5, సెప్టెంబర్ 2020, శనివారం

దూతగా హనుమాన్ - రెండవ భాగం

సరే, సీత కనిపించింది. మరి వెంటనే బయలుదేరి వెళ్లి రామునికి చెప్పవచ్చు. కానీ, అలా చేయలేదు. ఎందుకంటే, అప్పుడు సీత ఉన్న పరిస్థితి చూసి అలా చేయడం సరి కాదు అన్నది అతని నిర్ణయం. భర్తకు దూరమై, భయముతో, దుఃఖముతో, జీవన్మరణ పరిస్థితులలో ఉంది సీత. ఆమెను పలకరించి ఓదార్చి రాముని మాట చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ, తానేమో వానరం, ఆమెతో బిగ్గరగా మాట్లాడితే ఆమె భయపడి అరచితే రాక్షసులు మేల్కొంటారు, సీతను హింసిస్తారు, రావణుడు నాపై యుద్ధానికి రాక్షసులను పంపుతాదు. నేను తిరిగి వెళ్ళటం కష్టతరమవుతుంది దాని వల్ల అరిష్టం అని గ్రహించి రామ గుణ కీర్తన ఆరంభిస్తాడు హనుమాన్. సీత సందేహిస్తుంది. తన వాఙ్నైపుణ్యంతో ఆమెకు విశ్వాసం కలిగిస్తాడు. ఆమె హనుమను గుర్తిస్తుంది. మనసు కుదుటపడుతుంది. సరే, ఇంతటితోనైనా తన కార్యం పూర్తి అనుకోలేదు హనుమ.

రాక్షసుల బలం, ఆ లంకా నగర నిర్మాణ విధానం తెలుసుకోవాలి. తామసులైన రాక్షసులకు సామదానభేదదండోపాయాలలో దండోపాయమే సరైన మార్గము. రావణుని హృదయము, రాక్షస బలము తెలుసుకోవాలంటే యుద్ధం చేయాలి. అశోకవన విధ్వంసం ద్వారా అది సిద్ధిస్తుంది. కొందరు రాక్షసులను చంపితే వారు భయపడతారు. వారి బలాబలాలు తెలుసుకోవచ్చు. ఇదే అసలు పరమార్థం.

సరే, తాను అనుకున్నట్లు యుద్ధం జరిగింది, లంక భయభ్రాంతమైంది, హనుమ బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాడు. రావణుడు అడిగితే - నేను వానరుడను, నీ దర్శనం కోసం వనధ్వంసం చేశాను, ఆత్మ రక్షణకై రాక్షసులను ఎదుర్కొన్నాను, నేనొక రాచకార్యంపై వచ్చాను, రాముని దూతగా, నీ హితవు కోరి వచ్చాను అని ప్రియమైన మాటలు పలుకుతాడు. కోపోద్రిక్తుడైన రావణుడు హనుమను వధించమని ఆజ్ఞాపిస్తాడు. విభీషణుని మాటలతో శాంతించి లాంగూల దహనానికి ఆజ్ఞాపిస్తాడు. రాముని కోసం ఆ రాక్షస అకృత్యాన్ని సహిస్తాడు. సీతమ్మ తల్లి అనుగ్రహంతో చల్లదనాన్ని, పరిమళాలను పొంది ప్రకాశించాడు. అగ్నిదేవునికి సంతృప్తి కలిగించటానికి, రాక్షసులకు సంతాపం కలుగజేయటానికి లంకాదహనమే సరైనది అని నిశ్చయించుకుని తగులబెట్టాడు. తన రజోగుణం వల్ల కలిగిన ఆగ్రహానికి సీతమ్మ ఉన్న అశోకవనం కూడా దగ్ధమైందో, దాని వల్ల ఎంత అరిష్టం అని పరి పరి విధాలా చింతించి, కొన్ని శుభ శకునాల వల్ల సీత సుఖంగా ఉందని భావించి, ఆమెని చూసి సంతోషముగా లంకకు తిరిగి వచ్చి సీతావృత్తాంతాన్ని అందరికీ వివరిస్తాడు. రాముని గాఢ పరిష్వంగన గౌరవాన్ని పొందుతాడు. సామాన్యంగా భుజశాలి బుద్ధిశాలి కావటం అరుదు. హనుమ దానికి అపవాదం. హనుమ విషయంలో సద్యోవికసితమైన బుద్ధి ఔచిత్యం నిబద్ధంగా కార్యసానుకూల సాధనమవుతుంది.

హనుమలో పౌరుష, పరాక్రమ, బుద్ధికుశలత లక్షణాల సమగ్రత ఉంది. అందుకే జగద్వంద్యుడైనాడు. సాధారణంగా సందేశహరులు మాత్రమే దూతలు. అంతకు మించి వారి ప్రమేయముండదు. కానీ, హనుమ పరిపూర్ణమైన కార్యసాధకుడు. అందుకే దౌత్యానికి హనుమ ఆదర్శం.

జయహనుమాన్ జ్ఞానగుణసాగర!
జయకపీశ తిహు లోక ఉజాగర!

- శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి సుందరమారుతి పుస్తకం నుండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి