22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

పంచాశత్పీఠ రూపిణీ - దీక్షితుల వారి కృతి


పంచాశత్పీఠ రూపిణీ! మాం పాహి శ్రీ రాజరాజేశ్వరీ!

పంచదశాక్షరి! పాండ్యకుమారి! పద్మనాభ సహోదరి! శంకరి!

దేవీ! జగజ్జననీ! చిద్రూపిణి!
దేవాది నుత గురుగుహ రూపిణి!
దేశకాల ప్రవర్తిని! మహాదేవ మనోల్లాసిని! నిరంజని!
దేవరాజ ముని శాప విమోచని! దేవగాంధార రాగ తోషిణి!
భావ రాగ తాళ విశ్వాసిని! భక్త జన ప్రియ ఫల ప్రదాయిని!

ఏబది శక్తిపీఠములలో వెలసిన రాజరాజేశ్వరీ! నన్ను కాపాడుము! పదిహేను బీజాక్షరములు కల మంత్రరూపిణి! పాండ్యరాజుని కుమార్తెగా జన్మించిన మీనాక్షీ! శ్రీహరి సోదరీ! శంకరుని అర్థాంగీ! నన్ను కాపాడుము! ఓ దేవీ! నీవు లోకాలకే అమ్మవు! జ్ఞాన స్వరూపిణివి! దేవతలచే నుతించిబడిన కుమారుని తల్లివి! ఎల్లవేళలా అంతటా ప్రకాశించే అమ్మవు! పరమశివుని మనసును రంజిల్లజేసే నిర్మల మూర్తివి! మునులచే శపించబడిన ఇంద్రుని శాపవిముక్తుని చేసిన అమ్మవు! దేవగాంధార రాగములో అలరారి, భావ రాగ తాళములను విశ్వసించెదవు! భక్తుల కామ్యములను తీర్చెదవు! నన్ను కాపాడుము!

- ముత్తుస్వామి దీక్షితులు

శూలమంగళం సోదరీమణులు గానం చేసిన ఈ దీక్షితుల వారి కృతి దేవగాంధారి రాగంలో స్వరపరచబడింది. సగీత త్రయంలో దీక్షితుల వారి సాహిత్యంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.  వ్యాకరణము, మంత్రము, యోగము, భక్తి, క్షేత్ర వర్ణన, శ్రీ విద్యా ఉపాసన, తిరుత్తణి గురుగుహోపాసన దీస్ఖితుల వారి సాహిత్యంలో ప్రకాశిస్తూ ఉంటాయి. దీక్షితుల వారు తమ అనేక కీర్తనలలో తమ మంత్రశాస్త్ర ప్రావీణ్యంతో పాటు రాగం పేరును కూడా ప్రస్తావించారు. దేశమంతటా తిరిగి అనేక క్షేత్రాలలోని దేవతామూర్తులను దర్శించుకొని వారిని సంకీర్తనల ద్వారా నుతించారు. ఎక్కువ భాగం కీర్తనలను సుబ్రహ్మణ్యునిపైన, తరువాత అమ్మవారిపైన రచించారు. వీరిద్దరిని ఆయన బాగా ఉపాసించి సిద్ధి పొందారు. దేశంలో ఉన్న యాభై శక్తిపీఠాలను కూడా ఆయన సందర్శించారని ఆయన చరిత్ర చెబుతోంది. క్షేత్ర వైభవాలను మనకు అందించిన మహనీయులలో దీక్షితుల వారు అగ్రగణ్యులు. దేహాన్ని త్యజించే సమయంలో కూడా ఆయన అమ్మను స్మరించగలిగిన అపర భక్తులు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి