ఈ కర్మభూమి గొప్పతనమేమిటంటే సామాన్యమైన పరిస్థితులలో జన్మించి ఎన్నో వికారాలలో కొట్టుమిట్టాడే వారికి కూడా కారణాకారణములచే పరమాత్మ అనుగ్రహం కలిగింది. దేహరక్తి కలిగిన వారు తరువాత మహోన్నతమైన విరక్తితో అడుగడుగునా పరమేష్టిని అనుభూతి చెందుతూ తమ భావనలను మనకు ఆధ్యాత్మిక వారసత్వంగా అందించే రచనలను చేశారు. అటువంటి వారిలో 16-17 శతాబ్దాలలో జీవించిన గోస్వామి తులసీదాసు ప్రముఖులు.
తులసీదాసు మహిమ కేవలం రామకథను మళ్లీ చెప్పడంలో లేదు; సంస్కృతంలోని మహాకావ్య-పురాణ సంప్రదాయాన్ని అవధీ జనభాషలోకి తీసుకువచ్చి, భక్తిని పండితుల పరిధి దాటి సామాన్యుని ఇంటి ఆరాధనగా మలచడంలో ఉంది. రామచరితమానసలో రాముడు ధర్మస్వరూపుడు మాత్రమే కాదు—దీనజనులకు ఆశ్రయదాత, నామస్మరణ ద్వారా చేరదగిన పరబ్రహ్మ. అందుచేత ఇది ఉత్తర భారత భక్తి, భాషా, నాటక-సంగీత సంప్రదాయాలపై శతాబ్దాలుగా అపార ప్రభావం చూపింది.
పుట్టుకతోనే దంత వికారంతో జన్మించిన వీరిని తల్లి దాసి వద్ద వదిలి వేయగా, ఆ దాసి కూడా అతనికి చిన్న వయసులోనే మరణిస్తుంది. అప్పటి నుండి మొదలైంది తులసీదాసు ఆధ్యాత్మిక యానం. స్వయంగా పార్వతీదేవి బ్రాహ్మణ స్త్రీ రూపంలో వచ్చి అతనికి రోజూ అన్నం పెట్టేదట. నరహర్యానందస్వామి అనే గురువు స్వయంగా అతనికోసం వెదుక్కుంటూ వచ్చి అతనికి రామబోలా అని నామకరణం చేసి తనతో పాటు అయోధ్యకు తీసుకుని వెళతాడు. ఆ స్వామే 1561 సంవత్సరంలో ఆ బాలునికి ఉపనయనం చేస్తాడు. అప్పటికే మహేశ్వరీ అనుగ్రహం కలిగిన రామబోలా గాయత్రీ మంత్రాన్ని ఉచ్చరించేవాడు. యజ్ఞోపవీత సంసారమైన తరువాత నరహరిస్వామి రామబోలాకు రామ మంత్ర దీక్షను ఇస్తాడు. ఆయన అయోధ్యలోనే ఉండి రామబోలాకు విద్యాభ్యాసమొనరుస్తాడు. ఆ తరువాత నరహరిసామి రామచరితాన్ని అతనికి వినిపిస్తారు. కొన్నాళ్ల తరువాత వారిరువురూ కాశీక్షేత్రానికి వెళతారు. అక్కడ తులసీదాసు శేషసనాతనునితో నుండి పదిహేను సంవత్సరాల పాటు వేదవేదాంగాలు అభ్యసిస్తాడు. కొన్నాళ్లకు అతనికి రత్నావళి అనే కన్యతో వివాహము జరుగుతుంది. రామబోలాకు ఆమెపై అమితమైన మక్కువ. అది విపరీతానికి దారి తీసి ఆమె వియోగాన్ని ఒక్క క్షణం కూడా భరించలేని స్థితి కలుగుతుంది. ఒకసారి ఆమె తన సోదరుని ఇంటికి వెళ్లగా, తులసీదాసు ఆమెకు తెలియకుండా ఆమె వెనుకనే బయలుదేరి అక్కడికి వెళతాడు.
అతని ప్రవర్తన చూసి రత్నావళి వెగటు చెంది ఇలా అంటుంది:
లాజ్ న లాగ ఆప్ కో దౌరే ఆయేహు సాథ్
ధిక్ ధిక్ ఐసీ ప్రేం కో కహా కహహు మై నాథ్
అస్థి చర్మమయ దేహ మమ వా సో ఐసీ ప్రీతి
ఐసీ జో శ్రీరాం మే హోత్ న తౌ భవభీతి
ఛీ! నన్ను ఈ విధంగా వెంబడించటం సిగ్గుగా లేదా? ఎముకలు కలిగిన నా శరీరమునందు మీకెంత మక్కువ, ఆసక్తి గలదో నాకిప్పుడర్థమైంది. దీనిలో సగభాగమైనా మీరు శ్రీరాముని పట్ల కనబరిస్తే మీకు సంసాగర భయాలుండవు అంటుంది.
స్వయంగా పార్వతీదేవి రత్నావళి రూపంలో పలికిన ఆ మాటలు తులసీదాసు జీవితాన్ని మార్చేశాయి. అతను తీవ్రమైన విరాగంతో ప్రయాగ వచ్చి సంసార జీవితాన్ని త్యజించి సన్యాసాశ్రమం స్వీకరించి కాశీకి బయలుదేరుతాడు. ఆ తరువాత మానససరోవరంలో కాకభుసుండి దర్శనం, కాశీలో హనుమద్దర్శనం, హనుమంతుని అనుగ్రహంతో చిత్రకూటంలో శ్రీరాముని దర్శనం, స్వయంగా రాముడే తులసీదాసు నుదుటన చందనాన్ని అలదటం, కాశీలో సంస్కృతంలో రామచరిత్రాన్ని వ్రాయబోగా, ఏ రోజు వ్రాసింది ఆరోజు రాత్రికి చెరిపివేయబడటం, స్వప్నంలో పరమశివుడు సాక్షాత్కారమై ఇక్కడ కాదు, అయోధ్య వెళ్లి నీ స్వభాషలో రామచరితాన్ని రచించమని, అది సామవేద సమానమైనదవుతుందని చెప్పటం, తరువాత అయోధ్యలో తులసీదాసు 2 ఏళ్ల సమయంలో తన మాతృభాషలో పూర్తి రామాయణాన్ని రామచరితమానసంగా రచించటం, మళ్లీ శివానుగ్రహంతో కాశీ వెళ్లి పరమశివుని, అన్నపూర్ణేశ్వరి సన్నిధిలో ఆ చరితాన్ని గానం చేయటం, మరునాడు ఉదయానికి ప్రాకృత భాషలో ఆ గ్రంథం మొదటి ఆకుపై సత్యం శివం సుందరం అని పరమశివుడే వ్రాయటం, దేవాలయమంతా సత్యం శివం సుందరం అన్న శబ్దాలు మారుమ్రోగటం, ఈర్ష్యతో సాటి కవులు అతని గ్రంథానికి నష్టం కలిగించబోగా స్వయంగా రామలక్ష్మణులు ధనుర్ధారులై దానిని రక్షించటం, తన స్వామికి కష్టం కలిగించిన ఆ గ్రంథాన్ని తులసీదాసు మరల చేతితో వ్రాయటం...
అలా అద్భుతంగా సాగింది తులసీదాసు ఆధ్యాత్మిక యానం. రామచరితమానసమే కాదు, హనుమాన్ చాలీసా వంటి అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన స్తుతులను మనకు ఎన్నో అందించారు తులసీదాసు. అదే మన కర్మభూమిలోని గొప్పతనం. పరమాత్మ అనుగ్రహం అపారం, క్షీరసాగర మథనం నుండి హాలాహలం తరువాత అమృతం వెలువడినట్లు, సంసారసాగర మథనం నుండి తొలుత కష్టాలు, అజ్ఞానం, భయాలు, మమకారాలు, మోహాలు, తరువాత వైరాగ్యము, భక్తి, జ్ఞానము, భగవదనుగ్రహము కలుగుతాయి. దానికి తులసీదాసు ఓ మంచి ఉదాహరణ. 400 ఏళ్ల తరువాత కూడా ఆయన రచించిన రామచరితమానసము ఆ సీతారాముల వైభవాన్ని మనకు అదే సుగంధాన్ని వెదజల్లుతోంది.
సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ
వందే విశుద్ధవిజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ
సీతారాముల గుణసముదాయమనే పుణ్యమైన అరణ్యములో విహరించు వారు, శుద్ధ జ్ఞాన సంపన్నులైన కవీశ్వరుడైన వాల్మీకికి, కపీశ్వరుడైన హనుమంతునికి నమస్కరించుచున్నాను.
- గోస్వామి తులసీదాసు (రామచరితమానస ఆరంభ శ్లోకాలలో)

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి