22, సెప్టెంబర్ 2020, మంగళవారం

చూడగల్గెను రాముని సుందర రూపము - తూము లక్ష్మీనరసింహదాసు కృతి


తూము లక్ష్మీనరసింహదాసు గారు - భద్రాద్రి శ్రీరాముని తన ఇష్టదైవంగా జీవితాంతం సేవించి తరించిన భక్త శిఖామణి. భద్రాచల రామదాసు కర్మలేశం అనుభవించడానికి ఇలా మరలా జన్మించాడని కొందరి భావన. తూము నరసింహదాసుది గుంటూరు ప్రాంతం. వీరి తండ్రి అప్పయ్య, తాత వెంకటకృష్ణయ్యలు శిష్టాచారపరులుగా ప్రసిద్ధులు. వీరు 1790లో అప్పయ్య, వెంకమాంబ దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. ఇరవై సంవత్సరాల వయసులో తండ్రి పరమపదించడంతో కుటుంబ భారం దాసుపై పడినది. అందుకోసం పొన్నూరులో పేష్కారుగా పనిచేశారు. వంశానుగతంగా దాసుకు లభించిన వరం రామభక్తి. తన ఇంటిలోనే రామ మందిరం నిర్మించి, అడ్డుగా ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్నారు.

దాసు భారతదేశం అంతా సంచరించి తాను దర్శించిన దేవతలను పద్య కుసుమాలతో పూజించారు. కాలినడకన దాసు కాశీ, పూరీ, కుంభకోణం, తిరువయ్యూరు దర్శించారు. మహాభక్తుడైన త్యాగరాజు దాసుని కలిసి కీర్తనలు గానం చేస్తూ స్వాగతం చెప్పారు. తరువాత కాంచీపురం, తిరుపతి, అయోధ్య, హరిద్వారం కూడా దర్శించారు. అక్కడ నుండి భద్రగిరి చేరిన దాసుకు, శ్రీరామునికి జరుగవలసిన పూజాదికాలు కుంటుపడటం, బాధ కలిగించింది. రామచంద్రుడు ఒకనాటి రాత్రి కలలో కనిపించి హైదరాబాదులో మంత్రిగా ఉన్న చందూలాల్ అనే తన భక్తుని దర్శించమని అజ్ఞాపిస్తాడు. కలిసిన నరసింహదాసును ఆ మంత్రి భద్రాచలం, పాల్వంచ పరగణాలకు పాలకునిగా నియమించాడు. నాటి నుండి భక్త నరసింహదాసు రాజా నరసింహదాసుగా ప్రసిద్ధిచెందారు. ఆ రోజులలో నరసింహదాసు, అతని శిష్యుడు వరద రామదాసు తమ ఐశ్వర్యాన్ని భద్రాద్రి రాముని కైంకర్యానికే వినియోగించారు. భద్రాచలం కలియుగ వైకుంఠంతో తులతూగినది. నారద తుంబురులే, నరసింహ మరియు వరద రామదాసులుగా దివి నుండి భువికి దిగివచ్చారని భక్తులు భావించారు.

నిరంతరం రామనామ స్మరణ చేసుకునే దాసు విజయ సంవత్సరం (1833-34) బాధ్రపద చతుర్థి నాడు రామునిలో లీనమయ్యారు. అతని భౌతిక కాయాన్ని గోదావరి నదిలో నిమజ్జనం చేయడానికి వెళ్ళిన భక్తుల బృందంతో సహా దేహత్యాగం చేశారు. 

(పై సమాచారం వికిపిడియా నుండి)

ఆయన రచించిన కృతిని ఆలపించిన వారు డాక్టర్ కల్లూరి మురళీకృష్ణ గారు.

చూడగల్గెను రాముని సుందర రూపము
వేడుకలర శ్రీభద్రద్రి విభుని రాఘవ ప్రభుని నేడు

కరకు బంగారు మకుటము మెఱయు కస్తూరి తిలకము
సరసమైన బొమలు కరుణ కురియు కందోయు గలుగు స్వామిని

నీల నీరద దేహము మేలి పసిడి చేలము
చాల భక్తుల బ్రోవ జాలు పదములు గలుగు స్వామిని

ఇందువదనమందు మందహాసము మెఱయగ
అందమైన వెడద యురమునందు ముత్యపు సరులు గలవాని

రత్నమంటపమందు సీతారమణి వామాంకమందు
యత్నముగా మెఱయు మమ్మేలు ఇనకులాంబుధి సోమును రాముని

ఇరుగడల చామరములిడగ వరుస ముత్యాల గొడుగులమర
నరసింహదాసుడెదుట జేయు నాట్యమవధరించు స్వామిని 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి