన భావనలను గుప్పించి మోహనరాగంలో స్వరపరచారు. పుంసాం మోహన రూపాయ అని వేనోళ్ల రాముని పొగడారు మన ఆర్యులు. ఈ రారా రాజీవలోచన అనే కృతిలో ఆ రామ వైభవాన్ని మరింత పెంపొందించారు కృతికర్త. ఈ కృతి సాహిత్యాన్ని పరిశీలిస్తే త్యాగరాజస్వామి వారి సాహిత్యపు ఆనవాళ్లు ప్రస్ఫుటంగా కనబడతాయి. ఒకరకంగా తన మహా గురువుల సాహితీ వైభవాన్ని వాసుదేవాచార్యుల వారు తెలుగు భాషలోని తన కృతుల ద్వారా కొనసాగించారు. నిరాడంబరమైన, నిర్మలమైన జీవితం గడిపిన ధన్యజీవులు వీరు.

ఈ కృతిని విద్వన్మణి ఎమ్మెల్ వసంతకుమారి గారి శిష్యురాలు, కలైమామణి, పద్మశ్రీ మరియు పద్మభూషణ్ బిరుదాంకితురాలు శ్రీమతి సుధా రఘునాథన్ గారు ఆలపించగా వినండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...