4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ఈ సృష్టిలో బ్రాహ్మణత్వం ఎందుకు వర్ధిల్లాలి?

మానవ జన్మ యొక్క ప్రధాన లక్ష్యం సత్యాన్ని తెలుసుకోవటం, అనగా ఈ విశ్వంలో అణువణువునా నిండి ఉన్న విశ్వజనీన శక్తిలో మనమూ ఒక అణుభాగమని ఎఱిగి దానితో అనుసంధానం చేసుకోవటం. అది తెలిసిన వాడే బ్రాహ్మణుడు. అనితర నిత్య సత్యాన్వేషణ బ్రాహ్మణునికి ఉపాధి, జీవితము, పరమార్థమూను. ఈ సత్యాన్వేషణకే విద్య, ఆధ్యాత్మికత, స్థితప్రజ్ఞత, ఫలాపేక్షలేని జీవన విధానం. మరి సత్యం ఎందుకు కావాలి? మా జీవితమే మాకు సత్యం అని మిగిలిన మూడు వర్ణాల వారు, నాస్తికులు, వితండవాదులు ప్రశ్నించవచ్చు. స్వానుభవంలో విలువైన సమయం గడిచిపోతుంది, మనస్సాక్షి మనలను చాలా సందర్భాలలో తప్పుదారి పట్టిస్తుంది. కారణం? సత్యం కానిది ప్రపంచం. అనాదిగా ఋషిప్రోక్తమైన వేదవాఙ్మయం,అనేక దార్శనికుల అనుభూతుల ద్వారా రచించబడిన పురాణేతిహాసాలు, పెద్దల నడవడిక మనకు అత్యంత సులభమైన మార్గాలను తెలియజేశాయి. ఇవి కాలపరీక్షను తట్టుకున్నవి. ప్రతి ఒక్కరికీ వీటిని తెలుసుకునే సమయం, అవకాశాలు, పరిస్థితులు ఉండటం అసంభవం, ఉన్నా సఫలం కాకపోవచ్చు కూడా. ఎందుకంటే సత్యాన్వేషణకు ఒకరకమైన జీవనశైలి కావాలి, ఎంతో త్యాగం చేయాలి. ప్రతి అడుగులోనూ సత్యాన్ని ఆచరించగలిగే సంకల్పం ఉండాలి. ఇవి బ్రాహ్మణత్వానికి కావలసిన అర్హతలు, నియమావళిలో, శాస్త్రాలలో స్పష్టంగా చెప్పబడ్డాయి. ఒక్కసారి వాటిని గుర్తు చేసుకుందాం:

1. పూర్తిగా సాత్వికమైన ఆహారం
2. ఉపనయన సంస్కారం, త్రికాల సంధ్య
3. వేదాధ్యయనం
4. నిరాడంబరమైన గృహస్థ జీవితం, సంయమనం
5. ఫలాపేక్ష లేని కర్మానుష్ఠానం

పైవి ఎందుకు అన్నవి అనేకమార్లు చెప్పుకున్నాం. ఐదూ కూడా ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నవే. ధర్మానికి మూలము, వెన్నెముక అయిన సత్యాన్ని నిరంతరం తెలుసుకునే ప్రయత్నంలో ఉండే బ్రాహ్మణుని మించిన సమాజ శ్రేయోభిలాషి మరొకడుండడు. అందరు బ్రాహ్మణులు ఇలానే ఉంటారా అని ప్రశ్నించే వారికి సమాధానం ఉండేవాడే, ఆ ప్రయత్నం చేసేవాడే బ్రాహ్మణుడు. సత్యాన్వేషణ ద్వారా ధర్మాచరణ అనేది ప్రతి ఒక్క ఉపాధిలోనూ చాలా ముఖ్యం. అది కొంతైనా పాటించబడుతుంటేనే ఈ మానవ ప్రపంచంలో శాంతి మిగిలేది. లేకపోతే ప్రతిక్షణము అల్లకల్లోలమే. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకునే ధీరత, జ్ఞానం, ప్రశాంతమైన వ్యక్తిత్వం బ్రాహ్మణత్వం ద్వారా సమాజంలో పెంపొందించబడుతుంది, తద్వారా పాలకులకు, ప్రజలకు మార్గదర్శకమవుతుంది.

ఎలాగైతే, ఒక బిడ్డకు తల్లి తండ్రి ఇద్దరి ఆలంబన కావాలో, ఎలాగైతే ఒక చెట్టుకు ఎండ గాలి నీరు కావాలో, ఎలాగైతే ప్రకృతిలో పంచభూతాలు సృష్టి క్రమానికి అవసరమో, అలాగే సమాజంలో సత్యాన్వేషకుడు, ధర్మపరాయణుడు, సత్యబోధకుడు అయిన బ్రాహ్మణుడు ముమ్మాటికీ కావాలి. అందుకే బ్రాహ్మణత్వం వర్ధిల్లాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి