మహాగణపతిం మనసా స్మరామి వశిష్ఠ వామదేవాది వందిత
వశిష్ఠుడు, వామదేవుడు మొదలైన మహర్షులచే పూజించబడే మహాగణపతిని నేను నా మనస్సులో నిరంతరం స్మరిస్తున్నాను. ఆయన మహాదేవుడైన పరమశివుని కుమారుడు, గురుగుహుడైన కుమారస్వామిచే స్తుతింపబడేవాడు, కోటి మన్మథుల సౌందర్యప్రకాశాన్ని మించిన తేజస్సు కలిగినా పరమశాంతస్వరూపుడు. మహాకావ్యాలు, నాటకాలు మొదలైన కళలను ప్రీతితో ఆదరించేవాడు, మూషికాన్ని వాహనంగా కలిగినవాడు, మోదకాలను ఎంతో ఇష్టపడే ఆ మహాగణపతిని మనసారా ధ్యానిస్తున్నాను.
మహాకావ్య నాటకాది ప్రియం అన్నారు దీక్షితుల వారు. దీనిని రెండు విశేషాలుగా చెప్పుకోవచ్చు.
1. దీక్షితుల వారి ప్రత్యేకత రాగం యొక్క పేరును చాలా కృతులలో సాహిత్యానికి సముచితంగా ప్రస్తావించటం. ఇక్కడ నాట రాగ నామాన్ని నాటక అనే పదంలో పొందుపరచారు.
2. గణపతి వ్యాసభగవానుడి నోట వెలువడ్డ మహాకావ్యమైన భారతాన్ని వ్రాయటానికి ఒప్పుకోవటానికి ఉన్న నేపథ్యం. శబ్దభావతాళాలతో ముడిపడి ఉన్న కళలన్నిటినీ ఆస్వాదించేవాడు గణపతి, బుద్ధిప్రదాత కాబట్టి.
నాట రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి