గజముఖుడవైన మహాగణపతీ! నీకు నా నమస్సులు. బంగారుమయమైన మండపంలో సింహాసనంపై కొలువై ఉన్నవాడవు నీవు. ఏనుగు చర్మాన్ని వస్త్రముగా ధరించిన పరమశివునిచే పూజింపబడే మహాగణపతీ! పరమతత్త్వస్వరూపుడవు, సమస్త భక్తులపై అనుగ్రహం కురిపించేవాడవు, మాయాశక్తి ఆలింగనం చేసిన దివ్యవిగ్రహుడవు. కమలం, కలువ, పాశం, శంఖం, చక్రం, చెరకువిల్లు, వరికంకులు, గద, స్వదంతం, మాదీఫలము, రత్నకలశం ధరించిన కమలసదృశ హస్తాలు కలవాడవు, కమలాలవంటి పాదములు గల నిర్మలుడవు, జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయలకు కారణభూతుడై కరుణకు నిలయమైనవాడవు, హిమవంతుని కుమార్తె పార్వతీదేవి ముఖకమలాన్ని వికసింపజేసే సూర్యునివంటి హిరణ్యగర్భస్వరూపుడవు, సదాశయుడవు. ఉమారమణుడైన శివుని కుమారుడయిన సుబ్రహ్మణ్యునితో సమానమైన శ్రేష్ఠ పరాక్రమం, తేజస్సు, ప్రకాశస్వరూపుడవయిన నిన్ను భక్తితో స్తుతిస్తున్నాను.
నవరోజు రాగంలో మిశ్రచాపు తాళంలో స్వరపరచబడిన ఈ కృతి తిరువారూరు క్షేత్ర సంబంధితమైనది. గణపతిని కేవలం విఘ్నేశ్వరునిగా కాక, మాయాశక్తితో ఏకమైన పరతత్త్వంగా, విశ్వసృష్టి–స్థితి–లయకర్తగా, అనేక దివ్యచిహ్నాలు చేతబూనిన మహావిగ్రహంగా దీక్షితులు ఇందులో దర్శింపజేస్తారు. గురుగుహునితో సమానమైన తేజఃపరాక్రమం అనే పదబంధంలోనే నవరోజు రాగముద్రను కూడా సున్నితంగా నిక్షిప్తం చేశారు.
ఈ ముత్తుస్వామి దీక్షితుల కృతిని విఘ్నేశ్ ఈశ్వర్ ఆలపించారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి