10, జులై 2026, శుక్రవారం

పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ - జూనియర్ త్యాగరాజస్వామి



పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ - అసలు పేరు భరతం సుబ్రహ్మణ్య అయ్యర్. వీరు త్యాగరాజస్వామి వారి శిష్యులైన మానాంబుచావడి వేంకటసుబ్బయ్యర్ గారి శిష్యులు.

తిరువయ్యారులో 1845వ సంవత్సరంలో జన్మించిన వీరి తండ్రి భరతం వైద్యనాథ అయ్యర్. తాత పంచనదశాస్త్రి గారు తంజావూరు శరభోజి మహారాజు వారి ఆస్థానంలో విద్వాంసులు. సుబ్రహ్మణ్య అయ్యర్ గారు మేనమామ మేలత్తూరు గణపతిశాస్త్రి గారి వద్ద సంగీతం నేచుకుని తరువాత మానాంబుచావడి వారి వద్ద శిష్యరికం చేశారు. త్యాగరాజస్వామి వారి కృతులను నేర్చుకోవటం కోసం తెలుగు భాషను క్షుణ్ణంగా అధ్యయనం చేసి నూరుకు పైగా సంస్కృత, తెలుగు కృతులను, వర్ణాలను, జావళీలను, తిల్లానాలను రచించారు. ఆయన ముద్ర వేంకటేశ. బేగడ రాగాన్ని విస్తరించి పాడటంలో ఆయన నైపుణ్యం అమోఘం. అందుకే ఆయనకు బేగడ సుబ్రహ్మణ్య అయ్యర్ అని పేరు కూడా వచ్చింది. ఒకసారి మైసూరు మహారాజ వారి ఆస్థానంలో ఈ రాగాన్ని ఆయన మూడు రోజుల పాటు ఆలపించారు. మొదటి రాగాలాపన, రెండవరోజు తానం, మూడవరోజు రామనమమే జీవనము ఓ మనసా అన్న కృతి పల్లవి, స్వరకల్పనలు. ఈ అద్భుతమైన కళానైపుణ్యానికి మహారాజవారు ఆయనకు స్వర్ణకంకణాలను బహుకరించారు. అలాగే ఆయనకు విజయనగరం, ట్రావెంకోర్ ఆస్థానలలో మన్ననలను పొందారు. ఆయన లయజ్ఞానం అసమానమైనది. కదనకుతూహలం రాగంలో ఆయన రచించిన రఘువంశసుధాంబుధిచంద్ర అన్న కృతి జగద్విఖ్యాతమయ్యింది.

ఆయన గొప్ప గురువు కూడా. మైసూరు వాసుదేవాచార్యుల వారు, టైగర్ వరదాచార్యుల వారు మొదలైన ప్రఖ్యాత విద్వాంసులెందరో ఆయన శిష్యులు. మైసూరు వాసుదేవాచార్య తన స్మృతుల్లో గురువు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గురించి ఎంతో గౌరవంగా రాశారు. గురుకులంలో చేరిన వెంటనే కొత్త కృతులు నేర్పకుండా, మూడు నెలల పాటు కేవలం బేగడ రాగంలోని ఒకే వర్ణాన్ని  పాడిస్తూ సాధన చేయించారని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా ఒక రాగంలోని ప్రతి సూక్ష్మభావాన్ని పూర్తిగా గ్రహించిన తరువాతే తదుపరి పాఠానికి వెళ్లాలనే ఆయన బోధనా తత్వం తెలుస్తుంది. వాసుదేవాచార్య తరువాత కాలంలో భారతదేశంలోని మహానుభావ సంగీతకారులలో ఒకరిగా ఎదగడంలో ఈ శిక్షణ కీలక పాత్ర పోషించింది.సేలం మీనాక్షి గారి కుమార్తెలైన పాప, రాధలకు శిక్షణ కోసం ఆయన చెన్నై(చెన్నపట్టణం) వచ్చి అక్కడే స్థిరపడ్డారు. అందుకు ఆయనకు పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు అన్న పేరు స్థిరమయ్యింది. త్యాగరాజస్వామి ప్రభావంతోనే ఆయన కృతులను సద్గురువుల శైలిలో రచించి జూనియర్ త్యాగరాజ అన్న పేరు తెచ్చుకున్నారు. 1902వ సంవత్సరంలో ఆయన పరమపదించారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి