11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ఏమయ్య రామ - -భద్రాచల రామదాసు కృతి

ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైన నీ మాయ తెలియ వశమా

కామారి వినుత గుణ ధామ కువలయదళ శ్యామ నను గన్న తండ్రీ! శ్రీరామా!

సుతుడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవుడు అతిబలుడనుచు కపులు 
క్షితినాథుడనుచు భూపతులు కొలిచిరి గాని పతితపావనుడనుచు మతి తెలియలేరైరి

నరుడనుచు నరులు తమ దొర వనుచు యాదవులు వరుడనుచు గోప సతులు 
కరి వరద భద్రాద్రి పుర నిలయ రామ దాస పరమాత్ముడని నిన్ను భావింపలేరైరి

ఓ రామ్మా! నీ మాయ బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలకైన తెలియ వశము కాదు. శ్రీరామా! మన్మథుని శత్రువైన పరమశివునిచే నుతించబడినవాడవు, సకల గుణములకు నిలయమైన వాడవు, కలువరేకుల వంటి కన్నులు కలిగిన నీలమేఘ శరీరుడవు, నీవే కదా నా కన్న తండ్రివి! నీవు తన కుమారుడవని దశరథుడు, శ్రేయోభిలాషివని సుగ్రీవుడు, మహావీరుడవని వానరులు, చక్రవర్తివని రాజులు కొలిచారు, కానీ, నీవు పాపాత్ములను పావనము చేసే వాడవని గ్రహించలేకపోయారు. మానవులు నీవు వారితోటి మానవుడవని, యాదవులు తమ దొరవని, గోపస్త్రీలు తమ వరుడవని భావించారు. గజేంద్రుని రక్షించి భద్రాద్రి యందు వెలసిన రామా! నీవు దాసుల పాలిట పరమాత్ముడవని వారు భావించలేకపోయారు. 

కాంభోజి రాగంలో కూర్చబడిన ఈ కృతిని నేదునూరి కృష్ణమూర్తి గారు ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి