22, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా - శ్రీరంగం గోపాలరత్నం గారి ఆలాపన


శ్రీరంగం గోపాలరత్నం ఆంధ్రుల అనర్ఘ రత్నం అని ఊరికే అనలేదు. ఆవిడ ప్రతిభ అసమానం. అసలు తెలుగు భక్తి మరియు శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఆవిడ వంటి గాన మాధుర్యం కలవారు, గాత్రకౌశలం కలవారు, ఆవిడలాంటి సంపన్నమైన అనుభవం కలవారు మళ్లీ రాలేదు అంటే అతిశయోక్తి లేదు. విధి బలీయమై ఆవిడ చిన్న వయసులోనే రాలిపోయారు. లేకపోతే ఖచ్చితంగా మరో ఎమ్మెల్ వసంతకుమారి లేదా డీకే పట్టమ్మాళ్ అయ్యేవారు. లలిత భక్తి గీతాలైనా, యక్షగానాలైనా, అన్నమాచార్య కీర్తనలైనా, నారాయణ తీర్థుల తరంగాలైనా ఆవిడ గాత్రంలో యమునా తరంగాలలా జాలువారాయి. భావగర్భితమైన భక్తి ఆవిడ ప్రత్యేకత. ఆర్తి ఆవిడ గాత్రానికి సహజ లక్షణం. ఆవిడ ఆలపిస్తే ఆ పరమాత్మ ఎదుట నిలిచి అనుగ్రహించవలసిందే. అది ఏ రకమైన భక్తైనా కావచ్చు. పరిపూర్ణమైన కళాకారిణి గోపాలరత్నం గారు. ఆవిడ ఆలపించిన గీతాల్లో నన్ను కరగించినది ఏడిద కామేశ్వరరావు గారి ఒక పిలుపులో పిలిచితే. ఆవిడ ఆర్తి, భక్తి కళ్లు మూసుకుని అనుభూతి చెందితే, ఏడుకొండలస్వామి దిగివచ్చి తీరాలి అన్న భావన కలుగుతుంది. ఆపద మ్రొక్కుల సామీ అని గోపాలరత్నం గారు స్వామిని వేడితే ఆ స్వామి హృదయం కరిగి కరుణించవలసిందే అనిపిస్తుంది. విని మీరు కూడా ఆస్వాదించండి. ఆ మహా విదుషీమణికి వేవేల నమోవాకములు. 

ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా నా పలుకులో కులుకుతావటా
ఆపద మ్రొక్కుల సామీ! నీ సన్నిధె నా పెన్నిధీ!

కొండంత దేవుడవని కొండంత ఆశతో 
నీ కొండ చేర వచ్చితిని అండ జేసి కాపాడరా

అభయహస్తమున్నదట అభయమూర్తివీవేయట
అభయదానమిచ్చి నాకు భవతరణ పథమ్ము జూపు

వడ్డికాసువాడవట వడ్డీ వడ్డీ గుంజుదువట
అసలు లేని వారమయ్యా వెతలు బాపి కావుమయ్యా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రోజులు మారాయి – 1955: చిత్ర విశేషాలు

1955లో విడుదలైన రోజులు మారాయి సారథి ఫిలిమ్స్ నిర్మించిన సామాజిక చిత్రం. 1939లో రైతుబిడ్డ ద్వారా రైతుల సమస్యలను తెరపైకి తీసుకొచ్చిన సారథి సంస...