10, జులై 2020, శుక్రవారం

చాతుర్మాస్యం


నాలుగు మాసాలు దీక్షగా గడిపే ఒక కర్మ. మతాచార్యులు, గురువులు, పీఠాధిపతులు వర్ష శరదృతువులున్న నాలుగు నెలలు ఒకేచోట గడపటానికి ఉద్దేశించిన వ్రతం. గృహస్థులు కూడా దీనిని పాటించవచ్చు. ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వయుజ మాసాలు వానలు కురిసే సమయం కాబట్టి సన్న్యాసులు ఈ నాలుగు నెలలు ఒక చోట స్థిరంగా ఉండటం మంచిదని ఇలా నాలుగు నెలల దీక్షా సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు అని ఒక వివరణ. ఇప్పుడు చాలా మంది దీనిని రెండు నెలలకు తగ్గించి పాటిస్తున్నారు.

శృంగేరి శారదాపీఠం వారి ప్రకారం ఇది ఒక వ్రతం. వేదాల ప్రకారం పక్షా వై మాసాః అనగా ఒక పక్షాన్ని మాసంగా పరిగణించి ఈ వ్రతాన్ని రెండు నెలలు చేస్తారు. దీనిని వర్షఋతువులో పాటిస్తారు. ఈ సమయంలో గురువులు పరబ్రహ్మను ధ్యానిస్తూ శిష్యులకు ఉపనిషత్తులు, సాంఖ్యమును బోధిస్తారు.

సమాగతేభ్యోऽన్తేవసద్భ్యః ఔపనిషదం సాంఖ్యం ప్రతిపాదయంతో వర్తామహే

చాతుర్మాస్య సంకల్పం చేసే ముందు వ్యాసపూజ నిర్వహించి, దక్షిణామూర్తిని, శివుని, ఆచార్య పరంపరను, బ్రహ్మవిద్యా ప్రతిపాదకులకు, గురువులను, బోధకులను స్మరించుకుంటరు. సాధారణంగా సన్న్యాసులకు ఏ విషయముపైనా అనురాగము కలుగకుండా అనేక ప్రదేశాలు తిరుగమని నారద పరివ్రాజకోపనిషద్ నిర్దేశించింది. కానీ, వర్ష ఋతువు సమయంలో దానికి భిన్నంగా ఒకేచోట ఉండి చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించాలి.

ఏకరాత్రం వసేద్ గ్రామో నగరే పంచరాత్రకం
వర్షాభ్యోऽన్యత్ర వర్షాసు మాసాంశ్చ చతురో వసేత్
ద్విరాత్రం న వసేద్ గ్రామో భిక్షుర్యది వసేత్తదా
రాగాదయః ప్రసజ్యేరంస్తేనాసౌ నారకీ భవేత్
గ్రామాన్తే నిర్జనే దేశే నియతాత్మాऽనికేతనః
పర్యటేత్ కీటవద్ భూమౌ వర్షాస్వేకత్ర సంవసేత్

సన్యాసి, వర్హ ఋతువులో తప్ప, ఒక గ్రామంలో ఒక్క రాత్రి, నగరంలో రెండు రాత్రుల వరకు ఉండవచ్చు. వర్షఋతువులో గ్రామంలో కానీ, నగరంలో కానీ, నాలుగు మాసములు ఉండవచ్చు. గ్రామంలో ఒక రాత్రి కన్నా ఎక్కువ ఉంటే అనురాగ్రము, కామము మొదలైనవి ఆతని దృష్టిని మరల్చవచ్చు. గ్రామం యొక్క చివర, జనులెవరూ నివసించని ప్రదేశంలో నివాసముండి నియమంగా, నేలపై తిరిగే కీటకములా భిక్షాటన చేయవలెను. వర్షఋతువులో ఒక్క చోట ఉండవచ్చు.

వర్షఋతువులో ప్రదేశాలు తిరుగుట వలన సన్యాసులకు క్రిమికీటకాదులనుండి ఆపదలు, వ్యాధులు కలిగే అవకాశముంది కాబట్టి ఒకే చోట ఉండవచ్చు అన్న వ్రతం. నిరంతర పర్యటన వల్ల బ్రహ్మ విచారమునకు ఆటంకము కలుగుతుంది కాబట్టి ఈ నాలుగు మాసాలు వారు ఒక చోట ఉండి పరబ్రహ్మను ధ్యానిస్తూ, గురు శిష్యుల సాంగత్యములో ఉండి ఆధ్యాత్మిక శాస్త్ర విషయాదులను చర్చించుకునే అవకాశం కలుగుతుంది. శృంగేరి శారదా పీఠాధిపతులు చాతుర్మాస్య సమయంలో అనేక వ్రతాలను ఆచరిస్తారు. అవి 1. శ్రావణ సోమవార వ్రతము 2. వరమహాలక్ష్మీ వ్రతము 3. గోకులాష్టమీ వ్రతము 4. వామన జయంతి 5. అనంత పద్మనాభ వ్రతము 6. ఉమామాహేశ్వర వ్రతం. ఈ ఆఖరి వ్రతంతో చాతుర్మాస్య దీక్ష ముగుస్తుంది.

మన దేశంలో ఈ వ్రతాన్ని అన్ని సాంప్రదాయాలలోని సన్యాసులు కూడా ఆచరిస్తారు. జ్ఞాన సముపార్జనకు ధ్యానానికి వారికి ఇది అత్యుత్తమమైన సమయం, శిష్యకోటికి గురువులను ఒకే చోట సందర్శించుకునే మహదవకాశం.

8, జులై 2020, బుధవారం

గురువు యొక్క కృప


చాలా సార్లు గురువంటే మన సమస్యల పరిష్కారానికో లేక మన ప్రశ్నల సమాధానానికో అనుకుంటాము. కానీ, తాబేలు బిడ్డలకు దూరంగా ఉండి గమనిస్తూ ఉన్నట్లు శిష్యుల ప్రగతిని, పరిణతిని నిత్యం గమనించి సరిదిద్దే వారు గురువులు. ఈ గురు తత్త్వం అనుభవైకవేద్యం. స్కాందపురాణంలోని బ్రహ్మ సంహితలో శివపార్వతుల సంవాదంలోని గురుగీత గురువు యొక్క గొప్పతనాన్ని 27 శ్లోకాల ద్వారా తెలిపింది. దాని సారాంశం.

గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఆయనే ఆ పరబ్రహ్మము. అజ్ఞానమనే అంధకారాన్ని జ్ఞానమనే అంజనముతో తొలగించే వారు గురువులు. అనంతమైన, అఖండమైన, సృష్టిలోని కదిలే, కదలని ప్రతి ప్రాణి/వస్తువు లో ఉండే బ్రహ్మ యొక్క నిజాన్ని తెలిపే వారు గురువులు. సృష్టిలో, కదిలే కదలని ప్రతి వస్తువులో ఉండే జీవాత్మ నిజాన్ని తెలిపే వారు గురువులు. చరాచారాలతో కూడిన మూడులోకాలను వ్యాపించి ఉన్న శుద్ధ చైతన్య స్వరూపమైన బ్రహ్మ గురించి తెలిపే అసి శబ్దాన్ని వివరించే వారు గురువు. ఆత్మజ్ఞానమనేది ఎవరి ద్వారా అయితే ఒకనిమిషములోని అత్యంత అల్పమైన భాగములో కలుగుతుందో వారే గురువులు. దైవము, గురువు పట్ల అత్యంత ఉన్నతమైన భక్తి కలిగిన వానికే శాస్త్రాలు తమ నిగూఢ అర్థాన్ని పూర్తిగా తెలుపుతాయి. తల్లి, తండ్రి, దైవమై సంసార భయాన్ని పోగొట్టే వారు గురువ్లు. ఎవరి వలన ప్రపంచము సత్యముగా, ప్రకాశముగా, ఆనందముగా కనిపించి, తెలుస్తుందో వారే గురువులు. మూడు అవస్థలు (జాగృతము, స్వప్నము, సుషుప్త) - వీటి యందు చేతనను కలిగిన వారు గురువులు. జ్ఞానమనే శక్తిని అధిరోహించి, తత్వము (నిజము) అనే మాలతో అలంకరించబడి, మనకు భుక్తిని, ముక్తిని ప్రసాదించే వారు గురువులు. జ్ఞానమనే అగ్ని ద్వారా అనేక జన్మల నుంచి సంప్రాప్తించిన కర్మ అనే బంధములను దహించే వారు గురువులు.

ఎవరి పాదములు కడిగిన నీరు ఈ సంసారమనే సాగరాన్ని దాటించి, అసత్యాన్ని నాశనం చేస్తుందో వారే సద్గురువులు. గు అనే అక్షరము అంధకారాన్ని, రు అనే అక్షరము తొలగించడానికి ప్రతీక. అందుకనే గురు అనే పదము అంధకారాన్ని తొలగించేదిగా పిలవబడింది. కర్మలు, మనసు, వాక్కు - మూడింటి ద్వారా గురువును ఆరాధించాలి. గురువుకు పూర్తి సాష్టాంగ నమస్కారము చేయుటకు వెనుకాడ కూడదు. గురువుకు ప్రతి నిత్యం సాష్టాంగ నమస్కారము చేసి పూజించవలెను. అలా చేయటం వలన స్థైర్యము, ఆత్మ జ్ఞానము (తాను ఎవరు అని తెలిపేది) కలుగుతాయి.గురువును మించిన తత్వము (నిజము), తపస్సు, జ్ఞానము లేదు. గురువే కారణము, ఆది (మొదలు). కానీ ఆయనకు అవి లేవు. గురువు ఉత్తమమైన దైవము. గురు మంత్రాన్ని మించిన మంత్రము లేదు. నిజమైన వివేకము జాగృతమైనప్పుడు గురువే అత్యంత హితుడని తెలుస్తుంది. అన్ని ధర్మములకు మూలము గురువే. విశ్వము గురువు యందు స్థితమైయున్నది. గురువు విశ్వవ్యాప్తమై యున్నాడు. సంసారమనే అడవిలో చిక్కుకున్న వారికి, భ్రాంతిలో జీవించే వారికి ముక్తిని కలిగగించే వారు గురువు. మూడు రకాల తాపముల(శరీరము, ప్రాణులు,దైవికము) అగ్ని నుంచి ఉపశమనము కలిగించే గంగా నది వంటి వారు గురువు. సాక్షాత్తు శివుడే అయిన గురువు ఈ జగత్తులో మనకు ఏకైక హితుడు. సర్వ విద్యలకు ప్రభువు ఆయన.ధ్యానానికి మూలము గురువు యొక్క రూపము, పూజకు మూలము గురువు యొక్క పాదములు, గురువు యొక్క పలుకులు మంత్రానికి మూలము. గురువు యొక్క కృప ముక్తికి మూలము.

ధ్యానమూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం
మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపాః

తస్మై శ్రీ గురవే నమః

పరమాత్మ, పరమేశ్వర స్వరూపాలు


పరమాత్మ అనగా?

నిర్వచించలేకపోయినా ఈ సృష్టి ప్రవాహంలో సనాతన ధర్మ సాంప్రదాయంలో అనేక నిర్వచనాలు వచ్చాయి 1. స్వయంప్రకాశం కలిగి జ్ఞానరూపమైన ఆత్మ 2. కార్యాకారణాలకు భిన్నమై, క్షరాక్షరములకు అతీతమై, స్వాభావికంగా నిత్యమై, శుద్ధమై, ఋద్ధమై, ముక్తమైన పదార్థం 3. అవిద్య వల్ల ఆత్మగా తలచిన దేహం మొదలు బుద్ధి వరకు ఉన్న తత్త్వాలకు అతీతమైనది, సర్వోత్కృష్టమైనదీ, ఉపద్రష్టృత్వాది విశేషణ విశిష్టమై ప్రకాశించే ఆత్మ 4. ఆత్మగా కల్పితాలైన పంచకోశాలకు, విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత తత్త్వాలకు అతీతమై బ్రహ్మకు పూర్వము నుంచి ఉన్న పదార్థము 5. సమస్త భూతాలలోని ప్రత్యక్చేతనము 6. మాయాశక్తికి ఆశ్రయం 7. సర్వానికి అధిష్ఠానమైనది 8. పరదేవత 9. దైవం లేదా పరబ్రహ్మం.

మరి ఆ పరమాత్మ/పరమేశ్వర స్వరూపాలు ఏమిటి?

సనాతన ధర్మం ప్రకారం పరమాత్మ ఇందుగలడందులేడు, చక్రి సర్వోపగతుండు, మనం చూడటాన్ని బట్టి అని ఎన్నో శాస్త్ర పురాణాలు తెలిపాయి. వీటికి ఓ ప్రాతిపదిక ఉంది. పరమేశ్వరుడు నిరాకారుడు, సర్వవ్యాపి, సర్వాంతర్యామి అయినా, మనం కొలిచే రూపాలు ఐదు విధాలు:

1. పర స్వరూపం - దృష్టి, గోచరము కలిగిన సృష్టికి అతీతమైనది దివ్యమంగళ స్వరూపం. అనగా విశ్వవ్యాప్తమైన పరబ్రహ్మ స్వరూపం. ఇది సృష్టి స్థితిలయాదుల ఆధీనములో ఉండదు. శాశ్వతము, పరమానందకరమైంది. అవాఙ్మానసగోచరమైనది అని అర్థం.

2. వ్యూహ స్వరూపం - ఉపాసకులకు అనుకూలమైన రూపము. అనగా ఉపాసకులకు సాధనలో గోచరమైన రూపము. ఈ రూపము వేర్వేరు సాధకులకు ఒకేలా కనిపించవచ్చు. ఆ రూపానికి వారి సాధనకు గట్టి లంకె ఉంటుంది. విష్ణు, పురుష, సత్య, అచ్యుత, అనిరుద్ధ రూపాలుగా వ్యక్తమని వైఖానస శాస్త్రం చెబుతుంది.

3. విభవ స్వరూపం - అనాదిగా అత్యంత వైభవం పొందిన రూపాలు - రాముడు, కృష్ణుడు, సీత మొదలైన రూపాలు. ఇవి వేద శాస్త్ర పురాణాదులలో వర్ణించబడి, నుతించబడి కాలగమనంలో అత్యంత వైభవంగా కొలువబడిన రూపాలు.

4. అంతర్యామి స్వరూపం - అనగా బాహ్యేంద్రియములకు గోచరము కాని స్వరూపం. జ్ఞాననేత్రంతో మాత్రమే చూసే స్వరూపం. ఆయా సూక్తాలు చెప్పినట్లు హృదయ స్థానంలో ఉండే సూక్ష్మరూపం ఈ అంతర్యామి స్వరూపం. సిద్ధులకు, ముముక్షువులకు ఇచ్ఛామాత్రమున కనిపించే రూపము.

5. అర్చా స్వరూపం - అనగా ఆలయాలలో విగ్రహ రూపంలో ప్రతిష్ఠితమై కనిపించే స్వరూపం. ఇవి విభవ స్వరూపానికి మరింత వివరమైన రూపము. గుణ విభవాలను బట్టి కాస్త రూపాంతరము చెంది స్థపతుల చేతిలో రూపొందుకునేవి. వీనికి ప్రాతిపదిక దేవాలయ ఆగమ శాస్త్రం మరియు పీఠాధిపతులు/మఠాధిపతుల అనుభూతులకు రూపము. కోదండరాముడు, పట్టాభిరాముడు, శక్తి గణపతి, శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీనివాసుడు, సిద్ధి వినాయకుడు మొదలైనవి.

ఈ విధాలను గమనిస్తే ప్రధానంగా మన ధర్మంలోని దేవతా స్వరూపాలన్నీ అనుభవైకవేద్యమైనవి, అవతార సంబంధమైనవి, శాస్త్రప్రమాణవైనవి. మనం వర్ణించలేని పరమాత్మకు ఓ రూపం ఇవ్వటంలో ధ్యాత, ధ్యేయం, ధ్యాస కలిగి అవ్యక్తానందం వేగవంతంగా కలిగే అవకాశం ఉంటుంది అని మనకు విగ్రహారాధనను ప్రతిపాదించారు. మనలను మనం ఇష్టపడినట్లే ఒక రూపాన్ని మనకు రక్షకునిగా ఆరాధిస్తే ఈ జనన మరణములతో కూడిన దేహాన్ని ఓ అద్భుతమైన సాధనంగా ఉపయోగించుకోవచ్చు అని విగ్రహారాధనను ఈ ధర్మంలో ప్రోత్సహించారు. దృగ్గోచరము కాని పరమ స్వరూపాన్ని, అంతర్యామి స్వరూపాన్ని దర్శించాలంటే ఎంతో తీవ్రమైన సాధన చేయాలి, అది అందరికీ ఒక జన్మలో సాధ్యం కాకపోవచ్చు కాబట్టే విభవ, అర్చా స్వరూపాలు, బహుళ ప్రయోజనానికి దేవాలయాలు, స్వప్రయోజనానికి నిత్య పూజాయతనాలు ప్రతిపాదించబడ్డాయి. దేహము, గృహము, దేవాలయము...అన్నీ ఈ రూపాలకు నివాసము అన్నది మరల మరల చెప్పి మనలను ఆ మార్గంలో నిరంతరం నడిపించటానికే స్వరూపాలు.

పరమేశ్వరార్పణమస్తు

6, జులై 2020, సోమవారం

నగవులు నిజమని నమ్మేదా - అన్నమాచార్యుల వారు


నగవులు నిజమని నమ్మేదా? 
ఒగినడియాసలు వద్దనవే!

తొల్లిటి కర్మము దొంతుల నుండగ
చెల్లబోయిక జేసేదా?
ఎల్లలోకముల యేలేటి దేవుడ
వొల్లనొల్లనిక వద్దనవే

నలి నీనామము నాలిక నుండగ
తల కొని ఇతరము దడవేదా
బలు శ్రీవేంకటపతి నిన్ను గొలిచి
వొలుకు చంచలములొద్దనవే

భావం: ఈ నవ్వులు నిజమని నమ్మేదెలా? ఒకదాని వెంట ఒకటి వచ్చే దురాశలను వద్దనవే మనసా! పూర్వజన్మలలో చేసిన కర్మలు దొంతర్లుగా ఉన్నాయి, అయ్యో ఇంక కొత్తవి ఎందుకు చేయటం? సమస్తలోకాలను ఏలేటి ఓ వేంకటేశా! ఓ మనసా! కొత్తవి నా వల్ల కాదు. వాటిని తిరస్కరించు. సర్వేశ్వరుడవైన ఓ శ్రీనివాసా! నీ నామము నాలికపై ఉండగా వేరే వాని పట్ల నాకు వెంపర్లాట ఎందుకు? నా మనసు చంచలము కాకుండా స్థిరపరచుము.

- సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు

https://www.youtube.com/watch?v=1mgPU_vwJts

ఎంత భాగ్యమో మా పాల గల్గితివి - త్యాగరాజస్వామి


ఎంత భాగ్యమో మా పాల గల్గితివి ఎవరీడు ముజ్జగములలో తన

చెంతజేరి సౌజన్యుడై పలికి చింత బాగ తొలగించి బ్రోచితివి

మున్ను మీ సమీపమున వెలయు సన్మునులనెల్ల నణిమాది లీలలచే
తిన్నగాను పాలన చేసినటు నన్ను గాచితివి త్యాగరాజనుత!

