4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

శర్మ-శాస్త్రి-వేదలక్షణాలు-వేదాధ్యయనం

బ్రాహ్మణంలోని పురుషులను సంబోధించేవి శర్మ, శాస్త్రి. పేరు చివరన వీటిని కలిగిన వారు సాధారణంగా బ్రాహ్మణులుగా పరిగణించబడతారు. ఏమిటి వీటికి తేడా?

శర్మ - ఉపనయన సమయంలో కృష్ణాజినం ధరించటం ద్వారా వటువు శర్మ అవుతాడు. కృష్ణాజినానికి మామూలు అర్థం జింకచర్మం అయినప్పటికీ, దానిలో గూడార్థం ఉంది. అది త్రయీ విద్యాస్వరూపమని విశ్వాసం. త్రయీవిద్యా అనగా మూడు వేదములను అభ్యసించటం. జింక చర్మం ధరించినవారు ఈ వేదవిద్యలో ప్రతిష్ఠులై, చిత్తశుద్ధి కలిగి క్రమంగా శర్మ అవుతారు. అనగా శాశ్వతానంద అనుభూతికి యోగ్యులవుతారు. వేదవిద్యలు గురుముఖత నేర్చుకోవలసినవి. ప్రవర, సంకల్పం చెప్పే సమయంలో ఈ శర్మను పేరు చివర జోడించటంలో పరమార్థం ఆ అనందానికే సమస్త కర్మలు, అధ్యయనాలు అని సూచించటానికి, నిరంతరం సాధకులకు గుర్తు చేయటానికి. ఈ వేద విద్యల అధ్యయనం, సంధ్యావందనం మొదలైనవి చేయని వారికి శర్మ అని చెప్పుకునే అర్హత లేదు.

శాస్త్రి - శాస్త్రములు తెలిసినవారు వారు శాస్త్రిగా పిలువబడతారు. ఏమిటా శాస్త్రాలు? ఇవి ఆరు. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం. ఈ శాస్త్రాలు కూడా గురుముఖత నేర్చుకోవలసినవి. ఈ శాస్త్రాల అధ్యయానికి ఉపనయనము జరిగి కొంత క్రమశిక్షణ ఏర్పడి, సంధ్యావందనాది నిత్యానుష్ఠానములు చేసే వారు అర్హులు. ఆ ఆరు శాస్త్రాలను షడంగాలు/వేదాంగాలు అంటారు.

ఈ విధంగా శర్మ, శాస్త్రి అన్న సంబోధనలు వచ్చాయి. ఇవి రెండూ కూడా జన్మతో ఆపాదించేవి కాదు, సంస్కారముల తరువాత సాధనతో, అధ్యయనంతో సంపాదించుకోవలసినవి.

వేదాల యొక్క లక్షణాలు ఏమిటి?

మంత్రాల ఓజస్సును, శక్తిని కాపడేవి ఈ లక్షణాలు. వర్ణక్రమం అనే ఓ గొప్ప సాంప్రదాయం ఈ మంత్రాలను సురక్షితం చేశాయి. వేదమంత్రోచ్ఛారణలో ధ్వని, స్థాన,కరణ, ప్రయత్న, మంత్ర, స్వర, దేవతా జాతులనే ఎనిమిది లక్షణాలను సాధకులు పాటించవలసి ఉంటుంది. ఎలా పడితే అలా నేర్చేసుకుని పఠించటం సరైన పద్ధతి కాదు.

అసలు వేదాధ్యయనానికి ఎంత సమయం పడుతుంది?

వేదంలో ఎన్నో శాఖలు. ఒక్కొక్క వేదం నేర్చుకోవటానికి దాదాపుగా 12 సంవత్సరాలు పడుతుంది. అంటే, నాలుగు వేదాలు సరైన పద్ధతిలో నేర్చుకోవాలంటే 48 ఏళ్లు లేదా అంతకు పైగా సమయం పడుతుంది. కాబట్టి వేదాల శాఖలను అధ్యయనం చేసే సాంప్రదాయం వచ్చింది. గతంలో ఈ వేదాధ్యయన సమయంలో శిష్యులు గురుకులంలోనే నివసించేవారు. చాలా మార్లు వంశానుక్రమంగా ఏ శాఖలనైతే అధ్యయనం చేశారో వానినే శిష్యులు ముందుకు కొనసాగించటం ఓ పద్ధతి. శిష్యుని యొక్క సామర్థ్యం, శ్రద్ధాసక్తులను బట్టి వేదాధ్యయన సమయం, ఉత్తీర్ణత అనేవి నిర్ణయించబడతాయి. వాక్శుద్ధి, శుద్ధ అంతఃకరణం కలిగి, పైన చేప్పిన వేదలక్షణాలను పాటించే గురువులవద్దే అధ్యయనం చేయాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి