5, సెప్టెంబర్ 2020, శనివారం

రామాయణంలోని ఆసక్తికరమైన విషయాలు



ఏ ఘట్టం కూడా ఒక ప్రాతిపదిక లేకుండా జరగలేదు. ప్రతి ఒక్క సర్గకూ, ప్రతి ఒక్క కాండకూ, ముందస్తుగా రంగం, పాత్రలు, ఆ పాత్రల ప్రతిస్పందనలు నిర్ణయాత్మకం. అదే వాల్మీకి మహర్షి గొప్పతనం. అటువంటి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

నేపథ్యం:

సుందరకాండలో హనుమంతుడు సీతమ్మ జాడ తెలుసుకొని, ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి బద్ధుడై రావణుని ఎదుట నిలిచి రాముని ప్రతాపం గురించి పలికి, లంకను దహనం చేసి తిరిగి వచ్చి రామునికి సీతమ్మ ఆనవాలు ఇచ్చి రామునికి ఆనందం కలిగిస్తాడు. ఇక్కడ హనుమంతునికి రామకార్యమొక్కటే కాదు, రామదూతగా శత్రువునకు రాముని పక్షం యొక్క బల పరాక్రమాల రుచి చూపించి భయం కలిగించటం, రావణునికి మరొక అవకాశం కలిగించటం. ఆ కార్యంలో హనుమ పూర్తిగా సఫలమై తిరిగి వచ్చాక యుద్ధం అనివార్యమని అందరికీ తెలుసు. కానీ, ఎవరి ప్రవృత్తులను బట్టి వారు ప్రవర్తించారు.

ఎలా?

1. విభీషణుడు అన్నకు రామబాణం యొక్క శక్తిని తెలిపి అతనికి నచ్చచెప్ప జూచి అది ఫలించక రాముని పక్షాన చేరి శరణు కోరటం. అనగా, మంచి వైపు చేరే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అన్న రాక్షస ప్రవృత్తిని ఇక ఏ మాత్రం సమర్థించను అన్న నిర్ణయానికి రావటం. మరి రాముడేం చేశాడు? వైరి తమ్ముడు వచ్చి తన శరణు కోరాడు కాబట్టి అతనిని స్వాగతించాడు. అది సత్పురుషుల లక్షణం. ఈ రామ-విభీషణ సమాగమం విభీషణుని రామభక్తునిగా, తద్వారా రామానుగ్రహంతో లంకానగరానికి పాలకునిగా మరియు చిరంజీవిని చేసింది.

2. వానరసైన్యం సహాయంతో రాముడు తనపై యుద్ధానికి వచ్చాడు అన్న సంగతి తెలిసినా, రావణుడు తన కుతంత్రాన్ని వీడలేదు. 10 యోజనముల మేర వానరసైన్యమున్నదన్న శార్దూలుని మాటలకు కలవరపడి మిత్రభేధం కలిగించాలని ప్రయత్నం చేశాడు. రామసుగ్రీవ మైత్రికి విఘాతం కలిగించటానికి శుకుడనే వానిని పక్షిరూపంలో వెళ్లి సుగ్రీవునికి మాయమాటలు చెప్పమని ఆజ్ఞాపిస్తాడు. శుకునికి సుగ్రీవునితో ఇలా చెప్పమని పలుకుతాడు " ఓ సుగ్రీవా, నీవు మహావీరుడవు, గొప్పవాడవు, ఈ యుద్ధం వలన నీకు ఒరిగేదేమీ లేదు, నీవు నాకు సోదరుని వంటి వాడవు, నేను సీతను అపహరిస్తే నీకెందుకు? కాబట్టి కిష్కింధకు తిరిగి వెళ్లిపో". ఆ మాటలు విన్న వానరసైన్యమంతా ఆ పక్షిరూపంలో ఉన్న శుకుని రెక్కలు తెంచి అతని చంపబోతాయి.

3. ఆ శుకుడు భయంతో రామునితో దూతను చంపటం న్యాయం కాదు అని పలుకుతాడు. అంతా విన్న సుగ్రీవుడేమన్నాడు? అతను కూడ మిత్రధర్మాన్ని నిర్వర్తించాడు. రావణుని మాయమాటలకు లొంగకుండా - "ఓ రావణా! నీకు నాకు భ్రాతృ బంధం లేదు, రాముని శత్రువైన నీవు అధర్మానికొడిగట్టిన వాలిలా రాముని చేత హతుడవవుతావు, నీవు జటాజటాయువును చంపి, సీతమ్మను అపహరించి అధర్మానికొడిగట్టావు, నీకు మరణం తప్పదు" అని శుకుని ద్వారా సందేశం పంపి రావణుని హెచ్చరిస్తాడు.

4. మరి రాముడేం చేశాడు? భయంతో తనను చంపవద్దు దాని వల్ల రామునికే పాతకమన్న శుకుని మాటలు విని అతనిని విడిచిపెట్టమని వానరులను ఆజ్ఞాపించాడు. ఇక్కడ మనం గమనించవలసింది హనుమ లంకకు వెళితే రావణుడు అతనిని చంపమని ఆజ్ఞాపించి, తిరిగి విభీషణుని సలహా మేరకు దూతను చంపకుండా అతనికి శక్తికి సంకేతమైన లాంగూలానికి నిప్పంటించమని ఆజ్ఞాపిస్తాడు, దాని వల్ల నష్టం ఎవరికి జరిగింది? లంకకే! మరి రాముడేం చేశాడు? శుకుని చంపకుండా వదిలేస్తాడు. దీని వల్ల లాభమేమిటి? రాముని గొప్పతనం, రామసుగ్రీవుల మైత్రీబంధం రావణునికి వివరంగా తెలుస్తాయి. ఇక అతనికి మరణం తథ్యం. కానీ, రామయ్య వెంటనే ఆ పని చేయలేదు. మరిన్ని వివరాలు రేపు.

అడుగడుగునా రామయ్య ధర్మాన్ని పాటించాడు, పరిస్థితిని ధర్మ విజయానికి అనుకూలంగా తీర్చిదిద్దాడు. రావణుడో? ప్రతి అడుగూ, తన వినాశనానికే దారి తీసేలా చేసుకున్నాడు.

శ్రీరామ జయం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి