22, సెప్టెంబర్ 2020, మంగళవారం

చూడగల్గెను రాముని సుందర రూపము - తూము లక్ష్మీనరసింహదాసు కృతి


తూము లక్ష్మీనరసింహదాసు గారు - భద్రాద్రి శ్రీరాముని తన ఇష్టదైవంగా జీవితాంతం సేవించి తరించిన భక్త శిఖామణి. భద్రాచల రామదాసు కర్మలేశం అనుభవించడానికి ఇలా మరలా జన్మించాడని కొందరి భావన. తూము నరసింహదాసుది గుంటూరు ప్రాంతం. వీరి తండ్రి అప్పయ్య, తాత వెంకటకృష్ణయ్యలు శిష్టాచారపరులుగా ప్రసిద్ధులు. వీరు 1790లో అప్పయ్య, వెంకమాంబ దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. ఇరవై సంవత్సరాల వయసులో తండ్రి పరమపదించడంతో కుటుంబ భారం దాసుపై పడినది. అందుకోసం పొన్నూరులో పేష్కారుగా పనిచేశారు. వంశానుగతంగా దాసుకు లభించిన వరం రామభక్తి. తన ఇంటిలోనే రామ మందిరం నిర్మించి, అడ్డుగా ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్నారు.

దాసు భారతదేశం అంతా సంచరించి తాను దర్శించిన దేవతలను పద్య కుసుమాలతో పూజించారు. కాలినడకన దాసు కాశీ, పూరీ, కుంభకోణం, తిరువయ్యూరు దర్శించారు. మహాభక్తుడైన త్యాగరాజు దాసుని కలిసి కీర్తనలు గానం చేస్తూ స్వాగతం చెప్పారు. తరువాత కాంచీపురం, తిరుపతి, అయోధ్య, హరిద్వారం కూడా దర్శించారు. అక్కడ నుండి భద్రగిరి చేరిన దాసుకు, శ్రీరామునికి జరుగవలసిన పూజాదికాలు కుంటుపడటం, బాధ కలిగించింది. రామచంద్రుడు ఒకనాటి రాత్రి కలలో కనిపించి హైదరాబాదులో మంత్రిగా ఉన్న చందూలాల్ అనే తన భక్తుని దర్శించమని అజ్ఞాపిస్తాడు. కలిసిన నరసింహదాసును ఆ మంత్రి భద్రాచలం, పాల్వంచ పరగణాలకు పాలకునిగా నియమించాడు. నాటి నుండి భక్త నరసింహదాసు రాజా నరసింహదాసుగా ప్రసిద్ధిచెందారు. ఆ రోజులలో నరసింహదాసు, అతని శిష్యుడు వరద రామదాసు తమ ఐశ్వర్యాన్ని భద్రాద్రి రాముని కైంకర్యానికే వినియోగించారు. భద్రాచలం కలియుగ వైకుంఠంతో తులతూగినది. నారద తుంబురులే, నరసింహ మరియు వరద రామదాసులుగా దివి నుండి భువికి దిగివచ్చారని భక్తులు భావించారు.

నిరంతరం రామనామ స్మరణ చేసుకునే దాసు విజయ సంవత్సరం (1833-34) బాధ్రపద చతుర్థి నాడు రామునిలో లీనమయ్యారు. అతని భౌతిక కాయాన్ని గోదావరి నదిలో నిమజ్జనం చేయడానికి వెళ్ళిన భక్తుల బృందంతో సహా దేహత్యాగం చేశారు. 

(పై సమాచారం వికిపిడియా నుండి)

ఆయన రచించిన కృతిని ఆలపించిన వారు డాక్టర్ కల్లూరి మురళీకృష్ణ గారు.

చూడగల్గెను రాముని సుందర రూపము
వేడుకలర శ్రీభద్రద్రి విభుని రాఘవ ప్రభుని నేడు

కరకు బంగారు మకుటము మెఱయు కస్తూరి తిలకము
సరసమైన బొమలు కరుణ కురియు కందోయు గలుగు స్వామిని

నీల నీరద దేహము మేలి పసిడి చేలము
చాల భక్తుల బ్రోవ జాలు పదములు గలుగు స్వామిని

ఇందువదనమందు మందహాసము మెఱయగ
అందమైన వెడద యురమునందు ముత్యపు సరులు గలవాని

రత్నమంటపమందు సీతారమణి వామాంకమందు
యత్నముగా మెఱయు మమ్మేలు ఇనకులాంబుధి సోమును రాముని

ఇరుగడల చామరములిడగ వరుస ముత్యాల గొడుగులమర
నరసింహదాసుడెదుట జేయు నాట్యమవధరించు స్వామిని 

ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా - శ్రీరంగం గోపాలరత్నం గారి ఆలాపన


శ్రీరంగం గోపాలరత్నం ఆంధ్రుల అనర్ఘ రత్నం అని ఊరికే అనలేదు. ఆవిడ ప్రతిభ అసమానం. అసలు తెలుగు భక్తి మరియు శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఆవిడ వంటి గాన మాధుర్యం కలవారు, గాత్రకౌశలం కలవారు, ఆవిడలాంటి సంపన్నమైన అనుభవం కలవారు మళ్లీ రాలేదు అంటే అతిశయోక్తి లేదు. విధి బలీయమై ఆవిడ చిన్న వయసులోనే రాలిపోయారు. లేకపోతే ఖచ్చితంగా మరో ఎమ్మెల్ వసంతకుమారి లేదా డీకే పట్టమ్మాళ్ అయ్యేవారు. లలిత భక్తి గీతాలైనా, యక్షగానాలైనా, అన్నమాచార్య కీర్తనలైనా, నారాయణ తీర్థుల తరంగాలైనా ఆవిడ గాత్రంలో యమునా తరంగాలలా జాలువారాయి. భావగర్భితమైన భక్తి ఆవిడ ప్రత్యేకత. ఆర్తి ఆవిడ గాత్రానికి సహజ లక్షణం. ఆవిడ ఆలపిస్తే ఆ పరమాత్మ ఎదుట నిలిచి అనుగ్రహించవలసిందే. అది ఏ రకమైన భక్తైనా కావచ్చు. పరిపూర్ణమైన కళాకారిణి గోపాలరత్నం గారు. ఆవిడ ఆలపించిన గీతాల్లో నన్ను కరగించినది ఏడిద కామేశ్వరరావు గారి ఒక పిలుపులో పిలిచితే. ఆవిడ ఆర్తి, భక్తి కళ్లు మూసుకుని అనుభూతి చెందితే, ఏడుకొండలస్వామి దిగివచ్చి తీరాలి అన్న భావన కలుగుతుంది. ఆపద మ్రొక్కుల సామీ అని గోపాలరత్నం గారు స్వామిని వేడితే ఆ స్వామి హృదయం కరిగి కరుణించవలసిందే అనిపిస్తుంది. విని మీరు కూడా ఆస్వాదించండి. ఆ మహా విదుషీమణికి వేవేల నమోవాకములు. 

ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా నా పలుకులో కులుకుతావటా
ఆపద మ్రొక్కుల సామీ! నీ సన్నిధె నా పెన్నిధీ!

కొండంత దేవుడవని కొండంత ఆశతో 
నీ కొండ చేర వచ్చితిని అండ జేసి కాపాడరా

అభయహస్తమున్నదట అభయమూర్తివీవేయట
అభయదానమిచ్చి నాకు భవతరణ పథమ్ము జూపు

వడ్డికాసువాడవట వడ్డీ వడ్డీ గుంజుదువట
అసలు లేని వారమయ్యా వెతలు బాపి కావుమయ్యా

కొలువుదీరెనే రాముడు - వాసుదాసస్వామి గారి కృతి

వాసుదాసస్వామిగా పేరొందిన వావిలికొలను సుబ్బారావు గారి పరిచయం వనం జ్వాలా నరసింహారావు గారి మాటల్లో. ఆ తరువాత వారు ఒంటిమిట్ట రాములవారిపై రచించిన ఒక కృతి. శ్రవణం ఆకాశవాణి విజయవాడ వారి సౌజన్యంతో.

వాల్మీకి రామాయణాన్ని యథావాల్మీకంగా, పూర్వకాండలతో సహా ఉత్తరకాండను కూడా కలిపి తెనిగించిన ఏకైక మహాకవి కీర్తి శేషులు వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు. ఆ మహానుభావుడి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరాలన్నీ, తెలుగు నేల నాలుగు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో సంతరించుకున్నాయి. కానీ, కాలక్రమంలో అవన్నీ మరుగున పడిపోతున్నాయి. వాల్మీకి రామాయణ క్షీరసాగర మథనాన్ని చేసి "మందర" మకరందాలనూ, రమా రామ పారమ్య పీయూషాలనూ, నాలుగు చెరగులా పంచి, ఆ మథనంలో ఆవిర్భవించిన శ్రీ సీతారాముల తత్వాన్ని, వేద వేదాంగేతిహాస స్మృతి శ్రుతి శుభంగా అన్వయించి, ఆంధ్రుల హృదయ కేదారాలను ప్రపుల్లం చేసిన పరమ భాగవతోత్తములు "ఆంధ్ర వాల్మీకి" వాసుదాస స్వామి వారు.

వాసుదాసు గారి కీర్తికి ఆలవాలమైంది ఆంధ్ర వాల్మీకి రామాయణం. ఆంధ్ర భాషలో అంతకుముందు రామాయణానికి యథామూలాలు లేవని, అర్థ పూర్తి కలిగి, కావ్య-ఇతిహాస గౌరవ పాత్రమై, సర్వజన పఠనీయమై, ప్రామాణికమై, మూలానుసరమైన రామాయణం తెలుగులో వుండడం లోకోపకారంగా భావించి రచించారీ గ్రంథాన్ని వాసుదాసు గారు. ఎనిమిదేళ్లలో రామాయణాన్ని తొలుత నిర్వచనంగా ఆంధ్రీకరించి, అలనాటి కడప మండలంలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామికి అంకితం చేశారు. తర్వాత, శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం "మందరం" పేరుతో గొప్ప వ్యాఖ్యానం వ్రాశారు వాసుదాసు గారు. వాస్తవానికి అదొక గొప్ప ఉద్గ్రంథం. సరికొత్త విజ్ఞాన సర్వస్వం. తను రచించిన నిర్వచన రామాయణంలో సంస్కృత రామాయణంలో వున్న ప్రతి శ్లోకానికొక పద్యం వంతున రాసారు వాసు దాసుగారు. మందరంలో తను రాసిన ప్రతి పద్యానికి, ప్రతి పదార్థతాత్పర్యం సమకూర్చారు. ఒక్కో పదానికున్న వివిదార్థాలను విశదీకరించారు. భావాన్ని వివరణాత్మకంగా విపులీకరించారు. ఆయన మందరాలలోని శ్రీరామాయణ వ్యాఖ్యానంలో "జ్ఞాన పిపాసి"కి విజ్ఞాన సర్వస్వం దర్శనమిస్తుంది.

ఆంధ్ర వాల్మీకి రామాయణం వ్రాయడానికి ప్రేరణ-స్ఫూర్తి, భాగవత గ్రంథకర్త బమ్మెర పోతన సంకల్పం ద్వారానే తనకు లభించిందంటారు వాసుదాసుగారు. వావిలికొలను సుబ్బారావుగారు, కడప జిల్లా జమ్మలమడుగులో 1863లో జన్మించి 1939లో పరమపదించారు. ఎఫ్‌.ఎ చదువు పూర్తిచేసి, పొద్దుటూరు తాలూకా కార్యాలయంలో చిరుద్యోగిగా చేరి, రెవెన్యూ ఇనస్పెక్టర్‌ హోదాకెదిగారు. ఆ విధంగా 1893-1904 మధ్య కాలంలో పదకొండేళ్లు రెవెన్యూ శాఖలో ఉద్యోగం మొదట్లో చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారి తర్వాత, మద్రాస్‌ (నేటి చెన్నై) ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్య కాలంలో పనిచేశారు. వాసు దాసుగారి తర్వాత ఆ పదవిని అలంకరించింది అక్కిరాజు ఉమాకాంతం గారు. కళాశాలలో చేరక ముందే, పినతండ్రి మీద తనకున్న కృతజ్ఞతకు గుర్తుగా, "శ్రీ కుమారాభ్యుదయం" అనే ప్రబంధ గ్రంథాన్ని రచించి, ఆయనకు అంకితమిచ్చి శాశ్వత స్వర్గ సుఖాన్ని ఆయనకు కలిగించారు. ఆంధ్ర పండితుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే, భార్యావియోగం కలగడంతో, వాసు దాసుగారు భక్తి-యోగ మార్గం పట్టారు. జీర్ణ దశలో వున్న ఒంటిమిట్ట రామాలయాన్ని సముద్ధరించాలన్న సంకల్పంతో, బిక్షాటనచేసి లభించిన ధనంతో ఆలయాన్ని అభివృద్ధి చేసారు. ఆంధ్ర వాల్మీకి రచనాకాలం 1900-1908 మధ్య. గాయత్రీ మంత్రం, రామ షడక్షర మంత్రం మూలంలో వున్నట్లే, అనువాదంలో కూడా నిక్షిప్తం చేశారాయన. వాల్మీకంలో వున్న బీజాక్షరాలన్నీ, ఇందులోనూ యథాస్థానంలో చేర్చబడ్డాయి. విడిగా వాసు దాసుగారు, గాయత్రీ రామాయణం, శ్రీరామనుతి కూడా రాసారు. ఆంధ్ర వాల్మీకం అనువాదమైనా, స్వంత రచన-స్వతంత్ర రచన అనిపించుకుంది.

వావిలికొలను సుబ్బారావుగారు పండిత పదవీ విరమణ చేసిన అనంతరం, తన జీవితమంతా, భక్తి మార్గంలోనే గడిపారు. వాసు దాసుగారు కౌసల్యా పరిణయం అనే ప్రబంధం, సుభద్రా విజయం అనే నాటకంతో పాటు, హిత చర్యలు, ఆధునిక వచనరచనా విమర్శనం, పోతన నికేతన చర్చ, పోతరాజు విజయం, రామాశ్వమేథం, ఆంధ్రవిజయం కూడా వ్రాశారు. ఆర్యకథానిధులు అన్న పేరుతో ఆయన వ్రాసిన సులభ వచన గ్రంథాలు తెలుగువారందరికి అత్యంత ఆదరణీయమైనాయి. సులభ వ్యాకరణం తెలుగు వ్యాకరణాన్ని నిజంగానే సులభం చేసింది. ఆయన రచించిన కృష్ణావతార తత్వం ప్రశస్త కృతి పాండిత్యంతో, ఆధ్యాత్మికభావనతో, పాఠకులలో ఆంధ్ర భాషాభిమానాన్ని ఉద్దీపించ చేసి-తాను తరించి, ఇతరులను తరింపచేసిన ధన్యాత్ముడు.

వాసుదాసుగారు ఆంధ్ర వాల్మీకిగా లబ్ద ప్రతిష్టులయ్యారు. రామాయణ క్షీర సాగరాన్ని మందరం మథించి, మనకందరికీ ఆప్యాయంగా అందించింది. భాష, శైలి, అర్థం, తాత్పర్యం కాలక్రమంలో పరిణామం చెందుతున్నాయి. వాసు దాసుగారు మారిపోతున్న తరాలకు గుర్తురావడం కూడా కష్టమైపోతున్నది. వారి ఆర్యకథానిధులతోనూ, హితచర్యల పరంపరలతోనూ, పరవశించిపోయిన తెలుగు పాఠక మహనీయులు క్రమంగా తెరమరుగవుతున్నారు. మళ్లీ-మళ్లీ జ్ఞాపకం చేసుకోవాల్సిన, మరువలేని మహనీయుడు, ప్రాతఃస్మరణీయుడు వాసుదాసస్వామి.

కొలువుదీరెనే రాముడు కొలువుదీరెను

కొలువుదీరెను నేడు కోసలాధీశుడు
జలజాతలోచన జానకితో గూడి

కనకసింహపీఠి కమలాక్షులందరు
మనసార వింజామరములు వీవగా

హరిహయ హరముఖ సురవరులెల్లరు
కరములు జోదించి కరము భక్తి గొలువ

నృపముఖ్యులెల్లరు కపివరులతోడుత
చపలత లేకుండ సన్నిధి నిలుచుండ

వాసుదాసుడు తన పాటలు పాడగను
ఆశతోడ నిలుచు హర్షమునొందుచును

17, సెప్టెంబర్ 2020, గురువారం

సద్గురు శివానంద సరస్వతి బోధలు


సాధకుల ప్రశ్నలకు హృషీకేష్ దివ్య జీవన సంఘం వ్యవస్థాపకులు స్వామి సద్గురు శివానంద సరస్వతి గారి సమాధానాలు:

ప్రశ్న: మరణమనేది ఎప్పటికైనా రావలసినదే, అది జీర్ణించిన వస్త్రాలను త్యజించి కొత్తవి ధరించినట్లు ఆత్మ ఒక దేహాన్ని వీడటమనే ప్రక్రియ అయినప్పుడు, ఆత్మహత్య మరియు జంతుబలి ఎలా పాపం?

సమాధానం: ఆత్మహత్య మరియు జంతుబలి మహాపాపాలు అని ఎందుకు అన్నారు అంటే అవి ఆ జీవుని యొక్క జీవ పరిణామాన్ని అర్థాంతరంగా ఆపివేస్తాయి కాబట్టి. అంతే కాకుండా, దేహాన్ని అర్థాంతరంగా ముగించటం వల్ల ఆ జీవుని యాతనలను ఏ మాత్రం తగ్గించకపోగా మరింత పెంచుతున్నాము. ఆ జీవునికి పూర్వజన్మ కర్మఫలముల వలన కలిగే సుఖదుఃఖాలను అటువంటి హత్యల వలన మనం ఏ మాత్రం తగ్గించటం లేదు. ఆ ఫలాలు పూర్తిగా ఎప్పటికైనా, ఎన్ని జన్మలెత్తైనా సరే అనుభవించి తీరవలసిందే.

అంతే కాకుండా, ఆత్మహత్య వలన జీవుడు మరిన్ని క్లేశాలను కొని తెచ్చుకుంటాడు. ఎందుకంటే అటువంటి దశలో దేహాన్ని వీడిని జీవునకు తన కర్మఫలాలను అనుభవించటానికి మరొక దేహం పొందటానికి సహజ మరణం కన్నా ఎంతో ఎక్కువ సమయం పడుతుంది. ఈ దేహప్రాప్తి కోసం వేచియుండటంలో జీవుడు ప్రేతాత్మగా సంచరించవలసి రావచ్చు. ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా ఇటువంటి జీవహింస వల్ల కలిగే దోషాలను, జీవుని దుస్థితుల నుండి త్వరగా ముక్తి కలుగక పోవచ్చు. సహజ జీవన పరిణామంలో జీవికి కలిగే మార్పులు అత్యంత సహేతుకమైనవి, వెలకట్టలేనివి.

మహామృత్యుంజయ మంత్రం ఏమని చెప్పింది? ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అని. అంటే, దోసపండులా తీగనుండి ఎటువంటి నొప్పి లేకుండా, అత్యంత తేలికగా విడిపోవాలని పరమశివుని ప్రార్థిస్తాం. దోస తీగ పూవు పూచి, కాయ ఏర్పడి, ఆ కాయ తగినంత పరిణామానికి చేరి, పండటం మొదలు పెట్టి, పూర్తిగా పరిపక్వత సాధించిన తరువాత తీగనుండి వీడటానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు కోస్తే తీగకు, పండుకు అతి తక్కువ క్లేశం ఉంటుంది. ఆత్మ కూడా అంతే. అర్థాంతరంగా ఆ దేహాన్ని బలవంతంగా విడిపోయేట్లు చేస్తే ఎంతటి క్షోభ అది? ఆలోచించండి.

జీవన క్రమంలో ఏ ఆశ్రమ ధర్మం పాటించినా, జీవికి విషయ వాంఛల నుండి, బంధనాల నుండి ముక్తి కలగటమే సహజమైన ప్రక్రియ. ఈ విధంగానే కర్మఫలానుభూతి పరిపూర్ణమయ్యేది. ఇది బలవన్మరణంలో కలుగదు. అది మానవ జన్మైనా, మరే ఇతర జంతు జన్మైనా సరే. సారాంశం - ఆత్మహత్య లేదా జంతుబలి అన్నది ఆధ్యాత్మిక ప్రగతికి పూర్తిగా విరుద్ధమైన కర్మ. ఆధ్యాత్మిక పురోగతే కదా సమాజ పురోగతికి ప్రధాన హేతువు? అందుకే, చట్టరీత్యా అవి నేరాలు అయ్యాయి.

ప్రశ్న: సాధకులు మాంసాన్ని తినటం ఏ ప్రాతిపదిక మీద మీరు నిషేధిస్తున్నారు?

సమాధానం: వైద్యపరంగా, మనస్తత్వశాస్త్రపరంగా, నైతికపరంగా, ఆధ్యాత్మికపరంగా. మనసు అనేది మనం తినే ఆహారం యొక్క సారాన్ని బట్టే ఉంటుంది. తామసమైన ఆహారం తామసమైన మనస్సును కలిగిస్తుంది. మాంసం తామసమైనది కాబట్టే దాన్ని వర్జించాలి.

ఒక జంతువును వధించినప్పుడు దాని నాడీమండలం భయంతో కుంచించుకుపోతుంది. మీరు గమనించి ఉండవచ్చు మనకు భయం కలిగినప్పుడు మన కడుపులో వికారాలు కలుగుతాయి. దీనికి కారణం కాలేయం నుండి కొన్ని విషపదార్థాలు వెలువడటం వలన. అలాగే, జంతువులలలో కూడా. ఈ విషపదార్థాలు పేరుకుపోయి, ఆ జంతు మాంసాన్ని ఉడికించినా, వండినా, ఏమి చేసినా అలాగే ఉండిపోతాయి. కాబట్టే మాంసం తినటం విషపూరితము మరియు తినే వారి దేహానికి దీర్ఘకాలంలో ప్రమాదకరం.

ఆత్మ దేహంలో నివసిస్తుంది అన్న ప్రాతిపదికన మనిషికి జంతువుకు తేడా లేదు. ఎలాగైతే మనకు పూర్తికాలం జీవించే హక్కుందో, అదే జీవ సిద్ధాంతం ప్రకారం జంతువులకు కూడా ఆయుః ప్రమాణమున్నంత వరకు జీవించి దేహాన్ని అనుభవించే హక్కుంది. కాబట్టి నైతికంగా జంతువులను చంపటానికి మనకు హక్కు లేదు.

చేతనము అనేక రకాల చరాచరములుగా ఆవిర్భవించింది. ఆ చేతనమే మనలను ఇతర జంతుజాలాలలో, చరాచరములలో ఒకరిని చేసేది. మనలో ఉన్నదే ఆ జంతువులలో కూడా ఉంది. ఇది మన ధర్మం యొక్క మూల సిద్ధాంతం. ఇది తెలిసి కూడా జంతువులను ఎలా హింసించగలము? ఎలా చంపి తినగలము? ఈ ఆత్మ యొక్క ఏకత్వము వల్లనే మనము మరల మరల ఈ ప్రపంచంలో వేర్వేరు జన్మలెత్తుతున్నామనే కదా మన ధర్మం చెప్పింది? ఇదే కదా మనం సాధనలో తెలుసుకునేది? మనం ఇతర జీవులను హింసించకుండా, ప్రేమతో చూసి, కరుణ కలిగి ఉంటేనే కదా ఈ ఏకత్వ భావాన్ని అనుభూతి చెందేది? అప్పుడే కదా మన ఆత్మ, వాటి ఆత్మ ఒకటే అని అర్థమయ్యేది? పరబ్రహ్మమే సమస్త చరాచరములలోని ఆత్మ, ఆయన సృష్టి క్రమంలోనే ఆ ఆత్మ వేర్వేరు దేహాలను ధరిస్తుంది. కాబట్టి మనం చేసే జీవహింస ఆ చేతనము పట్ల పూర్తి అగౌరవభావాన్ని, మన యొక్క తీవ్రమైన అజ్ఞానాన్ని సూచిస్తుంది.

కాబట్టే, జంతువులను చంపకుండా, హింసించకుండా వాటి పట్ల ప్రేమగా ఉండి నిజమైన ఏకత్వాన్ని చాటుదాం.

ప్రశ్న: ఉన్నదానితో తృప్తి చెందటం శాంతిని కలుగజేస్తోంది. కానీ నాదొక సందేహం. నేను సంతృప్తుడనైతే నా జీవిత ఆశయాలు చచ్చిపోతాయి, నేను బద్ధకస్తుడినిగా మారి అలసత్వం పాలవుతాను. అనేక ఆకాంక్షల వల్ల నేను వాటిని సాధించే తపనలో శ్రమపడి మరింత శక్తిమంతుడవుతాను. తృప్తి అనేది మానవ ప్రగతికి అవరోధంలాగా అనిపిస్తోంది. దీనిని నివృత్తి చేయగలరు.

సమాధానం: తృప్తి అనేది ఎన్నటికీ మనిషిని అలసత్వం, బద్ధకం వైపు నడిపించదు. ఇది ఒక ముఖ్యమైన సాత్త్విక ప్రవృత్తి. దాని వలన మనిషి భగవంతుని అన్వేషించే మార్గంలో నడుస్తాడు. అది మానసిక శక్తిని, శాంతిని కలుగజేస్తుంది. అనవసరమైన, స్వార్థపరమైన ఒత్తిళ్ళను పక్కకు పెట్టగలదు. మనిషి యొక్క అంతర్నేత్రాన్ని తెరచి మనసును దేవునివైపు దృష్టి పెట్టేలా చేస్తుంది. అతని శక్తిని అంతర్ముఖం చేస్తుంది. అత్యాశ రూపంలో స్థూలమై ఉన్న శక్తిని ఓజస్సుగా మారేలా చేస్తుంది. తృప్తితో ఉన్న మనిషి సత్త్వముతో పరిపూర్ణుడవుతాడు. అతని శక్తి మరింత పెరుగుతుంది, అంతర్ముఖుడై ఆత్మదృష్టి కలిగి ఉంటాడు. శాంతముతో, ఏకాగ్రతతో మరింత పనిని చేయగలుగుతాడు. చిత్తము యొక్క చెదరగొట్టబడిన కిరణాలు ఏకమై తేజోమయుడవుతాడు.

ఈ సంతృప్తి అన్న బలంతోనే సాధువులు, సన్యాసులు, భిక్షువులు స్వేచ్ఛగా దేశాటన చేయగలిగారు. సంతృప్తి వల్లనే మనిషికి అంతశ్శక్తి కలిగి ఆత్మజ్ఞానం కలిగే మార్గంలో నడుస్తాడు. ముళ్లమయమైన, కఠినతరమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో అతను భయాతీతుడై ముందుకు సాగుతాడు.

ప్రశ్న: పరమాత్మ అంతటి దయాళువైతే మరి మంచి వానిని పూర్వ జన్మ కర్మ ఫలాలను అనుభవించే పరిస్థితి నుండి తప్పించి శాశ్వత సుఖాన్ని ప్రసాదించవచ్చు కదా? మంచి వాళ్లకు ఈ దుర్భరమైన కర్మఫలానుభవాలెందుకు?

సమాధానం: ఇక్కడే మనం పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవటంలో తప్పటడుగు వేసేది. కర్మఫలమనేది తిరిగే చక్రం లాంటిది. దానిని తిప్పే శక్తి ఖర్చు అయ్యేంత వరకూ అది తిరుగుతూ ఉండవలసిందే. కర్మ-ఫలములు అనేవి గొలుసుగా ముడిపడినవి. వేటగాడు బాణాన్ని ఒకసారి సంధించిన తరువాత, తన గురి లక్ష్యాన్ని తప్పిందని తెలిసినా దానిని ఉపసంహరించలేనట్లు, పూర్వజన్మలలో చేసుకున్న కర్మలు, అనగా ప్రారబ్ధ కర్మల యొక్క ఫలాలను అనుభవించి తీరాల్సిందే. వాటిని ఉపసంహరించలేము.

మరి పరమాత్మ ఎలా సహాయం చేస్తాడు? భక్తునికి ఈ ప్రారబ్ధ కర్మల ఫలానుభవాలను తట్టుకునే ఓర్పును, చిరునవ్వుతో అనుభవించగలిగే సంకల్పాన్ని బలపరుస్తాడు. పూర్తిగా ప్రారబ్ధ కర్మల పాలిట వదిలి వేయకుండా, తన అనుగ్రహమనే రక్షణ కవచంతో భక్తుని కప్పుతాడు. భీకరమైన వృష్టిలో, శీతలంలో మనం మన గృహంలో వెచ్చని వస్త్రాలలో రక్షణగా ఉన్నట్లు మనం పరమాత్మ అనుగ్రహంతో ఈ బాధలను సంతోషంగా ఓర్చుకుంటూ ఆ సాగరాన్ని దాటతాము. భగవద్భక్తి యొక్క మహత్తు ఇది.

ప్రశ్న: నేను "మహారాజును" అనుకుంటే మహారాజును కాను, అలాగే "అహం బ్రహ్మాస్మి" అనుకుంటే పరబ్రహ్మమును కాను కదా?

నేను మహారాజును అని అనుకోవటంతో పాటు ఆ మహారాజత్వానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి. ఎందరినో కూడగట్టాలి, ఆయుధాలను, శక్తియుక్తులను చేపట్టాలి, ఎన్నో విద్యలు నేర్వాలి, పోరాడాలి, విజయం పొందాలి, కోటానుకోట్ల ప్రజల గౌరవం పొందాలి. అలాగే, అహం బ్రహ్మాసి అని భావించటానికి మనసును శుద్ధి చేసుకోవాలి, దానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి. వివేక వైరాగ్య, షడ్ సంపదలు, ముముక్షత్వమనే నాలుగు ప్రాతిపదికలను పొందాలి, సనాతన వాఙ్మయాన్ని శ్రవణం, మననం చేయాలి, నిరంతర కఠోర ధ్యానం చేయాలి. అప్పుడే ఆత్మసాక్షాత్కారానికి అర్హుడవై బ్రహ్మానుభూతిని పొందగలవు.

నేను చక్కెర చక్కెర చక్కెర అనుకుంటే చక్కెర లభించదు, అలాతే, రామ రామ రామ అనుకుంటే రాముడు లభించడు కదా?

చక్కెర కావాలంటే దానికి సరిపడ డబ్బు సంపాదించాలి, కొట్టుకు వెళ్లాలి, కొనుక్కోవాలి. అలాగే, రాముని దర్శించాలంటే, కామ క్రోధాది అరిషడ్వర్గాలను కోల్పోవాలి, పరిపూర్ణమైన శరణాగతితో, సద్భావముతో, తదేక భక్తితో రాముని స్మరించాలి, అప్పుడు తప్పక రాముడు గోచరిస్తాడు. కానీ, చక్కెర నీ దేహానికి బయట ఉన్న వస్తువు. రాముడు నీలోనే ఉన్నాడు, కాబట్టి నీ హృదయాన్ని సంపూర్ణంగా సమర్పిస్తే రాముడు తప్పక లభిస్తాడు.

ప్రశ్న: స్వామీ! భారతదేశంలో ఉన్న సాంప్రదాయం గురువును ఆరాధించటం. అది ఎంతవరకూ సబబు? అది బానిసత్వం కాదా?

సమాధానం: నీకు సహాయం చేసిన వ్యక్తికి నీవు ఏదో ఒక విధంగా కృతజ్ఞత కనబరుస్తావు కదా? ప్రాపంచిక విషయాలలో సహాయం చేసిన వాని పట్ల కనబరచిన కృతజ్ఞత మన జీవిత పరమావధి అయిన పరమాత్మను కనుగొనే మార్గాన్ని నీకు అందించే గురువు పట్ల ఎందుకు చూపకూడదు? గురువు నీకు కొత్త జీవితాన్ని, శాశ్వతానందాన్ని, పరమ జ్ఞానాన్ని అందించే వాడు. ఆయనకు కృతజ్ఞత చూపించటమే గురువును ఆరాధించటంలో పరమార్థం. భారతీయ సాంప్రదాయంలో ఆరాధన అంటే ఉత్కృష్టమైన కృతజ్ఞతా భావం. నీకు సాయం చేసిన వానికి ఏదైనా సమర్పించుకుని కృతజ్ఞత తెలిపినట్లు నీకు అత్యంత విలువైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందజేసిన గురువుకు నిన్ను నీవు సమర్పించుకోవటమనేదే సముచితమైన కృతజ్ఞత.

ఇది బానిసత్వం ముమ్మాటికీ కాదు. నిజమైన సద్గురువు ఎన్నటికీ బానిసత్వం కోరుకోడు. ముమ్మాటికీ శిష్యుని ఆత్మకు స్వేచ్ఛనే కోరుకుంటాడు. గురువుకు శిష్యుని పట్ల అత్యున్నతమైన ప్రేమ వాత్సల్యాలు ఉంటాయి. శిష్యుని హృదయాన్ని గెలుచుకుని ఆ హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటాడు గురువు. ఆ విధంగా రెండు వేర్వేరు దేహాలైనా వారు ఏకమైన వారు. 

ప్రశ్న: నేను బ్రహ్మసాక్షాత్కారం పొందిన ఒక గురువు కోసం తీవ్రంగా వెదుకుతున్నాను. అటువంటి గురువు జాడలు తెలుపగలరా? మీరు బ్రహ్మ సాక్షాత్కారం పొందారా?

సమాధానం:ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే ఎందరికో వచ్చే చాలా సామాన్యమైన ప్రశ్నలివి. సరే, నేను ఫలానా గురువు బ్రహ్మజ్ఞానం పొందినవాడు అని చెప్పానే అనుకో. దానిని నీవు ఎలా నిరూపించగలవు? అతని వలన నీవు ఎంత ప్రయోజనం పొందగలవు?

బ్రహ్మజ్ఞానం పొందిన గురువులు అరుదేమీ కాదు. అజ్ఞానంలో కొట్టుమిట్టాడే మానవులు వారిని అంత త్వరగా గుర్తించలేరు. శుద్ధ అంతఃకరణం వంటి అనేక సుగుణాలు కలిగిన వారు అటువంటి జ్ఞానులను గుర్తించగలరు, వారి ద్వారా ప్రయోజనం కూడా పొందగలరు. బ్రహ్మజ్ఞానులైన గురువులు కోసం ఆ మూల ఈ మూల పరుగెత్తి వెదుకనవసరం లేదు. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే నీతో ఉన్నా, నీవు ఆయనను గ్రహించేందుకు అర్హుడవైతే తప్ప ఆయన నీకు ఏమీ చేయడు. ఈ విషయం గ్రహించి, నిష్కామ కర్మయోగ సాధనతో నిన్ను నీవు శుద్ధి చేసుకో. దాన గుణము కలిగి, ఏకాగ్రతతో బ్రహ్మచర్యము, జపము, ధ్యానము ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని పొందు. సద్గురువు అనుగ్రహం అదే కలుగుతుంది.

ఒక గురువును పరీక్షించటం చాలా కష్టం. నీ మేధస్సును దానిపై వినియోగించకు. విశ్వాసము కలిగి ఉండు. నిజమైన సాధకుడు ఇటువంటి ప్రశ్నలకు, సంశయాలకు దూరంగా ఉంటాడు. నా మాటలు నమ్మితే నువ్వు అద్భుతమైన ప్రయోజనాలు పొందగలవు.

దేవ దేవం భజే దివ్య ప్రభావం - సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యులు

దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణ పుంగవం రామం

రాజ వర శేఖరం రవి కుల సుధాకరం
ఆజానుబాహుం నీలాభ్ర కాయం
రాజారి కోదండ రాజ దీక్షా గురుం
రాజీవ లోచనం రామచంద్రం

పంకజాసన వినుత పరమ నారాయణం
శంకరార్జిత జనక చాప దళనం
లంకా విశోషణం లాలిత విభీషణం
వేంకటేశం సాధు విబుధ వినుతం

దేవదేవుడు, దివ్యమైన మహిమలు కలవాడు, రావణాసురుని శత్రువు, యుద్ధములో శ్రేష్ఠుడు అయిన రాముని భజింపుము. రాజాధిరాజు, సూర్యవంశానికి చంద్రునివంటి వాడు, ఆజానుబాహువు, నీలమేఘ శరీరుడు, క్షత్రియుల శత్రువైన పరశురాముని కోదండమును ధర్హించిన ఘనుడు, కలువలవంటి కన్నులు కలవాడు అయిన రామచంద్రుని భజింపుము. బ్రహ్మచే నుతించినబడిన శ్రీహరి, జనకుని వద్ద ఉన్న శివుని విల్లును ఎక్కుపెట్టి విరిచిన వాడు, లంకను జయించినవాడు, విభీషణుని అనుగ్రహించిన వాడు, సాధువులు, జ్ఞానులచే నుతించబడిన వేంకటేశ్వరుని భజింపుము.

హిందోళ రాగంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు పాడగా వినండి.

పితృపక్షాలు

రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం
అర్థీనాం ఉదకం దత్తం అక్షయ్యం ఉపతిష్ఠతు

నరకంలో అపుణ్యలోకాలలో పద్మార్బుదములో నివసించే, ఈ నీటి బిందువులను అర్థిస్తూ ఉన్న ఆత్మలకు ఉదకాన్ని సమర్పిస్తున్నాను. అవి అక్షయమగుగాక, వారు శాంతులగుదురు గాక.

ఒక్క శ్రాద్ధం రోజే కాకుండా ప్రతి నిత్యమూ పితృదేవతలను తలచుకోవలసిన విధి మానవునిది. పై మంత్రం అందుకే నిత్యం భోజనానంతరం నీటిని విడిచే విధిలో చెప్పబడింది. ఇవి పితృదేవతల ద్వారా మన పెద్దలకు చేరాలన్నది సారం.

మహాలయ పక్షాలు - మానవాళి అభివృద్ధికి, వంశాభివృద్ధికి, సృష్టి క్రమంలో సహజ పరిణామంగా వచ్చే మరణ బాధ నుండి ఆత్మలకు విముక్తి కలిగి ఉన్నతస్థానం లభించటానికి ఈ పక్షంలో చేసే కర్మలు ఎంతో తోడ్పడతాయి. కర్మ ఫలాలను బట్టి, వాటిని అనుభవించేందుకు అనువైనా పరిస్థితులు దొరికేంత వరకు ఆత్మలు పునర్జన్మ పొందవు. కర్మఫలాలు మంచివైతే ఉన్నత స్థానం, లేకపోతే నీచస్థానంలో వేర్వేరు జీవరాశులుగా జన్మనెత్తుతుంది ఆత్మ. అది మనిషి మరణించిన ఏడాదికి కావచ్చు, ఎన్నో ఏళ్లకు కావచ్చు, దశాబ్దాలకు కావచ్చు. సంవత్సరీకముల వరకు ఉన్న ఏడాది ప్రస్థానం ముగిసిన పిమ్మట ఆ ఆత్మ తిరిగి దేహాన్ని వెంటనే ధరించ గలిగినా, శ్రాద్ధ కర్మ, తర్పణాలు, పిండ ప్రదానాలు ఆ ఆత్మోద్ధరణకు తోడ్పడతాయి. దానిని వెసులుబాటు చేసే వారు పితృ దేవతలు. ఇది పూర్తిగా శాస్త్రీయమైనది.

సృష్టి క్రమంలోని జనన మరణాలనే చక్రంలో చిక్కుకున్న ప్రతి ఆత్మకూ ఉన్నతిని కలిగించేవి మనం సముపార్జించుకున్న పుణ్యఫాములతో పాటు, ఆ ఆత్మలను పితృదేవతలు ఏ విధంగా నడిపిస్తారు అన్నది కూడా. కాబట్టి పితృదేవతలు ఆత్మోద్ధరణకు గేట్‌కీపర్లు. మరి వారు సంతుష్టులైతే కదా ఆత్మోద్ధరణ జరిగేది. ఉద్ధరించబడని ఆత్మ అనేక అసంతులనలకు గురవుతూ ఉంటుంది. కొన్ని మార్లు ప్రేతరూపంలో, ఇతర రూపాలలో సంచరిస్తుంది. అన్నిటికీ కర్మఫలాలే ముఖ్య ప్రాతిపదిక. ఆ ఆత్మకు ఎక్కడో ఒక చోట ఊతం అందాలి కదా? అది మనకు నిర్దేశించబడిన అనేక విధి విధానాల ద్వారా జరుగుతుంది. ఒకటి పైన చెప్పబడిన భోజనకాల ఉదకదానం. అలాగే, నిత్యానుష్ఠానంలో మరెన్నో. వీటిలో మరొక ముఖ్యమైనది మహాలయ పక్షం.

ఈ మహాలయ పక్షంలో పితృదేవతలని సంతృప్తి పరచటానికి అత్యంత అనువైన కాలం. సృష్టిలో ఉత్తరాయణ దక్షిణాయనాలకు వాటి వాటి ప్రాధాన్యతలున్నాయి. దక్షిణాయన కాలంలో సృష్టిక్రమాన్ని సూచించే వర్షఋతువు ముగిసే సమయంలో, అనగా పొలాలు దున్నబడి, తొలకరి వానలు కురిసి, గింజలు నాటబడి, మరల వానల వలన అవి మొలిచి మనకు ఆహారం అందించటానికి పంటలు వేగంగా పెరుగుతాయి. ఈ సమయంలో వచ్చే ఋతువు మార్పునకు కూడా సంకేతం మహాలయపక్షం. వర్షములు ఆగే సమయం, శరదృతువు ఆగమనమునకు ముందు రెండు వారాలు ఈ పక్షం. మానవుని శరీరానికి సంబంధించి చైత్ర మాసం మొదలయ్యే సమయం, అలాగే ఆశ్వయుజం మొదలయ్యే సమయం మధ్య ఉన్న ఆరునెలల సమయమనేది కాలగమనంలో ఓ పెద్ద మైలు రాయి. అలాగే సృష్టిక్రమంలో కూడా మైలురాయి. అందుకే ఈ శరదృతువు ఆరంభానికి మునుపు వచ్చే పక్షాన్ని ఆత్మగమనాన్ని నిర్దేశించే పితృదేవతలకు సంబంధించినదిగా శాస్త్రం నిర్ణయించింది.

మరి ఈ సమయంలో ఏం చేయాలి?

సృష్టి క్రమాన్ని గౌరవిస్తూ, జనన మరణ చక్రంలో చిక్కుకుని క్లేశాల బారిన పడుతున్న ఆత్మలను ఉద్ధరించేందుకు దేహధారణ చేసి ఆ అత్మలతో ముడిపడి ఉన్న మనం మనవంతు ప్రయత్నం చేయాలి. ఇక్కడ అత్యంత ముఖ్యమైన అంశం - జననమనేది కర్మఫలాలను బట్టి అన్నది. అనగా ఒకేరకమైన కర్మఫలాలను అనుభవించవలసిన ఆత్మలు ఒకే రకమైన పరిస్థితులలో దేహాన్ని ధరిస్తాయి. అనగా ఒక కుటుంబంలో, ఒక వంశంలో, ఒక సామాజిక పరిస్థితులలో. అందుకే మనవాళ్లు భార్య బిడ్డలు, మనతో ఉండే పశువులు ఋణానికి రూపాలు అంటారు -

ఋణానుబంధ రూపేణ పశు పత్నీ సుతాలయా రుణక్షయే క్షయయంతి తత్ర పరివేదనా

పశువులు, భార్య, పిల్లలు, ఇల్లు అన్నవి పూర్వజన్మ ఋణములకు రూపములు. ఈ రుణములు తీర్చుకున్న తరువాత ఆత్మకున్న క్లేశములు నశిస్తాయి.

వీటన్నిటినీ పరిశీలించే శ్రాద్ధ కర్మ, పితృపక్షాలు, తర్పణాలు, పిండప్రదానాలు, దానాలు నిర్వచించబడ్డాయి. ఆత్మోద్ధరణకు ఆ దేహానుబంధమైన వారందరూ ఋణాలను తీర్చుకుని, ఆ ఆత్మలను ఉద్ధరించే పితృదేవతలకు కృతజ్ఞత తెలుపుతూ ప్రాణశక్తికి సంకేతమైన అన్న, ఉదక, తిలములను వినియోగించి ఈ మహత్కార్యానికి తోడ్పడతాం.

సారాంశం: మరణానంతరం కర్మఫలాల ద్వారా బాధలు పడుతూ మరు జన్మ కోసం వేచి ఉన్న, జన్మ పొందిన ఆత్మల ఉద్ధరణకు పితృదేవతలను ప్రీతి పరచి వారి ద్వారా సృష్టి క్రమంలో ఓ ముందడుగు పడేందుకు మనవంతు ప్రయత్నం పితృకార్యాలు. దానికి అత్యంత అనువైన సమయం కాలగమనంలో అతి ముఖ్యమైన మైలురాయైన పితృపక్షం. కావలసింది నమ్మకం, శ్రద్ధ, కృతజ్ఞత. పూర్వీకులు లేనిదే మనం లేము, మన జన్మకు కారణమైన వారి ఆత్మలను ఉద్ధరించేందుకు మనవంతు ప్రయత్నం చేయటం మన ధర్మం.

అక్షయ్యముపతిష్ఠతు!

13, సెప్టెంబర్ 2020, ఆదివారం

సుగుణములే చెప్పుకొంటి - త్యాగరాజస్వామి కృతి

సుగుణములే చెప్పుకొంటి సుందర రఘురామా!

వగలెరుంగలేక ఇటు వత్తువనుచు దురాశచే

స్నానాది సుకర్మంబులు దానాధ్యయనంబులెరుగ
శ్రీనాయక క్షమియించుము శ్రీత్యాగరాజవినుత

సుందర స్వరూపుడవైన ఓ రఘురామా! నీవు నాపై కరుణించి దర్శనమిచ్చెదవను ఆశతో నీ మాయలను తెలుసుకోలేక నీ సుగుణములనే చెప్పుకొనుచున్నాను. పుణ్యతీర్థములలో స్నానములు మొదలైన మంచి కర్మలు, దానములు, వేదాధ్యయనములను నేను ఎరుగను. సీతాదేవికి నాయకుడవు, పరమశివునిచే నుతించబడిన శ్రీరామా! నీవే నన్ను క్షమించి దర్శనమిచ్చి కాపాడుము. 

చక్రవాకం రాగంలో కూర్చబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు


వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...