4, అక్టోబర్ 2017, బుధవారం

శివకామేశ్వరీం చింతయేహం - దీక్షితులవారి చిదంబర క్షేత్ర కృతి


శివకామేశ్వరీం చింతయేహం
శృంగారరస సంపూర్ణకరీం

శివ కామేశ్వర మనః ప్రియకరీం
శివానంద గురుగుహ వశంకరీం

శాంత కళ్యాణ గుణ శాలినీం శాంత్యతీత కళా స్వరూపిణీం
మాధుర్య గానామృత మోదినీం మదాలసాం హంసోల్లాసినీం
చిదంబర పురీశ్వరీం చిదగ్ని కుండ సంభూత సకలేశ్వరీం

శృంగార రసాన్ని సంపూర్ణం చేసే శివకామేశ్వరీ అమ్మను నేను ధ్యానిస్తున్నాను. శివకామేశ్వరుని మనసును రంజిల్ల జేసే, శివానందయైన, గురుగుహుని నిర్దేశించే అమ్మను నేను ధ్యానిస్తున్నాను. శాంతము మొదలైన శుభకరమైన గుణములతో ప్రకాశిస్తూ, శాంతికి అతీతమైన కళలకు స్వరూపిణియై, మధురమైన గానామృతమును ఆనందించే, ఆనందాతిశయయై హంసపై భాసిల్లే, చిదగ్నికుండము నుండి జన్మించిన, సకల జీవరాశులకు రాజ్ఞియైన, చిదంబరపురానికి ఈశ్వరి అయిన శివకామసుందరిని నేను ధ్యానిస్తున్నాను.



ముత్తుస్వామి దీక్షితుల వారి క్షేత్ర కృతులలో చిదంబరంలో నటరాజునితో కూడి యున్న శివకామసుందరి అమ్మవారిని కొలిచిన కృతి ఇది. చిత్సభలో నటరాజుడు శివకామసుందరీ దేవిల వైభవం కళ్లారా చూడవలసినదే. అద్భుతమైన శైవక్షేత్రం చిదంబరం. తమిళనాడులో చెన్నైకి దక్షిణాన 231కిలోమీటర్ల దూరంలో కడలూరు జిల్లాలో చిదంబరం ఉంది. సనాతనమైన ఈ దేవాలయాన్ని చోళులు, పాండ్యులు, చేరులు, విజయనగర రాజులు పోషించారు. ఇప్పుడున్న కట్టడం 12వ శతాబ్దం నాటిది. 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అనేకదేవతా సమూహమై యున్న ఈ దేవాలయం పంచభూత స్థలములలో ఆకాశాన్ని సూచించేది. శివరాత్రికి జరిగే నాట్యాంజలి ఉత్సవాలకు ఈ దేవస్థానం పేరొందింది. నాలుగు వైపుల నాలుగు గోపురముల ద్వారా ఈ దేవస్థానంలోకి ప్రవేశించ వచ్చు. ఐదు సభలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి - చిత్సభ (గర్భగుడి), కనకసభ (నిత్యసేవలు జరిగే మంటపము), నాట్యసభ, వేయి స్థంభములతో సహస్రార చక్రాన్ని సూచించే రాజసభ, దేవసభ (గణేశుడు, సోమస్కందుడు,  శివానందనాయకి, చండికేశ్వరులకు నిలయమైన సభ). 14వ శతాబ్దంలో హిందూ ద్వేషి అయిన ఇస్లాం రాజు మాలిక్ కఫూర్ దాడులలో ఈ గుడిని కూడా ధ్వంసం చేయగా తరువాత దానిని పునరుద్ధరించారు.

దీక్షితుల వారు శివకామేశ్వరీ రూపంలో ఈ శివకామసుందరిని దర్శించి ఉపాసన చేశారు. ఈ కృతిలో లలితా సహస్రనామావళిలో చిదగ్ని కుండ సంభూతగా పలుకబడిన అమ్మవారిని ప్రస్తావించారు. అలాగే ఈ క్షేత్రంలో ఉన్న శివానంద నాయికను, స్కందుని కూడా ప్రస్తావించారు. శివుని ఆనందతాండవానికి చిదంబరం రంగస్థలం. ఆ తాండవంలో శివకామసుందరిని శృంగార రస సంపూర్ణకరిగా, హంసోల్లాసినిగా వర్ణించి స్థల పురాణానికి సార్థకత కలిగించారు. కళ్యాణి రాగంలో కూర్చబడిన ఈ కృతిని మల్లాది సోదరులు గానం చేశారు.


22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

పంచాశత్పీఠ రూపిణీ - దీక్షితుల వారి కృతి


పంచాశత్పీఠ రూపిణీ! మాం పాహి శ్రీ రాజరాజేశ్వరీ!

పంచదశాక్షరి! పాండ్యకుమారి! పద్మనాభ సహోదరి! శంకరి!

దేవీ! జగజ్జననీ! చిద్రూపిణి!
దేవాది నుత గురుగుహ రూపిణి!
దేశకాల ప్రవర్తిని! మహాదేవ మనోల్లాసిని! నిరంజని!
దేవరాజ ముని శాప విమోచని! దేవగాంధార రాగ తోషిణి!
భావ రాగ తాళ విశ్వాసిని! భక్త జన ప్రియ ఫల ప్రదాయిని!

ఏబది శక్తిపీఠములలో వెలసిన రాజరాజేశ్వరీ! నన్ను కాపాడుము! పదిహేను బీజాక్షరములు కల మంత్రరూపిణి! పాండ్యరాజుని కుమార్తెగా జన్మించిన మీనాక్షీ! శ్రీహరి సోదరీ! శంకరుని అర్థాంగీ! నన్ను కాపాడుము! ఓ దేవీ! నీవు లోకాలకే అమ్మవు! జ్ఞాన స్వరూపిణివి! దేవతలచే నుతించిబడిన కుమారుని తల్లివి! ఎల్లవేళలా అంతటా ప్రకాశించే అమ్మవు! పరమశివుని మనసును రంజిల్లజేసే నిర్మల మూర్తివి! మునులచే శపించబడిన ఇంద్రుని శాపవిముక్తుని చేసిన అమ్మవు! దేవగాంధార రాగములో అలరారి, భావ రాగ తాళములను విశ్వసించెదవు! భక్తుల కామ్యములను తీర్చెదవు! నన్ను కాపాడుము!

- ముత్తుస్వామి దీక్షితులు

శూలమంగళం సోదరీమణులు గానం చేసిన ఈ దీక్షితుల వారి కృతి దేవగాంధారి రాగంలో స్వరపరచబడింది. సగీత త్రయంలో దీక్షితుల వారి సాహిత్యంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.  వ్యాకరణము, మంత్రము, యోగము, భక్తి, క్షేత్ర వర్ణన, శ్రీ విద్యా ఉపాసన, తిరుత్తణి గురుగుహోపాసన దీస్ఖితుల వారి సాహిత్యంలో ప్రకాశిస్తూ ఉంటాయి. దీక్షితుల వారు తమ అనేక కీర్తనలలో తమ మంత్రశాస్త్ర ప్రావీణ్యంతో పాటు రాగం పేరును కూడా ప్రస్తావించారు. దేశమంతటా తిరిగి అనేక క్షేత్రాలలోని దేవతామూర్తులను దర్శించుకొని వారిని సంకీర్తనల ద్వారా నుతించారు. ఎక్కువ భాగం కీర్తనలను సుబ్రహ్మణ్యునిపైన, తరువాత అమ్మవారిపైన రచించారు. వీరిద్దరిని ఆయన బాగా ఉపాసించి సిద్ధి పొందారు. దేశంలో ఉన్న యాభై శక్తిపీఠాలను కూడా ఆయన సందర్శించారని ఆయన చరిత్ర చెబుతోంది. క్షేత్ర వైభవాలను మనకు అందించిన మహనీయులలో దీక్షితుల వారు అగ్రగణ్యులు. దేహాన్ని త్యజించే సమయంలో కూడా ఆయన అమ్మను స్మరించగలిగిన అపర భక్తులు. 

వావిళ్ల రామస్వామి శాస్త్రులు-వేంకటేశ్వర శాస్త్రులు - వావిళ్ల ప్రెస్



వావిళ్ల రామస్వామి శాస్త్రులు - వీరు తెలుగు వారికి అందించిన సాహితీ సంపద వెలకట్టలేనిది. ఈనాటికీ మనకు శుద్ధమైన తెలుగులో పుస్తకాలు, పురాణేతిహాసాలు, వ్రతకల్పాలు అందుబాటులో ఉన్నాయంటే అది వీరి చలవే. విఖ్యాతమైన సంస్థ వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వ్యవస్థాపకులైన వీరు సంస్కృతాంధ్ర పండితులుగా, వేదవిద్యా కోవిదులుగా పేరొందారు. 1826వ సంవత్సరంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో వీరు జన్మించారు. వీరు చిన్న వయసులోనే ఉభయభాషలలో ప్రావీణ్యం పొంది తాళపత్ర గ్రంథాలను సేకరించి, పరిష్కరించి టీకా తాత్పర్యం వ్రాసి, వాటిని ముద్రించి శాశ్వతంగా సాహిత్యాభిమానులకు అందుబాటులో ఉండేలా చేశారు. వీరి సేవను గుర్తించిన బ్రౌన్ మహాశయుడు చేతి వ్రాత పుస్తకాలు చదువుకునే రోజుల్లో శ్రీవావిళ్ల రామస్వామి శాస్త్రుల వారు ముద్రణాలయం స్థాపించి పాఠకులకు ఎంతో సౌకర్యం కలిగించారు అని కొనియాడారు. వావిళ్ల రామస్వామి శాస్త్రులు వారు ముద్రించి ప్రకటించిన గ్రంథములు 1876 సంవత్సరంలో ప్రచురితమైన లండన్ మ్యూజియంలోని గ్రంథాలయ పట్టికలో నమోదు చేయబడినవి. శ్రీమద్రామాయణమునకు టీకా తాత్పర్య విశేషార్థములతో మొట్ట మొదట ప్రచురించింది వీరే. వీరి సంపాదకత్వంలో అనేక సంస్కృతాంధ్ర గ్రంథములు పరిష్కరించి ముద్రణా భాగ్యమును పొందాయి.

1851వ సంవత్సరంలో రామస్వామి శాస్త్రులు గారి హిందూ భాషా సంజీవని అనే ప్రెస్ ద్వారా ఈ సంస్థను స్థాపించారు. తరువాత ఆది సరస్వతీ నిలయాన్ని కూడా ఆయనే స్థాపించారు. 50కి పైగా పుస్తకాలను తన జీవిత కాలంలో ఆయన ప్రచురించారు. 1891వ సంవత్సరంలో వీరు కాలం చెందారు. వీరికి వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రులు 1884 జన్మించారు. వేంకటేశ్వర శాస్త్రులు గారు 1906లో ఈ సంస్థకు నేతృత్వం వహించి వావిళ్ల ప్రెస్‌గా పేరు మార్చారు. ప్రచురణా పద్ధతికి మెరుగు దిద్ది సంస్థను అభివృద్ధి చేశారు. గోరఖ్‌పూర్ వారి గీతా ప్రెస్, వారణాసి వారి చౌఖంభా ప్రెస్‌తో అనుసంధానం చేసుకొని మనకు అమూల్యమైన వాఙ్మయాన్ని ముద్రిత రూపంలో అందజేశారు. ఉత్తమ ప్రమాణాలు గల ముద్రణంతో, సంపాదకీయ ప్రతిభతో వారు 900కు పైగా సంస్కృతాంధ్ర తమిళ ఆంగ్ల భాషలలో పుస్తకాలను ప్రచురించారు. వేంకటేశ్వర శాస్త్రులు గారి మహా దేశభక్తులు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఎన్నో దేశభక్తిని కలిగించే పుస్తకాలను ప్రచురించారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి చేత ప్రభావితులైనారు. అలాగే బంకించంద్ర ఛటర్జీ గారి ఆనందమఠాన్ని తెలుగులోకి అనువదించారు. ఆంధ్రకేసరి ప్రకాశం గారికి ఎస్. సత్యమూర్తిగారికి ఎంతో ఆర్థిక సహాయం చేశారు. మహాభారతం, రామాయణం, పోతన భాగవతం మొదలైన వాటిని ప్రచురించారు. వీరి సమయంలో ఈ సంస్థను ఇంగ్లాండులోని మెక్‌మిలన్ మరియు లాంగ్‌మాన్ సంస్థలతో పోల్చారు.



1916లో వీరు మా పూర్వీకులు, ఉభయ భాషా పారంగతులు అయిన అక్కిరాజు ఉమాకాంతం పంతులు గారితో కలిసి త్రిలింగ అనే పత్రికను స్థాపించారు. 1941లో ఈ పత్రిక రజతోత్సవం కూడా జరుపుకుంది. వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రులు గారు 1927లో ఫెడరేటెడ్ ఇండియా అనే ఆంగ్ల పత్రికను కూడా స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు నడిపించారు. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి గారితో కలిసి బాలవినోదిని అనే తమిళ మాస పత్రికను నడిపారు. వీరి షష్టిపూర్తి సమయంలో అభిమానులు వీరికి స్మారక ముద్రణను కూడా బహుమతిగా అందజేశారు. ప్రజా జీవితంలో ఎంతో పేరు పొందిన వీరు 1938లో ఆంధ్ర మహాసభ రజతోత్సవ సభకు అధ్యక్షునిగా పని చేశారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. పచయప్ప ట్రస్ట్ బోర్డు అధ్యక్షునిగా, హానరరీ మెజిస్ట్రేటుగా, మద్రాస్ పోర్ట్ ట్రస్ట్, కాస్మోపాలీటన్ క్లబ్, మాసోనిక్ లాడ్జ్, సుగుణ విలాస సభలతో అనుబంధం కలిగి సేవలు చేశారు. ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకులు వీరే. ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యునిగా కూడా పని చేశారు. వీరు సెమ్మంగూడి మరియు అలగప్ప మొదలైన ప్రముఖులకు సన్నిహితులు.

శ్రీనాథుని శృంగార సాహిత్యాన్ని వీరు ప్రచురించగా పిఠాపురం రాజావారు, జయంతి రామయ్య గారు వీరిపై అవి అసభ్యంగా ఉండే సాహిత్యం అని దావా వేసినా అది నిలబడలేదు. తరువాత వీరు వాత్సాయన కామసూత్రాలను కూడా ప్రచురించారు. 1931-33 మధ్య 18 భాగాల మహాభారతాన్ని వీరు సంస్కృతంలో ముద్రించారు.  వారణాసి పండితులు వీరికి శాస్త్ర ప్రచార భూషణ అనే బిరుదునిచ్చారు. వీరు చేసిన భాషా సేవకు భాషోద్ధారక బిరుదు కూడా వచ్చింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు వీరిని 1955లో కళాప్రపూర్ణ బిరుదుతో గౌరవించారు. ధనవంతురాలైన భార్యతో విభేదాలతో వీరి సంసార జీవితం మాత్రం ఒడిదుడుకులు గానే నడించింది. 1942లో పక్షవాతం పాలైన వీరు 1956లో తన 67వ ఏట మరణించారు. వీరికి సంతానం లేదు. ఆయన తరువాత వీరి ఆస్తులకై ఎన్నో న్యాయ పోరాటాలు నడిచాయి. ప్రచురణ సంస్థ మూత పడింది. చెన్నైలో వీవీస్ ట్రస్ట్ నామమాత్రంగా నడుస్తోంది. దీనికి అల్లాడి స్వామినాథన్ గారు ట్రస్టీ. కొన్నేళ్ల క్రితం హైదరాబదులో ముద్రణను పరిమితిగా ఈ ట్రస్ట్ ప్రారంభించింది.

ఈ తండ్రి-కొడుకులు తెలుగు భాషకు చేసిన సేవ చిరస్మరణీయం. ఇటీవలే వావిళ్ల వారి సహితీ సంపదల 150వ జయంతి కూడా జరిగింది. ఎందరో మహానుభావులు అందరికి వందనాలు. 

17, సెప్టెంబర్ 2017, ఆదివారం

శరవణభవ గుహ షణ్ముఖ - తంజావూరు శంకర అయ్యర్ కృతి


శరవణభవ గుహ  షణ్ముఖ
తిరుమరుళ్ పురియ వా వా

మరువుం వళ్లీ దేవయాని మనాళ
కరుణై మళి పొళియ వా దయాళ

కుణ్డ్రు తోరుం ఆడుం కుమరనే  
కురైగళ్  తీర్థరుళ విరైవినిల్ నీ వా
ఎణ్డ్రుం ఇంబం తరుం  తమిళిసైక్క వా
ఇరంగి ఎంగళుక్కు జ్ఞానం తళైక్క వా

రెల్లు గడ్డి నుండి జన్మించి, ఆరు ముఖములు కలిగిన ఓ సుబ్రహ్మణ్యా! నీ కరుణతో మాకు శుభములు కురిపించుటకు రావయ్యా!  ఓ దయాళుడవైన వల్లీ దేవసేనా పతీ! నీ కరుణావృష్టిని కురిపించుటకు రావయ్యా! కొండలలో తిరుగుతూ ఆడుకునే ఓ కుమారా! మా కామ్యములు తీర్చుటకు రావయ్యా! నిత్యానందమునిచ్చే తమిళమును పాడుటకు రావయ్యా! మాపై కరుణ చూపించి జ్ఞానాన్ని ప్రసాదించుము.

(తమిళనాట భాషకు దైవ స్వరూపంగా కుమారస్వామిని కొలుస్తారు. అగస్త్య మహాముని కుమారస్వామిని ఉపాసించగా, ఆయన నోట ఈ భాష ఆ ప్రాంతంలో పలుక బడి ప్రసిద్ది పొందిందని వారి నమ్మకం)

- తంజావూరు శంకర అయ్యర్

షణ్ముఖుని నుతించే ఈ కృతిని కర్త శహానా రాగంలో స్వరపరచారు. ఈ రాగం ఆర్తికి, భక్తికి, శరణాగతికి ప్రతీక. కృతిలోని భావానికి సముచితమైన రాగంలో స్వరపరచటం వాగ్గేయకారుని పూర్ణప్రజ్ఞను సూచిస్తుంది. తంజావూరు శంకర అయ్యరు గారు 1924లో తిరుచిరాపల్లి జిల్లలోని తోగమరైలో జన్మించారు. టైగర్ వరదాచాయులు మొదలైన వారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ఈయన శిష్యులలో టీవీ శంకరనారాయణన్, నేవేలి సంతానగోపాలన్, చిత్రవీణ రవికిరణ్ మొదలైన మహామహులెందరో ఉన్నారు. ముంబై షణ్ముఖానంద సభ ద్వారా ఎందరో శిష్యులకు శిక్షణనిచ్చారు. కలైమామణి బిరుదును పొందారు. ఈ కృతి సాహిత్యంలో ఆర్తిని రాగం ద్వారా అందించటంలో ఆయన కృతకృత్యులైనారు. రంజని-గాయత్రి సోదరీమణులు ఈ కీర్తనను గానం చేశారు. 

10, సెప్టెంబర్ 2017, ఆదివారం

గడప దాక వచ్చి మరలి పోయావు - డాక్టర్ శోభారాజు గారి మధురభక్తి గీతం


గడప దాక వచ్చి మరలి పోయావు
వెను దిరిగి రమ్మని నే పిలుచు లోపే
పిలుపందనంత దూరానికేగావు! స్వామీ! 

గుడిసెనంతా అలికి ముగ్గులేశాను
తోరణాలను కట్టి తలుపు తెరిచుంచాను
దీపాలు వెలిగించి ధూపమేసే లోపు
గడప దాకా వచ్చి మరలి పోయావు
వెను దిరిగి రమ్మని నే పిలుచు లోపే
పిలుపందనంత దూరానికేగావు! స్వామీ! 

భక్ష్యభోజ్యాదులను ప్రేమార చేశాను
కొసరి నీవు తినగా విస్తరేశాను
విశ్శ్రాంతి గొందువని పానుపేసే లోపు
గడప దాకా వచ్చి మరలి పోయావు
వెను దిరిగి రమ్మని నే పిలుచు లోపే
పిలుపందనంత దూరానికేగావు! స్వామీ!

ఏర్పాట్లలో మునిగి ఏమరను ఇకను
కటిక చీకటిగుంది చిరుదివ్వె చేబట్టి
కాలాన్ని మరచి నే ఎదురు చూస్తున్నాను
వస్తావుగా స్వామి మరియొక్క మారు

కాళ్లు వణకేను కళ్ళు చెదరేను
వంటి చేవంతా కంటి నీరాయెను
పెనుగాలికీ దివ్వె పెనుగులాడేను
వస్తావుగా స్వామి మరి యొక్క మారు

- డాక్టర్ శోభారాజు గారు

పదకవితా పితామహుని సంకీర్తనలను ప్రచారంలోకి తీసుకు రావటంలో అగ్రగణ్యులైన డాక్టర్ శోభారాజు గారి అద్భుతమైన మధురభక్తి గీతం ఇది. కృష్ణభక్తి వారికి చిన్ననాడే ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలుగా జీవితంలో అంతర్భాగమై పోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కళను పరమాత్మ సేవకు అంకితం చేసి  పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారి అమూల్యమైన సంకీర్తనా సంపదలోని భావాన్ని ప్రత్యేకమైన మార్గంలో ప్రచారం చేస్తున్నారు పద్మశ్రీ దాక్టర్ శోభారాజు గారు. ఈ మహాయజ్ఞంతో పాటు వారు ఎన్నో సంకీర్తనలను రచించారు. అందులో ఒకటి ఈ గడప దాకా వచ్చి అనే రచన. రాధ, మీరాల మధురభక్తి ఈ గీతంలో స్పష్టంగా కనబడుతుంది. స్వామి వస్తున్నాడన్న ఆనందంలో ఇల్లు అలికి, ముగ్గేసి, తోరణాలు కట్టి, ధూప దీపాలు వెలిగించి, చక్కని భోజనము ఏర్పాటు చేసి, సేదదీరేందుకు పానుపు వేసేలోపు  భక్తురాలు అంతలో స్వామి వెళ్లిపోయాడన్న విచారంలోని మనోభావన ఈ గీతం. ఈ ఏర్పాట్లలో మునిగి స్వామి రాకను ఏమరచేనేమో అని కారు చీకటిలో దివ్వెను చేతబట్టి ఎదురు చూస్తున్న కృష్ణ భక్తురాలి హృదయ సవ్వడులను మనోజ్ఞంగా తెలిపే గీతం ఇది. ఎదురు చూపులో శరీరం బలహీనమై, శక్తి అంతా కన్నీరు ధార కాగా, గాలీ దీపం ఊగిసలాడుతుండగా స్వామిని మరల రమ్మని వేడుకునే గీతం అమ్మ శోభారాజు గారు అద్భుతంగా రచించారు.

భక్తికి శరణాగతి అతి ముఖ్యం. ఈ శరణాగతిని నేను శోభారాజు అమ్మలో పరిపూర్ణంగా గమనించాను. కృష్ణభక్తిలో ఉన్న వారిలో ఈ శరణాగతితో పాటు, ప్రశాంతత, స్థితప్రజ్ఞత, దృఢమైన వ్యక్తిత్వం, పరమాత్మతో ఓ విలక్షణమైన అనుబంధం కలిగి ఉంటారు. శోభారాజు గారు చేస్తున్న సేవ అమూల్యమైనది. ఆధ్యాత్మిక సంపదతో పాటు వ్యక్తిత్వ వికాసంతో కూడిన సామాజిక స్పృహ కలిగిన శోభారాజు గారు మన సమాజాన్ని, నేటి హిందుత్వాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యల గురించి సుస్ఫటమైన భావనలు కలిగిన వారు. డొల్లతనాన్ని, ద్వంద్వ ప్రమాణాలను, కుహనా వాదాలను, దురాచారాలను ఖండిస్తూ ఈ సమాజంలో  పోరాటం సాగిస్తున్న యోధురాలు అమ్మ. ఒక్క గీతంలో ఇన్ని భావనలను వ్యక్తపరచటం అనేది ఆ స్వామి అనుగ్రహమే. ఆధ్యాత్మిక సాధనలో, భక్తి సంగీతం ద్వారా భావకాలుష్య నివారణ అనే అద్భుతమైన లక్ష్యంతో ముందుకు వెళుతున్న శోభారాజు గారు ఇటువంటి గీతాలను ఎన్నో రచించారు. వారి భావ సంపద ఈ సమాజంలో మరింత ప్రచారంలోకి రావాలని నా ప్రార్థన.

శోభారాజు గారు ఈ గీతం ఆలపించిన రీతి అత్యంత మధురం. చరణాలు ముందుకు సాగిన కొద్దీ భావనలకు అనుగుణంగా గాత్రాన్ని మార్చి వేర్వేరు రసాలను పండించారు. స్వామీ అని పిలిచే రీతి మనసును కరగించి వేస్తుంది. బద్ధుడై స్వామి రావలసిందే అని మనసు నిశ్చయమయ్యేలా గానం చేశారు. చివరి చరణంలో శృతిని మార్చి ఆర్తితో వారు పాడిన పద్ధతి మధురభక్తికి నిదర్శనం. గీతాన్ని లలితంగా, భావనలకు అనుగుణంగా స్వరపచటంలో శోభారాజు గారి సాధన ప్రతిబింబిస్తుంది. ఈ గీత భావం అనుభవైకవేద్యం.  అన్నమాచార్య భావనా వాహిని ద్వారా ఈ గీతానికి రమణీయమైన, సముచితమైన చిత్రాలను పొందుపరచి వీడియో రూపొందించిన పార్థసారథి గారికి నా అభిననందలు, కృతజ్ఞతలు.

9, సెప్టెంబర్ 2017, శనివారం

జగమే మారినది మధురముగా ఈ వేళ - మధుర గీతం (దేశద్రోహులు చిత్రం - 1964)




సాలూరి రాజేశ్వరరావు గారు ఎంతటి మహా సంగీత దర్శకులో, ఘంటసాల మాష్టారు, సుశీలమ్మ ఎంతటి మధుర గాయకులో తెలుసుకోవటానికి కొన్ని పాటలు వింటే చాలు. సాహిత్యకారుల ప్రతిభ ఒక ఎత్తైతే దానికి తగ్గ సంగీతం అందించటం సంగీతకారుల ప్రతిభ. మేరు పర్వతమంత ఎత్తైనది సాలూరి వారి సంగీత విద్వత్తు. లలితమైన పాటలకు అత్యంత మధురమైన సంగీతాన్ని అందించటంలో ఆయన మేటి. అటువంటి పాటను ప్రతిభామూర్తి ఆరుద్ర గారు రచించగా రసాలూరించే సాలూరి వారు స్వరపరచగా మధుర గాయకులు ఘంటసాల మాష్టారు, సుశీలమ్మ ఎంతో మధురంగా పాడారు. ఇది 1964లో విడుదలైన దేశద్రోహులు చిత్రంలోని జగమే మారినది మధురముగా ఈ వేళ అన్న పాట. ఇది చిత్రంలో రెండు సందర్భాలలో వస్తుంది. మొదటిది సుశీలమ్మ, ఘంటసాల మాష్టారు యుగళ గీతంగా పాడగా, రెండవది భగ్న ప్రేమికునిగా నాయకుడు అన్న ఎన్‌టీఆర్‌పై కాస్తంత బరువైన సన్నివేశంలో చిత్రీకరించబడి ఘంటసాల మాష్టారు అత్యద్భుతంగా పాడిన గీతం. యుగళ గీతం ఉత్సాహంగా సాగేదైతే సోలో గీతం కాస్త గంభీరంగా సాగుతుంది. సంగీతకారులు మరియు గాయకుల ప్రతిభ విలక్షణంగా తెలుస్తుంది. కళ్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ గీతం అజరామరమై నిలిచింది. పాట మొత్తం అద్భుతమైన స్వరాలతో సితార్, తబలా వాద్య నాదాలతో రాజేశ్వరరావు గారు స్వరపరచారు.

ఆరుద్ర గారి గీతంలోని భావాన్ని పరిశీలిస్తే, లలితమైన పదాలతో ఎంతటి మధురమైన భావనలను పండించారో అర్థమవుతుంది. మనసు నెమలిలా ఆడిందట, పావురాలు పాడాయట, జగమంతా ఎంతో మధురముగా మారిందట. గొరవంక, రామచిలుక చెంత చేరగా అవి అందమైన జంటగా కనబడ్డాయట. ప్రేమ, స్నేహము కలిసి జీవితము పండగా ఓ చిత్రమైన పులకింత కలిగిందట. విరజాజి పూవుల సువాసన స్వాగతము పలుకగా, తుమ్మెద ఆ జాజులలోని మధువు యొక్క తీయదనాన్ని కోరి ప్రేమలో తేలుతూ తిరిగాడిందట. ప్రేమలో పడిన వారికి కలలు, కోరికలు తీరినప్పుడుండే భావనలను ఈ గీతం తెలుపుతుంది. గీతమంతా ఒకే సాహిత్యాన్ని ఉపయోగించి ఒక్క ఆఖరి పంక్తిలో సందర్భోచితంగా సాహిత్యాన్ని మార్చి పాట భావం ఏ మాత్రం చెదరకుండా రచించిన ఆరుద్ర గారి ప్రతిభ అమోఘం.

మాధుర్యానికి మారు పేరు సుశీలమ్మ, అంతే గొప్పగా ఘంటసాల మాష్టారు స్వరయుక్తంగా పాడారు. ఇద్దరూ కలిసి కొన్ని వందల పాటలు దశాబ్దాల పాటు పాడారు. వారిరువురూ తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని మధురమైన గీతాలతో అలరించారు. ఒకరకంగా సాలూరి వారు, ఘంటసాల, సుశీలమ్మల బృందం ఆనాడూ ఈనాడూ కూడా టాప్ క్లాస్ అని చెప్పుకోవాలి. సంగీతానికి, మాధుర్యానికి, భావసంపదకు ఆనాడు ఎంత ప్రాధాన్యముండేదో, వాటికి తగినట్లు గాయకులు కూడా తమలోని ప్రతిభ పాటను మరింత ప్రేక్షకుల మనసులను దోచుకునేలా పాడే వారు. అందరూ పరిపూర్ణమైన న్యాయం చేసేవారు. అందుకే ఇటువంటి పాటలు దశాబ్దాల పాటు నిలిచి మనుషుల హృదయాలను రంజిల్లజేస్తూనే ఉంటాయి.

యుగళ గీతం
సోలో

జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవి మనసారా

మనసాడెనే మయూరమై పావురములు పాడే! ఎల పావురములు పాడే!
ఇదే చేరెను గోరువంక రామచిలుక చెంత! అవి అందాల జంట!
నెనరు కూరిమి ఈనాడే పండెను! జీవితమంతా చిత్రమైన పులకింత!!

విరజాజుల సువాసన స్వాగతములు పలుక! సుస్వాగతములు పలుక!
తిరుగాడును తేనెటీగ తియ్యదనము కోరి! అనురాగాల తేలి!
ఎదలో ఇంతటి సంతోషమెందుకో! ఎవ్వరికోసమో! ఎందుకింత పరవశమో! (యుగళ గీతం)
కమ్మని భావమే కన్నీరై చిందెను! ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి!! (సోలో)


3, సెప్టెంబర్ 2017, ఆదివారం

శ్రీ విష్ణు గీతం - భారతీతీర్థ మహాస్వామి రచన


శృంగేరి శారదా పీఠ జగద్గురువు భారతీతీర్థ మహాస్వామి వారు రచించిన అద్భుతమైన విష్ణు గీతం. వారి సాహిత్యానికి ఆ చిన్నారి హరిప్రియ చేసిన నృత్యం చూస్తే మనసు ఉప్పొంగుతుంది. శ్రీహరిని శరణాగతితో పరిపరి విధాల వేడుకునే ఈ గీతం ఆది శంకరుల స్తుతులను గుర్తు చేస్తుంది. గీతం వివరాలు:

శ్రీ విష్ణు గీతం 

గరుడగమన తవ చరణకమలమిహ  మనసి లసతు మమ నిత్యం
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

జలజ నయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పదపద్మ 
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

భుజగశయన భవ మదన జనక  మమ జనన మరణ భయహారీ
మమ తాపమపా కురు దేవ  మమ పాపమపా కురు దేవ

శఙ్ఖ చక్రధర దుష్ఠ దైత్య హర సర్వలోక శరణ
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

అగణిత గుణగణ అశరణశరణద విదళిత సుర రిపు జాల
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

భక్తవర్యమిహ భూరికరుణయా పాహి భారతీ తీర్థం
మమ తాపమపా కురు దేవ మమ పాపమపా కురు దేవ

 ఓ గరుడ వాహనుడవైన శ్రీహరీ! నీ పాదపద్మములు నా మనసునందు నిత్యము ఉద్దీపనము చేయుము. నా తాపమును, పాపమును హరింపుము దేవా!  కలువలవంటి కన్నులు కలిగిన శ్రీహరీ! బ్రహ్మ,ఇంద్రుడు, జ్ఞాన గణముచే నుతించించబడిన పదపద్మములు కలవాడా! నా తాపమును, పాపమును హరింపుము దేవా!  ఆదిశేషునిపై శయనించే శ్రీహరీ! మన్మథుని తండ్రీ! నా జనన మరణ భయములను తీర్చువాడా  నా తాపమును, పాపమును హరింపుము దేవా!  శంఖ చక్రములని ధరించిన నారాయణా! దుష్టులైన రాక్షసుల హరించినవాడా! సర్వలోకములకు రక్షణ కలిగించే వాడా! నా తాపమును, పాపమును హరింపుము దేవా! ఎనలేని సుగుణములు కలిగిన నారాయణా! దీనులకు దిక్కైనవాడా! దేవతల వైరులను సంహరించువాడా! నా తాపమును, పాపమును హరింపుము దేవా! నీ భక్తుడనైన ఈ భారతీతీర్థుని అపారమైన కరుణతో రక్షించుము. నా తాపమును, పాపమును హరింపుము దేవా!

జగద్గురు భారతీతీర్థస్వామి వారి సంగ్రహ చరిత్ర:



1951వ సంవత్సరం ఏప్రిల్ 11న (ఖర నామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్టి నాడు) గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతమైన దాచేపల్లి సమీపంలో నాగులేరు ఒడ్డున అలుగుమల్లిపాడులో తంగిరాల వేంకటేశ్వర అవధాని, అనంతలక్ష్మమ్మ దంపతులకు నోముల ఫలంగా బాలుడు జన్మించాడు. అవధాని గారు నిత్యము భవానిశంకరునికి రుద్రాభిషేకం చేసే వారు. అలాగే రామనవమి సమయంలో నవరాత్రి ఉత్సవాలు చేసేవారు. అనంతలక్ష్మమ్మ హనుమంతుని ధ్యానించేది. నలుగురు ఆడపిల్లల తరువాత మగపిల్లవాడు పుడితే సీతారాముల పేరు, ఆంజనేయుని పేరు పెట్టుకోవాలని ఆ దంపతులు సంకల్పించారు. అందువలన ఆ బాలునికి తల్లిదండ్రులు సీతారామాంజనేయులు అని నామకరణం చేశారు. మూడేళ్ల వయసు నుండే శివనామాన్ని ఆ బాలుడు స్మరించాడు. నిరంతరం స్వామి నామ స్మరణలో తనను తాను మరచే వాడు. ఐదేళ్ల వయసుకే సంస్కృతాన్ని ప్రతాపగిరి శివరామశాస్త్రి గారి వద్ద నేర్చుకోవటం ప్రారంభించారు. తొమ్మిదేళ్ల వయసుకే సంస్కృతంపై పట్టు సాధించారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మొదలైన పండితుల మన్ననలు పొందారు. ఆకాశవాణిలో సంస్కృత కార్యక్రమాలలో పాల్గొనటానికి సీతారామాంజనేయులును పిలిచారు. సంహిత, బ్రాహ్మణ, అరణ్యక చిన్న వయసులోనే చదివిన సీతారామాంజనేయులు గుంటూరు జిల్లా వేదప్రవర్ధక విద్వత్ పరీక్షలో ఉత్తీర్ణులైనారు.

1961వ సంవత్సరంలో సీతారామాంజనేయులును ఉపాధ్యాయుడు విజయవాడలో పర్యటిస్తున్న శృంగేరి శారదా పీఠం అధిపతి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి ముందు సంస్కృతంలో సంభాషించ వలసిందిగా కోరాడు. సుస్పష్టంగా సంస్కృతంలో మాట్లాడటంతో ఆ బాలుడికి ప్రత్యేక బహుమతి లభించింది. అప్పుడు స్వామి దర్శనంతో ఆ బాలుడి మనసులో ఆయనే తనకు దారి, గురువు అని నిశ్చయమైంది. 1966వ సంవత్సరంలో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఉజ్జయినిలో చాతుర్మాస్యం చేస్తున్నారు. అక్కడికి స్వామి ఆశీస్సులకై సీతారామాంజనేయులు తల్లిదండ్రులతో వెళ్లి తనకు శాస్త్రాలను బోధించవలసిందిగా కోరాడు. క్షిప్రా నదిలో స్నానమాచరించి వస్తున్న స్వామి ఆ బాలుని వైరాగ్యము, భక్తి చూసి ఎంతో సంతోషించి శిష్యునిగా స్వీకరించారు. ఎక్కడ నరసరావుపేట? ఎక్కడ ఉజ్జయిని? ఉన్నత పాఠశాల విద్య చదువుతున్న బాలుడు మంచి చదువులు చదవాలని తండ్రి అభిలాష. మరి ఏమిటీ అనుకోని మలుపు? ఇదంతా ఆ శారదాంబ అనుగ్రహమే అన్నారు భారతీతీర్థ స్వామి వారు. చిన్ననాటి దర్శనం తరువాత అభినవ విద్యాతీర్థ స్వామి వారే తన మనసులో నిలిచి తనను ముందుకు నడిపారని, తన సమస్యలకు పరిష్కారం చూపారని, ఆ గుర్వనుగ్రహమే తనను అంత బలీయంగా ఉజ్జయినికి తీసుకు వెళ్లిందని అన్నారు.



అప్పటినుండి సీతారామాంజనేయులు స్వామితోనే ఉన్నారు. ఎనిమిదేళ్లలో కృష్ణ యజుర్వేదం, పూర్వ ఉత్తర మీమాంసలు, న్యాయశాస్త్రముతో పాటు మరెన్నో శాస్త్రాలను అధ్యయనం చేశారు. సంస్కృతంలో రచనలు కూడా చేశారు. 1974వ సంవత్సరంలో అభినవ విద్యాతీర్థస్వామి వారు సీతారామాంజనేయులుకు సన్యాస దీక్షనిచ్చి వారిని భారతీతీర్థస్వామిగా నామకరణం చేశారు. స్వామి వారు అప్పటికే మాతృభాష తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషలలో కూడా ప్రావీణ్యం పొందారు. సన్యాస స్వీకారం వెంటనే గురువులతో కలసి విజయయాత్ర చేశారు. గురువులతో కలసి ఉత్తరభారత దేశంలో పర్యటించినప్పుడు సంస్కృత హిందీ భాషలలో అక్కడి పండితులు, యోగులు, స్వాములతో సంభాషించి వారి మన్ననలు పొందారు. భారతీతీర్థ స్వామి వారికి అమితమైన గురుభక్తి. నిరంతరం గురువులను అనుసరిస్తూ, గమనిస్తూ వారి సుశ్రూషలో గడిపేవారు. 15 ఏళ్ల పాటు ఆ విధంగా తన గురువులైన మహాస్వామి వద్ద అమూల్యమైన సమయం గడిపి ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పొందారు.

1989లో గురువుల మహాసమాధి తరువాత భారతీతీర్థస్వామి శృంగేరి శారదా పీఠానికి 36వ మహాస్వామిగా పీఠాధిపత్యాన్ని స్వీకరించారు. వేద విద్యను అభివృద్ధి చేయటానికి, సనాతన ధర్మ పరిరక్ష్ణకు విశేషమైన సేవలు అందిస్తూ అమిత తపోబల సంపన్నులై, పరమ నిష్ఠా గరిష్ఠులై దేశంలోనే అతి పవిత్రమైన పీఠంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. శారదా ధన్వంతరి ఆసుపత్రి స్వామి వారి సంకల్పబలంతో సాకారమైంది. ఈ ఆసుపత్రి ద్వారా శృంగేరి మరియు చుట్టు పక్కల గ్రామాలకు వైద్య సేవలందిస్తున్నారు. వేదపండితుల దయనీయ పరిస్థితి గ్రహించిన స్వామి వారు పండితులకు జీవనభృతిని కలిగించే ఏర్పాటు చేశారు. ఇక్కడి వేదపాఠశాలలో అత్యుత్తములైన పండితులను విద్యార్థులకు బోధించేలా నియమించి వేదవిద్యాభివృద్ధికి తోడ్పడుతున్నారు. లోక కళ్యాణార్థం పీఠం ఆధ్వర్యంలో శత, సహస్ర చండీ హోమాలు, అతిరుద్ర యాగాలు నిరంతరం నిర్వహించేలా స్వామి ఏర్పాటు చేశారు. పీఠాన్ని దర్శించుకునే భక్తుల కోసం శారదా కృప, యాత్రి నివాస్‌ల పేరిట వసతి గృహాలను నిర్మించారు. ఎన్నో ఏళ్లుగా చాతుర్మాస్య దీక్షా సమయంలో బ్రహ్మసూత్ర భాష్యాల వివరణ చేస్తూ సనాతన ధర్మ ప్రచారానికి తొడ్పడుతున్నారు.

2015 జనవరి 22న తిరుపతికి చెందిన యువ బ్రహ్మజ్ఞాని కుప్పా వేంకటేశ్వర ప్రసాద్ గారిని తన శిష్యునిగా స్వీకరించి అతనిని సన్యాసాశ్రమంలోకి ప్రవేశ పెట్టారు. భారతీతీర్థస్వామి వారి అనంతరం ఈ విదుశేఖర భారతీస్వామి వారు శృంగేరి పీఠాన్ని అధిరోహిస్తారు. శృంగేరి పీఠంలో తెలుగు స్మార్త బ్రాహ్మణులు పీఠాధిపతిగా పరంపర ఈ విధంగా కొనసాగబోతోంది. శ్రీ గురుభ్యో నమః.

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...