ఓ శ్రీరామా! నీవు మాకు ఆశ్రయమైతివి, ఇది ఎంతటి భాగ్యమో! ముల్లోకములలో నీకు సాటి ఎవరయ్యా! చెంతకు వచ్చి మంచిమనసుతో మాటలాడి చింతలు ఎంతో చక్కగా తొలగించి కాపాడినావు, ఇది ఎంతటి భాగ్యమో! నీ సన్నిధిన చేరిన యోగులకు అణిమాది అష్టసిద్ధులను ప్రసాదించి నీ దివ్యలీలలచే ఎంతో చక్కగా పాలన చేసిన రీతి నీవు నాకు ఆశ్రయమైతివి, ఇది ఎంతటి భాగ్యమో!

-సద్గురువులు త్యాగరాజస్వామి

రామసాక్షాత్కారము తరువాత త్యాగరాజస్వామి రచించిన కీర్తనలలో ఇదొకటి. చాలామందికి తెలియని విషయం - త్యాగరాజస్వామి వారికి రామకృష్ణానందస్వామి అనే గురువులు రామతారకమంత్రోపదేశం చేశారు. తిరువాయూరులోని పంచనదీశ్వరుని సన్నిధిలో త్యాగరాజస్వామి రోజుకు లక్షా ఇరవై ఐదు వేల రామ తారక మంత్ర జపం చేశారు. ఆ విధంగా 38 ఏళ్ల కాలంలో 96 కోట్ల మంత్ర జపం పూర్తి చేశారు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై యాగసంరక్షణకై విశ్వామిత్రునితో వెడలిన రూపంలో త్యాగయ్యకు ప్రత్యక్షమై వెంటనే అంతర్ధానమైనాడు. ఆ పారవశ్యంలోనే త్యాగరాజస్వామి "బాలకనకమయ చేల సుజనపరిపాల" అనే సాక్షాత్కార కృతిని ఆశువుగా గానం చేశారు. ఈ విధంగా రామతారక మంత్ర సిద్ధి పొందిన తరువాతే త్యాగరాజస్వామి ఎక్కువ కృతులను రచించారు. వాల్మికీ మహర్షి 24,000 శ్లోకాలలో రామాయణాన్ని రచించగా త్యాగయ్య 24,000 కీర్తనలను రచించారు.

కాబట్టి మనం గమనించవలసినది - రామతారకమంత్రోపాసనలో సిద్ధి పొంది త్యాగయ్య పరిపూర్ణమైన యోగిగా జీవించారు. పరబ్రహ్మ తత్త్వాన్ని పూర్తిగా అనుభూతి చెందిన తరువాతే అద్భుతమైన కీర్తనలను రచించారు. అందుకే ధనకనక వస్తు వాహనాదులు, రాజభోగాలు ఆయనకు రుచించలేదు, ఉంఛవృత్తిలోనే జీవించారు. నిరంతర రామభజన తత్పరులై, సాంసారిక విషయ వాంఛలకు దూరంగా ఉంటూ, రామతారకమంత్రమనే సచ్చిదానందములో పవిత్రమైన జీవితాన్ని గడిపారు. ఆ నాదయోగికి నమస్సులు.

5, జులై 2020, ఆదివారం

రమించు వారెవరురా - త్యాగరాజస్వామి కృతి



రామ నామంలోని రహస్యాన్ని మనకు ఒలిచిన అరటిపండులా తన కృతుల ద్వారా అందజేశారు నాదబ్రహ్మ త్యాగరాజస్వామి. అగ్ని బీజమై కాటుక కొండలవంటి సమస్త పాపములను నాశనము చేసే నామం రామ నామం. అనేక జన్మార్జిత పాపసంచయాన్ని అత్యంత శక్తిమంతమైన రామనామ స్మరణతో ఛేదించి ముక్తిని పొందవచ్చు అన్నది మనకు సనాతన ధర్మంలో ఎందరో సత్పురుషులు, సజ్జనుల జీవితాల ద్వారా విదితమే. దానినే మరల తన జీవన ప్రస్థానంలో అనేక కృతుల ద్వారా అనుభవ పూర్వకంగా పలికారు త్యాగరాజస్వామి. రామకోటి, రామాయణ పారాయణం, రామనామ స్మరణం, కీర్తనం వల్ల మనమే కాదు తరతరాలు ఉద్దరించబడతారు అని మా గురువు గారు ఎప్పుడూ చెబుతారు. అంతటి మహోన్నతమైన సాధనం మనందరికీ అందుబాటులో ఉంది. ఇక ఆలస్యమెందుకు? ఆ రహస్యాన్ని తెలుసుకుని, జపాది ఉపాసనామార్గాల ద్వారా అనుభూతి చెంది తరిద్దాం.  జై శ్రీరాం!

జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం
జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం
సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం
రఘుపతి నిజమంత్రం రామరామేతి మంత్రం


ఈ రామనామ వైభవాన్ని తెలిపే కృతి వివరాలు:

సాహిత్యం
=======

రమించువారెవరురా రఘూత్తమా నిను వినా!

శమాది షడ్గుణగణ సకల భువన జనులలో 

రంయనే సుమర్మము రామయనే శర్మము స
దమరవరులకబ్బెనో త్యాగరాజ సన్నుత

భావం
======

రఘువంశోత్తముడవైన శ్రీరామా! సమస్త లోకములలోని ప్రాణులకు (శమ దమ ఉపరతి తితీక్ష శ్రద్ధ, సమాధాన అనే) ఆరు సద్గుణాలను ప్రసాదించి రమించేది నీవు కాక ఇంకెవ్వరు?  రం అనే అద్భుతమైన బీజాక్షర రహస్యం (అగ్ని బీజమై అత్యంత తేజోమయమైనది అని అర్థం), రామ అనే శాశ్వతమైన ఆనందాన్ని యోగులకు, దేవతలకు అందజేసి పరమశివునిచే నుతించబడింది నీవు కాక ఇంకెవరు? 

శ్రవణం
=======

సుపోషిణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

లక్షణములు గల రామునికి - త్యాగరాజస్వామి కృతి



లక్షణములు గల రామునికి ప్రదక్షిణమొనరింతాము రారే

కుక్షిని బ్రహ్మాండములున్నవట విచక్షణుడట దీక్షాగురుడట శుభ

లక్షణ లక్ష్యము గల శ్రుతులకు ప్రత్యక్షంబౌనట
శిక్షబడి సభను మెప్పించు భక్తరక్షకుండౌనట
అక్షరస్థులైన భజనపరులకే అంతరంగుడౌనట
సాక్షియై వెలయు త్యాగరాజపక్షుండౌనట ముప్పది రెండు

ముప్ఫై రెండు శుభలక్షణములు గల శ్రీరామునికి ప్రదక్షిణము చేసేదము రండి! కడుపులో బ్రహ్మాండములు కలవాడు, సమస్త జీవుల కార్యాకార్యములను పరిపూర్ణంగా ఎఱిగిన వాడు, తనను ఆశ్రయించిన వారి అంతరంగములోని చైతన్యమును పరమాత్మతో అనుసంధానం చేసే దీక్షను అనుగ్రహించువాడు, వస్తు స్వరూపము, స్వభావము చెప్పునట్టి వేదవచనములచే తెలియబడువాడు, అనేక పరీక్షలు లోనై భగవంతుని యందు నమ్మకము వీడకుండా మెప్పించే భక్తజనులను రక్షించువాడు, ఓంకారరూపమైన పరమాత్మ తత్త్వమునెఱిగి వివిధనామ రూప క్రియలతో భజించువారికి అంతరంగమయ్యేవాడు, సాక్షీభూతుడైనవాడు, పరమశివుని పక్షముననుండు వాడు, అనేక శుభలక్షణములు కలిగిన శ్రీరామునికి ప్రదక్షిణము చేసేదము రండి.

-సద్గురువులు త్యాగరాజస్వామి

శుద్ధ సావేరి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మల్లాది సోదరులు ఆలపించారు

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...