5, సెప్టెంబర్ 2020, శనివారం

సనాతన ధర్మం

"స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే"

- మానవులందరికీ మేలు కలుగుగాక, చెట్లు చేమలు పైకి పెరుగు గాక, రెండు, నాలుగు కాళ్లున్న ప్రాణులకు శుభము కలుగుగాక.


"భద్రం కర్ణేభి శృణు యామ దేవాః భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః"

- మా చెవులతో శుభం కలిగించేవి మాత్రమే వినెదము గాక, మా కళ్లతో శుభమునే చూచెదము గాక.


"ఆ నో భద్రా క్రతవో యన్తు విశ్వతః"

- విశ్వములోని అన్ని దిక్కుల నుండి ఉన్నతమైన ఆలోచనలు మాకు వచ్చు గాక.


"ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి"

- నీవే యదార్థము, నీవే సత్యము అని పలికెదను.


"ఋతం వచ్మి సత్యం వచ్మి"

యదార్థమును, సత్యమునే పలికెదను


"శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరివిశ్రువం"

- నా శరీరం ఆరోగ్యంగా ఉండనీ, నా నాలుక మధురమైన మాటలనే పలుకనీ, నా చెవుల ద్వారా అనేక మంచి విషయాలనే ఆలకించనీ.


"ఓం సహ నావవతు సహ నౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావిద్వాషావహై"

మనలను భగవంతుడు రక్షించు గాక, పోషించు గాక, ఇద్దరమూ ఉత్తేజితులమై పరిశ్రమించెదము గాక, మన ఏకాగ్రత ఫలవంతమగు గాక, మనమిద్దరమూ ఒకరినొకరు ద్వేషించకుండా ఉండెదము గాక.


"స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాం గోబ్రాహ్మణేభ్యశ్శుభమస్తు నిత్యం లోకాస్సమస్తా సుఖినో భవంతు"

- ప్రజలకు శుభం కలుగుగాక, రాజులు న్యాయమార్గములో ఈ భూమిని పరిపాలింతురు గాక, గోవులకు, బ్రాహ్మణులకు శుభం కలుగు గాక, సమస్త లోకములకు సుఖము కలుగు గాక.


"మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వౌషదీ మధు నక్తంతోషసి మధుమత్పితార్థివగ్‌ం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః"

- సత్కార్యం చేయదలచిన మనకు గాలి తీయగా వీచుగాక, నదులు తీయని నీటితో ప్రవహించు గాక, చెట్టు చేమలు పరిపుష్టమై ఉండు గాక, భూమి మాధుర్యాన్ని అందించు గాక, మన తండ్రియైన ఆకాశము తియ్యదనాన్ని వర్షించు గాక, చెట్టుచేమల అధిపతియైన చంద్రుడు తీయగానుండు గాక, గోవులు అధికంగా పాలనిచ్చుగాక.

ఇలా ప్రతి అడుగులోనూ మంచినే వినాలని, మాట్లాడాలని, చూడాలని, ఆచరించాలని చెప్పింది వేదరూపమైన సనాతన ధర్మం. సమస్త జీవరాశి మంచి కోరుకుని వాటికి పుష్టి, తుష్టి శాంతి కలగాలని, దానిని నమ్మి నిరంతరం పలుకమని వేదాలు ఘోషించాయి. త్రికరణములు కూడా మంచిపైనే ధ్యాస కలిగి మంచినే ఆచరించాలని సహస్రాధికంగా పలికాయి. విశాలమైన భావనలతో అందరినీ ఆహ్వానించాయి, అందరికీ శుభం కలగలాని అడుగడుగునా నినందించాయి. అదీ ఈ ధర్మం యొక్క గొప్పతనం. ప్రతి అడుగులోనూ, సూక్తం లోనూ శాంతి మంత్రంతో శాంతికాముకతను పునరుద్ఘాటించాయి.

మరి మిగిలినవో? - వాళ్లు అది చేస్తున్నారు, అది సహేతుకం కాదు, అది మూఢం, అది అనాగరికం, రాళ్లు రప్పలను పూజించటమేమిటి అని దూషించి, దుష్ప్రచారం చేసేవారొకరైతే మరొకరు బలవంతం చేసైనా సరే వారు వారి ధర్మాన్ని వీడేటట్లు చేయండి, వారి దేవాలయాలను నాశనం చేయండి, వారి సంస్కృతి సాంప్రదాయాలను నామరూపాల్లేకుండా చేయండి, వారి ఆడవారిని చెరపట్టండి అని ధర్మపరాయణులను హింసించి మతమార్పిడులు, అత్యాచారాలు చేశారు, శతాబ్దాలపాటు దేశాన్ని రక్తసిక్తం చేసి మహోన్నతమైన సంస్కృతిని కాలరాశారు.

ఎవరిది అసహనం? ఎవరిది సర్వమానవ సౌభ్రాతృత్వం? మరొక మతానికి చెందిన వారిని చంపి రక్తసిక్తం చేసేవారు శాంతికాముకులా? దారుణంగా ఆడవారిని చెరబట్టి మానభంగం చేసి చంపి మారణహోమం సృష్టిస్తున్నవారు శాంతి కాముకులా?

లేక,

సన్యాసం ముసుగులో రాసలీలు సాగిస్తూ, అన్యమత ప్రచారం కోసం ఇతరుల ఆరాధనా ప్రదేశాలను అపవిత్రం చేస్తూ, సరైన అస్తిత్వం లేక దొడ్డిదారి తొక్కి చాపకింద నీరులా ప్రజలను డబ్బుతో ప్రలోభ పెట్టి తప్పుడు మాటలతో పక్కదోవ పట్టించే వారా?

లేక

నిరంతరం యజ్ఞ యాగాదులతో, పశు సమృద్ధి, ధాన్య సమృద్ధిని కాక్షించి, పవిత్రమైన అనుష్ఠానంతో, మంచిని పలికి మంచిని పంచిన వారా? శబ్ద ప్రకంపనలతో లోకంలో సకారాత్మకతను నింపుతున్న సనాతన ధర్మ పరాణయులను అతివాదులుగా చిత్రీకరిస్తుంటే, ఆ ధర్మాన్ని దారుణంగా అపహాస్యం చేస్తుంటే కనీసం స్పందించలేని పరిస్థితులను సృష్టిస్తుంటే మనం కళ్లు మూసుకుని కూర్చోవాలా?

సత్యం సుస్పష్టం, కానీ దాని వైపు నిలబడేందుకు ధైర్యం కావాలి, నిబద్ధత కావాలి, ధర్మం యొక్క గొప్పతనం అవగతం కావాలి. సనాతనధర్మమంటేనే శాంతి, సౌభ్రాతృత్వం, సమభావం. ఇక్కడ హింసకు తావులేదు, వివక్షకు అవకాశం లేదు. వక్రీకరించే వారిని ఎదిరించవలసిన సమయం.

ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్నిబోధత!
క్షురస్య ధారా నిశితా దురత్యయా పథస్తత్కవయో వదంతి!!

లేవండి, మేల్కోనండి, జ్ఞానులను ఆశ్రయించి కర్తవ్యాన్ని తెలుసుకోండి. పదునైన కత్తివలె ఇది చాలా దుర్గమమైన మార్గము అని సత్కవులు చెబుతున్నారు. అయినా వెనుకడుగు వేయకండి.

- కఠోపనిషత్తు.

శ్రీగురుభ్యోనమ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి