4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

నమో నారాయణాయ నమో - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

నమో నారాయణాయ నమో!నమో నారాయణాయ నమో!

నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వ పారాయణాయ శోభన మూర్తయే

నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ
సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో

కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ మురవైరినే జగన్మోహనాయ
తరుణీందు కోటీర తరుణీ మనస్తోత్ర పరితోష చిత్తాయ పరమాయ తే నమో

పాత్రదానోత్సవ ప్రథిత వేంకటరాయ ధాత్రీశ కామితార్ధ ప్రదాయ
గోత్రభిన్మణి రుచిర గాత్రాయ రవిచంద్ర నేత్రాయ శేషాద్రి నిలయాయ తే నమో

సగుణ పరబ్రహ్మ స్వరూపుడు, అన్నిటాయున్న వాడు, సుందరమైన రూపము గల నారాయణునికి నమస్సులు. శాశ్వతమైనవాడు, జ్ఞానులచే నుతించబడిన వాడు, లోకేశ్వరుడు, ముని సమూహముల విశ్వాసము కలవాడు, సత్యమైన వాడు, ప్రత్యక్షమైన వాడు, సజ్జనుల సాంగత్యములో నుండే వాడు, జగత్తును రక్షించే నారాయణునికి నమస్సులు. గజేంద్రుని కాపాడిన వాడు, కౌస్తుభమును ధరించిన వాడు, మురారియైన వాడు, జగన్మోహనాకారుడు, సముద్రుని కుమర్తె అయిన లక్ష్మీదేవితో ప్రకాశించే వాడు, గోపకాంతల మనస్సులలో తలచబడే వాడు, ఎల్లప్పుడూ ఆనందమయమైన మనస్సు కలవాడు, పరమపురుషుడు అయిన నారాయణునికి నమస్సులు. పాత్రులను అనుగ్రహించేవానిగా ప్రసిద్ధి చెందిన వాడు, వేంకటేశ్వరుడు, ధరణీపతి, కామ్యములను తీర్చేవాడు, ఇంద్రనీలమణి కాంతితో అందమైన దేహము కలవాడు, సూర్య చంద్రులు నేత్రములుగా కలవాడు శేషాద్రి శిఖరముపై నివసించే నారాయణునికి నమస్సులు.

అన్నమాచార్యుల వారు సంస్కృతంలో రచించిన కొన్ని కృతులలో ఇది ఒకటి. శ్రీరాగంలో కూర్చబడిన ఈ కృతిని గానం చేసిన వారు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు, వారి కుమారులు అనిల కుమార్ గారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి