భారతదేశంలో ఉన్న శాస్త్రీయ సంగీతంలో ప్రధానంగా రెండు రకాలు, హిందూస్తానీ శాస్త్రీయ, కర్నాటక శాస్త్రీయ సంగీతం. రెండిటిలోనూ కర్నాటక సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. శాస్త్రం (ఆంగ్లంలో సైన్స్), భావం కలిపి మేళవించే సంగీత సమ్మేళనం మరింత ఉన్నతంగా ఉంటుంది.
దీనికి ప్రధాన కారణం సంగీతత్రయమైన త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రుల వారి సాహిత్యంలోని ఔన్నత్యం. ఇవి వ్యక్తిపూజను పూర్తిగా వర్జించి మన ధర్మంలోని దేవతామూర్తుల వైభవాన్ని కళ్లకు కట్టినట్లు ఛందోబద్ధంగా వర్ణించి, సముచితమైన రాగంలో స్వరపరచబడటం వల్ల శాస్త్రం, ధర్మం ఏకమై దివ్యమైన సంగీతంగా కర్నాటక శాస్త్రీయ సంగీతం పరిణమించింది, కాలపరీక్షను తట్టుకుని దృఢంగా నిలిచింది. సంగీతత్రయానికి పూర్వం వారి స్థాయిలో సాహిత్యానికి విలువనిచ్చిన అన్నమాచార్యుల వారు, పురందరదాసుల వారు ఈ త్రయం కన్నా దాదాపు 250 ఏళ్లు ముందు జీవించిన వారు. అనగా ఒక 10 తరాల పాటు సమాజంలో అనేక రకాల మార్పులు వచ్చాయి. వాటిలో ముస్లిం పాలకులు, తెల్లవారి పాలన ప్రధానమైనవి. కాబట్టే శాస్త్రీయ సంగీతం ధర్మంతో నిరంతరం మేళవించబడి పరిఢవిల్లటానికి అప్పటి పరిస్థితులు అనుకూలంగా లేవు. రామదాసు గారు చాలా సంకీర్తనలు రాసినా, ఆయన శాస్త్రీయత కన్నా భజన సాంప్రదాయానికి ప్రాధాన్యతనిచ్చారు అని చెప్పుకోవచ్చు.
అందుకే, కర్నాటక శాస్త్రీయ సంగీతానికి ప్రధానమైన వృద్ధియుగం సంగీతత్రయం ఉన్న కాలమే అని చెప్పుకోవచ్చు. వీరు వచ్చాకే భావానికి పెద్దపీట వేసి శాస్త్రీయత మేళవించి అద్భుతమైన సాహిత్య సంగీత సుగంధాలు అలదబడ్డాయి. త్యాగరాజస్వామి నిధి చాలా సుఖమా, జగదానందకారకా, దీక్షితులవారి రంగపుర విహార, వాతాపి గణపతిం భజే, శ్యామశాస్త్రుల వారి హిమాచలతనయ వంటి వేల కృతులు శాస్త్రీయ సంగీతాన్ని ఉపాసనాపూర్వకంగా పొందిన ఆధ్యాత్మికశక్తితో వెలువడిన సాహిత్యంతో జతపరచినవి. క్షేత్రాలు, దేవతామూర్తులు, నిత్యోపాసన వీరు మనకు అందించిన అద్భుతమైన వారసత్వంలో మూలస్తంభాలు. వర్ణన అన్నది అనుభూతి చెందితేనే సఫలమవుతుంది. ఆ అనుభూతి ఉపాసనతోనే సాధ్యం. త్యాగరాజస్వామి రాముణ్ణి నిరంతరం ఉపాసన చేస్తే దీక్షితుల వారు శ్రీవిద్యోపాసనలో తపోసంపన్నులై నిలిచారు, శ్యామశాస్త్రుల వారు బంగారు కామాక్షి అమ్మను ఒక బిడ్డలా నిత్యం కొలిచారు. కాబట్టే వారి సాహిత్యం మిగిలిన వారి కన్నా మిన్నగా నిలిచిపోయాయి.
అంతే కాదు, సమకాలీన రాచరికాలు, సంస్థానాలు సంగీతత్రయ సాహిత్యానికి తగిన ప్రోత్సాహాన్నిచ్చాయి. త్యాగరాజస్వామి రాచరికాన్ని పూర్తిగా వర్జించినా వారి సాహిత్యాన్ని అప్పటి, తరువాతి రాచరికాలు ముందుకు తీసుకు వెళ్లాయి. అందుకే ఆయన శిష్య పరంపర సాహిత్యాన్ని కాపాడగలిగింది.
ముగ్గురిలో దీక్షితుల వారు దేశాటన ఎక్కువగా చేసి మరింత విస్తారమైన సాహిత్యాన్ని రచించారని చెప్పుకోవచ్చు. త్యాగరాజస్వామి కూడా తాను నివసించిన తిరువయ్యారుకు 500 కిలోమీటర్ల పరిధిలో పర్యటించారు. శ్యామశాస్త్రి గారు బంగారు కామాక్షి దేవాలయంలోని విధుల వలన వీరిద్దరి కన్నా కాస్త తక్కువగా పర్యటించారు. అయితే, ముగ్గురూ కూడా ఉపాసనలో సిద్ధి పొందే రససిద్ధిని కూడా సాధించారు.
నిజం చెప్పాలంటే, వారి జీవితాలలో ఆధ్యాత్మిక సాధనల వల్లనే వారి సాహిత్యాలు శాశ్వత స్థానాన్ని పొందాయి. శాస్త్రీయ సంగీతం అటువంటి ఉన్నతమైన సాహిత్యానికి చక్కని అలంకరణగా, ఒక సముచితమైన వేదికగా, ఆ దైవిక శక్తితో వేగంగా అనుసంధానం చేసే స్వరారోహణంగా నిలుస్తుంది. అందుకే సాహిత్యాన్ని రమించి సంగీతంలో మేళవించే కళాకారులు చరిత్రలో నిలిచిపోతారు. కేవలం శాస్త్రీయతకే ప్రాధాన్యతనిచ్చి భావం యొక్క విరాట్స్వరూపాన్ని అవగతం చేసుకోలేని వారు కనుమరుగవుతారు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఈ రహస్యాన్ని చక్కగా ఆకళింపు చేసుకుని నిరంతరం పాటించారు కాబట్టే భారతరత్న అయ్యారు. అలాగే మరెందరో గొప్పకళాకారులు. ఈ మేళవింపును గ్రహించని ఎందరో విద్వాంసులు సంగీతసాధన ద్వారా పరమపదసోపానాన్ని అధిరోహించలేకపోయారు.
కర్నాటక శాస్త్రీయ సంగీత రాగాలలోని స్వరాలతో చేసే గమకాలు అందాన్ని, సొగసును ఇస్తే, భావం వాటి మీద లయవిన్యాసం చేసి సార్థకతను పొందింది. భావరాగతాళ సమన్వితమైనది కాబట్టే సంగీతత్రయ సంపద దివ్యత్వాన్ని పొందగలిగింది.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి